వీణా-వాణి ఆపరేషన్.. అస్ట్రేలియా వైద్యులు సుముఖ‌త

  అవిభక్త కవలలు వీణా-వాణిలకు ఆపరేషన్ చేయడం కుదరని పని అని..విడదేసే ప్రయత్నం చేస్తే వారి ప్రాణాలకు ముప్పు అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. వారు అలా బతకాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వీళ్ల ఆపరేషన్ కు ఆస్ట్రేలియా వైద్యులు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన అక్కడి రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్య సిబ్బందితో భేటీ అయి వీణా-వాణి ల గురించి చెప్పగా వారు శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చారని నిరంజన్ రెడ్డి తెలిపారు. దీంతో రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) వైద్యుల‌తో వీణా-వాణిల ఆపరేషన్ చేయించే అంశంపై ఓ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని నిరంజ‌న్ రెడ్డి అన్నారు.

అంగారక గ్రహంపై మీకు పనిచేయాలనుందా..!

ఎప్పుడూ ఒకే జాబ్‌లో ఉండి బోర్ కొడుతోందా..? ఛేంజ్ అవ్వాలనుకుంటున్నారా..? మీరు కూడా వ్యోమగామిగా మారాలనుకుంటున్నారా..? ఇలాంటి వారందరికి సువర్ణావకాశం. అంగారక గ్రహం మీద మీకు పనిచేయాలనుందా..? అయితే..మమ్మల్ని సంప్రదించండి అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా). అంగారకగ్రహానికి సంబంధించిన పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచడం కోసం నాసా కొన్ని ఉద్యోగాలిస్తానంటోంది. ఉపాధ్యాయులు, సర్వేయర్లు, రైతులు తదితర వృత్తులకు చెందినవాళ్లు కావాలంటూ కొన్ని పోస్టర్లు రీలీజ్ చేసింది. అయితే..ఇది కార్యరూపం దాల్చడానికి కనీసం 14 ఏళ్లైనా పట్టవచ్చు. ఎందుకంటే నాసా అంగారక యాత్ర ప్రణాళికల ప్రకారం..ఆ గ్రహం పైకి మనుష్యులను పంపించి అక్కడ మానవ యోగ్యమైన నివాసప్రాంతాలను ఏర్పాటు చేయటమన్నది 2030కి గానీ సాధ్యం కాదు. ఎప్పుడో సంగతి ఇప్పుడు ఎందుకని మీరనుకోవచ్చు.  ముందుగా ఎవరు అప్లై చేస్తారో వాళ్లకే ఉద్యోగం..సో..ఇంకేందుకు లేటు.

ముద్రగడ దీక్షపై బొత్స ఆగ్రహం.. గొప్ప‌ల‌కు పోవ‌ద్దు..

  ఏపీ ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని కేసులో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముద్ర‌గ‌డ‌ను చూసి రావ‌డానికి వీలు లేకుండా అంక్ష‌లు పెడుతున్నారని ఆయ‌న మండిపడ్డారు. స‌మ‌స్య‌ను జ‌టిలం చేయ‌కుండా చూడాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. ముద్ర‌గ‌డ దీక్ష‌పై మంత్రులు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, బాధ్యతలు లేని మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని బొత్స దుయ్యబట్టారు. ‘ప్ర‌భుత్వం గొప్ప‌ల‌కు పోవ‌ద్దు, ఒంటెద్దు పోక‌డ‌లు పోవ‌ద్దు, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ప్రభుత్వం వ్య‌వ‌హ‌రించాలి’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు.   కాగా ముద్రగడ దీక్ష చేపట్టి ఈరోజుతో తొమ్మిది రోజులకి చేరింది. మరోవైపు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది.. మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగడంతో పరిస్థితి క్షీణిస్తోందని.. కీటోన్ బాడీస్ పెరగడం ప్రమాదకరమని తెలుపుతున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటారో.. ముద్రగడ దీక్షను విరమిస్తారో లేదో చూడాలి.

మిస్టరీగా మారిన నావీ అధికారి కుమార్తె కేసు...

  నావీ అధికారి అరవింద్ కుమార్ కుమార్తె ఖైరవీ శర్మ గురించిన ఆచూకి ఇంకా తెలియక పోలీసులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈనెల 14న  విశాఖ నుంచి పుణెకు వెళుతూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. అయితే కనెక్టింగ్ విమానం ఎక్కేవారు విమానాశ్రయం బయటకు వెళ్లరు.. కానీ ఖైరవీ విమానాశ్రయం బయటకు వచ్చి ఓ పుష్పక్ బస్సు ఎక్కినట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఆ తరువాత  ఆపై ఆమె సెల్ ఫోన్ బోయినపల్లి వరకూ వెళ్లినట్టు మాత్రమే గుర్తించారు. ఆపై సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో, ట్రేసింగ్ కష్టమైపోయింది. దీంతో ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేక తనంతట తానే ఎక్కడికైనా వెళ్లిందా అని ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు. దీంతో ఈకేసు మిస్టరీగా మారింది. త్వరలోనే కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

మహిళల దుస్తుల మార్చుకునే రూంలో సీక్రెట్ కెమెరా.. ప్రబుద్దుడు అరెస్ట్

  అతని వయసు యాభై సంవత్సరాలు. చేసింది బుద్ది తక్కువ పని. ఫలితం ఉద్యోగం ఊడిపోవడం. జైలు ఊచలు లెక్కబెట్టడం. ఇంతకీ ఆ పెద్ద మనిషి చేసిన పని ఏంటనుకుంటున్నారా..? ఆడవాళ్లు దుస్తులు మార్చుకునే రూంలో సీక్రెట్ పెట్టి ఆ వీడియోలు జమచేసి పోర్న్ సైట్లకు అమ్మాలనుకోవడం. యూరోపియన్ యూనియన్ బ్యాంకులో ఓ వ్యక్తి ఉన్నత స్థాయి అధికారిగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన గత నెలలో మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో టేబుల్ కింద ఓ సీక్రెట్ కెమెరాను ఉంచాడు. అలా రికార్డ్ అయిన వీడియోలు తన ల్యాప్ టాప్లో, ఫోన్లో భద్రంగా తీసి పెట్టుకున్నాడు. ఈ లోపులోనే అతని బండారం బయటపడింది. రూంలో సీసీ కెమెరా ఉండటం గమనించిన ఓ మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ సీక్రెట్ కెమెరా గుట్టును తేలికగానే పసిగట్టగలిగారు. బయట ఉన్న సీసీ కెమెరా ఫూటేజ్ ను పరిశీలించి, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 150 మంది మహిళలు ఈ వ్యవహారంలో బాధితులుగా ఉన్నారు.

ఏఎస్పీది ఆత్మహత్యే.. కారణం అదేనా..?

పాడేరు ఏఎస్పీ నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తుపాకీ పేలి ఆయన మరణించగా.. ఏఎస్పీ కావాలనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు పేలిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది ఆత్మహత్యే అని పోలీసులు తెలుపుతున్నారు. అంతేకాదు.. ఓ సూసైడ్ నోటు కూడా దొరికిందని తెలుపుతున్నారు. ‘నా చావుకు ఏ అధికారి, ఎవరూ బాధ్యులు కారు. మూడు నెలలుగా విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నా’ అని లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్బంగా హోంమంత్రి చినరాజప్ప ఏఎస్పీ కుటుంబాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో సూసైడ్ నోటు దొరికింది.. వారి కుటుంబ సభ్యుల అనుమతితోనే బయటపెడుతున్నాం.. సూసైడ్ లో అంశాలన్నీ సెంట్ మెంట్ తో కూడుకున్నవని అన్నారు. సెప్టెంబర్ 4 న శశికుమార్ వివాహం జరగాల్సి ఉంది.. ఈలోగా ఘటన జరగడం బాధాకరంగా ఉందని వెల్లడించారు.  పెళ్లికి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు మూడు రోజులు సెలవు పెట్టి వస్తున్నానని రెండు రోజుల క్రితం ఆయన తన తల్లికి ఫోన్ చేసి చెప్పారు. సెలవుపై వెళ్లాల్సిన రోజే... ఆత్మహత్య చేసుకున్నారు. తను ఇష్టపడిన అమ్మాయితో కాకుండా... మరొకరితో పెళ్లి కుదర్చడంతో మనస్తాపానికి గురైనందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

టీడీపీలోకి అమర్నాథ్ రెడ్డి... నా నోటికి పని చెప్పొద్దు..

  వైసీపీ పార్టీ నుండి మరో ఎమ్మేల్యే టీడీపీలోకి జంప్ అయ్యారు.  చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను డబ్బులు తీసుకొని టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. దీనికి సమాధానం జగనే చెప్పాలని మండిపడ్డారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సవాల్ కూడా విసిరారు.. తనకు ఉన్నది ఒకే బిడ్డని.. డబ్బులు తీసుకోలేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతానని, జగన్‌కు ఏసుక్రీస్తు పైన నమ్మకం ఉంటే నేను డబ్బులు తీసుకున్నానని క్రీస్తు దగ్గర తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. పత్రిక ఉంది కదా అని ఏది పడితే అది రాయడం సరికాదని.. తనను ఇబ్బంది పెడితే తన నోటికి పని చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) కూడా టిడిపిలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రాణం తీసిన సోనియా గాంధీ ఫొటో..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫొటో  ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. అదేంటీ సోనియా ఫొటోకి.. వ్యక్తి మరణించడానికి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ ' విజయ నగర్ ఫ్రెండ్స్ ' పేరిట వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అయితే ఈ గ్రూపులో అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి సోనియా పాత్రలు తోముతున్నట్టు ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని గ్రూపులో పోస్ట్ చేశాడు. అంతేకాదు దానికింద సోనియాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మోడీ అన్నట్టు వ్యాఖ్యానించాడు. దీంతో ఆగ్రహానికి గురైన జతిన్ రాజ్.. ప్రశాంత్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో తమ అనుచరులతో కలిసి వచ్చి అతనితో వాగ్వాదానికి దిగారు. అది కాస్త పెద్దదై కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇక అటుగా వెళుతున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించినా అక్కడ కూడా వారు కొట్టుకోవడం జరిగింది. ఈ గొడవలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం స్టేషన్ బయట జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం స్టేషన్ లోపల జరిగిందని ఆరోపిస్తున్నారు.

గుల్బర్గ్ హత్యాకాండ.. 11 మందికి జీవిత ఖైదు

గోద్రా అల్లర్లు జరిగిన మరుసటి రోజే జరిగిన గుల్బర్గ్ గా హత్యాకాండ కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెల్లడైంది. 2002 లో జరిగిన గుల్బర్గ్ గా సొసైటీ హత్యాకాండలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అహెసాన్ జాఫరి సహా 69మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసుపై విచారించిన కోర్టు దోషులకు శిక్ష విధించింది. కేసులో బిజెపి సిట్టింగ్‌ కార్పొరేటర్‌ బిపిన్‌ పటేల్‌తో సహా 24 మందిని నిందితులుగా ప్రత్యేక కోర్టు ప్రకటించగా.. వారిలో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ శిక్ష ఖరారు చేసింది. మరో పన్నెండుమందికి ఏడేళ్లు.. మరొకరికి పదేళ్ల శిక్షను విధించింది.

ఎంపీ దారుణ హత్య.. తుపాకీతో పేల్చి.. కత్తితో పొడిచి

  ఓ ఎంపీని దారుణంగా హత్య చేసిన ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. జో కాక్స్ అనే 40 ఏళ్ల మహిళ లేబర్ పార్టీ తరుపున వెస్ట్ యార్క్ షైర్ లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజక వర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె బ్రిటన్ ఈయూ(యూరోపియన్ యూనియన్) లోనే కొనసాగాలని ఎప్పటినుండో వాదిస్తున్నారు. దీనిని తన సన్నిహితుడైన థామస్ మెయిర్ వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగా ఆమెను ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడు. అనుకున్నట్టుగానే జో కాక్స్ కార్యలయం వద్ద మాటు వేసిన థామస్.. ఆమె కార్యాలయం వద్దకు రాగానే.. మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం.. కసి తీరక కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆతరువాత మళ్లీ కాల్చాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన జో కాక్స్ ను హాస్పిటల్ కు తరలించినా ఫలితం మాత్రం దక్కలేదు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. హత్యకు గల కారణాలు ఏంటన్నది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.

మరో నిర్భయ ఘటన.. కారులోనే తిప్పుతూ అత్యాచారం..

  దేశ రాజధాని ఢిల్లీలో రోజుకో నిర్భయ లాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం.. ఓ యువతిపై కారులోనే తిప్పుతూ ఆత్యాచారం చేసిన ఘటన బయటపడింది. ఈ ఘోరం గురించి ఇంకా మరిచిపోకముందే  తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ 25 ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తుండగా.. కొందరు దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకొని.. తిరుగుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేసి పూర్వీమార్ వద్ద విసిరేసి వెళ్లిపోయారు. ఆమె పక్కన ఉన్న స్నేహితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి... వాహనం నెంబరు కూడా చెప్పడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయగా ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయం కూడా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. మరి ఎన్ని ఘటనలు జరిగినా ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకుంటాం అని చెప్పడం తప్ప చేసేది ఏం లేదన్న విషయం అర్ధమవుతోంది. ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో..

క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం.. పెరిగిన కీటోన్ బాడీస్..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష ఈరోజుతో తొమ్మిదో రోజుకి చేరుకుంది. వైద్యపరీక్షలకు అంతంత మాత్రం అంగీకరించిన ముద్రగడ.. దీక్షను మాత్రం విరమించేది లేదని మొండికేస్తున్నారు. అయితే ఆయన మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగడంతో పరిస్థితి క్షీణిస్తోందని, గత రాత్రి ఓ సెలైన్ పెట్టేందుకు మాత్రం అంగీకరించారని ఈ ఉదయం వైద్యులు ప్రకటించారు. ఆయన్ను ప్రతి గంటకూ పరీక్షిస్తున్నామని, పల్స్ రేట్ క్రమంగా పడిపోతూ ఉన్నదని తెలిపారు. కీటోన్ బాడీస్ పెరగడం ప్రమాదకరమని ఆయన బంధువులకు వివరించామని, ఆయన్ను దీక్ష విరమించేందుకు ఒప్పించాలని వారి ద్వారా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.   కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. తుని కేసులో అరెస్ట్ చేసిన నిందితులను వెంటనే విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే.

పరమాన్నం పెట్టి 1.33 కోట్లు టోకరా.. బురిడి బాబా అరెస్ట్..

  'లైఫ్ స్టైల్' బిల్డింగ్ యజమాని మధుసూధన్ రెడ్డిని బురిడి కొట్టించి శివానంద అనే దొంగ బాబా కోటి 30 లక్షల రూపాయలతో ఉడాయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే అతని కారు డ్రైవర్ షాజహాన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. ఇప్పుడు శివానందని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ ను ట్రేస్ చేసి.. ఎవరెవరితో మాట్లాడాడన్న దానిపై దృష్టి సారించి.. వారిని విచారించడంవల్ల ఆయన ఎక్కడెక్కడ దాక్కునే అవకాశం వుందో తెలుసుకున్నామని... వారు చెప్పినట్టే అతనిని బెంగళూరు శివారుల్లో పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం అతను హైదరాబాదు నుంచి డబ్బులు తీసుకుని బెంగళూరు వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. అతని నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

రోడ్డు ప్రమాదాల్లో తమిళనాడు టాప్..

  దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో జరిగినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2015 కు సంబంధించి రోడ్డుప్రమాదాలు, మరణాలకు సంబంధించి నితిన్ గడ్కరీ ఓ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014తో పోలిస్తే 2015లో 2.5శాతం రోడ్డుప్రమాదాలు, 4.6శాతం మరణాలు పెరిగాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.   కాగా రోడ్డుప్రమాదాల్లో ఏపీ ఏడోస్థానంలో, తెలంగాణలో పదో స్థానంలో ఉన్నాయి. నగరాల వారీగా అత్యధిక ప్రమాదాలు ముంబయిలో, అత్యధిక మరణాలు దిల్లీలో సంభవించాయి. ట్రాఫిక్‌ జంక్షన్లలోనే 49శాతం ప్రమాదాలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 53.8 శాతం ప్రమాదాలు, 61శాతం మరణాలు సంభవిస్తున్నాయి. రోజుకు సగటున 1,374 రోడ్డుప్రమాదాలు జరుగుతుండగా, 400 మరణాలు సంభవించాయి. రోడ్డుప్రమాదాల మృతుల్లో 54.1 శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల లోపువారే.

పోలీసుల అదుపులో బురిడి బాబా డ్రైవర్..

బంజారాహిల్స్ లో పూజలు పేరుతో రూ 1.33 కోట్లతో శివ అనే దొంగ బాబా పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ బురిడి బాబా కేసులో  పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతని కారు డ్రైవర్ షాజ‌హాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కారు డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు. దొంగ బాబాతో మ‌రో ముగ్గురు మాట్లాడిన‌ట్లు షాజ‌హాన్ పోలీసుల‌కి తెలిపాడు. బాబా క‌ర్ణాట‌క వైపుగా పారిపోయిన‌ట్లు అనుమానిస్తోన్న పోలీసులు బెంగ‌ళూరుకి ప్ర‌త్యేక గాలింపు బృందాలను పంపించారు.   ఇదిలా ఉండగా అలిపిరిలో రెండేళ్ల క్రితం ఇదే తరహాలో దొంగబాబా శివ మోసం చేసినట్టు తెలుస్తోంది. అప్పుడు శివను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అలిపిరి పోలీసులు నుండి  హైదరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లా వట్టెం రిజర్వాయర్ కోసం భూసేకరణ జరిపేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 123 విడుదల చేసింది. ఇక్కడ 2013 భూసేకరణ చట్టాన్ని అమలు జరపకుండా జీవోతో భూసేకరణ జరపాలని భావించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూసింది. ఎకరానికి రూ. 20 నుంచి రూ.25 లక్షల వరకు చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు తాము సిద్ధమని రైతులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కారుకొండకు చెందిన రైతులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం..తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణ కోసం రైతులను ఎందుకు బెదిరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందు రైతుల సమస్యలను పరిశీలించాలని, అప్పటి వరకు భూసేకరణను నిలిపివేయాలని ఆదేశించింది.