వీడిన నావీ అధికారి కుమార్తె మిస్టరీ..

  నావీ అధికారి అరవింద్ కుమార్ కుమార్తె ఖైరవీ శర్మ మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఈనెల 14న  విశాఖ నుంచి పుణెకు వెళుతూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. అక్కడి నుండి ఆమె ఎటు వెళ్లిందో కూడా తెలియలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేక తానే ఎటైనా వెళ్లిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. స్నేహితులు, ప్రయాణికులు, ఫేస్ బుక్ స్నేహితులు... ఇలా అందర్నీ విచారిస్తూ పోలీసులు ముందుకి సాగడంతో ఆమె ఎక్కడుందో తెలిసింది. ఖైరవీ శర్మ గోవా బీచ్ లో పోలీసులకి దొరికింది. దీంతో ఆమెను గుర్తించిన పోలీసులు, ఆమె తండ్రి, నేవీ అధికారి అరవింద్ కుమార్ కు అప్పగించారు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

కేసీఆర్ కు కేంద్రమంత్రి పంచ్.. 'ముందు అవి వాడండి మహాప్రభో'..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర వైద్యం, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఝలక్ ఇచ్చారు. ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంది కానీ తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తమకు మరిన్ని నిధులు కావాలని కేంద్రానికి లేఖలు మీద లేఖలు రాస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన జేపీ నడ్డా.. 'ముందు మేమిచ్చిన నిధులను ఖర్చు చేయండి మహా ప్రభో అంటూ' కేసీఆర్ కు లేఖ రాశారట. ఇచ్చిన నిధులను ముందు ఖర్చు పెట్టండి ఆ తరువాత నిధులు అడగండి అంటూ లేఖలో పేర్కొన్నారంటా. దీనికి కారణం కూడా లేకపోలేదట.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రతియేటా రాష్ట్రానికి రూ.1000కోట్లు కేటాయిస్తుండగా.. వాటిలో 60 శాతం కేంద్రం.. 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది విడుదల చేసిన నిధుల్లోనే ఇప్పటికీ రూ.438 కోట్లు అలాగే ఉన్నాయంటా..వీటిలో రూ.143 కోట్లను ఆర్థిక శాఖ నిలిపేసిందట. అందుకే కేంద్ర మంత్రి ఈ రకంగా లేఖ రాసి కేసీఆర్ కు పంచ్ విసిరారని అనుకుంటున్నారు. మరి మంత్రిగారి లేఖపై కేసీఆర్ సాబ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కోర్టు ముందుకు బురిడి బాబా..

  బురిడిబాబా.. శివానందబాబాను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ ట్రాస్క్ పోర్స్ పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు ముమ్మరం చేసి బురిడి బాబాను బెంగుళూరు శివారులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈయనను విచారించిన పోలీసులు తగిన సమాచారాన్ని రాబట్టారు. అయితే ఈరోజు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని.. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరిని  ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి.. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అతడిని కోర్టులో హాజరుపరుస్తారు. కాగా  హైదరాబాదు 'లైఫ్ స్టయిల్' బిల్డింగ్ యజమాని మధుసూదన రెడ్డికి టోకరా ఇచ్చి రూ.1.33 కోట్లతో ఉడాయించిన సంగతి విదితమే.

'ఎలిఫెంట్' స్పెల్లింగ్ కూడా సరిగా రాని మంత్రిగారు..

ఓ మంత్రిగారు.. ఎలిఫెంట్ స్పెల్లింగ్ కూడా సరిగా రాయలేక విమర్సలు పాలయ్యారు. ఇంతకీ ఎవరా మంత్రిగారు అనుకుంటున్నారా.. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటెల్ కేబినెట్లో.. రవాణా శాఖతో పాటు ఆరోగ్య శాఖ బాధ్యతలను భుజాన వేసుకున్న శంకర్ చౌదరి. శంకర్ చౌదరి ఎంబీఏ వరకూ విధ్యనభ్యసించారు. ఈ మేరకుతన అఫిడవిట్ లో కూడా తన విద్యార్హతలు తెలిపారు. అయితే ఇటీవల ఆయన ఓ పాఠశాలకు వెళ్లి.. టీచర్ అవతారం ఎత్తి విద్యార్ధులకు పాఠాలు చెప్పారు. కొన్ని ఆంగ్ల పదాలు కూడా బోర్డుపై రాశారు. ఇక్కడే మంత్రిగారు తప్పులో కాలు వేశారు. 'elephant' అని రాయకుండా 'elephent' అని రాశారు. అంతే దీన్ని గమనించిన ఓ విద్యార్ధి స్పెల్లింగ్ తప్పుగా రాశారు అని చెప్పడంతో సదరు మంత్రిగారు షాకయ్యారు. ఇక అక్కడ ఉన్న మీడియా ఊరుకుంటుందా.. జరిగిందంతా రికార్డ్ చేసేసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో సదరు మంత్రిగారిపై కామెంట్లు, విమర్శలు మొదలయ్యాయి.

ఇండియాలో హైవేలపై దిగనున్న విమానాలు..

ఎయిర్‌పోర్టుల్లో ఖాళీ లేకనో..లేదంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసమో గత్యంతరం లేక విమానాలు హైవేలపై దిగడం చూశాం. ఇకపై ట్రాఫిక్ తక్కువగా ఉండే జాతీయ రహదారులను విమానాలకు రన్‌వేలుగా ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఊరి చివర జాతీయ రహదారులపై విమానాలు దిగేలా, జనసమ్మర్ధం ఉండని ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మించేలా ఓ పథకాన్న రూపొందిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేషనల్ హైవేలను పౌర, సైనిక విమానాల రాకపోకలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకారి కాగలదని చెప్పారు. విమానాల్లో రవాణా చేయడానికి రోడ్డు వెంబడి సరకుల లోడింగ్, అన్‌లోడింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. దీని వల్ల సంప్రదాయ విమానాశ్రయాలతో పోలిస్తే తక్కువ వ్యయం అవుతుందని చెప్పారు.

చిత్తూరు కోర్టులో బాంబు పేలుడు... ఉగ్రవాదుల పనేనట..!

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య నేపధ్యంలో.. నిందితుడు చింటూను కోర్టులో హాజరుపరిచే సమయంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనకు చింటూకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. చింటూనే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాంబు పేలుడు ప్లాన్ వేసి ఉంటాడని అనుకున్నారు. దీనికి గాను చింటూ బాంబు పేలుడుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అతడు... రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు, హైకోర్టు, జిల్లా కోర్టులతో పాటు పోలీసులకు లేఖలు రాశాడు కూడా.   అయితే ఇప్పుడు దీనిపై ఓ కొత్త విషయం బయటపడింది. ఈ దాడులకు పాల్పడింది.. ఉగ్రవాద సంస్థ ఆల్- ఉమా అని తెలిసింది. ఈమేరకు ఉగ్రవాద సంస్ధ కోర్టులో బాంబు పేల్చింది తామేనంటూ చిత్తూరు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై పోలీసులు మొదట అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరిగిన ఘటనను లేఖలోని విషయాలను పోలుస్తూ పరిశీలించారు. ఈ క్రమంలో అన్ని విషయాలను పరిశీలించిన చిత్తూరు పోలీసులు కోర్టులో జరిగిన పేలుడు చింటూ పని కాదని తేల్చుకున్నారు. ఆల్- ఉమా ఉగ్రవాదులే నాడు బాంబులు పేల్చారని నిర్ధారించారు. 2013లో పుత్తూరులోని ఓ ఇంటిలో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పెను బీభత్సమే సృష్టించారు. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేయగా..ఈ కేసు విచారణ తిరుపతిలోని కోర్టులో జరుగుతోంది. తమ సహచరులు కోర్టుకు వచ్చిన సందర్భంగా బాంబులు పేల్చి వారిని విడిపించుకునేందుకు ఆల్- ఉమా ఉగ్రవాదులు పథకం పన్నారు.

నిలకడగా ముద్రగడ ఆరోగ్యం.. తుని కేసులో నలుగురికి బెయిల్..

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని కేసులో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన దీక్ష ఈరోజుతో పదో రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. రాత్రి వైద్యానికి సహకరించారని, సెలైన్లు ఎక్కించామని తెలిపారు. మూత్రంలో కీటోన్‌ బాడీస్‌ పెరగటంపై కుటుంబ సభ్యులకు వివరించామని వెద్యులు చెప్పారు.   ఇదిలా ఉండగా తుని అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న వారిలో నలుగురికి బెయిల్ లభించింది. మొత్తం 13 మందిని అరెస్ట్ చేయగా వారిలో నలుగురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది పిఠాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు. కోర్టు అనుమతి లేకుండా నిందితులు ఎక్కడకూ వెళ్లవద్దని, స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రతి రోజు సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది.

పెళ్లికి ఒప్పుకోలేదని అబ్బాయిపై యాసిడి దాడి..

  అమ్మాయిలు ప్రేమ అంగీకరించకపోతే అబ్బాయిలు యాసిడ్ తో దారి చేస్తుంటారు అది కామన్. అయితే ఇక్కడ ఓ అమ్మాయి.. ఓ అబ్బాయిపై యాసిడ్ దాడి చేసింది. ఈఘటన పాకిస్థాన్ లో జరిగింది. వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ముల్తాన్‌కు చెందిన మొనిల్ మాయ్ (32) అనే మ‌హిళ త‌న పొరుగింట్లో నివ‌సించే ర‌షీద్ అనే వ్యక్తిని ప్రేమించింది. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ర‌షీద్‌ను ఆమె కోరింది. అయితే రషీద్ మాత్రం పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైంది. దీంతో నిన్న ర‌షీద్‌పై యాసిడ్ గుమ్మరించి కోపాన్ని తీర్చుకుంది. మొనిల్ మాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గుండె, కాలేయం లోకి ఇనుప ఊచ.. అయినా బ్రతికాడు..

కొన్ని సార్లు ఎంత చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలు కోల్పోతుంటారు. అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడుతుంటారు. అలా ప్రాణాలతో బయటపడి అది నిజమే అని నిరూపించాడు చైనా కి చెందిన ఓ వ్యక్తి. చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 5 మీటర్ల ఎత్తు నుంచి ఇనుప ఊచలపై పడిపోయాడు. దీంతో అతని శరీరంలో ఇనుప ఊచలు దిగిపోయాయి. అయితే కొన్ని ఇనుప ఊచలు కత్తిరించినా ఒక ఇనుప ఊచ మాత్రం  కపాలం, శ్వాసనాళం, గుండె, గళధమని, కాలేయం పక్కనుంచి చొచ్చుకుపోయింది. అదృష్టం ఏంటంటే ఏ భాగానికి అది తగలకుండా ఉండటంతో ప్రాణాలు పోలేదు. ఇక అతనిని ఆస్పత్రిలో చేర్పించగా.. 7 గంటలకు పైగా శ్రమించి.. అతడి ప్రాణాలను నిలిపారు. ప్రధాన అవయవాలకు ఏమాత్రం గాయం అయినా అతడి ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం  అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు వారాల పాటు అతడిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందన్నారు.

నాలుగు టైర్ల ధర ఎంతని.. ఛీప్‌గా రూ.4 కోట్లు

కార్లు నడవాలంటే టైర్లది ముఖ్య పాత్ర.. సాధారణంగా కార్లకు వాడే టైర్ల ధర మహా అయితే 10 వేలు ఉంటుంది..లేదు కొంచెం కాస్టిలీ కారైతే లక్ష నుంచి ఐదు లక్షలు ఉండవచ్చు. కాని కోటి రూపాయల టైరు ఉందంటే మీరు నమ్ముతారా..? కాని ఇది పచ్చినిజం..దుబాయ్‌కి చెందిన జడ్ టైర్స్ అనే సంస్థ తయారు చేసిన నాలుగు టైర్లు (ఒక సెట్) 4 కోట్లకు పైగానే విలువ చేస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం, ప్రత్యేకంగా ఎంపిక చేసిన వజ్రాలను పొదిగి తయారు చేయడం వల్ల వీటికి అంత ధర. ఇటలీకి చెందిన స్వర్ణకారులు తయారు చేసిన ఆభరణాలతో టైరుకు అలంకరణ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ టైర్లు..గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించాయి

ఎయిర్‌హోస్టెస్ ప్రేమలో కేంద్రమంత్రి

కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్న బాబుల్ సుప్రియో ప్రేమలో పడ్డారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న రచనా శర్మను తొలి చూపులోనే ప్రేమించారు. 2014లో కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లే విమానంలో యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి ప్రయాణిస్తుండగా సుప్రియోను రచన పలకరించింది. లోక్‌సభ ఎన్నికలపై చర్చిస్తుండగా టికెట్ లభిస్తే విజయం ఖాయమంటూ ఆయన భుజం తట్టిందట. అప్పుడే ఆమెపై మనుసు పారేసుకున్నానని సుప్రియో తెలిపారు. ఆమె పేరు, ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ మాట్లాడుకుంటూ ప్రేమలో మునిగిపోయారట.   అపై రచన చెప్పినట్లే టికెట్ లభించడం, విజయం సాధించడం, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంటకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. తమ రెండేళ్ల ప్రేమాయణానికి ఆగస్టు 9న తెరదించి ఒక ఇంటివారు కాబోతున్నారు. కాగా ఆయనకు ఇది రెండో పెళ్లి. గతంలో బాలీవుడ్ గాయకుడిగా ఉండగా ఆయనకు రియా పరిచయం కావడంతో ఆమెను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి కూతురు షర్మిలి పుట్టింది. అయితే మనస్పర్థల కారణంగా రియాకు 2006లో విడాకులిచ్చారు.

జమ్మూలో మరోసారి ఆలయ ధ్వంసం.. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ు బంద్

  జమ్మూలో రెండు రోజుల క్రితం ఓ వ్య‌క్తి నాన‌క్ న‌గ‌ర్‌లోని ఓ ఆల‌య ధ్వంసానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం.. జ‌మ్మూ రూప్ నగర్‌లో ఓ వ్యక్తి ఆల‌యంలోకి వెళ్లి  దాన్ని ధ్వంసం చేయ‌బోయాడు. పోలీసులు వెంట‌నే ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆల‌యం ధ్వంసం చేసే ప్ర‌యత్నం జ‌రిగింద‌న్న స‌మాచారం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్య‌లో నిర‌స‌న‌కు దిగారు. దీంతో జ‌మ్మూలో మ‌రోసారి మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను బంద్ చేశారు.

మూడు సింహాలకు జీవితఖైదు శిక్ష..

  గుజరాత్ లోని మనుషులపై దాడి చేసిన సింహాలు ముగ్గురిని చంపి తిన్నందుకు వాటిని శిక్షించాలని పోలీసులు కేసు పెట్టిన సంగతి తెలసిందే. ఈ కేసు విచారణలో భాగంగా 18 సింహాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాటిని పరీక్షలు నిర్వహించి వాటిలో మూడు సింహాలకు దోషులుగా తేల్చి జీవితఖైదు శిక్ష వేశారు. అయితే ఈ మూడింటిల్లో కూడా రెండు సింహాలు బాల నేరస్తులని, ఓ మగ సింహం మనిషిని చంపి తినగా మిగిలినవి మాంసాన్ని మాత్రమే తిన్నాయని నిర్ణయించిన అటవీ శాఖ అధికారులు, వాటికి ప్రొబేషన్ ఇచ్చి తిరిగి అడవిలో వదిలేశారు. ఈ రెండింటినీ ఒకదానిని ఒకటి కలవకుండా దూరంగా ఉంచి కొంతకాలం అబ్జర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు.

ఏపీ ఉద్యోగుల్ని తీసుకువెళ్లడానికి రైలే వస్తోంది..

అమరావతికి తరలివచ్చే ఏపీ ఉద్యోగుల సుడి మామూలుగా లేదు. వాళ్లు ఏది కోరుకుంటే అది క్షణాల్లో వారి ముందు ప్రత్యక్షమవుతోంది. ఐదు రోజుల పనిదినాలు, హెచ్‌ఆర్ఏ పెంపు ఆఖరికి స్థానికత ఇలా ఏది కావాలంటే దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదనకుండా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రయాణించేందుకు వీలుగా తమకు ప్రత్యేక రైలు కావాలని సీఎంతో పాటు కేంద్రానికి లేఖ రాశారు సచివాలయ ఉద్యోగులు. దీనికి చంద్రబాబు సిఫారసు తోడవ్వడంతో రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు. ఏపీ ఉద్యోగుల కోసం విజయవాడ-సికింద్రాబాద్ మధ్య వారానికి మూడు రోజుల పాటు ప్రత్యేక రైలు నడపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక రైలు రాత్రి 10 గంటలకు విజయవాడలో బయలుదేరి..ఉదయం సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరిగి సికింద్రాబాద్‌లో రాత్రి 10 గంటలకు బయల్దేరి..ఉదయం విజయవాడకు చేరుకోనుంది. మరో పది రోజుల్లో ఈ రైలు పట్టాలెక్కనుంది.

వీణా-వాణి ఆపరేషన్.. అస్ట్రేలియా వైద్యులు సుముఖ‌త

  అవిభక్త కవలలు వీణా-వాణిలకు ఆపరేషన్ చేయడం కుదరని పని అని..విడదేసే ప్రయత్నం చేస్తే వారి ప్రాణాలకు ముప్పు అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. వారు అలా బతకాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వీళ్ల ఆపరేషన్ కు ఆస్ట్రేలియా వైద్యులు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన అక్కడి రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్య సిబ్బందితో భేటీ అయి వీణా-వాణి ల గురించి చెప్పగా వారు శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చారని నిరంజన్ రెడ్డి తెలిపారు. దీంతో రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) వైద్యుల‌తో వీణా-వాణిల ఆపరేషన్ చేయించే అంశంపై ఓ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని నిరంజ‌న్ రెడ్డి అన్నారు.

అంగారక గ్రహంపై మీకు పనిచేయాలనుందా..!

ఎప్పుడూ ఒకే జాబ్‌లో ఉండి బోర్ కొడుతోందా..? ఛేంజ్ అవ్వాలనుకుంటున్నారా..? మీరు కూడా వ్యోమగామిగా మారాలనుకుంటున్నారా..? ఇలాంటి వారందరికి సువర్ణావకాశం. అంగారక గ్రహం మీద మీకు పనిచేయాలనుందా..? అయితే..మమ్మల్ని సంప్రదించండి అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా). అంగారకగ్రహానికి సంబంధించిన పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచడం కోసం నాసా కొన్ని ఉద్యోగాలిస్తానంటోంది. ఉపాధ్యాయులు, సర్వేయర్లు, రైతులు తదితర వృత్తులకు చెందినవాళ్లు కావాలంటూ కొన్ని పోస్టర్లు రీలీజ్ చేసింది. అయితే..ఇది కార్యరూపం దాల్చడానికి కనీసం 14 ఏళ్లైనా పట్టవచ్చు. ఎందుకంటే నాసా అంగారక యాత్ర ప్రణాళికల ప్రకారం..ఆ గ్రహం పైకి మనుష్యులను పంపించి అక్కడ మానవ యోగ్యమైన నివాసప్రాంతాలను ఏర్పాటు చేయటమన్నది 2030కి గానీ సాధ్యం కాదు. ఎప్పుడో సంగతి ఇప్పుడు ఎందుకని మీరనుకోవచ్చు.  ముందుగా ఎవరు అప్లై చేస్తారో వాళ్లకే ఉద్యోగం..సో..ఇంకేందుకు లేటు.