ఈనెల 11న కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం! పాలనలో కీలక నిర్ణయాలకు అవకాశం
ఎన్నికల్లో వరుసగా వస్తున్న వ్యతిరేక ఫలితాలతో పాలనలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ నెల 11న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారని సీఎంవో తెలిపింది. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యా, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంది. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్ బీ లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చించనున్నారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారని సీఎంవో తెలిపింది.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించబోతున్నారు. వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉంది? తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని ముఖ్యమంత్రి అధికారుల నుంచి తెలుసుకుంటారని సీఎంవో తెలిపింది.
రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలు, గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ సమీక్షించబోతున్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపైనా ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారని సీఎంవో తన ప్రకటనలో వెల్లడించింది.
సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయన గురువారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ పర్యవేక్షణలో కేసీఆర్ కు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. అయినా కేసీఆర్ హై లెవల్ మీటింగ్ నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.