ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు సీబీఐకి.. నందకుమార్ భార్య పిటిషన్

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. తన భర్త ఫోన్ ను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేశారని ఆరోపించారు. తన భర్త నందకుమార్ తో పాటు ఇతర నిందితులకు రిమాండ్ విధించడానికి ఏసీబీ కోర్టు తొలుత నిరాకరించిన విషయాన్ని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు  దర్యాప్తు పారదర్శకంగా జరగకుండా పలుకుబడి కలిగిన వ్యక్తులు   ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు.   సీబీఐ, సిట్‌ లేదా సిట్టింగ్‌ జడ్జికి కేసు దర్యాప్తును అప్పగించాలని ఆమె తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు నిందితులకు సంబంధించిన ఎటువంటి ఆడియోలను, వీడియోలను మీడియాకు, సోషల్‌ మీడియాకు, ఇతరులకు విడుదల చేయకుండా పోలీసులను కట్టడి చేయాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐ, సిట్‌ లేదా సిట్టింగ్‌ జడ్జి చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం (నవంబర్ 4) మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది.  

మునుగోడులో రికార్డు స్థాయిలో 93శాతం ఓటింగ్

రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 93 శాతం పోలింగ్ నమోదయ్యాంది.  రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నిటి కంటే మునుగోడు ఉప ఎన్నికలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 84.75 శాతం, దుబ్బాకలో 82.61 శాతం, నాగార్జునసాగర్‌ 88 శాతం, హుజూరాబాద్‌లో 87 శాతం ఓటింగ్‌ నమోదైంది. మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీ తలపడిన మునుగోడు ఉప ఎన్నిక చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.అక్కడక్కడా ఘర్షణలు, ఆందోళనలు తలెత్తినా మొత్తం మీద పోలింగ్ ప్రశాతంగానే ముగిసింది.  మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  5వేల మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.   మొత్తం 298 పోలింగ్‌ బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి   నల్లగొండ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించారు. 

తెరాసదే విజయం..ఎగ్జిట్ పోల్సన్నీఒకే మాట

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రధాన పార్టీలైన తెరాస, బీజేపీ, కాంగ్రెస్ లో హోరాహోరీగా తలపడ్డ ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు జరిగింది. పోలింగ్ ముగిసిన తరువాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. దాదాపు అన్నిసర్వే సంస్థలూ విజయం టీఆర్ఎస్ లే నని తేల్ేశాయి. మునుగోడు ఉప పోరులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటింయాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నిలుస్తారని తేల్చశాయి. శ్రీ ఆత్మసాక్షి ప్రకటించిన ఎగ్జిట్ పోల్ లో తెరాసకు 42 శాతం ఓట్లు,  బీజేపీకి 35 నుంచి 36 శాతం ఓట్లు వస్తాయనీ, కాంగ్రెస్ 17.5 శాతం ఓట్లకే పరిమితమౌతుందని, బీఎస్పీకి 4 నుంచి 5 శాతం ఓట్లు, ఇతరులకు ఒక శాతం  ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.  పోతే పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ మేరకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు వరుసగా 44.4%, 37.3%, 12.5% ఓట్లు వస్తాయి.  

దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీతో పెను ప్రమాదం.. కేసీఆర్

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంపై కేసీఆర్ మౌనం వీడారు.  బీజేపీ రాష్ట్రాల ప్రభుత్వాల కూల్చివేతకు సాగిస్తున్న దుర్మార్గం, పన్నుతున్న కుట్రలకు సంబంధించి దాదాపు మూడు గంటల వీడియోను విడుదల చేశారు. దేశానికి బీజేపీ పెను ముప్పుగా పరిణమించిందని ఆరోపించారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు సంబంధించి వివరాలను సాక్ష్యాధారాలతో సహా న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందజేసినట్లు చెప్పారు.  దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీ పెను ప్రమాదంగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై కేసీఆర్ తొలిసారిగా గొంతు విప్పారు. దేశంలో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ తరఫున ఏకంగా ఒక ముఠాయే పని చేస్తోందన్నారు. ఈ ముఠాకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకులని ఆరోపించారు. దేశంలో ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందనీ, ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ, ఏపీలలో ప్రభుత్వాలను కూల్చేయాలని చూస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తానేమీ ఆధారరహితంగా ఆరోపణలు  చేయడం లేదన్నారు. ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. బీజేపీ 2016 నుంచే బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేతకు ప్రయత్నాలు ప్రారంభించిందని కేసీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కాల్ లిస్ట్ మొత్తం తమ వద్ద ఉందన్నారు. దాదాప 70 వేల పేజీల సమాచారం ఉందని, ఈ సమాచారాన్ని అందరు న్యాయమూర్తులకు, దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపామనీ, అలాగే మీడియాకు కూడా అందజేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.  టీఆర్ఎస్ పార్టీలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారనీ, అయితే వారెవరినీ తాము అనైతిక పద్ధతుల్లో చేర్చుకోలేదని కేసీఆర్ అన్నారు. వారంతా స్వచ్ఛందంగా, టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి వచ్చి చేరారని, తాము స్వచ్ఛందంగా టీఆర్ఎస్ లో చేరుతామని లేఖలు ఇచ్చిన తరువాతే చేర్చుకున్నామన్నారు. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధమని కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో   ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారనీ, ప్రజాస్వమ్య హననం దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు. ఎనిమిదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ దేశంలోని అన్ని రంగాలనూ సర్వ నాశనం చేసేసిందన్నారు. నిరుద్యోగం పెరిగింది, రూపాయి విలువ పతనం అయ్యింది. విభజన రాజకీయాలతో దేశంలో ద్వేష వాతావరణాన్ని తీసుకువచ్చిందన్నారు. ఫామ్ హౌస్ కుట్ర బయటపడిన రోజునే ఈ విషయాలన్నీ చెప్పవచ్చు.. కానీ మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి కోసం మాట్లాడానంటారనే ఇంత వరకూ ఆగానని కేసీఆర్ చెప్పారు. అక్టోబర్ లో రామచంద్రభారతి హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను వారు నాకు చెప్పారు. తాండూరు ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఉందని కేసీఆర్ వివరించారు. ఇప్పటికే మోడీ సర్కార్ ను, ఆయన విధానాలను వ్యతిరేకించే పార్టీలు, పార్టీల నాయకులపై ఐటీ, సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుని వేధిస్తున్నారు. మా ఎమ్మెల్యేలకూ అదే చెప్పారు. కమలం గూటికి చేరితే ఆ వేధింపులు ఉండవని హామీ ఇచ్చారని, అలాగే బీజేపీలో చేరే ప్రతి ఎమ్మెల్యేకూ వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారనీ కేసీఆర్ తెలిపారు. అంత డబ్బు వారికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తమ వద్ద ఉన్న సమాచారాన్నీ, ఆధారాలనూ న్యాయమూర్తులకు అందజేశామన్నారు. ఈవీఎంలు ఉన్నంత వరకూ బీజేపీకి ఢోకా లేదని ఎమ్మెల్యేల కోనుగోలు కోసం వచ్చిన వ్యక్తులు చెప్పారు.    

జగన్ సర్కార్ కు షాక్.. అయ్యన్నకు రిమాండ్ తిరస్కరించిన మేజిస్ట్రేట్

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ అయ్యన్న పాత్రుడి అరెస్టు విషయంలో జగన్ సర్కార్ కు షాక్ తగిలింది. అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. వెంటనే బెయిలు మంజూరు చేసింది.   ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని పేర్కొంటూ కేసు కొట్టేసింది. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. అయ్యన్న పాత్రుడు అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు.  జగన్ హయాంలో జరుగుతున్న అరాచకపాలనకు ఈ అరెస్టు పరాకాష్టగా అభివర్ణించారు. ప్రభుత్వానికి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను అరెస్టు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ రక్తం పంచుకుపుట్టిన స్వంత చెల్లి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారనీ, ఆ వాంగ్మూలంలో తన బాబాయ్, మాజీ మంత్రి వివేకాను ఎవరు చంపారో స్పష్టంగా చెప్పారని, దీంతో జగన్ దిక్కు తోచని పరిస్థితుల్లో పడ్డారని అన్నారు. ఆ విషయం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి దాటిన తరువాత అమానుషంగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారని చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖలో భూ కబ్జాల వ్యవహారంపై తెలుగుదేశం పోరాడుతోందనీ, దాని నుంచి కూడా దృష్టి మరల్చాలనే అయ్యన్న పాత్రుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. 

అయ్యన్నకు బెయిల్ మంజూరు

భారీ బందోబస్తు మధ్య తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌ను సిఐడి పోలీసులు విశాఖ జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్  వారికి  వెంటనే  బెయిలు మంజూరు చేశారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు గురువారం (నవంబర్3) తెల్లవారుజామున అరెస్టు చేసిన సంగతి విదితమే. నర్సీపట్నంలో అయ్యన్నను ఆయన కుమారుడిని  సీఐడీ పోలీసులు   తెల్లవారు జామున దొంగల్లా గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందవే.గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పిం చిన డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు గా పేర్కొంటూ  నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురిపైనా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు దొంగల్లా గోడ దూకి దొంగల్లా ఇంట్లోకి ప్రవేశించారనీ, తలుపులు పగులగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నించారనీ అయ్యన్న పాత్రుడి కోడలు, రాజేష్ భార్య పద్మావతి ఆరోపించారు. తన భర్త రాజేష్ తలుపులు తీసి ఎందుకు వచ్చారని ప్రశ్నిచారనీ, అయితే అందుకు సమాధానం చెప్పకుండా ఈడ్చుకుపోయారనీ ఆమె ఆరోపించారు. తెల్లవార జామున తమ నివాసంపై దాడి చేసిన పోలీసులు తాగి ఉన్నారనీ, దుర్భాషలాడారని ఆమె పేర్కొన్నారు. తన భర్త రాజేష్, మామ అయ్యన్న పాత్రుడులను ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్టు చేశారని ఆమె పేర్కొన్నారు. గతంలో అయ్యన్నపాత్రుడి నివాసం దగ్గర ప్రహరీ గోడ విషయంలో వివాదం రేగిన సంగతి విదితమే. అయ్యన్న పంట కాలువ స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టారని కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. అనంతరం హైకోర్టులో పిటిషన్ వేయగా అయ్యన్న కుటుంబానికి ఊరట దొరికింది. మళ్లీ అదే కేసులో ఫోర్జరీ డాక్యు మెంట్లు కోర్టుకు సమర్పించారనే అభియోగాలపై ఇప్పుడు అయ్యన్నపాత్రుడితో పాటూ ఆయన కుమా రుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అయ్యన్ప పాత్రుడిని అక్రమంగా అరెస్టు చేయడం పట్ల తెలుగుదేశం మండి పడింది. ఏడు పదుల వయస్సులో ఉన్న వ్యక్తినీ, నాలుగు దశాబ్దాలుగా క్రీయాశీల రాజకీయాలలో ఉన్న వ్యక్తిని రెండు సెంట్ల భూమిలో అక్రమ నిర్మాణం చేశారంటూ అరెస్టు చేస్తారా? ఇంతకు ఇంత అనుభవిస్తారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. 

జగన్ జైలుకు.. వైసీపీ బంగాళాఖాతంలోకి..!

జగన్ జైలుకు వెళ్లడం తథ్యమని, ఆ తరువాత వైసీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం (నవంబర్ 3) విలేకరులతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్టుపై మండిపడ్డారు. జగన్ హయాంలో జరుగుతున్న అరాచకపాలనకు ఈ అరెస్టు పరాకాష్టగా అభివర్ణించారు. ప్రభుత్వానికి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను అరెస్టు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ రక్తం పంచుకుపుట్టిన స్వంత చెల్లి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారనీ, ఆ వాంగ్మూలంలో తన బాబాయ్, మాజీ మంత్రి వివేకాను ఎవరు చంపారో స్పష్టంగా చెప్పారని, దీంతో జగన్ దిక్కు తోచని పరిస్థితుల్లో పడ్డారని అన్నారు. ఆ విషయం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి దాటిన తరువాత అమానుషంగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారని చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖలో భూ కబ్జాల వ్యవహారంపై తెలుగుదేశం పోరాడుతోందనీ, దాని నుంచి కూడా దృష్టి మరల్చాలనే అయ్యన్న పాత్రుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు.  రిషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయని హైకోర్టులో తేలిందనీ, దానిపై జగన్ తన తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.  ఏడు పదుల వయస్సున్న అయ్యన్ప పాత్రుడిని తెల్లవారు జామున 3 గంటలకు ఆయన ఇంటి గోడలు దూకి మరి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారనీ, ఆయనేం చేశారని ఈ దుర్మార్గపు అరెస్టు అని నిలదీశారు.   అయ్యన్న పాత్రుడు ఏమైనా హత్యలు చేశారా? అరాచకాలు చేశారా? కబ్జాలు చేశారా? అని నిలదీశారు. ఆ చరిత్ర జగన్ కుటుంబానిది, ఆయన పార్టీదీ అని విమర్శించారు. అయ్యన్న పాత్రుడి ఇంట్లోకి పోలీసులు దొంగల్లా వెళ్లారనీ, ఎందుకు వచ్చారని అడిగినందుకు దాడి చేశారని చంద్రబాబు అన్నారు. అయ్యన్న పాత్రుడికి కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా లాక్కెల్లారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ కు దమ్ముంటే ఆయన సొంత బాబాయ్ ని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అయ్యన్నది వందల ఎకరాలు దానం ఇచ్చిన కుటుంబమని చెప్పిన చంద్రబాబు అయ్యన్న తాత ఎమ్మెల్యే.. స్వయంగా అయ్యన్న పాత్రుడు 40 ఏళ్లుగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న వ్యక్తి, మాజీ మంత్రి అటువంటి వ్యక్తిని రెండు సెంట్లలో అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని అరెస్టు చేస్తారా అని నిప్పులు చెరిగారు.  ఇడుపుల పాయలో వైఎస్ కుటుంబం 650 ఎకరాల భూమి కబ్జాపై వాస్తవాలను అప్పట్లో నిరూపించి, అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డిని నిలదీసిన సంగతిని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసైన్డ్ భూములను కబ్జా చేసి.. దాని నుంచి బయటపడేందుకు చట్టం చేసిన కుటుంబం మీది అని చంద్రబాబు పేర్కొన్నారు.  హైదరాబాద్ లో భూమిని ఆక్రమించి  అక్రమించి వైఎస్ ఇళ్లు కట్టుకున్నారు. ఈ విషయంలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు కూడా వచ్చిందని చంద్రబాబు అన్నారు. కానీ అయ్యన్న పాత్రుడిది అటువంటి చరిత్ర కాదన్నారు. భూములు దానం చేసిన కుటుంబం అయ్యన్న పాత్రుడిది అని చెప్పారు. మంగంపేటలో వైఎస్ కుటుంబం బైరైటీస్ గనుల అక్రమాలపై నటరాజన్ కమిషన్ తో పాటు హౌస్ కమిటీ కూడా నిర్ధారించిందని చంద్రబాబు చెప్పారు. ఇంకా కడపలో జగన్ మేనమామ వక్ఫ్ బోర్డు భూముల్లో థియోటర్ నిర్మించుకున్నారు. ఆయనపై చర్యలు తీసుకోగలరా అని ప్రశ్నించారు. ఫిర్యాదు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.  ఉన్మాదుల్లా, రౌడీల్లా అర్ధరాత్రి ఇళ్లపై పడుతున్నారు. కొందరు రిటైర్డ్ అధికారులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి, శారీరకంగా బాధలు పెట్టేవారు అన్నింటికీ అనుభవిస్తారని అన్నారు.  వివేకా హత్య కేసులో వాస్తవాలను సిఐ శంకరయ్య అంగీకరించాడు. తరువాత అతనిపై ఒత్తిడి తెచ్చి హత్యపై స్టేట్మెంట్ ఇవ్వకుండా చేశారు. వివేకా కేసులో సస్పెండ్ అయిన సిఐకి ప్రమోషన్ ఇచ్చారు. తరువాత సిబిఐ పైనే ఆరోపణలు చేయించారు. కోర్టులో ఉన్న కేసుపై ఎవరో వచ్చి ఫోర్జరీ అని సిఐడికి ఫిర్యాదు చేశారట. విజయ్, రాజేష్ పై ఆస్థి ఉంటే అయ్యన్నపై కేసు పెడతారా?  ఈ భూమి ఆయన పేరున లేదు.. ఆయన  ఈ కేసులో   ఏ రకంగా ఏ1 కింద వస్తారు అని నిలదీశారు. అయ్యన్న ను ఇతర కేసుల్లో ఏమీ చెయ్యలేక....రెండు సెంట్ల భూమి అని కేసు పెట్టి దుర్మార్గంగా అరెస్టు చేశారని నిప్పులు చెరిగారు.  ఇదే విధంగా అయితే 14 ఏళ్లు కేసులు పెట్టే వాళ్లం కాదా...భవిష్యత్ లో పెట్టలేమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఐడీ కార్యాలయం టార్చర్ కార్యాలయంగా మారిపోయింది, సీఐడీ పోలీసులు జగన్ సర్కార్ కుఊడిగం చేసే వారిలో తయారయ్యారని విమర్శించారు. ఇవన్నీ చూస్తూ మేం సైలెంట్ గా ఉండాలా అని చంద్రబాబు నిలదీశారు. విశాఖలో రూ.40 వేల కోట్లు దోచింది కాక మాపై కేసులు పెడతారా? 0  ఏళ్ల అయ్యన్నపై సిగ్గు లేకుండా రేప్ కేసు పెడతారా? ఇప్పుడు భయపడి తప్పులు చేస్తున్న అధికారులు...రేపు నిజం ఒప్పుకోరా అని చంద్రబాబు నిలదీశారు.  అయ్యన్న కుటుంబం పై ఇప్పటికి 12 కేసులు పెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వమే చేస్తున్న టెర్రరిజం ఇది మాపై కేసులు పెడుతున్న సిఐడి అధికారుల చరిత్ర ఏంటి? ఎవడికి చెపుతారు కాకమ్మ కబుర్లు...నువ్వు కేసు పెడితే అయిపోతుందా? అని నిలదీశారు.   

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పై కాల్పులు

గురువారం పాకిస్తాన్ వజీరాబాద్ లో ఒక ర్యాలీ లో ప్రసంగిస్తుండగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఇమ్రాన్ కాలికి గాయాలయ్యాయి. ఆయనకు ప్రాణానికి ప్రమాదమేమీ లేదని అధికారులు ప్రకటించారు. కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే పట్టుకు న్నారు. ఇమ్రాన్ శుక్రవారం నుంచి లాహోర్ లాంగ్ మార్చ్ చేపడుతున్నారు. అందులో భాగంగానే గురువారం వజీరాబాద్ ర్యాలీ లో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. ముందస్తు ఎన్నికలు ఆశిస్తూ ఇమ్రాన్ ప్రజల మద్దతు కోరుతున్నారు. ప్రజల మద్దతుతో ప్రభుత్వం పై ముందస్తు ఎన్నికలకు ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల పాటు ప్రధాని పదవిలో ఉన్న ఇమ్రాన్ ను సభలో ఆత్మవిశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీనంతటికి కారణం దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తడ మేనని రాజకీయ పరిశీలకుల మాట.  కాగా ఈమధ్యనే పాకిస్తాన్ లో పెను విప్లవం రానున్నదని మాజీ ప్రధాని ఖాన్ హెచ్చరించారు. అయితే ఆ విప్లవం ఓటు హక్కును సక్రమంగా వినియోగించడం ద్వారానా, లేక రక్తపాతంతో కూడినదా అన్నది తేలాల్సి ఉందన్నారు. 

మునుగోడులో కారుదే జోరు.. శ్రీఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ వెల్లడి

మునుగోడులో కారు జోరు స్పష్టంగా కనిపించిందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప పోరులో విజయం కారుదేనని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ తేల్చింది. నియోజకవర్గంలోని మొత్తం  298 పోలింగ్‌ కేంద్రాలలో ఎంపిక చేసిన 36 పోలింగ్ కేంద్రాలలోనే వివిధ వర్గాల ఓటర్ల నుంచి సేకరించినట్లు ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఈ ఎగ్జిట్ పోల్ లో కారుకు అనుకూలంగా పలు ఆశక్తికర అంశాలు వెల్లడయ్యాయని పేర్కొంది. ముఖ్యంగా 45 ఏళ్లు అంతకు పైబడిన వారిలో అత్యధికులు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారనీ, ఈ ఏజ్ గ్రూప్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల షేర్ వరుసగా 60, 25, 20గా ఉందని ఎగ్జిట్ పోల్ పేర్కొంది.  అదే యువత అంటే 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులలో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గు చూపారు.  అదే 31-45 ఏళ్ల మధ్య వయస్కులలో అత్యధికులు  తెరాస వైపే మొగ్గు చూపారు. ఈ ఏజ్ గ్రూప్ లో తెరాస తరువాత అత్యధికుల మొగ్గు కాంగ్రెస్ వైపు ఉంది. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళల విషయానికి వస్తే అత్యధికులు తెరాస వైపు మొగ్గు చూపితే.. ఆ తరువాత వరుసగా బీజేపీ కాంగ్రెస్ లు ఉన్నాయి. మహిళలలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఓట్ల విభజన 44, 18, 25గా ఉంది. ఇక రైతులు, పెన్షనర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులలో 66శాతం మంది తెరాసకే మొగ్గు చూపారు. అలాగే ప్రభుత్వోద్యోగులు, పదవీ విరమణ చేసిన వారిలో 40 శాతం మంది తెరాసకే జై కొట్టారు. ఈ కేటగరిలో 30 శాతం మంది మొగ్గు బీజేపీ వైపు ఉండగా  26శాతం మంది మాత్రమే కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్ లో  యువత, నిరుద్యోగులలో అధికార టీఆర్ఎస్ పట్ల తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకొందని వెల్లడైంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే వామపక్షాలు తెరాసతో పొత్త పెట్టుకున్నా.. కమ్యూనిస్టుల ఓట్లు కూడా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య 65, 25, 5గా చీలిపోయారు. కమ్యూనిస్టు ఓట్లలో 65శాతం మంది టీఆర్ఎస్ కు ఓటేయగా, పాతిక శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఇక ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ వైఫల్యానికి ప్రధాన కారణం ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ ఓట్లను అనుకున్నంతగా బీజేపీ వైపు మళ్లించడంలో విఫలమవ్వడమే.  ఇక తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం, ఆ వ్యవహారంలో బయటపడిన ఆడియో క్యాసెట్లు కూడా కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డికి ఏదో ఒక మేర నష్టం చేకూర్చాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం కనీసం 2% మంది ఓటర్లు రాజగోపాలరెడ్డికి వ్యతిరేకం అయ్యిరని అంచానా.  అలాగే మునుగోడు నియోజకవర్గంలో మహిళా ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపలేదని కూడా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. శ్రీ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ప్రకారం సగటున తెరాసకు 41.5 శాతం,  బీజేపీకి 35.5శాతం మంది ఓటర్లు మొగ్గు చూపితే కాంగ్రెస్ కు ఆ శాతం కేవలం 17 మాత్రమే. ఇక బిఎస్పీ 4.5 శాతం ఓట్లను దక్కించుకోగా, ఇతరులకు పడిన ఓట్ల శాతం 1.5 మాత్రమే.

మీడియా సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేసిన సీఐడీ డీఐజీ

రాష్ట్రంలో సీబీసీఐడీ సొంతంగా ఒక్క మాట కూడా మాట్లడలేని పరిస్థితి ఉందన్న విషయం  తేటతెల్లమైంది. అయ్యన్న పాత్రుడు అరెస్టుపై  సీఐడీ డిఐజీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన అర్దంతరంగా మీడియా సమావేశాన్ని ముగించేసి వెల్లిపోవడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. తాను చెప్పాల్సింది, చెప్పాలనుకున్నది, అంటే ‘పై’ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారేం చెప్పమన్నారో అది చెప్పేసి.. విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెబితే ఆ ‘పై’ వారేమంటారో అన్న భయంతో మీడియా సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   \తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్టు పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించిన డీఐజీ.. ఆ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారు. తాను చెప్పదలుచుకున్న రెండు ముక్కలు చెప్పేసి విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మధ్య లోనే లేచి వెళ్లి పోయారు. అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడిని అరెస్టు చేసినట్లు చెప్పిన ఏపీ    సీఐడి డిఐజీ సునీల్ నాయక్ అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్ లపై ఫిర్యాదు వచ్చిందనీ, ఆ ఫిర్యాదు మేరకే అరెస్టు చేశామని చెప్పారు.  రెండు సెంట్ల భూమిని అయ్యన్న ఆక్రమించారనీ, ఆ ఆక్రమణపై నకిలీ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) తీసుకు వచ్చారనీ, ఆ ఎన్ఓసీపై సంతకం ఏఈది కాదనీ డిఐజీ తెలిపారు. ఆ కారణంగానే అయ్యన్న పాత్రుడు, విజయ్, రాజేష్ లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.   ఐపీసీ 464, 467, 471, 474, రెడ్‌విత్ 120బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కుట్ర చేసి భూమిని ఆక్రమించుకున్నారని ఏపీ సీఐడీ వెల్లడించారు. దీనిపై విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే వాటికి వేటికీ సమాధానం చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు.  ఎంత స్థలం కబ్జా చేశారనేది తమకు ముఖ్యం కాదని.. ఫోర్జరీ చేశారనేదే ముఖ్యమన్నారు. నిందితులు సహకరించకపోతే..  ఏ విధంగానైనా ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేయవచ్చని  చట్టంలో ఉందని డీఐజీ చెప్పారు.  ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే అర్ధంతరంగా మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. 

మునుగోడు ఉపఎన్నిక... 92 శాతం ఓటింగ్ కి అవకాశం

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక పైనే ఇపుడు అందరి దృష్టి నిలిచింది. మునుగోడును టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కి మారడంతో ఇక్కడ ఉపఎన్నిక తప్పనిసరి అయిన సంగతి తెలిసిందే. అయితే రాజగోపాల్ రెడ్డిని అడ్డుపెట్టుకుని తెలంగాణాలో ఈ ఉప ఎన్నిక గెలవడం ద్వారా కేసీఆర్ కు గట్టి జవాబు చెప్పాలని బీజేపీ వర్గాలు కంకణం కట్టుకున్నాయి. కాగా ఇక్కడ ప్రజలకు నిజమయిన అభివృద్ధి తమ పార్టీతోనే జరుగుతుందని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. పైగా సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. అందుకే సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్ధిగా నిలబెట్టింది. అయితే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు ఉంది గనుక బీజేపీ దాన్ని అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.  కనుకనే  ఈ ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టా త్మకంగా మారింది. కాగా టీఆర్ ఎస్ తరఫున నిలబడిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తమ పార్టీ సాధించిన విజయాలు, చేస్తున్న పనులను ప్రచారం చేసుకుని గెలిపించుకోవాలని టీఆర్ ఎస్ దూకు డుగా ఉంది. ఇదిలా ఉండగా, మునుగోడు లో మూడు ప్రధాన పార్టీతో పాటు బీఎస్సీ తరఫున అందోజు శంకరాచారి, టీజెఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్, ప్రజాశాంతి తరఫున ఆ పార్టీ అధినేత కేఏపాల్ కూడా బరిలో ఉన్నారు.  మునుగోడులో కొత్తగా చేరిన ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిని ఇంతవరకు ఎవరు సుముఖు లుగా చేసుకుంటే వారికి అత్యంత మద్దతు లభిస్తుందన్న ప్రచారం ఉంది. కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తులు వేలాది వచ్చాయి. కేవలం రెండు నెలల్లోనే 24వేల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దరఖాస్తులపై పార్టీల మధ్య రగడ, కోర్టు తీర్పుల అనంతరం.. మొత్తం 2 లక్షల 41 వేలపై చిలుకు ఓట్లలో 14వేల మంది కొత్త ఓటర్లను ఫైనల్‌ చేసింది ఈసీ.  గురువారం ఉదయం ఏడింటికి పోలింగ్ ఆరంభమయింది. పోలింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు, గొడవలు, కొట్లాటలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలను కూడా మోహరించారు.   పోలింగ్ సెంటర్లలోకి స్మార్ట్ ఫోన్లకు అనుమతి ఇవ్వడం లేదు పోలింగ్ అధికారులు. పోలింగ్ సెంటర్లకు ముందే ఫోన్లతో వచ్చినవారిని నిలివేస్తున్నారు. పోలీంగ్ స్లిప్పులు, ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు.  మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉదయమే ఓటర్లు పోలింగ్‌ సెంటర్లకు వచ్చారు. పనులకు వెళ్లే వారు ఉదయమే వచ్చి ఓటేసి వెళుతున్నారు. వృద్ధులు,మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. తొలిగంటలోనే గ్రామాల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం ఏడున్నర ప్రాంతంలో తంగేడుపల్లిలో గందరగోళం నెలకొంది. పోలీసులకు ఓటర్లకు వాగ్వాదం నెల కొంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తు న్నాయి.. ఇదే జోరు కంటిన్యూ అయితే గత రికార్డు బ్రేక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018లో ఇక్కడ 91.3 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి జోష్‌ చూస్తుంటే..92 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటింగ్ బహిష్కరించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు పంచుతామని చెప్పి డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు తెచ్చుకొని నేతలు ఇంట్లో దాచుకున్నారు. తులం బంగారం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఓటర్లు ఆరోపిస్తున్నారు. పక్క గ్రామాల్లో డబ్బులు పంచారు. మేము ఏమి అన్యాయం చేశామంటూ.. దూరప్రాంతాల నుంచి వచ్చామని.. కానీ ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. డబ్బు లు పంచితేనే ఓట్లు వేస్తామని ఓటర్లు పేర్కొంటున్నారు. ఒంటిగంట సమయానికి 41.30 శాతం ఓటింగ్‌ నమోదు..మునుగోడులో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదైంది. సంస్థాన్‌ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు చాలా సెంటర్ ముందు ఓటు వేసేందుకు వేచి చూడాల్సి వచ్చింది. పోలింగ్‌ రోజు కూడా భారీగా నగదను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్‌హాల్‌లో ఇతర ప్రాంతల నుండి వచ్చి డబ్బులు పంచుతుండగా పట్టుకున్నారు. 2లక్షల 99 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చండూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది..టీఆర్ఎస్, బీజేపీ మధ్య వివాదం తలెత్తింది. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. వరంగల్‌కు చెందిన వ్యక్తులు నగదు పంచుతున్నారని బీజేపీ ఆరోపించింది.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈయన పోలింగ్‌ కేంద్రాల పరిశీలి స్తున్నారు. ఒక సెంటర్‌ నుంచి మరొకరు సెంటర్‌కు ఆయన పరుగులు పెట్టారు. సిద్దిపేటకి చెందిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారంటూ మర్రిగూడ పోలింగ్ బూత్ బయట బీజేపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఔటర్స్ ని ఎందుకు అను మతి ఇస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తక్షణమే బయటి వ్యక్తులను పంపించివేయాలని డిమాండ్ చేశారు. అటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరి స్థితి నెలకొన్నది. చండూరులో కొంతమంది నేతలు ఓటర్లకు నగదు పంచేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి డబ్బు అక్కడే వదిలి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలంలో రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.  నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కారును బీజేపీ శ్రేణులు పట్టుకున్నాయి. ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోన్న వేళ ఈ డబ్బు లభ్యం కావడం గమనార్హం. చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు పోలింగ్ నిలిచిపోయింది. ఇక్కడ ఈవీఎం మిషన్లు మొరాయించాయి. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లంతా పోలింగ్ సెంటర్లోనే కూర్చుండిపోయారు. మునుగోడు బైపోల్‌లో హీట్ కంటిన్యూ అవుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రశాంతంగానే జరిగింది పోలింగ్. అయితే.. పదిన్నర సమయంలో  చాలా చోట్ల గొడవలు తలెత్తాయి.. బయటివారు ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నారని కొన్ని చోట్ల.. డబ్బులు పంచుతున్నారంటూ మరికొన్ని చోట్ల ఘర్షణ తలెత్తింది. ఓటింగ్ రోజు కూడా నగదు ప్రవాహం కంటిన్యూ అవుతోంది. చాలా చోట్ల క్యాష్‌ను సీజ్ చేస్తున్నారు అధికారులు. మర్రిగూడలో లాఠీఛార్జ్‌ వరకు వెళ్లింది పరిస్థితి. బయటి ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారంటూ రెండు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. సిట్యుయేషన్ సీరియస్‌గా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. రెండు వర్గాలను చెదరగొట్టారు . మధ్యాన్నం 12 గంటల సమయంలో నో మనీ.. నో ఓట్ అంటూ ఏకంగా పోలింగ్‌నే బహిష్కరించారు మర్రిగూడ మండలం అంతపేట గ్రామస్థులు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంచారని.. మరికొందరికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నగదు ఇస్తే తప్ప పోలింగ్‌ సెంటర్లకు వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు మునుగోడు ఉపఎన్నిక  సందర్బంగా చండూరు మండలంలోని కోటయ్యగూడెంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సాధారణంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఓటర్లుగా వారిపై ఉండే బాధ్యలేంటి అనేవి అన్నీ వివరిస్తూ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎండలో నుంచోవాల్సిన అవసరం లేకుండా కూడా సౌకర్యాలు కల్పించారు. అలాగే ఎవరైనా క్యూలైన్లలో నిలబడం వల్ల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంటే.. ప్రథమ చికిత్స కోసం మందులు, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు ఈ పోలింగ్ కేంద్రాన్ని అందంగా బెలూన్లతో డెకరేట్ చేశారు.  చండూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.టీఆర్  ఎస్  మధ్య వివాదం తలెత్తింది. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. వరంగల్‌కు చెందిన వ్యక్తులు నగదు పంచుతున్నారని బీజేపీ ఆరోపించింది..

ఎట్టకేలకు పోసానికీ పదవి? ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నటుడు పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గత మూడున్నరేళ్లుగా ఏదో ఒక పదవి కోసం చకోర పక్షిలా కళ్లకు కాయలు కాచేలా ఎదురు చూసిన పోసానికి ఎట్టకేలకు చైర్మన్ గిరీ దక్కింది. జగన్ ఆయనను ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నటుడు అలీని నియమించిన సంగతి తెలిసిందే. గత మూడున్నరేళ్లుగా ఈ ఇరువురూ జగన్ తమకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏళ్లు గడిచిపోతున్నా.. అటువంటి పదవి ఏదీ రాకపోవడంతో ఇరువురూ కూడా ఒకింత అసంతృప్తికి లోనైనట్లు వార్తలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలాయి. ఎంద చాట అలీ అంతేనా? ఏం రాజీ పోసానీ జగనన్న దయ రాలేదా? అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు జోకులు పేల్చారు. అదే సమయంలో  ఇక సమయం వచ్చింది. అలీ పోసానిలకు పదవి ఖాయం అంటూ తెలుగు వన్ స్పష్టంగా చెప్పింది. నాడు తెలుగువన్ చెప్పింది.. నేడు నిజమైంది.  నవ్వండి .. నవ్వండి.. నవ్విన నాప చేనే పండుతుంది... ఇప్పుడు మీరు ఎన్ని జోకులైనా వేయవచ్చు. నవ్వచ్చు, ఎగతాళి చేయవచ్చు  కానీ నిజ్జంగానే కమెడియన్ అలీకి త్వరలో నామినేటెడ్ పోస్టు ఖాయం. అని తెలుగువన్  రెండు నెలల కిందటే విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అది నిజమైంది. ఒక్క అలీకేనా.. అలీతో పాటుగా ఒక్క మాటలో చెప్పాలంటే   అలీకంటే ఎక్కువగా జగన్ రెడ్డిని భుజాన మోసిన  పోసాని కృష్ణ మురళీకి కూడా నామినేటెడ్ పోస్టు ఖాయమని తెలుగువన్ అప్పుడే చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. కొంచెం అటూ ఇటూలో ఇద్దరికీ ఒకరి తరువాత ఒకరికి పోస్టులు ఇచ్చింది. గత ఎన్నికలలో అలీ, పోసాని మాత్రమే కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం, ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ కూడా వైసీపీ తరఫున కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు.   అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ఒక్క పృద్వీని మాత్రమే ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్ పదవికి నామినేట్  చేశారు. అది కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయింది. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పెట్టేశారు. పృధ్విరాజు పార్టీకి దూరమయ్యారు. ఇక మోహన్ బాబు కూడా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసాని మాత్రం   పార్టీని వదల కుండా  చకోర పక్షుల్లా జగన్ రెడ్డి దయకోసం, కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. జబర్దస్త్ రోజా మంత్రి పదవికోసం ఎంతగా తాపత్రయ పడ్డారో, అంతకంటే ఎక్కువగా అలీ, పోసాని నామినేటెడ్ పదవుల కోసం తాపత్రయ పడ్డారని అంటారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలీని ఒకటికి రెండు సార్లు ఇంటికి పిలిపించుకుని మరీ ఒట్టి చేతులతో పంపించారు. రెండు మూడు సార్లు ఆయనకు పదవులు కేటాయించినట్టు ప్రచారం కూడా సాగింది. తొలుత రాజ్యసభ, ఆ తరువాత కేబినెట్ హోదాతో సమానమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి అలీకి కేటాయించనున్నారన్న ప్రచారం జరిగింది. అలీ దంపతులు కలిసిన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెబుతానంటూ స్వయంగా జగన్ చెప్పడంతో పాపం అలీ అమాయకంగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏదీ అలీ చెవిన పడలేదు.  ఎట్టకేలకు అలీకి పోస్టు దక్కింది. ఆశించిన పదవి కాకపోయినా, కంటితుడుపు సలహాదారు పోస్టు అయినా ఏదో ఒకటి దక్కిందని అలీ కూడా సంతృప్తి పడ్డారు. ఇక పోసానిని వదిలేశారేమిటా? అని అందరూ అనుకున్నారు. ఎంతో కొంత నొచ్చుకున్నారు కూడా. ఎందుకంటే  పోసాని కృష్ణ మురళీ జగన్ రెడ్డిని వెనకేసుకొచ్చే  క్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆయనను టార్గెట్ చేస్తూ పవన్ ఫాన్స్ చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు.  అయినా, తట్టుకుని మడమ తిప్పకుండా జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచినందుకు పోసాని  సినిమా అవకాశాలు కూడా  పోగొట్టుకున్నారు. ఇవన్నీ గుర్తు చేసుకుని మరీ పలువురు అలీకి పోస్టు ఇచ్చి కూడా పోసానిని వదిలేశారేమిటని గుసగుసలు పోయారు. అయితే జగన్ పోసానిని వదిలేయలేదు. చివరాఖరికి ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. దీంతో అలీ, పోసానిల కథ సుఖాంతమైనట్లేనా? 

ఏపీ నుంచి  గుజరాత్ కి తరలిపోతున్న పరిశ్రమలు

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశం తగ్గిపోతుండడంతో అనేక సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కంపెనీలు  గుజరాత్ కి తరలిపోతున్నాయి. గతంలో కర్నూలు, కడప, అనంతపరం జిల్లాల్లో స్థాపించిన సంస్థలు అభివృద్ధిపరంగా ఎలాంటి నమ్మకం  కలగక పోవడంతో వాటి కార్యకలాపాలక స్వస్తి పలికి పెట్టు బడులకు ఎంతో అనుకూలమయిన, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్ర మయిన గుజరాత్ కు తరలి పోతున్నాయి.  అనంతపురం జిల్లా నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల విండ్ మిల్ యూనిట్లు ఇప్పటికే తరలిపోయా యి. అవి ఉత్పత్తి చేస్తున్న గ్రీన్ విద్యుత్ కు తగినంత ధర పొందలేకపోవడమే అందుక ప్రధాన కారణమని తెలుస్తోంది. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం అనేక ప్రయివేటు కంపెనీలు సోలార్, విండ్ పవర్ యూనిట్లను ప్రారంభించాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి యూనిట్ నాలుగు రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రభుత్వం టారిఫ్ ను  మార్చి యూనిట్ కు  కేవలం రెండు రూపాయలే  యిస్తున్నది.  ఇలానే, కళ్యాణదుర్గ, రామగిరి, రెడ్డం ప్రాంతాల్లో అనేక పెద్ద సంస్థలు నెలకొల్పిన యూనిట్లు  మెల్లగా ఎక్కడో ఉన్న గుజరాత్ లో తమ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాయి. సుమారు వెయ్యి మెగావాట్ల యూని ట్లు ముఖ్యంగా అనంతపురం జిల్లాల్లో నెలకొల్పవలసినవి దూరంగా ఉన్న గుజరాత్ మేలని తరలి పోయాయని అంటున్నారు. వాస్తవానికి అనంతపురం జిల్లాలో కొండప్రాంతాలతో ఉన్నందువల్ల విండ్ విద్యుత్ కి ఎంతో అనుకూలం. ముఖ్యంగా ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య గాలి వేగం గంటకు 45 కి.మీ ఉంటుంది. ఇది విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమని రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి కార్పోరేషన్ (నెడ్ కాప్) పేర్కొన్నది.  ముఖ్యంగా ఉరవకొండ, సి.కె.పల్లి, వజ్రకరూర్, రామగిరి , రొడ్డం ప్రాంతాలు ఎంతో అనుకూలమని నెడ్ కాప్ అధికారులు పేర్కొన్నారు.  పైగా వారి యూనిట్లు పెట్టుకోవడానికి కనీసం ఒక్క ఎకరం ప్రభుత్వ భూమి కూడా తమకు లేదని, కొండ ప్రాంతాలన్నీ ప్రయివేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారని వారితో రైతులు కూడా ఒప్పందాలు కుదుర్చకున్నారని అధికారులు చెప్పారు.  అయితే పవర్ టారిష్ తమకు ఉపయోగకరంగా లేదు గనుక ఈ ప్రయివేటు కంపెనీలు వాటి కొత్త యూనిట్ల ఏర్పాటు విషయలో పెద్దగా ఆసక్తీ చూపడం లేదు. 

స్థానికేతరులతో కక్కిరిసిన మునుగోడు.. టీఆర్ఎస్ పై బీజేపీ ఫైర్

మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు నియోజకవర్గంలో స్థానికేతరుల హల్ చల్ ఎక్కువైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి.. ప్రచారం గడువు ముగిసిన తరువాతా, పోలింగ్ రోజున కూడా నియోజకర్గంలోని పలు ప్రాంతాలలో స్థానికేతరులు బస చేసి ఉన్నారనీ, ముఖ్యంగా మునుగోడు నియోజకర్గంలో ప్రచారాన్ని ముందుండి నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మంత్రులు ప్రచారం గడువు ముగిసిన తరువాత కూడా నియోజకవర్గంలోనే ఉండి పోలింగ్ బూత్ ల వద్ద ప్రచారం, సొమ్ము పంపిణీ వంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక గురువారం (నవంబర్ 3)న ఉదయం ప్రారంభమై ప్రశాతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ దాదాపు 41శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ.. నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో బయటి వారు ఉన్నారంటూ టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మర్రిగూడెంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని లాఠీ చార్జ్ వరకూ వెళ్లింది. మర్రిగూడెంలో టీఆర్ఎస్ వారు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనీ, నిబంధనలను తుంగలోకి తొక్క వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.  మర్రిగూడెంలో సిద్దపేట నంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారనీ, వారు ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారం చేస్తున్నారనీ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అలాగే పలువురు సీనియర్ నాయకులు, కొందరు మంత్రులూ కూడా నియోజకవర్గంలోనే బస చేసి ఓటర్లను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. స్థానికేతరులను వెంటనే నియోజకవర్గం నుంచి పంపేయాలనీ, అంత వరకూ పోలింగ్ నిలిపివేయాలనీ డిమాండ్ చేశారు. దీంతో మర్రిగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.  

గుజరాత్  ఎన్నికలు డిసెంబర్ 1, 5 

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుతాయి. ఫలితాలు 8న ప్రకటిస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  గురువారం ప్రకటించారు. 182 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది. కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో కి వస్తుంది.  ఈ ఏడాది ఎన్నికల్లో 4.9 కోట్లమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రం మొత్తం మీద 51 వేల పోలింగ్ బూత్ లు నెలకొల్పనున్నారు. వీటిలో 34 వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారు.  పోలింగ్ సమయానికి బాగా ముందుగానే  రాష్ట్రంలో  160 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను మోహరించనున్నట్టు అధికారులు తెలిపారు. ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య  త్రిముఖ పోటీకి ఎంతో ఆస్కారం ఉంది.  రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో పాటు, ప్రధాని మోదీ స్వరాష్ట్రం కూడా కావడంతో గుజరాత్ ఎన్నికలు ప్రాధాన్యతసంతరించుకున్నాయి. 

అయ్యన్నపాత్రుడి అరెస్ట్ అందుకేనా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం గురించి తెల్లారితే ప్రింట్ మీడియాలో ప్రజల ముందుకు వస్తుందని, దాన్నుంచి జనం దృష్టి మళ్లించేందుకే అయ్యన్నపాత్రుడ్ని అరెస్ట్ చేసినట్లు టీడీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే అభియోగాలపై పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో నర్సీపట్నంలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కడప ఎంపీ టికెట్ విషయంలో వైఎస్ వివేకానందరెడ్డి గట్టి పోటీదారుగా ఉండడం వల్లే తమ చిన్నాన్నను వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చంపించారని షర్మిల సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ఓ వార్తా పత్రికలో వార్త ప్రధానంగా వచ్చింది. సీబీఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలం తెల్లారితే రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచం మొత్తం తెలిసిపోతుందని, దాన్నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే అయ్యన్నపాత్రుడి అరెస్ట్ కథను జగన్ నడిపించారని టీడీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఢిల్లీ వెళ్లి సీబీఐకి షర్మిల వాంగ్మూలం ఇచ్చిన సమాచారం తెలుసుకున్న జగన్ ఫైరయ్యారని, తమ తల్లి విజయమ్మకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోందని ఆ పత్రిక వార్త ప్రచురించింది. నిజానికి జగన్ కు షర్మిలకు మధ్య ఇప్పటికే విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారులను జగన్ రక్షిస్తున్నారంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తూనే ఉన్నాయి కూడా. ఇప్పుడు షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన విషయం బయటపడడంతో తల్లి విజయమ్మతో షర్మిలపై జగన్ ఆగ్రహం వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓపికతో ఉన్నానని, తన పరువును షర్మిల బజారుకు ఈడుస్తోందని జగన్ మండిపడ్డారంటూ ఆ పత్రిక కథనంలో పేర్కొంది. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఇవ్వాలని వైఎస్ షర్మిలను కోరడమే కాకుండా నోటీసు కూడా ఇచ్చినట్లు సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం తెలిసిందని ఆ పత్రిక పేర్కొంది. దీంతో తాను తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నానని, వీలుచూసుకుని వస్తానని షర్మిల చెప్పారట. వాంగ్మూలం తాను కడపకే వచ్చి ఇవ్వాలా? అని షర్మిల అడిగినప్పుడు కడపలో కానీ, ఢిల్లీ అయినా ఇవ్వొచ్చని సీబీఐ అధికారులు తెలిపారని వార్తా కథకం వచ్చింది. దీంతో అక్టోబర్ 7వ తేదీన షర్మిల ఢిల్లీలో సీబీఐ ఆఫీసుకు వెళ్లి వివేకా హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో.. తనకు ఉన్న సమాచారం ప్రకారం అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే తమ చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేయించారని షర్మిల తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వివేకాకు శత్రువులు లేరని, కడప జిల్లాలో ఆయనను అందరూ గౌరవిస్తారని, ఆయనను వ్యతిరేకించేవారు ఎవరూ లేరని సీబీఐకి షర్మిల వివరించారని ప్రింట్ మీడియాలో వచ్చిన కథనం. అయితే.. కడప ఎంపీ టికెట్ విషయంలో తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని, టికెట్ కోసం తమ చిన్నాన్న వివేకా గట్టి పోటీదారుగా ఉన్నారని, అవినాశ్ రెడ్డి కూడా ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు చెప్పారు. ఎంపీగా వివేకా బరిలో దిగితే తమ ఉనికికి ప్రమాదం అని అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే తమ చిన్నాన్నను చంపించారని తమకు ఉన్న సమాచారం అని షర్మిల వాంగ్మూలం ఇచ్చినట్లు పత్రికలో వచ్చింది. కడప ఎంపీ టికెట్ తనకు ఇవ్వకపోతే.. షర్మిలకు లేదా విజయమ్మకే ఇవ్వాలంటూ వివేకానందరెడ్డి గట్టిగా కోరారని, ఈ నేపథ్యంలోనే అవినాశ్ రెడ్డి ఆయనను హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది కదా.. దీనిపై మీ స్పందన ఏమిటి? అని మీడియా ప్రశ్నించినప్పడు ‘వాస్తవం’ అని షర్మిల సూటిగా స్పందించారు. ‘నా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది. సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను ఎవరు అంత ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటికి రావాలి. వారికి శిక్ష పడాలి. దీన్ని ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదు’ అని అక్టోబర్ 21న ఢిల్లీలో మీడియా సమావేశంలో షర్మిల అన్నారు. ఈ విషయాలపై ఏపీ వ్యాప్తంగా జనంలో చర్చ జరుగుతుందని, అసలు రంగు బయటపడుతుందని.. దీన్నుంచి జనం దృష్టి మళ్లించేందుకే సీఐడీ పోలీసులతో అయ్యన్నపాత్రుడి అరెస్టుకు పథక రచన చేశారని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఉత్తరాంధ్రలో పులిలా ఉన్న అయ్యన్నపాత్రుడిని తాడేపల్లి ప్యాలస్ లో పిల్లిలా దాక్కున్న జగన్ అర్ధరాత్రి అరెస్ట్ చేయించారంటూ నిప్పులు చెరుగుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత అయ్యన్నపై 15 తప్పుడు కేసులు పెట్టడంపై టీడీపీ నేతలు తూర్పారపడుతున్నారు.

రాజస్థాన్ కాంగ్రెస్ లో సచిన్ vs గెహ్లాట్.. స్టోరీ కంటిన్యూస్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముంగిట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాన్ పార్టీ హై కమాండ్ కు ఇచ్చిన ఝలక్ ఇంకా ఎవరూ మరచిపోలేదు.. పార్టీ అధ్యక్షపదవికి సోనియాగాంధీ ముందుగా ఎంపిక చేసింది తనకు అత్యంత విశ్వాసపాత్రుడని భావించిన అశోక్ గెహ్లాట్ నే.. ముఖ్యమంత్రి పదవి వదులుకుని అప్పటి అధినేత్రి ఆదేశాన్ని శిరసావహించడం ఇష్టం లేక గెహ్లాట్ ఏకంగా రాజస్థాన్ కాంగ్రెస్ లో తిరుగుబాటు వ్యూహానికి తెరతీశారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఉండేందుకు తనను విశ్వసించిన అధినేత్రికా హాత్ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ కోసం  నామినేషన్ వేయడానికి ముందు తదుపరి సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి తన వర్గానికి చెందిన నేతలెవరూ హాజరు కాకుండా వ్యూహం రచించారు. దీంతో సోనియా గెహ్లాట్ కు బదులుగా మల్లిఖార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. ఆయన గెలిచారు. పార్టీ అధ్యక్షుడయ్యారు అది వేరే సంగతి. అయితే గెహ్లాట్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి పదిలంగా ఉండటమే కాకుండా.. ఆ పదవి కోసం పోటీలో ఉన్న సచిన్ పైలట్ కు ఇప్పట్లో అవకాశం లేకుండా పోయిందని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషణలు చేశారు. అయితే ఆ కథ అక్కడితో ఆగిపోలేదని..ఇంకా ఉందని తాజా సంఘటనలతో రుజువైంది. గెహ్లాట్ తిరుగుబాటు వెనుక మోడీ ఉన్నారా అంటూ ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ప్రధాని మోడీ అవకాశం వచ్చినప్పుడల్లా.. అవసరం ఉన్నా లేకపోయినా అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పొగడ్తల్లో ముంచెత్తే వారు. తరువాత గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా మారి చివరకు పార్టీ వీడి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి విదితమే. అలాగే గెహ్లాట్ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగుర వేయడం వెనుక కూడా మోడీ ఉన్నారా అన్న అనుమానాలు తాజాగా రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలోనూ, ముఖ్యంగా సచిన్ పైలట్ లోనూ మాత్రం అవి అనుమానాలుగా కాక.. వాస్తవమేనన్న విశ్వాసంగా మారింది. అందుకు కారణమేమిటంటే.. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. దీనిపై రాజస్థాన్  కాంగ్రెస్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సచిన్ పైలట్ వర్గీయులు గెహ్లాట్ పై విమర్శల దాడి మొదలు పెట్టారు. గెహ్లాట్ ను మోడీ ప్రశంసించడాన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంటూ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ప్రధాని గెహ్లాన్ పై ప్రశంసల వర్షం కురిపించడంపై స్పందించిన సచిన్ పైలట్.. ఈ పొగడ్తలను గులాం నబీ ఆజాద్ తన రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మోడీ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడంతో పోల్చారు.  ఆ పొగడ్తల అనంతరం గులాం నబీ ఆజాద్ వైఖరి ఎలా మారిందో గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ గెహ్లాట్ ను ప్రశంసించడాన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోరాదంటూ అధిష్ఠానానికి సూచన చేశారు. అంతే కాదు.. గత సెప్టెంబర్ లో రాజస్థాన్ సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించి గెహ్లాట్ కు అనుకూలంగా బల నిరూపణకు సిద్ధమైన ఎమ్మెల్యేలందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచిన్ పైలట్ వ్యాఖ్యలపై గెహ్లాట్  ఒకింత లౌక్యంగా స్పందించారు.  పైలట్ పై పరోక్షంగా చురకలు వేశారు.

సరదానా.. జనాకర్షణ ట్రిక్కా?

చింటూ లెక్క తప్పుచేశాడని టీచర్ కొట్టింది, పింకీ జడ సరిగావేసుకోలేదని తల్లి కొట్టింది, తనను రక్షించమని భక్తులు వినాయకుడి ముందు చెంపలేసుకుంటున్నారు.. కానీ హఠాత్తుగా రాహుల్ గాంధీ కొరడాతో కొట్టేసుకున్నారు.. జనమంతా ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు..అది సరదానా.. జనాకర్షణ ట్రిక్ .. తెలీడం లేదు.  భారత్ జోడో అంటూ పాదయాత్ర పేరుతో దేశాటన చేస్తున్నారు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ. అందులో భాగంగా తెలంగాణా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రయాణంలో భాగంగా సంగారెడ్డిలో అలా అభిమానులు, నాయకులతో ఉత్సాహంగా వెళుతూ అందరికి అభివాదం చేస్తూ ముందడుగు వేస్తు న్నారు. ఆయనకు బుడగ జంగాల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆయన ఎంతో ఆసక్తిగా వారిని చూశారు. వారు కొరడాతో కొట్టుకోవడం అమ్మవారి మీద భక్తితో అరవడం.. చాలా చిత్రంగా అనిపించింది. అదో భక్తిపారవశ్యంతో కూడిన సరదా అనుకున్నారేమో తెలీదు గాని ఆయనకీ కొరడాతో కొట్టుకోవా లనిపించింది.  ఇదే సినిమాలో అయితే పక్కనున్నవారు అమాంతం ఆపి హంగామా చేస్తారు. కానీ ఇది వాస్తవం. అందునా జనానికి పార్టీ ని మరింత దగ్గర చేయడం లో భాగంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలవారి అభిమానాన్ని చూరగొనాలి. అలాంటి గొప్ప ఆలోచన తట్టగానే రాహుల్ అమాంతం కొరడా చేతిలోకి తీసుకుని అలా కొట్టుకోవడం అందరూ చూసి విస్తుపోయారు. సరే ఒక దెబ్బవేసుకుని ఉంటారు. అదీ పెద్దగా తగిలిందో లేదో వేరే సంగతి కానీ ఇట్లాంటి జిమ్మి క్కులు పార్టీ నాయకులకు చాలా అవ సరం. అందునా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి, దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్న పట్టుదలతో ఉన్న నాయకునికి చాలా అవసరం.  దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజలకు కలుగుతున్న అవాంతరాలు, అవస్థలు, కష్టనష్టాలను ఏకరువు పెడుతూ కాంగ్రెస్ ను మళ్లీ పీఠం ఎక్కించాల్సిన అవసరం ఎంతో ఉందని దేశ ప్రజలకు పిలుపునివ్వడం లో భాగంగా తాను భారత్ జోడో యాత్రలో ప్రజల్లో కలిసిపోతున్నారు రాహుల్ గాంధీ. కేంద్రంలో పార్టీని నిలబెట్టడానికి, బీజేపీ వ్యూహాలను దెబ్బకొట్టడానికి, దేశమంతటా పార్టీ నాయకత్వాన్ని పటిష్టపరిచేందుకు వీలయినంత కష్టపడాల్సిన సమయం గుర్తించే రాహుల్ భారత్ జోడో చేపట్టారు. ఇందులో భాగంగా ఇటు తెలంగాణా ప్రాంతంలో గత ఎనిమిది రోజులుగా తిరుగుతు న్నారు.  జాతీయ పార్టీల నాయకులు అందరూ ఈవిధంగా అన్ని రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతా ల్లోని వారిని ఇలా ఆకట్టుకోవడం మామూలే. పూర్వం ఇందిరాగాంధీ కూడా థిమ్సా వారితో కలిసి డాన్స్ చేశారు. 

తెగిన విద్యుత్ తీగలు లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదులుతుంది

అనంత జిల్లాలో తెగిపడిన విద్యుత్ తీగలు లాగితే తాడెపల్లి ప్యాలెస్ డొంక కదులుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలిలు మరణించిన విషాద సంఘటన తెలిపిందే. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు జగన్ సర్కార్ రూ. 10లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఈ ఘటనపై లోకేష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో విద్యుత్ తీగలు తెగిపడుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇలా ఎందుకు అవుతోంది అని ప్రశ్నించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఎవరు? అంటూ నిలదీశారు. తీగలాగితే డొంక కదులుతుందంటారు. అలాగే తెగిపడుతున్న విద్యుత్ తీగలను లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదలడం ఖాయమన్నారు. విద్యుత్ తీగలు తెగిపడి అనంతపురం జిల్లాలో నలుగురు వ్యవసాయ కూలీలు మరణించిన సంఘటన జరగడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా విద్యుత్ తీగలు తెగిపడిన ఉదంతంలో ముగ్గురు రైతులు మరణించారని గుర్తు చేశారు.  ఈ దారుణ ఉదంతానికి నాలుగు రోజుల క్రితమే ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని చియ్యపాడులో సాగు మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిని ఉదంతంలో.. ముగ్గురు రైతులు మరణించటం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పుడల్లా  ఉడత కథ చెప్పి   చేతులు దులుపుకోవటం జగన్ సర్కారుకు అలవాటైందని మండిపడ్డారు.  హైటెన్షన్ వైర్లు కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల తెగిపడవు.  ఇక సర్కార్ చెబుతున్నట్లుగా  ఉడుతలు.. పక్షుల వల్ల అయితే.. ముందుగా   ట్రిప్ అయి విద్యుత్ సరఫరా ఆగిపోవాలి.   కానీ ఇటీవల విద్యుత్ తీగలు తెగిపడిన సంఘటనల్లో  వైర్లలో కరెంట్ ప్రవహిస్తోంది. అంటే.. వైర్లే తెగిపడుతున్నాయని స్పష్టంగాతెలుస్తోంది. దీంతో విద్యుత్ తీగల కాంట్రాక్టర్లు నాసిరకం కరెంట్ వైర్లు వాడించడం వల్లనే అవి తెగిపడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఉడుత కథలు చెబుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా తాడేపల్లి ప్యాలెస్ డొంక కదులుతుందంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి.