స్పీడ్ న్యూస్ 1

ప్రేమ జంటకు శ్మశానంలో వివాహం 1. ఓ ప్రేమ జంటకు స్మశానంలో అతి వైభవంగా వివాహం జరిగిన అరుదైన ఘటన    శిర్డీ సమీపంలోని రహతా గ్రామంలో జరిగింది.  స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పని చేస్తున్న వ్యక్తి కుమార్తె ప్రేమ వివాహాన్ని ఆమె పుట్టి పెరిగిన చోటే చేయాలన్న తలంపుతో  ఆ జంట వివాహం శ్మశానంలో   అంగరంగ వైభవంగా జరిపించారు. ............................................................................................................................................... పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం నిషేధం : యునెస్కో 2. ప్రపంచవ్యాప్తంగా  పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని యూనెస్కో సూచించింది. మనుషుల మధ్య సంబంధాలను  డిజిటల్ టెక్నాలజీతో భర్తీ చేయకూడదని అభిప్రాయపడింది. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వాలు స్కూళ్లల్లో మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల వినియోగంపై నిషేధం విధించాయి. .............................................................................................................................................................. ముత్యాల జలపాత సందర్శనకు వెళ్లి చిక్కుకున్న పర్యాటకులు 3.  ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 84 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న ఉదయం ఈ జలపాతం చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా  భారీ వర్షాలకు వాగు ఉప్పొంగింది. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.  డయల్ 100 ద్వారా పర్యాటకులు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. ....................................................................................................................................................... బీజేపీ నుంచి జిట్టా సస్పెన్సన్ 4. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది.   చాలాకాలంగా బీజేపీలో ఉన్న జిట్టా ఇటీవల   బీజేపీలో   గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ అయ్యాయని, అందుకే పార్టీకి మానసికంగా దూరమయ్యాయనీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్ఠానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ....................................................................................................................................................... జగన్ ఓ కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ : లోకేష్ 5. జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఒంగోలులో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన జగన్ ను కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గా అభివర్ణించారు. దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక నాయకుడు జగనే అంటూ విమర్శించారు. ......................................................................................................................................................... ఏపీలో బాలికలు, మహిళల అదృశ్యం 6. ఆంధ్రప్రదేశ్ లొ  2019- 2021 మధ్య 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్లు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. దీనిపై జనసేనానిని కేంద్రం విడుదల చేసిన గణాంకాలను కాదనగలరా జగన్ అంటూ ట్వీట్ చేశారు. ................................................................................................................................................... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వనమాలే: షర్మిల 7. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో కేసీఆర్ పార్టీలోని ఎమ్మెల్యేలందరూ వనమాలే అంటే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు   తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని  అన్నారు. ......................................................................................................................................................... అవిశ్వాసంతో ఒరిగేదేమీ లేదు: కిషన్ రెడ్డి 8.కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లఅాడిన ఆయన  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేని చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. .................................................................................................................................................. సీఎస్ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్ 9.తెలంగాణ వ్యాప్తంగా వచ్చే  48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్‌ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని  ఆదేశించారు. .......................................................................................................................................................... భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 10. భారీ వర్షాలకు గోదావరి పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం  50.2 అడుగులకు చేరింది  రికార్డు స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో రాత్రి 12 గంటల సమయానికే 350 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదయింది.

అవిశ్వాసంలోనూ ఇందిరమ్మదే రికార్డు!

స్వాతంత్ర భారత రాజకీయాల్లో దివంగత ప్రధాని ఇందిరా గాంధీది ప్రత్యేక స్థానం. ఒకటీ రెండూ కాదు అనేక విషయాల్లో ఆమె చరిత్రను సృష్టించారు.  అవును  ప్రస్తుతం దేశంలో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న అవిశ్వాస తీర్మానం చర్చలోనూ ఇందిరా గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధానిగా ఇందిరా గాంధీ రికార్డుల కెక్కారు. అవును. ఇంత వరకు స్వాతంత్ర భారత చరిత్రలో ప్రతిపక్ష పార్టీలు  27 సార్లు అవిశ్వాసం ప్రవేశ పెడితే, ఒక్క ఇందిరా గాంధీ ప్రభుత్వంమే 15 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కుంది. అదొక రికార్డు అయితే, అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్న అన్ని (15) అన్ని సార్లు ఇందిర ప్రభుత్వమే నెగ్గింది.  అంతే కాదు.దేశంలో ఇంతవరకు   ప్రభుత్వాలు 27 సార్లు అవిశ్వాసం తీర్మానం ఎదుర్కున్నా, కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ప్రభుత్వం కూలి పోయింది, మిగిలిన అన్ని సందర్భాలలోనూ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంది. మొదటిసారి 1979లో మొరార్జీ దేశాయ్.. రెండవసారి  1999లో అటల్ బిహార్ వాజ్‌పేయ్‌లు ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అత్యధికంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధానిగా రికార్డుకెక్కిన ఇందిరా గాంధీ మాత్రం అన్ని సందర్భాలలో సభ విశ్వాసం పొందారు. విజయం సాధించారు. అదలా ఉంటే, స్వాతంత్ర భారత తొలి ప్రధాని జవహర లాల్ నెహ్రూ  ... మొట్టమొదటి సారిగా 1963 (మూడవ లోక్ సభ)లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్నారు. నెగ్గారు. అయితే 1952 లోక్ సభ నిబంధనలలో  అవిశ్వాస తీర్మానం నిబంధనలు పొందు పరిచిన తర్వాత 1963 అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన జేబీ కృపలానీ నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.అంతకు ముందు తొలి రెండు సభల్లో అవిశ్వాసం అవసరం రాలేదు. ప్రతిపక్ష పార్టీలు ఆ ప్రయత్నం  చేయలేదు.   అదలా ఉంటే, కృపలానీ ప్రవేశ పెట్టిన తొలి అవిశ్వాస తీర్మానాన్ని  నెహ్రూ స్వాగతించారు. తీర్మానం పై  నాలుగు రోజుల పాటు, 21 గంటలకు పైగా జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు, చరిత్ర పుటల్లో నిలిచి పోయాయి.  అవిశ్వాస తీర్మానం లక్ష్యం, అధికారంలో ఉన్న పార్టీ గద్దె దింపి,తాము అధికారంలోకి రావడం, అయితే. ప్రస్తుత తీర్మానం లక్ష్యం అది కాదు... అటువంటి అంచనాలు కానీ, ఆశలు కానీ లేవు. అయినా, చర్చ ఆసక్తి దాయకంగా, ప్రయోజనకరంగా సాగింది. అందులో అవాస్తవాలున్నా, నేను వ్యక్తిగతంగా చర్చను స్వాగతిస్తున్నాను. అంతే కాదు, మనం అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెట్టుకోవడం మంచిదని భావిస్తున్నాను అంటూ చరిత్రలో నిలిచి పోయే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఆ తర్వాత 1964లో లాలబహదూర్ శాస్త్రి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కుంది. ఇక అక్కడి నుంచి 1964 – 1975 మధ్యలో 15 మార్లు లోక్ సభలో అవిశ్వాస తీర్మానాలపై  చర్చ జరిగింది.  అందులో మూడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన తీర్మానాలు అయితే, మిగిలిన 12 ఇందిరా గాంధీ ఖాతాలో చేరాయి. ఇవిగాక, 1981- 1982 మధ్యలో ఇందిరా గాంధీ మరో మూడు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కున్నారు. దిగ్విజయంగా దాటేశారు. ఆవిధంగా తొలి అవిశ్వాస తీర్మానం ఎదుర్కున్న  నెహ్రూ కోరుకున్న విధంగా, ఆయన కుమార్తె  ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కుని.. నెగ్గారు. చరిత్రను సృష్టించారు.

అవిశ్వాస తీర్మానం ఫలితం తెలిసిందే ... అయినా ఆసక్తి

మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టి, ఐదు రోజులుగా సభా కార్యక్రమాలను స్తంబింప చేసిన విపక్ష కూటమి, ఐఎన్డీఐఎ (ఇండియా), ఆఖరి అస్త్రాన్ని సంధించింది. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు  అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌‌ ఇచ్చిన  నో కాన్ఫిడెన్స్   నోటీసును స్పీకర్ ఆమోదించారు. అన్ని పార్టీలతో చర్చించి అవిశ్వాస తీర్మానం పై చర్చకు తేదీని ఖరారు చేస్తారు. అయితే, పార్టీల సంఖ్యా బలాలను  బట్టి చూస్తే  కాంగ్రెస్ పార్టీ  ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.  లోక్ సభలో ఎన్డీఎకు 332 మంది సభ్యుల బలముంది. ఎన్డీఎ సఖ్యా బలంలో సగం సంఖ్యా బలం అయినా లేని ఐఎన్డీఐఎ కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమనేది అందరికీ తెలిసిన నిజం. మరో వంక 22 మంది సభ్యులున్న వైసీపీ ఇప్పటికే, ఎన్డీఎకు మద్దతు ప్రకటించింది. అందుకే అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమనే విషయం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా, కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కూడా తెలుసు. నిజానికి, ఇండియాగా పిలుచుకుంటున్న విపక్ష ఐఎన్డీఐఎ కూటమిలో 26 పార్టీలు ఉన్నా, కూటమి ఎంపీల సంఖ్య 140 దాటదు. సో ... కాంగ్రెస్ ఎంపీ  గౌరవ్‌ గొగొయ్‌‌ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. ఈ విషయం కాంగ్రెస్ సహా కూటమి నేతలు అందరికీ తెలిసిందే అయినా, అవిశ్వాస తీర్మానం ద్వారా  మణిపూర్ హింసాకాండతో పాటుగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ఉద్దేశంతోనే  కాంగ్రెస్ పార్టీ  అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.  అదలా ఉంటే, కాంగ్రెస్ సభ్యుడు గోగోయ్ నోటీసు ఇచ్చేందే తడవుగా స్పీకర్ ఆమోదం తెలపడంలో మతలబు ఏమిటనే ప్రశ్న ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిస్తోంది. విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఆలోచన చేస్తున్నాయని తెలిసిన వెంటనే, బీజేపీ కోర్  కమిటీ సమావేశమై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే అనుసరించవలసిన వ్యూహం పై క్షుణ్ణంగా చర్చిన్నట్లు తెలుస్తోంది. అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాతనే విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే, ఏమి చేయాలనే విషయంలో ప్రభుత్వం, అధికార కూటమి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, కాంగ్రెస్ సభ్యుడు నోటీసు ఇచ్చిందే తడవుగా స్పీకర్  ఆమోదం తెలిపారని అంటున్నారు.  మణిపుర్  సహా ఈశాన్య భారతంలో పరిస్థితుల పూర్వపరాలను, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన హింసాత్మక సంఘటలను సవివరంగా దేశం ముందుంచడంతో పాటుగా  విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలలో జరుగతున్న పరిణామాలను ఎండగట్టి తద్వారా విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలను ఇరకాటంలోకి నెట్టే వ్యూహంతోనే బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తోందనే విశ్లేషణలు  వినిపిస్తున్నాయి.  మరో వంక విపక్ష కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుందని, తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని యోచిస్తోంది. అందుకే, ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే 2019 ఎన్నికలకు ముందు  2018లో యూపీఏ కూటమి మద్దతుతో ఏపీకి నిధుల విషయంలో టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఎన్డీఎకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో మోదీ ప్రభుత్వం సంఖ్యాబలాన్ని చాటుకుంది.  ఇప్పడు మళ్ళీ మరో మారు ఎన్నికలకు సంవత్సరం ముందు మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడం యాదృచ్చికమే అయినా  ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ముఖ్యంగా, అవిశ్వాస తీర్మానం పై చర్చలో ఎవరిది పైచేయి అవుతుంది అనేది మరింత ఆసక్తి రేకిస్తోంది. అలాగే విపక్ష కూటమికి ఇది మరో పరీక్ష కానుందనే అభిప్రాయం కుడా రాజకీయ వరగాల్లో వినవస్తోంది. మరో వంక   ఇదే అంశంపై విపక్ష కూటమిలో లేని బీఆర్ఎస్  ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు. అంతే కాదు, కాంగ్రెస్ తీర్మానానికి తమ మద్దతు లేదని కూడా ప్రకటించారు. రాష్ట్రపతి, ఉప రాష్టపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపిన బీఆర్ఎస్  అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ కు దూరంగా ఉన్నట్లు చెప్పుకునేందుకు... ప్రత్యేకంగా నోటీసు ఇచ్చింది అంటున్నారు. ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం అవుట్ కం ఏమిటనేది క్లిస్టర్  క్లియర్’గా అద్దంలో ప్రతిబింబంలా స్పష్టంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, దాన్ని ప్రభుత్వం ఆమోదించి, చర్చకు సై  అనడం దేశంలో రాజకీయ వేడిని, ఆసక్తిని రేకెత్తిస్తోందని  చెప్పవచ్చును.

వివేకా హత్య కేసుతో సజ్జలకేం పని

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటుంది? శిక్ష ఎవరికి పడుతుంది? ఎప్పటికి తీర్పు వస్తుంది? అన్న విషయాలను పక్కన పెడితే.. సీబీఐ దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్.. అందులోని అంశాలు, సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రభుత్వం, పోలీసుల అండతో అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి కర్నాలులో సృష్టించిన అరాచకం వీటన్నిటినీ బట్టి హత్య ఎందుకు జరిగిది? ఎలా జరిగింది? దీని వెనుక ఉన్నది ఎవరు అన్న విషయంలో ప్రజలకు సందేహాలకు అతీతంగా ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని పరిశీలకులు విశ్లేషించి మరీ చెబుతున్నారు. సీబీఐ చార్జిషీట్ తో వెలుగులోకి వచ్చిన అంశాల అనంతరం సీబీఐ మాజీ డైరెక్టర్ రామ్ కుమార్ దర్యాప్తును సమీక్షించాలంటూ అవినాష్ రెడ్డి లేఖ.. వివేకా హత్య వల్ల నష్టపోయినది జగనేనంటూ సజ్జల పెట్టిన ప్రెస్ మీట్ పై దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందంటూ నెటిజన్ లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అన్నిటికీ మించి ఏపీ సీఎం సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగు చూసిన తరువాత వివేకా హత్య కు మోటివ్ ఏమిటన్న విషయంలోనూ సందేహాలకు తావులేకుండా పోయిందని అంటున్నారు.  ఇంతకీ వివేకా హత్య కేసు విషయంలో డాక్టర్ సునీత సీబీఐకు ఏం చెప్పారంటే.. తన తండ్రి హత్య విషయంలోతాను మీడియాతో ఏం మాట్లాడాలన్నా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించాలని వైఎస్ జగన్ సతీమణి భారతి తనకు చెప్పారనీ, అది తనకు కొంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ అంగీకరించాననీ, సజ్జల ప్రెస్ మీట్ లో జగన్ తో పాటు అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించాలని సలహా ఇవ్వడంతో తనకు అనుమానం వచ్చిందనీ సునీత పేర్కొన్నారు.  సునీత, సజ్జల స్వయంగా తన ఇంటికి వచ్చి మరీ ఈ విషయం చెప్పారని సునీత పేర్కొన్నారు. ఆ తరువాత సజ్జల  ఈ అంశానికి ముగింపు పడేలా  ప్రెస్‌మీట్ పెట్టాలని దాని తరువాత ఈ అంశంపై మరింత చర్చ జరగే అవకాశం ఉండకూదని సూచించారని సునీత వివరించారు.  2019లో జరిగిన ఈ విషయాలన్నీ సునీత వాంగ్మూలంలో ఉన్నాయి. ఇవి సీబీఐ కోర్టుకు సమర్పించడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చా యి. అలా బయటకు రాగానే జగన్ కోటరీలో కంగారు మొదలైంది. యథా ప్రకారం ప్రభుత్వ సలహాదారు, సకల శాఖల మంత్రి మీడియా ముందుకు వచ్చి.. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కు ఉన్న ఇంగితం కూడా సీబీఐకి లేకుండా పోయిందంటూ.. తన దైన స్టైల్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ వివేకా హత్యకేసును ఎలా దర్యాప్తు చేసి ఉండాల్సిందో చెప్పుకొచ్చేశారు. వైసీపీ అధినేత జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా ఆయన పార్టీ నేతలంతా తెలుగుదేశం అధినేత జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని తరచూ విమర్శలు గుప్పిస్తారు.. అయితే వివేకా హత్య కేసులో దర్యాప్తును అడ్డుకునేలా.. జగన్ అండ్ కో  వ్యవహరించిన తీరు ఆ దర్యాప్తు సంస్థపై ఎంత తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిందో.. అందరూ ప్రత్యక్షంగా  చూశారని పరిశీలకులు సోదాహరణగా విమర్శిస్తున్నారు. కడప జిల్లాలో దర్యాప్తు  అధికారుల కదలికలను సైతం వివేకా హత్య కేసు నిందితులు ప్రభుత్వం, పోలీసుల అండతో ఎలా నియంత్రించారో అందరికీ తెలిసిందే. దీంతో ఏపీలో కేసు దర్యాప్తు  తీరు సరిగ్గా సాగే అవకాశాలు లేవంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించి మరీ తెలంగాణకు మార్పించారు. ఏపీలో దర్యాప్తు ముందుకు సాగదన్న సునీత వాదనను సీబీఐ కూడా సుప్రీంలో సమర్ధించింది. ఇక కేసు తెలంగాణకు మారిన తరువాత దర్యాప్తులో పురోగతి సాధించినప్పటికీ.. దర్యాప్తు అధికారిపై వరుస ఆరోపణలతో హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారి మారడం వెనుక అవినాష్ ప్రభృతుల ఒత్తిడి ఉందన్న వాదన చాలా చాలా బలంగా వినిపించింది. సరే మొత్తం మీద  అవినాష్ రెడ్డి ఇంత వరకూ అరెస్టు కాకుండా ఉండటం వెనుక మేనేజింగ్ స్కిల్స్ పాత్ర ఉందన్నది విశ్లేషకుల మాట. పదే పదే కోర్టులను ఆశ్రయించడం, దర్యాప్తు సంస్థలపైనా, వివేకాహత్య కేసులో బాధితులపైనా పదే పదే ఆరోపణలు చేయడం ద్వారా వ్యవస్థలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా దర్యాప్తును ఏళ్లబడి సాగదీయగలగారని అంటున్నారు.   ఇన్ని చేసినా సీబీఐ చార్జిషీట్ లో విషయాలు బయటకు రావడంతో ఇప్పుడు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రంగంలోకి దిగారు.. నాలుగేళ్ల కిందట తాను భారతికి ఫోన్ చేసిన మాట్లాడిన దాన్ని పట్టుకుని  కొత్త కథ అల్లుతున్నారని చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు.  అంతే కాకుండా వివేకా హత్యకు గురికావడం వల్ల నష్టపోయినది జగనే అని చెప్పడానికి శతధా ప్రయత్నించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో నారాసుర రక్త చరిత్ర అంటూ ఊరూవాడా ఏకం చేసిన సంగతిని విస్మరించి.. ఈ నాలుగేళ్లలో వివేకా హత్యకు కారణాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తదితరులు ఎన్ని అంశాలను తెరమీదకు తెచ్చారో తెలిసిందేననీ, ఇప్పుడు సజ్జల మీడియా ముందుకు వచ్చి.. వివేకా హత్య వల్ల నష్టపోయింది జగనేనంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.   సజ్జల అయినా.. అవినాష్ రెడ్డి అయినా  ఏదైనా చెప్పుకోదలచుకుంటే  కోర్టుకు చెప్పుకోవచ్చు. కానీ కోర్టుల ఎదుట చెప్పుకునే అవకాశాన్ని కాదనుకుని మరీ  మీడియా ముందుకు ఎదుకు వస్తున్నారని న్యాయనిపుణులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇంతా చేసి సునీత వాంగ్మూలం బయటకు వచ్చిన తరువాత సజ్జల గంట సేపు   ప్రెస్ మీట్ లో  చెప్పినదేమిటంటే.. వివేకా గౌరవాన్ని.. పరువు ప్రతిష్టలను కాపాడటానికి తాము ప్రయత్నిస్తున్నామని మాత్రమే. సునీత దంపతులే హంతకులనీ,  వివేకా స్త్రీలోలుడనీ  నిందలేస్తూ  ఇంత కాలం ప్రచారం చేసిందెవరో జనం అప్పుడే మరిచిపోయి ఉంటారని సజ్జల ఎలా భావించారన్న ఆశ్చర్యం అందరిలో వ్యక్తం అవుతోంది.  సామాజిక మాధ్యమంలో అయితే సజ్జల ప్రెస్ మీట్ ప్రసంగంపై ఓ రేంజ్ లో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసులో నిందితులెవరన్నది  ఇప్పుడు రహస్యం కాదనీ, కేవలం కోర్టులు శిక్ష విధించడమే మిగిలిందని నెటిజన్లు అంటున్నారు. 

సిట్టింగులలో సీనియర్లకు నో అసెంబ్లీ టికెట్!.. జగన్ యోచన?

 ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు అందుకు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ   తమ పార్టీలో ఏం జరుగుతున్నది? రానున్న ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆ నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందన్న క్లారిటీ పార్టీ నేతలకు, శ్రేణులకు ఇచ్చేశారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని కూడా కుండబద్దలు కొట్టేశారు. ఎమ్మెల్యేలతో పాటు మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ల విషయంపై కూడా ఫోకస్ పెట్టారు.  గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ  22 మంది ఎంపీలు విజ‌యం  సాధించగా, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రెబల్ గా మారారు. ఇక వైసీపీకి ఇప్పుడున్న 21 మందిలో నలుగురు ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎంపీగా పోటీ చేయ‌లేమ‌ని, అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా అధిష్టానానికి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. వారిలో అనకాపల్లి ఎంపీ బీశెట్టి స‌త్య‌వ‌తి, అరకు ఎంపీ గొట్టేటి మాధ‌వి, విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. దీనికి వైసీపీ నుండి ఎలాంటి స్పందనా రాకపోవడంతో  వారు చాలా కాలంగా ఈ నలుగురు పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నాలుగు స్థానాలలో వైసీపీ కొత్త వారి  కోసం వేట మొదలు పెట్టింది. మరో నలుగురు ఎంపీలను   ఈసారి అసెంబ్లీకి పంపాలని  జగన్ స్వయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అలాంటి వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఉన్నారు. మొత్తంగా ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు వైసీపీ కొత్త అభ్యర్థులను దించాల్సి ఉండగా.. మరో ముగ్గురు ఎంపీలు వారి మూడు స్థానాలలో ఓటమి చూడడం ఖరారని నివేదికలు రావడంతో వారిని కూడా మార్చాలని జగన్ భావిస్తున్నారు.  అంటే మొత్తంగా 21 మందిలో పది మంది పాత వారికి మాత్రమే ఎంపీ టికెట్లు ఇవ్వనుండగా 11 మంది   స్థానాలలో కొత్త వారిని దించనున్నారు.  కాగా, ఈసారి వైసీపీ సీనియర్ నేతలను పార్లమెంట్ కు బరిలో దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్రాలో విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లి లేదా విశాఖ నుంచి అవంతి శ్రీనివాసరావు, కాకినాడ లోక్ సభ స్థానం నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఏలూరు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, నెల్లూరు నుంచి  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లను లోక్ సభ కు పంపాలని జగన్ భావిస్తున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇప్పటికే ఆయా నాయకులకు  పార్టీ నుండి ఆదేశాలు కూడా వెళ్లాయంటున్నారు.  కాగా, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్ నుంచి, హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ని కర్నూల్ జిల్లాలో ఆయన సామాజికవర్గం అధికంగా ఉన్న సీటు నుంచి ఎమ్మెల్యేగా, విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని ఎచ్చర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు కసరత్తులు మొదలు పెట్టగా.. ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని ఆలోచన చేస్తున్న మిగతా ఎంపీల అసంతృప్తిని ఎలా చల్లార్చాలా అని మల్లగుల్లాలు పడుతున్నారంటున్నారు. జగన్ నిర్ణయం రుచించని వారు రెబల్స్ గా మారుతారన్న ఆందోళన కూడా పార్టీలో వ్యక్తమౌతోందంటున్నారు. 

రాములమ్మ బిజెపికి గుడ్ బై?

బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను పార్టీని వీడేది లేదని  గతంలో స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలపై  ఆమె స్పందిస్తున్నారు.  బిజెపి ప్రభుత్వాన్ని  ఇరకాటంలో పెట్టే ట్వీట్స్ఈ మధ్య కాలంలో ఎక్కువగా  చేస్తున్నారు. కానీ విజయశాంతి  బీజేపీలోనే ఉంటానని చెబుతున్నారు. తాజాగా మణిపూర్ హింసపై విజయశాంతి స్పందించారు. విజయ శాంతి పెట్టే ట్వీట్ మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ప్రతి పక్ష కూటమి ఇండియా లోక సభలో అవిశ్వాస తీర్మానం పెట్టే నేపథ్యంలో విజయశాంతి ట్వీట్ కలకలం రేపింది. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సోషల్ మీడియా  విజయశాంతి ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాములమ్మకు చాలా రోజుల తర్వాత మణిపూర్ అంశం గుర్తుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మణిపూర్ అంశంపై సోషల్ మీడియాలో స్పందించారు. మణిపూర్‌లో చాలా రోజులుగా ఘోరాలు జరుగుతున్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందించలేదు అని విజయశాంతి బాహాటంగానే  స్పందించారు. దీంతో ఆమె ఆ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశ్యం తన అసంతృప్తి అని వేరే చెప్పనక్కర్లేదు.  బీజేపీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం  చేస్తున్నాయి.  ఇటీవల బీజేపీలో రాములమ్మ మాటే వినిపించడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి పదవులు వస్తున్నాయి. అయినా రాములమ్మకు ఓ పదవి ఇద్దామని అధిష్టానం కూడా అనుకోవడం లేదు. సమావేశాలకూ పిలవడం లేదు. దీంతో అసంతృప్తికి గురవుతున్నారు. ఇటీవల కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పటికీ అక్కడ ఎక్కువ సమయం వెచ్చించలేదు. వెంటనే వచ్చేశారు. ఎందుకంటేఅక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడన్నసాకు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేతే అన్న విషయం ఆమె మర్చిపోయారు.  సొంత పార్టీ నేతలు విస్మయానికి గురయ్యేలా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేటప్పుడు ఆమె కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిలో ఉండేవారు. బీజేపీలో చేరాక అసలు ఆమె పదవి ఏంటో ఎవరికీ తెలియడం లేదు. సినీ గ్లామర్ తప్పితే పొలిటికల్ గ్లామర్ విజయశాంతికి లేదనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బిజెపి టిక్కెట్ ఆమెకు దొరకడంం కష్టమే.   

స్పీడ్ న్యూస్ 3

రాజీనామా ప్రశక్తే లేదు: మణిపూర్ సీఎం 26.మణిపూర్  హింసాకాండ, మహిళల నగ్న ఊరేగింపు ఘటన నేపథ్యంలో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్   రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్   వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యకర్తనని, తాను రాజీనామా చేసే సమస్యే లేదన్నారు. .............................................................................................................................................................. పార్లమెంటును స్తంభింపచేయడం సరికాదు: విజయసాయి 27. పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైసీపీ సమర్థించదని ఆ పార్టీ ఎంపీ విజయసాయి అన్నారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చెప్పిన తరువాత కూడా విపక్షాలు సభాకార్యక్రమాలను  అడ్డుకోవడంలో అర్ధం లేదని అన్నారు. .......................................................................................................................................................... బీఆర్ఎస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ 28. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై  విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. అలాగే బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు వేరుగా మరో నోటీసు ఇచ్చారు.   మణిపూర్  హింసాకాండపై సభలో మోడీ ప్రకటనకు విపక్షాలు పట్టుబడుతున్న సంగతి విదితమే. ........................................................................................................................................................... తల్లి సంరక్షణ విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్తిపై హక్కులు ఉండవు 29. తల్లి సంక్షరణ గురించి విస్మరించిన కూతురికి ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తల్లి ఆలనాపాలనా చూసుకోని ఓ కూతురి ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ   రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది.   ..................................................................................................................................................... ప్రతి నెలా ఇండియా సమావేశాలు 30.  ప్రతిపక్ష కూటమి ఇండియా  ఇక నుంచి  ప్రతి నెలా ఒక రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ఇండియా మూడో సమావేశం వచ్చే నెల రెండో వారంలో ముంబైలో జరగనుంది.   ........................................................................................................................................................ కుప్పంలో గెలిపిస్తే భరత్ ను సీఎం చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి 31. ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి భరత్ ను గెలిపిస్తే భరత్   ముఖ్యమంత్రిని అవుతారన్నారు.   ఆ వెంటనే పొరపాటు సవరించుకుని భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పారని అన్నారు. ...................................................................................................................................................... హనుమాన్ జంక్షన్ బస్టాండ్ జలమయం 32.ఎ డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమాన్‌ జంక్షన్‌ బస్టాండ్‌ జలమయమైంది. భారీగా నీరు చేరడంతో బస్టాండ్ లో నిలుచునేందుకు కూడా అవకాశం లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.   .............................................................................................................................................................. రోడ్డుపై గుంతలలో వరినాట్లతో నిరసన 33.చిత్తూరు జిల్లా కుప్పం బైపాస్ మార్గం రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో బుధవారం తెదేపా నాయకులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. నాలుగేళ్ల వైకాపా  హయాంలో కుప్పం అభివృద్ధి శూన్యమని వారు ఆరోపించారు. ........................................................................................................................................................... ఆర్వింద్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణుల ఆందోళన 34.  ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  అర్వింద్‌ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ బీజేపీ  రాష్ట్ర కార్యాలయం వద్ద  నిజామాబాద్‌ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు.  ...................................................................................................................................................... జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు: ప్రత్తిపాటి పుల్లారావు 35. తెలుగుదేశం నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎమ్మెల్యే బొల్లా ప్రోద్బలంతోనే ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా దోపిడీపై ప్రశ్నిస్తే కేసు పెట్టడం దుర్మార్గమన్నారు.   ............................................................................................................................................................. సీమకు జగన్ తీరని ద్రోహం: చంద్రబాబు 36. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంతో పోరాడి తెలుగుగంగ సాధించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని గుర్తుచేశారు. నదుల అనుసంధానంతో తి ఎకరాకు నీరు ఇవ్వవచ్చని వివరించారు.   ........................................................................................................................................................... వి. కొత్తకోటలో సచివాలయాని తాళం 37. అనంతపురం జిల్లా  వి.కొత్తకోటలో   బీసీ కాలనీ వాసులు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. రోడ్లపై నిలిచిన నీటిలో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రహదారులు, మురుగు కాల్వలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.  ............................................................................................................................................................... కేంద్రం నిధుల దారిమళ్లిస్తున్నారు: పురంధేశ్వరి 38. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. పంచాయతీలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.  ............................................................................................................................................................ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన 39. జీవో నంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు  తెలంగాణ సచివాలయం  ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  .......................................................................................................................................................... రైతుల పొట్ట కొడుతున్న జగన్ సర్కార్ : సోమిరెడ్డి 40.  ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతులకు అందే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను జగన్ సర్కార్ నిలిపివేసిందన్నారు. ............................................................................................................................................................ అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదం 41. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామని వెల్లడించారు.   .......................................................................................................................................................... కొత్తగూడెం ఎమ్మెల్యేగా గుర్తించండి: జలగం 42.  కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు శాసనసభ కార్యదర్శిని కలిశారు. వనమా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పు ప్రతులను ఆయన ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.  ............................................................................................................................................................... రైతు వద్దకు బీజేపీ: కిషన్ రెడ్డి 43.  రైతు వద్దకు బీజేపీ కార్యక్రమాన్ని రేపటి  నుంచి చేపట్టనున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామని  2.8 కోట్ల దుకాణాలను కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని వివరించారు.  ............................................................................................................................................................... అలా బండి నడిపితే 20 వేలు జరిమానా 44. ఏపీలో ఇకపై చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకుని  వాహనం నడిపితే  భారీ జరిమానా తప్పదు. వచ్చే నెల 1 నుంచి ఏపీలో హెడ్ ఫోన్స్ తగిలించుకుని వాహనం నడిపితే 20 వేల రూపాయలు జరిమానా విధిస్తారు.   ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ....................................................................................................................................................... విపక్షాల వెర్రికి నిదర్శనం: జీవీఎల్ 45.కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడాన్ని విపక్షాల వెర్రికి నిదర్శనంగా బీజేపీ ఎంపీ  జీవీఎల్ అభివర్ణించారు.  సంఖ్యా పరంగా అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని చెప్పారు. బీజేపీ ఎన్డీఏకి 330 పైగా సంఖ్యాబలం ఉందని అన్నారు.   ............................................................................................................................................................ అందుకే అవిశ్వాసం: నామా 46. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోడీ మాట్లాడితేనే దేశ ప్రజలలో శాంతి నెలకొంటుందని, అయితే విపక్షాలు ఎంతగా డిమాండ్ చేస్తున్నా మోడీ నోరు విప్పడం లేదని బీఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు అన్నారు.  అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని నామా చెప్పారు. ............................................................................................................................................................... వర్షాలు, వరద కష్టాలలో ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం: రేవంత్ 47.వర్షాలు, వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే  వారిని  ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ గానీ ఎలాంటి  చర్యలు తీసుకోవడం లేదన్నారు.   ........................................................................................................................................... ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధం: ఎమ్మెల్సీ కవిత 48. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ లో ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. .................................................................................................................................................... క్యాస్ట్ సెన్సెక్స్ అన్న ఒకే ఒక్కడు రాహుల్: వీహెచ్ 49.యావత్ భారతదేశం‌లో  క్యాస్ట్ సెన్సెక్స్ చెస్తానని  చెప్పిన ఘనత రాహుల్ కు మాత్రమే దక్కుతుందని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీ మాత్రమే బీసీల గురించి మాట్లాడారని  అన్నారు. ...................................................................................................................................................... జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవలు రద్దు 50. భారీ వర్షాల నేపథ్యంలో  జీహెచ్ఎంసీ ఉద్యోగులకు  సెలవులు రద్దు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప సెలవురు తీసుకోవద్దన్నారు.   భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న  హెచ్చరికలతో సెలవులు రద్దు  చేసినట్లు చెప్పారు.

అవిశ్వాసం వీగేనా? గెలిచేనా?

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభలో 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. 1963లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తొలి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ సభ్యులు ఆదేశిస్తేనే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(3) లోక్‌సభకు మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుందని పేర్కొనడం ద్వారా ఈ నియమాన్ని పొందుపరిచింది. లోక్‌సభ ఎంపీ ఎవరైనా, ఏ సమయంలోనైనా మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు.అనంతరం తీర్మానంపై చర్చ జరుగుతుంది. మోషన్‌కు మద్దతు ఇచ్చే ఎంపీలు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతారు.  ట్రెజరీ బెంచ్‌లు వారు లేవనెత్తిన సమస్యలపై స్పందిస్తారు. చివరగా ఒక ఓటు జరుగుతుంది. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్  గెలిచినట్లయితే, ప్రభుత్వం ఉన్న ఫళంగా  దిగిపోవాల్సి వస్తుంది.  2018 తర్వాత మోదీ ప్రభుత్వంపై ఇది రెండో అవిశ్వాస తీర్మానం. మణిపూర్ అల్లర్లు  దేశ రాజకీయాలను   ఓ కుదుపు కుదిపేస్తున్నాయి.  మణిపూర్‌లో పిఎం మోడీ మాట్లాడాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించడానికి బిజెపి నిరాకరించడంతో పాటు పార్లమెంటులో రోజుల తరబడి గందరగోళం  నెలకొంది.  బెంగుళూరులో ప్రతి పక్ష కూటమి ఇండియా ఏర్పడిన తర్వాత మొదటి అవిశ్వాస తీర్మానం ఇది. బిజెపి కి బిటీం అని ప్రచారంలో ఉన్న బిఆర్ఎస్  కూడా అవిశ్వా స తీర్మానానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది.బీఆర్ఎస్ తరఫున ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు ఇచ్చారు. ఇందుకోసం ముసాయిదా తీర్మానం కూడా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ అది వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. లోక్ సభలో బలాబలాలు చూస్తే.. ప్రతిపక్ష కూటమికి కేవలం 140 మంది సభ్యుల మద్ధతు మాత్రమే ఉంది. అదే సమయంలో అధికార ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. మిగతా 60 మంది సభ్యులు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం నిలబడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయం ప్రతిపక్ష పార్టీలకూ తెలుసని అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం వెనక వాటి ఉద్దేశం వేరని అంటున్నారు. మణిపూర్ అల్లర్లు, హింసపై చర్చించేందుకే ప్రతిపక్షాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం వస్తుందని, ఆ చర్చలో పలు అంశాలను లేవనెత్తేందుకు తమకు అవకాశం లభిస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు.

స్నేహానికి ప్రతీక ముసారాం బాగ్ బ్రిడ్జి

హైదరాబాద్ లో ఉన్న అతి పురాతన బ్రిడ్జిలలో ముసారాం బ్రిడ్జి ఒకటి. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ బ్రిడ్జి మీద రాకపోకలు ఇంకా కొనసాగుతున్నాయంటే ఆశ్యర్యమే. బ్రిడ్జి మీద రాకపోకలు సాగించకూడదని ఇప్పటికే ఆర్కియాలజీ శాఖ హెచ్చరించింది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న హైదరాబాద్ లోని అతి పురాతనమైనభ ముసారాంబ్రిడ్జి ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది. నిజాంలకు సేవ చేసిన ఫ్రెంచ్ మిలిటరీ కమాండర్ మోన్సియర్ రేమండ్.   ఆయన చనిపోయాక  అస్మాన్ ఘర్ ప్యాలెస్ సమీపంలో  ఖననం చేశారు.  ప్రస్తుతం అక్కడే రేమండ్  సమాధి ఉంది. అతని సేవలను గుర్తించి మూసా-రామ్-బాగ్ ప్రాంతానికి  ఫ్రెంచ్ మిలటరీ కమాండర్  పేరు పెట్టారు. ఇందులో బాగ్  అంటే ఒక ఉద్యానవనం అని అర్థం. ఒకప్పుడు ముసారాంబాగ్ భారీ పచ్చదనంతో నిండి ఉండేది.ముసారాంబాగ్ బ్రిడ్జి 18 వ శతాబ్దంలో నిర్మించారు. ఫ్రెంచ్ మిలటరీ కమాండర్ మోన్సియర్ రేమండ్  18వ శతాబ్దంలో నిజాం రాజుకు అత్యంత సన్నిహిత మిత్రుడు.  రేమండ్ రెండవ అసఫ్ జా నిజాం అలీ ఖాన్‌తో మమేకమయ్యాడు. రేమండ్‌ను రెండో నిజాం ఉన్నతంగా గౌరవించేవాడు.  స్థానిక ప్రజల ప్రేమ , విశ్వాసాన్ని చూరగొన్నాడు రేమండ్.   ముస్లింలు రేమండ్ ను  మూసా రహీమ్ అని, హిందువులు మాత్రం ముసారామ్ అని పిలుచుకునే వారు. ప్రస్తుతం ముసారాంబాగ్ బ్రిడ్జి  ఈ పేరుతోనే పిలవబడుతుంది. భారీ వర్షాలే కారణం ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు భాగ్యనగర వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజా జీవనం స్తంభించింది. ఎక్కడిక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో హైదరాబాదీలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు నగరంలోని మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే బ్రిడ్జికి ఆనుకొని మూసి వరద ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్ నుంచి నీళ్ళు వదలడంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు అంటూ ఇప్పటికే వాతావరణ‌శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం బ్రిడ్జిపై నుండి వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నీటి ప్రవాహం పెరిగితే వాహనాలు రాకపోకలను నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్పీడ్ న్యూస్ 2

కృష్ణాలో పాఠశాలలకు సెలవులు 11. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యాసంస్థలకు ఈ రోజు సెలవుదినంగా ప్రకటించారు. ........................................................................................................................................................ పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్న యువకుడి అరెస్ట్ 12. చిన్నారుల పోర్న్ వీడియా లను  షేర్  చేస్తున్న హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.  అమెరికా దర్యాప్తు సంస్థ  భారత దౌత్య కార్యాలయానికి ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన ఆ యువకుడిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు.   ....................................................................................................................................................... భద్రాచలం వద్ద గోదావరి వరద 12.భారీ వర్షాలతో  భద్రాచలం వద్ద గోదావరి వరద పెరుగుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 39.4 అడుగులుగా ఉండగా, పోలవరం వద్ద ఇది 11.4 మీటర్లుగా ఉంది. ఇక ధవళేశ్వరం వద్ద వరద  ఇన్ ఫ్లో 6.84 లక్షల క్యూసెక్కులుగా ఉందని విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. ............................................................................................................................................................ ఎర్రకాల్వకు పోటెత్తిన వరద 13.  పశ్చిమ ఏజెన్సీ లో  నిన్నటి నుంచీ  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా  ఎర్రకాలువ జలాశయానికి వరద పోటెత్తుతోంది. కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  .................................................................................................................................................... బెజవాడలో విరిగిపడిన కొండ చరియలు 14. విజయవాడ లో  ఒ ఇండిపై కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడినట్లు చెబుతున్నారు. కొండ దిగువన ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ................................................................................................................................................... భారత్ బియ్యం ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలి : ఐఎంఎఫ్ 15. బియ్యం ఎగుమతులపై ఇండియా  విధించిన బ్యాన్ వల్ల గ్లోబల్ ఇన్ ఫ్లేషన్ ముప్పు పొంచి ఉందని   ఐఎంఎఫ్  ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు దేశాల్లో బియ్యం కొరత ఏర్పడిందని పేర్కొంది.  దీంతో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.  ................................................................................................................................................. కార్గిల్ అమరులకు చంద్రబాబు నివాళి 16. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి చరిత్రాత్మక విజయాన్ని అందించిన కార్గిల్ యుద్ధ వీరులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు  శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర జవానులకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ....................................................................................................................................................... బీఆర్ఎస్ విఫ్ 17. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో  పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుకు వ్యతిరేకంగా  ఓటు వేయాలంటూ  బీఆర్ఎస్  తమ పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసింది.   .......................................................................................................................................................... జల్లేరు వాగు ఉధృతి 18.ఏలూరు జిల్లా పట్టెన్నపాలెంలో జల్లేరు ఉధృతి  కారణంగా  సుమారు 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.   మరోవైపు  అల్లూరి సీతారామరాజు జిల్లా భూపతిపాలెం జలాశయం వద్ద కొండచరియలు విరిపడ్డాయి.  ........................................................................................................................................................ కార్గిల్ అమరులకు రాజ్ నాథ్ సింగ్ నివాళి 19.  కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాళులర్పించారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని  ద్రాస్‌లో కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద ఆయన అంజలి ఘటించారు. ......................................................................................................................................................... ఓపెన్ కాస్ట్ లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 20. భారీ వర్షాల కారణంగా  ఇల్లెందు, కోయగూడెం ఓపెన్ కాస్ట్  గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో సైతం నాలుగు ఓపెన్ కాస్ట్  గనుల్లో బొగ్గు ఉత్పత్తి  నిలిచిపోయింది.  ...........................................................................................................................................................  వర్షాల పరిస్థితిపై మంత్రి సత్యవతి రాథొడ్ సమీక్ష 21. ఉమ్మ‌డి వరంగ‌ల్ జిల్లాల్లో  కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం  అప్రమత్తంగా ఉండాలని   మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులు ఆదేశించారు . భారీ వర్షాలతో ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా  ఎదుర్కొనేలా   అధికారులు, సిబ్బంది సమన్వయంతో  పని చేయాలన్నారు. .............................................................................................................................................................. మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద 22. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద  లక్ష్మీ బ్యారేజీకి  ఇన్ ఫ్లో పెరగడంలో  ప్రాజెక్టు 85 గేట్లలో 75 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్లే  కిందకు వదులుతున్నారు. .................................................................................................................................................... ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు: గడ్కరీకి ఓబీసీ అసోసియేషన్ వినతి 23. చట్ట సభల్లో  ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలనిఅఖిల భారత ఓబీసీ అసోసియేషన్ కేంద్ర  మంత్రి నితిన్ గడ్కరీని కోరింది. ఢిల్లీలో  జరిగిన  ఓఅవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గడ్కరీకి అసోసియేషన్ సభ్యులు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ....................................................................................................................................................... అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు మోడీకి ఆహ్వానం 24. అయోధ్య రామమందిరంలో  వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన  కార్యక్రమానికి ప్రధాని మోడీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. 2024 జనవరి 15 నుంచి 24 వరకు అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. .................................................................................................................................................... 1నుంచి నెల రోజులు శ్రీవారి పుష్కరిణి మూత 25. తిరుమలలో వచ్చే నెల 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూతపడనుంది.  శ్రీ‌వారి పుష్క‌రిణిలో నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు పుష్కరిణిని మూసి వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేశస్థానం పేర్కొంది.

జాబితా విడుదలలో కెసీఆర్ కు తొందరెందుకు?

బీఆర్ఎస్ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి కె.  చంద్రశేఖర్ రావు రెండు దశల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా? 60 మందిని జూలై 24న ప్రకటిస్తానని,   మిగిలిన 59 మంది అభ్యర్థులను ఆగస్టు 24న ప్రకటిస్తానని కెసీఆర్ సెలవిచ్చారు. ఆగస్టు 24వ తేదీన ప్రకటించడానికి కెసీఆర్ ఓ లాజిక్ కూడా చెప్పారు రెండు తేదీలు కలిపి తన అదృష్ట సంఖ్య 6ని చెప్పారు. అయితే కెసీఆర్ ఇలా తొందరపడి అభ్యర్థులను ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. దాదాపు 14 మంది మంత్రులు, ఇతర పార్టీల నుంచి మారిన 16 మంది ఎమ్మెల్యేలకు తొలి దశలో టిక్కెట్లు దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తో సహా 31 మందికి తొలి దశలో సీట్లు వస్తాయి అని ప్రచారం జరుగుతోంది.  సర్వే నివేదికలను బట్టి జాబితాను మార్చడానికి పార్టీ అధినేతకు  అవకాశం, సమయం ఉంటుందని బిఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్త ముఖాలను రంగంలోకి దింపాలని కేసీఆర్  ఆలోచిస్తున్నట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల కోసం  డిమాండ్ ఉన్న నేపథ్యంలో వామపక్ష పార్టీలతో ముందస్తు ఎన్నికల పొత్తుకు కేసీఆర్ సిద్దంగా లేరు అని తెలుస్తోంది. గత అనుభవాలను పరిశీలిస్తే ఎన్నికలు  అనగానే కేసీఆర్ కు ఉత్సాహం ఉరకలేస్తుంది.  2019 జూన్‌లో పదవీకాలం ముగియడానికి తొమ్మిది నెలల ముందే అంటే 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసారు. అదే రోజు 105  స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సెప్టెంబర్ 6న ప్రకటించడానికి కారణం లేకపోలేదు. 6 కెసీఆర్ లక్కీ నెంబర్.  అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించే కేసీఆర్ ఈ సారి కూడా తొలి జాబితాను  ప్రకటించడానికి ఉవ్వీళూరుతున్నారు. ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆగస్టు 24లోపు రెండు జాబితాలను ప్రకటిస్తానని ప్రకటించి అన్ని పార్టీలను అబ్బురపరుస్తున్నారు. మెజారిటీ రాజకీయ పార్టీలు సాధారణంగా అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటించకుండా సస్పెన్స్ కొనసాగిస్తాయి.నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాయి.  చివరి క్షణం వరకు ఉత్కంఠ నెలకొనేలా చేస్తాయి. 

స్పీడ్ న్యూస్ 1

బంగాళాఖాతంలో తుపాను 1. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారి నేడు తుపానుగా అవతరించింది.  ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువగా కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండాని  సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతోంది. ............................................................................................................................................................... హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్ 2. హైదరాబాద్‌లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణశాఖ జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ల పరిధిలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.  .................................................................................................................................................... తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వనమా 3. తాను ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాబలంతోనే కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పిన వనమావెంకటేశ్వరరావు తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తానని అన్నారు.  న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. .......................................................................................................................................................... హోంమంత్రి పర్యటన సన్నాహకాలపై కిషన్ రెడ్డి సమావేశం 4. బీజేపీకి చెందిన వివిధ విభాగాల నేతలతో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 29న  అమిత్ షా రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై చర్చ జరిగింది. ........................................................................................................................................................... పాఠశాలలకు సెలవులు 5. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నేడు, రేపు సెలవులు ప్రకటించింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ......................................................................................................................................................... ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంటులో బిల్లు 6.  ఢిల్లీలో అధికారుల పోస్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్ కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను బిల్లుగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. .................................................................................................................................................. సొమ్మసిల్లి పడిపోయిన డీరాజా 7. మణిణిపూర్ పరిస్థితులను అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ చెన్నైలో కేంద్రానికి వ్యతిరేకంగా నిన్నజరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ డి. రాజా సొమ్మసిల్లి పడిపోయారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా స్ఫృహతప్పి పడిపోయారు. ............................................................................................................................................................... నెల్లూరు రూరల్ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా కోటంరెడ్డి 8. తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియమితులయ్యారు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీధర్ రెడ్డిని ఇంఛార్జ్ గా నియమించినట్లు  ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు తెలిపారు.   ................................................................................................................................................ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 23 సీట్లే: విష్ణుకుమార్ రాజు 9. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీకి వచ్చేవి కేవలం 23 సీట్లేనని  బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణుకుమార్ రాజు  అన్నారు. విశాఖపట్నంలో మీడియా మాట్లాడిన ఆయన మరో 8 నెలల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని చెప్పారు. ............................................................................................................................................................... మేం ఇండియా: రాహుల్ 10. విపక్ష కూటమి పేరుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గట్టిగా బదులు ఇచ్చారు.  విపక్ష కూటమిపై మీరెంతగా నిప్పులు చెరిగినా పట్టించుకోం ఎందుకంటే మేం ఇండియా అని ట్వీట్ చేశారు.

వైసీపీకీ కేంద్రం ఝలక్?!

నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ నించోమంటే నించుని, కూర్చోమంటే కూర్చుని రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి మరీ అడుగులకు మడుగులోత్తిన జగన్ సర్కార్ కు సరిగ్గా ఎన్నికల ముందు దిమ్మతిరిగేలా ఝలక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.   ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయిన కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి అవకాశాలు ఇసుమంతైనా లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టేసింది.   సెయిల్ అధ్యయనం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశాలు లేవని తేల్చిందని నిన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు.  అయితే రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాలపై, ఏర్పాటు చేసిన  జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ నివే దిక  ఎప్పటికి వస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన పేర్కొనలేదు.  కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సీమ ప్రజల ఆకాంక్ష, దానిని సాధించి తీరుతామంటూ ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన సీఎం జగన్ ఇక రాయలసీమ వాసులకు ముఖం ఎలా చూపించగలరని విపక్షాలు నిలదీస్తున్నాయి. కడన స్టీల్ ఒక్కటే అని కాదు.. విశాఖ రైల్వే జోన్ ను కూడా అటకెక్కించేసినట్లేనని నిత్యానందరాయ్ సమాధానంతో తేటతెల్లమైపోయింది.  కనీసం ఆంధ్రులు పోరాడి సాధించుకున్న కడప స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోమన్న మాట కూడా ఆయన నోటి వెంట రాలేదు. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానీయబోమని ఇంత కాలం చెబుతూ వచ్చిన సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు, ఎంపీలు, ఎంపీలు కంగుతినేలా  కేంద్రమంత్రి తాజా ప్రకటనలో  ప్రైవేటీకరణ ఉండదన్న మాట కూడా రాలేదు.   గతంలో సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఆయనతో,  బీజేపీ అగ్రనేతలంతా.. విశాఖ రైల్వేజోన్‌ సాధిస్తామని గంభీరమైన ప్రకటనలు చేశారు. సోము వీర్రాజయితే ఒక అడుగు ముందుకేసి.. రైల్వే జోన్‌ రాదని మీకెవరు చెప్పారని మీడియాపై రుసరుసలాడారు. ఎంపి జీవీఎల్‌ కూడా పలు మీడియా సమావేశాల్లో విశాఖ రైల్వే జోన్ పై హామీలు గుప్పించారు.  ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకటనతో జగన్ సర్కార్ కు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇంత కాలం తాము చేసిన గంభీర ప్రకటనలన్నీ డొల్లేనని తేటతెల్లమయ్యేలా పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనతో  ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కాళ్ల కింద నేల కదిలిపోయినట్లైంది. ఇంత కాలం ఊరిస్తూ వచ్చిన బీజేపీ  వైసీపీ ఆయువుపట్టుమీద దెబ్బకొట్టినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం వైసీపీ ఏం చెబుతూ వచ్చిందో.. జగన్  పదే పదే ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యి ఏ డిమాండ్లైతే చేశానని చెబుతూ వచ్చారో అవన్నీ ఉత్తుత్తి మాటలే అని తేటతెల్లమయ్యేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటన ఉండటంతో  రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి నడి సంద్రంలో చుక్కాని లేని నావగా మిగిలిపోయింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటు వేదికగా చేసిన ప్రకటన రాజకీయంగా వైసీపీ ప్రతిష్టను, వ్యక్తిగతంగా జగన్ పరువును నిండా గంగలో ముంచేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గత ఎన్నికల ముందు తమకు ఎంపీ సీట్లు మొత్తం ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్ ఇప్పుడు ఏ ధైర్యంతో మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతారని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇప్పుడిక కేంద్రంపై వైసీపీ యుద్ధ భేరి మోగించినా చేతులు కాలిన తరువాత ఆకులుపట్టుకున్న చందమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ తో అంటకాగింది జగన్ స్వప్రయోజనాల పరిరక్షణకేనని జనానికి పూర్తిగా అర్థమయ్యిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. 

కర్ణాటకలో ఆట మొదలైంది!

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా వందరోజులు  కూడా కాలేదు  ఇంతలోనే బీజేపీ  ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించింది. గతంలో  కర్ణాటక సహా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చి, గద్దె నెక్కిన కమల దళం, ఇప్పడు కర్ణాటకలో మళ్ళీ అదే కథను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. అవును ఇది ఎవరో, ఏ అనామక నాయకుడో చేసిన చిల్లర ఆరోపణ కాదు. బీజేపీని బద్నాం చేసేందుకు నాడు   రాజకీయ విశ్లేషకులు చేసిన రాజకీయ వ్యాఖ్యానం కాదు. స్వయంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని కూడా డీకే మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఒక్క డీకేనే కాదు. మరో మంత్రి కృష్ణ బైరెగౌడ కూడా మరింత స్పష్టంగా బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.అదే సమయంలో,పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లా ఇంచార్జి మంత్రులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసినట్లు చెపుతున్న నకలీ  లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీకే ఆరోపణలకు బలం చేకూరిందని అంటున్నారు.  అదే సమయంలో  కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య ఆది నుంచి ఉన్న విభేదాలు అడ్డు పెట్టుకుని, బీజేపీ కాంగ్రెస్ వేలితోనే కాంగ్రెస్  కంట్లో పొడిచే వ్యూహాలకు పదును పెడుతోందని అంటున్నారు.   నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం బీజేపీ అగ్ర నాయకత్వానికి తల వొంపులు తెచ్చింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని, సర్వం తానై విస్తృతంగా ప్రచారం చేసినా, అమిత్ షా నాయకత్వంలో కేంద్ర నాయకత్వం మొత్తానికి మొత్తంగా కర్ణాటకలో తిష్ట వేసి చక్రం తిప్పినా బీజేపీ ఓటమి పాలు కావడం కమల దళానికి మింగుడు పడలేదు. అందుకే, ఆలస్యం చేయకుండా అర్జెంటుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నాయకత్వం సిద్దమైందనే అనుమానాలు సర్వత్రా వ్యక్త మవుతున్నాయి.  ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రభుత్వం  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన ఐదు గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేయడంతో కమల దళంలో గుబులు మొదలైంది.  ఐదు గ్యారెంటీల విషయంలో సిద్దూ సర్కార్ సక్సెస్ అయితే  ఆ ప్రభావం మరో నాలుగైదు నెలలలో జరగనున్న తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల పైనా ఉంటుందని అలాగే ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే సంవత్సరం జరగనున్నసార్వత్రిక ఎన్నికల పైనా ఉంటుందని భయపడుతోంది. అందుకే కమల దళం మొగ్గలోనే కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు తొందర పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ సిద్ధరామయ్య  కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికోసం విదేశంలో పథకం రచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమ ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని వెల్లడించారు. అయితే, బీజేపీ పేరు  ఎత్తకుండా  ఈ కుట్ర చేసేది ఎవరో తమకు తెలుసునని డీకే పరోక్షంగా, కమలం పార్టీని వేలెత్తి చూపించారు. బెంగళూరులో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తే తమ ప్రభుత్వానికి తెలుస్తుందని.. కుట్రకు సింగపూర్‌ ను వేదిక చేశారన్న డీకే.. దానికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని  పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన సమయంలోనే డీకే శివకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుతం ఇలాంటి  కుట్రలకు భయడదని డీకే ధీమా వ్యక్తం చేశారు. ఒక  విధంగా చేతనైతే, సిద్దు సర్కార్ ను కూల్చాలని కమల దళానికి సవాలు విసిరారు.  అలాగే రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర బీజేపీకి ఉందని ఆరోపించారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. బీజేపీ కుట్రలను వమ్ము చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజల చేత రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అన్న ఆయన అందుకే, గతంలో లాగ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాకుండా ముందు నుంచే జాగ్రత్త అవసరమన్నారు.  అయితే, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అంతర్గత సంక్షోభం ఏర్పడితే తప్ప సిద్దరామయ్య ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పులేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ జోష్ కు బ్రేక్ !

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  విజయం తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపింది.  జోష్’ పెంచింది.  అదే సమయంలో గత ఐదారు నెలలుగా, తెలంగాణ రాజకీయాల్లో కీలకం గా మారిన, బీఆర్ఎస్ బహిష్కృత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అటూ ఇటూ ఊగి చివరకు కాంగ్రెస్  తీర్ధం పుచ్చుకోవడంతో ఆ జోష్ మరికొంత పెరిగింది. అలాగే పొంగులేటితో పాటుగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఇంకా కాంగ్రెస్  తీర్ధం పుచ్చుకోకపోయినా ఆయన పార్టీలో చేరడం కేవలం లాంఛనమే అని తేలిపోయింది. ఆయన పార్టీలో చేరినట్లే వ్యవహరిస్తున్నారు. పార్టీ సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. జూలై 30 కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో  కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం సైతం ఖరారైంది.  కొల్లాపూర్లో జరిగే సభలో జూపల్లి కృష్ణారావు, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని  ఇప్పటికే ప్రకటించారు.  మరో వంక ఖమ్మంలో పొంగులేటి చేరిక సభను మరిపించేలా కొల్లాపూర్ సభను జయప్రదం చేయాలని తద్వారా పార్టీలో తన పట్టును పెంచుకునేందుకు జూపల్లి గట్టి పర్యటనలు చేస్తున్నారు. అయితే  జూపల్లి చేరికను వ్యతిరేకిస్తున్న  పాత కాంగ్రెస్ నాయకులు కొంత గుర్రుగా ఉన్నా, ఆయన తన దారిన తాను ముందుకు సాగుతున్నారు.  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడిన విధంగాన , రాజకీయ వాతావరణం కూడా కొంత చల్లబడినట్లు కనిపిస్తోంది. పొంగులేటి చేరిక నేపధ్యంగా తెరపైకొచ్చిన ఉచిత విద్యుత్  వివాదం విషయంలో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్  ను డిఫెన్సులోకి నెట్టే ప్రయత్నం చేసినా రోడ్లెక్కి ఆందోళనలకు దిగినా  అల్టిమేట్ గా హస్తం పార్టీదే పైచేయి అయింది. అదెలా ఉన్నా ప్రతిరోజూ ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కొనసాగుతూనే ఉంది. గాంధీ భవన్ లో నిత్య కళ్యాణ శోభ పరిఢవిల్లుతోంది.   అయితే  కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏమి జరుగుతోంది అనే విషయం పక్కన పెడితే  ఓ వంక చేరికలతో మంచి ఊపు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు చిన్న షాక్ తగిలింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ పార్టీకి షాకిస్తూ, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ఆయన  స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై కుంభం అనిల్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి, కర్ణాటక గెలుపు, పొంగులేటి, జూపల్లి చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగినా  తెలంగాణలో హస్తం పార్టీ రాజకీయాలకు ఉమ్మడి నల్గొండ జిల్లానే కీలకం. ఈ నేపథ్యంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి  చేయి  వదిలి, కారెక్కడం సంచలనంగా మారిందనే చెప్పాలి. అంతే కాదు  నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో కోమటి రెడ్డి, రెంత్ రెడ్డి జోడీపై పెరుగుతున్న అసంతృప్తికి అనిల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఒక సంకేతంగా భావిస్తున్నారు. కాగా భువనగిరి కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్య వర్గ పోరు సాగిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, నియోజకవర్గంలో తన ఓటమికి రహస్య మంతనాలు చేస్తున్నారని అనిల్ పలుమార్లు ఆరోపించారు.అయితే ఆరోపణలు చేసింది  అనిల్ కుమార్ రెడ్డి అయినా చేయించింది మాత్రం ... కోమటి రెడ్డి అనూహ్యంగా రేవంత్ రెడ్డితో చేతులు కలపడాన్ని జీర్ణం చేసుకోలేని సీనియర్ నాయకులే అని అంటున్నారు. అందుకే  అనిల్ కుమార్ రెడ్డి రెడ్డి బీఆర్ఎస్ లో చేరడాన్ని కేవలం   చేరిక  వ్యవహారంగానే చూడరాదని తెర వెంక కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడుస్తోందని అంటున్నారు.

పవన్‌పై పరువు నష్టం కేసు.. పోటీకి అనర్హుడిని చేయాలనే ప్లాన్?

ఏపీలో అధికార వైసీపీ,  జనసేన  మధ్య యుద్ధం తార స్థాయికి చేరుకుంటుంది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ యుద్దానికి ఆజ్యం పోశాయి. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజల డేటాను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని.. ఆ డేటా ఆధారంగా ఏపీలో మహిళలను ట్రాప్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వాలంటీర్లతో పాటు ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఆరోపణలకు ఇంత వరకూ ప్రభుత్వం నుండి వివరణ అయితే రాలేదు కానీ.. ఇష్టారాజ్యంగా పవన్ వ్యక్తిగత జీవితంపై మాటల దాడి చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే ఏపీ మహిళా కమీషన్ కూడా నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా పరువు నష్టం కేసు వేశారు. అది కూడా క్రిమినల్ డిఫమేషన్ కేసు కావడం విశేషం. ఓ మహిళా వాలంటీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సివిల్ కోర్టులో ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు. పవన్ అనుచిత వ్యాఖ్యల పట్ల తాను మానసిక వేదనకు గురయ్యానని మహిళా వాలంటీర్ పేర్కొన్నారు. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేయగా.. న్యాయమూర్తి కేసును విచారణకు కూడా స్వీకరించారు. నిజానికి ముందుగా ప్రభుత్వమే పవన్ పై పరువు నష్టం కేసు వేయాలని నిర్ణయించింది. వివిధ వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన వార్తల ఆధారంగా వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పవన్ వ్యాఖ్యలపై 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సీసీపీ 199/4 యాక్ట్ కింద కేసు నమోదు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ.. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు కూడా పంపింది. కానీ, ఈ లోగానే ప్రభుత్వ తరపున కాకుండా ఓ మహిళా వాలంటీర్ తో పరువు నష్టం డిఫమేషన్ కేసు నమోదయ్యేలా చేశారు. ఇలా మహిళా వాలంటీర్ తో పిటిషన్ దాఖలు చేయించడం వ్యూహాత్మకమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఆ వ్యూహం ఏంటన్నది తెలియాలంటే ముందుగా మనకి పరువు నష్టం కేసు, డిఫమేషన్ కేసుపై కాస్త అవగాహనా కావాలి. ఇప్పుడు పవన్ పై పెట్టిన కేసు  బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పెట్టిన కేసులాంటిదే. 2019 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈ కేసు దాఖలు చేశారు. ప్రధాని ఇంటి పేరుతో ఉన్న వాళ్లంతా దొంగలే అనే అర్ధం వచ్చేలా చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో  రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష   విధించింది. ఈ కేసులో హైకోర్టు కూడా రాహుల్ కి వ్యతిరేకంగా తీర్పు నివ్వగా ఈ కేసు ప్రస్తుతం సుప్రీమ్ కోర్టు పరిధిలో ఉంది.  ఒకవేళ సుప్రీమ్ కోర్టు కూడా రాహుల్ కి రిలీఫ్ ఇవ్వకపోతే   రాహుల్ గాంధీ 2024 ఎన్నికలలో పోటీకి అనర్హుడు అవుతారు. ఇప్పుడు పవన్ పై కూడా అలాంటి కేసు పెట్టడం వెనక జనసేనానిని కూడా ప్రత్యక్ష పోటీకి అనర్హుడిగా చేయాలన్నప్లాన్ ఉండవచ్చని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అయితే, 2024 ఎన్నికలకు నిండా ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉండగా ఈ కేసు ఈలోగా తేలడం కష్టమే. రాహుల్ గాంధీ కేసు ఇప్పటికి నాలుగేళ్లు అయినా ఇంకా తెలనేలేదు. మరి ఇప్పుడు వాలంటీర్ తో వైసీపీ నేతలు పెట్టించిన ఈ కేసులో ఫైనల్ తీర్పు ఎప్పటికి వస్తుందో ఎవరికీ తెలియదు. 

స్పీడ్ 4

వనమా ఎన్నిక చెల్లదు 41.  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన  కోర్టు నేడు తీర్పు వెలువరించింది. .......................................................................................................................................................... తెలంగాణ పాఠశాలల్లో పాఠ్యాంశంగా సీపీఆర్ శిక్షణ 42. తెలంగాణలో పాఠ్యాంశంగా   సీపీఆర్‌ శిక్షణను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణాల ను నియంత్రించేందుకు విద్యార్థులలో సీపీఆర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా పాఠ్యాంశంగా ప్రాథమిక శిక్షణ చేర్చనుంది.   ...................................................................................................................................................... 43.  రానున్న రోజులలో  ఐటీ ఉద్యోగాలలో ఫ్రెషర్స్ రిక్రూట్ మెంట్ బాగా తగ్గిపోయే అవకాశం ఉందని  ఆర్థిక సంవత్సరంకోసం ఫ్రెషర్ రిక్రూట్‌మెంట్  బిజినెస్‌లైన్ ద్వారా సేకరించిన డేటా వెల్లడించింది. అమెరికాలో ఏర్పడిన ఆర్థిక మాంద్యమే ఇందుకు కారణమని ఆ డేటా పేర్కొంది. ............................................................................................................................................................. కర్నాటక సర్కార్ కూల్చివేతకు సింగపూర్ లో కుట్ర: డీకే 44. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సింగపూర్ లో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.   వైద్య పరీక్షల కోసం జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన సమయంలో డీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ............................................................................................................................................................. 6న తమిళనాడుకు రాష్ట్రపతి ముర్ము 45.  మద్రాసు విశ్వవిద్యాలయం  165వ స్నాతకోత్సవాల్లో పాల్గొనేందుకు ఆగస్టు 6న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడుకు రానున్నారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ద్రౌపది ముర్ము తమిళనాడు పర్యటనకు రావడం ఇదే మొదటి సారి.  .............................................................................................................................................. ఎన్నికలకు ముందే అన్నాడీఎంకేలో వర్గాలన్నీ విలీనం: శశికళ 46. వచ్చే యేడాది జరగనున్నసార్వత్రిక ఎన్నికలకు ముందే అన్నాడీఎంకేలోని చీలిక వర్గాలన్నీ విలీనమౌతాయని  ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు  శశికళ అన్నారు. మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆమె అన్నారు. .................................................................................................................................................. బైజూస్ కార్యాలయం మూత 47. విద్యారంగ టెక్‌ దిగ్గజం బైజూస్‌  సంస్థ తాజాగా బెంగళూరు కల్యాణి టెక్‌పార్క్‌లోని కార్యాలయాన్ని  ఖాళీ చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కిన్న బైజూస్ ఇక్కడి ఉద్యోగులను ఇతర కార్యాలయాలకు సర్దుబాటు చేసింది. ............................................................................................................................................................ జగన్ పై గంటా విమర్శలు 48. ఏపీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాశారని, రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.  ప్రతీ సమావేశంలో తాను అమాయకుడినంటూ  హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారని సెటైర్లు వేశారు.  ........................................................................................................................................................... అజిత్ పవార్ సీఎం అయ్యే అవకాశమే లేదు: ఫడ్నవీస్ 49.     మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ త్వరలో మహారాష్ట్ర సీఎం కాబోతున్నారంటూ కాంగ్రెస్ నేత   పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలను బీజేపీ నేత ఫడ్నవీస్ కొట్టి పారేశారు. అజిత్ పవార్ సీఎం అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదని చెప్పారు.  చవాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ........................................................................................................................................................... మత్స్యకారుల వలలో డాల్ఫిన్.. వండుకుని తినేశారు 50.యమునా నది వరదల్లో కొట్టుకు వచ్చిన డాల్ఫిన్  మత్స్యకారులకు చిక్కింది.  వలలో చిక్కిన డాల్ఫిన్ ను మత్స్యకారులు భుజంపై మోసుకొని ఇంటికి తీసుకువెళ్లారు. దానిని వారు వండుకు తినడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 

స్పీడ్ న్యూస్ 3

సాంకేతిక లోపంతో నిలిచిన టికెట్ల బుక్కింగ్ 26. సాంకేతిక లోపంతో ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది.  ఈ మేరకు ట్వీట్ చేసిన ఐఆర్‌సీటీసీ  సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.  సాధ్యమైనంత త్వరలో టికెట్ బుకింగ్ ను పునరుద్ధరిస్తామని తెలిపింది. ............................................................................................................................................................... రోడ్లపైకి వరద నీరు 27.ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు గోతులతో అధ్వానంగా తయారైంది.  మరోవైపు పక్కనే ఉన్న పంట పొలాల్లో నుంచి వచ్చిన వరద రోడ్డుపై ప్రవహిస్తోంది. ................................................................................................................................................. కట్టేరు వాగు ఉధృతి 28. భారీ వర్షాలకు తిరువూరు నియోజకవర్గ పరిధిలోని  వినగడప వద్ద కట్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది.  కట్లేరు వాగు ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సమీప 20 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద తగ్గే వరకు వాగు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ............................................................................................................................................................ కోటిపల్లి ప్రాజెక్టులోని వరద నీరు 29. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోటిపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరాయి.  పూర్తిస్థాయి నీటిమట్టంతో కోట్లు ప్రాజెక్ట్ ఆ లుగు పారుతుంది. కోట్పల్లి ప్రాజెక్ట్ నుండి నీరు కుదరడంతో నాగ సంబంధర్ దోర్నాల మీదుగా వాగు పొంగి ప్రవహిస్తుంది  .............................................................................................................................................. భారీ వర్షాలకు తెగిపోయిన రహదారి 30.ఆర్మూర్ లో గత రాత్రి  కురిసిన భారీ వర్షం కారణంగా  , రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో ఆ రహదారి తెగిపోయింది.  దీంతో రైల్వే స్టేషన్ కు రాకపోకల నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న్నారు. .................................................................................................................................................. నేతన్నలపై దాడులు సహించం: పరిటాల శ్రీరామ్ 31. నేతన్నలపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని  తెలుగుదేశం నాయకుడుపరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. గత నెలలో విజయవాడ ఆలయ సిల్క్స్ యజమాని ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన గిర్రాజు శశి, కోటం ఆనంద్ లపై దాడి పట్ల పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు.   ......................................................................................................................................................... మోడీ సర్కార్ పై అవిశ్వాసం 32. మణిపూర్ లో   హింసపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోకపోవడంతో  విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ అంశంపై కేంద్రపై  లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ................................................................................................................................................ 27న రైతుల ఖాతాల్లోకి ఆ సొమ్ములు 33. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తీసుకొచ్చిన పీఎం కిసాన్ యోజన పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13 విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. ........................................................................................................................................................ ఢిల్లీలో డెంగ్యూ జ్వరాలు 34.  యమునానది వరదలతో అతలాకుతలమైన ఢిల్లీ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు చేరుకుంటోంది. అంతలోనే మరో ముప్పు నగరవాసులను భయంపెడుతోంది.   ఢిల్లీ వాసులు డెంగ్యు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 187 డెంగ్యు కేసులు నమోదు అయ్యాయి. .................................................................................................................................................... మణిపూర్ లో మరో దారుణం 35.  మణిపూర్ లో మరో దారుణ వెలుగులోకి వచ్చింది. కొందరు సాయుధ వ్యక్తులు ఓ స్వాతంత్ర్య సమయోధుడి భార్యను ఇంట్లో బంధించి, సజీవ దహనం చేశారు. కాక్చింగ్ జిల్లాలోని సెరో గ్రామంలో మే 28న ఈ దారుణం జరిగింది. బాధిత వృద్ధురాలు ఇబెటోంబికు 80 ఏళ్ల వయసు ఉంటుంది. ............................................................................................................................................................... ఇండియాపై మోడీ విమర్శలు 36. విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ  పార్లమెంటరీ పార్టీ సమావేశంలో  మాట్లాడిన మోడీ  విపక్ష కూటమి పేరు లక్ష్యంగా ఆయన  గుప్పించారు. పీఎఫ్ఐ, ముజాహిదీన్ వంటి  వంటి ఉగ్ర సంస్థల పేరులోనూ ఇండియా ఉందన్నారు.   ................................................................................................................................................... ఆకాశంలో స్వర్గానికి ద్వారం 37. బెంగళూరులో వినువీధిలో కనిపించిన వింత ఆకారం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. ఆకాశంలో మబ్బుల మధ్య ధ్వారం ఆకారం ఏర్పడటం చూపరులను ఆకట్టుకుంది. స్వర్గానికి ద్వారంలా ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.   ............................................................................................................................................................... జల దిగ్బంధనంలో వేల్పూర్ 38. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆర్మూర్ - మెట్ పల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  వేల్పూర్ జల దిగ్బంధం పై క్షేత్రస్థాయిలో  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. ........................................................................................................................................................ తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల 39. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదలయ్యాయి. tirupatibalaji.ap.gov.in సైట్లో భక్తులు తమ వివరాలు నమోదు చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక వృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు కూడా విడుదలయ్యాయి. ............................................................................................................................................................ వరంగల్ ఖమ్మం హైవేపై భారీగా వరద నీరు 40. వరంగల్-ఖమ్మం హైవేపై భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంతిని హైవేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 5 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది.