ఢిల్లీకి కన్నా...సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా?

      రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు హైకమాండ్ నుంచి పిలుపురావడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ హైకమాండ్ పెద్దలతో మంత్రి కన్నా కీలక మంతనాలు జరుపనున్నారు. కన్నాకు హైకమాండ్ పిలుపుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మంత్రి శ్రీధర్‌బాబును నియమించాలని అధిష్ఠానం ఆలోచిస్తోందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా కన్నా నియామకానికి అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.     కాగా, కన్నా లక్ష్మినారాయణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం గతంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌తో మంతనాలు జరిపారు. తాజాగా కన్నాకు దిగ్విజయ్‌, అహ్మద్‌పటేల్‌ పిలుపునివ్వడం.. ఇద్దరూ ఆల్రెడీ కన్నాతో ప్రత్యేకంగా మాట్లాడటంటో ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిని చేస్తారా? లేదంటూ ఎవరూ ఊహించని విధంగా కిరణ్‌ని తప్పించి, కన్నాను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతారా.? అన్నదానిపైనా రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.  

చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్

      చత్తీస్‌గఢ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాష్ట్రంలో 85 వేల మంది పారామిలటరీ బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం రమణ్‌సింగ్ సహా 143 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా ఓటు వేస్తే చేతులు తీసేస్తామంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే.   మరోవైపు చత్తీస్‌గఢ్‌లో కా౦కేర్ జిల్లా పంఖజోర్ లో మావోయిస్టులు ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. భారీగా పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికలను అడ్డుకోవడానికి మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.     

అలా ముందుకు పోతున్నారు!

రాష్ట్ర విభజనపై తుది రూపునకు రంగులు, హంగులు అద్దుతున్న కేంద్రం నేడు అధికారులతో, రేపు, ఎల్లుండు రాష్ట్ర పార్టీలతో, 18న రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులతో.. ఇలా వరుస సమావేశాలు, చర్చలతో జీవోం బిజీ,బిజీ! 21నాటికి టి-బిల్లు ముసాయిదా క్యాబినెట్ లో సమర్పించే అవకాశం స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. జీవోయం ఒకొక్క దశను  దాటి ముందుకు వెళ్ళిపోతోంది. ఎవరేమనుకున్నా, ఎవరెన్నిశాపనార్థాలు పెట్టినా పట్టించుకోకుండా తాను అనుకున్న దారిలో ముందుకు వెళుతోంది.   ఈ చర్చల ఆధారంగానే ముసాయిదా బిల్లుకు తుది రూపునిచ్చే పనిలో పడ్డారు. ఇక నుంచి 10రోజుల వరకు విభజన సెగ ఢిల్లీని తాకనుంది. ఈ మధ్యలో ట్విస్ట్ ఏమిటంటే రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమావేశానికి టీడీపీ వెళ్లకపోవడం. ఇదిలా ఉంటే జీవోం నిర్వహించే నేటి సమావేశానికి కేంద్ర ప్రభుత్వంలోని 9 ప్రధాన శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొననున్నారు.   ముఖ్యంగా హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీ, విద్యుత్ కేటాయింపులు , హైదరాబాదులో శాంతి భద్రతలు , హైదరాబాదు ఆదాయం.. ఇలా ఎన్నో విభాజనాంశాలను చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలతో సమావేశాలకి కాంగ్రెస్ నుంచి దామోదర రాజ నరసింహ, వట్టి వసంత్ కుమార్లకు పిలుపు వచ్చింది. ఇంకో ఎండ్ నుంచి దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లను రమ్మనమని దిగ్విజయ్ సింగ్ కబురుపెట్టారు.   చివరి ఆశనైనా నెరవేర్చుకోవాలని హైదరాబాదుని యూటీ చేయాలనే డిమాండుతో ప్రధానిని నేడు కలిసేందుకు సీమాంద్ర కేంద్రమంత్రులు రెడీ అవుతున్నారు. ఇలా ఎవరికీ తోచిన దారిలో వారు అలా ముందుకుపోతున్నారు.

కిరణ్ వాదనలు కూడా నాటకంలో భాగమేనా?

   కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిననాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని దిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తూ సీమాంధ్ర ప్రజలలో మంచిపేరు సంపాదించుకొంటున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్లు, ఆయన అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న కారణంగా మంచి దైర్యవంతుడని, కొత్త పార్టీ పెట్టగల సమర్ధుడని ప్రజలలో ఒక భావన కలిగిస్తూ, సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న కారణం చేత అతనే బెస్ట్-సమైక్యవాదని, అందువలన రాష్ట్రాన్ని విభజిస్తున్నకాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం చెప్పాలంటే, ఆయన నేతృత్వంలో ఏర్పడే కొత్త పార్టీకే మద్దతు ఇవ్వవలసి ఉంటుందనే భావనని కూడా చాలా సమర్ధంగా ప్రజలలోకి జొప్పించగలిగారు.   ఇదంతా బాగానే ఉంది. కానీ, ఇదే సమయంలో ఆయన రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎన్నడూ కూడా అడ్డుపడలేదనే సంగతిని గ్రహించవలసి ఉంది. ఆయన మనస్పూర్తిగా రాష్ట్రం విడిపోకూడదని కోరుకొంటూ ఉండవచ్చు గాక! కానీ కేవలం అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అధిష్టానానికి వ్యతిరేఖంగా మాట్లాడటం తప్ప రాష్ట్రం విడిపోతుంటే ఆపేందుకు ఆయన చేసిన ప్రయత్నమేదీ కనబడలేదు.   అందువల్లే రాష్ట్రానికి సంబంధించిన విభజన ప్రక్రియ రాష్ట్రంతో ఎటువంటి సంబంధము, సమ్మతి లేకుండా ఎక్కడో డిల్లీలో చకచకా జరిగిపోతోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి వలన కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రక్రియను ఏవిధంగా గట్టెకించాల అనే సందిగ్ధంలో ఉన్నట్లు మీడియా చెపుతోంది తప్ప, కాంగ్రెస్ అధిష్టానంలో ఎవరూ కూడా అటువంటి భయాలు వ్యక్తం చేయలేదు. అంతే గాక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే అభ్యంతరం చెపుతున్నారు గనుక రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నడూ కూడా భావించలేదు.   కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటూ మీడియాకి, తద్వారా ప్రజలకి మంచి కాలక్షేపం కలిగిస్తూ, అందరినీ చాలా తెలివిగా పక్కదారి పట్టిస్తున్నారని చెప్పక తప్పదు.   ఒకసారి కిరణ్ పై చాకో, మరోసారి మనిష్ తివారి, ఇంకోసారి షిండే, దిగ్విజయ్ సింగ్ ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొన్నట్లు మీడియా ముందుకు వచ్చి స్పందిస్తుంటారు. గత మూడు నాలుగు రోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగులమధ్య జరుగుతున్న భాగోతం గమనిస్తే అది స్పష్టమవుతుంది.   ఇంత రాద్ధాంతం జరుగుతున్నపటికీ తెరవెనుక విభజన ప్రక్రియ మాత్రం సజావుగా సాగిపోతూనే ఉంటుంది. మరో పక్క అందుకు అవసరమయిని ఫైళ్ళు, వివరాలు, సమాచారం అంతటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఈ నేపద్యంలో కేంద్రం రచించిన నాటకంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తన పాత్ర తను సమర్ధంగా పోషిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మవలసి వస్తోంది.   చివరికి ఆయనని నిత్యం విమర్శిస్తూనే మళ్ళీ ఆయనతో సమావేశాలవుతున్న టీ-కాంగ్రెస్ నేతలని కూడా అనుమానించక తప్పదు. అంటే, కాంగ్రెస్ అధిష్టానం తయారు చేసి ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ ఒకరినొకరు దూషించుకొంటూ, ప్రజలని పక్కదారి పట్టిస్తూ విభజన ప్రక్రియను సజావుగా ముందు తీసుకుపోతున్నారనుకోవలసి ఉంటుంది.

నాగం నోటికి తాళం!

  బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నోటికి చాలాకాలం తర్వాత తాళం పడింది.  నాగం సారు తెలుగుదేశంలో వున్నా, టీఆర్ఎస్‌తో రాసుకుని పూసుకుని తిరిగినా, సొంత కుంపటి పెట్టుకున్నా.. ఎప్పుడైనా ఆయన నోటికి అడ్డే ఉండేది కాదు. సీమాంధ్రులని తిట్టడంలో నాగం జనార్దన్ రెడ్డిది ప్రత్యేక శైలి. అవమానంతో సీమాంధ్రుల గుండె పగిలిపోయే స్థాయిలో తిట్టడంలో నాగం సిద్ధహస్తుడు. ప్రెస్‌మీట్లల్లో నాగం చూపుడువేలు చూపిస్తూ సీమాంధ్రులని తిడుతూ వుండే విభజనవాదుల మనసులు దూదిపింజల్లా హాయిగా గాలిలో తేలుతూ వుండేవి. అంతటి ఘనాపాటి నాగం ఈమధ్య సీమాంధ్రుల మీద తిట్ల పురాణం విప్పటం లేదు. బీజేపీలో చేరినప్పటి నుంచి నాగం గారి వాయిస్ చాలా సాఫ్ట్ అయిపోయింది. బీజేపీ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్స్‌ లో పాల్గొంటున్నప్పటికీ నాగం క్లుప్తంగా, తిట్లూ గట్రా లేకుండా నాలుగు ముక్కలు మాట్లాడేసి బుద్ధిగా కూర్చుంటున్నారు. ఈ ధోరణి సీమాంధ్రులకి మనశ్శాంతిని కలిగిస్తూ వుంటే, విభజనులు మాత్రం ఏవి తండ్రీ నిరుడు కురిసిన తిట్ల పురాణాలు అంటూ విలవిలలాడుతున్నారు. ఆ విలవిల నాగం మనసులో కూడా వుండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు సీమాంధ్రులను గానీ, అటు తాను నిరంతరం తిట్టిపోసే చంద్రబాబుని కానీ తానిప్పుడు తిట్టలేకపోతున్నందుకు నాగం మనోవేదన చెందుతూ ఉండొచ్చని అంటున్నారు. నాగం ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం బీజేపీ నాయకత్వం నాగం నోటికి తాళం వేయడమేనని తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల మీద కామెంట్లు చేసే విషయంలో బీజేపీకి ఒక క్రమశిక్షణ వుండటం, తెలంగాణ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం ధోరణి మారుతూ వుండటం, తెలుగుదేశం పార్టీకి చేరువ అయ్యే ప్రయత్నాలు జరుగుతూ వుండటం వల్ల నాగం నోటికి తాళం పడటానికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగం తన ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ పోతే అది బీజేపీని ఇబ్బందికర పరిస్థితుల్లో పడే అవకాశం వుంది. తన నోటికి తాళం వేయడం నాగానికి ఇష్టం లేకపోయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో నాగం సైలెంట్‌గా వుంటున్నారు. తెలంగాణ విషయంలో పట్టు సడలిస్తున్న బీజేపీని వదలాలని మనసులో వున్నా ఆయనకు వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇష్టంలేని కాపురం చేస్తున్నారు.

వసపిట్ట కేటీఆర్!

  కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి చిన్నప్పుడు వస ఎక్కువగాపోసినట్టున్నారు. అందుకే అయినదానికీ, కానిదానికీ సీమాంధ్రుల మీద నోరేసుకుని పడిపోతూ వుంటాడు. తాను సృష్టించే అబద్ధాలను తెలంగాణ ప్రజల చేత నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ విషయంలో కేటీఆర్‌ది తండ్రిపోలికే! ఇప్పుడు తాజాగా కేటీఆర్‌ తన క్రియేటివిటీని రాష్ట్ర విభజన అనంతరం శాంతిభద్రతల పరిస్థితి మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ మీద చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే శాంతి భద్రతల పరిస్థితి మీద సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సీనియర్ అధికారులు సభ్యులుగా వున్న ఈ టాస్క్ ఫోర్స్ అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో విభజనవాదులకు పళ్ళకింద రాళ్ళలాగా వుండే, విభజన అనంతరం వాళ్ళ హింసాత్మక ధోరణికి అడ్డు తగిలే అనేక అంశాలు వున్నాయి. దాంతో విమర్శల చిట్టా పట్టుకుని కేటీఆర్ రంగంలోకి దిగిపోయాడు. తమకు అనుకూలంగా వుంటే రైట్ లేకపోతే రాంగ్ అనే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడే విభజనవాదుల ప్రతినిధి అయిన కేటీఆర్ టాస్క్ ఫోర్స్ నివేదిక మీద విమర్శల వర్షం కురిపించాడు. టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకట. చీఫ్ విజయ్ కుమార్ సీమాంధ్ర నాయకులతో రహస్య సమావేశం జరిపి సీమాంధ్రులకు అనుకూలంగా ఉండే నివేదికను రూపొందించారట. టాస్క్ ఫోర్స్ లో వున్న సీమాంధ్ర అధికారులు నివేదికను ప్రభావితం చేశారట. తెలంగాణకు వ్యతిరేకంగా వున్న  ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ బిల్లు రూపొందిస్తే ఒప్పుకోరట... ఇదీ కేటీఆర్ వరస! అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ప్రవేశపెడితే మొట్టమొదటి అవార్డు కేసీఆర్‌కి, రెండో అవార్డు కేటీఆర్‌కి ఇవ్వాలి. గతంలో శ్రీకృష్ణ కమిటీ మీద కూడా సీమాంధ్రులు ప్రభావం చూపించారని నోరు పారేసుకున్న కేటీఆర్ లాంటి విభజనవాదులు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ విషయంలో కూడా అదే ఫార్ములాను పాటిస్తున్నారు. తనకే అన్నీ తెలిసినట్టు ఆరిందాలా వసపిట్టలా మాట్లాడే కేటీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. కేటీఆర్ లాంటి నాయకులు ప్రతి విషయం మీదా నిరాధార ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజల పరువు తీయకుండా వుండాలని కోరుకుంటున్నారు.

పాపం కోదండరామ్‌!

  తెలంగాణ పొలిటికల్ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కి వచ్చిన పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు. నిన్న మొన్నటి వరకూ హీరోలా వెలిగి ఒక్కసారిగా జీరో అయిపోవడం అనేది ఎవరికైనా బాధ కలిగించే విషయమే. పొలిటికల్ జేఏసీ నాయకుడిగా ఎంపికయిన దగ్గర్నుంచీ కోదండరామ్ తెలంగాణని అగ్నిగుండం చేయడానికి తనవంతు ఆజ్యం పోశారు. తన పిల్లల్ని అమెరికాలో సెటిల్ చేసిన కోదండరామ్, తెలంగాణ యువకులను ఉద్యమోన్ముఖులను చేస్తూ వాళ్ళలోనే తన పిల్లల్ని చూసుకున్నారు. టీఆర్ఎస్‌కి తనవంతు సేవ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో తరించారు. నిన్నమొన్నటి వరకూ తెలంగాణ ఉద్యమకారులందరూ కోదండరామ్ నోటి వెంట ఏ మాట వస్తే దాన్ని తు.చ. తప్పకుండా పాటించడానికి రెడీగా వుండేవాళ్ళు. టీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు కోదండరామ్ చల్లనిచూపులు తమమీద వుండాలని కోరుకునేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్, పొలిటికల్ జేఏసీల భాగస్వామ్యం లేకుండా తన సొంత వ్యవహారంలా రాష్ట్ర విభజకు పూనుకుంది. అప్పటి నుంచి పొలిటికల్ జేసేసీకి, దాని నాయకుడు కోదండరామ్‌కి చేతిలో పనిలేకుండా పోయింది. విభజన విషయంలో కేంద్రం పొలిటికల్ జేఏసీ అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా గమనించకుండా ముందుకు వెళ్తోంది. గతంలో పొలిటికల్ జేఏసీ పేరు చెబితేనే గడగడా వణికిన తెలంగాణ నాయకులు ఇప్పుడు కోదండరామ్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కోదండరామ్‌కి నీడనిచ్చి, ఆయనలో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఆశల్ని పెంచి పోషించిన టీఆర్ఎస్ కూడా కోదండరామ్‌ని లైట్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏరుదాటక ముందు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా తన పరిస్థితిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును కోదండరామ్ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నీ కలసి వస్తే టీఆర్ఎస్ ఆశీస్సులతో ఏ రాజ్యసభకో వెళ్దామని కలలు కన్న ఆయన ఇప్పుడు తనను ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో ఆవేదనలో వున్నారు. ఎప్పుడూ తన వెనకాలే తిరిగే ఉద్యోగ సంఘ నాయకులని వెంట పెట్టుకుని చిన్నచిన్న ప్రదర్శనలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఓ పాతిక ముప్పై మంది కార్యకర్తలతో కలసి ఓ బుజ్జి ర్యాలీ చేసుకున్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకుండా వుంటే తనకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఎదురు చూస్తున్నారు. పాపం కోదండరామ్!

కొత్త రాష్ట్రంలోనే కొత్త సంవత్సరం

  ఈ సారి కొత్త సంవత్సర వేడుకలు కొత్త రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి. ఈ నెల 26న అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందన్న ఆయన తరువాత జరిగే పక్రియ అంతా చాలా వేగంగా అవుతుందన్నారు. 2014 జనవరి 1 వేడుకలు ఈ సారి తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు.   తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వరంగల్‌ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, భద్రాచలం డివిజన్‌ కూడా తెలంగాణలోనే ఉంటుందన్నారు.  

వేర్పాటు ముసుగులో కబ్జాదారులు ఎవరెవరు?

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     "ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటలుగా పరిగణింపబడే ముఖ్యకేంద్రాలను మీర్జా ఇస్మాయిల్ (నిజం) రిజర్వు పోలీసులు, సైన్యాలు వారంరోజుల్లో రాత్రికి రాత్రే చుట్టుముట్టి మెరుపు దాడులు చేసి, నిండుప్రాణాలను బలిగొని, వేలకు వేల సంఖ్యలో అరెస్టులు చేసి, హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణా ప్రాంతపు కారాగారాలందు నిర్భంధించి, కనీవినీ ఎరుగని నిర్బంధవిధానాన్ని నైజాం నిరంకుశ ప్రభుత్వం ప్రయోగించింది ... ఆ సమయంలో ఈ ప్రాంతపు ఆంధ్రమహాసభలో మితవాదులైన మందుముల సోదరులు (నర్శింగారావు, రామచంద్రరావు), బూర్గుల రాం కిషన్ రావు, కొండా వెంకటరంగారెడ్డి లాంటివారు నైజాం సైన్యాలు, రిజర్వుపోలీసులు చేస్తున్న అఘాయిత్యాలను ఖండిస్తూ కనీసం ప్రకటనలనైనా చేయడానికి సాహసించలేకపోయారు! పైవారంతా, ఆంధ్రమహాసభలో మాతో సమిష్టిగా పనిచేసినప్పుడు కూడా తెలంగాణా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలపై చన్నీళ్ళు చల్లిన ఘరానా పెద్దమనుషులే! నిజం వ్యతిరేకపోరాటం చాలా ఉన్నతస్థాయిలో వున్నప్పుడు కొండా వెంకటరంగారెడ్డి నాయకత్వాన ఒక బృందం [మితవాద నాయకులు పంపగా] ఒక నివేదికను పత్రికలకు విడుదల చేసింది. గ్రామ సీమలందు కమ్యూనిస్టులు దొరలను, భూస్వాములను పత్తి హింసిస్తున్నారని, వారి వ్యవసాయాల్ని సాగనీయడం లేదని, ఆయా గ్రామాలందు కాంగ్రెస్ లో సభ్యులుగా చేరినవారిని కమ్యూనిస్టులు హింసిస్తున్నారని ఆ నివేదికలో తెలిపారు.   దొరల దోపిడీ, దౌర్జన్యాకాండలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఆంధ్రమహాసభ కార్యకర్తలను భూస్వాములు పోలీసులతో మిలాఖాతై చిత్రహింసలకు గురిచేస్తున్నప్పుడు నైజాం నవాబుకు తొత్తులుగా వున్నారని గ్రామాలనుండి తరిమివేయడంలో తప్పులేదు. ఆ దొరల తొత్తులయిన గూండాలను కాంగ్రెస్ లో చేర్చుకోగా, కాంగ్రెస్ వారిని కమ్యూనిస్టులే కొట్టారని కొండా వెంకటరెడ్డి నివేదిక చెప్పింది. అసలు ఈ కొండా వెంకటరెడ్డి ఎవరు? .... ఈ రంగారెడ్డికి భువనగిరి తాలూకాలోని శాహ్ రాజ్ పేట గ్రామంలోనే దాదాపు వేయి ఎకరాలభూమి సొంత వ్యవసాయంలో ఉంది. 1946-47, 1947-48 సంవత్సరాల్లో నైజాం నవాబుకు నమ్మినబంటు అని పేరుతెచ్చుకున్నారు. పులితోలు కప్పుకున్నా, నక్కనక్కే, గూండాలు కాంగ్రెస్ లో చేరినా గూండాలే ... అలాంటి కాంగ్రెస్ కు 1952 జనరల్ ఎన్నికల్లో సభ్యులకు అసలు పోలింగ్ ఏజెంట్లే దొరకలేదు. కమ్యూనిస్టు పార్టీ అద్వితీయమైన విజయాలు సాధించింది! [రైతాంగ సాయుధ పోరాట అగ్రనాయకులలో ఒకరైన ఆరుట్ల రామచంద్రారెడ్డి: "తెలంగాణా పోరాట స్మృతులు]   తెలంగాణాలో ఈ 'దొరల'గత చరిత్రే కాదు, నేటి చరిత్ర కూడా అదే అయినందుననే, హైదరాబాద్ స్టేట్ రద్దయి, దేశంలో తొలి "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్'' [ఫజల్ ఆలీ] స్పష్టమైన సిఫారసులు ఆధారంగా దేశంలోనే తొలి రెండవ పెద్ద రాష్ట్రంగా తెలుగువారందరికీ కలిపి తెలుగుప్రజల చిరకాల వాంఛలకు అనుగుణంగా "ఆంధ్రప్రదేశ్'' (విశాలాంధ్ర) రాష్ట్ర అవతరణ హైదరాబాద్ రాజధానిగా 1956 నవంబర్ 1న సుసాధ్యమయిన తరువాత కూడా నానారకాల 'దొరల' ఇతర భూస్వామ్య, నయాపెట్టుబడిదారుల అలానే ఉన్నాయి! ఈ కొనసాగింపులో భాగమే కోస్తాంధ్రలోని శ్రీకాకుళం (విజయనగరం)నుంచి తెలంగాణాకు వచ్చి, తన రాజకీయ నిరుద్యోగానికి పరిష్కార మార్గంగా మొత్తం తెలుగుజాతి మధ్యనే విషబీజాలు నాటినవాడు "బొబ్బ్లిదొర'', అతని కుటుంబమూ; తెలుగువారి తెలంగాణా ప్రాంతంలో ఇతడు కాలుమోపిన నాటికి ఉన్న ఆస్తిపాస్తులెన్ని? ఆ తరువాత చేసిన దొంగసంపాదనలెన్ని? లెక్కల కోసం సీమాంతరాలు దాటి వెళ్ళనక్కరలేదు!   ఎందుకంటే తెలంగాణాలోని స్థానికులు హైదరాబాద్ లోని మిత్రులూ వెల్లడిస్తున్నా దాన్నిబట్టి - ఒక్క హైదరాబాద్ సమీపంలో 'బొబ్బిలిదొర'కు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో రకరకాల రహస్య కార్యకలాపాల కోసం నిర్మించుకున్న "ఫామ్ హౌస్'' ఉంది! ఇదిగాక, 2010 జనవరి 31న "ఇంటర్నెట్" సాక్షిగా ఒక "బ్లాగ్''లో "బొబ్బిలిదొర'' వారి "డాలర్ సామ్రాజ్యం'' అన్న మకుటం కింద ఇండియా మ్యాప్ లో అతడి బొమ్మ ముద్రించి తాజాగా మావోయిస్టులు ఒక వార్తను ప్రముఖంగా విడుదల చేశారు! ఆ వార్త తాలూకు తాజా సమాచారం ("అప్ డేటెడ్'') పేరిట "ఆంధ్రామానియా'' శీర్షిక కింద బొబ్బిలిదొర పేరుతొ వారి "సీక్రెట్ బిజినెస్: సీపోర్టు షిప్స్ అండ్ రు. 6000 క్రోర్స్'' అన్న ఉపశీర్షిక పెట్టి ఈ క్రింది సమాచారం అందులో పెట్టారు. అందులోని కొన్ని భాగాలు : తెలంగాణా ప్రజలంటే తనకెంతో ప్రేమ అని నటించే వ్యక్తీ నిజమైన ప్రేమంతా అతని వ్యాపారాల మీదనే ఉంటుంది. "తన ప్రజలు మోసపోయారని ఎవరు అరుస్తూంటారో అతను ఇతర రాష్ట్రాలలో భారీ పెట్టుబడులు పెడుతుంటాడు!'' "ఇతరులమీద రాజకీయంగా ఎక్కువ పలుకుబడి పొందడం కోసం దోమల బెడదను కూడా లెక్క చేయకుండా తండాల మధ్య తలదాచుకోజూచే వ్యక్తీ రెండు ఓడలకు (కాండ్లారేవులో) అధిపతి కాగలగడమేకాదు, ఇప్పుడా వ్యక్తీ ఒక ప్రయివేట్ హార్బరునే నిర్మిస్తున్నాడు'' అని ఆ బ్లాగ్ లో బ్లాగర్ వివరించాడు.   అంతేగాదు, ఆ వ్యక్తీ తాలూకు "ఈ చీకటి కోణాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి ... ఈ వివరాలు చదివితే అతడు ప్రారంభించిన స్థానిక ఉద్యమం గురించీ, తెలంగాణా ఆత్మగౌరవం గురించీ అతను చేస్తే ప్రకటనలలోని డొల్లతనం బోధపడుతుంది ... 2001 సంవత్సరంలో ఇతడు స్థానిక పార్టీని స్థాపించిన తరువాత అపారమైన సంపదను కూడబెట్టుకున్నాడు. దానికి తగిన సాక్ష్యాధారాలను విశ్వసనీయవర్గాల నుంచే రాబట్టుకోవటం జరిగింది. రాజకీయంగా పొందిన ఈ సంపదతోనే ఆయన కాండ్లా (గుజరాత్) సముద్ర రేవుపైన గట్టిపట్టు సాధించాడు. రెండు భారీ నౌకలు కొన్నాడు. ఇప్పుడా నౌకలు ప్రపంచాన్ని చుట్టివస్తున్నాయి. అతడు ఒక ప్రయివేట్ సీపోర్టును కూడా నిర్మించే యత్నంలో ఎద్దడిగా ఉన్నాడు. ఈ సీపోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.500 కోట్లు అని అంచనా. ఈ నిర్మాణాన్ని ఆయన సన్నిహిత బృందంతో ("క్లోజ్ సిండికేట్'') కలిసి చేస్తున్నాడు! ఈ రాజకీయవేత్త విలువ నేడు రూ.6,000 కొట్లనీ, ఇది పైకి కన్పించే సొమ్ము మాత్రమేననీ అతడి ఆర్ధిక లావాదేవీలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తీ వెల్లడించాడు. ఈ మొత్తం కేవలం పైకి తెలియవచ్చిన సంపదకాగా, అజ్ఞాతంగా ఉన్న సంపద వాస్తవ విలువ ఎంత ఉండాలో ఎవరికీ వారే ఊహించుకోవచ్చు. అంతేగాదు, మహారాష్ట్ర, గుజరాత్ ల మధ్యదారిలో అతడికి అనేక ఆస్తులూ, ఎస్టేట్లూ, ఆర్ధిక లావాదేవీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలేగాని, తెలంగాణాలో మాత్రం కావు. ముంబైకి, గుజరాత్ కు మధ్య ఈయన పొందిన భూముల విలువ కోటానుకోట్ల రూపాయల్లోనే ఉంటుంది''!   ఇవీ - ఇంటర్నెట్ కథనం (బ్లాగ్) వివరాలు! ఇంతకూ ఇక్కడ గమనించవలసిన విషయం - 1956కు ముందూ తెలుగుజాతి ఏర్పరచుకున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దరిమిలా ఇరుప్రాంతాలకు చెందినా (సీమాంధ్ర, తెలంగాణా) భూస్వామ్య, ధనికవర్గాలు పెట్టె పెట్టుబడులకు మాత్రం ప్రాంతీయ భేదాలుండవుగాక ఉండవు, అని! ప్రాంతాలలోని సామాన్య ప్రజాబాహుళ్యాన్ని వివిధ రూపాలలో దోచుకోవటంలో ఇరుప్రాంతాలలోని భూస్వామ్య, పెట్టుబడివర్గాలకు పద్ధతులలోనేగాని, దోపిడీ స్వభావంలో మాత్రం తేడాలుండవు గాక ఉండవు! లేవు కాబట్టే, తెలంగాణా సాయుధ పోరాట విజయాల ప్రభావంలో నాటి తెలంగాణా పేదరైతు, వ్యవసాయ కార్మికవర్గం, వెట్టిచాకిరీని, "నీబాన్చను దొరా, నీ కాల్మొక్తా'' అన్న బానిస సంకెళ్ళను కాస్తా విదిలించుకుని బయటపడవలసి వచ్చింది. అదీ అసలైన ఆత్మగౌరవ ప్రతిష్ఠాపాన!   అయితే నాటి ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం సుసాధ్యం చేసిన ఈ పరిణామక్రమాన్ని నేడు తిప్పికొట్టడం కోసమే మరొకసారి ప్రాతపు దోరాలూ, భూస్వాములూ సమాయత్తం కావడానికి ఒక ఉద్యమం అవసరమైంది. అందుకనే ప్రజల మౌలిక సమస్యలయిన భూసమస్య, కనీసవేతనాలు, గనుల పేరిట, పరిశ్రమల విస్తరణపేరిట విచ్చలవిడిగా పెట్టుబడివర్గాలు సాగిస్తున్న భూసేకరణలు, భూముల స్వాదీనాలు, విద్యార్థి, యువజనుల నిరుద్యోగం వగైరా సమస్యలు ప్రస్తావనకు రాకుండా, ఆ సమస్యలపైన వాస్తవికమైన ఆందోళనలు, ఉద్యమాలూ రాకుండా పక్కదారులు పట్టించేందుకే, పదవీ స్వార్థంలో భాగంగా పాలకపక్షంలోని 'నిరుద్యోగ'వర్గమూ, "పక్కింటావిడ భర్త దొరికితే, నా భర్తా దొరుకుతాడ''న్న సామెతలాగా కొన్ని ప్రతిపక్షాలలోని స్వార్థపరులూ ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండా ద్వారా తెలుగుజాతిని చీల్చాలని కృత్రిమంగా ఉద్యమించారనడంలో సందేహం లేదు! ఈ రాజకీయ నిరుద్యోగుల అండలేకపోతే కాంగ్రెస్ అధిష్ఠానం కొమ్ములు కూడా విరిగిపోవటం ఖాయం.   అలాగే, 1956కు ముందు పరిస్థితిలో పోల్చుకుంటే ఆ తరువాత కడచిన 56 సంవత్సరాలలోనూ ఉభయప్రాంతాలలో రిజిస్టరయిన భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల పెట్టుబడులూ, పరిశ్రమల నిర్మాణం కూడా ఉన్న పరిధులలో గణనీయంగానే పెరిగాయని గణాంకాలన్నీ తెల్పుతున్నాయి. అందువల్ల హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడుల కేంద్రీకరణలో గానీ, విస్తరణలోగానీ ఉభయప్రాంతాల మోతుబరులూ ఉన్నారు. అందుకు ఏ ఒక్కరినో టార్గెట్ చేసీ లాభంలేదు! విచిత్రమేమంటే, ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయమే చూడండి - "న్యూ''కంపెనీలో భాగస్వాములుగా ఉన్నవారు ఉభయప్రాంతాల పెట్టుబడిదారులే. పైగా ఆ కంపెనీ కోసం స్థానిక మోతుబరూ, స్థానిక దినపత్రిక యజమానికి [ఇప్పటిదాకా ఆ పత్రిక నిర్వాహకుడు తెలంగాణాలో పాగా వేసిన 'బొబ్బిలిదొర'వారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా] కాంట్రాక్టు ఇప్పించడంలో ప్రముఖపాత్ర వహించడాన్ని పత్రికలు బయటపెట్టాయి!   అంతవరకూ ఇదే స్థానిక పత్రిక అధినేతగా ఉంటూ వచ్చిన 'బొబ్బిలిదొర' ఆ పత్రికను ఆ స్థానిక యజమానికి కుదువబెట్టిన సంగతీ బహిరంగ రహస్యమే! ఇక "బొబ్బిలిదొర'' కుమారరత్నం ఒక ఎన్.ఆర్.ఐ. "సీమాంద్ర పెట్టుబడిదారులు'' అంటే ఎక్కడ అదే సీమాంధ్రకు చెందినా తమకూ వర్తించుతుందేమొననిసిగ్గుపడిన ఈ తండ్రీకోడుకులూ మధ్యలో ఆ మాటను మానేసి మొత్తం "దోపిడీ'' పదాన్ని "సీమాంధ్రప్రజల''కే అంటగట్టేస్తూ వచ్చారు. అంతేగాదు, 'బొబ్బిలిదొర' కుమారరత్నానికి వ్యాపారాలకోసం సీమాంధ్ర కావాలట, అధికారానికి తెలంగాణా కావాలట! ఈ సత్యం - శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి గ్రామంలో ఎగుమతులకు గిరాకీ ఉన్న "శ్రీకాకుళం బ్లూస్'' అనే విలువైన రంగురాళ్ళ క్వారీని ఈ కుమారరత్నం 2005 సంవత్సరం దాకా కొల్లగొడుతూనే వచ్చాడని మరవరాదు!   ఈ భాగోతం ఇలా ఉండగానే, 1956కు ముందు మన తెలంగాణాలోగాని [రెండు ప్రాంతాలూ 1953 దాకా ఒకటి, 1956 దాకా మరొకటీ పరాయి పాలనల్లోనే ఉంటూ వచ్చినందున] ఉభయత్రా విదేశాలకు ఉద్యోగరీత్యాగానీ, వ్యాపారాల కోసంగానీ వెళ్ళిన ఎన్.ఆర్.ఐ.ల సంఖ వేళ్ళమీద లెక్కించదగిన దానికన్నా మించిలేదు. కాని 1956 తరువాతనే ఉభయప్రాంతాలలోనూ గత 57 సంవత్సరాలలోనూ ఇటు తెలంగాణానుంచీ, అటు సీమాంధ్రనుంచీ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఎన్.ఆర్.ఐ.ల రాకపోకలూ, విదేశాల్లో నివాసాలూ, స్థిరనివాసాలూ పెరిగాయని మరచిపోరాదు. అమెరికా, బ్రిటన్, జర్మనీలలోనేగాక, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, మలేసియా, సింగపూర్ లలో స్థిరపడి ఆయా చోట్ల పలు తెలుగు సాంస్కృతిక సంస్థలనూ ఏర్పరచుకున్నారు. ఈ విషయంలో ఇరుప్రాంతాల వారూ విద్యా విషయకంగానూ, సాంస్కృతికంగానూ కూడా ఎంతో అభివృద్ధి దిశగా పురోగామిస్తున్నారు. తెలుగునాట వివిధప్రాంతాల అభివృద్ధి కోసం తమకు వీలైన పద్ధతుల్లో పాటుపడుతూనూ ఉన్నారు. ఈ పరిణామం ప్రధానంగా 1956 తరువాతనే, తెలుగుజాతి ఏకైకరాష్ట్రంగా ఏర్పడిన తరువాత మాత్రమే సాధ్యమైందని గుర్తించాలి. ఇక హైదరాబాద్ లో ఉభయప్రాంతాల వారి పెట్టుబడులకు సంబంధించి కూడా 1956 తర్వాతనే ఇరుపక్షాల క్రమానుగతమైన అభివృద్ధి కనిపిస్తోంది. ఉదాహరణకు 1956 తరువాతనే మన తెలంగాణా సోదరుల పరిశ్రమలు, సంస్థలలో ఉన్న పెట్టుబడులు రూ.350 కోట్ల నుంచి సుమారు రూ.4,000 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈ ఇరుప్రాంతాలకు చెందిన మోతుబరులు ఆక్రమించిన లేదా కొనుగోలు చేశామని చెబుతున్న భూముల వైశాల్యం వివరాలను రాష్ట్రప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన 'శాంతి'చర్చల సందర్భంగా మావోయిస్టులు పేర్లతో సహా పేర్కొన్న వివిధ ప్రాంతాలవారీ భూముల, పెట్టుబడి ఆస్తుల, కంపెనీల వివరాలతో ఒక పత్రాన్ని కూడా విడుదల చేశారు. కాగా, ఇటీవల తెలియవచ్చిన కొన్ని వివరాల ప్రకేరం గత పాతికేళ్ళలో స్థానిక సోదరులు సంపన్నులుగా ఎదిగి ఏ ఏ పరిశ్రమలు పెట్టి బలమైన పరిశ్రమాధిపతులుగా ఎదుగుతూ వచ్చారో తెలిసింది. పెట్టుబడిదారీ-భూస్వామ్య మౌలిక చట్రం అనుమతించినందువల్లనే అటువారుగాని, ఇటువారుగానీ వీలైనంత మేర సంపన్నులుగా తమ వృద్ధి నమోదు చేసుకున్నారు! ఆ వ్యవస్థ మౌలింగానే మారిపోనంత కాలం ప్రాంతాలతో నిమిత్తం లేకుండానే కొత్త 'టాటా'లు, కొత్త 'బిర్లా'లూ, ఇంకొత్త అంబానీలూ పుట్టుకొస్తూనే ఉంటారని మరవరాదు! అలాగే మన తెలంగాణాలో కూడా హైదరాబాద్ కేంద్రంగానూ, జిల్లాస్థాయిలోనూ కోట్లకు పడగలెత్తిన కేవల స్థానిక కంపెనీలున్నాయి. వాటిలో కొన్ని " ఆంశ్రీ కన్ స్ట్రక్షన్స్, శాలివాహనా బిల్డర్స్, శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్, మధుకాన్, మైహోమ్ కన్ స్ట్రక్షన్స్, నాగంవారి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కున్ డాయి, గుజరాత్ షిప్పింగ్ సర్వీసు, 'న్యూ' కంపెనీ, శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్, శ్రీకిరణ్ కన్ స్ట్రక్షన్స్ వగైరాలు!   అన్నట్టు - వెంకటస్వామి, వివేక్, మధుయాష్కీ, డి.ఎస్., ఎర్రబెల్లి, నాగం, ఈటెల వారి ఆస్తులు పుట్టుకతోనే వచ్చినవా, 1956 తర్వాత 'ఎదిగినవా' చంద్రబాబులాగా?! ఇంత అభివృద్ధిలోనూ ఒక చెరపరాని పెద్ద హంసపాదు - "బొబ్బిలిదొర'', అతడి కుటుంబమూ, దౌర్జన్య భాషతో, బూతులతో 'దీపి'స్తున్న అతడి అనుచరవర్గమూ, వెరసి వీళ్ళు కేవలం స్వార్థప్రయోజనాల కోసం ప్రోత్సహించిన తెలంగాణాబిడ్డల ఆత్మహత్యలూనూ! అందుకే ఈ పరిణామాన్ని మనం 'దొర'ల స్వామ్యానికీ, ఇతర భూస్వాముల వర్గ స్వామ్యానికీ మధ్య సాగుతున్న కుల, వర్గ ఆధిపత్యపోరని నిర్థారణ చేస్తుకోవచ్చు! ఇందులో రెక్కాడితే గాని డొక్కాడని "పూటబత్తెమే పుల్లవెలుగు''గా ఉన్న ప్రజాబాహుళ్యానికి ఎలాంటి పాత్రాలేదు, లేదు, లేదు! ఆరుట్లవారి అంచనా ఆ రోజుకీ ఈ రోజుకీ అక్షరసత్యమే!

జగన్ పునరాలోచన!

  విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడమే వైసీపీ అధినేత జగన్ విధానంలా కనిపిస్తోంది. విభజన వాదం నుంచి సమన్యాయ వాదానికి మళ్ళీ అక్కడి నుంచి సమైక్య వాదానికి షిష్టయిన జగన్‌లో ఇప్పటికీ క్లారిటీ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమంటే విభజనకు అంగీకరించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. తమ పార్టీకి రాష్ట్ర విభజన ఇష్టం లేదు కాబట్టి ఆ సమావేశానికి తమ పార్టీ వెళ్ళబోదని జగన్ మొదట్లో ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం ఐడియా వచ్చిందోగానీ, తాజాగా జీఓఎం సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిగా మైసూరారెడ్డి వెళ్తారని ప్రకటించి రాష్ట్ర విభజన మీద తనకున్న మక్కువను బహిర్గతం చేశారు. ఆ సమావేశానికి మీ పార్టీ నుంచి సభ్యుడిని పంపితే విభజనకు ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నిస్తే, అబ్బే మైసూరారెడ్డి మీటింగ్‌కి వెళ్ళి విభజనకు ఒప్పుకోరు.. కేంద్ర మంత్రుల బృందాన్ని బాగా తిట్టి, వాళ్ళకి సమైక్య పాఠాలు బోధించి వస్తారని జగన్ వివరణ ఇచ్చాడు. అసలు  ఆ మీటింగ్‌కి వెళ్ళకపోతేనే రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు లెక్క! అలాంటప్పుడు ప్రత్యేకంగా మీటింగ్‌కి వెళ్ళి విభజనని వ్యతిరేకిస్తున్నామని చెప్పడమెందుకో కిందున్న జగన్మోహనరెడ్డికి, పైనున్న ఆ రాజశేఖరరెడ్డికే తెలియాలి. మైసూరాని మీటింగ్‌కి పంపాలని తాను తీసుకున్న నిర్ణయానికి సమైక్యవాదుల నుంచి, వైఎస్సార్ సీపీ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ వుండటంతో జగన్ మరోసారి తన విధానాన్ని మార్చుకునే ఉద్దేశంలో వున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. మొన్నటి వరకూ వీర తెలంగాణవాదిగా ముద్ర పడిన బీజేపీ కూడా మంత్రుల బృందం మీటింగ్‌కి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. అలాంటప్పుడు సమైక్యవాద పార్టీగా క్లెయిమ్ చేసుకుంటున్న తమ పార్టీ ఆ ‌మీటింగ్‌కి వెళ్తే సీమాంధ్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచన వైసీపీ పార్టీ వర్గాల్లో నలుగుతోంది. దాంతో మంత్రుల బృందం మీటింగ్‌కి తమ  పార్టీ నుంచి మైసూరాని పంపకుండా వుంటే ఎలా వుంటుందన్న దానిమీద పార్టీలో తీవ్ర స్థాయిలో తర్జన భర్జనలు జరుగుతున్నట్టు సమాచారం.

రాజీబాటలో ‘హర్రీ’కృష్ణ!

  తన పుత్రరత్నం జూనియర్ ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీలో సువర్ణ రత్నఖచిత సింహాసనం వేయట్లేదని నందమూరి హరికృష్ణ ఫీలవుతూ వుంటారు. ఆ అసంతృప్తిని అప్పుడప్పుడు వెళ్ళగక్కుతూ వుంటారు. ఆ అసంతృప్తిని మరింత బలంగా వ్యక్తం చేయడానికి సందర్భం కోసం ఎదురు చూసిన ఆయనకి సమైక్యాంధ్ర ఉద్యమం ఒక మంచి అవకాశంలా దొరికింది. దాంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాకుగాచూపించి తన రాజ్యసభ సభ్యత్వానికి హర్రీగా రాజీనామా చేశారు. అదేం ఖర్మోగానీ, ఆయన రాజీనామాని లటుక్కున ఆమోదించేశారు. ఊహించని పరిణామానికి హరికృష్ణ కంగుతిన్నారు. పదవి పోతేపోయింది.. సమైక్యాంధ్ర హీరోగా అయినా మిగులుతానులే అనుకుని సరిపెట్టుకున్నారు. ‘హర్రీ’కృష్ణ బ్యాడ్ లక్ ఏంటోగానీ, ఆయన చేసిన ‘త్యాగాన్ని’ ఎవరూ పట్టించుకోలేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన పేరుని తలుచుకున్నవాళ్ళే లేరు. హరికృష్ణ సమైక్యాంధ్ర ఉద్యమంలో దూకితే అద్భుతాలు జరుగుతాయని దురాశపడిన అమాయకులు కూడా ఎవరూ లేరు! అటు రాజ్యసభ సభ్యత్వం పాయె.. ఇటు రాజీనామా క్రెడిట్టూ దక్కకపాయె! మరోవైపు తాను రాజీనామా చేసినా చంద్రబాబు బావ ఎంతమాత్రం చలించక పాయె! దాంతో హరికృష్ణలో ఇప్పుడు పశ్చాత్తాపం మొదలైనట్టు తెలుస్తోంది. తండ్రి ఎన్టీఆర్ నుంచి ఆవేశాన్ని మాత్రమే వారసత్వంగా పొందిన హరికృష్ణలో ఇప్పుడు అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. అపర చాణక్యుడైన చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి తాను చెడిపోయి, తన పుత్రరత్నం జూనియర్ ఎన్టీఆర్‌ని చెడగొట్టడం కంటే రాజీబాటలో నడిచి పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో హరికృష్ణ వున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన హితబోధ కారణంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా మసలుతున్న జూనియర్ ఎన్టీఆర్‌ని మళ్ళీ తెలుగుదేశానికి చేరువ చేయడానికి హరికృష్ణ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. చంద్రబాబు తనయుడు లోకేష్‌తో ఎన్టీఆర్‌కి సఖ్యతని కుదర్చడం ద్వారా ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దాలని హరికృష్ణ భావిస్తున్నట్టు సమాచారం.

సీనియర్స్ ని కాదని శ్రీధర్ బాబుకి పట్టం కడితే

  రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాక ముందే తెలంగాణాకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి పదవుల కోసం టీ-కాంగ్రెస్ నేతలు గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొంది రాష్ట్రం ఏర్పడితే గానీ, ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ ఖరారు చేయడం సాధ్యం కాదు గనుక, పార్టీ పరంగా తెలంగాణాకు పీసీసీని ఏర్పాటు చేసి, అధ్యక్షపదవికి పేరు ప్రకటించినట్లయితే, శాసనసభలో తెలంగాణా బిల్లుపై ఏవిధంగా వ్యవహరించాలో నిర్ణయించుకోగాలమని, అంతే గాక ఎన్నికలకు సన్నాహాలు చేసుకోగలుగుతామని టీ-కాంగ్రెస్ నేతల గట్టిగా పట్టుబడుతుండటంతో టీ-పీసీసీ ఏర్పాటుకి కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడుతోంది.   అయితే వారి విజ్ఞప్తిని మన్నించినా, మాజీ పీసీసీ అధ్యక్షులు డీ. శ్రీనివాస్, షబ్బీర్ ఆలీ వంటి అనేక మంది సీనియర్లను, అనుభవజ్ఞులను పక్కనబెట్టి రాష్ట్రపౌర సరఫరా శాఖా మంత్రి శ్రీధర్ బాబుని డిల్లీకి పిలవడంతో వాళ్ళు కంగు తిన్నారు. యువతకు పెద్ద పీట వేస్తానని చెపుతున్న రాహుల్ గాంధీ అభీష్టం మేరకే శ్రీధర్ బాబుని డిల్లీ పిలిచినట్లు సమాచారం. అదే నిజమయితే, రానున్న ఎన్నికలలో ఇప్పుడున్న సీనియర్లలో ఎంత మందికి మళ్ళీ టికెట్స్ దొరుకుతాయో తెలియదు. ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తమ ముఖ్యమంత్రి కలలను సాకారం చేసుకోవాలని వారు భావిస్తుంటే ఇప్పుడు ఈ ‘యువ కారణం’ వలన అన్యాయం అయిపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఎన్నికల సమయంలో ఈ సీనియర్స్ పార్టీని తమ జూనియర్స్ ని ముప్పతిప్పలు పెట్టడం ఖాయం.

రాజకీయాలలో యాక్టివ్ గా నారా లోకేష్

      టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాగా యాక్టివ్ అవుతున్నట్లే. ఆయన ఏకంగా ఎన్నికల నిర్వహణకు సంబందించిన ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా టిడిపి యువ నేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. చంద్రబాబు నివాసంలో పార్టీ యువనేతలతో నారా లోకేష్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. వచ్చే నెల నుంచి చేపట్టనున్న యువసదస్సులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీవైపు యువతను ఆకర్షించాల్సిన అవసరం ఉందని, మాస్ ఓటర్లను పార్టీవైపు వచ్చేలా చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటారని టీఎన్ఎస్ఎఫ్ నేతలతో లోకేష్ అన్నట్లు సమాచారం.

ఏవీఎస్ కు చంద్రబాబు నివాళి

      ఫిల్మ్‌చాంబర్‌లో ఉన్న ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ భౌతికకాయాన్ని శనివారం ఉదయం పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏవీఎస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏవీఎస్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిజేశారు. ఈ సందర్భంగా ఏవీఎస్‌తో తమకున్న అనుంబంధాన్ని గుర్తు చేశారు. ఎంపీ నామానాగేశ్వరరావు, నన్నపనేని రాజకుమారి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, సినీ ప్రముఖులు దాసరి,అల్లు అరవింద్, వెంకటేష్, మురళీ మోహన్, జమున, జయసుధ, బ్రహ్మానందం,గుండు హన్మంతరావు, ఆర్.నారాయణమూర్తి, బుల్లితెర నటీనటులు తదితరులు ఏవీఎస్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

విభజనకు జగన్ ఓకే!

      ఢిల్లీ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు.. ఇలా ఇండియాలోని చాలా రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు తెలుగువాళ్ళ చెవుల్లో పూలు పెడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వేరే రాష్ట్రాల వాళ్ళు చాలరన్నట్టు తెలుగోడే తెలుగోడి చెవిలో పూలు పెడుతున్నాడు. ఆ తెలుగోడు ఎవరో కాదు... వైసీపీ నాయకుడు జగన్!   అయ్యగారు తనను తాను సమైక్యవాదినని చెప్పుకుంటూ వుంటారు. మరోవైపు విభజనకు తనవంతు సహకారం తాను అందిస్తూ వుంటారు. జగన్  ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సిద్ధమైంది. అంత దారుణానికి సహకరించి కూడా తాను తాను సమైక్యవాదినని చెప్పుకుంటున్న జగన్ తెలుగు ప్రజల చెవుల్లో  క్యాలీఫ్లవర్లు  పెడుతున్నాడు. రాష్ట్ర విభజన విషయంలో జగన్ కర్ణపుష్పన్యాయం మరోసారి బయటపడింది.  రాష్ట్ర విభజన గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సమావేశాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, తమ పార్టీ నుంచి ఆ మీటింగ్‌కి ఎవరూ వెళ్ళరని జగన్ చెప్పాడు. ఆ మీటింగ్‌కి వెళ్తే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్టే అవుతుందని, తాను కనీవినీ ఎరుగనంత సమైక్యవాదిని కాబట్టి తమ పార్టీ మీటింగ్‌తో పాల్గొనదని జగన్ తియ్యగా చెప్పాడు. కొంతమంది అమాయకులు చెప్పిన మాటలు నమ్మేశారు. అయితే తాజాగా జగన్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. జీవోఎం ఏర్పాటు చేసిన సమావేశంలో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. ఆ సమావేశానికి వైసీపీ తరఫున మైసూరారెడ్డి పాల్గొంటారట. ఆయన ఆ మీటింగ్‌లో సమైక్య గళాన్ని మంత్రుల బృందంలో వున్నవాళ్ళ కర్ణభేరి పగిలిపోయేంత గట్టిగా వినిపిస్తారట. మంత్రుల బృందం మీటింగ్‌కి వెళ్తే విభజనకు ఓకే అన్నట్టే అని వక్కాణించిన జగన్ ఇప్పుడు ఆ మీటింగ్‌కి తన పార్టీ నుంచి ప్రతినిధిని పంపిస్తున్నాడంటే రాష్ట్ర విభజనకు జగన్ అధికారికంగా ఓకే చెప్పినట్టే భావించాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నేను ఎప్పటికీ సమైక్యవాదినే: కిరణ్

      ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని, తాను రాష్ట్ర విభజనకు అంగీకరించానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని ప్రకటించారు.   ఏంటీ డ్రామాలు? ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు, ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సొంత ప్రాపర్టీనా? ఒకపక్క తెలుగు ప్రజల గుండెలు మండిపోతూ వుంటే ఇలాంటి చెలగాటాలు ఆడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు పద్ధతి కాదు. దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలుచుకుంటే తనని తరిమికొట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి చేసుకుంటే మంచిది. తెలుగు ప్రజలతో ఇంకా ఆడుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆటలని తెలుగు ప్రజలు త్వరలో కట్టిస్తారు.

తెలంగాణ వద్దట!

      ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం కావాల్సిందేనని పట్టుపట్టిన విభజన వాదుల నోటి వెంట తెలంగాణ వద్దనే మాటలు కూడా వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో పార్టీలతో నిమిత్తం లేకుండా తెలంగాణ వాదులంతా ‘మాకు తెలంగాణ వద్దు బాబోయ్.. సమైక్యంగానే ఉంటాము దేవుడోయ్’ అని మొత్తుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి శుభారంభంగా ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నోటి వెంట ‘ఇలాగైతే తెలంగాణ వద్దు’ అనే మాటలు వచ్చాయి.   ఆ ఇద్దరు నాయకులు ఎవరో కాదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆమోస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ! కేంద్ర రాజకీయాలు మొన్నటి వరకు విభజనవాదులకు అనుకూలంగా సాగాయి. రెండు రోజుల నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. జరుగుతున్న ఒక్కో పరిణామం  విభజనవాదుల గొంతులో వెలక్కాయ మాదిరిగా తయారవుతోంది. రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఎలా వుండాలో నిర్ణయించే టాస్క్ ఫోర్స్ నివేదిక బయటకి వచ్చింది. అలాగే ఆంటోనీ కమిటీ తన నివేదిక రెడీ చేసింది. నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. టాస్క్ ఫోర్స్ నుంచి, ఆంటోనీ నుంచి వచ్చిన నివేదికలలో ప్రస్తావించిన ప్రతిపాదనలు విభజనవాదుల గొంతెమ్మ కోర్కెలకు వ్యతిరేకంగా వున్నాయి.  సీమాంధ్రుల ఆవేదనను అర్థం చేసుకున్నట్టు, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా వున్నాయి.  ఇప్పటి వరకు సీమాంధ్రుల నెత్తిన తెల్లగుడ్డ వేసి  హైదరాబాద్‌లో నుంచి పంపేసే ఆలోచనలో వున్న విభజన వాదులకు ఇవి షాకిచ్చాయి. వాళ్ళ విభజనోత్సాహం మీద నీళ్ళు పోశాయి. దాంతో వెంటనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆమోస్ మీడియా ముందుకు వచ్చేశాడు. ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రతిపాదనలతో తెలంగాణ బిల్లు రూపొందిస్తే తెలంగాణ ఇచ్చీ వేస్టన్నాడు. ఈ పద్ధతిలో అయితే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేదన్న మాట ఆయన నోట్లోంచి బయటపడింది. అదేవిధంగా, కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం రాజనర్సింహ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించేట్టయితే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేదని ఆవేశంగా అన్నట్టు సమాచారం. ఈమాత్రం దానికే తెలంగాణ వద్దన్న మాటలు వస్తున్నాయి. రేపు హైదరాబాద్ గురించి ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయో, అప్పుడు విభజనవాదులు ఎలా స్పందిస్తారో!