ఏపీలో ఘోరం.. ఆక్సిజన్ అందక 15 మంది మృతి..
posted on May 2, 2021 @ 4:17PM
ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజువారీగా పదివేలకు పైగానే కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వలన కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనాకు వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సమాచారం. తీరా ఘోరం జరిగాక యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ఆస్పత్రిని వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై జిల్లా డీఎంహెచ్వో స్పందించారు. కేఎస్ కేర్ ఆస్పత్రికి కొవిడ్ చికిత్స అనుమతి లేదన్నారు. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందినట్లు సమాచారం అందినదని పేర్కొన్నారు.మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు డీఎంహెచ్వో రామగిడ్డయ్య తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులో లేదని తెలిపారు.
మరో వైపు..
రాష్ట్రంలో ఆక్సిజన్ అందుబాటులో లేక ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా అనంతరం జిల్లా జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు అందక కళ్ల ముందే తమ వారు చనిపోతుండటంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలియడంతో హాస్పిటల్లో తనిఖీ చేసి జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్యులను విచారించారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తమ వారు మరణించారని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.