తీవ్ర ఉద్రిక్తత మధ్య రామతీర్థంలో చంద్రబాబు పర్యటన

విజయనగరం జిల్లా రామతీర్థంలో పురాతన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెల్సిందే. ఏపీలోని ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ప్రతిపక్షాలు మండిపడుతుండగా... ఇది టీడీపీ పనే అని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలిని పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుండి రామతీర్థంకు బయల్దేరారు. మరి కొద్దిసేపట్లో ఆయన రామతీర్థం చేరుకోబోతుండగా.. మరోవైపు విజయసాయిరెడ్డి అంతకు ముందే బోడికొండకు చేరుకుని, రామతీర్థం ఆలయానికి చేరుకున్నారు. దీంతో, రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత పరిష్టితులు నెలకొన్నాయి.   ఇది ఇలా ఉండగా బోడికొండ కింద ఇప్పటికే టీడీపీ, బీజేపీ, వైసీపీ శ్రేణులు టెంట్లు వేసుకున్నాయి. బీజేపీ శ్రేణులతో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు కొంత మంది సాధువులు కూడా ఉన్నారు. మరోవైపు రామతీర్థంకు వెళ్తున్న విజయసాయిని బీజేపీ, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కొండపైకి వెళ్లే అర్హత విజయసాయికి లేదని వారు మండిపడ్డారు. గోబ్యాక్ విజయసాయిరెడ్డీ అంటూ నినాదాలు చేసారు. మరోపక్క జైశ్రీరాం నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగుతోంది. అయితే, పోలీసుల అండతో విజయసాయిరెడ్డి కొండపైకి బయల్దేరారు. ఆ ప్రాంతంతో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీ ఎత్తున ఆ ప్రాంతంలో మోహరించారు. అయితే ఇప్పటివరకు రామతీర్థంతో పాటు ఇతర ఆలయాల దాడులపై సరిగా స్పందించని ప్రభుత్వం, వైసీపీ నేతలు ఇపుడు చంద్రబాబు పర్యటనకు వస్తుండడంతో విజయసాయిరెడ్డి హడావిడిగా పర్యటన చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అధికారంలోకి వచ్చాకా ఎవరిని వదిలిపెట్టం! పోలీసులకు ఉత్తమ్ వార్నింగ్ 

సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ పతనం మొదలైందన్నారు. పోలీసులు కేసీఆర్‌ను చూసి ఎగరకండని.. జాగ్రత్తగా ఉండాలని.. తాము ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఉత్తమ్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒత్తిడితోనే   రాఘవ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. పోలీసులు చట్టం, ధర్మం, రాజ్యాంగం పరిధిలో పని చేయాలని సూచించారు.  జైలులో ఉన్న జంగా రాఘవరెడ్డిని కలిసేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క వస్తుండటంతో  వరంగల్ సెంట్రల్ జైల్ వద్ద అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.  రాఘవ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో వరంగల్ సెంట్రల్ జైలు పరిసరాలతో పాటు వరంగల్ నగరం, జనగామ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.    

మంత్రి అవంతి ఎక్కడికి పారిపోయినా వదిలిపెట్టం: టీడీపీ సంచలన కామెంట్స్ 

ఏపీలోని విశాఖ నగరంలో గత కొంత కాలంగా వైసీపి, టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో చల్లని వింటర్ లో కూడా రాజకీయ వాతవరణం బాగా వేడెక్కుతోంది. తాజాగా జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విరుచుకుపడ్డారు. అవంతి ఇతర రాష్ట్రాలకు పారిపోయే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా మరో రెండేళ్ల తర్వాత ఇటు రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు, అటు దేశంలో జగన్ కూడా ఉండడు అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఆఫర్ చేస్తున్న ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీలోనే ఉన్నారన్న అక్కసుతో వైసీపీ కక్ష్య సాధింపు చర్యలు చేపడుతోందని అయన మండిపడ్డారు. వెలగపూడి.. కబడ్ధార్ అని మంత్రి అవంతి అనడం హాస్యాస్పదంగా ఉందని అయన అన్నారు. అసలు అవంతి బెదిరింపులకి భీమిలి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలే భయపడరు, ఇంక ఆయన తాటాకు చప్పుళ్లకు టీడీపీ ఎమ్మెల్యే భయపడతారా? అంటూ మంతెన ఎద్దేవా చేశారు.   వైసీపీని నమ్మి రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇస్తే...రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ.. ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షలు, కార్పణ్యాలు, తప్పుడు కేసులతో రెండేళ్ళ సమయాన్ని వృధా చేసారని అయన విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని ఏపీ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అయన హెచ్చరించారు. జగన్ ని నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయినట్లు అవంతిని నమ్మి భీమిలి నియోజకవర్గ ప్రజలు కూడా మోసపోయారన్నారు. మంత్రి అవంతి విశాఖలో భూకబ్జాలు చేయడం తప్ప మంత్రిగా తన నియోజకవర్గానికి గానీ రాష్టానికి గానీ ఈ రెండేళ్లలో చేసిందేంటని అయన ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన మరుసటిరోజే విశాఖలో అవంతి చేసిన భూకబ్జాలపై చర్యలు తీసుకుంటామని, దీంతో చేసిన తప్పులకు భయపడి అవంతి.. ఇతర రాష్ట్రాలకు పారిపోయినా వదిలిపెట్టం అని మంతెన సత్యనారాయణరాజు హెచ్చిరించారు.

యూ టర్నా.. కమలాన్ని ఇరికిస్తున్నారా? సీఎం కేసీఆర్ దారెటు? 

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ మారిపోయారా? వరుస ఓటములతో ఆయన దిగొచ్చారా? తెలంగాణలో ప్రస్తుతం ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాల్లోనే కాదు టీఆర్ఎస్ లోనూ ఇదే ఇప్పుడు ప్రధానంగా మారిందని చెబుతున్నారు. ఇందుకు కారణం సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలే. మాములుగా తనకు నచ్చిన పని చేసేస్తుంటారు గులాబీ బాస్. అది అనుకున్న ఫలితాలు ఇవ్వకపోయినా సరే ఆయన తన నిర్ణయాలను వెనక్కి తీసుకోరు. మొండిగా ముందుకు వెళుతూనే ఉంటారు. కాని ఇటీవల మాత్రం ఆయన మైండ్ సైట్ లో మార్పు కనిపిస్తోంది. తాను తీసుకున్న  కొన్ని విధాన పరమైన నిర్ణయాలను ఉపసంహరించుకుంటున్నారు కేసీఆర్. గతానికి భిన్నంగా తన నిర్ణయాలపై  తెలంగాణ ముఖ్యమంత్రి వెనక్కి తగ్గడం రాజకీయ వర్గాల్లో ఆస్తక్తిగా మారింది. కేసీఆర్ యూ టర్న్ ముఖ్యమంత్రిగా మారారని విపక్షాలు విమర్శలు చేస్తుండగా.. రాజకీయ అనలిస్టుల నుంచి మాత్రం కేసీఆర్ యూ టర్న్ ల వెనక బలమైన వ్యూహమే ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా వెళుతోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కమలానికి బూస్ట్ ఇచ్చాయి. వరుస విజయాల జోష్ తో రాష్ట్రంలో అధికారమే లక్ష్యమంటోంది కాషాయ దళం. దీంతో  తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీకి బ్రేక్ వేయడమే లక్ష్యంగా కేసీఆర్ తాజా అడుగులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.  తెలంగాణ బీజేపీ నేతలు  లేవనెత్తిన  అంశాల్లోనే కేసీఆర్ వెనక్కి తగ్గటం ఇందుకు బలాన్నిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఎల్ఆర్ఎస్, ఉద్యోగాల అంశాన్ని బీజేపీ ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఇప్పుడు ఈ రెండు అంశాల్లో కేసీఆర్ దిగిరావడంతో..  బీజేపీకి ఇక ప్రచారం చేయడానికి వేరే అంశాలు లేకుండా పోయాయని చెబుతున్నారు. బంతిని బీజేపీ కోర్టులోకి విసిరి దూరమవుతున్న ప్రజలను తిరిగి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కేసీఆర్ వ్యూహంలో  దాగి ఉన్నాయని అంటున్నారు.   రానున్న కాలంలో కేంద్ర సర్కార్ నిర్ణయం ప్రకారం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే విద్యుత్ సంస్కరణలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనకబడినవర్గాలకు ప్రత్యేక కోటాలాంటి మరికొన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశం ఉంది.ఆయుష్మాన్ భారత్, వ్యవసాయ చట్టాల గురించి ప్రస్తావించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు బీజేపీ నేతలు. కేంద్ర చట్టాలను తెలంగాణ సర్కారు అమలుచేయకపోవడంతో పేదలకు ప్రయోజనం అందడంలేదని బీజేపీ ఇంతకాలం విమర్శించింది. ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్రానికే జై కొట్టారు కేసీఆర్. దీంతో  రైతులలో ఇకపైన వ్యతిరేకత వస్తే దానికి కేంద్రమే జవాబుదారీ అనే అభిప్రాయం నెలకొంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ దోషిగా నిలబడుతుంది. బీజేపీని ఎక్కడా విమర్శించకుండా రైతుల ద్వారానే కాగల కార్యాన్ని ఇలా సాధించాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.  ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేసినట్లయితే దాని ద్వారా కనీసంగా రూ. 250 కోట్లు రాష్ట్రానికి అందే వీలు ఉంది.కేంద్రం దారిలో నడవడం ద్వారా రోజువారీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చన్న అంశం కూడా కేసీఆర్  వ్యూహంలో కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేయడంతో పాటు  పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలన్నింటినీ ఒక్కటొక్కటిగా చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ బాస్. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, ఉద్యోగులకు జీతాల పెంపు , సామాన్యులకు ఎల్ఆర్ఎస్ మినహాయింపు అందులో భాగమేనంటున్నారు. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, రెండు ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జునసాగర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికులు జరుగునున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తాజా వ్యూహాలతో బీజేపీకి రాజకీయ అంశాలు లేకుండా చేయడంతో పాటు ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే.. కేసీఆర్ తన నైజానికి భిన్నంగా యూటర్న్ లు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

మళ్లీ ఫ్యాక్షన్ పడగలోకి రాయలసీమ? అరాచకాలకు అడ్డాగా జగన్ రెడ్డి పాలన ? 

మూడు మర్డర్లు.. ఆరు అటాక్ లు.. తొమ్మిది దొమ్మీలు. ఇదీ ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి. ఫ్యాక్షన్ పడగలో,  కక్ష్య రాజకీయాలతో తల్లడిల్లింది ఆ సీమ. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ లబ్ది కోసం ఫ్యాక్షన్ ను పెంచి పోషించారు అక్కడి నేతలు. దివంగత నందమూరి తారక రామారావు  రాజకీయ ప్రవేశంతో  రాయలసీమ ఊపిరి పీల్చుకుంది. ఎన్టీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, అభివృద్ధి నినాదంతో  రాయలసీమ ఫ్యాక్షన్ కు దూరంగా ప్రశాంత సీమగా మారిపోయింది. తర్వాత చంద్రబాబు పాలనలోనూ రాయలసీమలో  ఫ్యాక్షన్ ను చోటు లేకుండా పోయింది. హత్యా రాజకీయాలు మాని అభివృద్ధి కోసం పని చేశారు ప్రజా ప్రతినిధులు. అయితే కొన్ని రోజులుగా రాయలసీమలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాయలసీమ జగన్ రెడ్డి పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ నీడలోకి వెళ్లింది. అధికార పార్టీ నేతలు బరి తెగింపుతో  సీమలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రజలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. దాడులకు తెగబడుతున్నారు. హత్యలకు పాల్పడుతూ జనాల్లో భయాందోళన స్పష్టిస్తున్నారు.  కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం.. ఏ జిల్లా చూసినా ఇదే పరిస్థితి. రోజూ ఏదో ఒక చోట ప్యాక్షన్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  రాజకీయ కక్షలతోనే .. ఇతర పార్టీల సానుభూతిపరులనే కారణంతోనో.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనో.. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు దుండగులు. దీంతో ప్రజలు ప్రాణాలు అర చేతిలో  పట్టుకుని జీవించాల్సిన పాత రోజులు రాయలసీమలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పట్టపగలే జరిగిన టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది.  ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యక్రమంలో ఇళ్ళపట్టాల పంపిణీ  వద్ద అందరు చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను హతమార్చారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్న సుబ్బయ్యను రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.  ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌ లో  స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పాత్రను,  అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పోలీసులు అక్కడ ఉండగానే.. టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో  ఊహించవచ్చు.   అనంతపురం జిల్లా  వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. పోలీసుల అండతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వందలాది మంది అనుచరులతో కలిసి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జేసీ వద్ద పనిచేసే కిరణ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి... తన అనుచరులతో కలిసి జేసీ నివాసంపై దండెత్తారు. అక్కడే ఉన్న కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. జేసీ నివాసంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుర్చిలో కూర్చొని హంగామా చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి ఘటనే నిదర్శనమనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని చెబుతున్నారు. గతంలో ఫ్యాక్షన్ గొడవలు జరిగినా.. ఇలా ఒక ఎమ్మెల్యే వందలాది మందిని తీసుకుని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం ఎప్పుడు జరగలేదంటున్నారు. ఏపీలో  రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ ఘటన ఉదాహరణ అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.   అంధ్రప్రదేశ్ లో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయని పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలో దళిత జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపైనే  దాడి జరిగింది. ఒక జడ్జీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉంటే.. మిగితా దళితుల భద్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  జగన్ రెడ్డి పాలనలో అధికారులకు రక్షణ లేకుండా పోయింది. తాము చెప్పినట్లు వినకపోతే అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారు. బెదిరించి వారిని దారిలోకి తెచ్చుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులపై అధికార పార్టీ నేతల దాడులు జరుగుతూనే ఉండగా.. తాజాగా  గుంటూరు శివారులోని నల్లపాడుకు చెందిన వైసీపీ నేత గాదె నాగిరెడ్డి.. కరెంట్ బిల్లు కట్టమన్న లైన్ మైన్ పై తీవ్రంగా కొట్టడం దుమారం రేపింది. ఆరు నెలలుగా కరెంట్ బిల్లు కట్టకపోవడంతో వైసీపీ నేత పేరు డీఫాల్ట్ లిస్టులోకి వెళ్లిపోయింది. లైన్ మైన్ కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో లైన్  మెన్ ను ఇంటికి పిలుపించుకుని మరీ కొట్టాడు వైసీపీ నాయకుడు.    రాయలసీమలో  జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. మళ్లీ పాత రోజులు వచ్చాయని వారంతా భయపడుతున్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా? అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. రాష్ట్రాన్ని మారణాయుధాలతో పాలిస్తారా? అని నిలదీస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని.. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వస్తున్నాయి.  ఏపీలో వైసీపీ నేతలే  విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతూ భయానక పరిస్థితులు నెలకొల్పారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రాముడికే రక్షణ లేని రాష్ట్రం.. వ్యవస్థలు ఏమైపోయాయి.. చినజీయర్ స్వామి  

ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 160కిపైగా ఆలయాలలో ఈ తరహా దాడులు జరిగాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహం తల వేరు చేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మరోపక్క నిన్న రాజమహేంద్రవరంలో సుబ్యహ్మణ్యేశ్వర స్వామి చేతులను విరిచేసిన ఘటన చోటు చేసుకుంది. ఇంతకూ ముందు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఈ తాజా ఘటనలు అందరి మనసులను కలచివేస్తున్నాయి. అంతేకాకుండా ఆలయాలపై వరుసగా ఇన్ని దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో దుండగులు మరింతగా రెచ్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి అసలు ఈ ఘటనలకు కారకులు ఎవరు ?ఎందుకు చేస్తున్నారన్న దానిపై ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. మరో పక్క ఈ ఘటనలపై భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు. హిందువులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో తక్షణమే స్పందించవలసిన ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు.   తాజాగా రామతీర్థం ఆలయ ఘటనపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. ఆలయాల్ని పరిరక్షించే బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. అక్కడి ఆలయాన్ని.. అలాగే రాముల వారిని ఆసరాగా చేసుకుని ఓ వ్యవస్థ ఉందని… వారంతా ఏమైపోయారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నవారు.. రక్షించాల్సిన వారు ఎందుకు నిమిత్తమాత్రులుగా మారారని ఆయన సూటిగా ప్రశ్నించారు. అదే సమయంలో ప్రశ్నించడానికి భక్తులు ఏమాత్రం భయపడకూడదని ఆయన అన్నారు. వ్యవస్థలు విఫలమైనప్పుడు తప్పకుండా ప్రశ్నించాలని.. భక్తులకు ఆయన పిలుపునిచ్చారు. మన కోసం స్వయంగా వైకుంఠ వాసుడు.. శ్రీరామచంద్రుడిగా దిగి వచ్చారని.. అలాంటప్పుడు ఆయన బాగోగులు మనం తప్పకుండ చూసుకోవాల్సిందేనన్నారు. ఎందుకంటే.. విగ్రహ రూపంలో ఆయన అక్కడ ఉన్నది మన బాగోగులు చూడటానికేనని అయన గుర్తు చేశారు.   ఇది ఇలా ఉండగా రామతీర్థం ఘటనపై చినజీయర్ స్వామి తాజా స్పందన గమనిస్తే ఈ దాడి ఆయనను ఎంత తీవ్రంగా కలచి వేసిందో స్పష్టమౌతోంది. సాధారణంగా ఇటువంటి అంశాలపై చినజీయర్ స్వామి మాట్లాడితే రాజకీయం చేసే ప్రమాదం ఉంది. తాజాగా రామతీర్థం వ్యవహారం ఉన్మాద స్థాయికి చేరడంతో.. ఇక ఉపేక్షిస్తే.. ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశం ఉండడంతో అయన సున్నితంగా తన స్పందన తెలియచేసారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం తెలంగాణలో ఉండిపోవడంతో… ఏపీలో శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ చేయాలన్న చర్చ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్ట ఆలయంతో పాటు.. విజయనగరం జిల్లాలోని కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థం ఆలయాన్ని కూడా పరిశీలించింది. వివిధ రకాల పరిశీలనలు చేసిన తర్వాత ఒంటి మిట్టను నవమి వేడుకలకు ఎంపిక చేసుకున్నప్పటికీ.. రామతీర్థం ఆలయానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. తాజాగా ఆ ఆలయంపైనే కొందరు ముష్కరులు గురి పెట్టారు. ఇది ఇలా ఉండగా ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని హిందూత్వంపై జరుగుతున్న దాడిగా.. మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్న కొంత మంది స్వామిజీలు మాత్రం కనీసం స్పందించడానికి కూడా సిద్ధంగా లేరు. కేవలం రాజకీయ ప్రకటనలు చేయడానికి పరిమితమైన కొందరు స్వాములు గుడ్డిగా ప్రభుత్వానికే మద్దతు పలుకుతున్నారు.

సీఎం జగన్ సొంత ఇలాకాలో వైసీపీ నేతల గన్ ఫైట్ 

ఏపీ సీఎం జగన్ కు సొంత పార్టీ నేతల కారణంగా ప్రతి రోజు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ఒక పక్క సీఎం జగన్ అనేక కొత్తకొత్త సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. మరో పక్క జగన్ ఎంత మొత్తుకున్నా అయన పార్టీ నేతలు మాత్రం రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట అయితే ప్రతిపక్షాలతో లేదంటే సొంత పార్టీ నేతలతో ఘర్షణలకు దిగడంతో ప్రజలలో పార్టీ చులకన అవుతోంది.   తాజాగా సీఎం సొంత జిల్లా అయిన కడప వైసీపీలో వర్గపోరు రాజుకుంది. అక్కడ వైసీపీ లోని రెండు గ్రూపులు నువ్వెంతంటే నువ్వెంతంటూ ఒకరిపై మరొకరు రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. కడపజిల్లా కమాలాపురం నియోజకవర్గం వీరపనాయునిపల్లి (మం) పాయసంపల్లి వైసీపీలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసే విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ముదిరి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో వైసీపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.   పాయసం పల్లికి చెందిన వైసీపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసేందుకు సిద్దపడగా.. వైసీపీలోని మరో వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డి దీనికి అభ్యంతరం వ్యక్తం చేశార‌ని స‌మాచారం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ రెడ్డి పాయసం పల్లి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పోస్ట్ చేశారు. వైసీపీకి చెందిన మరో వర్గానికి చెందిన మహేశ్వరరెడ్డి ఈ పోస్టింగ్‌పై ఫోన్‌ చేసి సుధాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. "మనకు కొత్త సంవత్సరం..ఉగాది కదా! జనవరి ఒకటి కాదు కదా" అని గట్టిగా అడిగారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అని.. ఇద్దరూ ఫోన్‌లోనే హెచ్చరించుకొన్నారు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే మహేశ్వరరెడ్డి వర్గీయులు.. సుధాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి అతడి వర్గీయులపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగిరెడ్డికి గాయాలయ్యాయి. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి వర్గీయులను కంట్రోల్ చేయడానికి సుధాకర్‌రెడ్డి తన లైసెన్స్‌ గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గాయపడిన వారికి చికిత్స అందుతోంది. ప్రస్తుతం గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో దేవుడికే రక్షణ కరువైంది!!

అందరికీ ఆ దేవుడే రక్ష అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దేవుడికే రక్షణ కరువైంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 19 నెలల  కాలంలో హిందూ ఆలయాలపై అనేక దాడులు జరిగాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం, రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటనలు వెలుగు చూశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదోక ప్రాంతంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.    ఏపీకి వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఐన తరువాత ఈ 19 నెలల కాలంలో 20 కి పైగా హిందూ దేవాలయలపై దాడుల జరిగాయి. 1. 2019 నవంబర్ 14 న.. గుంటూరు దుర్గ గుడి ధ్వంసం  2. 2020 జనవరి 21 న.. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ధ్వంసం 3. 2020 ఫిబ్రవరి 11 న.. రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం 4. 2020 ఫిబ్రవరి 13 న.. ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ధ్వంసం చేశారు 5. 2020 ఫిబ్రవరి 14 న.. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం 6. 2020 సెప్టెంబర్ 6 న.. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం 7. 2020 సెప్టెంబర్ 13 న.. విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ 8. 2020 సెప్టెంబర్ 15 న.. కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ధ్వంసం 9. 2020 సెప్టెంబర్ 16 న.. ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 10. 2020 సెప్టెంబర్ 16 న.. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం 11. 2020 సెప్టెంబర్ 17 న..  కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ధ్వంసం 12. 2020 సెప్టెంబర్ 19 న.. విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో శివాలయంలో శివుడు విగ్రహాలు ధ్వంసం 13. 2020 సెప్టెంబర్ 20 న.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు, విగ్రహం ధ్వంసం 14. 2020 సెప్టెంబర్ 23 న.. కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 15. 2020 సెప్టెంబర్ 25 న.. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం 16. 2020 అక్టోబర్ 5 న.. కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా సుగని జలాశయం దగ్గర వున్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం లో నరసింహ స్వామి శేషపడగలు ధ్వంసం 17. 2020 అక్టోబర్ 6 న.. కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ  స్వామి విగ్రహం ధ్వంసం 18. 2020 అక్టోబర్ 6 న.. గుంటూరు జిల్లా నరసరావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి దేవి విగ్రహం ధ్వంసం 19. 2020 అక్టోబర్ 17 న.. తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం 20. 2020 నవంబర్ లో.. యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం.. 21. 2020 డిసెంబర్ 29 న.. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం 22. 2020 డిసెంబర్ 31 న.. రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం   ఇలా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడి ఘటనలు వెలుగులోకి వచ్చినవి కొన్నే.. వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరైన చర్యలే లేవు. మతిస్తిమితం లేని వారి చర్యలంటూ ప్రభుత్వం, పోలీసులు కాలయాపన చేశారు. ఇక సీఎం సంగతి సరేసరి. ఇన్ని నెలలుగా దాడులు జరుగుతుంటే ఆయన నుండి సరైన స్పందనే లేదు. తాజాగా ఒక్కసారి స్పందించారు. దేవుడితో పెట్టుకోవద్దని, శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. అయితే ఆయనలా హెచ్చరించిన కొద్ది గంటల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటన జరగడం గమనార్హం. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో హిందూ ఆలయాల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. ఇక ప్రభుత్వానికి తగ్గట్టే ప్రతిపక్షాల తీరు కూడా ఉంది. దాడి జరిగినప్పుడు ఖండిస్తున్నాం అంటూ రెండు వ్యాఖ్యలు చేయడమే తప్ప.. ఇది కోట్ల మంది మనోభావాలకు సంబందించిన అంశం అంటూ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ సరైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే చేయడం లేదు.   మరోవైపు హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందన్న అనుమానాలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఒక పార్టీ.. రాష్ట్రంలో హిందూ మతం లేకుండా చేసి, మరో మతాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుందని అనమానపడుతున్నారు. లేదా మరో పార్టీ.. ఈ దాడులతో హిందూవులలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి ఆ ఓట్లన్నీ రాబట్టే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న ఈ దాడుల వెనుక ఏ పార్టీ రాజకీయ పార్టీ కుట్ర కోణం ఉందో గానీ.. ఈ దాడుల మూలంగా కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ దాడుల వెనుక ఉన్న కోణాన్ని ఆ దేవుడు ఎంత త్వరగా బయటపెడితే.. అంత మంచిదన్న అభిప్రాయం అటు హిందువుల్లోనూ, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.

కోమటిరెడ్డి బాటలో ఇంకెందరు? రేవంత్ రెడ్డే వాళ్ల టార్గెట్టా?

ఘోర పరాజయాలు, నేతల వలసలతో 2020 సంవత్సరంలో కుదేలైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.. కొత్త ఏడాది కూాడా కలిసొచ్చేలా కనిపించడం లేదు. 2021 న్యూఇయర్ తొలిరోజే హస్తం పార్టీకి షాకిచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏడాది క్రితం జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ తాను బీజేపీలోకి వెళతానని ప్రకటించారు. త్వరలోనే తాను కాషాయ కండువా కప్పుకుంటానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని మరోసారి స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తిరుమల శ్రీవారి సన్నిధిలో కోమటిరెడ్డి చేసిన రాజకీయ ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బీజేపీలోకి వెళతారా లేక ఆయనతో పాటు ఇంకెవరైనా వెళతారాదా అన్నది సస్పెన్స్ గా మారింది.     2020లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అంతేకాదు బీజేపీ కంటే దిగువకు పడిపోయింది. గత సంవత్సరం చాలా మంది పార్టీ నేతలు, కొందరు సీనియర్లు కూడా బీజేపీలో చేరారు.  దీంతో తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. పార్టీలో ప్రక్షాళనకు  సిద్ధమైంది. కొత్త పీసీసీని నియమించే పనిలో పడింది. పీసీసీ పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఎవరో ఒకరిని పీసీసీ చీఫ్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఖాయమని తెలిసినందు వల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డికి మొదటి నుంచి మంచి సంబంధాలు లేవు. కోమటిరెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వెళతారనే చర్చ జరుగుతోంది.    రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే తమకు ఇబ్బంది అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఓటు మొత్తం కమలానికి వెళుతోంది. రేవంత్ పీసీసీ బాస్ గా వస్తే కాంగ్రెస్ బలోపేతం కావడంతో పాటు ప్రజా వ్యతిరేకత ఓటు కొంత అటు వైపు వెళుతోంది. దీంతో తమకు నష్టం కల్గుతుందని భావిస్తున్న బీజేపీ హైకమాండ్... తెలంగాణ కాంగ్రెస్ ను బలహీనం చేయడమే లక్ష్యంగా.. ఆ పార్టీ నేతలను ఆహ్వానిస్తోంది. రేవంత్ కు పీసీసీ వస్తున్నందున.. అందుకు కౌంటర్ గా కమలనాధులు తమ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ కు బలపడే అవకాశం ఇవ్వకుండా.. పావులు కదుపుతోంది.  ఇందులో భాగంగానే మొదటగా సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి బాటలోనే కొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా కాషాయం గూటికి చేరుతారంటున్నారు. రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత వీహెచ్ తో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా కాంగ్రెస్ నుంచి బయటికి రావచ్చంటున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ ను వ్యతిరేకించే నేతలందరికి బీజేపీ వల వేస్తుందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ వచ్చిన వెంటనే కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు ఉండేలా తెలంగాణ బీజేపీ నేతలు కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది.    మరోవైపు తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా కోమటిరెడ్డి సోదరులు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదని చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన తల్లిగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టారు రాజగోపాల్ రెడ్డి. కాని ఆ కార్యక్రమాలకు తన అన్న వెంకట్ రెడ్డిని ఆయన పిలవలేదు.  తన అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి ఎంపీ పరిధిలోనే ఉన్నా..ప్రోటోకాల్ ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి కార్యక్రమాలకు వెంకట్ రెడ్డి వెళ్లలేదు. అప్పడే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు అన్న టీపీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్తానని ప్రకటించడంతో ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని భావిస్తున్నారు.    మొత్తంగా రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. అతనితో పాటు ఇంకా ఎవరెవరు నేతలు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తే.. ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయనే అభిప్రాయం కూడా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరీ బీజేపీ వ్యూహాలకు కాంగ్రెస్ నేతలు ఎలా చెక్ పెడతారో చూడాలి మరీ..

కేసీఆర్ కి కొత్త బిరుదు.. యూటర్న్ ల వీరుడు!!

"టర్న్ లందు యూటర్న్ లు వేరయ్యా యూటర్న్ ల్లో కేసీఆరే తోపయ్యా" అని భవిష్యత్ తరాలు తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి చెప్పుకుంటారేమో అనిపిస్తోంది. అదేదే సినిమాలో చెప్పినట్టుగా "ఈరోజు రైట్ అనిపించింది రేపు రాంగ్ అనిపించొచ్చు. ఈరోజు రాంగ్ అనిపించింది రేపు రైట్ అనిపించొచ్చు" అనే మాటని కేసీఆర్ నిజమని రుజువు చేస్తున్నారు. ముందేమో అబ్బే ఇది అసలు పనికిరాదు అంటారు. కట్ చేస్తే కొన్నిరోజులకి ఇది అమోఘం అంటారు. ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఎన్నెన్నో.. ఆ ఎన్నెన్నోలో ఇప్పుడు కొన్ని యూటర్న్ ల గురించి తెలుసుకుందాం.   తెలంగాణలో రైతులంతా నియంత్రిత సాగు విధానాన్ని పాటించాలని సూచించిన కేసీఆర్.. తరువాత ఆ మాటను వెనక్కు తీసుకున్నారు. రాష్ట్రంలో నియంత్రిత సాగు అవసరం లేదని.. రైతులు ఇక నుంచి తమకు నచ్చిన పంటను పండించవచ్చని.. నచ్చిన చోట అమ్ముకోవచ్చని తాజాగా కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్.. కొన్ని రోజులకే ఆ చట్టాలకు జై కొట్టారు. 'నూత‌న వ్య‌వ‌సాయ బిల్లు తేనేపూసిన క‌త్తి లాంటి చ‌ట్టం. దీన్ని క‌చ్చితంగా వ్య‌తిరేకించి తీరాలి' అని కేసిఆర్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ ‌లో మిగతా పార్టీల కంటే ఉత్సాహంగా టీఆర్ఎస్ పాల్గొంది. టీఆర్ఎస్ కీలక నేతలు, మంత్రులు సైతం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఓ రకంగా అది టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారిక బంద్ గా కనిపించింది. కానీ కొన్నిరోజులకే సీన్ మారిపోయింది. కొత్త చట్టాలకు జై కొడుతూ.. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలని తీసివేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.   అప్పట్లో 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని అసలు ఎందుకు పనికి రాదన్న కేసీఆర్.. తాజాగా ఈ విషయంలోనూ యూటర్న్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఇక తెలంగాణలోనూ అమల్లోకి రానుంది. ‌ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గతంలో అసెంబ్లీ సాక్షిగా 'ఆయుష్మాన్ భారత్' పై కేసీఆర్ విమర్శలు చేశారు. ‌ఆరోగ్యశ్రీతో పోల్చితే అసలు 'ఆయుష్మాన్ భారత్' దేనికి పనికి రాదన్నారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు 'ఆయుష్మాన్ భారత్' కి ఆహ్వానం పలికారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ కార్డుపై వైద్యం చేయడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు, మరో వైపు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. అందుకే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.   వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో మాత్రమే కాదు. పలు విషయాల్లో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. సీఎం కాకముందు నుండి ఇప్పటి వరకు ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత నాయకుడిని సీఎం చేస్తానన్నారు.. ఆయనే సీఎం అయ్యారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. తరువాత ఆ ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. తరువాత అదసలు సాధ్యమేనా? అని ఆయనే రివర్స్ లో క్వశ్చన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో యూటర్న్ లు ఉన్నాయి. అయితే, తాజాగా వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో కేసీఆర్ తీసుకున్న యూటర్న్ మాత్రం.. యూటర్న్ సీఎం అంటూ విమర్శల పాలు చేసింది.

తోటి విద్యార్థిని తరగతి గదిలో కాల్చి చంపిన టెన్త్ క్లాస్ స్టూడెంట్

టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య తరగతి గదిలో కూర్చునే సీటు కోసం జరిగిన గొడవ ఏకంగా ఒక బాలుడి ప్రాణాలు బలి తీసుకొంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. క్లాస్ రూములో సీటు కోసం పదో తరగతి విద్యార్థులు ఇద్దరు నిన్న గొడవ పడ్డారు. దీంతో కోపంతో రగలిపోయిన ఒక బాలుడు ఈ ఉదయం స్కూలుకు వస్తూ తన అంకుల్ తుపాకిని వెంట తెచ్చుకున్నాడు. అతడు వచ్చీ రావడంతోనే నిన్న తనతో గొడవకు దిగిన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో రెండు పిరియడ్లు ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.   ఆ బాలుడు మొత్తం మూడుసార్లు కాల్పులు జరిపాడని, వాటిలో ఒక తూటా పొట్టలోకి, మరొకటి చాతీలోకి, మూడోది తలలోకి దూసుకుపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. అయితే కాల్పుల జరిపిన తరువాత నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా పై అంతస్తు నుంచి కిందికి వచ్చిన అతడు తనను పట్టుకునేందుకు వచ్చిన వారిని బెదిరించేందుకు మరోసారి గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. చివరికి కొంత మంది ఉపాధ్యాయులు అతికష్టం మీద ఆ బాలుడిని పట్టుకుని తుపాకి లాక్కున్నారు. అయినప్పటికీ అతడు వారిని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. ఈలోగా ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు వచ్చి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.   నిందితుడైన బాలుడు తుపాకిని తన అంకుల్ నుంచి దొంగలించి తీసుకు వచ్చినట్లుగా గుర్తించారు. ఆ బాలుడి అంకుల్ సైన్యంలో పనిచేస్తుంటారని, ఆయన సెలవులపై ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా అయన లైసెన్స్‌డ్ తుపాకిని తీసుకొచ్చి ఈ అఘాయిత్యనికి పాల్పడినట్టు పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. బాలుడి పుస్తకాల సంచిలో మరో నాటు తుపాకి కూడా ఉందని, పోలీసులు దానిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అయన తెలిపారు.

బీజేపీకి షాక్.. రైతు చట్టాలను వ్యతిరేకించే తీర్మానానికి ఎమ్మెల్యే సపోర్ట్ 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతులు ఇటు ప్రతి పక్షాలు ఉద్యమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేస్తున్నాయి. తాజాగా కేర‌ళ రాష్ట్ర అసెంబ్లీలో వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానాన్ని కేర‌ళ అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. అయితే కేర‌ళ‌లో బీజేపీ తరుఫున ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాజ‌గోపాల్ కూడా ఈ బిల్లుకు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌టం ఇపుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.   అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలను వ్య‌తిరేకిస్తూ తీర్మానం చేసిన త‌ర్వాత కూడా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతుల పక్షాన నిలిచిన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూడా తన పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, సాయంత్రానికి ఎమ్మెల్యే ఓ.రాజ‌గోపాల్ యు టర్న్ తీసుకుని.. త‌ను అలా అన‌లేద‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కన్న కొడుకు మీద కోపంతో.. పెంపుడు కుక్కకు ఆస్తి రాసిచ్చిన రైతు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతు తాను సంపాదించిన ఆస్తిలో సగం వాటాను తన పెంపుడు కుక్కకు రాసిచ్చాడు. మిగతా సగ భాగం ఆస్తిని తన భార్య పేరున రాశాడు. అయితే అయన తన కుమారుడి తీరు నచ్చక అతడికి ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలోని బరిబాడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.   మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయణ వర్మ ఒక వారం క్రితం తన ఆస్తికి సంబంధించిన వీలునామా రాశాడు. ఈ వీలునామా ప్రకారం తన వారసులుగా అయన తన భార్య చంపాబాయి, తన పెంపుడు కుక్క జాకీని చట్టబద్దమైన వారసులుగా పేర్కొన్నారు. నారాయణ వర్మ రాసిన వీలునామాలో పేర్కొన్న ఆస్తుల్లో 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన భార్య చంపాబాయి తనను జాగ్రత్తగా చూసుకొంటుందని అలాగే తన పెంపుడు కుక్క జాకీ కూడ తనను జాగ్రత్తగా కాపాడుతోందని ఆయన చెప్పారు. తన భార్యతో పాటు తన పెంపుడు కుక్క అంటే కూడా తనకు చాలా ప్రేమ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉందని.. ఒకవేళ తాను చనిపోతే తన పెంపుడు కుక్క అనాథగా మారే అవకాశం ఉందని భావించి ఆయన ఈ పని చేశారట.   అంతేకాకుండా తన చివరి కర్మలు కూడ భార్య, కుక్క చేయాలని అయన తన వీలునామాలో రాశాడు. అంతేకాకుండా తన తర్వాత తన పెంపుడు కుక్కను ఎవరైతే జాగ్రత్తగా చూసుకొంటారో వారికే జాకీకి చెందిన ఆస్తి దక్కుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే ఈ వీలునామా గురించి తెలుసుకొన్న తన కుమారుడు ఈ వీలునామాను రద్దు చేయాలని తనను కోరాడని అయితే తాను మాత్రం వెనక్కు తగ్గేది లేదని అయన స్పష్టం చేస్తున్నాడు.

లోకేష్ ధర్నాతో దిగొచ్చిన జగన్ సర్కార్.. హత్య కేసులో ఎమ్మెల్యేపై కేసు నమోదు

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య రెండు రోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే సుబ్బయ్య మరణానికి కొన్ని గంటల ముందు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో సుబ్బయ్య హత్య జరగడంతో ఈ హత్య కేసులో ఎమ్మెల్యే, అయన బావమరిది, అధికారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయాలని హతుడి భార్య అయిన అపరాజిత డిమాండ్ చేయగా పోలీసులు నిరాకరించారు.   ఈ నేపథ్యంలో సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రొద్దటూరు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తరువాత.. సుబ్బయ్య మృతదేహంతో ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే, ఆయన బంధువు, మున్సిపల్ అధికారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే వరకు ప్రొద్దుటూరు వీడేదిలేదని స్పష్టం చేసారు. దీంతో డీఎస్పీ వచ్చి ఆందోళన విరమించాలని లోకేశ్‌ను కోరారు. అయితే అందుకు లోకేష్ ససేమిరా అనడంతో 161 సెక్షన్‌ ప్రకారం ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్లను ఈ కేసులో చేర్చుతున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో సుబ్బయ్య భార్య అపరాజిత దగ్గర పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తరువాత ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు అందించనున్నారు. ఈ హత్య కేసుపై 15 రోజుల్లో త్వరిత గతిన విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ హామీ ఇచ్చారు.

తిరుమల వెంకన్న మాలలో ఉన్న వైసీపీ నేత జీసస్ స్తుతి.. 

కలియుగ దైవం అయిన తిరుమల వెంకటేశ్వర స్వామి మాల ధరించిన ఆ వైసీపీ నేత ఏసుక్రీస్తును స్తుతిస్తూ క్రిస్మస్‌ గీతాలు ఆలపించడం తాజాగా వివాదాస్పదమైంది. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సోదరుడు జయదేవ్‌ కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వరస్వామి మాల ధరించారు. అయితే ఈనెల 25న నియోజకవర్గంలోని ద్వారకానగర్‌లో క్రిస్మస్‌ వేడుకలకు ఎమ్మెల్యే ధర్మశ్రీతో పాటు అయన సోదరుడు జయదేవ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరుని మాలలో ఉన్న జయదేవ్ వేదికపై క్రీస్తును స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో హిందూ సంఘాలు జయదేవ్ పై తీవ్రంగా మండిపడుతున్నాయి. వెంకటేశ్వర స్వామి మాల ధరించి.. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా, క్రైస్తవ గీతాలు ఆలపించడం ఏమిటని ఆ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఇన్నింగ్స్ డిక్లేర్? టీడీపీలో సోదరుల యాక్టివ్ రోల్ 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ, సమైక్య ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయనే ముఖ్యమంత్రి. ఏపీ విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నించిన నేత. స్వతాహాగా క్రికెటర్ అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... విభజన సమయంలోనూ సమైక్యాంధ్ర కోసం లాస్ట్ బాల్ వరకు పోరాడి.. చివరికి చేసేది లేక సీఎం పదవిని వదులుకున్నారు. ఏపీ విభజనకు వ్యతిరేకంగా సీఎం పోస్టుకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి... 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.    2017లో కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు ఆయన ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఉమెన్‌చాందీ కిరణ్‌ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించారని అందుకు సోనియాగాంధీ ఆమోద ముద్రవేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డిని సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించారని, ఆయననే ఏపీసీసీ చీఫ్ గా నియమించనున్నారని భావించారు. అయితే పీసీసీ పగ్గాలు చేపట్టే ఆలోచన తనకు లేదని చెప్పుకొచ్చారు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్ పదవి తనకేనంటూ వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనన్నారు. తర్వాత కొంత కాలానికి తిరుపతిలో మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎంతో భాదేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సాగు, తాగునీరు ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి.      కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా యాక్టివ్ రాజకీయాలు మాత్రం చేయడం లేదు. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో అన్న స్థానంలో పీలేరు నుంచి  జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడి పోయిన కిషోర్ కుమార్ రెడ్డి.. తర్వాత టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో  పార్టీని బలోపేతం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ గానే పని చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా టీడీపీలో ఇప్పుడు కీలక నేతగా ఉన్నారు నల్లారి  కిషోర్ కుమార్ రెడ్డి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా.. కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు.    ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ లోనూ బలపడే సూనచలు కనిపించకపోవడం, టీడీపీలో తన కుటుంబ సభ్యులు యాక్టివ్ గా ఉండటం తదితర అంశాలతో రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటరనే నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని చెబుతున్నారు. దాదాపుగా ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని తెలుస్తోంది. ఆయన అభిమానులు, అనుచరులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మొత్తానికి సమైక్య ఉద్యమ చాంపియన్ గా నిలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగియడంతో ఆయన అనుచరులు నిరాశ పడుతున్నారు.

హర్యానా స్థానిక ఎన్నికలలో బీజేపీ కూటమికి ఘోర పరాభవం 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 36 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రైతులు చేస్తున్న ఆందోళన ప్రభావంతో హర్యానాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని ముఖ్య నగరాలైన సోనిపట్, అంబాలా మునిసిపల్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడగా, హిస్సార్ జిల్లాలోని ఉకలానా, రేవారీ పరిధిలోని ధారూహెరాలను బీజేపీ కూటమి కోల్పోయింది. ఇప్పటివరకు ఈ రెండు స్థానాలూ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కంచుకోటలుగా ఉన్న సంగతి తెలిసిందే.   ప్రస్తుతం హర్యానాలో బీజేపీ - జేజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేస్తుండగా, వారికి స్థానిక రైతులు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. దీని ప్రభావం స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.   మరోపక్క రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గమైన అంబాలాలో కూడా బీజేపీ ఓటమి పాలవడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలైందని తెలిసి ధర్నాల్లో ఉన్నరైతులు మిఠాయిలు పంచుకుని, ఆనందంతో పాటలు పాడుతూ స్టెప్పులేశారు. హర్యానా జనచేతన పార్టీకి చెందిన శక్తి శర్మ అంబాలాలో మేయర్ కాబోతున్నారు. సోనేపట్ లో కాంగ్రెస్ కు చెందిన లలిత్ బాత్రా మేయర్ పదవిని చేపట్టబోతున్నారు. అయితే పంచకుల మేయర్ పదవి మాత్రం బీజేపీకే దక్కింది. ఇక్కడ కుల్ భూషణ్ గోయల్ విజయం సాధించారు. అంబాలాలో 20 సీట్లకు గాను అధికార బీజేపీ 8 స్థానాలను మాత్రమే గెలవడం ఇక్కడ గమనార్హం.

ఆ ముగ్గురు మంత్రులు తోకలేని కోతులు వంటివారు.. జనసేన ఫైర్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాజాగా ఏపీ మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై జనసేన ముఖ్య నేత శివశంకర్ స్పందించారు. ఈరోజు ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ వెనుక ఉన్న ముగ్గురు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని కూడా ముగ్గురు తోకలు కత్తిరించిన కోతులులాంటివారని అన్నారు. ఆ మంత్రులకు మంత్రివర్గ సమిష్టి బాధ్యతలు ఎంతమాత్రం తెలియవని, అంతేకాకుండా ప్రజస్వామ్యం గురించి గానీ, రాజ్యాంగం గురించి కానీ ఓనమాలు కూడా తెలియని మంత్రులని విమర్శించారు. ఈ ముగ్గురు ప్రాచీనయుగంలో పుట్టవలసినవాళ్లని అయన అన్నారు. ఆ మంత్రులు ఈ యుగంలో పుట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు.   మంత్రి కొడాలి నాని బూతులు మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడడంలేదని శివశంకర్ విమర్శించారు. మంత్రులు తమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. బూతులు మాట్లాడే మంత్రులను పక్కన పెట్టుకుని సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. నివర్ తుఫాను వల్ల 19 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని... ఇప్పుడు 11 లక్షల మంది రైతులని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల సమస్యను పూర్తిగా గాలికొదిలేశారని, నివర్ తుఫాన్ వచ్చినప్పుడు తడిసిన ధ్యాన్నాన్ని కొనుగోలు చేస్తానని సీఎం జగన్ చెప్పారని.. అయితే ఇప్పుడు మిల్లర్లు శాసిస్తున్నారని, దీంతో రైతులు రోడ్డుపై ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వ్యక్తిగత దాడులు ఆపాలని, రైతులకు నివర్ నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని శివశంకర్ డిమాండ్ చేశారు.

బి కేర్ ఫుల్... ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు కరోనా..

కరోనా మహమ్మారి నుండి తమ దేశ ప్రజలను రక్షించడం కోసం బ్రిటన్, అమెరికా వంటి కొన్ని దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న వారం తరువాత ఓ మేల్ నర్సు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మాథ్యూస్ స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. అయన మొన్న డిసెంబర్ 18న ఆయన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న ప్రాంతంలో చేతిపై కొద్దిగా ఎర్రబడటం తప్ప తనకు ఎటువంటి ఇబ్బందులూ కలగలేదని మాథ్యూస్ తెలిపారు.   అయితే అయన ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు రోజుల తరువాత.. క్రిస్మస్ సందర్భగా విధుల్లో ఉన్న తనకు కొంత అనారోగ్యంగా అనిపించిందని.. ఆ తరువాత కొంత సేపటికే చలి, ఒళ్లునొప్పులు వచ్చాయని ఆయన తెలిపారు. మరుసటి రోజు మ్యాథ్యూస్ అనుమానం కలిగి టెస్టు చేయించుకోగా.. రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే ఈ ఘటన పై స్పందించిన అంటువ్యాధుల నిపుణుడు ఒకరు ఈ ఘటన అనూహ్యమైనదేమీ కాదని వ్యాఖ్యానించారు. "క్లినికల్ ట్రయల్స్‌లో తేలిన వివరాల ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్న 10 నుంచి 14 రోజుల తరువాతే కరోనాను ఎదుర్కొనేందుకు మన రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తరువాత మనలో ఇమ్మునిటీ 50 శాతం, రెండు డోసు తీసుకున్న తరువాత 95 శాతం శక్తిని పుంజుకుంటుందని" ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నతరువాత కూడా కొంతకాలం పాటు భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.