ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ భజనా! జగన్ సర్కార్ కు రూల్స్ పట్టవా ? 

భారత రాజ్యాంగ నియమాలు  పట్టవా?  ప్రజ్వాస్వామ్య స్పూర్తిని గాలి కొదిలేసి..  ఏం చేయాలనుకుంటే అది చేయడమే వాళ్ల రాజ్యాంగమా? ఇవి ఆంధ్రప్రదేశ్ లో  పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి సర్కార్ తీరును చూస్తున్న వారికి వస్తున్న సందేహాలు. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ ప్రోగ్రామ్ లకు తేడా తెలియకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  నెల్లూరు జిల్లాలో నిర్వహించిన అమ్మఒడి రెండో విడత అమలు కార్యక్రమం ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ప్రజా ధనంతో నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేస్తూ.. తమ  అధినేతను పొగుడుతూ  వైసీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు చిల్లరగా ప్రవర్తించారు. వైసీపీ నేతల తీరుపై రాజకీయ వర్గాలతో పాటు జనాల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.      ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉంది. పంచాయతీ ఎన్నకలకు ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వడంతో శనివారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా  కోడ్ అమల్లోకి వచ్చింది. అమ్మఒడి పథకం గతంలోనే ప్రారంభించింది.. రెండో విడత అమలు అందులోనే భాగంగా కావడంతో.. ఆ కార్యక్రమానికి ఎస్ఈసీ పర్మిషన్ ఇచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని, లబ్దిదారులకు చెక్కులు ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అధికారుల చేతుల మీదుగానే అమ్మఒడి రెండో విడత అమలు జరగాలని స్పష్టమైన అదేశాలు ఇచ్చింది. కాని స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీని వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్.. కోడ్ నిబంధనలను పట్టించుకోవద్దనే ఉద్దేశంతో ఉన్నట్లు ఉంది. అందుకే నెల్లూరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు.. ఏకంగా ఆ  కార్యక్రమాన్ని  తమ పార్టీ సభను తలపించేలా మార్చేశారు. సీఎం జగన్ సమక్షంలోనే వైసీపీ నేతలంతా రాజకీయ ప్రసంగాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమం అన్న సంగతి మర్చిపోయి.. వ్యక్తిగత దూషణలు చేస్తూ విరుచుకుపడ్డారు. తమ పార్టీ నేతలు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నా కనీసం వారించే ప్రయత్నం చేయలేదు సీఎం జగన్. దీంతో వైసీపీ మంత్రులు , నేతలు మరింత రెచ్చిపోయారు. ఈ సభలోనే స్వయనా ముఖ్యమంత్రి జగన్ కూడా  విపక్షాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి  పనులు చూడలేక ప్రతిపక్ష పార్టీలకు  మంట పుడుతుందని ఆరోపించారు. చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, రథాలను తగలబెడుతున్నారని చెప్పారు. అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు చేసిన వారు దేవుళ్లపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా కొందరు కోవర్డులు నోటిఫికేషన్లు ఇస్తున్నారంటూ ఏకంగా ఎన్నికల కమిషనర్ నే టార్గెట్ చేశారు సీఎం జగన్. ఎన్నికల కోడ్ కు విరుద్దంగా నిర్వహించిన సభలో పాల్గొనడమే కాకుండా ఎస్ఈసీపైనా సీఎం ఆరోపణలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.  నెల్లూరు అమ్మఒడి కార్యక్రమంలో వైసీపీ నేతల తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాని, రాష్ట్ర విభజన తర్వాత కాని ఇలాంటి పరిణామాలు గతంలో  ఎప్పుడు జరగలేదంటున్నారు. గతంలో పని చేసిన ముఖ్యమంత్రులు కాని మంత్రులు గాని ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉండేవారు. ఏదైనా మాట్లాడాలి అనుకున్నా...  పరోక్షంగా తాము చెప్పదలుచుకున్న విషయాలను చెప్పేవారు. దివంగత వైఎస్సార్ కూడా పార్టీ సభల్లోనే టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసే వారు కాని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో హుందాగానే వ్యవహరించేవారని చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ మాత్రం ఇవేమి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాను అనుకున్నదే చట్టం.. పాటించేది రాజ్యంగం అన్నట్లుగా ఇష్టారాజ్యంగా ముందుకు వెళుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పోకడలు మంచివి కావని మేథావులు అభిప్రాయపడుతున్నారు.   మొత్తానికి  ప్రభుత్వ కార్యక్రమంలో.. అది కూడా ఎన్నికల కోడ్ ఉన్నా పట్టించుకోకుండా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు  ఇంత దారుణంగా వ్యవహరించడమేంటనే చర్చ జరుగుతోంది. రాజ్యాంగ రూల్స్ కు విరుద్దంగా ముందుకు వెళుతూ వైఎస్ జగన్ నెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని కొందరు జనాలు ఫైరవుతున్నారు.  

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్  

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 50 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ వ్యవహారం పై ఈరోజు సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను సవాల్ చేస్తూ రైతులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ల‌క్ష్య వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టింది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేవ‌ర‌కు చ‌ట్టాల‌ను నిలుపుద‌ల చేయాల‌ని ఇప్పటికే సూచించింది. ఒకవేళ కేంద్రం నిలిపివేయకపోతే.. తామే స్టే విధించాల్సి వ‌స్తుంద‌ని తీవ్రంగా హెచ్చ‌రించింది. ఒకపక్క ఆందోళ‌నలలో పాల్గొంటున్న రైతులు చ‌నిపోతుంటే కేంద్రానికి క‌నిపించ‌డం లేదా అని సుప్రీం కోర్టు నిల‌దీసింది. వృద్ధులు, మ‌హిళ‌లు కూడా ఈ ఉద్యమంలో చేరి పోరాటం చేస్తున్నార‌ని గుర్తు చేసింది. ఇప్ప‌టికే ఈ విషయంలో ప‌రిస్థితి విష‌మించింద‌ని.. రేపు ర‌క్త‌పాతం జ‌రిగితే దానికి ఎవ‌రు బాధ్య‌త వహిస్తారని ప్ర‌శ్నించింది. ఇన్ని రోజులు గ‌డిచినా దీనికి ప‌రిష్కారం చూప‌క‌పోవ‌డ‌మేంట‌ని కేంద్రంపై కోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.   సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్య‌ల‌పై అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వెలుగోపాల్ స్పందిస్తూ.. రైతులతో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు గ‌తంలో చ‌ట్టాలు నిలుపుద‌ల చేసిన సంద‌ర్భాలు లేవ‌ని గుర్తు చేశారు. ప్రజల ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లుగుతుంద‌ని భావిస్తే త‌ప్ప స్టే విధించలేరని కోర్టుకు చెప్పారు. ఈ నెల 15న చ‌ర్చ‌లు ఉన్నందున‌.. అప్ప‌టివ‌ర‌కు వేచి చూడాల‌ని అయన కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు.   ఇది ఇలా ఉండగా ఈ నెల 7న కేంద్రం, రైతు సంఘాల మ‌ధ్య జ‌రిగిన ఎనిమిదో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోను మూడు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు త‌మ ఆందోళ‌న కొన‌సాగిస్తామని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా అక్షింతలతో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతుల కోర్కెలను మన్నిస్తుందా.. లేక కోర్టు ద్వారానే దీనికి పరష్కారం లభిస్తుందా వేచి చూడాలి.

సామాన్యుడి నెత్తి మీద మరో పిడుగు.. కేంద్రం కొత్త సెస్..! 

కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబుపై కేంద్రం మరోసారి కన్నేసింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతున్న సంగతి తెల్సిందే. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాల రాబడి అంతంత మాత్రమే ఉండడం, మరోపక్క కరోనా వ్యాక్సిన్‌ను దేశం మొత్తం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వాటికి అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని కేంద్రం "కరోనా సెస్" ను విధించాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఆదాయాన్ని పెంచే మరిన్ని చర్యలపై కేంద్రం ఇప్పటికే పలువురు నిపుణులతో ఒక ప్రాథమిక సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే సెస్ లేదా సర్‌చార్జీ రూపంలో కొత్త లేవీని విధించే విషయంలో కేంద్రం ఒక ఫైనల్ డెసిషన్ కు ఇంకా రాలేదు. అయితే కేంద్రం చేస్తున్న ఈ నిర్ణయాన్ని పరిశ్రమలు, ఆర్థిక నిపుణులు వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ వివిధ పారిశ్రామిక వేత్తల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో ఒక సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి కొత్త పన్నులను విధించరాదని కేంద్రానికి స్పష్టం చేసారు. అయితే కొత్త సెస్‌ను విధించే విషయంలో మాత్రం అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు కొందరు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క అధిక ఆదాయం కలిగిన వారికి పరోక్షంగా పన్నులు వేయాలన్న ప్రతిపాదనలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు విధించాలని కూడా కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు..

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఈరోజు జరిగిన విచారణలో న్యాయస్థానం అఖిల ప్రియకు బెయిల్ నిరాకరించింది. అఖిలప్రియను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆమె పోలీసు కస్టడీ ఈరోజు నుండి మొదలు కానుంది. ఈ కేసులో అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంచించిన సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. అఖిలప్రియ బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని పోలీసులు ఆ కౌంటర్ లో తెలిపారు.

ఏపీలో కీచక టీచర్.. కోరిక తీర్చకపోతే పిల్లల ఫ్యూచర్ నాశనం చేస్తానంటూ...

విద్యార్థులకు పాఠాలు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఆ ఉపాధ్యాయుడి బుద్ది గడ్డి తింది. తన కోరిక తీర్చాలంటూ ఒక మహిళతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. తన మాట వినకుంటే ఆమె పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని న్యూ చిట్యాల గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గత శనివారం రాత్రి చోటు చేసుకుంది.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాల గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటింటికీ తిరిగి నిమ్మకాయలను విక్రయిస్తుంది. అయితే అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బొల్లా శ్రీనివాసరావు ఆ మహిళపై కన్నేశాడు. శనివారం సాయంత్రం తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆ మహిళను శ్రీనివాసరావు వెంబండించాడు. ఆమె ఇంటికి వెళ్లిన శ్రీనివాసరావు ఆమె కొంగు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా తన కోరిక తీర్చాలంటూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.   అంతేకాకుండా నీ పిల్లలకు చదువు చెప్పేది నేనే.. నా కోరిక తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా.. అని ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఈ ఘటన చూసి అడ్డువచ్చిన ఆ మహిళ తల్లిదండ్రులపై దాడి చేసి.. వారిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.   దీంతో ఆదివారం బాధితురాలి కుటుంబ సభ్యులు, మరికొంతమంది స్థానికులు కలిసి.. ఆ టీచర్ ను వెంటనే విధుల్లోనుంచి తొలగించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని సర్ది చెప్పడంతో బాధితురాలు కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఆ బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెల్లెలికి పసుపు రంగు బైకు ఉందని అన్నకు బేడీలు.. అవాక్కయిన జడ్జ్ 

ఆ రంగుల బైకు ఒక అమాయకుడిని దొంగగా బోనులో నిలబెట్టింది. చెల్లికి ఉన్న పసుపు రంగు బైక్‌, దానికి ఎరుపు రంగు రిమ్ములు ఉండడమే ఆ అన్న పాలిట శాపమైంది. పోలీసులు అతనిపై ఏకంగా దొంగతనం నేరం మోపడానికి కూడా ఆ బైకు కారణమైంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ఒక దొంగతనం జరిగింది. ఆ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. దొంగ ఎరుపు రంగు రిమ్ములున్న పసుపురంగు బైక్‌పై పరారయ్యాడని కంప్లైంట్ చేసాడు. దీంతో.. ఢిల్లీ పోలీసులు అటువంటి బండి కోసం వెతికి.. ఆ వాహనం యజమాని ఒక యువతి అని తేల్చారు. వెంటనే ఆమె సోదరుడు నందాను ఈ దొంగతనం కేసులో అరెస్టు చేశారు.   ఈ కేసు నుండి బయటపడాలంటే తమకు రూ. 50వేలు లంచం ఇవ్వాలని.. అపుడే నందాకు బెయిల్‌ దొరుకుతుందని అతడి సోదరికి చెప్పారు. మరోపక్క నందాను అదనపు సెషన్స్‌ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి బాధితుడి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు. బెయిల్‌ కోసం ఒక ఏఎస్సై లంచం డిమాండ్‌ చేయడంపైన ఆయన సీరియస్‌ అయ్యారు. దీంతో నందాపై తప్పుడు కేసు పెట్టిన ఎస్‌హెచ్‌వో, దర్యాప్తు అధికారి, లంచం డిమాండ్‌ చేసిన ఏఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జడ్జ్ డీసీపీని ఆదేశించారు.

ప్రముఖ జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(89) కన్నుమూశారు.  ఆదివారం  రాత్రి కుటుంబరావు గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో అనేక మంది పాత్రికేయ ప్రముఖులు శోఖసంద్రంలో మునిగారు.  1933 ఆగస్టు 10న జన్మించిన తుర్లపాటి 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగు పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అనేక విషయాలపై విశ్లేషణలు చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ప్రసిద్ధికెక్కారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు. ఆయన రాసిన ‘18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరు గడించారు. జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 2002లో ప్రతిష్టాత్మక పద్మశ్రీని అందించింది.     1951లో ఆచార్య ఎన్‌జీ రంగారావు వాహిని పత్రికలో మొదటిసారిగా కుటుంబరావు ఉప సంపాదకుడిగా పనిచేశారు. అనంతరం చలసాని రామారాయ్‌ ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. రాజకీయలపై చేస్తున్న విశ్లేషణలను చూసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన్ని చెన్నైకి పిలిపించి, తను నడుపుతున్న ప్రజాపత్రికలో సహాయ సంపాదకుడిగా నియమించారు. అంతేకాకుండా సహాయ సంపాదకుడితో పాటు ప్రకాశం పంతులుకు కార్యదర్శిగానూ ద్విపాత్రాభినయం చేశారు. ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో కుటుంబరావును తనతో పాటే ఉండమని చెప్పారు. దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రభుత్వంలో ఉండి నిజాలను కప్పిపెడుతూ రాయలేనని, జర్నలిస్టుగానే ఉంటానని కుటుంబరావు పేర్కొన్నారు. దీంతో ఆయనకు పాత్రికేయ వృత్తిపై ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతోంది. అనంతర కాలంలో ఆంధ్రజ్యోతికి ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు.     విజయవాడకు వచ్చిన మహత్మా గాంధీ నుంచి 14 ఏళ్ల ప్రాయంలో ఆటోగ్రాఫ్‌ పొందారు. ప్రముఖ నాయకులు అంబేద్కర్‌, నెహ్రూ, రాజాజీలను ఇంటర్వ్యూ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయవాదులు, ప్రముఖ వ్యక్తులు ఇలా దాదాపు 6 వేల బయోగ్రఫీలను ఆయన రాశారు. ఇలా తెలుగు సాహిత్యంలో వ్యక్తుల జీవిత చరిత్రల రచయితగా ముద్ర వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో దాదాపు 20 వేల సమావేశాల్లో వక్తగా ప్రసంగించారు. దీంతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించారు. జాతక కథలు, జాతి నిర్మాతలు, మహానాయకులు, విప్లవ వీరులు, నా కలం నా గళం, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు తదితర పుస్తకాలు రాశారు. ప్రముఖ జాతీయ నేతల ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేశారు.       తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ‘‘తుర్లపాటి పరమపదించారని తెలిసి విచారించాను. టంగుటూరి ప్రకాశం పంతులు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన నాటి నుంచి ప్రతి రంగంలోనూ ఉన్నత ప్రమాణాలు పాటించి ఆదర్శంగా నిలిచారు. ఆయన చూపిన మంచి మార్గం, సాంప్రదాయాలని పాటించడమే, ఆయనకి మనమిచ్చే నిజమైన నివాళి. కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ తుర్లపాటికి  వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. తుర్లపాటి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది. తుర్లపాటి కుటుంబరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.  

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాలకు టీకా!

కోవిడ్ వ్యాక్సినేషన్ కు తెలుగు రాష్ట్రాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఏపీ, తెలంగాణకు సోమవారం రాత్రి వరకు కరోనా టీకాలు రానున్నాయి.  మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ కు 7 లక్షలు,  తెలంగాణకు ఆరున్నర డోసులు వస్తాయని చెబుతున్నారు.హెడ్ క్వార్టర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ డోస్‌లు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయి. పోలీసు భద్రత నడుమ గ్రామస్థాయి వరకు వ్యాక్సిన్ వెళ్లినట్లుగానే వీటి నిల్వ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే చేపట్టేలా ఫ్రీజర్లు, ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్లను వైద్యారోగ్య శాఖ సమకూర్చింది. డోస్‌లు భద్రపరిచిన చోట కూడా పోలీసు భద్రత కొనసాగనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. హెల్త్ కేర్ వర్కర్లకు తొలి డోస్ ఇవ్వడానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉన్నందున అప్పటికల్లా మరోసారి కొత్త స్టాక్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.           ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రంలో డాక్టరుతో పాటు వ్యాక్సిన్ వేయడానికి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలర్జీ, రియాక్షన్ లాంటివాటిని పరిశీలించడానికి అబ్జర్వేషన్ రూమ్‌లు, హెల్త్ కేర్ సిబ్బంది వేచి ఉండడానికి వెయిటింగ్ హాళ్ళు.. ఇలా అన్నీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటయ్యాయి.ఇప్పటికే సిరంజీలు వచ్చి రెడీగా ఉన్నాయి. వ్యాక్సిన్‌లు వచ్చిన తర్వాత వాటిని నిల్వ చేయడానికి వీలుగా  అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కోల్డ్ స్టోరేజీ చైన్ సిస్టమ్ రెడీ అయింది. వ్యాక్సిన్‌ వేయించుకునే ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. వ్యాక్సినేషన్‌ అయిపోయిన అనంతరం వీరి వివరాలు కో–విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేస్తారు.    వ్యాక్సిన్ పంపిణి కోసం  తెలంగాణలో  తొలి రోజు 139 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 40 ప్రైవేటు ఆసుపత్రులలో ఉంటే మిగిలిన 99 ప్రభుత్వాసుపత్రులలోనే ఏర్పాటయ్యాయి. ప్రతీ కేంద్రంలో రోజుకు వంద మంది చొప్పున తొలి రోజు తెలంగాణలో మొత్తం 13,900 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా రంగం సిద్ధమైంది. ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఇప్పటికే సుమారు 2.90 లక్షల మంది పేర్లు ‘కొవిన్’లో నమోదయ్యాయి. తొలి రోజున 13,900 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంటుంది. 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాలలో మొత్తం 1400 సెషన్లలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. కొన్ని చోట్ల అనుబంధ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున రోజుకు 1.40 లక్షల మందికి ఇవ్వాలని ప్లాన్ రెడీ అయింది.     హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఆ తర్వాతి క్రమంలో పోలీసు, రెవెన్యూ, పారిశుద్య కార్మికులకు కూడా ఇవ్వనున్నందున మొత్తం తొమ్మిది లక్షల మందికి తొలి డోస్ ఇవ్వడానికి సుమారు రెండు వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ వర్గాల అంచనా. హెల్త్ కేర్ సిబ్బంది వివరాలన్నీ ‘కొవిన్’లో నమోదై సిద్ధంగా ఉన్నా పోలీసు, రెవెన్యూ, పారిశుద్య కార్మికుల వివరాలు మాత్రం ఇంకా నమోదు చేసే స్థాయిలోనే ఉన్నాయి. హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి వీరి పేర్లు కూడా ‘కొవిన్’లోకి చేరితే వారికి కూడా పంపిణీ మొదలవుతుంది.  

బోయినపల్లి కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్ తల్లిదండ్రుల అరెస్ట్ కు రంగం సిద్ధం.. 

బోయినపల్లి కిడ్నాప్ కేసులో భార్గవ్ రామ్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పోలీసులకు అతని ఆచూకీ కూడా తెలియని పరిష్టితి నెలకొంది. దీంతో ఈ కేసులో భార్గవ్‌రామ్ తండ్రి శ్రీరామ్ నాయుడు దంపతులను అరెస్ట్ చేసేందు‌కు రంగం సిద్ధమైంది. యూసఫ్‌గూడలోని ఎంజీఎం స్కూల్‌ దగ్గర ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించారు. బోయిన్ పల్లి కిడ్నాప్‌ కేసులో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ కిడ్నాప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీరామ్‌నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. తాము దుబాయ్‌ నుంచి శనివారమే వచ్చినట్లు అయన తెలిపారు. మరోపక్క ఈ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దేశంలో జనవరి 16 నుంచి కోవిడ్ టీకా పంపిణీ

భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. దేశంలో జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించామని కేంద్రం  తెలిపింది.  ప్రాధాన్యత క్రమంలో భాగంగా మొదట దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఆ తర్వాత 27కోట్ల మంది 50ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి కోవిడ్ అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ పై డిజిటల్ పర్యవేక్షణ చేయనున్నారు.   దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ  కేబినెట్‌ సెక్రటరీ, పీఎం ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ సన్నాహాల గురించి ఈ సమావేశంలో ప్రధాని మోడీ.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.రెండు స్వదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్ట్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం శుక్రవారం  దేశవ్యాప్తంగా డ్రైరన్‌ చేపట్టింది. ఈ డ్రై రన్‌ ఫలితాల ఆధారంగా టీకా పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీకి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్రాల  ప్రధాన కార్యదర్శులకు విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే దేశంలోని అన్ని  ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతమైందని తెలిపారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రాజీవ్‌గౌబ .. వ్యాక్సిన్‌ పంపిణీని ప్రణాళిబద్దంగా అమలు చేయాలని కోరారు. మొదటగా  ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని హెల్త్‌ వర్కర్స్‌, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు, 50 సంవత్సరాలు పై బడిన వారికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని సూచించారు.   

తెలంగాణ సీఎస్ పై కేంద్రానికి కంప్లైంట్! సోమేష్ కుమార్  కు గండమేనా? 

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై కేంద్రానికి కంప్లైంట్ వెళ్లింది. సీఎస్ సోమేష్ కుమార్ ఏకపక్షంగా  ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నారని  విజయగోపాల్ అనే సామాజిక కార్యకర్త కేంద్ర హోం మంత్రిత్వి శాఖ ఆధీనంలోని డీవోపీటీ కి ఫిర్యాదు చేశారు. కేంద్ర సర్వీసు బోర్డు నిబంధనలను పట్టించుకోవడంలేదని అందులో ఆయన ఆరోపించారు. విజయగోపాల్ ఫిర్యాదును  పరిగణనలోకి తీసుకున్న డీవోపీటీ అధికారులు..  నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.  సీఎస్ పై కేంద్రానికి చేసిన ఫిర్యాదులో అత్యంత కీలకమైన విషయాలు ప్రస్తావించారు విజయగోపాల్.  ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు ఒకసారి నిర్దిష్ట బాధ్యతలను స్వీకరించిన తర్వాత కనీసం రెండేళ్ల వరకు కొనసాగాలని స్పష్టమైన నిబంధన ఉందని లేఖలో  పేర్కొన్నారు. బదిలీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే సెంట్రల్ సర్వీసెస్ బోర్డు ద్వారా మాత్రమే జరగాలని.. కాని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు బోర్డును నెలకొల్పనేలేదని వివరించారు. సుప్రీంకోర్టు సైతం సెంట్రల్ బోర్డు ఏర్పాటు దాని ఆవశ్యకత గురించి ఒక కేసులో ప్రస్తావించిందని  విజయగోపాల్  గుర్తుచేశారు. సెంట్రల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని విజయగోపాల్ లేఖలో వివరించారు.  ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారుల బదిలీలపై నిర్ణయం తీసుకోడానికి ఈ బోర్డు అవశ్యమని, దీనికి రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారని విజయగోపాల్ గుర్తుచేశారు. రాజకీయ జోక్యాన్ని తగ్గించడం, నిర్దిష్టంగా ఒక బాధ్యత అప్పజెప్పిన తర్వాత దాన్ని నిర్వర్తించడానికి తప్పనిసరిగా నిర్దిష్ట కాలవ్యవధి అవసరం కావడం తదితర కారణంగానే బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 19 రాష్ట్రాలు బోర్డులను ఏర్పాటుచేశాయని, తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా నెలకొల్పిందని పేర్కొన్నారు. బోర్డుతో సంప్రదింపులు లేకుండానే తెలంగాణలో ఆరు నెలల వ్యవధిలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయని తెలిపారు. విజయగోపాల్ ప్రస్తావించిన అంశాల  ప్రతిని కూడా తాజా లేఖతో జతచేసి  సీఎంవో  ముఖ్య కార్యదర్శికి పంపింది డీవోపీటీ.   విజయగోపాల్ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీవోపీటీ తెలంగాణ సీఎంవోను ఆదేశించడంతో.. ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. సీఎస్ సోమేష్ కుమార్ పై కొంత కాలంగా సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్, ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వంపై  ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. సోమేష్ ప్రతిపాదనల ప్రకారం ముందుకు వెళ్లడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి  ఈ రెండు అంశాలే కారణమయ్యాయని భావిస్తున్న కేసీఆర్.. సీఎస్ సోమేష్ కుమార్ ను మార్చుతారనే ప్రచారం కూడా ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. దీంతో డీవోపీటీ లేఖ సాకుతో  ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాలతో పాటు ప్రభుత్వ యంత్రాగంలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది.   

2020 కంటే 2021 యమ డేంజరట! ఇక మానవ జాతి అంతమేనా! 

2020 ప్రపంచ దేశాలకు అత్యంత దుర్భరమైన సంవత్సరం. ప్రపంచ మానవాళిని భయాందోళనలో ఉంచిన ఏడాది. 2020లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. జనాల జీవితాల్లో కల్లోలం రేపింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసింది. మానవ సంబంధాలను తెంపేసింది. పండుగ చేసుకున్నా సింగిల్ గానే.. పార్టీ చేసుకున్నా సింగిల్ గానే.. చివరకు పెళ్లి.. చావు అన్నీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే.. హంగూ ఆర్భాటాల్లేవు.. మంది మార్బలం అంతకన్నా లేదు. ఇంతటి భయంకరమైన 2020కు వీడ్కోలు పలికాం.. కొత్త ఏడాదికి కోటి ఆశలతో స్వాగతం చెప్పాం.. అయితే కొత్త సంవత్సరం తొలి వారంలోనే  ప్రపంచానికి మరో షాకింగ్ వార్త వచ్చేసింది.  2020 కంటే భయానకమైన పరిస్థితిని 2021లో చూడబోతున్నామట. ఇది చెప్పింది ఎవరో కాదు.. ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్. 465 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ భవిష్యవాణిలో 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉంటుందని చెప్పారని చెబుతున్నారు. 2020-21కి సంబంధించి ఆయన చెప్పిన జోస్యంలో.. వర్షం, రక్తం, పాలు, కరువు, దొంగతనాలు, ఓ మహమ్మారి అనేవి విజృంభిస్తాయని వెల్లడించారు. అలాగే వీటి బారిన పడి కోట్ల మంది చనిపోతారని... ఎందరో తల్లులు, తండ్రులు మరణిస్తారని తెలిపారు. బతికున్న వారు సగం చనిపోయిన వారిలా మిగిలిపోతారని వెల్లడించారు. వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయని... ఆకాశం ఎర్రగా మారుతుందని తెలిపారు. కాంతి వంతమైన తోక కలిగిన ఓ కిరణం విశ్వం నుంచి భూమికి చేరుతుంది. ఎక్కడ చూసినా కరువు ఏర్పడుతుందంటూ 20వ శతాబ్దానికి సంబంధించి ఆయన భవిష్యవాణి చెప్పారు.  నోస్ట్రడామస్ చెప్పిన దాని ప్రకారం 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  కరోనా మహమ్మారితో పెద్ద ప్రమాదమేమీ లేదు కానీ.. దాని తరువాత ప్రపంచ వ్యాప్తంగా దారుణమైన కరువు పరిస్థితులు మాత్రం ఏర్పడే అవకాశముంది. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా వెల్లడించింది. ఇక ప్యారిస్‌లోని ఐఫిల్ టవర్ సైజులో ఉన్న ఓ భారీ ఉల్క భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇది భూమిడి ఢీకొట్టే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. అది భూమిని దాటే వరకు ప్రమాదం పొంచి ఉన్నట్లేనని చెబుతున్నారు. ఈ ఏడాది సౌర తుఫానులు భారీగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు వాతావరణంలో భారీ మార్పుల కారణంగా భూ భ్రమణ వేగం కూడా పెరిగింది.  నోస్ట్రడామస్ చెప్పినవాటిలో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి.  దుర్మార్గుడైన హిట్లర్ నియంతృత్వ ధోరణిని ఆయన ముందుగానే ఊహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడి హత్య గురించి ముందుగానే హెచ్చరించారు. 9/11 ట్విన్ టవర్స్ ఎటాక్, అమెరికాలోని అతిపెద్ద భూకంపం ఇలా అనేక విషయాల గురించి ఏకంగా 465 ఏళ్ల క్రితమే తన భవిష్యవాణిలో చెప్పారు ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్. వీటితో పాటు 2020లో ఓ గుర్తు తెలియని మహమ్మారి విజృంభించి కోట్ల మంది ప్రాణాలను బలిగొంటుందన విషయం కూడా ఆయన భవిష్యవాణిలో ఉంది. దాని ప్రకారమే కరోనా వచ్చింది.  2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉంటుందని నోస్ట్రడామస్ భవిష్యవాణిలో ఉండడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం. అయితే 2020లో విజృంభించిన కరోనాను మానవజాతి దాదాపు జయించినట్లే. కోవిడ్ వ్యాక్సిన్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. ఇక భూమికి చేరువగా వస్తున్న ఉల్క కూడా భూమిని ఢీకొనే అవకాశం 40వేలల్లో ఒక్క శాతం కంటే తక్కువ మాత్రమే ఉంది. కరువు పరిస్థితులను తట్టుకోవడానికి ప్రపంచ దేశాలు కూడా ఒక్కటై పోరాడేందుకు, సహాయసహకారాలూ అందించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అంటే ఈ ప్రమాదాలను కూడా  మనం జయించే అవకాశం ఉందని చెబుతున్నారు.   

పూజారులు, జర్నలిస్టులపై కేసులా! జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్ 

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడులపై రాజకీయ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆలయాలపై దాడులకు సంబంధించి పూజారులు, జర్నలిస్టులపై కేసులు పెట్టడం దుమారం రేపుతోంది. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండకు చెందిన జర్నలిస్టుపై కేసు నమోదైంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారంపై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకే అతనిపై పోలీసులు కేసు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. పూజరి, జర్నలిస్టుపై కేసు పెట్టడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు తీవ్రంగా స్పందించారు.  ఆలయ పూజారి పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం సరికాదని చంద్రబాబు అన్నారు. 140 ఆలయాలపై దాడులు జరుగుతున్నా దోషులను పట్టుకోలేదన్నారు. టీడీపీ కార్యకర్తలుగా ముద్రవేసి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలే కావాలని ఇదంతా చేయిస్తున్నారని తాము కూడా అనాలా? అని ప్రశ్నించారు. అమాయకులను కేసుల్లో ఇరికించ వద్దన్నారు.ఆలయాల ఎదురుగా దుకాణం నడిపేవారిని స్టేషన్‌కు తీసుకెళ్లారా?..అమాయకులను స్టేషన్‌లో పెట్టి వేధిస్తారా? అని ప్రశ్నించారు. నిందితులను గాలికొదిలేసి సమాచారం ఇచ్చిన వ్యక్తులను, వార్త రాసిన జర్నలిస్టులను వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని నారా లోకేష్ విమర్శించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారంపై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకు జర్నలిస్టుల పై అక్రమ కేసులు పెట్టి వేధించడం వైఎస్ జ‌గ‌న్  మూర్ఖత్వానికి పరాకాష్ట అని లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 140 ఘటనలు జరిగితే నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి సమాచారం బయటపెట్టిన వ్యక్తులు, జర్నలిస్టుల పై అక్రమ బనాయిస్తుందని ధ్వజమెత్తారు.వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అమాయకులపై కేసులు పెడుతున్న కొంతమంది పోలీసులు పర్యవసానం అనుభవించక తప్పదని లోకేష్ హెచ్చరించారు.  ముందే విగ్రహాలు విరిగిపోయాయని మాయచేస్తున్న ప్రభుత్వం మరమ్మత్తులు ఎందుకు చెయ్యలేదు... వాస్తవాలు బయటకొచ్చాకా ఎదో తప్పుడు కథలు చెప్పడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది  అని నారా లోకేష్ విమ‌ర్శించారు.   

నగ్నంగా మోకాళ్ళపై ప్రదర్శన చేస్తానంటున్న ఎమ్మెల్యే! 

రాజకీయ నేతలు సవాల్ విసురుకోవడం కామన్. కొందరు నేతలు శపథాలు చేస్తుంటారు... ఇంకొందరు గుళ్లలో ప్రమాణాలు  చేస్తుంటారు. కాని ఈ ఎమ్మెల్యే మాత్రం స్పెషల్. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో   ఉంటారు. వినూత్నంగా  వ్యవహరిస్తుంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా అధికారులపైనా నిరసన తెలుపుతుంటారు. సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా వెరైటీ కార్యక్రమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆ ఎమ్మెల్యేనే మరోసారి సంచలన సవాల్ చేశారు.  ఆయనెవరో కాదు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆయన వార్నింగ్ ఇచ్చారు.  తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన 1లక్షా30వేల కోట్ల నిధులు ఇవ్వకుండా దగా చేస్తుందని మండిపడ్డారు ముత్తిరెడ్డి. ఇది వాస్తవం కాదని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే జనగామ నియోజకవర్గంలో నగ్నంగా మోకాళ్ళపై ప్రదర్శన చేస్తానని సవాల్ చేశారు. ముత్తిరెడ్డి చేసిన సవాల్ జనగామ జిల్లాలో సంచలనంగా మారింది.  గతంలోనూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలు  వివాదాల్లో  చిక్కుకున్నారు.  ఓ వివాదాస్పద 6 ఎకరాల స్థలంలో ఆయన వెంచర్ వేశారు. మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసి మురుగు నీటిని యశ్వంతాపుర్ వాగులోకి తరలించే యత్నం చేశారని స్థానికుల ఆరోపణ. దీన్ని టీఆర్‌ఎస్‌‌కు చెందిన మాజీ సర్పంచ్ సుశీలమ్మ అడ్డుకున్నారు. ఆమె అడ్డుకోవడంతో నేలపై పడుకొని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిరసన తెలిపారు. ఫిల్టర్ చేసిన నీటిని వాగులోకి తరలిస్తామంటే అడ్డుకోవడం సరికాదని ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు.  చేర్యాలలో మత్తడి సమీపంలో ముత్తిరెడ్డి యాదగిరి అర ఎకరం స్థలాన్ని ఆక్రమించారని స్థానిక విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మత్తడి నుంచి నేరుగా కాలువ నిర్మిస్తే తన కుమార్తె కొన్న స్థలం మొత్తం కాలువకు వదలాల్సి ఉంటుందనే ఉద్దేశంతో కాస్త పక్కకు జరిపి కేవలం 1000 గజాల స్థలం మాత్రమే కోల్పోయేలా కాలువను ముత్తిరెడ్డి డిజైన్‌ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే  పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని తాను కబ్జా చేశానంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నిరూపిస్తే జనగామలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తానని ముత్తిరెడ్డి సవాల్‌ విసిరారు. 

కేసీఆర్ మోడీ కాళ్లు పట్టుకున్నారు! జీవన్ రెడ్డి సంచలన కామెంట్లు 

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి  మొగుడిని అవుతానంటూ ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ట్రాన్స్ జండర్ అయ్యారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.ఢిల్లీలో మోడీ కాళ్ళు పట్టుకున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు జీవన్ రెడ్డి.  కేసీఆర్ శిఖండిగా మారారని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ కేసీఆర్ జగీర్ కాదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మంత్రులను రోడ్లపై కూర్చో పెట్టి ధర్నా చేయించిన కేసీఆర్ .. వ్యవసాయ చట్టంపై  ఎందుకు యూ టర్న్ తీసుకున్నారని ఆయన నిలదీశారు.  కొత్త  వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు.   కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం పచ్చి మోసమన్నారు జీవన్ రెడ్డి. రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయమన్నారు. శ్మశానవాటికలు, డప్పింగ్ యార్డులను కాంగ్రెస్ తీసుకొచ్చిన  ఉపాధి హామీ పథకంతోనే అభివృద్ధి చేస్తున్నారన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతుకు మద్దతు ధర కల్పించిందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే‌‌.. టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు. 

పాలిటిక్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా బాలకృష్ణ.. టీడీపీలో ఫుల్ జోష్

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా హిందూపురం నియోజకవర్గంలో చేపడుతున్న పర్యటన ఇపుడు రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన పర్యటనలో వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే ఇక అయన పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారిపోయారని ఇటు టిడిపి లో అటు ప్రజలలోను పెద్ద చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు ఎదో తన నియోజకవర్గం హిందూపురం వరకు పర్యటించి అక్కడి సమస్యల గురించి మాట్లాడే వారు. అటువంటిది తాజాగా బాలయ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను లేవనెత్తుతూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేయటం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ప్రత్యర్థి పక్షాలపైన పెద్దగా సప్నదించని బాలకృష్ణ తాజాగా రాష్ట్ర మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇవ్వటం పెద్ద సంచలనం అయింది. అంతేకాకుండా రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపైన, అలాగే రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతన్న దాడులు వరకు అన్నింటిపైనా అయన స్పందించారు. మరోపక్క టీడీపీ నేతలతో కలిసి ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల వద్ద ధర్నా చేసి.. వాటిని వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేసారు. మొత్తానికి బాలకృష్ణ తాజా హిందూపూర్ పర్యటనలో ఒకపక్క అధికార వైసీపీని ఏకిపారేస్తూ.. మరోపక్క పంట నష్టపోయిన రైతన్నలను పరామర్శించి వారికి తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. మరోపక్క రైతుల సమస్యలపై జగన్ సర్కార్ కనుక దిగిరాకపోతే డిల్లీ తరహా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బాలకృష్ణ తాజా పర్యటనలో అయన పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ కావడం చూసి టీడీపీ కేడర్ మొత్తం ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఏపీలో వచ్చేసిన ఎన్నికల కోడ్.. సుప్రీంకు వెళ్లే యోచనలో సర్కార్

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎపిలొంమి జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం చాన్సివ్వకుండా దూకుడుగా అయన వ్యవహరిస్తున్నారు. హైకోర్టు సూచించిన మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయిన వెంటనే.. రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసారు. ఈ నెల ఇరవై మూడో తేదీన మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం నాలుగు దశల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు.. అయన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసారు. 27వ తేదీన రెండో దశ, 31వ తేదీన మూడో దశ, ఫిబ్రవరి నాలుగో తేదీన నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఎస్ఈసీ తాజా ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లయింది. గత సంవత్సరం మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయాయి. మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల వరకూ వచ్చినా.. పంచాయతీ ఎన్నికలకు మాత్రం నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోయాయి. దీంతో… ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ణయించి.. దానికి సంబంధించిన ప్రోసీడింగ్స్ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా కారణం చెబుతూ.. ఎన్నికలు నిర్వహించలేమని చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీదే అంతిమ నిర్ణయం అని కోర్టులు కూడా స్పష్టం చేసినందున ప్రభుత్వం సహకరించకపోవడానికి చాన్సే లేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక సహకరించకపోతే.. అపుడు రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఎన్నికల ప్రకటనకు ముందు… ఎపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ఎస్‌ఈసీ వద్దకు వచ్చిన ప్రభుత్వ కమిటీ.. తాము చెప్పాల్సిందంతా చెప్పి ఒక లేఖ ఇచ్చి వెళ్లారు. ఆ లేఖలో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కొన్ని కారణాలను కూడా పేర్కొన్నారు. అయితే వారు లేఖ ఇచ్చి వెళ్లిన తర్వాత.. నిమ్మగడ్డ నేరుగా.. వారికి జవాబుగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో.. ప్రభుత్వ అధికారుల కమిటీ వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నింటికీ అయన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు చెప్పిన అభ్యంతరాలన్నీ గతంలో చెప్పినవేనని కాబట్టి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బట్టి… తాను ఎస్‌ఈసీగా ఉండగా ఎన్నికల నిర్వహించడానికి సిద్ధంగా లేనట్లు ఉందని.. తన పదవీ విరమణ తర్వాత నిర్వహించాలనుకుంటోందని.. నిమ్మగడ్డ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు సాక్ష్యంగా అయన వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి విజయనగరంలో చేసిన వ్యాఖ్యలను పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో స్థానికలు ఎన్నికలు జరుగుతాయని విజయసాయిరెడ్డి ప్రకటించైనా సంగతి తెల్సిందే. అయితే.. అయన తన లేఖలో విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక కీలక నేతగా పేర్కొన్నారు. ఆయన చేస్తున్న ప్రకటనలన్నీ… ఆ దిశగానే ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.   ఒకపక్క క‌రోనా వైర‌స్, వ్యాక్సినేష‌న్ కార‌ణంగా ఎన్నిక‌లు సాధ్యంకాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టింది. అయితే అమెరికాలో అన్ని కరోనా కేసులున్నా కూడా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగాయంటూ క‌మిష‌న్ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించింది. దీంతో ఎన్నికల క‌మిష‌న్ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌ల తేదీలు ప్ర‌క‌టించింద‌ని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తూ స‌ర్కార్ న్యాయ‌పోరాటానికి సిద్దమౌతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సినేష‌న్ షెడ్యూల్ ఉండ‌టంతో ప్రస్తుతం ఎన్నిక‌లు స‌రికాదంటూ స‌ర్కార్ హైకోర్టులో హౌజ్ మోష‌న్ పిటిష‌న్ వేయ‌నుంది. అవ‌స‌రం అయితే సుప్రీం త‌లుపుత‌ట్టేందుకు కూడా ఎపి స‌ర్కార్ రెడీగా ఉన్న‌ట్లుగా వార్తలు వస్తున్నాయి.

కొవిడ్‌ టీకా పంపిణీకి సాఫ్ట్‌వేర్‌ తిప్పలు!   ఏజెన్సీల్లో  ఇంటర్ నెట్ సమస్యలు 

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన వెంటనే టీకా పంపిణి చేసేలా రాష్ట్రాలు సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి రెండు సార్లు డ్రై రన్ కూడా నిర్వహించారు. అయితే కోవిడ్ టీకా పంపిణికి కొన్ని సాఫ్ట్ వేర్ సమస్యలు వస్తున్నాయని డ్రై రన్ లో అధికారులు గుర్తించారు. తెలంగాణలో 1200 కేంద్రాల్లో టీకా పంపిణీకి సంబంధించిన డ్రై రన్‌ను నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించినా.. సాఫ్ట్‌వేర్‌ సహకరించని  కారణంగా  917 చోట్ల మాత్రమే నిర్వహించారు. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ సమస్యలతో డ్రైరన్ సాఫీగా జరగలేదు. కొవిన్‌ వెబ్‌ యాప్‌లో లబ్ధిదారుడి పేరు, వయసు, ఫోన్‌ నంబరు, చిరునామాతో పాటు తప్పనిసరిగా పిన్‌కోడ్‌ను కూడా చేర్చాలి. పిన్‌కోడ్‌  లేకపోతే కొవిన్‌ వెబ్‌ యాప్‌లో లబ్ధిదారుడి సమాచారం చేరదు. ఒక పిన్‌కోడ్‌ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో రెండు, మూజు  కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు.. లబ్ధిదారుడికి సమీప కేంద్రంలో కాకుండా మరో కేంద్రంలోకి టీకా పంపిణీ ప్రదేశాన్ని సాఫ్ట్‌వేర్‌ కేటాయిస్తోంది.   తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోంది. ఒక పిన్‌కోడ్‌ పరిధిలోని ప్రాంతాలు కొన్ని చోట్ల  వేర్వేరు జిల్లాల్లోనూ ఉండటంతో అధికారులకు కూడా ఇబ్బందిగా మారుతోంది. లబ్ధిదారుడు కోరుకున్న టీకా కేంద్రం మారడంతో పాటు కొన్నిసార్లు జిల్లా కూడా మారుతోంది.  ఇక దేశమంతటా ఒకేసారి డ్రై రన్‌ను నిర్వహించడం వల్ల కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ స్లోగా పని చేసిందని డ్రై రన్‌లో గుర్తించారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఏక కాలంలో జరుగుతుంది కాబట్టి ఆ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏజెన్సీతో పాటు మారుమూల ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సరిగా రావడం లేదు. దీంతో  కొవిన్ వెబ్ యాప్  అందుబాటులోకి రాకపోవడంతో అక్కడ టీకా పంపిణి సాధ్యం కావడం లేదు.  ఈ సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని,  డ్రై రన్‌లో గుర్తించిన సమస్యలను   రెండు రోజుల్లో పరిష్కరిస్తామంటున్నారు అధికారులు.  కోవిడ్ వ్యాక్సిన్ పంపిణికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ  అన్ని జిల్లాల వైద్యాధికారులకు తాజాగా మరిన్ని మార్గదర్శకాలు జారీచేసింది.  టీకాల పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసింది. కొవిడ్‌ టీకా ఎంతో సురక్షితమైనదని, అర్హులంతా తప్పక తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. సైడ్‌ ఎఫెక్ట్స్‌ పర్యవేక్షణకు ప్రతి టీకా పంపిణీ కేంద్రంలోను నోడల్‌ అధికారిని నియమించింది. దుష్ఫలితాలు తలెత్తితే సత్వర చికిత్సకు 14 రకాల మందులు, వస్తువులతో కూడిన కిట్‌ను అందుబాటులో ఉంచనుంది.  సాధారణ, కొద్దిగా తీవ్రమైన దుష్ఫలితాలకు అక్కడికక్కడే చికిత్స అందించేలా వైద్యులు, నర్సులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. పరిస్థితి విషమిస్తున్నట్లు భావిస్తే.. వెంటనే సమీపంలోని పెద్దాసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచనున్నారు.  ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి అనుసంధానంగా ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సర్కారు ఎంపిక చేసింది.   ఒక్కొక్కరికి ఒక డోసులో 0.5 మి.లీ. వంతున కొవిడ్‌ టీకాను అందజేయనున్నారు. ప్రతి లబ్ధిదారుడికి ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇస్తారు. అంటే మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాలకు అదే టీకాను అంతే డోసులో రెండోసారీ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.  కొవిడ్‌ టీకాను ఇంజక్షన్‌ ద్వారా అందజేస్తారు. ముందుగా వైద్యసిబ్బందికి 2 వారాల పాటు, తర్వాత పోలీసు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో, అత్యంత శుభ్రమైన, సురక్షితమైన ప్రదేశాల్లోనే భద్రపర్చాలని, ఎండలో ఉంచనేవద్దని  వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.  

ఏపీ సీఎం జగన్ కు ఈడీ కోర్టు సమన్లు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది.  ఇటీవల  అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. దీంతో అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సీఎం జగన్‌తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.