రూ.10,250కే రాజ్యసభ సీటు!

  ప్రస్తుత రాజకీయాలలో నెగ్గుకు రావాలంటే అంగబలం, అర్ధబలం చాలా అవసరమని అందరికీ తెలిసిన విషయమే. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజాసేవ ఇవ్వన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి మన రాజకీయ నాయకులు అలవాటులో పొరపాటుగా చెప్పే మాటలయితే, టికెట్ల కోసం, మంత్రి పదవుల కోసం, అధికారం కోసం, కాంట్రాక్టుల కోసం వారు చేసే పైరవీలు పచ్చియదార్ధమని ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ, కులం, మతం, ప్రాంతం వగైరా వగైరా బలహీనతలతో బాధపడుతున్న ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలవడం రాజకీయ నాయకులకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య గనుక, ప్రజల మద్దతు గురించి వారెన్నడూ దిగులు పడలేదు. పడరు కూడా. ఆ దైర్యంతోనే వారు చట్ట సభలలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. టికెట్స్ కోసం పైరవీలు చేసుకొంటూ గెలవడానికి ఎంత ఖర్చు పెడుతున్నామో నిర్లజ్జగా ప్రకటిస్తున్నారు.   ఇటీవల శాసనసభ ఆవరణలో జేసి దివాకర్ రెడ్డి మరి కొందరు శాసనసభ్యుల మధ్య రాజ్యసభ సీటు కోసం దాదాపు కోటి రూపాయలు ఖరీదు చేసే వోల్వో బస్సులను బహుమతులుగా పంచడంపై జరిగిన చర్చ గురించి మీడియాలో ప్రజలందరూ చూసే ఉంటారు. మన రాజకీయ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో, ప్రజాస్వామ్యం ఎంత ఖరీదయినదో ఇది స్పష్టం చేస్తోంది.   రాజ్యసభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నచైతన్యరాజు నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ ఇంటర్వ్యులో పాల్గొన్నప్పుడు, సదరు చానల్ వాళ్ళు “నలబై కోట్లు ఖర్చు చేయలేకనే జేసీ దివాకర్ రెడ్డి డ్రాపయిపోయితే, మీరయితే అంత ఖర్చు చేయగలరనే మిమ్మల్ని అభ్యర్ధిగా నిలబెట్టారట కదా? అని ప్రశ్నించినప్పుడు ఆయన, “నాది, నా భార్యదీ కలిపినా అంత మొత్తం ఆస్తి లేదు. నేను కేవలం రూ.250 పెట్టి ఒక దరఖాస్తు, రూ.10వేలు డిపాజిట్ మాత్రమె కట్టాను” అని గడుసుగా జవాబిచ్చారు.   జేసీ లెక్క ప్రకారం ఒక శాసనసభ్యుడి మద్దతు ఖరీదు ఒక వోల్వో బస్సు అనుకొంటే, మరి చైతన్యరాజు గెలవడానికి కనీసం 36 నుండి 39మంది సభ్యుల మద్దతు అవసరమయితే దానికి ఎంతవుతుందో ఆ మాష్టారుకి తెలియకపోదు. అయినా, కేవలం రూ.10,250 తో రాజ్యసభకు పోటీచేస్తున్నాని చెప్పడం, ప్రజలని కూడా ఆయన చిన్న పిల్లలనుకొని పాటాలు చెప్పబోవడమే అవుతుంది. ఏమయినప్పటికీ, ఆయనకీ మద్దతుగా సంతకాలు పెట్టినవారిలో కొందరు పార్టీ నుండి హెచ్చరికలు అందుకొన్నాక తమ మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ఎన్నికల అధికారికి లేఖలు వ్రాసారు. చైతన్యరాజు ఎలాగూ కేవలం రూ.10,250 మాత్రమే ఖర్చు చేసానని చెప్పుకొంటున్నారు గనుక, ఒకవేళ ఓడిపోయినా పెద్దగా బాధపడనవసరం కూడా ఉండదు.

మోత్కుపల్లి శాంతించారా?

      రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కొంత శాంతించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు మోత్కుపల్లిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడాలని మోత్కుపల్లి అనుకున్నారు. ఇంతలో పార్టీ నేతలు వచ్చి తనను కలవడంతో ఆయన ఆ యోచన విరమించుకొన్నారు.   అయితే పార్టీ నేతల వద్ద ఆయన మరోసారి తన బాధను వ్యక్తం చేశారు. తనకు సర్దుబాటు చేసే పరిస్ధితి లేకపోతే కొంత ముందుగానే చెప్పి ఉంటే బాగుండేదని, కాని ఆఖరి నిమిషం వరకూ తేల్చకపోవడంతో తన ప్రతిష్ట దెబ్బ తిందని ఆవేదన వెలిబుచ్చారు. తన వంటి సీనియర్ల విషయంలో బాబు తన మనసులోని మాటను బహిరంగంగా చెప్పాలని, చెప్పలేకపోతే ఇలాగే బాధపడాల్సి వస్తుందన్నారు.    మోత్కుపల్లికి ఇవ్వలేకపోయినందుకు చంద్రబాబు కూడా బాధపడుతున్నారని, కొన్ని సమీకరణాల వల్ల ఈ సమస్య వచ్చింది తప్ప వేరే ఆలోచన లేదని పార్టీ నేతలు ఆయనకు నచ్చజెప్పారు. కాగా, వచ్చి తనను కలవాలని చంద్రబాబు ఈ నేతల ద్వారా ఆయనకు కబురు చేశారు. అయితే, తాను ఇప్పుడే రాలేనని, తర్వాత వచ్చి కలుస్తానని మోత్కుపల్లి తెలిపారు.  

మోత్కుపల్లి కాంగ్రెస్ వైపు చూస్తున్నాడా?

      రాజ్యసభ సీటు దక్కపోవడంతో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును బుజ్జగించడానికి టిడిపి పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు కనిపించడం లేదు. మోత్కుపల్లిని సముదాయించేందుకు ఆ పార్టీ సీనియర్ నేతల ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, నామా నాగేశ్వర రావు, మహేందర్‌రెడ్డి తదితరులు మోత్కుపల్లి నివాసానికి వచ్చినప్పుడు తన ఆవేదనను నర్సింహులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.   ''ఏడాది నుండి నీకె రాజ్యసభ సీటు ఇస్తాను అని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు నన్ను మోసం చేశాడు. ఈ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీలో ఉండడంకన్నా కట్టెలమ్ముకోవడం మేలు” అని మోత్కుపల్లి వాపోయాడట. మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని రాజకకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి జానారెడ్డి రాయబారం ద్వారా కాంగ్రెస్ లో ప్రవేశించవచ్చని ప్రచారం జరుగుతోంది.  అయితే పార్టీ మారే విషయంలో మాత్రం మోత్కుపల్లి ఇంకా నిర్ణయం తీసుకోలేదట.

ఆ ముగ్గురూ

  కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని, ఒకరినొకరు ఎంత తీవ్రంగా విమర్శించుకొన్నా, సమయంవస్తే అధిష్టానం అందరినీ ఒక్కత్రాటిపైకి తీసుకురాగలదని రాజ్యసభ నామినేషన్ల ఘట్టం రుజువు చేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన నిర్ణయాన్నే తప్ప, అధిష్టానాన్నివిమర్శించడం లేదని దిగ్విజయ్ సింగ్ మొదలు ముకుల్ వాస్నిక్ వరకు చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఆయనకు క్లీన్ సర్టిఫికెట్లు జారీ చేసారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖించడమంటే పార్టీని వ్యతిరేఖిస్తున్నట్లు కాదని అందరూ కలిసి ఒక కొత్త సిద్దాంతాన్ని బాగానే కనిపెట్టారు.   ఈ సిద్దాంతం ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి నేటికీ పార్టీకి విధేయుడు, విశ్వసనీయుడు, క్రమశిక్షణ గల నాయకుడే గనుక, ఆయన కూడా ఈరోజు పార్టీ రాజ్యసభ అభ్యర్ధుల నామినేషను పత్రాలు దాఖలు చేయడానికి వచ్చారు. ఇక, ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి పనికిరాడని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని గట్టిగా కోరే ఆయన బద్ధ శత్రువు దామోదర రాజనరసింహ కూడా ఆయనతో కలిసి వచ్చారు. వీరిరువురికీ ఉమ్మడి శత్రువయిన బొత్ససత్యనారాయణ కూడా వారితో కలిసివచ్చి ఈ అధికారిక తంతు సక్రమంగా, సజావుగా పూర్తి చేయించారు. ఈవిధంగా ముగ్గురు బద్ద శత్రువులు  పార్టీకోసం తమ బెషజాలను, అహాన్ని పక్కనపెట్టి కలిసిరావడం కేవలం కాంగ్రెస్ లోనే సాధ్యమేమో!

రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు

  ఆరు రాజ్యసభ సీట్లకు మొత్తం 8మంది అభ్యర్ధులు రంగంలో మిగలడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులలో గుబులు మొదలయింది. కాంగ్రెస్ పార్టీ తరపున-సుబ్బిరామి రెడ్డి, యం.ఏ.ఖాన్, కేవీపీ రామచంద్ర రావు బరిలో ఉండగా, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో యం.యల్సీ. చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్స్ దాఖలు చేసారు. గమ్మతయిన విషయం ఏమిటంటే, రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానాన్నిగట్టిగా ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముగ్గురూ కలిసి పార్టీ అభ్యర్ధుల నామినేషన్ దాఖలు చేయించారు. ఇక, ముప్పై మంది సీమాంధ్ర శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పుకొన్నస్వతంత్ర అభ్యర్ధి చైతన్యరాజు నామినేషన్ ఫారంపై కేవలం 10 మంది మాత్రమే సంతకాలు చేసినట్లు తాజా సమాచారం.   బొత్ససత్యనారాయణ వారిని వెంటనే తమ మద్దతు ఉపసంహరించుకోమని, లేకుంటే కటిన చర్యలు తప్పవని హెచ్చరించి, వారినందరినీ ఈరోజు సాయంత్రంలోగా తనను కలిసి సంజాయిషీలు ఇవ్వవలసినదిగా ఆదేశించారు. ఇక టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ తాము పార్టీ అభ్యర్ధికే మద్దతు ఇస్తున్నామని, ఎవరయినా తాము స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. తద్వారా అయన కూడా పార్టీకి లొంగిపోయినట్లే!   సీమాంధ్ర సభ్యుల వ్యతిరేఖతను దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ అధిష్టానం తన మిగిలిన శాసనసభ్యులను తెరాస అభ్యర్ధి కేశవ్ రావుకి మద్దతు ఇద్దామనే ఆలోచనతో ముగ్గురినే రంగంలోకి దించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అదుపులోకి రావడంతో టీ-కాంగ్రెస్ నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు నాలుగో అభ్యర్ధిని కూడా రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతోంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి కేవలం మరొక అరగంట సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, బొత్స, కిరణ్, దామోదరలు ముగ్గురు నాలుగో అభ్యర్ధిని నిలబెట్టడం గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా పార్టీ అభ్యర్దులచేత నామినేషన్స్ దాఖలు చేయించారు గనుక, ఇక తిరుగుబాటు అభ్యర్దులిరువురూ వెనక్కి తగ్గకపోయినా, వారికి సీమాంధ్ర కాంగ్రెస్ శాసన సభ్యులెవరూ కూడా మద్దతు ఈయకపోవచ్చును.   అదేవిధంగా కాంగ్రెస్ తన నాలుగో అభ్యర్ధిని కూడా రంగంలోకి దించినట్లయితే, తెరాస అభ్యర్ధి కేశవ్ రావు ఇక కాంగ్రెస్ మద్దతుపై ఆశలు వదులుకోక తప్పదు. ప్రస్తుతం ఆయనకి తెరాస-17, తెదేపా నుండి తెరాసలోకి వచ్చినవారు-5, సీపీఐ-4మంది సభ్యుల మద్దతు ఉంది. ఇంకా కనీసం మరో 10మంది మద్దతు అవసరం ఉంది. బీజేపీ-3, మజ్లిస్-7మంది సభ్యుల మద్దతు ఇచ్చినట్లయితే అయన గెలవగలరు.

'ఫిబ్రవరి 21' కాంగ్రెస్ ఖతం: లగడపాటి

      పార్లమెంట్ సమావేశాలకు చివరి రోజైన ఫిబ్రవరి 21తో కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో డిపాజిట్లు దక్కవని గుంటూరులో హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే సీమాంధ్ర, తెలంగాణ రెండూ నష్టపోతాయి. సీమాంధ్రకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మాకు రాజకీయ భవిష్యత్ లేకున్నా ఎలాంటి నష్టం లేదు. మా భవిష్యత్ కన్నా రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అని లగడపాటి అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు.

మోత్కుపల్లి ఆగ్రహం: టిడిపిని వీడుతారా!!

      రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం కలిపించకపోవడంపై పార్టీ అధినేత చంద్రబాబుపై టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీని కూడా వీడే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన నాయకులతో, తన వర్గంతో మంతనాలు జరుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాబు తెల౦గాణ టిడిపి నేతలను ఆయన ఇంటికి పంపించారు. ప్రస్తుతం పార్టీలో వున్న పరిస్థితులను అర్ధం చేసుకోవాలని..భవిష్యత్తులో మంచి స్థానం కలిపిస్తారని బుజ్జగిస్తున్నారు. అయితే, ఆయన బుజ్జగింపులకు తగ్గే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఆయన ఒకటి గంటలకు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ సుబ్బిరామి రెడ్డి గెలిచినట్లా, ఓడినట్లా?

  కాంగ్రెస్ అధిష్టానం సుబ్బిరామి రెడ్డి రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆయన కంగు తిన్నారు. ఆయన గతః ఏడాదిగా వైజర్ లోక్ సభ సీటు కోసం సిట్టింగ్ యంపీ పురందేశ్వరితో మాటల యుద్ధం చేస్తున్నారు. వైజాగ్ తో, అక్కడి ప్రజలతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని, తాను వైజాగ్ కోసం, అక్కడి ప్రజల కోసం చాలా సేవలు చేశానని, అందువల్ల వైజాగ్ సీటుపై న్యాయంగా తనకే సర్వహక్కులు ఉన్నాయని వాదించారు. అంతేగాక వైజాగ్ సీటుని తనకే ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం తనకు చాలా కాలం క్రితమే మాటిచ్చిందని, అదొక దేవ రహస్యమని ఆయన అన్నారు. అందువల్ల, పురందేశ్వరిని పొరుగునున్న ఏ నరసాపురం నియోజక వర్గానికో మారిపొమ్మని ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చారు. కానీ, ఆయనకు పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు చాలా ఘాటుగా బదులీయడంతో సుబ్బిరామి రెడ్డి రూ.10కోట్లకు పరువు నష్టం దావా కూడా వేస్తానని బెదిరించారు. దానికీ వెంకటేశ్వర రవు ‘సై’ అనడంతో సుబ్బిరామి రెడ్డి ఇక వెనక్కి తగ్గక తప్పలేదు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన వైజాగ్ లో సినిమా హీరోలతో క్రికెట్ మ్యాచులు, కళాకారులకు సన్మాన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తూ, వాటి గురించి వైజాగ్ లో పెద్దగా ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన వైజాగ్ ప్రజలకు చేస్తున్న సేవలు, దానధర్మాలు, ధర్మకార్యాల గురించి వివరిస్తూ ఆయన ఫోటోలతో కూడిన పెద్దపెద్ద బ్యానర్స్ గత రెండు మూడు వారాలుగా వైజాగ్ అంతటా వెలిసాయి.   కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనను మళ్ళీ రాజ్యసభకే నామినేట్ చేయడంతో ఆయన చేసిన ఈ ప్రయత్నాలు, పురందేస్వరితో చేసిన యుద్ధం అన్నీ కూడా వృధా అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆయనకు సీమాంధ్ర కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధుల నుండి పోటీ ఎదుర్కోక తప్పదు. అధిష్టానం ఆయనను రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ ఖాయం చేసినప్పటికీ, అధిష్టానం మాటవిని వారందరూ ఆయనకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయనే స్వయంగా పూనుకొని సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకోవలసి ఉంటుంది. ఇక, పురందేశ్వరిని నరసాపురం తరలిపొమ్మని చెప్పిన ఆయన వైజాగ్ లోక్ సభ సీటుని ఆమెకే వదిలిపెట్టి తనే ఇప్పుడు రాజ్యసభకు పోక తప్పడంలేదు. ఆయనను తిరిగి రాజ్యసభకు పంపడంతో అధిష్టానం వద్ద ఆమెకి ఎంత పట్టు ఉందో కూడా స్పష్టమయింది.   అందువల్ల తను తిరిగి రాజ్యసభ సీటు పొందినందుకు సంతోషించాలో లేక తను ముచ్చట పడిన లోక్ సభ సీటు తన ప్రత్యర్ధికి వదిలిపెట్టవలసి వచ్చినందుకు బాధ పడాలో తెలియని పరిస్థితి ఆయనది. ఒకవిధంగా ఇది ఆయనకు ఓటమి క్రిందే లెక్క. గనుక, పురందేశ్వరికి టికెట్ రాకుండా అడ్డుపడటమో, వీలుకాకపోతే ఎన్నికల సమయంలో ఆమెకు తన అనుచరుల ద్వారా పొగ బెట్టడమో చేస్తారేమో!

టిడిపి రాజ్యసభ అభ్యర్ధులు: గరికపాటి, తోట సీతారామలక్ష్మి

      టిడిపి రాజ్యసభ అభ్యర్ధులుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిలను చంద్రబాబు ప్రకటించారు. వీరిద్దరివీ పార్టీ కుటుంబాలు. 30 ఏళ్ల నుంచి పదవి ఉన్నా లేకపోయినా పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని తీసుకొని పని చేస్తున్నారని, అలా పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు పార్టీలో గుర్తింపు, గౌరవం, అవకాశాలు ఉంటాయన్న నమ్మకం కలిగించడానికే వీరిని ఎంపిక చేశామని ఆయన అన్నారు. కాపు సామాజిక వర్గం టిడిపి వైపు మొగ్గు చూపుతోందని, తమ పార్టీలో వారికి తగిన అవకాశాలు ఉంటాయన్న విశ్వాసం, నమ్మకం కలిగించడం కోసం సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని చెప్పారు. బిసిలకు ఏ నష్టం లేకుండా కాపులను ఆదుకోవడానికి మేం కృషి చేస్తామని అన్నారు.

రాజ్యసభ పోరు రసవత్తరం: తెరపైకి టీఎస్ఆర్

      తెలంగాణ అంశంపై రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై తీవ్ర ఒత్తిడిలో వున్న కాంగ్రెస్ పార్టీ...రాజ్యసభ కు మళ్ళీ సిట్టింగ్ ఎంపీలకే అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, టి.సుబ్బిరామిరెడ్డిల పేర్లను ప్రకటించింది. కేవీపీ, ఖాన్‌లకు మరో విడత ఖాయమని తొలినుంచీ వార్తలు వస్తున్నా అనూహ్యంగా సుబ్బిరామిరెడ్డికీ మళ్లీ చాన్స్ దక్కడం గమనార్హం.   సీమాంధ్రలో తిరుగుబాటు ఆందోళన విషయంలో సురక్షితంగా ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో కేవీపీ, సుబ్బిరామిరెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.  సమైక్యాంధ్ర నినాదంతో బరిలో నిలిచేందుకు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, విద్యాసంస్థల అధిపతి చైతన్యరాజు సిద్ధమవుతున్నారు. మరో నేత ఆదాల ప్రభాకర రెడ్డి సైతం తనకు మద్దతుగా సంతకాల సేకరణ జరుపుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు చీలిపోయి, తమ ఓట్లకు చిల్లు పడుతుందని కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి రాకుండానే సీమాంధ్రకు చెందిన కేవీపీ, సుబ్బిరామిరెడ్డిలను అభ్యర్థులుగా ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఎవరెవరు నామినేషన్లు వేస్తారో..ఎవరు ఉప సంహరించుకుంటారు, అంతిమంగా ఎవరు బరిలో నిలుస్తారో 31వ తేదీన స్పష్టమవుతుంది.  

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులు వీరేనా!!

      రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి కేవీపి రామచంద్రారావు, ఎంఎ ఖాన్, కొప్పులరాజు పేర్లను ఖరారు చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. వారి పేర్లను ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కెవిపి రామచంద్ర రావును నిలబెడితే ఎక్కువ మంది మద్దతిచ్చే అవకాశం ఉండటమే కాకుండా కొంత రెబల్ సమస్య తగ్గే అవకాశముంది. ఈ కారణంతో అధిష్టానం కెవిపి పేరును మరోసారి తెరపైకి తీసుకు వచ్చిందంటున్నారు. మరోవైపు రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితాను అధిష్టానం అధికారికంగా విడుదల అయ్యాక తమ నిర్ణయం తెలియజేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తాను, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి ఎవరో ఒకరు బరిలో ఉంటామని ఆయన జేసీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతల మాటల మతలబేమిటో

  రాష్ట్ర విభజన అంశాన్నిభుజానికెత్తుకొన్నకాంగ్రెస్ అధిష్టానం, అది తనకెంత భారంగా ఉన్నాకూడా ఇంతవరకు కాడి క్రిందన పడేయకుండా ప్రయాసపడుతూ మోసుకుపోతోంది. అంటే దానర్ధం తెలంగాణా ఏర్పాటు పట్ల దానికెంతో నిబద్దత ఉందని కాదు. ఉన్నట్లు నటిస్తోంది అంతే! బీజేపీ మద్దతు లేనిదే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందదని తెలిసి ఉన్నపటికీ, ప్రతీ కాంగ్రెస్ నాయకుడు కూడా “తెలంగాణా బిల్లును పార్లమెంటులో తప్పకుండా ప్రవేశపెడతాము, ఆమోదింపజేస్తాము” అంటూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ముహూర్తాలు కూడా తరచు ప్రకటించడం కూడా ఈ జగన్నాటకంలో భాగమే. ఒక అబద్దాన్ని పదిమంది పదిసార్లు పదిమందికి చెపితే నిజమవుతుందన్నట్లు, కాంగ్రెస్ అధిష్టానం తాను స్వయంగా తెలంగాణా ఏర్పాటు చేసే స్థితిలో లేకపోయినా, తెలంగాణా ఏర్పాటు చేస్తానని పదేపదే గట్టిగా చెపుతుండటం వలన, కాంగ్రెస్ నిజంగానే చాలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు ప్రజలు భావించే అవకాశం ఉంది. భావిస్తున్నారు కూడా. అందుకు టీ-కాంగ్రెస్ నేతలు కూడా “తెలంగాణా ఇచ్చేది తెచ్చేది తామేనంటూ”, కాంగ్రెస్ అధిష్టానానికి (ఉడతా) భక్తిగా పక్కవాయిద్యాలు వాయిస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు.   అందువల్ల బీజేపీ పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడేందుకు కాంగ్రెస్ చాలా ముందు నుండే ఈ వ్యూహం అమలు చేస్తోంది. ఒకవేళ ఏ కారణంగానయినా పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందలేకపోయినా కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అతి నిజాయితీని చూసి తెలంగాణా ప్రజలు “తెలంగాణా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పాపం! చాలా నిజాయితీగా చాలా గట్టిగానే కృషిచేసింది. కానీ, ఆ దుష్ట బీజేపీ మద్దతు ఈయకపోతే తను మాత్రం ఏమి చేయగలదు పోనీలే పాపం!” అని క్షమించి ఓట్లేస్తారని కాంగ్రెస్ (దురా)లోచన.   ఒకవేళ బీజేపీ నిజంగానే బిల్లుకి మద్దతు ఇచ్చినా కూడా మంచిదే. టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నట్లు “తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది తామేనని” డంకా భజాయించి చెప్పుకొని మరీ ప్రజలని ఓట్లు అడగవచ్చును. ఇంకా చెప్పుకోదలిస్తే తాము బీజేపీ కొమ్ములు ఏవిధంగా వంచి తెలంగాణాకి మద్దతు ఇప్పించిందీ కధలు కధలుగా చెప్పుకొని ఓట్లు నొల్లుకోవచ్చును.   అందువల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రదర్శిస్తున్న ఈ అతి నిజాయితీ, నిబ్బదత అంతా కూడా ఒకవేళ బిల్లుని ఆమోదింపజేయలేకపోతే తాము వచ్చే ఎన్నికలలో సురక్షితంగా లేదా తక్కువ నష్టంతో బయటపడేందుకే తప్ప, తెలంగాణా ప్రజల పట్ల వెర్రి అభిమానంతో తెలంగాణా ఏర్పాటు చేసేయాలనే ఆలోచనతో మాత్రం కాదు.

శాసన సభలోగందరగోళం..స్పీకర్ కు సలహా

      సోమవారం ఉదయం శాసన సభ ప్రారంభం అయిన కాసేపటికే గందరగోళం చెలరేగటంతో వాయిదా పడింది. సభలో పలు తీర్మానాలు చేయాలని సభ్యులు ఇచ్చిన వినతిపత్రాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అదే విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును కూడా తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తూ పోడియం చుట్టుముట్టారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని, బిల్లును వెనక్కి పంపాలని సీమాంధ్ర నేతలు పోడియం చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం రేగింది. సభలో చర్చ జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు సహకరించకపోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.   మరోవైపు సభాపతి నాదెండ్ల మనోహర్‌కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రపతి పంపించింది డ్రాఫ్ట్ బిల్లు కాదని అసలు బిల్లేనని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా నోటీసు ఇచ్చారని, దానిని తిరస్కరించాలని కోరారు. నోటీసు పైన తుది నిర్ణయం స్పీకర్‌దేనని చెప్పారు. మరోవైపు కిరణ్ ఇచ్చిన లేఖను తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత మంత్రులు మరోసారి సభాపతికి లేఖ రాశారు.  

మెజార్టీతో గెలిపించండి: రాష్ట్రపతి

  గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశ్యించి ప్రసంగించిన రాష్ట్రపతి “వచ్చేఎన్నికలలో ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమయిన మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉందని, అప్పుడే దేశంలో స్థిరమయిన రాజకీయ వ్యవస్థ ఏర్పడి, దేశం అన్ని రంగాలలో నిలకడగా అభివృద్ధి సాధించగలదని” అన్నారు. రాహుల్-మోడీల రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించబోయే వచ్చేఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక, ఆ రెండు పార్టీల మధ్య జరిగే తీవ్రమయిన పోటీలో దేశప్రజలు రాహుల్-మోడీల మధ్య రెండుగా చీలిపోతే ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవచ్చని ఆయన అభిప్రాయం కావచ్చును.   గత పది సం.లలో దేశంలో ప్రాంతీయ పార్టీలు బాగా బలపడటంతో, అవి కేంద్రప్రభుత్వ మనుగడను కూడా శాసించే స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు పేరుకి జాతీయపార్టీలే అయినా, వాటంతట అవి పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితులు లేవు. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలన్నాతప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, రాజకీయాలలో, పార్టీలలో, ప్రజాప్రతినిధులలో నైతిక విలువలు దిగజారిన ఈ పరిస్థితుల్లో, కేంద్రానికి మద్దతు ఇస్తున్నకారణంగా ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా పెద్దన పాత్ర పోషిస్తున్నకారణంగా కేంద్రం ప్రాంతీయ పార్టీలను తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఒకరినొకరు తరచు చెయ్యి మెలిపెట్టుకొంటూ పరిపాలన సాగిస్తుంటే కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా బలహీనమయిన ప్రభుత్వాలు ఏర్పడటం వలన దేశ అభివృద్ధి కుంటుపదుతుంది. గనుకనే, ప్రజలందరూ సరయిన పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టాలని రాష్ట్రపతి కోరారు.   కాంగ్రెస్, బీజేపీలు ఆయన సూచనను ఆహ్వానించినప్పటికీ, రెంటికీ గెలుపు అత్యావశ్యకం గనుక పోటాపోటీగా ప్రచారం చేసి ప్రజలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నం చేస్థాయి. వీటికి తోడు ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలతో వాటి పొత్తులు, ప్రాంతీయ సమస్యల తీవ్ర ప్రభావంతో ప్రజలు కూడా ఆ రెండు పార్టీల మధ్య చీలిపోవడం ఖాయం. కానీ ఇంతవరకు వెలువడుతున్న సర్వేలనీ దేశ వ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ సారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోయినట్లయితే, ఆయనకి మళ్ళీ ఎప్పుడూ ఆ అవకాశం వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు గనుక, వచ్చేఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. ఆ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కానీ ఎవరికి పట్టం కట్టదలచుకొన్నా పూర్తి మెజార్టీతో పట్టం కట్టమని రాష్ట్రపతి సలహా.

అండమాన్ లో పడవ బోల్తా: 32మంది మృతి

      బంగాళఖాతం సముద్ర౦లో పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడడంతో 32మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 45 మందికి పైగా పర్యాటకులున్నారని స్థానిక వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పడవ సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చర్యలు చేపట్టారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. పర్యాటకుల్లో 30 మందితోకూడిన ఒక బృందం తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందినవారని... ప్యాకేజీ టూర్‌పై గురువారంనాడు పొర్ట్ బ్లెయిర్‌కు వచ్చారు. ఈ దుర్ఘటనపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం లక్ష పరిహారంగా ప్రకటించింది.

ఆప్ నుంచి ఎమ్మెల్యే బిన్నీ సస్పెండ్

      ఆమ్ ఆద్మీ పార్టీ తమ రెబెల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించింది. అధినేత కేజ్రీవాల్ పైన తీవ్రవిమర్శలు చేసి క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించడంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తనను పార్టీ నుండి బహిష్కరించడంపై బిన్నీ స్పందించారు. ఢిల్లీ సమస్యల పైన తాను మాట్లాడానని, అలాంటప్పుడు వారు తనను పార్టీ నుండి తొలగించడం కంటే మించి ఏమీ చేయలేరని విమర్శించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పైన బిన్నీ కొద్దిరోజుల క్రితం తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్, తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎఎపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. కేజ్రీవాల్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటిగా ఉందన్నారు. హామీల అమలును కేజ్రీవాల్ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.

ముఖ్యమంత్రి తీర్మానంపై సభలో ప్రతిష్టంభన

  శాసనసభ, శాసనమండలిలో తెలంగాణా సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు అరగంటసేపు వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఇచ్చిన తీర్మానాన్ని సభలో ప్రేవేశపెట్టవద్దంటూ తెరాస నేతలు ఇచ్చిన తీర్మానాన్ని సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంతో తెరాస నేతలు సభలో ఆందోళనకు దిగారు. టీ-కాంగ్రెస్, టీ-తెదేపా, తెరాస సభ్యులందరూ ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న తీర్మాన్న్ని ముక్తకంఠంతో వ్యతిరేఖిస్తున్నందున బహుశః మిగిలిన నాలుగు రోజులు కూడా ఉభయ సభలలో బిల్లుపై ఇక ఎటువంటి చర్చజరుగకపోవచ్చును. ఈ సమస్యను పరిష్కరించేందుకు సభాపతి బిజినస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చును. గనుక, ఇక బిల్లుపై ఎటువంటి చర్చ, తీర్మానం, ఓటింగ్ జరగకుండానే రాష్ట్రపతికి త్రిప్పి పంపబడే అవకాశాలే ఎక్కువ. బహుశః కేంద్రం కూడా అలాగే జరగాలని కోరుకొంటోందేమో.

రాజ్యసభ ఎన్నికలతో చంద్రబాబుకు తలనొప్పులు

  తెలుగుదేశం పార్టీకి ఉన్న రెండు రాజ్యసభ సీట్ల కోసం దాదాపు ఐదారు మంది పోటీ పడుతూ చంద్రబాబుకి బీపీ పెరిగేలాచేస్తున్నారు. రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి తెలంగాణా కు, మరొకటి సీమాంధ్రకు కేటాయించవలసి ఉంటుంది. తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాను పార్టీకి చేసిన సేవలకి ప్రతిగా రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్లు గట్టిగానే చెపుతున్నారు. ఇంతకాలంగా చంద్రబాబుపై ఈగ కూడా వాలనీయకుండా కాపాడుకొంటూ వచ్చిన తనకు ఆయన తప్పకుండా రాజ్యసభ సీటు ఇస్తారని నమ్ముతున్నానని మోత్కుపల్లి అంటున్నారు. అయితే, పార్టీలో కార్పోరేట్ వర్గం తనకు టికెట్ రాకుండా అడ్డుకొంటుందేమోననే భయం కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తెలంగాణా నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా రాజ్యసభ సీటుపై ఆసక్తి చూపకపోయినా, మొత్కుపల్లికి మద్దతు ఇచ్చేందుకు కూడా ముందు రాలేదు. పార్టీలో మరికొందరు నేతలు వరంగల్ కు చెందిన తెదేపా జనరల్ సెక్రెటరీ గరికపాటి రామ్మోహన్ రావుకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.   ఇక వీరు కాక నన్నపనేని రాజకుమారి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కే. రామ్మోహన్ తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో నన్నపనేని రాజకుమారి, చంద్రబాబు తనకు తప్పకుండా రాజ్యసభ సీటు ఇస్తారని చెప్పుకొంటున్నారు. హరికృష్ణ రాజీనామాతో ఖాళీ అయిన సీటుని ఆయన సోదరుడు బాలకృష్ణకే ఇద్దామని మొదట అనుకొన్నపటికీ, ఆయనను వచ్చే ఎన్నికలలో శాసనసభకు పోటీ చేయించడం వలెనే పార్టీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించడంతో ఆయన ఈ పోటీ నుండి దాదాపు విరమించుకొన్నట్లే. కానీ పోటీలో మిగిలిన ఇంత మంది అభ్యర్ధులలో ఎవరిని కాదన్నా అలకలు బుజ్జగింపులు తప్పవు. ఈనెల 28న నామినేషన్లు వేయవలసి ఉంటుంది గనుక రేపే తెదేపా తన ఇద్దరు అభ్యర్దుల పేర్లు ఖరారు చేయవచ్చును. గనుక ఎల్లుండి నుండి తెదేపాలో అలకపాన్పు సీన్లు మొదలవుతాయేమో.