జర్నలిస్ట్ కుటుంబానికి రక్షణ! టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులో హైకోర్టు 

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు  టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై జర్నలిస్టు సంతోష్ నాయక్ వేసిన కేసుపై మంగళవారం  హైకోర్టు విచారించింది. తనను చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో జర్నలిస్టు సంతోష్ నాయక్ రిట్ పిటీషన్  దాఖలు చేశారు. పోలీసులు నామ మాత్రంగా కేసు నమోదు చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని  పిటీషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, తమ విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. ఎలాంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో త్వరగా కష్టడీలోకి తీసుకొని విచారణ చేయకపోతే ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రాముఖ్యతను తగ్గించిన వాళ్ళం అవుతామని కోర్టుకు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. అయితే  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని  ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాలని తాము చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో సరైన దర్యాప్తు జరగకపోతే మరోసారి కోర్టుకు పిటిషనర్ రావొచ్చని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్‌కు ప్రాణ హాని ఉందని, దీంతో అతని, అతని కుటుంబం సభ్యులకు  పోలుసులు రక్షణ కల్పించాలి అని హైకోర్టు ఆదేశించింది. తనకు ప్రాణ హానీ ఉందని భావిస్తే డీఎస్పీకి దరఖాస్తు పెట్టుకోవాలని  జర్నలిస్ట్ సంతోష్ నాయక్ కు సూచించింన హైకోర్టు.. పోలీసులు కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

భవిష్యత్తులో కరోనా కంటే పెద్ద గండాలు!  

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతోంది.  ఏడాది క్రితం వెలుగుచూసిన ఈ వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. అన్ని రంగాలను ఈ మహమ్మారి కుదేలు చేసింది. కరోనా దెబ్బకు కొన్ని చిన్న దేశాలు పూర్తి చితికిపోయాయి. కరోనా ఇప్పుడు కొత్త రూపులో మరింత ఆందోళన కల్గిస్తోంది. కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కోవిడ్ వ్యాక్సిన్ కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చినా.. కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే  కరోనా మహమ్మారి అంత పెద్దదేం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రానున్నాయని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ సెల్ చీఫ్ మైకేల్‌ ర్యాన్‌ సూచించారు.  కరోనా చాలా వేగంగా వ్యాపించి అనేక మందిని బలిగొందని ర్యాన్‌ గుర్తుచేశారు. అయితే భవిష్యత్తులో రాబోయే మహమ్మారులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరింత తీవ్రమైన అంటువ్యాధుల్ని ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు.  కరోనా సమయంలో అనేక నూతన ఆవిష్కరణలు, వేగవంతమైన శాస్త్రవిజ్ఞాన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్‌వో సీనియర్‌ సలహాదారు బ్రూస్‌ ఇల్‌వర్డ్‌ గుర్తుచేశారు. భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని అందుకోవడంలో ఇంకా చాలా దూరం ఉన్నామని తెలిపారు. కరోనా రోజురోజుకీ రూపాంతరం చెందుతూ రెండు, మూడో దశలోకి ప్రవేశిస్తోందని గుర్తుచేశారు. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి కూడా ఇంకా మనం పూర్తి సన్నద్ధంగా లేమని తెలిపారు. భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనేందుకు కరోనా మనల్ని సంసిద్ధుల్ని చేసిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానామ్‌ తెలిపారు.  అంటువ్యాధులపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. యూకే, దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు నిర్ధారణ పరీక్షల్ని చేస్తేనే కొత్త రకాల్ని గుర్తించగలమన్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానామ్‌.  

సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం.. పట్టపగలే టీడీపీ నేత హత్య!

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పట్టపగలు ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద అందరు చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, సుబ్బయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్నారు. రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.    టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌ లో ఎమ్మెల్యే పాత్రను బహిర్గతం చేశాడన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చడం కిరాతక చర్య అని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టీడీపీ నేత హత్య సీఎం జగన్ రెడ్డికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని.. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించిందన్నారు.   సుబ్బయ్య హత్యపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సీఎం సొంత జిల్లాలో టీడీపీ నేత హత్య రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందన్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మారణాయుధాలతో పాలిస్తారా? అని నిలదీశారు. చివరకు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో హత్య రాజకీయాలకు తెరదీశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారు టెర్రరిస్టులే!  

న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని కామెంట్ చేశారు సీపీ సజ్జనార్. ఈ వారం రోజులు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  సోమవారం  ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 402 మంది పట్టుపడ్డారని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ మరోసారి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే సంతోషంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. 

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ముగ్గురు.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను కలవాలని ఆదేశించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని వారు వివరించి చెప్పాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన వెంటనే మూడు రోజులలోపు ముగ్గురు అధికారులను ఎన్నికల కమిషన్ వద్దకు పంపాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది.    ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించిన వివరాలను అధికారులు ఎన్నికల కమిషన్ కు వివరించాలని తెలిపింది. అలాగే, ఇంతవేగంగా ఎందుకు ఎన్నికలు జరపాల్సి వస్తోందో.. ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి వివరించాలని సూచించింది. ఈ చర్చలకు వేదికను ఎన్నికల కమిషన్ నిర్ణయించాలని పేర్కొంది. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

అనారోగ్యమా.. వెనుకంజా? రజనీకాంత్ పార్టీకి అసలు ఏమైంది?  

తెలుగు వన్ చెప్పిందే అక్షర సత్యమైంది.  తమిళ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పురుడు పోసుకోకముందే పత్తా లేకుండా పోయింది. తెలుగు వన్ ఊహించినట్లే రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గారు రజనీకాంత్. అనారోగ్య  కారణాలతో  రాజకీయ పార్టీ ఏర్పాటుపై  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించలేనంటూ మూడు పేజీల  లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన భాషా..  అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని అందులో  వివరించారు. రాజకీయ పార్టీపై తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను వేడుకున్నారు రజనీకాంత్. రజనీకాంత్ పార్టీ పెట్టబోరని అతను హాస్పిటల్ లో జాయిన్ కాకముందే కథనం ఇచ్చింది తెలుగు వన్.     రాజకీయ పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ వెనక్కి తగ్గడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి అందరికి అనుమానాలే ఉన్నాయి. సాఫ్ట్ గా ఉండే వ్యక్తిగా పేరున్న  రజనీకాంత్ పార్టీని నడపలేరనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వినిపించింది.  రాజకీయ పార్టీని ఆయన  ముందుకు తీసుకెళ్లలేరని కొందరు ఓపెన్ గానే చెప్పారు. కేవలం బీజేపీ కోసమే అయిష్టంగానే ఆయన పార్టీ పెడుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. రజనీకాంత్ తో ఆరెస్సెస్, బీజేపీ నేతల సమావేశాలు కూడా ఆ వాదనకు బలం చేకూర్చాయి. బీజేపీకి మద్దతుగా రజనీకాంత్ కొన్ని ప్రకటనలు కూడా చేయడంతో.. తమిళనాడులో పుంజుకోలేకపోతున్న కమలం పార్టీ  రజనీకాంత్ ద్వారా కొత్త ఎత్తులు వేస్తుందన్న విమర్శలు వచ్చాయి.  యూపీఏలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే గెలవకుండా, తనకు మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకేకు ప్రయోజనం కలిగేలా చూసేందుకే రజనీకాంత్ ను బీజేపీ తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు పలు వర్గాల నుంచి వచ్చాయి.   తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. 2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు.  రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్. రాజకీయ పార్టీపై మూడేండ్లు నాన్చడం, మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆయన పార్టీ ఉండదనే దాదాపుగా అంతా భావించారు. ఇంతలోనే సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. గత నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.  పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే  సినిమా షూటింగ్ లో ఒక్కసారిగా అనారోగ్యానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. దీంతో రాజకీయ  పార్టీ ప్రకటన వాయిదా వేయడానికే రజనీకాంత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే విమర్శలు  వచ్చాయి.    గతంలోనూ  కొందరు రాజకీయ నేతల కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ మార్పు సందర్భాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి.  ఏపీ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు కన్నా లక్ష్మినారాయణ . తెల్లారితే కన్నా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాల్సి  ఉండగా.. బీజేపీ పెద్దలు ఎంట్రీ అయ్యారు. కన్నాను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతలోనే  వైసీపీలో చేరడానికి అన్ని సిద్దం చేసుకున్న కన్నా లక్ష్మినారాయణ.. అర్ధరాత్రి పూట సడెన్ గా అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.  మరికొన్ని గంటల్లో వైసీపీలో చేరాల్సి ఉన్న  కన్నా.. అది తప్పించుకోవడానికే హాస్పిటల్ లో చేరారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రజనీకాంత్ విషయంలోనూ అచ్చం అలానే జరిగిందనే చర్చ  జరుగుతోంది.  రాజకీయ పార్టీపై రజనీకాంత్  వెనక్కి తగ్గారని  గతంలోనూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది.  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్..  అది తన ప్రకటన కాదంటూనే అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను  పరోక్షంగానే అంగీకరించారు.  తనకు అనారోగ్యం ఉందని గతంలో అంగీకరించిన రజనీకాంత్.. పార్టీ ఏర్పాటుకు మళ్లీ ఎందుకు ముందుకు వచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది. వైద్యులు చెప్పినట్లు చేయకుండా డిసెంబర్ 31న పార్టీ పేరు ప్రకటిస్తానని ఎందుకు చెప్పారన్నది ఎవరికి అర్ధం కావడం లేదు. బీజేపీ కోసం ఏదో చేయాలని తలంచినా... ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇప్పుడు వెనక్కి తగ్గారని కొందరు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గడంతో ఆయన అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు.   

గన్నవరం మళ్లీ గరం.. వల్లభనేని వంశీకి చేదు అనుభవం

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యేను బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వేదిక వద్దకు వెళ్లనీయకుండా ఓ వర్గం అడ్డుకుంది. తమ గ్రామంలోకి రావద్దంటూ, రోడ్డుపై బైఠాయించి.. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో 1400 తెల్ల రేషన్‌ కార్డులు ఉంటే.. 400 మందికి మాత్రమే పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. వేరే గ్రామాల వారికి తమ ఊరిలో పట్టాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేది ఏమీలేక వంశీ వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆ గ్రామంలో వైసీపీలో గ్రూపు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్నవర్గమే ఈ ఆందోళనను ప్రోత్సహించిందని వంశీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో గన్నవరం వైసీపీ నేతల వర్గీయులు తరచూ గొడవలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా.. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలు అక్కడికి చేరుకుని ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు.

పవన్ వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్

జనసేన నేత పవన్ కళ్యాణ్ సోమవారం గుడివాడ పర్యటన సందర్భంగా మంత్రి కొడాలి నాని పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కొడాలి నాని జనసేన అధినేత విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం జరిగిన పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవనే పెద్ద బోడి లింగమంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని అయన వ్యాఖ్యానించారు. పవన్ ఒక పెద్ద బోడిలింగం కాబట్టే అటు గాజువాక, ఇటు భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్‌లను ప్రజలు నమ్మరన్నారు. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమని నాని విమర్శించారు. విజయవాడ నగరంలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో.. పేకాట క్లబ్ లు నిర్వహించిన చరిత్ర చంద్రబాబు, అతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ది అంటూ నాని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అలాగే గుడివాడ లో పేకాట క్లబ్ లను మూయించిన చరిత్ర సీఎం జగన్ ది, తనది అని అయన అన్నారు. అసలు పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమన్నారు. ప్యాకేజీలు తీసుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని నాని హెచ్చరించారు. పవన్ వకీల్ సాబ్ కాదు...షకీలా సాబ్ అని జనాలు అనుకుంటున్నారని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను సినిమాలు మానేయమని ఎవరూ చెప్పలేదు, ఆయన సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా ఒకటే అని నాని పేర్కొన్నారు. గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కల్యాణ్‌లు ఎంతమంది వచ్చినా, దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం సీఎం జగన్ బొచ్చు కూడా పీకలేరంటూ కొడాలి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

అవే ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగేదా.. రోజాకు నారాయణ కౌంటర్ 

నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా తనపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ ఘాటుగా కౌంటరిచ్చారు. విశ్వాసపాత్రమైన కుక్కలే కనుక ఉండి ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యేవారా? అని అయన రోజాను ప్రశ్నించారు. గతంలో చంద్రబాబును వ్యతిరేకించి, వైఎస్ఆర్‌ను సమర్ధించినప్పుడు తన కులం ఏమైనా మారిందా? అని నారాయణ నిలదీశారు. రోజా మాదిరిగా తాను పార్టీలు, కులాలు మార్చలేదని అయన అన్నారు.   అంతకుముందు.. సీపీఐ నేత నారాయణపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేసారు. గొప్ప కమ్యూనిస్ట్ భావాలున్న సీపీఐ కి ఆయన తలవంపులు తెస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఇంట్లో కుక్కలు కట్టేంత స్థలం కూడా పేద ప్రజలకు ఇవ్వటం లేదని నారాయణ అంటున్నారని ఆమె మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు చేయకుండానే సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని అన్నారు. అసలు నారాయణ నగరికి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. సీపీఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికి తెలుసునని.. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ మార్చేశారని రోజా విమర్శించారు.

రాజకీయ పార్టీ పెట్టడం లేదన్న  రజనీకాంత్! క్షమించాలని అభిమానులకు విన్నపం

అనారోగ్యానికి గురైన  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు రజనీ కాంత్. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన అందులో వివరించారు. రాజకీయ పార్టీపై తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు . రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు రజనీకాంత్.   2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు.  రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్.  మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.  పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ లో చేరారు. ఆరోగ్య  పరిస్థితి దృష్ట్యా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రాజకీయ పార్టీ ప్రకటన ఉండబోదని క్లారిటీ ఇచ్చారు రజనీ కాంత్. రాజకీయ పార్టీ ఉండబోదన్న రజనీకాంత్ ప్రకటనతో ఆయన అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

జర భద్రం.. తెలంగాణాలో బయటపడ్డ రెండు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు 

బ్రిట‌న్ లో కొత్తగా వెలుగు చూసిన రూపాంతరం చెందిన క‌రోనా వైర‌స్ కేసులు తాజాగా భారత్ లోనూ న‌మోద‌వుతున్నాయి. బ్రిట‌న్ లో కొత్త స్ట్రెయిన్ మొదలైందని ప్ర‌క‌టించ‌గానే ఆ దేశం నుండి వ‌చ్చే విమానాల‌పై భార‌త్ నిషేధం విధించిన‌ప్ప‌టికీ… కేంద్రం రియాక్ట్ అయ్యే లోపే వైర‌స్ భారత్ లో ఎంట‌ర్ అయిపోయింది. తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్రకటించింది.   దేశ‌వ్యాప్తంగా ఈ కొత్త స్ట్రెయిన్ వైర‌స్ కేసులు 6 న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు వెల్ల‌డించింది. ఇందులో బెంగ‌ళూరులో 3, హైద‌రాబాద్ లో 2, పుణేలో ఒక‌రికి కొత్త స్ట్రెయిన్ వైరస్ సోకినట్లు బులిటెన్ వెల్ల‌డించింది. బ్రిట‌న్ నుండి వ‌చ్చిన మొత్తం 33వేల మందిని ప‌రీక్షించ‌గా 114మందికి వైర‌స్ ఉన్న‌ట్ల నిర్ధార‌ణ అయ్యింద‌ని, అందులో 6గురికి ఈ కొత్త స్ట్రెయిన్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింద‌ని తెలిపింది.   ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ ఉన్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, వైర‌స్ ఉన్న వారిని ప్రత్యేక గ‌దిలో ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. బ్రిటన్ లో గుర్తించిన ఈ కొత్త స్ట్రెయిన్ వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించిన సంగతి తెల్సిందే. ఈ క‌రోనా స్ట్రెయిన్ తో యువ‌త‌, పిల్ల‌ల్లోనూ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతాయని హెచ్చ‌రించింది.   ఇది ఇలా ఉండగా ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తి (49)లో దీనిని గుర్తించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి కూడా పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది. అయితే ఆమెకు సోకింది కొత్త కరోనానా? కాదా? అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. అయితే యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారి నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం ఫలితాల నివేదికను ఆదివారమే సీసీఎంబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అందులోనే వరంగల్‌ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్‌ను నిర్ధారించినట్లు సమాచారం. ఇతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.   మరోపక్క రాష్ట్రంలో బ్రిటన్ నుండి వచ్చి ట్రేస్‌ అయినవారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా, 966 మందికి నెగెటివ్‌ వచ్చింది. 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన 21 మందిలో హైదరాబాద్ ‌వారు నలుగురు, మేడ్చల్‌వారు 9 మంది, జగిత్యాల జిల్లావాసులు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

వైసీపీలో తిరుపతి బైపోల్ భయం! 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి ఉప ఎన్నిక భయం పట్టుకుందా? ప్రభుత్వ వ్యతిరేకత తమ కొంప ముంచబోతోందని గ్రహించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో అధికారంలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతి ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. ఎంపీ చనిపోవడంతో సానుభూతి కూడా ఉంటుంది. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నా తిరుపతి ఉపఎన్నికపై వైసీపీలో భయం కనిపిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సర్కార్ చేయించుకున్న సర్వేలే కారణమని చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికపై ఇప్పటికే  రెండు, మూడు సార్లు సర్వే చేయించారట సీఎం జగన్. అయితే అన్ని సర్వేల్లోనూ టీడీపీకి లీడ్ వచ్చిందట. మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువత,  దళితులు .. చివరకి మందుబాబులు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చాకా సామాన్యులపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, అధికార పార్టీ నేతల స్కాములు తప్ప.. ప్రజలకు జరిగిందేమి లేదనే భావనలో మెజార్టీ ప్రజలు ఉన్నారని సర్వే సంస్థలు స్పష్టం చేశాయంటున్నారు. అందుకే ఉప ఎన్నికపై వైసీపీలో ఆందోళన ఉందని తెలుస్తోంది.  ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఏం చేయాలన్న దానిపై వైసీపీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇందు కోసం తిరుపతి లోక్ సభ పరిధిలో సంక్షేమ పథకాలను మరింతగా అమలు చేయాలని అధికార పార్టీ భావిస్తుందట. అందుకే పేదలందరికి ఇండ్ల పథకాన్ని తిరుపతి లోక్ సభ పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ప్రారంభించారని చెబుతున్నారు. డిసెంబర్ 25న ఇండ్ల పట్టాల పంపిణి ప్రారంభించింది ప్రభుత్వం. అయితే రెండు రోజుల్లోనే వెంటనే ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు తిరుపతినే వేదికగా మార్చుకుంది. ఉప ఎన్నిక కోసమే తిరుపతి నియోజకవర్గంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారని వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉన్నందునే ఇక్కడే ఈ కార్యక్రమం పెట్టారని చెబుతున్నారు. ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించడమే కాదు.. తిరుపతి లోక్ సభ పరిధిలో వెంటనే నిర్మాణ పనులు చేపట్టేలా జగన్ సర్కార్ చర్యలు చేపడుతుందని చెబుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల భూ పట్టాల పంపిణి లక్ష్యంగా పెట్టుకుంది జగన్ ప్రభుత్వం. అంటే ఒక్కో లోక్ సభ పరిధిలో లక్ష 35 వేల వరకు వస్తాయి. కాని ఉప ఎన్నిక ఉన్న తిరుపతి పార్లమెంట్ పరిధిలో మాత్రం రెండున్నర లక్షలకు పైగా పట్టాలు ఇవ్వనున్నారట. ఇండ్ల నిర్మాణం కూడా తిరుపతి పరిధిలోనే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని లక్ష్యంగా పెట్టుకోగా... అందులో తిరుపతి ఎంపీ పరిధిలోని లక్షకు పైగా ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు వేశారట. ఇంతే  కాదు తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల్లో వేగం పెంచాలని నిర్ణయించారట. అంటే పెండింగులో ఉన్న రేషన్ కార్డులను వెంటనే ఇవ్వడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం.. అమ్మ ఒడిలో కొత్త వారిని చేర్చడం.. ఇలా సంక్షేమ పథకాలను ఈ నియోజకవర్గం పరిధిలో మరింత మందికి ఇచ్చేలా స్థానిక వైసీపీ నేతలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట.  తిరుపతి ఉప ఎన్నికకు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. గతంలో పోటీ చేసిన పనబాక లక్ష్మినే బరిలోకి దింపి ప్రచారం కూడా చేసేస్తోంది. జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ బాగా పుంజుకోవడంతో అభ్యర్థి ఎంపికపై వైసీపీ తీవ్ర తర్జనభర్జనలు పడుతుందని చెబుతున్నారు. మొదట దివంగత ఎంపీ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తి ఖరారయ్యారని చెప్పారు. కాని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మొదట తిరుపతి తమకు ఈజీగానే ఉంటుందని భావించిన వైసీపీ.. సర్వే ఫలితాలతో బెంబెలెత్తి అభ్యర్థి ఎంపికకై ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. జిల్లా ఇంచార్జ్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి... తిరుపతి లోక్ సభ పరిధిలోని పార్టీ నేతలతో మూడు, నాలుగు సార్లు చర్చలు జరిపినా.. క్యాండిడేట్ పై క్లారిటీ రాలేదంటే... వైసీపీకి ఎంతగా భయపడుతుందో అర్ధం చేసుకోవచ్చు.      తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1984, 1998 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చింతా మోహన్ ఎంపీగా గెలిచారు. 2014, 2019లో వైసీపీ విజయం సాధించింది. 1999లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నందిపాకు వెంకట స్వామి తిరుపతి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.  2019 ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద రావు  2 లక్షల 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో  విజయం సాధించారు. ఇక్కడ అనూహ్యంగా నోటా మూడో స్థానంలో నిలిచింది.  కాంగ్రెస్ నాలుగు,  బీఎస్పీ ఐదో స్థానం దక్కించుకోగా.. కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే సాధించి  బీజేపీ  ఆరో స్థానానికి పడిపోయింది.  టీడీపీ కంటే వైసీపీకి దాదాపు 17 శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి.

ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు! సీఎం, డీజీపీలకు చంద్రబాబు లేఖ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తాడిపత్రిలో పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ ఘటన ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు భయానక పరిస్థితులు నెలకొల్పారని చంద్రబాబు నాయుడు  ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. తాడిపత్రిలాంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా జరగకుండా చూడాలని ఆయన కోరారు. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేల్కొనాలని చంద్రబాబు నాయుడు అన్నారు.  జేసీ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వాటిల్లినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో జేసీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా నిందితులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.  

రెచ్చిపోయిన వైసీపీ నేత.. 6 నెలలుగా కరెంటు బిల్లు కట్టకపోగా.. లైన్‌మ్యాన్‌పై దాడి!

ఆరునెలలుగా కరెంటు బిల్లు కట్టలేదు.. బిల్లు కట్టమన్న అధికారులను అధికార పార్టీ అంటూ బెదిరించాడు.. ఆరు నెలలు ఓపిక పట్టిన అధికారులు.. ఇక చేసేది లేక కరెంట్ ఫ్యూజ్ తొలగించారు. ఇంకేం సదరు అధికార పార్టీ నేత రెచ్చిపోయాడు. లైన్ మైన్ తన ఇంటికి పిలిపించి దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు.. అంతేకాదు లైన్ మెన్ కేసు పెట్టినా తీసుకోవద్దంటూ పోలీసులకు కూడా హుకుం జారీ చేశాడు.. దీంతో పోలీసులు లైన్ మెన్ పై జరిగిన దాడి లైట్ తీసుకున్నారు... ఇదీ జరిగింది రౌడీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచో  బీహార్ లో కాదు.. అరాచకాల్లో బీహార్ ను దాటేస్తున్న.. జగన్ రెడ్డి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో..   గుంటూరు శివారులోని నల్లపాడుకు చెందిన వైసీపీ నేత గాదె నాగిరెడ్డి ఆరు నెలలుగా తన ఇంటి కరెంటు బిల్లు కట్టడంలేదు. ఎవరైనా అడిగితే అధికార పార్టీ పేరు చెప్పి బెదిరిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ఆ ఏరియా లైన్‌మ్యాన్‌ పట్నాయక్‌.. నాగిరెడ్డి ఇంటికి వెళ్లి ఆరు నెలలుగా బిల్లు కట్టనందున ‘డీ-లిస్టు’లో పేరు వచ్చిందంటూ ఫ్యూజు తొలగించారు. ఆ సమయంలో నాగిరెడ్డి ఇంట్లో లేరు. ఆ తర్వాత కాసేపటికి పట్నాయక్‌ కు ఫోన్ చేసిన నాగిరెడ్డి.. 'బిల్లు చెల్లించాం. వస్తే రశీదు చూపిస్తాం. ఫ్యూజు మళ్లీ పెట్టి వెళ్లు' అంటూ నమ్మబలికారు. దీంతో పట్నాయక్‌ తోటి సిబ్బందితో కలిసి నాగిరెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే, పట్నాయక్‌ వచ్చీ రాగానే ‘నా ఇంటికే కరెంట్‌ కనెక్షన్‌ పీకేస్తావా.. ఎంత ధైర్యంరా’ అంటూ నాగిరెడ్డి మరో వ్యక్తితో కలిసి ఆయనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దాడిని అడ్డుకునేందుకు తోటి సిబ్బంది ప్రయత్నించినా వారు ఆగలేదు. దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయిన పట్నాయక్‌ ను తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.   తమ లైన్‌మ్యాన్‌ పై దాడి జరిగిందని ఏఈ కిరణ్‌ కుమార్‌ అదేరోజు ఫిర్యాదు చేసినా.. పోలీసులు దానిని స్వీకరించలేదు. అంతేకాదు, కొందరు వైసీపీ నేతలు ఏఈకి ఫోన్‌ చేసి‌ కేసు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించినట్లు సమాచారం. చివరికి విద్యుత్‌ అధికారులు, యూనియన్‌ ఒత్తిడితో ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే, ఇంత జరిగినా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం. కాగా, సోమవారం డి-లిస్టులో ఉన్న బకాయిదారుల విద్యుత్‌ కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ఆ ప్రాంతంలోని విద్యుత్‌ సిబ్బంది బహిష్కరించి, నిరసన వ్యక్తం చేయడంతో ఈ దాడి విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాయక్‌ పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్‌ చేస్తేనే తాము విధులకు హాజరవుతామని విద్యుత్‌ సిబ్బంది తేల్చిచెప్పారు. నాగిరెడ్డిపై కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటిదాకా అరెస్టు చేయకపోవడం గమనార్హం. కొందరు నేతల ఒత్తిళ్ల కారణంగానే అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య.. కారణం అదేనా..! 

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ నిన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం ధర్మెగౌడ తన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే తాను ఎక్కడికి వెళ్తున్నదీ ఎవరికీ చెప్పలేదు. అలా వెళ్లిన ఆయన మళ్ళీ తిరిగి రాకపోవడంతో.. ఎమ్మెల్సీ గన్​మెన్, పోలీసులు ఆయన కోసం గాలించారు. అయినా ఎక్కడా అయన జాడ కనిపించలేదు.   అయితే ఈ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సూయిసైడ్ లెటర్ ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ఘటన కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది. ధర్మెగౌడ ఆత్మహత్య విషయం తెలిసి మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.   ఈ నెల 16న శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా తీవ్ర స్థాయిలో రభస జరిగింది. అప్పుడు సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లడం అప్పట్లో దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఆ ఘటనతో ఆయన తీవ్ర మనస్థాపం చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకోవడం తాజాగా కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతోంది.

బీజేపీకి  ప్రత్యామ్నాయంగా  బలమైన కూటమి! తమిళనాడు ఎన్నికలే కీలకం! 

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ బలహీన పడింది. బీజేపీ మాత్రం రోజురోజుకు మరింత బలపడుతోంది. బీజేపీకి ధీటుగా పోరాడే శక్తి కాంగ్రెస్ కు లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా  బలమైన కూటమి కోసం  ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.  కొత్త కూటమి అయితే సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడున్న  యూపీఏనే బలోపేతం చేసే యోచనలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వేదిక కాబోతున్నాయని సమాచారం.            తమిళనాడులో మేలో  కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. అంటే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఇప్పటికే తమిళనాడులో రాజకీయాలు  వేడెక్కాయి. తమిళనాడులో పాగా కోసం బీజేపీ శ్రమిస్తున్నా.. వారికి ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదు. రజనీకాంత్ పార్టీ పెడితే... బీజేపీతో కలిసి పోటీ చేయవచ్చని భావించారు. కాని హైదరాబాద్ లో  అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన రజనీకాంత్.. హాస్పిటల్ నుంచి డాశ్చార్జ్ అయినా ... ఆయన ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతిలో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో డిసెంబర్ 31న చేస్తానన్న రజనీకాంత్ రాజకీయ ప్రకటన లేనట్టేనని తెలుస్తోంది.  ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కేంద్ర సర్కార్ తో సఖ్యతగానే ఉన్నా... తమిళనాడుకు వచ్చే సరికి మాత్రం ఆ పార్టీతో అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో బీజేపీతో కలిసి సర్కార్ పంచుకునే అవకాశం లేదని అన్నాడీంకే స్పష్టం చేసింది. డీఎంకే ఎలాగూ బీజేపీకి బద్ద వ్యతిరేకమే.     జనవరి తొలి వారంలోనే చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదల కాబోతోంది. శశికళ ఎంట్రీ తర్వాత తమిళ పాలిటిక్స్ మరింత రంజుగా మారిపోనున్నాయి.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017లో శశికళను దోషిగా తేల్చిన కోర్టు నాలుగేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. అప్పటి నుంచి ఆమె బెంగళూరులోని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. జనవరిలో జైలు నుంచి రానున్న శశికళ.. రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఆమె అనుచరులు పార్టీ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారంటున్నారు. శశికళ పార్టీ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. తాను జైలుకు వెళ్లడానికి బీజేపీనే కారణమనే భావనలో శశికళ ఉన్నారని ఆమె అనుచరుల వాదన.  తమిళనాడులో ఏ విధంగా చూసినా బీజేపీకి కలిసి వచ్చే పార్టీలు కనిపించడం లేదు.అవసరమైతే బీజేపీని ఎదుర్కొనేందుకు.. అన్నాడీఎంకే మినహా మిగితా పార్టీలు ఏకమయ్యే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   తమిళనాడు రాజకీయ పరిణామాల తరహాలోనే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి బలమైన శక్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూపీఏ కూటమికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను చీఫ్ గా నియమించి.. ఆ దిశగా అడుగులు వేయవచ్చని చెబుతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని, ప్రాంతీయ పార్టీలతో ఆమె సమావేశం జరిపింది కూడా ఇందు కోసమేనని చెబుతున్నారు. రైతు సమస్యలపై మాట్లాడుకున్నామని మమత చెబుతున్నా అంతర్గతంగా జరిగింది మాత్రం దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి బలోపేతం పైనేనని పక్కాగా తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి శివసేన కూడా అంగీకరిస్తోంది. ఆ పార్టీ పత్రిక సామ్నాలో శరద్ పవార్ ను ప్రశంసిస్తూ సంపాదకీయం వచ్చింది. పవార్ ఆ పదవిని స్వీకరిస్తానంటే తమకే అభ్యంతరం లేదని.. పవార్ ఆ పదవికి అన్ని విధాలా అర్హులని మిత్రపక్షం శివసేన అందులో  స్పష్టం చేసింది.    మొత్తంగా పశ్చిమ బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, బెంగాల్ లో టీఎంసీ విజయం సాధిస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా  బలమైన కూటమి ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టేనని  చెబుతున్నారు. మమత, స్టాలిన్, శివసేనల డైరెక్షన్ లోనే శరద్ పవార్ నేతృత్వంలో బలమైన కూటమి రావచ్చంటున్నారు. ఈ విషయాన్ని ముందే గ్రహించడం వల్లే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ.. తమ చేతుల్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తోందని, అందుకే కేసీఆర్, జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు సాగించిందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత గతంలో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని రాజకీయ అనలిస్టులు ఉదాహరణగా చూపుతున్నారు.

మీరు ఎక్కడంటే అక్కడికి వస్తాం.. అసెంబ్లీని ముట్టడిస్తాం.. జగన్ సర్కార్ కు పవన్ సవాల్  

ఏపీలో కొద్ది రోజుల క్రితం వచ్చిన నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు 35 వేల రూపాయలు పరిహారం ఇవ్వకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను తమ పార్టీ అడ్డుకుంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏపీ సర్కార్ ను హెచ్చరించారు. మీరు కనుక రైతులను ఆదుకోకపోతే అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తామని అయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈరోజు గుడివాడలో పర్యటన చేస్తున్న పవన్.. రైతుల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. భూమి హక్కు లేక కౌలు రైతులు నష్టపోతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. "కౌలు రైతులు బాధలు పడుతుంటే వాలంటీర్లు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే.. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వొచ్చు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినా వస్తాం. మీరు సై అంటే మేమూ సై.. అమరావతిలో పెట్టుకుంటారా, వైజాగ్‌లో పెట్టుకుంటారా, పులివెందులలో పెట్టుకుంటారా? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వచ్చి.. అసెంబ్లీని ముట్టడిస్తాం. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడో లేడో తెలియని జనసేనను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారు. మాట్లాడితే చాలు సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నా అంటున్నారు. సీఎం జగన్‌కు మాత్రం ఏ వ్యాపారాలు లేవా? అయన కేవలం రాజకీయాలు చేస్తున్నారా? సీఎం సాబ్‌కు చెబుతా ఉన్నాం. పదివేల రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు 35వేల రూపాయలు విడుదల చేయకపోతే... రైతులు, నిరుద్యోగులు అందరూ కదలిరండి. మంచి మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. మేము అయ్యా, బాబు, సీఎం గారు అంటే ఏమాత్రం వినడం లేదు. రైతుల కోసం జనసేన పార్టీ ఉంది" అని పవన్ ఇటు సీఎం అటు వైసీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

వర్మ డైరెక్షన్ లో 'అల వైయస్ అవినీతిపురములో'! జగన్ పాత్ర పోషిస్తానన్న టీడీపీ నేత 

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కామన్.. కానీ రాజకీయ నాయకుడు సినీ నటుడు అవ్వాలనుకోవడం వెరైటీ. అందులోనూ ఒక నాయకుడు తమ ప్రత్యర్థి పార్టీ నాయకుడి పాత్రలో నటించాలనుకోవడం డబుల్ వెరైటీ. తాజాగా ఓ టీడీపీ నేత అలాంటి కోరికనే బయటపెట్టారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రలో నటించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు, ఆయన స్టొరీ లైన్ ఇచ్చారు, డైరెక్టర్ ని కూడా ఎంపిక చేశారు. అలాగే, ఈ సినిమాకి అదిరిపోయే టైటిల్ ని కూడా పెట్టారు. ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన సూపర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురములో' స్ఫూర్తితో ఆ సినిమాకి 'అల వైయస్ అవినీతిపురములో' అని పేరు పెట్టారు.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. ఇళ్ల పట్టాల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని చెప్పారు. సీఎం జగన్ పేదల పేరు చెప్పి 7 వేల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల్లో జరిగిన అవినీతిపై బొత్స చర్చకు రావాలన్నారు. తన ఆరోపణలు అవాస్తం అని తేలితే... రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బండారు సవాల్ విసిరారు. 31 లక్షల పట్టాలు ఇస్తామని వైసీపీ నేతలు అంటుంటే.. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్‌లో 60 గదులు ఉంటే.. ఒక సెంటు‌లో పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని టీడీపీ నేత  ప్రశ్నించారు.     ఇళ్ల పట్టాల పంపిణి విషయంలోనే  వివాదాస్పద, సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బండారు సత్యనారాయణ మూర్తి  ఒక కోరిక కోరారు. ఇళ్ల స్థలాల అంశం ఆధారంగా వర్మ ఒక సినిమాను తీయాలన్నారు. ఆ సినిమాలో జగన్ పాత్రను తానే పోషిస్తానని చెప్పారు బండారు. ఆ చిత్రానికి 'అల వైయస్ అవినీతిపురములో' అని టైటిల్ పెట్టాలని సూచించారు. జగన్ అవినీతి మొత్తం తనకు తెలుసన్న బండారు..  తాను కూడా మంచి నటుడినే అని... అందుకే జగన్ పాత్రను తానే పోషించాలనుకుంటున్నానని చెప్పారు. వర్మ తనకు అవకాశాన్ని ఇస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు బండారు సత్యనారాయణ మూర్తి.     టీడీపీ ప్రభుత్వంలో  నిర్మించిన ఇళ్లను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని చెప్పారు బండారు.  చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని ఇళ్లు ఇచ్చామో.. అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జగన్ రెడ్డి సర్కార్  ఇళ్ల దోపిడీని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆపాలన్నారు. జగన్ ఒక మూర్ఖుడు, అహంకారి  అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండారు సత్యనారాయణ మూర్తి.  ఇళ్ల పట్టాల్లో జరుగుతున్న అనినీతిని దారి మళ్లించడానికే వైసీపీ నేతలు సవాళ్ల పేరిట డ్రామాలు ఆడుతున్నారని బండారు సత్యనారాయణమూర్తి  మండిపడ్డారు.

బండిపై కులం పేరు ఉంటే సీజ్! 

కుల రక్కసికి చెక్ పెట్టేందుకు ఉత్తర్ ప్రదేశ్ రవాణా శాఖ  వినూత్న నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కులం  తెలిపే స్టిక్కర్లు ఉంటే ఆ  వాహనాలను సీజ్ చేస్తోంది. కొందరు తమ వాహనాలపై తమ కులాన్ని ప్రతిబింబించే స్టిక్కర్లు వేసుకుంటున్నారు. యూపీలో అయితే వాహనాల నెంబర్ ప్లేట్లు, అద్దాలు, బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఈ స్టిక్కర్లు ఎక్కువగా కనబడుతుంటాయి. యాదవ్, జాట్, గుజ్జర్, బ్రాహ్మణ్, పండిట్, క్షత్రియ, లోధి, మౌర్య వంటి సామాజిక వర్గాల స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోతుండటాన్ని మహారాష్ట్రకు చెందిన హర్షల్ ప్రభు అనే టీచర్ గమనించాడు. ఇలా తమ సామాజిక వర్గాన్ని బహిరంగంగా ప్రదర్శించడం సరికాదని, ఇది సమాజంలో విభజనను తీసుకొస్తుందని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు లెటర్ రాశాడు.  హర్షల్ ప్రభు లేఖపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం యూపీ రవాణా శాఖకు పలు నిబంధనలు రూపొందించి పంపించింది. ఇలాంటి వెహికల్స్ ట్రాక్ చేయడం కోసం ఓ డ్రైవ్ నిర్వహించాలని సూచించింది.  పీఎంఓ సూచనల మేరకు యూపీ రవాణాశాఖ   స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. స్టిక్కర్ల ద్వారా కులాన్ని ప్రదర్శించే వాహనాలను సీజ్ చేస్తోంది. తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ తనిఖీలో ప్రతి 20 వాహనాల్లో ఒకదానిపై స్టిక్కర్ ఉంటోందని, వెహికల్స్‌పై కులం తెలిపే స్టిక్కర్లు అంటించొద్దని కాన్పూర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డీకే త్రిపాఠి తెలిపారు.