జగన్ తండ్రిని పొగిడినా సహించలేడుట!

  వైకాపా నుండి బయటపడేవారు అందరూ చెప్పే మాట ఒక్కటే! జగన్మోహన్ రెడ్డికి చిన్నాపెద్ద అనే గౌరవం లేదని! పార్టీలో నుండి బయటకి పోయేవారు పార్టీపై, పార్టీ అధినేతపై ఏదో ఒక ఆరోపణలు చేసి పోవడం సహజమే అయినప్పటికీ, ఈవిధంగా అందరూ ఒకే రకమయిన ఆరోపణలు చేస్తుండటం చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఎటువంటివాడో, పార్టీలో సీనియర్ల పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.   నరసాపురం నుండి వైకాపా లోక్ సభ అభ్యర్ధిగా పేర్కొనబడిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడుతున్నరంటూ ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన తరువాత, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిపై ఇంచుమించు ఇవే రకమయిన ఆరోపణలు చేసారు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి పైకి చాలా గట్టిగా సమైక్యవాదం చేస్తున్నా, ఆయన సమైక్య ముసుగులో పనిచేస్తున్న విభజనవాది. పార్టీలో ఎవరయినా గట్టిగా సమైక్యవాదం చేస్తే ఆయన సహించలేరు. పార్టీలో పెద్దవాళ్ళకి, సీనియర్లకి ఆయన తగిన గౌరవం ఈయకపోయినా అందరూ ఆయనని గౌరవంగా ‘సర్’ అని మాత్రమే సంభోదించాలి. లేకుంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. చివరకి ఎవరయినా ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని పొగిడినా ఆయన తట్టుకోలేడు. ఆయన అహంభావం తట్టుకోవడం చాల కష్టం. ఆయనకీ తగిన బుద్ధి చెప్పెందుకే నేను రాజకీయాలలో కొనసాగాలనుకొంటున్నాను. త్వరలో నా రాజకీయ భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియజేస్తాను,” అని తెలిపారు. రఘురామ కృష్ణంరాజు నిన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడిని కలిసినట్లు సమాచారం. బహుశః ఆయన బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారేమో!   ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి చాలా సహనం, అందరినీ కలుపుకుపోగల నేర్పు ఉండాలి. కానీ, కేవలం వ్యక్తిగత ఆకర్షణతోనే ఎల్లకాలం పార్టీని నడుపుదామనుకొంటే ఆ ఆకర్షణ కనుమరగయిననాడు, పార్టీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అందుకు ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చును. 

బిల్లు ఓటమితో విభజన ఆగిపోతుందా?

  విభజన బిల్లుని ఉభయ సభలలో ఓడించినందుకు సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చుతుండగా, తెలంగాణాలో ప్రజలు ఆగ్రహంతో ముఖ్యమంత్రి తదితరుల దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఒకరు విజయం సాధించామని సంబరపడుతుంటే, వేరొకరు ఓడిపోయిన భావనతో ఆక్రోశం వ్రేళ్ళగ్రక్కుతున్నారు. అయితే ఈ విజయం, పరాజయం రెండూ తాత్కాలికమేనని ప్రజలందరూ గ్రహించాల్సి ఉంది. ఈరోజు శాసనసభ లో బిల్లును ఓడించడం ద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోదని అందరికీ చాలా బాగా తెలుసు. సీమాంధ్ర నేతలకు నిజంగా రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొనే ఆలోచనే ఉండి ఉంటే, పరిస్థితిని ఇంతవరకు రానిచ్చేవారే కాదు. కానీ, పార్టీ టికెట్స్, మంత్రి పదవులకు,కాంట్రాక్టుల కోసం ఆశపడి ప్రజలని మభ్యపెడుతూ పరిస్థితులను ఇంతవరకు తీసుకు వచ్చారు. ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటున్నట్లు విభజన బిల్లుని సభలో ఓడించి తామేదో చాలా ఘన కార్యం చేసామని చెప్పుకొంటున్నారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలకు ఈ మాత్రమయిన ఉపశమనం కలగించి వారిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నమే ఇది. అందుకే వివిధ రాజకీయ పార్టీల అధ్వర్యంలో కార్యకర్తలు రోడ్లమీధకు వచ్చి టపాసులు కాల్చి ప్రజాభిప్రాయానికి అడ్డం పడుతున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   అయితే ఈ విజయం, ఆనందం రెండూ తాత్కాలికమేనని ఆ నేతలందరికీ తెలుసు. ఆదేవిధంగా సభలో బిల్లుని ఓడించినందుకు తెలంగాణా ప్రజల ఆక్రోశం వ్యక్తం చేయడం సహజమే. కానీ శాసనసభలో బిల్లుని ఓడించడం వలన విభజన ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపదని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం గమనిస్తే, ఈ కారణంగా మాత్రం తెలంగాణా ఏర్పాటు ఆగదని స్పష్టమవుతోంది. కానీ, ఈ కారణంగా ఒకవేళ రాష్ట్రపతి బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, సుప్రీం కోర్టులో పిటిషన్లు పడినప్పుడు, బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందని కోర్టు అడ్డుపడినా, పార్లమెంటులో బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినా రాష్ట్ర విభజన ఆగవచ్చును. అంతే తప్ప కేవలం ఈ కారణంగానే విభజన ప్రక్రియ ఆగే అవకాశం లేదు.   అందువల్ల సీమాంధ్ర నేతలు ఏదో ఘన కార్యం సాధించినట్లు కాలరు ఎగురవేసుకొని తిరుగనవసరం లేదు. బిల్లు శాసనసభలో ఓడిపోయినందుకు తెలంగాణా ప్రజలు దిగులు చెందనవసరం లేదు. అయితే, తన రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్దంగా రాష్ట్ర విభజనకు పూనుకొని తెలుగు ప్రజల మధ్య ఇంత అగాధం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ, దాని అధిష్టానం మాత్రం ఈ పరిస్థితులను చూసి సిగ్గుపడకపోగా నిర్లజ్జగా మాట్లాడటం సిగ్గు చేటు.

విభజన బిల్లును ఉభయసభలు తిరస్కరించాయి...

      ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ బిల్లును ఉభయసభలు తిరస్కరించాయని మంత్రి ఆనం రా౦నారాయణరెడ్డి, మంత్రి టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. సభలో తెలంగాణ నేతలు కూడా బిల్లు తిరస్కరణకు అనుకూలంగా ప్రవర్తించారని అన్నారు.రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా మండలిలో, శాసన సభలో తీర్మానం జరిగిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం కూడా రాష్ట్ర అభిప్రాయాలను గౌరవించాలని అన్నారు. శాసనసభ తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో పెట్టలేరన్నారు.   ఇది చారిత్రాత్మకమైన రోజు: ఆనం వివేకా   తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తే బాల్ పెవీలియన్ దాటి ఢిల్లీలో పడిందని, ఇది చారిత్రాత్మకమైన రోజని, దీనిని సువర్ణాక్షరాలతో లిఖించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఓపికతో, సహనంతో సీమాంధ్ర శాసనసభ్యులు, సీమాంధ్ర ప్రజలు ఏమి కోరుకున్నారో ? దానిని సాధించారని, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజలు హర్షించే నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.

సీఎం, స్పీకర్ దొంగ దారిలో...

    తెలంగాణ బిల్లును తిప్పిపంపుతూ సీఎం చేసిన తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంమంత్రి, స్పీకర్ దొంగదారిలో పనికిరాని తీర్మానాన్ని ఆమోది౦చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లుపై చర్చలో ఎటువంటి పరిష్కారాలు చూపకుండా మూజువాణి ఓటింగ్‌తో తీర్మానాన్ని ఆమోదించి పైశాచిక ఆనందాన్ని పొందారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో సీఎంకు రాజకీయ సన్యాసం తప్పదని, ప్రజలే సీఎంకు బుద్ది చెబుతారని హెచ్చరించారు. మరోవైపు టిడిపి తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్, ముఖ్యమంత్రి కుట్రలో బాగంగానే తీర్మానాన్ని ఆమోది౦చుకున్నారని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన కీలక సంఘటన ఎంత బలమైనదో తెలిసినా, దాన్ని పట్టించుకోనట్టు మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత నాయకులది అమాయకత్వం.  

కిందపడ్డా పైచెయ్యే!

      విభజన వాదులు ఓటమిని ఓ పట్టాన ఒప్పుకోరు. సమైక్య వాదుల విజయాన్ని కూడా తమ అకౌంట్లో వేసుకుని తమదే విజయమని అంటూ వుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే కిందపడ్డా పైచేయి అనే సామెత పుట్టినట్టుంది. తెలంగాణ బిల్లును తిప్పిపంపుతూ సీఎం చేసిన తీర్మానం గురువారం నాడు భారీ గందరగోళం మధ్య అసెంబ్లీ ఆమోదం పొందింది. ఇటు శాసన సభలో, అటు శాసనమండలిలో కూడా తెలంగాణ బిల్లును తిరస్కరించే తీర్మానం ఆమోదం పొందింది.     గురువారం నాడు సీమాంధ్ర సభ్యుల మీద దౌర్జన్యం చేసి అయినా సీఎం ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కార తీర్మానంపై ఓటింగ్ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు వ్యూహరచన చేశారు. అయితే స్పీకర్ మనోహర్ క్షణాల్లో విభజన బిల్లును తిరస్కరించే తీర్మానానికి ఓటింగ్ నిర్వహించడం, మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందడం జరిగిపోయింది. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో షాకైన విభజనవాదులు కొద్ది నిమిషాలు నోట మాట రాకుండా వుండిపోయినా, ఆ తర్వాత తమదైన శైలిలో గళం విప్పారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ ముగిసిందని, ఇక తెలంగాణ రావడం ఖాయమని మీడియా పాయింట్లో స్టేట్‌మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని తిరస్కరించినందువల్ల నష్టమేమీ లేదని, పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభిస్తుందని అతి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అసలు అసెంబ్లీ అభిప్రాయానికి విలువే లేదని తేల్చేసి చెప్పేశారు. మరి అసెంబ్లీ అభిప్రాయానికి విలువ లేకపోతే బిల్లు అసెంబ్లీకి రావాలని పట్టు పట్టడం ఎందుకో, చర్చ జరగాలని గొడవ చేయడమెందుకో, సీమాంధ్రుల వాణి వినపడకుండా గందరగోళం సృష్టించడమెందుకో విభజనవాదులకే తెలియాలి. అసెంబ్లీ బిల్లును తిరస్కరించినా కేంద్రం హాయిగా రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించే అవకాశమే వుంటే అసలు బిల్లును రాష్ట్రానికి పంపడం ఎందుకో విభజనవాదులే చెప్పాలి. ఏది ఏమైనా కీలక సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోని సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఏకతాటి మీద నిలిచి విభజన వ్యతిరేక తీర్మానానికి మద్దతు పలకడం శుభ పరిణామం. అసెంబ్లీలో జరిగిన కీలక సంఘటన ఎంత బలమైనదో తెలిసినా, దాన్ని పట్టించుకోనట్టు మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత నాయకులది అమాయకత్వం.  

తెలంగాణ బిల్లు తిరస్కరణ..వెనక్కి వెళ్ళదు

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర విభజనపై ఎలాంటి ప్రభావం చూపదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ బిల్లుపై సభలో ఓటింగ్  జరగలేదని అన్నారు. తెలంగాణ బిల్లును సభకి అభిప్రాయం కోసమే పంపించాం కాని ఓటింగ్ కోసం కాదని అన్నారు. కేబినేట్ సమావేశం అనంతరం కేంద్రం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుందని అన్నారు. సవరణలపై కేబినేట్ చర్చించి సలహాలు వుంటే పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు బిల్లును వ్యతిరేకించిన పార్టీలన్నీ ఒకప్పుడు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని గుర్తుచేశారు.

కిరణ్ పంతం నెగ్గింది..తెలంగాణ బిల్లు తిరస్కరణ

      అసెంబ్లీలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్రపతి పంపించిన తెలంగాణ బిల్లును తిరస్కరించాలంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి ఓటింగ్‌తో సీఎం ఇచ్చిన నోటీసును అసెంబ్లీ ఆమోదించింది. దాంతో తెలంగాణ బిల్లును అసెంబ్లీ తిరస్కరించినట్లయింది. సభలో అందోళనల మధ్యే స్పీకర్ సీఎం తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పారు. సభలో 86 మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. బిల్లుపై 9,076 సవరణలు వచ్చాయన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. సీఎ౦ కిరణ్ సమైక్యాంధ్ర నినాదాలు చేసుకుంటూ సభ నుంచి బయటకు వచ్చారు.      

జగన్ పార్టీ నుంచి కృష్ణంరాజు బిజేపిలోకి జంప్

  గత మూడు నాలుగు రోజులుగా వైకాపా నేత రఘురామకృష్ణంరాజు పార్టీ వీడి కాంగ్రెస్ లోకో, బీజేపీలోకో వెళ్లిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి2న తను స్వయంగా జగన్మోహన్ రెడ్డి తో సమావేశమయిన తరువాత తగిన నిర్ణయం తీసుకొంటానని ఆయనే స్వయంగా ప్రకటించారు కూడా. అయితే ఆయన నిన్నబీజేపీ నేత వెంకయ్య నాయుడిని వెళ్లి కలవడంతో బీజేపీలో చేరబోతున్నట్లు దాదాపు ఖాయమయిపోయినట్లే భావించవచ్చును. ఆయన నరసాపురం నుండి పోటీ చేసేందుకు వైకాపా అంగీకరించినట్లు సమాచారం. కానీ కొందరు స్థానిక పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తుండటంతో ఆయన ఈవిషయాన్ని జగన్ దృష్టికి తీసుకు వెళ్ళినా ఆయన నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో బాధపడిన రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి తన గోడు వెళ్ళబోసుకోవలనుకొన్నారు. కానీ, ఇంతలోనే ఏమయిందో తెలియదు కానీ ఆయన వెంకయ్య నాయుడిని వెళ్లి కలిసి వచ్చారు.   అదేవిధంగా మల్కాజ్ గిరీ కాంగ్రెస్ శాసనసభ్యురాలు  జయసుధ ఈసారి అక్కడి నుండే లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నందున, ఆ సీటు సిట్టింగ్ యంపీ సర్వే సత్యనారాయణకే కేటాయించే అవకాశం ఉండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో జేరేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే  టికెట్ కోసం పార్టీలు మారే ఇటువంటి వారికి పార్టీలు, సిద్దాంతాలు, సమైక్య, విభజన వాదనలు ఏవీ కూడా అడ్డుకావని అర్ధం అవుతోంది.

మానవుడే మహనీయుడు

    గుండెనిండా స్వేచ్చా వాయువులు పీల్చినపుడల్లా అందులో ఎందరో మహనీయుల త్యాగం అంతర్లీనంగా మనలని స్పృశిస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే మన జాతిపిత గాంధీ భారతీయుల ప్రతిశ్వాసలో ఈనాటికి ఉన్నారంటే అతిశయోక్తి కాదు, అలా౦టి మహానుభావుడి వర్ధంతి ఈ రోజు, స్మరించుకోవడం, మనసులో కృతజ్ఞతలు తెలియజేయడం, అయన చూపిన మార్గంలో నడవాలని సంకల్పించుకోవడం మనందరని కనీస ధర్మం . అహింస, శాంతి,సహనం, నిత్యం మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో అవసరపడే పదునైన ఆయుధాలు, వాటిని పరీక్షించి ఫలితాలని కూడా మనముందుంచారు. బాపూజీ నిస్సంకోసంగా వాటిని వాడొచ్చు మనందరం. మహానుభావుడు పూజ్యుడు,ఆరాధ్యుడు అంటూ గాంధీని మాటలతో పూజిస్తాం కాని నిజంగా ఆయనకి గుడి కట్టి నిత్యం ధూపదీపాలతో అర్చనలు చేస్తారంటే నమ్మగలరా, కాని నిజం మన దేశంలో రెండుచిట్ల అలా గాంధీజీ ఆలయాలు ఉన్నాయి.   కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులోని కంకనాడిలో ఉందా గుడి. అక్కడ గాంధీయే దేవుడు. ఈ గుడి 1948 లోనే నిర్మించారు. నరసప్పసాలియాన్, సోమప్ప పండితే, వెంకటప్ప అనే వారికీ గాంధీ అంటే ప్రాణం గాడ్సే తుపాకీ గుళ్ళకి అయన నేలకొరిగారన్న వార్త విన్నాక అంతటి మహాత్ముడికి మరణం లేడు అని నమ్మి ఆయనకి గుడి కట్టారు ఈ ముగ్గురు. అప్పటినుంచి ఆ ఆలయంలో గాంధీజీ పూజలు అందుకుంటున్నారు.   నేటికి నిత్యం అర్చనలు జరుపుతారు. జాతీయ పర్వదీనాల్లో ఆ ఆలయం జన సందోహంతో కిక్కిరిసిపోతుందట. దూర దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం మహాత్ముడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబదతారట. ఇక గాంధీ జయంతి నాడు పల్లకీసేవ ప్రత్యేకంగా ఓ ఉత్సవంలా నిర్వహిస్తారు అంతే కాదు ఆ ఆలయం చుట్టూ ప్రజల గట్టి నమ్మకం కూడా ఒకటుంది. గాంధీజీ ఆలయం గురించి దాని చుట్టూ ప్రజలఅల్లుకున్న విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మద్యపానం,ధూమపానం,జూదం వంటి వ్యసనాలకు బానిసయిన వారిని ఈ ఆలయానికి తీసుకు వచ్చి ప్రమాణం చేయిస్తే వారు ఆ వ్యసనాల జోలికి ఇక వెళ్ళారని ఆ చుట్టుపక్కల గ్రామస్తుల నమ్మకం. అలాగే మానసిక ఆరోగ్యం సరిగా లేనివారిని ఈ ఆలయానికి తీకుసువస్తే స్వస్థత చేకూరుతుందని కూడా నమ్ముతారు. మొక్కలు కడతారు చెల్లిస్తారు.గాంధీజీ జీవిత చరిత్ర వారికీ నిత్య  పారాయణ గ్రంధం. ఇక గాంధీజీకి ఒరిస్సాలో కూడా ఓ గుడి వుంది. గాంధీజీ తన జీవితంలో ఒకేఒకసారి ఒరిస్సాలో పర్యటించారు. అయితేనేం అక్కడ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసారు గాంధీజీ వారినేంతగా ప్రభావితం చేశారంటే ఆ రాష్ట్రంలో సంబాల్పూర్ కూ సమీపంలో బాత్రా అనే గ్రామంలో ఆయనకో గుడి కట్టించారు. అక్కడ జాతీయపర్వదీనాలు పెద్ద పండగలుగా, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ గ్రామం చుట్టు పక్కల ఇప్పటికీ ఖాదీ మాత్రమే ధరిస్తారు. ఆ ఆలయం గోడలానిండా స్వాతంత్రోద్యమ ఘట్టాలు చెక్కించారు. 'రఘుపతి రాఘవ రాజారాం' అన్నా గీతాన్ని వారు నిత్యం స్మరిస్తారు. మహాత్ముడికి గుడి కట్టడమెందుకని అడిగితే వారెంమంటారో తెలుసా...ఈ గుడిలో మేము మహత్ముడిని కాదు..మానవత్వాన్ని పూజిస్తున్నాం. గాంధీజీ జీవిత చరిత్ర మాకు నిత్య పారాయణ గ్రంథం..దాని నుంచి ఎంతో స్పూర్తి పొందుతాం. అందుకే ఆయన మాకు దేవుడు అంటారు. ఇంకా ఏమంటారో తెలుసా..''ఈ ఆలయాన్ని చూడగానే రక్తమాంసాలున్న ఇటువంటి మనిషి ఈ భూమ్మిద నడిచాడంటే ముందుతరాల వారు నమ్మరు..అన్న ఐన్ స్టీన్ మాటలు గుర్తుకు రావాలి అందరికి...అన్న వారి మాటలు మానవుడే మహనీయుడు అని నీరుపిస్తున్నాయి. ఆ మహనీయుడి స్పూర్తితో ముందడుగు వేద్దాం. .....రమ

కాంగ్రెస్ తో కాశ్మీరీ పార్టీ కటీఫ్

  కాంగ్రెస్ అధిష్టానం ఒకపక్క కొత్త పార్టీలను దువ్వుతూ వచ్చే ఎన్నికలలోగా ఎలాగయినా మచ్చిక చేసుకొని వాటితో పొత్తులు పెట్టుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని తిప్పలు పడుతుంటే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం ఖాయమని పసిగట్టి కాంగ్రెస్ దోస్తులు కొందరు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఇప్పటి నుండే ఎన్డీయే కూటమిలోకి దూకేందుకు సిద్దం అవుతున్నారు.   యూపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నకాశ్మీరుకి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మాజీ కాశ్మీరు ముఖ్యమంత్రి అయిన ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ, "మా పార్టీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగాలా వద్దా అనే సంగతిని మా అబ్బాయి ఒమర్ అబ్దుల్లా నిర్ణయిస్తాడు. అతను ఏవిధంగా చెపితే పార్టీ ఆవిధంగా చేస్తుంది. అయితే ఇంకా అతను, మేము ఈవిషయంలో ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు,” అని అన్నారు.   ఆయన మీడియా అడిగిన మరో ప్రశ్నకు జవాబిస్తూ, “ఒకవేళ దేశప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకొంటే వారి అభిప్రాయాన్ని మా పార్టీ గౌరవిస్తుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే అంతిమ నిర్ణయం,” అని అన్నారు.   గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు దానితో అంటకాగిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, అది ఎన్నికలలో ఓడిపోగానే దానిని వదిలి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమిలోకి జంపయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేఖ గాలులు వీస్తూ, మోడీ భజన మారుమ్రోగిపోవడం చూసి ‘స్వంత గూటికి’ వచ్చేయాలని ఈ తండ్రీ కొడుకులు ఆరాటపడుతున్నట్లున్నారు. ఏ ఎండకి ఆ గొడుగు అంటే ఇదేనేమో!

సభ మొదటి వాయిదా షురూ

  ఊహించినట్లుగానే ఈరోజు శాసనసభ సమావేశమవగానే ఆంధ్ర తెలంగాణా సభ్యుల నినాదాలతో దద్దరిల్లిపోయింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ విజయమ్మ తదితరులు సమైక్య తీర్మానం కోసం ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బహుశః ఈరోజు సాయంత్రం వరకు సభలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చును. అయితే, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు ప్రకారం సభలో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకే నిశ్చయించుకొన్నారు గనుక, దానిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణా సభ్యులను బయటకి తరలించేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పించి సిద్దంగా ఉంచారు. ఈ రోజే టీ-బిల్లుకి ఆఖరి రోజు గనుక, తెలంగాణా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసి బహుశః సాయంత్రంలోగా ఆయన సభలో బిల్లుపై ఓటింగ్ నిర్వహించవచ్చును.

రాజ్యసభ సీటు కోసం ఇంత బాధపడిపోవాలా

  రాజ్యసభకి తనను పంపలేదని మోత్కుపల్లి నరసింహులు, ఎలాగో టికెట్ దక్కించుకొన్నా తనపై స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టారని కేవీపీ రామచంద్ర రావు కన్నీళ్లు పెట్టుకొన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. వారిలో మోత్కుపల్లి తాను ఇంతకాలం చంద్రబాబుపై ఈగ కూడా వాలనీయకుండా కాపాడుకొస్తున్నాని, అయినా చంద్రబాబు తనకు కాదని వేరెవరికో రాజ్యసభ టికెట్ ఇచ్చారని కన్నీళ్లు పెట్టుకొన్నారుట. ఇంకా గమ్మతయిన విషయం ఏమిటంటే, కన్నీరుమున్నీరు అవుతున్న ఆయనను ఎర్రబెల్లి ఓదార్చుతూ, ఎన్నికల తరువాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే, ఆయనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని నచ్చజెప్పడం.   ఇక సమైక్యాంధ్ర కోసం పోరాడిన తనపైనే సమైక్యవాదులు స్వతంత్ర అభ్యర్ధిని నిలబెట్టడమేమిటని కేవీపీ వాపోయినట్లు సమాచారం. ఇంతకాలం పార్టీ కోసం, ప్రజల కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్నామని డప్పుకొట్టుకొని తిరిగే ఇటువంటి నేతలు అధికారం కొంత ఎంతగా విలవిలలాడుతున్నారో వారి బాధ చూస్తే అర్ధమవుతుంది. రాజ్యసభ సీటు దక్కకపోతే తమకేదో తీరని కష్టం వచ్చేసినట్లు తెగ ఫీలయిపోతున్న వీరిరువురూ త్వరలోనే ఈ బాధ, వైరాగ్యం నుండి కోలుకొని మళ్ళీ యధావిధిగా నిస్వార్ధంగా పార్టీ సేవలో, ప్రజా సేవలో నిమగ్నమవుతారని ఆశిద్దాము.

ఆఖరి పోరాటం నేడే

రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకి రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. అందువల్ల విభజనవాదులు, సమైక్యవాదులు ఈ రోజు శాసనసభ సాక్షిగా తమ ఆఖరిపోరాటం చేయబోతున్నారు. బిల్లుని వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసి ఓటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నేతృత్వంలో సమైక్యవాదులు ప్రయత్నిస్తే, దానినిఎట్టి పరిస్థితుల్లో సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని విభజనవాదులు ప్రయత్నిస్తారు. గనుక బహుశః ఈరోజు సభలో సభ్యులు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొనే వరకు పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. విచక్షణతో వ్యవహరించవలసిన ప్రజాప్రతినిధులు, మందబలంతో తాము అనుకొన్నది సాధించాలని ప్రయత్నిస్తే బహుశః రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇదొక అత్యంత దుర్దినంగా మిగిలిపోవచ్చును.   ఇక “ఆఖరిబంతి పడేవరకు ఆట కొనసాగుతూనే ఉంటుంది” అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఆఖరు బంతులకోసం ఎదురు చూస్తూ ముఖ్యమంత్రిగా కొనసాగుతారో లేక రాజినామా చేసి, కొత్త జెండా పట్టుకొని ప్రజల ముందుకు వస్తారో బహుశః ఈ రోజే తేలిపోవచ్చును. గత కొంతకాలంగా అన్ని టీవీ ఛానళ్లలో హోరెత్తిన సమైక్యగానం ఆగిపోయింది గనుక, కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచన కూడా అటకెక్కిందో లేక మరికొంత సమయం తీసుకొని అంటే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు ఆగి స్థాపించబడుతుందో తెలుసుకోవాలంటే ఈరోజు సభలో ముఖ్యమంత్రి రాజినామా చేస్తారా లేదా అనేదానిని బట్టి తేలిపోవచ్చును. అధికారం చేతిలో ఉంచుకొంటే చాలా సులువుగా తను అనుకొన్నవిధంగా చక్రం తిప్పడానికి వీలుంటుంది. అంతేగాక ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమే తన మాటకు విలువ, ప్రత్యేక గుర్తింపు ఉంటాయి గనుక కిరణ్ కుమార్ రెడ్డి బహుశః రాజీనామా చేయకపోవచ్చును.      ఏమయినప్పటికీ, ఈరోజుతో విభజన బిల్లు శాసనసభ గుమ్మం దాటేస్తుంది గనుక, ఈ వ్యవహారంలో రాష్ట్ర రాజకీయ పార్టీల పాత్ర ముగిసి, జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇక రాజకీయ చదరంగం మొదలవుతుంది.  అందువల్ల ఇంతకాలం విభజనపై దోబూచులాడుతున్న రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ తేలికగా ఊపిరితీసుకొని, ఇకముందు అమలుచేయవలసిన వ్యూహ ప్రతివ్యూహాలపై దృష్టి పెట్టగలవు.  

దమ్ముందా..కిరణ్ సవాల్

      రాష్ట్ర శాసనసభకు పంపించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ముసాయిదా బిల్లునే మీకు దమ్ముంటే పార్లమెంటులో ప్రవేశపెట్టండి అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇదే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని సవాల్ కూడా చేశారు. తాను బిల్లును మార్చమని అడగటం లేదని, పార్లమెంటులో ప్రవేశ పెట్టవద్దని చెబుతున్నానని చెప్పారు. బిల్లు పైన ఓటింగుకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 86 మంది మాట్లాడితే అసెంబ్లీ అభిప్రాయం చెప్పినట్లా అని ప్రశ్నించారు. బిల్లులోని లోపాలు ఎత్తి చూపేందుకే తాను మరో మూడు వారాల సమయాన్ని కోరినట్లు చెప్పారు. విభజనపై వారి ఉద్దేశ్యం చెప్పకుండా ఏ ప్రాతిపదికన ఈ సభ అభిప్రాయం చెప్పాలని ప్రశ్నించారు.విభజనకు తాను వ్యతిరేకమని, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని, తెలుగు ప్రజలు కలిసి ఉండాలనేదే తన అభిప్రాయమన్నారు.

టీఆర్ఎస్ లో చేరనున్న జయసుధ..!!

      సీనియర్ సినీ నటి, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయసుధ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్థివర్గాలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం, గత ఎన్నికల సమయంలో ఉన్నట్టుగా పార్టీలో పెద్ద దిక్కు లేకపోవడంతో నియోజకవర్గంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయని జయసుధ భావిస్తున్నారు. మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న జయసుధ..మహబూబునగర్ జిల్లాకు చెందిన సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ద్వారా కెసిఆర్ కు రాయబారం పంపినట్లు సమాచారం. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని అన్ని శాసన సభ నియోజకవర్గాల్లో సెటిలర్లతో పాటు, మైనారిటీవర్గాలకు చెందిన ఓటర్లు కూడా గణనీయంగా ఉండటం వల్ల గెలుపు అవకాశాలు ఉంటాయని ఆమె భావిస్తున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు తేలిన తరువాత ఎంపీ టిక్కెట్ పై నిర్ణయం తీసుకుంటామని జయసుధకు చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

స్టాలిన్‌ కు భద్రతా పెంచండీ... ప్రధాని గారు

      కరుణానిధి కుమారులైన అళగిరి, స్టాలిన్‌లకు మధ్య వైరుధ్యాలు తీవ్రస్థాయికి చేరి ఉభయుల మధ్య శత్రుత్వం పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా తన రెండో కుమారుడు స్టాలిన్‌కు భద్రత కల్పించాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు డీఎంకే అధినేత కరుణానిధి లేఖ రాశారు. ఇటీవల అళగిరి తన తండ్రి(కరుణానిధి) వద్దకు వెళ్లి మూడు నెలల్లో చనిపోయే వ్యక్తికి పదవులు ఎందుకు అని ప్రశ్నించడంతో అవాక్కైన కరుణానిధి వెంటనే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం కూడా తెలిసిందే. ఒక కుమారుడిపై మరో కుమారుడు చేసిన 'అమానవీయ' వ్యాఖ్యలను తండ్రిగా భరించగలను కానీ పార్టీ రథసారథిగా భరించలేనని, అందుకే అళగిరిని బహిష్కరించ వలసి వచ్చిందని కరుణానిధి స్వయంగా మీడియాకు వివరించారు.ఈ నేపథ్యంలో అళగిరి తన మరో కుమారుడు స్టాలిన్‌కు భౌతికంగా అపకారం తలపెట్ట వచ్చునన్న అనుమానంతోనే ఇప్పుడు స్టాలిన్‌కు భద్రత కల్పించాల్సిందిగా అభ్యర్థిస్తున్నట్లు కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో సవివరంగా పేర్కొన్నారు.

ఆదాల, చైతన్యరాజుల నామినేషన్ లు ఓకే

      రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దీగిన చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్ధులు పోటీలో వున్నారు. స్వతంత్ర అభ్యర్ధులకు మద్దతిచ్చిన ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో... మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల నుంచి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకురావాంటూ రెబల్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి గంట సమయం ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి కేవీపీ రామచంద్రరావు స్వతంత్ర అభ్యర్ధులకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ భవనంలో తన వద్దే ఉంచుకున్నారు. దీంతో కాసేపు ఉత్క౦ఠ నెలకొంది. చివరికి స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్ల పై బొత్స అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. చివరికి న్యాయం గెలిచిందని చైతన్య రాజు అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఎన్నికలలో తాము తప్పనిసరిగా గెలుస్తామని చెప్పారు. చాలామంది సమైక్యాంధ్రకు మద్దతుగా తమకు ఓటు వేస్తారన్నారు. తమకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు అన్నీ చదివాకే సంతకాలు చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు బొత్స, కెవిపి లు గట్టిగా ప్రయత్నించినా చివరికి వారి వ్యూహం విఫలం అయింది.

అతితెలివి ప్రదర్శించిన కాంగ్రెస్ అధిష్టానం

  ఇంతవరకు రాజ్యసభ ఎన్నికలు కేవలం కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన వ్యవహారంగానే సాగింది. కానీ, కాంగ్రెస్ అదిష్టానం చాలా తెలివిగా సమైక్యవాది అయిన కేవీపీని, స్వయంగా శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకోగల సుబ్బిరామి రెడ్డిని పార్టీ అభ్యర్ధులుగా నిలబెట్టి, ఈ మొత్తం వ్యవహారాన్నితనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి, ఆయన అనుచరులే ఒక కొలిక్కి తెచ్చేలా చేసి కాంగ్రెస్ అధిష్టానం చేతులు దులుపుకొంది. ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు, ఆయన సమైక్య అనుచరులు, పార్టీ అభ్యర్దులు అందరూ కలిసి తిరుగుబాటు అభ్యర్ధులను, వారికి మద్దతు ఇస్తున్న శాసనసభ్యులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం నుండి కాంగ్రెస్ అధిష్టానం తెలివిగా బయటపడగా, ఇంత కాలం అధిష్టానానికి వ్యతిరేఖంగా రంకెలు వేస్తున్నసీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకొనే పనిలో తలమునకలయ్యున్నారు. పార్టీ అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధుల గెలుపోటములు ఎలా ఉన్నపటికీ, ఈ ఎన్నికల వ్యవహారంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినా ఆశ్చర్యం లేదు.

మాటల గారడీ చేస్తున్నఉండవల్లి

  నేడు రాజకీయాలలో మనుగడ సాధించాలంటే అంగబలం, అర్ధ బలంతోబాటు మంచి మాటకారితనం కూడా ఉంటే ఇక వారు పాడిందే పాట, చెప్పిందే వేదంగా చెలామణి అవుతుంది. ఒక న్యాయవాదికి మంచి మాటకారితనం ఉండి అతను రాజకీయాలలోకి ప్రవేశిస్తే ఇక చెప్పేదేముంది?   రాజమండ్రి యంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కోవలోకే వస్తారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొన్నందున ఆయన పార్టీకి, పదవికీ కూడా రాజినామా చేసారు. తన నిబద్దతపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు వచ్చేఎన్నికలలో తాను పోటీ చేయబోనని ప్రకటించారు కూడా. అయితే, త్వరలో జరుగబోయే రాజ్యసభ ఎన్నికలకి ఆయన పేరు అటు పార్టీ తరపున, ఇటు సీమాంధ్ర తిరుగుబాటు కాంగ్రెస్ నేతల తరపున కూడా పరిశీలనలోకి రావడం విచిత్రమే!   నిన్నఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన కేవీపీ, సుబ్బిరామి రెడ్డిలను వెనకేసుకు వచ్చిన తీరు ఆయన మాటకారితనాన్ని మరోసారి బయటపెట్టింది. “కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేఖిస్తున్న మీరు, పార్టీ నిలబెడుతున్న కేవీపీ, సుబ్బిరామి రెడ్డిలకు మద్దతు ఇస్తారా? ఓడించమని పిలుపునిస్తారా?” అనే మీడియా ప్రశ్నకు జవాబు చెపుతూ, “కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖించడం, రాష్ట్ర విభజన చేయాలని అది తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేఖించడం రెండూ రెండు వేర్వేరు అంశాలు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించిన వారందరూ పార్టీ అభ్యర్ధులను వ్యతిరేఖించవలసిన అవసరం లేదు. అలాగే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్న వారందరూ పార్టీని వీడిపోవలసిన అవసరం లేదు కూడా. ఒకవేళ పార్టీ విభజనవాదులయిన తెలంగాణా వ్యక్తులను ఎవరినయినా పోటీలో నిలబెట్టి, వారికి మద్దతు ఈయమని మమ్మల్ని కోరినట్లయితే తప్పకుండా వారిని ఓడించవలసి ఉంటుంది. కానీ కేవీపీ, సుబ్బిరామి రెడ్డి ఇద్దరూ కూడా పూర్తి సమైక్యవాదులే. కేవీపీ స్వయంగా ముందుండి సమైక్యపోరాటం చేసారు. అదేవిధంగా సుబ్బిరామి రెడ్డి కూడా సమైక్యవాదే! ఆయన తన వ్యాపార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని ఆ మాట గట్టిగా పైకి చెప్పలేకపోతున్నారు, కానీ ఆయన చేయవలసిన ప్రయత్నాలు ఆయనా చేసారు. అందువల్ల వీరిరువురినీ పార్టీ నిలబెట్టిన కారణంగా వ్యతిరేఖించనవసరం లేదు,” అని స్పష్టం చేసారు.   “మరయితే వారిపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీగా దిగిన చైతన్యరాజుకి మీరు మద్దతు ఇస్తారా?” అనే ప్రశ్నకు బదులిస్తూ, “నిజానికి మా యంపీల కంటే శాసనసభ్యులే రాజకీయాలలో ఆరితేరినవారు. ఎందుకంటే వారు అటు ప్రజలతో, ఇటు పార్టీతో నిత్యం మంచి సంబందాలు కలిగి ఉంటారు. వారు ఎవరికి మద్దతు ఈయాలో మేము చెప్పనవసరం లేదు,” అని ఉండవల్లి జవాబు చెప్పడం ఆయన మాటకారితనానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది.   కాంగ్రెస్ అధిష్టానం చాలా తెలివిగా ఎంపికచేసిన అభ్యర్ధులను ఎవరూ కాదనలేని పరిస్థితి కల్పించడమే కాదు, వారి ద్వారా ఉండవల్లి వంటి అసమ్మతి నేతలను కూడా దారిలోకి తెచ్చుకోగలిగింది. అందుకే పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులకు ముఖ్యమంత్రి మొదలు ఉండవల్లివరకు అందరూ కూడా కాదనకుండా మద్దతు ఈయవలసి వస్తోంది. దీనినే కర్ర విరగకుండా, పాము చావకుండా కధ నడిపించడం అంటారేమో! ప్రస్తుతం ముఖ్యమంత్రి, బొత్స ఇరువురూ కలిసి తిరుగుబాటు అభ్యర్ధులను వారికి మద్దతు ఇస్తున్న వారిని బుజ్జగించే ప్రయత్నాలలో ఉన్నట్లు తాజా సమాచారం. కాంగ్రెస్ తెలివితేటలకి ఇంత కంటే గొప్ప ఉదాహరణ ఏమి కావాలి?