రాజకీయం అంటే.. జగన్ నిర్వచనం.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!

అదేంటో పాపం సీఎం జగన్ బహిరంగ సభకి వచ్చి ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్.. ఒకటికి నాలుగైదు సార్లు చదువుకున్న స్క్రిప్ట్.. సభలో కూడా చూసే చదివినా అది తేడా కొట్టేస్తుంది. ఎవిరిథింగ్ ఈజ్ ఫైనూ అనుకున్నా జగన్ నోటి నుండి ఆ మాటలు రాగానే ఎక్కడివాళ్ళకి అక్కడే  చిర్రెత్తుకొస్తుంది. ఆ వీడియోలు కట్ చేసి మాంచి బ్యాక్ గ్రౌండ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ట్రోలింగ్ చేస్తుంటారు. తాజాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా సీఎం జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెటిజన్ల చేతికి ఫుల్ స్టఫ్ ఇచ్చాయి. సభలో ఎన్నికలు, మ్యానిఫెస్టో, కార్యకర్తల నుండి నేతల వరకూ ఏం చేయాలో చెప్పిన జగన్.. యధావిధిగా ప్రత్యర్థులపై అదే ఊకదంపుడు విమర్శలు చేశారు. ఇక, కొత్తగా ఈ సభలో జగన్ రాజకీయానికి ఒక నిర్వచనాన్ని చెప్పారు. రాజకీయం అంటే ఏంటో తెలుసా.. రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా నిలవడం.. మరణించిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా మనం కనిపించటడమంటూ సీఎం జగన్ సూత్రీకరించారు. నిజానికి జగన్ ఈ నిర్వచనం చెప్పిన తర్వాత సభలో ఉన్న వారెవరికీ ఆయన ఏం చెప్పారో  చాలా సేపటి వరకూ  అర్ధం కాలేదు.  దీంతో జగన్ దానిని ఇంకాస్త వివరించి చెప్పారు. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి గుండెలో కూడా ఉండటం తనకు తెలిసిన రాజకీయం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జగన్ ఏం చెప్పారో అర్ధం అయింది అన్నట్లు అందరూ చప్పట్లు కొట్టారు. అలా చప్పట్లు కొట్టకపోతే మళ్లీ చెబుతారనుకున్నారో ఏమో. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండటమే రాజకీయం అనే మాటను చెప్పేందుకు జగన్ అన్ని ఇబ్బందులు పడ్డారన్న మాట. ఇక పనిలో పనిగా మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడని, రాజకీయ చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాడని, అబద్ధాల్ని నమ్మొద్దని, మోసాలను నమ్మొద్దని పార్టీ క్యాడర్ ను కోరారు. కాగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు అంత సులభంగా మార్చిపోలేరని.. ఆంధ్రా చరిత్ర ఉన్నన్నాళ్ళు, ఆయన పాలనను చూసిన ప్రజలు ఉన్నంత కాలం ఎవరూ మర్చిపోలేరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతలా ప్రజలను పీక్కుతిన్న ముఖ్యమంత్రి, ఇంతలా కక్షకట్టి పాలించిన నేత ఎవరూ ఉండరని, రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను, చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పాలించిన సీఎం బహుశా జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని, ఆలాంటి వ్యక్తిని ఎలా మర్చిపోతామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా ప్రజలపై ప్రేమతో పాలిస్తారు.. తన పేరు మర్చిపోకుండా మంచి పనులు చేయాలని చూస్తారు.. కానీ జగన్ మాత్రం తనను తప్పు అన్న వారిని లేకుండా చేయాలనీ చూస్తారని.. అలాంటి వ్యక్తిని ప్రత్యర్థులే కాదు   ప్రజలు కూడా అంత సులభంగా మర్చిపోలేరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక అబద్ధాల్ని, మోసాలను నమ్మొద్దని  జగన్ చెప్పిన మాటపై కూడా నెటిజన్లు పెద్ద చర్చ పెట్టారు. నిజమే ఈ నాలుగేళ్ళ పాలనలో ప్రజలు అబద్దాలు, మోసాలు అంటే ఏమిటో తెలుసుకున్నారని, ఈసారి ఖచ్చితంగా ప్రజలు మోసపోరని పేర్కొంటున్నారు. అబద్దాల గురించి, మోసాల గురించి, నేరాల గురించి, అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని.. 16 వేల కోట్ల అవినీతి కేసులో ఉన్న వ్యక్తి 27 కోట్ల అక్రమ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నేరస్తుడిగా పేర్కొనడం, సొంత బాబాయ్ హత్యకేసులో నిందితులను కాపాడుతూ మోసపోకండని ప్రజలను కోరడం, మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, 45 ఏళ్లకు పెన్షన్ లాంటి ఎన్నో హామీలను ఇచ్చి గాలికి వదిలేసిన వ్యక్తి ఇప్పుడు అబద్దాలను నమ్మవద్దని కోరడం చూస్తుంటే ప్రజలంటే సీఎంకు ఇంత చులకనగా కనిపిస్తున్నారా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

జగన్ సర్కార్ అరాచక పాలనకు అండా దండా కేంద్రామే!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక  అరాచకత్వం, అరాచక పాలన కొనసాగుతోందనడంలో ఎవరిలోనూ ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో బీజేపీకి కూడా స్పష్టత ఉంది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఆద్వాన్నంగా ఉందో, రాష్ట్రంలో పాలన ఎంత అరాచకంగా సాగుతోందో చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా వాడవాడలా వైసీపీ పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లు ధాఖలు చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపు కూడా ఇచ్చారు. పిలుపు ఇవ్వడం కాదు.. ఆదేశించారు. ఇందులో రహస్యమేమీ లేదు. అయినా అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా అప్పటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు.. మోడీ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం నాయకులు సోము వీర్రాజుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ తీరుపై కన్నెర్ర చేసింది. సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి  తప్పించింది. ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఆయన స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది.  పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన  క్షణం నుంచి జగన్ సర్కార్ చేస్తున్నఅడ్డగోలు అప్పులపై పూర్తి  వివరాలతో  మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి చెప్పారు. అక్కడితో ఆగకుండా  ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు రాష్ట్ర   అప్పుల చిట్టా  సమర్పించారు.   ఇదంతా చూసి ఇక జగన్ సర్కార్ కు అప్పులు పుట్టవు, కేంద్రం ఏపీ పరిస్థితులపై దృష్టి సారించిందని అంతా భావించారు. కానీ వాస్తవంగా అందుకు భిన్నంగా జరిగింది.  పురంధేశ్వరి భేటీ తరువాత   రాష్ట్ర అప్పుల పరిధి (ఎఫ్ఆర్బీఎం) విషయంలో కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు విభిన్నప్రకటనలు చేసి,వాస్తవ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా చేశారు.  నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అడుగుపెట్టినప్పటి నుంచి, ఆర్ధిక  క్రమశిక్షణ గాడి  తప్పింది. జగన్మిహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తోలి క్షణం నుంచే, సంక్షేమాన్ని గీత దాటించేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగు కప్పి, బటన్ నొక్కుడు మాత్రమే పాలన చేసేశారు.  ఆర్థిక క్రమశిక్షణ అన్న మాటకు అర్ధమే లేకుండా చేసేశారు. అప్పులు చేసి మరీ ఓటు బ్యాంకు పథకాలతో ప్రజలను ఆకర్షించడమే లక్ష్యం అన్నట్లుగా పాలనకు గాడి తప్పించేశారు. ఈ విషయాలన్నిటిపై తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూనే ఉంది. అయితే  అడ్డగోలు అప్పులను నిరోధించాల్సిన కేంద్రం మాత్రం ఏపీ విషయంలో ఔను ఒక్క ఏపీ విషయంలో మాత్రమే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా అప్పులకు ఎగబడుతోందో.. అంతే అడ్డగోలుగా అందుకు మోడీ సర్కార్ అనుమతులు ఇచ్చేస్తోంది.   రాష్ట్రంలో సొంత బలం లేని బీజేపీ.. తమ చెప్పుచేతల్లో ఉండే జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి అన్ని విధాలుగా అండా, దండా అందిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను, ఓ వంక విమర్శిస్తూనే, మరో వంక   జగన్ రెడ్డి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తోంది. అంటే కొట్టినట్లు బీజేపీ చేస్తుంటే.. ఏడ్చినట్లు వైసీపీ చేస్తున్నదన్నదన్న మాట. ఈ విధంగా ఇరు  పార్టీల  మధ్యా రహస్య మైత్రి బహిరంగంగా కొనసాగుతోందని, పిల్లి కళ్లు మూసుకు పాలు  తాగుతూ ఎవరూ గమనించడం లేదనుకున్నచందంగా వైసీపీ, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కెసీఆర్ ప్రచార కార్యక్రమాలు ఖరారు 

ఒకే రోజు కామారెడ్డి, గజ్వేల్ నియోజక వర్గాలలో  తన నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల ప్రచారం మీద దృష్టి కేంద్రీకరించనున్నారు.  ప్రగతిభవన్ నుంచే 20 రోజుల నుంచి అటు పార్టీ కార్యకలాపాలతో ముఖ్యమంత్రి విధులు నిర్వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆరోగ్యం ఇంకా పూర్తిస్థాయిలో కోలు కోలేదని తెలుస్తోంది. తొలుత వైరల్ ఫీవర్ అని చెప్పిన రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కెటీఆర్ గత వారం కెసీఆర్ కు చెస్ట్ ఇన్ ఫెక్షన్ సోకిందని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ముఖ్యమంత్రి ప్రగతిభవన్ నుంచి బయటకు రాకపోవడం పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. అయితే ముఖ్యమంత్రి నేరుగా ఎణ్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజే ముఖ్యమంత్రి కెసీఆర్ సతీమణి తిరుమల దర్శించుకున్నారు.  తొలుత తొమ్మిదో తేదీన నామినేషన్ వేయాలని కెసీఆర్ సంకల్పించినప్పటికీ మరో రోజుకు తన నామినేషన్ పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని  వాయిదా వేసుకున్నారు.   వరుస బహిరంగ సభలతో సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. మొదట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అంతేగాక, అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. అక్టోబర్ 15న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు. అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభ, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోనుంది. మూడోసారి సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.  

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో రిలీఫ్ 

ఎన్నికల కోడ్ అమలు అయిన ఒక రోజు తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు    హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ ఓటరు రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో ఆఫీడవిట్ ట్యాంపరింగ్ చేసారని ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణలో భాగంగా గతంలో అడ్వకేట్ కమీషన్‌ను హైకోర్టు నియమించగా.. అడ్వకేట్ కమీషన్ ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేరుగా విచారణకు హాజరయ్యారు. అనంతరం అడ్వకేట్ కమిషన్‌ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అవగా... చివరకు శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. సంబంధించి హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అవగా... చివరకు శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావ్ అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మహబూబ్ నగర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

బీఎల్ సంతోష్ హంగ్ ఆశల వెనుక మర్మం ఇదేనా?

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఎన్నికల సన్నాహాల విషయంలో ఏ  పార్టీ ముందున్నది.. ఏ పార్టీ వెనుకబడింది అన్న సంగతి పక్కన పెడితే.. కేంద్ర ఎన్నికల సంఘం  మాత్రం తన పని తాను చేసేసి తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అనేసింది. తెలంగాణలో ప్రస్తుత  పరిస్థితులను గమనిస్తే త్రిముఖ  పోటీ అనివార్యం అనే అనిపిస్తుంది. అయితే ఈ పోటీలో ఇప్పటికే బీజేపీ అస్త్ర సన్యాసం చేసేసింది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారం మాదే అని ధీమాగా చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో హంగ్ వస్తుంది. అప్పుడు తిమ్మిని బమ్మిని చేసైనా, బమ్మిని తిమ్మిని చేసైనా అధికారం చేపడతామని చెబుతున్నారు. అలా బీజేపీ హంగ్ ఆశలపల్లకీలో ఊరేగుతుంటే.. సర్వేలు  మాత్రం వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి.  అదే సమయంలో అధికార బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా రెండో స్థానంలో నిలుస్తుందని చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ వెలువడిన రెండు సర్వేలూ కూడా రాష్ట్రంలో బీజేపీ సింగిల్ డిజిట్ కు మించి స్థానాలు సాధించే అవకాశాలు మృగ్యమేనని తేల్చేశాయి. తాజాగా వెలువడిన సీఓటర్ సర్వే కాంగ్రెస్ కు 48 నుంచి 60 స్థానాలు, బీఆర్ఎస్ కు 43 నుంచి 55 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే  రెండు పార్టీల మధ్యా ఓ పదిహేసు స్థానాలలో తీవ్రమైన పోటీ ఉండటం వల్లే గెలిచే సీట్ల అంచనాలో గ్యాప్ ఎక్కువ ఉందని సర్వే పేర్కొంది.  సరే ఎలా చూసినా తెలంగాణలో  సప్పోజ్, ఫర్ సప్పోజ్ హంగ్ వస్తే చక్రం తిప్పే అవకాశం మాత్రం బీజేపీకి ఏ మాత్రం ఉండదన్నది మాత్రం వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 119 స్థానాలున్న అసెంబ్లీలో ఓ తొమ్మిది స్థానాలతో అధికారాన్ని చేపట్టే అవకాశం బీజేపీకి ఇసుమంతైనా ఉండదన్నది వారి విశ్లేషణ. ఈ విశ్లేషణలన్నీ ఇటీవల వెలువడిన రెండు సర్వేల ఆధాకరంగా జరిగినవే.  ఇక ఓట్ల శాతం పరంగా చూసిన బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు దూరంగా మూడో స్థానంలో నిలిచింది. సీవోటర్ సర్వే మేరకు కాంగ్రెస్ 39 శాతం ఓట్లు సాధిస్తుంది, బీఆర్ఎస్ 37శాతం ఓట్లతో రెండు స్థానానికి పరిమితమౌతే.. బీజేపీ 16 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో  బీజేపీ హంగ్ అంచనా అయితే గియితే నిజమైనా.. అధికారం చేపడతామన్న ఆశలు మాత్రం నెరవేరే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే విమర్శకులు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ చేసిన హంగ్ తప్పదు.. అధికారం మాదే అన్న వ్యాఖ్యల వెనుక మర్మాన్ని ఎత్తి చూపుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ ఎప్పటి నుంచో ఉన్న భావన వాస్తవమే అనడానికి సంతోష్ వ్యాఖ్యలు నిదర్శనమని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచడం అనే  ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెంచిందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి విదితమే. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మరీ ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంపై పలు మార్లు సోదాహరణంగా చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అందరినీ అరెస్టు చేసిన ఈడీ కవితకు మాత్రం అరెస్టు నుంచి వెసులుబాటు ఇవ్వడాన్ని ఆయన ప్రధానంగా ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలోనే బీఎల్ సంతోష్ హంగ్ తధ్యం అధికారం మాదే అన్న మాటను అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పరిశీలకుల అంచనా ప్రకారం  రానున్న 50 రోజులలో అంటే ఎన్నికల నాటికి  తటస్థ ఓటర్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తరువాత  బీఆర్ఎస్ పై ప్రజాగ్రహం వ్యక్తం అవుతోందని, ఇంత కాలం ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన సెటిలర్లు, తెలుగుదేశం క్యాడర్ అధికార పార్టీకి దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దానికి తోడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతున్నదని చెబుతున్నారు.  

ఎన్నికల కోడ్ వస్తే ఏం చేయకూడదో తెలుసా ? 

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. భారత ఎన్నికల కమిషన్ నిన్న మధ్యాహ్నం షెడ్యూల్‌ను విడుదల చేసింది. చత్తీస్‌గఢ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.  మిజోరంలో నవంబరు 7న ఒకే విడతలో ఎన్నికలు పూర్తికానుండగా, చత్తీస్‌గఢ్‌లో అదే నెల 7, 17 తేదీల్లో రెండు విడతలుగా జరుగుతాయి. మధ్యప్రదేశ్‌లో 17న, రాజస్థాన్‌లో 23న పోలింగ్ జరగనుండగా, తెలంగాణలో 30న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడిస్తారు. షెడ్యూల్ ప్రకటనతోనే ఈ ఐదు రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.  ఈ కోడ్‌లో రాజకీయ పార్టీలు ఏం చేయకూడదో చూద్దాం.  - ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ అధికార పార్టీ నేతలను కానీ, మంత్రులను కానీ వారి ఇంటి వద్ద వ్యక్తిగతంగా కలవకూడదు.  - ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కానీ, పార్టీ నేత కానీ తమ ఇంటి వద్ద కార్యక్రమాలు నిర్వహించకూడదు. అయితే, తమ సొంత ఖర్చుతో మాత్రం చేసుకోవచ్చు.   -ఏదైనా పథకం కానీ, ప్రాజెక్టుకు కానీ కోడ్ అమల్లోకి రావడానికి ముందే గ్రీన్ సిగ్నల్ లభించి, క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కాకపోతే, కోడ్ అమల్లోకి వచ్చాక ఆ పని ప్రారంభించడానికి వీల్లేదు.   - అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు.   - ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ తమ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకూడదు.   - కోడ్ అమల్లోకి వచ్చాక పెన్షన్ ఫాంలు స్వీకరించడం, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, బీపీఎల్ కుటుంబాలు ఎల్లో కార్డులు జారీ చేయడం నిషేధం.   - ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు.   * టెండర్లు జారీ చేయడం కానీ, కొత్త పనులు ప్రారంభించడం కానీ ప్రభుత్వం చేయకూడదు.   * కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు ప్రారంభించడం, పెద్ద భవనాలకు క్లియరెన్స్ ఇవ్వడం నిషేదం.  ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది.

జగన్ ఇక సర్దేసుకుంటున్నారా?

జగన్ సర్దేసుకుంటున్నారా? ఓటమి ఖeయమని నిర్ణయానికి వచ్చేసి.. ఇక తన హయాంలో జరిగిన అక్రమాలతో  తనకేమాత్రం సంబంధం లేదని పార్టీ నేతలకు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహం పీక్స్ కు చేరిందని గమనించి ప్రజలకు ముఖం చాటేయడానికే నిర్ణయించుకున్నారా? అయినా వచ్చే ఎన్నికలలో విజయం మనదే అని పార్టీ నేతలను క్యాడర్ ను నమ్మించడానికి విస్తృతస్థాయి సమావేశాన్ని వేదికగా చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.   అయితే ఆ విస్తృత స్థాయి సమావేశంలో కూడా జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలలో చేసే ప్రసంగమే చేయడంతో దీని కోసం ఈ సమావేశం ఎందుకు అంటూ పార్టీ నేతలు ఉసూరుమన్నారు. ఎప్పడూ చెప్పే ఆవుకథకు తోడు ఈ సమావేశంలో జగన్ వచ్చే మార్చిలోనే ఎన్నికలు ఉంటాయనీ, అందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు.  ఈ నెల 25 నుంచీ డిసెంబర్ వరకూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను బస్సు యాత్రలతో చుట్టేయాలనీ, రోజుకు మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. అయితే ఈ సభలు వేటిలోనూ జగన్ పాల్గొనరు. అసలు తాను బటన్ నొక్కడం తప్ప ఇంకేమీ చేయనని పరోక్షంగా నేతలకు స్పష్టం చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారా అని పార్టీ వర్గాలే సెటైర్లు వేసుకుంటున్నాయంటే.. జగన్ ప్రసంగం వారిని ఎంత ప్రభావితం చేసిందో అర్ధమౌతుంది. ఎన్నికలు సన్నద్ధం కావాలనీ, తాను చేసిన సంక్షేమాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ చెప్పిన జగన్ చంద్రబాబు అరెస్టు విషయంలో తనపై వచ్చిన వ్యతిరేకత తీవ్రతతో ఎంత భయపడుతున్నారో కూడా పరోక్షంగా నేతలకు ఎరుకపరిచారు.   దీంతో జగన్  ప్రసంగం నేతలలో ఉత్సాహం నింపడం అటుంచి,  వారిలో భయాన్ని ప్రోది చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో జగన్  కంగారు పడుతున్నారనీ, బాబు అరెస్టుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవడానికి తాపత్రేయపడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జనమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా జగన్ మాటలు నమ్మడం లేదని అంటున్నారు. చంద్రబాబు అరెస్టు గురించి తనకు ఏ మాత్రం తెలియదనీ, తాను లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆ అరెస్టు జరిగిందని జగన్  పార్టీ విస్తృత సమావేశంలో చెప్పి తనలోని భయాన్ని మరోసారి చాటుకున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత తన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్.. ఆ వెంటనే నిర్వహించిన సమీక్షల్లో చంద్రబాబు అరెస్టు గురించి గొప్పగా చాటారు. అరెస్టు చేసిన సీఐడీని అభినందించారు. ఎవరినీ వదలొద్దు.. అంటూ భుజం తట్టారు. దీంతో సీఐడీ చీఫ్ రెచ్చిపోయి తన స్కాన్ లో లోకేష్ సహా ఎవరెవరున్నారో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించేశారు.  అయితే ఆ తరువాత చంద్రబాబు అరెస్టు వలన వ్యక్తిగతంగా తనకూ, ప్రభుత్వానికీ, పార్టీకీ జరిగిన డ్యామేజీ జగన్ కు అర్ధమైందనీ, అందుకే ఆ అరెస్టుతో తనకు సంబంధం లేదనీ, విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే వరకూ తనకా విషయమే తెలియదనీ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటం, రాజకీయాలకు అతీతంగా బాబుకు మద్దతు పెరుగుతుండటం, ఎంతగా నిర్బంధకాండను అమలు చేసినా, రాష్ట్రం మొత్తాన్ని ఆంక్షల వలయంలో నింపేసినా నిరసనలు ఆగకుండా కొనసాగుతుండటంతో జగన్  ఈ అరెస్టు వల్ల రాజకీయంగా జరిగిన నష్టం ఏమిటన్నది బోధపడింది. చంద్రబాబు అరెస్టు తరువాత వైసీపీ గ్రాఫ్ అధ:పాతాళానికి పడిపోయిందన్న సంగతి సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు నష్ట నివారణ కోసం జగన్ ఆ అరెస్టుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే  ఆయన చెప్పే మాటలు కనీసం పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మడం లేదు. ఇక జనమెలా నమ్ముతారని పరిశీలకులు అంటున్నారు.   చంద్రబాబు అరెస్టు తరువాత పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్పన్నమైన ఓటమి భయాన్ని పక్కన పెట్టేందుకే మార్చిలోనే ఎన్నికలు.. సిద్ధం కండి అంటూ పిలుపు నిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ ఎన్నికల సన్నద్ధతకు తాను మాత్రం దూరం అంటూ ముక్తాయించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గతంలో కూడా గడపగడకకూ అంటే తమను జనం ముందు దోషులుగా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజాగ్రహానికి తమను బలి చేసి ఆయన మాత్రం ప్రగతి భవన్ లో భద్రంగా కూర్చుంటారా? అని అంతర్గత సంభాషణల్లో  పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే జనం వై ఏపీ నీడ్స్ జగన్ అని తమను ముఖం మీదే ప్రశ్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్ తాను మాత్రం ప్రజల ముందుకు రాను మీరు వెళ్లి వ్యతిరేకతను సానుకూలతగా మార్చండని ఆదేశించడమేమిటని ప్రశ్నించుకుంటున్నారు. 

మార్చిలో ఎన్నికలు.. ఢిల్లీలో డిసైడ్ చేసుకొని వచ్చారా?

 తెలుగు రాష్ట్రాలలో ఓట్ల పండగ వచ్చేసింది. గత నాలుగైదు నెలలుగా రెండు రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటూ తెగ చర్చలు నడిచాయి. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలంగాణ‌  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసింది. న‌వంబర్ 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌న్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ మొదలైంది. అదే వేడిలో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి కూడా ఓ కీలక ప్రకటన చేశారు. ఆంధ‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా జగన్ ప్రకటన చేసి ఇక్కడ కూడా వేడి రాజేశారు. ఏపీలో 2024 మార్చిలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ప్ర‌క‌టించారు. క‌రెక్ట్ తేదీని చెప్పలేదు కానీ.. మర్చి నెలలోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టమైన ప్రకటన చేశారు. త్వ‌ర‌లోనే మేనిఫెస్టోను ప్రవేశపెడతామన్న జగన్.. ఈ నెలాఖరున వైసీపీ బస్సు యాత్ర మొదలు పెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బస్సు యాత్రతో వైసీపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నట్లు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని నిన్నటి వరకూ విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే, జగనే ఇప్పుడు ఆ చర్చతకు, వదంతులకు చెక్ పెడుతూ మార్చిలో ఎన్నికలని ప్రకటించారు. అయితే, ఉన్నపళంగా జగన్ ఇప్పుడు ఈ ప్రకటన చేయడం వెనక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటికే విడుదలైన సర్వేల ఫలితాలతో వైసీపీ గాభరా పడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలే ఈసారి మనం గెలవగలమా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గెలిస్తే తమ పరిస్థితి ఏంటని బహిరంగంగానే  అంటున్నారు. మొత్తంగా తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న వైసీపీకి ఇప్పుడు బూస్టప్ ఇచ్చేలా ప్రణాళిక కావాలి. గెలిచేది మనమే అంటూ భరోసా కావాలి. అదే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇదిగో మార్చిలో ఎన్నికలు, ఫిబ్రవరిలో మ్యానిఫెస్టో అంటూ ప్రకటనలు చేశారు. ఈ నాలుగు నెలలు ఏం చేయాలో కూడా క్యాడర్ కు సూచించారు. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమ కేసులతో జైల్లో పెట్టారు. అయినా తెలుగుదేశం క్యాడర్ ఎక్కడా నిరుత్సాహపడడం లేదు. గెలుపు తమదే అన్న ధీమా టీడీపీ శ్రేణుల్లో కన్పిస్తుంది. అధికారంలో ఉండి.. ఏది తలచుకుంటే అది చేయగలుగుతున్నా వైసీపీ శ్రేణులలో మాత్రం ఆ ధీమా కొరవడింది. అందుకే జగన్ అదే సభలో చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడి మరీ ఎన్నికల ప్రకటన చేశారు. ఎలాగూ చంద్రబాబు జైల్లో ఉన్నాడు కనుక టీడీపీ పనైపోయిందని.. విజయం మనదే అన్న రీతిలో జగన్ ఒక అడుగు ముందుకేసి ఎన్నికల ప్రకటన చేశారు. అయితే, జగన్ ఎన్నికల ప్రకటన చేసి రోజు గడిచినా వైసీపీ శ్రేణుల్లో ఎక్కడా చలనం కనిపించడం లేదు. ప్రజాలలో జగన్ సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి  చంద్రబాబుపై సానుభూతి  తోడు కావడంతో  వైసీపీకి ఇప్పుడు విజయంపై భరోసా లేకుండాపోయింది.  అలాగే.. జగన్ అలా ఢిల్లీ వెళ్లి  వచ్చి.. ఇలా ఎన్నికల ప్రకటన చేయడం వెనక అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా  ఢిల్లీలో అమిత్ షాతో ఎన్నికలపైనే జగన్ మాట్లాడారని,  ముందస్తుకు వెళ్లాలా యధావిధిగా జరగాలా అన్న దానిపై బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే జగన్ ఎన్నికలకు సిద్దమవుతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఇప్పటి వరకూ ఎన్నికల కమిషనే ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న విషయంలో ఎలాంటి ప్రకటన కానీ సంకేతం కానీ ఇవ్వలేదు.   జగన్ మాత్రం సరిగ్గా మార్చిలోనే  ఎన్నికలు అంటూ ప్రకటన చేశారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టులో కూడా బీజేపీ పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు అలా అమిత్ షాను కలిసి రాగానే జగన్ ఎన్నికల ప్రకటన చేయడం బీజేపీపై మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నది. బీజేపీ, వైసీపీ ఢిల్లీలో డిసైడ్ చేసుకొనే ఏపీలో జగన్ ఈ ప్రకటన చేశారన్న టాక్ బలంగా వినిపిస్తుంది.

మన పని అయిపోయింది.. వైసీపీ నేతలలో భయం.. భయం!

మొన్నటి వరకూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 అనే నినాదం వినిపించేవారు. సీఎం వైనాట్ 175 అంటుంటే ఆ సంగతెలా ఉన్నా మరో సారి మన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని  వైసీపీ క్యాడర్ నమ్ముతూ వచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కాస్త అటో ఇటూ మినిమం అధికారానికి సరిపడా సీట్లు దక్కుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు వారిలో ఆ నమ్మకం లేదు. పరిస్థితి పూర్తిగా తారుమారైంది. దీంతో వైసీపీ నేతలలో   భయం మొదలైంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. మనం ఓడిపోవడం ఖాయం కనుక రేపు మన పరిస్థితి ఏంటి అనే టెన్షన్ మొదలైంది. తెలుగుదేశం గెలిస్తే మన పరిస్థితి ఏంటి అంటూ వైసీపీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. మొన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు  ఇటీవల ఓపెన్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన తరువాత మాజీ మంత్రి బాలినేని కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మన పరిస్థితి ఏంటని కార్యకర్తలను ఉద్దేశించి వీళ్లు ప్రశ్నించారు.  తెలుగుదేశం గెలిస్తే రేపు మన భవిష్యత్ ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాన, బాలినేని క్యాడర్ ను ఒకరకంగా రెచ్చగొడుతూ బ్రతిమాలుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన,  తెలుగుదేశం నాయకులు ఓపెన్ గానే హెచ్చరికలు జారీ చేస్తున్నారని..  తెలుగుదేశం నిజంగానే అధికారంలోకి వస్తే మనం తట్టుకోలేమని.. పరుగులు పెట్టాల్సిందేనని ధర్మాన, బాలినేని కార్యకర్తలను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి వైసీపీ నేతలలో ఈ భయం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత కొన్ని నెలలుగా వైసీపీ చేయించుకున్న అంతర్గత సర్వే, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టుతో నే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని నిర్ధారణ అయింది. ప్రజలలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆగ్రహ జ్వాలలలో మనం కొట్టుకుపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చేశారు. కానీ, ఆ విషయాన్ని దాచి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ నేతలలో గెలుపు ఆశలు పూర్తిగా  అడుగంటాయి. దాంతో  బరస్ట్ అయిపోతున్నారు. కేడర్ ను రెచ్చగొట్టి అయినా సరే ఓటమి గండం గట్టెక్కాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్టుతో తో వైసీపీ క్యాడర్ ఉలిక్కి పడింది. కొందరు నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నా ఎక్కువ మందిని ఆలోచనలో పడేసింది. చంద్రబాబు అరెస్ట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడంతో వైసీపీలో ఆందోళన మొదలైంది. తమ ఓటమి ఖరారైందన్న భావనలోకి వచ్చేసిన వైసీపీ నేతలు.. మనసులో మాటను దాచుకోలేక బయటపడిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు, టీడీపీతో భగ్గుమంటున్న విద్వేష వాతావరణంలో ఓటమిపాలైతే మన పరిస్థితేంటని వైసీపీ క్యాడర్ మధనపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రతీకార చర్యలకు దిగిన వైసీపీకి ఇప్పుడు అధికారం కోల్పోతే తమ పరిస్థితి ఏంటని భయపడుతోంది. కలవర పడుతోంది. ఆ కలవరమే, భయమే వైసీపీ నేతలు, మంత్రుల మాటలతో భయపడుతోంది.  ధర్మాన, బాలినేని లాంటి నేతలు మీడియా ముఖంగా బయటపడ్డారు. కానీ, వైసీపీ నేతలలో ఇప్పుడు అందరిదీ ఇదే భయం. అంతర్గత సంభాషణల్లో కూడా వైసీపీ నేతల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ఇన్నాళ్లు అధికారం ఉందని చెలరేగిపోయామని, ఇప్పుడు పరిస్థితి తేడాగా మారగా.. రేపు మనల్ని ఎవరు కాపాడాలని వారిలో వారు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకొచ్చిన గొడవ జరిగిందేదో జరిగింది. ఇప్పటి నుండైనా తగ్గి ఉంటే మంచిదనే భావనలో ఇప్పటికే కొంత మంది సైలెంట్ అయిపోయారు. మరికొంత మంది టీడీపీ నేతలతో పరిచయాలు పెంచుకుంటూ వీలయితే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. కొంత మంది మాత్రం కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. టీడీపీ వస్తే బతకనివ్వదని, ప్రాణాలు తెగించి గెలిపించుకుంటేనే రేపు మీ ప్రాణాలు నిలిచేది అంటూ నూరిపోస్తున్నారు. కానీ, కార్యకర్తల నుండి మాత్రం స్పందన రావడం లేదు. నాలుగేళ్ళగా పార్టీ కోసం పనిచేసినా తమకి ఒరిగిందేమీ లేదన్న భావనలో ఉన్న వైసీపీ క్యాడర్ అధికారం ఉన్నా.. లేకపోయినా తమకొచ్చే ఆదాయం ఏదీ లేదు.. జరిగే నష్టం ఏదీ లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.

బీఆర్ఎస్ ప్రచార సారథి కేటీఆర్?.. నెగ్గుకు రాగలరా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో బాగా డీలా పడే పార్టీ ఏదైనా ఉందంటే అది అధికార బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పాలి. గతంలో ఆంధ్రులకు ఆరంభ శూరత్వం అనే వారు. ఏపీ సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు మాత్రం ఆ నానుడి సరిగ్గా అతికినట్లు సరిపోతుందని అని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. అతి విశ్వాసమో, అతిశయమో తెలియదు కానీ.. ఎటువంటి కసరత్తూ చేయకుండానే ఊరికి ముందుగా 16 మంది అభ్యర్థులతో వచ్చే ఎన్నికలలో పోటీ చేసే వారి తొలి జాబితాను కేసీఆర్ విడుదల చేసేశారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికలకు సిద్ధమైపోయామన్న సంకేతమిచ్చేశారు. అంతే ఆ తరువాత నుంచి బీఆర్ఎస్ లో అసమ్మతి, అసంతృప్తి వినా.. ఎన్నికల సమాయత్తం దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైపెచ్చు అసంతృప్తులను బుజ్జగించే యత్నాలూ బెడిసికొట్టాయి.  సరిగ్గా అదే సమయంలో అనారోగ్యం కారణంగా కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితం కావడంతో అంతా అయోమయం జగన్నాథం అన్నట్లుగా తయారైంది. వైరల్ ఫీవర్ కు తోడు ఇన్ ఫెక్షన్ కూడా సోకడంతో కేసీఆర్ మరిన్ని రోజులు ఇంటికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందుగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎన్నికల లబ్ధి పొందాలనుకున్నా అది సాధ్య పడలేదు. అంచనాల కంటే ఒక రోజు ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేయడంతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణక్ష్ాలపై నిర్ణయం తీసుకుందామని బీఆర్ఎస్ చేసిన కసరత్తు వృధా అయిపోయింది.  ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఇక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బీఆర్ఎస్ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక బీఆర్ఎస్ ఏం చేసినా పార్టీ పరంగా హామీలు మాత్రమే ఇవ్వగలదు.   ఇక బీఆర్ఎస్ ను మధన పెడుతున్న అంశమేమిటంటే.. కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఏ మేరకు చేస్తారు? ఎన్ని రోజులు కేటాయిస్తారు అన్నదానిపైనే ఉంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సారథ్యం పూర్తిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావే వహించనున్నారు. అలాగే పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పగ్గాలు కూడా ఆయనే చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అధినేతగా ఉన్నప్పుడు, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీ ప్రచార సారథ్యం వహించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సీఎం పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ అనారోగ్యం కారణంగా విశ్రాంతి అవసరమన్న వైద్యుల సూచనల మేరకు పరిమితగానే ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండటంతో.. బీఆర్ఎస్ కూడా సమాజ్ వాదీ పార్టీ మోడల్ ను అనుసరించక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొంటున్నదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  అయితే కేటీఆర్ సారథ్య బాధ్యతలు అనగానే పార్టీలోని ఒక వర్గం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందా అన్న అనుమానాలు బీఆర్ఎస్ నుంచే వ్యక్తం అవుతున్నాయి.  ఇందుకు ఉదాహరణగా 2018 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేటీఆర్ ను కేసీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించడం.. దాంతో ఈటల, హరీష్ వంటి వారు అలకపాన్పు ఎక్కారన్న వార్తలు వెలువడటం, వాటికి బలం చేకూర్చే విధంగా 2018 ఎన్నికలలో విజయం తరువాత కేసీఆర్ తన తొలి కేబినెట్ లో ఈటల, హరీష్, వారి వర్గానికి చెందిన వారెవరికీ కేబినెట్ లో స్థానం కల్పించకపోవడాన్ని చూపుతున్నారు.  అసలు 2018 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఏదో ఒక సమయంలో కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే కార్యక్రమం ఉంటుందని అంతా భావించారు. పలువురు మంత్రులు అయితే ఏకంగా బహిరంగ వేదికలపైనే కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించేశారు కూడా. అయితే తరువాత తరువాత పరిస్థితి మారింది. కేటీఆర్ నాయకత్వానికి పార్టీలో సంపూర్ణ ఆమోదం లేదన్న విషయం గ్రహించిన కేసీఆర్ కుమారుడికి పట్టాభిషేక ముహూర్తాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈ కారణంగానే కేటీఆర్, కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందని కూడా అప్పట్లో పరిశీలకులు సోదాహరణంగా వివరించారు. సీఎం పాల్లొన్న సభలకు కేటీఆర్ గైర్హాజర్ కావడం, అసెంబ్లీ సమావేశాలలో కూడా ఒకరికొకరు ఎదురు పడకుండా ఒకరు వచ్చి వెళ్లిన తరువాతే మరొకరు రావడాన్ని అప్పట్లో పరిశీలకులు ఎత్తి చూపారు. సరే టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ గ్యాప్ ఒకింత తగ్గిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొనడం, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేయడంతో ఇక ప్రచార రంగంలోకి దూకక తప్పని అనివార్య పరిస్థితులు ఉత్పన్నం కావడంతో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ప్రచార సారథ్యం భుజాన మోయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీని విజయతీరాలకు చేర్చగలిగితే ఇక ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించడానికి ఎటువంటి అడ్డంకులూ ఉండవని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన సారథ్యంలో పార్టీ అంతా ఏకతాటిపై నిలుస్తుందా? అన్న అనుమానాలను మాత్రం గత ఉదంతాలను ఎత్తి చూపుతూ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

ఇజ్రాయిల్ లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న భారతీయులు 

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయగా... గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలను తరలిస్తోంది. మరోవైపు పాలస్తీనాకు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మద్దతును ప్రకటించింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో... ఇజ్రాయెల్ ప్రజలతో పాటు అక్కడున్న విదేశీ పర్యాటకులు, విదేశీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.  ఇజ్రాయెల్ లోని వివిధ నగరాలు, పట్టణాల్లో 18 వేల మందికి పైగా భారతీయులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. వీరంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే... రోడ్లపై చిక్కుకుపోయారు. ఆ దేశంలో ఉన్న తమ వారి పరిస్థితి ఎలా ఉందో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  మరోవైపు భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. స్థానిక అధికారులు సూచించిన భద్రతాపరమైన ప్రొటోకాల్ ను అనుసరించాలని తెలిపింది. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంప్రదించాలని సూచించింది.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై తీర్పు వాయిదా

 తెలంగాణలో ఇవ్వాళ  ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కోడ్ కూడా అమలవుతోంది. ఈ నేపథ్యంలో   మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై కొనసాగుతున్న వివాదంపై తీర్పును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. తెలంగాణ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల సమయంలో ఆయన అఫిడవిట్ లో ఆస్తుల లెక్కలు తప్పుగా చూపించారని, ఒకసారి సమర్పించిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకుని పలు సవరణలు చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ను మళ్లీ వెనక్కి తీసుకుని, సవరణలు చేయడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో మంగళవారం తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.

ఏపీలో మద్యం స్కాం.. కేంద్ర హోంమంత్రికి పురంధేశ్వరి ఫిర్యాదు? ఏం జరుగుతుంది?

ఏపీ విషయంలో బీజేపీ వైఖరి మారుతోందా? జగన్ కు దూరం జరుగుతోందా? ఏపీలో ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు, అడ్డగోలు విధానాపై దృష్టి పెట్టిందా? అంటూ ఒక్క రోజులో.. అంటే హస్తినలో ఏపీ సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ తరువాత స్వల్ప వ్యవధిలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఔననక తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో జగన్ ఆర్థిక అరాచకత్వం, అడ్డగోలు అప్పులు, మద్యం విధానంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శలు గుప్పిస్తూ, అధిష్ఠానానికి ఫిర్యదులు చేస్తూ వచ్చిన పురందేశ్వరి తాజాగా సిరికిం చెప్పడు అన్నట్లుగా హస్తిన బయలుదేరి వెళ్లారు. అసలు ముందుగా అనుకున్నట్లు అయితే ఏపీలో జగన్ సర్కార్ పట్ల తాము అనుసరించాల్సిన వైఖరి ఏమిటి? యుద్ధం చేయాలా? రాజీ పడాలా? తేల్చండి అంటూ హై కమాండ్ కు అల్టిమేటమ్ ఇచ్చేందుకు పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి హస్తిన వెళ్లాల్సి ఉంది. అందుకోసం తేదీ ఖరారు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ లోగా ఉరుములేని పిడుగులా పురంధేశ్వరి ఆదివారం ( అక్టోబర్ 8) మధ్యాహ్నమే హడావుడిగా హస్తినకు వెళ్లారు. వెళ్లీ వెళ్లడంతోనే అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించింది. అమిత్ షాను కలిసి ఏపీలో మద్యం కుంభకోణంపై ఫిర్యాదు చేయడమే కాదు.. దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పురందేశ్వరి అధిష్ఠానం పిలుపు లేకుండా ఆమె అంతట ఆమె హస్తిన వెళ్లి, అమిత్ షాతో భేటీ అయ్యారనీ, జగన్ సర్కార్ మద్యం విధానంపై ఫిర్యాదు చేసి.. అదో పెద్ద స్కాం.. దానిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలనీ కోరారని భావించలేం. మద్యం స్కాం కు సంబంధించిన వివరాలతో హస్తినకు రావాల్సిందిగా హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాదు పురంధేశ్వరి ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై విచారణ ఇహనో ఇప్పుడో ఆరంభం అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలు ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోనికి వచ్చినప్పుడే ఏపీ మద్యం కుంభకోణం గురించిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంతే కాదు.. అంత కంటే ముందు నుంచీ కూడా ఏపీ మద్యం విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఏపీ మద్యం కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  ఇందుకు కారణం.. వైసీపీ అధికార పగ్గాలు చేపట్టీపట్టగానే రాష్ట్ర మద్యం విధానాన్ని సమూలంగా మార్చేసింది. సంపూర్ణ మద్య నిషేధం కోసం అంటూ మొత్తం మద్యం వ్యాపారం అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. దీంతో మద్యం వ్యాపారం వైసీపీ గుప్పిట్లోకి వెళ్లిపోయింది.  అంటే దశల వారీ సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రభుత్వమే మద్యం వ్యాపారం మొదలు పెట్టింది. ఆ పేరుతో మద్యం దుకాణాలన్నీ వైసీపీ అధినం చేసుకుంది.  కాదు కాదు ప్రభుత్వమే అలా చేసింది.  ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏపీలోని ప్రభుత్వ అధీనంలోని మద్యం దుకాణాలలో ప్రముఖ బ్రాండ్ల మద్యం దొరకదు. అక్కడ దొరికేదంతా జె బ్రాండ్ గా గుర్తింపు పొందిన మద్యమే. ఈ బ్రాండ్ల మద్యం  మాత్రమే ఏపీలో లభ్యమౌతుంది. మరో  రాష్ట్రంలోనూ ఈ బ్రాండ్ల జాడ కనిపించదు. అలాగే ప్రపంచం అంతా డిజిటల్ మనీ అంటుంటే ఏపీలో అదీ ఒక్క మద్యం వ్యాపారం మాత్రం నో డిజిటల్ ఓన్లీ క్యాష్ విధానంలో  ఇటీవలి వరకూ కొనసాగింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు  కూడా అనుమతించారు. అయితే ఏపీ మద్యం వ్యాపారంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇప్పటికీ నామమాతరమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఏపీ మద్యం కుంభకోణంపై పురంధేశ్వరి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడం, అదీ స్వయంగా  హస్తిన వెళ్లి మరీ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మోగిన ఎన్నికల నగారా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.  ఛత్తీస్ గఢ్ ,రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మిజోరం, తెలంగాణ  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే.  వచ్చే ఏడాది జరగనున్నసార్వత్రిక ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు.   దీంతో  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను   బీజేపీ  కూటమి (ఎన్డీయే), కాంగ్రెస్ కూటమి (ఇండియా), ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం రాజస్థార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో నవంబర్ రెండవ వారం, డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.   తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటించిన షెడ్యూల్ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫాలో జరుగుతాయి.  వచ్చే నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన అదే నెల 13న జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు నవంబర్ 15. నవంబర్ 30 పోలింగ్ తేదీ కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న  జరుగుతుంది. కాగా ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయి. ఇక రాజస్థాన్, మిజోరం, మధ్య ప్రదేశ్ లలో  ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి.  మధ్య ప్రదేశ్ లోని 230 స్థానాలకు ఒకే దఫాలో నవంబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్ ఈ నెల 21న వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు అక్టోబర్ 30. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 31. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 2. పోలింగ్ నవబంబర్ 17 కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది.  ఇక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే దఫాలో జరుగుతాయి. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకూ ఒకే విడతలో  నవంబర్ 23న పోలింగ్ జరుగుతుంది. నోటిఫికేషన్ అక్టోబర్ 30న విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు నవంబర్ 6 కాగా నామినేషన్ల పరిశీలన నవంబర్ 7న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 9. పోలింగ్ నవంబర్ 23 కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్3న జరుగుతుంది.  ఛత్తీస్ గఢ్ లో రెండు విడతలుగా నవంబర్ 7, 17 తేదీలలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. మొదటి విడత కు అక్టోబర్ 13న, రెండో విడతకు అక్టోబర్ 23న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. తొలి విడతకు నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 20 తుదిగడువు కాగా, రెండో విడతకు అక్టోబర్ 30 చివరి తేదీ. ఇక తొలి విడత నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 21న, రెండో విడత నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 31న ఉంటుంది. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 23 కాగా రెండో విడత నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 2. రెండు విడదల ఓట్ల లెక్కింపూ కూడా డిసెంబర్ 3న ఉంటుంది.  ఇక మిజోరాం విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో కూడా ఒకే విడతలో  నవంబర్ 7,పోలింగ్ జరుగుతుంది.  

జగన్ తో రణమా.. శరణమా.. బీజేపీ హైకమాండ్ కు రాష్ట్ర నేతల అల్టిమేటమ్!?

తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోయింది. సైద్ధాంతిక నిబద్ధత, క్రమశిక్షణ అంటూ గొప్పగొప్ప కబుర్లు చెప్పే కమలనాథులు.. ఎన్నికల సమయానికి వాటన్నిటినీ గాలికొదిలేసి.. నాలుగు ఓట్లు సంపాదించిపెట్టగలిగే నాయకుడు ఉంటే చాలు లాగేయండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  నిన్న మొన్నటి దాకా తెలంగాణలో అధికారం మాదే.. అంటూ ఘనంగా చాటుకున్న నేతలు ఇప్పుడు పరోక్షంగానైనా.. హార్స్ ట్రేడింగ్ లో మేం దిట్టలం.. హంగ్ వచ్చినా అధికారం మాదే అనే స్థయికి దిగజారిపోయారు. నిన్న మొన్నటి దాకా తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే.. అవినీతి కేసీఆర్ పార్టీని ఓడించి అధికారంలోకి వస్తామని ఢిల్లీ నుంచి గల్లీ నేతల దాకా ఒకే పాట పాడేవారు. ఇప్పుడు గల్లీ నేతలు అసలు మాట్లాడటమే మానేశారు. ఢిల్లీ నేతలు మాత్రం వరుసకట్టి తెలంగాణలో పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో అధికారం మాదేనని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోడీ సైతం.. కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానంటూ కాళ్లావేళ్లా పడినా తాను పట్టించుకోలేదంటూ తెలంగాణ గడ్డపై ప్రకటించి చులకన అయ్యారు. నాలుగేళ్ల కిందట ఎప్పుడో కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానని అన్నారనీ, తాను పట్టించుకోలేదనీ ఆయన ఇప్పుడు చెప్పడంపై బీజేపీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని ఆ నాడే వెళ్లడించి ఉంటే.. అప్పుడే బీఆర్ఎస్ గాలి పోయేదికదా.. అంటూ వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర నేతల నుంచే వినవస్తున్నాయి. ఇంత కాలం బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు చేస్తున్న విమర్శలకు మోడీ వ్యాఖ్యలు మరింత దోహదం చేసి.. తెలంగాణలో పార్టీ పరువును మంటగలిపాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే మొత్తం మీద మోడీ తరువాత రాష్ట్రంలో పర్యటించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్ నిష్టూరమే అయినా నిఖార్సైన నిజాన్ని బయటపెట్టేశారు. మోడీ, షా, నడ్డా ఇలా అగ్రనేతల మాటలను పూర్వ పక్షం చేసే విధంగా తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే బలం లేదని కుండబద్దలు కొట్టేశారు. అయినా రాష్ట్రంలో పార్టీ ఉనికి బలంగానే ఉందనీ, తిమ్మిని బమ్మిని చేసైనా అధికారాన్ని దక్కించుకుంటామని పార్టీ నేతలకు, శ్రేణులకూ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకీ మెజారిటీ రాదనీ, రాబోయేది హంగ్ అసెంబ్లీయేననీ చెప్పి.. హంగ్ పరిస్థితి బీజేపీకే అనుకూలమనీ, అధికారం మనదేననీ చెప్పారు. అంటే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాకుండా హార్స్ ట్రేడింగ్ కు తెరలేపేశారు.   ఇటీవల కొన్ని సర్వేలు పేర్కొన్నట్లు రాష్ట్రంలో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమౌతుందని బీఎల్ సంతోష్ కూడా అంగీకరించేసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. సరే తెలంగాణ సంగతి పక్కన పెడితే.. ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు అధిష్ఠానం తీరుతో విసిగిపోయారు. ఒక వైపు జనసేనతో మైత్రి, మరో వైపు అధికార వైసీపీతో రహస్య బంధం.. మూడో వైపు.. తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అన్న చందంగా   వ్యవహరిస్తోంది. వాస్తవానికి బీజేపీకి ఏపీలో ఏ మాత్రం స్టేక్ లేదు. ఎన్నిక ఏదైనా, ఎప్పుడైనా  ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం ఒకటి  కంటే తక్కువే. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ఒకే ఒక్క ధీమాతో ఎక్కడైనా చక్రం తిప్పేస్తామంటూ బీజేపీ  నేతలు ఇంత కాలం ఏపీలో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ  ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఆ పార్టీ పప్పులు ఉడకడం లేదనీ, అసలు ఉడకవనీ తేటతెల్లమైపోయింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలే ఇక ముసుగులో గుద్దులాట వద్దంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత.. అదే స్థాయిలో బీజేపీ మీదా రిఫ్లెక్ట్ అవుతోందని వారు అధిష్ఠానానికి స్పష్టం చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీని తెలుగుదేశం, జనసేన కూటమి కూడా దరి చేర నిచ్చే పరిస్థితి లేదన్న పరిశీలకుల విశ్లేషణలను బీజేపీ రాష్ట్ర నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎటూ రాష్ట్రంలో పార్టీకి ఎన్నికలో వచ్చేదీ, పోయేదీ లేదు.. కనీసం ఉనికి చాటుకోవడానికి పోటీలో దిగినా.. నోటాకు మించిన ఓట్లు వస్తాయన్న నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దోబూచులాటలను స్వస్తి చెప్పి జగన్ పార్టీతో రణమా..ఆ పార్టీకి శరణమా? అన్నది తేల్చేస్తే.. బెటరని పార్టీ రాష్ట్ర నేతలు అంటున్నారు.  ఒక వేళ ఇంత కాలం రాష్ట్రంలోని అధికార పార్టీకి వంత పాడుతూ కొనసాగించిన రహస్య మైత్రి అలాగే కొనసాగుతుందన్న స్పష్టత వస్తే అందుకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామనీ, ఒక వేళ పార్టీ విధానంతో విభేదిస్తే మౌనం వహిస్తామనీ, అంతే కాక.. తమను అధికార పార్టీపై వాడవాడలా చార్జిషీట్లు వేయండి అంటూ అక్కడ హస్తినలో మాత్రం జగన్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆడుతున్న డబుల్ గేమ్ కారణంగా ఇక్కడ రాష్ట్రంలో తాము నవ్వుల పాలౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జగన్ సర్కారు అప్పులపై తాము యుద్ధం చేస్తుంటే.. అడ్డగోలు అప్పులు, ఆర్థిక అరాచకత్వం అంటూ విమర్శలు గుప్పిస్తుంటే.. కేంద్రం మాత్రం ఆ అడ్డగోలు అప్పులకు అంత కంటే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తూ  రక్షణ కవచంలా నిలబడుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జగన్ సర్కారుపై బీజేపీ అగ్రనేతల వైఖరి ఏమిటి? రాష్ట్రంలో తాము చేయాల్సిన పని ఏమిటి? అన్నది తేల్చుకునేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో ఒక బృందం హస్తిన బయలు దేరేందుకు రెడీ అయ్యిందంటే.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అవగతమౌతుంది. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం వైఖరి ఏమిటన్నది తేల్చక పోతే తమ దారి తాము చూసుకునేందుకు కూడా రాష్ట్ర నాయకులు సిద్ధపడుతున్నారని సమాచారం.

పొన్నవోలు ముంచేశారు.. వైసీపీలో అంతర్మథనం?

జగన్ సర్కార్ స్కిల్ స్కాం పేరిట తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో కోర్టులలో సమర్పిస్తున్న పత్రాలు, కేసులో చంద్రబాబు పాత్రను రుజువు చేయడానికి  చేస్తున్న ప్రయత్నాల కారణంగా జగన్ దుష్టపన్నాగాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అంతే కాదు.. ఈ కేసు పుణ్యమా అని దేశంలో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వస్తున్నాయన్న రహస్యం కూడా వెలుగులోకి వచ్చింది.  స్కిల్‌ కేసు అవినీతి సొమ్ము తెలుగుదేశం  మళ్లిందంటూ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన ఆరోపణ, అందుకు ఆధారంగా చూపిన వివరాలు బూమ్ రాంగ్ అయ్యాయి.  పొన్నవోలు చేసిన ఆరోపణ, చూపిన ఆధారం వైసీపీ మెడకు చుట్టుకునే పరిస్థితి రావడంతో వైసీపీలో గాభరా మొదలైంది.  ఆ ఆరోపణతో వైసీపీతో పాటు, బీజేపీని కూడా పొన్నవోలు ఇరుకున పడేశారు. స్కిల్ కేసులో తెలుగుదేశం ఖాతాలోకి లంచం సొమ్ము 27 కోట్లు మళ్లాయంటూ పొన్నవోలు చేసిన ఆరోపణ వైసీపీ కాళ్ల కింద నేలను కదిలించివేస్తున్నది. ఎన్నికల విరాళాల రూపంలో వచ్చిన నిధులను కోర్టుకు సమర్పించి దానికి అవినీతి సొమ్ముగా పేర్కొనడంపై తెలుగుదేశం తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు, అలాగే అందుకు సంబంధించి  బ్యాంకు వివరాలను వెల్లడించిన తెలుగుదేశం, అదే సమయంలో  వైసీపీకి వచ్చిన విరాళాల లెక్కల గుట్టు రట్టు చే సింది.  వైసీపీ ఖాతాలకు ఏపీలో కాంట్రాక్టు పనులు చేస్తున్న ఏ కంపెనీలు విరాళాలు జమచేశాయన్న సమాచారాన్నీ వివరంగా పేర్కొంది.  పార్టీకి వచ్చిన విరాళాలను కూడా స్కిల్‌ స్కాంకు లింకు చేయడంపై దుమ్మెత్తి పోసింది. పార్టీకి వచ్చిన విరాళాలను  ఎప్పటికప్పుడు ఆడిట్‌ చేయించి, ఎన్నికల సంఘానికి పంపిస్తామని పేర్కొన్న తెలుగుదేశం. స్కిల్‌  కేసులో ఆధారాలు  చూపలేక.. తాము ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను.. డౌన్ లోడ్ చేసుకుని దానినే కోర్టుకు సమర్పించి  గోల్ మాల్ చేయడానికి ప్రయత్నించిన  పొన్నవోలుపై కోర్టు ధిక్కరణ చర్యలకు డిమాండ్ చేసింది. మొత్తంగా స్కిల్ అవినీతి సొమ్ము అంటూ పొన్నవోలు కోర్టుకు సమర్పించిన వివరాల డొల్లతనం బయటపడటంతో పాటు.. వైసీపీకి అందిన వివరాల గుట్టుమట్లు కూడా బయటపడటంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జగన్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఆ పార్టీకి 600 కోట్ల రూపాయలు విరాళాలు అందాయన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది.ఆ సొమ్ము ఏపీలో కాంట్రాక్టులు చేసిన కంపెనీల నుంచి వసూలు చేసినదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆ విరాళాలలో అధికభాగం ఏపీలో కాంట్రాక్టులు చేస్తున్న మేఘా, హెటిరో, వైకాపా ఎంపి ఎంవివి కంపెనీల నుంచి వచ్చినవే ఉన్నాయి. ఈ విరాళాలలో పోలవరం కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ లో దక్కించుకున్న మేఘా కంపెనీ 22 కోట్ల రూపాయలు, కడప స్టీల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ 14 కోట్ల రూపాయలు, అలాగే వివాదాస్పద భూములను దక్కించుకున్న హెటిరో డ్రగ్స్ 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. 

మూడు కోర్టులు.. ఆరు తీర్పులు.. సర్వత్రా ఉత్కంఠ

ఏపీలోని జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగంగా విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై వరుసగా కేసులు బనాయిస్తోంది. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సోమవారం (అక్టోబర్ 9)న సుప్రీం కోర్టు విచారించనుంది. అది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు కేసులలో హైకోర్టు సోమవారం నాడే తీర్పులు వెలువరించనుంది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిలు పిటిషన్ లపై తీర్పు రానుంది. మొత్తంగా ఈ తీర్పుల విషయంలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావద్ధేశంలో ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది.   ముఖ్యంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. కేవలం సాంకేతిక అంశాల కారణంగా ఏసీబీ, హైకోర్టులలో ఆయన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యిందనీ, సరైన ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్టు చేయడమే కాకుండా.. ఇప్పుడు ఎలాగూ అరెస్టు చేశాము కనుక ఆయనను విచారించి ఆధారాలు సేకరిస్తామంటూ ఏపీ సీఐడీ వింత వాదనను తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో 17ఏ సెక్షన్ వర్తిస్తుందా? వర్తించదా? అన్న అశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ నెల 3న సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సుప్రీం కోర్టు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీని ఆదేశించింది. డాక్యుమెంట్లు అన్నీ హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందును విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.  ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ  వాదనలు వినిపించారు. కాగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు.  ఆ సందర్భంగా సుప్రీం కోర్టు 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఆ దశలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ముకుల్ రోహత్గీ పేర్కొంటే జస్టిస్ బేలా త్రివేది వెంటనే అవీనీతి సంగతి తరువాత ముందు 17ఏ గురించి మాత్రమే చెప్పండని నిలువరించారు. అంతే కాకుండా సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? అన్ని కేసులకూ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఆ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని 17ఏ అన్ని కేసులకూ వర్తిస్తుందని చెప్పారు.  ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే ఈ సొందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు.  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఒక్క ఆధారం చూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వీ పేర్కొన్నారు.   కేసు విచారణలో భాగంగా జస్టిస్ అనిరుధ్ బోస్ అసలు స్కిల్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదందనీ అడిగారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 2021 డిసెంబర్ 9న ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తులకు తెలిపారు.  ఈ కేసులో చంద్రబాబునాయుడిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచాలన్న ఏకైక లక్ష్యమే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని బాబు తరఫున వాదించిన మరో న్యాయవాది సిద్ధార్థ లూధ్రా పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి అంటే అక్టోబర్ 9కి వాయిదా వేస్తూ అప్పటి లోగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం ఆభిప్రాయపడుతున్నారు.