ఆర్టీసీ బిల్లు.. తమిళిసైకి కార్మికుల నిరసన సెగ!

తమిళనాడు గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై తెలంగాణ సర్కార్ మధ్య చాలా  విభేదాలు నిన్నా మొన్నటివి కావు. దాదాపుగా మూడేళ్లుగా  రాజ్ భవన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఎప్పుడో  హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా తమిళిసై, కేసీఆర్ ముఖాముఖి ఎదురుపడ్డారు. అంతే అంతకు ముందు, తర్వాతా కూడా ఇరువురి మధ్యా సంబంధాలు ఉప్పూ నిప్పులాగే  ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ అవమా నిస్తోందని తమిళిసై పలు సందర్భాలలో బహిరంగంగా ప్రకటనలూ చేశారు.  గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిం చారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందన్నారు.ప్రభుత్వం చాలాసార్లు కావాలని ఇబ్బంది పెట్టినా తాను భయపడలేదని గవర్నర్ తమిళి సై తెలిపారు. తనపై ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.  గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదనీ ఆరోపించారు.  గవర్నర్ కార్యాలయం అయిన రాజ్ భవన్ పై ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కిందన్నారు.  ఇక బీఆర్ఎస్ మంత్రులు కూడా గవర్నర్ పై విమర్శలు గుప్పించారు. తమిళసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారన్నారు. మొత్తంగా రాజకీయ ప్రత్యర్థుల స్థాయిలో గవర్నర్ బీఆర్ఎస్ ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. ఈ పరిస్థితి గత మూడున్నరేళ్లుగా కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగ బద్ధంగా తన కున్న అధికారాలను వినియోగించుకుని పలు సందర్భాలలో గవర్నర్ తమిళిసై కేసీఆర్ సర్కార్ కు షాక్ లు ఇచ్చారు.  బిల్లులను తిరస్కరించకుండా వెనక్కు తిప్పి పంపకుండా తన వద్దే ఉంచుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్లును గవర్నర్ కు పంపితే దానిపై తనకు సందేహాలున్నాయని నివృత్తి చేయాలని తిప్పి పంపారు. ఇటీవల వరదలు సంభవించి రాష్ట్రంలోని అనేక గ్రామాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను గవర్నర్ సందర్శించి ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ తిప్పి పంపించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ శాసన సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలనుకున్న ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపలేదు. ఆర్థికపరమైన బిల్లు కావడంతో ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వానికి గవర్నర్ మరోసారి షాకిచ్చినట్లైంది. ఎన్నికల ఏడాదిలో కేసీఆర్ సర్కర్ కు గవర్నర్ తీసు ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించిందనడంలో సందేహం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ కు ఆ బిల్లును గవర్నర్ తిప్పి పంపడంతో  ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యిందనే చెప్పాలి. ప్రోటోకాల్ పాటించనందుకు గవర్నర్ తమిళిసై ఇచ్చిన రిపార్టీలా దీనిని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. గవర్నర్ నిర్ణయంపై రాజకీయ విమర్శల కంటే ఆర్టీసీ కార్మికులను నిరసనలకు ప్రోత్సహించడం ద్వారా రాజకీయ మైలేజ్ పొందాలని యోచిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేఏ పాల్ కాదు ఇక విశాఖ పాల్!

కేఏ పాల్.. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  గతంలో మత ప్రభోధకుడిగా ఒక వెలుగు వెలిగిన పాల్.. దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికీ దేశాల ప్రధానులను, అధ్యక్షులను ఎలాంటి అపాయింట్ మెంట్ కూడా లేకుండా కలవగలిగిన సత్తా ఉన్న వ్యక్తిని తానని  ఆయనే చెప్పుకుంటారు. ఇక  ఎన్నికల సమయంలో పాల్ చేసే స్టంట్స్, ఇచ్చే ఇంటర్వ్యూలకు సోషల్ మీడియాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆయన మాటలనే ఇతర రాజకీయ పార్టీలు కూడా ట్రోల్స్ కోసం వాడేంతగా ఆయన ఎన్నికల సమయంలో ప్రజలను ఎంటర్ టైన్ చేస్తుంటారు. వినోదం పంచుతుంటారు. ఈయనకున్న క్రేజ్ దృష్ట్యా కొన్ని మీడియా సంస్థలు కూడా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్లాన్ చేసి ప్రచారం చేస్తున్నాయంటే ఆయన సేలబులిటీ ఎంతో అర్ధమౌతుంది.  ఆయన మాట్లాడే మాటలు వైరల్ అయితే, ఆయన ఇంటర్వ్యూలు పెద్ద సంఖ్యలో  వ్యూస్ తెస్తాయి. కాగా  ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు రచించుకొనే పనిలో ఉన్నారు. ఎన్నికల హీట్ మొదలైందో లేదో పాల్ మళ్ళీ రంగంలోకి దిగిపోయారు. ఈసారి ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను పక్కా లోకల్ అని చెప్పుకున్నారు. విశాఖలో తనకంటే మంచి అభ్యర్థి లేరని.. ఈసారి పోటీ చేసి తీరుతానని గట్టిగా చెప్పారు. ఇక నుంచి ఇక్కడే మకాం పెడతానని, తన రాజకీయం ఎలా ఉంటుందో ఇక్కడి రాజకీయ పార్టీలకు చెబుతానని సవాల్ విసిరారు. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తొత్తుగా మారాయని.. విశాఖపట్నంకి మేలు చేసే పార్టీ ఒక్కటీ లేదని, అందుకే తాను బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇన్ని సీట్లు ఉండగా విశాఖనే ఎందుకు ఎంచుకున్నారంటే.. విశాఖ దగ్గర తగరపువలస తన సొంత ప్రాంతమని అందుకే ఇక్కడ నుంచి పోటీ చేసి ఈ ప్రాంత సమస్యలు తీర్చాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడి పరిస్థితులు తనకంటే ఎక్కువగా ఏ నాయకులకు తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఆరు నూరైనా నూరు పదహారైనా 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని.. ఇదే సమయంలో తనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేసిన పాల్.. తాను ఇక మీదట కేఏ పాల్ ను కాదని విశాఖ పాల్ ని అని.. తనని అందరూ అలాగే పిలవాలని కూడా కోరుతున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాలలో కేఏపాల్ చెప్పే మాటలు అందరినీ నవ్వుల్లో ముంచుతుంటాయి. మత ప్రబోధకుడిగా ఆయనకి చాలా దేశాలలో గుర్తింపు ఉన్న మాట నిజమే కానీ.. దాన్ని ఆయన చెప్పే తీరు చూసేవారికి కామెడీగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గతంలో ఆయన కూడా హుందాగానే మాట్లాడేవారు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలా కామెడీ పీస్ అయిపోయారు. ప్రజాశాంతి పార్టీ పెట్టిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు సహజంగానే తెగ ట్రోల్ అయిపోతున్నాయి. తాను తలచుకుంటే ఎవరినైనా సీఎంను చేస్తానని.. అవసరమైతే రెండు రాష్ట్రాలను దత్తత తీసుకుంటానని ఆయన చెప్పే డైలాగ్స్ ఎక్కువగా యూత్ లో ఎంటర్ టైన్మెంట్ పార్ట్ అయిపొయింది.  కాగా, పాల్ ప్రకటించిన విశాఖ పార్లమెంట్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన మధ్యే పోటీ ఉండేలా ఉంది. టీడీపీ జనసేన పొత్తులు ఇంకా ఖరారు కాకపోగా.. బీజేపీ మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని బరిలో నిలబెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పొత్తు ఖరారైనా ఆమెకు సీటు ఖాయం, గెలుపు ఖాయం అనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బలహీన పడ్డారు. ఆ మధ్య దుండగులు ఈ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనంగా మారగా.. ఇప్పుడు ఎంవీవీ హైదరాబాద్ కు మకాం మార్చినట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో వైసీపీ మరొకరిని దింపేందుకు కసరత్తులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

ఏ బిడ్డా ఇది నా అడ్డా అనగలవా జగన్?.. పులివెందుల నడిబొడ్డున బాబు సవాల్

పులివెందుల.. ఈ పేరు చెబితే చాలు ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రైనా వైఎస్ఆర్‌ కుటుంబానికి కంచుకోట అని ఠక్కున చెప్పేస్తారు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల అండ‌దండ‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించారు. వైఎస్ కుటుంబం ఏం చెబితే అక్క‌డి మెజార్టీ ప్ర‌జలు అదే ఫాలోఅయ్యేవారు. వైఎస్ఆర్ మృతి త‌రువాత కూడా వై.ఎస్‌. జ‌గ‌న్‌కు పులివెందుల ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించి సీఎంను చేశారు. వైఎస్ఆర్ బంతికున్న స‌మ‌యంలో పులివెందుల‌లో ప్ర‌తిప‌క్ష‌పార్టీల నేత‌లు అడుగుపెట్టి గ‌ర్జిద్దామ‌న్నా అక్క‌డి ప్రజ‌ల నుంచి స్పంద‌న క‌రవ‌య్యేది. దీంతో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌బాబుకు ఎలాగో..   పులివెందుల ప్ర‌జ‌లు వైఎస్ఆర్ కుటుంబానికి అలా అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. అయితే  ప్ర‌స్తుతం పులివెందుల‌లో ప‌రిస్థితులు మారుతున్నాయి. ఇందుకు నిద‌ర్శనం తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు పులివెందుల వెళ్లి సింహ‌గ‌ర్జ‌న చేయ‌డ‌మే. వైసీపీ శ్రేణుల్లో ఇన్నాళ్లూ ఒక గ‌ట్టి న‌మ్మ‌కం ఉండేది. చంద్ర‌బాబు రాష్ట్రంలో ఎక్క‌డికివెళ్లినా ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న వ‌స్తుందేమో కానీ..   జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అడ్డా పులివెందుల వెళితే ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌నే భావ‌న‌లో ఉండేవారు. అయితే, రెండు రోజుల క్రితం చంద్ర‌బాబుకు పులివెందుల‌ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డంతో  వైసీపీ శ్రేణుల నమ్మకం పటాపంచలైపోయింది. వారి వెన్నులో వణుకు పుట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   చంద్ర‌బాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల రాజ‌కీయాలు వేరుగా ఉండేవి. చంద్ర‌బాబుకు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌గా ఉండ‌గా.. రాజ‌శేఖ‌ర‌రెడ్డికి పులివెందుల కంచుకోట‌గా ఉంది. వీరిద్ద‌రూ ప్ర‌త్య‌ర్థులైన‌ప్ప‌టికీ ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయించాల‌ని ఎప్పుడూ చూడ‌లేదు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వైసీపీ జెండా ఎగురేస్తామంటూ ప్ర‌క‌ట‌నలు చేస్తూ వ‌స్తున్నారు. దీనికి తోడు కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన స‌మ‌యంలో అనేక అడ్డంకులు సైతం సృష్టించారు. కానీ  ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే కుప్పంలో చంద్ర‌బాబు ఓడిపోవ‌టం అలా ఉంచితే.. పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌రువు పోయే ప‌రిస్థితి ఏర్ప‌డిందని పరిశీలకులు అంటున్నారు.   జ‌గ‌న్ వ్యూహం రివర్స్ అయ్యిందని విశ్లేషిస్తున్నారు.  చంద్ర‌బాబు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో కాలుమోప‌డ‌మే త‌రువాయి అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీనికితోడు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవాల‌ని చూసిన వైసీపీ శ్రేణుల‌ను త‌రిమి కొట్టారు. ఈ విచిత్ర ప‌రిస్థితి చూసి ఇది పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ‌మేనా అనే అనుమానం విశ్లేష‌కుల నుంచిసైతం వ్య‌క్త‌మ‌వుతోంది. చంద్ర‌బాబుకు పూలుప‌రిచి పులివెందుల ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌ల‌క‌డంతో పాటు, చంద్ర‌బాబు మాట్లాడే ప్ర‌తీ మాట‌కు హ‌ర్ష‌ధ్వానాలు చేశారు. దీంతో పులివెందుల ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు ప‌లికిన స్వాగ‌తాన్ని చూసి వైసీపీ శ్రేణులు వ‌ణికిపోతున్నాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.   జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై పులివెందుల ప్ర‌జ‌ల్లో రోజురోజుకు ఆద‌ర‌ణ త‌గ్గిపోవ‌డానికి ప‌లు కార‌ణాల‌ను విశ్లేషకులు తెర‌పైకి తెస్తున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలో, సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ పులివెందులకు ఎప్పుడో ఒక‌సారి వ‌చ్చేవారు. అక్క‌డ రాజ‌కీయాల‌న్నీ ఆయ‌న సోద‌రుడు వివేకానంద‌రెడ్డి చూసుకుంటూ ఉండేవారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వివేకానందరెడ్డే ప‌రిష్క‌రించేవారు. ఏదైనా పెద్ద స‌మ‌స్య అయితేనే వైఎస్ఆర్ వ‌ర‌కు వ‌చ్చేది. దీనికి తోడు పులివెందుల నుంచి త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన‌వారికి రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌యం కేటాయించి వారి స‌మ‌స్య‌ల‌ను వినేవారు. వారి స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించేలా చూసేవారు. దీంతో పులివెందుల ప్ర‌జ‌ల‌కు వైఎస్ఆర్ అన్నా.. వివేకానంద రెడ్డి అన్నా ఎన‌లేని అభిమానం. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై సైతం పులివెందుల ప్ర‌జ‌లు అంతే అభిమానాన్ని చూపుతూ వ‌చ్చారు. అయితే, ఈ నాలుగేళ్ల కాలంలోజ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న భావన అక్క‌డ ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు పులివెందుల ప్ర‌జ‌ల‌కు జగన్ ద‌ర్శ‌న‌భాగ్య‌మే క‌రువ‌వుతోంద‌ట‌. ఒక‌వేళ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వెళ్లినా అవ‌కాశం ద‌క్క‌డం లేద‌ట‌. దీంతో రోజురోజుకు జ‌గ‌న్ అంటే అక్క‌డి ప్ర‌జ‌లు చీద‌రించుకొనే ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతుంది.  చంద్ర‌బాబుకు పులివెందుల‌లో అద్భుత ఆద‌ర‌ణ ల‌భించ‌డానికి మ‌రోకార‌ణం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అదే.. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌. వివేకా హ‌త్య‌కేసు విచార‌ణ‌లో సీఎం జ‌గ‌న్ తీరు పులివెందుల ప్ర‌జ‌లకు ఆగ్ర‌హాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు. వివేకాను  అవినాశ్ రెడ్డి హ‌త్య‌చేశాడ‌ని రాష్ట్రం మొత్తం కోడైకూస్తున్నా జ‌గ‌న్ మాత్రం ఆయ‌న్ను కాపాడుకుంటూ వ‌స్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికితోడు వివేకా కుమార్తెను దూరం పెట్ట‌డం, సొంత చెల్లి ష‌ర్మిల‌ను దూరం పెట్ట‌డం కూడా పులివెందుల ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక భావం  నెల‌కొనడానికి కారణమని పరిశీలకులు చెబుతున్నారు. సీఎంగా ఉండి, కేంద్ర ప్ర‌భుత్వం అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సొంత బాబుయిని హ‌త్య‌ చేసిన నిందితుల‌ను క‌ట‌క‌టాల్లోకి పంపించ‌లేక పోయాడ‌ని, ఇక మ‌న‌కేం న్యాయం చేస్తాడ‌నే భావ‌న‌కు పులివెందుల‌లోని మెజార్టీ ప్ర‌జ‌లు వ‌చ్చారంటున్నారు. ఇదే ప‌రిస్థితి ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల‌లో టీడీపీ జెండా ఎగిరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

విశాఖకు మారిన కోడికత్తి కేసు.. మతలబేంటి?

గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాలలో సంభవించిన అతి పెద్ద ట్విస్టులలో కోడికత్తి కేసు కూడా ఒకటి. కోడికత్తి జగన్ మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందన్నది పక్కన పెడితే.. ఈ దాడిని సానుభూతిగా మలచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో  సక్సెస్ అయ్యారు. ఈ కేసు అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడకి చుట్టాలని యత్నించి సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలిసి కుట్ర పన్ని జగన్ పై హత్యాయత్నం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ దాడి వెనక ఎవరున్నారో తేల్చాలని వైసీపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ఆ తర్వాత వైసీపీ గెలిచినా ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు.ఈ కేసులో నిందితుడు కోడి కత్తి శీను దోషా.. లేక అసలు కుట్ర దారులు ఎవరైనా ఉన్నారా అన్నది కూడా తేల్చలేదు.  ఈ కేసులో కొ గత ఐదేళ్లుగా శీను జైల్లోనే మగ్గుతున్నాడు. కోర్టు ఈ కేసు విచారణకి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే జైల్లోనే శ్రీను నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఈ మధ్యనే అతని లాయర్ ప్రకటించాడు. దీంతో ఈ కేసు విచారణ క్లైమ్యాక్స్ కు చేరుకుంటుందని, అసలు దోషులు ఎవరో తేలిపోతారనీ అంతా భావించారు. కానీ ఇప్పుడు ఈ కేసులో భారీ మలుపు తిరిగింది. ఇప్పటివరకు విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ జరగగా.. ఇప్పుడు ఈ కేసును విశాఖకు మార్చారు.  తాజాగా జరిగిన ఈ కేసు విచారణ సమయంలో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అతడి తరపున న్యాయవాది కోరడంతో, కేసు బదిలీ విషయాన్ని న్యాయమూర్తి సత్యానంద్‌ ప్రకటించారు. ఈ కేసును విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్టేనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో  జగన్‌ నాలుగేళ్ల తర్వాత రెండు పిటిషన్లను దాఖలు చేశారు. కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్‌ కమిషన్‌ను నియమించడం గానీ, వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా విచారించాలని రెండో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌తో పాటు నిందితుడు శ్రీనుకి బెయిల్‌ ఇవ్వకూడదని ఎన్ఐఏ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ దాడి జరిగి ఐదేళ్లయినా కేసు విచారణ ఇంకా నత్తకి మేనత్తలానే సాగుతుంది. నిందితుడు శ్రీనివాస్ కు కోర్టు బెయిల్ కూడా ఇవ్వలేదు. కేసు విచారణను పూర్తిచేసి ఆధారాలుంటే నిందితుడికి శిక్ష వేయాలి.. లేదా సరైన ఆధారాలు లేవని అనుకుంటే నిర్దోషిగా విడుదలైనా చేయాలి. ఒకవేళ రెండూ కూడా బాగా ఆలస్యమవుతుందని అనుకుంటే కనీసం నిందితుడికి బెయిల్ అయినా ఇచ్చి విచారణ కొనసాగించాలి. కానీ, ఈ కేసులో అవేమీ లేవు. వైఎస్ జగన్ కేసు విచారణకి హాజరు కావడం లేదు. తాజాగా మంగళవారం జరిగిన విచారణకు జగన్‌ తరపున న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. నిందితుడికి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కోరడంతో, కేసు బదిలీ విషయం బయటపడింది.  మొత్తంగా ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఈ కేసు విచారణ పూర్తి కాకూడదన్న ఉద్దేశంతో  తెర వెనక శక్తులు పనిచేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు  వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపిన కేసులో నిందితులుగా, కుట్ర దారులగా సీబీఐ పేర్కొన్న వారు బెయిల్ మీద దర్జాగా బయట తిరుగుతుంటే.. కత్తి చేతి మీద గీసుకున్న ఈ కేసులో నిందితుడిని ఐదేళ్లుగా జైల్లోనే  మగ్గుతుండటం విశేషం. కోడికత్తి నిందితుడు బయటకొస్తే సమాజానికి మంచిది కాదని భావిస్తే.. ఇక వివేకా హత్యకేసు నిందితులకు బయట తిరిగే హక్కు ఎక్కడ ఉంది?

రుణ మాఫీ ఓ ఎన్నికల స్టంట్ 

వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు  రుణ మాఫీ చేయడం సహజమే.  సాధారణంగా ఎన్నికల ముందు రుణ మాఫీలు జరుగుతుంటాయి. రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పులను ఆయా ప్రభుత్వాలు తీర్చడమే రుణ మాఫీ అంటారు. వారు తమ పంటలను అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారు. కొన్ని సమయాల్లో వాతావరణ పరిస్థితులు మరియు వనరుల లభ్యత కారణంగా , పంటలు విఫలం కావచ్చు మరియు రైతులు తాము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగిన ఆదాయాన్ని పొందలేరు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు విధిగా రుణ మాఫీ చేయాలి.  తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6385 కోట్లు ప్రతిపాదించింది. ఈమేరకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన చేశారు.వ్యవసాయానికి జవజీవాలనందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రైతుల కళ్లలో దీనత్వం తొలిగి.. ధీరత్వం తొణికిసలాడుతోందని  అప్పట్లో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్బావానికి ముందు పదేళ్ల ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 7,994 కోట్లు ఖర్చు చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జనవరి మాసానికి  లక్షా 91వేల 612 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఖర్చు చేసినట్టు గణాంకాలు తెలియ జేస్తున్నాయి.  ఒక్క రైతు బంధు పథకానికే 15,075 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతు బీమాకు  15 వేల 98 కోట్లు ఖర్చు బడ్జెట్ లో  కేటాయింపులు చేసినప్పటికీ రైతులకు ఎటువంటి బీమా ప్రయోజనాలు అందడం లేదని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. 90 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణ మాఫీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో 6385 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు రుణ మాఫీ జరగలేదు. రైతులు అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వానికి రుణ మాఫీ కోసం అర్జీపెట్టుకున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం రైతు మొరను ఆలకించలేదు. అయితే ఎన్నికల స్టంట్ లో భాగంగా రైతు రుణ మాఫీ ని ముఖ్యమంత్రి కెసిఆర్ పునరుద్దరించారు.  రైతు బంధు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో రుణమాఫీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోబోతుంది  అని అప్పట్లో వార్తలు వచ్చాయి. నూతన సంవత్సరం మొదటి నెలలోనే రుణమాఫీని కూడా క్లియర్ చేసేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు ఈ వార్తలు వెలువడ్డాయి. కొత్త సంవత్సరం వచ్చి ఏడు నెలలు పూర్తి కావస్తున్నా ముఖ్యమంత్రి నోటి నుంచి రుణ మాఫీ ప్రకటన వెలువడ లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రైతుల విషయంలో స్పష్టంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్  ప్రభుత్వం.  కాబట్టే ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి.   రైతులకు 10వ దఫా రైతు బంధును ప్రారంభించిన ప్రభుత్వం రుణమాఫీని కూడా క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీని గురువారం నుంచే అమలు చేస్తున్నారు. 

ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణం.. జగన్ సర్కార్ మరో నమ్మక ద్రోహం!

ఏపీలో కంచే చేను మేస్తున్న చందంగా ప్రభుత్వమే పేదలకు ద్రోహం చేస్తున్నది. ఔను ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాల్సిన ప్రభుత్వం వారిని మోసం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.  తమది పేదల ప్రభుత్వమంటూ గొప్పగా చెప్పుకుంటూనే జగన్ సర్కార్ ఆ పేదలను నిలువునా మోసం చేస్తున్నది.  బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తున్నానంటున్న జగన్ ఒక చేత్తో బటన్ నొక్కి సొమ్ములు ఇచ్చినట్లే ఇచ్చి మరో  చేత్తో అంతకు రెట్టింపు లాగేస్తున్నారు.  కానీ జగన్ మాత్రం తాను పేద ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు ఆ మంచి జరగకుండా అడ్డు కోవాలని చూస్తున్నారనీ, తాను పేదల కోసం పాటుపడుతుంటే పెత్తందార్లు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఎదురు విమర్శలు చేస్తున్నారు.   రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో పట్టాలు ఇవ్వడం. అమరావతి మాస్టర్‌ ప్లాన్ ప్రాంతంలో ఆర్‌5 జోన్‌ పేరిట పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని హైకోర్టు తప్పు పడుతూ ఇచ్చిన తాజీ తీర్పులో జగన్ ప్రభుత్వ అడ్డగోలు మోసానికి సంబంధించి కీలక అంశాలను కూడా ప్రస్తావించింది.  ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అమరావతిలో 25 లే ఔట్లలో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధిస్తుందన్న సంగతి అంతా ముందే ఊహించారు. జగన్ సర్కార్ కూడా స్టే తప్పదని తెలిసే ఉండాలి. అయినా కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం, పేదలకు ఇళ్ళు నిర్మిస్తామని గాల్లో మేడలు కట్టడం ప్రజలను మోసం చేయడమే. ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగానే ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. పట్టాల పంపిణీకి అనమతి ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పట్టాలపై పేదలకు హక్కు  హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే  లబ్థిదారులకు ఆ భూములపై ఎటువంటి హక్కూ ఉండదని కూడా   స్పషం చేసింది.  మరి అప్పుడైనా జగన్ వెనక్కు తగ్గలేదు?   నిజానికి వైసీపీ ప్రభుత్వం పేదలను అడ్డం పెట్టుకొని రాజధానిని నాశనం చేయాలని ప్రణాళికలు రచిస్తున్నది. పేదలకు ఇళ్ల నిర్మాణం ముసుగులో.. అమరావతి రాజధాని బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేయాలన్నది జగన్ ప్రణాళికగా చెబుతున్నారు. అందుకే కోర్టు పరిధిలో ఉండగానే నిబంధనలను తుంగలోతొక్కి పట్టాలు ఇచ్చారు. కోర్టు కుదరదన్నా వినకుండా ఇళ్ల నిర్మాణానికి మౌలిక వసతులు కల్పించేలా దొంగ జీవోలు తీసుకొచ్చారు. తీరా ఇప్పుడు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ అంశంలో అమరావతి రైతుల పిటిషన్ పెండింగ్ లో ఉందని తెలిసీ ఆగమేఘాలమీద సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కానీ, సంపద సృష్టించే.. ఆర్-5 జోన్లో ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల నిర్మాణం ఆపాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన భూములను.. రాజధానేతరులకు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. మొత్తంగా ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే జగన్ మోహన్ రెడ్డికి పేద ప్రజలపై ప్రేమ ఏ కోశానా కనిపించదు. అమరావతి ప్రణాళికకు విరుద్ధమైన ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టే బదులు.. పేదలు కూడా రాజధానికి దగ్గరలోనే ఉండాలనే చిత్తశుద్ధి ఉంటే.. అమరావతికి దగ్గర్లోనే మరో చోట ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టవచ్చు. కానీ, జగన్ సర్కార్ ఆ ఆలోచన చేయడం లేదంటే ఇక్కడ పేదలపై ప్రేమ కన్నా.. అమరావతి వినాశనం, పేదల పేరుతో అమరావతి రైతులను, ప్రతిపక్షాల ద్రోహులుగా చిత్రీకరించడమే లక్ష్యంగా కనిపిస్తున్నది.

   జయసుధకు సికింద్రాబాద్ దక్కేనా? 

రాజకీయాల్లో సినీ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్  అనే విషయం చాలా కాలంగా ఉంది. అంతకుముందు ప్రజా జీవితంలో లేని సినీ తారలను ఆయా రాజకీయ పార్టీలు చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చి చట్ట సభల్లోకి పంపిన ద‌ృష్టాంతాలు అనేకం. ఈ కోవలోనే సహజ నటి జయసుధ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.300 కి పైగా చిత్రాల్లో నటించిన జయసుధ రాజకీయాల్లో రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధానకారణం.  ఆమెను కాంగ్రెస్ పార్టీలో  ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానించి  ప్రోత్సహించారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి సారి టికెట్ సంపాదించి 2014లో ఆమె సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం  గెలుపొందారు.  45,063 వోట్లు ఆమె కైవసం చేసుకున్నారు.   36.32 శాతం వోట్ల శాతం తేడాతో ఆమె గెలుపొందారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటి చేసిన తలసానిని ఆమె చిత్తుచిత్తుగా ఓడించారు. తలసాని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పరాజయం చెందారు. సికింద్రాబాద్ నియోజక వర్గంలో 30 శాతం క్రిస్టియన్లు ఉండటంతో ఆమె ఎన్నిక సులభతరమైంది. ఆ ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో జయసుధ ఎక్కువ వోట్లతో గెలిచినట్టు రికార్డ్ లో కెక్కారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి  రైతులకు ఉచిత విద్యుత్ , రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలే. టిడిపి అభ్యర్థి తలసానితో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి కత్తి పద్మారావ్ జయసుధకు పోటీ ఇచ్చారు.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత టిడిపిలో చేరారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు.  వై ఎస్ తనయుడు వైఎస్ జగన్ పార్టీలో చేరినప్పటికీ  ఆ  పార్టీలో ఆమె ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయారు. జయసుధ ఇటీవలె బిజెపిలో చేరారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి నియామకం అయిన తర్వాత చేరికలు ప్రోత్సహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. బండి సంజయ్ వీడిన తర్వాత పార్టీ కేడర్ దూరమౌతున్న నేపథ్యంలో జయసుధ లాంటి సెలబ్రిటీ చేరడం బిజెపికి సానుకూలాంశం.   ఆమె కాషాయ కండువా కప్పుకోగానే జయసుధ వల్ల బీజేపీకి ఏమిటి ఉపయోగమనే చర్చ మొదలైంది. ఏదోరోజు విజయశాంతి పార్టీని వదిలేస్తారని అగ్రనేతల కు అనుమానాలు పెరిగిపోతున్నట్లున్నాయి. అందుకనే ముందుజాగ్రత్తగా జయసుధను పార్టీలో చేర్చుకున్నారు   జయసుధ బిజెపిలో చేరడానికి  ఓ కండిషన్ పెట్టినట్టు సమాచారం. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ను ఆశించే ఆమె బిజెపిలో చేరినట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ లో తనకు సంబంధించిన  అభ్యర్థికే టికెట్ ఇప్పించడానికి మాజీ ఎమ్మెల్యే  డాక్టర్ కె. లక్ష్మణ్  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కూతురుకి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.  

పార్లమెంటుకు రాహుల్.. అనర్హతపై సుప్రీం స్టే

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై సూరత్ కోర్టు విధించిన అనర్హతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు లైన్ క్లియర్ అయినట్లే భావించవచ్చు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందినా, అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. రాహుల్ పై అనర్హత వేటుపై సుప్రీం స్టే పార్లమెంటులో కాంగ్రెస్ గళం మరింత బలంగా వినిపించేందుకు వీలుకల్పించిందనే చెప్పాలి. వాస్తవానికి రాహుల్ గాంధీ మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యం విషయంలో సూరత్ కోర్టు తీర్పుపై అప్పట్లోనే భిన్న వాదనలు వినిపించాయి. కోర్టు అనర్హత వేటు నిర్ణయం తీవ్రమైనదని న్యాయనిపుణులు సైతం పేర్కొన్నారు. అనర్హత వేటుపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన రాహుల్ ఇప్పటికే  ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి సోనియాగాంధీ అధికారిక నివాసానికి మకాం మార్చేశారు. పలువురు మాజీ మంత్రులు ఇప్పటికీ ఎంపీలకు కేటాయించిన భవనాలలోనే కొనసాగుతున్నా.. కోర్టు తీర్పును గౌరవించి పార్లమెంటు సభ్వత్వాన్ని కోల్పోగానే నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్.. ఇప్పుడు సభ్యత్వం పునరుద్ధరణకు లైన్ క్లియర్ కావడంతో లోక్ సభలో తన గళాన్ని గట్టిగా వినిపించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో అనర్హత వేటుపై స్టే కారణంగా బీజేపీ కూడా డిఫెన్స్ లో పడినట్లేనని అంటున్నారు. ముఖ్యంగా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించి న్యాయపోరాటం చేసి తిరిగి పార్లమెంటులో అడుగుపెడుతున్న రాహుల్ కు కచ్చితంగా ఇది నైతిక విజయమనే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.   అదలా ఉంచితే ఎన్నికల అక్రమాల కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ లోనే ఉన్నా.. రాహుల్ విషయంలో మాత్రం కోర్టుల్లో విచారణ వేగంగా ముగిసి తీర్పు వెలువడటం వెనుక కేంద్రం హస్తం ఉందన్న అనుమానాలు నాడే వ్యక్తమయ్యాయి. ఇలా కోర్టు తీర్పు రాగానే అలా ఆయనను లోక్ సభ సభ్యుడిగా అనర్హుడు అంటూ లోక్ సభ సెక్రటేరియెట్ నిర్ణయం తీసేసుకుంది. తెలంగాణలో  2018లో ఎన్నికల అఫిడవిట్ తో తప్పుడు వివరాలు సమర్పించారంటూ దాఖలైన దాదాపు డజన్ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. అటువంటిది.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యం విచారణ పూర్తై తీర్పు కూడా వెలువరించడం ఏమిటని సూరత్ కోర్టు తీర్పు వెలువడిన సమయంలోనే పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని  2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై  గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే  దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును రాహుల్ సుప్రీంలో సవాల్ చేసి స్టే పొందారు. 

కేంద్రానికి కనిపించదా ?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థతి ఏమిటి?  అంటే  రాష్ట్రంలో  అరాచక పాలన సాగుతోందని, ఆర్థిక పరిస్థితి అధ్వానం గా ఉందని చెప్పేందుకు ఇసుమంతైనా   సంకోచించ వలసిన అవసరం  లేదని ఎవరిని అడిగినా చెపుతారు. ఎవరి దాకానో  ఎందుకు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఆధ్వానంగా వుందో చెపుతూనే ఉన్నారు. ముఖ్యంగా  కొత్తగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన  పురందేశ్వరి రాష్ట్ర అప్పుల పరిస్థిపై గణాంక వివరాలతో సహా గంటకు పైగా వివరించారు. అంతే కాదు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్  కు రాష్ట్ర   అప్పుల చిట్టాను సమర్పించారు కూడా.    అయినా కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. అంతే కాదు అదే సమయంలో  రాష్ట్ర అప్పుల పరిధి (ఎఫ్ఆర్బీఎం) విషయంలో కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు విభిన్న ప్రకటనలు చేసి వాస్తవ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా చేశారు. దీంతో, రాష్ట్ర బీజేపీ నేతలు ముఖ్యంగా  రాష్ట్ర ఆర్థిక, అప్పుల పరిస్థితిపై సవివరంగా విశ్లేషించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శలు ఎదుర్కొంటున్నారు.  నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అడుగుపెట్టినప్పటి నుంచి  ఆర్ధిక  క్రమశిక్షణ గాడి  తప్పింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తోలి క్షణం నుంచే  సంక్షేమాన్ని గీత దాటించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగు కప్పి, మీటలు నొక్కడం మొదలెట్టారు. అంతే కాదు ఆర్థిక క్రమశిక్షణ అనే పదాన్ని ఏపీ సర్కార్ నిఘంటువు నుంచి తుడి చేశారు. అప్పులు చేసి మరీ ఓటు బ్యాంకు పథకాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు.  మరోవంక ప్రాధాన ప్రతిపక్ష పార్టీ  టీడీపీ  ఒక బాధ్యతగల ప్రతిపక్షంగా గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర దృష్టికి తీసుకు వెళుతూనే వుంది. అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ వుందే కానీ పరిస్థితిని చక్క దిద్దే ప్రయతనం ఏదీ చేయలేదు. అంతే కాదు  పెద్దల సభలో  వైసీపీ మద్దతుతో కీలక బిల్లుల పాస్ చేసుకునేందుకు  రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను  ఓ వంక విమర్శిస్తూనే, మరో వంక  అప్పులు పెంచుకునే వెసులు బాటు కల్పించడంతో పాటుగా ఇంకా ఇంకా అప్పులు చేసి, రాష్ట్రాన్ని ఇంకా ఇంకా అధ్వాన స్థితికి చేర్చేందుకు  జగన్ రెడ్డి ప్రభుత్వానికి ‘హితోదిక’ సహాయం అందిస్తోంది.  దీంతో  జగన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేయడమే కాదు  కేంద్ర నిధులకూ కన్నం వేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పడు తాజగా పంచాయతీ నిధుల దారి మళ్లింపునకు సంబంధించి  ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8660 కోట్ల మేర గ్రామ పంచాయితీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళించిందని   ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ కేసు కట్టి సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాదు  ఇందుకు సంబంధిచిన వివరాలను, ఆధారాలను సంవత్సరాల వారీగా కేంద్ర మంత్రికి సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు ఇచ్చిన ఆర్దిక సంఘం నిధులు రూ.8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా  దారి మళ్లించి తన సొంత పథకాలకు, సొంత అవసరాలకు వాడుకుందని ఫిర్యాదు చేశారు. 2022-23 సంవత్సరానికి చెందిన 2010 కోట్లు, 2023 -24 సంవత్సరము కు చెందిన 2035 కోట్లు, మొత్తం రూ.4045 కోట్లను పంచాయితీలకు విడుదల చేయకపోవడంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - 2006  కింద వచ్చే నిధులు నరేగా చట్టప్రకారం గ్రామ పంచాయితీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2023 వరకు సుమారు రూ.35 వేలకోట్ల రూపాయలను తన సొంత అవసరాలకు, పథకాలకు వాడుకుంటోందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం ఏర్పడిన గ్రామ పంచాయతీలను, సర్పంచులను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను డమ్మీలను చేసి వారి అధికారాలను గ్రామ వాలంటీర్లకు కట్టబెట్టారని రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జప్పీటీసీలకు , వార్డు మెంబర్లకు సమాంతరమైన పోటీ వ్యవస్థ, రాజ్యాంగేతర శక్తులుగా గ్రామ సచివాలయాలను, గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలు లాగా మార్చిన దుస్థితి గుర్చి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక,చట్ట వ్యతిరేక చర్యల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 12918 మంది గ్రామ సర్పంచులు కనీసం త్రాగునీరు కూడా అందించలేని స్థితిలో ఉన్నారని వివరించారు. ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం జల జీవన్ మిషన్ పథకాన్ని కూడా మూలన పడేశారని ఆరోపించారు. ఇకపై కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా   గ్రామపంచాయతీ  పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే జమ చేయాలని,   రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన రూ.8660 కోట్ల నిధులపై సైబర్ క్రైమ్ కేసు కట్టి, సిబిఐ చేత ఎంక్వయిరీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుండా అంటే, అనుమానమే అంటున్నారు పరిశీలకులు.

ఆర్వోల నియామకం ముందస్తు నగారాకు సంకేతమా?

ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో ఎన్నికలు జరగాలి. రాజకీయ పార్టీలన్నీ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయాయి. రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలు  రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల దాడులు మర్యాద మార్క్ ను దాటేస్తున్నాయి. పర్యటనలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు యమా స్పీడ్ గా జరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలు పొత్తులు, ఎత్తులపై మంతనాలు, మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏపీలో మొత్తంగా పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. సరిగ్గా ఈ సమయంలో ఎన్నికలకు ఇంత ముందుగానే రాష్ట్రంలో రాజకీయ హీట్ ఎందుకు పెరిగిపోయిందా అన్న ప్రశ్నకు ఈసీ చూచాయిగానైనా సరే జవాబిచ్చేసింది. ఏపీలో ముందస్తుకు అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలను ఇస్తూ ఏర్పాట్లు మొదలెట్టేసింది. ఎన్నడూ లేని విధంగా  షెడ్యూల్ కు తొమ్మది నెలలకు పైగా సమయం ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని 175 నియోజకవర్గాలకూ రిటర్నింగ్ అధికారులను నియమించేసింది. అలాగే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాదు.. 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సిన 12 రాష్ట్రాలలోనూ ఈసీ ఈ నియమకాలు చేపట్టింది. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా ముందస్తు ముచ్చటపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  మణిపూర్, హర్యానా హింసాకాండ సహా పలు సమస్యలతో కేంద్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. విపక్షాల ప్రశ్నలకు పార్లమెంటులో సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో పడింది. ముఖ్యంగా మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ ను కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదాల పర్వంతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కూడా హడావుడిగా కీలక బిల్లులన్నిటినీ ప్రతిష్ఠంభణ కొనసాగుతుండగానే ప్రవేశ పెట్టి బుల్ డోజ్ పద్ధతిలో ఆమోదింప చేసుకోవాలన్న తొందర ప్రదర్శిస్తోంది. అటు ఈసీ రిటర్నింగ్ అధికారుల నియామకాలను.. ఇటు కేంద్రం బిల్లుల ఆమెదంలో చూపుతున్న తొందరను క్రోడీకరించి చూస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను రెండు మూడు నెలల ముందుగానే నిర్వహించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లుగా కనిపిస్తున్నది. పనిలో పనిగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను కూడా ముందస్తుకు ఒప్పించి.. మినీ జమిలికి కేంద్రం  తెరతీస్తున్నదా అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఒకే సారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు అసాధ్యమన్న భావనకు కేంద్రం వచ్చేసిందని ఇటీవల పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో అవగతమైపోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ మినీ జమిలి యోచన చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే జగన్ ముందస్తుకు తొందరపడుతున్నారనీ, ఈ విషయాన్ని ఇటీవల హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మరీ కోరారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సాధ్యమైనంత వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీకి కూడా ఎన్నికలు జరిగితో ఒకింత ప్రయోజనం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. జగన్ ముందస్తు యోచన చేస్తున్నారంటూ ఒక సందర్భంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా మీడియా ముఖంగా బయటపడ్డారు. అయితే కేంద్రం అప్పట్లో అంతగా సుముఖత చూపకపోవడంతో.. తెలంగాణతో పాటుగా ఏపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కేంద్రం కూడా ముందస్తు యోచన చేస్తుండటంతో ఉభయ తారకంగా ఏపీతో సహా 12 రాష్ట్రాలలో కూడా ముందస్తు నగారా మోగించేస్తే మేలని కేంద్రం భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే ఈసీ రిటర్నింగ్ అధికారుల నియామకంతో ఎన్నికల సన్నాహాలను మొదలు పెట్టేసిందని చెబుతున్నారు.   

కేసీఆర్ జాతీయ ప్రస్థానానికి ఫుల్ స్టాపేనా?

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ గతంలో రాష్ట్రాలు చుట్టేసిన కేసీఆర్ ఇప్పుడు తన యాత్రలను మహారాష్ట్రకే పరిమితం చేశారు. ఇందుకు కారణాలేమిటన్నది పక్కన పెడితే.. ఆయన జాతీయ రాజకీయాలలో ప్రత్యర్థి మాత్రం బీజేపీ ఎంత మాత్రం కాదని తన తీరు ద్వారా తేటతెల్లం చేస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యం అంటూ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించిన కేసీఆర్.. ఆ తరువాత మోడీ సర్కార్ పై విమర్శలు చేయడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పైపెచ్చు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తున్న విపక్ష కూటమితో కూడా అడుగులు కలపడం లేదు. దీంతో బీఆర్ఎస్ తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో విస్తరణ విషయాన్ని పట్టించుకోకుండా మహాపైనే ఎందుకు దృష్టి పెట్టారన్న ప్రశ్నలూ ఉత్పన్నమౌతున్నాయి. మహారాష్ట్రలో శివసేనను  నిట్టనిలువునా చీల్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన బీజేపీపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఆ వ్యతిరేకత వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశంతోనే కేసీఆర్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణకు శ్రీకారం చుట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే సమయంలో విపక్ష కూటమిలో భాగస్వామి కాకుండా దూరంగా ఉండటం ద్వారా బీజేపీ వ్యతిరేక శక్తులు బలోపేతం కాకుండా తన వంతు ప్రయత్నం చేశారని భావించాల్సి ఉంటుందని అంటున్నారు. తొలుత జాతీయ రాజకీయాలలో ప్రవేశం అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. అప్పట్లో ఇప్పుడు విపక్ష కూటమి ‘ఇండియా’లోని భాగస్వామ్య పార్టీల నేతలందరితో భేటీ అయ్యారు. అప్పట్లో కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేసినప్పుడే పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నెలల తరబడి అదిగో ఇదిగో అంటూ ఆయన చేసిన తాత్సారంతో ఆయన జాతీయ రాజకీయ ప్రవేశం నాన్నా పులి కథ చందంగా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇక ఇపుడు ఇంత దూరం వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం సంగతి అటుంచి ఉనికి కూడా అనుమానమేనన్న అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన జాతీయ రాజకీయాల అంశానికి ఇంట్రవెల్ కాదు, ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈసీ ప్రమాణాల మేరకు ఓట్లు, సీట్లు రాకుంటే భారత్ రాష్ట్ర సమితి అనబడే బీఆర్ఎస్ కేవలం తెలంగాణకు పరిమితమైన ప్రాతీయపార్టీగానే మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు.  

వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వానికి కేంద్రం అండ!

ఆంధ్రప్రదేశ్ లో జగన్  ఆర్థిక అరాచకత్వానికి కేంద్రంలోని  మోడీ సర్కార్ పూర్తిగా అండదండలు అందిస్తోందా? జగన్ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పార్లమెంటు సాక్షిగా అసత్యాలు, అర్ధ సత్యాలు చెబుతోందా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననక తప్పదని పరిశీలకులు అంటున్నారు.  లోక్ సభ సాక్షిగా జగన్ సర్కార్ అప్పులపై వైసీపీ రెబల్ ఎంపీ ప్రశ్నకు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ జవాబు చెప్పిన రోజుల వ్యవధిలో రాజ్యసభలో  తెలుగుదేశం సభ్యుడు కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ చెప్పిన సమాధానం  పరస్పర విరుద్ధంగా ఉండటాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ జగన్ ప్రభుత్వ అప్పులన్నీ నిబంధనలకు లోబడే ఉన్నాయని చెబితే..  రాజ్యసభలో భగవత్ కరాద్  ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని దాటి జగన్ ప్రభుత్వం అప్పులను తీసుకుందనీ తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని   పేర్కొన్నారు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణించాలని సూచించారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి లోక్ సభలో రఘురామకృష్ణం రాజు ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఆమె వద్ద ఉన్న పరిమిత సమాచారం ఆధారంగానే ఇచ్చారని కుండబద్దలు కొట్టేశారు.  మొత్తంగా కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రం అప్పులపై ఇచ్చిన రెండు సమాధానాలనూ బేరీజు వేసుకుని చూస్తే జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందనీ పరిశీలకులు అంటున్నారు.  ఈ రెండు సమాధానాలనూ ఉటంకిస్తూ.. రచ్చబండలో భాగంగా బుధవారం (ఆగస్టు 2) న మీడియాతో మాట్లాడిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు జగన్ ప్రభుత్వ అప్పులపై తాను వెల్లడించిన వివరాలు అక్షర సత్యాలని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో జగన్ అయినా సరే ఆయన వంది మాగధులైనా సరే చర్చకు రావాలని సవాల్ విసిరారు.  తానే కాదు..  బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి  కూడా జగన్ అప్పుల బాగోతాన్ని పూసగుచ్చినట్లు వివరించారన్నారు.   జగన్ ప్రభుత్వం అప్పులు, ఏయే ఆస్తులను తాకట్టు పెట్టి ఎంతెంత అప్పు చేసింది అన్న వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే ఇప్పటికే అంటే ఈ ఆర్థిక సంవత్సరం లో తొలి నాలుగు నెలలలోనే 29 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఏపీ సర్కార్ కు మరో మూడువేల కోట్ల రూపాయల రుణానికి ఎలా అర్హత లభించిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

కేసీఆర్ ను వెంటాడుతున్న ఓట‌మి భ‌యం!

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతానంటూ ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేసి, చివరకు మహారాష్ట్రలో పాగాకు పరిమిత ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే ఓట‌మి  భ‌యం వెంటాడుతుందా?  జాతీయ రాజ‌కీయాలేమో కానీ.. సొంత రాష్ట్రంలో బొక్క‌బోర్లా ప‌డ‌బోతున్నామ‌న్న గుబులు రేగుతోందా?  అంటే విశ్లేషకులు ఔననే అంటున్నారు. తెలంగాణ‌లో  తిరుగులేద‌ని భావించిన కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఆర్‌గా మార్చి జాతీయ నేతగా మారిపోయారు. ఢిల్లీలో రాబోయే కాలంలో మ‌న‌మే కీల‌క‌మంటూ ఇటీవ‌ల తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో నిర్వ‌హించిన‌ బ‌హిరంగ స‌భ‌ల్లో  చెప్పుకుంటూ వ‌చ్చారు. కానీ, తెలంగాణ ప్ర‌జ‌ల్లో  తన ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందన్న సంకేతాలు రావడంతో  కేసీఆర్‌కు కొత్త భ‌యం ప‌ట్టుకుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో దేశ రాజ‌కీయాల సంగతి తరువాత ముందు  సొంత రాష్ట్రంలో ప‌ట్టు నిలుపుకోవాల‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల కేసీఆర్ చేతికి అందిన స‌ర్వేల ఆధారంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని అర్ధ‌మైంద‌ని, దీంతో కేసీఆర్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపుకు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. అందులో భాగంగానే  ప్ర‌భుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రైతు రుణ‌మాఫీ, వీఆర్ఏల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్త‌ర్వులు వంటి  నిర్ణయాలని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివ‌రి నాటికి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడోసారి సీఎం పీఠం ద‌క్కించుకోవాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవ‌ల కాలం వ‌ర‌కు తెలంగాణ‌లో   తిరుగులేద‌ని భావించిన కేసీఆర్‌కు తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీ దిమ్మ‌తిరిగేలా షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది.  క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘ‌న విజ‌యం త‌రువాత తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఇత‌ర పార్టీల్లో కీల‌క నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండంతోపాటు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లంతా ఏక‌తాటిపైకి రావ‌డంతో అధికార బీఆర్ఎస్‌కు దీటుగా ఆ పార్టీ ఎదిగింది. ఇటీవ‌ల‌ సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన అంత‌ర్గ‌త స‌ర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి గ‌ట్టిపోటీ త‌ప్ప‌ద‌ని తేలిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేసీఆర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యార‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వంపై రోజురోజుకు పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు కేసీఆర్  నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఆ నిర్ణయాలలో భాగంగానే  గత నాలుగేళ్లుగా  ఇదిగో  అదిగో రుణ‌మాఫీ అంటూ వచ్చిన కేసీఆర్ తాజాగా కాంగ్రెస్ దెబ్బ‌కు దిగొచ్చారు. రుణ‌మాఫీ అమ‌లుకోసం రూ.19వేల కోట్ల‌ను కేటాయిస్తున్న‌ట్లు ప్రకించారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌క్ష వ‌ర‌కు రైతుల బ్యాంకు రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విడుత‌ల వారిగా రైతు ర‌ణ‌మాఫీ అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. కానీ, నేటికీ రూ.35వేలలోపు వారికి మాత్ర‌మే రుణం మాఫీ అమ‌లైంది. మిగిలిన రైతులు రుణ‌మాఫీకోసం ఎదురుచూపులు త‌ప్ప‌లేదు. తాజాగా, ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు కేసీఆర్ పూర్తిస్థాయిలో రుణ‌మాఫీకి హామీ ఇచ్చారు. విడుత‌ల వారిగా సెప్టెంబ‌ర్ రెండ‌వ వారం వ‌ర‌కు పూర్తి రుణ‌మాఫీ చేస్తామ‌ని కేసీఆర్ చెప్పారు. దీంతో రైతుల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకొనే ప్ర‌య‌త్నం చేశారు.  అలాగే ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తున్నామ‌న్న ప్రకటన. ఈ నిర్ణ‌యంతో రాష్ట్రంలోని 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారిపోనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును ప్ర‌భుత్వం అసెంబ్లీ స‌మావేశాల్లో ఆమోదించాల్సి ఉంది. అయితే, ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఆర్టీసీ భూముల‌ను అమ్ముకొని సొమ్ముచేసుకునేందుకు కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నాయి. వీఆర్ఏ వ్య‌వ‌స్థ‌ను శాశ్వ‌తంగా ర‌ద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఫ‌లితంగా 20,555 మంది వీఆర్ఏ ల‌బ్ధిపొంద‌నున్నారు. వీరిని విద్యార్హ‌త‌ను బ‌ట్టి వివిధ శాఖ‌ల్లో కేటాయింపులు చేయ‌నున్నారు. దీనికితోడు పోడు భూముల ప‌ట్టాల పంపిణీసైతం ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి త‌ప్పించుకొనేందుకు సీఎం కేసీఆర్ అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్నార‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ‌లప‌డ‌టం వ‌ల్లే కేసీఆర్ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో  వరాలు కురిపిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ సాగుతోంది.  

చంద్రబాబు పెన్నా టూ వంశధార.. జగన్ ఎక్కడ నుంచి ఎక్కడికి?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. జగన్ సర్కార్ ఎక్కడ ఫెయిలైందో చంద్రబాబు అక్కడే ప్రజల నాడి పట్టుకుంటున్నారు. అందులో భాగమే పెన్నా టూ వంశధార టూర్. ప్రాజెక్టుల నిర్మాణంలో జగన్ సర్కార్ ఘోరంగా ఫెయిలైంది. ఇది రాజకీయ విశ్లేషకులు, సాగునీటి రంగ నిపుణులు చెప్తున్న మాటే. అయితే, ఇప్పుడు అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని చంద్రబాబు బయల్దేరారు. 'పెన్నా టు వంశధార' పేరుతో చంద్రబాబు ఆగస్టు 1 నుంచి ప్రాజెక్టుల సందర్శన మొదలు పెట్టారు. మొత్తం 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆగస్టు 1వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలైన ఈ కార్యక్రమంలో తొలి రోజు మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు.  ఆగస్టు 2న కొండాపురం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు.. గురువారం (ఆగస్టు 3) ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్‌లను సందర్శించారు. ఇక, శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్‌ కెనాల్‌ సందర్శించనున్నారు. కాగా, ఒకవైపు ప్రాజెక్టుల సందర్శిస్తూనే మరోవైపు ఎక్కడిక్కడే సభలు కూడా ఏర్పాటు చేసి.. నాలుగేళ్ళలో జరిగిన నష్టాన్ని లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనాలు రావడంతో.. జగన్ పులివెందులలో నాకు జనాలు ఎలా వచ్చారో ఒక్కసారి చూడు అంటూ  చూపించారు. పులివెందులలో టీడీపీ సభ జరగడం, పెద్ద ఎత్తున స్వాగతం పలకడం నిజంగా విశేషమే. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన మొదలై మూడు రోజులే  అయ్యింది. ఆయన పర్యటన మరో వారం రోజులు  కొనసాగుతుంది. ఈ వారం రోజులలో టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజలోకి చేరస్తాయి. కాగా ప్రాజెక్టుల నిర్మాణంలో వైసీపీ విఫలమవడానికి కారణం నిధులను కేటాయించకపోవడమే. ఎంతసేపూ పప్పు బెల్లాల మాదిరి తలకి ఇంత లెక్కేసి పంచడం, రాష్ట్రంలో అభివృద్ధి లేక ఆదాయానికి గండిపడడంతో తీవమైన నిధుల కొరత ఏర్పడింది. దీంతో జగన్ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోవడమే మానేసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు గత వారమే లెక్కలతో సహా ఎన్టీఆర్ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏకి పారేశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఇదే విషయంపై ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. కమాన్.. మీరేం చేశారో చర్చకు రండి.. ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇంత జరుగుతున్నా..  సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఎలాంటి స్పందన లేదు. టీడీపీని ఎదుర్కొనేందుకు వైసీపీ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. చంద్రబాబు చేసే ఆరోపణలను ఖండించలేకపోతోంది. కనీసం సమాధానం కూడా చెప్పలేకపోతోంది.   జగన్ తన తాడేప‌ల్లి  ప్యాలస్ లోఏవో వ్యూహాలు ర‌చిస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు తప్ప ఆయన బయటకి రావడం లేదు. వైసీపీపై నలువైపులా వ్య‌తిరేక‌త పెంచే చ‌ర్య‌ల‌ను టీడీపీ వేగ‌వంతం చేస్తోంది. ఎ  టీడీపీ దూకుడు మీద ఉంది. కానీ, వైసీపీలో ఎలాంటి జోష్ కనిపించడం లేదు. చంద్ర‌బాబు చేసే ఆరోపణలకు వైసీపీ నుండి ఎక్కడా ఎలాంటి  సమాధానం రావడం లేదు. సాగునీటి రంగానికి వ‌చ్చే స‌రికి.. లెక్క‌ల‌తో స‌హా వివ‌రించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం పెట్టింది పెద్దగా లేదు. ఏవో కాకి లెక్కలు తెచ్చి బురిడీ కొట్టించే తెలివితేట‌లు గల నేతలు వైసీపీ కేబినెట్‌లోనూ, స‌ల‌హాదారుల్లోనూ కనిపించడం లేదు. అందుకే వ్యక్తిగత దూషణకి దిగుతున్నట్లున్నారు. కానీ, ఇలాంటి ప్రజా ప్రయోజన ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోతే వైసీపీ కొంప మునగడం ఖాయం. మరి తాయిలాలే తనకి ఓట్లు తెస్తాయని ఇంకా జగన్ భ్రమలోనే ఉంటారా? లేక తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకొచ్చి చంద్రబాబు ఆరోపణలకు లెక్కలు చెప్తారా అన్నది చూడాల్సి ఉంది. 

వైసీపీ ధనయజ్ణం.. జల భగ్నం.. అదే తెలుగుదేశం ఆయుధం

మాట తప్పం.. మడమ తిప్పం.. ఒక్కసారి మాట ఇస్తే దానికే కట్టుబడి ఉంటా.. మాట ఇస్తే చేస్తా అంతే. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి చెప్పిన మాట. కానీ, ఒక్కసారి అధికారం దక్కించుకొని కుర్చీ ఎక్కాక ఆయన రివర్స్ విధానాలలాగే ఆయన నినాదాలు, హామీలూ కూడా రివర్స్ గేర్ లోనే అమలౌతున్నాయి.  అందుకే మద్యపాన నిషేధం, శాసన మండలి రద్దు వంటి వాటిలో నిర్మొహమాటంగా  యూ టర్న్ తీసుకున్నారు. ఇక జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నవరత్నాలలో మూడు నాలుగు రత్నాలు ఎప్పుడో  కంకరరాళ్లుగా మారిపోయాయి. జగన్ నవరత్నాలలో ఫీజ్ రీఎంబర్స్ మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, మద్యపాన నిషేధం, రైతు భరోసా, పేదలందరికీ ఇల్లు, రూ.3 వేల పెన్షన్, అమ్మఒడి, ఆసరా చేయూత ఉండగా.. ఇందులో ఇప్పటికి ఏదీ పూర్తిగా అమలు కాలేదు. కావడం లేదు. పెన్షన్లు ఇప్పటికీ రూ.3 వేలు కాలేదు. రైతు భరోసాలో కేంద్ర వాటా కలుపేసుకుని ఏదో గొప్పగా చేసేస్తున్నామంటూ సొంత జబ్బలు చరిచేసుకుంటున్నారు జగన్. అమ్మ ఒడికి ఇంటికి ఒకరికే అనే వంకలు పెట్టారు. లబ్ధి దారుల విషయంలోనూ భారీగా కోతపెట్టారు. ఇక ఆరోగ్య శ్రీ సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మేడు. బిల్లులు ఇవ్వడం లేదని ఆసుపత్రులలో సేవలు నిలిపేస్తున్నారు. ఫీజ్ రీఎంబర్స్ మెంట్ చెల్లించడం లేదని సంస్థలు విద్యార్థులతో ఫీజులు కట్టించుకొని ప్రభుత్వం ఇచ్చినపుడు తిరిగి చెల్లిస్తామని చెప్తున్నాయి. ఇక మధ్య నిషేధం ఊసే లేదు. ఇక జల యజ్ఞం కాస్తా జల భగ్నంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ నవరత్నాల్లో 4వ రత్నం జలయజ్ఞం గత 4 ఏళ్లలో నవ్వులపాలైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తామని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని ఇచ్చిన హామీకి జగన్ తిలోదకాలిచ్చేశారు. ఫలితంగా ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీనినే ఇప్పుడు తెలుగుదేశం ఆయుధంగా మలచుకుంటున్నది. జగన్ గత ఎన్నికలలో ఏ హామీలైతే ఇచ్చి అమలు చేయలేదో.. ఆ హామీలనే  ఇప్పుడు తెలుగుదేశం ఆయుధాలుగా మార్చుకుని జగన్ సర్కార్ పై ఎక్కుపెడుతున్నది.  అలా ఇప్పుడు చంద్రబాబు మొదలు పెట్టిందే ప్రాజెక్టుల సందర్శన. దానికి పెట్టుకున్న పేర్లే 'జలభగ్నమైన జలయజ్ఞం', 'భగీరథుడు చంద్రబాబు.. భస్మాసురుడు జగన్'. జగన్ అంటే చెప్పింది చేయడని సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు టీడీపీ కంకణం కట్టుకుంది. చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులెలా పరుగులు పెట్టించిందీ, ఈ 4ఏళ్లలో ప్రాజెక్టులెలా పడకేసిందీ ఇంకా జనం కళ్లముందే ఉంది. సోమవారం పోలవరం వంటి నినాదాలు ఇంకా ప్రజల చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి. తాను కూడా ఒక ఇంజనీర్ గా, ఒక మేస్త్రీగా, ఒక కూలీగా సోమవారం సోమవారం పోలవరంలో అడుగుపెట్టి కాంట్రాక్టర్లను, అధికారులను పరుగులు పెట్టించిన దృశ్యాలు ఇంకా ప్రజల కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. నీటి పారుదల శాఖను నోటి పారుదల శాఖగా మార్చి వైసీపీ మంత్రులు చెప్పిన వాయిదాల గడువులు సోషల్ మీడియాలో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు నడుం బిగించారు. ఇంకేముందు ఈ వ్యవహారం ప్రజల మధ్యకి వెడితే   జగన్ సర్కార్ ను జనం ఛీకొట్టడం ఖాయమని భావించిన వైసీపీ శిబిరంలో కల్లోలం మొదలైంది. పోలవరానికి పట్టిన శని జగన్, రాయలసీమ ద్రోహి జగన్ అంటూ చంద్రబాబు నిప్పులు చెరుగుతుంటే వైసీపీ నేతల కళ్ళలో నెత్తుటి ధార కనిపిస్తుంది. ఆధునిక దేవాలయాల్లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పాడుబెడితే సమాజానికే అరిష్టం అంటూ టీడీపీ నేతలు గొంతెత్తి స్లొగన్స్ ఇస్తుంటే వైసీపీ కార్యకర్తలకు ఊపిరి అందడం లేదు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా సమాజాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులపై శీతకన్ను వేయడం లేదని టీడీపీ ప్రచారం మొదలు పెడితే వైసీపీ సమాధానం చెప్పుకోలేక హ్యాండ్సప్ అనేస్తున్నది.

బాబు దెబ్బకు దిక్కులు చూస్తున్న జగన్ !

భగీరథుడు చంద్రబాబు.. భస్మాసురుడు జగన్ అంటూ తెలుగుదేశం నాయకులు, శ్రేణులూ సూటిగా సుత్తిలేకుండా వైసీపీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం వైఫల్యాలకు సమాధానం చెప్పలేక విపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు పరిమితమౌతున్నారు. టీడీపీ, జనసేన పోటాపోటీగా జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు, ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలలోకి తీసుకువెడుతున్నాయి.ఈ విషయంలో తెలుగుదేశం సూటిగా సుత్తి లేకుండా గణాంకాలు, ఆధారాలతో వైసీపీ సర్కార్ ను, జగన్ అరాచకత్వాన్ని ఎండగడుతుంటే..  వైసీపీ మాత్రం తెలుగుదేశం విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో వాటిని వదిలేసి విపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతోంది.  ఒకవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్య వంతం చేయడానికి తాను ముందుండి  పార్టీని నడిపిస్తుంటే.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రతో తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.  దీంతో క్షేత్ర‌స్థాయిలో టీడీపీ  నాయ‌కుల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు కూడా స‌మ‌రోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. లోకేష్ ఊరూరూ తిరుగుతూ తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేస్తూ.. నువ్వేం చేశావో చూపించు జగన్ రెడ్డీ అంటూ సవాల్ విసురుతున్నారు. ఇదే ఊపులో చంద్రబాబు ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల సందర్శనకి తెరలేపి.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిందేంటి? అంటూ డైరెక్ట్  అటాక్ మొదలు పెట్టారు. అటు లోకేష్.. ఇటు చంద్రబాబు   వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను, కుంటుపడిన అభివృద్ధిని  సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నిస్తుంటే.. ఆ ప్రశ్నలకు బదులిచ్చే పరిస్థితి లేని వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలు  టీడీపీ నేతలపై వ్యక్తిగత మాటల దాడికి దిగుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలను, యువతకి వచ్చిన ఉపాధిని, చేసిన అభివృద్ధిని లోకేష్ ఆధారాలతో సహా చూపెడుతుంటే.. వైసీపీ నేతలు లోకేష్ అప్పుడెప్పుడో విదేశాలలో స్విమ్మింగ్ పూల్   ఫోటోలను వైరల్ చేసి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాము చేసిన అభివృద్ధి ఏంటో చెప్పుకోలేని వైసీపీ నేతలు ఇలా వ్యక్తిగత విమర్శలతో ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఇక చంద్రబాబు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తూ ఈ నాలుగేళ్ళలో నిధులు లేక, ఎక్కడివక్కడే ఆగిపోయిన ప్రాజెక్టుల నిర్మాణాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటే.. పవన్ కళ్యాణ్  సినిమా బ్రో లో మంత్రి అంబటిని చులకన చేసేలా డైలాగులు ఉన్నాయంటూ  వైసీపీ నేతలు నంగనాచి ఏడుపులు ఏడుస్తున్నారు. ఇదిగో ఈ నాలుగేళ్ళలో ఇన్ని నిధులు ఇచ్చాం.. ఇంత కట్టాం అని చూపించాల్సిన వైసీపీ నేతలు.. ప్రజలకు ఏ మాత్రం అవసరమేలేని  సినిమా డైలాగులతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖకి మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సింది పోయి బ్రో సినిమాలో తనను కించపరిచేలా డైలాగులు ఉన్నాయంటూ  మీడియా ముందు గంటల తరబడి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.  అంబటి వ్యాఖ్యలపై చంద్రబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  తాను ప్రాజెక్టులు, నీళ్లు వ్య‌వ‌సాయం గురించి మాట్లాడ‌వ‌య్యా అంటే.. బ్రో సినిమాలో త‌న‌నేదో అన్నార‌ని.. త‌న‌నేదో చేశార‌ని రోజుల త‌ర‌బ‌డి మాట్లాడతాడు. ఈయ‌నా మ‌న‌కు ఇరిగేష‌న్ మంత్రి. ఇదీ.. మ‌న ఖ‌ర్మ‌'' అంటూ చంద్రబాబు చురకలంటించారు. అంతేకాదు, మ‌నం చేసే ప‌నులు బాగుంటే.. సినిమాల్లోనూ బాగానే చూపిస్తారు. ఆయ‌న హిస్ట‌రీని ఒక్క‌సారి చూసుకుంటే.. ఆ మంత్రి ఏమ‌న్నారో .. ఏం చేశారో.. అంద‌రికీ తెలుస్తుంది.  గంట‌, అర‌గంట అని మాట్లాడేవారు.. మ‌న‌కు మంత్రులుగా ఉన్నారని గతంలో వైరల్ అయిన అంబటి కాల్ రికార్దింగ్స్ ను ప్రజలకు గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే ఒకవైపు టీడీపీ రాష్ట్రంలో సమస్యలు, జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ.. 'భగీరథుడు చంద్రబాబు-భస్మాసురుడు జగన్' అనే ట్యాగ్ లైన్ ప్రజలలోకి తీసుకెళ్తుంటే.. పాపం వైసీపీ నేతలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతూ ప్రజా సమస్యలను ప్రశ్నించిన వారిపై బురదజల్లే పని పెట్టుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కానీ, ప్రజలకు ఈ విషయం ఎప్పుడో అర్ధమయింది కనుక ఇక ఫలితం అనుభవించాల్సింది వైసీపీనే!

సాదా సీదాగా జూపల్లి కాంగ్రెస్ రీ ఎంట్రీ !

మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు  ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి మరి కొందరు జూపల్లి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆరేడు నెలలుగా సాగుతున్న జూపల్లి, పొంగులేటి రాజకీయ ప్రహసనానికి తెర పడింది. నిజానికి, జూపల్లి పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యారు.మంత్రి కూడా అయ్యారు. సో ... జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఒక విధంగా స్వగృహ ప్రవేశమే అని చెప్పాలి.  అయితే అదేమిటో కానీ జూపల్లి స్వగృహ ప్రవేశం ఆయన అనుకున్నట్లుగా   జరగలేదు. జూపల్లితో పాటుగా బీఆర్ఎస్ బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కోరుకున్న  విధంగా, కోరుకున్న ముహూర్తానికి కాంగ్రెస్  కండువా  కప్పుకున్నారు. జూలై 2 న, ఖమ్మం జిల్లాలో సొంత గడ్డపై, లక్షల మంది ప్రజలు పాల్గొన్న బ్రహ్మాండమైన జనగర్జన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతే కాదు  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభతో జన గర్జన  సభ తోడవడంతో పొంగులేటి ఎంట్రీకి మీడియాలో  మంచి మైలేజి వచ్చింది. మీడియా చర్చల్లో ప్రముఖంగా నిలచింది    నిజానికి అదే సభలో జూపల్లి కుడా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా  జూపల్లి, పొంగులేటి సభను తలదన్నేవిధంగా కొల్లాపూర్ లో భారీ బహిరంగ  సభ నిర్వహించి రాహుల్ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవాలని భావించారు. అయితే కారణాలు ఏవైనా కొల్లాపూర్ సభ రెండు మార్లు వాయిదా పడింది.  ఈ నేపధ్యంలోనే జూపల్లి కృష్ణా రావు ఢిల్లీ వెళ్లి చేరిక క్రతువును కానిచ్చుకున్నారు. అయితే అదేమిటో కానీ వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా  ఢిల్లీ వెళ్ళినా జుపల్లికి నిరీక్షణ తప్పలేదు.అనుకున్న విధంగా చేరిక క్రతువు జరగ లేదు. కనీసం, ఢిల్లీలో అయినా రాహుల్ లేదా ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని జూపల్లి ఆశించారు. అయితే, చివరకు ఆ కోరిక తీరలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంక్షలో జూపల్లి, అయన అనుచరులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మళ్ళీ అక్కడ కూడా జూపల్లికి ముహూర్తం కలిసి రాలేదు. నిజానికి   బుధవారమే (ఆగస్టు 2)  జూపల్లి,కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి తదితరుల పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే బుధవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరడానికి వారు ఢిల్లీ చేరుకున్నారు. అయితే  తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌ నేతలతో సమావేశాలతో ఖర్గే బిజీబిజీగా గడిపారు. దాంతో జూపల్లి చేరిక గురువారానికి వాయిదా వేశామని మల్లు రవి వెల్లడించారు. చివరకు, ఈరోజు, ఖర్గే, సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, , ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. అంజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే.. కేసీఆర్ గాలి తీసేసిన మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ గాలి తీసేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ  కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కేవలం ఎన్నికల స్టంటేనని అసలు నిజం చెప్పేసి నాలిక కరుచుకున్నారు. ఔను కేసీఆర్ తాను అసాధ్యం అని గతంలో చెప్పిన సంగతి విస్మరించి  మరీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  గతంలో కేసీఆర్ మీడియా సమావేశంలోనే.. ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడమనే ఒక అంసబద్ధమైన, అసంభవమైన, అర్థరహితమైన, ఒక తెలివి తక్కువ నినాదాన్ని పట్టుకుంటరా?  అదో నినాదమానండీ! నాకర్థం కాదు. ఒక పనికిమాలిన, పిచ్చి రాజకీయ పార్టీలు, తలకాయమాసినోడు, నెత్తిమాసినోడు.. గీళ్లా.. నాకర్థం కాదు. అర్థముండాలె కద! ఆర్టీసీ విలీనమనేది వందశాతం అసంభవం. గవర్నమెంట్‌లో కలపడమనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంతకాలం అది జరిగేది కాదు. అని చెప్పారు. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ గతంలో తాను చెప్పిన మాటలను తానే ఖండించిన చందంగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశారు. దీనిపై కేసీఆర్ కేబినెట్ లో కార్మిక మంత్రిగా ఉన్న చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ( ఆగస్టు 2)  విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి ఆర్టీసీ విలీనం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని కుండబద్దలు కొట్టేశారు. బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ అనీ, ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఎన్నికల స్టంట్ లు కామనే కదా అని అన్నారు.   ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలనీ, అవి రెండూ తమ అధినేత వద్ద పుష్కలంగా ఉన్నాయనీ మల్లారెడ్డి తన వ్యాఖ్యలను సమర్ధించుకుని, సరిదిద్దుకోవాలని ప్రయత్నించినా.. ఆర్టీసీ ఎన్నికల స్టంటేనన్న ఆయన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి