లోకేష్ ప్రకాశం
posted on Aug 2, 2023 @ 2:35PM
ప్రాంతమేదైనా.. ఊరు ఏదైనా.. మండుటెండ వచ్చినా, జోరు వాన వచ్చినా.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టి పాదయాత్ర సుడిగాలిలా ముందుకు దూసుకుపోతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 17 రోజుల పాటు.. 220 కిలోమీటర్ల మేర అన్ని నియోజకవర్గాల మీదగా సాగిన యువనేత పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లోకేశ్ సభ పెట్టినా ప్రజలు పోటెత్తుతున్నారు. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే అద్దంకిలో లోకేశ్ సభ అదిరిపోయింది. ఇక దర్శిలో లోకేశ్ సభ దద్దరిల్లిపోయింది. అటు కందుకూరులో సభ అయినా.. ఇటు గిద్దలూరులో సభ అయినా.. జిల్లాలో ఎక్కడ.. ఎప్పుడు సభ పెట్టినా జనం మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
అలాగే అధికార పార్టీ అధ్యక్షుడు సీఎం వైయస్ జగన్పై లోకేశ్ విసురుతోన్న పంచ్లకు, ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల చిట్టాపై నారా లోకేశ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే.. ప్రజల నుంచి వస్తున్న స్పందన.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక వివిధ నియోజకవర్గాల్లో ప్రజలకు లోకేశ్ ఇస్తున్న హామీలతో ప్రజల్లో తెలుగుదేశం నాయకత్వంపై నమ్మకం రెట్టింపు అవుతోంది.
అలాగే తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. రైతులకు నాణ్యమైన విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, ఉచిత కరెంట్, వ్యవసాయ రుణాలు, అదే విధంగా యువతకు విద్యా, ఉపాధి, ఉద్యోగ కల్పన.. తదితర అంశాలపై నేను ఉన్నాను నేను విన్నాను అన్నట్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఉకదంపుడు హామీలు ఇచ్చినట్లుగా కాకుండా.. తాము అధికారంలోకి వస్తే.. తూచ తప్పకుండా అమలు చేసే స్పష్టమైన హామీలను ప్రకటిస్తూ.. నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు.
ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోని.. ఆయన అడుగులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు సీమలోకి దూసుకెళ్తున్నాయి. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన ఈ పాదయాత్ర ద్వారా నారా లోకేశ్ వైయస్ జగన్ మోహనుడి అధికార మదం పీచమణచడానికి.. నవ్యంధ్రలో అమరావతి రాజధానిగా చేసుకొని తెలుగుదుశం ప్రజా రంజక పాలన చేపట్టడానికి రాచబాట వేస్తున్నారని పార్టీ శ్రేణులు సంతోషంగా చెబుతున్నాయి.
2023, జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో లేకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విఘ్నంగా దిగ్విజయంగా కొన... సాగుతోంది. ఈ పాదయాత్రలో తొలుత లోకేశ్కు అటు పోలీసులు, ఇటు అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించినా.. వాటిని ఆయన అధిగమించి.. తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.
అలా ఆయన చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన..సాగి ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాటీ సీమలోని వినుకొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించి.. ముందుకు సాగుతోంది.