టీకాల కోసం పెద్దల వార్నింగ్స్.. బ్రిటన్ కు సీరం సీఈవో జంప్!
posted on May 2, 2021 @ 9:52AM
దేశంలో కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకూ 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు రోజుకు దాదాు 4 వేల వరకు వస్తున్నాయి. మే రెండో వారానికి దేశంలో కరోనా విజృంభణ పీక్ స్టేజీకి వెళుతుందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. దీంతో దేశంలో కొవిడ్ టీకాలక డిమాండ్ పెరిగింది. ఆ సమయంలోనూ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దేశానికి ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్ అందిస్తున్న పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా సడెన్ గా దేశం విడిచి వెళ్లారు. ఆయన బ్రిటన్ లో మకాం పెట్టారు. సీరం ఇన్స్టిట్యూట్ లో కోవిషీల్డ్ టీకా తయారవుతోంది.
సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఇండియా నుంచి జంప్ కావడంతో కోవిషీల్డ్ టీకాల పంపిణిపై సస్పెన్ష్ నెలకొంది. భారత్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని అదర్ పూనావాలా తెలిపారు. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం డిమాండ్ చేస్తూ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఒత్తిడిని అధిగమించడానికే లండన్లోని తన భార్యా పిల్లల దగ్గరకు వచ్చానని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ది టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.మరోసారి అలాంటి ఒత్తిడిలోకి వెళ్లదలచుకోలేదని.. అందుకే లండన్లో మరింత కాలం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీకాలను అందించే బాధ్యత మొత్తం తనపైనే పడిందని.. కానీ, తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని తెలిపారు.
భారత్లో టీకాల కోసం కొంతమంది అంచనాలు, ఆవేశాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని అదర్ పూనావాలా తెలిపారు. ప్రతిఒక్కరూ తమకే వ్యాక్సిన్ కావాలని కోరుకుంటున్నారని.. ఇతరులకు దాని అవసరం ఎంతో గుర్తించడం లేదని అభిప్రాయపడ్డారు. యూకేకి వెళ్లడంలో వ్యాపారపరమైన కారణాలు కూడా ఉన్నాయని సీరం సీఈవో చెప్పారు. వ్యాక్సిన్ తయారీని భారత్ వెలుపల కూడా చేపట్టేందుకు యోచిస్తున్నామని వెల్లడించారు. దీనిపై రానున్న కొన్ని రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. పరిస్థితులు ఈ స్థాయికి దిగజారుతాయని చివరకు దేవుడు కూడా అంచనా వేసి ఉండరన్నారు. కొవిషీల్డ్ టీకా ధరలపై మాట్లాడుతూ.. ప్రపంచంలో కొవిషీల్డ్ కంటే చౌకైన వ్యాక్సిన్ మరొకటి లేదని అభిప్రాయపడ్డారు.