ధూళిపాళ్ల కస్టడికి బ్రేక్.. సంగం కేసులో సర్కార్ కు షాక్
posted on May 2, 2021 @ 12:33PM
సంగం డెయిరీ కేసులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు షాక్ తగిలింది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడికి బ్రేక్ పడింది. సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంను ఏసీబీ అరెస్ట్ చేసింది. వారిని ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిం ఏపీ హైకోర్టు... ధూళిపాళ్ల నరేంద్ర సహా మిగితా నిందితుల ఏసీబీ కస్టడీని నిలిపేసింది. అలాగే, వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించాలని చెప్పింది. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో శనివారం ముగ్గురిని జైలు నుంచి విజయవాడకు తరలించి ఏసీబీ కార్యాలయంలో విచారించారు. ఈ నేపథ్యంలో నరేంద్ర భార్య జ్యోతిర్మయి మాట్లాడుతూ.. తన భర్తను అక్రమంగా కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపణలు చేశారు. ఏ అంశంపై కేసు నమోదు చేశారో కూడా స్పష్టత లేదని తెలిపారు. నరేంద్రను రాజమహేంద్రవరం జైలు నుంచి విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారన్నసమాచారంతో ఆయన కుమార్తె వైదీప్తి.. ఉదయమే అక్కడికి చేరుకుని తన తండ్రితో మాట్లాడనివ్వాలని కోరారు. కారులో ఉన్న తండ్రిని అద్దంలో నుంచి చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో మాట్లాడతానని కోరినప్పటికీ అధికారులు అందుకు అంగీకరించలేదు.