పాదయాత్రలో రాహుల్ పరుగో..పరుగు...!

ఎంతో వేగంగా పరిగెట్టడం ఆ పోటీల్లో గెలవడం అనుకున్నంత సులభం కాదు.  మన  స్ప్రింటర్లలో అమియా కుమార్, గురువీందర్ సింగ్  జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు వాళ్లు కూడా అమితాశ్చర్యంతో ఓర్నీ ఈయనున్న పోటీలో పాల్గొనలేదే అనుకుంటున్నారేమో.  జాతీయ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కుమారుడు, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఊహించని విధంగా స్ప్రింటర్ రూపం ఎత్తారు. దేశంలో చాలాభాగం మొన్నటి దాకా భారత్ జోడో యాత్ర చేసి అందులో భాగంగానే తెలంగాణా గొల్లపల్లి  వచ్చిన రాహుల్ గాంధీ అందర్నీ పలకరిస్తూ హఠాత్తుగా పరుగుపోటీకి సిద్ధ మ య్యారు. చిత్రమేమంటే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఓడిపోయారు.  దేశంలో జాతీయ క్రీడల్లో అమ్లా బోర్గాన్, అమియా మాలిక్, ధ్యుతీ చంద్ వంటివారి వేగాన్ని చూసినవారు, రాజకీయ నాయకుల్లో యువ కిశోరంలా  మంగళవారం  రాహుల్ గాంధీ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. భారత్ జోడో యాత్ర  గొల్లపల్లికి చేరుకుంది. రాహుల్ గాంధీ కి అందరూ ఘన స్వాగతం పలికారు. అంద ర్నీ అమితోత్సా హంతో పలకరిస్తూ, అస్సలు అలసటే కనపడకుండా నడుస్తూ అందర్నీ తన వెంట పరుగులాంటి నడక నడిచేలా చేస్తుంటే యువకులు, నాయకులు ఆశ్చర్యంలో అలా ఆయన్నే చూస్తుండిపోయారు.  హఠాత్తుగా పాదయాత్ర కాస్తా పరుగు పోటీగా మారిపోయింది. అయితే ఇందులో రాహుల్ తో రేవంత్ మాత్రమే పోటీ పడ్డారు. అలా రూల్ పెట్టుకున్నారేమో అనిపించింది.  పాదయాత్ర లో రాహుల్ ని కలివడానికి పిల్లలు రావడంతో ఆయన మరింత కుర్రాడయిపోయి పరుగు తీయడం మొదలయిది.. అంతే రేవంత్ కి ఆయనతో పోటీపడాల్సి వచ్చింది. కానీ రేవంత్ వల్ల కాలేదు. చిత్రమేమంటే ఇప్పటికే చాలా దూరం భారత్ జోడో యాత్ర చేస్తూన్నప్పటికీ కుర్రాడిలానే ద్విగుణీకృత ఉత్సాహంతో రాహుల్ పరుగులు తీయడం. పోలీసులు, రేవంత్, కుర్రాళ్లూ , పిల్లలూ అంతా వెనకబడిపోయారు.  ఈ పోటీలో తాము లేకపోయామని మాజీ స్స్రింటర్లు అనుకునే ఉంటారు. పార్టీ నాయకత్వం బాధ్యతను తాను స్వీకరించలేదు కానీ ప్రజలను పార్టీ వేపు తిప్పేందుకు, ఈ తరం వారిని పార్టీలోకి ఆకట్టుకోవడానికి, కేంద్రంతో పోరుకీ రాహుల్ గాంధీలో ఆవేశం, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదన్నది  ఈ పరుగు స్పష్టం చేసింది.  అయితే రాహుల్ తన బాస్ కనుక ఆయన్ను గెలిపించడం ధర్మమనే భక్తి భావంతో రేవంత్ కావాలనే వెనుకడుగు వేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రాహుల్ పరుగు పందెం వీడియో చూసిన, చూస్తున్నవారంతా అసలు పార్టీ పదవిని ఈయనే తీసుకోవాల్సింది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఖర్గే కంటే పార్టీలోకి యువతను రాహుల్ రాబట్టగలడన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబేతరులకు యివ్వాలన్న నిర్ణయం తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం వల్ల ఖర్గే కు పార్టీ పగ్గాలు అందాయి. కానీ ఇటు భారత్ జోడో యాత్ర చేపడుతూ రాహుల్ గాంధీ తక్కువేమీ తినడం లేదు. రోజు రోజుకూ యువకునిగా మారుతూ, మాటల్లో, ప్రసంగాల్లో, యువతను ఆకట్టుకోవడంలో తన శైలితో మరింత ముందుకు వెళుతున్నారు. ఆయన్ను గతంలో చూసినవారు, గమనించినవారు ఆయనలో వచ్చిన మార్పు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పెరోల్ బాబా ఆశీర్వాదానికి బీజేపీ మంత్రి ఠాకూర్

ఊళ్లోకి కొత్త సాములోరు వచ్చారని అంతా వెళ్లారు. తీరా చూస్తే మొన్నామద్య దొంగపనులు చేస్తు న్నారని పోలీసోల్లు పట్టుకెల్లిన కేటుగాడే గదా.. అనుకున్నారంతా.  కానీ పైకి అనుకోలేదు. అంతా భక్తి పారవశ్యాన్ని నటించారు.  చాలాకాలం భక్తిపారవశ్యంతో ఊగిపోతూ ఎన్నో ప్రవచనాలు వల్లించి, పాటలు పాడి భక్తిని ప్రసారం చేసినవాడు  అత్యా చారంలో దొరికిపోయి జైలుకీ వెళ్లాడు. ఆయనే గుర్మీత్ రామ్ రహీమ్ బాబా. ఆయనన్ను ఇటీవలే పెరోల్ మీద విడుదల చేశారు. కానీ భక్తులను ఆకట్టుకోవడంలో ఆయన్ను మించినవారే లేరు గనుక మళ్లీ ప్రవచనాలు, భక్తీగీతాల పనలతో జనాన్ని తన శిబిరానికి వచ్చేట్టు చేసుకున్నారు. బాబా వచ్చేశారని వెర్రి జనం వేలం వెర్రిగా ఎగబడ్డారు. ఆయన దర్శనానికి వెళ్లినవారిలో హిమాచల్ ప్రదేశ్ బీజేపీ మంత్రి విక్రమ్ థాకూర్ , ఇతర మంత్రులు కూడా క్యూకట్టారు.  స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతటి కష్టమైనా ఇట్టే దాటేయవచ్చన్న మూఢ నమ్మకం వారిది. సామాన్య జనంతో పాటు వీరు పెరోల్ మీంచి వచ్చిన ఆ దైవాంశసంభూతుడి ఆశీర్వాదం కోసమే వెళ్లారు.  చిత్రమేమంటే మరో నెల రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే బాబాకు పెరోల్ రావడం, ఆయన సత్సంగ్ నిర్వహించడం, అందులో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలూ పాల్గొనడం ట్విస్ట్.  బీజేపీ వారి వింత నిర్ణయాలకు ఇదేమీ కొత్త కాదు. ఎన్నికల ముందు ఏ రాష్ట్రంలో చేయాల్సిన వ్యూహాత్మక ముందడుగును అలానే అమలు చేయడంలో సిద్ధహస్తులు కమలనాథులు. ఎన్నికల సమయంలోనే భక్తి పొంగిపొర్లుతుంటుంది. అప్పుడే తప్పుచేసినవాడు, జైలుకి వెళ్లి వచ్చిన వాడు కూడా మహాత్ముడై పోతుంటాడు. పెరోల్ మీద ఉన్నంత మాత్రాన ఈ బాబా సత్సంగ్ నిర్వహిం చడానికి ఎలా అనుమతించారన్నది ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.

హైకోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురు- రైతుల మహాపాదయాత్రకు ఓకే

జగన్  ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతుల పాదయాత్ర ఇక ఆగిపోయినట్టేనంటూ బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు చేసిన వ్యాఖ్యలు హైకోర్టు తీర్పుతో పసలేనివిగా మారిపోయాయి. అమరావతి రైతులు తమ పాదయాత్రను పున: ప్రారంభించవచ్చని హైకోర్టు విస్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల పాదయాత్ర నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే 600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలన్న పూర్వపు ఆదేశాలను అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఐడీ కార్డులు ఉన్న వారు మాత్రమే పాదయాత్రలో కొనసాగాలన్న తమ పూర్వ ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐడీ కార్డులను రైతులకు వెంటనే తిరిగి ఇచ్చేయాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక యాత్రకు సంఘీభావం తెలిపే వారిపై ఎటువంటి ఆంక్షలూ లేవని హైకోర్టు తన ఉత్తర్వులలో విస్పష్టంగా చెప్పింది. సంఘీభావం తెలిపే వారు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలుపవచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.ఈ విషయంలో గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ మంగళవారం (నవంబర్1)  తన ఉత్తర్వులలో హై కోర్టు స్పష్ఠం చేసింది. పాదయాత్రను నున: ప్రారంభించుకోవచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది.   కాగా పోలీసుల తీరుకు నిరసనగా గత నెల 22న రైతులు తమ పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి విదితమే.   అమరావతి నుండి అరసవిల్లి వరకు   చేస్తున్న మహాపాదయాత్రకు  విరామం ప్రకటించారు. పోలీసులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులోనే తేల్చుకుని పాదయాత్రను మళ్లీ ప్రారంభిస్తామని అమరావతి రైతుల ఐకాస ప్రకటించింది. కోర్టుకు సెలవులు ఉన్నందున పాదయాత్రకు నా తాత్కాలిక విరామం మాత్రమే ఇస్తున్నట్లు ఐకాస వెల్లడించింది. అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. రైతులు శుక్రవారం రాత్రి బస చేసిన ఫంక్షన్ హాల్ ను ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి చుట్టుముట్టారు. ఈ సందర్భంగా బయటి నుంచి   రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. మద్దతు తెలిపేందుకు వస్తున్న వారని ఎక్కడికక్కడ నిలిపేశారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది రైతుల ఐడీ కార్డులు చూపించాలని ఒత్తిడి తెచ్చారు. అనుమతి ఉన్న వాహహనాలు తప్ప ఇంకే వాహనాన్నీ అనుమతించేది లేదంటూ పోలీసులు   చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు- అమరావతి రైతుల మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. దీంతో అమరావతి రైతుల ఐకాస నేతలు అప్పటికప్పుడు సమావేశమై పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మునుగోడులో టీఆర్ఎస్- బీజేపీ డిష్యుం డిష్యుం..రాళ్ల దాడి, ముష్టిఘాతాలతో పలివెల రణరంగం

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న క్రమంలో టీఆర్ఎస్- బీజేపీ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడం  ఇరు పార్టీల శ్రేణులు ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్గొండ జెడ్పీ చైర్మన్ జగదీశ్ కు దెబ్బలు తగిలాయి. ఈటల రాజేందర్ పీఆర్ఓ కాలికి కూడా గాయం అయింది. ఈటల రాజేందర్ కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకు ప్రచారం సాఫీగానే కొనసాగిందనే చెప్పాలి. మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగుస్తుందనగా మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఘర్షణ జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈటల రాజేందర్ కాన్వాయ్ పలివెల రాగానే కాన్వాయ్ లోని వాహనాలపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాన్వాయ్ వెంటే ఉన్న బీజేపీ శ్రేణులు ఆ దాడిని ఎదుర్కొని, ప్రతిగా రాళ్లతో దాడులు చేశారు. వారు పరస్పరం పిడిగుద్దులు కూడా గుద్దుకున్నారు. ఈక్రమంలోనే ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో కూడా దాడులు చేసుకున్నాయి. అయితే.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్ఎస్- బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు. అయినా.. ఆగ్రహం చల్లారని రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల ఘటనపై ఈటల స్పందిస్తూ.. తాను, తన సతీమణి ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనానికి వచ్చినట్లు చెప్పారు. మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారని తెలిపారు. ఆ సమయంలోనే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం తమ తమ వర్గాలతో కలిసి రాళ్లతో దాడి చేశారని చెప్పారు. పార్టీ జెండాల్లో రాళ్లు, కర్రలు తీసుకొచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారని ఆరోపించారు. ఈ దాడికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కారణమని ఈటల ఆరోపించారు.

మోదీ.. గోబ్యాక్.. హ్యాష్ ట్యాగ్ వైరల్ 

అందరికీ ప్రాంతీయాభిమానం ఉంటుంది. కానీ తమ ప్రాంతమే దేశంలో అన్నింటా ముందుందని, అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం వహిస్తోందని, అసలు గుజరాత్ నే రోల్ మోడల్ గా చేసుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాలు ముందంజలో నిలుస్తాయని బీజేపీ సర్కారు చేసుకున్న, చేసుకుంటున్న ప్రచారం అంతా యింతా కాదు.  పరిశ్రమలు, వాణిజ్యం, పాడిపంటలూ అన్నింటా గుజరాత్ కళకళలాడుతోందని తుంబురా పట్టి దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసుకోవడం, ఆ మాటకు వస్తే ప్రతీ ప్రసంగంలోనూ గుజరాత్ మాట లేకుండా ప్రసంగాన్ని ముగించకపోవడం బీజేపీ వారిని మించినవారు లేరు. అదంతా ప్రధాని నరేంద్రమోదీవారి చలవేననీ బాహాటంగా చెప్పుకోవడం బీజేపీ వారికి చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే పచ్చబొట్లు వేసుకునేంత. చిత్రమేమంటే అంతటి గుజరాత్ మహాద్భుతంలోనే మొన్న పాతకాలం నాటి బ్రిడ్జ్ అమాంతం కూలిపోయింది. మరణించినవారి సంఖ్యా 140కి మించే ఉంటుంది. దీన్ని గురించి మాత్రం కమలనాథులు కంటితుడుపు మాటలే చెబుతున్నారుగాని గట్టిగా ఏమీ మాట్లాడ లేకపోతున్నారు.  గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ మొన్నఅమాంతం కూలి సుమారు 180 మంది గాయపడగా, సుమారు 150 మంది మరణించారని తెలిసింది. బ్రిటీష్ కాలంనాటి బ్రిడ్జ్ ని ఇటీవలే కొంత ఆధునీకరించారట. చాలా రోజులకు మళ్లీ అవకాశం వచ్చిందని పర్యాటకులు వెళితే కొంతసేపటికే కూలిపోయింది. కారణం మాత్రం బ్రిడ్జి మీద అల్లరిమూకలు  బ్రిడ్జ్ ని ఉయ్యాల్లా ఊపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు చెబుతున్నారు. పోనీ అదే నిజమనుకున్నప్పటికీ అంత దానికే కూలిపోతుందా? మరి ఆధునీకరణ పనుల మాటేమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం భజన చేయడమే కాకుండా బ్రిడ్జి పనులు సక్రమంగా జరిగినదీ లేనిదీ పరిశీలించకుండానే  పర్యాటకులను అనుమతించడంలో అర్ధమేమిటి అని పరిశీలకుల మాట.   ఇప్పుడు గుజరాత్ పరిస్థితిని గ్రహించి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొన్న రాజస్థాన్ పర్యటనలో ఉన్నా మనసంతా గుజరాత్ సంఘటన గురించే మదన పడుతోందని ప్రధాని అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.  కానీ సోషల్ మీడియా అంతటా  అందరూ గో బ్యాక్ మోదీ అనే భారీ నినాదాలు చేస్తున్నారు ముందు మీ రాష్ఠ్రాన్ని కాపాడుకోండి అంటూ ట్విటర్లలో నినాదాలు ట్రండ్ అవుతున్నాయి. 

జాతీయ రాజకీయాలలో ఏకాకి కేసీఆర్.. టీఆర్ఎస్ స్టింగ్ ఆపరేషన్ ను విశ్వసించని పార్టీలు

కేసీఆర్ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని ఏ ముహూర్తాన ప్రకటించారో.. ఆ క్షణం నుంచీ జాతీయ పార్టీల నాయకులు ఆయనను కలుసుకోవడానికే ఇష్ట పడటం లేదు. కేంద్రంలోని మోడీ సర్కార్ పై నిత్యం విమర్శల వర్షం కురిపించే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆప్, ఎన్సీపీ వంటి పార్టీల నాయకులు కూడా కేసీఆర్ కు దూరం పాటిస్తున్నారు.  బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు సాగించిందంటూ.. టీఆర్ఎస్ అందుకు సంబంధించి వాయిస్ ఆడియోలను బయటపెట్టినా బీజేపీయేతర పార్టీలు కానీ, ఆ పార్టీల నేతలు కానీ కేసీఆర్ కు మద్దతుగా, సంఘీ భావంగా కనీసం ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేదు. బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చేస్తున్న ప్రయత్నాలను స్టింగ్ ఆపరేషన్లో టీఆర్ఎస్ బయటపెట్టినట్లు చెప్పుకుని విస్తృత ప్రచారం చేసినా జాతీయ స్థాయిలో కేసీఆర్ కు ఇసుమంతైనా మద్దతు లభించలేదు. అదేదో రాజకీయాలకు సబంధం లేని కేసీఆర్ కుటుంబ అంతర్గత వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులూ వ్యవహరించి మౌనం వహించారు. ఇటీవలే బీజేపీ కుట్రలకు కుతంత్రాలకు చీలికలు పేలికలైపోయిన ఉద్ధవ్ థాక్రే శివసేన కూడా తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై నోరు మెదపలేదు. టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు మద్దతుగా నిలవలేదు. టీఆర్ఎస్    విడుదల చేసిన ఆడియో టేప్ లలో హస్తినలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేల్చేందుకు కుట్ర జరుగుతోందని ఉన్నా.. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వెనుక సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నట్లుగా సంకేతాలున్నా.. జాతీయ స్థాయిలో పార్టీలేవీ కనీసం స్పందించలేదు. కేసీఆర్ కు మద్దతుగా నిలవలేదు. కేసీఆర్ కు మద్దతు పలుకుతూ పలువురు నేతలు ఫోన్ చేశారని టీఆర్ఎస్ నుంచి ఏవో ఒకటి రెండు ప్రకటనలు వెలువడినా అదంతా ప్రచారంలో భాగమే తప్ప వాస్తవం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎటువైపు నుంచీ కనీస మద్దతు కూడా రాకపోవడం వల్లనే ఎమ్మెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారాన్ని టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఒక ప్రధాన అంశంగా తీసుకువెళ్లడంలో విఫలమైందని వారంటున్నారు. బీజేపీనీ, మోడీ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలూ నాయకులూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఇష్యూగా మార్చి బీజేపీని బదనాం చేయాలన్న టీఆర్ఎస్ ప్రయత్నం కనీస మద్దతు కరవై తుస్సు మంది. బీజేపీ తీరును అవకాశం వచ్చినప్పుడల్లా తూర్పారబట్టే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కానీ, తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ, కేరళర సీఎం పనరయి విజయ్ కానీ కనీసంగా కూడా స్పందించకపోవడంతో అసలు టీఆర్ఎస్ స్టింగ్ ఆపరేషన్ విశ్వసనీయతపైనే అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఇదంతా చూస్తుంటే జాతీయ పార్టీల దృష్టిలో టీఆర్ఎస్ ఓ అంటరాని పార్టీగా మారిపోయిందా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రంలో మోడీ సర్కార్ ఢీ కొట్టే సత్తా ఉన్న నాయకుడిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఎవరి నుంచీ ఆశించిన మద్దతు లభించక ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోయారని పరిశీలకులు అంటున్నారు. 

ప్రభుత్వ వైఫల్యాలపై జనంలోకి చంద్రబాబు.. రెండు నెలల పాటు విస్తృత పర్యటనలు

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల నాలుగో తేదీ నుంచి రెండు నెలల పాటు విస్తృతంగా పర్యటనలు జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ఈ పర్యటనల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను మరిన్ని వర్గాల్లోకి తీసుకెళ్లడం, టీడీపీ శ్రేణులను మరింత క్రియాశీలం చేయడం లక్ష్యం అని చెబుతున్నారు. గత మే నెలలో జరిగిన టీడీపీ మహానాడు తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు రోజులు పర్యటించడం ద్వారా ఏడాదిలో అన్ని జిల్లాలు సందర్శించాలని అప్పట్లో కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించారు. అయితే.. భారీ వర్షాలు, వ్యవసాయ పనులు ముమ్మరం కావటంతో జిల్లాల పర్యటనలకు ఆయన విరామం ఇవ్వాల్సి వచ్చింది. దీంతో రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో మాత్రమే అప్పుడు చంద్రబాబు పర్యటించగలిగారు. ఆ తర్వాత చాలా వరకు నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జులతో ముఖాముఖీ సమావేశాలు పూర్తిచేశారు. ఇప్పటికే 117 నియోజకవర్గాల ఇన్ చార్జులు లేదా సిటింగ్ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ జిల్లాల పర్యటనలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నా రు. నవంబరు నాలుగో తేదీన ఎన్టీఆర్ జిల్లా నుంచి చంద్రబాబు పర్యటనలు ప్రారంభిస్తారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆ రోజున చంద్రబాబు రెండు సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వారానికి మరో జిల్లా పర్యటన ఉండేలా టీడీపీలో ప్రణాళిక రూపొందుతోంది. పర్యటనలు మరింత పకడ్బందీగా నిర్వహించే నిమిత్తం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు ఈ విభాగం కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీమంతెన సత్యనారాయణ రాజు సహ కన్వీనర్ గా ఉంటారు. గతం నుంచి ఈ కార్యక్రమాల సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న గంటా గౌతం, పత్తిపాటి శ్రీనివాస్ లనూ అందులో కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు హయాం నుంచీ పార్టీ పర్యటనల ఏర్పాట్లను కంభంపాటి చూస్తు న్నారు. దీంతో ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగించారు. పర్యటనల విభాగం కొద్ది రోజుల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమై పర్యటనల వ్యూహంపై చర్చించింది. ఇలా ఉండగా.. జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత నుంచి టీడీపీ యువ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. కుప్పంలో ప్రారంభమయ్యే లోకేశ్ పాదయాత్ర సుమారు ఏడాది పాటు సాగనుంది. ఈ లోగా నవంబర్, డిసెంబర్ నెలల్లో పార్టీ చీఫ్ చంద్రబాబు పర్యటనలు కొనసాగుతాయి.

వల్లభనేని వంశీ ఎన్నికపై హైకోర్టు విచారణ

కృష్ణాజిల్లా గన్నవారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. వకాలత్ దాఖలు చేశామని కౌంటర్ వేలయడానికి సమయం కావాలని ఎమ్మెల్యే తరఫు న్యాయ వాది కోరారు. పిటిషన్లో ప్రతివాదులు పలువురికి మరోసారి నోటీసులు జారీ చేసింది. మరికొం దరికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు ఇచ్చేందుకు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయడానికి పిటిష నర్‌ తరఫు లాయర్‌కు అనుమతిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన యార్ల గడ్డ వెంకటరావు 2019 జులైలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వంశీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల ప్రచారంలో వంశీ సూచనతో తహసీల్దార్‌ సంతకంతో ఇళ్ల స్థలాల నకిలీ పట్టాలు పంపిణీ లెక్కింపు ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరగడం తో స్వల్ప తేడాతో ఓడిపోయానని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.  2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంశీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వంశీ విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి వంశీ గెలుపొందాడని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ యార్లగడ్డ వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాపుల‌పాడులో ఎమ్మార్వో స్టాంపు ఫోర్జరీ చేసి.. 12 వేల న‌కిలీ ఇళ్ల ప‌ట్టాల‌ను తన అనుచరులకు వంశీ పంచారని యార్లగడ్డ వెంక ట్రావు పిటి షన్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేసిన‌ట్లు వల్లభనేని వంశీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అమరావతి కేసు.. నాట్ బిఫోర్ మీ అన్న సీజేఐ

అమరావతి కేసులో సుప్రీంలో  ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ యూయూ లలిత్ ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ విచారణ నుంచి తప్పుకుని వేరే బెంచ్ కు బదిలీ చేశారు. వేరే బెంచ్ లో ఈ కేసు లిస్ట్ అయి విచారణకు రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో వాస్తవానికి మంగళవారం (నవంబర్ 1)) జరగాల్సి ఉంది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ.లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణ జరగాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో ఈ కేసు విచారణకు నిరాకరిస్తూ నాట్ బిఫోర్ మి అన్నారు. విభజన చట్టంపై గతంలో తన అభిప్రాయం చెప్పానని అందుకే  వేరే బెంచ్‌పై విచారణ  జరపాలన్నారు. వేరే బెంచ్‌పై వీలైనంత త్వరగా విచారణకు అనుమతి ఇవ్వాలని సూచించారు.   దీంతో ఈ కేసు విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి విదితమే. అయితే ఈ తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం సుప్రీం  కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.  వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది.  ప్రభుత్వ వాదనపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసా గించాలని రైతులు కోరుతున్నారు. ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని ఆరోపిస్తున్నారు. విభేదాలు సృష్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, పాదయాత్రను అడ్డుకోవడం, దాడులు చేయడం మానుకోవాలని రైతులు అంటున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉండాలని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు. హైకోర్టు తీర్పుని వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని రైతులు చెబుతున్నారు.  

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైసీపీ నేత వీరంగం

గన్నవరం విమానాశ్రయంలో పోలీసు అధికారులపై వైసీపీ నేత బెదిరింపులకు దిగిన వైనం మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎయిర్ పోర్టు లోపలికి తనను పంపించలేదని వైసీపీ జెడ్ పీ కో ఆప్షన్ సభ్యుడు ఎం.డి. గౌసాని ఇష్టం వచ్చినట్లు వీరంగం వేశారు. ‘ఏంటి నువ్వు..? ఏం చేస్తావ్..?’ ‘నీ యవ్వారం ఏంటో తేల్చేస్తానం’టూ ఆయన రంకెలు వేస్తూ ఎయిర్ పోర్ట్ ఏసీపీ మీది మీదికి వచ్చారు. ‘నన్ను లోపలికి పంపలేదంటే మీ ఉద్యోగాలు ఉండవు’ అంటూ విమానాశ్రయం పోలీసు అధికారులను గౌసాని భయభ్రాంతులకి గురిచేశారు. ‘అనుమతి ఉన్న వారిని మాత్రమే విమానాశ్రయం లోపలికి పంపిస్తాం’ అని చెప్పినా వైసీపీ నేత ఎం.డి.గౌసాని వినిపించుకోలేదు. సరికదా పోలీసులకు వేలు చూపించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఏంటి నువ్వు చేసేది. నిన్ను ట్రాన్స్ ఫర్ చేయించకపోతే చూడు’. ‘ఎయిర్ పోర్ట్ లోపలికి తనను పంపించకపోతే గంటలో ఇక్కడ నుండి ట్రాన్స్ ఫర్ అవుతావు’ అని అని గౌసానియా బెదిరింపులకు దిగారు.

పీకేకు అర్ధమైంది.. ఇక జనానికీ అర్ధమౌతుంది.. రఘురామ

జగన్ వ్యవహారం, వేషాలు పీకేకు అర్దమయ్యాయనీ, ఇక జనానికీ అర్ధమౌతాయనీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన జగన్ వైఖరినీ, దుర్మార్గాన్నీ అర్ధం చేసుకోవడానికి తనకు ఎనిమిది నెలలు పట్టిందనీ, అదే జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకేకు అర్ధం కావడానికి మూడేళ్లు పట్టిందనీ,  రఘురామ కృష్ణం రాజు అన్నారు.  అందుకే పీకే ఇప్పుడు జనగ్ పదవీకాంక్ష సాకారం అవ్వడానికి తాను సహకరించి ఉండకపోయి ఉండాల్సిందని పీకే వ్యాఖ్యలను ఈ సందర్బంగా ఉటంకించారు. పీకేకి అర్ధమయ్యిందనీ, ఇక జనం కూడా జగన్ పదవీ కాంక్షతో చేసిన చేస్తున్న దుర్మార్గాలను అర్ధం చేసుకుంటారని అన్నారు.  ఈ సందర్భంగా ఒక సినిమాలో తన అధికారం చేపట్టాలంటే.. సానుభూతి అవసరమని భావించిన హీరో కిరాయి హంతకుడి చేత తనను తాన పొడిపించుకున్న దృశ్యాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రజలకు చూపించారు.  ఇక ముఖ్యమంత్రి ఉన్న చోటనే రాజధాని అంటూ జగన్ ఎత్తుకున్న కొత్త పల్లవి అసంబద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోడీకి ఏపీలోని అమరావతి నుంచి పాలన కొనసాగించాలని భావించి భారతదేశ రాజధాని అమరావతే అని ప్రకటించి ఇక్కడ నుంచి పాలన కొనసాగిస్తే జగన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ తన వెసులుబాటు కోసం ఇష్టారీతిగా మాట్లాడి, ఇష్టారీతిగా ప్రవర్తిస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన బాధ్యతాయుతంగా ఉండాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏపీ సీఎం తీరు, వ్యవహారం అంతా తుగ్లక్ ను పోలి ఉంటుందనడానికి సీఎం ఎక్కడంటే అక్కడే రాజధాని అన్న మాటే ఉదాహరణ అన్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచన ఇప్పటి వరకూ దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ రాలేదని,  గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఊటీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా  దాన్ని రాష్ట్ర రాజధాని అని పేర్కొనలేదని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నప్పటికీ,  దాన్ని ఆయన తెలంగాణ రాజధానిగా పేర్కొనడం లేదన్నారు. వారందరికీ భిన్నంగా జగన్ మాత్రం ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాష్ట్ర రాజధాని అంటూ వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు.   తాను చెబుతున్నంత సులువుగా విశాఖ రాజధాని అయిపోతుందని అనుకుంటే.. మూడు రాజధానులంటూ ఇంత హంగామా ఎందుకు? అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానాలు ఎందుకు.. కోర్టు కన్నెర్ర చేసిందని మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఎందుకు అని రఘురామ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆరు నెలల వ్యవధి సరిపోదు, 60 నెలల సమయం కావాలని ఎందుకు అభ్యర్థించినట్లు అని నిలదీశారు.  విశాఖకు తాను వెళ్తాను… తన వెనుకే మంత్రులు వస్తారు… సచివాలయం వస్తుంది, దాన్నే రాష్ట్ర రాజధాని అని పిలుచుకుంటామని జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో చెప్పాలన్నారు. 

వాణిజ్యం పై రూపాయి విలువ తరుగుదల ప్రభావం...చర్చించనున్న పార్లమెంటరీ కమిటీ

వాణిజ్యం పై రూపాయి విలువ తరుగుదల ప్రభావం గురించి చర్చించడానికి పార్లమెంటరీ ప్యానల్ సంసిద్ధత వ్యక్తం చేయనుంది. అయితే దీని గురించి బిజేపీ సభ్యులు వ్యతిరేకించవచ్చుననే అభిప్రా యాలు లేకపోలేదు.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ నాయకత్వంలో  వాణిజ్య వ్యవహారాలపై  పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీ  అనేక అంశాలు చర్చించేందుకు  సోమవారం సమావేశ మయింది. కమిటీ కొత్తగా రూపొందించిన తర్వాత సమావేశం కావడం ఇదే తొలిసారి. సమావేశంలో సంఘ్వీ వాణిజ్యంపై రూపాయి విలువ తరుగుదల ప్రభావం కూడా చర్చించా ల్సిన అంశంగా ప్రతి పాదించారు.   అయితే సంఘ్వీ ప్రతిపాదనను ప్యానల్ సభ్యుడు,  బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వ్యతిరేకించారు. రూపా యి విలువ తరగడమన్నది శాశ్వతం కాదు, కేవలం తాత్కాలికమే గనుక ఆ అంశం కంటే వాణిజ్యానికి సంబందించిన ఇతర కీలకాంశాలు చర్చించడమే మేలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఇతర బీజేపీ ఎంపీలు రాజు బిస్త, రాజకుమార్ చాహార్, దీపక్ ప్రకాష్ సమర్ధించారు. కానీ ఇతర ప్రతిపక్ష ఎంపీలందరూ సంఘ్వీ ప్రతిపాదించాల్సినది చర్చించాల్సిన అంశమేనని అన్నారు.  కనుక వాణిజ్యం సంస్థలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ఈ అంశంలో తమ అభిప్రాయాలను కోరవచ్చు.  వారి అభిప్రాయాలు, సూచనల ఆధారంగానే చర్చ జరగవచ్చు.  ఈ ఏడాది ఆరంభం నుంచే రూపాయి విలువ తరుగుదలకు గురవుతూనే ఉంది.  యు. ఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుదల  తర్వాత  విదేశీ నిధుల  ప్రవాహానికి  దారితీసిన తరువాత  ఇతర  అభివృద్ధి  చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో కలిసి రూపాయి ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఒత్తిడిలో ఉంది. దేశీయ కరెన్సీ అక్టోబర్‌లో  యు. ఎస్  డాలర్‌తో పోలిస్తే దాని జీవితకాల కనిష్ట స్థాయి 83కి పడిపోయింది మరియు ఇది రు.82 పైన కొనసాగుతోంది.

ఆర్భాటంగా ప్రకటనలు.. అమలు చేయలేక ఆపసోపాలు!

జగన్ ముఖ్యమంత్రి ఈ మూడున్నరేళ్లలో చేసినది ఆర్భాటంగా నిర్ణయాలు తీసుకోవడం.. వాటి పర్యవసానాలు ఎదుర్కోలేక అభాసుపాలై ఆపసోపాలు పడటం మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా వేదికను కూల్చడంతో మొదలైన జగన్ విధ్వంస పాలన మూడేళ్లుగా ఎన్నో మొట్టికాయలు తిన్నా అప్రతిహాతంగా కొనసాగుతూనే ఉంది. అక్రమ కట్టడం అంటూ ప్రజావేదికనైతే కూల్చేశారు కానీ.. ఆ ప్రజా వేదిక అక్రమకట్టడం అని ఇప్పటి వరకూ అక్రమకట్టడం అని నిరూపించడం అయితే కాలేదు. ముందు కానిచ్చేస్తే.. ఆ తరువాత ఏం జరిగినా ఎవరూ పీకేదేం లేదన్న విధానంతో జగన్ సర్కార్ ముందుకు పోతోందని అంటున్నారు. రిషికొండ తవ్వకాల విషయంలో కూడా జగన్ సర్కార్ అదే తీరును అవలంబిస్తోందని గుర్తు చేస్తున్నారు. కోర్టు కూడదన్నా తవ్వకం పనులు యథేచ్ఛగా సాగించడం.. పర్యావరణ విధ్వంసానికి వెనుకాడకపోవడాన్ని ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు ఉదహరిస్తున్నాయి. అడవుల విధ్వంసంపై న్యాయస్థానం కన్నెర్ర చేస్తే ధ్వంసం చేసిన అడవుల స్థానంలో మళ్లీ అడవిని పెంచుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పడాన్ని తెంపరితనంగా అభివర్ణిస్తున్నారు. విధ్వంసం విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయని జగన్.. ప్రభుత్వ నిర్ణయాల అమలు విషయంలో మాత్రం ప్రతిసారీ మడమ తిప్పుతున్నారు.. మాట తప్పుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ విశాఖలో ఫ్లెక్సీల పై నిషేధం అంటున్నారు. ఇటీవల జగన్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖలో అపరిమితంగా అడ్డూ అదుపూ లేకుండా వెలసిన ఫెక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఊరుకోకుండా తక్షణమే విశాఖలో ఫ్లెక్సీలపై నిషేధాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఈ తక్షణం ఇప్పటి వరకూ రాలేదు. నవంబర్ 1 లోగా ఫెక్సీలపై నిషేధం ఉత్తర్వులు ఇస్తామని ఒకసారి.. ఆ తేదీ వచ్చేసరికి నిషేధం జనవరి నుంచి అంటూ మరోసారి మడమ తిప్పేసి మాట మార్చేశారు జగన్. ముందు చూపు లేకుండా నిర్ణయాలు ప్రకటించడం.. ఆ తరువాత మిన్నకుండిపోవడం ఒక అలవాటుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తున్నది. అప్పటికప్పుడు నోటికి తోచిన ప్రకటన చేయడం... ఆ ప్రకటన ప్రకారం చర్యలు తీసుకోలేక, కార్యాచరణలో పెట్టలేక అభాసుపాలు కావడం.. మాట మార్చడానికి ఆపసోపాలు పడటం ఇదే మూడున్నరేళ్లుగా జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానమంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మందు బాబులు..సారీ.. కోతులు 

అతిగా తాగి తూలేవాడిని కోతి అనే పిలుస్తారు. మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా వాగడం, తిరగడం చేస్తుంటాడు. మరి కోతులే మందు కొడితే? సరిగ్గా ఇదే జరుగుతోంది ఉత్తరప్రదేశ్ లో. రాయిబరేలీలో లిక్కర్ దుకాణాలవారికి, అక్కడికి వచ్చేవారికి కోతుల బెడదతో భయంతో కూడిన సమస్యలు తెలెత్తాయి.  గుడికి వెళితే అరటిపళ్లు లాగేసుకునే కోతులు చూస్తాం. వాటికి భయపడుతూ జాగ్రత్తగా వెళ్లి వస్తుంటారు. వాటికి ఆకలి వేసి జనాల మీద దాడి ప్రారంభించితే ఇంట్లో ఉన్న తిండి అంతా సమర్పించు కోవా ల్సిందే.  ఇచ్చేంతవరకూ వదలవు. కానీ మందుబాటిల్, మందు కోసం కూడా ఎగబడటం, జనాన్ని ఇబ్బందిపెట్టడం మాత్రం రాయిబరేలీలో జరుగుతోంది. ఏదో సరదాగా నలుగురు కలిసి తాగదాలని వెళ్లినవారి మీదా కోతులు దాడి చేస్తున్నాయట. వాటికి మందు అంతగా యిష్టమయిందేమో మరి.   మామూలుగా అయితే, బాగా చెట్లు ఉన్న కాలనీల్లోకి దండులా వచ్చి పడుతుంటాయి. మామిడి, అరటి చెట్లున్నచోట మరీ ఎక్కువ గోల చేస్తుంటాయి. పిల్లలతో పాటు దూకుతూ, దొంగతనంగా ఇళ్లలోకి వచ్చి అందిన తిండిపదార్ధాలని తినేస్తుంటాయి. కానీ రాయిబరేలీ కోతులు మరింత చిత్రంగా ఉన్నాయి. అక్కడివారంతా రోజూ వాటివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారట. మొన్నామధ్య ఒకరోజు లిక్కర్ దుకాణం వాడు దుకాణం తలుపు తీసేసరికే లోపల కూచుని ఒకటి డబ్బా బీర్ లాగించేస్తూ కనపడింది. అంతే దుకాణం వాడు గొల్లుమన్నాడు. వెంటనే వాటిని పట్టుకునేవారిని పిలిపించాడు. వాళ్లు వచ్చే లోగానే మరోటి తాగేసి పారిపోయింది. రోడ్డు మీద వెళుతూ ఆయన కేకలు విన్నవారిలో కుర్రాళ్లు ఆ మందుకోతి వీడియో తీశారు. ఇపుడు అది వైరల్ అయింది. 

వ్యవసాయ మోటార్లకు మీటర్లు సరే.. ఈ సంగతేంటి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోడీ సర్కార్ పై విమర్శలతో విరుచుకు పడే అంశాలలో ప్రధానమైనది వ్యవసాయ మీటర్లకు కేంద్రం మోటార్లు పెట్టమంటోందన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ విస్పష్టంగా చెబుతున్నారు. తాను కేంద్రం ఆదేశాలను ధిక్కరించినందుకే అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నదనీ, పనికిమాలిన కొర్రీలతో అప్పులకు అడ్డంకులు సృష్టిస్తే రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడేస్తోందని కేసీఆర్ చెబుతున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ, ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్ కూ లేని ఆంక్షలను తెలంగాణకు విధిస్తూ నానా ఇబ్బందులూ పెడుతోందని విమర్శిస్తున్నారు. తన తల తీసేసినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పనికి తాను అంగీకరించేది లేదని చెబుతున్నారు. అదలా ఉంచితే అసలు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఆలోచన మోడీకి రావడానికి కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించడం ద్వారానే వచ్చిందనీ, ఒక విధంగా చెప్పాలంటే.. కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకునే కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాలలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు యథేచ్ఛగా వాడేస్తూ ఉండేవారు. విద్యుత్ ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే విద్యుత్ వృధాను అరికట్టడం అన్న పేర ప్రీపెయిడ్ మీటర్లను బిగించడానికి నిర్ణయించిందో అప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మోడీ సర్కార్ కూడా అదే చెబుతోంది. వ్యవసాయానికి విద్యుత్ ఉచితంగా ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదనీ, కానీ ఉచిత విద్యుత్ పేర విద్యుత్ వృధాను అరికట్టడమే తమ లక్ష్యమనీ చెబుతూ కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని చెబుతున్నామంటోంది.  కనీ కేసీఆర్ తన రాష్ట్రంలో తన ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు ఏ కారణంతో అయితే ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని నిర్ణయించారో.. అదే కారణంతో కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తానంటే మాత్రం ససెమీరా అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రీపెయిడ్ రీచార్జబుల్ ఎలక్ట్రికల్ మీటర్లను బిగించేశారు. ముందుగా చెల్లించిన మేరకు విద్యుత్ ను వినియోగించిన ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఆలస్యమైతే రిచార్జ్ చేయించుకునే వరకూ ఆయా కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అదీ సంగతి ఇప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయానికి వస్తే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల.. ప్రభుత్వం ఆ మీటర్ మేరకు విద్యుత్ బిల్లు చెల్లించడం ఆలస్యమైతే వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. మనీ ట్రాన్స్ఫర్ తరహాలో రైతులు వినియోగించుకున్న మేరకు అయిన చార్జీల సొమ్మును ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో వేస్తుంది. దానితొ వారు విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం బిల్లు సొమ్మును రైతుల ఖాతాలో వేయడం ఆలస్యమైతే.. రైతుకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఇలా మోడీ కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకునే.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ మోటార్లను బిగించిన విధంగానే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న నిర్ణయం తీసుకున్నారు.  ఇక కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించడంతో ఆగడం లేదు. ఇప్పుడు గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు సమాయత్త మౌతున్నారు. అంటే గృహ వినియోగదారులు కూడా తాము వినియోగించుకోబోయే విద్యుత్ కు ముందుగానే సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఆ సొమ్ముకు సరపడా విద్యుత్ వినియోగం పూర్తి కాగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనం కేసీఆర్ ను దీని సంగతేమిటని నిలదీస్తున్నారు. స్మార్ట్ మీటర్లన్నీ ప్రీపెయిడ్ ప్రాతిపదికగానే ఉంటాయనీ, అంటే ఫోన్ రీచార్జ్ చేయించుకున్నట్లుగా విద్యుత్ వినియోగం కూడా రీచార్జ్ విధానంలోనే సరఫరా అవుతుందనీ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అంటే చార్జ్ చేయించుకున్న మేర విద్యుత్ వినియోగించిన మరు క్షణం ఆటోమేటిగ్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేయించుకునే వరకూ సదరు గృహస్థు కుటుంబంతో సహా చీకట్లో మగ్గాల్సిందే.

రంభ కారు ప్రమాదం..,కుమార్తె సీరియస్

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఒకప్పటి టాప్ హీరోయిన్ రంభ కుటుంబ సమేతంగా వెళుతోన్న కారు ప్రమాదానికి గురయింది. మంగళవారం కెనడాలో జరిగిన ఈ ప్రమాదంలో అందరికీ గాయాలయ్యాయని, రంభ కుమార్తె నాషా మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారని సమాచారం.  రంభ కొంతకాలం నుంచీ తన కుటుంబంతో కెనడాలో ఉంటున్న సంగతి తెలిసిందే. కారులో ఉన్న రంభ, ఆమె పెద్ద కూతురు, అలాగే ఆమె నాన్నికి స్పల్ప గాయాలు అయ్యాయి. కానీ చిన్న కూతురు సాషాకి తీవ్రగాయాలు అవ్వడంతో హాస్పిటల్‌కి తరలించారు. సాషాకి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయం తెలిపుతూ నటి రంభ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. కూతుర్లను స్కూల్ నుంచి తీసుకొస్తుండగా.. ఓ జంక్షన్ వద్ద మా కారుని మరో కారు ఢికొట్టింది. అప్పుడు నేను నా పిల్లలు, అలాగే నా నానీ కూడా నాతోనే ఉన్నారు. అందరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. కానీ నా కూతురు సాషా ఇంకా హాస్పిటల్‌లోనే ఉంది. మా బ్యాడ్ టైమ్. దయచేసి మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకు చాలా ముఖ్యమన్నారు.

మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మంత్రి జగదీశ్వరరెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక ముందు వరుస ఎదురుదెబ్బలు తగలడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటికి మొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించింది. అది అలా ఉంటే ఆ నిషేధం ఇలా ముగిసిందో లేదో  సోమవారం రాత్రి నుంచి ఆయన నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. తెలంగాణ విద్యుత్ మంతి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం ఒకింత ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకే కొనసాగిన ఈ సోదాలో ఐటీ అధికారులకు భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. అత్యంత గొప్యంగా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. దాదాపు 15 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో అధికారులు పెద్ద మొత్తంలో నగదు, కొన్న డాక్యుమెంట్లు, డైరీలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

జైలుశిక్షలో ఉన్నవారికి ఓటు హక్కు లేదా?

దేశంలో ఓటర్లు ఎంతమంది, మనకు ఎంతశాతం ఓట్లు వస్తాయి, మన పార్టీవారు వేరే పార్టీవారికి జారిపోకుండా కట్టు దిట్టం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదలయిన వన్నీ సరిగ్గా ఏదో ఒక ఎన్నికల సమయంలోనే చర్చకు వస్తుంటాయి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో లేనివారికి ఆ హక్కు కల్పించే యత్నాలూ ముమ్మరంగా చేపడుతుంటారు. అయితే, ఏదో ఒక కేసులో జైళ్లలో మగ్గుతున్నారి సంగతేమిటి? అనే ప్రశ్న కూడా తలెత్తకా పోదు. వారిని కూడా ఓటర్లుగా భావించి ఓటు హక్కు కల్పిస్తారా అన్న అంశంపై చాలా కాలం నుంచే చర్చ ఉంది. కానీ పెద్దగా సీరియస్ గా పట్టించు కున్నట్టు లేదు. వాస్తవానికి 1951 ప్రజాప్రతినిధుల చట్టం జైల్లో ఉన్నవారికి  ఓటు హక్కు లేదు. కానీ వారి ఓటుహక్కు వినియోగానికి వీలు కల్పించాలని కోరడం జరుగుతోంది. దీన్ని గురించి కేంద్ర  ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ యింకా స్పందించాల్సి ఉంది.  అయితే ఈ అంశంలో పిల్ ను అంగీకరించే సమయానికి అంటే డిసెంబర్ 9వ తేదీలోగా  సుప్రీం కోర్టు ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీలతో కూడిన బెంచ్ కేంద్రం, ఈసీ స్పందించాలని ఆదేశించింది.  అయితే,  ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం జైలు శిక్ష లేదా రవాణా లేదా మరేదైనా జైలులో నిర్బంధించబడినా, లేదా పోలీసు చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నట్లయితే, ఏ వ్యక్తి ఏ ఎన్ని కల్లోనూ ఓటు వేయకూడదు: ఈ ఉప విభాగంలోని ఏదీ నివారణ నిర్బంధానికి గురైన వ్యక్తికి  వర్తించదని సెక్షన్ 62(5) తెలియజేస్తుంది.   కాగా.  జైల్లో ఉన్న వ్యక్తి  శిక్షాకాలం, చేసిన పని గురించిన స్పష్టత మాత్రం ఎలాంటి స్పష్టీకరణను  ఓటు హక్కు  నిషే ధంలో లేదని , జైలు శిక్ష అనుభవిస్తున్న వారి విషయంలో ఆదిత్య భట్టాచార్య వేసిన పిల్ పేర్కొన్నది.  అంటే  ఎంత కాలం నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి ఓటు హక్కు ఉండదు, ఎంత స్థాయి నేరం చేసినవారికి  ఉండదూ  అనే అంశాలు స్పష్టంగా లేవని ఆయన పిల్ లో పేర్కొన్నా రు. అంతేగాక, నిర్దోషిత్వం లేదా అపరాధం నిశ్చయంగా నిర్ధారించబడని అండర్ ట్రయ ల్‌లు, వారు కూడా జైలులో నిర్బంధించబడినందున వారి ఓటుహక్కును కోల్పోతారని, అయితే బెయిల్‌పై విడుదలై నప్పటికీ దోషి ఓటు వేయవచ్చని పేర్కొంది.  మొత్తానికి జైలుశిక్షలో ఉన్నవారికి ఓటు హక్కు గురించి సుప్రీంకోర్టు పరిశీలించాల్సి ఉంది. 

వైసీపీ టంగ్ ట్విస్టర్.. మూడంటే మూడు కాదు ఒకటే!

మూడు రాజధానుల మూడుముక్కలాటలో వైసీపీ నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. మూడంటే మూడని కాదు అని చెబుతోంది. ఏపీకి ఒక్కటే రాజధాని అనీ.. అది అమరావతి కాదు.. విశాఖపట్నం అని అంటోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే.. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తారో అదే రాజధాని అని చెబుతున్నారు. ఇందు కోసం మూడు రాజధానులంటూ రాద్ధాంతం ఎందుకని ప్రకటిస్తున్నారు. సీఎం తనకు ఇష్టమొచ్చిన నగరం నుంచి పాలన సాగించవచ్చనీ, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే కేబినెట్ ఉంటుందనీ, అక్కడే సచివాలయం కూడా ఉండాలని చెబుతున్నారు. ఇంతోటి దానికి మూడు రాజధానులంటూ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం.. కోర్టులు మొట్టికాయలు వేయడంతో వాటిని ఉపసంహరించుకోవడం.. మళ్లీ తగుదునమ్మా అంటూ మూడు రాజధానులే ముద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేయడం ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు.  ఇంత కాలం మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతూ వస్తున్నారు. కర్నూలు న్యాయరాజధాని, అమరావతి శాసన రాజధాని, ఇక విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ చెబుతూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ స్వరం మారింది.. ధోరణి మారింది. ఉత్తరాంధ్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రానికి ఒకటే రాజధాని అని కుండ బద్దలు కొట్టేశారు. అయితే ఆ ఏకైక రాజధాని అమరావతి కాదు.. విశాఖపట్నం అని ఆయన చెప్పారు. ఈ అభిప్రాయం పార్టీ అభిప్రాయమా.. లేక ధర్మాన సొంత పైత్యమా అన్నది పక్కన పెడితే.. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో రాద్ధాంతం ఎందుకని ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అదే రాజధాని అవుతుందని స్పష్టంగా చెప్పారు. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగించాలనుకుంటే అక్కడ నుంచి సాగించవచ్చనీ.. దీనిని ఎవరూ అడ్డుకో జాలరనీ కూడా చెప్పేశారు. అంతే కాదు.. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అక్కడే కేబినెట్ కూడా ఉంటుందనీ, అక్కడే సచివాలయం కూడా ఉండాలని జగన్ చెప్పారు. అంటే తాను విశాఖ నుంచే పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నాననీ, అందుకే అక్కడే సచివాలయం ఉంటుందనీ, అక్కడే కేబినెట్ కూడా ఉంటుందని అందుకే ఏపీ రాజధాని విశాఖపట్నమే అవుతుందనీ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాశారు. మరి శాసన కేపిటల్, న్యాయ రాజధాని అంటూ ఇంత కాలం ఆడిన డ్రామాకు అర్ధమేమిటో జగన్ చెప్పి తీరాలి. ఇది అలా ఉంచితే.. ఇప్పుడు ధర్మాన తాజాగా ఎత్తుకున్న ఏపీకి ఏకైక రాజధాని విశాఖ పట్నమే అన్న విషయానికి వస్తే.. కర్నూలులో హైకోర్టు ఉంటుంది కానీ అది న్యాయ రాజధాని కాదు.. అలాగే అసెంబ్లీ అమరావతిలోనే కొనసాగినంత మాత్రాన అది శాసన రాజధాని కాదు అని చెబుతున్నారు.   వరుసగా సదస్సులు నిర్వహిస్తూ ఆయన చెబుతున్న మాట ఇదే. ఇప్పుడు జనగ్ మాటలను ఒకసారి పరిశీలిస్తే.. ఆయన కూడా ఏపీ రాజధాని విశాఖపట్నమే అవుతుంది కానీ.. ఇంత కాలం తాము చెబుతూ ఉన్న మూడు రాజధానులు అన్న మాటే ఉండదని అర్ధమౌతుంది.  ఇందుకు ఉదాహరణలుగా  ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయితే కటక్‌లో హైకోర్టు ఉందని ధర్మాన ఇప్పుడు తాపీగా ఎవరికీ తెలియని రహస్యమన్నట్లు చెబుతున్నారు. అలాగే దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ఓ చోట… రాజధాని మరో చోట ఉన్నాయని చెబుతూ.. అంత మాత్రాన ఆయా రాష్ట్రాలలో న్యాయరాజధాని అంటూ హైకోర్టు ఉన్న  నగరాలను రాజధానులని ఎవరూ పిలవడం లేదన్న ధర్మాన వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్తగా రాయల సీమ ప్రాంతంలో ఆందోళనలు అంకురించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకలు అంటున్నారు. తాజాగా జగన్, ధర్మానలు చేస్తున్న వాదన వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే అని వివరిస్తున్నారు.  అసలిదంతా ఎందుకంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి.. ప్రజల సెంటిమెంటును రగిలిస్తే తప్ప వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం అసాధ్యమన్న అభిప్రాయానికి వైసీపీ అగ్రనాయకత్వం వచ్చేయడంతోనే ఇప్పుడొ  ఏకైక రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడానికి ఇదే కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.