స‌భ‌కు స‌ర్వం సిద్దం

  తెలంగాణ ఉద్యమ‌కారుల ఆంక్షలు బెదిరింపుల మధ్య ఏపిఎన్జీవోల స‌భ‌కు స‌ర్వం సిద్దమ‌యింది. తెలంగాణ రాజకీయ జేఎసితో పాటు ప‌లు సంఘాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్ని చేదించుకుంటూ వేలాదిగా సీమాంద్ర ఉద్యోగులు హైద‌రాబాద్ చేరుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో స‌భ‌ను స‌క్సెస్ చేస్తామంటున్నారు ఎన్జీవోలు. పోలీసులు కూడా ఎలాంటి అవాంచనీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అన్నిర‌కాల జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి న‌గ‌రంలోకి వ‌చ్చిన దాదాపు 70 బ‌స్సుల‌ను పోలీస్ సెక్యూరిటీతో సిటీలోకి తీసుకువ‌చ్చారు. దీంతో పాటు వివిద జిల్లాల‌నుంచి ట్రైన్‌లు ఇత‌ర ర‌వాణా మార్గాల ద్వారా వ‌స్తున్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా త‌గు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత వాహనాలలో వ‌చ్చిన ఉద్యోగ‌స్తుల కోసం ప‌బ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌, ఆలియా క‌ళాశాల ప్రాంగ‌ణాల్లో పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించారు.

న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్షలు

  హైద‌రాబాద్‌లో ఏపిఎన్జీవోల స‌భ, తెలంగాణ బంద్‌ల నేప‌ధ్యంలో న‌గ‌రంలో చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విదించారు. ఉద‌యం 11గంట‌ల‌నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఈ ఆంక్షలు కొన‌సాగ‌నున్నాయి. ముఖ్యంగా ఏపి ఎన్జీవోలు స‌భ నిర్వహిస్తున్న ఎల్‌బి స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల‌తో పాటు అంసెబ్లీ చుట్టూ ప్రక్కల రెండు కిలో మీట‌ర్ల మేర ఆంక్షలు వ‌ర్తిస్థాయి. ముఖ్యంగా ఏఆర్ పెట్రోల్ పంప్‌, బీజెఆర్ విగ్రహం, అబిడ్స్, గ‌న్‌ఫౌండ్రీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, బ‌షీర్‌బాగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఉన్నాయి. అబిడ్స్, తెలుగుత‌ల్లి ఫ్లైఒవ‌ర్ మార్గాల‌ను అస‌లు ఉప‌యోగించ వ‌ద్దని పోలీసులు సూచిస్తున్నారు.

రాష్ట్ర విభజనతో తెదేపాలో కూడా విభజన

  రాష్ట్ర విభజన యొక్క తీవ్ర పరిణామాలు అన్నిటికంటే తెలుగుదేశంపైనే చాలా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. వైకాపా తెలంగాణాను వదులుకొని సమైక్య నినాదం ఎత్తుకోవడంతో తెదేపాకు మరిన్నిసమస్యలు ఎదురయ్యాయి. వైకాపా సమైక్యనాదంతో సీమాంద్రాలో దూసుకుపోతుంటే, విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చినపటికీ, పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు తప్పని పరిస్థితుల్లో సమైక్య రేసులో పాల్గొనవలసి వస్తోంది.   అందువల్ల పార్టీకి తెలంగాణాలో తీరని నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ ఏమీ చేయలేని అసహాయత. తమ పార్టీకి ఆ రెండు పార్టీలు ఇటువంటి పరిస్థితి కల్పించినందుకే చంద్రబాబు కాంగ్రెస్, వైకాపాలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సింహ గర్జనలు, భూస్థాపితాలు అంటూ మాట్లాడుతున్నారు.   ఆ పార్టీకి చెందిన తెలంగాణానేతలు పార్టీ పరిస్థితిని అర్ధం చేసుకొని ఇంత కాలం సంయనం పాటించినప్పటికీ తప్పని పరిస్థితుల్లో నోరు విప్పవలసి వచ్చింది. తెదేపా తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ రేపు ఎపీఎన్జీవోలు తలపెట్టిన సభను వ్యతిరేఖిస్తున్నామని, అదేవిధంగా తెలంగాణా రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన 24గంటల హైదరాబాద్ బంద్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు.   తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చిన సంగతిని మరచి, సమైక్యాంధ్ర కోసం గర్జిస్తు, నేడో రేపో, ఆయన కూడా పూర్తి సమైక్యవాదిగా మారితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వారిలో పెరుగుతోంది. అందువల్ల ఇప్పటికయినా తాము మౌనం వీడకపోతే, రేపు తెలంగాణా లో కాలుకూడా పెట్టలేని పరిస్థితి ఎదురవుతుందనే భయం వారిలో మొదలయింది. అందువల్లే రేపటి బంద్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.   ఇక ఊహించినట్లుగానే, ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు అందుకు విరుద్దంగా మాట్లాడారు. పార్టీలో చంద్రబాబుది ఒకదారి, సీమాంధ్ర నేతలది మరొక దారి, తెలంగాణా నేతలది ఇంకొక దారి అన్నట్లు తయారయింది. మరి ఈ పరిస్థితులను చంద్రబాబు చక్కదిద్దుకొని ఆయన చెపుతున్నట్లు కాంగ్రెస్-వైకాపా-తెరాసాలు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో నెగ్గుకొస్తారో లేక ఆటలో కూర్చొనక ముందే ఓటమి అంగీకరించి తప్పుకొంటారో త్వరలోనే తేలిపోతుంది.

కాంగ్రెస్ మార్క్ పరిపాలన

  కాంగ్రెస్ పార్టీ చేసిన రాష్ట్ర విభజనతో నేడు రాష్ట్రం అతలాకుతలం అవుతునపటికీ, ఆ విషయాన్ని పార్లమెంటులో రాష్ట్ర యంపీలు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నపటికీ, కేంద్ర ప్రభుత్వంలోఎటువంటి చలనం కలగకపోవడం చాలా విచిత్రం. సాక్షాత్ ప్రధానికి రాష్ట్ర నేతలు వెళ్లి మొరపెట్టుకొన్నపటికీ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ఎటువంటి చర్యలు చెప్పటకపోవడం బాధ్యతా రాహిత్యమే. ఇక రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నకారణంగా ముఖ్యమంత్రి కూడా అంతే నిర్లిప్తత ప్రదర్శించడం చూస్తే రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్నసంగతి స్పురణకి రాక మానదు.   ఇక ప్రజలకు సరయిన మార్గదర్శనం చేయవలసిన రాజకీయపార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మరింత రెచ్చగొడుతూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. వాటి సమ్మతితోనే రాష్ట్ర విభజన చేసినందున, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి, తాము భాద్యులము కామన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం చేతులు దులుపుకొంది. కానీ, ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలే మొదటి నుండి విభజను వ్యతిరేఖిస్తూ వచ్చారు. ఇప్పటికీ వ్యతిరేఖిస్తూనే ఉన్నారన్న సంగతిని మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడటం లేదు. అసలు ముందు తన పార్టీ నేతలపైనే పట్టు సాధించలేని కాంగ్రెస్ పార్టీ, ఇక రాష్ట్రంపై, ఇతర పార్టీలపై ఏవిధంగా పట్టు సాధించగలదు? బహుశః అందుకేనేమో నెల రోజులు పైగా రాష్ట్రం పూర్తిగా స్తంభించినా కాంగ్రెస్ అధిష్టానం చేష్టలుడిగి చూస్తోంది.   సీమాంధ్ర ప్రాంతమంతా ఉద్యమాలతో రగులుతుంటే, హైదరాబాదులో ఇరుప్రాంతల ఉదోగుల మధ్య కొట్లాటలు నిత్యకృత్యమయిపోయాయి. రేపు ఏపీ యన్జీవోలు, తెలంగాణావాదుల మధ్య ఘర్షణలు చెలరేగి, పరిస్థితులు చేయి దాటిపోయిన తరువాత కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనవేమో? కాంగ్రెస్ పాలన ఎంత గొప్పగా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

ఏపీ ఎన్జీవోల సభకు కిషన్ రెడ్డి మద్దతు దేనికి సంకేతం?

  వరంగల్ జిల్లా, హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో చేప్పట్టిన తెలంగాణ సాధన దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ రేపటి జేఏసీ బంద్ పిలుపుకు మద్దతునిచ్చే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అదేవిధంగా హైదరాబాదులో రేపు ఏపీ ఎన్జీవోల సభ జరుపుకోవడాన్నిసమర్దించారు.   మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడటమే కాక జై తెలంగాణా, జై సమైక్యాంధ్ర అని సభకు వచ్చిన వారితో నినాదాలు కూడా చేయించి తమ పార్టీ స్పష్టమయిన వైఖరిని చాటారు. అయితే, ఆ తరువాత సీమంద్రాలో ఉదృతమవుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను గమనించిన బీజేపీ క్రమంగా ప్రత్యేక తెలంగాణా నుండి 'సమన్యాయం' వైపు మరలిందని బీజేపీ నేత వెంకయ్య నాయుడు పార్లమెంటులో మాట్లాడిన మాటలను బట్టి అర్ధమవుతోంది.   అందుకు కారణం రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి సహకరించడం వలన కాంగ్రెస్ పార్టీయే లాభపడుతుంది తప్ప, బీజేపీకి ఒరిగేదేమీ లేదని తాజాగా జ్ఞానోదయం పొందడమే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే తెలంగాణా బిల్లుకి ఏవో కుంటి సాకులు చెప్పి మద్దతు పలకకుండా తప్పుకొని, రానున్న ఎన్నికలలో తమకు అధికారం ఇస్తే వంద రోజుల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికలలో గెలవాలని బీజేపీ తాజా వ్యూహం. బహుశః తదనుగుణంగానే నేడు కిషన్ రెడ్డి కూడా తన అభీష్టానికి వ్యతిరేఖంగా ఏపీ ఎన్జీవోల సభకు మద్దతు తెలిపారనుకోవచ్చును.   తెరాసలో జేరి ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలనే ఆశతో తెదేపా నుండి బయటకి వచ్చి భంగపడిన నాగం జనార్ధన్ రెడ్డి, తెలంగాణా పట్ల స్పష్టమైన వైఖరి అవలంభిస్తున్నబీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ కూడా ‘యూ టర్న్’ తీసుకోవడంతో కంగు తిన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ ఎన్జీవోల సభకు మద్దతుగా, రేపు సభను అడ్డుకొనేందుకు టీ-జేఏసీ తలపెట్టిన బంద్ కి వ్యతిరేఖంగామాట్లాడుతుంటే, నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం ఆయనతో విభేదిస్తూ సభను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవలసిందే, బంద్ విజయవంతం చేయవలసిందేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు.   ఆయనవంటి సీనియర్ రాజకీయ నేత పార్టీ ఆలోచనలను గ్రహించకపోవడం విచిత్రమే. కిషన్ రెడ్డి మాత్రం ఒకవైపు తెలంగాణా సాధన సభ వంటి కార్యక్రమాలు చేపడుతూనే, మరో వైపు మారిన పార్టీ వైఖరికి అనుగుణంగా మాట్లాడుతూ తెలివయిన రాజకీయ నాయకుడిగా నిరూపించుకొంటున్నారు.

చిన్నదాని పెద్ద మాటలు వినండి

  ఈ రోజు నంద్యాలలో తన సమైక్య శంఖారావం యాత్రను చేస్తున్నవైకాపా నాయకురాలు షర్మిల తను వయసులో చిన్నదానినయినా దయచేసి తన మాట వినండి అంటూ ప్రజలను కోరారు. సమైక్య ఉద్యమం చేయాలా వద్దా? అనే సంగతి మీకు మీరే తెల్చుకోండని ఆమె అన్నారు. చంద్రబాబు పుటుక వలన తెలుగుతల్లి అవమానంతో తల దించుకొనే పరిస్థితి ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. తను వయసులో చిన్నదానిని అని చెప్పుకొంటూనే, మరో వైపు తన వయసుకు మించి ఇటువంటి అనుచితమయిన మాటలు మాట్లాడటం వలన తరిగేది ఆమె గౌరవమే. రేపు తెదేపా నేతలు కూడా ఆమెకు ఇదే స్థాయిలో జవాబు చెపితే అది ఆమెకు గౌరవం కాబోదు.   అసలు తన యాత్ర ఉద్దేశ్యం ఏమిటి? తను మాట్లాడుతున్నది ఏమిటి? అనే ఆలోచనలేకుండా ఇటువంటి పొంతన లేని మాటలు మాట్లాడటం వలన తాత్కాలికంగా ప్రజలను ఆకట్టుకోవచ్చునేమో కానీ, దానిద్వారా ప్రజల నుండి ఓట్లను రాబట్టుకోలేరు. సమైక్యాంద్రా కోసం మొదలుపెట్టిన యాత్రలో దాని గురించే చర్చిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఇంత వరకు రాష్ట్ర విభజన జరిగితే వచ్చే నష్టాల గురించే ఆమె కధకధలుగా వర్ణిస్తున్నారు. దాని వలన ప్రజలను మరింత రెచ్చగొట్టడం తప్ప వేరేమి ప్రయోజనం లేదు. తద్వారా రాష్ట్రంలో అశాంతికి ఆజ్యం పోస్తూ తన పార్టీని బలపరచుకొనే ప్రయత్నం చేయడం క్షమార్హం కాదు.   తన యాత్రల వలన రాష్ట్ర విభజన ఆగదనే సంగతి ఆమెకు బాగానే తెలుసు. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసి కూడా ఆమె ఇంకా సమైక్య రాగం ఆలపించడం కేవలం రాజకీయ లబ్ది కోసమే. ఇతరులకు దైర్యం లేదు, పిరికి వారని నిత్యం ఆడిపోసుకొనే ఆమె, దైర్యంగా రాష్ట్ర విభజన అనివార్యమని ప్రజలకి తెలియజేసి, సీమంధ్ర ప్రాంతానికి న్యాయం జరగడానికి పార్టీ తరపున తగిన ప్రతిపాదనలు, సలహాలు ప్రకటించి, విభజన తరువాత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తమ పార్టీ చేపట్టనున్న పధకాలు, ప్రణాళికల గురించి వివరించగలిగితే ఆమె నాయకత్వ లక్షణాలను ప్రజలు కూడా హర్షించేవారు.   అసలయిన నాయకుడు ప్రజల ముందుండి నడిపిస్తే, అవకాశవాద నాయకులు ప్రజల వెనుకనడుస్తారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యం అంటున్నారు గనుక, తను కూడా అదే పల్లవి అందుకోవడం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే.   చంద్రబాబుకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆయన కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్, వైకాపా నేతలపై తన స్థాయికి తగని విధంగా అనుచితమయిన వ్యాక్యాలు చేస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుకి అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన ఆయన అదే మాటను నిర్భయంగా ప్రజలకు చెప్పి, విభజన అనంతరం రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవచ్చునో చెపుతూ ప్రజలను యధార్ధ పరిస్థితులు గుర్తించేలా చేసి ముందుకు నడిపించి ఉంటే, ఆయన నాయకత్వ లక్షణాలు ప్రజలకు మరో మారు తెలిసి ఉండేవి. దాని వలన తెలంగాణాప్రజలలో, తన పార్టీకి చెందిన తెలంగాణా నేతలలో కూడా ఆయన పట్ల మరింత నమ్మకం, గౌరవం, సదాభిప్రాయం కలిగి అక్కడ కూడా పార్టీ బలపడే అవకాశం ఉంది.   ఈ రోజు సమైక్యవాదం గురించి మాట్లాడి, విభజన జరిగిపోయిన తరువాత, నూతన రాష్ట్ర అభివృద్ధి గురించి సామాన్య పౌరులు కూడా మాట్లాడగలరని వారు గ్రహించాలి. కానీ, నిజమయిన ప్రజా నాయకులు మాత్రం దాని గురించి ఇప్పుడే దైర్యంగా మాట్లాడ వలసి ఉంటుంది. చంద్రబాబు, షర్మిల ఇద్దరిలో ఆ నాయకత్వ లక్షణాలు ఎవరు ప్రదర్శించితే వారికే ప్రజలు పట్టం కడతారు.

త్వరలో జగన్మోహన్ రెడ్డికి బెయిలు

  జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సీబీఐ విచారణ పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు నెలల గడువు ఈనెలతో ముగియబోతోంది గనుక అతను మళ్ళీ బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చును. ఇప్పటికే జగన్ కేసుల్లో ఐదు అభియోగ పత్రాలను, అనుబంధ పత్రాలను కోర్టులో వేసిన సీబీఐ, తన విచారణను పూర్తిచేసి నేడో రేపో ఆఖరి అభియోగపత్రం కూడా వేయనుంది. దాని తరువాత కోర్టులో విచారణ మొదలవుతుంది.   రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిల మధ్య తెరవెనుక ఎన్నికల పొత్తులకు ఒప్పందం ఏదయినా జరిగి ఉంటే, ఆయన బెయిలుకు దరఖాస్తు చేసుకొన్నపుడు, సీబీఐ ఇదివరకులా గట్టిగా ప్రతిఘటించకుండా ఆయన బెయిలుకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.   ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది శాసన సభ్యులు, యంపీలు, యం.యల్సీలు, మంత్రులు, ఇతర నేతలు వైకాపాలోకి దూకేయగా, మరికొందరు దూకేందుకు సిద్దంగా ఉన్నారు. ఒకవేళ ఇరు పార్టీల మధ్య పొత్తులపై రహస్య ఒప్పందం జరిగినప్పటికీ, ఆ సంగతిని బెయిలుకి ముందే ప్రకటిస్తే అది అనుమానాలకు వీలు కల్పిస్తుంది గనుక, రెండు పార్టీలు కొంత కాలం శత్రువుల వలే ప్రవర్తిస్తూ ఒకటిరెండు నెలల తరువాత ఆ విషయం చల్లగా ప్రకటించవచ్చును.   కానీ, గోడ దూకలనుకొంటున్న కాంగ్రెస్ నేతలు ఈ విషయం గ్రహించకపోతే వైకాపాలోకి వారి వలసలు కొనసాగవచ్చును. సీమంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలలో దూసుకుపోతున్న వైకాపా వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నతేదేపాకు జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త సవాలుగా మారుతారు. ఒకవేళ కాంగ్రెస్, వైకాపాలు ఎన్నికలకోసం రహస్య ఒప్పందాలు చేసుకొని ఉంటే, తేదేపాకు అది మరో అగ్నిపరీక్షగా మారుతుంది. బహుశః ఈనెలాఖరులోగా జగన్మోహన్ రెడ్డి బెయిలు వ్యవహారం తేలిపోవచ్చును.   తాజా వార్త: జగన్మోహన్ రెడ్డికి ఈ నెల 20వ తేదీ వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది.

డీజీపీ ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం జారీ

  డీజీపీ దినేష్ రెడ్డి, ఐపీయస్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ మద్య గత కొంత కాలంగా సాగుతున్న ప్రచ్చన్న యుద్ధం ఈరోజు సుప్రీంకోర్టు డీజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో తారా స్థాయికి చేరింది. డీజీపీ దినేష్ రెడ్డి కొద్ది కాలం క్రితం ఉమేష్ కుమార్ పై హైకోర్టులో పిటిషను వేయడంతో, అతనిపై ఫోర్జరీ కేసు నమోదుచేసి కోర్టులో విచారణ సాగుతోంది. అందుకు ప్రతిగా ఉమేష్ కుమార్ కూడా సుప్రీంకోర్టులో డీజీపీ దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణ కోరుతూ వేసిన పిటిషనుపై నేడు కోర్టు సానుకూలంగా స్పందిస్తూ సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తనపై క్రింద కోర్టులోఫోర్జరీ కేసు విచారణను నిలిపివేయమని ఉమేష్ కుమార్ పెట్టుకొన్న దరఖాస్తును తిరస్కరిస్తూ ఆ సంగతి క్రింద కోర్టులోనే తేల్చుకోమని సూచించింది. దీనితో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకరిపై మరొకరు వేసుకొన్నకేసులలో ఇరుకొన్నారు.   గతంలో మాజీ మంత్రి శంకర్ రావు కూడా డీజీపీ దినేష్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేసి సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేసారు. అయితే, పోలీసులు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఎటువంటి ఆధారాలు చూపలేకపోవడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసారు. గ్రీన్ ఫీల్డ్స్ భూ భాగోతంలో పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పటి నుండి శంకర్ రావు డీజీపీ దినేష్ రెడ్డిపై కత్తులు నూరుతున్నారు. అయితే ఆయనను ఏమీ చేయలేకపోయారు. తన చిరకాల కోరిక నేడు ఉమేష్ కుమార్ ద్వారా తీరబోతునందున శంకర్ రావు మీడియా ముందుకి వచ్చిఅదే విషయంపై హంగామా చేయవచ్చును.

సేవ్ ఆంద్రప్రదేశ్ స‌భ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  విభ‌జ‌నకు నిర‌స‌న‌గా సమైక్యవాదులు హైద‌రాబాద్‌లో త‌ల‌పెట్టిన సేవ్ ఆంద్రప్రదేశ్ స‌భ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసులు అనుమ‌తి ఇవ్వడాన్ని స‌మ‌ర్థించిన కోర్టు ష‌రుతుల‌ను ఖ‌చ్చితంగా పాటించాలంటూ ఎపిఎన్జీవో నేత‌ల‌కు సూచించింది. కేవ‌లం గుర్తింపు కార్డులు క‌లిగిన ఉద్యోగులు మాత్రమే స‌భ‌కు రావాల‌ని, ప్రైవేట్ ఉద్యోగులు విద్యార్థులు స‌భ‌కు రాకూడ‌దని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప‌లువురు రాజ‌కీయ‌నాయ‌కులు స‌భ‌కు సంఘీభావం తెలుప‌గా మ‌రికొంత మంది స‌భ‌కు హాజ‌ర‌వుతామ‌ని ప్రక‌టించారు. ఈ నేప‌ధ్యంలో ఉద్యోగ‌స్థులు కానివారిని ఎవ‌రైనా స‌రే స‌భ‌కు అనుమ‌తించ వ‌ద్దని కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా గ‌ట్టి భ‌ద్రత ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

దినేష్ రెడ్డి అస్తుల‌పై సిబిఐ విచార‌ణ‌

  నియామ‌కం నుంచే వివాదాస్పదం అవుతున్న డిజిపి దినేష్‌రెడ్డికి మ‌రో ఎదురు దెబ్బ తగిలింది. త‌న చ‌ర్యలు సీమాంద్ర వాసులకు అనుకూలంగా ఉన్నాయంటూ తెలంగాణ వాదులు విమ‌ర్శిస్తున్న స‌మ‌యంలో ఇప్పుడు మ‌రో వివాదం కూడా ఆయ‌న్ను చుట్టుముట్టింది. త‌న‌ను కావాల‌నే డిజిపి వేదిస్తున్నారంటూ ఆరోపించిన శంక‌రావు. ఆయ‌న ఆస్తుల‌పై సిబిఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించార‌ని శంక‌ర్రావు విమ‌ర్శించారు. దీనికి తోడు ఐఎఎస్ అధికారి ఉమేష్‌కుమార్ కూడా దినేష్ రెడ్డి ఆస్తుల‌పై విచార‌ణ కోర‌డంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. ఎంత‌టి వారైనా విచార‌ణ ఎదుర్కోక త‌ప్పంద‌టూ వ్యాఖ్యానించిన కోర్టు డిజిపి ఆసత్తుల‌పై సిబిఐ విచార‌ణ‌కు ఆదేశించింది.

వారి తాట తీస్తానన్న చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గురువారం రాత్రి తాడికొండ మండలంలోని గరికపాడులో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వచ్చి "జై జగన్", "జోహార్ వైయస్సార్" అంటూ నినాదాలు చేస్తూ అడ్డు తగిలారు. అదే విధంగా చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డుగా నిలుచుని నినాదాలు చేశారు. అయితే వాళ్లని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరినప్పటికీ... వారు అదే పనిగా నినాదాలు చేశారు. దీంతో వారిపైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీలాంటి వాళ్ళందరూ జైలులో ఉండాల్సిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాను. ఏదైనా ఉంటే ప్రజల్లో తేల్చుకోవాలి కానీ ఇలా దొంగ దారిన వచ్చి వీరంగం చేయడం ఎక్కడి సంస్కృతి అని మీ పులివెందులకే వచ్చి అక్కడే మీ సంగతి తేలుస్తానంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు మండిపడ్డారు. కాన్వాయ్‌లోకి వేరే వ్యక్తలు వస్తుంటే ఏం చేస్తున్నారని బాబు పోలీసులను కోపగించుకున్నారు.

జగన్‌ కేసులో తుది చార్జీషీట్‌

  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీద తుది చార్జీషీటు రెడీ అయింది. అక్రమాస్తుల కేసులో దాదాపు 15 నెలలుగా జైళ్ళో ఉంటున్న జగన్‌ కేసు దర్యాప్తు దాదాపుగా పూర్తి అయింది. ఈ చార్జీషీట్‌ను శుక్రవారం కోర్టుకు సమర్పించనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే చార్జీషీట్‌లోని కీలక అంశాలను సీబిఐ డైరెక్టర్‌కు వివరించిన ఇక్కడి ఇన్‌చార్జ్‌ జేడి వెంకటేశ్వర్‌ కోర్టులో సమర్పించడానికి ఆమోదం పొందారు. ఎంతమందిని విచారించారు, ఎవరిని నిందుతులుగా చేర్చారు అన్న అంశాలతో పాటు సేకరించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఐదు చార్జీషీట్లను సమర్పించిన కోర్టు మరికొన్ని అనుబంధ చార్జీషీట్లను కూడా వేసింది. గతంలో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సమయంలో కేసు దర్యాప్తును సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలన్న కోర్టు వ్యాఖ్యలతో ఈ శుక్రవారం సిబిఐ తుది చార్జీషీట్‌ దాఖలు చేయనుంది.

ఈ ఏడాది చివరకల్లా రెండు రాష్ట్రాల ఏర్పాటు

  ప్రత్యేక సమైక్య సెగలతో రాష్ట్రం తగలబడుతుంటే కేంద్ర మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో విభజన విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ తేల్చిచెపుతుంది. 36 రోజులుగా సీమాంద్రలో భారీగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం విభజన దిశగా తన పని తాను చేసుకుపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలల్లోనే విభజన ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయితే రాష్ట్రపతి పాలన పెట్టి అయిన విభజన తంతును పూర్తి చేయనున్నారట. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్‌ నోట్‌ రూపకల్పన మొదలు పెట్టిన కేంద్ర హోంశాఖ. ఆ నోట్‌ కాపీని న్యాయశాఖకు పంపినట్టుగా సమాచారం. అంతేకాదు మరి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు కూడా కేంద్రం తెరదించనుందట.

రేపు రాష్ట్రాన్నితాకనున్నతుఫాన్

  సెప్టెంబర్ 6, 7 తేదీలలో అంటే రేపు ఎల్లుండి రాష్ట్రం కొన్ని అవాంచనీయ సంఘటనలు చూడబోతోంది. రేపు రామ్ చరణ్ తేజ్, ప్రియాంకా చోప్రా నటించిన తుఫాన్, జంజీర్ సినిమాలు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల రక్షణలో ప్రదర్శనకు సిద్దం అవుతుంటే, వాటిని అడ్డుకొని తీరుతామని సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఈ రోజుకూడా గట్టి హెచ్చరికలు జారీచేసారు. అదేవిధంగా తెలంగాణాలో ఈ సినిమాల ప్రదర్శనకు ఒప్పుకోమని తెలంగాణావాదులు కూడా తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నారు.   ఈ రోజు అనంతపురం మరియు నెల్లూరు జిల్లాలలో సమైక్యవాదులు సినిమా పోస్టర్లను చించి తగులబెట్టారు. అనంతపురంలో సినిమా హాళ్ళ యజమానులు సమైక్య వాదుల హెచ్చరికలకు భయపడి సినిమా ప్రదర్శనకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం కోర్టు ఆదేశాల మేరకు ఈ సినిమాలు ప్రదర్శింపబడే అన్ని సినిమా హళ్ళ వద్ద రక్షణ కల్పించేందుకు సిద్దపడుతున్నారు.   ఇక, సెప్టెంబర్ 7న అంటే శనివారం నాడు హైదరాబాదు, యల్బీ స్టేడియంలో ఏపీ యన్జీవోలు తలపెడుతున్న సభను అడ్డుకొనేందుకు టీ-యన్జీవోలు, టీ-జేఏసీ, ఓయు విద్యార్ధి జేఏసీ, తెరాస కార్యకర్తలు రేపు, ఎల్లుండి హైదరాబాద్ బంద్ పిలుపునిచ్చారు. అంతే కాకుండా నగర దిగ్బంధనం చేసి, వారిని ఎక్కడికక్కడ అడ్డుకొంటామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.   ఇరువర్గాలు పట్టు వీడకపోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలకు చెందిన ప్రజలు వేలాదిగా రోడ్లమీదకు వచ్చినట్లయితే వారిమధ్య ఘర్షణలు చెలరేగితే నగరంలో ఎంత మంది పోలీసులను, పారా మిలటరీ దళాలను దింపినప్పటికీ పరిస్థితులు అదుపు చేయడం కష్టమే. ఇదే అదనుగా వారి మధ్య అసాంఘిక శక్తులు చొరబడితే అల్లర్లు నగరమంతా వ్యాపించి అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉంది. గనుక ఇరువర్గాల నేతలు ఇప్పటికయినా విజ్ఞత చూపి పరిస్థితిని అర్ధం చేసుకొని తమ తమ కార్యక్రమాలు రద్దు చేసుకోవడం మేలు.

పార్లమెంట్ స‌మావేశాలు మరోరోజు పొడిగింపు

  శుక్రవారం ముగియాల్సిన పార్లమెంట్ స‌మ‌వేశాల‌ను ఒక‌రోజు పాటు అంటే శ‌నివారం వ‌ర‌కు పొడిగించారు. స‌భ ప్రారంభ‌మైన ద‌గ్గర నుంచి స‌మైక్యాంద్ర తెలంగాణ ఆందోళ‌న‌ల‌తో పాటు బొగ్గు స్కాం విష‌యంలో బిజెపి పట్టు ప‌ట్టడంతో ఒక్క రోజు కూడా స‌భ‌స జావుగా జ‌ర‌గ‌లేదు. దీంతో ఈ సెష‌న్స్‌లో ఆమోదం పొందాల్సిన అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదానికి పార్లమెంట్ సమావేశాల‌ను ఒక రోజు పొడిగించారు. ఆగ‌స్టు 5న ప్రారంభ‌మైన ఈ వ‌ర్షాల‌కాల స‌మావేశాలు ఆగ‌స్టు 30నే ముగియాల్సి ఉంది. ఆందోళ‌న‌ల‌తో స‌భ సజావుగా జ‌ర‌గ‌క‌పోవ‌టంతో ఈ నెల 6 వ‌ర‌కు స‌మావేశాలను పొడిగించారు. ఇప్పటికి పెన్షన్ ఫండ్‌, భూ ఆక్రమ‌ణ‌ల బిల్లులు ఆమోందిచ‌క‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రో రోజు స‌మావేశాల‌ను పొడింగిచారు.

స‌మ్మె విర‌మించిన ఆటో యూనియ‌న్లు

  108 జీవోకు నిర‌స‌న‌గా స‌మ్మె చేప‌ట్టిన ఆటోడ్రైవ‌ర్లు అనుకున్నది సాదించారు. గురువారం సాయంత్రం ప్రభుత్వం జీవోర‌ద్దుకు అంగీక‌రించ‌టంతో ఆటో యూనియ‌న్లు స‌మ్మె విర‌మిస్తున్నట్టుగా ప్రక‌టించాయి. ఉద‌యం ప్రభుత్వ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీతో జ‌రిగిన చ‌ర్చలు విఫ‌లం కావ‌టంతో వారు స‌మ్మె కొన‌సాగిస్తామ‌ని ప్రక‌టించారు. అయితే సాయంత్రం ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్‌తో ఆటోయూనియ‌న్లు జ‌రిపిన చ‌ర్చలు స‌ఫ‌ల‌మ‌య్యాయి. ప్రభుత్వం 108 జీవోను వెన‌క్కి తీసుకోవ‌టంతో పాటు, వెయ్యి రూపాయ‌ల చ‌లానా కూడా త‌గ్గించ‌నున్నట్టు అధికారుల యూనియ‌న్కు హామి ఇచ్చారు. దీంతో స‌మ్మె విర‌మించిన‌ట్టుగా ఆటో డ్రైవ‌ర్లు ప్రక‌టించారు.

శాంతి ర్యాలి కాదు 24 గంట‌ల బంద్‌

  ఈ నెల 7న హైద‌రాబాద్‌లో స‌మైక్య వాదుల సేవ్ ఆంద్రప్రదేశ్ స‌భ నేప‌ధ్యంలో తెలంగాణ జెఎసి కూడా గేమ్ ప్లాన్ సిద్దం చేస్తుంది. ఇన్నాళ్లు అదే రోజు శాంతి ర్యాలి చేయాల‌న‌కున్న టి జెఎసి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. అదే రోజు తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చింది రాజ‌కీయ జెఎసి. శుక్రవారం రాత్రి నుంచి శ‌నివారం రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల‌పాటు బంద్ పాటించ‌నున్నట్లు తెలిపారు. శాంతి ర్యాలికి బదులుగానే బంద్ పాటిస్తున్నట్టుగా ప్రక‌టించిన జెఎసి ఇది సీమాంద్ర స‌భ‌కు వ్యతిరేకం కాద‌న్నారు. ప్రభుత్వం తెలంగాణ‌కు వ్యతిరేకంగా వ్యవ‌హ‌రిస్తుంద‌ని అందుకు నిర‌స‌న‌గానే బంద్ పాటిస్తున్నామ‌ని, తెలంగాణ మొత్తం వ్యవ‌స్థను స్తంబింప చేస్తామ‌న్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడిక్క‌డే శాంతి ర్యాలిల‌తో పాటు ఊరేగింపులు నిర్వహిస్తామ‌న్నారు. సీమాంద్రు విభ‌జ‌న‌కు స‌హ‌క‌రిస్తే వారి స‌భ‌ను తామే విజ‌య‌వంతం చేస్తామ‌న్నారు. కిర‌ణ్‌కుమార్ రెడ్డి కావాల‌నే విద్వేశాలు రెచ్చగొడుతున్నార‌రు. ఆయ‌న వ్యవ‌హార శైలికి నిర‌స‌న‌గానే బంద్‌కు పిలుపు ఇస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి రాజుగారు త‌లుచుకుంటే ఏదైనాజ‌రుగుతుంది అనేలా ఉంద‌న్న కోదండ‌రామ్ ఎట్టి ప‌రిస్ధితుల్లోనూ బంద్ విజ‌యవంతం చేసి తీరుతామ‌న్నారు.

గీతికా శర్మ ఆత్మహత్య కేసు: కందాకు బెయిల్

      మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. సంవత్సరం నుంచి జైలులో వుంటున్న కందాకు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు వీలుగా కోర్ట్ నెల రోజుల పాటు బెయిల్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కందా తరఫు లాయర్ రమేష్ గుప్తా వాదించారు. గోపాల్ కందా సిర్సా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఇతను తన ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరముందని, నియోజకవర్గానికి వచ్చిన నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లాయర్ చెప్పారు. ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి ఎంసి గుప్తా అంతకుముందు కందా బెయిల్ పిటిషన్‌ను రిజర్వ్‌లో ఉంచారు. ఇరు వైపుల వాదనలు విన్న అనంతరం బెయిల్ ఇచ్చారు.