సోము భజన.. సంజయ్ గర్జన! ఏపీ బీజేపీ పరువు గోవిందా! 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల పరువు తీస్తూ నాయకుడంటే ఎలా ఉండాలో చూపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికార పార్టీకి తొత్తులుగా కాదు.. సర్కార్ వైఫల్యాలు, అరాచకాలపై ఉద్యమించాలనే సంకేతమిచ్చారు. ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా.. పోరాటం చేయలేని ఏపీ బీజేపీ నేతల దుస్థితిని పరోక్షంగా ఎండగడుతూ.. ఎలా ముందుకు వెళ్లాలో చూపించారు బండి సంజయ్. జగన్  ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.  దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు సంజయ్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినైన తాను... ఏపీలో జరుగుతున్న దారుణాలపై బాధతోనే మాట్లాడుతున్నానంటూ.. ఏపీ బీజేపీ నేతల చేతగాని తనాన్ని చెప్పకనే చెప్పారు బండి సంజయ్.   హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు సంజయ్. రెండు కొండలవాడా గోవిందా గోవిందా అనే వైసీపీకి ఓటు వేస్తారా? లేక ఏడు కొండలవాడా గోవిందా గోవిందా అనే బీజేపీకి ఓటువేస్తారా? అనే విషయాన్ని ఏపీలోని హిందువులందరూ ఆలోచించాలని అన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకున్న పార్టీ ఇప్పుడు ఏపీలో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని... అధికార పార్టీకి బుద్ధి చెపుతారని అన్నారు. ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు బండి సంజయ్.  తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ బీజేపీ కార్యకర్తలు బలవంతులని, దమ్మున్నవారని చెబుతూ.. జగన్ సర్కార్ ఉద్యమించడానికి ఓ రకంగా వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు  బండి సంజయ్.  ఆంధ్రప్రదేశ్ లో  జగన్ రెడ్డి పాలన వచ్చాకా  హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే 150కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయమయ్యాయి. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం రామతీర్థం  కోదండరామాలయంలోని రాముడి విగ్రహాన్ని రెండు ముక్కలు చేశారు దుండగులు.  ఆలయాలపై దాడులు జరుగుతున్నా హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించ లేదు. ఎక్కడో పాకిస్థాన్ లోని హిందూ దేవాలయంపై దాడి జరిగితే ఆవేశంగా స్పందించే ఏపీ బీజేపీ నేతలు.. సొంత రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతున్నా తమ జగన్ భక్తినే చాటుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండే ఉండేందుకన్నట్లు.. ఆలయాలపై దాడులను ఖండిస్తున్నట్లు పేపర్ స్టేట్ మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.      రామతీర్థంలో రాములోరి తల నరికినా.. నిత్యం  జై శ్రీరామ్ నినాదాలు చేసే ఏపీ కమలనాధులు ఏపీ సర్కార్ ను గట్టిగా నిలదీయలేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనతో మేల్కొని కొంత హడావుడి చేశారు. అక్కడ కూడా తమ రాజకీయ కుట్రను బయటపెట్టుకున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయకుండా  అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పటిలానే చంద్రబాబుపై పడ్డారు. రామతీర్థం ఘటనపై మాట్లాడకుండా.. టీడీపీలో హయాంలో కూల్చేసిన గుడుల గురించి ప్రస్తావించి తన జగన్ భక్తి చాటుకున్నారు. కేంద్రం నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న గుడులను తొలగించారని తెలిసినా.. అవే పసలేని ఆరోపణలు చేశారు విష్ణువర్దన్ రెడ్డి. జగన్ సర్కార్ కు ఇబ్బంది కాకుండా, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ కేడర్ నుంచే వస్తున్నాయంటే ఏపీ బీజేపీ నేతల తీరు ఎలా ఉందో ఊహించవచ్చు.  ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మన నేతలు చేయలేని పనిని తెలంగాణ అధ్యక్షుడు చేశారని కమలం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే సంజయ్ లాగా దూకుడుగా ఉండాలి .. కాని అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తే సాధ్యం కాదని చెబుతున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతల వల్లే ఏపీలో బీజేపీ నాశనం అవుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి భజన వీడి వైసీపీ కోసం కాకుండా పార్టీ కోసం బండి సంజయ్ లాగా పని చేస్తేనే ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి జగన్ రెడ్డి సర్కార్ పై బండి సంజయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా మారాయి. ఏపీ బీజేపీ కార్యకర్తలంతా బండికి ఫిదా అయిపోయారని తెలుస్తోంది. అదే సమయంలో సంజయ్ వ్యాఖ్యలతో తమ చేతకానితనం బయటపడిందని సోము వీర్రాజు టీమ్ వర్రీ అవుతోందని తెలుస్తోంది. 

'జాక్ మా' కనబడుటలేదు.. ఏమైపోయాడు?

చైనా కుబేరుడు, అలీ బాబా సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ మా గత రెండు నెలలుగా కనిపించడంలేదు. ఆయన ఆస్తుల విలువ కూడా పడిపోయింది. కొన్ని నెలల కిందట 61 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద ఇప్పుడు 50 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనంతటికీ ఆయన మాట్లాడిన ఒక్క మాటే కారణం. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్నే మార్చేసింది.    గత అక్టోబరులో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలు, బ్యాంక్ రెగ్యులేటరీలపై జాక్ మా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని, విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవర్చుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో జాక్‌ మాపై ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది. ఆయన సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా వేసింది. వ్యాపారాలపై విచారణకు ఆదేశించింది. జాక్ మా ఎదిగేందుకు ఉపకరించే చర్యలను అడ్డుకుంది.    చైనా ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో జాక్ మాకు గడ్డుకాలం మొదలైంది. ఆయన ఆస్తులు హరించుకుపోతున్నాయి. రెండు నెలల్లోనే 11 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంతేకాదు, రెండు నెలలుగా ఆసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడంలేదు. నిజానికి జాక్ మా స్వయంగా నిర్వహించే 'ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్' అనే టాలెంట్ షోలో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన ఆ షోకు కూడా రాలేదు. ఆయన తరపున ఆలీబాబా ఎగ్జిక్యూటివ్ ఒకరు పాల్గొన్నారు. జాక్ మా షెడ్యూల్ బిజీగా ఉన్నందునే రాలేకపోయారంటూ ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కానీ దీనిపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. జాక్ మా అదృశ్యం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నా అనుచరులు పేకాటలో ఉంటే ఏంటీ? గడ్డం గ్యాంగ్ పై కొడాలి రియాక్షన్ 

మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో పేకాట రాయుళ్ల అరెస్ట్ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి అండదండలతోనే గుడివాడలో పేకాట క్లబ్లులు నడుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే గుడివాడ గడ్డం గ్యాంగ్ అరెస్ట్ పై స్పందించిన మంత్రి కొడాలి నాని..  అదో చిన్న విషయంగా  చిత్రీకరించే ప్రయత్నం చేయడం మరింత వివాదమవుతోంది. గుడివాడ ఘటనపై మాట్లాడిన కొడాలి నాని.. పేకాట ఆడిన వారిలో తన  అనుచరులు  ఉంటే ఏమవుతుందని ఎదురు ప్రశ్నించారు. పేకాట ఆడుతూ దొరికిపోయిన వాళ్లలో తన అనుచరులు ఉన్నా, తన తమ్ముడే ఉన్నా ఇబ్బందేమీలేదని, వాళ్లకేమైనా ఉరిశిక్ష వేస్తారా? అంటూ లైట్ తీసుకున్నారు. పట్టుకుంటే జరిమానా కట్టించుకుని వదిలేస్తుంటారు కాబట్టే హద్దు అదుపు లేకుండా పేకాట ఆడుకుంటుంటారని మంత్రి కొడాలి  వివరించారు. తన ఇలాకాలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, తానే వాటి వెనకుండి నడిపిస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తానే పేకాట క్లబ్బులు నడిపిస్తున్నట్టయితే పోలీసులు దాడులు చేయగలరా? అని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా పేకాట ఆడేవాళ్లకు పార్టీలు ఉంటాయా ? అని అన్నారు.  గుడివాడలో పేకాట క్లబ్బులపై మీడియాలో వచ్చిన కథనాలతో మంత్రి కొడాలి నాని ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. దీంతో అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ ను కలిశారు.  సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపో.. లేక ఈ మొత్తం ఘటన పై వివరణ ఇచ్చుకునేందుకు ఆయనే వెళ్లారో తెలియలేదు కానీ  హఠాత్తుగా మంత్రి నాని సీఎం ఇంటికి వెళ్ళడం మాత్రం  పెద్ద చర్చకు దారి తీసింది. అయితే పేకాట రాయుళ్ల కోసం తాను సీఎం జగన్ వద్దకు పరిగెత్తుకు రావాల్సిన అవసరంలేదని చెప్పారు కొడాలి నాని.  తాను సీఎం వద్దకు వచ్చానంటే అది పాలనకు సంబంధించిన విషయాల కోసమేనని తెలిపారు. గుడివాడ నుంచి కంకిపాడు వెళ్లే రోడ్డు, వయా మానికొండ మీదుగా వెళ్లే రోడ్డుకు సంబంధించిన పనులను ఎన్డీబీ రెండో ఫేజ్ లో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి సీఎంను కలిశానని వివరణ ఇచ్చారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన గుడివాడ ప్రజల కోసం తాను సీఎ జగన్ ను కలిశానే తప్ప పేకాటరాయుళ్ల కోసం రావాల్సిన అగత్యం తనకు పట్టలేదని అన్నారు. అలాంటి చిల్లర పనులు చేసేది చంద్రబాబు, దేవినేని ఉమ అని విమర్శించారు.   మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేకాట ఆడుతూ తన అనుచరులు అడ్డంగా దొరికినా మంత్రి ఇంకా బుకాయిస్తున్నారని మండిపడుతున్నాయి. పేకాట ఆడితే తప్పేంటని మాట్లాడుతున్న కొడాలి.. గడ్డం గ్యాంగ్ కు సపోర్ట్ చేస్తున్నారా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేకాడుతూ దొరికిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరడం పోయి..  దొరికితే  ఏమవుతుంది.. వాళ్లకేమైనా ఉరి శిక్ష వేస్తారా అంటూ మంత్రి మాట్లాడటం దారుణమంటున్నారు జనాలు. అక్రమంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న కొడాలి నానిని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం లేనిది గుడివాడ నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పడానికి మంత్రి గారికి ఇప్పుడే కనిపించినట్లున్నాయని తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. 

మూషికం మనసు గెలిచిన విజయవాడ పోలీసులు!!

కరోనా మహమ్మారి మూలంగా గత కొద్దినెలలుగా ప్రజలు పండుగలు సరిగా జరుపుకోలేకపోయారు. వాటిలో వినాయక చవితి కూడా ఒకటి. ప్రతి ఏడాది ఘనంగా వినాయకుడిని పూజించి నిమజ్జనం చేసే భక్తులు ఈసారి మాత్రం మొక్కుబడిగా పూజలు చేశారు. నైవేద్యంగా పెట్టే ఉండ్రాళ్ళు కూడా బాగా తగ్గించారు. దీంతో బొజ్జ గణపయ్యకు కోపమొచ్చింది. వెంటనే తన వాహనమైన మూషికాన్ని పిలిచి.. "మూషికా.. నరులు ఈ ఏడాది నాకు ఉండ్రాళ్ళు తక్కువ చేసి.. నా కడుపులో నిన్ను పరుగెత్తేలా చేశారు. వెంటనే నువ్వు భూలోకానికి వెళ్లి నేను అలిగానని వాళ్ళకి అర్థమయ్యేలా అలజడి సృష్టించు" అని గణపయ్య ఆజ్ఞాపించారు.    గణపయ్య ఆజ్ఞతో భూలోకానికి వచ్చిన మూషికం తిరిగి తిరిగి అలసిపోయి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చేరుకుంది. అలజడి సృష్టించడానికి ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకుంది. నగరంలోని పండిట్ నెహ్రు బస్ స్టేషన్‌ ఆవరణలో ఉన్న రామ మందిరంలో మూషికం స్థావరం ఏర్పరుచుకుంది. అక్కడ సీతారాముల మట్టి విగ్రహాలుంటే వాటి నీడలో ఉంటూ తాను వచ్చిన పనిని మర్చిపోయి పూజారులు, భక్తులు పెట్టిన నైవేద్యం తింటూ బాహుబలిలా బలంగా తయారైంది. అలా కొద్దిరోజులు గడిచాక గణపతి ఆజ్ఞ గుర్తుకొచ్చి, తాను భూలోకానికి వచ్చిన పనిని మరిచానని గ్రహించి.. వెంటనే అక్కడి నుండి బయటకు రాబోతుండగా.. బాహుబలిలా బలంగా తయారైన మూషికం తాకిడికి సీతమ్మ విగ్రహం కిందపడిపోయింది. 'అయ్యయ్యో ఎంత అపచారం జరిగింది.. నన్ను క్షమించు అమ్మ' అంటూ మూషికం సీతమ్మకి క్షమాపణ చెప్పి పరుగుపరుగునా వినాయకుడి వద్దకు చేరుకుంది.   భూలోకంలో తాను చేసిన పని వినాయకుడికి తెలిసి ఉంటుందని, తనని మందలిస్తాడని మూషికం అనుకుంది. కానీ తాను చేసిన పని వినాయకుడు కనిపెట్టలేకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కానీ, వినాయకుడు కనిపెట్టలేకపోతేనేం.. విజయవాడ పోలీసులు కనిపెట్టేశారు. ఎలుక తోసేయడం వల్ల సీతమ్మ విగ్రహం కింద పడిపోయి ఉంటుందని కృష్ణలంక సీఐ సత్యానందం, ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రాధమిక అంచనాకు వచ్చేశారు. ఇది మట్టితో తయారుచేసిన విగ్రహమని, ఎలుకల వల్ల కిందపడి ధ్వంసమై ఉంటుందని సీఐ వ్యాఖ్యానించారు. నిందితులను పట్టుకోలేక, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని సీఐపై భక్తులు, ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే వినాయకుని వాహనం మూషికం మాత్రం సీఐని ప్రశంసిస్తోంది. నేను చేసిన పనిని స్వామి గణపయ్యే కనిపెట్టలేకపోయారు.. కానీ సీఐ భలేగా కనిపెట్టారంటూ ఆయనపై మనసులోనే ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

కేసీఆర్ కోసమా.. ఆయనతో విభేదాలా? బీజేపీలోకి రామేశ్వరరావు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయాల్లో  అనూహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో  ఊహించని ట్విస్టులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. అందులో ప్రధానంగా వినిపిస్తోంది ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్నది. రామేశ్వరరావును బీజేపీ రాజ్యసభకు పంపించబోతుందని కూడా చెబుతున్నారు. రామేశ్వరరావు బీజేపీలోకి వెళుతున్నారన్న  ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. కేసీఆర్ టార్గెట్ గానే బీజేపీ జూపల్లిని లాగుతుందని కొందరు చెబుతుండగా.. కేసీఆర్ కోసమే రామేశ్వరరావు కమలం గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ తో కొంత కాలంగా జూపల్లికి విభేదాలు వచ్చాయని , అందుకే ఆయన మరో పార్టీ వైపు చూస్తున్నారన్న వాదన కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.    తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా కేసీఆర్, జూపల్లికి మధ్య గ్యాప్ వచ్చిందనే సంకేతమిస్తున్నాయి. ముఖ్యంగా జూపల్లికి చెందిన మీడియాలో కాంగ్రెస్ పైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లైవ్ షో జరగడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. మీడియాలోకి జూపల్లి ఎంటరయ్యాకా... ఆయనకు సంబంధించిన ఛానెళ్లలో రేవంత్ రెడ్డి వార్తలే రావడం లేదు. సీఎం కేసీఆర్, జూపల్లి రామేశ్వరరావును రేవంత్ రెడ్డి మొదటి నుంచి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. అందుకే అతని వార్తలను జూపల్లి మీడియాలో బ్యాన్ చేశారని భావించారు.  కాని సడెన్ గా సీన్ మారిపోయింది. జూపల్లికి సంబంధించిన  మీడియాలో రేవంత్ రెడ్డి గంటన్నర పాటు కనిపించడంతో చూసినవారంతా .. ఇది నిజమా  కలా  అంటూ విస్తుపోయారు. అది కూడా జూపల్లికి కేసీఆర్ తో ఆయనకు విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతున్న సమయంలోనే జరగడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.  జూపల్లి మీడియాలో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి లైవ్ షో జరగడంతో .. కేసీఆర్, జూపల్లి మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది.              తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలోనూ కారుకు షాకిచ్చింది కమలం పార్టీ. ఇక అధికారం చేజిక్కుంచుకోవడమే లక్ష్యంగా కొత్త ఎత్తులు వేస్తుందని, అందులో భాగంగానే కేసీఆర్ ఆర్థిక మూలాలపై బీజేపీ దెబ్బ కొడుతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు,టీఆర్ఎస్‌కు ఆర్థిక అండ దండలు అందిస్తున్న మై హోమ్ రామేశ్వరరావును బీజేపీలోకి లాగుతున్నారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఆయన సంస్థలపై ఈడీ దాడులు జరగడం కూడా బీజేపీలో వ్యూహంలో భాగమేనంటున్నారు.  కేంద్రంలోని బీజేపీ నేతల నుంచి ఒత్తిడి పెరగడం, ఈడీ దాడులతో రామేశ్వరరావు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.  జూపల్లికి సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ అవినీతికి సంబంధించిన చిట్టా మొత్తం కేంద్రంలో చేతుల్లో ఉందని, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకునేందుకు  కేసీఆరే .. తన సన్నిహితుడు జూపల్లి రామేశ్వరరావును బీజేపీలోకి పంపిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. జూపల్లికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉండటంతో కేసీఆర్ అటు వైపు నుంచి నరుక్కొస్తున్నారని చెబుతున్నారు. కేంద్రంపై యుద్దమే అంటూ ఒంటి కాలిపై లేచిన కేసీఆర్.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. గతంలో వ్యతిరేకించిన కేంద్ర పథకాలకు జై కొట్టారు. దీంతో  బీజేపీ పెద్దలను గులాబీ బాస్ శరణు వేడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి ఆయన సరెండర్ అయ్యారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. బీజేపీతో సయోధ్య చేసుకోవాలని కేసీఆర్‌కు సలహా ఇచ్చింది కూడా మై హోమ్ రామేశ్వరరావే అన్న వాదన కూడా వుంది. అందుకే కేసీఆర్ ను కాపాడేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న రామేశ్వరరావు.. కేసీఆర్ కోసమే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారని కొందరు చెబుతున్నారు,        టీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒకటేనని చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ విషయం బహిర్గతమవుతుందని చెబుతున్నారు. అంతేకాదు కేసుల బూచి చూపిస్తూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీని బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని, తెలంగాణలోనూ అదే చేయబోతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.  ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లినప్పుడు... చంద్రబాబే బీజేపీకి మళ్లీ దగ్గరయ్యేందుకు వాళ్లను పంపించారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా తనపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరగకుండా ఉండేందుకే..  తన సన్నిహితుడిని కేసీఆరే బీజేపీలోకి పంపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  మొత్తానికి కారణం ఏదైనా.. మైహోం రామేశ్వరరావు బీజేపీకి వెళితే మాత్రం అది తెలంగాణలో పెద్ద రాజకీయ సంచలనమే. 

సీఎం దగ్గరకు హడావిడిగా పరుగులు పెట్టిన మంత్రి కొడాలి నాని.. కారణం అదేనా..!

ఏపీ పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని తన అనుచరులతో కలిసి నిర్వహిస్తున్నట్లుగా చెపుతున్న పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ దాడుల నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. దీంతో అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా సీఎం జగన్ ను కలిసేందుకు అయన నివాసానికి హడావిడిగా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కారణం సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపో.. లేక ఈ మొత్తం ఘటన పై వివరణ ఇచ్చుకునేందుకు ఆయనే వెళ్లారో తెలియలేదు కానీ ఇంత హఠాత్తుగా మంత్రి నాని సీఎం ఇంటికి వెళ్ళడం మాత్రం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది.   ఇదిలా ఉండగా.. గత రాత్రి మంత్రి కొడాలి నాని కి చెందిన గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరిస గ్రామంలోని పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేసి.. 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, కోట్ల కొద్దీ నగదు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడి అధికార పార్టీ నేతలే పేకాట క్లబ్‌ను నడుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ఒక కీలక మంత్రి కనుసన్నల్లో.. కృష్ణా జిల్లాలో నడుపుతున్న ఈ పేకాట డెన్‌ గుట్టు రట్టయింది. ఈ పేకాట డెన్ లోకి ఎంట్రీ ఫీజ్ 10 వేలు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.   అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం గుడివాడలో జరిగిన బహిరంగ సభలో పేకాట క్లబ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. "మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగా లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?" అని మంత్రిని ప్రశ్నిస్తూ.. పవన్ ధ్వజమెత్తిన సంగతి తెల్సిందే. దీంతో ఏపీ వ్యాప్తంగా పవన్ ఆరోపణలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. అయితే పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్ పై దాడులు జరగడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది.

తమ్ముడిని సీఎం పదవిలోకి రానివ్వను! 

రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాలు పని చేయవంటారు. అధికారం కోసం కొంత మంది లీడర్లు ఎంతకైనా తెగిస్తుంటారు. సొంత మనుషులను కూడా కాదనుకుంటారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. కొందరు ముఖ్య నేతలు కూడా తమ కుటుంబ సభ్యుల నుంచే తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. కుటుంబ గొడవలతో తీవ్ర ఇబ్బందులు  పడ్డారు. కుటుంబ కలహాలతో మరి కొందరు నేతలు పదవులు కూడా పోగొట్టుకున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అధికారం కోసం పావులు కదుపుతున్న డీఎంకే చీఫ్ స్టాలిన్ కు కుటుంబం నుంచే తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి.      నాలుగైదు నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా  వేగంగా మారిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేకే విజయావకాశాలు ఎక్కువని సర్వే సంస్థలు చెబుతున్నాయి.  అయితే ఆ పార్టీకి ఇప్పుడు  మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త‌ క‌రుణానిధి కుమారుడు అళ‌గిరి పెద్ద అడ్డంకిగా మారుతున్నారనే చర్చ జరుగుతోంది. కలైంజర్‌ డీఎంకే పేరిట పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అళగరి. మదురైలో తన మద్దతుదారులతో  సమావేశం కూడా నిర్వహించారు. అంతేకాదు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న అళగరి.. తన తమ్ముడు స్టాలిన్ నే ఎక్కువగా  టార్గెట్ చేస్తున్నారు.  తన త‌మ్ముడు స్టాలిన్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు అళగిరి. గ‌తంలో డీఎంకే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, అలాగే త‌న‌ను రాజకీయంగా అణ‌చివేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగినా తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. త‌న‌కు గ‌తంలో దక్షిణ తమిళనాడు పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవిని అప్పగిస్తే పార్టీకి విజ‌యాలు అందించాన‌ని చెప్పారు. కరుణానిధితో మాట్లాడి స్టాలిన్‌కు కోశాధికారి పదవి ఇప్పించాన‌ని తెలిపారు. తాను పదవుల కోసం ఎన్నడూ ఆశ‌ప‌డ‌లేద‌ని చెప్పారు అళగిరి. స్టాలిన్‌కు గ‌తంలో డిప్యూటీ సీఎం పదవి రావడంలో త‌న పాత్ర ఉంద‌న్నారు.  పార్టీ కోసం ఓ కార్యకర్తగా ఇంత‌గా శ్రమించిన తనను  ఏదో తప్పు చేసినట్టుగా చూశార‌ని చెప్పారు. స్టాలినే  త‌న‌ను డీఎంకే నుంచి బయటకు పంపించారని ఆరోపించారు అళగిరి.  త‌మిళ‌నాడుకు ముఖ్య‌మంత్రి కావాలన్న ఆశతో స్టాలిన్‌ ఉన్నాడన్నారు అళగిరి.  అయితే  ఆ పదవిలోకి ఆయన వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. తాను ఏడేళ్లులుగా  మౌనంగా ఉన్నానని, ఇప్పుడు తాను ఏ నిర్ణయం తీసుకున్నా త‌న‌ మద్దతుదారులు త‌న వెంటే ఉంటార‌ని చెప్పారు.  అళగిరి పార్టీతో డీఎంకేకు నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. దక్షిణ తమిళనాడులో అళగిరికి మంచి పట్టు ఉందని, అక్కడ డీఎంకేకు భారీగా గండి పడవచ్చని అంచనా వేస్తున్నారు. అళగిరి పార్టీ ఏర్పాటు వెనక బీజేపీ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. యూపీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న డీఎంతే ఎట్టి పరిస్థిత్తుల్లోనూ అధికారంలోకి రాకుండా చూసేందుకు బీజేపీ పెద్దలు అళగిరితో పార్టీ పెట్టిస్తున్నారని చెబుతున్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్న స్టాలిన్ ఆశలకు.. ఆయన అన్న అళగిరే అడ్డంకిగా మారారనే చర్చ తమిళనాడులో జరుగుతోంది. 

గృహ నిర్బంధంలో జేసీ బ్రదర్స్... తాడిపత్రిలో హైటెన్షన్  

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో జేసీ బ్ర‌ద‌ర్స్ నిర‌హార దీక్ష చేసేందుకు సిద్ధం కావడంతో హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌మ‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ.. దీనికి వ్య‌తిరేకంగా త‌హ‌సిల్దార్ కార్యాల‌యం ఎదుట ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష చేసేందుకు జేసీ సోదరులు సిద్ధ‌మయ్యారు. దీంతో ముందస్తు చ‌ర్య‌ల్లో భాగంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, జేసీ దివాక‌ర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిరాహార దీక్ష చేయడానికి బయల్దేరిన జేసీ దివాక‌ర్ రెడ్డిని పోలీసులు ఫామ్ హౌజ్ వ‌ద్ద‌నే హౌస్ అరెస్ట్ చేయ‌గా.. ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఇంటి వ‌ద్దే అడ్డుకున్నారు. దీంతో అయన ఇంటి వద్దే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మరోపక్క జేసీ బ్ర‌ద‌ర్స్ అనుచ‌రులు, టీడీపీ కార్య‌క‌ర్తలు వారి ఇళ్ల వ‌ద్ద‌కు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు.   ఇదిఇలా ఉండగా ఇప్ప‌టికే పోలీసులు తాడిప‌త్రిలో 30 యాక్టు,144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం ప‌ట్ట‌ణంలో ఎలాంటి స‌భ‌లు, స‌మావేశాలు, ధ‌ర్నా కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. జేసీ సోదరులతో పాటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల వ‌ద్ద పోలీసులు భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మరోపక్క పోలీసులు తమను అరెస్ట్‌ చేసినా.. దీక్ష చేసి తీరతామని జేసీ బ్రదర్స్ స్పష్టం చేస్తున్నారు. తాడిపత్రిలో పోలీసులు కవాతు చేసినా తాము భయపడేది లేదంటున్నారు. తాము శాంతియుతంగానే ఆమ‌ర‌ణ‌ నిరాహార దీక్ష చేస్తామ‌ని.. దీనిని పోలీసులు అడ్డుకోవ‌డం స‌రికాదంటూ జేసీ బ్రదర్స్ మండిప‌డుతున్నారు. 

త్వరలో టీఆర్ఎస్ లోకి వీహెచ్! కేసీఆర్ ను పొగడటంతో లైన్ క్లియరా? 

తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా అనూహ్యా మార్పులు జరుగుతున్నాయి. నాయకుల వలసలతో ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ తరహా వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి.  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడంతో తెలంగాణలో  బీజేపీ దూకుడు పెరిగింది. ఆ పార్టీలోకి రోజూ చేరికలు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో మాత్రం పీసీసీ చీఫ్ పీటముడి వీడటం లేదు. ఇదిగో అదిగో ప్రకటన అంటూనే నెల రోజులు కాలాయపన చేసింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో హస్తం నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కు మొదటి నుంచి వీర విధేయుడిగా ఉన్న సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు పార్టీ మారతారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసే వీహెచ్.. పార్టీ మారాల్సి వస్తే   బీజేపీలోకి వెళ్లవచ్చని భావించారు.   అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన గులాబీ గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడే వీహెచ్.. తాజాగా ఆయనను ప్రశంసిస్తూ  వ్యాఖ్యలు చేయడంతో హనుమంతరావు కారు పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. మున్నూరు కాపు మహాసభలో మాట్లాడిన వీహెచ్..  కేసీఆర్‌పై గతంలో ఎప్పుడు లేనంతగా ప్రశంసలు కురిపించారు.  సీఎం కేసీఆర్‌ అన్ని కులసంఘాల భవనాలకు స్థలం, నిధులు ఇస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కుల సంఘాలకు ఇంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు హనుమంతరావు.  వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నందు వల్లే కేసీఆర్ ను పొగుడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎన్నిక  కాంగ్రెస్  పార్టీలో  వివాదం రేపుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వొద్దని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అందులో వీహెచ్ ప్రధానంగా ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించవద్దని ఆయన చాలా సార్లు చెప్పారు. హైకమాండ్ కు వివరించారు. ఎక్కడ మాట్లాడినా పీసీసీ విషయంలో రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారు వీహెచ్. దీంతో రేవంత్ రెడ్డి అనుచరులు వీహెచ్ ను టార్గెట్ చేశారు. రేవంత్ అభిమానితో  వీహెచ్ కు ఫోన్ లో జరిగిన గొడవకు సంబంధించిన ఆడియో కాల్ లీకై తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి అనుచరుడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు వీహెచ్. తర్వాత కూడా రేవంత్ ను ఆయన వదలడం లేదు.  రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే తాను కాంగ్రెస్ నుంచి బయటికి వస్తానని కూడా చెప్పారు వీహెచ్.  రేవంత్ రెడ్డికే పీసీసీ చీఫ్ పోస్టు దాదాపుగా ఖాయమని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రావడంతో .. తాను చెప్పినట్లే  కాంగ్రెస్ పార్టీని  వీడేందుకు హనుమంతరావు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. బీజేపీలోకి వెళితే పదవులు వచ్చే అవకాశం లేదని, కేసీఆర్ అయితే ఏదో ఒక పోస్టు కట్టబెడుతారని వీహెచ్ భావిస్తున్నారట. అందుకే టీఆర్ఎస్ లో చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్న వీహెచ్..  సీఎం కేసీఆర్ ను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారంటున్నారు. రేవంత్ రెడ్డికే పీసీసీ చీఫ్ అన్న ప్రకటన వచ్చిన వెంటనే వీహెచ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తారని ఆయన అనచురులు కూడా చెబుతున్నారు. మొత్తానికి వీహెచ్ టీఆర్ఎస్ లో చేరితే మాత్రం అది సంచలనమే. విశ్లేషకులు మాత్రం రాజకీయాల్లో శాశ్వాత మిత్రులు, శత్రువులు ఉండరని.. ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. వీహెచ్ టీఆర్ఎస్ లో చేరినా పెద్దగా అశ్చర్యపడాల్సింది ఏమీ లేదంటున్నారు.

హైదరాబాద్ లో ఏపీ మంత్రి దిష్టి బొమ్మ దహనం.. ఖబడ్దార్ అంటూ హెచ్చరిక 

ఏపీలోని రామతీర్థం ఆలయంలోని పురాతన రాముడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై సర్వత్రా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెసిందే. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఆలయ చైర్మన్ గా ఉన్న పూసపాటి రాజ వంశీకుడైన అశోక గజపతిరాజును ఆ పదవి నుండి ఏపీ ప్రభుత్వం తప్పించిన సంగతి తెల్సిందే. ఇదే సందర్భంలో టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఐన అశోక్ గజపతిరాజుపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో క్షత్రియ సంఘం నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. వెంటనే మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని క్షత్రియ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.   ఇది ఇలా ఉండగా.. ఇదే విషయం పై విజయవాడలో నిన్న క్షత్రియ కార్పొరేషన్‌ సాధన సమితి రాష్ట్ర కన్వినర్‌ గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ.. ‘‘విజయనగర సంస్థానాధీశులు పూసపాటి అశోక్‌గజపతిరాజు ఇంట్లో పాలేరు స్థాయి కూడా లేని మంత్రి వెలంపల్లి ఆయనను అసభ్యపదజాలంతో దూషించడం సిగ్గుచేటు. మంత్రి తక్షణమే అశోక్‌ గజపతిరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం’’ అని హెచ్చరించారు. "దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ను పనికిమాలిన, దగుల్బాజి మంత్రి, చరిత్ర హీనుడిగా అభివర్ణించాలని ఉన్నా తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. వేల ఆలయాల అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు తమ ఆస్తులను త్యాగం చేసిన చరిత్ర అశోక్ గజపతిరాజు కుటుంబానిదని" అయన అన్నారు.   అంతేకాకుండా "ఆలయాల ఆస్తులు విక్రయించిన చరిత్ర వెలంపల్లిదని గుర్తుంచుకోవాలన్నారు. రాజవంశీకుడైనా కూడా ఒక సామాన్యుడిగా జీవనం సాగిస్తున్న అశోక్‌ గజపతిరాజుపై అవగాహన లేకుండా మంత్రి మాట్లాడటం క్షత్రియల ఆగ్రహావేశాలకు కారణమైందని" ఫెడరేషన్‌ అధ్యక్షులు వెంకటపతిరాజు, సమితి అధ్యక్షులు నాగరాజు అన్నారు. ఈ సమావేశంలో క్షత్రియ సంఘాల నేతలు ప్రసాదరాజు, వెంకటేశ్వరరాజు, ఉద్దరాజు విజయరామరాజు, సాగి అచ్చ్యుతరామరాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి గారి పేకాట క్లబ్బుపై దాడి చేసిన పోలీసులు.. చంపేస్తామని బెదిరించిన మంత్రి అనుచరులు 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీలోని జగన్ సర్కార్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి ఆధ్వర్యంలో నడిపిస్తున్న పేకాట క్లబ్బులపై కొద్దిరోజుల క్రితం పోలీసులు రైడింగ్ చేయగా.. ఆ దాడిలో భారీ ఎత్తున డబ్బు, కార్లు, వ్యక్తులు పట్టుబడ్డారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులే స్వయంగా బయట పేకాట ఆడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ నలభై మంది పోలీసు సిబ్బందితో కలిసి ఆ మంత్రి గారి పేకాట క్లబ్బుపై దాడి చేయగా.. ఆ ఆఫీసర్ ను బూతులు తిట్టారని.. అంతేకాకుండా అక్కడ్నుంచి వెళ్లకాపోతే చంపేస్తామని బెదిరించారని అయన ఆరోపించారు.   దేవినేని ఉమా వ్యాఖ్యల పూర్తి వివరాలు అయన మాటల్లోనే.. "సీఎం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఆధ్వర్యంలో నడుస్తున్న పేకాట క్లబ్బుల్లో భారీ ఎత్తున డబ్బు, కార్లు, వ్యక్తులు పట్టుబడ్డారు. ఆ స్పాట్ లో సంచుల్లో రూ. 10 కోట్ల రూపాయలు డబ్బులు దొరికాయి. ఈ సొమ్ముతోపాటు సుమారు 30 కార్లతో సహా 60 మంది కూడా పట్టుబడ్డారు. సీఎం జగన్ క్యాబినెట్ లోని మంత్రులు లోపల, బయట పేకాట ఆడుతున్నారు. కొడాలి నాని 19 నెలలుగా తన ముఖ్య అనుచరులు విజయ్, మధు(మురళి) ల ఆధ్వర్యంలో ఎంట్రీ ఫీజుగా రూ. 5,000 నెట్ క్యాష్ వసూలు చేస్తూ, రూ. 2 లక్షల రూపాయలంటు పేకాట క్లబ్ నడిపిస్తున్నాడు. తాజాగా ఒక నిజాయితీపరుడయిన ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసులతో మంత్రి ఆడిస్తున్న పేకాట క్లబ్బుల పైన దాడి చేశారు. అయితే ఆ పోలీస్ అధికారిని బదిలీ చేస్తామని, బూతులు తిడుతూ ఆ డబ్బు సంచులను వదిలేసి వెళ్లకపోతే చంపేస్తామని మంత్రి దగ్గరనుంచి బెదిరింపులు వెళుతున్నాయి.." అని ఉమా అన్నారు.   ఇదే ఘటనపై ఉమా స్పందిస్తూ.. "సీఎం కు దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయాలి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి వెళ్లి మంత్రి కొడాలి నానికి అడ్డుకట్ట వేశారు. నిజాయితీపరుడైన ఆ పోలీస్ అధికారి కి హ్యాట్సాఫ్. నందివాడ మండలం దొండపాడు గ్రామ పరిధిలోకి ఏ మీడియా వారైనా ఫోన్ తీసుకొని వెళితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటా.. అక్కడ రాత్రి ఎనిమిదింటికి మొదలైన పేకాట క్లబ్బులు తెల్లవారు జాము దాకా జరుగుతున్నాయట.. ఇది గత 19 నెలలుగా జరుగుతోంది. కొడాలి నాని అడిస్తున్న ఈ లోనా బయట ఆటల వల్ల, కోత ముక్కల వల్ల ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో చాలామంది జీవితాలు కూడా బలి అయ్యాయి.." అని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.   సదరు మంత్రి నిర్వహిస్తున్న పేకాట క్లబ్బుల వల్ల ఇప్పటికే చాలా మంది జీవితాలు నాశనమవుతున్నాయని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. "నూజివీడు లో కనకం అనే ఉద్యోగి అప్పులు చేసి ఇంట్లో బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టి పేకాట ఆడి అప్పులు కట్టలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల రైడ్ లో స్పాట్ లో దొరికిన ఆ పది కోట్ల రూపాయల డబ్బును, సీజ్ చేసిన 30 కారులను, ఆ 60 మంది వ్యక్తులను కోర్టులో హాజరు పరచాలి. ఈ విషయం మీద ప్రతిపక్షాలు, మీడియా వాళ్ళు మాట్లాడినా సీఎం జగన్ గారి చెవికి ఎక్కలేదు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం, దొండపాడు గ్రామం చంద్రయ్య కాలవ గట్టున అంకమ్మగూడెం వంతెన వద్ద ఆక్వా పొలాల్లో గత 19 నెలలుగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో విజయ్, మధు(మురళి) అనే ఇద్దరు ఆధ్వర్యంలో లోన బయట ఆట ఆడిస్తున్నారు..." అంటూ ఉమా మండిపడ్డారు.

గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన! వెల్లంపల్లిపై విరుచుకుపడుతున్న జనాలు 

కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టిన.. వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ.. గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన... ఇవన్ని అర్హత లేని వారిని అందం ఎక్కిస్తే ఎలాంటి పరిణమాలు వస్తాయో చెప్పటానికి ఉపయోగించే సామెతలు. నీచుడైన వానిని ఎంత గౌరవించినా, వాడి నీచగుణాలను వదిలించుకోడని తన పద్యంలో వివరించారు సుమతీ  శతకకారుడు.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇలాంటి సీనే కనిపిస్తోంది. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు వీధి రౌడీకన్నా దిగజారి పోయాడు. పరమ  పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు అమాత్యులుగా ఉండి పరమ నీచంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయనెవరో కాదు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ రెడ్డి పాలనలో ఆలయాల పర్యవేక్షణ చూసే శాఖకు మంత్రిగా ఉంటూ.. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ.. ఆ పవిత్ర పదవికే కళంకం తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా  సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజును ఉద్దేశించి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు ఫైరవుతున్నారు. ఇలాంటి మంత్రి ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని కొందరు క్షమాపణలు చెబుతున్నారు.           జగన్ రెడ్డి పాలన వచ్చాకా ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే 150కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. వరుస ఘటనలు జరుగుతున్నా జగన్ సర్కార్ స్పందించలేదు. రామతీర్థంలోని కోదండరామాలయంలోని రాముడి విగ్రహాన్ని రెండు ముక్కలు చేశారు దుండగులు. దీంతో భక్తుల నుంచి  తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో... ఆ నెపాన్ని ఇతర పార్టీలపై వేసే ప్రయత్నం చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. అందులో భాగంగానే రామతీర్థం ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. ఆ ఆలయ ట్రస్టీ చైర్మెన్ గా ఉన్న అశోక గజపతి రాజును హడావుడిగా తొలగించింది . 150 ఆలయాల్లో దాడులు జరిగితే.. ఏ గుడి చైర్మెన్ ను తొలగించని సర్కార్.. అశోక గజపతి రాజును తొలగించడంతో జగన్ రెడ్డి సర్కార్ కుట్రలు భయటపడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. అశోక గజపతి రాజును పదవి నుంచి తొలగించేందుకే రాములోరి తల నరికారా అన్న ఆరోపణలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఇదిలా ఉండగానే రామతీర్థం ఘటనపై మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి.. విగ్రహం ధ్వంసం గురించి చెప్పకుండా అశోక గజపతి రాజుపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఏపీ జనాలు భగ్గుమంటున్నారు. పార్టీలు, ప్రాంతాలకతీతంగా తీవ్రంగా స్పందిస్తున్నారు.  రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ గా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు పూసపాటి అశోక్ గజపతి రాజు. రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్ గజపతిరాజు పూర్వీకులు ఆలయ ధూపదీప నైవేద్యాలకు తమ ఏలుబడిలోని 12 గ్రామాలను కేటాయించారు. విజయనగరం సంస్థానంలోని 105 దేవాలయాల నిర్మాణం, పోషణ పూసపాటి వంశీకులదే. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే.  పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా అశోక్ గజపతిరాజు గారిని అందరూ గౌరవిస్తారు. వాళ్ల అమ్మాయికి కరీంనగర్ లో మెడిసిన్ సీట్ వస్తే  మంత్రిగా ఉండి ,  మార్పించుకునే అవకాశం  వున్నా ఒప్పుకోకుండా  వచ్చిన ర్యాంక్ కి అక్కడే చదవాలి అని ఆయన చదివించారు. ఆంధ్ర యూనివర్సిటీ కి,  విజయనగరం  మహారాజా కళాశాలకు వందల  ఎకరాలు  ఇచ్చిన కుటుంబం పూసపాటిది.  అందుకే అవినీతి  మరకలు లేని హుందాగా దేవాలయాల ధర్మ కర్తగా వ్యవహరించే అశోక గజపతి రాజును వెధవ అని సంభోదించిన వెల్లంపల్లిపై ఆయన నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి గారి నోటిదురుసుతనానికి  సిగ్గుపడుతూ,  పెద్దరికాన్ని, గౌరవాన్ని మరిచిపోయేలా చేసిన పదవి శాశ్వతం కాదని,  విజయవాడ  పరువు నిలిపేలా, అందరు మెచ్చుకునేలా వ్యవహార శైలి ఉండాలని,  వయసుని గౌరవించటం నేర్చుకోవాలంటూ.. వెల్లంపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన  కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.   అశోక గజపతి రాజును ఉద్దేశించి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన అంటూ మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు గారి వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరిచిప్పలు కొట్టేసే దొంగకి మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుందని చురకలంటించారు. నీతికి, బూతుకు తేడా తెలియనివాడి నోటి నుంచి అంతకంటే మంచి భాష ఎలా వస్తుందని కౌంటరిచ్చారు నారా లోకేష్. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే కంత్రీ మంత్రీ తెలుసుకో! అంటూ హితవు పలికారు నారా లోకేష్.    ఇక అశోకగజపతి రాజును ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. జగన్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ  ఓ జర్నలిస్ట్ రాసిన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ పోస్టును యథాతథంగా  కింద ఇస్తున్నాం..    విజయనగరం వేదికగా అనేక ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను ధారాదత్తం చేసిన ఘనత విజయనగరం మహారాజా స్వంతం. నేటి విశాల విశాఖ నగరం కోసం వేలాది ఎకరాలను విరాళంగా ఇచ్చిన చరిత్ర వారిది. విశాఖ నేవల్ డాక్ యార్డ్ విజయ్ నగర్ గేట్ ను అడిగినా, సింహాచలం దేవస్థానం చుట్టూ వున్న కొండలను అడిగినా,  దిగువున నలుదిశలనూ ప్రశ్నించినా ఈ విషయం రూఢీ అవుతుంది. ఆధ్యాత్మిక, విద్య వైద్యం, సమాజిక, రాజకీయ రంగాలలో పూసపాటి చేసిన సేవ హర్షించదగినది. అలాంటి అశోక గజపతి రాజు వ్యక్తిగత జీవితంపై దారుణమైన వ్యాఖ్యానాలు చేయడం అత్యంత బాధాకరం. ముఖ్యంగా బాధ్యతాయుతమైన ఓ మంత్రి గారు అత్యంత బాధ్యతారహితంగా అశోక్ గజపతి రాజును వెధవ (మంత్రి మాట‌ల్లో అయితే యదవ) అని పదేపదే దూషించడం చూసి సభ్య సమాజం తల దించింది. రాజకీయాలలో పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యానాలు సహజమే. అయితే మరీ ఇంత దారుణంగా, నిస్సిగ్గుగా, గతి తప్పి చేసే విమర్శలతో ఏలిన వారు ఏ వర్గానికి ఏ విధమైన సంకేతాలు పంపుతున్నారో ఆలోచించుకోవాలి. ముఖ్యంగా కొందరు మంత్రుల మాయదారి మాట‌లకు ముఖ్యమంత్రే చివరికి బాధ్యత వహించాల్సి ఉంటుందనే వాస్తవం గ్రహిస్తే మంచిది. ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు ఆయా సామాజిక వర్గాలు లేక వర్ణాలను తీవ్రంగానే ప్రభావితం చేసే అవకాశం వుంది. ఏ రాజకీయ నాయకుడు లేక పార్టీకి ఇది ఎంతమాత్రం మంచిదికాదు. అశోక్ గజపతి రాజుపై సదరు మంత్రి అనుచిత వ్యాఖ్యానాలు ఇప్పుడు యావత్ క్షత్రియ సామాజిక వర్గాన్నే ఓ కుదుపు కుదిపాయనడంలో సందేహం ఉందా? . అధికార పార్టీ లేక అధికారం వలయం నుండి దూసుకు వచ్చిన నోటి దురద మాట‌లకు సదరు సామాజిక వర్గం యావత్తూ ఉలిక్కిపడి చూసింది. మదనపడింది... అవకాశం కోసం, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తోంది... ఈ విధంగా ఏ ఒక్క వర్గానికి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిన  బాధ్యత తప్పకుండా అధినేత జగనే.. ఉత్తర కుమారులను తలదన్నే ఇటువంటి నేతల ఉత్తుత్తి ప్రవచనాలకు చెక్ పెట‌్ట‌లేని పక్షంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని గమనించండి  ముఖ్యమంత్రి గారూ...

అశోక్ టార్గెట్ గానే విగ్రహం ధ్వంసం? జగన్ రెడ్డి నియంత పాలనకు సాక్ష్యం? 

విజయనగరం జిల్లా రామతీర్థంలోని ప్రసిద్ధ రామాలయంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో ఆంధ్రప్రదేశ్ రగిలిపోతోంది. విగ్రహం ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వస్తుండగా.. జగన్ సర్కార్ తీరుతో ఆ అనుమానం నిజమేనని బలపడుతోంది. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టార్గెట్ గానే అధికార పార్టీ డైరెక్షన్ లోనే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. విగ్రహం ధ్వంసం ఘటనను సాకుగా చూపుతూ ఆయన్ను ట్రస్ట్ చైర్మెన్ పదవి నుంచి తొలగించింది జగన్ సర్కార్. రామతీర్థంతో పాటు పైడితల్లి, మందపల్లి ఆలయ ట్రస్ట్ ల నుంచి ఆయన్ను తొలగిస్తూ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అశోక్ గజపతి రాజును పదవి నుండి తప్పించడానికి రాములోరి తల నరికారా.. అందుకే పదవి నుండి తప్పించారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపునకు పరాకాష్టగా, జగన్ రెడ్డి నియంత పాలనకు సాక్ష్యంగా రామతీర్థం ఘటన నిలుస్తోందని చెబుతున్నారు.    రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ గా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు పూసపాటి అశోక్ గజపతి రాజు. రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్ గజపతిరాజు పూర్వీకులు ఆలయ ధూపదీప నైవేద్యాలకు తమ ఏలుబడిలోని 12 గ్రామాలను కేటాయించారు. విజయనగరం సంస్థానంలోని 105 దేవాలయాల నిర్మాణం, పోషణ పూసపాటి వంశీకులదే. వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతి రాజును టార్గెట్ చేశారు. ఇప్పటికే అశోక్‌ ను ప్రతిష్ఠాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్‌ పదవి నుంచి తొలగించింది. విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌  ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది. ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది ఏపీ సర్కార్. తాజాగా మూడు దేవాలయాల బోర్డుల నుంచి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ సర్కార్ తీరుతో అశోక గజపతి రాజును రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ పదవి నుంచి తొలగించేందుకే ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారనే చర్చ జరుగుతోంది.   ఇందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాకా ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు దాదాపు 150కి పైగా గుడుల్లో విగ్రహాలు ధ్వంసం చేయడమే, హుండీలు పగలగొట్టడమే, విగ్రహాలు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు జరిగాయి. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు జరిగాయి.అయితే ఆలయాలపై దాడులు జరుగుతున్నా జగన్ సర్కార్ సీరియస్ గా స్పందించలేదు. ఎవరిపైనా చర్య తీసుకోలేదు. 150 ఆలయాలపై దాడులు జరిగితే.. ఏ గుడి చైర్మెన్ ను తొలగించలేదు. కాని రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో  మాత్రం విచారణ జరుగుతుండగానే ట్రస్ట్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ఆదేశాలివ్వడంతో.. ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందనే అనుమానం బలపడుతోంది.    అంతేకాదు విగ్రహం ధ్వంసం ఘటన తర్వాత రామతీర్థం ఆలయ అధికారులు, స్థానిక పోలీసుల తీరు కూడా వివాదాస్పందగానే ఉంది. వైసీపీ నేతలను కొండపైకి అనుమతిస్తూ.. ఇతర పార్టీల నేతలను అడ్డుకున్నారు. శనివారం కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొండ పైకి ఎక్కారు. విజయసాయిని ఆలయ అధికారులు ఆయనను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ఆయన పూజలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు కొండ పైకి ఎక్కారు. అయితే చంద్రబాబు గుడిలోకి వెళ్లకుండా అధికారులు తాళం వేశారు. చంద్రబాబు గుడి వద్దకు చేరుకుంటారనగా అధికారులు తాళం వేయడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు ఘటనాస్థలిని పరిశీలిస్తే.. నిజాలు భయటపడుతాయనే భయంతోనే అధికార పార్టీ ఇలా వ్యవహరించిందని చెబుతున్నారు.  ఎంపీని గర్భగుడిలో తీసుకెళ్లి.. ప్రతిపక్ష నేత చంద్రబాబును విచారణ పేరుతో అడ్డుకోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.     ఆలయాలపై దాడులు జరుగుతున్నా నివారించలేని  దేవాదాయ శాఖకు దద్ధమ్మ మంత్రిగా మిగిలిపోయిన వెల్లంపల్లి శ్రీనివాస్... నోటి దూలతో ఆ పదవికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. రామతీర్థం ఘటనపై మరోసారి దిగజారి వ్యాఖ్యలు చేశారు వేస్ట్ మినిస్టర్ వెల్లంపల్లి. రాములవారి విగ్రహం తల పగులగొట్టిన వెధవను చైర్మన్ గా ఉంచాలా? అంటూ మండిపడ్డారు. అశోక గజపతి రాజును ఉద్దేశించి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన అంటూ మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు గారి వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరిచిప్పలు కొట్టేసే దొంగకి మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుందని చురకలంటించారు. నీతికి, బూతుకు తేడా తెలియనివాడి నోటి నుంచి అంతకంటే మంచి భాష ఎలా వస్తుందని కౌంటరిచ్చారు నారా లోకేష్. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే కంత్రీ మంత్రీ తెలుసుకో! అంటూ హితవు పలికారు నారా లోకేష్.   పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా అశోక్ గజపతిరాజు గారిని అందరూ గౌరవిస్తారు. వాళ్ల అమ్మాయికి కరీంనగర్ లో మెడిసిన్ సీట్ వస్తే  మంత్రిగా ఉండి ,  మార్పించుకునే అవకాశం  వున్నా ఒప్పుకోకుండా  వచ్చిన ర్యాంక్ కి అక్కడే చదవాలి అని ఆయన చదివించారు. ఆంధ్ర యూనివర్సిటీ కి,  విజయనగరం  మహారాజా కళాశాలకు వందల  ఎకరాలు  ఇచ్చిన కుటుంబం పూసపాటిది. అవినీతి  మరకలు లేని హుందాగా దేవాలయాల ధర్మ కర్తగా వ్యవహరించే అశోక గజపతి రాజును వెధవ అని సంభోదించిన వెల్లంపల్లిపై ఆయన నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి గారి నోటిదురుసుతనానికి  సిగ్గుపడుతూ,  పెద్దరికాన్ని, గౌరవాన్ని మరిచిపోయేలా చేసిన పదవి శాశ్వతం కాదని, విజయవాడ  పరువు నిలిపేలా, అందరు మెచ్చుకునేలా వ్యవహార శైలి ఉండాలని,  వయసుని గౌరవించటం నేర్చుకోవాలంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.    హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ నేతలు రామతీర్థం ఘటనలోనూ తమ రాజకీయ కుట్రను బయటపెట్టుకున్నారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయకుండా.. ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవధర్ , అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిలు ఎప్పటిలానే చంద్రబాబుపై పడ్డారు. రామతీర్థం ఘటనపై మాట్లాడకుండా.. టీడీపీలో హయాంలో కూల్చేసిన గుడుల గురించి ప్రస్తావించి తమ జగన్ భక్తీ చాటుకున్నారు. బీజేపీ నేతల తీరుపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రం నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న గుడులను తొలగించారని విష్ణువర్దన్ రెడ్డికి తెలియదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కేంద్ర సర్కార్ నిర్మాణాన్నే వ్యతిరేకిస్తున్నారా అని నిలదీస్తున్నారు. జగన్ సర్కార్ కు ఇబ్బంది కాకుండా, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఏపీ బీజేపీ కేడర్ నుంచి కూడా వస్తున్నాయి.

గర్భగుడిలోకి విజయసాయి రెడ్డి.. చంద్రబాబుకు మాత్రం గుడిలోకి నో ఎంట్రీ

విజయనగరం జిల్లా రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బిజెపి, వైసిపి, టిడిపి నాయకులు పోటాపోటీగా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ రామతీర్థం ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే ముందుగా విజయసాయిరెడ్డి కొండ పైకి ఎక్కారు. విజయసాయి ఆలయం వద్దకు వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ఆయనను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ఆయన పూజలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు కొండ పైకి ఎక్కారు. అయితే చంద్రబాబు గుడిలోకి వెళ్లకుండా అధికారులు తాళం వేశారు.   చంద్రబాబు మరికాసేపట్లో గుడి వద్దకు చేరుకుంటారనగా అధికారులు తాళం వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గుడికి తాళం వేయడంపై చంద్రబాబు అక్కడి ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుడికి తాళం ఎందుకు వేశారని ప్రశ్నిస్తే... విచారణ జరుగుతోందని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహాలను ఆయన గుడి వెలుపలి నుంచే పరిశీలించారు. దుండగులు రాముడి విగ్రహం తలను విసిరేసిన కోనేరును కూడా ఆయన పరిశీలించారు. ఇది ఇలాఉండగా చంద్రబాబును ఆలయంలోకి అనుమతి ఇవ్వక పోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిని ఏ హోదాతో అనుమతి ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో ఆగని దాడులు.. మరో ఆలయంలో విగ్రహాల ధ్వంసం!

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ని నెలలుగా ఎన్నో దేవాలయాలపై దాడుల జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ వచ్చింది. పదులు వందల సంఖ్యలో దాడులు జరిగిన తర్వాత గానీ ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదు. ఇటీవల ఆయన హిందూ దేవాలయాలపై దాడుల అంశంపై మాట్లాడుతూ.. దేవుడితో పెట్టుకుంటే కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు. కానీ ఏం లాభం? ఆయన హెచ్చరించినా దుండగులు రెచ్చిపోతున్నారు. ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రామతీర్థం, రాజమండ్రి ఘటనలు మరువకముందే.. తాజాగా కర్నూలు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.   కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం మర్లబండలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేశారు. గోపురంపై ఉన్న విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతేగాక ఆలయంలోని హుండీలను కూడా అపహరించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

420కి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది! 

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై మాటల తూటాలు పేల్చుతున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తన సవాల్ ను స్వీకరిస్తున్నానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై లోకేష్ ఫైరయ్యారు. ‘420 జగన్‌రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఏ1 కి దమ్ము, ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని ఎద్దేవాచేశారు. వైసీపీ ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని దుయ్యబట్టారు  నారా లోకేష్. తనపై జగన్ రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చెయ్యడానికి సిద్ధమని లోకేష్‌ సవాల్ విసిరారు. ప్రమాణం చేయడానికి జగన్ రెడ్డి సిద్ధమా? అని నారా లోకేష్‌  మరోసారి ప్రశ్నించారు.   రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు సంబంధించి తీవ్రంగా స్పందించిన నారా లోకేష్.. సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చర్చకు  సింహాద్రి అప్పన్న ఆలయానికి రావాలని సీఎం జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. అయితే లోకేష్ సవాల్ పై స్పందించిన ఎంపీ విజయసాయి రెడ్డి..  ‘‘టీడీపీ నేత లోకేష్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తా.. చర్చకు సిద్ధం. చర్చకు మీరే తేదీ చెప్పండి’’ అని సవాల్ విసిరారు. దీనిపై స్పంచిందిన నారా లోకేష్.. 420 జగన్‌రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?’అని కౌంటరిచ్చారు. 

రామతీర్థంలో హై టెన్షన్.. విజయసాయి కారుపై దాడి.. చంద్రబాబు ఎంట్రీ!!

విజయనగరం జిల్లా రామతీర్థం రణరంగాన్ని తలపిస్తోంది. రాజకీయనేతల పర్యటనతో రామతీర్థంలో హై టెన్షన్ నెలకొంది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటనల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు రామతీర్థానికి భారీగా చేరుకున్నారు. వీరితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో రామతీర్థం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   రామతీర్థం పర్యటనలో ఎంపీ విజయసాయిరెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారుపై నిరసనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కొండపైకి వెళ్తున్న విజయసాయిని టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసుల అండతో ఆయన కొండపైకి వెళ్లారు. ఆయనతో పాటుగా అనేక మంది కార్యకర్తలు కూడా కొండమీదకు వెళ్లారు. అయితే, కొందరు కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకొని కొండమీదకు వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ జెండాలతో ఎలా వెళ్తారని బీజేపీ, టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ సమయంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు విజయసాయి కారుపై దాడికి దిగారు. ఈ దాడిలో విజయసాయి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన తర్వాత విజయసాయి మరో కారులో వెళ్లారు.    మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. మార్గమధ్యంలో అడ్డంకులు ఎదురైనా, ఎట్టకేలకు చంద్రబాబు రామతీర్థం రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. అంతకుముందు రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికే అనుమతి ఇచ్చారు. కాన్వాయ్‌ లోని టీడీపీ నేతల మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. తాము కూడా రామతీర్థం వెళ్లేందుకు అనుమతించాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఎట్టకేలకు వారిని కూడా అనుమతించడంతో రామతీర్ధం చేరుకున్న చంద్రబాబు గుడిని పరిశీలించారు. కాగా, రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం మొదట్లో కొబ్బరికాయ కొట్టి కొండపైకి పయనమయ్యారు. ఆయన వెంట ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు తదితరులున్నారు.  

సౌరవ్ గంగూలీకి గుండెపోటు

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఉదయం జిమ్‌ లో ఉండగా ఉన్నట్లుండి తీవ్రమైన ఛాతీ నొప్పితో గంగూలీ బాధపడ్డారు. దీంతో అక్కడి సిబ్బంది ఆయనను హుటాహుటిన దగ్గరలోని ఉడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు.. హృదయపు నాళాల్లో అడ్డంకులు ఏర్పడడమే ఛాతీ నొప్పికి కారణంగా గుర్తించారు. సాయంత్రంలోపు యాంజియో ప్లాస్టీ(గుండె నాళాల్లో అడ్డంకులు తొలగింపు) చికిత్స చేయడం జరుగుతుందని చెప్పారు. దీనికోసం ఆసుపత్రి యాజమాన్యం ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స పూర్తయిన తరువాత త్వరగా కోలుకుంటారని డాక్టర్లు పేర్కొన్నారు.

సాగర్ తో పాటు మరో అసెంబ్లీకి ఉప ఎన్నిక?  

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో   ఖాళీ అయిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. మార్చిలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగే  అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నాగార్జున సాగర్ తో పాటు తెలంగాణలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి  కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాకే చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక రావొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.  తాను బీజేపీలో చేరబోతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణా సంఘం నివేదికను ఏఐసీసీ కోరింది. దీంతో తిరుపతిలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, గతంలో చేసిన కామెంట్స్‌తో కూడిన రిపోర్ట్‌ను ఏఐసీసీకి క్రమశిక్షణా సంఘం పంపించింది. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా  రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి ఇచ్చే సమాధానం తర్వాత అతనిపై స్పీకర్ పై అనర్హత పిటిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందట. కాంగ్రెస్ అనర్హత పిటిషన్ ఇస్తే.. స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరపాల్సి  ఉంటుంది.  బీజేపీలో చేరేందుకు ఏడాది క్రితమే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆ సందర్భంలోనే తెలంగాణలో బీజేపీనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని  చెప్పారు. అప్పుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని అంతా భావించారు. అయితే అది ఎందుకో ఆగిపోయింది. కోమటిరెడ్డి బీజేపీలో చేరితే  స్పీకర్ ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ భావించింది. అదే జరిగితే స్పీకర్ అనర్హత వేటు వేయవచ్చని భావించారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఆ సమయంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందని ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఉప ఎన్నిక వస్తే మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదనే అంచనాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలు వచ్చారట. అందుకే కావాలనే  అప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరికను బీజేపీ పెద్దలు వాయిదా వేశారనే చర్చ జరుగుతోంది.  వరుస విజయాలతో తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడు మీద ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా గెలవొచ్చనే భావనలో బీజేపీ ఉందని చెబుతున్నారు.  పార్టీ మారితే తనపై అనర్హత  వేసినా బీజేపీ నుంచి పోటీ చేసి మళ్లీ గెలుస్తాననే ధీమాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. అందుకే బీజేపీలో చేరేందుకు ముహుర్తాన్ని ఆయన రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నిక రావొచ్చనే అంచనాతో బీజేపీ కూడా మునుగోడుపై  ఫోకస్ చేసిందంటున్నారు. పరిస్థితులన్ని తమకు  అనుకూలంగా ఉన్నాయని భావించిన వెంటనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని, ఉప ఎన్నికలో మళ్లీ పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుచరగణం ఉంది. 2020 మొదట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా కనిపించినా... మునుగోడులో మాత్రం పట్టు నిలుపుకున్నారు కోమటిరెడ్డి. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటిల్లోనూ కాంగ్రెసే మెజార్డీ డివిజన్లు గెలుచుకుంది. అందుకే తన గెలుపుపై ఫుల్ క్లారిటీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.   కాంగ్రెస్ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై సీరియస్ గా  చర్చిస్తోందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిపై అనర్హత పిటిషన్ వేసే ముందు.. మునుగోడు పరిస్థితిపై సర్వే చేయించాలనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారట. అక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటే మాత్రం రాజగోపాల్ రెడ్డిపై అనర్హత పిటిషన్ ఇవ్వకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.  అయితే మునుగోడు కాంగ్రెస్ కు బలమైన ప్రాంతమని, రాజగోపాల్ రెడ్డి వెళ్లినా అక్కడ మళ్లీ గెలిచే ఛాన్స్ కాంగ్రెస్ కు ఉందని కొందరు పీసీసీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మాత్రం ఆయనపై అనర్హత వేటు పడి మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక రావడం ఖాయమనే చర్చే ఎక్కువగా జరుగుతోంది.  మరోవైపు కోమటిరెడ్డి సోదరుల మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం నేపథ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే వెంకట్ రెడ్డి సీరియస్ గా తీసుకుని పని చేస్తారని చెబుతున్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటనతో మునుగోడు రాజకీయాలు వేడెక్కాయని తెలుస్తోంది.