బిన్నీ బీసీసీఐ  ఛీఫ్ అవుతాడా?

రోజ‌ర్ బిన్నీ.. ఈ పేరు విన‌గానే 1983 ప్ర‌పంచ‌క‌ప్ విజేత భార‌త్‌జ‌ట్టు గుర్తుకు వ‌స్తుంది. అప్ప‌టి అద్భుత విజ‌యానంద‌మే క్రికెట్ వీరాభిమానులు గుర్తుచేసుకుంటారు. చాలాకాలం త‌ర్వాత మ‌ళ్లీ  మాజీ  టీమ్ ఇండియా పేస‌ర్ రోజ‌ర్ బిన్నీ పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. అయితే ఈసారి భార‌త్ క్రికెట్ బోర్డు అధ్య‌క్షునిగా  సౌర‌వ్ గంగూలీ స్థానంలోకి వస్తాడా అని. చాలామంది బిన్నీ రావాల‌నే కోరుకుంటున్నారు. గంగూలీ ప‌ద‌వీ కాలం అయిపోవ‌డంతో ఈ నెల 18 వ తేదీన అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రోజ‌ర్ బిన్నీ మంచి ప్లేయ‌ర్‌గా, సెలెక్ట‌ర్‌గా అంద‌రి దృష్టిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు.  గ‌తంలో జాతీయ సెలెక్ట‌ర్‌గా సేవ‌లు అందించిన క‌ర్ణాట‌కా స్టార్ బిన్నీ పేరు ఊహించ‌నివిధంగా తెర‌ మీద‌కి వ‌చ్చింది. మొన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న పేరు ప్ర‌స్తావ‌న‌కు రాలేదు. హ‌ఠాత్తుగా ఆయ‌న పేరు బోర్డు వెబ్‌సైట్ లో  పోటీదారుల్లో క‌న‌ప‌డింది. అక్టోబ‌ర్ 18నే బోర్డు స‌మావేశం కూడా జ‌రుగుతుంది. అందులో ఆయ‌న క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌తినిధిగా పాల్గొంటారు.  కాగా గురువారం స‌మావేశ‌మైన బీసీసీఐ అధికారులు, మాజీ హేమాహేమీలు బోర్డు అద్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక గురించి ఎంతో చ‌ర్చించారు. అయితే ప్ర‌స్తుతం  కేంద్ర‌మంత్రివ‌ర్గంలో ఉన్న ఒక మంత్రి మాట‌ను గౌర‌విం చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌యింది. సౌర‌వ్ గంగూలీ అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ ప‌ద‌వికి  భార‌త్ ప్ర‌తినిధిగా  నియ‌మితుల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. కానీ ప్ర‌స్తుతం భార‌త్  క్రికెట్ బోర్డు కార్య‌ద‌ర్శిగా ఉన్న జై షా మాత్రం అదే ప‌ద‌విలో కొన‌సాగే అవ‌కాశాలే ఉన్నాయి. బెంగా ల్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు అవిషేక్ దాల్మియా స్థానంలో కి  గంగూలీ రావ‌చ్చు. క‌నుక బోర్డు అత్యున్న‌త ప‌ద‌వికి అవిషేక్  అర్హ‌త పొందరు. బోర్డు ప‌ద‌వికి నామినాష‌న్లు అక్టోబ‌ర్ 11, 12 తేదీల్లో దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ప‌రిశీల‌న 13వ తేదీ ఉంటుంది, విత్‌డ్రా 14 వ తేదీ చేసుకోవ‌చ్చు.  ఇదిలా ఉండ‌గా, బీసీసీ ఐ ప‌ద‌వి రేసులో అరుణ్ ధుమాల్‌(హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌), రాజీవ్ శుక్లా(యు.పి),ఆశిస్ షెలార్‌(ముంబై), అనిరుధ్ చౌద‌రీ(హ‌ర్యాణ‌), వైభ‌వ్ గెహ్లాట్‌(రాజ‌స్థాన్‌), అజారుద్దీన్‌(హైద‌రాబాద్‌), జ‌య దేవ్ షా(సౌరాష్ట్ర‌), అద్వైత్ మ‌నోహ‌ర్‌(విద‌ర్భా), ప్ర‌ణ‌వ్ అమిన్‌(బ‌రోడా), రోహ‌న్ జైట్లీ(ఢి్లీ) ఉన్నారు. 

నువ్వొస్తానంటే... మేం రానిస్తామా?

ఆంధ్రప్రదేశ్ జనం ఏ మాత్రం అంగీకరించని, ఆమోదించని విషయం ఏదైనా ఉంటుందంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన మాత్రమే. సీమాంధ్రులకు ఏ మాత్రం అంగీకార యోగ్యం కాని, ఆమోదయోగ్యం కాని విభజనను బలవంతంగా నెత్తిమీద రుద్దారు. ఆ ఆగ్రహం ప్రతి సీమాంధ్రుడిలోనూ ఉంది. అందుకే విభజనకు అంగీకరించి, ఆమోదించి, విభజనను సాకారం చేసిన కాంగ్రెస్ కు ఏపీలో ఉనికి లేకుండా చేశారు. కనీసం విభజన సమస్యలను పరిష్కరించి, విభజన సందర్బంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్న ఆశలను వమ్ము చేసిన బీజేపీకి 2019 ఎన్నికలలో అదే గుణ పాఠం చెప్పారు. అసెంబ్లీలో కనీసం ప్రాతినిథ్యం లేకుండా చేశారు. ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ విభజన గాయాల గురించి కనీసం పట్టించుకోలేదు సరికదా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ తాన అంటే తందానా అంటూ తన పబ్బం గడుపుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఈ తరుణంలో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో తగుదునమ్మా అంటూ ఏపీలో ప్రవేశిస్తానంటే అంగీకరిస్తారా? దశాబ్దాల పాటు తిరుగులేని అధికారాన్ని ఇచ్చి ఆదరించిన కాంగ్రెస్ నే విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోదిలోకి లేకుండా బుద్ధి చెప్పారు. గత రెండు ఎన్నికలలోనే కాదు సమీప భవిష్యత్ లో కాంగ్రెస్ ఏపీలో ప్రభావమంతమైన రాజకీయ పార్టీగా ఎదుగుతుందన్న నమ్మకం పరిశీలకులలోనే కాదు.. కాంగ్రెస్ పార్టీలోనూ లేదు. ఇక బీజేపీకి.. 2014 ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తు ఉండటమొక్కటే కాదు.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి జరిగిన నష్టాలను ఏదో మేరకు పూడుస్తుందన్న విశ్వాసంతోనే ఆదరించారనడంలో సందేహం లేదు. అయితే ఏపీ జీవనాడి పోలవరం సహా అన్ని ఆశలనూ బీజేపీ వమ్ము చేసింది. దీంతో 2019 ఎన్నికలలో బీజేపీకి రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం లేకుండా చేశారు. ఇప్పుడు విభజన కోసమే ఉద్యమించి, విభజన వద్దంటున్న సీమాంధ్రులపై నిప్పులు చెరిగి, విభజన సాకారం అయిన తరువాత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్ పై నిప్పులు చెరుగుతూ ఏపీ ప్రయోజనాలకు అడుగడుగునా గండి కొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ఏపీలో కాలుపెడతాననడం పాత గాయాలను కెలకడంగానే ఆంధ్రులు భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అరకొరగా అక్కడక్కడా బీఆర్ఎస్ పోస్టర్లు వెలిసినంత మాత్రాన ఏపీలో బీఆర్ఎస్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారని భావించడానికి వీల్లేదని అంటున్నారు.  ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను ఓ ముగ్గురు నేతలకు అప్పగించేసి ఇక రాష్ట్రంలో పాగా వేసినట్లేనని కేసీఆర్ భావించడం వాస్తవాన్ని విస్మరించి ఊహలలో విహరించడంగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు. వాస్తవానికి ఇప్పటికీ విభజన పట్ల, ఆ విభజన జరిగిన తీరు పట్లా ఆంధ్రులలో అలవిమాలిన కోపం అలాగే ఉంది.    అడ్డగోలు విభజన చేసిందనే  కాంగ్రెస్ కి ఏపీలో స్థానం లేకుండా చేశారు.   విభజన హామీలునెరవేర్చడం అటుంచి, న్యాయంగా రావాల్సిన వాటికి కూడా మోకాలడ్డిన బీజేపీకి  2019 ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారు. ఏపీలో 2019 ఎన్నికలలో బీజేపీకి వచ్చిన  ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయంటే బీజేపీ పట్ల ఆంధ్రుల తిరస్కారం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు విభజనకు కర్త, కర్మ, క్రియ తానేనని చాటుకునే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ఏపీలోకి అడుగుపెడితే ఆయన భాషలోనే చెప్పాలంటే కిర్రికాల్చి వాత పెట్టడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. విభజన చేసిన పాపానికి మద్దతు ఇచ్చిన నేరానికి కాంగ్రెస్ బీజేపీలకు పాతరేసిన ఏపీ జనం కేసీఆర్ ను ఎంత మాత్రం ఉపేక్షించే అవకాశం లేదనీ, ఏపీలో బీఆర్ఎస్ ముసుగులో రావాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ను తగిన గుణపాఠం చెబుతారనడంలో సందేహం లేదనీ అంటున్నారు. 

అత్యాశ .. వృధా ప్ర‌యాస! 

ఇక్క‌డే ఉండి ఏద‌న్నా చేసుకో న‌గ‌రానికి వెళ్లి ఏం వెల‌గ‌బెడ‌తావ్‌? అంటుంది బామ్మ మ‌న‌వ‌డి హైద‌రా బాద్ ఉత్సాహాన్ని చ‌ల్ల‌బ‌రుస్తూ. చిన్నోచిత‌కో ఉన్న‌వూళ్లో చేసుకుంటే బాగుంటుందేగాని ఎవ్వ‌రూ తెలీని న‌గ‌రానికెళ్లి ఉద్ధ‌రించేదేవిట్రా పిచ్చి స‌న్నాసీ! అని ఆమె మొట్టికాయ హెచ్చ‌రిక‌. అయినా సాధించు కొచ్చే తెలివి ఉన్న‌పుడు ఉన్న‌వూళ్లోనే కూర్చుంటే ఎలా అంటాడు ఎన్టీఆర్‌లా! కానీ ..! ఇదుగో ఇంత అనాలో చితం బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేంద్రంలో పాగా వేసే ప్ర‌య‌త్నం అంటున్నా రంతా.   చిన్న‌రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసి అధికారంలోకి రావ‌డం ఒక ఎత్తు. కానీ అదే ధీమాతో న‌లుగురినీ చేర్చుకుని కేంద్రా నికి గాలం వేయాల‌నుకోవ‌డ‌మే తొంద‌ర‌పాటు చ‌ర్యే అవుతుంది. ఎందుకంటే ఆ మ‌ద్ద తునిచ్చే స్నేహితులు ఎంత స్నేహంగా ఉంటారన్న‌ది భ‌విష్య‌త్తుకి ఉప‌క‌రిస్తుంది. కార‌ణం చిన్న‌ రాష్ట్రాల నుంచి ఎదిగి కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌నుకున్న‌వారిలో పెద్ద‌గా విజ‌యం సాధించింది కేవలం సీనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే. తెలుగు దేశం పార్టీ స్థాపించి, అంద‌రి మ‌ద్ద‌తూ కూడ‌గ‌ట్టుకుని కేంద్రానికి త‌న‌స‌త్తా చూపిన శ‌క్తిమంతుడు ఆయ‌న‌.  ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో, స‌మైక్య ఆంధ్రప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణా ముఖ్య‌మంత్రిగా, టీఆర్ ఎస్ అధినేత‌గా కేసీఆర్ తెలంగాణాలో చ‌క్రం తిప్ప‌డం సాగింది. కానీ అదే ధీమా తో ఇంకెన్నాళ్లీ  బ‌తుకు అన్న‌ట్టుగా కొడితే కుంభ‌స్థ‌లాన్నే కొట్టాల‌న్న‌ట్టుగా కేంద్రానికి గాలం వేసి పార్టీ పేరును బీఆర్ ఎస్ అంటూ మార్చి ఉద్య‌మించ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. అయితే ఉద్య‌మాల పార్టీగా టీఆర్ ఎస్‌ను స్థాపించి తెలంగాణా సాధించుకుని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గ‌లిగిన స‌త్తా, అప్ప‌టి ప‌రిస్థితుల‌కు ప్ర‌స్తుతం రాజ‌కీయప‌రిణామాల‌కు ఎంతో వ్య‌త్యాసం ఉంది. తెలంగాణాలోనే టీఆర్ ఎస్ ప‌ట్ల ప్ర‌స్తుతం పెద్ద‌గా వీరాభిమానం ప్ర‌ద‌ర్శించే ప్ర‌జాభిమానం అంటూ లేదు. ప‌రిపాల‌న‌, ప‌థ‌కాల అమ‌లు అన్నింటా టీఆర్ ఎస్ పెద్ద‌గా ప్ర‌జాద‌ర‌ణ‌ను చూర‌గొన‌లేదు.  అంద‌రూ వ్య‌తిరేకించ‌డం ఆరంభ‌మ‌యింది.  పైగా ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణాల్లో పాత్ర  ఉంద‌న్న ఆరోప‌ణ‌లూ ఎదుర్కొంటున్నారు. ఈ త‌రుణంలో అన్నింటి నుంచీ త‌ప్పిం చుకుని కేంద‌రాజ‌కీయాల్లో బిజీ అయిపోవాల‌న్న ఆలోచ‌న‌తోనే రాష్ట్ర ప‌రిస్థితుల‌ను, రాజ‌కీయా ల‌ను దూరం చేసుకుంటున్నార్న అప‌వాదు క‌ట్టుకున్నారు కేసీఆర్‌.  బీఆర్ ఎస్ అంటూ పార్టీ పేరు మార్చుకున్నంత మాత్రాన ప్ర‌త్యేకించి ఆయ‌న‌కు గాని, పార్టీకి గాని ఒరిగే ద‌మీ ఉండ‌ద‌ని విశ్లేష‌కుల మాట‌.  కేవ‌లం బీజేపీ వారి దాడిని ఎదుర్కొన‌డానికి కేసీఆర్ ఆ నిర్ణ‌యం తీసు కున్నారు. తెలంగాణాలో ఎలాగ యినా పాగా వేయాల‌ని, వీల‌యితే కుర్చీ నుంచి కేసీఆర్ ను తోసేయా ల న్న ప‌ట్టుద‌ల‌తోనే బీజేపీ  అన్ని శ‌క్తులూ ఒడ్డుతోంది. కానీ ఇక్క‌డ కంటే అటునుంచే న‌రుక్కురావ‌ల‌న్న ధోర‌ణిలోనే కేసీఆర్ ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్ద‌తు ఆశించి ప్ర‌యాణాలుక‌ట్టారు. కానీ వాస్త‌వానికి  ఎవ్వ‌రూ ఆయ‌న‌కు ప్ర‌త్యేకించి మ‌ద్ద‌తుగా నిలుస్తామని, ముందుకు అడుగువేయ‌మ‌ని హామీ ఇవ్వ‌లేదు. కానీ త‌ను మాత్రం పంతంతో పార్టీ పేరు మార్చి రంగంలోకి తానే దిగారు కేసీఆర్‌.  గ‌తంలో ఇంత పెద్ద ప్ర‌య‌త్నం చేసిన ఎన్టీఆర్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కొంత‌వ‌ర‌కూ విజ‌యం సాధించారే గాని రాష్ట్ర‌రాజ‌కీయాల‌ను, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను గాలికి వ‌దిలేసి త‌న ల‌క్ష్య సాధ‌న అంటూ ఉట్టికి తాడు వేయ‌లేదు. అప్ప‌ట్లో కాంగ్రెస్‌ను ఎదిరించ‌డానికి, గ‌ద్దె దింప‌డానికి ఏర్పాట‌యిన కూట‌మికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు కోర‌డం, క‌న్నీన‌ర్‌గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డం తెలిసిందే. రాజ‌కీయాల్లో త‌న‌దంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న‌నాయ‌కునిగా ఆయ‌న్ను అంద‌రూ ఎంతో గౌర‌వించారు. ఆయ‌న కేంద్ర రాజ‌కీ యాల్లో చ‌క్రం తిప్ప‌గ‌లిగారు. కానీ కేంద్ర ప‌ద‌వులు, ప్ర‌త్యేక‌త‌లు ఆశించ‌లేదు. ఎన్‌డిఏ కూట‌మి ఇచ్చిన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోలేదు. ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధినే ఆశించారు.  చంద్ర‌బాబు 1980వ దశాబ్దం చివర్లో ఆయన ఎన్ టి రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ రాజకీ యాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా మారి కాంగ్రెస్ సహకారంతో దేవెగౌడ, గుజ్రాల్ లను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. 1998లో ఎన్.డి.యే. కన్వీనర్ గా మారి ఢిల్లీలో చక్రం తిప్పి అటల్ బిహారీ వాజ్ పాయి ప్రధాని కావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్ప టి ఎన్.డి.యే.లో చంద్రబాబు ప్రభావం చాలా బలంగా వుండేది. బాబు సూచనల మేరకే 2004లో వాజ్ పాయి ముందస్తు ఎన్ని క లకు సిధ్ధం అయ్యారని కూడా చెపుతారు. చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ మ‌ధ్య వివాదం,  రాష్ట్రానికి నిధుల కేటా యింపు అంశాల్లో మొదలయి క్రమంగా రాజకీయ విధానాల వరకు విస్తరించింది. మోదీ విధా నాలను విమర్శించడంలో చంద్రబాబు జాతీయ నేతలు అందర్నీ మించి పోయారు. కర్ణాటక ఎన్నికల నుండే కాంగ్రెస్ కు దగ్గరయిన చంద్రబాబు  యూపియే శిబిరంలో అప్రకటిత కన్వీనర్ గా వున్నారు. అంత‌కుమించి, బీజేపీ హ‌యాంలోనే అబ్దుల్ క‌లామ్‌ను రాష్ట్ర‌ప‌తి చేయాల‌ని బీజేపీ ఆలోచ‌న చేసిన‌పుడు ఆ ప్ర‌తిపాద‌న‌కు ముందుగా మ‌ద్ద‌తు నిచ్చింది  అప్ప‌టి స‌మైక్య  ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబే.  అలిపిరిలో చంద్ర‌బాబు ప్రమాదానికి గుర‌యి ఆస్ప‌త్రిలో ఉన్న‌ప్పుడు  రాష్ట్ర‌ప‌తి హోదాలో ఉన్న క‌లామ్ వ‌చ్చి ప‌ల‌క‌రించ‌డం గ‌మ‌నార్హం.  కానీ కేసీఆర్ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీఆర్ ఎస్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రానికి ఎగ‌బాకా ల‌నే అనుకుంటున్నారు. కానీ బీజేపీయేతర రాష్ట్రాల నుంచి ఏ ఒక్క‌రి మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు. ఇటీవ‌ల క‌లిసిన క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కూడా వాస్త‌వానికి కేసీఆర్‌తో ముంద‌డుగు వేయ‌డానికి ఆస‌క్తి ప్ర‌ద ర్శించ‌డం లేదు. ముఖ్య‌మంత్రిగా రాష్ట్రంలో ప్ర‌జాద‌ర‌ణ కోల్పోయి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను, ప్ర‌జ‌ల ఆకాం క్ష‌ల‌ను, స‌మ‌స్య‌ల్ని గాలికి వ‌దిలేసి కేంద్రంలో నిల‌దొక్కుకోవాల‌న్న స్వార్ధ ప్ర‌యోజ‌నాల‌తో కేసీఆర్ కొత్త రాజ‌కీయ ప్ర‌యాణానికి ఉప‌క్ర‌మించారు. ఇక్క‌డే ఒక్క విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. కేసీఆర్ స్వార్ధ ప్ర‌యో జ‌నాల‌కు రాష్ట్ర అభివృద్ధిని, ప్ర‌జాసంక్షేమాన్ని వ‌దిలేశారు. ఇందుకు భిన్నంగా చంద్ర‌బాబు నాయ‌కుడు మాత్రం కేంద్రంలో చ‌క్రం తిప్పే అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ నిస్వార్ధంగా వ్య‌వ‌ హ‌రించారు. ఆయ‌న‌కు రాష్ట్ర ప్ర‌గ‌తి, ప్ర‌జాసంక్షేమం కీల‌కంగా అనిపించాయి. రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో ముందుంచాల‌న్న గొప్ప ఆలోచ‌న‌తోనే అందివ‌చ్చిన అవ‌కాశాన్ని కాద‌నుకున్నారు. 

అహంకారంలో ఘనాపాటి!

అహం త‌లకెక్కితే ఘ‌నాపాటి అయినా, గుర‌వ‌య్య‌యినా ఒక‌టే. చ‌దువుకి, సంస్కారానికి తేడాలేకుండా పోతే ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌కీ, ప్ర‌చార‌సామ‌గ్రి మోసేవాడికీ పెద్ద‌గా తేడా ఉండ‌దు. ఇత‌రుల ప్ర‌త్యేక‌త‌ను గుర్తించి గౌర‌వించాలి. సంద‌ర్భం ఏద‌యినా కొన్నిసార్లు మ‌న‌కు న‌చ్చ‌కున్నా ఎదుటివారి ప్ర‌త్యేక‌త‌ను గౌర‌వించి అంగీక‌రించాల్సిందే. ఇదుగో ఇక్క‌డే మ‌న ఘ‌నాపాటి గ‌రిక‌పాటి త‌ప్పులో కాలేసిందీను. చిరంజీవి లోకం మెచ్చిన న‌టుడు. అంతులేని ఫాలోయింగ్ ఉన్న‌వాడు. అలయ్ బ‌లయ్ సంద‌ర్భంగా రాజ‌కీయ నాయ కులు ఆయ‌న్ను ఆహ్వానించారు. సినీస్టార్లు.. అందునా చిరు లాంటివారు ప‌దిమందిలోకి వ‌చ్చిన‌పుడు ఇర‌వ‌యిమంది ఫోటోల‌కో, ఆటోగ్రాఫ్‌ల‌కో ఎగ‌బ‌డ‌టం మామూలే. అది వాస్త‌వానికి వారికి ఇబ్బందిక‌రంగానే ఉంటుంది, కానీ త‌ప్ప‌ని ప‌రిస్థితి. కానీ అదే స‌మ‌యంలో అవ‌త‌ల వేదిక మీద ప్ర‌సంగిస్తున్న ఘ‌నాపాటివారు ఆగ్ర‌హించ‌డం అర్ధంలేనిదే. ఆయ‌న కాస్తంత నోటిదురుసు ప్ర‌ద‌ర్శిం చ‌కుండా ఉండాల్సింది. ‘అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే.. నేను మాట్లాడతా.. లేకపోతే వెళ్లిపోతా. నాకేం మొహమాటంలే.. అక్కడే ఫొటో సెషన్ మొత్తం ఆగిపోవాలి.. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారూ దయచేసి మీరాపేసి, ఈ పక్కకు రండి. నేను మాట్లాడతా. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి.. ఫొటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేకపోతే నాకు సెలవిప్పించండి’ ఇవీ.. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు తాజాగా చేసిన వ్యాఖ్యలు. దసరా పండుగ మరుసటి రోజు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిషన్ గ్రౌండ్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం వేదికపై గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి. చిరంజీవి అభిమానులైతే ఓ రేంజ్ లో గరికపాటిని ట్రోల్ చేశారు. గరికపాటికి మర్యాద తెలియదని కొందరు, అహంకారంలో ఆయన ఘనాపాటి అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా తనదైన శైలిలో స్పందించారు. గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలా అహంకారపూరితంగా మాట్లాడి వివాదాలు కొనితెచ్చుకున్నారు. ఆపై ఆయన సంజాయిషీ ఇచ్చుకోవడమో లేక క్షమాపణలు చెప్పుకోవడమో జరిగింది. ఇప్పుడు కూడా చిరంజీవి పట్ల తాను అలా మాట్లాడి ఉండకూడదంటూ క్షమాపణలు చెప్పారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతే కాదు చిరంజీవితో స్వయంగా మాట్లాడతానని కూడా గరికపాటి చెప్పినట్లు చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్ తెలిపారు. గతంలో గరికపాటి నరసింహారావు స్వర్ణకారులపై చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ‘కన్న తల్లికి బంగారు వస్తువు చేసినా సరే.. స్వర్ణకారుడు కొంచెం పక్కన పెట్టేస్తాడట. అది వృత్తి ధర్మమట. మా వృత్తి ధర్మమండి.. కాస్తయినా పక్కన పెట్టకపోతే మాకు కలిసిరాదంటారు. వాళ్లకు అదో సెంటిమెంటు’ అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలతో స్వర్ణకారులు ఆయనపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. గరికపాటి తమకు క్షమాపణ చెప్పాలంటూ జంగారెడ్డిగూడెం పీఎస్ ముందు స్వర్ణకారులు నిరసన వ్యక్తం చేసి, ఫిర్యాదు చేసేదాకా పరిస్థితి వెళ్లింది. గరికపాటి నరసింహారావు భీమవరం పర్యటన సందర్భంగా నిరసన ర్యాలీకి కూడా పిలుపునిచ్చారు. ఈ వివాదం ముదిరిపోవడంతో గరికపాటి దిగి వచ్చి స్వర్ణకారులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ‘ఎవరినీ కించపరచాలని నేను మాట్లాడలేదు. విశ్వబ్రాహ్మణులకు బాధ కలిగితే.. నాకు బాధ కలిటినట్లే. చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా’ అన్నారు. ఇటీవలే మరోసారి గరికపాటి తన మాటలతో వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా గురించి స్పందిస్తూ.. ‘ఒక స్మగ్లర్ ను హీరోగా చూపించడం ఏంటీ’ అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ‘సినిమా అంతా హీరోను స్మగ్లర్ గా చూపించి, చివరిలో ఐదు నిమిషాలు మంచిగా చూపిస్తామనో, లేదా తరువాతి పార్ట్ లో చూపిస్తామంటే.. అప్పటి లోగా సమాజం చెడిపోవాలా?’ అంటూ పుష్ప మూవీ మేకర్స్ పై ఫైరయ్యారు. ‘స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అది ఈ రోజు ఉపనిషత్తు సూక్తిగా అయిపోయింది. ఇప్పుడు కుర్రాళ్లు కూడా ఎవరినైనా గూబమీద కొట్టి తగ్గేదేలే అంటున్నారు. దీనికి ఎవరు కారణం. ఆ హీరోను, డైరెక్టర్ ను కడిగేస్తా’ అని గరికపాటి ప్రశ్నించడం సంచలనం అయింది. ఇక మరో ప్రసిద్ధ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పైన కూడా గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పలువురి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అమ్మాయిల వస్త్రధారణ విషయంలో కూడా గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ‘స్త్రీలు ఇష్టానుసారంగా వస్త్ర ధారణ చేస్తే.. పురుషులు తమను తాము నియంత్రించుకోలేర’ని అనడం సంచలనం అయింది. అత్యాచారం అంశంపై ప్రసంగించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యల్ని సింగర్ చిన్మయి లాంటి వారు తప్పుపట్టారు. సమాజాన్ని గరికపాటి తప్పుదోవ పట్టిస్తున్నారని వీడియో చేసి మరీ గరికపాటి బోధనలపై విరుచుకుపడ్డారు. మనిషిలో కోపం ఉండకూడదని, అసూయా ద్వేషాలు అసలే పనికిరావంటూ ప్రవచనాలు చెప్పే గరికపాటి ఇలా పలు సందర్భాల్లో పలు వర్గాలు, వ్యక్తులపై అసందర్భంగా, ఆగ్రహంగా, అనాలోచితంగా వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్న గరికపాటి అంతకు మించిన పద్మభూషణ్ గ్రహీత చిరంజీవి విషయంలో చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవే అంటూ జనం నిప్పులు చెరుగుతున్నారు. పైగా వయస్సులో, జనాభిమానంలో కూడా తన కంటే అధికుడైన చిరంజీవిని చిన్నబుచ్చేలా గరికపాటి మాట్లాడడం ఏంటని ఫైరవు తున్నారు. ప్రవచనాలకు కేరాఫ్ అడ్రస్ గా అని అందరూ అనుకునే గరికపాటి తాను వివాదాస్పదంగా మాట్లాడాలని అనుకోనని, కొన్ని విషయాలను ఘాటుగా చెప్పడం వల్ల వివాదం కావచ్చని చెబుతుండడం ముక్తాయింపు.

జర్నలిస్ట్ మాధ్యూకు నమస్తే .. క్షమాపణ

అదేదో టీవీ చానల్ లో,  ‘నా షో నా ఇష్టం’ అంటూ కమెడియన్ చంటి ప్రెజంట్ చేసే కామెడీ షో ఏదో వచ్చింది. జనం కూడా ఆ షోను బానే ఎంజాయ్ చేసినట్లున్నారు. అవును, అదో కామెడీ షో కాబట్టి, జనం చూసినా, చూడక పోయినా, ఎంజాయ్ చేసినా చేయక పోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.  కానీ అదే పని రాజకీయ పార్టీలు నాయకులు  అదే తరహాలో  ‘నా పత్రిక నా ఇష్టం’ అంటే కుదరదు.  నా పత్రికలో నా ఇష్ట మొచ్చింది రాసుకుంటానంటే అసలే కుదరదు. ముఖ్యంగా. మీడియా మూడో కన్నుగా సోషల్ మీడియా కన్ను తెరిచిన తర్వాత  సొంత పత్రికలలో పార్టీల నేతలు  సోత్కర్షలకు దిగితే, ఇదిగో ఇలాగే నవ్వులపాలు కావలసి వస్తుంది.  క్షమాపణలు చెప్పుకోవలసి వస్తుంది.  ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది  తెరాస/ భారాస అధికార పత్రిక (మౌత్ పీస్), ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక, నమస్తే తెలంగాణ పత్రిక  గురించే అయినా ఒక్క తెరాస మాత్రమే కాదు, ఒక్క నమస్తే, అనే కాదు.. చాలా వరకు రాజకీయ పార్టీలు సొంత పత్రికలు, సొంతగా టీవీ చానల్స్ పెట్టుకుంటున్నాయి. కాదంటే, సొంత పత్రికలు, సొంత ఛానల్స్ కంటే ఎక్కువగా తమను భుజాలకు ఎత్తుకునే పత్రికలు, మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అందువలనే  చాలా కాలం కిందటే  మహాకవి శ్రీశ్రీ  అంతటివాడు,  ‘పెట్టుబడి దారులకు పుట్టిన విష పుత్రికలు మన పత్రికలు’ అన్నారు.  ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి పత్రికలు అన్నీ అని అనలేము కానీ, చాలా వరకు  రాజకీయ బేహారుల చేతుల్లోకి వెళ్లి పోయాయి అనుకోండి వేరే విషయం.. ఇక అసలు విషయంలోకి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురకైన పాత్రను పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరులో   అడ్డుగా ఉన్న తెలంగాణ పదాన్ని చెరిపేసి, భారతీయను చేర్చిన సందర్భంగా, తెరాస అధికార పత్రిక నమస్తే తెలంగాణ  బీఆర్ఎస్ పట్ల దేశ విదేశాల ప్రముఖుల స్పందనలను సేకరించి ప్రచురించింది. సరే  ఆ ప్రచురించేది ఏదో ఉన్నది ఉన్నట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా ప్రచురిస్తే  ఎవరికీ ఏ అభ్యంతరం ఉండక పోవును. కానీ  రాజును మించిన రాజభక్తి చూపించే క్రమంలో కావచ్చు  నమస్తే తెలంగాణ  పత్రికలో పనిచేసే చేయి తిరిగిన సంపాదక రచయితలు కాళిదాసు కవిత్వం  కొంత, తమ పైత్యం కొంత అన్నట్లుగా తమ పాండిత్యాన్ని కలిపి కథలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. అందులో భాగంగా ఈ దేశాన్ని ఒక్క కేసీఆర్  తప్ప ఇంకెవరు  రక్షించలేరనే అభిప్రాయం వ్యక్త పరిచినట్లు పేర్కొంటూ  కొందరు ప్రముఖుల ‘ఇంటర్వ్యూ’ ప్రచురించారు.  ఇలా వచ్చిన ఇంటర్వ్యూలలో న్యూడిల్లీలో  ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు లిజ్ మాథ్యూ కూడా ఉన్నారు.  అయితే తన ఫోటోతో సహా వచ్చిన ఇంటర్వ్యూ  చూసిన  ఆమె ఆశ్చర్యపోయారు. తాను అనని మాటలను తన నోట్లో ఎలా పెడతారని  చాలా సీరియస్ గా రీయాక్ట్ అయ్యారు.  నమస్తే తెలంగాణ తప్పుడు రాతలను ఖండిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు. మాములుగా అయితే  నమస్తే ఇలాంటి ట్వీట్లను పట్టించుకోకపోయేదేమో కానీ  మాథ్యూ ఘాటుగా లేఖ రాయడంతో, తప్పనిసరై క్షమాపణ ప్రచురించింది.  అయితే, నమస్తే తెలంగాణ ఇలా తప్పులో కాలేయడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతులు, గ్రామ సర్పంచ్ లు తెలంగాణలో అమలవుతున్న పథకాలను మెచ్చుకుంటున్నారని, తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారని ఇలాగే పేర్లు, ఫోటోలు పెట్టి కధనాలు ప్రచురించింది. అప్పట్లోనూ అక్కడి రైతులు ఎవరి ఫోటోలను అయితే పత్రిక ప్రచురించిందో ఆ సర్పంచులు ఆ వార్తలను ఖండించారు.  నమస్తే తెలంగాణ పత్రికను తగల పెట్టి మరీ తమ  నిరసన తెలిపారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు వలన తమ పంటపొలాలు నీటి మునిగి తాము  నష్ట పోతున్నామని  కేసేఆర్ ప్రభుత్వం ఫై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే  ఇతర పత్రికలు కూడా కొంతవరకు తప్పుడు రాతలకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నా, నమస్తే తెలంగాణ  పత్రిక ముఖ్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూపు తిప్పిన తర్వాత ఈ దేశాన్ని రక్షించేందుకు పుట్టిన మహా పురుషునిగా వర్ణించే కథలు, కథనాలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు.   అయితే, తుమ్మి తధాస్తు అనుకున్నట్లుగా ఇలా వరసగా తప్పుడు కథనాలు ప్రచురించి, క్షమాణలు చెప్పుకుంటూ పొతే, చివరకు ఆపత్రికలో వచ్చే నిజాలను కూడా ప్రజలు నమ్మడం మానేస్తారు. నిజానికి, ఇప్పటికే నమస్తే పత్రికను తెలంగాణ ప్రజలు అంతగా నమ్మడం లేదని అంటున్నారు.

నావెంటే అంద‌రూ...కాదు నావెంటే! 

త‌న వెంట గుప్పెడుమందే మిగిలినా, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే ఎన్నిక‌ల క‌మిష‌న్ కి ఇచ్చిన వివ‌ర‌ణ‌లో మాత్రం ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే శివ‌సేన వెంట స‌భ్యుల సంఖ్య సున్నాగా పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీలో  శివ‌సేన స‌భ్యుల‌ను  త‌న‌వైపు లాక్కుని ఏక్‌నాధ్ షిండే త‌న ఆధిప‌త్యం ప్ర‌దర్శించిన నాలుగు మాసాల త‌ర్వాత ఉద్ధ‌వ్ థాక్రే త‌న పార్టీ స‌భ్యుల డేటా వివ‌రాలు ఎన్నిక‌ల క‌మిషన్ కు స‌మ‌ర్పిస్తూ, పార్టీ పేరు, గుర్తు అన్నీ తాము పొందేందుకు అర్హ‌త ఉంద‌ని పేర్కొ న్నారు.  టెక్నిక‌ల్‌గా ఇప్ప‌టికీ శివ‌సేన పార్టీ అధినేతగా ఆ పార్టీని యాభ‌య్యేళ్ల క్రితం స్థాపించిన బాల్ థాక్రే పేరు ఉంది. అయితే ప్ర‌స్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది త‌న‌తో లేర‌ని ఉద్ధ‌వ్ థాక్రే పేర్కొన్నారు. కానీ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రిగా ఉన్న శివ‌సేన అధినేత‌గా ప్ర‌చారం చేసుకుంటున్న ఏక్‌నాథ్ షిండే వెంట కూడా ఎవ్వ‌రూ లేరని ఉద్ధ‌వ్ పేర్కొన్నారు. పార్టీ రెబెల్ నాయ‌కుల‌ను షిండే తో ఉన్న‌ట్టుగా చూపించ‌రు. కార‌ణం వారు పార్టీ మార‌డం పై  అన‌ర్హ‌త వేటు కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్క‌న చూస్తే షిండే వెనుక చాలా త‌క్కువ‌మందే ఉన్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. అయితే టెక్నిక‌ల్‌గా పార్టీ ఛీఫ్ ఉద్ధ‌వ్ థాక్రే నే క‌నుక ఎన్నిక‌ల క‌మిష‌న్ వారి పార్టీ స‌భ్యుల వివ‌రాల సంబంధించి ఆయ‌న స్పందించాల‌న్న‌ది. షిండే తోపాటు కొంద‌రు పార్టీ నుంచి స్వ‌యంగా విడిపోయారు గ‌నుక పార్టీ సింబ‌ల్‌ను న‌వంబ‌ర్ 3 న జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ఉప‌యోగించ‌డానికి వీలులేద‌ని ఉద్ధ‌వ్ డిమాండ్ చేస్తున్నారు.  స‌భ్యుల వివ‌రాల విష‌యానికి వ‌స్తే, మొత్తం 54 మంది సేనా ఎమ్మెల్యేల్లో 14 మంది, అలాగే మండ‌లిలోని 12 మంది స‌భ్యులు, అలాగే  రాజ్య‌స‌భ లోని ముగ్గురు ఎంపీలు, 19 మంది ఎంపీల్లో ఏడుగురు త‌న‌కు  మ‌ద్ద తుగా ఉన్నార‌ని  థాక్రే  పేర్కొ న్నారు. అయితే షిండే వేపు వెళ్లిన‌వారిపై అన‌ర్హ‌త వేటు పై కేసులు పెం డింగ్ లో ఉన్నాయని ఎన్నిక‌ల క‌మిష‌న్ కి  థాక్రే వివ‌రించారు. 288 మంది స‌భ్యుల అసెంబ్లీలో షిండే 164 మంది మ‌ద్ద‌తుతో అధికారంలోకి రావ‌డానికి అర్హ‌త సంపాదించారు. షిండేతో జ‌త‌క‌ట్టిన బీజేపీ  త‌ర‌ఫున 106 మంది  ఉన్నారు. పార్టీ ఆఫీసు సంబంధించిన వారిలో చాల‌మంది షిండే పంచ‌నే చేరారు.  కానీ పార్టీ 2018 జ‌న‌వ‌రిలో ఏర్ప‌డిన‌ట్టుగా షిండే పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ లో ప్ర‌క‌టించారు. మొత్తం 234 మంది స‌భ్యుల్లో 160మంది మ‌ద్ద‌తు ల‌భించింది. కానీ అది షిండే వెంట ఎవ్వ‌రూ లేరన్న‌దే ఈసీ కి అందించిన జాబితాలో తెలియ‌జేసింది. అయితే టీమ్ థాక్రే మాత్రం సుమారు ప‌ది ల‌క్ష‌ల‌మంది మ‌ద్దతు ఉంద‌ని ప్ర‌క‌టించుకుంది. మ‌రో వంక రెబెల్ వైపు కేవ‌లం 1.6 ల‌క్ష‌ల‌మందే ఉన్న‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చింది. ఇప్ప‌టికే పోల్ ప్యాన‌ల్ కోసం అయిదు ల‌క్ష‌ల మంది పార్టీలో చేర్చే ల‌క్ష్యంతో అందుకు సంబంధించిన అఫిడెవిట్లు  సేక‌ర‌ణ ప‌నిలో ఉంది. అంతేగాక పార్టీ సంస్థాగ‌త ప‌ద‌వులు క‌లిగిన వారిలో రెండు ల‌క్ష‌ల 62 వేల‌మందికి పైగా త‌మ ప‌క్షాన ఉన్న‌ట్టుగా టీమ్ థాక్రే పేర్కొన్న‌ది. చిత్రంగా  ఇందులోనూ పురుషులు, స్త్రీలు  స‌భ్యుల సంఖ్య స‌రి స‌మానంగా ఉన్నార‌ న్న‌ది.  బిజేపీ మ‌ద్ద‌తుతో అధికారంలోకి వ‌చ్చిన షిండే వ‌ర్గం త‌మ‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించ‌డానికి వీలులేద‌నే వాదిస్తున్నారు. బాల్‌థాక్రే స్థాపించిన  పార్టీ హిందుత్వ వాదాన్నించి ఆయ‌న కుమారుడు ఉద్ద‌వ్ థాక్రే  త‌ప్పుకున్నార‌ని, బీజేపీతో విడిపోయి 2018లో కాంగ్రెస్, ఎన్‌సిపీల‌తో క‌ల‌వ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని షిండే వర్గం వాదిస్తోంది. ఇక ఇపుడు ఎన్నిక‌ల క‌మిష‌న్  థాక్రే నాయ‌క‌త్వంలోని శివ‌సేన త‌న పార్టీ గుర్తుగా  బాణం విల్లంబు ను అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక‌కు ఉప‌యోగించ‌డానికి  అనుమ‌తిస్తుందా లేదా అన్న‌ది నిర్ధారించాల్సి ఉంది. జూన్‌లో శివ‌సేన‌లో చీల‌క త‌ర్వాత జ‌రుగ‌నున్న పెద్ద ఎన్నిక ఇదే. 

కాంగ్రెస్ గూటికి తుమ్మల?.. టీఆర్ఎస్ కు ఝలక్కేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోందా? మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా సాగుతోందా? అంటే జిల్లాలో వరుసగా సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వచ్చేటట్లుంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ సీనియర్ల మాట ఎలా ఉన్నా క్యాడర్ లో మాత్రం కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలోకి చేరికలు పెరిగాయి. అదే దారిలో టీఆర్ఎస్ కు చెందిన కీలక నేత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నుంచి  తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.   కందాల ఆ తరువాత తెరాస గూటికి చేరారు. దీంతో తుమ్మల ప్రాభవం నియోజకవర్గంలో బాగా తగ్గిపోయింది. తెరాస అధినేత కూడా తుమ్మలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో కందాల మాటే చెల్లుబాటౌతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకింత అసంతృప్తికి గురైన తుమ్మల.. తాజాగా కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు అనడంతో ఇక తెరాసలో ఉంటే రాజకీయంగా మనుగడ ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ సమావేశాలకు కూడా తుమ్మలకు ఆహ్వానం అందడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తుమ్మల కాంగ్రెస్ వైపు దృష్టి సారించారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరే విషయంపై తన అనుచరులతో పలు మార్లు చర్చించిన తుమ్మల ఇక ఏ క్షణంలోనైనా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెరాస వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

కేసీఆర్ ఇంట్లో పంజరంలో పాలపిట్ల

ముహూర్తం చూసుకుని గృహ‌ప్ర‌వేశం చేస్తారు, తారాబ‌లం చూసి పెళ్లిచేస్తారు, మంచి స‌మ‌యంలో ప‌ను లు ఆరంభించ‌డానికి అనేక న‌మ్మ‌కాలమీద ఆధార‌ప‌డ‌టం ప‌రిపాటి. అది చాలా స‌హ‌జంగా జ‌రిగితే మ‌రీ బాగుంటుంది. అంతేకాని ఫ‌లానా కార్య‌క్ర‌మం చేప‌డుతున్నాను, పిల్లిని ఎదురురాకుండా చూడండి అనో, ఆవును ఎదురుగా తీసుకురండి అనో, పాల‌పిట్ట‌ను ప‌ట్టి తెమ్మ‌నో చెబితే అది మ‌న‌సుకు ఆనందా న్నిస్తుందా. అది గొప్ప ప్ర‌యోజ‌నం చేకూరుస్తుందా అంటే క‌ష్ట‌మే. కానీ ఇటువంటి స‌రికొత్త బ‌ల‌వంత‌పు న‌మ్మ‌కాన్నే తెలం గాణా సీఎం కేసీఆర్ అనుస‌రించారు. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను చూస్తే అంతా శుభం క‌లుగుతుంద‌ని తెలం గాణా అంత‌టా గొప్ప న‌మ్మ‌కం. కేసీఆర్ మాత్రం నిరాశ‌ప‌డ‌టం ఇష్టంలేక‌నే త‌న నివాసానికి పాల‌పిట్ట నే ర‌ప్పించుకున్నారు.. పంజ‌రం లో.  చిలుక జోస్యం చెప్పేవారు చిలుక‌ను పంజ‌రం ప‌ట్టి తిరుగుతూంటారు. అలా పాల‌పిట్ట దొర‌క‌దు పంజ‌రం లో ఠ‌పీమ‌ని ప‌ట్టి బంధించ‌డానికి. దేశ‌రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న రెండింత‌ల ఉత్స‌హంతో ఉర‌క‌లు వేస్తు న్న కేసీఆర్‌కు పాల‌పిట్ట జోస్యం చెప్ప‌దు. ద‌ర్శ‌నంతోనే అన్ని శుభాలు క‌లుగుతాయ‌న్న‌ది న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కంతోనే పాల‌పిట్ట ద‌ర్శ‌నాన్ని కోరుకున్నారు. అలాగ‌ని దాని కోసం తోట‌లోనో, మేడ‌మీద‌నో  వేచి ఉండ‌డం క‌ష్టం.. అందుకే తెమ్మ‌ని పుర‌మాయించారనే అనుకోవాలి. ఎందుకంటే దాన్ని ప‌ట్టి పంజ‌రంలో తెప్పించ‌డం,కేసీఆర్ కుటుంబ‌స‌భ్యులే దాన్ని ప్ర‌త్యేకంగా ద‌ర్శించుకోవ‌డం, ఆనందించ‌డం అయింది. శుభ‌ద‌ర్శ‌నం ప్ర‌భావం అదృష్టాన్ని మారుస్తుందా? అనేది కోటి మంది వేస్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే,  కేసీ ఆర్  దేశ‌రాజ‌కీయాల్లోకి  వెళ్ల‌డానికి టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్‌గా మార్చి అంద‌రినీ క‌లుపుకుంటూ దూసుకు పోవాల‌నుకుంటున్నారు.  కానీ పార్టీ కి కొత్త‌పేరు పెట్ట‌డానికి ఏర్పాట‌యిన నామ‌క‌ర‌ణోత్స‌వానికి పార్టీ వారు తప్ప ఆయ‌న ఆశించిన‌ట్టు ఇత‌ర రాష్ట్రాల‌వారు ఎవ్వ‌రూ ప‌రుగున వ‌చ్చి అభిమానం ప్ర‌ద‌ర్శిం చ‌లేదు. ఒక్క క‌ర్ణాట‌క మాజీముఖ్య‌మంత్రి త‌ప్ప‌. చిత్ర‌మేమంటే క‌నీసం  హ‌లో అని ప‌ల‌క‌ రించ‌ లేదు. అంతేకాదు ఆదిలోనే హంస‌పాదులా ఇపుడు కేసీఆర్ ఎత్తుగ‌డకు అడ్డంకి వ‌చ్చిప‌డింది. బీఆర్ఎస్ నామ‌క‌ర‌ణోత్సవానికి వ‌చ్చి ఫోటోలు దిగి శుభాకాంక్ష‌లు చెప్పిన క‌న్న‌డిగులు ఇపుడు క‌ర‌చా ల‌నానికి కాదు పొమ్మ‌న్నారు. ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ క‌ర్ణాట‌క‌కు పూల‌గుచ్ఛంతో పాటు పాల‌పిట్ట‌నీ చూసి వెళ్లా ల్సిందేమో.

మునుగోడులో ముసురుకుంటున్న యుద్ధ‌మేఘం!

ఇక మునుగోడు యుద్ధ‌క్షేత్రంగా మారిన‌ట్టే. తెరాస అభ్యర్థిగా  కూసుకుంట్ల  ప్ర‌భాక‌ర్ రెడ్డికి కేసీఆర్ బీఫామ్ ఇవ్వడంతో ఉప ఎన్నిక రంగంలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులెవరన్నది తేలిపోయింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు మునుగోడులో విజయమే లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు మునుగోడులో విజయాన్ని అత్యంత ప్రతిష్ఘాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలూ కూడా మునుగోడులో తమ చతురంగ బలాలను దించేశాయి. ఎన్నికల యుద్ధానికి సర్వం సహా సిద్ధమైపోయాయి. ఇప్పటి వరకూ తెరాస అభ్యర్థి ఎవరన్న దానిపై ఉన్న సందిగ్ధం కేసీఆర్ కూసుకుంట్లను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ సస్పెన్స్ కూ తెరపడింది.  మునుగోడు పై  ప్ర‌త్యేక దృష్టిసారిస్తూ టీఆర్ఎస్ వీరాభిమానులు, కార్య‌క‌ర్త లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా  పార్టీ  విజయానికి  కంక‌ణం క‌ట్టుకుని రంగంలోకి దిగారు. మొన్న‌టి వ‌ర‌కూ పార్టీ అభ్య‌ర్ధి ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో కాస్తంత మెల్ల‌గా క‌దిలిన కారు పార్టీ  కార్య‌క‌ర్త‌లు  ఇపుడు  ఇక జ‌నాల్లోకి ప్ర‌చార‌సామ‌గ్రితో రంగంలోకి దిగిపోయారు.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి  కాంగ్రెస్‌ను వ‌ద‌లి బీజేపీ లోకి చేర‌డంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే.  మునుగోడు ఉప ఎన్నిక‌కు కార‌ణ‌మైన  కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తాజా మాజీ హోదాలో బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న సంగతి విదితమే. కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి చేరికతో అనూహ్యంగా  మునుగోడులో కమలం బలం గణనీయంగా పెరుగుతుందని ఆశించినా, ఆశించిన స్థాయిలో  చేరికలు లేకపోవడంతో కమలం హై కమాండ్ అప్రమత్తమైంది. సర్వ శక్తులూ ఒడ్డైనా మునుగోడులో విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కేడర్ లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని పట్లుదలతో ఉంది.  అందేకే పార్టీ రాష్ట్ర నాయకులనే నమ్ముకుని కూర్చోకుండా కేంద్రం నుంచి పరిశీలకులు, పర్యవేక్షలను రంగంలోనికి దింపింది.  ముఖ్యంగా జెపి న‌డ్డా, కేంద్ర‌హోం మంత్రి అమిత్ షా కూడా మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే, మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పాల్వాయి స్ర‌వంతి ఉన్నా రు.  బీజేపీ, టీఆర్ ఎస్‌ల‌కంటే ముందే ఆమె ప్ర‌చారం ప్రారంభించారు.  సీనియ‌ర్ నేత‌గా  పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పేరును కూడా ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.  బీజేపీ, టీఆర్ ఎస్‌ల‌ది అధికార దాహమే తప్ప   ప్ర‌జ‌ల‌కు మేలు చేయా ల‌న్న ఆలోచ‌న త‌క్కువేనంటూ ప్ర‌చారం ఆరంభించింది కాంగ్రెస్.   

విద్వేషం పెంచడమే కమలం రాజకీయమా?

ప్రజలలో విద్వేషాలను రెచ్చగొట్టడమే తమ రాజకీయం అన్నంతగా తెగిస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. రాష్ట్రాలలో కూడా తమ అధికారాన్ని విస్తరించుకోవడానికి అదే మార్గం అన్న విశ్వాసంతో ముందుకు కదులుతున్నచందంగా ఉంది ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే. తెలంగాణలో ఎలాగైనా సరే పాగా వేయాలి, అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ ఇప్పుడు రజాకార్ల పేర సరికొత్త రాజకీయానికి తెరలేపుతోంది. నాటి రజాకార్ల అరాచకత్వాన్నిఇప్పటి ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తామంటూ సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుబండి సంజయ్ పర్యవేక్షణలో  రజాకార్ అనే  పేరుతో ఒక సినిమా నిర్మాణంలో ఉందని చెబుతున్నారు. ఇక కాశ్మీర్ ఫైల్స్ లా రజాకార్ ఫైల్స్ అనే సినిమా కోసం దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రెడీ చేశారని చెబుతున్నారు. ఆ కథను స్వయంగా మోడీ విని ఓకే చేశారని కూడా అంటున్నారు. ముందుగా విజయేంద్ర ప్రసాద్ కు కేవలం ఐదు నిముషాల సమయం కేటాయించి అప్పాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ.. కథ వింటూ దాదాపు అరగంట  వరకూ ఆ అప్పాయింట్ మెంట్ సమయాన్నిపొడిగించారని కూడా బీజేపీ శ్రేణులు అంటున్నాయి.  ఆ తరువాతే అమిత్ షా మోడీ సూచనల మేరకు తన హైదరాబాద్ పర్యటనలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో  ఇరువురి భేటీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ    భేటీపై పలు రకాల ఊహాగానాలు పైతం వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించారనీ, తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారనీ.. ఇలా పలు రకాల  వాదనలు తెరపైకి వచ్చాయి.   అయితే ఎన్టీఆర్ తో భేటీపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ ఓ అద్భుత నటుడితో భేటీ ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు.   బీజేపీ సీనియర్లు అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో ఆయనతో భేటీ కావాలని భావించారని, అందుకే ఆయన ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ భేటీ అయ్యారనీ చెప్పారు. అయితే అవన్నీ వాస్తవం కాదనీ,  మోడీ ఆదేశాల మేరకు రజాకార్ ఫైల్స్ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ ను ఒప్పించేందుకే అమిత్ షా ఆయనతో సమావేశమయ్యారని అప్పట్లోనే పరిశీలకులు పేర్కొన్నారు. తరువాత తరువాత రజాకార్ ఫైల్స్ సినిమాపై చర్చించేందుకే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని రాజకీయ వర్గాలు ధృవీకరించాయి. రజాకార్ ఫైల్స్ సినిమా తెలంగాణలో బీజేపీ పలుకుబడి పెంచుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రకు సర్వత్రా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజాకార్ ఫైల్స్ సినిమాలో నటిస్తే కాశ్మీర్ ఫైల్స్ ను మించి ప్రజలను ఆకట్టుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ ను సినిమాతో ఆపేయకుండా వెబ్ సిరీస్ కూడా తీయాలన్న భావనతో ఉన్నారనీ, రెంటిలోనూ జూనియర్ ఎన్టీఆరే ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని  అప్పట్లో రాజకీయ, సినీ వర్గాలలో బాగా వినిపించింది. అయితే అటు బీజేపీ కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.  ఇప్పుడు మళ్లీ నటీనటుల ప్రస్తావన లేకపోయినా రజాకార్ ఫైల్స్ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి.  

 ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం...ముత్తాపై ఈడీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం 

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం నేప‌థ్యంలో  హైద‌రాబాద్‌లో ఈడీ దాడులు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఊహించని విధంగా ఇండియా అహెడ్ ఆంగ్ల వార్తా ఛానెల్ మీదా దాడులు చేప‌ట్ట‌డం ఒక్క‌సారిగా ప‌త్రికా లోకం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తెలుగు దిన‌ప‌త్రిక ఆంధ్ర‌ప్ర‌భ యాజ‌మాన్యానికి సంబంధించిన ఈ ఆంగ్ల వార్తా ఛాన‌ల్ మీద ఈడీ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఇందులో కొంత‌కాలం సేల్స్ విభాగం అధిపతిగా ఉన్న అర్జున్ పాండే కుంభ‌కోణంలో కీల‌క‌పాత్ర వ‌హించ‌డం మ‌రింత వెలుగులోకి వ‌చ్చింది. అలాగే ఇందులో మ‌రొక కీల‌క వ్య‌క్తిగా భావిస్తున్న బోయిన‌ప‌ల్లి అభిషేక్ కూడా ఆంధ్ర‌ప్ర‌భ ఇండియా అహెడ్‌లో పెట్టుబ‌డు లు పెట్టార‌న్న‌ది బ‌య‌ట‌ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే ప‌క్కా ఆధార‌ల‌తో  శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌భ య‌జ‌మాని ముత్తా  గోపాల కృష్ణ‌ను ఈడీ ప్ర‌శ్నించింది.  శుక్ర‌వారం ఢిల్లీ, పంజాబ్‌, హైద‌రాబాద్‌ల‌తో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో ఈడీ తాజా దాడులు చేప ట్టింది. ఇందులో భాగంగానే హైద‌రాబాద్‌లోని ఆంధ్ర‌ప్ర‌భ కార్యాల‌యంపైనా సాయింత్ర‌వ‌ర‌కూ సోదాలు చేశారు. మ‌రీ ముఖ్యంగా అస‌లు ఈ కుంభ‌కోణంలో కీల‌కంగా భావిస్తున్న అర్జున్ పాండేకు ముత్తా గోపాల కృష్ణ కుటుంబం నిర్వ‌హిస్తున్న ఆంగ్ల ఛాన‌ల్‌కి  సంబంధాల మీద‌నే ఎక్కువ దృష్టి పెట్టారు. అంతేగాక‌, ఢిల్లీలో  ఉప ముఖ్యమత్రి మనీష్‌ సిసోడియా సన్నిహితుడుగా భావిస్తున్న  దినేశ్‌ అరోరా, హైదరాబాద్‌లో అభినవ్‌(మాదాపూర్‌), శరత్‌ చంద్ర(కూకట్‌పల్లి) ఇళ్లపైనా దాడులు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపా రు. గతంలో అరెస్టు చేసిన సమీర్‌ మహేంద్రు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి.  తెలంగాణా అధికార టీఆర్ ఎస్ పార్టీ ముఖ్య‌నేత‌ల‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న బోయిన్‌ప‌ల్లి అభి షేక్ నివాసం, కార్యాల‌యాల్లో ఈడీ గ‌తంలో దాడి చేసిన‌పుడు లిక్క‌ర్ స్కామ్‌లో ఏ-14గా ఉన్న రామ చంద్ర పిళ్లై సంస్థ‌ల్లో అభిషేక్ భాగ‌స్వామిగా ఉన్న‌ట్టు తెలిపే ఆధారాలు ల‌భించాయి. ఇపుడు తాజాగా ఇండియా అహెడ్ సంస్థ‌లో అభిషేక్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌సంగ‌తి వెలుగుచూసింది. ముత్తా గోపాల‌కృష్ణ కుమా రుడు గౌత‌మ్తో పాటు అభి షేక్ జేఈయూ ఎస్ నెట్‌వ‌ర్కింగ్ ప్ర‌యివేట్ లిమిటెడ్‌కు డైరెక్ట‌ర్లుగా ఉన్నారు. ఈ సంస్థ కు 2021 నుంచీ అభిషేక్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు.   ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో  ఏ-15గా ఉన్న అర్జున్ పాండే అక్క‌డి మీడియాకు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు సిబీ ఐ ఆరోపించింది.  ఇండోస్పిరిట్‌ సంస్ఠ ఎండీ సమీర్‌ మహేంద్రు నుంచి ఓన్లీ మచ్‌ లౌడర్‌ సంస్థ సీఈవో విజయ్‌ నాయర్‌ తరపున అర్జున్‌ పాండే కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. జూబ్లీహిల్స్‌ కార్యాలయంలో సోదాల్లో పలు పత్రాలు సాంకేతిక ఆధారాల్ని ఈడీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోనూ ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. 

శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. ఇక శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం కలిగింది.   ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.  విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో శ్రైశైలం వెళ్లే ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు.   కొండ చరియలు విరిగిపడిన సమయంలో ఆ మార్గంలో వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం ఘా ఘాట్ కుండా వందల సంఖ్యలో వాహనాలలో భక్తులు శ్రీశైలానికి వెళుతుంటారు. కొండచరియలు విరిగిపడటంతో   వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేస్తున్నారు.

క్యూలైన్లు నిండిపోయాయి.. రేపు రండి.. భక్తులకు టీటీడీ విన్నపం

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని అంచనా వేయడంలో విఫలమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమై చేతులెత్తేసింది. క్యూలైన్లు నిండిపోయాయి.. రేపు రండి అంటూ భక్తలను వేడుకుంటోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తలు తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారాంతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తిరుమల భక్త జనంతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. దీంతో   భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి 48 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక క్యాటేజీలన్నీ నిండిపోవడంతో వసతి దొరకక భక్తులు నానా అవస్థలూ పడుతున్నారు. క్యూలైన్లన్నీ నిండిపోయాయనీ, భక్తులు యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకుని శనివారం ఉదయం క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ భక్తులను కోరుతోంది.

కర్నాటకలో పాయె అయిపాయె.. బీఆర్ఎస్ పొత్తుకు నో అన్నకుమార స్వామి

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటించేందుకు దసరా రోజున ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అంత కంటే ఆర్భాటంగా కర్నాటక నుంచి మందీ మార్బలంతో తరలి వచ్చిన జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తిరిగి తమ రాష్ట్రం వెళ్లగానే బీఆర్ఎస్ గాలి తీసేశారు. ఇక్కడ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మీడియా చిట్ చాట్ లో బీజేపీ పై విమర్శలు గుప్పిస్తూ.. బీఆర్ఎస్ వేగంగా విస్తరిస్తుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పోటీ చేస్తుదని, వేగంగా జాతీయ హోదా తెచ్చుకుంటుందనీ చెప్పారు. సరిగ్గా దాదాపు అదే సమయంలో కర్నాటకలో జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మాట్లాడుతూ, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదనీ, ఆ పార్టీకి కర్నాటకలో తాము అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశమే లేదనీ కుండ బద్దలు కొట్టేశారు.   తెలుగువారు ఎక్కువ ఉన్న చోట బీఆర్ఎస్ .. జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందన్నారు. ఇక పార్టమెంటు స్థానాల విషయానికి వస్తే పా‌ర్లమెంట్ ఎన్నికల సమయంలో   తెలంగాణ శివారు ప్రాంతాలైన ఒకటి, రెండు స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ పోటీచేసే అవకాశం ఉందని వివరించారు. అంటే.. జేడీఎస్ నేత కుమారస్వామి బీఆర్ఎస్ కర్నాటకలో పోటీ చేయదనీ, ఆ పార్టీ అభ్యర్థులను నిలబెడితే తమ మద్దతు ఉండదనీ, జేడీఎస్, బీఆర్ఎస్ ల మధ్య పొత్తేమీ లేదనీ చెప్పకనే చెప్పేశారు. ఉంటే గింటే జాతీయ స్థాయిలో అంటే పార్లమెంటు ఎన్నికలలో కొద్దో గొప్పో అవగాహన ఉంటుందని కుమారస్వామి చెప్పారు.  దీంతో కేసీఆర్, కేటీఆర్ లు బీఆర్ఎస్ విషయంలో చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రగల్భాలు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదన్న చందంలో ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ మంతా తెలంగాణ మోడల్ అభివృద్ధిని కోరుకుంటున్నది అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. జాతీయ స్థాయిలో మద్దతు వచ్చే వారు ఎవరన్న విషయంలో ఇప్పటి దాకా స్పష్టత ఇవ్వలేకపోతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.  

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆంధ్రప్రభ కార్యాలయంలో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఆంధ్రప్రభ కార్యాలయంపై శుక్రవారం (అక్టోబర్ 7) దాడులు నిర్వహించింది. ఈ దాడులతో లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ మీడియా మేనేజ్ మెంట్ బహిర్గతమైంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం రూ.20 కోట్లను ఆంధ్రప్రభకు బదలీ చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ మొత్తాన్ని  తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడైన అభిషేక్ రెడ్డి ఆంధ్రప్రభలో ఇన్వెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. కాగా ఆంధ్రప్రభ ఎండీ గౌతమ్ ను ఈడీ అధికారులు ఆయన నివాసంలో విచారిస్తున్నారు. ఇలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ  ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుల నివాసాలలో కూడా సోదాలు నిర్వహిస్తోంది. మనీష్ సిసోడియా సన్నిహితులు దినేష్ అరోరా నివాసం, కార్యాలయాలతో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలో కూడా శుక్రవారం దాడులు చేసింది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దినేష్ అరోరా ఖాతాలలో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు చెబుతున్నారు.  రాధాకృష్ణా ఇండస్ట్రీ ద్వారా రూ. కోటి నగదు దినేష్ అరోరా ఖాతాకు బదిలి అయినట్లు, ఆ సోమ్మును దినేష్ అరోరా మనీష్ సిసోడియాకు అందించినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే హైదరాబాద్ లో మాదాపూర్ లోని అభినవ్ రావ్ నివాసాలు, కార్యాలయాలపైనా, అలాగే కూకట్ పల్లికి చెందిన శరత్ చంద్ర నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే ఆంధ్రప్రభ కార్యాలయంలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి షర్మిల ఫిర్యాదు

తెలంగాణలో రాజకీయ సందడి జోరందుకుంది. ఇప్పటి వరకూ కేవలం విమర్శలకే పరిమితమైన పాదయాత్రల బాటసారి షర్మిల ఇప్పుడు యాక్షన్ లోకి దిగారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి రాష్ట్రంలో నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్న షర్మిల పాదయాత్రకు ఒకింత విరామమిచ్చి హస్తిన వెళ్లారు. ఇంత కాలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం, తెరాస ప్రభుత్వం, నాయకులపై చేసిన విమర్శలకు కొనసాగింపుగా ఆమె హస్తినలో నేరుగా సీబీఐ డెరెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసి, తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలనూ సమర్పించారు.  తెరాస ను భారాస( భారతీయ రాష్ట్ర సమితి)గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తరువాత రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ వేదికగానూ తెలంగాణ రాజకీయాలు వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. తెరాస బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం వెలువడిన తరువాత షర్మిల హస్తిన బాట పట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ హస్తిన ముఖం చూడని షర్మిల ఇప్పుడు తొలిసారిగా ఢిల్లీ పర్యటన పెట్టుకోవడంతో.. ఆమె ఢిల్లీలో  ప్రభుత్వ పెద్దలతో వరుస భేటీలు జరుపుతారన్న ఊహాగానాలను పూర్వపక్షం చేస్తూ నేరుగా సీబీఐ మెట్లెక్కారు. తెలంగాణ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటూ ఆమె ఇంత కాలం ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే అవినీతిపై ఆమె సీబీఐ డైరెక్టర్ ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆమె తన ఫిర్యాదులే పేర్కొన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మేఘా కంపెనీతో కలిసి కేసీఆర్ సర్కార్ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా  దాదాపు ఇరే ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు అవే ఆరోపణలతో షర్మిల ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత కాలం కేవలం ఆరోపణలే, కానీ ఇప్పుడు నేరుగా ఫిర్యాదు అందడంతో సీబీఐ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా ఎక్కువ అవుతోంది.   ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ,ఈడీ, ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెరాస అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత, సమీప బంధువు, ఎమ్మెల్సీ సంతోష్ రెడ్డి పేర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల  కాళేశ్వరం అవినీతిపై  ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభించడం, ఆ పార్టీ తరఫున దేశ వ్యాప్త పర్యటనకు ఉపక్రమించనున్న తరుణంలో  షర్మిల తెరాస అవినీతిపై సీబీఐకు చేసిన ఫిర్యాదు రాజకీయంగానూ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.   

బెలార‌స్ మాన‌వ‌హ‌క్కుల నాయ‌కునికి నోబెల్‌

ప్ర‌స్తుతం జైల్లో ఉన్న బెలార‌స్ మాన‌వ‌హ‌క్కుల నాయ‌కుడు అలెస్ బియాలియ‌ట్స్కీ, ర‌ష్యా మాన‌వ హ‌క్కుల సంస్థ‌, ఉక్రెయిన్ మాన‌వ‌హ‌క్కుల కేంద్రం 2022 సంవ‌త్స‌రం నోబెల్ శాంతి  బ‌హుమ‌తికి ఎంపిక‌యిన‌ట్టు ఓస్లోలోని నోబెల్సంస్థ ప్ర‌క‌టించింది. అలెస్ మ‌రియు శాంతి బ‌హుమ‌తి అందుకోనున్న ఆ రెండు సంస్థ‌లూ త‌మ త‌మ ప్రాంతాల్లో పౌర‌హ‌క్కులు, ప్ర‌జ‌లు ఎద‌ర్కొంటున్న వ్య‌వ‌స్థాగ‌త స‌మ‌స్య‌ల గురించి పోరాడ‌టంలో ఎంతో కృషి చేసిన‌ట్టు నోబెల్ సంస్థ  త‌న ట్విట‌ర్‌లో  వివ‌రించింది. కాగా అలెస్‌ ను జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని నోబెల్ క‌మిటీ బెలార‌స్ అధికారుల‌ను కోరింది. అలెస్ త‌న దేశం లో ప్ర‌జాస్వామ్యం, శాంతియుత అభివృద్ధిని ఎంతో ఆకాంక్షించారు. అందుకు ఎన‌లేని కృషి చేశార‌ని  నోబెల్  క‌మిటీ ప్రశంసించింది.  అలెస్ 1996లో వియాస్నా(స్ప్రింగ్‌) అనే సంస్థ‌ను నెల‌కొల్పి జైళ్ల‌లో మ‌గ్గుతున్న అనేక‌మంది రాజ‌కీయ ఖైదీల ప‌రిస్థితుల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చారు. మాన‌వ‌హ‌క్కుల‌ను తుంగ‌లో తొక్కుతున్నార‌ని ప్ర‌భుత్వ విధానాల‌ను తీవ్రంగా ఖండించారు.  ఉక్రెయిన్ సెంట‌ర్ ఫ‌ర్ సివిల్ లిబ‌ర్టీస్ సంస్థ ఆ దేశంలో ప్ర‌జాస్వామ్యం, మాన‌వ‌హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు ఏర్పాట‌యింది. అక్క‌డ పూర్తిస్థాయిలో ప్ర‌జాస్వామ్యం నెల కొనేందుకు ఎంతో పాటుప‌డింద‌ని నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది. 2022 ఫిబ్ర‌వ‌రిలో ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి త‌ర్వాత ర‌ష్యా కుతంత్రాలు, దాడుల‌పై ప్ర‌త్యేకంగా డాక్యుమెంట్ రూపొందించ‌డంలో కీల‌క‌పాత్ర వ‌హిం చింది.   అలాగే  1987లో ఆరంభ‌మ‌యిన మెమోరియ‌ల్ సంస్థ పాత సోవియ‌ట్ యూనియ‌న్‌లో క‌మ్యూనిస్టు పాల‌ కుల చేత అణ‌చివేత‌కు గుర‌యిన‌వారిని ర‌క్షించ‌డంలో వారి కోసం పాటుప‌డిన సంస్థగా ప్ర‌పంచ‌ స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా చెచెన్ యుద్దాల స‌మ‌యంలో, ర‌ష్యా, ర‌ష్యా మ‌ద్ద‌తు దారుల దాడులకు గుర‌యిన వారి ప‌రిస్థితులు, దేశం ఎదుర్కొన్న దుర్భ‌ర స్థితుల గురించి ఎంతో స‌మాచారం సేక‌రించి మాన‌వ‌హ‌క్కుల సంర‌క్ష‌ణ విష‌యంలో గొప్ప కృషి చేసిన గుర్తింపు పొందింది.  ఫ‌లితంగా, 2009 లో  ఈ మెమోరియ‌ల్ చెచెన్యా విభాగం అధ్య‌క్షుడు న‌లాలియా ఎస్టిమిరోవా హ‌త్య‌కు గుర‌య్యారు. 

చిరు ఘటన..ఎందుకీ రచ్ఛ

మెగాస్టార్ చిరంజీవి, పాపులర్ ప్రవచన కర్త గరికపాటి మధ్య యాధృచ్ఛికంగా జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమం వేదికగా రచ్చ రచ్చ అవుతోంది.  హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు విషయంలో గరికపాటి తొందరపాటుతోనో, తన ప్రసంగానికి అవాతరం అవుతోందనో ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అ యితే వెంటనే నిర్వాహకులు సముదాయించారు. చిరంజీవి సంయమనం పాటించారు. అక్కడితో ఆ వ్యవహారం ముగిసిపోయింది. అయితే చిరంజీవి అభిమానులూ, ఆయన సోదరుడు నాగబాబు సామాజిక మాధ్యమం వేదికగా ఈ అంశాన్ని పెద్దది చేయడానికి చూపుతున్న ఉత్సాహం చిరు గౌరవాన్ని ఇనుమడింప చేసేదిగా లేదు సరికదా.. ఏదో రూపంలో విమర్శలు చేయాలని, బురద జల్లాలనీ ప్రయత్నించే వారికి అవకాశం ఇచ్చేదిలా ఉంది. ఇప్పటికే నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు బ్రాహ్మణ సంఘాలు స్పందిస్తున్నాయి. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరు వ్యవహరించిన తీరు అహంకారానికి నమూనాగా ఉందనీ, అందుకనే ప్రవచన కర్త గరికపాటి అసహనం వ్యక్తం చేశారనీ వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నాయి. అవును నిజమే అలయ్ బలయ్ కార్య‌క్ర‌మంలో చిరంజీవి – గ‌రిక‌పాటి జరిగిన చిరు ఘటన అవాంఛనీయమే.  చిరుని చుట్టిముట్టి ఫొటోలు దిగుతున్న అభిమానుల సందడి అప్పుడే ప్రసంగించడానికి ఉపక్రమిస్తున్న గరికపాటిని ఒకింత అసహనానికి గురి చేసింది. అందుకే మీరు ఫొటో సెషన్ ఆపకపోతే నేను వెళ్లి పోతాను అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. విషయం గ్రహించిన చిరంజీవి   వెంటనే అభిమానులను సముదాయించి ఫోటో సెషన్ కు స్వస్తి పలికారు. ఆ తరువాత గరికపాటి, చిరంజీవి పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. జరిగిన సంఘటన వారిరువురిపైనా ఎలాంటి ప్రభావం చూపలేదనడానికి ఇదే నిదర్శనం.  ఇరువురూ కూడా వారి వారి రంగాల్లో లబ్ధ ప్రతిష్టులు , నిష్ణాతులు. ఇద్దరిలో ఒకరు పద్మశ్రీ అయితే ఒకరు పద్మభూషణ్. జరిగిన సంఘటన కాకతాళీయమేనని ఇరువురూ గ్రహించారు. దానిని అక్కడితో ఆపేస్తే బాగుండేది.. కానీ చిరంజీవి సోదరుడు నాగ‌బాబు  అత్యుత్సాహంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా గ‌రిక‌పాటిపై కౌంట‌ర్ వేశాడు. చిరంజీవి ఇమేజ్‌ని చూస్తే ఏపాటి వాడికైనా ఈ పాటి అసూయ క‌ల‌గ‌డం ప‌రిపాటే అంటూ సెటైర్ వేశారు.  అందుకు తందాన పాడుతున్న చందంగా చిరంజీవి  అభిమానులు గ‌రిక‌పాటి క్ష‌మాప‌ణ‌లు డిమాండ్ చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. దీంతో గరికపాటికి మద్దతుగా ఆయన అభిమానులు బ్రాహ్మణ సంఘాల పేర రంగంలోకి దిగారు.  ఈ తీరు ఇటు చిరంజీవికీ, అటు గరికపాటికీ కూడా గౌరవాన్ని తెచ్చి పెట్టేది కాదు. ఒక ముగిసిన అధ్యాయాన్ని లాగి పీకి రచ్చ చేయడం తగదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిదని విజ్ణులు సూచిస్తున్నారు. 

యాపిల్ స్మార్ట్ వాచ్ టైం బాంబ్ లా పేలింది!

దీపావళి దగ్గరకొస్తోంది. టపాసుల కొనుక్కుని తనివి తీరా కాల్చాలని పిల్లలు పెద్దలూ ఉబలాటపడటం మామూలే. అయితే దీపావళికి ముందే పేలుళ్లు వినిపిస్తున్నాయి. అయితే అవి టపాసుల వల్ల వచ్చే పేలుళ్లు కాదు. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్ వాచ్ లు పేలడంతో వస్తున్న శబ్దాలు. చాలా సందర్బాలలో ఈ పేలుళ్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకులు నడుస్తుండగా పేలి మరణాలు సంభవించిన సంఘటనలు విన్నాం. చూశాం. ఎలక్ట్రిక్ బైకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాన్ని ఆయా బైకుల తయారీ కంపెనీలూ కూడా అంగీకరించాయి. అలా పేలిన బైకులకు సంబంధించి బ్యాచ్ బైకులను మార్కెట్ నుంచి ఉపసంహరించాయి కూడా. ఇక ఇప్పుడు ఈ పేలుళ్లు స్మార్ట్ వాచ్ లకూ పాకాయి. ప్రముఖ కంపెనీ యాపిల్ కు చెందిన స్మార్ట్ వాచ్ భడేల్మని పేలిపోయింది. అదృష్ట వశాత్తూ ఆ స్మార్ట్ వాచ్ యూజర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి యాపిల్ స్మార్ట్ వాచ్ వాడుతున్నాడు. ఆ స్మార్ట్ వాచ్ బ్యాటరీ ఉబ్బిపోయి లోపలి నుంచి శబ్దాలు వస్తుండటంతో భయపడిన ఆ స్మార్ట్ వాచ్ యూజర్ దానికి ఇంటి నుంచి బయట దూరంగా పడేశాడు. ఆ వెంటనే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనపై యాపిల్ స్పందించిన తీరే విమర్శలకు తావిస్తోంది. తమ కంపెనీ స్మార్ట్ వాచ్ పేలిందన్న సంగతి ఎవరికీ చెప్పవద్దంటూ ఆ వినియోగదారుడిపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఒక డాక్యు మెంట్ పై సంతకం చేయించుకుని, పేలిపోయిన వాచ్ ను రికవర్ చేసుకుంది. మొత్తం మీద స్మార్ట్ వాచ్ లు ఉపయోగించే వారు ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఈ సంఘటన చెబుతోంది.