అప్పు సరే, తీర్చుమార్గమేది జగనా?!
posted on Jul 23, 2022 @ 10:31AM
మేకకి పులి భయం, పాముకి కుక్కభయం, దొంగకి పోలీసు భయం.. ఇవి సహజం. ఇప్పుడు కొత్తగా వింటున్నది బ్యాంకులే ప్రభుత్వాన్ని దూరం పెడుతున్నాయి. జగన్ ఏ క్షణాన వచ్చి ఎన్ని కోట్లు అడుగుతారో అని భయపడుతున్నాయి. రకరకాల ఒత్తిళ్లతో కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి మరీ అప్పులు పుట్టించుకున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు అవే బ్యాంకుల నుంచి రివర్స్లో షాకులు తగిలే పరిస్థితి కనిపిస్తు న్నది. వేల కోట్ల రుణాలను సరైన తనఖా,ఆదాయం,చెల్లింపుల పరిస్థితి లేకుండానే బ్యాంకులు ఇచ్చేశాయి.
ఇంకా తెచ్చుకు నేందుకు ఏపీ ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించింది. కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి ఎస్బీఐకి చైర్మన్గా పని చేసిన వారిని సలహాదారులుగా నియమించుకుని మరీ ఈ అప్పులు తెస్తోంది. అలాంటి వారి పలుకు బడితో పెద్దఎత్తున అప్పులు తెచ్చింది జగన్ సర్కార్. అంతేగా, గుడిలో ప్రసాదం కావాలంటే పంతులు గారితో రవ్వంత స్నేహం అవసరంగదా! అయితే నిజానికి అలాంటి అప్పులు తేవడానికి నిబంధనలు అంగీకరించవు. బ్యాంకులు కూడా ఇవ్వలేవు . కానీ తప్పుడు మార్గాల్లో ప్రయత్నించారు. కార్పొరేషన్లకు లేని ఆదాయాన్ని చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిటేడెట్ ఫండ్ నుంచి డబ్బులు చెల్లిస్తామంటే సరే అన్నారు.
కానీ ఇలాంటివి అరికట్టడానికి నిబంధనలను ఆర్బీఐ ఎప్పుడో పెట్టింది. ప్రభుత్వాలకు అప్పు ఇచ్చేపద్దతులను వివ రించింది. కానీ బ్యాంకులు ఇప్పుడు ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించాయి. కాస్త లేటైనా ఇప్పుడు ఆర్బీఐ ఆ అంశంపై దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఆ బ్యాంకులకు ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక వేళ బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించి మరీ అప్పులిచ్చినట్లుగా తేలితే, ఆ బ్యాంకులకు జరిమానా విధిస్తారు.
అదో పెద్ద మైనస్ అవుతుంది. ఇలా అప్పులు తెచ్చుకున్న ఏపీకి రుణాలివ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఏపీ అప్పుల్లో అసలు విషయం ఏమిటంటే.. అసలు ఏ బ్యాంక్ నుంచి ఎన్ని వేల కోట్లు తెచ్చారో స్పష్టత లేదు. ఏం లెక్క చెప్పారు. ఏం తాకట్టు పెట్టారు. ఎలా అప్పులిచ్చా రన్న వివరాలు లేవు. ఆ అప్పులను ఏపీ ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. బ్యాంకులూ అంతే. ఈ గోల్ మాల్ వ్యవహారం ముందు ముందు కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం పెద్దగా పట్టించుకోని ఆర్బీఐ కూడా ఇప్పుడు సీరి యస్గా చర్యలు తీసుకుంటోంది. దీంతో మొత్తం లోగుట్టు బయటపడే అవకాశం కనిపిస్తోంది.