గజ్వేల్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న కెసీఆర్ 

ఉమ్మడి రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి అరుదైన రికార్డు ఉంది.  ఆ సంప్రదాయం తెలంగాణా రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత కూడా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం ఆవిర్బవించిన   తర్వాత నుంచే గజ్వేల్ నియోజకవర్గానికి పెద్ద సెంటిమెంటే ఉంది. అయితే గ‌జ్వేల్ చ‌రిత్ర పరిశీలిస్తే మాత్రం…సీఎం సీటుకు…గజ్వేల్‌లో గెలుపుకు మాత్రం పెద్ద లింక్ ఉంది అనే చెప్పాలి. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన కేసీఆర్ 2014,2018 ఎన్నికల్లో  ఇక్క‌డి నుంచి పోటీ చేశార‌ని అర్ధ‌మ‌వుతోంది. ఈ సెంటిమెంట్‌ను ఈ సారి కూడా ఆయ‌న ఫాలో అయ్యే అవ‌కాశం మాత్రం క‌నిపిస్తోంది. గ‌జ్వేల్‌లో గెలిచిన పార్టీయే అధికారంలోకి వ‌స్తుంది. ఇది ఈ నియోజ‌క‌వ‌ర్గం పుట్టినప్ప‌టి నుంచి ఉన్న సెంటిమెంట్‌. ఇప్ప‌టివ‌ర‌కూ అయితే ఈ సెంటిమెంట్ బ్రేక్ అయింది లేదు.   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత తొలి సారి గజ్వేల్ నియోజకవర్గం పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి పెండెం వాసుదేవు పోటీచేసి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగింది.1957లో జెబి ముత్యాలరావు గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  1972, 1978 ఎన్నిక‌లలో గ‌జ్వేల్ ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సీటు నుంచి కాంగ్రెస్   అభ్య‌ర్థి గ‌జ్వేల్ సైద‌య్య గెలిచారు.   అప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆత‌ర్వాత 1983లో టిడిపి అభ్యర్థి అల్లం సైదులు విజ‌యం సాధించారు. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.  1989లోఢాక్టర్  జె. గీతారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడంతో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది.  1994 ఎన్నికల్లో విజయరామారావ్,,1999 ఎన్నికల్లో బి. సంజీవరావు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందడంతో టీడీపీ అధికారంలో రాగలిగింది.  1989లో కాంగ్రెస్ తరపున డాక్టర్ జె. గీతారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేసింది. 1994 ఎన్నికల్లో జి. విజయరామారావు, 1999 ఎన్నికల్లో బి. సంజీవ రావు టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందడంతో మళ్లీ టీడీపీ అధికారంలో వచ్చింది. 2004లో డాక్టర్ జె. గీతారెడ్డి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 2009లో జి.నర్సారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలో వచ్చింది.  వచ్చే ఎన్నికలలో హ్యాట్రిక్ కొట్టడానికి కెసీఆర్ యత్నిస్తున్నారు. 2014,2018 ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్న  కెసీఆర్ మూడో సారి హ్యట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. 2014,2018లో కెసీఆర్ మీద వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.  కాంగ్రెస్ వేవ్ లో గజ్వేల్ సెంటిమెంట్  వర్కవుట్ అవుతుందని కెసీఆర్ భావిస్తున్నారని, అందుకు తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మొన్న టార్గెట్  రజినీ..నేడు చిరంజీవి..  వైసీపీ నోళ్లకు అడ్డు అదుపు లేదా...?

ఎవరైన వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. ఆ పార్టీ నేతల నోళ్లకు ఇక అడ్డు అదుపు ఉండదు.వాళ్లకు కనీస విచక్షణ ఉండదు.. విజ్ఞత మచ్చుకైనా  కనిపించదు. అస్సలు విమర్శలకు తట్టుకోలేరు. అవతల ఉన్నది ఏ స్థాయి వ్యక్తి అని ఆలోచించరు. చివరకు న్యాయమూర్తులు పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పై పడ్డారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని? సినిమా పరిశ్రమను స్వేచ్ఛగా విడిచిపెట్టండని మెగాస్టార్ కోరారు. అందులో తప్పేంటి..? అప్పటినుంచి వైసీపీ నేతలు చిరంజీవిపై ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు.  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడంలో పేర్ని నాని,కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందుంటారు. ఇప్పుడు చిరంజీవిపై పడ్డారు. ముందుగా కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు. పరోక్షంగా చిరంజీవి పకోడీ గాడు అన్నట్టు మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లంతా పకోడీ గాళ్ళని.. తాము ఎలా ఉండాలో వారు సలహాలు ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. తన వాళ్లకు కూడా ఆ సలహాలిస్తే బాగుంటుందని సూచించారు. మనకెందుకురా బాబు మన డాన్సులు, ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదని చెప్పుకొచ్చారు. తనకు తాను చిరంజీవి అభిమానిని చెప్పుకునే పేర్ని నాని సైతం మెగాస్టార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారని.. అందుకే ఎదుర్కోక తప్పదని నేరుగా చిరంజీవికే హెచ్చరికలు పంపారు. గిల్లితే గిల్లించుకోవాలి అన్న సినిమా డైలాగుని గుర్తు చేశారు. బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు తప్పకుండా గిల్లుతారని.. సినిమా కాదన్న విషయం చిరంజీవికి గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై ఏం చేశారని నిలదీశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడుగుతున్నట్లు అని ఆక్షేపించారు. అటు ఆదర బాదరగా..ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడే బొత్స సత్యనారాయణ సైతం వ్యంగ్యంగా స్పందించారు. చిత్ర పరిశ్రమ పిచ్చుకని చిరంజీవి అంగీకరించారా అని సెటైర్ వేశారు. అయితే వైసీపీ నేతలు నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని చిరంజీవికి తెలుసు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలోనే ఈ విషయం తేటతెల్లమైంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన ఆయన.. స్నేహితుడు చంద్రబాబు గురించి మాట్లాడారు. ఆయన చేసిన అభివృద్ధిని కొనియాడారు. మరోసారి ఆయన అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇలా మాట్లాడిన పాపానికి రజనీకాంత్ ను ఏ స్థాయిలో విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. చివరికి రజినీకాంత్ అనారోగ్యంపై కూడా మాట్లాడారు. కోట్లాదిమంది ఆరాధిస్తున్న ఓ హీరో శరీర ఆకృతి గురించి కూడా వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల సభ్యత, సంస్కారం అది. ఇది చిరంజీవికి తెలియంది కాదు. అయినా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే.. ఏ స్థాయిలో విసిగి వేసారి పోయారో అర్థమవుతుంది. చిరంజీవి వ్యాఖ్యలతో.. వైసీపీపై నలువైపులా ఇక ముప్పెట దాడి ఆరంభమైనట్లైంది. ఏడు పదుల వయసులో కూడా.. రోడ్ షోతో అదర గొడితున్న బాబు ఓ వైపు.. మరోవైపు లోకేష్.. జనసేనాని పవన్ ..ఇప్పుడు తాజాగా...చిరంజీవి. 2024 ఎన్నికలలో వైసీపీకి ఇక చుక్కలే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

మొరగని కుక్క లేదు.. అర్థమైందా రాజా?.. వైసీపీ నేతలకు రజినీకాంత్ చురకలు!

దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. అయినప్పటికీ ఆయనలో ఆ అహం ఉండదు. అందరితో మంచిగా ఉంటారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ, వివాదాలకు దూరంగా ఉంటూ తన పనేదో తాను చూసుకుంటూ ఉంటారు. అలాంటి రజినీకాంత్ కి కోపం వచ్చింది. "కుక్కలు మొరుగుతుంటాయి.. మన పని మనం చేసుకుంటూ పోవాలి" అంటూ పరోక్షంగా కొందరికి చురకలు అంటించారు. అయితే రజినీకాంత్ కోపానికి కారణం.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.  రజినీకాంత్ కి తెలుగులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో మంచి అనుబంధం ఉంది. చంద్రబాబు నాయుడుతో, నందమూరి కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆ అనుబంధంతోనే ఈ ఏడాది ఏప్రిల్ 28 న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే చంద్రబాబు గొప్పతనాన్ని వివరించారు. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబుది అని, ఆయన గొప్ప విజనరీ ఉన్న నాయకుడని, ఆయన హయాంలో రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందని కొనియాడారు. ఈ మాటలు ఏపీ అధికార పార్టీ నేతలకు నచ్చలేదు. నిజానికి ఆ వేడుకలో రజినీకాంత్ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. తన స్నేహితుడు చంద్రబాబు ఎంత గొప్ప నాయకుడో చెప్పే ప్రయత్నం చేశారు అంతే. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం రజినీకాంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న హీరోని పట్టుకొని నువ్వు హీరోవా అంటూ చులకన చేశారు. కొడాలి నాని మొదలుకొని పోసాని కృష్ణమురళి వరకు ఎందరో రజినీకాంత్ పై విమర్శలు గుప్పించారు. రజినీకాంత్ పై అలా విమర్శలు చేయడాన్ని మేధావులు, స్వతంత్రులు సైతం తప్పుబట్టారు. అయితే ఇంత కాలం ఈ విషయంపై సైలెంట్ గా ఉన్న రజినీకాంత్.. తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు.  రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఈ సినిమా వేడుకలో ఆయన మాట్లాడుతూ.. "మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?" అంటూ చురకలు అంటించారు. మొదటి వాక్యాలను తమిళ్ లో చెప్పిన రజినీకాంత్.. చివరిలో మాత్రం 'అర్థమైందా రాజా' అని తెలుగులో చెప్పడం విశేషం. పోసాని మాట్లాడితే 'రాజా రాజా' అంటుంటారు. అందుకే పోసాని శైలిలోనే అర్థమైందా రాజా అంటూ వైసీపీ నాయకులకు రజినీ చురకలు అంటించారనే చర్చ జోరుగా నడుస్తోంది. రీసెంట్ గా చిరంజీవి సైతం సినిమా వాళ్ళపై మీ ప్రతాపం చూపించడం మానేసి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటిస్తూనే హితవు పలికారు. దీంతో మొన్నటిదాకా చిరంజీవిని పొగిడిన అధికార పార్టీ నేతలే.. ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు విపక్షాలు అందరినీ కలుపుకొని పోతూ రోజురోజుకీ బలపడుతుంటే.. ఇప్పటికే రాజధాని పరంగా, అభివృద్ధి పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ మాత్రం.. తన గోతిని తానే తవ్వుకున్నుట్లుగా ఆ నాయకుల నోటి తీరుతో అందరికీ దూరమవుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన గ్రాఫ్ ని మరింత పడిపోయేలా చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై మళ్లీ సుప్రీంకు జగన్ సర్కార్

ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీలో జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లని వాదించడమే కాదు.. నమ్ముతోంది. అలా నమ్మకుండా నాలుగు కాళ్లు ఉంటాయన్న వాళ్లని ప్రజా ద్రోహులుగా, పేదల వ్యతిరేకులుగా ముద్ర వేసి ప్రచారం చేయాలనుకుంటోంది. ఈ విషయంలో కోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయడంలేదు. ఎలాగైనా సరే తాను అనుకున్నది చేసి తీరాలని భావిస్తోంది. ఇప్పటికే పలు మార్లు అమరావతి విషయంలో ప్రజలలోనే కాదు, కోర్టులలో కూడా భంగపాటుకు గురైన జగన్ సర్కార్  ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై స్టే ఇస్తూ ఏపీ  హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. అసలింతకీ ఏమీటీ ఆర్5 జోన్ ఇళ్ల నిర్మాణం కథ అంటే పెద్దగా ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఆర్5 జోన్ లో ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగానే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పట్టాల పంపిణీకి అనమతి ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పట్టాలపై పేదలకు హక్కు  అమరావతి కేసులో తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే  లబ్థిదారులకు ఆ భూములపై ఎటువంటి హక్కూ ఉండదని విస్పష్టంగా చెప్పింది. అయినా సరే పేదలను వంచించడమే లక్ష్యం అన్నట్లుగా జగన్ సర్కార్ ఆర్భాటంగా  ఆర్ 5 జోన్ లో రాజధానేతర పేదలకు పట్టాలు పంచేసింది.   నిజంగా సుప్రీం కోర్టు తీర్పును జగన్ సర్కార్ గౌరవించి ఉంటే.. ఆ తీర్పు ప్రకారం పట్టాలపై అమరాతి కేసులో తుది తీర్పునకు లోబడే హక్కులు ఉంటాయనీ, ఒక వేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే లబ్ధిదారులకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలపై ఎటువంటి హక్కూ ఉండదనీ, అవి చెల్లుబాటు కావనీ  పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనే వెల్లడించి ఉండాలి. కానీ జగన్ సర్కార్ ఆ పని చేయలేదు. పట్టాలు పంపిణీ చేసిన రోజు ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సభా ముఖంగా ఇళ్ల నిర్మాణం అని చెప్పారు. చెప్పి ఊరుకోలేదు.. గుంతలు పడిన రోడ్లకు కనీపం మరమ్మతులు కూడా చేయకుండా నాలుగేళ్లు లాగించేసిన జగన్ సర్కార్.. కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా   శరవేగంగా ఆర్5 జోన్ లో   ఇళ్ళ నిర్మాణానికి శంకు స్థాపన చేసేని పనులు జరిగేలా చర్యలు  జరిగేలా చర్యలు చేపట్టింది. దీంతో అమరావతి కోసం భూములిచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇళ్ల నిర్మాణంపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో  వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.  పట్టాల మీద లబ్ధిదారులకు హక్కులు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని గతంలోనే విస్పష్టంగా చెప్పిన సుప్రీం కోర్టు.. ఆ హక్కులేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకం. అలాగే ఇప్పటికే రైతులు ఈ కేసులో   రాష్ట్ర ప్రభుత్వం   సుప్రీంకోర్టులో కెవియట  దాఖలు చేశారు.   ఈ కేసు  శుక్రవారం (ఆగస్లు10) లేదా సోమవారం (ఆగస్టు12)న విచారణకు వచ్చే అవకాశం ఉంది.  

రాజాసింగ్ దుస్థితి.. స్వయంకృతం!

బీజేపీలో వివాదాస్పద  ఎమ్మెల్యే రాజాసింగ్ ఎటు వెళ్తున్నారు..? రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌డం క‌ష్ట‌మేనా? అంటే దాదాపు అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. తెలంగాణ అసెంబ్లీలో తాజాగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్య‌లనే అందుకు ఉదాహరణగా చూపుతున్నాయి.  తాను మ‌ళ్లీ స‌భ‌లో ఉండ‌ను అని స్వ‌యంగా రాజా సింగ్ చెప్ప‌డం విస్తృత చర్చకు దారి తీసింది.  ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో నిర్వేదంగా మాట్లాడారు. ఇప్పుడు స‌భ‌లో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు వ‌చ్చేసారి శాస‌న స‌భ‌లోకి రావొచ్చు. రాక‌పోవ‌చ్చు. తాను అయితే మ‌ళ్లీ స‌భ‌లో  అడుగుపెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు అని సభాముఖంగానే చెప్పేశారు. తనను అసెంబ్లీలో మ‌ళ్లీ అడుగుపెట్ట‌కుండా తన చుట్టూ చాలా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయని అంటూ రాజాసింగ్ భావోద్వేగానికి గురయ్యారు.  గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ధూల్‌పేట్‌లో లోధి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం తోడుగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. దీంతో రాజాసింగ్ వ్యాఖ్య‌ల వెనుక మర్మమేదో ఉందన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. 2014, 2018  అసెంబ్లీ ఎన్నిక‌లలో రాజాసింగ్  ఘోషామహల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికలలో  అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే.  హింస‌ను ప్రేరేపించేలా ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటూ కేసు న‌మోదైన నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారు. అయితే బీజేపీ మాత్రం ఇంకా ఆ సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు.  అంతే కాకుండా గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న్ని దూరం చేసేలా బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నదన్న అభిప్రాయం ఆ నియోజకవర్గ ప్రజల నుంచే వ్యక్తం అవుతోంది.  కాగా రాజాసింగ్ కూడా ఇటీవల పలు సందర్భాలలో అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  పార్టీలో నూ   బ‌య‌టా కూడా త‌న‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని రాజాసింగ్ దాపరికం లేకుండా చెబుతున్నారు.   గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దుల‌కోవాల్సి వ‌స్తే రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతాన‌ని ఆయన విస్పష్టంగా చెబుతున్నారు. అయితే రాజాసింగ్ కు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదురుకావడానికి ఆయన స్వయంకృతమే కారణమని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. పరిధి మీరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. స్థానిక ముస్లిం వర్గాలతో దురుసుగా ప్రవర్తించడం.. ఇవన్ని  ఆయనను పార్టీ పక్కన పెట్టేయడానికి కారణమైంది. తీరా ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత వగచి ఏం ప్రయోజనం అని, ఇప్పుడు ఆయన ఏం చేసినా చేతులు కాలాక..ఆకులు పట్టుకున్నట్లే అవుతుందని అంటున్నారు.

వచ్చే ఎన్నికలలో గద్దర్ కుమారుడికి కాంగ్రెస్ టికెట్?

ప్రజాయుద్ధ నౌక గద్దర్ కుమారుడు సూర్యం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అబ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక అభిమానులు ఆయన మరణంతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయి ఉన్నారు. అటువంటి వేళ ఆయన కుమారుడిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తే సానుభూతి ఓట్లతో ఆయన విజయం సాధిస్తారని కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు.   గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలుపుతూ సందేశం పంపిన సంగతి విదితమే. గద్దర్ భార్య విమలకు సానుభూతి తెలియజేసిశారు. కాగా గద్దర్ కుమారుడికి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ కి అవకాశం కల్పించాలన్న రాష్ట్ర పార్టీ ప్రతిపాదనను  హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.  గద్దర్ కుమారుడికి పార్టీ టికెట్ విషయమై ఎన్నికల కమిటీలో చర్చించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుని ఎక్కడ నుంచి ఆయన పోటీ చేసేది తదితర విషయాలను అధికారికంగా ప్రకటించే అవకాశలు ఉన్నాయంటున్నారు.    తెలంగాణ ఉద్యమంలో తన పాటతో జనాలను చైతన్యం చేయడంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. అయితే.. తెలంగాణ వచ్చి 9 ఏళ్లు దాటినా.. బీఆర్ఎస్​ గద్దర్ కు ఎటువంటి గుర్తింపూ ఇవ్వలేదని ఆయనే స్వయంగా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  అంతే కాకుండా గత రెండు మూడేళ్లుగా గద్దర్ ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీతో  సత్సంబంధాలు మెయిన్ టైన్ చేస్తూ వస్తున్నారు.  మధ్యలో కొద్దిరోజులు బీజేపీ వైపు అడుగులు వేసినా.. తన భావజాలానికి సెట్ కాదని గ్రహించి కమలం పార్టీకి దూరం జరిగారు.     గద్దర్ మరణానంతరం  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి తదితర నేతలంతా కుటుంబ సభ్యులకు మనోధైర్యం  ఇస్తూ అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ వెన్నంటే ఉన్నారు.  అమీర్‌పేట్ నుంచి ఎల్బీ స్టేడియం.. అక్కడి నుంచి అల్వాల్ వరకు జరిగిన యాత్రలో కాంగ్రెస్​నేతలు పాల్గొన్నారు.  గద్దర్ అన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆయనను తమ వాడిగా చెప్పుకునేందుకు ప్రయత్నించింది. అందుకే బీఆర్ఎస్ నేతలు పలువురు గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.   గద్దర్ తన పాటలతో, ఉద్యమ స్ఫూర్తితో సమాజంలోని అత్యధికులను ప్రభావితం చేసిన వ్యక్తి కావడంతోఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తి కావడంతో  బీఆర్ఎస్, కాంగ్రెస్ లు గద్దర్ ను తమకు ఆప్తుడిగా చెప్పుకునే విషయంలో పోటీ పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అయితే ఒక అడుగు ముందుకు వేసి గద్దర్ కుమారుడికి పార్టీ టికెట్ కూడా ఆఫర్ చేస్తున్నది.

ఏపీలో భోళా శంకర్ బోల్తాయేనా?.. వైసీపీ దృష్టిలో చిరు ఇక పకోడీయేనా?

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అలాగే వారి అభిమానులంతా కూడా మెగా అభిమానులుగా కలిసే ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితుల కారణంగా మెగా అభిమానుల్లో కొంతకాలంగా కాస్త గందరగోళం నెలకొంది. ఓ వైపు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న పవన్ 'అందరి లెక్కలు తేలుస్తా' అంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపిస్తుంటే.. మరోవైపు చిరంజీవి మాత్రం రాజకీయాలు మానేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి 'అంతా మీ దయ' అన్నట్లుగా మెతక వైఖరి చూపుతూ అధికార పార్టీకి అస్త్రంలా మారారు. దీంతో పలువురు అధికార పార్టీ నేతలు చిరంజీవిని అడ్డుపెట్టుకొని పవన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఆమధ్య ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గించడంపై పవన్ తన గళాన్ని బలంగా వినిపించారు. సినీ పరిశ్రమపై ప్రభుత్వ పెత్తనం ఏంటంటూ పవన్ బలంగా నిలబడ్డారు. అయితే చిరంజీవి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సీఎం వైఎస్ జగన్ ని కలిసి చేతులు జోడించి వేడుకున్నారు. ఆ సమయంలో మెగా అభిమానులు నొచ్చుకున్నారు. అప్పటికే చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్ కుటుంబాన్ని కలవడం పట్ల అసహనంగా ఉన్న అభిమానులకు.. చిరు చేతులు జోడించి వేడుకోవడం పుండు మీద కారం చల్లినట్లు అయింది. ఇలా పవన్, చిరంజీవి భిన్న వైఖరితో కొందరు మెగా అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఓ వైపు చిరంజీవిని పొగుడుతూ, మరోవైపు పవన్ మీద దారుణమైన విమర్శలు చేశారు. పవన్ కుటుంబంపైనా ఎన్నో దారుణ వ్యాఖ్యలు చేశారు. పవన్ కుటుంబం అంటే చిరంజీవి కుటుంబమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయినప్పటికీ చిరు నోరు మెదపలేదు. ఆయన వైఖరి పట్ల పవన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరి అభిమానుల ఆవేదన ఇన్నాళ్ళకు చిరంజీవికి చేరిందో లేక రాబోయే కొద్ది నెలల్లో అధికారం మారుతుందన్న నమ్మకమో తెలీదు కానీ.. ఇన్నిరోజులు మంచుపర్వతంలా కనిపించిన చిరంజీవి.. ఒక్కసారిగా అగ్నిపర్వతంలా మారారు. చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర 200 రోజుల వేడుకలో పాల్గొన్న చిరు.. పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "మీరు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి" అంటూ మెగాస్టార్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. చిరు ఎట్టకేలకు తన నోరు మెదపడంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు. అదే సమయంలో ఏపీలో 'భోళా శంకర్' పరిస్థితి ఏంటి? అని భయపడుతున్నారు. ఎందుకంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించినందుకు పవన్ నటించిన 'భీమ్లా నాయక్' విడుదల సమయంలో ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందనేది బహిరంగ రహస్యం. ఇంతకాలం తన మెతక వైఖరితో పవన్ ని ఇరుకున పెట్టి తమకు లాభం చేకూర్చేలా ఉండటంతో.. చిరంజీవిని అధికార పార్టీ నేతలు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు చిరు తన స్వరం వినిపించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఇంతకాలం పవన్ మీద చేసిన విమర్శలు ఇప్పుడు చిరు మీద చేసే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఆగస్టు 11న విడుదల కానున్న 'భోళా శంకర్' సినిమాకి ఇబ్బందులు కలిగించే అవకాశాలున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. ఆ విమర్శలను, ఇబ్బందులను మృదుస్వభావి అయిన చిరంజీవి తట్టుకోగలరా? ఇకముందు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ్ముడికి మద్దతుగా తన స్వరం వినిపిస్తారా? అలాగే తన అన్న జోలికొస్తే ఊరుకొని పవన్ 'భోళా శంకర్' కోసం ఏ మేరకు అండగా నిలబడతారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  మొత్తానికి ఇంతకాలం ఏపీ అధికార పార్టీ నేతలకు పవన్ అగ్నిపర్వతంలా, చిరంజీవి మంచుపర్వతంలా కనిపించారు. కానీ ఇప్పుడు చిరంజీవి తాను కూడా మంచు కప్పుకున్న అగ్నిపర్వతాన్ని అని తెలిపేలా.. కాస్త మంచుని తొలగించి చిరు కోపాన్ని ప్రదర్శించారు. మరి ఈ కోపం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి. ఇకపోతే.. చిరంజీవి జగన్ సర్కార్ పై ఇలా చిరు విమర్శ చేశారో లేదో.. అలా వైసీపీ బూతుల మాజీ  మంత్రి కోడాలి నాని నోరేసుకుపడిపోయారు. చిరంజీవిని పకోడీగాడుగా అభివర్ణిస్తూ దూషణల పర్వానికి దిగారు. సినిమా పరిశ్రమలో చాలా మంది పకోడీగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో మాకు సలహాలు చెబుతున్నారంటూ విరుచుకు పడిపోయారు. ఆయన మాటలను బట్టి చూస్తే భోళా శంకర్ కు ఏపీలో చిక్కులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పాలన పడకేసింది... అరాచకం రాజ్యమేలుతోంది!

ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆరోపణలు చేయడం అనేది రాజకీయాలలో అత్యంత సహజమైన ప్రక్రియ. అయితే  ప్రతిపక్షాలు చేసే ప్రతి ఆరోపణ నిజమైతే ఆ ప్రభుత్వం ఫెయిలయినట్లే లెక్క. అందులో కొన్ని సరిదిద్దుకొనే అవకాశం ఉండేవైతే ప్రభుత్వం సరిచేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక, అసలు చేయరాని తప్పులు, తీవ్ర నేరంగా పరిగణించాల్సినవి కూడా జరిగిపోతుంటే ఇక ఆ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేనట్లే. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం  అలాంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ అభాసుపాలైన జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు.. ఎవరికి కావాల్సినట్లు వారు పరిపాలన సాగిస్తూ అసలు చట్టాలు, అధికారాలు అనేవి ఉన్నాయన్న సోయ లేకుండా అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నాలుగేళ్ళలో జగన్ సర్కార్ పై వచ్చిన ఆరోపణలు, కోర్టుల మొట్టికాయలు ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ఏడాది వస్తున్న ఆరోపణలు మరో ఎత్తు. ఎందుకంటే ఒక్కొకటి బయటపడుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత ఘోరంగా విఫలమయ్యారో  స్ఫష్టంగా తేటతెల్లమౌతోంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నఆరోపణ అన్నిటికంటే తీవ్రమైనది.    ముఖ్యమంత్రికే తెలియకుండా ఆయన డిజిటల్ సంతకాన్ని చోరీ చేసి  ఎవరో ప్రభుత్వాన్ని నడిపించేస్తే? చంటి పిల్లాడు మార్కులు తక్కువచ్చాయని తన ప్రోగ్రెస్ కార్డు మీద తండ్రి సంతకం పెట్టేసుకున్నట్లు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకాన్ని సీఎంఓలో పనిచేసే వాళ్లే పెట్టేసుకొని ఫైళ్లను క్లియర్ చేసేసుకుంటున్నారంటే? ఔను.. ఇప్పుడు ఏపీ సీఎంఓలో ఇదే జరిగిందని ప్రభుత్వ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆయన డిజిటల్ సంతకాన్ని వాడేసుకుని కొందరు వాళ్లకు కావాల్సిన ఫైళ్లను క్లియర్ చేసుకున్నారని దుమారం రేగుతున్నది. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో సౌలభ్యం కోసం తీసుకొచ్చిందే డిజిటల్ సిగ్నేచర్. అంతా ఆన్ లైన్ అయిన ఈ కాలంలో ఈ ఫైళ్ల కోసం సీఎం నుండి ఒక గ్రామ రెవెన్యూ అధికారి వరకూ అందరికీ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. సదరు అధికారి సంతకం.. ఈ డిజిటల్ సిగ్నేచర్ రెండూ ఒక్కటే. అందుకే దీని కోసం పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. ఇక సీఎం స్థాయిలో భద్రత అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీని కోసం సీఎం థంబ్ ఇంప్రెషన్ తప్పకుండా ఉంటుంది. ఒకసారి సీఎం థంబ్ ఇచ్చారంటే డిజిటల్ సిగ్నేచర్   కొద్ది సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఎలా జరిగిందో.. ఏం చేశారో కానీ.. సీఎం జగన్ డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి తమకి కావాల్సిన పెండింగ్ ఫైళ్లను సీఎంఓ అధికారులు కొందరు క్లియర్ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  సీఎం డిజిటల్ సిగ్నేచర్ చోరీ చేసిన నిందితులు ఎవరన్నది వెల్లడించడం లేదు కానీ, సీఎంఓలో అందిరికీ ఈ వ్యవహారం, నిందితుడు కూడా తెలుసని ఉద్యోగవర్గాలలో పెద్దగా చర్చ జరుగుతోంది.  ఇంతకీ అసలేం జరిగింది? నిందితులు ఎవరు అన్నది అందరికీ తెలిసినా బయటకి పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. సీఎం డిజిటల్ సిగ్నేచర్  ఉపయోగించి ఆయనకు తెలియకుండా ఫైళ్లు క్లియర్ చేయడం అంటే రాష్ట్రంలో దిగజారిన పరిపాలనకు పరాకాష్టగానే చూడాలి. అందునా వాళ్ళు క్లియర్ చేసిన ఫైళ్లు ఏంటి? దేనికి సంబంధించి ఫైళ్లు క్లియర్ చేసుకున్నారు? దాని వలన రాష్ట్ర ప్రజలపై పడే  ప్రభావం ఎంత అనేది చెప్పేవారు కూడా లేరు. అయితే, ఈ తంతంగం వెనక అటెండర్ ఉన్నాడని, ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.  ఇప్పటికే   సీఎం డిజిటల్ సిగ్నేచర్ చోరీ అంశాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ లేవనెత్తగా.. త్వరలోనే జనసేన దీనిపై భారీ ఎత్తున ఆరోపణలకు దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ప్రభుత్వ పరువు గంగపాలు అయినట్లే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర పరిపాలన వ్యవస్థకు మూల స్తంభం. అలాంటి సీఎం సిగ్నేచర్ చోరీ అవ్వడం అంటే ఆ మూల స్తంభం.. ఆ వ్యవస్థ కుప్పకూలినట్లే. మరి దీనికి వైసీపీ ఎలాంటి సమాధానం చెప్పుకుంటుందో , ఏచర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేసీఆర్ సంచలన నిర్ణయం?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించాలంటే సిట్టింగ్ లలో అత్యధికులను మార్చక తప్పదా? అలా మార్చకుంటే కేసీఆర్  హ్యాట్రిక్ కల నెరవేరదా? అంటే బీఆర్ఎస్ శ్రేణులే ఔనని అంటున్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్టులన్నీ సిట్టింగ్ లపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న నివేదికలే ఇచ్చాయని అంటున్నారు. కనీసంలో కనీసం 50 మంది సిట్టింగ్ లు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారనీ ఇంటెలిజెన్స్ నివేదికలతో కేసీఆర్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. కనీసం 50 నియోజకవర్గాలలో సిట్టింగులకు టికెట్ ఇస్తే విజయం కష్టమని నివేదికలు తేల్చేయడంతో కొత్త వారి కోసం అన్వేషణ మొదలైందని చెబుతున్నారు.  సొంత పార్టీలో పోటీకి నేతలు కరవైన నియోజకవర్గాలలో   ఇతర పార్టీల్లో బలమైన నేతలను బీఆర్ఎస్ లోకి ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారనీ అంటున్నారు. అమోఘమైన అభివృద్ధి, అనితర సాధ్యమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా తమ ప్రభుత్వం పట్ల ఇంత ప్రజా వ్యతిరేకత గూడుకట్టుకోవడమేమిటని తెరాస నేతలు ఆశ్చర్యపోతున్నారని చెబుతున్నారు. గత ఎన్నికలలో కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తున్న కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ నివేదికలు షాక్ ఇచ్చాయని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104. వీరిలో కనీసం 50 మంది తిరిగి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్నది ఇంటెలిజెన్స్ నివేదికల సారాంశం. దీంతో ఆయా నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థుల కోసం కేసీఆర్ అన్వేషణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడే ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చనున్నట్లు ప్రకటిస్తే మొదటికే మోసం వస్తుందన్న భయం బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని వెంటాడుతోందని అంటున్నారు. ఆ కారణంగానే సిట్టింగులకే సీట్లు అని గతంలో చెప్పిన మాటను తప్పలేక, ఓటమి ఖాయమని నివేదికలు తేల్చేసిన సిట్టింగులను మళ్లీ పార్టీ అభ్యర్థులుగా నిలపేందుకు నిర్ణయం తీసుకోలేక సీఎం కేసీఆర్ సతమతమౌతున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ నేపథ్యంలోనే సిట్టింగులను మార్చాల్సిన నియోజకవర్గాల ఇన్ చార్జ్ మంత్రులతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కాగా కొన్ని చోట్ల మంత్రులకే వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా నివేదికలు ఉండటంతో వారిని పక్కన పెట్టి కొత్త ఇన్ చార్జ్ లను నియమించాలన్న యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా టికెట్లు దక్కని సిట్టింగులను సముదాయించే పనిని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి హరీష్ రావులకు కేసీఆర్ అప్పగించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మాత్రం ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో కంటే ఏడెనిమిది స్థానాలలో విజయం సాధించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. 

పోలవరం వాస్తవాలు బయటపెట్టేసిన జగన్!

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. నిధులు కేటాయించకపోవడం, అందుకు తగిన సమర్థులైన వారిని మంత్రులుగా నియమించలేకపోవడం, పారదర్శకత లోపం.. అనుభవమైన నిర్మాణం చేపట్టే ఇంజనీరింగ్ కంపెనీలను ఎంచుకోకపోవడం, రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లలో అపనమ్మకం ఇలా ఎన్నో కలిసి ఏపీలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవడం, ఇప్పటికే జరిగిన పనులు ధ్వంసం అవడం, ఏడాదికి ఏడాది పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు కలిసి ఇప్పుడు ఈ వ్యవహారం అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ పెద్దలు ఈ అంశంలో గుడ్డ కాల్చి మోహన వేసేలా అడ్డగోలు విమర్శలు చేయడం తప్ప లెక్కలతో సహా సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనలో ఎన్ని విమర్శలు చేస్తున్నా వైసీపీ నుండి దీటుగా సమాధానం వచ్చే పరిస్థితి లేదు. కాగా, రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టుల సంగతెలా ఉన్నా పోలవరం విషయంలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒక్క ఏడాది ఇది ఆలస్యం అయినా నష్టం వేల కోట్లలో ఉంటుంది. ఈ భారమంతా ప్రాజెక్టుపైనే పడుతుంది. ఇది గ్రహించే గత ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. సోమవారం పోలవారం అంటూ వారం వారం సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అందుకు ప్రతిఫలమే పోలవరం నిర్మాణంలో 60 నుండి 70 శాతం పూర్తి చేయగలిగారు. అంతేకాదు, ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యామ్ వంటివి పూర్తి చేశారు. స్పిల్ వే పనులను కూడా మొదలు పెట్టారు. కేంద్రం నుండి ఆశించిన సమయానికి నిధులు రాకపోయినా.. ముందు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి తర్వాత కేంద్రం నుండి వచ్చినపుడు జమ చేసుకుంది. అయితే, గత ఎన్నికలకు ముందు, జగన్ సర్కార్ ఏర్పాటైన తర్వాత కూడా పోలవరం నిర్మాణంపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేసేవారు. అసలు పోలవరంలో యాభై శాతం కూడా పనులు కాలేదని, టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనని సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డే ఆరోపించేవారు. అయితే, తెలిసో తెలియకో సీఎం జగన్ మోహన్ రెడ్డే ఇప్పుడు పోలవరం నిర్మాణంపై కొన్ని నిజాలు బయటపెట్టారు. ఇటీవల వర్షాలకు ముంపునకు గురి అయిన ప్రాంతాలను సీఎం సోమవారం సందర్శించారు. ఇందులో పోలవరం గ్రామం కూడా ఉంది.. అక్కడ మాట్లాడిన జగన్.. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబు 2014 అంచనాల ప్రకారమే కట్టడానికి పోలవరం తీసుకున్నారని, ఆ నిధులతో 2023లో ఉన్న ధరలకు పోలవరం ప్రాజెక్ట్ ని కట్టగలమా మీరే చెప్పండని ప్రజలనే ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణం చంద్రబాబు అని డైరెక్ట్ గా ఆరోపించిన జగన్.. స్పిల్ వే కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారని, కాఫర్ డ్యామ్ పూర్తి చేయలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం స్పిల్ వే, డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసిందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే, గత ప్రభుత్వంలోనే డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పూర్తి కాగా.. స్పిల్ వే పనులు కూడా కొద్ది శాతమే పెండింగ్ ఉన్నాయి. ఈ నాలుగేళ్ళలో ఆ పెండింగ్ పనులు మాత్రమే పూర్తి చేసినట్లు జగనే ఒప్పుకున్నట్లైంది. ఇక అదే సమయంలో గత ప్రభుత్వం ఒప్పుకున్న ధరలకు ఇప్పుడు కట్టగలమా అని ప్రజలనే ప్రశ్నించడం అంటే.. ఇప్పుడు తాము కట్టలేమని సీఎంనే  అంగీకరించారని భావించాల్సి ఉంటుంది. పెరిగిన ధరలతో నిధులు కావాలంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెచ్చుకోవాలి. కానీ జగన్ కేందంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితిలో లేరన్నది తెలిసిందే. మరి  ప్రజలను మీరే చెప్పండి అని ప్రశ్నిస్తే ప్రజలు ఏం చెప్తారు. ఒకవిధంగా జగన్ మాటలను చూస్తే పోలవరం నిర్మాణం తమ వల్ల కాని పని అని స్వయంగా  ఒప్పుకుని చేతులెత్తేసినట్లే ఉంది.

వైసీపీలో మరో రఘురామకృష్ణం రాజు? లోక్ సభలో లావు ప్రసంగం సంకేతమేంటి?

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో తిరుగుబావుటా ఎగురవేయడానికి రెడీ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందా? తమ రాజకీయ భవిష్యత్ పై భయం వారిని వైసీపీకీ దూరం చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే వైసీపీకి లోక్ సభలో ఒక రెబల్ ఎంపీ ఉన్నారు. ఆయనకు తోడుగా మరో ఎంపీ తిరుగుబావుటా ఎగుర వేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సోమవారం ( ఆగస్టు 7) వైసీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయులు లోక్ సభలో చేసిన ప్రసంగం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లోక్ సభ వేదికగా ఆయన మాట్లాడిన ప్రతి మాటా జగన్ సర్కార్ ను వేలెత్తి చూపినట్లుగానే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను పరొక్షంగా విమర్శించిన కారణంతో జగన్ పార్టీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కక్ష కట్టింది. కేసులు పెట్టింది. సీఐడీ పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేసినా స్పందించలేదు. అంతే కాదు.. గత కొన్నేళ్లుగా ఆయన కనీసం రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి కూడా లేకుండా చేసింది. సొంత నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగి.. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరైనా కూడా రఘురామకృష్ణంరాజు రాలేకపోయారంటేనే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఇట్టే అవగతమౌతుంది. ఇప్పుడు అదే కోవలో   నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు ప్రభుత్వ డేటాచోరీ అంశంపై పార్లమెంట్‌లో పరోక్షంగా మాట్లాడి వైసీపీలో కలకలం రేపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చలో పాల్గొని  ప్రభుత్వాలు సేకరించే వ్యక్తిగత వివరాలు సంక్షేమ పథకాల అమలు కోసం  కాకుండా ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.   ఇలా దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.   ప్రభుత్వం.. డేటా చౌర్యం, దుర్వినియోగం అనగానే ఎవరికైకా ముందుగా గుర్తుకు వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్  వలంటీర్ల ద్వారా జగన్ సర్కార్ డేటా చౌర్యానికి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలా చోరీ చేసిన డేటాను హైదరాబాద్ నానక్ రామ్ గూడలో భద్రపరిచారనీ విమర్శించారు.  ఆ చోరీ చేసిన డేటాను ఓ ప్రైవేటు కంపెనీకి చేసి..  ఓటర్లను  ఓటర్లను ప్రభావితం చేసే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాయి.  వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో డేటా చౌర్యం గురించి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలనే ఏపీ సర్కార్ అన్న మాట ఎత్తకుండా మాట్లాడారు. పేరెత్తి నిజం నిర్భయంగా చెప్పలేకపోయినా.. పరోక్షంగా జగన్ సర్కార్ పై వస్తున్న ఆరోపణలనే ప్రస్తావించి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టేశారు. లోక్ సభలో ఆయన ప్రసంగంపై వైసీపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మరో ఎంపీ జగన్ కు రెబల్ గా మారారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లావు ప్రసంగం తరువాత జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. చాలా కాలంగా లావు కృష్ణ దేవరాయులు జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, అలాగే తనకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభించే అవకాశాలు లేవని తన సన్నిహితుల వద్ద పలుమార్లు చెప్పారనీ వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే డేటా చౌర్యంపై లోక్ సభ వేదికగా లావు చేసిన ప్రసంగం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఎంపీల విషయం పక్కన పెడితే.. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభించే అవకాశం లేని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలలు కూడా ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధపడుతున్నారనీ, ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వైసీపీలో అసంతృప్తి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, సొంత పార్టీలోనే జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నదనీ, నెల్లూరు, తూర్పుగోదావరి సహా పలు జిల్లాలలో నాయకుల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలే తేటతెల్లం చేస్తున్నాయి. 

ఏపీలో పొత్తుపొడుపుల దాగుడుమూతలు!

ఆంధ్రప్రదేశ్ లో పొత్తుపొడుపుల దాగుడుమూతలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎటూ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుంది. వైసీపీకి వ్యతిరేకంగా జనసేన తెలుగుదేశంతో పొత్తుతో రంగంలోకి దిగుతుందని అంతా భావిస్తున్నారు. జనసేనకు ఇప్పటికే మిత్రపక్షమైన బీజేపీ కూడా ఈ రెంటితో కలిసి ఎన్నికల సమరంలో పాల్గొంటుందా? అన్న విషయంలో మాత్రమే సందిగ్ధత ఉందని అంతా ఇంత కాలం భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు పొడుస్తుందా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయి. ముఖ్యంగా హస్తినలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లి వచ్చిన తరువాత రాష్ట్రంలో పొత్తుల విషయంలో ఒకింత సందేహం వ్యక్తం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ ఇప్పటికీ జగన్ సర్కార్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెబుతున్నప్పటికీ.. పొత్తు చర్చల విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. బీజేపీ వ్యూహాత్మకంగా ఒక వైపు జగన్ సర్కార్ పై పార్టీ అగ్రనాయకత్వం నుంచి రాష్ట్ర నాయకుల వరకూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు అంటూ వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు.  అదే సమయంలో కేంద్రం నుంచి జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అవసరమైన సహకారం అందుతోంది. దీంతో బీజేపీ అటో ఇటో తేల్చుకోలేకపోతున్నదనీ, రాష్ట్ర రాజకీయాల గురించి ఆ పార్టీకి పెద్దగా పట్టింపు లేదనీ, జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికలలో  ఏపీ నుంచి చెప్పుకోదగ్గ ఎంపీ స్థానాల మద్దతు కోసమే ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరి వైపు నిలవాలి అన్నది తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ పార్టీ ఎటు వైపు ఉన్నా అసెంబ్లీ ఎన్నికలలో అది చూపే ప్రభావం దాదాపు శూన్యమనే అంటున్నారు. ఇక మిగిలినది తెలుగుదేశం, జనసేన పార్టీలు. పొత్తుల విషయంలో ఆ రెండు పార్టీలూ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయంటున్నారు. తెలుగుదేశంపై ఒత్తిడి పెంచేందుకు జనసేన, జనసేనపై ఒత్తిడి పెంచాలని తెలుగుదేశం భావిస్తున్నాయన్ని పరిశీలకుల విశ్లేషణ. జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దిగితే జరిగేదేమిటన్నది విస్పష్టంగా తెలుసు. తనకున్న సినీ గ్లామర్ ఓటుగా మారుతుందన్న విశ్వాసం లేదని ఆయనే పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు కేడర్ కు చెప్పేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను కీలక పాత్ర పోషిస్తానని కూడా విస్పష్టంగా చెప్పారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్న జనసేన అసెంబ్లీలో చెప్పుకోదగ్గ స్థానాలను తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే తెలుగుదేశంలో పొత్తులో భాగంగా ఆ పార్టీ ప్రతిపాదిస్తున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకోవడానికి పొత్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ కొండకచో గత తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అదే సమయంలో మరో వైపు తెలుగుదేశం కూడా పొత్తుల విషయంలో తొందరపాటు లేకుండా వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది.   జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్  జనసేన పోటీ చేసే సీట్ల ఎన్ని, ఏవి అన్న విషయంలో త్వరలో వెల్లడిస్తామని ప్రకటించి ఒత్తిడిని మరింత పెంచే ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం నుంచి మాత్రం నాదెండ్ల ప్రకటనపై  ఎటువంటి స్పందనా రాలేదు. అలాగే జనసేనాని స్వయంతో తెనాలి నుంచి నాదెండ్ల పోటీ చేస్తారని ప్రకటించడం ద్వారా కీలక సీటు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పొత్తుల మీద ప్రభావం చేపుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   మరో వైపు  తెలుగుదేశం అయితే  పొత్తులు ఉంటే మంచిదే.. లేకపోయినా మంచిదో అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. పొత్తల పేరు చెప్పి పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు. గత నాలుగేళ్లకు పైగా ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కేసులు, దాడులూ ఎదుర్కొంటూ పోరాడుతున్న తమ పక్షానే ప్రజలు ఉన్నారన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నది.  మొత్తం మీద రానున్న రోజులలో పొత్తుల విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

జెపి రూట్ మారిందా..?

లోకసత్తా జయప్రకాష్ నారాయణ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారా..? ఈ ప్రశ్నకు సమాధానంగా దాదాపు అవుననే వినవస్తుంది. దీనికి కారణం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ కార్యక్రమంలో జగన్, జేపీ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడమే. జేపీకి రాజకీయ ఆసక్తి ఉంది. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి మల్కాజిగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు పార్లమెంట్ కు వెళ్లాలన్న ఆసక్తి ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సిపీ అధినేత జగన్ తో  ఆయన ముసి ముసి నవ్వులు.. ముచ్చట్లు.. కొత్త ఊహాగానాలు దారి తీస్తున్నాయి. లోక్ సత్తాను  ప్రజలను చైతన్యవంతం చేసే సంస్థగా ప్రారంభించి.. ప్రభంజనాన్ని సృష్టించి.. తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు జయప్రకాష్ నారాయణ. 2009 ఎన్నికల్లో ఆయన పార్టీ రెండు శాతం ఓట్లు సాధించింది. కూకట్ పల్లి  నుంచి పోటీ చేసి పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఆయన ఒక్కరు మాత్రం గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు. అప్పట్నుంచీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్న జేపీ ఇటీవల వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్లమెంట్ కు వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. లోక్ సత్తా పార్టీని మళ్లీ పునరుద్ధరించి ఆ పార్టీ తరపునపోటీ చేస్తారా లేకపోతే వేరే ఇతర పార్టీలో చేరుతారా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. నిజానికి లోక్ సత్తను రద్దు చేసినట్లుగా జేపీ ప్రకటిచారు కానీ.. ఆ పార్టీ మాజీ నేతలు విడిగా లోక్ సత్తా పేరుతో పార్టీని కొనసాగిస్తున్నారు. కానీ పెద్దగా కార్యకలాపాల్లేవు. లోక్ సత్తా జేపీ సోషల్ మీడియాతో పాటు మీడియా చర్చల్లో తరచూ పాల్గొంటూ ఉంటారు. ఇటీవల జగన్ ప్రకటించిన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు.. ఆ వ్యవస్థను జేపీ సమర్థించారు. ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్కాబ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిజానికి ఆప్కాబ్ కు..   జేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో దశాబ్దాల కిందట ఆప్కాబ్ చైర్మన్ గా పని చేశారని ఆయనను పిలిచారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రభుత్వ కార్యక్రమాల్లో అది కూడా జగన్ తో    కలిసి స్టేజ్ పంచుకోవడంతో ఆయన వైసీపీలో చేరికపై చర్చ ప్రారంభమయింది. వైసీపీలో చేరడమా లేకపోతే వైసీపీ మద్దతుతో విజయవాడ లేదా గుంటూరు ఎంపీగా పోటీ చేయడమా అనే డైలమాలో ఉన్నారని అంటున్నారు. రెండు, మూడు రోజుల నుంచి జేపీ, వైసీపీ బంధం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నా అటు వైసీపీ కానీ.. ఇటు జయప్రకాష్ నారాయణ వర్గాలు కానీ స్పందించలేదు. ప్రస్తుతం జయప్రకాష్ నారాయణ లాంటి నేత వస్తే.. వైసీపీ వద్దనే అవకాశం లేదు. చేర్చకుంటారు.. ఎంపీ టిక్కెట్ కూడా ఇస్తారని అంటున్నారు. కానీ జేపీ చేరుతారా అన్నదే కీలకం. ఆయన ఓ మేధావిగా సమాజంలో ఇమేజ్ తెచ్చుకున్నారు. తన పార్టీ కాకపోతే ఆయన తన స్థాయికి తగ్గట్లుగా బీజేపీ వంటి జాతీయ పార్టీలో చేరుతారని అంటున్నారు. కానీ వైసీపీలో ఎందుకు చేరుతారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి..  రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఇరువురూ గుంభనంగా ఉంటున్నారంటే.. ఏదో ఒకటి జరిగినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. అదే గనుక జరిగితే.. జేపీ సొంత ఆదర్శ విలువలు.. సిద్ధాంతాలు.. ఆలోచనలు పక్కన పెట్టి.. వైసీపీ గొంతుకను జేపీ వినిపించాల్సి ఉంటుంది. అలా జయప్రకాశ్ నారాయణ చేస్తారా.. ?

అంతా అయ్యాక తీరిగ్గా సీఎం జగన్ ..!

ఈ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిసి అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని స్థాయిలో కురిసిన ఈ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. ఏపీలో అన్ని జిల్లాలలో ఈ వర్షాలు, వరదల ప్రభావం లేకపోగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో మాత్రం ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలనువరదలు ముంచెత్తాయి. ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాలలో బిక్కుబిక్కు మంటూ గడిపారు. అధికారులే వారికి తోచిన సాయం అందించగా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదన్న విమర్శలు  భారీగా వినిపించాయి. అందుకే ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ వరద ప్రాంతాలలో పర్యటించారు. సీఎం జగన్ సోమవారం ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోల‌వ‌రం ప్రాంతంలో ఉన్న కూన‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల వర్షాల కార‌ణంగా వ‌ర‌దతో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఇక్కడ జ‌గ‌న్ మాట్లాడుతూ.. బాధితుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాలా ముందుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే అధికారులు క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌ర్య‌టిస్తున్నార‌ని.. అక్క‌డే ఉంటున్నార‌ని చెప్పారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను సందర్శించనున్నారు. మొత్తం రెండు రోజులు సీఎం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నట్లు రెండు రోజుల క్రితమే సీఎంఓ ప్రకటించింది. అయితే, ప్రజలు ఇబ్బందులలో ఉండగా కనీసం అటు కన్నెత్తి కూడా చూడకుండా, ఇప్పుడు వరదలు తగ్గి అంతా అయిపోయాక సీఎం పర్యటనకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సీఎం అనే సంగతి మర్చిపోయి ఒక ప్రతిపక్ష నేత మాదిరి వరద బాధితుల పరామర్శకు వెళ్లినట్లుగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో వరదలు, తుఫాన్ల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎలా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి ప్రజలకు అండగా నిలిచారో గుర్తు చేసుకుంటున్న ప్రజలు.. ఇప్పుడు వరదలు అయ్యాక వెళ్లి పరామర్శించి హామీలు ఇస్తున్న సీఎం జగన్  తీరును విమర్శిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్రల ప్రభావం ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై కనిపిస్తున్నదని.. అందుకే సీఎంగా బాధితులకు అండగా ఉండాల్సిన జగన్.. ఇలా సర్వం కోల్పోయాక ఓదార్చి అండగా ఉంటానని హామీలు ఇస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, జగన్ ఈ పర్యటన విషయానికి వస్తే సోమ, మంగళవారం రెండు రోజుల పర్యటన అని సీఎంఓ పేర్కొంది. కానీ, ఇది కనీసం ఒక్క రోజు కూడా లేదు. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ పర్యటన మంగళవారం ఉదయం ముగుస్తుంది. మంగళవారం మధ్యాహ్నానికి సీఎం తిరిగి తాడేపల్లి ఇంటికి కూడా చేరుకోనున్నారు. దాదాపుగా సీఎంగా జగన్ పర్యటనలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఉదయం తాడేపల్లిలో బయలుదేరితే మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునేలా ఉంటుంది. లేదా రెండు రోజుల పర్యటన అంటే ఇలా ఒకరోజు మధ్యాహ్నం మొదలై మరుసటి రోజు ఉదయానికి ముగుస్తుంది. ఒక రాత్రి, ఒక పూట జరిగే ఈ పర్యటనను రెండు రోజుల పర్యటన అని చెప్పుకుంటారు.  కాగా, ఈ మూడు జిల్లాల పర్యటనను చూసిన బాధితులకు ముందే విషయం చెప్పి ప్రిపేర్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. బాధితులలో మన పార్టీ సానుభూతిపరులను ఎంచుకొని వారికి ముందే సలహాలు, సూచనలు ఇచ్చి ఈ ఓదార్పు పర్యటనలను సాగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నది వైసీపీ పెద్దలకు కూడా తెలుసు. అందుకే అది బయటపడకుండా ఇలా తమ పార్టీ సానుభూతిపరులను ఎంచుకొని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. నిజానికి జగన్ గతంలో దీక్షలు, ఓదార్పు యాత్ర, పాదయాత్రలలో కూడా ఇలాగే చేసేవారు. ప్రతిదీ ముందే ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ పెట్టుకొని ముందుకెళ్ళేవారు. ఇప్పుడు సీఎంగా కూడా ఆ పద్ధతి వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

బాబు చంద్ర నిప్పులు..ఇక సమరమే!

నిదానమే ప్రధానం అనే చంద్రబాబు దూకుడు పెంచారు. శాంతం శాంతం అనే  పెద్దాయన పులివెందుల నడిబొడ్డున నిలబడి.. ఏయ్ జగన్ ఇది నా అడ్డా అంటూ గర్జించారు. తన కుటుంబంపై, కార్యకర్తలపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినా ఇది సంస్కారం కాదంటూ వైసీపీకి క్లాస్ పీకిన, న్యాయపోరాటం చేద్దాం అంటూ తెలుగుదేశం శ్రేణులను శాంత పరిచిన చంద్రబాబు ఇప్పుడు తెగించాల్సిన సమయం వచ్చింది  తమ్ముళ్లూ అంటూ హుంకరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు.. విలువలు కలిగిన రాజకీయం రావాలని చెబుతూ వచ్చిన చంద్రబాబు, రేపు మాదే అధికారం రాసి పెట్టుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు స్వరం మారింది. గళంలో తీవ్రత పెరిగింది. ఆయన భాషలో మునుపెన్నడూ లేని పదును కనిపిస్తున్నది.  పులివెందుల వెళ్లి మరీ వైసీపీ నేతలకు రీ సౌండ్ వినిపించేలా గద్దించి మాట్లాడారు. రాయలసీమ నడి బొడ్డున సభ పెట్టి వై నాట్ పులివెందుల అంటూ నినదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమలో మొదలైన చంద్రబాబు బిగ్ సౌండ్ ఇప్పుడు ఏపీ మొత్తం వినిపిస్తోంది. చంద్రబాబు దూకుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన నుండే మొదలైంది. పులివెందుల సభలో ఆయన మాట్లాడిన తీరు, పుంగనూరు ఘర్షణలతో ఆయన తెగింపు, నెల్లూరులో ఆయన హెచ్చరికలు.. ఎక్కడ చూసినా గత నాలుగేళ్ళలో  ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతసెత్రుడే అలిగిననాడు అన్నట్లుగా చంద్రబాబు ఆగ్రహం కనిపిస్తోంది. అది రాష్ట్రం అంతటా ప్రతిధ్వనిస్తోంది. నిన్న మొన్నటి వరకూ నేను మా నాన్న అంత మంచోడిని కాదంటూ నారా లోకేష్ మాట్లాడితే.. ఇప్పుడు ఆ లోకేష్ ను మించి చంద్రబాబు అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఒక వైపు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతూ ప్రాజెక్టులకు మీరేం చేశారో చెప్పండి.. ఎక్కడకి రమ్మంటే అక్కడకి వస్తానని బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. ఒక విధంగా చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ యుద్ధం డిక్లేర్ చేశారు. అయితే, చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ప్రజల నుండి వస్తున్న స్పందనే అని పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భవం తరువాత ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర సమయంలో కనిపించిన జనచైతన్యం ఇప్పుడు చంద్రబాబు పర్యటనల్లో కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా చంద్రబాబు రోడ్ షోకు ఊహించని స్థాయిలో జనాలు పోటెత్తారు. దీంతో చంద్రబాబులో  కొత్త ఉత్సాహం ఉరకలేస్తోందంటున్నారు.  అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ శాఖలను అడ్డం పెట్టుకొని ఈ ప్రాజెక్టుల సందర్శనకు బ్రేకులు వేయాలని చూస్తుంటే టీడీపీ కార్యకర్తలు తెగించి పోరాడడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు కూడా శాంత ప్రవచనాలు వల్లిస్తూ వారి ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని నియంత్రించడం సరికాదని  చంద్రబాబు భావిస్తున్నారనీ అందుకే ఆయన స్వరంలో మార్పు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రజలలో  తెలుగుదేశం వైపు మొగ్గు  స్పష్టంగా కనిపిస్తుండడంతో చంద్రబాబు తన వయసును మరచి ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం చంద్రబాబు ఏలూరు జిల్లాలో ఉన్నారు. చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించారు. పట్టిసీమపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ఇచ్చారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలించారు.   

వనమాకు సుప్రీంలో ఊరట!

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంలో ఊరట లభించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడాన్ని రద్దు చేస్తూ ఆయనపై ఆ ఎన్నికలలో ప్రత్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా నిర్ణయిస్తూ తీర్పు వెలువరించింది. కాగా తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వనమా పిటిషన్ ను విచారణకు స్వీకరించి, 15 రోజులలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది. 2018 ఎన్నికలలో తెరాస అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే వనమా సమర్పించిన  ఎన్నికల అఫిడవిట్ లో  తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ జలగం కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇటీవల వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  కాగా కాంగ్రస్ అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి విజయం సాధించిన వనమా ఆ తరువాత కొద్ది రోజులకు బీఆర్ఎస్ (అప్పటికి ఇంకా తెరాసయే)లో చేరిపోయారు. దీంతో ప్రత్యర్థులిద్దరూ ఒకే పార్టీలో చేరిపోయి పరస్పరం వ్యతిరేకించుకుంటున్న పరిస్థితి బీఆర్ఎస్ కు అప్పటి నుంచీ ఒకింత ఇబ్బందికరంగానే మారింది. వచ్చే ఎన్నికలలో సిట్టింగులందరికీ టికెట్లు.. అని ఒక సారి.. కాదు కాదు కొందరికే అని మరోసారి ఇలా తెరాస అధినాయకత్వమే అయోమయంలో ఉన్న సమయంలో ప్రత్యర్థులిద్దరూ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు వెలువడగానే స్థానిక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక విధమైన రిలీఫ్ కనిపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వనమాకు పార్టీ టికెట్ లభిస్తే.. ఆయన విజయానికి ఆయన కుమారుడిపై ఉన్న తీవ్ర ఆరోపణలు అవరోధంగా మారతాయని కొత్తగూడెం బీఆర్ఎస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పుతో వారు ఒక విధంగా రిలీఫ్ చెందారని చెప్పవచ్చు. ఇప్పుడు వనమాకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. 

జగన్ కు మరో ట్రబుల్ సెప్టెంబర్ 1 ముహూర్తం..!

ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం సహజం. అయితే, ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇది రాజకీయ సంకటంగా మారింది. గత నాలుగేళ్ళలో కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం కావడంతో ఇప్పుడు అన్ని వైపుల నుండి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన, కుంటుపడిన అభివృద్ధికి తోడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నెరవేరని హామీలు అన్నీ ప్రభుత్వానికి గుదిబండలా మారాయి. ఒకవైపేమో ముంచుకొస్తున్న ఎన్నికలు.. మరోవైపు సూటిగా ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలకు తోడు ఇప్పుడు నెరవేరని హామీల తాలూకు బాధితులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రభుత్వ వైఫల్యాలన్నిటీనీ ప్రజల మధ్య చర్చకు పెట్టారు.  మరోవైపు  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని ప్రజల కళ్ళకు కనిపించేలా చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కక్ష్ పూరిత వైఖరి, అసమర్ధ పాలనను ఎండగడుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చేతులెత్తేసిన జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు మరో ట్రబుల్ మొదలు కానుంది. అదే ఉద్యోగ సంఘాల సీపీఎస్ రద్దు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ స్కీం తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. వారం కాదు నాలుగేళ్లు అయినా ఆ హామీ నెరవేరనేలేదు. సీపీఎస్ బదులు జీపీఎస్ అని మరో పథకాన్ని తీసుకొచ్చి మసి పూసి మారేడు కాయ చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నించింది. కానీ, అందుకు ఉద్యోగులు అసలు ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనా ఓల్డ్ పెన్షన్ స్కీం మాత్రమే అమలు చేయాలనీ, జగన్ మైకులలో ఊదరగొట్టిన హామీ అమలు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబట్టి ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి గళం విప్పేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.  సెప్టెంబరు ఒకటిన చలో విజయవాడకు పిలుపునిస్తూ ఉద్యోగ సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. సీపీఎస్ రద్దుతో పాటు, సీపీఎస్ ఉద్యోగులపై గతంలో పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చని నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు ఈ మేరకు ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు.. జీపీఎస్ వద్దు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ముద్దు అంటూ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు సమరానికి సిద్ధమవుతున్నాయి. వైనాట్ ఓపీఎస్ అంటూ రోడ్డెక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలోనూ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎలాగైనా నిరోధించాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ, ఉద్యోగుల ముందు ప్రభుత్వం పప్పులు ఉడకలేదు. గతంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా వేలాది మంది ఉద్యోగులు వివిధ మార్గాల్లో విజయవాడకు చేరుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ నిరసన గళాన్ని మరింత బలంగా వినిపించారు. ప్రభుత్వం అడ్డుకున్నా బెజవాడ రోడ్లు ఉద్యోగులతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన చేపట్టిన చలో విజయవాడ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ట్రబుల్ గా మారింది. మరోవైపు ఒక్కసారి ఉద్యోగ సంఘాలు బయటకి వస్తే.. గత ఎన్నికలలో ఇచ్చిన మిగతా హామీల బాధితులు కూడా బయటకి రావడం గ్యారంటీ. ఇప్పటికే ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ పెండింగ్ బిల్లుల విషయంలో హాస్పటిల్స్, కాలేజీల యాజమాన్యాలు గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైతే.. అది అన్ని వర్గాలలో వ్యక్తమవడం ఖాయం. మరి ఇలాంటి పరిస్థితులను వైసీపీ సర్కార్   ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.