జగన్ పై గుంటూరు వైసీపీ నేతల గుర్రు!

వైసీపీలో ఇప్పుడు ఆ పార్టీ అస్థిత్వాన్ని ప్రశ్నార్ధకంలో పడేశేలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ వ్యూహాత్మకమో.. వ్యూహాత్మక తప్పిదమో కానీ అభ్యర్థుల మార్పు ఆ పార్టీలో ముసలానికి కారణమయ్యేలా ఉంది. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి పదకొండు స్థానాల్లో ఇన్ చార్జీలను మార్చేసిన  జగన్.. ఇలా సిట్టింగులను మార్చేసే  నియోజకవర్గాల సంఖ్య  90కి పైనే ఉంటుందని   సంకేతాలు పంపారు. ఆ దిశగా కసరత్తులూ మొదలెట్టేశారు. ఇలా నియోజకవర్గాల మార్చేసే వారిలో మంత్రులూ ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే మంత్రులు విడదల రజనీ, మేరుగ నాగార్జునని మార్చేశారు. 11 మందిని మార్చేసిన జగన్ ఇక రెండో విడతలో 40 మంది సిట్టింగుల మార్పునకు రెడీ అయిపోయారని  వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలందరిలోనూ ఆందోళన ప్రారంభమయింది. ఇప్పటికే అధికారికంగా ఇక టిక్కెట్ రాదని తెలిసిపోయిన నేతలు కొందరు రాజీనామాలకు సిద్ధమవుతుండగా.. మరికొందరు పక్క చేపులు చూస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎమ్మెల్యేల అనుచరులు రాజీనామాల బాటపట్టారు.  టిక్కెట్ రాదని కంగారు పడుతున్న నేతలు కొందరు  ఇప్పటికైతే సైలెంట్ గా ఉండగా.. సమయం వచ్చినపుడు తిరుగుబాటుకు రెడీ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బెంగళూరులో ఓ ఎంపీ నివాసంలో జరిగిన రహస్య భేటీని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఎన్నికల ముందు అధికార పార్టీలోకి చేరికలు ఉండాల్సిందిపోయి ఇప్పుడు వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది.  ఏపీ రాజకీయాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా తర్వాత ఆ స్థాయిలో రాజకీయ చైతన్యం ఉండే జిల్లా గుంటూరు. ఇటు కృష్ణా, అటు ప్రకాశం జిల్లాలతో అనుబంధం ఉండే ఈ జిల్లా నేతలు రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తుంటారు.   అధికార  వైసీపీలో కూడా ఈ జిల్లా నేతలే కీలకంగా ఉంటూ వచ్చారు. కానీ  ఇప్పుడు జగన్ నిర్ణయాలతో ఈ జిల్లా నేతలలో గుర్రు మొదలైంది. ఇప్పటికే ఈ టికెట్ల అలజడితో జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎంకు రాంరాం చెప్పి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో మంగళగిరికి గంజి చిరంజీవిని ఇఆన్ చార్జిని చేశారు. తనను మార్చేస్తున్నారనే ముందుగా ఆర్కేనే పార్టీ నుండి బయటకొచ్చేశారు. అంత సన్నిహితుడైన ఆర్కేను కూడా పక్కన పెట్టేయడంతో ఒక్కసారిగా పార్టీలో అలజడి మొదలైంది. ఇక వైద్య ఆరోగ్య మంత్రి రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు, సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మేకతోటి సుచరితను తాడికొండకి తరిమేశారు.  చిలకలూరిపేటకు మల్లెల రాజేశ్‌నాయుడు రేపల్లెకు డాక్టర్‌ ఈవూరు గణేశ్‌,  ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్‌కుమార్‌లను కొత్త ఇన్‌చార్జులుగా నియమించారు. తెలుగుదేశం నుంచి వచ్చిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌కు ఈసారి మొండి చేయేనని తేల్చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు వైసీపీని కుదిపివేస్తున్నాయి. ప్రత్తిపాడులో ఉన్న సుచరితను.. వైసీపీ నుంచి సస్పెండ్‌ చేసిన ఉండవల్లి శ్రీదేవిపై పోటీ చేయమని తాడికొండ పంపారు. నిజానికి ఇక్కడ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను ఎన్నో ఆశలతో ఉన్నారు. డొక్కానే మొదట ఇన్ చార్జిగా నియమించగా.. అప్పట్లో శ్రీదేవి కోసం ఆయన్ను తప్పించి కత్తి సురేశ్‌ను ఇన్‌చార్జిగా వేశారు. ఇప్పడు కూడా మరోసారి ఆయనకు మొండిచేయి చూపి సుచరితను తెచ్చారు. దీంతో డొక్కా  తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగ నాగార్జున మార్చొద్దు బాబోయ్ అంటూ ఎంత మొత్తుకున్నా వినకుండా మార్చేశారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటిని కృష్ణా జిల్లాకు పంపడం లేదంటే ఈసారి అసలు టికెట్ కేటాయించకపోవడం జరగనుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో అంబటి  అధిష్టానంతో బేరసారాలు మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది.  ఒకవైపు అమరావతి ఎఫెక్ట్ తో ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉండగా.. ఇప్పుడు స్థానాల మార్పుతో నేతలలో కూడా సొంత పార్టీపై, పార్టీ అధినేతపై ఆగ్రహం, అసంతృప్తి పెల్లుబుకుతోంది.   40 మందికి పైగా సిట్టింగుల మార్పు అభ్యర్థులతో రెండో జాబితా నేడో రేపో రానున్నట్లు  తెలుస్తున్నది. ఈ జాబితా కనుక వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో పెను మార్పలు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జిల్లాకు చెందిన  దాదాపు అరడజను మంది నేతలు తిరుగుబాటుకు సిద్దమవుతున్నట్లు రాజకీయ వర్గాలలోచర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లాపై కూడా వైసీపీ ఆశలు వదిలేసుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమౌతాయని విశ్లేషిస్తున్నారు. 

మాజీ జేడీ కొత్త పార్టీ..ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

ఓ మూడు నెలల పాటు కాక రేపిన తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇప్పుడు తెలుగు ప్రజల దృష్టి మొత్తం ఏపీ మీదకి మళ్లింది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు  అంచనా వేస్తున్నారు. అధికార వైసీపీ కూడా అదే చెబుతోంది. దీంతో ఏపీలో అధికార, ప్రతిపక్షాలు  దూకుడు మీదున్నాయి. ఒకవైపు సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలను మార్చేస్తూ జంబ్లింగ్ ఆట మొదలు పెట్టి.. ఎన్నికలకు రెండు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి వారిని జనంలో వుంచాలని స్కెచ్ గీస్తున్నారు. మరోవైపు జనసేన కూడా కలిసి రావడంతో ఫుల్ జోష్ లో ఉన్న తెలుగుదేశం ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలు పెట్టింది. సంక్రాంతికి ముందు సంక్రాంతి తర్వాత   అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ కూడా కర్ణాటక, తెలంగాణ గెలుపు జోష్ లో ఏపీలో కూడా ఉనికి చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. జనవరి తర్వాత కాంగ్రెస్ నేతలు ఏపీలో  క్రియాశీలంగా మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.   బీజేపీ మాత్రం ఈసారి ఏపీలో పోటీ చేస్తుందా లేదా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.  అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు   ఏపీలోఓ  కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ అని ప్రకటించారు. ఐపీఎస్ కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజల మధ్యకు వచ్చానని.. అనేక వర్గాల ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని వివరించారు. సమస్యలు, పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించానని వెల్లడించారు. ఆ విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశానని, 3 లక్షల మంది వరకు ఓటర్లు మద్దతు పలికారని వివరించారు. ఆ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ యువతను, రైతులను, కార్మికులను, మత్స్యకారులను కలిసిన తర్వాత వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఆకాంక్షలు పరిశీలించానని.. ఒక పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని స్థాపించిన పార్టీ తనదని.. ఇది పెట్టిన పార్టీ కాదు.. ప్రజల కాంక్షలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ.. జై భారత్ నేషనల్ పార్టీ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ లక్ష్మీ నారాయణ అంటే  నిజాయతీపరుడు అని టాక్ ఉంది. యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరు ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు. నిజానికి లక్ష్మీనారాయణ 2019 ఎన్నికలకు ముందు కూడా పార్టీ పెట్టాలని చూశారు. సీబీఐలో చేస్తున్న ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చి రాజకీయాలలోకి వచ్చారు. 2019 ఎన్నికలలో జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే రెండు లక్షల ఎనభై వేల దాకా ఓట్లు వచ్చాయి. ఆ తరువాత జనసేనకు రాజీనామా చేసి బయటకు వచ్చారు. కొంతకాలంగా ఆయన వైసీపీ, తెలుగుదేశం, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన మాత్రం తాను విశాఖ నుంచి ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెబుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన  సొంత పార్టీయే పెట్టారు. దాంతో ఏపీలో రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకున్నట్లు అయింది.  లక్ష్మీనారాయణ ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన వేదిక ఇప్పుడు ఇలా పార్టీగా మారిందని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్టీ ప్రభావం ఎవరిపై పడుతుంది? ఎవరికి మేలు చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.  వైసీపీ, తెలుగుదేశం, జనసేనను వ్యతిరేకించే వారికి లక్ష్మీనారాయణ పార్టీ వేదికగా నిలుస్తుందని కొందరుఅంటున్నారు.  అయితే, లక్ష్మీనారాయణ తన పార్టీ లక్ష్యాలు, ఎవరెవరు ఇందులో ఉన్నారో స్పష్టత వచ్చిన తరువాత ఆ పార్టీ ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే లక్ష్మీనారాయణ విశాఖ నుండి ఎంపీగా పోటీ చేయడం ఖరారైంది.

గనుల సర్వేక్షణ సాంకేతికతలో బౌద్ధ అవశేషాల గుర్తింపు.. మల్లేపల్లి లక్ష్మయ్య

కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణలో గనుల కోసం చేపట్టే సర్వేక్షణంలో, బౌద్ధ స్థావరాల ఉనికిని కనిపెట్టడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శి, వి. ఎల్. కాంతారావుకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులోని ఎన్.ఎం.డి.సి లో కాంతారావును కలిసిన ఆయన భారత భూగర్భ సర్వేక్షణ అధికారులకు ఈ దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఇందుకు విఎల్ కాంతారావు  సానుకూలంగా స్పందించారని లక్ష్మయ్య చెప్పారు.  యాదాద్రి -భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం, చాడ గ్రామంలో శాతవాహన, ఇక్ష్వాకుల కాలపు క్రీ. శ. 2-3 శతాబ్దాలు నాటి సున్నపు రాతి బుద్ధుని బొమ్మలు బయల్పడ్డాయనీ, అక్కడి పురాతన స్థలం దాదాపు 10 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొన్న లక్ష్మయ్య, ఆ స్థలంలో ఎంత మేరకు పురాతన కట్టడాలు ఉన్నాయో రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే చేపట్టాలని కాంతారావును కోరారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డిజైన్ ఇంచార్జ్  డి.ఆర్. శ్యాంసుందర రావు పాల్గొన్నారు.

నెల్లూరులో వైసీపీ ఆపసోపాలు!

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ అభ్యర్థుల మార్పు పేరుతో చేస్తున్న కసరత్తు వైసీపీలో తిరుగుబాటుకు దారి తీస్తోంది.  ఇప్పటికే 11 మందిని మార్చేసిన జగన్.. త్వరలో 40 మందికి పైగా జాబితాను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు తాడేపల్లి ప్యాలెస్ లో కసరత్తులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఒక్కో జిల్లా ముఖ్య అభ్యర్థులను పిలిచి జగన్ బుజ్జగించే పనిలో ఉన్నారు.  అభ్యర్థులు కొందరు కూల్ గానే ఒప్పుకుంటున్నా.. మరికొందరు మాత్రం ససేమిరా అని ముఖంమీదే చెప్పేస్తున్నారు. ఇంకొంత మంది  ఏకంగా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. వీరిని బుజ్జగించేందుకు సజ్జల, విజయసాయి రెడ్డి లాంటి వారిని నియమించినా వాళ్ళ మాటలకు కూడా అభ్యర్థులు ఖాతరు చేయడం లేదని  తెలుస్తున్నది. దీంతో అభ్యర్థుల మార్పుతో రానున్న రెండో జాబితాతో వైసీపీలో ముసలం పుట్టడం ఖాయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కొందరు తెలుగుదేశం, జనసేన వైపు చూస్తున్నారు.  మొత్తం మీద సంక్రాంతి తర్వాత వైసీపీ నుండి భారీ స్థాయిలో వలసలు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  ఉమ్మడి నెల్లూరు అంటే వైసీపీకి కంచుకోట. అంతకు ముందు కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా.. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచింది. అందుకే 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలలో వైసీపీ గెలిచింది. అయితే సరిగ్గా నాలుగేళ్లు గడిచే సరికి మొత్తం సీన్ మారిపోయింది. జగన్ కోసం పోరాటాలకు కూడా సిద్దపడే నేతలు ఇప్పుడు వైసీపీకి దూరమైపోయారు. ఓదార్పు యాత్ర సమయంలో జగన్‌ వెన్నంటి నడచిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పుడు పార్టీలో లేరు. శ్రీధర్ రెడ్డిని ప్రభుత్వ పెద్దలే దెబ్బకొట్టాలని చూడగా.. ఆయన తిరుగుబాటు చేసి వైసీపీని ముప్పతిప్పలు పెట్టి చివరికి టీడీపీ వైపు వెళ్లారు. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డికి కూడా పొగబెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ వేశారంటూ ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేయగా.. ఆయన కూడా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. దీంతో ఇప్పుడు నెల్లూరులో వైసీపీ ఆపసోపాలు పడుతోంది. పార్టీలో ఉన్న అభ్యర్థుల మీదేమో ప్రజలలో తీవ్ర అసంతృత్తి ఉంది. పోనీ అభ్యర్థులను మార్చేద్దామంటే ఇక్కడ సరైన అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సి వస్తున్నది. మరోవైపు ఉన్న వారిలో గ్రూపు తగాదాలు కూడా ఎక్కువైపోయాయి. దీంతో ఇప్పుడు వైసీపీ  ఇక్కడ ఏం చేయాలో కూడా తోచని పరిస్థితితో ఉంది. ముందుగా ఉన్న వారిని మార్చేసేందుకు సిద్దమైన జగన్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను అక్కడి నుంచి తప్పించేందుకు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనిల్ కుమార్ ను ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌తో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అసలు పొసగడం లేదు. నెల్లూరు నుంచి అనిల్ పోటీ చేస్తే, తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో వుండనని ఇప్పటికే వేమిరెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు అవగాహాలేని అనిల్ వ్యాఖ్యలు, దూకుడు స్వభావంతో ప్రజలలో కూడా తీవ్ర అసంతృప్తి మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను అక్కడ నుండి తప్పించి ప్రకాశం జిల్లా కనిగిరికి పంపనున్నట్లు తెలుస్తుంది. కనిగిరిలో ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఈసారి టికెట్ లేనట్లేనని చెబుతున్నారు.  ఇక కావలి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్ది ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి, కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు వెలగపల్లి వరప్రసాద్ రావు, సూళ్ళూరు పేట సంజీవయ్య వీళ్లందపైనా కూడా వారి వారి నియోజకవర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. వీళ్లంతా కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.   ఈ మేరకు  జగన్ వద్ద నివేదికలు ఉన్నట్లు చెబుతున్నారు.  ఈ క్రమంలోనే వీరిలో ముగ్గురికి అసలు ఈసారి టికెట్టిచ్చే పరిస్థితే లేకపోగా.. వారి స్థానంలో ఇక్కడ ఎవరిని దింపాలన్నదే వైసీపీకి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చిత్తూరు జిల్లా నుండి మంత్రి రోజాను నెల్లూరులో దింపనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే ప్రకాశం జిల్లా నుండి మరో కీలక నేతను కూడా నెల్లూరులో దింపాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, టికెట్లు దక్కనివారు రెబల్స్ గా మారితే ఈసారి ఈ జిల్లాను వైసీపీ సంపూర్ణంగా వదులుకోవాల్సిందే అంటున్నారు పరిశీలకులు.

లోకేష్ ను అరెస్ట్ చేయడానికి అనుమతి..

లోకేష్‌ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్. దాఖలు చేసింది.. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారన్న సీఐడీ పేర్కొంది.  చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు  అధికారులను  ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని ,  లోకేష్ ప్రకటనలపై సీఐడి అభ్యంతరం వ్యక్తం చేసింది. రెడ్‌బుక్‌ పేరుతో  చేస్తున్న ప్రకటనలు సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును సిఐడి  కోరింది. ఐఆర్ఆర్ కేసులో గతంలో సిఐడి లోకేష్ కు 41 ఏ క్రింద నోటీసు  ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు లోకేష్ విచారణకు హాజరయ్యారు. ఐఆర్ ఆర్ కేసులో ఏ 14గా లోకేష్ ఉన్నారు. వాంగ్మూలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలు  వివాదాస్పదంగా మారాయి. అధికారులు సీఆర్ పిసి క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారని, రెడ్ బుక్ లో  పేరు రికార్డు చేశానని , తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి  తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారు. 164 సీఆర్ పిసి క్రింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం లోకేష్ తప్పు పట్టడంపై కోర్టు సీరియస్ గా తీసుకోలేదు..  సాక్షులను బెదిరించి కేసు  దర్యాప్తు పక్క దారి పట్టించడం లోకేష్ ఉద్దేశమని సిఐడి  తన పిటిషన్ లో పేర్కొంది.  

రిపబ్లిక్ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ 

వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విచ్చేస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ను ఆహ్వానించినట్టు కేంద్ర అధికారిక వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావాల్సి ఉంది. అయితే, వివిధ కారణాల వల్ల తాను రాలేనని బైడెన్ చెప్పినట్టు సమాచారం. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడిని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు ఈ ఏడాది జులైలో ప్యారిస్ లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే పరేడ్ కు ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు మెక్రాన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాస్టిల్ డే పరేడ్ కు మోదీ హాజరు కావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావిస్తున్నారని చెప్పారు. 

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ .. చేతులెత్తేసిన బిఆర్ఎస్ 

సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కు గురయ్యారు. యూనియన్ కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు. వీరిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్లో ఎందుకుండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వీరు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ... ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆత్మహత్యాసదృశ్యమేనని అన్నారు. పోటీ చేయొద్దని చెప్పడం బాధాకరమని చెప్పారు. కాగా, అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.  సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయం పై టీబీజీకేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లో అసంతృప్త నేతలు సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్ నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమన్నారు. ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడం బాధాకరమని టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజి రెడ్డి పేర్కొన్నారు. సింగరేణిలో గుర్తింపు సం ఘం ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రభుత్వాలు, యాజమాన్యం అడ్డుకుందామని ప్రయత్నించినా వాటి కుయుక్తులు పని చేయలేదు. కేంద్ర లేబర్‌ కమిషనర్‌ ఎన్నికల తేదీ ప్రకటించగా, నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు పూర్తయ్యింది. కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి ఇంధన కార్యదర్శి ఎన్నికల నిలుపుదలకు కోర్టులో మధ్యంతర పిటిషన్‌ వేశారు. కానీ ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు  తీర్పు ఇచ్చిం ది. దీంతో కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేసున్నారు. సింగ రేణి గుర్తింపు ఎన్నికల గడువు ముగిసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం ముందుకు వెళ్లడం లేదు. గత ప్రభుత్వ అండదండలతో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. ఎన్నికలు జరుపాలని కార్మిక సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నప్పటికి పెడచెవిన పెట్టింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రరుంచడంతో ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

రేపటి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు  ప్రారంభంకానున్నాయి. వైష్ణ‌వాల‌యాల సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం విశిష్ట‌త ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవ‌త్స‌రం అని అర్థం. అదేవిధంగా అక్క‌డ ప‌గ‌లు 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ఉత్త‌రాయ‌ణం, రాత్రి 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ద‌క్షిణాయణం.వైకుంఠంలో తెల్ల‌వారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి వైష్ణ‌వాల‌యాలలో ఈ 10 రోజుల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శ‌నం చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది అనేది న‌మ్మ‌కం.తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి జనవరి 1 వరకూ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతి, తిరుమలలోని మొత్తం 9 ప్రాంతాల్లోని 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా భక్తులు పోటెత్తడంతో ముందుగానే టోకెన్ల జారీని మొదలుపెట్టారు. మొత్తం 4,23,500 టిక్కెట్లు జారీ చేయనున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, పరిసరాల్లో అత్యవసర సమయాల కోసం అంబులెన్సులు ఏర్పాటు చేశారు. రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం వేకువజామున 1.45 నుంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించనున్నారు. విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్‌ కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నారు.

సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు వర్ల రామయ్య, జవహర్‌, దేవినేని ఉమ, అశోక్‌ బాబు, కొల్లు రవీంద్ర, నాగుల్‌ మీరా స్వాగతం పలికారు. జైలు నుంచి వచ్చాక పలు పుణ్య క్షేత్రాలను చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. గుణదల మేరీ మాత ఆలయం నుంచి చంద్రబాబు దంపతులు ఇంటికి బయలుదేరి వెళ్లారు అంతకు ముందు విశాఖ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మేరీమాత ఆలయానికి వెళ్లారు.

రేవంత్ రెడ్డి  ఢిల్లీ పర్యటన రద్దు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి... సభకు వచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు ఆ పర్యటన రద్దయింది.  సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఇన్వైటీ వంశీచంద్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ భేటీలో... ఇటీవలి వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి పాల్గొననున్నారు. మంత్రిమండలి విస్తరణలో మిగిలిన 6 స్థానాలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన నేతలకు గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. పదేళ్ల తరువాత ప్రభుత్వం ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు

జగన్ విశాఖ ఆశలు గల్లంతు.. కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్

జగన్ విశాఖ నుంచి పాలన ఆశలు ఇక ఆవిరైపోయినట్లే.  ఏదో ఒక సాకుతో  ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించి అక్కడ నుంచి పాలన సాగించినట్లు చేద్దామని వేసిన జగన్ ఎత్తుగడ పారలేదు. క్యాంపు కార్యాలయాలంటూ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖకు మార్చేసి విశాఖ నుంచి పాలన అన్న తన మాటను చెల్లుబాటు చేసుకోవాలని చూసిన జగన్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖకు  కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ గురువారం (డిసెబర్ 21) ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది.   అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటిషన్‌పై బుధవారం (డిసెంబర్ 20) హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను ముగ్గురు సభ్యుల ధర్మాసనంకు పంపుతామని హైకోర్ట్ చెప్పింది. అక్కడ ఇప్పటికే విచారణ పెండింగ్‌లో ఉందనీ.. ఈ లోపు పిటీషన్ వేసిన రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్ట్ న్యాయమూర్తి తెలిపారు.   రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం చెప్పింది. దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోరారు.  దీంతో. తదుపరి విచారణను హైకోర్టు ఒక రోజు వాయిదా వేసింది.   గురువారం తిరిగి ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు కేసును త్రిసభ్య ధర్మసనానికి బదిలీ చేసింది.  ఆ ధర్మాసనం తీర్పు వెలువరించేంత వరకూ కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో ఉత్త‌ర్వులు జారీ చేసింది..

ఉమ్మడి కృష్ణాలోనూ తగ్గేదేలే అంటున్న ఎమ్మెల్యేలు... బుజ్జగింస్తున్న సజ్జల!

ఏపీలో అధికార పార్టీ వైసీపీని జగన్ అభ్యర్థుల మార్పు నిర్ణయం నిండా ముంచేస్తోందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఒకటీ రెండూ కాదు మొత్తం రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలోనూ సిట్టింగుల మార్పు నిర్ణయంతో పార్టీ మునక ఖాయమేనని అంటున్నారు.   నిన్న మొన్నటి వరకూ పని తీరు ఆధారంగానే ఈసారి టికెట్లు కేటాయిస్తామని చెప్పిన సీఎం జగన్..  తీరా ఎన్నికలు దగ్గరకి వచ్చాక.. వాళ్లూ వీళ్లూ అని లేకుండా అందరినీ మార్చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో ఎంత మంది సిట్టింగులు ఉంటూ అంత మందినీ మార్చేయడానికి రెడీ అయిపోయారు.  వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ఎలా చెప్తే అలా  మంత్రులు, సిట్టింగులు, సీనియర్లు అని కూడా చూడకుండా మారాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. కొందరికైతే అసలు టికెట్లు కూడా లేవని ముఖం మీదే చెప్పేస్తున్నారు.  దీంతో  చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తెగించి  తిరుగుబాటుకు రెడీ అయిపోతున్నారు. దీంతో జగన్ ఆదేశం మేరకు సజ్జల రంగంలోకి దిగి  వారిని బుజ్జగించే పని మొదలు పెట్టారు. అయితే ఎమ్మెల్యేలు తగ్గేదేలే అంటూ భీష్మిస్తున్నారు. ఇప్పటికే ఒక విడత మార్పులను ప్రకటించిన జగన్  రెండో  విడత మార్పులకు సిద్ధం అయిపోయారు. రెండో జాబితాలో మార్పులు ఎవరెవరు ఎక్కడెక్కడికి అన్నది ప్రకటిస్తే వైసీపీలో అసమ్మతి విస్ఫోటనం చూడాల్సి వస్తుందని పార్టీ వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.  కొందరు మంత్రులను వారికి రాజకీయం నేర్పిన స్థానాల నుండి తరలించడం.. మరికొందరు మంత్రులకు అసలు సీట్లే లేవని చెప్తుండడంతో వీరంతా ఇప్పటికే తిరుగుబాటుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టినట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది.  ఏపీలో అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే ఈ తిరుగుబాటు మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికలలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు వినా  మిగిలిన అన్ని స్థానాలలో వైసీపీ విజయం సాధించింది.   విజయవాడ లోక్ సభ స్థానంతో పాటు.. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్.. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ తెలుగుదేశం అభ్యర్థులుగా గెలిచారు. కాకపోతే వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీలోకి మారి పోయారు. 2019 ఎన్నికలలో వల్లభనేని అతి స్వల్ప ఓట్ల తేడాతో గెలిస్తే.. వైసీపీ నుండి విజయవాడ సెంట్రల్ పరిధిలో మల్లాది విష్ణు కేవలం పాతిక ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా వైసీపీ నేతలపై ఉమ్మడి జిల్లాలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదనడంలో సందేహం లేదు. దీనినే కారణంగా చూపుతూ  ఎంతటి మహామహులైనా  సరే సిట్టింగుల స్థానాలను మార్చడం ఖాయమని జగన్ చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం అందుకు సుముఖంగా లేరు. అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఇప్పటికే ఖరారైంది. అవనిగడ్డలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను తప్పించి మంత్రి అంబటి రాంబాబును తీసుకువస్తారని చెబుతున్నారు. అంబటికి అవనిగడ్డతో మంచి సంబంధాలు ఉండటంతో మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక తిరువూరులో ఎమ్మెల్యే కొక్కిరిగడ్డ రక్షణనిధి స్థానంలో కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే గత ఎన్నికలలో 25 ఓట్లతో గెలిచిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తప్పించి నగరంలో ఉన్న మరో ఎమ్మెల్యేను ఇక్కడ నుంచి రంగంలోకి దింపే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు చెబుబుతన్నాయి. అంతే కాకుండా  ఈసారి విష్ణుకు టికెట్  అనుమానమేనని చెబుతున్నారు. అలాగే మైలవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ను విజయవాడ ఎంపీగా పంపి మైలవరానికి పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేశ్‌ ను తీసుకువచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  జోగి రమేష్ కుకి ఇది సొంత నియోజకవర్గం కావడం కలిసివస్తుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే వసంత ప్రసాద్  మాత్రం నియోజకవర్గం మారేందుకు ససేమిరా అంటున్నారనీ, అంతగా అయితే పోటీ నుంచి విరమించుకుంటానని తెగేసి చెప్పినట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.   ఇక మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని  ఇప్పటికే ప్రకటించారు.  అయితే తన వారసుడికి టికెట్ ఇవ్వాలని కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేశ్‌, మంత్రి జోగి రమేశ్‌ తదితరులు ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసి చర్చించగా వీరిలో ఎవరిని తప్పిస్తారన్న చర్చ జరుగుతుంది. వీరిలో కొందరు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారన్న నివేదికలతో వైసీపీ వీరిని సామరస్యంగా పక్కన పెట్టాలని చూస్తున్నదని అయితే  మారిస్తే మాత్రం మాట వినే ప్రశక్తేలేదని వీరు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.  జగన్ పై తిరుగుబాటుకు ఇక్కడ నుండే బీజం పడే ఛాన్స్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సిట్టింగుల మార్పు..ప్రకాశం వైసీపీలో లుకలుకలు!

వైసీపీలో ఇప్పుడు సంక్షోభం తలెత్తే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారిపోయింది ఆ పార్టీ అధినేత జగన్ పరిస్థితి. ఇటు చూస్తే పార్టీపై ప్రజలలో పీకల దాకా అసంతృప్తి కనిపిస్తున్నది. ఇప్పటికే వెలువడిన సర్వేలన్నీ ఇదే విషయాన్ని కరాఖండీగా చెప్పేశాయి.  దీన్ని అంతో ఇంతో తగ్గించి కనీసం పరువు పోకుండా ఉండేలా కాపాడుకోవాలని పార్టీ పెద్దలు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. కసరత్తులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేసి ఎంతో కొంత మేర ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలేమో అందుకు ససేమీరా అంటున్నారు. నాలుగున్నరేళ్లగా అంటిపెట్టుకుని ఉన్న సిట్టింగ్ స్థానాన్ని వదిలి వెళ్ళమంటే అక్కడ పరిస్థితి తట్టుకోవడం ఎలా అంటూ అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మరికొందరికైతే రాష్ట్రంలో ఎక్కడ సీటు ఇచ్చినా ఓడిపోతారని ముందే తేలిపోవడం, వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో వారు   తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్  ఇప్పుడు  ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారు. ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.  ఉమ్మడి ప్రకాశం జిల్లాను తీసుకుంటే.. 2019ఎన్నిక‌ల్లో  ఈ జిల్లాలో మూడు స్థానాలు మిన‌హా  మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. చీరాల‌లో అప్ప‌టి తెలుగుదేశం నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, అద్దంకిలో గొట్టిపాటి ర‌వి, కొండ‌పిలో డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామి మాత్రమే తెలుగుదేశం నుంచి విజయం సాధించారు. వీరు మిన‌హా అంద‌రూ వైసీపీ నాయ‌కులే గెలిచారు.   జగన్ ఒక్క ఛాన్స్ గాలిలో జిల్లాలకు జిల్లాలు వైసీపీ  క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ప్రకాశంలో మాత్రం తెలుగుదేశం మూడు స్థానాలను గెలుచుకొని సత్తా చాటింది. మరో రెండు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపొయింది. అయితే తర్వాత తెలుగుదేశం త‌ర‌ఫున గెలిచిన బ‌ల‌రాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఈసారి ఇక్కడ పూర్తిగా వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది. ఒంగోలు నుండి చీరాల వరకూ.. మార్కాపురం నుండి కందుకూరు వరకూ ఎక్కడా, ఏ నియోజకవర్గంలోనూ వైసీపీకి అనుకూల పరిస్థితులు లేవు. అందుకే ఇప్పుడు ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ సిట్టింగుల స్థానాలను మొత్తంగా మార్చేయాలని నిర్ణయించుకుంది.   ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు సహా వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ఓటమి తప్పదని ఇప్పటికే  నివేదికలున్నాయి. అందుకే ముందుగా మంత్రి ఆదిమూలపునే మార్చేసింది అధిష్టానం. అలాగే ప్ర‌స్తుత సిట్టింగుల్లో ఒక‌రిద్ద‌రికి అస‌లు టికెట్ కూడా ఇచ్చే పరిస్థతి లేదని చెబుతోంది. దీంతో ఇప్పుడు ఉమ్మ‌డి ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పుల లొల్లి మొదలైంది. ముందుగా యర్రగొండపాలెం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండపికి మార్చగా.. కొండ‌పిలో వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబును బాపట్ల జిల్లా వేమూరుకు కేటాయించారు. అలాగే వేమూరు నుంచి ఎన్నికైన మంత్రి మేరుగు నాగార్జునను ప్ర‌కాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజ‌క‌వ‌ర్గానికి మార్చారు. ఇక, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిల‌ను వేరే నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపించేందుకు సిద్ధమయ్యారు. అలాగే కీల‌క‌మైన ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. బాలినేని ఇప్పటికే రెబల్ గా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీలో ఉంటే గిద్ద‌లూరు కేటాయించనున్నారు. అయితే గిద్దలూరుకు మారేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఇప్పటికే వైసీపీ రీజినల్‌ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డికి బాలినేని ఈ విషయం తేల్చి చెప్పేశారు. కాగా, ఒంగోలు స్థానాన్ని క‌ర‌ణం బ‌ల‌రాంకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక‌  ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ ద‌ఫా ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నట్లు తెలుస్తుంది. అయితే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు చీరాల టికెట్ హామీ ఉండగా బలరాంకు అసలు టికెట్  దక్కడమే అన్న అనుమానాలూ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.     గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు లాంటి  వారికి మొండి చేయే అంటున్నారు. దీంతో టికెట్ దక్కని వారు తిరుగుబాటుకు సిద్ధమ వుతున్నారు. మొత్తంగా ఇప్పుడు ప్రకాశం వైసీపీలో  సిట్టింగుల మార్పు దుమారం రేపనుంది. 

తెలుగుదేశం జనసేన కూటమిలో బీజేపీ ఉండదు.. ఇది కన్ ఫర్మ్!?

ఏపీలో ఎన్నికల ముహూర్తం దగ్గరకొచ్చేసింది. జనసేన తెలుగుదేశంతో కలిసే వెడుతుందన్న స్పష్టత ఎప్పుడో వచ్చేసింది. అయితే తెలుగుదేశం, జనసేన పొత్తులో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంటుందా? ఉండదా అన్న విషయంలో  ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం (డిసెంబర్ 20) న జరిగిన యువగళం- నవశకం సభలో స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నిన్న మొన్నటి దాకా అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జనసేనాని ఎప్పుడు మాట్లాడినా ఏపీలో తెలుగుదేశం, జనసేనా కలిసే ఎన్నికలలో పోటీ చేస్తాయనీ, అలాగే బీజేపీ కూడా కలిసివస్తుందనీ చెబుతూ వచ్చారు. అయితే యువగళం-నవశకం సభలో మాత్రం ఆయన కేంద్రంలోని బీజేపీ ఆశీస్సులు ఉంటాయని, ఉండాలని ఆకాంక్షించారు కానీ ఆ పార్టీ కలిసిరావాలన్న మాట అనలేదు.  దీంతో పవన్ కల్యాణ్ బీజేపీ దూరం అన్న సంకేతాలిచ్చేనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-జనసేన కూటమి వైఫల్యం తరువాత ఇరు పార్టీల వైఖరిలోనూ ఒకింత మార్పు వచ్చిందని, సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీలో ఉంటుందని ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్పష్టంగా ప్రకటించడంతో ఇక జనసేనతో  మైత్రికి బీజేపీ చెల్లు చీటీ పాడేసిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే ఇరు పార్టీల నుంచీ అటువంటి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. దీనికి తోడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్రంలో జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోందనీ, ఎన్నికలలో కలిసే పోటీ చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కూడా పురంధేశ్వరి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. దీంతో ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా కలుస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అదే జరిగితే సీట్ల సర్దుబాటు, ఓటు ట్రాన్స్ ఫర్ సజావుగా సాగుతాయా అని పరిశీలకులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు.  ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహజంగానే ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటే తమ గౌరవానికి తగ్గట్టుగా సీట్లు ఉండాలని పట్టుబడుతుంది. అయితే ఏపీలో కనీసం ఒక శాతం కూడా ఓటు స్టేక్ లేని బీజేపీకి పొత్తులో భాగంగా కోరినన్ని సీట్లు కేటాయించే అవకాశం, అవసరం తెలుగుదేశం పార్టీకి ఉండదు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతీ సీటు కీలకంగా భావించే తెలుగుదేశం పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు వదులుకుంటుంది, అవి కాకుండా మరికొన్ని సీట్లు బీజేపీకి కేటాయించేందుకు అంగీకరించే అవకాశాలు ఉండవు. ఆ పరిస్థితుల్లో జనసేన తనకు కేటాయించిన సీట్ల నుంచే బీజేపీకి భాగం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ బీజేపీ విషయంలో అలా త్యాగం చేసేందుకు జనసేన సిద్ధపడినట్లుగానే కనిపించింది. అందుకే బీజేపీ పొత్తులో ఉండే విషయంలో తెలుగుదేశం సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ స్పందించలేదు. యువగళం పాదయాత్ర ముగించిన తరువాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కూడా బీజేపీ కూడా పొత్తులో ఉంటుందా అన్న విషయంలో ఆచి తూచి స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదన్నదే తమ అభిమతమని చెప్పారు. దీంతో బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమిలో భాగస్వామిగా ఉండే అవకాశాలే ఉన్నాయని అంతా భావించారు.  సీట్ల సర్దుబాటు ఎలా అన్న విషయంపై చర్చోపచర్చలూ జరిగాయి. వీటన్నిటికీ పవన్ కల్యాణ్ యువగళం-నవశకం సభా వేదికగా ఫుల్ స్టాప్ పెట్టేశారనే పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ఆశీస్సులు చాలనీ, ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుకు అవకాశం లేదనీ చెప్పకనే చెప్పేశారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఫలితాల తరువాత బీజేపీ కూడా ఏపీలో తన వాస్తవ బలాన్ని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. సీట్ల కోసం పట్టుబట్టకుండా నైతిక మద్దతుకే పరిమితమౌతుందని, జనసేనాని ఆశీస్సులు ఉంటాయన్న ఆకాంక్ష వెనుక ఉన్న అర్ధం కూడా ఇదేననీ చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ ఓంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సింగరేణి ఎన్నికల వాయిదాకు తెలంగాణ హైకోర్టు నో

సింగ‌రేణి ఎన్నిక‌ల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. ఈ నెల 27న సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపేందుకు న్యాయస్థానం ఆమోదముద్ర వేసింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న సింగరేణి యాజమాన్యం పిటిషన్ గురువారం (డిసెంబర్ 21)న కొట్టి వేసింది.  షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఎన్నిక‌లు నిర్వహించాల్సి ఉండ‌గా, ఎన్నికలనువచ్చే ఏడాది మార్చికి వాయిదా వేయాలని కోరుతూ  రాష్ట్ర ఇంధ‌న శాఖ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో  ఎన్నిక నిర్వహణకు కొంత సమయం కావాలని  సదరు పిటిషన్ లో కోరింది.  అయితే ఈ పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు  కొట్టివేసింది.   ఈ ఎన్నికల విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒకసారి గుర్తింపు సంఘం, ఆ తర్వాత యాజమాన్యం, మరో సారి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి.   చివరికి అక్టోబరులో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారింది. తీరా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  ఇంధ‌న శాఖ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో   సింగరేణి ఎన్నికలు ఈ నెల 27నే జరగనున్నాయి. 

జగన్ పై తిరుగుబాటు? వైసీపీలో సంక్షోభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీలోనూ ఏకాకిగా మారుతున్నారా? ఇప్పటికే తన అహంకారం, అహంభావంతో సొంత చెల్లి, తల్లిని దూరం చేసుకున్న ఆయన, ఇప్పుడు పార్టీ నేతలనూ దూరం చేసుకుంటున్నారు. తాను కలవాలనుకుంటే తప్ప.. పార్టీలోని సీనియర్ నేతలూ, మంత్రులకు కూడా జగన్ అప్పాయింట్ మెంట్ దొరకదని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. తాను పిలిపించుకుని మాట్లాడాల్సిన సందర్భాలలో కూడా ఆయన తీరు ఎదుటి వారిని కించపరిచేలాగే ఉంటుందని, తాను చెప్పదలచుకున్నది చెప్పేయడం తప్ప ఎదుటి వారు చెప్పేది వినడం ఆయనకు అలవాటులేని పని అని అంటుంటారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత అంటూ పెద్ద సంఖ్యలో  సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చాలని, పలువురికి టికెట్లు నిరాకరించాలన్న జగన్ నిర్ణయంతో పార్టీలో  ఆయన నాయకత్వంపై తిరుగుబాటు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం జరగాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అసలు తొలుత 11 మందిని మార్చుతూ నిర్ణయం తీసుకున్న తరువాతనే పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఒక ఎంపీ నేతృత్వంలో బెంగళూరులోని ఆయన నివాసంలో  పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని, ఆ సమావేశంలో జగన్ మార్పులపై తీసుకునే నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాలని తీర్మానించుకున్నట్లు చెబుతున్నారు. జగన్ తన అహంకార పూరిత వైఖరితో అందర్నీ దూరం చేసుకుంటున్నారనీ, ప్రజలు ఇప్పటికే దూరమైపోయారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనానికి ముఖం చాటేస్తూ, పర్యటనలకు వెళుతున్నప్పుడు పరదాలు ఏర్పాటు చేసుకోవడం, ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వంటి చర్యలతో జగన్ జనానికి ఎప్పుడో దూరమైపోయాననీ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ అవసరాల కోసం ఆయనకు అడుగులకు మడుగులొత్తే వారు ఆయన అహంకారాన్ని సహిస్తారేమో కానీ, జనం మాత్రం అహంకారాన్ని ఇసుమంతైనా సహించరనడానికి తెలంగాణ ఎన్నికల ఫలితమే నిదర్శనమనీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని మించి అహంభావంతో వ్యవహరించే జగన్ కు ఏపీ జనం వచ్చే ఎన్నికలలో షాక్ ఇవ్వడానికి ఇప్పటికే డిసైడైపోయారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎమ్మెల్యేలకు జగన్ పూచిక పుల్ల విలువ సైతం ఇవ్వరని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకున్న జగన్ వారిలో కేవలం ముగ్గురితోనే ముఖాముఖి మాట్లాడారనీ, అది కూడా కేవలం నిముషం మాత్రమేననీ పార్టీ వర్గాలు తెలిపాయి.  అంతోటి దానికి వారిని పిలిపించుకోవడం ఎందుకు అని పార్టీ వర్గాలే అంటున్నాయి.  ఇక పరిశీలకులు కూడా జగన్ సిట్టింగులను మార్చాలన్న నిర్ణయం బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. సిట్టింగులపై నిజంగా అసంతృప్తి ఉంటే, ఉందని నివేదికలలో తేలితే జగన్ చేయాల్సింది వారికి టికెట్ నిరాకరించడం కానీ, ఈ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను మరో నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుందని అంటున్నారు.   మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రసాద్ రాజు  తమ్మినేని సీతారాం , జోగి రమేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా చాలా పెద్దదే ఉంటుంది. మొత్తం 90 మంది సిట్టింగుల విషయంలో జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ అసంతృప్తికి కారణం ఆయా నియోజకవర్గాలలో పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడమేనని అంటున్నాయి. అయితే నాలుగున్నరేళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊర్కుని సరిగ్గా ఎన్నికల ముందు.. ఎమ్మెల్యేలపైనా తప్ప ప్రజా వ్యతిరేకత తన మీద కాదని, తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకునే ప్రయత్నమే సిట్టింగుల మార్పు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పుడు ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపైన కాదనీ, మొత్తంగా జగన్ పాలన మీద అని వారు సోదాహరణంగా వివరిస్తున్నారు.  సిట్టింగుల నియోజకవర్గాలను జగన్ మారుస్తున్నట్లే  సీఎంగా జగన్ ను  జనం దించేస్తారనీ విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.  

మాస్కులు మస్ట్.. కరోనా వ్యాప్తితో అమలులోకి వచ్చిన నిబంధన

కరోనా రెండేళ్లుగా ఆ మాటే ఎక్కడా వినిపించడం లేదు. కానీ అంతకు ముందు మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. తుమ్మినా, దగ్గినా కరోనాయే అన్న అనుమానంతో నిద్ర లేకుండా చేసింది. లక్షల మంది ఉసురు తీసేసి ప్రజలను క్వారంటైన్ లో మగ్గిపోయేలా చేసింది. కరోనా మహమ్మారి ముప్పు తొలగిందని ఊపిరి పీల్చుకునే లోగా ఉపిరి తీసేయడానికి రెడీ అయిపోయానంటూ కొత్త వేరియంట్ రూపంలో ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. పంజా విసరడానికి సిద్ధమౌతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బుధవారం (డిసెంబర్ 20)న కరోనా బులిటిన్ విడుదల చేసింది. తాజాగా నాలుగు కేసులు నమోదయ్యాయని ఆ బులిటిన్ లో పేర్కొంది. 402 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో నలుగురు పాజిటివ్ గా తేలారని ప్రకటించింది. కాగా మొత్తంగా ప్రస్తుతం గాంధీలో 9 మందిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రత కారణంగా రాష్ట్రంలో మాస్కులు ధరించడాన్ని తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగితే ఫైన్ తప్పదని హెచ్చరించింది.  

జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు.. వెల్లంపల్లి రాజీనామా.. వసంత పోటీకి దూరం?

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో సంక్షోభం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.  మెజారిటీ ఎమ్మెల్యేలు ఏకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దాదాపు 42 మంది పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచే తెలుస్తోంది. ఈ అసంతృప్తికి టికెట్ల లొల్లి  కారణమని అంటున్నారు. మొత్తంగా జగన్ పాలన పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ఒకింత తగ్గించే ఉద్దేశంతో  సీఎం జగన్.. సిట్టింగుల సీట్లు మార్చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని  మార్చేశారు.  త్వరలో  ఇలా మార్చే ఎమ్మెల్యేల రెండో జాబితా వస్తుందన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్‌ నెలకొంది. ఒకవైపు అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు కొనసాగుతున్నది.  పోటీ చేసే స్థానాలు, నియోజకవర్గాల మార్పు తదితర అంశాలపై సీఎం జగన్ నేరుగా  ఎమ్మెల్యేలతోనే చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై ఎమ్మెల్యేలకు స్పష్టత ఇస్తుండగా.. మరోవైపు నేతలు మాత్రం ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన నియోజకవర్గాన్ని వదిలేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే వైసీపీలో సంక్షోభం తలెత్తింది. వైసీపీలో ఈ అభ్యర్థుల మార్పు పార్టీలో ముసలం పుట్టేందుకు దోహదపడుతోంది. చాలామందికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదనీ, పార్టీ  గెలిచాక పదవులు ఇస్తామని, మరికొందరికి  పార్లమెంటుకు వెళ్లాలని ముఖం మీద చెప్పేయడంతో వారంతా  తీవ్ర అసంతృప్తితో ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నట్లు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.  ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మార్చేయగా.. ఇప్పుడు మరికొందరిని   మార్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మరికొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎం నుంచి పిలుపు రాగా.. మంత్రులు విశ్వరూప్‌, గుమ్మనూరు జయరాం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంను కలిశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు.  వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ సీటుపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నరసాపురం ఎమ్మెల్యే, విప్ ప్రసాదరాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి,  కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మంత్రి శంకరనారాయణ సీఎంవోకు వచ్చి పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు.  అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి ముఖ్యనేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వసంత కృష్ణ ప్రసాద్ కూడా సీఎంను కలిసి చర్చించారు. విజయవాడ వెస్ట్‌ నుండి వెలంపల్లిని తప్పించి.. ఈసారికి త్యాగం చేయాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ సెంట్రల్‌ నుండి మల్లాది విష్ణు‌ను తప్పించి.. ఆ స్థానంలో విజయవాడ వెస్ట్ నుంచి ఒక ప్రముఖ కళాశాల అధిపతిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ పశ్చిమ సీటు కూడా వసంత కృష్ణను కాదని మరొకరికి అప్పగించనున్నట్లు తెలుస్తుంది. దీంతో బెజవాడ వైసీపీలో ఇప్పుడు గందరగోళం నెలకొనగా.. టికెట్ దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకు న్నారని చెబుతున్నారు. అయితే,  తనకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో  తీవ్ర మనస్తాపానికి గురైన వెల్లంపల్లి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాగే  వసంత కృష్ణ ప్రసాద్ అధిష్టానంపై అనకబూని తాను అసలీ ఎన్నికలలో పోటీకే దూరంగా ఉంటానని పార్టీ హైకమాండ్ ముఖం మీదనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారని అంటున్నారు.  ఒకవైపు సమీక్ష జరిగిన జిల్లాల అభ్యర్థులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీలో కొనసాగడమా? వైదొలగడమా అన్న యోచనలో ఉంటే.. జగన్ మాత్రం తన సిట్టింగుల మార్పు ప్రణాళితో ముందుకు సాగుతున్నారు.  త్వరలో సీమ జిల్లాల్లోనూ   అభ్యర్థుల మార్పుపై కసరత్తులు ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.  మొత్తంగా ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు.. ఒకరూ, ఇద్దరూ కాదు  అధికార వైసీపీలో ఇప్పుడు ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వీరిలో అసంతృప్తిని చల్లార్చడానికి వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి  పార్టీ నిర్ణయానికి కారణాలేమిటో, వారి  సేవలను ఏ రీతిలో వినియోగించుకుంటామో చెప్పే ప్రయత్నం చేసినా అది వికటించి తిరుగుబాటుకు దారి తీసినట్లు సమాచారం. ఇప్సుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇదే సరైన అదును అన్నట్లుగా ఏపీలో బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతోందని చెబుతున్నారు. జగన్ సోదరి షర్మిలకు ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్  కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే వైసీపీ నుంచి వలసలు ఆ పార్టీ తిరిగి కోలుకోలేని విధంగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో  పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్ లోకి వచ్చినట్లు  ఆ పార్టీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చేసిన ప్రకటన  ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ప్రజా వ్యతిరేకత, సిట్టింగుల మార్పు వైసీపీలో సంక్షోభం ముదిరిపాకాన పడేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజులలో అధికార వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా నాలుగున్నరేళ్ల పాలనలో సమాజంలోని అన్ని వర్గాలనూ ఇబ్బందుల పాల్జేసి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్ ఇప్పుడు సిట్టింగుల మార్పుతో సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని కూడా కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.