కాంగ్రెస్ గూటికి తెరాస కారు ?.. రేవంత్’కు ఏది దారి ..
అనుకున్నదే జరిగింది ... కాంగ్రెస్, తెరాస పెళ్లి పీటలు ఎక్కేశాయి.. ఇక మూడు ముళ్ళు పడడం మాత్రమే మిగిలింది. నిజానికి, ఇలాంటి పరిణయ ఘడియలు ఆనివార్యమనే విషయాన్ని తెలుగు వన్ ఎప్పటి నుంచో చెపుతూనే వుంది. అయితే, ఇంత వరకూ అసెంబ్లీ ఎన్నికలకు ముందా, తర్వాత అనే విషయంలోనే కొంత సందిగ్దత మిగిలుంది. ఇక ఇప్పుడు ఆ కాస్త సందేహం కూడా తీరిపోయింది. అవును పెళ్ళితో సంబంధం లేకుండా వాళ్ళిద్దరూ.. ఒకటయ్యారు. సహజీవనానికి సిద్ధమయ్యారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబందించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం (జూన్ 21) విచారణ జరిపింది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు అనూహ్యంగా, తెరాస మద్దతు తెలిపింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, తెరాస ఒక్కటైన నేపధ్యంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి, ఏ మలుపు తిరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. వివరాలలోకి వెళితే ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలకు పిలుపు నిచ్చింది. కాంగ్రెస్ పిలుపు ఇచ్చిందే. తడవుగా, తెరాస నాయకులు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ పంచన వాలిపోయారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు సహకరించాలని కోరుతూ విపక్షాలకు విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ పార్టమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్ సభలో తెరాస పక్ష నేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అవును, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే, ఆ పార్టీలన్నీ మొదటి నుంచి కాంగ్రెస్ పక్షానే ఉన్నాయి. కాంగ్రెస్ తో కలిసే ఉన్నాయి.
కొత్తగా పీటలెక్కింది, తెరాస ఒక్కటే. అంతే కాదు, ఈ సందర్భంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనపై తెరాస టీఆర్ఎస్ తరఫున కే కేశవరావు సంతకం చేశారు. నిజానికి ఇది ఒక్కసారి వచ్చిన మార్పు కాదు. కాంగ్రెస్ పార్టీ పంచన చేరేందుకు తెరాస చాలా కాలంగా పావులు కదుపుతూనే వుంది. ఒకప్పుడు ఛీ. ఛీ అన్న హస్తం చేయి అందుకునేందుకు, అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలోనూ తెరాస కన్ను గీటుతూనే ఉంది. అస్సాం ముఖ్యమంత్రి సోనియా గాంధీని ఏదో అన్నారని, కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసినప్పుడే కేసీఆర్ కాంగ్రెస్ కోరస్ ట్రూప్ లో చేరారు.
అలాగే ఇంకేదో సందర్భంలో రాహుల్ గాంధీకి కేసీఆర్ జై కొట్టారు. ఇక అక్కడి నుంచి, అవకాశం చిక్కిన ప్రతిసందర్భంలోనూ హస్తానికి దగ్గరగా జరుగుతూనే ఉన్నారు. రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికలను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ కు చేరువయ్యేందుకు, ఢిల్లీలో కేటీఆర్, హైదరాబాద్ లో కేసీఆర్ ఎన్నెన్ని విన్యాసాలు చేశారో, అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు, జాతీయ రాజకీయాల ముసుగులో కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష కూటమిలో తెరాస అధికారికంగా చేరింది. సో . సహజంగానే రాష్ట్ర రాజకీయాలపై, రాజకీయ సమీకరణాలపై ఇది ప్రభావం ప్రభావం చూపుతుంది.
నిజానికి, కాంగ్రెస్, తెరాస చేతులు కలపడం కాంగ్రెస్ సీనియర్లు చాలా వరకు స్వాగతిస్తున్నారని అంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చేదుకు ఏ బొంత పురుగును అయినా ముద్దాడేందుకు, డిసైడ్ అయిపోయిన తెరాస నాయత్వం కూడా ఎంత సుముఖంగా, ఎంతలా తహతహ లాడుతోందో వేరే చెప్పనక్కరలేదు.
అయితే, ఎటొచ్చి ఏదో ఆశించి తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒంటికాలుపై లేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అయితే కాంగ్రెస్ ఆదిస్థానం తెరాసతో పొత్తు/ చెలిమి / లోపాయి కారి అండర్స్టాండింగ్ దేనికి ఒకే అన్నా, రేవంత్ రెడ్డి కూడా చేయగలిగింది ఏమీ ఉండదని పార్టీ పెద్దలు అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ దూకుడుకు బ్రేకులు వేసినా ఆశ్చర్య పోనవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, చివరకు ఏమవుతుంది?