స్వామి కన్ను ఇప్పుడు టీడీపీపై పడిందా..?

  నిన్నటి వరకూ కాంగ్రెస్ నేతలు, ఆర్ధిక వేత్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు టీడీపీపై కూడా ఆయన కన్ను పడినట్టుంది. ఏపీలోని పుణ్య కేత్రమైన తిరుమల నేపథ్యంలో ఆయన టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రంపై టీడీపీ ప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని.. ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఎప్పుడూ కాంగ్రెస్ పై ఏదో ఒక ఆరోపణలు చేసి వారిని ఇరుకున పెట్టే సుబ్రహ్మణ్యస్వామి.. ఆ తరువాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ను టార్గెట్ చేశారు. ఆ తరువాత.. కేంద్ర ఆర్ధిక సలహాదారు.. అరవింద్ సుబ్రమణియన్ ను టార్గెట్ చేశాడు. అది అయిపోయిందనుకుంటే.. విదేశీ యాత్రలు చేసే మంత్రుల డ్రస్సింగ్ గురించి ట్విట్టర్లో కామెంట్లు విసిరి దుమారం రేపారు. మళ్లీ ఇప్పుడు తాజాగా ఆయన కన్ను ఏపీలోని టీడీపీ పై పడింది మరి దీనిపై ఎంత రగడ చేస్తారో.. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే.

చంద్రబాబు, కేసీఆర్.. మళ్లీ మొదలైంది..

  అనుకున్నంత పనే జరిగింది. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ గురించి కూడా ఇరు రాష్ట్రాల మధ్య రగడ మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఏపీ భవన్ గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని.. ఢిల్లీలోని ఏపీ భవన్‌ స్థలాన్ని తెలంగాణకు బదిలీ చేయాలని..  ఏపీ భవన్‌ స్థలంలో తెలంగాణ నూతన భవనాన్ని నిర్మించుకుంటామని పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ భవన్‌ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు.   ఇప్పుడు దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఒక పక్క కేంద్రం నుండి నిధులు రాక మొత్తుకుంటుంటే.. మనకు సహకరించాల్సింది పోయి.. అన్నింటిలోనూ ఇబ్బంది పెడతారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ మనం ముందుకెళ్లాలి. తెలివే మన ధైర్యం. దృఢ సంకల్పంతో ముందుకెళ్లాల్సి ఉంది. 4 శాతం జనాభా ఉన్న ఏపీ... జేఈఈలో 15 ర్యాంకులు దక్కించుకోవడం మన సత్తాకు నిదర్శనం'' అని అన్నారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలకు కేసీఆర్ స్పందిస్తారా.. లేదా..? ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

రాహుల్ గాంధీ గురించి చెప్పండి.. లక్ష రూపాయలు తీసుకోండి..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అప్పుడప్పుడు కనిపించకుండా పర్యటనలకు వెళుతుంటారు అది కామన్. గతంలో కూడా ఇలాంటివి చాలానే చూశాం. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఆ తరువాత ఆయన కనిపించకుండా వెళ్లిపోయాడు అనుకోవడం ఇంకా కామన్. ఇప్పుడు మళ్లీ ఆయన విదేశీ పర్యటనపై ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇటీవలే తన 46 వ పుట్టిన రోజు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కొద్ది రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ పర్యటనపై ప్రత్యర్థులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.   మధ్యప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్ సిసోడియా మాత్రం ఏకంగా రివార్డునే ప్రకటించేశారు. 'రాహుల్ ఏ దేశంలో ఉన్నారు? ఆయనకు సంబంధించి సమాచారం ఉంటే ఇవ్వండి. నా జేబులోంచి లక్ష రూపాయలు ఇస్తాను' అని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నేత రవి సక్సేనా వెంటనే ఈ బిజెపి నేత రివార్డుకు కౌంటర్ ఇచ్చారు. బిజెపికి రాహుల్ ఫోబియా పట్టుకుందని అన్నారు. హోంమంత్రిత్వ శాఖను అడిగితే రాహుల్ ఆచూకీ తెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని కారణంగానే సిసోడియా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

హరీశ్, రేవంత్ రెడ్డి.. ఎవరి పంతం నెగ్గుతుందో..?

మల్లన్న సాగర్ పై అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు మధ్య రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, రేవంత్ రెడ్డిలు పోటా పోటీగా సవాళ్లు చేస్తున్నారు. ఒకపక్క ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతామని హరీశ్ రావు అంటుంటే.. మరోపక్క రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు అంటూ దీక్ష చేస్తానని పూనుకున్నారు.   హరీశ్ రావు మాట్లాడుతూ..  ప్ర‌భుత్వం చేప‌డుతోన్న‌ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయని.. తెలంగాణ ఏర్పాటుకు స‌హ‌క‌రించ‌ని నాయ‌కులు ఇప్పుడు అభివృద్ధికి కూడా స‌హ‌క‌రించ‌డం లేద‌ని అంటున్నారని.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ కట్టి తీరతామని అంటున్నారు.   రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో సర్వం కోల్పోతున్న ముంపు గ్రామాల ప్రజల కోసం ఏటిగడ్డ కిష్టాపురంలో 48గంటల దీక్ష చేపడుతానని.. . ముంపు గ్రామాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం పోలీసు బలగాలతో అడ్డుకున్నా దీక్ష చేసి తీరుతానన్నారు. ముంపు గ్రామాలకు కేసీఆర్, హరీశ్‌రావు వెళ్తే, ప్రజలు బట్టలిప్పదీసి కొడతారన్నారు. దమ్ముంటే ముంపు గ్రామాలకు రావాలని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. తాను కూడా వస్తానని, ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడి, ఏం కావాలో అడిగి, ఒప్పిద్దామన్నారు. మరి ఇద్దరు నేతలూ మంచి పట్టున్న నేతలే.. ఈనేపథ్యంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.

జగన్ టూర్ పై సొంత పార్టీ నేతలే ఏడ్పా..?

రాష్ట్రంలో ఒకపక్క ముద్రగడ దీక్ష..మరోపక్క తాత్కాలిక సచివాలయంలో నేల కుంగిపోవడం.. మరి ఇన్ని జరుగుతుంటే.. వీటిని ప్లస్ చేసుకొంటూ.. ఇంకేముంది ఇన్ని జరగడానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఊదరగొట్టే జగన్ ఎక్కడ..? ఏ చిన్న పాయింట్ దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబుని విమర్శిద్దామని చూసే జగన్ ఎక్కడ..? ఇంక ఎక్కడ.. చక్కగా బ్రిటన్ లో విహరిస్తున్నాడు. లేకపోతే ఇంత సైలెంట్ గా ఉంటారా. అయితే ఇప్పుడు ఆయన వెళ్లడం ఏమో కానీ చాలా మంది నేతలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారంట. అది కూడా పార్టీ నేతలే కావడం విశేషం. ఒకపక్క కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ ముద్రగడ చేస్తున్న దీక్షతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇలాంటి సమయంలో జగన్ విహార యాత్రకు వెళ్లడంతో నేతలు చాలా ఫీల్ అవుతున్నారట. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతుంటే.. ఇలాంటి సమయంలో జగన్ విహార యాత్రకు వెళ్లడం బాధకరం అంటూ వాపోతున్నారట. అంతేకాదు జగన్ అక్కడ తీసుకున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. వాటిలో జగన్ మోహన్ గోల్ఫ్ ఆడుతున్నాడు. ఇంకేముంది ఆ ఫొటోలను చూసి ఇంకా ఏడుస్తున్నారంట. ఇవన్నీ ఒకఎత్తైతే.. దీనిపై టీడీపీ నేతలు కూడా స్పందించడం ఇంకో ఎత్తు. జగన్ చాలా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని.. వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో ఆరోపిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ విదేశీ పర్యటన మాత్రం చాలామంది నేతలకు కడుపుమంటను పుట్టిస్తుందని అర్ధమవుతోంది. ఆయన మాత్రం ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలా అని చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

అప్పుడు ముఖ్యమంత్రిని నేనే...

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఈ మధ్య ఎంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకే సవాల్ చేస్తూ హాట్ టాపిక్ అయిన జానారెడ్డి.. ఇప్పుడు.. మరోసారి రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రినని అందరికి షాకిచ్చారు. నల్గొండ జిల్లా హాలియాలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సీఎంతో సమాన హోదా ఉన్న ఏకైక నాయకుడిని తానేనని జానారెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై నేతల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి

తప్పుడు రాతలు రాస్తున్నారు..

  ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈసందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని, సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మార్చుకోవాలని అన్నారు. క‌ట్టుబ‌ట్ట‌లతో హైద‌రాబాద్‌కు వ‌చ్చామ‌ని అమ‌రావ‌తిని అభివృద్ధి చేసుకుందామ‌ని.. అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన ప్రాంతాన్ని రాజ‌ధానిగా నిర్ణ‌యించామ‌ని, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల ఎక‌రాల భూములిచ్చారని ఆయ‌న అన్నారు. రాజధాని నిర్మాణానికి 'స్విస్ ఛాలెంజ్‌' పద్ధతికి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపామ‌ని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   నిన్న సచివాలయం కుంగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై పలు కథనాలు వచ్చాయి కూడా. ఆ వార్తలపై స్పందించిన చంద్రబాబు ‘స‌చివాల‌యం కుంగిపోయింద‌ని దుర్మార్గంగా రాశారు’ అని మండిపడ్డారు. అంతేకాదు రాజ‌ధానిలో ల‌క్ష కోట్ల రూపాయల అవినీతి జ‌రుగుతోందంటూ రాశారని.. ల‌క్ష కోట్ల అవినీతి జ‌రిగే అవ‌కాశం, ఆస్కారం అక్క‌డ ఎక్క‌డ ఉంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇటువంటి వార్తలు రాస్తే ఇక్క‌డికి వ‌చ్చే సంస్థ‌ల్లో, భూములిచ్చిన ప్ర‌జ‌ల్లో అభ‌ద్ర‌తా భావం క‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. అటువంటి నేరాన్ని చేయొద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

మనకి ఈ సవాళ్లు ఎందుకు జానా..?

  తెలంగాణ ప్రభుత్వం కనుక రైతులకు రెండో పంటను ఇస్తే తాను టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇంతకీ అంతటి సవాల్ విసిరింది ఎవరనుకుంటున్నారా. ఇంకెవరూ అటు కాంగ్రెస్ కు అనుకూలమా.. లేక టీఆర్ఎస్ కు అనుకులమా అన్నట్టు వ్యాఖ్యానించే జానారెడ్డి గారు. జానారెడ్డిగారే.... కొత్తగా ఇలాంటి సవాల్ ను తెలంగాణ ప్రభుత్వానికి విసిరారు. అయితే ఇప్పుడు ఇంత సడెన్ గా జానారెడ్డి గారు.. ఇలాంటి సవాల్ ఎందుకు విసిరారబ్బా.. అందునా టీఆర్ఎస్ పార్టీకి అని చర్చించుకుంటున్నారు.   ఎందుకంటే.. కాంగ్రెస్ నేత అయిన జానారెడ్డి.. అవ్వడానికి ప్రతిపక్షనేత అయినా.. అప్పుడుప్పుడు టీఆర్ఎస్ పార్టీపైన ప్రశంసలు కురిపిస్తూనే ఉండేవారు. ఒకవైపు పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై పొగడ్తలు కురిపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ జానారెడ్డి మాత్రం సత్య హరిశ్చంద్రుడు మాదిరి.. టీఆర్ఎస్ ను పొగిడేవారు. దీంతో జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్ష నేతగా వ్యవహిస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన జానా.. నన్ను అంత మాత అంటారా.. నేను పదవులకు రాజీనామా చేస్తున్నా.. అంటూ ఎన్నోసార్లు చెప్పారు. కానీ చేసింది మాత్రం లేదు. అందుకే తనను టీఆర్ఎస్ కోవర్ట్ అనే విమర్శలు వున్నాయి. ఇప్పుడు ఆ విమర్శల నుండి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నారేమో.. ఏకంగా తెలంగాణ సర్కార్ కు సవాల్ విసిరారు.   మరి జానారెడ్డి అయితే సవాల్ విసిరారు. మరి సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తారా..? అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉన్నదే అంతంతమాత్రం.. ఇక ఆ పార్టీ నేతలు చేసే సవాళ్లను టీఆర్ఎస్ నేతలు స్వీకరిస్తారా.. అందునా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే జానారెడ్డి సవాల్ ను... మరోవైపు అసలు మనకు ఈ సవాళ్లేందుకు జానారెడ్డి అనుకునేవారు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సైకిల్ పై అమరావతికి.. మహిళ సాహసం..

  హైదరాబాద్ లో ఏపీ ఉద్యోగుల తరలింపు ప్రారంభమైంది. ఈనెల 27 నాటికి ఉద్యోగులందరూ ఏపీ రాజధాని అమరావతి వెళ్లాలని చూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులు ఏపీకి పయనమయ్యారు. నిన్న కొంతమంది ఏపీకి తరలి వెళ్లగా.. ఈరోజు కొంతమంది హైదరాబాద్ నుండి ఏపీకి బయలుదేరారు. సహకార, వాణిజ్య, సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో విజయవాడ బయల్దేరారు. అయితే అందరూ బస్సుల్లో వెళ్తుంటే.. పద్మ అనే ఉద్యోగిని మాత్రం తాను సైకిల్ మీద అమరావతికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. దీనికి ఏపీఎన్జీవో సంఘం నేతలు అశోక్ బాబు, కృష్ణయ్య తదితరులు ఆమెకు మద్దతు తెలిపారు. అశోక్ బాబు జెండా ఊపి ఆమె సైకిల్ ప్రయాణాన్ని ప్రారంభింప చేశారు. ఇదిలా ఉండగా.. కొంతమంది ఉద్యోగులు మాత్రం ఇక్కడి ఉద్యోగులను వదిలి వెళ్లలేక కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఏపీ కేబినెట్ లో చర్చించే అంశాలు ఇవే...

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలోని సీఎం కార్యలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలకమైన అంశాలపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చర్చించే అంశాలు.. * ఏపీ రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికకు సంబంధించి స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలపై చర్చించి.. స్విస్ ఛాలెంజ్‌కు సంబంధించిన బాధ్యతను సీఆర్డీఏకు అప్పగిస్తూ కేబినెట్ డిసెషన్ తీసుకునే అవకాశం * రాజధానికి ఉద్యోగుల తరలింపుపైనా *రేషన్ డీలర్లకు కమిషన్ పెంపుపై * కృష్ణా పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లపై * ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే పచ్చజెండా ఊపిన సర్కారు నిరుద్యోగుల వయోపరిమితి పెంపు డిమాండ్ అంశంపైనా * కృష్ణా జలాల వివాదం పై చర్చలు జరిగే అవకాశం.

సిద్ద రామయ్య నయా వివాదం.. బిపాసాకు కోటిన్నర

  కర్ణాటక ముఖ్యమంత్రికి ఏదో ఒక వివాదం లేనిదే అస్సలు నిద్రపట్టదు. వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన బెంగుళూరులో యోగా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తార బిపాసా బసును కూడా ఆహ్వానించారు. మరి ప్రభుత్వమే స్వయంగా వచ్చి అడిగితే బిపాసా ఊరుకుంటుందా.. గంటన్నర పాటు జరిగే ఈకార్యక్రమానికి కోటిన్నర కావాలని డిమాండ్ చేసిందట. దీనికి సిద్దరామయ్య ప్రభుత్వం కూడా ఓకే చెప్పి బిపాసాబసుకు కోటిన్నర చెల్లించారు. అంతేనా ఆమె రావడానికి, వెళ్లడానికి ఖర్చులు, ఉండటానికి హోటల్ అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించిందట. అంతే ఈ వార్త బయటకి రాగానే.. సిద్దరామయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరి సీఎం గారు దీనిని ఎలా కవర్ చేసుకుంటారో చూడాలి.

మీడియాతో ఫేస్ బుక్ బప్పందం..

  ఫేస్ బుక్ రోజుకో సరికొత్త ఫీచర్స్ తో యూజర్ల ముందుకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా.. ప్రముఖ మీడియా సంస్థలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా మీడియా ప్రత్యక్ష ప్రసారాలను ఫేస్ బుక్ ద్వారా లైవ్ లో చూసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈనేపథ్యంలోనే.. సుమారు 336 కోట్ల 55 లక్షల విలువ చేసే 140 ఒప్పందాలపై సంతకం చేసింది. దీనిద్వారా సామాజిక మాధ్యమంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఫేస్ బుక్ లో వినియోగదారులకు అందుబాటులో ప్రత్యక్ష ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బజ్ ఫీడ్, ఎన్ వైటీ, సీఎన్ఎన్ వంటి సంస్థలకు అత్యధికంగా 67 కోట్ల, 32 లక్షల రూపాయల వరకూ చెల్లించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ మరో ఉద్యమానికి తెర తీస్తున్నారా..?

  రాష్ట్ర విడిపోయిన తరువాత దాదాపు అన్నింటిలోనూ ఇరు రాష్ట్రాలకు పంపకాలు జరిగాయి. ఏపీకి రావాల్సినవి ఏపీ తీసుకుంది.. తెలంగాణకు రావాల్సింది తెలంగాణ తీసుకుంది. ఇప్పటికే కొన్ని అంశాలపై జరుగుతున్న వివాదులు ఓ కొలిక్కి రావడం లేదు. అటు హైకోర్టు విషయంలో కాని, నీళ్ల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి కానట్టు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వివాదానికి తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ వాటి గురించే కొట్టుకుంటుంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాటి గురించి కూడా రగడ మొదలయ్యేలా ఉంది.   రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దీనిలో భాగంగానే ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు రెండు పేజీల లేఖ రాశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ స్థలాన్ని తెలంగాణకు బదిలీ చేయాలని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ భవన్‌ స్థలంలో తెలంగాణ నూతన భవనాన్ని నిర్మించుకుంటామని కేసీఆర్‌ తెలిపారు. అలాగే షెడ్యూల్ 10పై నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ భవన్‌ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు.   మరి దీనికి ఏపీ నేతలు ఎలా స్పందిస్తారూ.. కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ కు వాళ్లు అంగీకరిస్తారా.. లేక దీనిపై కూడా ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటాయా చూడాలి.

ప్రధానికి ట్రాఫిక్ పోలీస్ ఫైన్...

ఏదో ప్రధాని ముచ్చటపడి మోటార్ బైక్ టాక్సీ నడిపితే.. అతనికే ఫైన్ వేసి అందరినీ అశ్యర్యపరిచాడు ఓ ట్రాఫిక్ పోలీస్. వివరాల ప్రకారం.. కంబోడియా ప్రధాని హన్ సేన్.. కో కాంగ్ ప్రావిన్స్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డుపై మోటార్ బైక్ టాక్సీ నడిపి తన ముచ్చట తీర్తుకుందామనుకున్నారు. ఈ క్రమంలోనే దానిని కొద్దిసేపు నడిపారు. అయితే అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు ఇదంతా గమనించి గమనిస్తున్నాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడపటం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ప్రధానికి జరిమానా విధించాడు. అయితే సదరు ట్రాఫిక్ పోలీస్ తనకు జరిమానా విధించడంపై ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయని హన్ సన్.. జరిగిన విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా అందరికి తెలిపారు. అంతేకాదు ప్రజలకు క్షమాపణలు చెప్పి.. తనకు విధించిన జరిమానా కడతానని పేర్కొన్నారు.

సెల్ఫీ పిచ్చి.. ఆరుగురు మృతి

సెల్ఫీ సరదా ఏమో కానీ.. దాని వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి తెలిసిందే. అయినా కానీ కొంతమందికి ఈ సెల్ఫీ పిచ్చి పోవడంలేదు. కొంతమందికైతే ఇదో అలవాటులా తయారైపోయింది. తాము ఏం చేస్తున్నా.. ఎక్కడ ఉన్నా..కాస్తంత వెరైటీగా అనిపిస్తే చాలు సెల్ఫీ తీసేసుకోవడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఇక ఆ తరువాత ఏముంది. దానికి ఎన్ని లైకులు వచ్చాయి.. ఎన్ని షేర్లు వచ్చాయి.. ఎన్ని కామెంట్లు వచ్చాయి.. అని చూసుకోవడంతోనే సరిపోతుంది.   ఇప్పుడు ఈ సెల్ఫీ క్రేజ్ తోనే ఒకేసారి ఏడుగురు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ బాధాకరమైన ఘటన కాన్పూర్లో చోటుచేసుకుంది. కాన్పూర్లోని  కొలొనేల్‌గంజ్‌కు చెందిన శివం వారి మిత్రులతో కలిసి గంగానది స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో తాను సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో పడిపోయాడు. దీంతో అతనిని కాపాడటం కోసం ప్రయత్నించిన ఆరుగురు మిత్రులు కూడా నీళ్లలో కొట్టుకుపోయారు. గజఈతగాళ్ల ద్వారా వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు గంటల తర్వాత వారి మృతదేహాలు లభించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన వల్ల నది వద్ద పెద్ద బారికేడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఎవరైనా బారికేడ్లు దాటి నది లోపలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీన్నిబట్టి ఏం అర్ధమవుతోంది.. సెల్పీ తీసుకోవడం తప్పుకాదు..కానీ దానికో టైం.. ప్లేస్ ఉంటుంది.. ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో తీసుకుంటే ప్రమాదాలే జరుగుతాయి.. సో జర భద్రం...

టీమిండియా కోచ్ గా కుంబ్లే.. చక్రం తిప్పిన కోహ్లి..!

  ఎంతో సస్పెన్స్ కూడిన తరువాత టీమిండియా కోచ్ ఎవరూ అనే విషయం తెలిసిపోయింది. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కోచ్ పదవికి దాదాపు 57 ధరఖాస్తులు రాగా.. వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ లు దరఖాస్తులు పెట్టారు. అంతేకాదు విదేశాలనుండి కోచ్ పదవికి ధరఖాస్తులు వచ్చాయి. అయితే వారందరిని వెనక్కి నెట్టి కుంబ్లే కోచ్ పదవికి ఎంపికయ్యారు.   అయితే వచ్చిన 57 దరఖాస్తుల నుండి మొత్తం 20 మందిని సెలక్ట్ చేసి వారి నుండి హెడ్ కోచ్ ను ఎంపిక చేయాలని.. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీకి బీసీసీఐ సూచించింది. ఈ మేరకు అందరిని ఇంటర్వ్యూ చేసిన కమిటీ.. దానికి సంబంధించిన నివేదికను బీసీసీఐకు అందించింది. దీనిని పరిశీలించిన బీసీసీఐ అనిల్ కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి అప్పగించాలని నిర్ణయించింది. అయితే కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి దక్కడంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీల పాత్ర ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

న్యాయవాది దారుణ హత్య..

  చెన్నైలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ న్యాయవాదిని.. అందరూ చూస్తుండగానే హత్యేచేశారు. వివరాల ప్రకారం.. టి.రవి అనే వ్యక్తి న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. నిన్న తాను స్కూటర్ పై వెళుతుండగా.. సత్యమూర్తినగర్‌ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. అనంతరం అతనిని కత్తితో పొడిచి.. అక్కడి నుండి పారరయ్యారు. అతనిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.   కాగా రవి న్యాయవాది మాత్రమే గాక, స్థానికంగా ప్రముఖ రాజకీయ నాయకుడు.అతడిపై కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రవిని  హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.