చిలుకా దొరకవే!

సాధారణంగా తమ వాళ్లు తప్పి పోయినప్పుడు వారిని వెతికే క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. కూడళ్లలో, బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్లలో వారి ఫొటోలతో కనిపించడం లేదు అంటూ పోస్టర్లు అంటించడం కద్దు. అలాగే తప్పిపోయిన తమ వారి ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామంటూ నజరానా కూడా ఆ పోస్టర్లో ప్రకటిస్తారు. ఇక ఇటీవలి కాలంలో తమ పెంపుడు జంతువులు తప్పిపోయిన సందర్భంలో కూడా పలువురు వాటి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోస్టర్లు కూడా వేస్తున్నారు. అలా తప్పి పోయిన పెంపుడు జంతువుల కోసం ఆరాటపడే వారిలో అత్యధికులు కుక్క, పిల్లి వంటి వాటి కోసం వెతుకులాట చేయడం చూశాం. ఇటీవల ఓ  ఉన్నతాధికారి తన పెంపుడు కుక్కను గాలించేందుకు ఏకంగా వందల సంఖ్యలో పోలీసులను వినియోగించి వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సామాజిక మాధ్యమంలో తన పెంపుడు చిలుక ఆచూకీ తెలిపిన వారికి పది వేల రూపాయలు బహుమతి అంటూ వెలిసిన పోస్టర్లు నెట్టింట వైరల్ అయ్యాయి.  మధ్యప్రదేశ్‌  దమోహ్‌ జిల్లాకు చెందిన దీపక్‌ సోనీ  పెంపుడు చిలుక ఎటో ఎగిరిపోయింది. ఆ చిలుక ఫొటోలతో పోస్టర్లు వేసి ఆచూకీ చెప్పినవారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఊరంతా పోస్టర్లు వేసి, ఆటోకు మైకులు పెట్టి మరీ తన పెంపుడు చిలక ఆచూకీ కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.  నిజానికి దీపక్ సోనీ చిలుక ఇలా పారిపోవడం ఇదేమీ తొలిసారి కాదు.  గత నెలలో ఒకసారి ఇలాగే ఎగిరిపోయి మళ్లీ దానంతటదే ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. రోజులు గడుస్తున్నా అది తిరిగి రాకపోవడంతో దీపక్ సోనీ కుటుంబ సభ్యులు ఆందోళన   పడుతున్నారు. ఆ చిలుక సరిగా ఎగరలేకపోతోందనీ, దానికి ఏదైనా హాని జరిగిందా అన్న ఆందోళన కలుగుతోందని  దీపక్‌ సోనీ అంటున్నారు. 

పొత్తు తేలకుండానే అభ్యర్థి ప్రకటన.. పవన్ సంకేతమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తల విషయంలో రోజుకో మలుపు తిరుగుతోంది. పూటకో రకమైన గందరగోళం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇంత కాలం చెబుతూ వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఏకపక్షంగా తమ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించేశారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అది కూడా కీలకమైన తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పార్టీ రాజకీయవ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్ పోటీలో నిలుస్తారని పవన్ ప్రకటించారని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. దీంతో జనసేన, తెలుగుదేశం వర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మరి పొత్తు సంగతేంటన్న చర్చ  ప్రారంభమైంది. వాస్తవానికి జనసేనాని ఏ నియోజకవర్గం నుంచైనా ఏక పక్షంగా అభ్యర్థిని ప్రకటించాలంటే ముందుగా తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ ప్రకటన చేయాలి అంతే తప్ప తెలుగుదేశంకు బలమైన స్థానంగా అంతా భావిస్తున్న తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పేరు ప్రకటించడమేమిటన్న చర్చ జరుగుతోంది. అంతే కాకుండా పొత్తుల విషయంలో ఒక నిర్ణయానికి రావాలన్న ఒత్తిడిని తెలుగుదేశంపై పెంచే వ్యూహమా? లేక నాదేండ్లను తన నియోజకవర్గానికే పరిమితం చేయాలన్న ఉద్దేశమా అన్న చర్చ కూడా మొదలైంది. మొత్తానికి నాదెండ్ల అభ్యర్థిత్వ ప్రకటన అన్న వార్త అసలే వేడిగా ఉన్న ఏపీ రాజకీయాలలో కాక పెంచిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ నిజంగానే తెనాలి నుంచి నాదెండ్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటించేసి ఉంటే.. అది దేనికి సంకేతం.. పొత్తులు ఉంటాయా? ఉండవా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెనాలి నుంచి తెలుగుదేశం తరఫున ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత యాస్పిరెంట్ గా ఉన్నారు. ఆయనను కాదని పొత్తులో భాగంగా తెనాలిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనకు వదిలేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. జనసేన తెలుగుదేశం పొత్తు ఖాయమన్న భావనతో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలిసి పని చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండగట్టే కార్యక్రమాలలో కలిసి అడుగులేస్తున్నాయి. అటువంటి తరుణంలో పొత్తల విషయం తేలకుండా ఇరువురి నేతల మధ్యా చర్చ జరగకుండా పవన్ కల్యాణ్ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన తరఫున బరిలో ఉంటారంటూ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.   లోకేష్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీల డ్రామాలాగా ఇది కూడా వైసీపీ మైండ్ గేమేనా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.   జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎంత మాత్రం చీలనీయబోనని పదే పదే ప్రకటిస్తున్న జగన్ తనతో పాటుగా బీజేపీని కూడా కూడగట్టాలని యోచిస్తున్నారు.  ఇప్పటికే  బీజేపీతో  పొత్తు లో ఉన్న జనసేన, తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఇప్పటికే మిత్రుడిగా ఉన్న బీజేపీని కూడా కలిసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. బీజేపీ కలుస్తుందా? అందుకు తెలుగుదేశం అంగీకరిస్తుందా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ తరుణంలో  పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇవ్వడం దేనికి సంకేతం. తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ కూటమి నుండి అభ్యర్దిగా రంగంలో ఉంటారన్న సంకేతమిచ్చారా అని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే నిజమైతే మరి  తెనాలిలో తెలుగు దేశం పార్టీ నుండి ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజా వరుసగా పోటీ చేస్తున్నారు. తెనాలి నుండి జనసేన తరపున నాదెండ్ల పోటీ చేస్తే కూటమి లో ఉన్న తెలుగు దేశం పార్టి అభ్యర్దిగా ఆలపాటి రాజా పరిస్దితి ఎంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.   ఏది ఏమైనా తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల అన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

ఎమ్మెల్యేల ఆస్తుల విలువ నాగాలాండ్ మిజోరం బడ్జెట్ కంటే ఎక్కువ!

దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలు ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ లెక్కలను ప్రకటించింది. ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించిన ఈ తాజా నివేదిక ప్రకారం దేశంలోని 4001 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 54, 545. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వరుసగా 3, 8 స్థానాలలో ఉన్నాయి. ఇందులో  ఇందులో తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 1601 కోట్లు అని ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ రిపోర్ట్ తేల్చింది.   వీరిలో 103 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులను రూ. 1,443 కోట్లుగా పేర్కొంది.  అలాగే   ఏపీలోని 146 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 3,379 కోట్లు అని నివేదిక పేర్కొంది.   ఇక దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆస్తుల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కర్నాటక టాప్‌లో నిలిచింది. కర్నాటకలోని 223 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 14,359 కోట్లు. ఇక, ఈ నివేదికలో రూ.6679 కోట్లతో రెండవ స్థానంలో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు నిలిచారు. దేశంలోని మొత్తం 1356 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 16,234 కోట్లుగా కాగా.. దేశంలోని మొత్తం 719 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు 15, 798 కోట్లుగా ఏడీఆర్ నివేదిక తేల్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.11.97 కోట్లు కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 21.97 కోట్లు,  వైసీపీ ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ. 23.14 కోట్లుగా పేర్కొంది.అంతేకాదు, ఎమ్మెల్యేల ఆస్తుల విలువ నాగాలాండ్, మిజోరం, సిక్కిం బడ్జెట్‌కు మించి ఉందని ఏడీఆర్-ఎన్ఈడబ్ల్యూ పేర్కొంది.  అందరికంటే తక్కువగా త్రిపురలో 59 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 90 కోట్లుగా తేలింది.  

జగన్ రివర్స్ పాలన.. రివర్స్ టెండరింగ్.. రివర్స్ ఇన్వెస్ట్ మెంట్స్!

గత మార్చి నెల 3, 4 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘స్వప్న’ రాజధాని విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ నిర్వహించింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆవిషయం గుర్తుందో లేదో కానీ, ఆ సందర్భంగా ఆయన అదే వేదిక నుంచి రెండు కీలక  ప్రకటనలు చేశారు.  ఈ సదస్సు ద్వారా, రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చి పడుతుందని చేయెత్తి మరీ చెప్పు కొచ్చారు. అలాగే, వట్టి పెట్టుబడులే కాదు, పెట్టుబడులతో పాటుగా..లక్షల్లో ఉద్యోగాలు వచ్చిపడుతున్నాయని ప్రకటించారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 20 రంగాలకు సంబంధించి, 340 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు, ఓ ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి, తమ ట్రేడ్ మార్క్ చిరునవ్వు చెరగకుండా, సగర్వంగా చెప్పారు.  అదే  వేదిక నుంచి ముఖ్యమంత్రి విశాఖ వాసులకు మరో ‘తీపి’ కబురు కూడా వినిపించారు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని వెల్లడించారు. అలాగే  తాను త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తానంటూ ముఖ్యమంత్రి సదస్సు వేదికగా పారిశ్రామిక దిగ్గజాలు - ఆహుతుల సమక్షంలో ప్రకటించారు. సరే రాజధాని విషయం కాసేపు పక్కన పెడడాం..  పెట్టుబడుల మాటేమిటి? అవైనా వచ్చాయా, అంటే, ఆ ఒక్కటీ అడగొద్దనేదే సర్కార్ స్వాముల సమాధానం. నిజమే విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్  వంటి సదస్సుల్లో కుదుర్చుకున్న ఎంఓయూలు అన్నీ, గ్రౌండ్ కావు. కొన్ని ఒప్పందాలు కాగితాలకే  పరిమితం అవుతాయి. అందులో కొన్ని ఉత్తుతి ఒప్పందలుంటాయి. కొన్నిటి విషయంలో ఎక్కడో చిక్కుముడి పడి ఆగి పోతాయి. ఇంకొన్ని కొంచెం ఆలస్యంగా మొదలవుతాయి ... కానీ, ఎన్నో కొన్నయితే ఖాయంగా ఇప్పటికే గ్రౌండ్ కావాల్సింది. కానీ, ‘వైరైటీ’ గా జగన్ రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకున్న, పోనీ కుదుర్చుకున్నామని స్వయంగా  ముఖ్యమంత్రి ప్రకటించిన  రూ.13 లక్షల కోట్లలో నుంచి కోట్ల తీసేసి లక్షల్లో చూసినా ఆ రూ.13 లక్షల పెట్టుబడులు అయినా వచ్చాయా ..అంటే లేదనే సమాధానమే వస్తోంది. నిజానికి, విశాఖ సమ్మిట్ తర్వత కాదు, జగన్ రెడ్డి నాలుగేళ్ళ పై చిలుకు పాలనలో రాష్టానికి కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఏంటో తెలిస్తే, సిగ్గుతో తలదించుకోక తప్పుదు. అవును జగన్ రెడ్డి పాలనలో పెట్టుబడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అధోగతికి చేరింది. అట్టడుగు స్థాయికి చేరుకుంది. ఇదేదో ఎవరో జగన్ రెడ్డి అంటే గిట్టని వ్యతిరేకులు చేస్తున్న ఆరోపణ కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే, 2019 నుంచి 2022 వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 5751 కోట్లు .. అంటే, దేశం మొత్తం పెట్టుబడులలో 0.4 శాతం. ఇంత తక్కువగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం దేశంలో  ఏపీ తప్ప మరోటి లేదనడంలో సందేహం లేదు.  కొత్తగా పెట్టుబడులు రాకపోవడం ఒకటైతే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ( కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం అయిదేళ్ళలో రూ. 6 లక్షల కోట్లకు పైబడిన పెట్టుబడులు వచ్చాయి) అంతకు ముందు  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు అనేక మంది జగన్ రెడ్డి అరాచక పాలన భరించలేక రాష్ట్రం వదిలి పోయారు.    రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర  చంద్రబాబు నాయుడు హయాంలో  ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురానికి వచ్చింది, చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి. విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే జగన్ రెడ్డి పాలనలో  సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.దీంతో లూలు గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటు  ఇప్పుడున్న పరిస్థితిలో ( అనగా జగన్ రెడ్డి అధికారంలో ఉండగా ..)  ఇక మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని తేల్చి చెప్పేసింది. అంత వరకు ఎందుకు, చిత్తూరు జిల్లాకు చెందిన  గల్లా వారి,  అమర రాజా కంపెనీ, జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను, తెలంగాణకు తరలించుకు పోయింది.. ఇలా చెప్పాలంటే చాల చాలా ఉన్నాయి. ఒక్క మాటలో ముగించాలంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు ..ఆ సాహాసం చేసే పెట్టుబడి దారులు లేరు.  ఉన్న  పెట్టుబడులు నిలిచే పరిస్థితీ లేదు. పెట్టుబడులు రానిదే రాష్ట్రం ముందుకు సాగదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు ... అప్పులు మాత్రమే మిగులుతాయి. మరి రాష్ట్ర భవిష్యత్ ..? ఈ ప్రశ్నకు జవాబు ప్రజలే చెప్పవలసి ఉంటుంది . ఓటు వారి చేతిలో నే వుంది. సరే మళ్లీ గ్లోబల్ సమ్మిట్ దగ్గరకు వస్తే.. ఆ సమ్మిట్ లో పెట్టుబడులు పెడతామంటూ కోట్లూ, బూట్లూ వేసుకు వచ్చిన వారంతా నిజంగా పారిశ్రామిక వేత్తలేనా అన్న అనుమానాలు అప్పట్లోనే వచ్చాయి. భోజనాల దగ్గర వారు చేసిన గలాటా.. వారిలో కొందరిని ఐప్యాక్ సభ్యులుగా గుర్తించి అందుకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో గ్లోబల్ సమ్మిట్ ఓ ప్రహసనం అని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తయి. అయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రే గొప్పగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటించేసరికి కొందరు కాకపోతే కొందరైనా అందులో ఎంతో కొంత గ్రౌండ్ కాకపోతుందా అని ఆశించారు. అయితే  వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కూడా వాస్తవాలు మాట్లాడడని తేలిపోయింది. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ జరిగిన నాలుగు నెలల తరువాత అటువంటి సమ్మిట్ ఒకటి తన హయాంలో జరిగిందన్న సంగతిని జగన్ తో సహా ఆయన కేబినెట్ పూర్తిగా మరచిపోయింది. 

నయా సైబర్ నేరం.. యువతికి రూ.20లక్షలు టోకరా

సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్ గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా జనంలో మాత్రం అవగాహన పెరగడం లేదు. పైగా ఈ తరహా మోసాలలో బాధితులుగా ఉంటున్న వారిలో అత్యధికులు ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. అందులోనూ ఐటీ కొలువులలో ఉండే వారే  ఎక్కువగా సైబర్ మోసాలకు గురి అవుతున్నారు.  తాజాగా యువతి సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న ఒక యువతి ఈ తరహా మోసానికి గురై రమారమి 20 లక్షలు పోగొట్టుకుంది. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఆ యువతికి జులై 26న   ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. స్మిత పేరుతో పరిచయం చేసుకున్న  ఓ మహిళ ఆ ఫోన్ లో మీ పేరిట మలేసియాకు పంపిన పార్సిల్‌ ముంబయికి తిరిగొచ్చిందనీ, ఆ పార్శిల్ లో  డ్రగ్స్‌ ఉన్నాయని చెప్పింది.  దాంతో షాక్ తిన్న బాధితురాలు ఆ పార్సిల్‌తో తనకు సంబంధం లేదని చెప్పింది. అయితే ముంబై కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని గూగుల్‌ మీట్‌ ద్వారా లైన్లోకి  తీసుకు వచ్చింది. ముంబై కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ భయపెట్టిన ఆ వ్యక్తి ఆమె ఆధార్‌ కార్డు వివరాలు తీసుకున్నాడు. ఆధార్‌ ఐడీ తనిఖీ చేశామనీ,  హవాలా లావాదేవీల కేసు ఉన్నట్లు తెలిసిందని, బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తామంటూ బాధితురాలి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత సీబీఐ అధికారి పేరిట మరో వ్యక్తి వీడియోకాల్‌లో  లైన్లోకి వచ్చాడు. బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని.. మొత్తం మీ కుటుంబం సమస్యల్లో చిక్కుకుంటుందని ఆ యువతిని భయపెట్టాడు. ఈ కేసులో మూడేళ్లు జైలుశిక్ష పడుతుందని.. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు వినాలన్నాడు. అప్పటికే తీవ్రంగా భయాందోళనలకు గురైన బాధితురాలు అతను చెప్పిన విధంగా  ఓ బ్యాంకు యాప్‌ ద్వారా అప్పటి కప్పుడు రూ.19.94 లక్షల లోన్‌కు అప్లై చేసింది. ఆ సొమ్ము రాగానే  తాను చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనీ,  10 నిమిషాల తర్వాత హైదరాబాద్‌ సీబీఐ అధికారులు మీ ఇంటికొచ్చి డ్రగ్స్‌ పార్సిల్‌ పంపలేదని ఒప్పందం చేసుకుంటారని ఆ యువతిని నమ్మించారు. ఆ యువతి వారు చెప్పినట్లుగానే  రూ.19.94 లక్షలు  బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దాదాపు మూడు గంటలు ఫోన్లో మాట్లాడిన నిందితులు.. డబ్బు వాళ్ల అకౌంట్‌లో పడగానే  కాల్‌ కట్‌ చేశారు. ఎంత సేపు ఎదురుచూసినా.. సీబీఐ బృందం తన ఇంటికి రాకపోవటంతో యువతికి తాను మోసపోయానని అర్ధమైంది.  వెంటనే సైబరాబాద్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదువుకున్నవారు ఇలాంటి మోసాల బారినపడటం ఆందోళన కలిగిస్తోందని పోలీసులు అంటున్నారు. ఇలాంటి కాల్స్, మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.  

కేసీఆర్ రీతి, నీతి.. నిన్నటికి నేడు కొత్త.. నేటికి రేపు కొత్త

కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నిన్న రైట్ అన్నది రేపు రాంగ్ అవుతుంది.. ఇవ్వాల రాంగ్ అన్నది రేపు రైట్ అవుతుంది అని. అయితే తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం  ఎప్పుడు ఏది రైట్ అంటారో.. ఎప్పుడు ఏది రాంగ్  అంటారో ఆయనకైనా తెలుసా అన్న అనుమానం కలగక మానదు. ఒకే విషయంపై వేర్వేరు సందర్భాలలో ఆయన వేర్వేరు భాష్యాలు చెబుతారు. జనానికి ఏదీ గుర్తు ఉండదన్న విశ్వాసమో.. లేక ఆయనకే ఏం మాట్లాడానన్నది గుర్తుండదా అన్నది తెరాస శ్రేణులకే అర్ధం కాని విషయం. తెలంగాణ ఆవిర్భావానికి ముందు దళిత ముఖ్యమంత్రి అన్న ఆయనే.. తీరా తెలంగాణ ఆవిర్భవించి.. తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్) విజయం సాధించిన తరువాత మాట మార్చారు. కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే సమర్ధుడి నాయకత్వం అవసరమంటూ తానే సీఎం పగ్గాలు అందుకున్నారు. అలా అందుకున్న తరువాత గత తొమ్మిదేళ్లుగా ఆయనే అధికార పగ్గాలను చేతబట్టారు. దళిత ముఖ్యమంత్రి అని తన నోటి వెంటే వచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయారు. తన తరువాత రాష్ట్ర పగ్గాలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి అప్పగించడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు. ఇక ఆ తరువాత ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి అన్నది కూడా అలాగే  అయ్యింది. మచ్చుకు ఇవి రెండు మాత్రమే ప్రస్తావించినా.. ఆయన ఔనన్నది కాదని.. కాదన్నది ఔనన్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం. ఇది నిజంగా ఉభయ తెలుగు రాష్ట్రాలనూ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.   ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ నిన్న మొన్నటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది.  అయితే ఏపీలో జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత తెలంగాణలో కూడా అలాగే చేయాలన్న డిమాండ్ బలంగా తెరపైకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ దానిని కొట్టి పారేశారు. ఆంధ్రలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ చేసిన ప్రయోగం విఫలమౌతుందని అప్పట్లో జోస్యం చెప్పారు. బుర్రా బుద్ధీ ఉన్నవారెవరూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయరనీ, అది జరిగే పని కాదనీ తేల్చేశారు. ఆ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించి మరీ అది సరైనది కాదని చెప్పారు. తెలివితక్కువ నిర్ణయం అని తేల్చేశారు. అయితే ఇప్పుడు ఎవరూ అడగకుండానే స్వయంగా కేసీఆర్ ఆ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుని, తాను తీసుకున్న నిర్ణయం చాలా చాలా గొప్పదంటూ తన భుజాలను తానే చరుచుకుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమన్నది భూగోళం ఉన్నంత వరకూ జరిగేది కాదన్న నోటితోనే ఆయన విలీన ప్రకటన చేశారు. విధివిధానాల ఖరారుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేబినెట్ లో ఆర్టీసీ విలీనం నిర్ణయం తరువాత నాడు ఏపీలో ఆర్టీసీ విలీనం తరువాత కేసీఆర్ మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలివితక్కువ నిర్ణయాలను అడాప్ట్ చేసుకోవడంలో కేసీఆర్ అంతటివాడు లేడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదన్న విశ్లేషణల నేపథ్యంలో కేసీఆర్ వీఆర్ఏలకు, ఆర్టీసీ కార్మికులకు వరాలు కురిపించడం చాణక్యమేనని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలి ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ అని వాగ్దానం చేసిన ఆయన ఇన్నేళ్లుగా మొండి చేయి చూపుతూనే వస్తున్నారు.  మాట ఇవ్వడం.. మాట తప్పడం, హామీలను గాలికి వదిలేయడం కేసీఆర్ కు కొత్తేమీ కాదని అంటున్నారు. ఎన్నికలు ముంచుకువస్తున్నాయి కనుక విలీనం అంటూ చేసిన ప్రకటన ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందన్న భావనతోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారనీ, అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల బకాయిలు, ఇతర ఆర్థిక అంశాల గురించి కేబినెట్ లో కనీస ప్రస్తావన కూడా చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్పటికెయ్యది ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. అన్న సుమతీ శతకంలోని శ్లోకాన్ని కేసీఆర్ తు.చ. తప్పకుండా పాటిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

పని మొదలెట్టేసిన కొత్త పార్టీ!

కొత్త పార్టీ అప్పుడే పని ప్రారంభించేసింది. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఏపీలో జగన్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై కేంద్ర హోంమంత్రి  అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  పాల్పడిన 35 వేల కోట్ల రూపాయల అవినీతిపై అమిత్ షాకు ఆధారాలను అందజేశారు.  ఆయన ఫిర్యాదు మేరకు పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులున్నాయి. 17 మంది డైరెక్టర్ల ద్వారా సూట్కేసు కంపెనీలు సృష్టించి అవినీతిని దాచే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ముందు పెద్దిరెడ్డికి ఉన్న ఆస్తుల వివరాలను దాచిపెట్టారని రామచంద్రయాదవ్ హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.    పెద్ది రెడ్డి అక్రమాలు, అవినీతిపై ఈడీ  దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.  అలాగే ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మోసం చేశారని, దానిపై న్యాయపోరాటానికి సమాయత్తమౌతున్నానని అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో రామచంద్రయాదవ్ చెప్పారు. అలాగే పెద్దరెడ్డి తప్పుడు అఫిడవిట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.  కాగా తన భారత చైతన్య యువజన పార్టీ వెనుక బీజేపీ ఉన్నదంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని, బీజేపీ కోసం పని చేసేవాడినైతే తానే బీజేపీలో చేరేవాడిని కదా అని కూడా అన్నారు. జగన్ అక్రమాలను ఎదుర్కొనే విషయంలో ఏపీలో ఇప్పుడున్న పార్టీల వల్ల ఉపయోగం లేదన్న నిర్ణయానికి వచ్చిన మీదటే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మొత్తంగా మంగళవారం ( ఆగస్టు 2)న రామచంద్రయాదవ్ అమిత్ షాతో దాదాపు 20 నిముషాలు భేటీ అయ్యారు.  పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలు హోమంత్రికి అందజేసిన ఆయనఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు.  2019 నుంచి ఇప్పటి వరకూ జగన్ సర్కార్ చేస్తున్నది కేవలం రాష్ట్ర సంపద లూటీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న  విపక్షాల నాయకులపై కేసులు బనాయించడం వేధించడమ మాత్రమేనని రామచంద్రయాదవ్ అన్నారు.  పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఇసుకాసురులనీ, ఒక్క ఇసుక అనేమిటి, అన్ని రంగాలలోనూ దోపిడీకి పాల్పడుతున్నారని రామచంద్రయాదవ్ ఆరోపించారు.  అవినీతి సొమ్ముతో వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అంతే కాకుండా పీఎల్‌ఆర్ కంపెనీకి ప్రభుత్వం నుంచి అక్రమంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులున్నాయని రామచంద్రయాదవ్ ఆరోపించారు.  జగన్ సర్కార్ కేబినెట్ లో ఒక్క మంత్రిపైనే  రూ.35 వేల కోట్లు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయంటూ.. మొత్తం కేబినెట్ లో మిగిలిన మంత్రుల అవినీతి లెక్క ఎంత ఉంటుందో  ఊహాతీతమేమీ కాదని పరిశీలకులు ఒక్కో మంత్రిపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ విశ్లేషిస్తున్నారు.  సీఎం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర సంపదని లూటీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో  అవినీతి సర్కార్ పై రాజీలేని పోరాటం చేయడానికే కొత్త పార్టీని ఏర్పాటు చేశామన్న రామచంద్రయాదవ్ రానున్న రోజులలో తమ పోరాట కార్యచరణ ప్రారంభించనున్నామని అన్నారు.   

లోకేష్ ప్రకాశం

ప్రాంతమేదైనా.. ఊరు ఏదైనా.. మండుటెండ వచ్చినా, జోరు వాన వచ్చినా.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టి పాదయాత్ర  సుడిగాలిలా ముందుకు దూసుకుపోతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 17 రోజుల పాటు.. 220 కిలోమీటర్ల మేర అన్ని నియోజకవర్గాల మీదగా సాగిన యువనేత పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లోకేశ్ సభ పెట్టినా ప్రజలు పోటెత్తుతున్నారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే అద్దంకిలో లోకేశ్ సభ అదిరిపోయింది. ఇక దర్శిలో లోకేశ్ సభ దద్దరిల్లిపోయింది.  అటు కందుకూరులో సభ అయినా.. ఇటు గిద్దలూరులో సభ అయినా.. జిల్లాలో ఎక్కడ.. ఎప్పుడు సభ పెట్టినా జనం మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.    అలాగే అధికార పార్టీ అధ్యక్షుడు  సీఎం వైయస్ జగన్‌పై లోకేశ్ విసురుతోన్న పంచ్‌లకు, ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల చిట్టాపై నారా లోకేశ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే.. ప్రజల నుంచి వస్తున్న స్పందన..  తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక వివిధ నియోజకవర్గాల్లో ప్రజలకు లోకేశ్ ఇస్తున్న హామీలతో  ప్రజల్లో తెలుగుదేశం నాయకత్వంపై నమ్మకం రెట్టింపు అవుతోంది.  అలాగే  తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. రైతులకు నాణ్యమైన విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, ఉచిత కరెంట్, వ్యవసాయ రుణాలు, అదే విధంగా యువతకు విద్యా, ఉపాధి, ఉద్యోగ కల్పన.. తదితర అంశాలపై నేను ఉన్నాను నేను విన్నాను అన్నట్లుగా  ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో   జగన్ ఉకదంపుడు హామీలు ఇచ్చినట్లుగా కాకుండా.. తాము అధికారంలోకి వస్తే.. తూచ తప్పకుండా అమలు చేసే స్పష్టమైన హామీలను ప్రకటిస్తూ.. నారా లోకేశ్  ముందుకు సాగుతున్నారు.   ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోని.. ఆయన అడుగులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు సీమలోకి దూసుకెళ్తున్నాయి. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన ఈ పాదయాత్ర ద్వారా  నారా లోకేశ్  వైయస్ జగన్ మోహనుడి అధికార మదం పీచమణచడానికి.. నవ్యంధ్రలో అమరావతి రాజధానిగా చేసుకొని  తెలుగుదుశం ప్రజా రంజక పాలన చేపట్టడానికి రాచబాట వేస్తున్నారని పార్టీ శ్రేణులు సంతోషంగా చెబుతున్నాయి. 2023, జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో  లేకేష్ చేపట్టిన యువగళం   పాదయాత్ర  నిర్విఘ్నంగా దిగ్విజయంగా కొన... సాగుతోంది. ఈ పాదయాత్రలో తొలుత లోకేశ్‌కు అటు పోలీసులు, ఇటు అధికార   పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించినా.. వాటిని ఆయన అధిగమించి.. తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. అలా ఆయన చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన..సాగి ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాటీ సీమలోని వినుకొండ నియోజకవర్గంలోకి  పాదయాత్ర ప్రవేశించి.. ముందుకు సాగుతోంది.

ఎన్నికల బరిలో నితిన్ వర్సెస్ దిల్ రాజు

రానున్న సార్వత్రిక ఎన్నికలు చాలా రసవత్తరంగా జరగనున్నాయనే ఓ చర్చ అయితే అటు పోలిటికల్ సర్కిల్‌లో ఇటు టాలీవుడ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల బరిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ హీరో నితిన్ ఒకరిపై ఒకరు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయనే ఓ చర్చ సైతం ఊపందుకొంది.  నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర పంపిణి విషయంలో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి, నిర్మాత దిల్ రాజు మధ్య వివాదం నెలకొనడంతో వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు ఓ చర్చ అయితే టాలీవుడ్‌ వర్గాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు సై అంటే సై అనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  అదీకాక దిల్ రాజు, హీరో నితిన్ ఇద్దరిది నిజామాబాద్ జిల్లానే కావడం గమనార్హం. ఇక హీరో నితిన్ మేనమామ, పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు తన వంతుగా సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి నితిన్‌ని బరిలోకి దిగేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారనే చర్చ కొనసాగుతోంది. అయితే సదరు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాష్కి పోటీ చేయని పక్షంలో నితిన్‌ను హస్తం పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా అధిష్టానం చేత ఖరారు చేయించే పనిలో నగేష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.  ఇంకోపైపు హీరో నితిన్.. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడంతో.. ఆయన రాజకీయ ఎంట్రీపై ఓ రేంజ్‌లో పుకార్లు సైతం షికారు చేస్తున్నాయి. కానీ నితిన్‌ను మాత్రం కాంగ్రెస్ నుంచే బరిలో దింపేందుకు నగేష్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది.  ఇక నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దిల్ రాజు బరిలో నిలిపే అవకాశం ఉందనే చర్చ సైతం సాగుతోంది. 2019 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కవిత.. బీజేపీ అభ్యర్థి దర్మపూరి అర్వింద్ చేతిలో ఓటమి పాలైయ్యారు. కానీ రానున్న ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ క్రమంలో నిజామాబాద్ ఎంపీగా దిల్ రాజు బరిలో దిగనున్నారనే ప్రచారం సైతం వాడి వేడిగా కొన..సాగుతోంది.  ఇంకోవైపు తాను రాజకీయాల్లోకి వెళ్లితే ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో ఎక్కడి నుంచి అయినా గెలుస్తానంటూ దిల్ రాజ్ వ్యాఖ్యానించారు. ఆ కొద్దిరోజులకే ఆయన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి దిల్ రాజు, నితిన్‌లు ఎన్నికల బరిలోకి దిగితే.. ఎవరు గెలుస్తారనేది మాత్రం సస్పెన్సే. ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అలాంటి వేళ..  ఓ వేళ వీరిద్దరి.. ఎన్నికల బరిలో నిలిస్తే.. ఎవరు గెలుస్తారంటే మాత్రం ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే అనే చర్చ సైతం పోలిటికల్, టాలీవుడ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

ఎన్నికల ముందు బిఆర్ఎస్ వరాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు  వరాలను ప్రకటిస్తున్నారు. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ వర్గానికి దగ్గరైంది.  ప్రజల్లో తమ ప్రభుత్వంపై సానుకూల వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకుంటుంది బిఆర్ఎస్ ప్రభుత్వం. కాగా.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. ఆర్టీసీ సిబ్బంది దీర్ఘకాలికంగా చేస్తున్న పలు డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. 69,100 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ను 300 కి.మీల మేర విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.బీసీ కుల వృత్తులు చేసే వారికి  లక్ష  రూపాయల రుణం ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.వరంగల్ జిల్లాలోని మామ్‌నూర్‌ విమానాశ్రయాన్ని టెర్మినల్‌ భవనం, ప్రస్తుత రన్‌వే పొడిగింపు కోసం 253 ఎకరాల అదనపు భూమిని సేకరించి అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ ఏడాది జూన్‌లో విమానాశ్రయ విస్తరణ కోసం అదనపు భూమిని సేకరించేందుకు సర్వే పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం.  ఆర్టీసీ విలీనం, హైదరాబాద్ మెట్రో, వరంగల్ ఎయిర్ పోర్టు అంటూ చేసిన ప్రకటనలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చాయి. వీటిపై విస్తృత చర్చ జరుగుతుంది.. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను మర్చిపోయే  స్థాయికి వచ్చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రకటనలతో హ్యట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే కేసీఆర్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో మరో రకంగా ప్రచారం జరుగుతుంది. ఆర్టీసీ విలీనంపై గతంలో కేసీఆర్ అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఈ భూమండలం ఉన్నంత వరకూ ఆర్టీసీ విలీనం జరగదని గతంలో తేల్చి చెప్పారు. 50కిపైగా కార్పొరేషన్లు ఉన్నాయని వాటన్నింటినీ ప్రభుత్వంలో కలపమని డిమాండ్లు వస్తాయన్నారు. అందుకే అప్పట్లో సాధ్యం కాదని తేల్చారు. కెసీఆర్ ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఎవరూ అడగకపోయినా ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన ప్రకటనలను సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి.  ఎన్నికల స్టంట్ అని పలువురు అనుకుంటున్నారు. నాలుగు వందల కిలోమీటర్ల మెట్రోను మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి చేస్తామనడం పూర్తి జిమ్మిక్కేనని నమ్ముతున్నారు. అందుకే.. కేబినెట్ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి.  కేబినెట్ నిర్ణయాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చూడాలని… పార్టీ నేతల్ని కెటీఆర్ ఇప్పటికే ఆదేశించారు. కానీ ఆ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్తున్నా  కానీ నెగెటివ్ కోణంలో ప్రచారం జరుగుతోంది. 

పులస తినే భాగ్యం ఇక ఉండదా?.. కాలుష్యం కాటుకు పులస మాయం

వింటే భారతం వినాలి... తింటే గారెలు తినాలి అన్నది సామెత.. కానీ మాంసాహార ప్రియులు మాత్రం మరీ ముఖ్యంగా సీఫుడ్ ను ఇష్టపడేవారు మాత్రం పులస చేప తినాలి అని అంటారు. సీజనల్ గా మాత్రమే.. అదీ గోదావరి వరదల సమయంలో మాత్రమే లభించే పులస చేపకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. ఒక్కో సారి ఆ చేప వేల రూపాయలు దాటి లక్షల్లో కూడా పలుకుతూ ఉంటుంది. ఇది కేవలం జూలై, ఆగస్టు నెలలలో  మాత్రమే లభిస్తుంది. పుస్తెలమ్మైనా సరే ఒక సారైనా పులస చేప పులుసు తినాలి అన్న నానుడి గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వినిపిస్తుంటుంది. కేవలం గోదావరి వరదల సమయంలో మాత్రమే లభించే ఈ పులస చేప అంటే మాంసాహార ప్రియులలో ఉండే క్రేజే వేరు. రుచి, డిమాండ్ సంగతిని పక్కకు పెడితే.. ఎదురీది మరీ గోదావరిలోకి ప్రవేశించే ఏకైక చేప పులస. సముద్రం గోదావరి కలిసే సంగమం వద్ద గోదావరికి వరద సమయంలో సముద్రంలో నుంచి ఏటికి ఎదురీది ఉప్పునీటి నుంచి మంచినీటిలోకి ప్రవేశించే ఈ పులస చేపలు గోదవరి వరద తగ్గిన తరువాత మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది.  అయితే ఇటీవలి కాలంలో పులస చేప లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే పులస కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు, మాంసాహార ప్రియులూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వచ్చే వరదల్లో ఎదురీది మరీ గోదవరిలోకి ప్రవేశించే  విలస చేప పులస చేపగా మారి రుచికరమైన ఆహారంగా మారుతుంది. ఏటా వరదలు వస్తున్నా పులస చేప లభ్యత ఎందుకు తగ్గిపోతోందీ అంటే పర్యావరణ వేత్తలు కాలుష్యమే కారణమని అంటున్నారు.   మరీ ముఖ్యంగా సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటలు వేయడం...గోదావరి బేసిన్ లో చమురు, సహజవాయువుల కోసం అన్వేషణలు కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే గోదావరిలోకి యథేచ్ఛగా పరిశ్రమల వ్యర్థాలను వదిలివేయడం వల్ల గోదావరి జలాలు కలుషితం కావడం కూడా విలసలు సంతానోత్పత్తి కోసం గోదావరికి ఎదురీది రావడం తగ్గిపోతోందని చెబుతున్నారు. గోదావరి జలాలు కలుషితం అవ్వడం వల్ల ఇప్పటికే రకాల చేపలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు పులస చేప కూడా వేగంగా ఆ కోవలోకే చేరిపోతున్నదని  అంటున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా చేపడుతున్న రొయ్యల సాగు కూడా పులస చేపలు అంతరించిపోవడానికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. రొయ్యల సాగు కోసం వాడే మేత, యాంటీబయటిక్ వ్యర్థాలను గొదావరిలోకి మళ్లించడం వల్ల పులసలు అంతరించిపో తున్నాయనీ, వాటి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నదనీ నిపుణులు చెబుతున్నారు.  

తెలుగుదేశం... జనసేన మధ్యలో బీజేపీ.. పొత్తులు పొడిచేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, పొత్తులు, ఎత్తుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా పొత్తు వ్యవహారాలన్నీ బీజేపీ సెంట్రిక్ గానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సర్వ వ్యవస్థలనూ గుప్పెట్లో పెట్టుకుని ఒక విధంగా పోలీసు పాలనను సాగిస్తున్నదని రాజకీయ వర్గాలలోనే కాదు జనబాహుల్యంలో కూడా గట్టిగా వినిపిస్తున్నది. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా తెలుగుదేశం జగన్ సర్కార్ విధానాలు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది.   2024 ఎన్నికలలో  వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. పార్టీని, పార్టీ శ్రేణులను నిరంతరం చైతన్యవంతం చేస్తూ  జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. మరో వైపు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ యువగళం పాదయాత్ర పేరిట జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, నేతల అరాచకత్వాలను ప్రజలలో ఎండగడుతూ యువగళం పేర పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జగన్ సర్కార్ ను గద్దెదింపడమే లక్ష్యంగా పోరుబాటలో సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను మరోసారి అధికారంలోకి రానివ్వనని, అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ రాష్ట్రంలో పొత్తు పొడుపులపై చర్చకు తెరతీశారు. అది కూడా నిన్నో మొన్నో కాదు.. దాదాపు ఏడాదిన్నర కిందటే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననీ, జగన్ వ్యతిరేక శక్తులన్నిటినీ కలుపుకు పోతానని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. అంతే కాదు ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాలనుకోవడం లేదని కూడా క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో తెలుగుదేశం, జనసేనలు పొత్తుతోనే ఎన్నికలకు వెడతాయన్నది విస్పష్టంగా తేలిపోయింది. అయితే రాష్ట్రంలో ఇసుమంతైనా ఓటు బ్యాంకు లేకపోయినా.. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి నడిస్తే మంచిదని, జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ సహకారం అవసరమని జనసేనాని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీల మధ్య అధికారికంగా మైత్రి ఉంది. తెలుగుదేశం కూడా బీజేపీతో ఘర్షణాత్మక వైఖరిని కోరుకోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలో జగన్ హింసాత్మక వైఖరి, ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల నమోదు వంటి విషయాలలో కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా నిలబడి, నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అండ అవసరమన్న భావనతోనే తెలుగుదేశం బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జ ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలరాదు అని పదేపదే చెబుతున్న పవన్ కల్యాణ్ ఇటీవల  ఢిల్లీ పర్యటనలో వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ కలిసివస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో రాజకీయ వాతావరణం చూస్తుంటే ఒకే సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసే ఎన్నికల బరిలోకి దిగుతాయన్న భావన, బీజేపీ జగన్ సర్కార్ కు అండగా నిలుస్తూ పొత్తు పొడుపునకు అవరోధాలు కలిగిస్తోందన్న భావనా కలుగుతున్నాయి.   

జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.129.03 కోట్లు

తిరుమల శ్రీవారిని జులై నెలలో 23.23లక్షల మంది దర్శించుకున్నారు. ఆ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 129.03 కోట్ల రూపాయలు వచ్చింది. జూలైలో అత్యధికంగా 9వ తేదీన 88 వేల 836 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 17వ తేదీన శ్రీవారి హుండీ ఆదాయం అత్యధికంగా 5.40 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక నెల చివరి రోజు 31వ తేదీన శ్రీవారి హుండీ ఆదాయం 5.21 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక  సోమవారం అంటే ఆగస్టు 1న శ్రీవారిని 67 వేల 728 మంది దర్శించుకున్నారు. 21, 084 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చింది. మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.   

ఈ మరాఠా యోధుడిని శ్లాఘించిన కెసీఆర్ 

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అన్నాభావ్ సాథే పేరు కొత్తగా పరిచయమైంది. ఎందుకంటే తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మహారాష్ట్ర పర్యటనలో ఆయనను కీర్తిస్తూ మాట్లాడారు. భారత రత్న అవార్డు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అన్నాభావ్ సాథే మరాఠా ప్రజలకు సుపరిచితుడు. సామాజిక కార్యకర్త. జానపద కళాకారుడు, కవి, రచయిత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలకు  సేవ చేసిన యోధుడు. పైగా దళితుడు. పీడిత, తాడిత ప్రజానీకం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. మరాఠాలకు ఒక రకంగా దేవుడు లాంటి మనిషి. అంటరాని కులంలో పుట్టినప్పటికీ దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు.  సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక వహించారు.  మహరాష్ట్ర సాంగ్లీ జిల్లా వతేగావ్ లో పుట్టిన అన్నాభావ్ సాథే ఎస్ సిలోని మాతంగ్ తెగకు చెందిన వ్యక్తి. అన్నాబావ్ సాథే పెద్దగా చదువుకోలేదు. నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్థి పలికారు కానీ సమాజాన్ని బాగా చదివారు.  సాథే ఇప్పటి వరకు 35 నవలలు రచించారు. ఇందులో ఫకీరా(1959) చాలా ప్రాచుర్యం పొందింది. ఈ నవలకు మహ ప్రభుత్వం అవార్డును కూడా ప్రకటించింది. నవలలతో బాటు షార్ట్ స్టోరీలు రాశారు. రష్యాలో కూడా ఆయన అనేక నాటక ప్రదర్శనలు చేశారు. అన్నా భావ్ సాథే కమ్యూనిస్ట్ సిద్దాంతాలకు ప్రభావితులయ్యారు. భారత రాజ్యాంగనిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్  స్పూర్తితో సాథే దళిత ఉద్యమాల్లో పాల్గొన్నారు. సాథే బుద్దిజం కు కూడా ప్రభావితం చెందారు. ఆయన పేరు మీద 2002లో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది. 

కోడి.. కత్తి..జగన్

కోడికత్తి  కేసులో కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనీ.. ఇదంతా సమయం వృధా వ్యవహారమనీ ఎన్ఐఏ కుండ బద్దలు కొట్టేసింది. అయినా ఆ కేసును ఇప్పుడు విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదలీ అయ్యింది. కేసులో వాదనలు 80 శాతం పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీను గత ఐదేళ్లుగా బెయిలు కూడా దొరకకుండా జైళ్లో మగ్గుతున్నాడు.  అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించక తప్పదు.. మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఒంటిపై గాయాలకు కుట్లు వేసి బ్యాండేజీలు కట్టి హత్య కాదు గుండెపోటు అని నమ్మించడానికి విఫలయత్నం చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ గత నాలుగేళ్లుగా కనీసం అరెస్టు కాకుండా హాయిగా తిరుగుతున్నారు. అరెస్టు చేస్తాం అని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పింది. అయినా ఆయనకు ముందస్తు బెయిలు వచ్చింది. హత్యకు గురైన మాజీ మంత్రి, మాజీ ఎంపీ స్వయానా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాబాయ్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ.. జగన్ కు సోదరుడు.    బెయిలు కోసం ఎన్ని సార్లు కోర్టును వేడుకున్నా,   బెయిల్  దక్కదు.  ఎందుకంటే ఎన్ఐఏ కేసు. ఉగ్రవాదుల కుట్రలను దర్యాప్తు చేసే జాతీయ దర్యాప్తు సంస్థ కోడి కత్తి కేసు విచారణ చేస్తున్నది.  కోడి కత్తితో దాడికి గురైన వ్యక్తి అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం. దీంతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. కేసు పూర్తయితే నాడి దాడి గుట్టు రట్టౌతుందన్న భయమే ఇందుకు కారణమంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  కానీ అప్పట్లో అంటే కోడికత్తితో జగన్ పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడి వెనుక అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం కుట్ర ఉందంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న సాకుతో ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్నారు.  అయితే అప్పట్లో కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేసిన అప్పటి విపక్ష నేత మాత్రం ఆ తరువాత జరిగిన ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయినా.. తనపై కుట్ర పూరితంగా జరిగిన హత్యాయత్నం కేసు త్వరిత గతిన విచారించి కుట్రదారులకు శిక్ష పడాలని కోరుకోవడం లేదు.  కేసు దర్యాప్తు సజావుగా సాగి తీర్పు వెలువడితే.. రాజకీయంగా ఇబ్బందులు ఎదురౌతాయన్న జంకుతో  దర్యాప్తునకు సహకరించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడిన జనుపల్లి శ్రీని తెలుగుదేశం సానుభూతి పరుడు కాదని ఎన్ఐఏ తేల్చేసింది. పైపెచ్చు నిందితుడే స్వయంగా తాను వైసీపీ సానుభూతి పరుడిననీ, స్వల్పంగా గాయపడేలా దాడి చేస్తే సానుభూతి పవనాలు వీచి జగన్ పార్టీ విజయం సాధిస్తుందన్న ఉద్దేశంతోనే కోడి కత్తితో దాడి చేశాననీ దర్యాప్తులో విస్పష్టంగా చెప్పడం జరిగింది. సరే అదంతా పక్కన పెడితే బాధితుడిగా సీఎం జగన్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు విస్పష్టంగా ఆదేశించింది. ఆయన కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే తప్ప నిందితుడికి బెయిలు వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇంత క్రిస్టల్ క్లియర్ గా వివరాలు ఉన్నా ఎన్ఐఏ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందనీ, కోడి కత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ ఎన్ఐఏ కోర్టును కోరారు. ఒక వైపు ఈ కేసులో కుట్ర కోణం లేదనీ లోతైన దర్యాప్తు అవసరం లేదనీ ఎన్ఐఏ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేసు విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదలీ అయ్యింది. దీనిపై జనుపల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో వాదనలు దాదాపుగా పూర్తి అయిన సమయంలో కేసు వేరే ప్రాంతానికి బదిలీ చేయడం సరికాదని అన్నారు. అయితే ఈ కేసు విషయంలో న్యాయం తన క్లయింట్ వైపే ఉందనీ ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామనీ స్పష్టం చేశారు. అయినా ఈ కేసు కొలిక్కి రావాలంటే జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనన్నారు. ఇక విపక్షాలు మాత్రం కోడి కత్తి కేసులో కుట్రకోణం కాదు అసలా కేసే ఒక కుట్ర అంటూ ఆరోపణలు చేస్తున్నాయి.  వాస్తవానికి నాడు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై ఎలాంటి దాడీ జరగలేదనీ, కేవలం సానుభూతి కోసం ఆడిన నాటకం మాత్రమేనని అంటున్నాయి.   

సమయం లేదు మిత్రమా.. అటో ఇటో తేల్చుకో.. పవన్ కు ముంచుకొస్తున్న డెడ్ లైన్

బీజేపీ హై కమాండ్ కు మిత్ర పక్షాలంటే ఇసుమంతైనా లక్ష్యం లేదని, ఉండదని మరో సారి తేటతెల్లం అయ్యింది. గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు అడుగడుగునా ఎదురైనవి అవమానాలే అనడంలో సందేహం లేదు. తనను బీజేపీ రాష్ట్ర శాఖ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనీ, అయినా తాను ఖాతరు చేయననీ, తనకు పార్టీ హై కమాండ్ తో సత్సంబంధాలున్నాయని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్న కాలంలో  పరిస్థితి అలాగే ఉండేది. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా ఏపీ బీజేపీ జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తుతున్న చందంగా వ్యవహరించింది. ఆ కారణంతోనే సోము వీర్రాజును పదవి నుంచి బీజేపీ అధిష్ఠానం తొలగించిందని..  ఆయనను వ్యతిరేకించిన బీజేపీ రాష్ట్ర నాయకులు భావించారు.  సోము వీర్రాజు స్థానంలో పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టిన పురంధేశ్వరి కూడా సోము వీర్రాజు విధానాలను గట్టిగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో అరాచకపాలనపై బీజేపీ కూడా సమరశంఖం పూరించేందుకు సిద్ధమైందని అంతా భావించారు. ఇటీవల హస్తినలో బీజేపీ మిత్రపక్షాలు.. అంటే ఎన్డీయే బాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. ఆయన హాజరయ్యారు కూడా. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి నడ్డాలతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం హస్తినలో విలేకరులతో మాట్లాడిన ఆయన అధికార వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి ప్రయాణిస్తానని స్పష్టం చేయడమే కాకుండా.. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయననీ, తెలుగుదేశం పార్టీతో కూడా కలుస్తామనీ చెప్పారు. పవన్ కల్యాణ్ తొలి నుంచీ కూడా  ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనీయనని చెబుతూనే  ఉన్నారు. రాష్ట్రంలో పొత్తు పొడుపుల ఊసు ఎత్తింది కూడా తొలుత పవన్ కల్యాణే. వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలవనీయననీ, అందు కోసం తన వంతు కృషి చేస్తాననీ చెబుతూ వస్తున్నారు. బీజేపీతో జనసేన మైత్రి కొనసాగుతోంది. ఈ రెండు పార్టీలూ కూడా  ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి పని చేస్తాయని పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఇటీవలి ఆయన హస్తిన పర్యటనలో కూడా బీజేపీ అగ్రనేతలతో భేటీ తరువాత కూడా అదే మాట చెప్పారు. బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు విషయంలో చిన్న గ్యాప్ ఉందనీ, దానిని తాను పూడ్చి కలిసే ఎన్నికల బరిలోకి దిగుతామని సూచన ప్రాయంగానైనా చెప్పారు. అంతకు ముందు చంద్రబాబు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హస్తినలో భేటీ అయ్యారు. మధ్యలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి కలిశారు. అప్పుడు కూడా వీరి మధ్య రాష్ట్ర రాజకీయాలపైనే చర్చ జరిగింది. పొత్తుల విషయంగానే ఆ చర్చ జరిగిందని అంతా భావించారు. పరిశీలకుల విశ్లేషణలు కూడా ఆ దిశగానే సాగాయి. సరే అదంతా పక్కన పెడితే.. ఇప్పుడు బీజేపీ తన ముసుగు తీసేసింది. ఏపీలో తన మొగ్గు ఎవరివైపో పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలు కొట్టేసింది. ఏపీతో తన మిత్రపక్షమైన జనసేన ఏపీ సర్కార్  ఆర్థిక అవకతవకలపై, అడ్డగోలు అప్పులపై ఇంత కాలం చేస్తున్న విమర్శలన్నీ అబద్ధాలంటూ పార్లమెంటు సాక్షిగా నిర్మలాసీతారామన్ చెప్పడంతో పవన్ కల్యాణ్ గాలి తీసేసినట్లైంది.   ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు మేలు చేకూరేలా పార్లమెంటు సాక్షిగా అర్ధ సత్యాలు చెబుతూ మిత్రపక్షాన్నే కాకుండా, సొంత పార్టీ ఏపీ అధ్యక్షురాలిని కూడా తలదించుకునేలా చేయడానికి బీజేపీ హై కమాండ్, కేంద్రంలోని మోడీ సర్కార్ వెనుకాడలేదంటే.. వారి మద్దతు, ప్రోత్సాహం ఎవరికి ఉన్నాయో తేటతెల్లమైపోయింది. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్  చెబుతున్నట్లుగా ఏపీలో జగన్ సర్కార్ గద్దె దించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అంటూ బీజేపీ వైపు చూడటంలో అర్ధం లేదన్న సంగతి అవగతమైపోయింది. ఇక ఇప్పుడు బంతి పవన్ కల్యాణ్ కోర్టులో ఉంది. నిర్ణయించుకోవలసినది ఆయనే. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అన్నమాటకు కట్టుబడి ఉంటారా? కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీతో కలసే ప్రయాణం అంటారా? నిర్ణయించుకోవలసింది ఆయనే.   ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే.. పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు మార్లు చెప్పిన చందంగా జనసేన, తెలుగుదేశం కలిసి పని చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఓట్ స్టేక్ ఒక శాతం కంటే తక్కువ. అటువంటి పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుందంటే ఎవరూ విశ్వసించరు. జగన్ సర్కార్ పై తీవ్ర మైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతుందని పవన్ కల్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడమంటూ జరిగితే అది ప్రధాన విపక్షం తెలుగుదేశం, జనసేనల మధ్యే చీలుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీవైపు మళ్లే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఇప్పటికే విభజన హామీలను నెరవేర్చే విషయంలో బీజేపీ ఏపీ పట్ల  అత్యంత దారుణంగా వ్యవహరించిందనీ, మాట తప్పి మోసం చేసిందనీ జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో అన్ని వర్గాలనూ ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండదండగా నిలుస్తోందన్న ఆగ్రహమూ కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీని కలుపుకు పోవడమంటే జనసేన ప్రజలలో ఉన్న పలుకుబడిని పలుచన చేసుకోవడం వినా మరో ప్రయోజనం ఉండదన్నది విశ్లేషకుల అంచనా. అంటే బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికలకు వెడితే దాని వల్ల ప్రయోజనం సంగతి అటుంచి నష్టమే ఎక్కువ అని అంటున్నారు. 2019లో ఒంటరిగా పోటీ చేసిన  అందుకు తగ్గ ఫలితం అనుభవించింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఆ తరువాత జనసేన పార్టీ టికెట్ పై గెలిచిన ఒకే ఒక్కడు కూడా ఫ్యాన్ కిందకు చేరి పోయాడు.  ఇప్పుడు కూడా  మిత్రపక్షం కనుక అంటూ బీజేపీతో కలిసి నడిస్తే అదే ఫలితం పునరావృతమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాన విపక్షం తెలుగుదేశం ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజలలో ఉంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తున్నది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం జిల్లాల పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. అలాగే జనసేనాని కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ మాత్రం ఎప్పుడో ఒక సారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా.. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం మాత్రం జగన్ సర్కార్ ను అన్ని రకాలుగా అండదండగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో.. అందులోనూ జగన్ సర్కార్ అప్పుల విషయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటు వేదికగా ఇచ్చిన సమాధానం తరువాత ఏపీలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు అన్నది ఔటాఫ్ క్వశ్చన్ అని పరిశీలకులు చెబుతున్నారు.   వచ్చే ఎన్నికలకు బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలంటున్న పవన్ కల్యాణ్ కు బీజేపీ తన రూటేమిటో తేల్చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ముందు ఇప్పుడు మిగిలినవి మూడే ఆప్షన్లు. వాటిలో ఒకటి.. మిత్ర ధర్మమంటూ బీజేపీతోనే  ప్రయాణం చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటం. ఎందుకంటే పవన్ బీజేపీతో నే ప్రయాణిస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు  చీలకుండా తెలుగుదేశం ఖాతాలోనే పడుతుంది. లేదూ జనసేన పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగడం. దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. ఇక చివరి ఆప్షన్ ఏమిటంటే బీజేపీని వదిలేసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగడం దీని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటమే కాకుండా జనసేన కూడా బలోపేతం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. బంతి జనసేనాని కోర్టులోనే ఉంది. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో మరి?

జగన్ సర్కార్ అప్పులు.. పురంధేశ్వరి పరువు తీసేసిన బీజేపీ హై కమాండ్!

జగన్ సర్కార్ కు గొడుగుపట్టడమే తన రాజకీయమని కుండ బద్దలు కొట్టేసింది. జగన్ కు మేలు చేయడం కోసం రాష్ట్రంలో పార్టీ పతనం చేయడానికి కూడా వెనుకాడటం లేదు. వైసీపీతో అంటకాగుతున్నారంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించి పురంధేశ్వరికి ఆ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానం ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చింది. పురంధేశ్వరి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, అడ్డగోలు అప్పుల గురించి విమర్శలు గుప్పించారు. అధిష్ఠానానికి అందుకు సంబంధించిన నివేదికలు సమర్పించి ఫిర్యాదు సైతం చేశారు. స్వయంగా కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ ను కలిసి మరీ జగన్ సర్కార్ అడ్డగోలు ఆర్థిక అక్రమాల గురించి కూలంకషంగా వివరించారు. నిర్మలా సీతారామన్ తో భేటీ సంతృప్తి కరంగా సాగిందనీ, జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై చర్యలు తీసుకుంటామని నిర్మలాసీతారామన్ హామీ ఇచ్చారనీ పురంధేశ్వరి ట్వీట్ కూడా చేశారు. ఇది జరిగి ఒకటి రెండు రోజులు అయ్యిందో లేదో.. పార్లమెంటు సాక్షిగా విత్తమంత్రి ఏపీలో జగన్ సర్కార్ అప్పులన్నీ నిబంధనలకు లోబడే ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఔను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అడిగిన ప్రశ్నకు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సమాధానం ఏపీలో బీజేపీ పరువు తీసింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేసిన విమర్శలు, ఆరోపణలు పూర్తి అవాస్తవాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్పినట్లైంది. పార్టీ హై కమాండ్ కు తమ పార్టీ ఏపీ నేతల కన్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇమేజ్ ను కాపాడటమే ముఖ్యమన్న విషయాన్ని విత్త మంత్రి సమాధానం తేల్చేసింది.   ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడ్డగోలు అప్పులను పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ప్రజల ముందు ఉంచారు. అవే వివరాలను విత్త మంత్రికీ, పార్టీ పెద్దలకూ అందజేశారు. తీరా పార్లమెంట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం తరువాత పురంధేశ్వరి అవమానంతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పురంధేశ్వరి జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, అరాచకత్వం గురించి చెప్పిన వివరాలన్నీ శుద్ధ అబద్ధాలని విత్త మంత్రి పార్లమెంటు సాక్షిగా  చెప్పేసి సొంత పార్టీ అధ్యక్షురాలి నివేదికలను తప్పుడు నివేదికలేనని తేల్చేశారు.  ఏపీ అప్పుల విషయంలో జగన్ సర్కార్ చెబుతున్న లెక్కలే కరెక్టని చెప్పారు.   వాస్తవానికి నిర్మలా సీతారామన్ సొంత పార్టీ పరువును గంగలో కలుపుతూ చెప్పిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి.  టీడీపీ దిగిపోయే నాటికి అంటే 2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్లు ఉంటే..  ఈ ఏడాది నాటికి అవి రూ.4,42,442 కోట్లకు చేరాయని  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు సాక్షిగా చెప్పారు. అంటే వైసీపీ హయాంలో   అప్పులు రూ. 1 లక్షా 70వేల కోట్లు మాత్రమే అన్నారు.  అయితే ఈ లెక్క  రాష్ట్ర బడ్జెట్‌లోని గణాంకాల ఆధారంగా  రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదిక. జగన్ సర్కార్ ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాల గురించి మాత్రమే నిర్మలా సీతారామన్ చెప్పారు.  కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులను దాచేశారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల లెక్కలు జగన్ సర్కార్ చెప్పడం లేదంటూ  కాగ్ గత నాలుగేళ్లుగా మొత్తుకుంటూనే ఉంది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ సర్కార్  ఆర్థిక అరాచకత్వం, అడ్డగోలు అప్పులపై  తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిగా వైసీపీ నేతలు ఆమెపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అలాంటి సమయంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలికి అండగా నిలవాల్సిన బీజేపీ అధిష్ఠానం పురంధేశ్వరి పరువు తీసేసింది. పురంధేశ్వరి తెలుగుదేశం గళం వినిపిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలే వాస్తవమని తేల్చే సింది. తద్వారా వైసీపీకి  ఎనలేని ప్రయోజనం చేకూర్చింది. రాష్ట్రంలో ఇక బీజేపీ వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా నోరెత్తే అవకాశం లేకుండా చేసింది.  ఇది ఏపీ బీజేపీ నేతలకు తలవంపులే. ముఖ్యంగా పురంధేశ్వరికి తీరని అవమానమే.  గత నాలుగేళ్లుగా రహస్య మైత్రిని కొనసాగించిన బీజేపీ ఇప్పుడు ఆ ముసుగు తీసేశింది. రాష్ట్రంలో బలోపేతం కావడం తమ లక్ష్యం  కాదనీ, వైసీపీకి అన్ని విధాలుగా అండదండగా నిలవడమే ఏపీలో తన విధానమనీ విస్పష్టంగా చెప్పేసింది. ఇక తేల్చుకోవలసింది ఏపీ బీజేపీ నేతలే. అబద్ధాలకు వత్తాసు పలుకుతున్న అధిష్ఠానానికి అడుగులకు మడుగులొత్తడమా? తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలలా ధిక్కార స్వరం వినిపించడమా అన్నది ఏపీ బీజేపీ నేతలు నిర్ణయించుకోవాలి. 

చంద్రబాబుతో మనోజ్ ప్యామిలీ భేటీ..!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ ఆతడి భార్య మంచు మౌనికా సోమవారం సాయంత్రం భేటీ  అయ్యారనీ,   చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్ ప్యామిలీ  వచ్చారనీ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి.  మంచు మనోజ్ ఫ్యామిలీ.. సైకిల్ పార్టీలోకి చేరేందుకు సన్నాహాలు చేసుకొంటున్నదనీ,  ఆ క్రమంలో వీరు చంద్రబాబుతో భేటీ అయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది.  ఇటీవలే మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డిలు వివాహం చేసుకొన్న సంగతి  తెలిసిందే. ఆ క్రమంలో భూమా మౌనికా రెడ్డి రాజకీయ అరంగేట్రం గురించి మంచు మనోజ్ స్పందించారు. మౌనికా ఓకే అంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ  మనోజ్  క్లారిటీ గా చెప్పిన సంగతి తెలిసిందే.   మరోవైపు భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల కుమార్తెలు అఖిల ప్రియ, మోనికా రెడ్డి. భూమా అఖిల ప్రియ ఇప్పటికే టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఆమె మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ గెలుపులోనే కాదు.. నంద్యాల ఉప ఎన్నికల్లో   భూమా బ్రహ్మనందరెడ్డి విజయంలో  సైతం మౌనికా రెడ్డి అన్ని తానై వ్యవహరించిన విషయం తెలిసిందే.  ఇంకోవైపు.. 2019 ఎన్నికల ముందు మంచు మోహన్ బాబు వైసీపీలో చేరారు.  ఆ ఎన్నికలలో ఎన్నికల్లో  వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే..  మోహన్ బాబుకు మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఏమంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వలేదు.   అలాంటి వేళ.. గతేడాది మంచు మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మీ  హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  మోహన్ బాబు  తెలుగుదేశం గూటికి చేరనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారంగానే మిగిలిపోయింది తప్ప మోహన్ బాబు వైసీపీని వీడలేదు. తెలుగుదేశం పంచన చేరలేదు.      అదీకాక మోహన్ బాబు పెద్ద కుమారుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు భార్య విరోనికా రెడ్డి ఏపీ సీఎం  జగన్‌కు అత్యంత సమీప బంధువన్న విషయం అందరికీ తెలిసిందే. అదీకాక మౌనికతో వివాహంతో మంచు మనోజ్, మంచు విష్ణు ఫ్యామిలీల మధ్య విభేదాలు పొడసూపాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. మనోజ్, విష్ణులు ఘర్షణ పడ్డారనీ, ఇరువురి మధ్యా సత్సంబంధాలు లేవనీ కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  మంచు మనోజ్, తన భార్యతో కలిసి చంద్రబాబుతో ఎందుకు భేటీ అయ్యారు, అదీ కూడా ఎన్నికలకు కొద్ది నెలలు ముందుగా వీరి సమావేశం వెనుక ఉన్న అసలు సిసలు కారణాలు ఏమిటీ? అయినా.. ఇంత అర్జెంట్‌గా చంద్రబాబుతో  మనోజ్ దంపతుల భేటీకి కారణమేమిటన్న  చర్చ  రాజకీయ, సినీవర్గాల్లో జోరందుకుంది. ఓ వేళ మంచు మనోజ్ ఫ్యామిలీని తెలుగుదేశంలోకి చంద్రబాబు ఆహ్వానిస్తే.. మంచు మౌనిక పోటీ చేస్తారా?  మంచు మనోజ్ ఎన్నికల బరిలోకి దిగుతారా? ఓ వేళ మంచు మనోజ్ పోటీ చేస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి బరిలో దిగే అవకాశం ఉందని, అలాగే ఓ వేళ మౌనికా ఎన్నికల బరిలోకి దిగితే.. నంద్యాల నుంచి పోటీ చేస్తుందనే ఓ ప్రచారం సైతం జోరుగా సాగుతున్నది.   ఇక చంద్రబాబు నాయుడు రేపటి నుంచి అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ఏపీలోని పలు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నారు. అలాంటి వేళ.. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుతో మంచు ఫ్యామిలీ భేటీ అనంతరం వీరి భేటీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం నడుస్తోంది.