టీపీసీసీ చీఫ్ గా చివరి నిమిషంలో జీవన్ రెడ్డి..?
posted on Jan 5, 2021 9:21AM
టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాబోయే పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్రెడ్డి అంటూ కొంతకాలంగా వార్తలు వచ్చినప్పటికీ.. అనూహ్యంగా సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్రెడ్డి చెపుతున్నారు. అయితే రేవంత్రెడ్డిని పీసీసీ చీఫ్గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరీ ముఖ్యంగా కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది.
మరోపక్క ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు మాత్రం రేవంత్రెడ్డికే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్రెడ్డిని పీసీసీ చీఫ్గా, రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ముఖ్యనేతలెవరూ ధ్రువీకరించడంలేదు. అలా అని ఖండించడమూ లేదు. దీంతో జీవన్రెడ్డి అధ్యక్షుడయ్యేందుకు 50-50 అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జీవన్రెడ్డి, డి.శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్ తదితర నేతల పేర్లను ఆమె పరిశీలించి.. ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించనున్నట్లు సమాచారం.