బీజేపీది మత రాజకీయమన్న పవన్! తెగతెంపులు ఖాయమేనా? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. త్వరలో తిరుపతి లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. తిరుపతిలో పోటీ చేయాలని జనసేన భావిస్తుండగా.. తామే పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు ఏపీ కమలం నేతలు. దీంతో ఇరు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు మాట తప్పుతుందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల తీరుపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కుడా అసహనంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ, జనసేన పొత్తుపై అనుమానాలు వస్తున్న సమయంలో  ఏపీలో  తాజా రాజకీయ పరిణామాలు,  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేలా  ఆయన కామెంట్లు చేశారు.  ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించిన పవన్ కల్యాణ్.. మతం పేరిట రాజకీయాలు చేయడం ఇష్టం లేకే తాను రామతీర్థం వెళ్లలేదని  చెప్పారు. మత సామరస్యం కోసం రాజకీయ లబ్ధిని వదులుకుంటానని స్పష్టం చేశారు. మత ప్రస్తావన లేని రాజకీయాలే జనసేన సిద్ధాంతమన్నారు. రామతీర్థం ఘటనకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాముడి విగ్రహం ధ్వంసమైన రామతీర్థానికి టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి.   రామతీర్థం ఘటనలపై  పవన్ కల్యాణ్  చేసిన కామెంట్లతో..  బీజేపీ చేస్తున్నది కూడా మత రాజకీయమేనని ఆయన చెప్పినట్టేననే చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలపై ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలంటూ సంజయ్ చేసిన కామెంట్లు జనసేనకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్. ప్రస్తుతం ఏపీలో  జనసేనతో బీజేపీ పొత్తు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో... క్రిస్టియన్ భార్యగా ఉన్న పవన్ కల్యాణ్ పార్టీతో బీజేపీ పొత్తు ఎలా పెట్టుకుందనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. ఆ ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేకపోయాయి బీజేపీ, జనసేన. బండి ప్రకటన తర్వాత నుంచి బీజేపీపై పవన్ కల్యాణ్ కొంత అసంతృప్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత రాజకీయాలంటూ బీజేపీని ఇరుకున పెట్టేలా పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  తిరుపతి ఉప ఎన్నికపైనా హాట్ కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో కనుక జనసేన నిలిస్తే ఏడు నియోజకవర్గాల్లోనూ తానే ప్రచారం చేస్తానని చెప్పారు. అభ్యర్థిపై మరో వారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం మరోమారు సమావేశం కానున్నట్టు చెప్పారు. ఒకవేళ జనసేన కాకుండా బీజేపీ నిలిస్తే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసినట్టు బలంగా పోటీ చేయాలని కోరారు పవన్ కల్యాణ్. పార్టీ నేతలకూ కూడా ఈ విషయం స్పష్టం చేశారు. జనసేన అభ్యర్థి పోటీలో ఉంటనే పవన్ ప్రచారం చేస్తారా.. బీజేపీ బరిలో ఉండే ఆయన ప్రచారానికి రారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా జనసేన నేతలు , పవన్ కల్యాణ్ తాజా కదలికలను బట్టి తిరుపతిలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.

స్టార్ట్ కెమెరా యాక్షన్.. వ్యాక్సినేషన్ సినిమా చూపించారుగా!!

భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు వేస్తున్నారు. అయితే వ్యాక్సిన్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రైల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సినేషన్ ప్రారంభించడంతో.. వ్యాక్సిన్ సురక్షితమా? కాదా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో టీకాపై సామాన్యుల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాల్సిన వైద్యాధికారులు.. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నవ్వులపాలవడంతో పాటు.. వ్యాక్సిన్ పై నమ్మకాన్ని పోగొడుతున్నారు.   కర్నాటకలోని తుమ్మూరులో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలి రౌండ్ టీకాలను స్థానిక డీఎంవో నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్స్‌పాల్ రజనీలకు వేయాలి. అయితే వారు వ్యాక్సిన్ వేయించుకోకుండా.. వేయించుకున్నట్టు నటిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. సిబ్బంది వారికి టీకా ఇస్తున్నట్లు నటించారు. ఇక నాగేంద్రప్ప, రజనీలు కూడా అదే స్థాయిలో నటనలో లీనమయ్యారు. అయితే వీళ్లు నటించిన 'వ్యాక్సినేషన్ డ్రామా' అనే రియల్ మూవీ మేకింగ్ వీడియో లీక్ అయింది. దీంతో వీళ్ళ యాక్టింగ్ బండారం బయటపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో వైద్యాధికారుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. వైద్యాధికారులకు కూడా వ్యాక్సిన్‌పై నమ్మకం లేదా?.. ఇలా అయితే ప్రజలకు వ్యాక్సిన్ పై నమ్మకం ఎలా కలుగుతుంది? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపాల్సిన అధికారులే ఇలా నటిస్తారా?.. వ్యాక్సిన్ వేయించుకోకుండా నటించిన ఆ అధికారులను వెంటనే డిస్మిస్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు వైద్యాధికారులు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు నటించలేదని, అంతకుముందే వ్యాక్సిన్ తీసుకున్న వారు.. కేవలం మీడియా కోసం పోజ్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఇందులో నిజనిజాలు తెలియాల్సి ఉంది.

కేటీఆర్ కు జై కొట్టిన జగ్గారెడ్డి! 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు జై కొట్టారు. ఏంటీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సపోర్ట్ చేశారంటే ఆయన  గులాబీ గూటికి చేరబోతున్నారని అనుకుంటున్నారా... అయితే అలాంటేది లేదు. జగ్గారెడ్డి కేటీఆర్ కు జై కొట్టింది ముఖ్యమంత్రి పదవి విషయంలో. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్పుకుంటే తదుపరి సీఎం ఎవరూ అవుతారన్న అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా తండ్రులు ముఖ్యమంత్రిగా దిగిపోతే.. కొడుకులే ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని చెప్పారు. కొడుకు ఉండగా అల్లుడిని సీఎం చేసిన నేతలెవరు ఇప్పటివరకు లేరని తెలిపారు జగ్గారెడ్డి.  కేసీఆర్ దిగిపోతే. ఆ స్థానంలో కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అంతేకాదు మొదటి నుంచి మంత్రి హరీష్ రావును వ్యతిరేకింటే జగ్గారెడ్డి.. ఈ విషయంలోనూ ఆయన్ను మరోసారి టార్గెట్ చేశారు.  తెలంగాణలో జరగబోతున్న సీఎం మార్పు కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే జరగబోతోందనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు జగ్గారెడ్డి.  కేటీఆర్ సీఎం కావడం వల్ల బీజేపీకే ఉపయోగమని... తెలంగాణలో బీజేపీ కొత్త ఆటను ప్రారంభిస్తుందని చెప్పారు.   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని  తెరపైకి తెచ్చారని... సాధారణ ఎన్నికల సమయానికి ఏ దేవుడిని తీసుకొస్తారో? అని సెటైర్లు వేశారు.   సీఎం  కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటున్న బండి సంజయ్.. ఏ కేసులో జైలుకు పంపిస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు జగ్గారెడ్డి. బండి సంజయ్ మాటలు వినీవినీ బోరు కొడుతోందని చెప్పారు.  ఏ ఆధారంతో కేసీఆర్ ను జైల్లో పెడతారని టీఆర్ఎస్ నాయకులు కూడా అడగడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలది పాలోళ్ల పంచాయితీ అన్నారు జగ్గారెడ్డి. అన్నదమ్ముల పిల్లలు సాధారణంగా పగలంతా కొట్టుకుంటూ ఊరంతా పరేషాన్ చేస్తుంటారని... రాత్రి కాగానే అందరూ కల్లు దుకాణం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారని... ఈ పార్టీలది కూడా అదే తీరుగా ఉందని విమర్శించారు. ఈ మూడు పార్టీలు పగలు కొట్టుకుంటూ, రాత్రి మాట్లాడుకుంటాయని.. ప్రజల కోసం పని చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.

క‌రోనా టీకా వేయించుకున్న ఆరోగ్య‌శాఖ మంత్రి!

భార‌త్ బ‌యోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన క‌రోనా టీకా కొవాగ్జిన్‌ ను త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి.విజ‌య‌భాస్క‌ర్ ఈ రోజు తీసుకున్నారు. ఇటీవ‌ల తొలి ద‌శ వ్యాక్సినేష‌న్‌ ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొద‌టి ద‌శ‌లో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. తాను కూడా వైద్యుడు కావ‌డంతో విజ‌య‌భాస్క‌ర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా తీసుకున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్‌ ద్వారా తెలిపిన మంత్రి..  ఓ డాక్ట‌ర్‌ గా, ఐఎంఏ స‌భ్యుడిగా టీకా వేసుకున్న‌ట్లు చెప్పారు. హెల్త్ వ‌ర్క‌ర్ల‌లో విశ్వాసాన్ని నింపేందుకే తాను టీకా తీసుకున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాలని విజ‌య‌భాస్క‌ర్ అన్నారు.   కాగా, దేశంలో తొలి ద‌శ వ్యాక్సినేష‌న్‌ ప్రారంభమయ్యాక కొందరు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైల్స్ పూర్తిచేయకుండానే వ్యాక్సినేష‌న్ ప్రారంభించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, వ్యాక్సిన్ సేఫ్ అయితే ముందు ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ తీసుకోవాలని చూపించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ మంత్రి వ్యాక్సిన్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. మంత్రి చర్యతో వ్యాక్సిన్ పై వ్యక్తమవుతున్న అనుమానాలు తొలగిపోతాయేమో చూడాలి.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అశోక్ గెహ్లోట్ నేనా..?

ఎన్నో ఏళ్ళ నుండి వారసత్వం గా, అధికారికంగా కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కి, వారసుడు కరువయ్యాడా.. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షత పగ్గాలు పట్టనంటున్నాడా.. ? ఇంతకీ రాహుల్ రాజకీయాలకు పనికొస్తాడా.. ? లేదా.. ?   దేశంలో జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ప్రాచీనమైనదనే చెప్పుకోవాలి.. దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలమైన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ.. 1885 నుండి అటు వారసత్వంగా గానీ, ఇటు అధికారికంగా గానీ, తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది.. గతంలో సోనియా గాంధీ అధ్యక్షత వహింస్తుండగా.. వివిధ కారణాల వల్ల ఆ పదవిని రాహుల్ గాంధీ కి అప్పగించింది.   రాహుల్ గాంధీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సహంతో పరుగెడుతుందనుకున్న కార్యకర్తల్లో నిరుత్సహమే మిగిలింది.. రాహుల్ నాయకత్వం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. గత ఎన్నికల్లో ఊహించిన ఫలితం రాకపోవడంతో రాహుల్ గాంధీ అధ్యక్షత పదవి కి రాజీనామా చేశారు .. ఆ తరువాత గత కొద్దికాలంగా ఆ పదవి బాధ్యతలు సోనియా గాంధీ నిర్వహిస్తున్నారు.. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న ప్రశ్న అధ్యక్షత పదవి ఎవర్ని వరిస్తుందని.. మరోమారు తిరిగి అధ్యక్షత నిర్వహించడానికి రాహుల్ గాంధీ అయిష్టంగా ఉన్నారు.. ఆ పార్టీ నేతల్లో కూడా అదే తీరు వినిపిస్తుంది.. గతంలో ఇలాంటి ప్రస్తావనే వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ లో గాంధీ కుటుంబానికి దగ్గరి పరిచయం ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పేరు వినిపించింది.. కానీ అందుకు తాను సుముఖంగా లేను అని చెప్పేశారు. అయితే ఇప్పుడు కూడా అధిష్టానం అధ్యక్షత పదవికి అశోక్ గెహ్లోట్ పేరును పార్టీ ముందుకు తీసుకువచ్చింది.. అశోక్ గెహ్లోట్ ను అధిష్టానం ఢిల్లీ కి రమ్మని కబురు పంపింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ రథసారథి ఎవరో తేలుతుందో లేదో చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ ల మధ్య వార్!  ఉత్తరాది, దక్షిణాది వారిగా చీలిక! 

తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న సివిల్ సర్వెంట్ల మధ్య కోల్డ్ వార్ సాగుతోందా?  ఉత్తరాది, దక్షిణాది వారిగా  ఉన్నతాధికారులు విడిపోయారా? తెలుగు ప్రాంత  అధికారులు  సొంత గడ్డలోనే  చీత్కారాలకు గురవుతున్నారా? అంటే సచివాలయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. పాలనకు అత్యంత కీలమైన  ఐఏఎస్ లో  విభజన వచ్చిందని తెలుస్తోంది. పేరుకేమో తెలుగు రాష్ట్రాలైనా.. ప్రస్తుతం ఇక్కడి ప్రభుత్వాల్లో  పెత్తనమంతా బయటివారిదే నడుస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పాలనకు కేంద్రం ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో సీఎస్ గా ఉత్తరాది వ్యక్తులే ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా   ఆథిత్యదాస్ ఉండగా.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ ఉన్నారు. వీళ్లిద్దరిది బీహార్ రాష్ట్రమే. వీళ్లే కాదు దాస్ కు ముందు ఏపీ సీఎస్ గా ఉన్న నీలం సాహ్నీది ఉత్తరాదే. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమెను ఏరికోరి మరీ తెచ్చుకుని సీఎస్ పోస్టింగ్ కట్టబెట్టారు జగన్ రెడ్డి. ఇక తెలంగాణలో సోమేష్ కుమార్ కంటే ముందు సీఎస్ గా పని చేసిన ఎస్కే జోషి కూడా ఉత్తరాది వ్యక్తే. తెలంగాణ తొలి సీఎస్ రాజీవ్ శర్మ, తొలి డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే.  ఏపీ సీఎస్సే  కాదు సీఎంవోలోనూ ఉత్తరాది అధికారులదే పెత్తనమని తెలుస్తోంది. ఏపీ సీఎంవోలో ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాషే కీలక పాత్ర పోషిస్తున్నారని,సీఎం జగన్ కూడా ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు.  ఏపీకి చెందిన అధికారులు సీఎంవోలో ఉన్నా..  వారంతా నామ్ కే వాస్తాగానే మిగిలిపోయారట. అంతేకాదు ఢిల్లీ నుంచి  తెచ్చుకుని సీఎస్ గా నియమించుకున్న నీలం సాహ్నీ కూడా ఇప్పుడు  సీఎం  ముఖ్య సలహదారుగా ఉన్నారు. త్వరలోనే ఆమెను ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎంవోలోనూ ఉత్తరాది అధికారులే హవా సాగిస్తున్నారట. ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్న రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మలే  ప్రభుత్వంలో  కీలక పనులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. సీఎంవోలో ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే చర్చ సచివాలయంతో పాటు ప్రగతి భవన్ లో జరుగుతోంది.  ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉత్తరాది అధికారులు ఉండటంతో పాలనంతా వాళ్ల కనుసన్నలోనే జరుగుతోందని తెలుస్తోంది. ఉత్తరాదికి చెందిన ఉన్నతాధికారులు... కింది స్థాయిలోనూ తమవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. కీలక శాఖల్లో పోస్టింగులు వారికే కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు చెబుతున్నారు.  సొంత గడ్డలోనూ బయటి ప్రాంతాల అధికారుల ముందు చిన్నచూపుకు గురవుతున్నారని వాళ్లంతా ఆవేదన చెందుతున్నారని చెబుతున్నారు. ఈ కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్ లో డివిజన్ వచ్చిందంటున్నారు. ఉత్తరాది అధికారులంతా ఒక గ్రూపుగా.. మిగితా ప్రాంతానికి చెందిన ఐఏఎస్ లు మరో గ్రూపుగా చీలిపోయారంటున్నారు.    తెలంగాణ సచివాలయంలో అయితే  సీఎస్ సోమేష్ కుమార్ కు.. దక్షిణాదికి చెందిన  సీనియర్ ఐఏఎస్ లకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సచివాలయం రాకపోవడంతో .. సీఎం తరహాలోనే సీఎస్ సచివాలయంలో సమాంతర వ్యవస్థను సాగిస్తున్నట్లు చెబుతున్నారు. పాలనకు సంబంధించి కీలక విషయాల్లో ఉత్తరాది అధికారులనే సీఎస్ సంప్రదిస్తున్నారని అంటున్నారు. దక్షిణాది అధికారులు కలవాలని చూసినా.. సీఎస్ గంటలకొద్ది వాళ్లను వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇది నచ్చని కొందరు అధికారులు సోమేష్ కుమార్ ను  ప్రశ్నించారని, దీంతో విభేదాలు పెరిగిపోయాయని తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన  అధికారులు తనకు సహకరించకపోవడంతో వారిపై సీఎస్ సోమేష్ కుమార్ నిఘా పెట్టారని,  వారి  కదలికలను పసిగట్టే బాధ్యత తనకు అనుకూలంగా ఉండే ఉత్తరాది అధికారులకు అప్పగించారని సమాచారం.   సివిల్ సర్వెంట్ల మధ్య గ్యాప్ ప్రభావం పాలనపైనా పడుతుందనే అభిప్రాయం కొందరు అధికారుల నుంచి వస్తోంది.  అందుకే ఇటీవల ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలన్ని వివాదాస్పదమవుతున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ తీసుకున్న చాలా నిర్ణయాలను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో పలు విధానపరమైన నిర్ణయాలను సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకున్నారు. ధరణి పోర్టల్, ఎల్ఆర్ఎస్ విషయాల్లో అదే జరిగింది. మొత్తానికి సొంత గడ్డలో తెలుగు ప్రాంతాలకు చెందిన అధికారులు అవమానాలకు గురి కావడంతో పాటు ఉత్తరాది వారితో పాలన కూడా సరిగా జరగడం లేదన్న అభిప్రాయం ఏపీ, తెలంగాణ నిపుణులు, మేథావులు, జనాల నుంచి వినిపిస్తోంది.  

రేవంత్ రెడ్డికి కేటీఆర్ భయపడ్డారా? కూకట్ పల్లికి నై.. సికింద్రాబాద్ కు సై! 

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి  మంత్రి కేటీఆర్ భయపడుతున్నారా?  ఫైర్ బ్రాండ్ లీడర్ ముందుకు  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు రావడం లేదు? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణమాలు, కేటీఆర్ పర్యటనలు చూస్తున్న వారికి ఇవే అనుమానాలు వస్తున్నాయి. భయమో లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారో తెలియదు కాని.. ఎంపీ రేవంత్ రెడ్డి ఎదురుపడే అవకాశం ఉన్న కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉంటున్నట్లు మాత్రం కనిపిస్తోంది.  కూకట్ పల్లి,  సికింద్రాబాద్  నియోజకవర్గాల్లో జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. మల్కాజ్ గిరి ఎంపీ పరిధిలోకి వచ్చే కూకట్ పల్లి సెగ్మెంట్ లో బుధవారం జీహెచ్ఎంసీ నిర్వహించిన కార్యక్రమాలకు.. ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో  డుమ్మా కొట్టారు కేటీఆర్. అయితే గురువారం సికింద్రాబాద్ లో జరిగిన ప్రొగ్రామ్ కు మాత్రం హాజరయ్యారు. దీంతో  రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  భయపడుతున్నారని కాంగ్రెస్ కేడర్ పెద్ద ఎత్తున ప్రచారం  చేస్తోంది.  బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించాల్సి ఉంది. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేశారు. అయితే  చివరి నిమిషంలో కేటీఆర్ ఆ కార్యక్రమాలకు హాజరు కాలేదు.  కూకట్ పల్లి నియోజకవర్గం మల్కాజ్ గిరి ఎంపీ పరిధిలోకి వస్తుంది. దీంతో కూకట్ పల్లి కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ కు ఆహ్వానం వెళ్లింది. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రులతో కలిసి ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనరు. కాని రేవంత్ రెడ్డి మాత్రం అధికారులు ఇచ్చిన షెడ్యూల్ కంటే ముందే కూకట్ పల్లికి వచ్చేశారు. రేవంత్ రెడ్డి వచ్చారని పార్టీ నేతల నుంచి తెలుసుకున్న కేటీఆర్.. తాను రాకుండా ఇతర మంత్రులతో కార్యక్రమం జరిగేలా చూశారని చెబుతున్నారు.  కేటీఆర్ చివరి నిమిషంలో డుమ్మా కొట్టడంతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి కూడా వారితో కలిసి పాల్గొన్నారు. ఇద్దరు మంత్రులు ఉన్నా.. కేటీఆర్ రాకపోవడంపైనే కూకట్ పల్లి నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారింది.  బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలకు హాజరు కాని కేటీఆర్.. గురువారం సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి ఎంపీ పరిధిలోకి రాదు.  సో.. రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం లేదు కాబట్టే రైల్వే ఉద్యోగుల కార్యక్రమానికి కేటీఆర్ వచ్చారన్నది కాంగ్రెస్ కార్యకర్తల వాదన.  ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో  వైరల్ చేస్తున్నారు. స్థానిక  సమస్యలపై రేవంత్ రెడ్డి నిలదీస్తారనే కేటీఆర్.. ఆయన ముందుకు రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో రేవంత్ రెడ్డికి ఎదురుపడటానికి కేటీఆర్ భయపడుతున్నారనే చర్చ సామాన్య జనాల నుంచి వస్తోంది. అయితే ఇటీవల ఎల్బీ నగర్ నియోజకవర్గంలో  గొడవ జరిగింది. లోకల్ ఎమ్మెల్యేతో పాటు బల్దియా అధికారులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అలాంటి ఘటన జరిగే అవకాశం ఉందన్న కారణంతోనూ కేటీఆర్ రాకపోయి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు.  తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పిలుస్తుంటారు.   సీఎం కేసీఆర్ పై గత ఏడేండ్లుగా పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీపై ఆయన చేసే ఆరోపణలు, విమర్శల వల్లే రేవంత్ రెడ్డి క్రేజీ పెరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ రెడ్డి.. ఇటీవల మరింత దూకుడు పెంచారు. పీసీసీ రేసులో ముందున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు సాగుతున్నారు. రేవంత్ రెడ్డి తమపై ఎంతగా ఆరోపణలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడు స్పందించరు. రేవంత్ రెడ్డిపై మాట్లాడితే.. తర్వాత ఆయనిచ్చే కౌంటర్లు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వల్లే కేసీఆర్ కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉంటారనే చర్చ కూడా పొలిటికల్ సర్కిళ్లలో ఉంది. 

పంచాయతీ ఎన్నికల తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతాం: మంత్రి నాని 

ఏపీలో పంచాయతీ ఎన్నికలు యధావిధిగా జరపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. సుప్రీంకోర్టుకు వెళ్తామని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై మంత్రి నాని స్పందించారు. ఎన్నికల కంటే తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఎస్ఇసి నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రాన ఎన్నికల కోడ్ అమలు కాదని ఆయన స్పష్టం చేసారు. ఈ విషయంపై తాము న్యాయ నిపుణులు, అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దీ రోజుల క్రితం షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే.   కరోనా వ్యాక్సిన్ పంపిణీ కారణంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్లో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా విధులు నిర్వహించేలా ఒత్తిడి చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు.   ఇది ఇలా ఉండగా గత నెలలో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెల్సిందే. కరోనా బాధితులు, 65ఏళ్లు దాటిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చంటూ 27/A రూల్ ను సవరిస్తూ ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ను సుప్రీం కోర్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధమౌతున్నారు.

ఆయన సలహాతో అమరావతి ఇన్‌సైడర్ తీర్పుపై సుప్రీంకు ఏపీ సర్కార్..!  

ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించే స‌మ‌యంలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్న జగన్ సర్కార్ వాద‌న‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చుతూ తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ తీర్పుపై కోర్టులో మళ్ళీ అప్పీల్ కు వెళ్లాలని ప్రభుత్వం ఒక ప్రాథ‌మిక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తీర్పును హైకోర్టు డివిజ‌న్ బెంచ్ లో స‌వాల్ చేయాలా…? లేక నేరుగా సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలా… అన్న అంశంపై జగన్ స‌ర్కార్ తర్జనభర్జన ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అనే పదం చ‌ట్టాల్లో లేద‌ని కోర్టు తేల్చి చెప్పినందున ఈ కేసులో సీబీఐ ద‌ర్యాప్తు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని వారు భావిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు తీర్పును.. ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం అనధికారిక న్యాయసలహాదారుగా వ్యవహారిస్తున్న ఆయన అభిప్రాయం మేర‌కు… హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.   2019 ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ఒక ప్రచార అస్త్రంగా వాడుకున్న వైసీపీ ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం పై ఏ క్షణమైనా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారని చెబుతున్నారు. మరోపక్క అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేకపోతే ఇక కేసులే ఉండవని… దీంతో తాము ఇంతకాలం చేస్తున్న అమరావతిలో అవినీతి జరిగింది అనే ఆరోపణలకు విలువ ఉండదు కాబట్టి ఈ తీర్పుపై స్టే కోసం… అయితే అటు హైకోర్టు డివిజన్ బెంచ్ కి లేదంటే.. ఇటు సుప్రీంకోర్టుకు అయినా సరే వెళ్లాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రజాస్వామ్య  ప్రభుత్వమా ? ఆటవిక పాలనా?

ప్రజాస్వామ్య  ప్రభుత్వమా ? ఆటవిక పాలనా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో సగటు ఆంధ్రుడికి వస్తున్న సందేహమిది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడైనా ప్రజా సంక్షేమంపై ఫోకస్ చేస్తాయి. కాని ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితే కనిపించడం లేదు.  ప్రజల బాగోగుల కంటే .. తన ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపైనే జగన్ రెడ్డి సర్కార్  ఫోకస్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను అరెస్ట్  కాగా.. తాజాగా జరిగిన సీనియర్ రాజకీయ నేత కళా వెంకట్రావు అరెస్టుతో జగన్ రెడ్డి సర్కార్ లక్ష్యమేంటో మరోసారి స్పష్టమైంది. టీడీపీ నేతల అరెస్టుల పరంపరంలో భాగంగా  ఆ పార్టీ  సీనియర్‌ నేత, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిమిడి కళావెంకటరావును బుధవారం రాత్రి విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా , వివాదరహితుడిగా పేరున్న కళాను అరెస్ట్ చేయడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.        కళాను అరెస్ట్ చేయడమే కాదు అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఆయనపై పోలీసులు ప్రవర్తించిన తీరు మరీ దారుణంగా ఉంది.  ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలకు కళాను బాధ్యుడిని చేస్తూ  నెల్లిమర్ల  పొలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సీఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కళా వెంకటరావు ఇంటిని, కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. సీఐ శ్రీధర్‌తో పాటు మరికొంత మంది పొలీసులు నేరుగా కళా వెంకటరావు గృహంలోకి ప్రవేశించారు. కళా వెంకటరావుతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు, ఇతర సిబ్బంది చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయనను ఇంటి బయటకు తీసుకువచ్చారు. ఆయనను మాత్రలు కూడా వేసుకోనివ్వలేదని కళా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫోన్‌ చేసుకునేందుకు రెండు నిమిషాల పాటు సెల్‌ఫోన్‌ను అందజేశారు. కళా వెంకటరావు ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి బయటకు  వస్తుండగా...   చేతిలోని సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనను వాహనం వద్దకు తీసుకువచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు  ప్రయత్నించగా... ఆయనను  బలవంతంగా వాహనంలోనికి తోసివేశారు.   కళా వెంకటరావు తనతో పాటు తీసుకువెళ్లాల్సిన లగేజీ బ్యాగు కింద పడిపోయింది. బ్యాగును ఇచ్చేందుకు వ్యక్తిగత సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని సైతం పొలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన్ని తరలిస్తున్న వాహనం వెనుకడోర్‌ సైతం వేయకుండానే అక్కడి నుంచి కదిలిపోయారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి పొలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటలు దాటాక కూడా కళాను చీపురుపల్లి స్టేషన్‌లోనే ఉంచారు.  రాత్రి 11గంటల సమయంలో 41 నోటీసుపై విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానన్న పూచీకత్తుపై ఆయన్ను విడిచిపెట్టారు. కళా వెంకట్రావును అరెస్ట్ చేయడం.. అది కూడా అర్ధరాత్రి వేళ... హడావుడిగా తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. సుదీర్ఘ రాజకీయ నేతగా ఉన్న కళాపై పోలీసుల తీరును పార్టీలకతీతంగా అంతా ఖండిస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా.. మచ్చలేని నాయకుడిగా, సాధుస్వభావుడిగా పేరొందిన కళావెంకటరావును అరెస్ట్‌ చేయడంతో  అభిమానులు, పార్టీశ్రేణుల్లో ఆందోళన నెలకొంది.  సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా కళావెంకటరావు అరెస్టయ్యారని చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన నాటి నుంచి నేటివరకూ కళా వెంకటరావు అనేక పదవులు పొందారు. ఎన్టీ రామారావు హయాంలో వాణిజ్యపన్నులు, పురపాలక, హోం శాఖామంత్రిగా పనిచేశారు. ప్రతిష్టాత్మకమైన టీటీడీ  ఛైర్మన్‌గా వ్యవహరించారు. చంద్రబాబునాయుడు కూడా ఆయనకు ప్రాధాన్యం కల్పించారు. ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా కళా కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఏనాడూ ఆయనపై ఒక్క పోలీస్‌ కేసు కూడా నమోదు కాలేదు. అటువంటి నాయకుడిపై తొలిసారిగా కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.                           జగన్‌ రెడ్డి పాలనను ఆటవిక పాలనగా కళావెంకటరావు అభివర్ణించారు. ఏపీలో చీకటి రాజ్యం కొనసాగుతోందని ఆరోపించారు. రామతీర్థంలో జరిగిన సంఘటనను అడ్డం పెట్టుకుని తనను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. కళా వెంకట్రావు అరెస్టుపై భగ్గుమంటున్నారు టీడీపీ నేతలు. ఉగ్రవాదుల్లా రాత్రిపూట కళా వెంకట్రావు అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. తిరుపతి ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం వైసీపీకి పట్టుకుందని, కళా అరెస్ట్‌కు వైసీపీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. అరెస్ట్‌లతో తెలుగుదేశం పార్టీని, నాయకులను భయపెట్టలేరని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. రామతీర్థం సంఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా? అని  ప్రశ్నించారు. కనీసం మాత్రలు కూడా వేసుకోనివ్వకుండా బలవంతంగా అరెస్ట్‌ చేయడాన్ని మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతి ఖండించారు.   

పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్! జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్  

పంచాయతి ఎన్నికల అంశంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు షాకిచ్చింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్. ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ పై స్టే విధిస్తూ  గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టి వేసింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని ఏపీ ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.  ప్రజా రోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనన్న హైకోర్టు ధర్మాసనం.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్ వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ఇప్పట్లో వద్దని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడం.. జరిగి తీరాల్సిందే అన్నట్లుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ముందుకు సాగుతున్నారు.  ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది.నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూల్ పై ఏపీ సర్కార్ హైకోర్టుకు వెళ్లగా. సింగిల్ బెంచ్ ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ పై స్టే విధించింది. సింగిల్ బెంచ్ తీర్పు ఎస్ఈసీ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా.. మూడు రోజుల క్రితం వాదనలు జరిగాయి. గురువారం  రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది.  ఏపీ ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 23న తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉంది. హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పుతో  నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.  

విజయసాయిరెడ్డిపై చెప్పులదాడి కేసులో కళా వెంకట్రావు అరెస్ట్.. విడుదల 

విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించిన సమయంలో అయన వాహనంపై చెప్పులతో దాడి జరిగిన కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకటరావును గత రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేసారు. అయన భోజనం చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ చేసారు. అంతేకాకుండా ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు ఎవరికీ చెప్పలేదు. చివరికి ఆయనను చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడ ఆయనకు స్టేషన్ బెయిల్ ఇస్తున్నట్లుగా చెప్పి.. స్టేట్‌మెంట్ తీసుకుని విడుదల చేశారు.   విడుదల అయిన తర్వాత కళా వెంకటరావు మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా దేవుడి కోసం టీడీపీ పోరాటం ఆగదని అన్నారు. తాము ప్రజలతోనే ఉంటామని, వారి కోసం పోరాడుతూనే ఉంటామని అయన అన్నారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాగ్రహానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. రామతీర్థం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటని కళా వెంకటరావు ప్రశ్నించారు.   ఇది ఇలా ఉండగా పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంత బలవంతంగా కళా వెంకట్రావును అరెస్ట్ చేయడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయన గురించి తెలిసిన వారు అయితే.. ఎవరితోనూ కళా కనీసం పరుషంగా కూడా మాట్లాడే వ్యక్తి కాదు. కనీసం గొంతు పెంచి గద్దించే స్వభావం కూడా ఆయనకు లేదు. సాధారణంగా రాజకీయాల్లో ఉండే నాయకులపై కనీసం రాస్తారోకో.. ధర్నా వంటి కేసులైనా ఉంటాయి. కానీ.. కళా వెంకట్రావు మొత్తం రాజకీయ జీవితంలో అయన మీద మాత్రం ఒక్క కేసు కూడా లేదు.. కానీ రామతీర్థం ఘటనలో ఎవరో విసిరిన వాటర్ బాటిళ్లు, చెప్పులు వేశారని.. దానికి కళా వెంకట్రావు కారణం అని ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ కేసులో ఇప్పటికే ఇతరుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కళాను కూడా అరెస్ట్ చేశారు.

దొరికిన దుర్గమ్మ రథం వెండి సింహాల ఆచూకీ..! 

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోని రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమవడం పై తీవ్ర కలకలం రేగిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక నేరస్తుడిని విచారిస్తుండగా వెండి సింహాల మాయం కు సంబంధించిన విషయాలు తెలిసాయి. ఈ కేసు విషయంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. తానే ఆ వెండి సింహాలను అపహరించానని ఒప్పుకున్నాడు. అయితే ఆ వెండి విగ్రహాలను అతడు తునిలోని ఒక జ్యూయలరీ షాపులో విక్రయించినట్లుగ తెలుస్తోంది. దాదాపు 16 కిలోల బరువున్న మూడు వెండి విగ్రహాలను షాపు యజమాని కరిగించేసినట్లుగా విచారణలో తేలింది. దీంతో పోలీసులు షాపు యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు నిందితుడు బాలకృష్ణ అరెస్ట్‌ను పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు.

16 నెలలు చిప్ప కూడు తిన్నా బుద్ది మారలేదు.. విజయసాయిరెడ్డికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "16 నెలలు చిప్పకూడు తిన్నా జగన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి బుద్ధి మారలేదు. అదే దొంగ బతుకు ఇంకెన్నాళ్లు? ఇంకెంత కాలం మీ ఫేక్ ప్రచారం? అందుకే మిమ్మల్ని ఫేక్ గాళ్ళు అనేది'' అంటూ అయ్యన్న మండిపడ్డారు. ''శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పట్టణంలో పాలేశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న 3 రోడ్ల జంక్షన్ వెడల్పు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి దిమ్మ కూడా అప్పుడే ఏర్పాటు చేసారు. పాలేశ్వరస్వామి దేవాలయం ధర్మకర్తలు చెట్టు దగ్గర ఉన్న పాత నంది విగ్రహాన్ని ఆ దిమ్మపై ప్రతిష్టించారు'' అని అయ్యన్న వివరించారు.   అయితే ''నంది విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టడానికి వైసీపీ నాయకులు అసత్య ప్రచారం మొదలుపెట్టారు. గ్రామస్తుల సమక్షంలో అందరూ చూస్తుండగానే విగ్రహ ప్రతిష్ఠ జరిగితే సిసి టివి ఫుటేజ్ అంటూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?'' అని అయన ఈ సందర్భంగా ఎంపీని నిలదీశారు. అసలు ''జరిగింది విగ్రహ ప్రతిష్ఠ అయితే టిడిపి నేతలు విగ్రహం ధ్వంసం చేసారంటూ ఫేక్ ప్రచారం ఏంటి సాయిరెడ్డి? హిందూ దేవతా విగ్రహాలు ధ్వంసం చేసానంటూ ప్రకటించిన వాడిని, వాడి వెనుక ఉన్న మత మార్పిడి మాఫియా పెద్దలను తప్పించడానికి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ధర్మమే గెలుస్తుంది. తప్పు చేసిన వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు అన్న విషయం జగన్ రెడ్డి కి బాగా తెలుసు కదా'' అని అయ్యన్న పేర్కొన్నారు.   అయితే అంతకుముందు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లో ''మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాజకీయ ఉనికి కోసం నీచానికి తెగబడుతోంది పచ్చపార్టీ. టెక్కలిలో శివాలయంలో ఉన్న నంది విగ్రహం తొలగింపే దీనికి ఉదారహరణ. ఇది చాలు రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం వెనుకున్నవారెవరో చెప్పడానికి? సీసీ కెమెరా దృశ్యాలపై చంద్రన్న, అచ్చన్నా ఏమంటారు?'' అంటూ ఒక వీడియోను జత చేశారు.

అనంతలో ఆగని వైపీపీ నేతల అరాచకాలు!  కంకర క్రషర్‌పై ఎమ్మెల్యే  తనయుడి దాడి! 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది.  ప్రజా ప్రతినిధులే స్వయంగా దాడులకు పాల్పడుతుండటంతో ఇతర నేతలు, కార్యకర్తలు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల వరుసగా జరిగిన దాడి ఘటనలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపగా.. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.  రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలోని ఓ కంకర క్రషర్‌పై దాడి చేశారు. 20 ద్విచక్ర వాహనాల్లో వచ్చిన దాదాపు 30 మంది దుండగులు బీభత్సం సృష్టించారు. కంప్యూటర్‌ గది, జేసీబీలను ధ్వంసం చేశారు. క్రషర్‌లో పనిచేస్తున్న కార్మికులపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.  వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం కాగా కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో కార్మికులు ఫిరోజ్‌, సద్దాం, ఇజ్రాయెల్‌, తిమ్మేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాయదుర్గం అర్బన్‌ సీఐ వీరన్న ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు అనుచరులతో కలిసి దాడికి పాల్పడినట్లు క్రషర్‌ యజమాని లక్ష్మీదేవి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 

నాకో న్యాయం.. నా బావమరిదికో న్యాయమా.. జేసీ ప్రభాకర రెడ్డి సూటి ప్రశ్న 

ఏపీలోని పోలీసు అధికారుల సంఘం, వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపైన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మండి పడ్డారు. నా భార్య సోదరుడు అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి.. 3 సార్లు ఎస్పీని దూషిస్తే ఇప్పటివరకు కేసుల్లేవు. కానీ నేను ఏమీ మాట్లాడకపోయినా కడప జైలు నుంచి వస్తుంటే, నేను ఏదో అన్నానని పోలీసు అధికారుల అసోసియేషన్ అంటోంది. కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారు. ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ ఉంది. "నాకో న్యాయం?… నా బావమరిదికో న్యాయమా? జెండా ఒక్కటే డిఫరెన్స్. నాది పచ్చది.. వాళ్ళది బ్లూ కలర్" అని వ్యాఖ్యానించారు.   "పోలీస్ అసోసియేషన్ ఎవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ని రోజులు సజ్జల చేతుల్లో ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ఐఏఎస్ ఆఫీసరా? సాక్షి పేపర్‌లో అయన కథలు రాసుకునే వాడు. కథలు రాసేవాడు పోలీసులను ఆదేశిస్తే.. మీరెందుకు ఐఏఎస్, ఐపీఎస్ అవసరమా? ఎందుకు కష్టపడి చదివి శిక్షణ తీసుకున్నారు. మీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇకనైనా మారండి. అసలు మీరెవ్వరు మా ఇంట్లోకి రావడానికి.. మా ఇంట్లోకి వచ్చి మరీ మాపై కేసులు పెడతారా? పోలీసు అసోసియేషన్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో రూలా?" అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీస్ వ్యవస్థను నిలదీశారు.

జోబైడెన్ టీమ్ లో కరీంనగర్ యువకుడు! పోతిరెడ్డిపేట ప్రజల సంబరాలు 

అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ టీమ్ లో తెలంగాణ యువకుడికి చోటు దక్కింది.  వైట్ హౌజ్ స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా కరీంనగర్ జిల్లాకు చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి 1970లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసేందుకు అమెరికా వెళ్లి ఆక్కడే స్థిర పడ్డారు. నారాయణరెడ్డి ముగ్గురు కొడుకుల్లో వినయ్ రెడ్డి ఒకరు. అమెరికాలో లా కంప్లీట్ చేసిన వినయ్ రెడ్డి మొదట యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ కు స్పీచ్ రైటర్‌గా పని చేశారు.  2012 అమెరికా ఎన్నికల సమయంలో అప్పటి డెమెక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి  బరాక్ ఒబామాకు, బైడెన్లకు స్పీచ్ రైటర్ గా వ్యవహరించారు వినయ్ రెడ్డి. తాజా ఎన్నికల్లో బైడైన్, కమలా హారిస్ లకు స్పీచ్ రైటర్ తో పాటు ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు. వినయ్ రెడ్డి పనితీరు బాగుండటంతో ఇప్పుడు వైట్ హౌజ్ డైరెక్టర్ గా  అతన్ని అపాయింట్మెంట్ చేశారు జోబైడెన్. తమిళనాడు సంతతికి చెందిన కమలా హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగా ఆమెతో పాటు, ప్రెసిడెంట్ జో బైడెన్ లకు స్పీచ్ రైటర్ కం ట్రాన్స్‌లేటర్ గా వ్యవహరించారు వినయ్ రెడ్డి. 1970లో అమెరికాకు వెళ్ళిన నారాయణరెడ్డి  స్వగ్రామమైన పోతిరెడ్డిపేటలో ఆస్థులను మాత్రం విక్రయించలేదు. 3 ఎకరాల వ్యవసాయ భూమిని, ఇళ్లు ఆయన పేరిటే ఉన్నాయి. వీలు చిక్కినప్పుడల్లా నారాయణరెడ్డి గ్రామానికి వచ్చి, ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటుంటారు. పోతిరెడ్డిపేటలో చేపట్టిన పలు కార్యక్రమాలకు ఆర్ధిక సాయం అందించి సేవాగుణాన్ని చాటుకున్నారు. వినయ్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు స్పీచ్ రైటర్ గా వ్యవహరిస్తుండటంతో పోతిరెడ్డిపేట ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. వినయ్ రెడ్డి వల్ల తమ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కేటీఆర్ కోసం కేసీఆర్ దోష నివారణ పూజలు! 

 కేసీఆర్ సీఎంగా తప్పుకోనున్నారా ? కేటీఆర్ కు పాలనా పగ్గాలు అప్పగించనున్నారా ? తెలంగాణలో కొన్ని రోజులుగా ఇదే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం కూడా ఖరారైందని కొందరు చెబుతుండగా... అలాంటేది ఉండదు మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ లోనే కాదు... విపక్షాల రాజకీయాలు కూడా ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే తిరుగుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.  తన కుమారుడు కేటీఆర్ ని సీఎం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారని  బండి సంజయ్ అన్నారు. దోష నివారణ పూజకు  ఉపయోగించిన పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కుటుంబ సమేతంగా కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్లారని ఆరోపించారు. కాళేశ్వరంలో కేసీఆర్ దంపతులు ఏం కలిపారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు బండి సంజయ్.  కేటీఆర్ సీఎం కావడం నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని అన్నారు.  మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పారు బండి సంజయ్. ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఈటలను ముందు పెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ సీఎం అయినా, కాకపోయినా తమకు ఒకటేనని సంజయ్ చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని ఇష్టపడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే బీజేపీలో చేర్చుకుంటామని... అయితే వారికి అవినీతి మరకలు ఉండకూడదని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారని... ఇప్పటికైనా ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ చేసే పూజలన్నీ ఆయన కుటుంబ బాగుకోసమేనని... తాము చేసే పూజలు సమాజ హితం కోసమని అన్నారు బండి సంజయ్.  

వారంలో 9 శాతం పెరిగిన మృతులు!  60 దేశాల్లో ​ కరోనా స్ట్రెయిన్ 

ఏడాది దాటినా ప్రపంచం ఇంకా కరోనా మహమ్మారితో అల్లాడుతూనే ఉంది. కొత్త రూపంలో విజృంభిస్తూ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం వైరస్.. కరోనా స్ట్రెయిన్ శరవేగంగా  ప్రపంచం మొత్తం పాకేస్తోంది. భారత్ తో పాటు  ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో బ్రిటన్ కరోనా కేసులు నమోదయ్యాయని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. బుధవారం కొవిడ్ వీక్లి రిపోర్టును విడుదల చేసిన  డబ్ల్యూహెచ్ వో..  అందులో ఈ విషయాన్ని పేర్కొంది. గత వారంలోనే 10 దేశాలకు కరోనా స్ట్రెయిన్  వ్యాపించిందని వెల్లడించింది. దీంతో పాటు  దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన మరో  రకం కరోనా 23 దేశాలకు విస్తరించిందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 6 శాతం తగ్గాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఆందోళన వ్యక్తం చేసింది. రికార్డ్ స్థాయిలో ఒక్క వారంలోనే 93 వేల మంది కరోనాకు బలయ్యారు.  అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 9 శాతం అధికం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు  9.3 కోట్ల మందికి కరోనా  సోకగా.. 20 లక్షల మందికపైగా మరణించారని తన నివేదికలో వివరించింది డబ్ల్యూహెచ్ వో.   చాలా దేశాల్లో ప్రస్తుతం విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల సేఫ్టీ కోసం పలు సూచనలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్కూళ్లు తెరవాలనుకుంటే కరోనా కేసులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా.. అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని సూచించింది. సామూహిక వ్యాప్తి ఉన్న చోట కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని, అలాంటి చోట విద్యార్థులు, సిబ్బందికి మహమ్మారి సోకకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై చర్చించాలని చెప్పింది డబ్ల్యూహెచ్ వో.