తెలంగాణ వాదుల స్వాభిమాన స‌ద‌స్సు

  ఏపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంద్రప్రదేశ్ స‌భ ఘ‌న విజ‌యం సాదించ‌టంతో ఇప్పుడు అదే స్ధాయిలో భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేస్తుంది తెలంగాణ రాజ‌కీయ జేఎసి. ఈ నెల 22న ఎన్టీఆర్ స్టేడియంలో అవ‌గాహ‌నా స‌ద‌స్సు పేరుతో ఓ స‌భ నిర్వహించ‌నున్నారు. ఈ నెల 12న జ‌ర‌గ‌నున్న జెఎసి విస్తృత స్థాయి స‌మావేశంలో ఈ స‌భ‌కు సంబందించి పూర్తి వివ‌రాలు వెల్లడించానున్నారు. చాలా రోజుల ఢిల్లీ ప‌ర్యట‌న త‌రువాత హైద‌రాబాద్ చేరుకున్న కెసిఆర్ వివిద ప‌క్షాల నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం కెకె స‌మావేశం అయ్యారు కెసిఆర్‌. ఈ స‌మావేశంలో 22న త‌ల‌నెట్టిన స‌భ‌కు సంబందించిన చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌భ‌కు స్వాభిమాన స‌ద‌స్సు పేరు  పెట్టారు. దీంతో పాటు 12న జ‌రిగే విస్తృత స్థాయి స‌మావేశానికి కెసిఆర్ హాజ‌ర‌వుతార‌ని ప్రక‌టించారు.

మోడీతో బీజేపీకి లాభనష్టాలు-ఫిఫ్టీ-ఫిఫ్టీ

  మోడీ తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, 2017వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగానే కొనసాగాలనుకొంటున్నాననే ఒకే ఒక చిన్నస్టేట్మెంటుతో ఇంత కాలంగా తన ప్రధాని అభ్యర్ధిత్వాన్నిప్రకటించడానికి వెనుకాడుతున్నబీజేపీని వెంటనే తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనే విధంగా పరుగులు పెట్టిస్తున్నారు.   దీని వల్ల బీజేపీకి లాభము, నష్టము కూడా సరిసమానంగా ఉండవచ్చును. బీజేపీ మోడీ అభ్యర్ధిత్వాన్నిఒకసారి ఖరారు చేయగానే పార్టీలో, బయట ఆయనని వ్యతిరేఖించే శక్తులు అన్నీ ఏకమయ్యే అవకాశముంది. అప్పుడే యుపీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే ప్రయత్నాలను ఖండిస్తూ, రాహుల్ గాంధీకే ఆ అర్హత ఉందని అన్నారు. మోడీని వ్యతిరేఖిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ కు మరింత దగ్గర కావచ్చును. అందువల్ల మోడీ ఆలోటును భర్తీ చేసుకొనేందుకు దక్షిణాదిన తెదేపా, అన్నాడీయంకే వంటి కొత్త స్నేహితులను వెతుకోక తప్పదు.   అదేవిధంగా, రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలని తపిస్తున్నకాంగ్రెస్ పార్టీ, మోడీని నిలువరించేందుకు తనకు అందుబాటులో ఉన్నప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును. ఇప్పటికే మోడీని 2002 గోద్రా అల్లర్లతో బలంగా ముడివేసిన కాంగ్రెస్ పార్టీ, గుజరాత్ లో జరిగిన భూటకపు ఎన్కౌంటర్ల కేసుతో మోడీని దెబ్బతీయాలని చూస్తోంది. పనిలోపనిగా బీజేపీలో మోడీకి వ్యతిరేఖ వర్గాన్ని వెనుక నుండి ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు.   ప్రధాని పదవిపై ఆశలేదంటూ మోడీ మాట్లాడిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అదేరకమయిన ప్రకటన చేయడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు అన్ని విధాల తగినవాడని, అతని నాయకత్వంలో పనిచేయడానికి తనకేమి అభ్యంతరం లేదని ప్రకటించడం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మార్గం సుగమం చేయడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయని అర్ధం అవుతోంది.   ఇక బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించగానే, ఆయన పారిశ్రామిక, వ్యాపార దృక్పధాన్ని మెచ్చుకొంటున్న దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ ఆయనకు మద్దతు తెలుపుతారు గనుక అది బీజేపీ విజయావకాశాలను చాల మెరుగు పరుస్తుంది. అదేవిధంగా పార్టీ నిర్ణయంతో ఆయన ద్విగుణీకృత ఉత్సాహంతో, మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలుగుతారు. దేశ ప్రజలపై ముఖ్యంగా ఆయన నాయకత్వాన్ని కోరుకొంటున్న వారిపై ఆ ప్రభావం తప్పకుండా పడి, అది బీజేపీకి మేలు చేకూర్చవచ్చును.

మోడీ ఐడియా ఆయన జీవితాన్నే మార్చేయబోతోందా

  కొద్ది రోజుల క్రితం, నరేంద్ర మోడీ “తనను గుజరాత్ ప్రజలు 2017వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్నిపాలించమని ఎన్నుకొన్నందున, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగానే కొనసాగేందుకే ప్రాధాన్యత ఇస్తానని, ప్రధాన పదవిపై తానెన్నడూ ఆశపడలేదని” అన్నారు. ఆ మాటలు బీజేపీ అగ్ర నాయకత్వంపై బాగానే పనిచేశాయి. మోడీ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ నుండి విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ, మోడీ అకస్మాత్తుగా అస్త్ర సన్యాసం చేసినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకి మరో ఆయుధంగా మారుతుందనే ఆందోళన చెందుతోంది.   ఆర్.యస్.యస్. అధినేత మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తదితరులు, మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేఖిస్తున్న అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులను కలిసి పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మోడీని వ్యతిరేఖించవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు ఒప్పుకొన్నా లేకున్నాత్వరలో మోడీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకే నిశ్చయించుకొన్నారని సమాచారం.   ఒకవేళ మోడీని కాదనుకొంటే బీజేపీలో అంత ప్రజాకర్షక నేత మరొకరు లేనందున, అద్వానీ వర్గం ఆయనను వతిరేఖిస్తూనప్పటికీ మోడీనే తమ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు బీజేపీ అగ్రనేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. బహుశః మరో వారం పదిరోజుల్లో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా..

  భాగ్యన‌గ‌రం పండుగ శోభ సంత‌రించుకుంది. వాడ‌వాడ‌ల వినాయ‌క మండ‌పాలు వెళిశాయి. విఘ్నాల‌ను తొల‌గించాలంటూ ప్రజ‌లంద‌రూ ఆ విఘ్నేశ్వరుణ్ణి భ‌క్తి శ్రద్దల‌తో కొలుస్తున్నారు. ఎప్పటి లాగే ఖైర‌తాబాధ్ తో పాటు ప‌లు చోట్ల భారీ గ‌ణ‌నాధులు కొలువు తీరి భ‌క్తుల‌ను అనుగ్రహిస్తున్నారు. భ‌క్తులు ఇష్టా ఇష్టాలు అభిష్టాల‌కు త‌గిన‌ట్టుగా ర‌క‌ర‌కాల ఆకారాలు భంగిమ‌ల‌లో గ‌ణ‌నాధుడు మండ‌పాల‌లో కొలువుదీరాడు. అయితే ప్రతి సారి క‌న్నా ఈ సారి భ‌క్తుల్లో మ‌ట్టి వినాయ‌కుల మీద అవ‌గాహ‌న పేరింగింది. ఇళ్లలో పూజ చేసుకునే భ‌క్తులతో పాటు మండ‌పాల్లో అలంక‌రించిన భారీ గ‌ణ‌నాధుల‌ను కూడా మ‌ట్టితో త‌యారు చేసి ప్రతిష్టించారు. ఇక గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నగర పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు మండపాల వద్ద బాణాసంచా పేల్చడంపై నిషేధం విధించారు. ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున అందుకు తగ్గట్లు పది రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

కేబినేట్ నోట్ రెడీ.. అమ్మ ఆమోద‌మే త‌రువాయి..

  స‌మైక్యాంద్ర కోసం ఉద్యమం ఉదృతంగా కొన‌సాగుతున్న కేంద్ర మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుపై ఓ అభిప్రాయానికి వ‌చ్చిన అధిష్టానం ఏర్పాటు ప్రక్రియ‌లోని రెండో ద‌శ ను కూడ పూర్తి చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంభందించిన క్యాబినేట్ నోట్ ను కేంద్ర హోం శాఖ సిద్దం చేసింది. అయితే ఈ నోట్‌కు సోనియా ఆమోదం ప‌డిన వెంట‌నే నోట్‌ను న్యాయశాఖ‌కు పంప‌నున్నారు. ఈ మేర‌కు అధికారిక ప్రక‌ట‌న ఏది వెలువ‌డ‌క పోయినా నేష‌నల్ మీడియాలో మాత్రం నోట్ రెడీ అయిన‌ట్టుగా క‌థ‌నాలు ప్రసారం అవుతున్నాయి. కేంద్రం హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలోని బృందం రాజ్యాంగా విధివిదానాల ప్రకారం క్యాబినేట్ నోట్ సిద్దం చేశారు. ఇక దీనికి రాజకీయ ఆమోదం ప‌డ‌ట‌మే త‌రువాయి. అయితే ప్రస్థుతం వైద్య చికిత్స కోసం అమెరికా ప‌ర్యట‌న‌లో  ఉన్న సోనియా గాంధికి భార‌త్‌కు రాగానే ఆమె ఆమోదం కోసం నోట్‌ను పంప‌నున్నారు. అయితే సోనియా ఇండియాకు రావాడానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌టున్నారు కేంద్ర వ‌ర్గాలు. ఆమె రాగానే నోట్‌కు ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంద‌ని హోం శాఖ అధికారులు తెలిపారు. సోనియా ఆమోదం త‌రువాత  నోట్‌ను న్యాయ శాఖ ప‌రిశీల‌న‌కు పంపిస్తారు.

చంద్రబాబు సీమాంధ్ర వైపు మరలుతున్నారా

  ఎట్టకేలకు చంద్రబాబు తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన సంగతిని నిన్నతన ఆత్మగౌరవ సభలో ప్రస్తావించారు. అదే సమయంలో ఆయన మరికొన్ని ఆసక్తికరమయిన అంశాలు కూడా ప్రస్తావించారు.   తమ పార్టీ మొదట సమైక్యాంధ్రనే కోరుకొందని, అయితే తెలంగాణా ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని, “వారి సమస్యలను పరిష్కరించాలని” కోరుతూ కేంద్రానికి లేఖ ఇచ్చామని, అయితే దానర్ధం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయమంటే, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయమని కాదని అన్నారు. ఇరు పక్షాల వారితో చర్చించి, ఇద్దరికీ న్యాయం చేయాలని అన్నారు. అంటే, ఇరుపక్షాలకి ఆమోదయోగ్యంగా చేస్తే విభజనకు తమకు అభ్యంతరం లేదని ఆయన చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది.   కానీ, మళ్ళీ అంతలోనే ఆయన ‘తెలుగుదేశం పార్టీ సీమాంధ్రుల ప్రతినిధిగా ఉంటుందని, వారికి అన్యాయం జరిగితే తిరగబడతానని’ కేంద్రాన్ని హెచ్చరించడం చూస్తే ఆయన సీమాంధ్ర తరపున వఖల్తా తీసుకొని మాట్లాడుతున్నట్లు కనిపిస్తారు.   ఆయన చెప్పిన మాటలను బట్టి తెదేపా సమైక్యాంధ్ర కొరుకొంటోందని, కానీ తెలంగాణా ఉద్యమాల కారణంగా తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. తమ పార్టీ ఇచ్చిన లేఖలో కేవలం “వారి సమస్యలను పరిష్కరించమని కేంద్రాన్నికోరినట్లు” ఆయన చెప్పడం గమనిస్తే, తాము “వారి సమస్యలను పరిష్కరించమని కోరామే తప్ప ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయమని ఎన్నడూ కోరలేదని అందువల్ల రాష్ట్ర విభజనకు తమ పార్టీ కారణం కానే కాదని ఆయన తన లేఖకు సరికొత్త అర్ధం చెపుతున్నారు.   ఆయన తన వాదనను సమర్దించుకొంటూ 1999లో రాజశేఖర్ రెడ్డే స్వయంగా తెలంగాణా కోసం శాసనసభ్యులను డిల్లీకి పంపారని చెప్పడం చూస్తే, రాష్ట్ర విభజన విషయంలో లేఖ ఇచ్చిన కారణంగా తెదేపాను సీమాంద్రా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వైకాపా పైకే ఆ నేరాన్ని(?) నేట్టివేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.   కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు ఈవిధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు వలన ముందుగా తెదేపాయే నష్టపోతుంది. ఆయన తమ పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని కోరుకొంటోందో, లేక వ్యతిరేఖిస్తోందో ఇప్పటికీ స్పష్టంగా చెప్పకపోవడం వలన రెండు ప్రాంతాలలో ప్రజలు కూడా ఆయనను అనుమానించే అవకాశం ఉంది. ఇదే విషయంలో వైకాపా నాయకత్వం చాలా దైర్యంగా తెలంగాణాను వదులుకొని విభజనను వ్యతిరేఖిస్తూ సమైక్య ఉద్యమాలు మొదలుపెట్టగానే ఆ పార్టీ పరిస్థితిలో ఒక్కసారిగా గణనీయమయిన మార్పు వచ్చింది. అయితే, తెలంగాణాలో బలంగా లేని కారణంగా వైకాపా ఆనిర్ణయం తీసుకొనగలిగింది. కానీ మూడు దశాబ్దాలుగా తెలంగాణాతో బలమయిన అనుబంధం పెనవేసుకొన్న తెదేపా కూడా దైర్యంగా అటువంటి నిర్ణయం తీసుకోవడం కష్టం.      కానీ ఆయన 'తమ పార్టీ సీమాంధ్రుల ప్రతినిధిగా ఉంటుందని', వారికి అన్యాయం జరిగితే తిరగబడతానని హెచ్చరించడం చూస్తే ఆయన మళ్ళీ సమైక్యాంధ్ర వైపు మరలుతున్నట్లు కనబడుతోంది. బహుశః తెదేపా కూడా తెలంగాణాను వదులుకోవడానికి మానసికంగా సిద్దపడుతోందనుకోవచ్చును.   తెలంగాణా ప్రాంతంలో పార్టీకి బలమయిన క్యాడర్ ఉన్నపటికీ, మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్-తెరాసా చేతులు కలిపితే అక్కడ నెగ్గుకు రాలేమని, కనీసం సీమాంధ్ర ప్రాంతంలోనయినా పూర్తి ఆధిఖ్యత సంపాదించగలిగితే మంచిదనే ఆలోచనతో ఆయన రెండు ప్రాంతాలలో విజయావకాశాలను బేరీజు వేసుకొని, తమకు పూర్తి పట్టు, మద్దతు ఉన్నసీమాంధ్ర ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్ధమవుతోంది.   మూడు దశాబ్దాలుగా ఎంతో శ్రమపడి తెలంగాణాలో నిర్మించుకొన్న పార్టీని చంద్రబాబు అంత తేలికగా వదులుకోకపోవచ్చును. అయితే, ఆయన ప్రస్తుతం ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా చేస్తున్న ప్రసంగాలు మాత్రం ఆయన తెలంగాణా ను వదులుకొనే అవకాశాలే ఎక్కువ అని సూచిస్తున్నాయి.

తెలంగాణవాదులకు చంద్రబాబు వెన్నుపోటు

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణవాదులకు వెన్నుపోటు పొడిచి సమైక్యాంధ్రులను మోసం చేసేందుకు సీమాంధ్రలో ఆత్మగౌరవయాత్ర చేపట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. ఆమె సమైక్య శంఖారావం కడప జిల్లాలో సాగింది. చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోకేష్‌ను అందలం ఎక్కించుకునేందు కు హరికృష్ణ కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని షర్మిలా ఆరోపించారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పటికీ అవే రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ను ఏంచేశారో అందరికీ తెలుసన్నారు. చార్మినార్ ఏమైనా కట్టించారా? వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను బినామీలకు అప్పగించారని ఆరోపించారు. సోనియాగాంధీ రాహుల్‌ను ప్రధానమంత్రిని చేసేందుకే తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆరోపించారు.

శాంతికాములు కాబట్టే సభ: డీఎస్

      తెలంగాణ ప్రజలు శాంతికాములు కాబట్టి ఏపీఎన్జీవోలు హైదరాబాద్ సభలో అవసరానికి కంటే ఎక్కువ మాట్లాడినప్పటికీ ప్రజలు సంయమనం పాటించి మరోసారి తెలంగాణ సంస్కృతిని చాటారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణలో ఉన్న సీమాంధ్రులతో అన్నదమ్ముల్లా కలిసి ఉంటామనే విధంగా ఇక్కడి ప్రజలు సంయమనం పాటించి నిరూపించారన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని సభలో కొంతమంది హెచ్చరించడం సరైన పద్ధతి కాదన్నారు. సభలో కానిస్టేబుళ్లు జై తెలంగాణ అంటే వారిని చిరునవ్వుతో వీపు తట్టి బయటకు పంపించకుండా పోలీసులు చితకబాదడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.రెండు రాష్ట్రాలు ఏర్పడి నా ప్రేమాభిమానాలతో ఉండే సంస్కృతి గలవారు తెలంగాణ ప్రజలని, విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని ఏపీఏన్జీవోలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాన్నారు.

సీమాంధ్ర బస్సులపై రాళ్ళ దాడి

      హైదరాబాద్ లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో స్వస్థలాలకు వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుల మీద తెలంగాణ వాదులు, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడులు చేశారు. ఈ ఘటనల్లో ఇద్దరికి గాయాలు కాగా ఐదు బస్సుల అద్దాలు పగిలాయి. బస్సులు నగర శివార్లకు చేరుకోగానే హయత్‌నగర్, లక్ష్మారెడ్డిపాలెం, రామోజీ ఫిల్మ్‌సిటీ, ఇనాంగూడ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. దాడుల్లో హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద ఓ బస్సు, లక్ష్మారెడ్డిపాలెం వద్ద రెండు బస్సులు, రామోజీ ఫిల్మ్‌సిటీ గేటు వద్ద రెండు బస్సుల అద్దాలు పగిలాయి. ఈ దాడుల్లో రాజమండ్రి సీటీవో కార్యాలయంలో పని చేస్తున్న సత్యనారాయణ, వెంకటేశ్వర్ లు గాయపడడంతో వారిని సమీపంలోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సీమాంధ్ర ఉద్యోగులు బస్సులు నిలిపివేసి విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొంతమంది తెలంగాణవాదులు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ, సమైక్య వాదులు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. సీమాంద్రులను బస్సు ఎక్కించి పంపించారు.

కాంగ్రెస్ బంగారాన్నిఇసుకగా మార్చగలదా

  ఇసుకను బంగారంగా మార్చడం గురించి చాల కధలలో చదివి ఉంటాము. కానీ, బంగారాన్ని ఇసుకగా మార్చే కధని మాత్రం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుసుకోవచ్చును. ఈ సత్యాన్ని కనుగొన్నది ఎవరో కాదు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ! ఆయన ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రాన్ని చాలా ఘాటుగా విమర్శించారు. తెలంగాణా పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అగ్గి రాజేసిందని, సరయిన పద్ధతి అవలంభించకుండా అశాస్త్రీయంగా విభజించే ప్రయత్నం చేయడం వలనే నేడు రాష్ట్రం అల్లకల్లోలం అవుతోందని, అయినా కాంగ్రెస్ చోద్యం చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బంగారాన్నికూడా ఇసుకలా మర్చేయగలదని అన్నారు. తెలంగాణా అంశం బంగారం వంటిదని, దానిని కాంగ్రెస్ సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యిందని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయకపోయినట్లయితే, రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టినట్లయితే, అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్రాన్నివిభజించవచ్చునని మోడీ ఆలోచన.   రాష్ట్ర విభజన నిర్ణయంతో ప్రత్యర్ధి పార్టీలన్నిటినీ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతీయ గలిగినప్పటికీ, ప్రస్తుతం ఆ పార్టీకి సీమాంధ్ర లో ఎదురుగాలి వీస్తోంది. ఒకవేళ సమైక్యాంధ్ర ఉద్యమాల ఒత్తిడి కారణంగా, తెలంగాణా ఏర్పాటులో వెనక్కు తగ్గినా, విఫలమయిణా అక్కడ కూడా ఆ పార్టీ దెబ్బతినడం ఖాయం. అదేవిధంగా తెరాసతో సరిగ్గా వ్యవహరించలేకపోయినా, రానున్న ఎన్నికలలో దాని చేతిలో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు.   దాదాపు రెండు మూడు సం.లు సుదీర్ఘ చర్చలు, సమావేశాలు, నివేదికలు, కమిటీలు వగైరా తంతు అంతా పూర్తయిన తరువాత కూడా కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని సరిగ్గా చక్కబెట్టలేకపోయింది. అందుకు నేటి రాష్ట్ర పరిస్థితే ఒక చక్కని ఉదాహరణ. కాంగ్రెస్ అసమర్ధతకు, వైఫల్యానికి రాష్ట్ర ప్రజలు భారీ మూల్యం చెల్లించవలసి వస్తోంది. అందుకు ప్రతిగా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా భారీ మూల్యం చెల్లించక తప్పదు.

ఆంధ్ర, తెలంగాణాకు పుట్టిన బిడ్డ హైదరాబాద్

      ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఎన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ....ఉద్యమాల వల్ల రాజకీయ నాయకులు ఎవ్వరూ నష్టపోలేదని, ఇరు ప్రాంతాలలోనూ ప్రజలే నష్టపోయారని ఆయన చెప్పారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాలలో మరణించినవారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాలి అర్పించారు. హైదరాబాదును ఆంధ్ర, తెలంగాణాలకు పుట్టిన బిడ్డ వంటిదని దానిపై ఇరుప్రాంతల వారికి పూర్తి హక్కులు ఉంటాయని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే విద్యార్ధులు, ఉద్యోగులు, ఆర్టీసీ ముందుగా నష్టపోతారని అన్నారు. విభజనవల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరో ముప్పై కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని, రాష్ట్రం విడిపోయి కొత్త సమస్యలతో ఇబ్బందులు పడే కంటే సమైక్యంగా ఉంటే మంచిదనే అభిప్రాయాన్నివివిధ రాష్ట్రాల పార్టీనేతలు వ్యక్తం చేసారని ఆయన అన్నారు. రాజధాని  మీరు కట్టుకోవచ్చు కదా అని అంటున్నారని, విడిపోవడం ఎందుకు మళ్లీ కట్టుకోవడం ఎందుకు అని ఆయన అన్నారు. ముప్పైవేల నుంచి నలభై వేల మంది ఉద్యోగులు వేరే చోటకు వెళ్లవలసి ఉంటుందని అశోక్ బాబు అన్నారు. రెండువేల పద్నాలుగులో ఉమ్మడి రాజధాని అయినా రాజ్యం లేని రాజరికం ఎందుకు అని కొత్త ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ఉన్న వేలాది మంది ఉద్యోగులు ఎక్కడికి వెళ్లాలన్నది ప్రశ్న అని ఆయన అన్నారు. సమైక్యవాదం ఇక్కడ ఆగడానికి లేదు, ఇది ఆరంభం మాత్రమే. కేంద్రం పునరాలోచించుకోకుంటే ఖచ్చితంగా సికింద్రాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం, ఇది బెదరింపు కాదు, ప్రజల అభిప్రాయం చెప్పడానికి మాత్రమే అని ఆయన ప్రసంగం ముగించారు.

త్వరలో తెలంగాణా నోట్: షిండే

  ఈ రోజు హైదరాబాదులో జరిగిన ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంద్ర ప్రదేశ్’ సభతో సమైక్యాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి చేరగా, యాదృచ్చికంగానో లేక ఉద్దేశ్య పూర్వకంగానో హోంమంత్రి షిండే తెలంగాణా నోట్ మొదటి దశ పూర్తయ్యిందని త్వరలోనే మిగిలిన పని కూడా పూర్తి చేసుకొని మంత్రి మండలికి వెళుతుందని తెలిపారు. తెలంగాణా ఏర్పాటుకు రాష్ట్రంలో దాదాపు అన్నిపార్టీలు కూడా సమ్మతించాయని అందువల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సూచనల ప్రకారమే తెలంగాణా నోట్ తయారవుతోందని ఆయన తెలిపారు. ఇక హైదరాబాదుపై తమ ముందు రెండు ప్రతిపాదనలు ఉన్నాయని, అయితే వాటిపై ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలను ఆయన ఖండించారు.

‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ లో అశోక్ బాబు ప్రసంగం

  ఏపీ ఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఎన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ హైదరాబాదును ఆంధ్ర, తెలంగాణాలకు పుట్టిన బిడ్డ వంటిదని దానిపై ఇరుప్రాంతల వారికి పూర్తి హక్కులు ఉంటాయని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే విద్యార్ధులు, ఉద్యోగులు, ఆర్టీసీ ముందుగా నష్టపోతారని అన్నారు. విభజనవల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరో ముప్పై కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని, రాష్ట్రం విడిపోయి కొత్త సమస్యలతో ఇబ్బందులు పడే కంటే సమైక్యంగా ఉంటే మంచిదనే అభిప్రాయాన్నివివిధ రాష్ట్రాల పార్టీనేతలు వ్యక్తం చేసారని ఆయన అన్నారు. తమ సమైక్య ఉద్యమం కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకొనే వరకు కొనసాగుతుందని అన్నారు. ఒకవేళ కేంద్రం తెలంగాణపై ముందుకు వెళితే హైదరాబాదు పెరేడ్ గ్రౌండ్స్ లో మిలియన్ మార్చ్ చేపడతామని ఆయన అన్నారు.

సమైక్యవాదులంతా వస్తే హైదరాబాద్ సరిపోదు: కేశవ్

      ఎల్బీ స్టేడియం దగ్గర చూస్తే సమైక్యవాదం ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఇది కేవలం ఉద్యోగుల సభ మాత్రమే అని...సమైక్యం కోరుకునేవారంతా తరలివస్తే హైదరాబాద్ సరిపోదని ఆయన తెలిపారు. తెలంగాణలో 50 శాతం సమైక్యవాదులు ఉన్నారని...వారిని ఈ సభకు రానివ్వకుండా చేసేందుకే తెలంగాణలో బంద్ ప్రకటించారని విమర్శించారు. టెన్‌జెన్‌పథ్ డైరెక్షన్లలోనే వైఎస్ విజయలక్ష్మి లేఖ రాశారని ఆరోపించారు. టీఆర్ఎస్ కారుకు డీజిల్, వైసీపీ ఫ్యాన్‌కు కరెంట్‌ను ఇస్తుంది కాంగ్రెస్సే అని ఆయన అన్నారు. టీఆర్ఎస్, వైసీపీ నేతలు ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలు బొమ్మలని పయ్యావులు ఎద్దేవా చేశారు.

తెలంగాణ సభ విజయవాడలో..!!

      హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సభ పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అదే విధంగా విజయవాడలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసే సభకు ఇదేవిధంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు అనుమతివ్వకుంటే వారి నీతి ఏంటన్నది తేలిపోతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ తేల్చిచెప్పింది. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన ఏపీ ఎన్జీఓలు తెలంగాణ విద్యార్థుల మీద, నేతల మీద, జర్నలిస్టుల మీద దాడులు చేశారని దీనికి ఎవరు భాద్యత వహిస్తారని ప్రశ్నించింది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలు తెలంగాణ ఉద్యమం మీద విషం చిమ్ముతున్నారని, విద్యార్థుల మీద దాడులు చేస్తున్నారని, తెలంగాణ విభజన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ను పదేళ్ల ఉమ్మడి రాజధానిగా కాదు ఒక్క రోజు కూడా ఒప్పుకోమని, సమైక్యాంధ్ర అంటూనే ఇప్పుడు దాడులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితిని అస్సలు ఒప్పకోమని తేల్చిచెప్పింది. తెలంగాణది ధర్మపోరాటం అని..తెలంగాణదే అంతిమ విజయం అని జేఏసీ స్పష్టం చేసింది.

ఏపీయన్జీవోల సభకు భారీ స్పందన

  టీ-జేఏసీ తదితర సంఘాలు 24గంటల హైదరాబాదు బందుకు పిలుపునిచ్చినప్పటికీ, ఈ రోజు యల్బీ స్టేడియంలో జరగనున్న ఏపీయన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్'  సభకు సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల నుండి ప్రభుత్వోద్యోగులు, హైదరాబాదులో పనిచేస్తున్నఉద్యోగులలే కాకుండా అక్కడ నివసిస్తున్నఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఉదయం నుండే స్టేడియం వద్దకు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అయితే పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేవలం గుర్తింపు కార్డు కలిగిన ప్రభుత్వోద్యోగులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.   ఇప్పటికే స్టేడియం దాదాపు నిండిపోయింది. ఏపీయన్జీవో నేతలు ఊహించిన దానికంటే రెట్టింపు జనాలు సభకు వచ్చినట్లు కనబడుతోంది. ఇంకా స్థానికంగా నివసిస్తున్న వారు, ఇతర జిల్లాల నుండి వస్తున్నవారు స్టేడియం వద్దకు చేరుకొంటూనే ఉన్నారు. దాదాపు లక్షమందికి పైగా సభకు హాజరయ్యే అవకాశం ఉంది. స్టేడియం లోపలకి చేరుకొన్న ఉద్యోగులను రంజింప జేసేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.   స్టేడియం లోపల ఎంతమంది ఉన్నారో, దాదాపుగా అంతే మంది బయట బారులు తీరి ఉన్నారు. యల్బీ స్టేడియం చుట్టుపట్ల ప్రాంతాలన్నీ సభకు వస్తున్నవారితో జనసంద్రం తలపిస్తున్నాయి. భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు సమైక్యాంధ్ర జెండాలు పట్టుకొని ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు స్టేడియం వైపు కదులుతున్నారు.   వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగుల కోసం ఆర్గనైజింగ్ కమిటీ భారీ ఎత్తున నీళ్ళు, భోజన ఏర్పాట్లు కూడా చేసింది. ముఖ్యమంత్రి, సీమాంధ్ర మంత్రులు, యంఎల్యేలే ఈ ఏర్పాట్లకి వెనక నుండి సహాయం చేస్తున్నారని టీ-జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ ఆరోపిస్తున్నారు. తమ పోరాటం సభను జరుపుకొంటున్నఆంధ్ర ఉద్యోగుల మీద కాదని, కేవలం వారి ఆధిపత్య ధోరణిపైన మాత్రమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కనబరుస్తున్నఈ ఆధిపత్య ధోరణిని తాము వ్యతిరేఖిస్తున్నామని ఆయన అన్నారు.   స్టేడియం లోపల, బయట జరుగుతున్న ఈ భారీ హంగామాను అన్ని టీవీ చాన్నళ్ళు ప్రముఖంగా ప్రసారం చేస్తుండటంతో, సహజంగానే అది తెలంగాణా వాదులకు తీవ్ర ఆగ్రహావేశాలు కలిగిస్తోంది. ఉస్మానియా, నిజం కాలేజీ విద్యార్దులు స్టేడియం వైపు ర్యాలీగా బయలుదేరబోతుంటే పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.   మరి కొద్ది సేపటిలో ఏపీయన్జీవోల సభ మొదలుకాబోతోంది. ఈ సభ ద్వారా వారు ఎటువంటి పిలుపినిస్తారో మరి కొద్ది సేపటిలో తెలుస్తుంది.

అసేంబ్లీ ఆవరణ లో టిఆర్ఎస్ దీక్ష

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహం వద్ద శాంతి దీక్ష చేపట్టారు. దీక్షలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీఎన్జీఓల సభకు అనుమతించి దగ్గరుండి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తెలంగాణవాదుల శాంతి ర్యాలీలకు కూడా అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.     మరో వైపు అసేంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లో తెలంగాణ న్యాయవాదులు దీక్షకు దిగారు. తెలంగాణ న్యాయవాదులంతా గన్‌పార్క్‌కు తరలిరావాలని వారు  పిలుపునిచ్చారు. నిజాం కాలేజీ విద్యార్థులపై దాడి అమానుషమని, హాస్టల్ గదులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నట్లు తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్ తెలిపారు. ఇక నిజాం కళాశాల విద్యార్థుల మీద లాఠీఛార్జ్ చేసిన పోలీసుల మీద కేసులు పెడతామని, అనుమతిలేకుండా వారు లోనికి ప్రవేశించారని నిజాం కళాశాల ప్రిన్స్ పాల్  స్వామి తెలిపారు.

ఉద్రిక్తంగా మారిన ఓయూ

  స‌మైక్య ప్రత్యేక ఉద్యమాల నేప‌ధ్యంలో హైద‌రాబాద్ ర‌ణ‌రంగం మారనుంది. ఏపిఎన్జీవోల స‌భ‌కు స‌మ‌యం ద‌గ్గర ప‌డుతున్న కొద్ది న‌గ‌రంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఇప్పటికే ఎల్బీ స్టేడియం నిజాం క‌ళాశాల ప‌రిసర ప్రాంతాల్లో యుద్ద వాతవ‌ర‌ణం క‌నిపిస్తుండ‌గా. తాజాగా ఓయూ ప‌రిస‌ర ప్రాంతాల్లో కూడా అలాంటి ప‌రిస్ధితులే ఏర్పాడాయి. ఏపిఎన్జీవోల స‌భ‌ను అడ్డుకొని తీరాతామ‌ని ముందు నుంచి చెపుతూ వ‌స్తున్న ఓయు జెఎసి నాయ‌కులు అందుతో భాగంగా ఓయూ క్యాంపస్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు ర్యాలిగా బ‌య‌లు దేరారు దీంతో ఓయు ప‌రిస‌ర ప్రాంతాలు మ‌రోసారి వేడెక్కాయి. పోలీసులు విద్యార్థుల‌ను అడ్డుకోవాడానికి ప్రయ‌త్నించటంతో విద్యార్ధులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్ధుల‌ను అదుపు చేయ‌డానికి స్వల్పంగా లాఠిచార్జ్ చేశారు.

నిజాం కాలేజీ హాస్టళ్ వద్ద ఉద్రిక్తత

      నిజాం కాలేజీ హాస్టళ్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిజాం కాలేజీ హాస్టళ్లలో ఉన్న నాన్ బోర్డర్లను బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో హాస్టళ్లల్లో వున్న విద్యార్ధులు ఆందోళనకు దీగారు. దీంతో పోలీసులు విద్యార్ధుల మధ్య తోపులాట జారింది. పోలీసుల తీరుకి నిరసనగా విద్యార్ధులు రోడ్డుపై బైటాయించారు. కొందరు విద్యార్ధులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. విద్యార్ధి విభాగం నేత సుమన్ తో సహా పదిమందిని అరెస్టు చేశారు. మరోవైపు ఎల్.బి.స్టేడియం వద్దకు ఎన్.జి.లో పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సీమాంధ్రలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది తమ గుర్తింపు కార్డులు చూపి సభ ప్రాంగణంలోకి వెళుతున్నారు.సభ జరగడానికి దాదాపు ఆరు గంటల ముందు నుంచే ఇంతగా జనం హాజరవడం అరుదుగా జరుగుతుంటుంది.