ఎంత వినయం.. ఎంత వినయం..

  దొరబిడ్డ కేసీఆర్ నోరు తెరిస్తే సీమాంధ్రులని తిట్టడం మినహా మరోపదం రాదు. సారుగారు సీమాంధ్రులని మాత్రమే తిడతారు. ఇంకెవర్నీ తిట్టరు. పైగా మిగతావాళ్ళ దగ్గర చాలా వినయంగా వుంటారు. ఢిల్లీకి వెళ్ళారంటే ఆ వినయం రెండు మూడింతలు అవుతుంది. ఢిల్లీ వెళ్ళేముందు సమైక్యవాదులని తిట్టిపోసిన కేసీఆర్ ఢిల్లీ వెళ్ళగానే తన నోటికి తాళం వేశారు. తన దొరతనాన్ని ఇంట్లోనే పెట్టి బయటకి వెళ్తున్నారు. జాతీయ పార్టీల నాయకులని కలిసినప్పుడు కేసీఆర్ ఒలికిస్తున్న వినయ విధేయతలని చూడటానికి అక్కడున్నవారికి రెండు కళ్ళూ చాలటం లేదంట. కేసీఆర్ జాతీయ నాయకులను కలవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మర్యాపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కేసీఆర్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. కేవలం షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా? వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా? అడ్డగోలు విభజనకు మద్దతు సాధించడం ఎలా? అందుకే షేక్ హ్యాండ్ ఇస్తూనే కేసీఆర్ వాళ్ళ ముందు వినయంగా ఒంగిపోతున్నారు. బాడీని బాగా వంచేసి, తల పూర్తిగా దించేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వినయంగా, ఒద్దికగా, చూసేవాళ్ళకి శాంతిదూతలా కనిపిస్తున్నాడట. రాముడు మంచి బాలుడిలా, నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడిలా వున్న ఇంత వినయసంపన్నుడిని సీమాంధ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అని సదరు జాతీయ నాయకులు అనుకుంటున్నారో ఏం పాడో!

సీమాంధ్ర ఎంపీలని నమ్మొచ్చా?

  తెలంగాణ అంశం మీద గత పార్లమెంటు సమావేశాల్లో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నానా హడావిడి చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు అలా చేశారో... తమ సొంత బుద్ధితో చేశారోగానీ మొత్తానికి గడచిన రెండు సెషన్స్ లోనూ తెలంగాణ ఇష్యూ మీద పార్లమెంటులో హోరెత్తించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు సభని సజావుగా సాగనిచ్చే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. సభ సజావుగా సాగకుంటే ఏ బిల్లూ చర్చకూ వచ్చే అవకాశం లేదని అన్నారు. ఇక తెలంగాణ బిల్లు విషయానికి వస్తే అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సభని సజావుగా సాగించే అవకాశం లేదు కాబట్టి, అధికారపార్టీ సభను సజావుగా నడపుతామని హామీ ఇస్తేనే తెలంగాణ బిల్లు గురించి చర్చిస్తామని సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారు. దాంతో కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల నోళ్ళు మూయించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను గప్ చుప్‌గా కూర్చోపెట్టే పథకరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకున్న సీమాంధ్ర ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీల విషయంలో ఆందోళన పడుతున్నారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడే విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను ఎంతవరకు నమ్మాలన్న విషయం గురించే ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వేసే ఎత్తులకు సీమాంధ్ర ఎంపీలు చిత్తు కారన్న నమ్మకమేమీ లేదు. గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానం చెప్పినట్టల్లా తలూపారు. ఇప్పుడీ కీలక సందర్భంలో కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే తెలుగుజాతికి తీరని ద్రోహం జరిగే ప్రమాదం వుందని సమైక్య వాదులు భయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా కనిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ని బుజ్జగించి, దారిలోకి తెచ్చే ప్రయత్నంలో వున్న కాంగ్రెస్ నాయకత్వం తన ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకంతో వుంది. ఎంపీలు కూడా తాను గీసిన గీత దాటకుండా వుండేలా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

కేసీఆర్ గొంతులో వెలక్కాయ!

  తెలంగాణ సాధించుకునే ఢిల్లీ నుంచి తిరిగి వస్తానని, తాను తిరిగి అడుగుపెట్టేది తెలంగాణ రాష్ట్రంలోనేనని ప్రతిజ్ఞ చేసి ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్ అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను చూసి డంగైపోతున్నారు. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. మైకు ముందుకు వస్తేచాలు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని పూనకం స్థితికి వెళ్ళిపోయే కేసీఆర్ ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే తిరిగొస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ విభజనవాదుల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో జరిగిన పరిణామాలు కేసీఆర్‌తోపాటు విభజన వాదులందరికీ టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈసారి పార్లమెంట్ సమావేశాలను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకే పరిమితం చేయాలని దాదాపు అన్ని పార్టీలు పట్టు పట్టడం, తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ చేసిన కామెంట్లు కేసీఆర్ అండ్ బ్యాచ్ కట్టుకున్న గాలిమేడని కూల్చేశాయి. అసలు తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకి వస్తుందా, రాదా అనే సందేహాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో అయితే దోచుకున్నారు, సీమాంధ్ర దోపిడి లాంటి పడికట్టు పదాలు ఉపయోగించి, నోరు వేసుకుని మీద పడిపోయి నెగ్గుకురావొచ్చు. అయితే ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది. బాల్ జాతీయ పార్టీల కోర్టులో వుంది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో నెగ్గే విషయం అటుంచితే, చర్చకు వచ్చే విషయమే డౌటుగా వుంది. ఈ నేపథ్యంలో విభజనవాదుల బీపీ డౌన్ అయిపోవడంతో కేసీఆర్ ఆ బీపీని పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణవాదులు డంగైపోవాల్సిన అవసరం లేదని అర్జెంటుగా సందేశం ఇచ్చేశారు. తాను ముందుగా నోరు జారినట్టుగానే తెలంగాణ ఏర్పడిన తర్వాతే తిరిగి వస్తానని మరోసారి నోరుజారారు. కేసీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ విభజనవాదుల్లో ఉత్సాహం కలిగించిందో లేదోగానీ, ఢిల్లీలో విభజన బిల్లు పరిస్థితి మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. అజిత్ సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి నాయకులు తప్ప ప్రధాన పార్టీల నాయకులెవరూ తెలంగాణ బిల్లు మీద ఆసక్తి చూపించడం లేదు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో వున్న బిల్లుల విషయం ఆలోచించాలా? హడావిడిగా తెచ్చిన తెలంగాణ బిల్లు విషయం ఆలోచించాలా అని నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం, కీలక బిల్లుల ఆమోదం తర్వాతే ఏ విషయమైనా అంటున్నారు.

ఆమ్ ఆద్మీ ముష్టి తెలివి!

  ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజల్లో పరువు పూర్తిగా పోయింది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు ఊడ్చిపారేయాలని కలలు కన్న కేజ్రీవాల్ కలలు కల్లలైపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఏర్పడిన అంచనాలనీ భ్రమలన్నీ తేటతెల్లం అయిపోయాయి. అధికారం చేపట్టి నెల రోజులు పూర్తి చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ఢిల్లీలో దినదినగండంగా నెట్టుకొస్తోంది. జనాల్లో నమ్మకం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ రోజుకో ముష్టి తెలివిని ప్రదర్శిస్తూ జనాల్లో పోయిన పరువుని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మొన్నీమధ్య అవినీతిపరుల లిస్టు ఒకదాన్ని విడుదల చేసింది. దాంతోపాటు అవినీతిని అరికట్టడం తనవల్ల తప్ప మరొకరి వల్ల కాదన్నట్టు బిల్డప్పులిస్తూ ఆచరణ యోగ్యంగా లేని లోక్‌పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ఆమోదించేసింది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులని పేరుపేరునా తిట్టిపోస్తోంది. ఆమ్ ఆద్మీ ఎంత తిడుతున్నా కాంగ్రెస్ దులిపేసుకుంటూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తోంది. దీన్నే రాజకీయం అంటారేమో! ఇదంతా ఇలా వుంటే మదన్‌లాల్ అనే ఓ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ఇష్యూని ఒకదాన్ని లేవదీశాడు. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ కుట్ర పన్నారనేది ఆ ఇష్యూ సారాంశం. ఎవరో ఇద్దరు వ్యక్తులు తన దగ్గరకి వచ్చి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూలిస్తే ఇరవై కోట్లు ఇస్తామని చెప్పారట. ముఖ్యమంత్రిని కూడా చేస్తామని ఆశ చూపించారట. నరేంద్రమోడీకి సన్నిహితుడినని ఆ వ్యక్తులు చెప్పారట. అలాగే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనకి ఫోన్ చేసి తనతో బీజేపీ అగ్ర నాయకుడొకరు మాట్లాడుకుంటున్నారని చెప్పారని, ఎవరా వ్యక్తి అని అడిగితే అరుణ్ జైట్లీ అనిచెప్పారని ఆరోపించాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా మదన్‌లాల్ చేసిన ఈ ఆరోపణలని బీజేపీ నాయకులు ఖండించారు. రాజకీయ వర్గాలు కూడా ఈ ఆరోపణలని రాజకీయ మైలేజీ కోసం, జనాల్లో పోయిన పరువుని తిరిగి సంపాదించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పనుల్లో భాగంగా భావిస్తున్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయంగా మరింత దిగజారిపోయే అవకాశం వుందని విశ్లేషిస్తున్నారు. ‘పిచ్చి ముఖ్యమంత్రి’గా పేరు సంపాదించుకున్న కేజ్రీవాల్ తన పార్టీ నాయకులతో ఆడిస్తున్న ఇలాంటి నాటకాలను కట్టిపెట్టాలని సూచిస్తున్నారు.

నేడు ప్రపంచ కేన్సర్ దినం

  ఈరోజు (ఫిబ్రవరి 4) ప్రపంచ కేన్సర్ దినం. గత కొన్నేళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ కేసులు విపరీతంగాపెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలు కేన్సర్ కారణంగానే జరుగుతున్నాయి. అందుకే ఈ వ్యాధి విషయంలో అవగాహన, చైతన్యం పెరగాల్సిన అవసరం వుంది. దీన్ని గుర్తించిన జెనీవాకు చెందిన యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కేన్సర్ కంట్రోల్ సంస్థ 2008లో ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ కేన్సర్ దినంగా ప్రకటించింది. ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేన్సర్ గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా చేపడతారు.

టీ-బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడం కూడా వీలుకాదా?

  ఇంతవరకు తెలంగాణా ఏర్పాటుపై చాల ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ నిన్న జరిపిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల వైఖరి చూసి కంగుతింది. రేపటి నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణా బిల్లుని ప్రవేశపెడితే, ఆంధ్ర, తెలంగాణా ప్రాంత సభ్యుల ఆందోళన కారణంగా అసలు సభ జరిగే అవకాశమే ఉండదని, అందువల్ల ఈ సమావేశాలలో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టవద్దని, ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు వంటి అత్యంత ముఖ్యమయిన బిల్లులను మాత్రమే సభలో ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల సూచనతో కాంగ్రెస్ అధిష్టానం నోటమాటలేకుండా పోయింది. కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఈ సమావేశాలలో ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు ఆమోదించడం అత్యంత అవసరం. అదిగాక మరో 39 బిల్లులపై సభలో చర్చజరిపి ఆమోదించవలసి ఉంది. వాటిలో కొన్ని రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించే ఉద్దేశ్యంతోనే ప్రవేశపెట్టబడుతున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్ధికి మేలు చేకూర్చే అటువంటి బిల్లులకు తామెందుకు మద్దతు ఈయాలి? అని భావించడంతో బీజేపీతో సహా ప్రతిపక్ష నేతలు కేవలం ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు మరికొన్ని ముఖ్యమయిన బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టాలని సూచించాయి.   తెలంగాణా బిల్లుని ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలేయమని వారు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తను అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణా బిల్లుని సభలో ఆమోదింపజేయడం మాట సంగతెలా ఉన్నా, దానిని అసలు సభలో ప్రవేశపెట్టవద్దని ప్రతిపక్షాలు కోరడం కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోవడం చాలా కష్టమవుతోంది. తెలంగాణా బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికే అభ్యంతరం చెపుతున్న ప్రతిపక్షాలు, వాటి మాట కాదని ప్రవేశపెట్టినా దానికి మద్దతు ఇస్తాయని నమ్మకం లేదు.   బీజేపీ నేత సుష్మాస్వరాజ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ యంపీలపై ఆ పార్టీకి ఎటువంటి అదుపు లేదు. అందువల్ల వారు మళ్ళీ సభా కార్యక్రమాలను జరుగకుండా స్తంబింపజేయడం తధ్యం. అటువంటి పరిస్థితిలో కీలకమయిన బిల్లులపై ఏవిధంగా చర్చించలము? అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముందుగా తన సభ్యులను అదుపులో ఉంచుకొని సభను నిర్వహించమనండి. అప్పుడు బిల్లులకు మా మద్దతు గురించి అడగవచ్చును,” అని అన్నారు.

రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ

  రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ ఢిల్లీలోనే మకాం వేశాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ రాష్ట్రాన్ని విభజిస్తోందని నినదిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో హల్‌చల్ చేస్తున్నారు. శరద్ యాదవ్ లాంటి పలువురు జాతీయ నాయకులను కలసి సమసపై వారికి పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు చంద్రబాబు భేటీ అయ్యారు. అరగంట పాటు ఆయనతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా వుందంటూ రాసిన ఓ పుస్తకాన్ని ఆయన రాష్ట్రపతికి ఈ సందర్భంగా అందజేశారు. అలాగే ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఒక ప్రహసనంలా మార్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రపతికి వివరించినట్టు తెలిసింది.

రాష్ట్ర విభజనపై సుప్రీంలో పిటిషన్లు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో మూడు వ్యక్తిగత పిటిషన్లు. ఒకటి ప్రజాహిత వ్యాజ్యం. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, విశాలాంధ్ర మహాసభ వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా, ఢిల్లీకి చెందిన ఎం.ఎల్.శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. వీటిలో మూడు పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టనున్నామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శనివారం నాడు విచారణకు చేపట్టనున్నామని చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.

6 నుంచి ఉద్యోగుల సమ్మె

  రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆఖరి అంకం పార్లమెంటుకు చేరుకున్న నేపథ్యంలో ఏపీ ఎన్జీవోలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటూ సమ్మె శంఖారావం పూరించారు. ఈనెల 6 నుంచి సమ్మె చేయనున్నట్టు ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటించారు. గురువారం నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసే సమ్మె కొనసాగిస్తామని, సమ్మెలో భాగంగా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీల ఇళ్ళను ముట్టడించనున్నట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌తో సహా సీమాంధ్రలోని 13 జిల్లాలలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య పరుగు, 10న అమలాపురంలో భారీ బహిరంగసభ, 17, 18 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహించనున్నామని అశోక్‌బాబు చెప్పారు. ఇంకా ధర్నాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ముందుకు వెళ్ళిన పక్షంలో దక్షిణాదిని చీకటిమయం చేయడానికి సిద్ధంగా వున్నట్టు విద్యుత్ జేఏసీ ప్రకటించింది.

నెలలోగా మునిసిపల్ ఎన్నికలు

  నాలుగు వారాల్లోగా రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణజ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన అంశం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతోపాటు ఇంత తక్కువ వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధర్మాసనానికి నివేదించారు. ఎన్నికల నిర్వహణకు మరింత వ్యవధి కావాలని అభ్యర్థించారు. అయితే గతంలో ఎన్నోసార్లు గడువులు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని, అలాగే రాష్ట్ర విభజన అంశం తాజాగా తెరమీదకు వచ్చింది కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

పెప్సీ వివాదంలో అమితాబ్ బచ్చన్

  సినిమా నటులు, క్రికెట్ ఆటగాళ్ళు వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కోట్ల రూపాయలకు కాంట్రాక్టులు కుదుర్చుకొని సదరు కంపెనీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా బచ్చన్ కూడా వివిద కంపెనీల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొంటున్నారు. అమితాబ్ బచ్చన్ 2008 నుండి 8 సం.ల పాటు పెప్సీ కంపెనీతో ఏడాదికి రూ.3 కోట్లు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని ఆ కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం చేసారు. అందుకు పెప్సీ కంపెనీ ఆయనకు మొత్తం రూ.24 కోట్లు చెల్లించింది. అయితే ఆయన ఇటీవల అహ్మదాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ లో ఉపాద్యాయులు, గుజరాత్ పర్యాటక శాఖ సంస్థ అధికారులు, విద్యార్ధులు పాల్గొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి.   ఆయన వారితో మాట్లాడుతూ “నేను ఒకసారి జైపూర్ లో ఒక స్కూలు విద్యార్ధులతో మాట్లాడుతున్నపుడు ఒక బాలిక “మాకు మా టీచర్ అటువంటి పానీయాలు (కూల్ డ్రింక్స్) విషం వంటివని చెప్పారు. మరి మీరు అటువంటి విష పానీయాలను త్రాగమని ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించింది?” ఆమె ప్రశ్నకు నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను. కానీ, ఆమె ప్రశ్న నన్ను తీవ్ర ఆలోచనలో పడేసింది. నేను ప్రచారం చేస్తున్న శీతల పానీయాల గురించి ప్రజలలో ఇటువంటి అభిప్రాయం ఉన్నపుడు నేను వాటికి ఇంకా ప్రచారం చేయడం సరికాదని భావించి ఇక అటువంటి ఉత్పత్తులకు ప్రచారం చేయడం మానివేశాను. అంతేకాకుండా నేను నా కొడుకు, కోడలికి కూడా అటువంటి ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని సూచించాను. ఎందుకంటే, మన వృత్తిరీత్యా ఏదయినా ఒక వస్తువుకు ప్రచారం చేసేటప్పుడు అది ఇతరుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఉండకూడదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.   అమితాబ్ బచ్చన్ వంటి ఒక ప్రముఖుడు ఎనిమిదేళ్ళ పాటు పెప్సీ మరియు ఆ కంపెనీ తయారు చేసే ఇతర శీతల పానీయాలను త్రాగమని విరివిగా ప్రచారం చేసి, అందుకు ప్రతిఫలంగా రూ.24 కోట్లు డబ్బు కూడా తీసుకొని ఇప్పుడు అవన్నీ విషంతో సమానమని, వాటికి ప్రచారం చేయవద్దని తన కొడుకు కోడలికి కూడా చెప్పానని ఆయన బహిరంగంగా చెప్పడంతో సదరు కంపెనీ వారే కాక ఇతరులు కూడా ఆయనను తీవ్రంగా తప్పు పడుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సైతం ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఆయన వాటిపై ఇంతవరకు స్పందించకపోవడంతో ఆయనపై విమర్శలు జడివానలా కురుస్తూనే ఉన్నాయి.   ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మ్యాగీ నూడుల్స్, పార్లే గోల్డ్ స్టార్ కుకీస్, బైనాని సిమెంట్స్, కళ్యాణ్ జ్యులర్స్, గుజరాత్ పర్యాటక శాఖలకు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడయినా ఈ వస్తువులలో కూడా ఏదయినా లోపం ఉందని ఆయన తెలుసుకొంటే అప్పుడు వాటిని కూడా వాడవద్దని ఆయన సూచిస్తారా? ఆ విధంగా చేస్తే, ఇంతవరకు ఆయన సదరు వస్తువు కోసం చేసిన ప్రచారమంతా దేనికోసం? దేశంలో అత్యంత ప్రభావంతుడయిన ఆయన చేసే ప్రచారం వల్ల ఒక వస్తువు అమ్మకాలు ఏవిధంగా పెరుగుతాయో,దానికి వ్యతిరేఖంగా ఆయన చెపుతున్నమాటలు కూడా అంతే వ్యతిరేఖ ప్రభావం చూపుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు. మా శీతల పానీయాలకు ఎనిమిదేళ్ళు ప్రచారం చేసిన తరువాత ఇప్పుడు ఆయన ఆవిధంగా చెప్పడం చాలా విచారకరమని పెప్సీ కంపెనీ సంస్థ ప్రతినిధులు అన్నారు.

బుధవారం నుంచి పార్లమెంట్

  ప్రస్తుత 15వ లోక్‌సభ చివరి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అవినీతి నిరోధానికి సంబంధించిన బిల్లులు, మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుస్తోంది. మొత్తం 39 బిల్లులను కేంద్రం క్యూలోపెట్టింది. అయితే ఈ సమావేశాల్లో బిల్లుల గురించి చర్చించకూడదని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక్కదాన్ని ప్రవేశపెడితే సరిపోతుందని అనేక పార్టీలు సూచించినా కేంద్రం తన పట్టు విడిచిపెట్టలేదు. తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో పెట్టడం మీద వచ్చిన అభ్యంతరాలనీ కేంద్రం పట్టించుకోవడం లేదు. సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగింది. సభలో సీమాంధ్ర ఎంపీలను కేంద్రం అదుపు చేయగలిగితే తెలంగాణ బిల్లు మీద చర్చకు ఒప్పుకుంటామని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కేంద్రానికి స్పష్టం చేశారు.

తెలంగాణా ప్రజలకు కేసీఆర్ భరోసా

  తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు ఇచ్చే అంశంపై మీడియాలో వస్తున్నరకరకాల వార్తలు, కధనాలు తెలంగాణావాదులకు, ప్రజలకు చాలా ఆందోళన కలిగించడం సహజమే. టీ-కాంగ్రెస్ నేతలందరూ వాటిని ఎంత గట్టిగా ఖండిస్తున్నా, వారందరూ ఒకే కాంగ్రెస్ తానుకి చెందినవారు గనుక తెలంగాణా ప్రజలు వారి మాటలను నమ్మేందుకు సిద్దంగా లేరు. అందుకే కేసీఆర్ వెంటనే మీడియా ముందుకు వచ్చి బీజేపీ మద్దతుపై వస్తున్నవార్తలను నమ్మనవసరం లేదని, బీజేపీ తప్పకుండా తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తుందని, ఈ పార్లమెంటు సమావేశాలలోనేబిల్లు ఆమోదం పొందడం, ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం ఖాయమని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఎంతగా భరోసా ఇస్తున్నపటికీ, బీజేపీ నేతలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెపుతున్న మాటలు మారిన వారి ఆలోచనలకు అద్దంపడుతున్నాయి.

నరేంద్ర మోడీకే నా ఓటు: కిరణ్ బేడీ

  మాజీ ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ బేడీ మొన్న ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల గురించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. “రాహుల్ గాంధీకి నేను ఓటు వేయలేను. ఎందుకంటే లెర్నింగ్ లైసెన్సుతో వస్తున్నఅటువంటి వ్యక్తి చేతికి దాదాపు 1.2 బిలియన్ల జనాభా ఉన్న భారత్ దేశాన్ని అప్పగించలేము. అనుభవరహితుడయిన అతను ఇంత పెద్ద దేశాన్ని ప్రధానిగా పరిపాలించగలడని నేను భావించడం లేదు. కానీ, అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కొని నెగ్గుకొచ్చిన నరేంద్ర మోడి ప్రధాని పదవికి అన్ని విధాల తాను అర్హుడనని నిరూపించుకొన్నారు. ఇంత పెద్ద దేశాన్నికొత్తగా డ్రైవింగ్ నేర్చుకొంటున్న అనుభవరహితుడయిన రాహుల్ గాంధీ చేతిలో పెట్టడం కంటే, అనుభవజ్ఞుడు, తన దక్షత నిరూపించుకొన్న వాడయిన నరేంద్ర మోడీ చేతికి అప్పగించడమే మేలని నేను భావిస్తున్నాను. అందువల్ల నేను వారిరువురిలో నరేంద్ర మోడీకే నా ఓటు వేసేందుకు ఇష్టపడతాను.” అని అన్నారు.   ప్రముఖ సామాజిక నేత అన్నాహజారేతో కలిసి నడుస్తున్న కిరణ్ బేడీ ఒకప్పటి తమ ఉద్యమ సహచరుడయిన అరవింద్ కేజ్రీవాల్ కి కానీ, ఆయన స్థాపించిన ఆమాద్మీ పార్టీకి గానీ ఈవిధంగా ఎన్నడూ తన మద్దతు ప్రకటించలేదు. కానీ, తామందరూ వ్యవ్యతిరేకిస్తున్న బీజేపీకి చెందిన ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి ఈవిధంగా మద్దతు తెలపడం విశేషమే. ఆమాద్మీ పార్టీ కూడా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా వీలయినన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోందని తెలిసి ఉన్నపటికీ ఆమె బీజేపీకి మద్దతుగా మాట్లాడటం మరో విశేషం.   ఇక ఆమె మాటలను మన రాష్ట్రానికి కూడా చాలా చక్కగా అన్వయించుకోవచ్చును. ప్రస్తుతం మన రాష్ట్ర, దేశం పరిస్థితులు ఒక్కలాగే చాల క్లిష్టంగా తయారయ్యాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కంటుంటే, ఇక్కడ రాష్ట్రంలో అనుభవరహితుడు, అనేక ఆర్ధిక నేరాలలో కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మరో నాలుగు నెలలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని ఆత్రుత పడుతున్నాడు.   ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగినా, జరుగకపోయినా మున్ముందు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనకొనవలసి ఉంటుంది. ఆ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడం, గాడి తప్పినా పాలనను మళ్ళీ గాడిలో పెట్టడం అనుభవరహితుడయిన జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం కాదని చెప్పవచ్చును. అందువల్ల రాష్ట్ర ప్రజలు కూడా అన్నివిధాల సమర్ధుడయిన వ్యక్తికే ఓటు వేయడం అత్యవసరం.

కమలంపై చంద్రుడి ప్రభావం

  చంద్రబాబు కంటే ముందే డిల్లీ చేరుకొన్న కేసీఆర్ తెలంగాణాపై ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నబీజేపీ నేతలని కలిసి, బిల్లుకి అనుకూలంగా వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. కానీ, వారు ఆయన కంటే ముందు చంద్రబాబునే కలవడం, మారుతున్న వారి ఆలోచనలకు అద్దం పడుతోంది. బీజేపీ మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి పూర్తి మద్దతు తెలుపుతున్నపటికీ, తెదేపాతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత క్రమంగా దాని ఆలోచనా సరళిలో కూడా మార్పు రాసాగింది. చంద్రబాబు కూడా రాష్ట్ర విభజనను కాక అది జరుగుతున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేఖిస్తున్నందున, ఎన్నికల తరువాత రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేయవచ్చని బీజేపీ భావించి ఉండవచ్చును.   అదీగాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకే ప్రయోజనం కల్పిస్తుంది తప్ప బీజేపీకి కాదు. అంతేగాక, ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే అటువంటి లోపభూయిష్టమయిన బిల్లుని ఆమోదింపజేసినందుకు బీజేపీ ప్రభుత్వమే నానా అవస్థలు పడవలసి ఉంటుంది. గనుకనే బీజేపీ ఇప్పుడు తెలంగాణాపై మాట మార్చింది. ఇప్పుడు బీజేపీ నేతలు సీమాంధ్రవైపు మొగ్గు చూపిస్తుండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనని చెప్పవచ్చును. తొమ్మిదేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి బీజేపీ కంటే బాగా రాష్ట్ర పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు గురించి తెలుసు గనుక, బహుశః బీజేపీ నేతలు ఆయన సూచన ప్రకారమే వ్యవహరిస్తుండవచ్చును.   ఇక మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే ఇంతవరకు పార్టీలోని ఆంధ్ర, తెలంగాణా ప్రాంత నాయకులను వారివారి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడేందుకు అనుమతించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వారినందరినీ ఒకే త్రాటిపైకి తీసుకువచ్చి వారందరినీ వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రతిపక్షనేతలని కలుస్తుండటం ద్వారా తెదేపా ఇంతకాలంగా కోరుతున్న'ఇరుప్రాంతాల ప్రజలకి సమన్యాయం' అనే తన వాదనలో నిబద్దత ఉందని స్పష్టం చేయగలిగారు. ఒకవేళ ఆయన ప్రత్యర్దులందరూ వాదిస్తున్నట్లుగా ఆయన సమైక్యాంధ్ర లేదా సీమాంధ్రకే ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే, ఆయన కేవలం సీమాంధ్ర సభ్యులనే వెంటబెట్టుకొని వెళ్ళేవారు. ఇది ఆయన నాయకత్వాల్ లక్షణాలకి, రాజకీయ చాతుర్యానికి అద్దంపడుతోంది. 

సీఎమ్మా? ఏ స్టేట్‌కి?

      వైఎస్సార్సీపీ ప్లీనరీలో జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఆయన భృత్యులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నాలుగు నెలల తర్వాత నేనే సీఎం అంటూ జగన్ ముసలమ్మలకి, ముసలయ్యలకి ఆ మీటింగ్‌లో చెప్పడం, నాలుగు నెలల్లో మీ మనవడు సీఎం కాబోతున్నాడు (అంటే జగనే) అని అనడం జగన్ శిబిరంలో లేని ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్సీపీ మూలన పడిందన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్న తరుణంలో పార్టీలో ఉత్సాహాన్ని నింపడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇలాంటి స్టేట్‌మెంట్లని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   జగన్ తాను సమైక్యవాదినని చెబుతున్నప్పటికీ లోకం మొత్తం ఆయన్ని విభజనవాదిగానే చూస్తోంది. నిన్నగాక మొన్న వైసీపీలోంచి బయటపడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రఘురామ కృష్ణంరాజు జగన్ నూటికి నూరుశాతం విభజనవాది అని ఢంకా బజాయించి చెబుతుంటే దాన్ని ఖండించేవారు వైసీపీలో ఎవరూ లేకుండా పోయారు. ఇప్పుడు జగన్ నాలుగు నెలల తర్వాత తానే సీఎం అని ప్రకటించడం వైసీపీలోని కొన్ని వర్గాలను సంతోషపరుస్తున్నప్పటికీ, కొన్ని వర్గాలు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు నెలల తర్వాత జగన్ సీఎం అయ్యేది పూర్తిస్థాయి ఆంధ్రప్రదేశ్‌కా? లేక రాష్ట్రం ముక్కలయ్యాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కా అనే సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క రాష్ట్రం ముక్కలయ్యే ముప్పు ముంచుకొస్తుంటే జగన్ మాత్రం తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని స్టేట్‌మెంట్లు ఇస్తూ వుండటం వైసీపీలోనే కొన్ని వర్గాలకు మింగుడు పడటం లేదు. విభజన బిల్లు ఢిల్లీకి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటు విభజనవాదులు, ఇటు సమైక్యవాదులు ఢిల్లీకి చేరుకుని ఎవరి లాబీయింగ్‌లో వారున్న నేపథ్యంలో జగన్ మాత్రం అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా మీటింగులు, స్టేట్‌మెంట్లతో స్టేట్‌లోనే కాలక్షేపం చేస్తూ వుండటాన్ని అందరూ అనుమానపు కళ్ళతో చూస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆఖరి బాల్ ఆడబోతున్నారా?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు డిల్లీలో ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యంపీలు, యం.యల్యేలతో కలిసి మౌనదీక్ష చేసి, ఆ తరువాత రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి ఆయనకు విజ్ఞప్తి పత్రం అందించబోతున్నట్లు ద్రువీకరించబడింది. అయినా ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం ఈవిషయంపై స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క కాంగ్రెస్ అధిష్టానం తప్ప మిగిలిన అందరు ఏదో రూపంగా దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. చివరికి ఈ రోజు బీజేపీ సీనియర్ నాయకురాలుఅయిన సుష్మస్వరాజ్ కూడా ఈ దీక్ష గురించి మాట్లాడుతూ “తన ముఖ్యమంత్రినే అదుపులో పెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ మేము తన మాట వినాలని ఏవిధంగా భావిస్తోందో అర్ధం కావడం లేదు,” అని వ్యాఖ్యానించారు.   పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్న కీలక సమయంలో, ముఖ్యమంత్రి స్వయంగా తన నిర్ణయాన్నివ్యతిరేఖిస్తూ డిల్లీలోనే దీక్షలు, ర్యాలీలకు పూనుకోవడం, రాష్ట్రపతిని కలిసి అందుకు అనుమతి ఈయవద్దని కోరాలనుకోవడం కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయడం క్రిందే లెక్కవస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావించవచ్చునేమో కానీ ప్రతిపక్షాలు, మీడియా మాత్రం ఆ విధంగా భావించబోవు.     ముఖ్యమంత్రి రేపు డిల్లీలో చేయబోయే దీక్ష వలన రాష్ట్ర విభజన ఆగకపోవచ్చు కానీ, అధిష్టానంపై మాత్రం తీవ్రమయిన ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రతిపక్ష పార్టీలు, జాతీయ మీడియా అందరూ కలిసి ఆయన దీక్షను ప్రస్తావించడం వలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు గంగలో కలిసిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందునా కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశరాజధానిలో దీక్ష చేస్తే, కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్దంగా రాష్ట్ర విభజనకు పూనుకొంటోoదనే భావన దేశమంతా వ్యాపిస్తుంది.     ఇప్పటికే బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. రేపటి నుండి నరేంద్ర మోడీతో సహా బీజేపీ నేతలందరూ ఇదేవిషయాన్ని తమ ఆయుధంగా చేసుకొని సభలలో ప్రముఖంగా ప్రస్తావించడం మొదలుపెడితే ఇక కాంగ్రెస్ పార్టీకి జరగబోయే నష్టం గురించి అంచనా వేయలేము.   అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం ఇక కిరణ్ కుమార్ రెడ్డిని ఎంత మాత్రం ఉపేక్షించే అవకాశం లేదని భావించవచ్చును. కానీ, బహుశః ఆఖరు ప్రయత్నంగా ఆయనకు నయాన్నో భయాన్నోనచ్చజెప్పి దీక్షలు, ర్యాలీలు విరమింపజేసే ప్రయత్నాలు చేస్తోందేమో! కానీ ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి మొండిగా ముందుకే వెళ్ళదలిస్తే మాత్రం ఇక ఇదే ముఖ్యమంత్రిగా ఆయన ఆఖరు డిల్లీ యాత్ర కావచ్చును. అంతకంటే ముందే ఆయనను పదవిలోంచి తొలగించినా ఆశ్చర్యం లేదు.   పరిస్థితులు ఇంతవరకు వచ్చిన తరువాత ఆయన తన పదవిలో, పార్టీలో కొనసాగడం కూడా కష్టమే. అయితే, తనే స్వయంగా పదవి నుండి తప్పుకోవడం కంటే, పార్టీ చేతే వేటు వేయించుకొని బయటపడినట్లయితే, దానివలన సీమాంధ్రలో ప్రజల నుండి అపారమయిన సానుభూతి పొందవచ్చును. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తన పదవిని, పార్టీని తృణప్రాయంగా త్యజించినందుకు సమైక్య ఛాంపియన్ బిరుదు కూడా ఇక ఆయనకే ఖరారు అవుతుంది. ఒకవేళ ఇదంతా కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమే అయి ఉంటే నేడో రేపో ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం వేటువేసి, ఆయన స్థానంలో ఏ కన్నా లక్ష్మి నారాయణనో నియమించవచ్చును.   ఒకవేళ ఇంకా ఉపేక్షిస్తే అది కాంగ్రెస్ పార్టీకే కాక, ఆయనకీ రాజకీయంగా చాల నష్టం కలిగిస్తుంది. ఇంత హంగామా చేసిన తరువాత కూడా అయన ఇంకా తన పదవిలోనే కొనసాగితే ఆయన విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది గనుక, ఒకవేళ అధిష్టానం తనను పదవి నుండి తప్పించాకపోయినట్లయితే ఆయనే తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి, “సమైక్య త్యాగశీలి’ గా బయటకు వచ్చి తన కొత్త పార్టీకి రిబ్బన్ కటింగ్ చేసుకోవచ్చును.