చెల్లి చనిపోయిందని..చెల్లితో పాటే చితిలోకి

తను ప్రాణాలకన్నా మిన్నగా చూసుకునే చెల్లి చనిపోయే సరికి బ్రతకడం అనవసరమని తాను తనువు చాలించే అన్నలను మనం సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ నిజ జీవితంలోనూ చెల్లిలి పట్ల అంతకన్నా ఎక్కువ మమకారాన్ని చూపించే అన్నలున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా పుదుపేట మండలం కొంగరపాళయం గ్రామానికి చెందిన కుమార్, కుమార్ అన్నాచెల్లెల్లు. అతడికి చెల్లెలంటే పంచప్రాణాలు, కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇటీవలే శక్తివేల్ అనే యువకుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. మెట్టినింట ఉన్న చెల్లిల్ని చూడకుండా ఉండలేక తరచూ చూసి వస్తుండేవాడు.   ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా కుమారి శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే కుమార్ కుప్పకూలిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. విచారణ అనంతరం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. అయితే చెల్లిని కడసారి చూస్తూ..చితిలో కాలుతున్న ఆమె శరీరాన్ని చూసి తల్లడిల్లిపోయిన కుమార్ వెంటనే చితిపైకి దూకేశాడు. ఊహించని ఈ సంఘటనతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. వెంటనే కుమార్‌ను బయటికి లాగారు. తీవ్రంగా గాయపడిన కుమార్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

షీనా బోరా హత్య కేసులో అప్రూవర్ గా డ్రైవర్... కోర్టు గ్రీన్ సిగ్నల్

  షీనా బోరా హత్య కేసులో మరో ట్వీస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షి, హంతకుల్లో ఒకడైన ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్వామ్ వర్ రాయ్ అఫ్రూవర్ గా మారాడు. ఇప్పటికే ఈకేసులో భాగంగా ఆయనను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన అప్రూవర్‌గా మారి నిజాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. షీనా బోరా హత్య కేసుకు సంబంధించి అన్ని వివరాలు తకను తెలుసునని, అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలని మే 2016న కోర్టును ఆశ్రయించాడు. శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా  షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇంద్రాణి ముఖర్జీయాతో పాటు ఆమెకు సహకరించిన సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌లతో పాటు పీటర్ ముఖర్జీయా కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా జైలు జీవితం గడుపుతున్నారు.

మన్మోహన్ ను అలా అన్నాడు... సారీ చెప్పాడు..

  ఈ మధ్య నేతలు ఎలా తయారయ్యారంటే.. అవేశంతో తమ నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేయటం.. అది పెద్ద దుమారం అయిన తరువాత మేల్కొని సారీ చెప్పడం. ఇప్పటికి చాలా మంది నేతలనే చూసుంటాం.. ఇప్పుడు రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చాంద్ కటారియా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఈయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ అమెరికా వెళితే ఆయనకు ఎయిర్ పోర్ట్ లో మంత్రులు ఆహ్వానం పలికితే.. మోడీకి మాత్రం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం పలికారని విమర్శించారు. అంతే కటారియా చేసిన వ్యాఖ్యలపై నిరసనలు తలెత్తాయి. ఇంక మంత్రిగారు చేసేముందు ఆఖరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ ను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు.. మాట్లాడుతున్నప్పుడు అలా మధ్యలో వచ్చేసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నా.. ఇలా వ్యాఖ్యానించినందుకు క్షమాపణలు చెబుతున్నా అని అన్నారు.

'యోగా డే' కు భారీగా ఏర్పాట్లు..

  జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్బంగా ఇప్పటికే పలు దేశాల్లో ఏర్పాట్లు భారీగానే జరిగినట్టు కనిపిస్తోంది. రేపు జరబోయే ఈ యోగా డే లో  చండీగఢ్‌లో వేలాది మందితో కలిసి ప్రధాని మోడీ ఆసనాలు వేయనున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఇక ఐరోపా పార్లమెంటులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రారంభించనున్నారు. మొత్తం 190 దేశాల్లో ఘనంగా యోగా డే ను నిర్వహించనున్నారు.   కాగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కోసం 2014 సెప్టెంబరులో ఐరాస సర్వసభ్య సమావేశాల్లో మోదీ పిలుపునివ్వటంతో జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐరాస ప్రకటించింది.

మరో బులెట్ రైలోచ్చేస్తుందోచ్..

  ఇండియాకు మరో బులెట్ రైలు వచ్చేస్తోంది. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ రైల్ ఖరారు కాగా, ఇప్పుడు మరో బులెట్ రైలును తీసుకురానున్నారు. ఈ రెండో బులెట్ రైలు రూట్ ఢిల్లీ, వారణాసి మధ్య రానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి లక్నో మధ్య 506 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల 45 నిమిషాల్లోనే చేరుకునేంత వేగంతో ఇది నడుస్తుందని అధికారులు తెలుపుతున్నారు. ఇంకా దీని నిర్మాణం కోసం రూ. 43 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వాటిల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న వేళ, యూపీ ప్రజలకు బులెట్ రైలు వరాన్ని ఎన్నికల లోపే మోదీ ప్రకటించవచ్చని సమాచారం.

ఈ దేహానికి వైద్య మెందుకు.. నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి.. ముద్రగడ

కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష పదకొండో రోజుకి చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యంపై అటు కుటుంబ సభ్యులు, కాపు నేతలు, అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కుటుంబసభ్యులు, బంధువులు దీక్ష విరమించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన మాత్రం దీక్ష విరమించేందుకు ఒప్పుకోవడం లేదు. అంతేకాదు 'రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి వైద్య మెందుకు? ఇవన్నీ అవసరమా? నన్ను వేరెక్కడికీ తీసుకెళ్లొద్దు. తీసుకు వెళ్లాలనుకుంటే నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి' అంటూ ఆయన దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.   మరోవైపు వైద్యులు కూడా ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన శరీరంలో కీటోన్ల సంఖ్య మరింత పెరిగిందని.. ఇది చాలా ప్రమాదకరమని.. దీనివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని తెలిపారు. ఫ్లూయిడ్స్ అందిస్తున్నా ఆయన ఆరోగ్యాన్ని నియంత్రించడం కష్టంగా ఉందని.. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన ఆరోగ్య రీత్యా మంచిది కాదని వైద్యులు తెలిపారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. ముద్రగడ దీక్షను విరమిస్తారో లేదో చూడాలి.

టీచర్లు వర్సెస్ పోలీసులు... 8 మంది టీచర్లు మృతి..

మెక్సికోలో ఒయాక్సాకా రాష్ట్రంలో ఉపాధ్యాయులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఉపాధ్యాయులకు..పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఆందోళనలో భాగంగా ఉపాధ్యాయులు.. నిన్న ఒయాక్సాకా-ప్యూబ్లా రాష్ట్రాల మధ్య రహదారిని దిగ్బంధించేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీచర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు ఫైరింగ్ జరపగా.. ఈ కాల్పుల్లో 8 మంది ఉపాధ్యాయులు ప్రాణాలుకోల్పోయారు.. పలువురికి గాయాలయ్యాయి. అంతేకాదు ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.   కాగా విద్యావ్యవస్థలోని ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని అక్కడ ఉన్న యూనియన్ సీఎన్ టీఈకి చెందిన కొందరు ఉపాధ్యాయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని అరెస్టు చేశారు. దీంతో సీఎన్ టీఈ యూనియన్ కు చెందిన టీచర్ సంఘాల వారంతా రోడ్లెక్కారు.

దుమారం రేపుతున్న సర్దార్ 'గన్ పెన్' మాల...

  గుజరాత్ మాజీ పోలీసు అధికారి డీజి వంజార.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి గన్ మాల వేయడం పెద్ద దుమారమే రేపుతోంది. గుజరాత్ లోని తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వంజార పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పటేల్ విగ్రహానికి పెన్నులు, గన్ తో ఉన్న మాలను వేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఓ నిజమైన జాతీయవాదిగా, పటేల్ ఎన్నో సంస్థానాలను దేశంలో విలీనం చేశారని.. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసేందుకే తాను ఈపని చేశానని చెప్పుకొచ్చారు. అస్త్రశస్తాలతో ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారని కొనియాడారు. కాగా వంజార తాను సర్వీసులో ఉన్న సమయంలో ఎన్నో ఎన్ కౌంటర్లు చేసి వార్తల్లో నిలిచారు. అంతేకాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఇష్రాత్ జహాన్, సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్లు నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బెయిల్ పై ఉన్నారు. మరి ఈ గన్ పెన్ మాలపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి....

సెల్ఫీలతో ముసలితనమే..

సెల్ఫీలు..ఇప్పుడు యూత్‌కు ఇదోక ఫ్యాషన్..నలుగురితో కలిసినా..ఒంటరిగా ఉన్న ఒక్క సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇలాంటి వారికి ఒక చేదువార్తను చెప్పారు నిపుణులు. సెల్ఫీలు పదేపదే తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తాయని బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు తేల్చారు. స్మార్ట్‌ఫోన్ నుంచి వెలువడే బ్లూ రేస్ చర్మంలోకి చొచ్చుకుపోయి చర్మంపై ముడతలు ఏర్పాడతాయంటున్నారు. హ్యాండ్‌సెట్ నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్ విడుదలవుతుందన్నారు. దీంతో డీఎన్‌ఏ దెబ్బతింటుందన్నారు సైంటిస్టులు. సెల్ఫీలు తీసుకునేటప్పుడు కెమెరాను కంటికి, ముఖానికి ఎదురుగా తీసుకొస్తాం..ఈ కారణంగా ఆ ప్రదేశాల్లో చర్మం ముడతలు పడటం..పొడిబారటం జరుగుతుందని..టెక్‌సావీ, స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంటుందట. సో..సెల్పీల కోసం స్కిన్ పాడుచేసుకోండి.

ఏకే 47 మిస్ ఫైర్... గడ్డం నుండి తల బయటకి బులెట్..

ఏకే 47 గన్ మిస్ ఫైర్ అయి ప్రాణాలు కోల్పోయాడు శివకుమార్ అనే కానిస్టేబుల్. ఈఘటన బేగంపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శశికుమార్ అనే వ్యక్తి ఇటీవలే డిప్యుటేషన్‌పై గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే విధులు ముంగిచుకున్న అతను.. తన వద్దనున్న గన్ ను శుభ్రం చేస్తున్న.. క్రమంలో మిస్ ఫైర్ అయి బులెట్.. గడ్డం కింద నుండి తల భాగం నుండి బయటకు వచ్చింది. అంతే శశికుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది అతన్ని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అతని మృతదేహాన్ని నిమ్స్ మార్చురిలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా లేక.. ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ నేతలపై బాంబుల దాడి..

విశాఖపట్నంలో టీడీపీ నేతలపై గుర్తు తెలయని దుండగలు బాంబులతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విశాఖ డెయిరీ డైరెక్టర్, టీడీపీ మండల నాయకుడు గేదెల సత్యనారాయణ జిల్లా బుచ్చియ్యపేట మండలం కోమర్లపూడి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వెళ్లి విధుల్లో భాగంగా.. పెద్దగొట్టు చెరువు వద్ద పనులు చేయిస్తున్నారు. పనులను పరిశీలిస్తున్న క్రమంలోనే కొంతమంది దుండగులు వచ్చి.. ఆయనపై బాంబులు విసిరి పారిపోయారు. బాంబులు పేలడంతో.. ఇనుప ముక్కలు ఆయన శరీరంలోకి గుచ్చుకుపోయి తీవ్ర గాయాలవ్వగా.. అతనిని రావికమతంలోని ఆస్పత్రికి తరలించారు.   మరోవైపు సమాచరం అందుకున్న చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు హూటాహుటిన రావికమతం చేరుకొని సత్యనారాయణను తన కారులో విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నామని బుచ్చియ్యపేట ఎస్‌ఐ ధనుంజయ్ తెలిపారు. అయితే ఈ దాడికి కారణం రాజకీయాలా? లేక వ్యక్తిగత కక్షలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. దాడిలో గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.

భారీ ఎన్‌కౌంటర్.. కీలక నేత మృతి..

  తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా అహెరి తాలుకా కాటేపెల్లి అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగగా.. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన మావోల్లో.. ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్‌ (చార్లెస్‌) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంక మిగిలిన ఇద్దరు.. మంగి ఏరియా దళ కమిటీ సభ్యుడు ముఖేష్, ఐరి ఏరియా కమిటీ దళ సభ్యుడు దినేష్ ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకితోపాటు రెండు మందుగుండు సామగ్రి డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

పిలిస్తేనే ఆ సభకు వెళ్లాను..

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు టోకరా పెట్టి బ్రిటన్ పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కింగ్‌షిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్య లండన్‌లోని పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నాడంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. దీనిపై రచయిత సుహేల్ సేథ్ స్పందిస్తూ ఇది ఓపెన్ ఈవెంట్ అని ఎవరైనా రావొచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మాల్యా ట్విట్టర్‌ ద్వారా వెలుగులోకి వచ్చారు. పిలవకుండా పోవాల్సిన అవసరం తనకు లేదని..నా జీవితంలో ఎన్నడూ పిలవని పేరంటాలకు వెళ్లలేదన్నారు. అసలు అలాంటి చోట్లకు ఎన్నడూ వెళ్లను కూడా. నాకు ఆహ్వానం ఉందని పోస్ట్ చేశారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు..చార్జ్‌షీట్ లేదు. ఏదైనా ఆరోపించే ముందు నా వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇది దురదృష్టకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిలో టీడీపీ, వైసీపీ బాహాబాహీ..

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అమరావతి దేవస్థానానికి చెందిన సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో టీడీపీ అవకతవకలకు పాల్పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై నిజానిజాలను తేల్చేందుకు పార్టీ తరపున కమిటీ వేసింది. దానిలో భాగంగా ఈ కమిటీ సభ్యులు ఇవాళ అమరావతిలో పర్యటించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వీరిని అడ్డుకున్నారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకే వైసీపీ నేతల పర్యటన అంటూ టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రహదారిపై బైఠాయించి పోటాపోటిగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు

"అతి"థి మర్యాద..జడ్జిల భోజనం కోసం వెండికంచాలు..

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ అతిథుల కోసం "అతి" చేసింది. అదేంటంటే ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి నాలుగు రోజుల పాటు సుప్రీంకోర్టు జడ్జిల నాలుగో సదస్సు జరిగింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జడ్జిలతో పాటు వారి భార్యలు కూడా హాజరయ్యారు. సదస్సు తమ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి వీరందరికి ఎలాంటి లోటు చూసుకోవాలనుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని..వీరిని ప్రభుత్వ అతిథులుగా ప్రకటించింది. అంతేకాకుండా వారు భోజనం చేయడానికి ఏకంగా వెండి కంచాలను, పాత్రలను కొనుగోలు చేసింది. వాటి కొనుగోలుకు రూ.3.57 లక్షలు, ఆహార పదార్థాల కోసం రూ.3.37 లక్షలు ఖర్చు చేసింది. అంతేకాకుండా అతిథులకు బహుమతులు కూడా అందజేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అజయ్ దూబే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడంతో ప్రభుత్వ అతి మర్యాదలు బయటపడ్డాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.