బీహార్ లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ , పలువురి దుర్మరణం ,60 మందికి తీవ్రగాయాలు
posted on Oct 12, 2023 @ 12:16PM
దేశంలో రోజు రోజుకు రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఒక ప్రమాదం మరిచిపోయే లోపే మరో ప్రమాదం సంభవిస్తుంది. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది.బీహార్లో బుధవారం రాత్రి రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి గువాహటికి బయలు దేరిన 12506 నార్త్ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్కు సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 60 మంది తీవ్రగాయాల పాలయ్యారు. మొత్తం ఆరు బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. పాట్నాలోని కీలక ఆసుపత్రులైన పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను హైఅలర్ట్లో ఉండాలని ఆదేశించింది. సహాయక చర్యల కోసం ఘటనాస్థలానికి పది అంబులెన్స్లను పంపించింది.
కాగా, ఈ ప్రమాదంపై జిల్లా విపత్తు నిర్వహణ శాఖతో చర్చించామని బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ‘‘విపత్తు నిర్వహణ శాఖతో పాటూ ఆరోగ్య శాఖ, బక్స్ర్ జిల్లా యంత్రాంగంతో మాట్లాడి పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టాలని సూచించాం. పాట్నాలోని ఆసుపత్రులను కూడా హైఅలర్ట్లో ఉండాలని ఆదేశించాం’’ అని పేర్కొన్నారు.