భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వం.. రంగంలోకి మోడీ..

ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ కు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడానికి ఇప్పటికే అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఒప్పుకోగా.. చైనా మాత్రం తన నిరసనను కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చైనా అడ్డుకట్టలను నిలువరించేందుకు ప్రధాని మోడీనే స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. దక్షిణ కొరియాలోని సియోల్ లో రేపటి నుండి రెండు రోజులపాటు ఎన్ఎస్జీ సమావేశాలు జరగనున్నాయి. చైనా పదే పదే భారత్ ను అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీనే స్వయంగా అక్కడికి బయలుదేరనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈసారి సియోల్ లో సైతం అడ్డుకున్న పక్షంలో, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు చైనాకు వ్యతిరేకంగా ఓ రూలింగ్ ను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇకపై వీర నారీమణులే మెట్రో రైళ్లకు భద్రత...

దేశ రాజధాని ఢిల్లీలో ఆడవాళ్లపై జరిగే ఆకృత్యాలు మనకు తెలిసిందే. రోజుకో ఘటన వింటూనే ఉంటాం. ఇక మెట్రో రైళ్లలో అయితే అమ్మాయిలు నిత్యమూ వేధింపులకు గురవుతూనే ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అందుకే దీనిపై ఆలోచించిన ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.  ఇకపై ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళలే పూర్తి భద్రతను చేపట్టే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఐఎస్ఎఫ్ ప్రకటన కూడా చేసింది. సుశిక్షితులైన వీర నారీమణులు ఇకపై మెట్రో రైళ్లలో భద్రతను పర్యవేక్షిస్తుంటారని, వీరికి ఆయుధాలు వాడటం నుంచి మార్షల్ ఆర్ట్స్ వరకూ తెలుసునని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.  ఢిల్లీలో మెట్రోల భద్రత కోసం సీఐఎస్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్, ఐటీబీపీ తదితరాల్లో శిక్షణ పొందిన వారూ ఉంటారని అధికారులు తెలిపారు.

దీక్ష విరమించిన ముద్రగడ.. అవమానం జరిగింది..

  ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు. పద్నాలుగు రోజుల నుండి దీక్ష చేస్తున్న ఆయన తన నివాసంలో కాపు నేతల మధ్య దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాజకీయ నేతకు ఇంతటి అవమానం జరిగి ఉండదు.. నా కుటుంబానికి జరిగిన అవమానం చెప్పలేనిది.. ఈ అవమానానికి భగవంతుడు తగిన శాస్తి చేస్తాడు..భగవంతుడు తగిన శాస్తి చేసే వరకూ ఇంట్లో ఎలాంటి పండుగలు చేసుకోం అని అన్నారు. ప్రజలకు మీడియా, చివరికి, ఫోన్ కు కూడా దూరం చేశారు.. వాళ్ల ఖర్మకు వాళ్లే బాధ్యులు.. హామీలు నేరవేర్చమని అడిగినందుకు వారికి కోపమోస్తుంది..అయినా కాపుల కోసం పోరాడతాను.. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ముందుకు సాగుతుంది అని వ్యాఖ్యానించారు.

ఇస్రో సరికొత్త రికార్డ్... ఒక్కసారే 20 ఉపగ్రహాలు

ఇస్రో మరో రికార్డ్ సృష్టించింది. ఒక్కసారే 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-34 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉప గ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ,ఇండోనేషియాకు చెందిన 17 ఉప గ్రహాలను బుధవారం ఉదయం 9.26 గంటలకు వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. దీంతో  అమెరికా, రష్యా తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.  పీఎస్ఎల్వీ సీ-34 ప్రయోగం విజయవంతమవడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కూడా శాస్త్రవేత్తలను అభినందించారు.

ముద్రగడ దీక్ష ముగిసినట్టే ...

  కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు దీక్ష విరమించనున్నారు. తుని అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న వారిని విడుదల చేయాలంటూ ముద్రగడ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆయన దీక్ష చేపట్టి దాదాపు పద్నాలుగు రోజులు అయిపోయింది. అయితే ఈరోజు ఆయన దీక్ష విరమించనున్నారు. అయితే దీక్ష విరమించడనాకి ఆయన కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది.  తననూ, జైలు నుంచి విడుదలైన 13 మందినీ పోలీసు వ్యాన్ లో కిర్లంపూడికి తీసుకువెళ్లాలని, అక్కడికి కలెక్టర్, ఎస్పీలు వచ్చి నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ షరతులు పెట్టారు. దీనికి ప్రభుత్వం మాత్రం.. అది ఎట్టిపరిస్థితుల్లో కుదరదని.. ఇక దీక్ష విరమించి ఇంటికి వెళ్లాలని సూచించారు. దీంతో కిర్లంపూడిలో భారీ బధ్రత ఏర్పాటు చేశారు. 

నేనేమి చెప్పును కాదు వాడి పడేయడానికి..

రాజీనామా చేయాలంటే అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాయాలి. అయితే ఆ లేఖ సరిగా రాయకపోతే స్పీకర్ రాజీనామాను తిరస్కరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది కన్నడ నటుడు, ఎమ్మెల్యే అంబారీశ్ కు. మంత్రిగా ఉన్న అంబరీశ్ ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలగించారు. అంబరీశ్ తో పాటూ మరో 13 మంది మంత్రులను తొలగించారు. కొత్తగా 13 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే అంబరీశ్ కు కోపం వచ్చి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. అవసరం ఉన్నప్పుడు వాడుకుని... తరువాత దూరంగా పడేయడానికి తాను చెప్పును కాదంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో లేఖ సరిగా లేదన్న కారణంగా స్పీకర్ రాజీనామాను తిరస్కరించారు. మరోవైపు అంబరీశ్ రాజీనామాను ఆయన అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

మధ్యలో రాహుల్ ను ఎందుకు లాగావ్ కేజ్రీవాల్..?

తనకు మోడీ అంటే భయం ఉందో లేదో తెలియదు కానీ.. మధ్యలో రాహుల్ గాంధీని ఇరికించారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. వాటర్ స్కాంలో భాగంగా పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ లో కేజ్రీవాల్? పేరు నిందితుడిగా పెట్టారు. అంతే దీనిపై నిప్పులు చెరుగుతున్న కేజ్రీవాల్ కేంద్రం కేసులు పెడితే, భయపడేందుకు తానేమీ రాహుల్ గాంధీనో, రాబర్ట్ వాద్రానో కాదని అన్నారు. మోదీ తానంటే భయపడుతున్నాడని, అందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నిజాలేంటో విచారణలో తేలుతాయని అన్నారు. కాగా, 2012లో ఢిల్లీ వాసులకు నీళ్లను సరఫరా చేసేందుకు 385 వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకోగా, ఈ వ్యవహారంలో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని చెబుతూ, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కమిటీ వేయగా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు షీలా దీక్షిత్ తో పాటు కేజ్రీవాల్ నూ ఎఫ్ఐఆర్ లో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే అంతా బానే ఉంది మధ్యలో కేజ్రీవాల్ రాహుల్ ను ఎందుకు లాగినట్టో.. మరి రాహుల్ దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి.

నిజాయితీని చాటుకున్న ఆటోవాలా...

  ఎవరు బకరా దొరుకుతారా.. ఎవరిని మోసం చేద్దామా.. ఎవరి దగ్గర దోచుకుందామా అని చూసే రోజులు ఇవి. అలాంటిది ఓ ఆటోవాలా మాత్రం తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలో గుడ్డు గుప్తా అనే వ్యక్తి ఆటోవాలాగా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఓ భార్యభర్తలు ఇద్దరు అతని ఆటో ఎక్కి  బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వద్ద దిగారు. అయితే వారు దిగారు కానీ వారి లగేజీ మాత్రం మర్చిపోయారు. వారు తమ ఆటోలో లగేజీని మరిచిపోవడం గుప్తా రాత్రి గమనించాడు. ఎలాగైనా లగేజీ వారికి అందించాలని గుప్తా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ కు చేరుకుని, అక్కడి పోలీసు అధికారులకు చెప్పాడు. దీంతో పోలీసులు వివరాలు సేకరించి.. లగేజీ మర్చిపోయిన వారిని కనుగొని వారి సామాను వారికి అందించారు.   ఈ సందర్బంగా తమ లగేజీ తమకు తిరిగి ఇచ్చినందుకు ఆటోవాలాకు ధన్యావాదాలు తెలుపుతున్నామని.. బంగారు ఆభరణాలు, రూ.3,000 నగదు, ఇన్సూరెన్స్ పేపర్లు తమ సూట్ కేసులో ఉన్నాయని ముక్తార్ అహ్మద్ చెప్పారు.

దీక్ష విరమిస్తున్న ముద్రగడ..!

  కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష దాదాపు పద్నాలుగు రోజులకు చేరింది. అయితే ఇప్పుడు ఆయన దీక్ష విరమించేందుకు ఒప్పుకున్నారని రాజమండ్రి ఆస్పత్రి వైద్య సిబ్బంది తెలిపారు. ఆయన ఇంట్లో దీక్ష విరమించేందుకు సిద్దంగా ఉన్నారని తెలుపుతున్నారు. అయితే దీనిపై ముద్రగడ నుండి కాని, వారి కుటుంబసభ్యులు, జేఏసీ సభ్యుల నుండి కానీ ఎలాంటి అధికార ప్రకటన రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 14 రోజులుగా దీక్ష చేపడుతున్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా తుని కేసులో అరెస్ట్ అయిన నిందితులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

వామ్మో బామ్మ.. 90 ఏళ్ల వయసులో ఆసనాలు..

  ఈరోజు అంతర్జాతీయ యోగా డే. ఈరోజు అందరూ యోగాసనాలు వేస్తూ యోగా డే ను జరుపుకుంటారు. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు ఆసనాలు చాలా తేలికగా వేసేయోచ్చు. అదే వయసు దాటిన తరువాత వేయాలంటే.. అసలు ఆ వయసులో మన పని మనకు చేసుకోవడానికే చాలా కష్టం.. అలాంటిది యోగాసనాలా అని అనుకుంటున్నారు. కానీ ఆ వయసులో కూడా యోగాసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నానమ్మాళ్ అనే భామ. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నానమ్మాళ్- ఒక యోగా టీచర్. 93 ఏళ్ల వయసు. అయినా ఇప్పటికీ ఆమె శరీరాన్ని విల్లులా వంచుతుంది! నానమ్మాళ్ యోగాసనాలు వేస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే! దాదాపు 50 రకాల ఆసనాలను ఈ వయసులో కూడా అవలీలగా వేసెయ్యగలదు. 20 వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటిదాకా ఆమె మందు బిళ్ల కూడా మింగలేదంటే నమ్మండి. అంత ఆరోగ్యంగా ఉంటారు. దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్ గా నానమ్మాళ్ ఖ్యాతి గడించారు.

మధ్యలో నలిగిపోతున్న చంద్రబాబు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అభివృద్ధికి పడుతున్న పాట్లు చూస్తుంటే ఒక్క ముక్కలో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్ధిక లోటుతో ఉన్న ఏపీని వృద్ది చేయడానికి ఆయన బాగానే కష్టపడుతున్నారు. ఒక పక్క కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీలు లాంటివి ఇవ్వడం లేదు.. మరోవైపు ప్రతిపక్షాల గోల. ఇక ప్రతిపక్ష నేత జగన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. చంద్రబాబును ఏ పాయింట్ మీద విమర్శించాలా.. ఏ రచ్చ చేయాలా అని చూస్తుంటారు. చంద్రబాబు అంత రాజకీయానుభవం లేకపోయినప్పటికీ..యువనేత చేసే పనులు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగానే తయారయ్యాయి. ఇప్పుడు ముద్రగడ రూపంలో మరో తలనొప్పి.   ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో మరో పరిస్థితి. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కాని తెలంగాణలో పరిస్థితి వేరు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీదే ప్రస్తుతం హవా అక్కడ. ఏపీలోనే ఆయన ఎక్కువ గడుపుతుండటంతో.. తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో నేతల్లో అసంతృప్తి నెలకొనడం.. పార్టీ మారడం. ఇప్పటికే దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ నుండి ఇద్దరో ముగ్గురో ఎమ్మెల్యేలకు చేరిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మరో నేత కూడా పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ నేత ఎవరో కాదు.. నల్గొండ జిల్లా దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. దీంతో చంద్రబాబు మోత్కుపల్లి కూడా వెళ్లిపోతారేమో అని టెన్షన్ పడుతున్నారంట.   గత కొంత కాలంగా చంద్రబాబు మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తాననే చెబుతున్నారు. కానీ అది ఇంతవరకూ జరగలేదు. పోనీ.. అదికాకపోయినా రాజ్యసభ స్థానాల్లో ఒక సీటు కేటాయించాలని కోరారట.. కానీ అదీ జరగలేదు. వచ్చిన మూడు సీట్లలో ఒకటి మిత్రపక్షమైన బీజేపీకి ఇవ్వగా.. ఏపీలో ఉన్న రాజకీయాల దృష్యా రెండు సీట్లు అక్కడివారికే కేటాయించారు. అయితే ఇకపై కేంద్రనుండి ఏ సీటు వచ్చినా అది తెలంగాణ టీడీపీకే ఇస్తానని చెప్పారంట. అనుకున్నట్టే టీడీపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చింది. అయితే ఈసారి కూడా బాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. కేంద్రం మంత్రి పదవి ఇస్తే కేంద్రం నిధుల విషయంలో మొండి చేయి చూపుతుందని.. మంత్రి పదవి తీసుకోకుండా ఉంటే నిధుల కోసం గట్టిగా డిమాండ్‌ చేయవచ్చని అనుకుంటున్నారు.. మరోపక్క టీ టీడీపీకి పదవి ఇస్తామని హామి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటారో. అంతేకాదు మంత్రి పదవి వద్దని ఆయన గవర్నర్ పదవి అడగాలని.. పోస్ట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారంట. ఈ పదవి కునుక దక్కి తెలంగాణ నేతలకు ఇస్తే చంద్రబాబును వారి నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు మోత్కుపల్లిని సంతోపెట్టగలరా..? లేదా..? అన్నది చూడాలి.

ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తే ఇక అంతే..

  తమిళనాడులో అమ్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా బస్సులో రద్దీ ఎక్కువ ఉన్నప్పుడో.. లేక బస్సులు లేవనో ఫుట్ బోర్టు పై చాలా మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే చెప్పక్కర్లేదు.. ఒకవేళ బస్సులో ప్లేసు ఉన్నా ఫుట్ బోర్టు పై నిలబడటానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దీంతో దీన్ని అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇకనుండి ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ, పట్టుబడే విద్యార్థుల బస్ పాస్ లను రద్దు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వలను విద్యాశాఖ నుంచి జారీ అయ్యాయి. గతంలో వీటిని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకున్నా.. వారికి రూ. 500 జరిమానా, తల్లిదంద్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, టీసీలు ఇచ్చి పంపడం వంటి చర్యలు చేపట్టినా, అది కొంతకాలానికే పరిమితమైందని.. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలుపుతోంది.

యోగాసనాలు వేస్తూ ఎంపీ నిరసన.. కేజ్రీవాల్ ఇంటి ముందు..

  ఈ రోజు ప్రపంచ రెండో యోగా డే. అందరూ ఆసనాలు వేస్తూ బిజీగా ఉంటే ఓ ఎంపీ మాత్రం ఆసనాలతో తన నిరసనను తెలుపుతున్నాడు. ఇంతకీ ఎవరా ఎంపీ.. ఎందుకు నిరసనలు తెలుపుతున్నాడనే కదా డౌట్.. అసలు సంగతేంటంటే.. బీజేపీ ఎంపీ మహేశ్ గిరీ పై ఢిల్లీ ముక్యమంత్రి కేజ్రీవాల్ ఓ హ‌త్య కేసులో తనపై ఆరోపణలు కురిపిస్తున్న నేపథ్యంలో ఆయన దీక్షకు దిగారు. గత రెండు రోజుల నుండి కేజ్రీవాల్ ఇంటి ముందు దీక్ష చేస్తున్న ఆయన ఈరోజు యోగా డే సందర్బంగా.. వేదికపై యోగననాలు వేశారు. ఆయనతో పాటు ఆయనకు మద్దతు తెలుపుతున్న పలువురు నేతలు కూడా యోగాసనాలు వేస్తూ నిరసన తెలిపారు.

ముద్రగడ దీక్ష ఈ మాత్రం దానికేనా..?

  ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టి రోజులకు రోజులు గడుస్తున్నా ఫలితం మాత్రం ఎంటో ఎవ్వరికీ అర్ధంకావడంలేదు. గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. అయితే అప్పుడు ప్రభుత్వం కూడా దిగివచ్చి.. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. వారికోసం ఓ కమిటీ కూడా వేస్తాం అని సర్దిచెప్పడంతో అప్పుడు దీక్ష విరమించారు. అయితే ఇప్పుడు ముద్రగడ దీక్ష చేపట్టి పది రోజుల పైన అవుతున్నా ప్రభుత్వం కూడా అడుగు ముందుకేయడం లేదు. ఏదో రెండు రోజులు హడావుడి చేసినా.. ఆతరువాత చేసుకుంటే చేసుకోండి అన్నట్టు వదిలేసింది. ఇక ముద్రగడ కూడా తాను మాత్రం దీక్ష విరమించేది లేదని చెబుతూ.. ఒకపక్క వైద్య పరీక్షలకు సహకరిస్తూ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఇంతా చేసి.. దీక్షా చేస్తున్న.. కొంతమంది మాత్రం ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారో క్లారిటీ ఉందా..?లేదా..? అని అనుకుంటున్నారా. ఎందుకంటే. తుని కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలంటూ ముద్రగడ దీక్ష చేపట్టారు. అయితే దీనిపై ముగ్గురికి బెయిల్ దొరికింది. ఇక మిగిలివారికి కూడా దొరకడం పెద్ద కష్టమేమి కాదు. నేపథ్యంలో ఇక ముద్రగడ దీక్ష విరమింపజేయవచ్చని కాపు సంఘాల నేతలే అన్నారు. దీనికి ముద్రగడ బెయిల్ దొరికిన ముగ్గురు బయటకు వచ్చాకే విరమించేది లేదు అన్నట్టు సమాచారం. అంటే దీన్నిబట్టి చూస్తే.. ముద్రగడ ఎంతో కష్టపడి ఇన్నిరోజులు దీక్ష చేసింది నిందితులు బెయిల్ మీద బయటకు రావడం కోసమా..? కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. విచారణలు విన్న తరువాత వారికి బెయిల్ ఇవ్వడం అయిపోతుంది.. దానికి ఓ రెండు రోజుల టైం పడుతుంది.. ఆ మాత్రం దానికి దీక్ష చేయడం అవసరమా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   ఇక్కడ ఇంకా సిల్లీ విషయం ఏంటంటే.. ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటూ దీక్ష చేస్తున్న ముద్రగడకు అప్పుడప్పుడూ.. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూనే ఉన్నారు. మరి ఆ మాత్రం ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ ఎన్నిరోజులైనా దీక్ష చేసేయోచ్చు. అందుకే ప్రభుత్వం కూడా చేసుకుంటే చేసుకోండిలే అని నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు. మొత్తానికి ముద్రగడ చేస్తున్న దీక్షపై ప్రజలకు ఎలాగూ ఓ క్లారిటీ లేదు.. మరి ఆయనకన్నా ఓ క్లారిటీ ఉందో లేదో.. అసలు ఈ దీక్ష వల్ల ఆయన సాధించిందేంటో ఆయనకే తెలియాలి.

ట్రంప్ పై హత్యాయత్నం... ఊరుకుంటాడా..?

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అందరికి షాకులిచ్చే డొనాల్డ్ ట్రంప్ కే ఓ యువకుడు దిమ్మతిరిగే షాకిచ్చాడు. అతనిని చంపేదుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. వివరాల ప్రకారం.. లాస్ వేగాస్ లో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఆ ర్యాలిలో కాలిఫోర్నియాకు చెందిన మైకెల్ స్టాన్ ఫోర్డ్ (19) అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. అంతలో సడెన్ గా సెక్యూరిటీగా ఉన్న ఓ పోలీసు వద్ద గన్ లాక్కుని ట్రంప్ ను కాల్చేందుకు ప్రయత్నించాడు. అంతే వెంటనే తేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. లాస్ వెగాస్ లో ట్రంప్ మిస్సయితే తరువాత ఫీనిక్స్ ప్రాంతంలో జరిగే ర్యాలీలో చంపేందుకు సిద్ధమైనట్టు చెప్పాడు. ట్రంప్ ను చంపేందుకు ఒక్కరోజు ముందే లాస్ వేగాస్ వచ్చానని.. గన్ కాల్చడం కూడా ఒక్క రోజులోనే నేర్చుకున్నానని చెప్పాడు.   అసలే ట్రంప్ కు చిన్న విషయం దొరికినా తన నోటికి పని చెప్పి ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు అతనిపైనే ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించినట్టు తెలిసిన తరువాత ఊరుకుంటాడా.. ఈ విషయంలో ఎవర్ని విమర్శిస్తాడో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి.  

ప్రపంచ యోగా డే.. నేతల ఆసనాలు..

  ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చంఢీగఢ్ లోని క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్ధులు.. కేంద్రమంత్రులు చాలా మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా అనేది మన జీవన విధానమని, ముక్తి మార్గం వంటిందని అన్నారు. భారత్‌ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. యోగాకు మతం లేదని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంటోందని తెలిపారు.   మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. విజయవాడలోని ఎ1 కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని.. యోగా ఆసనాల వల్ల ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని.. ఆత్మ, పరమాత్మను కలిపేదే యోగా అని అన్నారు. ఇంకా ఈ యోగా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పాల్గొన్నారు.  పేర్కొన్నారు.  

నేపాల్ లో 36 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్...

  నేపాల్ లో నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 36 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(సీఐబీ) పోలీసులు ‘ఆపరేషన్‌ క్వాక్‌’లో భాగంగా నకిలీ వైద్య డిగ్రీలు, లైసెన్సుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల్లో 36మంది నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. కాగా వీరందరిని  కాఠ్‌మాండూ జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టగా.. ఐదు రోజులు రిమాండులో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఐదు రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి తగిన చర్యలు చేపడతామని పోలీసులు చెప్పారు.