గ్రామ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే! టీడీపీ చెప్పేదే నిజమన్న మంత్రి 

ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన సచివాలయ వ్యవస్థగా గురించి జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటోంది. మహాత్మ గాంధీ కలను సాకారం చేశామని ప్రచారం చేసుకుంటోంది. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామని , వాలంటీర్లు వారియర్లుగా పని చేస్తున్నారంటూ వందల కోట్ల రూపాయలు ఖర్చు  పెట్టి జాతీయ స్థాయిలో ప్రకటనలు ఇచ్చుకుంటోంది. విపక్షాలు మాత్రం వాళ్లు వారియర్లు కాదు వైసీపీ కొరియర్లని విమర్శలు చేస్తున్నాయి. గ్రామ సచివాలయాల పేరుతో తమ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ నిధులు దోచి పెడుతున్నాపని మండిపడుతున్నాయి. ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా గ్రామ వాలంటీర్లు చేసే పనులేంటో చెప్పాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. అయితే తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రే  అసలు నిజాన్ని అంగీకరించారు. టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తున్నది నిజమేనని అంగీకరించిన ఆయన..  వైసీపీ కార్యకర్తలనే గ్రామ వాలంటీర్లుగా నియమించామని ఓపెన్ గానే చెప్పేశారు.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్  ఈ  వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో వైసీపీ  కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ధర్మాన.. కార్యకర్తలకు అండగా ఉంటామని చెబుతూ .. గ్రామ వాలంటీర్ల విషయంలో జరిగిన అసలు నిజాన్ని అంగీకరించారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించామని తెలిపారు. తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలెవరు అసంతృప్తికి గురి కావొద్దని, భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ధర్మాన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో  పాల్గొన్న ఎంపీ విజయ్‌సాయిరెడ్డి కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. కార్యకర్తలకు ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తామని.. ఆరు నెలల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది.  గ్రామ వాలంటీర్ల విషయంలో ముందు నుంచి తాము చెబుతున్నదే నిజమైందని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రే తమ ఆరోపణలు నిజమని అంగీకరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వాలంటీర్లు పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని, ఆ పార్టీ వాళ్లకే పనులు చేసి పెడుతున్నారని మండిపడుతున్నారు. వైసీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తామని విజయసాయి చెప్పడంపైనా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కార్ ప్రజలందరి కోసం ఉందా లేక  లేక ఓ వర్గం కోసమే పని చేస్తుందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కూరగాయల వల్లే ఏలూరులో వింత వ్యాధి! 

కరోనా మహమ్మారితో వణికిపోతుండగానే..ఏలూరులో  వెలుగుచూసి అందరిని కలవరపెట్టిన అంతు చిక్కని వ్యాధికి అసలు కారణమేంటో తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనపై నివేదిక ఇచ్చిన ఉన్నతస్థాయి కమిటీ ..  కూరగాయలే వింత వ్యాధికి కారణమని తేల్చింది. మంచినీటిలో కొన్ని కలుషితాలు ఉన్నప్పటికీ అస్వస్థతకు అది కారణం కాదని, కూరగాయలు కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది. ఏలూరు మార్కెట్ నుంచి కూరగాయలు వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో.. బాధితులు నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించారని ఉన్నతస్థాయి కమిటీ వివరించింది. జనం ఉన్నట్టుండి ఆసుపత్రి పాలు కావడానికి ఇన్ఫెక్షన్లు కారణం కాదని, అదే నిజమైతే బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని నిపుణుల కమిటీ పేర్కొంది. రక్త పరీక్షల ఫలితాలు కూడా అసాధారణంగా ఉండేవని తెలిపింది. పురుగు మందుల్లోని ఆర్గానో ఫాస్ఫేట్లు, ఆర్గానో క్లోరైడ్లలో ఏదో ఒకదాని వల్ల ఈ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని కమిటీ అభిప్రాయపడింది. బాధితుల రక్త నమూనాలతోపాటు, నీటి నమూనాల్లోనూ ఆర్గానో ఫాస్ఫేట్లు కనిపించాయని తెలిపింది. ఒకవేళ నిజంగానే ఆర్గానో ఫాస్ఫేట్ ఇందుకు కారణమైతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, దగ్గు, ఆయాసం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపించేవని పేర్కొంది. బాధితుల్లో ఆ లక్షణాలు లేవు కాబట్టి ఈ ఘటనకు ఆర్గానో ఫాస్ఫేట్లు కూడా కారణం కాదని కమిటి స్పష్టం చేసింది.  ఏలూరులో  వ్యాపించిన వింత వ్యాధి  సమస్యకు ఆర్గానో క్లోరైడ్ కారణమని కమిటీ అంతిమంగా ఓ నిర్ణయానికి వచ్చింది. వ్యాధి లక్షణాలు, కోలుకోవడాన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొంది. శరీరంలో చేరిన 24 గంటల తర్వాత పరీక్షిస్తే ఆర్గానో క్లోరైడ్ ప్రభావం కనిపించదని, అందుకే బాధితుల రక్తనమూనాల్లో అది లేదని వివరించింది. బాధితుల్లో చాలామంది రెండుమూడు రోజులుగా మాంసాహారం తీసుకోలేదు కాబట్టి కూరగాయల ద్వారానే అది శరీరంలోకి చేరి ఉంటుందని ఉన్నతస్తాయి నిపుణల కమిటీ అభిప్రాయపడింది. వింత వ్యాధి భారీన పడిన బాధితుల ఇళ్ల నుంచి సేకరించిన టమాటా, వంకాయలలో ‘మెట్రిబుజిన్’ అనే రసాయనాన్ని గుర్తించామని, సమస్యకు ఇదే కారణం అయి ఉండొచ్చని కమిటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మెట్రిబుజిన్‌ను ఇక్కడ రైతులు చాలా తక్కువ స్థాయిలో ఉపయోగిస్తారని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి సరఫరా వ్యవస్థను కొన్ని నెలలపాటు అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఓ అభిప్రాయానికి రావాలని నిపుణులు సూచించారు.  గత డిసెంబరు 4 నుంచి 12వ తేదీ మధ్య ఏలూరులో ఈ వింత వ్యాధి విజృంభించి తీవ్ర కలకలం రేపింది. 622 మంది ఈ వ్యాధి భారీన పడి హాస్పిటల్ లో చేరారు. వ్యాధికి అసలు కారణమేంటో తెలియక వైద్యులు కూడా చికిత్స చేసే సమయంలో ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్ బృందం కూడా ఏలూరు వచ్చి పరిశీలించింది. వింత వ్యాధికి కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటి నియమించింది. అప్పటి నుంచి పరిశోధనలు చేసిన కమిటి..  చివరికి కూరగాయలే కారణం కావచ్చంటూ నివేదిక ఇచ్చింది. అంతేకాదు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేసింది. నిషేధిత రసాయనాలు పొల్లాలోకి చేరకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని, ఉభయ గోదావరి జిల్లాల్లో నీటి నమూనాలను తరచూ పరీక్షించాలని ప్రతిపాదించింది.  కార్లు, ఇతర వాహనాలను సర్వీసింగ్ చేసిన నీరు ఏలూరు కాలువలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

చివరి నిమిషంలో ట్రంప్ తొండాట.. పోలీసు కాల్పులలో మహిళ మృతి 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ విజేత అయిన జో బైడెన్‌కు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. 306-232 ఓట్ల తేడాతో ఎన్నికలలో నెగ్గిన డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ను ఎలక్టోరల్‌ కాలేజీ ఓటర్లు ఈరోజు అంటే.. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం లాంఛనంగా ఎన్నుకోవలసి ఉంది. దీనికోసం అమెరికా కాంగ్రెస్‌ లోని ప్రతినిధుల సభ, సెనేట్‌ సంయుక్తంగా సమావేశం కానున్నాయి. అయితే ఈ ఎన్నికను అడ్డుకోవాలని ట్రంప్‌ తన మద్దతుదారులకు పిలుపు ఇవ్వగా దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో రాజధాని వాషింగ్టన్‌కు తరలివచ్చారు.   వారంతా వైట్‌హౌ్‌సకు కూతవేటు దూరంలోని ఫ్రీడమ్‌ ప్లాజాలో ప్రస్తుతం బైఠాయించారు. గడ్డకట్టే చలిలో.. ఒకపక్క నిరంతరం వర్షం కురుస్తున్నా వారంతా అక్కడి నుంచి కదలడం లేదు. ఎన్నికల సందర్భంగా ఓటింగ్‌, లెక్కింపులో అక్రమాలు జరిగాయని.. దీంతో ఎన్నిక రద్దుచేసి మళ్లీ జరిపించాలంటూ ట్రంప్‌ బృందం కోర్టులకు వెళ్లినా అక్కడ చుక్కెదురైంది. న్యాయపరమైన దారులు మూసుకుపోవడంతో.. ఇక ట్రంప్ కు మిగిలిన ప్రత్యామ్నాయమేమిటో అయన మద్దతుదారులకు కూడా అంతుపట్టడం లేదు. అయితే ట్రంప్‌ వ్యవహార శైలిపై సొంత రిపబ్లికన్‌ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.   "అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, మోసం జరిగాయని రాష్ట్రాలకు తెలుసు. తమ ఓట్లను సరిదిద్దాలని అవి భావిస్తున్నాయి. పెన్స్‌ చేయాల్సిందల్లా.. ఆ ఓట్లను వెనక్కి పంపడమే. అయన అలా చేస్తే మనదే విజయం. మైక్‌.. ఈ పని నువ్వు చేయాలి. దీనికోసం అత్యంత తెగువ చూపాల్సిన సమయమిది" అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తాను చెప్పినట్లు చేయకపోతే పెన్స్‌ రాజకీయంగా దెబ్బతింటారంటూ ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. మరోపక్క అధ్యక్షుడి సూచనను పెన్స్‌ తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి.   ఇటువంటి నేతలు అధికారం చేపడతారని బహుశా రాజ్యాంగ కర్తలు కూడా ఊహించి ఉండరేమో.. కనీసం ఇటవంటి నేతలు తమ ఓటమిని ఒప్పుకుని హుందాగా పదవి నుండి తప్పుకుంటే అందరికి గౌరవంగా ఉండేది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోని కొంత మంది నేతల తీరు మాత్రం.. "మొండి వాడు రాజు కంటే బలవంతుడు.. అయితే పరిపాలించే రాజే కనుక మొండివాడైతే.. బహుశా వారి ప్రవర్తన ట్రంప్ లాగే ఉంటుందేమో.." ఇలాంటి వారు తాము పరిపాలించే సమయంలో దేశాన్ని, ప్రజలను ఎం ఉద్దరించారో తెలీదు కానీ.. దిగి పోయేటపుడు మాత్రం ఏకంగా సామాన్యప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి వెనుకాడట్లేదు. తాజాగా అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద చేరిన ట్రంప్ మద్దతుదారులు గలభా సృష్టించి లోపలి దూసుకు వచ్చే ప్రయతం చేయగా .. వారి పై జరిగిన కాల్పులలో ఒక మహిళ మృతి చెందింది.   అమెరికాలో జరిగిన ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ స్పందించారు. వాషింగ్టన్‌లో జరిగిన హింసాత్మక ఘటన బాధ కలిగించిందన్నారు. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని, నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆటంకపరచడం సరికాదంటూ ట్వీట్ చేశారు.

జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్‌ కన్నీళ్లు .. సోషల్ మీడియాలో వైరల్

టీమ్‌ ఇండియా పేసర్‌ , హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌  కంటతడి పెట్టాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన  సిరాజ్.. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. సిడ్నీలో మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించిన సమయంలో ఈ హైదరాబాద్‌ పేసర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు.  ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. రెండు చేతులతో ఆ కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వీడియోను ట్వీట్ చేసింది.  సిరాజ్ కంటతడి పెట్టిన విజువల్స్ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో..  ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సిరాజ్ కంటతడి పెట్టిన దృశ్యాలను చూసి అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమి తొలి టెస్టులో గాయపడగా సిరాజ్‌ రెండో టెస్టుకు ఎంపికయ్యాడు.  తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే  ఐదు వికెట్లు తీసి  జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సిరాజ్. దీంతో  మూడో టెస్టులోనూ అతనికి అవకాశం వచ్చింది.  గురువారం మ్యాచ్‌ ప్రారంభమైన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు హైదరాబాద్ పేసర్.  మూడో టెస్ట్ మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే సిరాజ్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌, ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌(5)ను ఔట్‌ చేశాడు. నాలుగో ఓవర్‌లో ఓ చక్కటి బంతిని వేసి బోల్తా కొట్టించాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా ఊరించే బంతి వేయడంతో వార్నర్‌ స్లిప్‌లో పుజారా చేతికి చిక్కాడు. మూడో టెస్టులో సిరాజే భారత బౌలింగ్ కు ప్రధాన ఆయుధంగా మారాడు. 

కేటీఆర్ ఇప్పట్లో  ముఖ్యమంత్రి కాలేరా! నిఘా సంస్థల నివేదికలే కారణమా?  

తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయని కొంత కాలంగా జరుగుతున్న చర్చ ప్రచారంగానే మిగిలిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనపై కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఈ టర్మ్ మొత్తం కేసీఆరే పాలన చేస్తారని గులాబీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావించింది నిజమేనని.. కాని కొన్ని రోజులుగా ఆయన  మైండ్ సెట్ లో మార్పు వచ్చిందంటున్నారు కారు పార్టీ లీడర్లు. కేటీఆర్ ముఖ్యమంత్రి  అవుతారని గత ఏడాదిన్నరగా ప్రచారం జరుగుతోంది.  2019 మొదట్లో జరిగిన  మున్సిపల్ ఎన్నికలు కాగానే కేటీఆర్ ను సీఎం చేస్తారని చర్చ జరిగింది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల సమయంలో మళ్లీ ఆ అంశం తెరపైకి వచ్చింది. గ్రేటర్ ఫలితాల తర్వాత కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్నిఓపెన్ గానే చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఓ అడుగు ముందుకేసి.. మార్చి లోపు కేటీఆర్ సీఎం కావడం ఖాయమంటూ ముహుర్తం కూడా చెప్పేశారు. కొత్త సంవత్సరంలోని తొలి  రెండు, మూడు నెలల్లో కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయంగా ఉంటుందని అంతా భావించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రావడంతో.. కేటీఆర్ ను సీఎంను చేసే అంశంపై ఆయన కేంద్రం పెద్దలతో మాట్లాడారనే చర్చ కూడా జరిగింది. అయితే సడెన్ గా సీన్ మారిందంటున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్న నిర్ణయాన్ని  గులాబీ బాస్ మార్చుకున్నారని తెలంగాణ  భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది.   కేటీఆర్ ను సీఎం చేయడంపై కేసీఆర్ వెనక్కి తగ్గడానికి నిఘా వర్గాల సమాచారమే కారణమట. కేటీఆర్ ను సీఎం చేస్తే పార్టీలో ఎలా ఉంటుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి స్పందన ఉంటుందన్న దానిపై ఇంటిలిజెన్స్ తో సర్వే చేయించారట కేసీఆర్ . అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కాంగ్రెస్, కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ బ్యాచ్ లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము  చూసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే మంత్రి హరీష్ రావు కూడా పార్టీ నుంచి బయటికి రావొచ్చనే ప్రచారం కూడా ఉంది.   కేసీఆర్ పరిధిలో ఉండే రాష్ట్ర సంస్థలే కాదు కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇదే విషయాన్ని  నివేదించాయని చెబుతున్నారు. కేంద్ర సంస్థల సర్వే ఫలితాలు తెలుసు కాబట్టే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొన‌సాగుతార‌ని కచ్చితంగా చెప్పారంటున్నారు.  కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచ‌న కూడా కేసీఆర్‌కు లేద‌ని సంజయ్ చెప్పడానికి నిఘా సంస్థల రిపోర్టే కారణమంటున్నారు. నిజానికి కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని కొన్ని రోజులుగా చెబుతున్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారుతారని ప్రకటనలు చేయాలి. అందుకు భిన్నంగా కేటీఆర్ ఇప్పట్లో సీఎం కారని చెప్పడానికి కేంద్రం నుంచి అతనికి వచ్చిన ఇన్ పుట్స్ కారణం అయి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ  జరుగుతోంది. మొత్తానికి ఏ రకంగా చూసినా తెలంగాణకు మరో మూడేళ్ల వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని, కేటీఆర్ కు ఆ ఛాన్స్ లేదన్నదే టీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.   

అలసిపోయానంటూ.. ఒక డాక్టర్ పెట్టిన పోస్ట్ వైరల్ 

కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడి ప్రజల ప్రాణాలు రక్షించిన వారిలో డాక్టర్లు అందరికంటే ముందున్న సంగతి తెలిసిందే. అటువంటి ఒక డాక్టర్ పోస్ట్ చేసిన ఒక లెటర్ తాజాగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.   ఈ లెటర్ వివరాల్లోకి వెళితే... తమిళనాడులో సినిమా థియేటర్లలో వంద శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా కరోనా పూర్తిగా తగ్గని ప్రస్తుత పరిస్థితుల్లో పళని స్వామి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర చర్చజరుగుతోంది. ఒకపక్క పాతరకం కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న నేపథ్యంలో, కొత్త స్ట్రెయిన్ కేసులు కూడా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదనే వాదన ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఒక వైద్యుడు సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందన ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేసింది. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జేఐపీఎంఈఆర్) పుదుచ్చేరిలో రెసిడెంట్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అరవింద్ శ్రీనివాస్ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి ఇచ్చిన ఆమోదం పై ఆవేదనతో కూడిన పోస్ట్ చేశాడు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు హీరో విజయ్, శింబులను ఉద్దేశిస్తూ అతడు ఒక లేఖ రాశాడు.   ఆయన రాసిన లేఖ పూర్తి సారాంశం.. "నేను అలసిపోయాను. మేమంతా కూడా అలసిపోయాం. నాలాంటి వేలమంది వైద్యులు అలసిపోయారు. హెల్త్ కేర్ వర్కర్లు అలసిపోయారు. పోలీసు అధికారులు అలసిపోయారు. పారిశుద్ధ్య కార్మికులు అలసిపోయారు. ఊహించని ఉపద్రవం వల్ల జరిగిన నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు కింది స్థాయి సిబ్బంది నుంచి అందరం చాలా తీవ్రంగా శ్రమించాం. చూసేవాళ్లకు మేం పడిన కష్టం గొప్పగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మా ముందు ఎలాంటి కెమెరాలు లేవు. అంతేకాకుండా మేము ఎలాంటి స్టంట్ సీక్వెన్స్‌లూ చేయలేదు. మేము హీరోలం కూడా కాదు. కానీ.. మేం ఊపిరి పీల్చుకోవడానికి కొంత సమయం కావాలి. ఈ ఉపద్రవం ఇంతటితో అయిపోలేదు.  కరోనాతో ఇప్పటికీ కొంతమంది ప్రజలు చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడమంటే అది ఆత్మహత్యా సదృశ్యమే, అంతేగాక సామూహిక జన హననమే అవుతుంది. సినిమాను వంద శాతం ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఏ ప్రజాప్రతినిధి గానీ, హీరోలుగా చెప్పుకునే ఏ ఒక్కరూ సిద్ధంగా ఉండరు. కొంచెం నెమ్మదిగా ఆలోచించి, మా ప్రాణాలపై కూడా కాస్త శ్రద్ధ పెట్టి కనికరం చూపండి. ఇట్లు అలసిసొలసిన, ఓ నిస్సహాయ వైద్యుడు" ఇదీ కరోనా రోగుల సేవలో అలసిపోయిన ఓ వైద్యుడి ఆవేదన. ఇదిలా ఉండగా.. తమిళ సినీ పరిశ్రమకు చెందిన చాలామంది వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే.. ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసినప్పటికీ.. కొంతమంది మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పూర్తి స్థాయిలో ఇంకా కంట్రోల్ కాకుండానే థియేటర్లలోకి ప్రజలను అనుమతిస్తే.. రెండున్నర గంటల పాటు మూసి ఉంచే చోట వైరస్ ప్రబలడానికి చేతులారా అవకాశమిచ్చినట్టవుతుందని చెబుతున్నారు. ఈ నిర్ణయం ఎంత మాత్రం సరైంది కాదని నిపుణులు కూడా వాదిస్తున్నారు. సినీ పరిశ్రమ నష్టాల్లో ఉంటే ఆ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టి పెట్టాలి.. అంతేగానీ ఇలా నిర్మాతల వ్యాపారం కోసం అమాయకులను బలి చేయడం సరికాదని కొందరు వాదిస్తున్నారు. ఒకపక్క "మాస్టర్" సినిమా విడుదల నేపథ్యంలో సీఎం పళనిస్వామిని హీరో విజయ్ కలిసిన రోజుల వ్యవధిలోనే థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

 బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి! ఏపీలో ఆటలు సాగవన్న అంబటి

జగన్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బండి సంజయ్ కి కౌంటరిచ్చారు  వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.  బైబిల్ పార్టీకి ఓటేస్తారా? భగవద్గీత పార్టీకి ఓటేస్తారా? అంటున్నావు... నీకేం పోయే కాలం వచ్చింది? అంటూ బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది బైబిల్ పార్టీ మాత్రమే కాదని, భగవద్గీత పార్టీ, ఖురాన్ పార్టీ కూడా అని అంబటి ఉద్ఘాటించారు. ఈ మూడు కలిస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నాయకుడని విమర్శించారు అంబటి రాంబాబు.  రాజకీయ అజ్ఞానంతో బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ అంటూ పేర్లు పెట్టేశారని మండిపడ్డారు. అయినా నీకిదేం బుద్ధి? బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఎంతో పవిత్రమైనవి. ఓట్లు సంపాదిద్దామని వాటికి కూడా పార్టీలు పెట్టేశావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అన్ని మతాలతో సంబంధం ఉన్న పార్టీ అని అంబటి స్పష్టం చేశారు. ఈ బండి సంజయ్ ఎవరో కానీ తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కులాలు, మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకునే సంకుచిత పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తావులేదన్నారు అంబటి రాంబాబు. ఏదో ఒక రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకుని గెలిచి ఇక్కడ కూడా అదే చేద్దామనుకుంటే కుదరదన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న రాష్ట్రం. ఇక్కడ మీ ప్రయత్నాలు సాగవు. ధర్మం నాలుగు పాదాలపై నడుస్తున్న రాష్ట్రమిది. అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే రాష్ట్రమిది అంటూ అంబటి రాంబాబు వివరించారు.   

అదానీని ఆటాడుకుంటున్న నెటిజన్లు!  గంగూలి అనారోగ్యంతో చిక్కులు 

అదానీనీ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.. అవును మీరు చదివింది నిజమే... భారత దేశంలో దిగ్గజ వ్యాపార సంస్థగా ఉన్న అదానీ గ్రూప్ ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. సెటైర్లు, జోకులు పేలుస్తూ ఆ గ్రూప్ కు చిక్కులు తెప్పిస్తున్నారు. దీనంతటికి కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ. దాదాకు గుండెపోటు రావడంతో అదానీ గ్రూపుకు డేంజర్ సిగ్నల్ పడింది. గంగూలీకి గుండెపోటు వస్తే.. అదానీ గ్రూప్ సంస్థకు సమస్యేంటని అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు తిరకాసు.. ఆదానీ గ్రూప్ విల్మార్ కంపెనీకి  చెందిన ‘ఫార్చ్యూన్ రైస్‌బ్రాన్ ఆయిల్‌’కు దాదా బ్యాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటమే ఆ సమస్యకు కారణం.  ఆ కంపెనీ యాడ్‌లో ఆరోగ్యమైన గుండె కోసం, రోగ నిరోధకశక్తిని పెంచేందుకు ఫార్చ్యూన్ రైస్‌బ్రాన్ ఆయిల్‌ వాడాలని ప్రజలకు సూచిస్తారు సౌరబ్ గంగూలీ. జనాలకు అరోగ్య చిట్కా చెప్పిన వ్యక్తే .. ఇప్పుడు గుండెపోటుకు గురి కావడంతో ఆ యాడ్ తీవ్ర విమర్శల పాలైంది.      గంగూలికి గుండెపోటు రావడంతో అదానీ విల్మార్ ఫార్చ్యూన్ రైస్ బ్రాండ్ ఆయిల్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు, జోకులు పేలుతున్నాయి.  అదానీ కంపెనీ ఆయిల్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్రాండ్ అంబాసిడర్‌కే గుండె పోటని కామెంట్లు పెడుతున్నారు. ఫార్చ్యూన్ ఆయిల్ వాడవద్దని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అదాని కంపెనీ ఆయిల్ వాడటం వల్ల గుండెపోటు వస్తుందని ప్రచారం చేస్తున్నారు. సినీ, క్రీడాకారులతో ఎక్కువగా ప్రకటనలు చేసే కంపెనీల యాడ్స్ ఎంత ఫాల్స్ అన్నది... దాదా ఘటనతో మరోసారి రుజువైందని కొందరు కామెంట్లు పెట్టారు. అలా  బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ గుండెపోటు ఆదానీ విల్మార్ కంపెనీ  కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది.  గుంగూలికి గుండెపోటు, తమ కంపెనీ ప్రోడక్ట్ పై వస్తున్న విమర్శలతో అప్రమత్తమైన అదానీ గ్రూప్.. చాలా తెలివిగా ఆ ప్రకటనను నిలిపివేసింది. అంతేకాదు గుంగూలి అన్ని ప్రకటనలను ఆపేసింది. ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక.. ఆయనతో మాట్లాడి కొనసాగిస్తామని  తెలిపింది. అయితే దీనిపైనా విమర్శలు వచ్చాయి. దీంతో అదానీ విల్మార్ గ్రూప్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంది.  సౌరవ్ గంగూలీని తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తామని ప్రకటించింది. "మేము సౌరవ్‌తో కలిసి పనిచేయడం కొనసాగిస్తాము మరియు అతను మా బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు.  మా వాణిజ్య ప్రకటనలో తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నామని అదానీ విల్మార్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంగ్షు మల్లిక్ చెప్పారు. అంతేకాదు ఫార్చ్యూన్ బ్రాండ్‌ను డిఫెండింగ్ చేస్తూ.. తాము  ఉత్పత్తి చేస్తున్నది మెడిసిన్ కాదు.. వంటనూనే మాత్రమేనని తెలిపారు. ఆరోగ్య సమస్యలకు ఇది కారణం కాదన్నారు. ఆహార మరియు వంశపారంపర్య సమస్యలు  గుండె జబ్బులను ప్రభావితం చేస్తాయని మల్లిక్ చెప్పుకొచ్చారు.   ఇంట్లో ట్రేడ్‌మిల్ చేస్తుండగా హార్ట్ ఎటాక్‌కు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ శనివారం స్థానిక వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దాదా హార్ట్‌లో మూడు బ్లాక్స్ గుర్తించిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి ఒక స్టెంట్ వేశారు. దాంతో దాదాకు ప్రాణాపాయం తప్పింది.  దాదా ఇంకా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. 

మాటలు కాదు చేతల్లో చూపిస్తాం! కొడాలికి బాలయ్య కౌంటర్

ఆంధ్రప్రదేశ్ లోని హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు, జగన్ సర్కార్ తీరు, వైసీపీ నేతల ఆరోపణలపై హిందూపురం  ఎమ్మెల్యే బాలకృష్ణ  ఘాటుగా స్పందించారు.  టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. న్యాయం, చట్టంపై ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడితే తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయన్నారు బాలయ్య. నోరు అదుపులో పెట్టుకో ... మేం మాటల మనుషులం కాదు, అవసరమైతే చేతలు కూడా చూపిస్తామనిహెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని బాలయ్య స్పష్టం చేశారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన బాలకృష్ణ  రైతుల సమస్యలు తెలుసుకున్నారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేయడం  చాలా కిరాతకమన్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇలాంటి  ఘటనలను ఖండించమేకాదు.. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి రథంపై మూడు వెండి సింహాలు మాయమైనా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంతర్వేధిలో రథం దగ్ధం.. శ్రీరాముడు, సీత విగ్రహాల ధ్వంసం ఇలా చాలా జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఇచ్చారని, మరి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? అని బాలయ్య ప్రశ్నించారు. ఒకసారి మనమంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని.. ఇప్పటినుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 

నాపై విష ప్రయోగం జరిగింది.. ఇస్రో ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా ఫేస్‌బుక్‌ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని ఆయన ఫేస్‌బుక్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇంతకాలం గోప్యంగా ఉంచిన ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నట్టు చెప్పారు.    2017 మే 23న  ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనను చంపేందుకు కుట్ర జరిగిందని తెలిపారు. ఆరోజు తాను తీసుకున్న ఆహరంలో విషపూరిత రసాయనాన్ని కలిపారని పేర్కొన్నారు. ఈ కారణంగా తాను అనారోగ్యం పాలయ్యాయని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డానని, చర్మంపై దద్దుర్లు రావడంతో పాటూ అరచేతిపై చర్మం పెచ్చులుగా ఊడిపోయిందని చెప్పారు. తనపై ఆర్సెనిక్‌ అనే రసాయన ప్రయోగం జరిగినట్టు ఎయిమ్స్ రిపోర్టును కూడా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో జత చేశారు.    గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ రాడార్‌ ఆధారిత ప్రాజెక్టుకు సీనియర్‌ శాస్త్రవేత్తగా ఉన్న తనను తొలగించడమే ఈ దాడి వెనుక కారణం అయి ఉండొచ్చని తెలిపారు. ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని, ఓ సహోద్యోగి కూడా దీనిపై ముందే అలర్ట్‌ చేశారని అన్నారు. అందువల్లే వైద్యులకు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విష ప్రయోగం జరిగిన రెండు, మూడు గంటల్లోనే తాను చనిపోయి ఉండేవాడినని తెలిపారు. ఈ చీకటి నిజాన్ని బహిర్గతం చేయవద్దంటూ ఇప్పటికీ తనకు వందలాది మెయిల్స్‌ వస్తున్నాయని అన్నారు. గతేడాది సెప్టెంబర్ ‌లోనూ తనపై విష ప్రయోగం చేయాలని విఫలయత్నం చేసినట్లు తెలిపారు. గత కొన్నాళ్లుగా డైరెక్టర్లతో చర్చించినా ఫలితం లేదని, ఈ ఘటనపై ఇప్పటికైనా ప్రభుత్వం దర్యాప్తు జరపాలని మిశ్రా కోరారు. కాగా, స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన తపన్ మిశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.

పార్టీకి ప్లస్సా.. మైనస్సా? సంజయ్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో చర్చ

తెలంగాణలో దూకుడు రాజకీయాలతో పాపులర్ అయిన బండి సంజయ్.. తొలిసారి ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు సంబంధించి తనదైన శైలిలోనే జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. డైరెక్ట్‌‌గా మత గ్రంథాలను బేస్ చేసుకొని చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు బండి సంజయ్.  ఏపీ ప్రజలు బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలని కామెంట్లు చేశారు. ఆలయాలపై దాడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. అయితే ఏపీ బీజేపీకి మాత్రం సంజయ్ కామెంట్లు ఇబ్బందిగా మారాయనే చర్చ జరుగుతోంది.   ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జనసేనతో కలిసి బీజేపీ పని చేస్తోంది. రెండు పార్టీలు కలిసే ఉద్యమాలు చేస్తున్నాయి. త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ బీజేపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థే పోటీ చేస్తారని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. ఆలయాలపై దాడులకు నిరసనగా ఉద్యమిస్తున్నా.. ఎక్కడా మతాల పరంగా  మాట్లాడటం లేదు బీజేపీ, జనసేన నేతలు. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నోవా క్రిస్టియన్. అందుకే  బీజేపీ నేతలు కూడా మతాల విషయంలో కూల్ గానే ఉంటున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఇప్పుడు కొత్త వాదన వస్తోంది. ఒక క్రిస్టియన్‌ను మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి .. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. ఏపీ ప్రజలకు బైబిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలని సంజయ్ ఎలా మాట్లాడారన్న పాయింట్‌ను కొందరు తెరమీదకు తీసుకువస్తున్నారు. బీజేపీకి కూడా ఇది పెద్ద సమస్యగానే మారిందంటున్నారు.   అంతేకాదు గతంలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులందరినీ ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపుతామని హామీ ఇచ్చింది. ఇంకా చాలా రాష్ట్రాల్లో క్రిస్టియన్ల కోసం అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు పూర్తిగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా బండి సంజయ్ మాట్లాడితే... జనాలు ఎలా అర్థం చేసుకుంటారనే చర్చ  నడుస్తోందట. తెలంగాణలో పార్టీ బలోపేతానికి హిందుత్వ కార్డునే ప్రధాన అస్త్రంగా వాడుతోంది బీజేపీ. గ్రేటర్ ఎన్నికల్లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారమంతా ఎంఐఎం టార్గెట్ గానే సాగింది. అందువల్లే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. కాని  తెలంగాణతో పోలిస్తే ఏపీలో మత పరమైన రాజకీయాలు చాలా తక్కువ. అందుకే బండి సంజయ్ అలా మాట్లాడాల్సింది కాదనే అభిప్రాయం ఏపీ బీజేపీలోనే వస్తుందంటున్నారు.   ఆలయాలపై దాడులను ఖండిస్తూ ఏపీ ప్రభుత్వంపై ఎంత ఘాటుగా విమర్శలు చేసినా సమస్య కాదని.. కాని బైబిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలా అన్న వ్యాఖ్యలే తమకు కొంత ఇబ్బందిగా మారాయని కొందరు నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ల టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తూ.. క్రిస్టియన్ ను పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ తో కలిసి ప్రచారం ఎలా చేస్తామన్న అభిప్రాయం కొందరు కమలం నేతల నుంచి వస్తుందట. అందుకే ఏపీ బీజేపీ నేతలు కూడా డ్యామేజీ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. తమది హిందుత్వ పార్టీ కానీ, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేయడమే ఇందుకు ఉదాహరణ. విశాఖలో మాట్లాడిన సోము వీర్రాజు ఈ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ కామెంట్లతో వచ్చిన ఇబ్బందిని చక్కదిద్దేందుకే సోము ఈ కామెంట్లు చేశారని చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణలో దూకుడు రాజకీయాలతో అదరగొట్టిన బండి సంజయ్.. ఏపీ రాజకీయాలపై మాత్రం కొంత తొందరపడ్డారనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వస్తోందని తెలుస్తోంది. 

ఏపీలో ఉప ఎన్నిక సందడి.. జగన్ మదిలో ఉన్నది ఎవరు?

ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు షెడ్యూల్ విడుదలైంది. జనవరి 11న నోటిఫికేషన్ విడుదలకానుంది. 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు వెల్లడించనున్నారు.    కాగా, పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి 2023 వరకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో పార్టీల బలాలు చూస్తే ఈ ఎమ్మెల్సీ స్థానం వైసీపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పదవి కోసం వైసీపీలో ఆశావహులు పోటీపడుతున్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పోతుల సునీతకే మళ్లీ జగన్ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని నెలల క్రితం చనిపోయిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో జగన్ ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశముందని అంటున్నారు. మరోవైపు, ఇటీవల మరణించిన చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు చల్లా భగీరథరెడ్డికి కూడా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. మరి జగన్ వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారో లేక మరో కొత్త పేరును ఖరారు చేస్తారో చూడాలి.

తొండి సంజయ్.. నాలుక చీరేస్తాం! వరంగల్ టీఆర్ఎస్ నేతల వార్నింగ్  

తెలంగాణలో  అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై వరంగల్ టీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. బండిపై  ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘‘నీది నోరా...? మోరా..? ’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వినయ్ భాస్కర్. సీఎం కేసీఆర్‎ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదని మండిపడ్డారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తాం అంటూ బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.  బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెటుకొని ఉండాలన్నారు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని.. లేదంటే ఖబడ్దార్ అంటూ బీజేపీ నేతలను హెచ్చరించారు వినయ్ భాస్కర్.  మంగళవారం వరంగల్ లో పర్యటించిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్‌ తోపేం కాదు. పచ్చి దగుల్బాజీ, బడాచోర్‌, మూర్ఖుడు  అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. మద్యం తాగి పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్‌.. ఫామ్‌ హౌస్‌కే పరిమితమయ్యారనీ, ప్రజలను కలవని ఏకైక ముఖ్యమంత్రి ఈయనేనని బండి మండిపడ్డారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించి వరంగల్‌ను మజ్లిస్‌ అడ్డాగా మార్చేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారన్నారు బండి సంజయ్.  

ఏపీకి రూ.344 కోట్ల రివార్డు ప్రకటించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రివార్టును ప్రకటించింది. పౌర సేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకు గాను ఈ రివార్డును అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. 'వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు', 'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌', 'పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణల'ను అమలు చేయడంలో ఈ రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి. కాగా రివార్డులో భాగంగా కేంద్రం ప్రత్యేక సహాయం కింద ఈ రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1004 కోట్ల రివార్డును ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.344 కోట్లు, మధ్యప్రదేశ్‌ కు రూ. 660 కోట్ల ప్రత్యేక సహాయం కేంద్రం నుంచి అందనుంది.

జగన్ సర్కారు వేలాది ఆలయాలను కబ్జా చేసింది!  మాజీ ఐపీఎస్ సంచలనం

ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు కలకలం రేపుతుండగానే వైసీపీ ప్రభుత్వంపై  మాజీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ ఏపీలో  వేలాది ఆలయాలను కబ్జా చేసిందని మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మన్నెం నాగేశ్వరరావు ఆరోపించారు.  చర్చ్‌లు, మసీదులను వదిలేసి.. ఏపీ సర్కారు 24,846 ఆలయాలను కబ్జా చేయడం ఎంత వరకు సెక్యులర్ అని ఆయన ప్రశ్నించారు. అనవసర రాద్ధాంతం వద్దని జగన్ భావిస్తే.. ఆలయాలను హిందూ సమాజానికి తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సిక్ గురుద్వారా చట్టం తరహాలో చట్టం చేస్తారా? అని ప్రశ్నించారు. మీరు ఆసక్తి చూపితే దాని గురించి నేను ప్రజెంటేషన్ ఇస్తానని మన్నెం నాగేశ్వరరావు ట్వీట్ చేశారు. ఏపీలో హిందూ దేవాలయాలను కబ్జా చేశారంటూ సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ చేసిన ఆరోపణలు పెను దమారం రేపుతున్నాయి. హిందూ టెంపుల్స్ పై దాడులు జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదనే  ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే వరుస ఘటనలు జరుగుతున్నాయని హిందూ సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. ఆ వివాదం జరుగుతుండగానే.. మన్నె నాగేశ్వరరావు చేసిన ఆరోపణలు ఏపీలో ప్రకంపనలు స్పష్టించే అవకాశం ఉంది. 

కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ అరెస్ట్.. 

తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియను హైదరాబద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను కూడా అరెస్ట్ చేసారు. కూకట్ పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్ సమీపంలో వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వాహనంలోనే పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే ఈ కేసులో తమపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అఖిల ప్రియ తెలిపారు. తన భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. భార్గవ్‌కు ఈ కిడ్నాప్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయలేదని.. తనకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు మీడియాకు తెలుపుతానన్నారు. కేవలం ఒక వైపు వాదనలు విని... తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని ఆమె మీడియాను కోరారు. మీడియా అంటే తమ కుటుంబానికి చాలా గౌరవం ఉందని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు.   ఇదిలా ఉండగా.. గతరాత్రి కిడ్నాప్‌కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ముగ్గురు సీఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు. అంతేకాకుండా వీరు సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. ఐటీ అధికారులమంటూ గతరాత్రి ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్‌ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వికారాబాద్‌లో గుర్తించారు. భూమా నాగిరెడ్డి బ్ర‌తికి ఉన్న స‌మ‌యం నుండే త‌మ మ‌ధ్య ఈ భూవివాదం ఉన్న‌ట్లు కిడ్నాప్ కు గురైన సీఎం కేసీఆర్ బంధువులు ప్ర‌వీణ్ రావు పోలీసుల‌కు తెలిపిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా.. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్రహాస్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. హాఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే అఖిలప్రియ దంపతులను బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ లో విచారించిన తరువాత కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.

మాజీ ఉద్యోగి ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా!  రతన్ టాటాపై ప్రశంసల వరద 

ఆయన దేశంలోనే ఒక బడా వ్యాపార వేత్త. సంపదను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.. అయితే మానవత్వాన్ని చాటుకోవడంలోనూ ఆయనకు ఎవరూ సాటిలేరని నిరూపించారు. అతనే టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా. పరిచయం అక్కర్లేని పేరది. దేశంలో అత్యంత సంపన్నులలో ఒకరైన రతన్ టాటాకు వ్యాపార రంగంలో మిత్రులే తప్ప శత్రువులు లేరంటే ఆయన హుందాతనం, వ్యక్తిత్వం ఏంటన్నది చెప్పవచ్చు. రతన్ టాటా మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. టాటా కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి అనారోగ్యం గురించి తెలుసుకున్న రతన్ టాటా ఆయన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి టాటా కంపెనీలో ఉద్యోగం చేశారు. కానీ అనారోగ్య కారణంగా జాబ్ కు రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఉద్యోగి యోగేశ్ దేశాయ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న రతన్ టాటా మానవత్వం చాటుకున్నారు. ముంబై నుంచి పూణేలోని ఫ్రెండ్స్ సొసైటీలో నివాసం ఉంటున్న ఉద్యోగి ఇంటికి స్వయంగా వెళ్లారు. యోగేష్ నీ ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ముంబై నుంచి పుణె వెళ్లారు రతన్‌ టాటా.  యోగేశ్ దేశాయ్  తన లింక్డ్ ఇన్ ఖాతాలో టాటా పర్యటన గురించిన వివరాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తమ కంపెనీలో పనిచేసిన ఓ ఉద్యోగి పట్ల రతన్‌ చూపించిన ఔన్నత్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. తమ ఉద్యోగులు ఏమైపోతే మాకేంటి అని అనుకుంటోన్న ఇలాంటి రోజుల్లో మాజీ ఉద్యోగి పట్ల ఇంత మార్యాదతో ఉండడం గొప్ప  విషయమని నెటిజన్లు రతన్ టాటాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన దగ్గరి నుంచి బిజినెస్‌మెన్లు, ఎంట్రప్రెన్యూర్లు చాలా నేర్చుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగి పట్ల ఆయన కమిట్‌మెంట్‌ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.  రతన్ టాటా గతంలోనూ అనేక సందర్భాల్లో ఇలా పెద్ద మనసు చాటుకున్నారు. ముంబైపై ఉగ్రదాడులు జరిగిన వేళ, తన సంస్థల్లో పనిచేస్తూ బాధితులుగా మారిన 80 మంది ఉద్యోగుల కుటుంబాలను కలిసిన ఆయన, వారి పిల్లల చదువులకు అవసరమైన సాయం చేశారు

ఏపీ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా అరూప్‌కుమార్ గోస్వామి ప్రమాణం 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్ పుష్పగుచ్ఛంతో జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు పాల్గొన్నారు. మొన్నటివరకు హైకోర్టు సీజేగా ఉన్న జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ కాగా.. ఆయన స్థానంలో అరూప్ కుమార్ గోస్వామి నియమితులైన సంగతి తెల్సిందే. అంతకు ముందు అరూప్ కుమార్ సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.

గాలిలోనూ కరోనా వైరస్ కణాలు! సీసీఎంబీ పరిశోధనలో తేలిన నిజాలు 

కరోనా కణాలు గాలిలో ఉంటాయా.. ఉంటే ఎంత పరిధి వరకు ప్రభావం చూపిస్తాయి .. ఓపెన్ ప్లేస్ లో కరోనా వైరస్ ఎంత కాలం ఉండగలుగుతుంది.. ఇవన్ని కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి క్లారిటీ లేకుండా ఉన్న ప్రశ్నలే. కరోనా వైరస్ కణాలు గాలిలో ఉంటాయా  లేదా అన్న విషయంలో ఒక్కో రీసెర్చ్ సంస్థ ఒక్కో అభిప్రాయం చెప్పడంతో  పూర్తి క్లారిటీ రాలేకపోయింది. అయితే తాజాగా దీనిపై సమగ్రమైన వివరణ ఇచ్చింది సీసీఎంబీ.  కరోనా పేషెంట్ల కోసం కేటాయించిన ఆసుపత్రుల ఆవరణలోని గాలిలో, ఐసీయూ-ఐసొలేషన్ వార్డుల్లోని ఉపరితల వాతావరణంలో కరోనా వైరస్ కణాలు ఉన్నట్లు గుర్తించింది.  పాజిటివ్ పేషెంట్లను వార్డుల్లోకి పంపడానికి ముందు, వారికి చికిత్స అందించిన తర్వాత  డిశ్చార్జి అయిన ఆరేడు గంటల తర్వాత తీసుకున్న గాలి నమూనాల్లో వైరస్ తేడాలను సీసీఎంబీ విశ్లేషించింది. హైదరాబాద్ నగరంలోని మూడు ఆసుపత్రులు. పంజాబ్‌లోని మొహాలి మూడు ఆసుపత్రుల్లో సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం జరిపారు.   హైదరాబాద్‌లో సెప్టెంబరు-నవంబరు మాసాల మధ్య 41 శాంపిళ్ళను సేకరించగా.. మొహలిలో  జూలై-డిసెంబరు మధ్యలో 23 శాంపిళ్ళను సేకరించి ఆ ప్రయోగాలు జరిపారు. గాలిలో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి నమూనాలను ప్రత్యేక పద్ధతుల్లో సేకరించి,  ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతిలో లాబ్‌లో పరీక్షలు చేశారు. కరోనా వార్డుల్లో మాత్రమే గాలిలో ఈ వైరస్ ఉన్నట్లు. నాన్-కొవిడ్ వార్డుల్లో లేదని తేలిందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు.  కరోనా పేషెంట్లు ఉన్న వార్డుల్లో ఫ్యాన్, ఎయిర్ కండిషన్ వినియోగం ఉన్నప్పుడు, అవి లేనప్పుడు వేర్వేరుగా శాంపిళ్ళు తీసుకుని పేషెంట్ బెడ్‌కు ఎంత దూరం వరకు గాలిలో వైరస్ ఉందో పరీక్షించినట్లు తెలిపారు. ఫ్యాన్ లేదా ఏసీ ఉన్నప్పుడు గది మొత్తం వైరస్ ఆవరించిందని, అవి లేనప్పుడు క్లోజ్డ్ రూమ్‌గా ఉన్నచోట గరిష్ఠంగా 12 అడుగుల దూరం వరకు వ్యాపించినట్లు తెలిపారు. ఇక పేషెంట్‌లో కరోనా తీవ్రతకు, గదిలో ఉన్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా వైరస్ తీవ్రత కూడా ఎక్కువ ఉన్నట్లు తేలిందన్నారు. అధ్యయనం లోతుగా జరిగేందుకు ఒక పాజిటివ్ పేషెంట్‌ను వార్డులో ఒక మూలకు ఉంచి కొన్ని గంటల తర్వాత శాంపిళ్ళను సేకరించామని, తక్కువ తీవ్రత కలిగిన పేషెంట్లు ఉంటే.. గాలిలో తక్కువ దూరంలో వైరస్ ఉన్నట్లు తేలిందని రాకేశ్ మిశ్రా చెప్పారు ఒక పాజిటివ్ రోగిని  ఫ్యాన్, ఏసీ లేని గదిలో రెండు గంటల సేపు ఉంచిన తర్వాత రెండు మీటర్ల వరకు గాలిలో వైరస్ వ్యాపించిందని ఆయన వివరించారు. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి మాస్కును మించిన వ్యాక్సిన్ లేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా మరోసారి  స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్కులే సోషల్ వ్యాక్సిన్లని చెప్పారు.  మాస్కును ధరించడమే వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గమన్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్కు, హ్యాండ్ వాష్.. ఈ మూడు కరోనా నుంచి దూరంగా ఉండడానికి చాలా ఉపయోగకరమన్నారు. పాజిటివ్ పేషెంట్లు ఐసొలేషన్‌లో ఉండడం ద్వారా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడవచ్చని, ప్రతి ఒక్కరూ ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కరోనా నుంచి తొందరగా బయట పడగలుగుతామన్నారు  సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా.