బీహార్ లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ , పలువురి దుర్మరణం ,60 మందికి తీవ్రగాయాలు

దేశంలో రోజు రోజుకు రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఒక ప్రమాదం మరిచిపోయే లోపే మరో ప్రమాదం సంభవిస్తుంది. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది.బీహార్‌లో బుధవారం రాత్రి రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి గువాహటికి బయలు దేరిన 12506 నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 60 మంది తీవ్రగాయాల పాలయ్యారు. మొత్తం ఆరు బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు పేర్కొన్నారు.  ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. పాట్నాలోని కీలక ఆసుపత్రులైన పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించింది. సహాయక చర్యల కోసం ఘటనాస్థలానికి పది అంబులెన్స్‌లను పంపించింది.  కాగా, ఈ ప్రమాదంపై జిల్లా విపత్తు నిర్వహణ శాఖతో చర్చించామని బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ‘‘విపత్తు నిర్వహణ శాఖతో పాటూ ఆరోగ్య శాఖ, బక్స్‌ర్ జిల్లా యంత్రాంగంతో మాట్లాడి పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టాలని సూచించాం. పాట్నాలోని ఆసుపత్రులను కూడా హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించాం’’ అని పేర్కొన్నారు.

ఈసీ బదలీలలేనా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇలా ప్రకటించిందో లేదో అలా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికల బదలీల ప్రక్రియ ప్రారంభించేసింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులలో  బాధ్యతలు నిర్వహించే శాఖలను, యంత్రాంగాన్ని తన అధీనంలోకి తీసుకుంటుంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఒక అడుగు ముందే ఉంది. ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే అలా యంత్రాంగాన్ని తన అధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. కీలక అధికారుల బదలీ చేసేసింది.  సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికలలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? అన్నదానితో సంబంధం లేకుండా ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఉండాలి కూడా. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని సర్కార్ కొలువు దీరిన నాటి నుంచి ఆ పరిస్థితి లేకుండా పోయింది. వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రజలలో ఎలా అయితే విశ్వసనీయత లేకుండా పోయిందో.. కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా అలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. 2014లో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి సర్కర్ ఏర్పాటైంది. అప్పటి నుంచీ క్రమక్రమంగా కేంద్రం వ్యవస్థలపై ఆధిపత్యం సాధించే విధంగా పావులు కదుపుతూ వచ్చిందని అంటున్నారు. అధికారుల నియామకం నుంచి, బదలీల వరకూ అస్మదీయులకు పెద్ద పీట వేయడం మొదలైందని సోదాహరణంగా వివరిస్తున్నారు. అన్నిటికీ మించి అత్యంత కీలక స్థానాలలో  ఉన్న వారిలో అత్యథికులు ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైన  గుజరాత్ కు చెందిన వారే కొలువుదీరి ఉండడాన్ని చూపుతున్నారు.  ఇక 2019 ఎన్నికలకు ముందు.. అంతకు ముందు వరకూ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఆ కూటమి నుంచి బయటకు వచ్చింద. విభజన హామీలు నెరవేర్చే విషయంలో, మరీ ముఖ్యంగా రెవెన్యూలోటుతో బీద రాష్ట్రంగా మిగిలిన ఏపీకి అందించాల్సిన  సహకారం విషయంలో మోడీ సర్కార్ వైఖరితో విబేదించిన చంద్రబాబు.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. ఫలితం.. 2019 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఆయనను చక్రబంధం చేసేసిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు.  2019లో ఎన్నికల కోడ్ రాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సీఎస్ సహా కీలక నేతలందరినీ బదలీ చేసేసింది. ఏ  అధికారీ  కూడా  చంద్రబాబు మాట వినని పరిస్థితిని క్రియోట్ చేసింది. చివరాఖరికి అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన స్థాయిని కూడా పట్టించుకోకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారంటే బాబు ఓటమే లక్ష్యంగా బదలీలు, నియామకాలు ఎలా జరిగాయో అర్ధం అవుతుంది.   అప్పట్లో పరిస్థితి అలా మారడానికి  చంద్రబాబు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తో విభేదించడమే కారణమని అప్పట్లోనే  పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు మోడీతో విభేదించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇలా  షెడ్యూల్ విడుదల కాగానే అలా కీలక  అధికారులను ఎన్నికల సంఘం బదలీ చేయడమే నిదర్శనం అంటున్నారు.  సాధారణంగా అధికారుల అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల  సంఘం వాటిని పరిశీలించి  బదలీ  చేస్తుంది. కానీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలోనూ, ఇప్పుడు 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులతో సంబంధం లేకుండానే.. బదలీలు చేసేసింది. తెలంగాణలో అయితే షెడ్యూల్ ప్రకటనకు ముందే ఎవరెవరిని బదిలీ చేయాలీ, ఎవరెవరిని ఎన్నికల విధుల్లో ఉండేలా చేయాలి అన్న  జాబితారెడీ చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా  ఉందా అన్న అనుమానాలు వ్యక్తం  అయ్యేలా తాజా బదలీలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   నోటిఫికేషన్ విడుదల నాటికి మరిన్ని బదలీలు ఉంటాయన్న అంచనాలూ ఉన్నాయి. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు యంత్రాంగం నుంచి ఎటువంటి సహాయ సహకారాలూ అందకుండా  చేయడమనే లక్ష్యంతో ఈ బదలీల  పర్వం ఉందన్న విమర్శలు అయితే ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికల  సమయంలో అధికార పార్టీకి యంత్రాంగం  నుంచి సహాయ  సహకారాలు అందకూడదనీ కీలక శాఖల ఉద్యోగులందరినీ ఎన్నికల సంఘం అధీనంలోకి తీసుకుంటుంది. అయితే ఈ విషయంలో పైస్థాయి రాజకీయ ఒత్తిడుల కారణంగా రాజకీయంగా ఎవరికో లబ్థి చేకూర్చాలన్నట్లుగా బదలీలు ఉన్నాయన్న అనుమానాలు తలెత్తేలా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాంటి తీరు వల్ల ఎన్నికల సిస్టంపై జనాలలో నమ్మకం పోయే పరిస్థితి వస్తుందని అనుమానిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం బదలీల ప్రక్రియను ఒక్క తెలంగాణలోనే ఆరంభించడమేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి  అనుకూలంగా వ్యవహరించే అధికారుల బదలీలను ఎవరూ తప్పు పట్టరు కానీ, వెస్టెడ్ ఇంట్రస్ట్ తో బదలీలను చేపట్టారన్న అనుమానాలు వ్యక్తం కాకుండా ఫిర్యాదులు, ప్రతిపాదనలూ వంటి వాటి జోలికి పోకుండా బదలీలు, నియామకాలు చేపట్టడంతోనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని  అంటున్నారు. 2019 లో ఏపీలో ఏం జరిగిందో.. ఇప్పుడు 2023 ఎన్నికల సమయంలో తెలంగాణలో అదే జరుగుతోందని అంటున్నారు. 

మోదీ జగన్ క్విడ్ ప్రో కో!

అవసరానికి అప్పుచేయి, తప్పులేదు. అయితే, చేసిన అప్పును సద్వినియోగం చేసుకో... ఆదాయాన్ని పెంచుకునే ఇంధనంగా మార్చుకో ... ఆర్థిక వేత్తలే కాదు, అమ్మా నాన్నలు కూడా అదే చెపుతారు. అంతకంటే ముందు, ఆర్థిక క్రమశిక్షణ అలవరచుకో మంటారు.  అనవసర వ్యయాలను,వ్యసనాలను తగ్గించుకో మని హితవు పలుకుతారు. అప్పు చేసి పప్పుకూడు వద్దని, అప్పుల పాలవుతావని పెద్దలు హెచ్చరిస్తుంటారు.  ఇది కేవలం వ్యక్తులు, కుటుంబాలకు మాత్రమే కాదు. ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. అయితే  ఆంధ్రుల దురదృష్టం అదేమో కానీ  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అదుపు తప్పి అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి ఇంకా ఇంకా అప్పులు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుని  అనుమతులు ఇచ్చేస్తోంది. ఇదేమిటని ప్రశ్నించడం లేదు. అంతేకాదు  ఇంకా ఇంకా అప్పులు చేయమని ప్రోత్సహిస్తోంది. అడిగిందే తడవుగా కాదు కాదు అడగక ముందే కొత్త అప్పులకు అనుమతులు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడంలో కేంద్రం రాష్ట్రానికి ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా  ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా ఏడున్నర శాతం వడ్డీకి  మరో రూ. 450 కోట్లు అప్పు చేసింది. ఇదిగాక, కార్పొరేషన్ల ద్వారా మరో రూ. 23వేల కోట్లు .. ఇలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే రూ.67 వేల 500 కోట్లు అప్పు చేసింది. అయినా ఇంత  వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదు.  ఇలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అప్పులు పెంచుకుంటూ పోతోంది. అంతే కాదు ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వాలన్న స్ఫృహ కూడా లేకుండా వ్యవహరిస్తోంది.  ఫలితంగా వైసీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో  కేంద్రంలోని జగన్ ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్ గా మార్చి వేశారు. అభివృద్ధి కుంటుపడింది.కుంటు పడడం కాదు అడుగంటి  కనిపించకుండా పోయింది. కాగితాల మీద మాత్రమే కనిపించే అభివృద్ధి నిధులు, బడ్జెట్ కేటాయింపులు, వాస్తవంలో వడ్డీల చెల్లింపు ఖాతాలలో చేరి పోతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో పట్టాలు తప్పి పరుగులు తీస్తున్న  జగన్ పాలనలో  అప్పులపై అసలు, వడ్డీ చెల్లింపులు రెట్టింపయ్యాయి. మూలధన వ్యయం  పూర్తిగా పడకేసేసింది.రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు 100శాతం సొమ్ము రాష్ట్రమే భరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలైతే 50 నుంచి 90 శాతం ఖర్చు కేంద్రం భరిస్తుంది. మిగిలింది మాత్రమే రాష్ట్రం భరించాలి. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉంది.  కానీ రాష్ట్ర వాటా చెల్లించే పరిస్థితి లేక రాష్త్రం పెద్ద మొత్తంలో కేంద్ర నిధులను కోల్పోతోంది. ఫలితంగా, అప్పులు పెరిగి, ఆదాయం తరిగి  అప్పులపై కట్టే వాయిదాలు రెండింతలు పెరిగాయి.  ముందే అనుకున్నట్లుగా తెచ్చిన అప్పులు రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే పనులు, ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తే, అంతో ఇంతో అభివృద్ధి జరిగేదే. కానీ  అప్పు తెచ్చిన లక్షల కోట్లను జగన్‌ వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం బటన్ లు నొక్కేందుకే ఉపయోగించుకున్నారు.   ఈ అప్పులు, వడ్డీల చెల్లింపుల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగినా సరే  ఖాతరు చేయడం లేదు.  ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు రివర్స్ పాలనను రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు.   టీడీపీ హయాంలో చివరి ఏడాది 2018-19లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్‌ డబ్బు ఇవ్వడం కోసం నిర్ణయించిన బడ్జెట్‌ కేటాయింపుల్లో 70.34 శాతాన్ని ఖర్చుచేశారు. కాగ్‌ నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో జగన్‌ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం చేసిన బడ్జెట్‌ కేటాయింపుల్లో ఖర్చు చేసింది 55 శాతం మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పేపర్‌పై వేసిన గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రం ఇచ్చిన మ్యాచింగ్‌ డబ్బు కేవలం 43.51 శాతమే. ఇందులో చాలావరకు వాస్తవిక ఖర్చు కంటే పీడీ ఖాతాలకు చేసిన సర్దుబాట్లే ఉంటాయి. కాబట్టి, ఈ ఆరు నెలల్లో కేంద్ర పథకాల కోసం జగన్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు 43.51 శాతం కంటే కూడా తక్కువగా ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెపుతున్నారు.  అంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెంచుకునేందుకు కేంద్రం ఉదారంగా అనుమతులు మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చుకోలేక కేంద్రం వాటాను వదులుకుని కేంద్రం ఖర్చులు తగిస్తోంది. ఒక విధంగా చూస్తే.. కేంద్ర రాష్ట్ర త్వాల  మధ్య  జగన్ రెడ్డి మార్క్  క్విడ్ ప్రో కో  వ్యవహరం నడుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,  రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలు  బానే ఉన్నాయి. అయితే  మోడీ, జగన్ చాటు మాటు వ్యహరాలతో రాష్ట్రం వందల ఏళ్ళు వెనక్కి పోతోంది. నిజానికి, తప్పు చేయడమే కాదు, తప్పును సమర్ధించడం కూడా నేరమే అవుతుంది. అందుకే  ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేసిన  జగన్ రెడ్డి ఆర్థిక నేరస్థుడు అయితే  అ నేరంలోమోడీకీ వాటా ఉందని పరిశీలకులు అంటున్నారు.  

బాబుపై అంబటి, గుడివాడ వ్యాఖ్యలు.. వైసీపీని నిండా ముంచేసినట్లే?

తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ చెరో వైపు నుంచి వైసీపీ సర్కార్ వైఫల్యాలు, జగన్ అరాచకాలను విమర్శలతో చెండాడుతుంటే  తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యో, ఓటమి తథ్యమనే భయమో.. లేక లేక ఎలాగూ ఓడిపోతాం అధికారం ఉన్నప్పుడే   కక్ష తీర్చుకోవాలని చేసిందో  ఓమో కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఈ అక్రమ  అరెస్టుపై తెలుగు రాష్ట్రాలు, దేశంలోనే కాకుండా  ఖండాలు దాటి కూడా ఖండనలు, నిరసనలు వెల్లువెత్తుతుండటంతో వైసీపీ పెద్దలకు తాము చేసిన తప్పు తెలిసొచ్చింది. దీంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని, బీజేపీ మీదకి నెట్టి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించారు. సంబంధం లేదని జగన్ చెప్పినా నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేకపోగా.. తన  ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తనకే తెలియదని తనంతట తనే చెప్పుకొని ప్రజలలోనే కాదు.. పార్టీ శ్రేణులలోనూ పలుచన అయ్యారు. ఇంత కాలం తెరవెనుక నుంచే అయినా ఇంత కాలం అన్ని విధాలుగా అండాదండాగా నిలుస్తున్న బీజేపీకి సైతం ఆగ్రహం కలిగింది. ఇంత జరిగినా, స్వయంగా  సీఎం చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని చెప్పినా మంత్రులు మాత్రం లేదు లేదు చంద్రబాబు అక్రమ అరెస్టు తమ పనేనని  బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అయితే, ప్రజా సమస్యలపై కనీసం స్పందించని మంత్రులు చంద్రబాబు అరెస్టుపై మాత్రం విరామం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ కుట్రని తెలుగుదేశం శ్రేణులు బలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా చంద్ర‌బాబు అరెస్టుపై మరోసారి స్పందించిన మంత్రి అంబ‌టి రాంబాబు తెలుగుదేశం ఆరోపణలకు బలం ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు.  అబ్బే తమకు క‌క్ష సాధింపు లేదంటూనే.. “ఏం పీకుతాడు.. ఏం పీకుతాడు.. అని చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రెండు పీకి సెంట్ర‌ల్ జైల్లో పెట్టాం అంటూ అంబటి బాబుని తమ సర్కారే.. అక్రమంగా, అడ్డగోలుగా అరెస్టు చేసిందని అన్యాపదేశంగానైనా అంగీకరించేశారు. రాజ‌శేఖ‌ర‌ రెడ్డే న‌న్నేం పీక‌లేక‌పోయాడు.. జ‌గ‌నేం పీకుతాడ‌ని చంద్ర‌బాబు అన్నాడు. అందుకే రెండు పీకి జైల్లో పెట్టాం.. నోరు పారేసుకుంటే ఇలానే ఉంటుంది.. ఒళ్లు జాగ్ర‌త్త‌గా పెట్టుకుంటే మంచిది అంటూ అంబ‌టి  చెలరేగిపోయారు. అంబటి వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు అరెస్ట్ కు స్కిల్  కేసు కేవలం సాకు మాత్రమేనని, అసలు విషయం ఆయన జగన్ ను విమర్శించినందుకు కక్షసాధింపుతో చేసిన అరెస్టేననీ స్పష్టంగా అర్ధమౌతోందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కాగా, తాజాగా చంద్ర‌బాబు నాయుడు జైల్లో తీవ్ర ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. జైల్లో స‌రైన వెంటిలేష‌న్ లేక‌పోవ‌డం, బ‌య‌ట ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డం, జైలు గ‌దిలో ఏసీ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌క‌పోవడం వంటి కార‌ణాల‌తో చంద్ర‌బాబు  అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని స్వ‌యంగా జైలు అధికారులే తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వెటకారంగా మాట్లాడారు.  చంద్ర‌బాబు ఉన్న‌ది ప్ర‌కృతి వ‌నంలో కాదు.. జైల్లో అన్న సంగ‌తిని ఆయ‌న మ‌రిచిపోయారు  అని మంత్రి గుడివాడ వ్యాఖ్యానించారు. అంతేకాదు, జైల్లో ఉన్న చంద్ర‌బాబు సింప‌తీ కోసం అనారోగ్యం అంటూ త‌న అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేయించుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. మంత్రి గుడివాడ వ్యాఖ్య‌ల‌పై తెలుగుదేశం శ్రేణులే కాదు ప్రజలు కూడా తీవ్ర‌స్థాయిలో మండిపడుతున్నారు. ఆధారాలు లేకుండా జైల్లో నిర్బంధించ‌డ‌మే కాకుండా.. చంద్ర‌బాబు అనారోగ్యంపై కూడా వెటకారంగా మాట్లాడడం వైసీపీ నేతల సైకోయిజానికి నిదర్శనమంటున్నారు. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్.. ఇద్దరూ కీలక శాఖలకు మంత్రులు. ఒకరు రాష్ట్రానికి ప్రాణాధారమైన నీటి పారుదల శాఖకి మంత్రి కాగా మరొకరు రాష్ట్రానికి తిండిపెట్టే పరిశ్రమలు, ఉపాధి, ఐటీ శాఖల  మంత్రి. కానీ, ఈ ఇద్దరూ చంద్రబాబు జైల్లో ఉన్న ఈ నెల రోజులలో ఆయా శాఖలకు సంబంధించి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క రివ్యూ మీటింగ్ లేదు. కానీ, ఈనెల రోజులలో చంద్రబాబు అరెస్టుపై డజనుకుపైగా మీడియా సమావేశాలు నిర్వహించారు. వీళ్ళే జడ్జీల మాదిరి చంద్రబాబు అవినీతి పరుడని గొంతు చించుకోవడం, చంద్రబాబును జైల్లో వేశామని చొక్కాలు చించుకోవడం. ఇప్పటికే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరుపై మండిపడుతున్న ప్రజలు.. మంత్రుల మీడియా సమావేశాలను చూసి చీదరించుకొనే పరిస్థితికి వచ్చారు. దీంతో ఇప్పుడు వీళ్ళు ఎంత ఎక్కువగా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడితే వైసీపీకి అంత ఎక్కువ నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణలోనూ టీడీపీ-జనసేన పొత్తు?.. ఎఫెక్ట్ ఎవరిపై?

ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసిఎన్నికలకు వెళ్లనున్నాయి.  ఈ రెండు పార్టీల మధ్యా పొత్తు విషయంలో  ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇక బీజేపీని కూడా కలుపుకొని వెళ్తాయా? లేదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో ఉన్నా తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి మాత్రం బీజేపీ ఊసే రావడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పినట్లుగానే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే  ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న తెలంగాణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అధికారం దక్కించుకునే స్థాయిలో లేకపోయినా తెలంగాణ, జనసేనలకు తెలంగాణలో  పెద్ద సంఖ్యలో క్యాడర్ ఉంది. అభిమానులు ఉన్నారు. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో  ప్రాంతంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సత్తా నేటికీ తెలుగుదేశం పార్టీకి ఉంది.  ఈ నేపథ్యంలోనూ తెలంగాణలో తెలుగుదేశం,జనసేన  పొత్తు, పోటీ ప్రభావంపై కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో  ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎవరికీ అర్ధం కానీ పజిల్ గా కనిపిస్తున్నది.  మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? లేక రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగరనుందా? బీజేపీ ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుంది?  మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పార్టీల వైపు వెళ్లిన ఆంధ్రా సెటిలర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికితే తప్ప తెలంగాణలో ఈసారి ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పరిస్థితి లేదు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదన్న భావన ఉంది. తెలుగుదేశం, జనసేనలు తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నా రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందా? ఉండదా అన్న దానిపై మాత్రం ఇప్పటికింకా స్పష్టత లేదు. అయితే తెలంగాణ  తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈ విషయంపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేనతో తమ పార్టీ కలసి ముందుకు సాగుతుందని  అన్నారు. ఏపీలో  తమ పార్టీతో జనసేన పొత్త పెట్టుకుందనీ, అది  తెలంగాణాలో కూడా ఉంటుందని  కాసాని అన్నారు. అంతేకాదు,  ఒకటి రెండు రోజులలో తాను రాజమహేంద్రవరంవెళ్ళి చంద్రబాబును ములాఖత్ లో కలుసుకుని ఈ విషయంపై చర్చిస్తానన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో కూడా ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. కాసాని వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలలో మరో కోణం ఆవిష్కృతమైనట్లైంది. తెలంగాణలో బీజేపీతో పొత్తు లేదని తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు పవన్ కళ్యాణ్  కూడా తెలంగాణలో బీజేపీతో కలిసివేళ్లేందుకు సుముఖంగా  లేరు. ఇక  కాసాని చెప్పినట్లుగా తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తే తెలంగాణ ఎన్నికలలో వీరి పొత్తు భారీ ప్రభావం చూపడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎన్ని సీట్లు గెలుచుకుంటారన్నది పక్కన పెడితే.. చాలా నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ఈ కూటమి కచ్చితంగా నిర్దేశిస్తుందన్న పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జనసేన తెలంగాణలో ఇప్పటికే 32 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. వాటిలతో తెలుగుదేశంకు బలం ఉన్న నియోజకవర్గాలు కూడా ఉండగా.. ఒకవేళ పొత్తులో పోటీకి దిగితే వాటిని తెలుగుదేశం పార్టీకి  వదిలేయాల్సి వస్తుంది. అలాగే రెండు పార్టీలూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా సాధ్యమైనంత ఎక్కువ సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై ఈ ప్రభావం పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలుగుదేశం తెలంగాణపై ఫోకస్ తగ్గించడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా వివిధ పార్టీలకు మద్దతుదారులుగా మారిపోయారు. ఇందులో ప్రధానమైనది బీఆర్ఎస్ కాగా.. గ్రేటర్ పరిధితో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ లాంటి పలు జిల్లాలలో తెలుగుదేశం క్యాడర్ బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. తెలంగాణలో ప్రతిసారి ఎన్నికల సమయంలో  తెలుగుదేశం శ్రేణులు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ చేతికి అందిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళారని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.  అయితే, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్దలు స్పందించకపోవడం, కేటీఆర్  చంద్రబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలుగుదేశం, జనసేన కలిసి  తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ ఏకతాటిపైకి వస్తుందని అంటున్నారు. అదే జరిగితే  తెలంగాణలో అధికారం చేపట్టబోయేది ఎవరన్నది ఈ కూటమే నిర్ణయించేంతగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. 

పండగ పూటా పస్తే.. దసరాకి జీతాలందే చాన్స్ లేదు!

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఆయన  పాలనలో మంత్రులూ, వందల సంఖ్యలో సలహాదారులూ ఉన్నా.. ఎవరికీ ఏ పనీ ఉండదు.  ఎందుకంటే  అందరి పనులూ కూడా సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ముగించేస్తారు. పోనీ ఏవైనా ప్రెస్ మీట్లు పెట్టి తమ శాఖల విషయం వివరిద్దామనుకున్నా మంత్రులకు ఆ పని కూడా చేయడానికి స్వేచ్ఛ  లేదు. సకల శాఖల మంత్రిగా పేరొందని  ప్రభుత్వ ముఖ్య సలహాదారు తాను తప్ప మరెవరూ మీడియా సమావేశాలలో మాట్లాడటానికి  వీల్లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇక మంత్రులు, నామ్ కే వాస్తే సలహాదారులు, ఇంక ఎవరైనా ఉంటే వారు చేయాల్సిది ఒకే ఒక్కటి. అదేమిటంటే..  చెప్పినపుడు చెప్పినట్లుగా విపక్ష నేతల మీద మాటల దాడి చేయడం..  అదీ చాలదనుకుంటే బూతు పురాణాలు అందుకోవడం.  అందుకే ఏపీలో పాలన చూసిన ఏ పారిశ్రామిక వేత్తా ఏపీని పట్టించుకోవడం లేదు. పెట్టుబడులు లేక రాష్ట్ర ఆదాయానికి  గండి పడింది.  దీంతో అలా ఓ చేత్తో బటన్ నొక్కి సొమ్ములు ఇచ్చినట్లు ఇచ్చి  మరో చేత్తో పన్నులు, పెంచిన ధరలతో ముక్కు పిండి వసూళ్లు చేసుకోవడం ఈ ప్రభుత్వం అలవాటుగా మార్చుకుంది. అయినా అవి సరిపోక తాహతుకు మించి అప్పులు చేసింది. బాండ్ల వేలం మొదలు, రాష్ట్రానికి రాబోయే కాలానికి వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి దానిని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చింది. అవి కూడా సరిపోక కేంద్రాన్ని కాళ్లావేళ్లా పడి అప్పు ఇప్పించండి మహాప్రభో అని వేడుకుంటున్నది. గత ఏడాదిన్నర కాలంగా ఏపీలో ఉద్యోగులకు సమయానికి అంటే ఒకటో తేదీన జీతం అందిన సందర్భమే లేదు.  ఒకటో తారీఖు అందాల్సిన జీతాలు ఏ నెలాఖరుకో వస్తున్నాయి. అది కూడా అందరికీ ఒకేసారి కాదు. ఒక్కో స్కేల్ ఉద్యోగికి ఒక్కో సమయంలో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఇక జీవితమంతా ఉద్యోగానికి ధారపోసి ఇప్పుడు మలి వయసులో ఆసరాగా దక్కాల్సిన ఉద్యోగుల పెన్షలైతే ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చిన సమయంలో జమ చేస్తున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి  రెండో వారం గడిచిపోతున్నా ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. ప్రభుత్వ పెన్షనర్లకు పింఛన్ మొత్తం అందలేదు. అసలే పండుగ సమయం. బోలెడు ఖర్చులు ఉంటాయి. ఇటేమో జీతాలు పడలేదు. సహోద్యోగులను అడుగుదామన్నా అందరిదీ అదే పరిస్థితి. దీంతో పండుగ ఖర్చులు తలుచుకొని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా తమకు ఎదురుచూపులు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో జీతాల చెల్లింపు ప్రభుత్వం చేతిలో కూడా లేదు. సూటిగా చెప్పాలంటే ప్రభుత్వానికి అప్పులు పుడితే కానీ జీతాలు ఇవ్వదు. ఎక్కడా అప్పు దొరకకపోతే నెలలో తొలి పక్షంలో వచ్చిన ఆదాయాన్ని రెండో పక్షంలో కొంతమందికి  జీతంగా జమ చేస్తారు. మిగతా వారికి రెండో పక్షం చివరిలో జమ అవుతాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం చేస్తున్నది కూడా ఇదే. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం రాబడి కోసం మద్యం, ఇసుక, పన్నులపై మాత్రమే ఆధారపడుతుంది. ఈ మూడు తప్ప ఇతరత్రా ఆదాయ మార్గాల గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించను కూడా  ఆలోచించడం లేదు.  ప్రతినెలా రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తేవడం, ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి మరీ రుణాలు సాధించడం ఇదే పనిగా ఉంది. అయినా సకాలంలో జీతాలు అందడం లేదు. కనీసం రెండో వారం వెళ్లిపోతున్నా, పండగ సమయం అయినా సగం మందికి కూడా జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. దీంతో ఉద్యోగులు, అటు వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే స్థాయికి మించి అప్పులు చేసినా కొత్త అప్పుల కోసం ఢిల్లీలో ఒక టీం మాత్రం పనిచేస్తూనే ఉంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అద్వర్యంలో నడిచే ఈ బృందం ఢిల్లీలో ఎవరిని కలవాలి? బాండ్ల వేలం ఎప్పుడు ఉంటుంది? కొత్త అప్పు ఎలా దక్కించుకోవాలి అనే దానిపైనా కసరత్తులు చేసి ప్రభుత్వానికి అప్డేట్ చేస్తూ ఉంటుంది. అయితే, కేంద్రం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తీరిక లేకుండా ఉంది. దీంతో ఏపీకి ఈ నెలలో అప్పు దొరకడం కష్టమే అవుతుంది.  బై ఛాన్స్ అప్పు దొరికితే ఏపీ ఉద్యోగుల అదృష్టం.. లేదంటే ఈ దసరా ఉసూరుమనాల్సిందే!

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడికి  హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టులో ఊరటదక్కింది. అంగళ్లు కేసులో చంద్రబాబును గురువారం (అక్టోబర్ 12), ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 16 వరకూ అరెస్టు చేయవద్దని ఏపీ హై కోర్టు బుధవారం (అక్టోబర్ 11) ఉత్తర్వులు ఇచ్చింది.   అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం (అక్టోబర్ 11) విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు హై కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ పెండింగ్‌లో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్‌ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చంద్రబాబుపై ఉన్న పీటీ వారెంట్ అరెస్టుపై  ఎటువంటి ఆదేశాలు ఇవ్వవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు  ఏపీ  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..

ఎపి హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొలిజియం చేసిన సిఫారసుల మేరకు  ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు రాబోతున్నారు. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసింది. జస్టిస్ హరినాథ్, జస్టిస్ ఎం. కిరణ్మయి, జస్టిస్ జె.సుమతి, జస్టిస్ ఎన్.విజయ్ లను హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫారసు చేసింది. త్వరలోనే ఈ నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీపై వెళ్లడం తెలిసిందే. ఈ నలుగురు గతంలో న్యాయవాదులుగా వ్యవహరించారు. వీరిని జడ్జిలుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలు సంప్రదింపులు జరిపి, ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఏపీ సీఎం జగన్, గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఆ నలుగురి అర్హతలు గుర్తించిన సుప్రీంకోర్టు కూడా వారిని న్యాయమూర్తులుగా నియమించవచ్చంటూ తాజాగా సిఫారసు చేసింది.

చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే.. ఇండియన్ లీగల్ సంచలన కథనం!

ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమా, సక్రమమా.. చంద్రబాబు నిజంగానే తప్పు చేశారా? లేక ఉద్దేశ్యపూర్వకంగానే ఇరికించారా అంటే తెలుగు రాష్ట్రాలలో చంటి  పిల్లల నుండి  వయోవృద్ధుల వరకూ అందరూ ముక్తకంఠంతో  చెప్పే మాట ఒక్కటే. చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. ఆయనను రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారు అని. విద్యార్థుల నుండి మేధావుల వరకూ.. రిటైర్డ్ అధికారుల నుండి మాజీ న్యాయమూర్తుల వరకూ అందరిదీ ఇదే మాట. ఈ కేసులో చంద్రబాబు పాత్ర లేదు.. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ.. ఒక్క వైసీపీ తప్ప రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. ఇప్పటికే ఈ విషయంపై  వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ జాతీయ పార్టీలన్నీ ఖండించాయి. ఏపీలో వైసీపీ అరాచకాలు శృతిమించిపోతున్నాయని హెచ్చరించాయి.   ఇప్పుడు తాజాగా ఇదే అంశంపై  ఓ జాతీయ మీడియా సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. న్యాయ వ్యవస్థ, అందులోని కోణాలను విశ్లేషించే ప్రముఖ పత్రిక  ఇండియాలీగల్‌  చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా ఇరికించారంటూ సంచలన కథనాన్ని ప్రచురించింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఎంతలా ఉపయోగించుకుంటున్నారనడానికి చంద్రబాబు అరెస్ట్ ఒక నిదర్శమని ఇండియా లీగల్ వెల్లడించింది.  చంద్రబాబు మరో బలిపశువా  అనే  శీర్షికతో  ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.   రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో అరెస్ట్ అవడమనేది కొత్తేమీ కాదని.. గతంలో చాలా మంది అరెస్ట్ అయ్యారని పేర్కొంది. చంద్రబాబుపై కేసును సుప్రీం కోర్టు జాతీయాంశంగా పేర్కొనాలని ఇండియా లీగల్ తన కథనంలో కోరింది. రాజకీయ నేతల చేతుల్లో పోలీసులు తొత్తులుగా మారారని, ఇలాగే పోలీసులు మితిమీరి ప్రవర్తించిన సందర్భాలలో గతంలో  కోర్టులు రంగప్రవేశం చేసిన విషయాన్ని గుర్తు చేసింది.  ఈ కేసును విశ్లేషిస్తూ.. అసలు చంద్రబాబును అరెస్ట్ చేశాక.. ఆధారాల కోసం యత్నించడమేంటని తీవ్రంగా తప్పు బట్టింది.  ఏపీలో ప్రజలు అనుమానిస్తున్నట్లే బీజేపీ పాత్రను కూడా ఈ కథనంలో పేర్కొనడం విశేషం. చంద్రబాబు బీజేపీతో స్నేహంగా ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేది కాదన్న ఇండియా లీగల్.. మొత్తానికి చంద్రబాబును కావాలని రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని పేర్కొంది.   ఇప్పుడు ఈ ఇండియా లీగల్ కథనంతో ఈ అంశంపై జాతీయ స్థాయిలో  మరింత విస్తృతంగా చర్చ జరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పరిశీలకులతో పాటు న్యాయ నిపుణుల విశ్లేషణలతో సాగే ఇండియా లీగల్ ఈ కథనాన్ని ప్రచురించడం తెలుగు తమ్ముళ్ల వాదనకు బలం చేకూర్చింది. చంద్రబాబును జైలుకు తరలించి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఈ కేసు విషయంలో కోర్టులు ఏదీ తేల్చకపోవడం..  ఇప్పుడు ఇలా సంచలన కథనాలు రావడం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడటం ఖాయమని అంటున్నారు. నిజానికి  జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి మాట మరిచి కక్షలు కార్పణ్యాలకు తెరదీసిన సంగతి తెలిసిందే. తనను ప్రశ్నించిన వారి నామరూపాల్లేకుండా చేయాలని భావించే వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంను టార్గెట్ చేసుకునే పని చేసిందని అంటున్నారు. అయితే జగన్ సర్కార్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. జనంలో సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. స్వయంగా జగనే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరుగుతాయని  ప్రకటించేశారు. అంటే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇంకా పూర్తిగా ఆరు నెలల సమయం కూడా లేదు.  ఆ కారణంగానే జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న తెలుగుదేశం కు అడ్డుకట్ట వేయాలన్న ఏకైక లక్ష్యంతోనే  సీఐడీని రంగంలోకి దిగి అసలు పేరు, ఊరు లేని కేసులో తీవ్రమైన ఆర్ధిక నేరాలు చేసిన వారిపై బనాయించే సెక్షన్లను నమోదు చేసి అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేయించారు. దాని పర్యవసానమే ఇలా ఇంటా బయటా జగన్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇక ఇండియన్ లీగల్ కథనం విషయానికి వస్తే.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ తేల్చేయడమే కాకుండా.. తన కథనానికి బలం చేకూర్చేలా  ఈ విషయంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రచురించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య.. న్యాయ వ్యవస్థ రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతూనే కొన్ని విషయాలలో రాజకీయపరంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అన్నారు. అయినా రాజకీయ కక్ష సాధింపునకు కేసులు పెట్టడం అన్నది అత్యంత తీవ్రమైన అంశమని అభిప్రాయపడ్డారు.  అలాగే ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్  బీజే కోల్ఫే పాటిల్ అయితే మరింత స్పష్టంగా చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని చెప్పేశారు. చంద్రబాబు కనుక బీజేపీతో మైత్రిలో ఉండి ఉంటే ఆయనపై ఈ కేసు ఉండేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసులో పస లేకపోయినా రాజకీయ కక్ష  సాధింపుతో కేసులు బనాయించి అరెస్టు చేయాలనుకుంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఖైదును తప్పించుకోలేరన్నారు.  

జగన్ ప్రభుత్వంపై మాధవ్ పూరించిన సమరశంఖం

అమరావతి లేదు... పోలవరం నిర్మాణం పూర్తి కావడం లేదు.. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? అలాగే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందా? అంటే ఏదీ లేదు. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రమేయం ఉందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.  అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూ.. దేశ విదేశాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అలాంటి వేళ చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయమంటూ.. యువ గాయకుడు అదీ కూడా అంధుడు మాధవ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఆంధ్రజాతి మేలుకోవాలని పిలుపునిస్తూ.. కళ్లు తెరవరా ఆంధ్రుడా.. అంటూ తన గళంతో నిరసన వ్యక్తం చేస్తూ.. ఆలపించిన గీతం.. సోషల్ మీడియాలో కృష్ణుడు వదిలిన సుదర్శన చక్రంలా దూసుకుపోతోంది. మాధవ్ స్వయంగా రాసి.. ఆలపించిన ఈ వీడియో కేవలం 24 గంటల్లోనే.. 5 లక్షల వ్యూస్‌ని దాటి 10 లక్షల వ్యూస్ వైపు పరుగులు పెడుతోంటే.. 5 వేల మందికిపైగా నెటిజన్లు.. ఈ వీడియోని షేర్ చేసి.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమంటూనే.. ఈ సైకో పాలనకు చరమగీతం పాడే విధంగా అందరు కలిసి రండి.. కదిలి రండి అన్నట్లుగా ఈ వీడియోకు వస్తున్న ఆదరణ చూస్తే అర్థమవుతోందనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో ఊపందుకొంది.  మాధవ్ ఆలపించిన గీతంలో.. నాకు కంటి చూపు లేదు.. కనిపించేదంతా చీకటే.. అయినా నా రాష్ట్రంలో జరుతున్న అన్యాయం కనిపిస్తోంది. ఆరాచకం వినిపిస్తోంది... నియంత నుంచి నా రాష్ట్రాన్ని కాపాడుకోమని  నా రక్తంలో ప్రతి అణవణువు ఉద్వేగంలో రగిలిపోతుంది. కానీ.. మీరు కళ్లుండీ.. జరుగుతున్న రాక్షసత్వాన్ని, నియంతృత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఎందుకు బండరాయిలా ఉండిపోయారు? భయంతోనా?  దారుణాల్ని చూస్తున్న మీ కళ్లలో విప్లవ జ్వాలలు రగలవెందుకు? ఆ జ్వాలల్లో నియంతృత్వాన్ని బూడిద చేయ్యరెందుకు? కళ్లు లేక చీకటిని చూస్తున్న నేను వెలుగును చూడాలనుకుంటున్నాను.. కళ్లుండి వెలుగును చూడగలిగిన మీరు పిరికితనంతో చీకటిని స్వాగతిస్తున్నారు. మీరు చేస్తున్నది నేరం. భావితరాల భవిష్యత్తుకు మీ పిరికితనం ఒక శాపం. మా నిర్లక్ష్యాన్ని, భయాన్ని చూసి నా హృదయం నుంచి పుట్టిన పాట ఇది. ప్రతి అక్షరం ఒక ఉద్వేగం. ప్రతి భావం ఒక విన్నపం. వినండి... చూడండి.. తెలుగోడి పౌరుషాన్ని నిద్ర లేపండి.. అనే ఉపోద్ఘాతంతో మొదలవుతోన్న ఈ గీతం..    ఏమి రాష్ట్రం... ఏమి రాజ్యం.. ఇక్కడున్నది రాక్షసత్వం.. ఎదిరిస్తే చచ్చినట్టే ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే బతుకేది ఈ రాజ్యంలో! రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను హరిస్తుంటే.. గొంతెత్తిన వాళ్ల గొంతు నులిమేస్తుంటే.. రాష్ట్రం నలుగుతున్నది నియంత చేతిలో.. రావణ కాష్టమవుతున్నది రాక్షస ఒడిలో అంటూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మాధవ్ కళ్లకు కట్టినట్లు అక్షర బద్దం చేశారు.  అలాగే రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని వివరిస్తూ..  ఈ బతుకులు మనకిచ్చినది అమ్మనాన్నలైతే.. ఈ భవితను మనకిచ్చినది చంద్రబాబు మాత్రమే.. ఈ ఆంధ్రదేశాన్ని అభివృద్ధి  పదము నందు నడిపిన మన నాయకుడు చంద్రబాబు మాత్రమే.. అలాంటి మన చంద్రన్నను నీచులంతా హింసిస్తూ దగా చేస్తూ ఉంటే.. చూస్తునే ఉంటావా! నువ్వు తినే మెతుకును ఒక్కసారి అడగలేవా.. సహించకు, సహించకు ఆంధ్రుడా.. ఆంధ్రమాత రక్తాశ్రువులను చిందిస్తున్నది.. నోరు మెదపరా ఓ ఆంధ్రుడా అంటూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై తిరగబడాలంటూ మాధవ్.. తన మనస్సు పెట్టి రాసిన ఈ గీతం ద్వారా పిలుపు నిచ్చారు. ఈ గీతానికి కామెంట్లు సైతం వెల్లువెత్తాయి.. ఈ గీతం ప్రజలనే కాదు.. పాలక పక్షన్నా సైతం ఆలోచింప చేసేదిగా ఉందనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఒక వైపు గెలుపు ధీమా.. మరో వైపు హంగ్ ఆశలు.. తెలంగాణలో బీజేపీ వ్యూహమేంటి?

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన తరువాత కూడా అయోమయంలో, గందరగోళంలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. రాష్ట్రంలో అధికారమే లక్ష్యం అంటూ గత రెండేళ్లుగా అనూహ్య దూకుడు ప్రదర్శించి  ఆ తరువాత  అంతే అనూహ్యంగా చతికిల పడింది. తెలంగాణలో బీజేపీది బలం కాదు వాపే  అని తేలడానికి  ఎన్నో రోజులు పట్టలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సైద్ధాంతిక నిబద్ధత, క్రమ శిక్షణ తమ పార్టీ ప్రత్యేకతలుగా చెప్పుకునే బీజేపీ వాటిని తిలోదకాలిచ్చేసి.. తెలంగాణలో అధికారమే లక్ష్యం అంటూ గెలపు గుర్రమైతే చాలు లాగేయండి అంటూ అందు కోసం ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సరే.. తెలంగాణలో బీజేపీ గూటికి ఇతర పార్టీల నుంచి పెద్ద నాయకులు కూడా వచ్చి చేరారు. అధికార పార్టీతో విభేదించి.. ఆ పార్టీకి రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని భావించి పార్టీలో చేరారు. అయితే బీజేపీలో తొలి నుంచీ ఉన్న వారికీ, కొత్తగా వచ్చి చేరిన వారికీ మధ్య అంతరం  మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూ వచ్చింది. అది రాష్ట్రంలో బీజేపీ బలంగా భావిస్తున్న పరిస్థితిని కేవలం వాపు మాత్రమేనని తేల్చేసింది. బండి సంజయ్ ను పార్టీ  రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన క్షణం  నుంచీ తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ స్థానంల పార్టీ రాష్ట్ర అధ్యక్ష  పగ్గాలు అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే బీజేపీలో  విభేదాలు భగ్గుమన్నాయి. అసలు తెలంగాణలో బండి సంజయ్ సారథ్య పగ్గాలు చేపట్టిన తరువాతే  రాష్ట్రంలో పార్టీ పుంజుకుందని బీజేపీ శ్రేణులే చెబుతాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకు బండి సంజయ్ పార్టీని నడిపే విధానంతో వచ్చిన పొరపొచ్చాల కారణంగానే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్న భావన పార్టీ శ్రేణులలో వ్యక్తం అవుతోంది. ఇక కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత చేరికల జోరు తగ్గింది. తగ్గడం అటుంచి చేరికల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చీకోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకునే విషయంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమనిపరిశీలకులు అంటున్నారు. ఇక అన్నిటికీ మించి మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కాకుండా ఉండటం వెనుక కేంద్రం ఆశీస్సులున్నాయన్న భావన రాష్ట్ర ప్రజలలోనే కాకుండా.. పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అయ్యింది. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నేతలు పలు సందర్భాలలో బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి బీ  టీమ్ బీఆర్ఎస్ అన్న ఆరోపణలకు కవిత ఎపిసోడ్ బలం చేకూర్చేదిగా ఉందని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే రాష్ట్ర నేతల అసంతృప్తిని కమలం హైకమాండ్ ఖాతరు చేయలేదు. కానీ రాష్ట్రంలో అధికారం మాత్రం బీజేపీదే అని వారికి ధీమా ఇస్తూ వచ్చింది. అయితే రాను రాను పార్టీ రాష్ట్ర నాయకులలో ఆ ధీమా కరవౌతూ వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోరు ఉంటుందన్న అంచనాలు మారిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో  కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ముఖాముఖీ పోరనన్న పరిశీలకుల విశ్లేషణలకు బలం చేకూర్చేలాగే సర్వేలు కూడా వెలువడ్డాయి.  ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతల్లోనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై తమ అంచనాలు తప్పాయన్న భావన వ్యక్తం అయ్యింది. అందుకు నిదర్శనమే తెలంగాణలో వచ్చేది హంగే నంటూ ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా మాత్రం పాత ప్రసంగాన్నే మరింత గొంతు పెంచి చెప్పారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంతృత్వ పాలనపై విమర్శలు చేసిన అమిత్ షా విజయంపై వ్యక్తం చేసిన ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న దాఖలాలు లేవు. అయితే బీజేపీ అధికారంపై వ్యక్తం చేస్తున్న ధీమాను పరిశీలకులు మాత్రం తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.   ప్రజా తీర్పును గౌరవించకుండా దొడ్డి దారిన అధికారంలోకి వచ్చే ఎత్తుగడతోనే బీజేపీ తెలంగాణలో రాజకీయం చేస్తున్నదని అంటున్నారు. 

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల మీద  పిడుగు పడ్డట్టయ్యింది.   టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీలకు వాయిదా వేసినట్టు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అనితారామచంద్రన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.  నవంబర్‌లో ఎన్నికలు ఉన్నందున టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని సమకూర్చలేమని కలెక్టర్లు టీఎస్‌పీఎస్‌సీకి సమాచారం అందించారు. మరోవైపు, ఎన్నికల విధులతో పోలీసులు కూడా బిజీగా ఉంటారు కాబట్టి పరీక్ష నిర్వహణ కోసం తగిన స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా కష్టమని ఎస్పీలు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు వాయిదా వేసేందుకు నిర్ణయించింది. కాగా, టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు ఇలా మళ్లీ వాయిదా పడటంపై ఉద్యోగార్థులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు నవంబర్ చివర్లో లేదా డిసెంబర్‌లో జరుగుతాయని చాలా కాలం క్రితమే స్పష్టత వచ్చినా హడావుడిగా నవంబర్‌లో పరీక్షలకు సిద్ధమవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇక గులాబి బాస్ ఎన్నికల ప్రచార భేరి.. వరుస సభలతో సుడిగాలి పర్యటనలు

తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్షణం నుంచే రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలూ ఎన్నికల రణరంగంలోకి దూకేశాయి. అందరి కంటే ముందుగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లుగా కనిపించిన అధికార బీఆర్ఎస్ మాత్రం ఆ తరువాత వెనుకబడినట్లుగా కనిపించింది. ఇందుకు కారణాలెన్నున్నా.. వాటిలో ముఖ్యమైనది మాత్రం కేసీఆర్ అనారోగ్యమనే చెప్పాలి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను ఒకే దఫాలో 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి.. దూకుడు మీద కనిపించిన కేసీఆర్.. పార్టీలో వెల్లువెత్తిన అసమ్మతి, అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించారు. టికెట్లు ఆశించి దక్కక అసంతృప్తికి లోనైన వారిని పదవుల పందేరంతో బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించారు. కొందరికి పదవులు కట్టబెట్టారు కూడా. అయితే ఆ తరువాత ఆయన అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహకాల విషయంలో, పార్టీలో లుకలుకలను పరిష్కరించుకునే విషయంలో బాగా వెనుక బడింది. అదే సమయంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కిరాకపోయినా.. ప్రచారం, ప్రచార సన్నాహకాల విషయంలో మాత్రం కాంగ్రెస్ రేసు గుర్రంలా దూసుకుపోతున్నది. ఆ పార్టీ సంస్కృతిలో భాగంగా అందరూ చెప్పే అసమ్మతి, గ్రూపు విభేదాలను ఈ  పార్టీ చాకచక్యంతో పరిష్కరించుకుంది. ఇక  బీజేపీ  కూడా అగ్రనేతల వరుస పర్యటనలతో దూకుడు  ప్రదర్శిస్తున్నది. అదే సమయంలో అధికార బీఆర్ఎస్ మాత్రం అధినత అనారోగ్యం కారణంగా డీలా పడింది. ఈ నేపథ్యంలోనే దాదాపు మూడు వారాల పాటు ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖరరావు తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కదన రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 15నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా  పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారు చేసేశారు. ఈ నెల 15న ప్రగతి భవన్ లో అభ్యర్థులకు బీ ఫాంల పంపిణీతో మొదలెట్టి పార్టీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు.  ఆయన సెంటిమెంట్ ప్రకారం వచ్చే నెల 9న తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సారి ఆయన గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా ఎన్నికల బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అదే  రోజుల అంటే నవంబర్ 9న  ఆయన రెండు నియోజకవర్గాలలోనూ నామినేషన్లు దాఖలు  చేస్తారు. ఇక ఎన్నికల ప్రచారాన్ని  కూడా ఆయన తన సెంటిమెంట్ ను కొనసాగిస్తూ హుస్నాబాద్ నుంచే ప్రారంభించనున్నారు.  ఈ నెల 15 హుస్నాబాద్ తో మొదలు పెట్టి వరుసగా నాలుగు రోజుల పాటు ఏడు నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేసి  బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఆ తరువాత వారం రోజులు అంటే ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకూ విశ్రాంతి తీసుకుంటారు.  ఆ తర్వాత అంటే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు వరుసగా నియోజకవర్గాలలో నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో  ప్రసంగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ పర్యటనలు, సభలకు సంబంధించి రోడ్ మ్యాప్, షెడ్యూల్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్.. తెలంగాణలో కాంగ్రెస్ పెరుగుతున్న మద్దతు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఏపీలో రాజకీయాలు చల్లబడ్డాయి. టీడీపీ నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తుంటే.. అధికార వైసీపీ చేసిన తప్పును ఒప్పుగా చూపించాలని తెగ ఆరాటపడుతుంది. ఇటు రాష్ట్రంలో పాలన.. అటు రాజకీయాలు రెండూ స్థబ్ధుగా మారిపోయాయి. అయితే, అదే చంద్రబాబు అరెస్ట్ తెలంగాణలో మాత్రం రాజకీయాలను వేగంగా మార్చేస్తుంది. నిజానికి తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ అంచనాలు ఎప్పటికప్పుడు తారుమారు అవుతూ వస్తున్నాయి. గెలుపోటములను అంచనా వేస్తూ ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వచ్చినా మారుతున్న సమీకరణలతో ఆ అంచనాలు తప్పడం ఖాయమనే భావన రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. రోజురోజుకీ తెలంగాణలో బీజేపీలో పరిస్థితులు గాడి తప్పడం.. కాంగ్రెస్ బలీయంగా మారుతుండడం.. కేసీఆర్ అనారోగ్యంతో కనిపించకపోవడం తదితర కారణాలతో నెల రోజుల క్రితం ఉన్న పరిస్థితిలు ఇప్పుడు కనిపించడం లేదు. వీటికి తోడు చంద్రబాబు అరెస్టు, అరెస్టుపై బీఆర్ఎస్ అగ్ర నేతలు స్పందించకపోవడం.. స్పందించిన కేటీఆర్.. ఆంధ్రా గొడవలతో మాకేం సంబంధం.. మాకు జగన్, పవన్, లోకేష్ అందరూ ఒక్కటే.. అందరూ మిత్రులే అంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఇప్పుడు మరింత నష్టాన్ని తెచ్చేలా కనిపిస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే తప్పిదాన్ని గ్రహించిన బీఆర్ఎస్ దాన్ని మాఫి చేసుకొనేందుకు రకరకాల మార్గాలలో సీమాంధ్ర సెటిలర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. కానీ, చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ వైఖరి మాత్రం సీమాంధ్ర సెటిలర్లలో అసంతృత్తి చల్లారడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డిలో ఉండే కమ్మ సామాజికవర్గానికి చెందిన సీమాంధ్ర సెటిలర్లు ఈ విషయంలో బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే ఆగ్రహంతోనే తెలంగాణ కమ్మ ఐక్య వేదిక తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలలో కమ్మ సామాజికవర్గం టీడీపీకి పెట్టని కోట అనే సంగతి తెలిసిందే. ఈ సామాజికవర్గంలో దాదాపు 80 శాతం పైగా ప్రజలు టీడీపీకి మద్దతుగా ఉంటారు. తెలంగాణలో కూడా గత ఎన్నికల ముందు వరకూ వీరంతా టీడీపీతోనే ఉండేవారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితులలో టీడీపీపై కోపం లేకపోయినా వీరంతా ఇతర పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. అప్పటికే ఏపీకి అన్యాయం చేసిన పార్టీలుగా కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లను కాదని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను, ద్వితీయ స్థాయి నేతలను బీఆర్ఎస్  గాలమేసి లాగేసుకోవడంతో హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో ఉండే కమ్మ సామాజికవర్గ సెటిలర్లు కూడా బీఆర్ఎస్ వైపు వెళ్లారు. కానీ, ఇప్పుడు వారంతా బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ వైఖరిపై అసంతృప్తిలో ఉన్న కమ్మ ఐక్య వేదిక కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది.  చంద్రబాబు ఎపిసోడ్ లో బీఆర్ఎస్ వైఖరి వలనే తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు కమ్మ ఐక్య వేదిక ప్రతినిధులు బహిరంగంగానే ప్రకటించారు. తెలంగాణలో పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ లో ఉన్నా చంద్రబాబుకు సన్నిహితుడుగానే ఉంటున్నారన్న భావన ఉంది. పార్టీ మారినా నేటికీ చంద్రబాబును పల్లెత్తు మాట అనని రేవంత్ నేటికీ చంద్రబాబు, టీడీపీపై అదే గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే మల్కాజిగిరిలో రేవంత్ గెలవగలిగారు. తెలంగాణలో ఏ టీడీపీ కార్యకర్తకు కూడా రేవంత్ రెడ్డిపై వ్యతిరేక భావన ఉండదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలే ముందుగా స్పందించారు.. ఖండించారు. తెలంగాణలో చంద్రబాబు అరెస్టుపై నిరసనలలో కూడా కాంగ్రెస్ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కమ్మ ఐక్య వేదిక కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు అరెస్ట్ ప్రభావంతో నష్టం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మధ్యాహ్నం భోజనంలో బల్లి.. గప్ చిప్ అంటూ దాచే యత్నం చేసిన స్కూలు సిబ్బంది!

మధ్యాహ్న భోజనంలో బల్లి పడితే.. విద్యార్థులను బెదరించి విషయాన్ని బయటకు పొక్కకుండా దాచేయడానికి స్కూలు సిబ్బంది చేసిన ప్రయత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కోనసీమ జిల్లా పలివెల సేరెపాలెం పంచాయతీ స్కూల్ లో జరిగింది. ఆ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి మధ్యాహ్న భోజనం చేస్తుండగా తన ప్లేట్ లో కూరలో బల్లి కనిపించింది. దీంతో భయపడిన అతడు ప్రధానోపాధ్యాయుడికి చెప్పాడు. ఆయన వెంటనే విద్యార్థి భోజనం చేస్తున్న ప్లేటును తన రూంలో దాచేసి.. విషయం ఎవరికీ చెప్పవద్దని ఆ విద్యార్థిని హెచ్చరించాడు. దీంతో  అతడు మౌనంగా ఉండిపోయాడు. కానీ సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత అస్వస్థతకు గురి అయ్యాడు. దీంతో తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తల్లిదండ్రులు వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యుడు ఫుడ్ పాయిజినింగ్ అని చెప్పి చికిత్స అందించి.. ఆసుపత్రిలోనే 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ ఒక్క విద్యార్థే కాకుండా  ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన మరి కొందరు విద్యార్థులు కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది.  మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా బల్లి పడిన భోజనం విద్యార్థులు తిన్నారని తెలిసిన తరువాత కూడా వారిని వైద్యం అందించే ప్రయత్నం చేయకుండా విషయాన్ని గోప్యంగా ఉంచేయడానికి ప్రయత్నించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

జగన్ సర్కార్ ను నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తి?

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం అంటే ఎన్నో శాఖలు.. మరెన్నో కార్పొరేషన్లు.. అన్నిటికీ ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి. అన్నీ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. అదేంటో ఏపీలో మాత్రం అన్నిటికీ ఒక్కరే కనిపిస్తారు. పథకం ఏదైనా.. శాఖ ఏదైనా.. నిధులు ఎన్నైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే కనిపిస్తారు. ఏ శాఖకి మంత్రి ఎవరైనా అన్నిటి గురించి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే కనిపిస్తారు. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్న ప్రకారం అసలు ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది జగన్ మోహన్ రెడ్డి కాదని.. ఓ అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ చర్చ రావడానికి జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలే కారణం. కేవలం చర్చతో ఆగిపోకుండా ఏమో జగన్ సర్కార్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఉందన్నదే నిజమని జనం నమ్ముతున్నారు కూడా. ఇంతకీ జగన్ ఏమన్నారంటే..  తాజాగా విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో అవినీతి, అక్రమాలు, మోసాలు, కుట్రల గురించి మాట్లాడారు. అక్కడితో ఊరుకోకుండా  అసలు రాజకీయం అంటే ఏమిటి అనే దానికి ఆయన నిర్వచనం చెప్పేశారు. అయితే జగన్ నిర్వచనం పై నెటిజన్లు ఓ స్థాయిలో సెటైర్లు గుప్పిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు అరెస్టు అంశాన్నిప్రస్తావించిన జగన్ ఆయన అరెస్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ చెప్పారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలే జగన్ సర్కార్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏదైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి.   ఈ సభలో జగన్ చంద్రబాబు అరెస్టు క్రెడిట్ బీజేపీకి  ఇద్దామని అనుకున్నారో లేకపోతే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నది బీజేపీ అని చెప్పాలనుకున్నారో స్పష్టత లేదు కానీ,  చంద్రబాబు అరెస్టుకు తాను ఎంత మాత్రం కారణం కాదని మాత్రం చెప్పుకున్నారు.   కేంద్రంలో ఉన్న బీజేపీ యే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నదని చెప్పడానికి ప్రయత్నించారు.   కేంద్రం ఐటీ నోటీసు ఇచ్చిందని, సీఐడీ అరెస్ట్ చేసిందని జగన్ తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్ తో మాట్లాడారు.  కానీ, అసలు కేంద్రం ఐటీ నోటీసులకూ, సీఐడీ అరెస్టుకు సంబంధం ఏమిటో చెప్పలేదు. కానీ కేంద్రంలో బీజేపీ ఉందని.. అందులో సగం మంది టీడీపీ వాళ్లేనని కూడా అన్నారు.  అలాగే తాను లండన్‌లో ఉన్నపుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని, ఆ ఆరెస్ట్‌తోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అసలు లండన్ లో ఉన్న తనకు చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియనే తెలియదని చెప్పుకొచ్చారు. దీంతోనే ఇప్పుడు అసలు రాష్ట్రంలో పాలనపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై జగన్ చేసిన వ్యాఖ్యల అంశంపై బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. తనకు తెలియకుండానే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగిందని జగన్ అంటున్నారంటే రాష్ట్రంలో పాలన ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నదో తెలుస్తోందని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో సీఎంకు తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే రాష్ట్రాన్ని జగన్ పాలిస్తున్నారా? లేక ఆయన పేరుతో మరెవరైనా పాలిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్ కు తెలియకపోతే మరి సీఐడీకి ఆదేశాలిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? అన్న చర్చ ప్రజలతో పాటు ప్రభుత్వ వర్గాలలో కూడా వినిపిస్తున్నది. అయితే, నిజానికి జగన్ సీఎంగా ఉన్నా.. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నా అన్నీ నడిపించేది ఒక్కరే.. ఆయనే సజ్జల  అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ లేవనెత్తిన అనుమానాలు కూడా ఇవే. చంద్రబాబు అరెస్టు ఒక్కటే కాదు అసలు ప్రభుత్వం ఏం చేయాలన్నది.. ఏ మంత్రి ఎప్పుడు మీడియా ముందుకొచ్చి ఎవరిని విమర్శించాలన్నది అన్నీ ఆయనే డిసైడ్ చేస్తారని, పథకాల నుండి అప్పుల వరకూ అన్నీ ఆయన చేతుల మీదుగానే నడుస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటు వైసీపీని అటు ఏపీ ప్రభుత్వాన్ని  ఆయనే నడిపిస్తున్నారని.. పార్టీ సమావేశాల నుండి ప్రభుత్వ పాలసీల వరకూ అన్నీ సజ్జల పర్యవేక్షణలోనే జరుగుతాయని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇంకా చెప్పాలంటే జగన్.. సంతకానికి, ఇచ్చిన స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే రబ్బర్ స్టాంప్ మాదిరి పనిచేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

బాబు అరెస్టు అక్రమమేనా?.. సీఎస్ నేతృత్వంలో ఏజీ, సీఐడీ చీఫ్ గవర్నర్ తో భేటీ సంకేతమదేనా?

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని జగన్ సర్కార్  అంగీకరించేసిందా? సుప్రీం కోర్టులో ఈ కేసుపై చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై మంగళవారం (అక్టోబర్ 10) జరిగిన విచారణలో ముకుల్ రోహత్గీ వాదనలు వీగిపోక తప్పదన్న భావనకు వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమేమిటంటే.. ఇప్పటి దాకా స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయం ముందుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన  అవసరం లేదనీ, ఆయన అనుమతి అక్కర్లేదనీ చెబుతూ వస్తున్న సర్కార్.. ఇప్పడు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడిన తరువాత  హడావుడిగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం తరఫున సీఎస్ జవహర్ రెడ్డి,  అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, సీఐడీ చీఫ్ సంజయ్ లు గవర్నర్ ను కలిసి వివరించారు. అంటే.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోకపోవడం కరెక్ట్ కాదని పరోక్షంగా ప్రభుత్వం అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ చంద్రబాబు అరెస్టు తనకు తెలిసి జరిగింది కాదనీ, స్కిల్ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఆ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిందనీ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నించారు. అంటే ఇప్పుడు  సుప్రీం కోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఏపీ సీఐడీ నిండా ఇరుక్కున్నట్లే అవుతుంది. ఈ నేపథ్యంలోనే  సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడగానే.. సీఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్వొకేట్ జనరల్, సీఐడీ చీఫ్ గవర్నర్ ను కలిశారని చెబుతున్నారు. ముందునుంచీ చంద్రబాబు తరఫు న్యాయవాదుల బృందం చెబుతున్నట్లుగానే  ఈ కేసులో 17ఎ వర్తిస్తుందని ఈ రోజు సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా  సీనియర్ న్యాయవాది సాల్వే వాదనలపై న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించినట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే  ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తున్న సందర్భంగా న్యాయమూర్తులు నాలుగు కీలక ప్రశ్నలు సంధించారనీ, అవన్నీ కూడా 17ఏకు సంబంధించి ముకుల్ రోహత్గీ చేస్తున్న వాదనలపైనేననీ అంటున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే..  సుప్రీంకోర్టు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పని రోహత్గి  1. 17A నేరానికి వర్తిస్తుందా? నిందితులకు వర్తిస్తుందా?  2. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు?  3. అవినీతికి సంబంధిందిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్ల కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా?  4.  మిగతా సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా? లేదా?   అయితే ఈ నాలుగు ప్రశ్నలకూ ముకుల్ రోహత్గీ సరైన సమాధానం ఇవ్వకుండా  పాత వాదననే కొనసాగించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ  సీఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలో  అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఏసీ సీఐడీ చీఫ్ సంజయ్ గవర్నర్  అబ్దుల్ నజీర్ ను కలవడం అత్యంత  ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ కు వీరు ముగ్గురూ స్కిల్ కేసు, చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలను వివరించారని  తెలుస్తోంది. ఏది  ఏమైనా సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ, 17ఏ సెక్షన్ పై పెద్ద ఎత్తున చర్చ  జరుగుతున్న సమయంలో ప్రభుత్వం గవర్నర్ ను  సంప్రదించడం కీలకంగా మారింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.