సైకిల్ పై అమరావతికి.. మహిళ సాహసం..

  హైదరాబాద్ లో ఏపీ ఉద్యోగుల తరలింపు ప్రారంభమైంది. ఈనెల 27 నాటికి ఉద్యోగులందరూ ఏపీ రాజధాని అమరావతి వెళ్లాలని చూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులు ఏపీకి పయనమయ్యారు. నిన్న కొంతమంది ఏపీకి తరలి వెళ్లగా.. ఈరోజు కొంతమంది హైదరాబాద్ నుండి ఏపీకి బయలుదేరారు. సహకార, వాణిజ్య, సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో విజయవాడ బయల్దేరారు. అయితే అందరూ బస్సుల్లో వెళ్తుంటే.. పద్మ అనే ఉద్యోగిని మాత్రం తాను సైకిల్ మీద అమరావతికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. దీనికి ఏపీఎన్జీవో సంఘం నేతలు అశోక్ బాబు, కృష్ణయ్య తదితరులు ఆమెకు మద్దతు తెలిపారు. అశోక్ బాబు జెండా ఊపి ఆమె సైకిల్ ప్రయాణాన్ని ప్రారంభింప చేశారు. ఇదిలా ఉండగా.. కొంతమంది ఉద్యోగులు మాత్రం ఇక్కడి ఉద్యోగులను వదిలి వెళ్లలేక కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఏపీ కేబినెట్ లో చర్చించే అంశాలు ఇవే...

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలోని సీఎం కార్యలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలకమైన అంశాలపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చర్చించే అంశాలు.. * ఏపీ రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికకు సంబంధించి స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలపై చర్చించి.. స్విస్ ఛాలెంజ్‌కు సంబంధించిన బాధ్యతను సీఆర్డీఏకు అప్పగిస్తూ కేబినెట్ డిసెషన్ తీసుకునే అవకాశం * రాజధానికి ఉద్యోగుల తరలింపుపైనా *రేషన్ డీలర్లకు కమిషన్ పెంపుపై * కృష్ణా పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లపై * ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే పచ్చజెండా ఊపిన సర్కారు నిరుద్యోగుల వయోపరిమితి పెంపు డిమాండ్ అంశంపైనా * కృష్ణా జలాల వివాదం పై చర్చలు జరిగే అవకాశం.

సిద్ద రామయ్య నయా వివాదం.. బిపాసాకు కోటిన్నర

  కర్ణాటక ముఖ్యమంత్రికి ఏదో ఒక వివాదం లేనిదే అస్సలు నిద్రపట్టదు. వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన బెంగుళూరులో యోగా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తార బిపాసా బసును కూడా ఆహ్వానించారు. మరి ప్రభుత్వమే స్వయంగా వచ్చి అడిగితే బిపాసా ఊరుకుంటుందా.. గంటన్నర పాటు జరిగే ఈకార్యక్రమానికి కోటిన్నర కావాలని డిమాండ్ చేసిందట. దీనికి సిద్దరామయ్య ప్రభుత్వం కూడా ఓకే చెప్పి బిపాసాబసుకు కోటిన్నర చెల్లించారు. అంతేనా ఆమె రావడానికి, వెళ్లడానికి ఖర్చులు, ఉండటానికి హోటల్ అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించిందట. అంతే ఈ వార్త బయటకి రాగానే.. సిద్దరామయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరి సీఎం గారు దీనిని ఎలా కవర్ చేసుకుంటారో చూడాలి.

మీడియాతో ఫేస్ బుక్ బప్పందం..

  ఫేస్ బుక్ రోజుకో సరికొత్త ఫీచర్స్ తో యూజర్ల ముందుకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా.. ప్రముఖ మీడియా సంస్థలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా మీడియా ప్రత్యక్ష ప్రసారాలను ఫేస్ బుక్ ద్వారా లైవ్ లో చూసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈనేపథ్యంలోనే.. సుమారు 336 కోట్ల 55 లక్షల విలువ చేసే 140 ఒప్పందాలపై సంతకం చేసింది. దీనిద్వారా సామాజిక మాధ్యమంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఫేస్ బుక్ లో వినియోగదారులకు అందుబాటులో ప్రత్యక్ష ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బజ్ ఫీడ్, ఎన్ వైటీ, సీఎన్ఎన్ వంటి సంస్థలకు అత్యధికంగా 67 కోట్ల, 32 లక్షల రూపాయల వరకూ చెల్లించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ మరో ఉద్యమానికి తెర తీస్తున్నారా..?

  రాష్ట్ర విడిపోయిన తరువాత దాదాపు అన్నింటిలోనూ ఇరు రాష్ట్రాలకు పంపకాలు జరిగాయి. ఏపీకి రావాల్సినవి ఏపీ తీసుకుంది.. తెలంగాణకు రావాల్సింది తెలంగాణ తీసుకుంది. ఇప్పటికే కొన్ని అంశాలపై జరుగుతున్న వివాదులు ఓ కొలిక్కి రావడం లేదు. అటు హైకోర్టు విషయంలో కాని, నీళ్ల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి కానట్టు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వివాదానికి తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ వాటి గురించే కొట్టుకుంటుంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాటి గురించి కూడా రగడ మొదలయ్యేలా ఉంది.   రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దీనిలో భాగంగానే ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు రెండు పేజీల లేఖ రాశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ స్థలాన్ని తెలంగాణకు బదిలీ చేయాలని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ భవన్‌ స్థలంలో తెలంగాణ నూతన భవనాన్ని నిర్మించుకుంటామని కేసీఆర్‌ తెలిపారు. అలాగే షెడ్యూల్ 10పై నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ భవన్‌ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు.   మరి దీనికి ఏపీ నేతలు ఎలా స్పందిస్తారూ.. కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ కు వాళ్లు అంగీకరిస్తారా.. లేక దీనిపై కూడా ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటాయా చూడాలి.

ప్రధానికి ట్రాఫిక్ పోలీస్ ఫైన్...

ఏదో ప్రధాని ముచ్చటపడి మోటార్ బైక్ టాక్సీ నడిపితే.. అతనికే ఫైన్ వేసి అందరినీ అశ్యర్యపరిచాడు ఓ ట్రాఫిక్ పోలీస్. వివరాల ప్రకారం.. కంబోడియా ప్రధాని హన్ సేన్.. కో కాంగ్ ప్రావిన్స్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డుపై మోటార్ బైక్ టాక్సీ నడిపి తన ముచ్చట తీర్తుకుందామనుకున్నారు. ఈ క్రమంలోనే దానిని కొద్దిసేపు నడిపారు. అయితే అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు ఇదంతా గమనించి గమనిస్తున్నాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడపటం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ప్రధానికి జరిమానా విధించాడు. అయితే సదరు ట్రాఫిక్ పోలీస్ తనకు జరిమానా విధించడంపై ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయని హన్ సన్.. జరిగిన విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా అందరికి తెలిపారు. అంతేకాదు ప్రజలకు క్షమాపణలు చెప్పి.. తనకు విధించిన జరిమానా కడతానని పేర్కొన్నారు.

సెల్ఫీ పిచ్చి.. ఆరుగురు మృతి

సెల్ఫీ సరదా ఏమో కానీ.. దాని వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి తెలిసిందే. అయినా కానీ కొంతమందికి ఈ సెల్ఫీ పిచ్చి పోవడంలేదు. కొంతమందికైతే ఇదో అలవాటులా తయారైపోయింది. తాము ఏం చేస్తున్నా.. ఎక్కడ ఉన్నా..కాస్తంత వెరైటీగా అనిపిస్తే చాలు సెల్ఫీ తీసేసుకోవడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఇక ఆ తరువాత ఏముంది. దానికి ఎన్ని లైకులు వచ్చాయి.. ఎన్ని షేర్లు వచ్చాయి.. ఎన్ని కామెంట్లు వచ్చాయి.. అని చూసుకోవడంతోనే సరిపోతుంది.   ఇప్పుడు ఈ సెల్ఫీ క్రేజ్ తోనే ఒకేసారి ఏడుగురు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ బాధాకరమైన ఘటన కాన్పూర్లో చోటుచేసుకుంది. కాన్పూర్లోని  కొలొనేల్‌గంజ్‌కు చెందిన శివం వారి మిత్రులతో కలిసి గంగానది స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో తాను సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో పడిపోయాడు. దీంతో అతనిని కాపాడటం కోసం ప్రయత్నించిన ఆరుగురు మిత్రులు కూడా నీళ్లలో కొట్టుకుపోయారు. గజఈతగాళ్ల ద్వారా వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు గంటల తర్వాత వారి మృతదేహాలు లభించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన వల్ల నది వద్ద పెద్ద బారికేడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఎవరైనా బారికేడ్లు దాటి నది లోపలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీన్నిబట్టి ఏం అర్ధమవుతోంది.. సెల్పీ తీసుకోవడం తప్పుకాదు..కానీ దానికో టైం.. ప్లేస్ ఉంటుంది.. ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో తీసుకుంటే ప్రమాదాలే జరుగుతాయి.. సో జర భద్రం...

టీమిండియా కోచ్ గా కుంబ్లే.. చక్రం తిప్పిన కోహ్లి..!

  ఎంతో సస్పెన్స్ కూడిన తరువాత టీమిండియా కోచ్ ఎవరూ అనే విషయం తెలిసిపోయింది. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కోచ్ పదవికి దాదాపు 57 ధరఖాస్తులు రాగా.. వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ లు దరఖాస్తులు పెట్టారు. అంతేకాదు విదేశాలనుండి కోచ్ పదవికి ధరఖాస్తులు వచ్చాయి. అయితే వారందరిని వెనక్కి నెట్టి కుంబ్లే కోచ్ పదవికి ఎంపికయ్యారు.   అయితే వచ్చిన 57 దరఖాస్తుల నుండి మొత్తం 20 మందిని సెలక్ట్ చేసి వారి నుండి హెడ్ కోచ్ ను ఎంపిక చేయాలని.. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీకి బీసీసీఐ సూచించింది. ఈ మేరకు అందరిని ఇంటర్వ్యూ చేసిన కమిటీ.. దానికి సంబంధించిన నివేదికను బీసీసీఐకు అందించింది. దీనిని పరిశీలించిన బీసీసీఐ అనిల్ కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి అప్పగించాలని నిర్ణయించింది. అయితే కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి దక్కడంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీల పాత్ర ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

న్యాయవాది దారుణ హత్య..

  చెన్నైలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ న్యాయవాదిని.. అందరూ చూస్తుండగానే హత్యేచేశారు. వివరాల ప్రకారం.. టి.రవి అనే వ్యక్తి న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. నిన్న తాను స్కూటర్ పై వెళుతుండగా.. సత్యమూర్తినగర్‌ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. అనంతరం అతనిని కత్తితో పొడిచి.. అక్కడి నుండి పారరయ్యారు. అతనిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.   కాగా రవి న్యాయవాది మాత్రమే గాక, స్థానికంగా ప్రముఖ రాజకీయ నాయకుడు.అతడిపై కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రవిని  హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఏపీకి వెళ్లలేక ఉద్యోగుల ఏడుపులు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 27నాటికి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులందరూ రాజధానికి రావాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అయితే ఒకపక్క సీఎం గారు ఎంత చెప్పినా.. కొంత మంది మాత్రం ఏపీకి రావడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఎన్ని రకాలుగా వసతులు కల్పించినా వారు మాత్రం ససేమిరా ఉంటున్నారు. ఆఖరికి వారు ఏపీ వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ సచివాలయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఆజ్ఞల ప్రకారం.. ఏపీ ఉద్యోగులు కొంతమంది ఈరోజు బస్సెక్కారు. ఇక ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తున్న కారణంగా.. తెలంగాణ ఉద్యోగులతో ఏర్పడిన బంధం వల్ల.. వారిని విడిచి రాలేక.. వీరు కూడా వారిని వదులుకోలేక.. ఒకరినొకరు హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ప్రభుత్వ ఆదేశాలు పాటించక తప్పదు కాబట్టి భారమైన హృదయాలతోనే ఏపీ ఉద్యోగులు బస్సెక్కగా, అంతకంటే భారమైన మనసులతో తెలంగాణ ఉద్యోగులు వారికి వీడ్కోలు పలికారు. కాగా ఇప్పటికే రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి కావచ్చింది. తుది దశకు చేరుకుంది. అప్పుడే పలు శాఖల కార్యాలయాలు కూడా అమరావతికి తరలివెళ్లాయి. మొత్తానికి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండి.. ఇప్పుడు ఏపీకి వెళ్లమంటే ఉద్యోగులకు కూడా కష్టమైన పనే..

హరీశ్ దేవినేని నీటి వివాదం.. పంతం నీదా నాదా..

  నీటి కేటాయింపులపై ఏపీ, తెలంగాణకు మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించడానికి ఇరు రాష్ట్రాల మంత్రులు కేంద్రం వద్ద చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇరువురి వాదనలు ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకంగా ఉన్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరిలో ఎవరూ కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. కనీసం ఒక్కరైనా తగ్గితే సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ ఎంతైనా మంత్రులు.. అందునా కొట్టుకొని మరీ విడిపోయిన వాళ్లం.. ఇంకా ఎందుకు తగ్గుతారు. ఒక పక్క కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని హరీశ్ రావు అంటుంటే.. తమ పరిధిలోని ప్రాజెక్టుల గేట్ల వద్ద తమ పోలీసులు పహారా కాయడాన్ని కూడా తెలంగాణ తప్పుబడుతున్నదని, ఇదెక్కడి న్యాయమని ఆయన ఏపీ వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని దేవినేని తేల్చిచెప్పారు. ఈ రకంగా ఇద్దరూ వాదించుకున్నదే.. వాదించుకుంటూ ఈసారి భేటీ కూడా అర్థాంతరంగానే ముగించేశారు. పైకి మాత్రం, దేవినేని ఉమ తెలంగాణపైనా.. హరీష్‌రావు ఆంధ్రప్రదేశ్‌ మీదా మమకారం కురిపించేస్తున్నారు. 'అందరం తెలుగువారమే..' అని ఇద్దరూ చెబుతున్నారు కానీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోందనీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోందనీ ప్రచారం చేసేశారు. ప్రజలు కూడా దానికి కనెక్ట్ అయిపోయారు. మరి ఈ నేపథ్యంలో ఈ వివాదం ముగియడం కష్టమే అని అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం...

గాయం కుడికాలికి... ఆపరేషన్ ఎడమకాలికి

  వేలకు వేలు డబ్బులు కుమ్మరించి కార్పోరేట్ ఆస్పత్రులకు వెళుతుంటాం. కానీ వారి నిర్లక్ష్య ధోరణితో ఎంతో మంది ప్రాణాలతో చెలగాటాలు ఆడేస్తుంటారు. అలా ఒక కాలుకు చేయాల్సిన ఆపరేషన్ ఇంకో కాలుకి చేసి తమ నిర్లక్ష్య ధోరణిని నిరూపించారు ఢిల్లీ ఆస్పత్రికి చెందిన వైద్యులు. వివరాల ప్రకారం.. ఢిల్లీ అషోక్ విహార్ ప్రాంతానికి చెందిన రవిరాయ్ అనే సీఏ విద్యార్ధి ప్రమాదవ శాత్తు మెట్లపై నుండి కింద పడ్డాడు. దీంతో అతని తల్లి దండ్రులు అతనిని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు సీటీ స్కాన్, ఎక్స్ రే లు వంటివి తీసి కాలి చీలమండలం వద్ద ఫ్రాక్చర్ అయిందని వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు కూడా అందుకు అంగీకరించారు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేయడానికి సిద్దమయ్యారు. అతనికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఇక రవిరాయ్ కు స్పృహ వచ్చిన తరువాత చూసుకుంటే దిమ్మతిరిగిపోయింది. తనకు గాయమైంది కుడి కాలికి అయితే.. వైద్యులు ఆపరేషన్ చేసింది ఎడమకాలికి. దీంతో అతని తల్లిదండ్రులు డాక్టర్లను నిలదీయగా.. జరిగిన తప్పిదానికి ఆస్పత్రి విచారం వ్యక్తం చేసి చేతులు దులుపుకుంది. దీంతో రవిరాయ్ తల్లిదండ్రులు వెంటనే అతనిని వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రవిరాయ్ తండ్రి మాట్లాడుతూ.. ఇందులో పూర్తిగా నిర్లక్ష్యం ఉందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, భారతీయ వైద్య మండలి, ఢిల్లీ వైద్య మండలిని కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.

నీ పని నువ్వు చూసుకో స్వామి.. అరుణ్ జైట్లీ

  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. నిరంతరం ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకూ రాజన్ పై విమర్శల వర్షం కురిపించిన స్వామి.. ఇప్పుడు ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అరవింద్ కాంగ్రెస్ నేత అని.. తక్షణం ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ స్మామి ఆరోపణలను తోసిపుచ్చారు. చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ గా సుబ్రమణియన్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, నిరాధార ఆరోపణలు చేస్తూ, అడగని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇకపై ఉచిత సలహాలు ఇవ్వడం ఆపాలని హితవు పలికారు. మరి స్వామి, అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

కృష్ణాలో వైసీపీ ఖాళీ అవుతుందా..?

  ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి ఎంతో మంది నేతలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. ఇప్పుడు ఆపార్టీకి మరో భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. అది కూడా వైసీపీకి పట్టు ఉన్న జిల్లాగా పేరు పొందిన కృష్ణాజిల్లానుండి. అయితే వైసీపీ ఎమ్మెల్యలు టీడీపీ లో చేరుతున్నట్టు స్వయంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుచ్చల అర్జునుడు. వైసీపీ నుండి ముగ్గరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని.. అందులో నూజివీడు ఎమ్మెల్యే కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. మరి ఆయన చెప్పినట్టు వారు టీడీపీలో చేరుతారో లేదో చూడాలి.   కాగా రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో మొన్నటిదాకా వలసల పర్వం జరుగగా బలహీనపడిపోయిన వైసీపీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా పార్టీ ఫిరాయింపులు జరిగితే మరింత బలహీనపడే ప్రమాదం కనిపిస్తోంది. మరి జగన్ వారిని బుజ్జగించేందకు ప్రయత్నిస్తారా.. లేక పోతే పోని అని వదిలేస్తారా.. చూడాలి.

టీడీపీలో అసంతృప్తి.. మళ్లీ వైసీపీ దారి..

  ఏదో ఆవేశంతో వేసీపీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు కానీ. కొంత మంది నేతల్లో ఎక్కడ ఓ దగ్గర అసంతృప్తి మాత్రం ఉందని చెప్పొచ్చు. అలా వెళ్లిన నేతలే కొంత మంది ఇప్పుడు తిరిగి సొంత గూటికి వచ్చేశారు. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి ఎంపీపీ, ఎంపీటీసీలు తిరిగి సొంత గూటికి వచ్చేశారు. అంతేకాదు తిరగొచ్చిన వారు ఇటీవల టీడీపీలో చేరిన అమర్ నాథ్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి తమపై ఒత్తిడి చేసి తీసుకెళ్లి, టీడీపీ కండువాలు కప్పించారని.. ఆరోపించారు. ఇక వీరి రాకతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇంకా చాలా మంది నేతలే టీడీపీలోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్నారు.. వారు కూడా త్వరలోనే పార్టీలోకి వస్తారని అన్నారు. ఏ అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయిస్తున్నారని ప్రజల అభివృద్ధి కోసమా? లేక స్వీయ అభివృద్ధి కోసమా? అన్నది చెప్పాలని విమర్శించారు.

అప్పుడు వైఎస్.. ఇప్పుడు జగన్.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎంత చిరాకు పెట్టిస్తున్నారో తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ఆయన మాటల్లో ఇప్పటికే చాలాసార్లు అర్ధమైంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు, జగన్ పై మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి ఆర్ధిక లోటులో ఉండగా రుణ విముక్తి చేయడం అనేది మామూలు విషయం కాదని.. అలాంటిది తాను లోటు బ‌డ్జెట్‌లో ఉన్న‌ప్ప‌టికీ రైతులకు లక్షన్నర రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని అన్నారు. ప్రతిపక్షాలు రుణమాఫీపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని..  ఒక‌ప్పుడు వైఎస్‌, ఇప్పుడు జ‌గ‌న్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయ‌న అన్నారు. ఎన్ని క‌ష్టాలు ప‌డ్డా మ‌న‌కు అన్నాన్ని పెడ‌తాడు.. అలాంటి రైతు సంక్షేమాన్ని మేము మ‌ర‌వ‌బోం’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్దికి అందరూ కలిసి రావాలి.. నేను ఒక్కడినే కష్టపడితే రాష్ట అభివృద్ధి సాధ్యం కాదు.. అని వ్యాఖ్యానించారు.

యువతిని తాళ్లతో కట్టేసి, లాక్కెళ్లి.. ఖాకీల దాష్టీకం..

  రాజస్థాన్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కనీసం ఓ అమ్మాయి అని కూడా చూడకుండా అధికారం ఉంది కదా అని ఖాకీలు దారుణానికి ఒడిగట్టారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్ లోని గర్వాకు చెందిన ఓ మహిళకు రాజస్థాన్ పట్టణం అల్వార్ లోని బ్యాంక్ కాలనీకి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది. అయితే వరకట్నం వేధింపులు వల్ల ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆమె తన వదిన కుటుంబంపై కేసు పెట్టింది. దీంతో డౌరీ హరాస్ మెంట్ కేసు నమోదు చేసుకున్న గర్వా పోలీసులు తన వదిన అయిన అపర్ణను అరెస్ట్  చేశారు.. ఆమెను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలోనే అపర్ణ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఇక్కడే మన పోలీసులు రెచ్చిపోయారు. పారిపోవడానికి ప్రయత్నించిన ఆమెను తిరిగి పట్టుకున్నారు. మళ్లీ పారిపోకుండా ఉండేందుకు  నడుము చుట్టూ తాళ్లతో కట్టి లాక్కెళ్లారు. కొద్దిసేపు అల్వార్ రైల్వే స్టేషన్ లోనే ఆమెను కూర్చోబెట్టారు. అంతే పోలీసులు చేస్తున్న ఈపనిని చూసి కొంతమంది ఆశ్చర్యపోగా..మరికొంత మంది ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది ఇప్పుడిది వైరల్ అయింది. ఇక పోలీసులపై నెటిజన్లు మండిపడుతూ.. వారిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.  

తెలంగాణ ఆర్టీసీ విద్యుత్ ఛార్జీల పెంపు..

  తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నసంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ముసేస్తారు అన్న కథనాలు కూడా వినిపించాయి. ఈనేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఆర్టీసీ ఛార్జీలు మాత్రమే కాదు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్  ఛార్జీల పెంపు సామాన్యుడికి భారంగా ఉండకూడదని అధికారులకు సూచించారట. పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు రూపాయి, 30 కిలోమీటర్లు దాటితే రూ.2 పెంచాలని ఆర్టీసీ అధికారులు సూచించగా దానిని ఆమోదించిన కేసీఆర్ ఇతర బస్సు సర్వీసుల్లో ఛార్జీల పెంపు 10శాతానికి మించరాదని చెప్పారు.   ఇంకా విద్యుత్ ఛార్జీలు పెంపుదలపై కూడా కేసీఆర్ కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 100 యూనిట్లలోపు విద్యుత్‌ ఛార్జీలు పెంచొద్దని, 100 యూనిట్లు దాటితే స్వల్పంగా పెంచాలని పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై 7శాతం లోపే పెంపు ఉండాలన్నారు.