చంద్రబాబుతో భేటీలో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారో తెలుసా?

వైసీపీ ఓటమి ఖరారైపోయింది. ఈ విషయం అందరికంటే బాగా వైసీపీ నేతలకు, కేడర్ కు తెలిసిపోయింది. గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన ప్రతి అంశం, ప్రతి వ్యక్తి ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారిపోయాయి. మారిపోయారు.  గత ఎన్నికలలో జగన్ విజయం కోసం కాళ్లరిగేలా పాదయాత్ర చేసిన, గోంతు చించుకుని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారం చేసిన సొంత సోదరి షర్మిల, జగన్ అరెస్టు సమయంలో రోడ్డుపై బైఠాయించి, కన్నీళ్లు పెట్టుకుని సెంటిమెంట్ రగిల్చిన తల్లి విజయమ్మ ఇప్పుడు జగన్ తో లేదు. అలాగే సొంత బాబాయ్ హత్య, కోడికత్తి దాడి రెండూ నాటి ఎన్నికలలో జగన్ పట్ల జనంలో సానుభూతి కలిగించాయి. ఇప్పుడు ఆ రెండు సంఘటనల వెనుక పాత్రధారి, సూత్రధారులు ఎవరన్నది తేటతెల్లమై ప్రతికూలంగా మారాయి. ఇక గత ఎన్నికలలో తన విజయానికి కర్త, కర్మ, క్రియా అంటూ జగన్ స్వయంగా చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన ప్రత్యర్థి శిబిరంలో ఉన్నారు. ఇలా ఎన్నో కలిసి వచ్చి గత ఎన్నికలలో జగన్ కు జనం ఒక్క చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చామా అని తలలు బాదుకుంటున్నారు. మరో చాన్స్ ఇచ్చేదే లేదని ముఖం మీదే చెప్పేస్తున్నారు.  ఇవన్నీ అందరికీ తెలిసినవే.. అయితే జగన్ నాలుగున్నరేళ్లలోనే అందరినీ దూరం చేసుకుని, అందరికీ కానివాడిగా ఎలా మారిపోయారో.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కళ్లకు కట్టినట్లు వివరించారు. అది కూడా అక్కడా ఇక్కడా కాదు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన జగన్ వైఫల్యాలను ఎండగట్టారు. ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ జగన్ తీరు, వైఖరి, అహంకారం, ప్రత్యర్థుల పట్ల శతృపూరిత వైఖరి, ప్రజల పట్ల చులకన భావం ఇత్యాది విషయాలన్నీ ఏకరవు పెట్టారు. జగన్ ప్రస్తుత పరిస్థితికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమని కుండబద్దలు కొట్టారు.  తప్పు తన వద్ద పెట్టుకుని ఎమ్మెల్యేలను బలిపశువులు చేయడానికి వెనుకాడని జగన్ తత్వమే ఆయనతో ఎవరూ కలిసి నడవడానికి అవకాశం లేకుండా చేసిందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.   జగన్ సిట్టింగులను మార్చడం వల్ల ఏం ఉపయోగం ఉండదనీ, ఒక చోట చెల్లని కాణి ఎక్కడా చెల్లదన్న విషయం జగన్ కు తెలియక కాదనీ, కానీ  మ్మెల్యేల అసమర్థతే ఓటమి కారణం అని చెప్పుకోవడానికి మాత్రమే జగన్ ఈ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్.   ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్ల కాలంలో అన్ని వర్గాల మద్దతునూ కోల్పోయి.. ఇప్పుడు మరో  చాన్స్ కోసం నేల విడిచి చేస్తున్న సాము ఆయనను నవ్వుల పాలు చేస్తున్నదే తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపించడం లే దని ప్రశాంత్ కిశోర్  తేల్చి చెప్పేశారు.   ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీకి 40 స్థానాలలో కూడా విజయం సాధించే అవకాశాలు లేవనీ, ముందు ముందు పరిస్థితి మరింత దిగజారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనీ చెప్పారు.  బాబుతో భేటీలో ప్రశాంత్ కిషోర్ జగన్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్నదని కూడా వివరించారు. ప్రజా వ్యతిరేకత అంటూ తన పేరు చెప్పి ఎమ్మెల్యేలను మారుస్తున్నారనీ, నిజంగా తానే చెప్పాల్సి వస్తే ప్రజా వ్యతిరేకత అంతా జగన్ మీదనేనని స్పష్టంగా చెప్పి ఉండేవాడిననీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చెప్పారు.   వాస్తవానికి జగన్ తన  సమన్వయకర్తల సూచనలూ, సలహాల మేరకే అభ్యర్థులను మారుస్తున్నారు. వైసీపీ వర్గాల సమాచారం మేరకు జగన్ పూర్తిగా సమన్వయకర్తల మీదా, సలహాదారుల మీదా అధారపడ్డారు. తెలుగుదేశం వర్గాల సమాచారం మేరకు  బాబుతో జరిగిన భేటీలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలు  ఇవే.  జగన్ అహంకారం, మొండితనం, కక్ష సాధింపు చర్యలూ ఇవన్నీ కూడా వైసీపీ పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి కారణంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు వివరించారు. పర్యటనల్లో పరదాలు, ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు వంటివి ప్రజా వ్యతిరేకత ప్రోది కావడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడవని తాను చెప్పినా జగన్ వినలేదని, ఆ కారణంగానే జగన్ గ్రాఫ్ వేగంగా దిగజారిందని పీకే   వివరించారు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుతో జగన్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందని పీకే చెప్పారు. చంద్రబాబుపై ప్రజాభిమానం ప్రస్ఫుటంగా వెలుగులోకి రావడానికి ఆయనను జగన్ అక్రమంగా అరెస్టు చేయడం దోహదం చేసిందని పీకే వివరించినట్లు సమాచారం.  ఇక లోకేష్ పాదయాత్ర జగన్ పాలనా వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక చర్యలను క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసేలా చేయడంతో పాటు తెలుగుదేశం క్యాడర్ లో చైతన్యానికి కారణమైందని, అలాగే తెలుగుదేశం, జనసేన పొత్తు కూడా క్షేత్రస్థాయి వరకూ చేరిందనీ పీకే బాబుకు వివరించారని తెలుస్తోంది.  ఏపీలో చాలా మంది బాబూస్(ఐఏఎస్, ఐపీఎస్) అయిష్టంగానే పని చేస్తున్నారనీ, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని జనంతో పాటు అధికారులు, వారితో పాటు వైసీపీలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలూ, నాయకులూ కూడా ఎదురు చూస్తున్నారని పీకే బాబుకు వివరించినట్లు సమాచారం. ఆ సందర్భంగా చంద్రబాబు కూడా తాను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు తనను రహస్యంగా కలిసి ఇదే విషయాన్ని చెప్పారని అన్నట్లు చెబుతున్నారు.  ఇక వైసీపీ ఎమ్మెల్యేలూ, నేతలూ కూడా ఈ నాలుగున్నరేళ్లుగా నిత్య నరకం అనుభవించారనీ,  వారి ఫోన్లపై కూడా నిఘా ఉండటంతో వారు   తమ అటెండర్లు, భార్యల ఫోన్ల నుంచి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారనీ పీకే చెప్పారు.   ప్రజలు తనను చూసి, తన పథకాలను చూసి ఓట్లేస్తారన్న భావనలో జగన్‌ ఉన్నారని,  అభద్రతాభావం-భయం ఉన్నందుకే జగన్‌ ఎవరితో తన అభిప్రాయాలు-వ్యూహాలు పంచుకోరని పీకే  పేర్కొన్నారు.   ఏం చేయాలో నాకు తెలుసు. నాకు అన్ని రిపోర్టులూ వస్తాయి. నేను చెప్పింది మీరు చేయండి  అని సలహాదారులు, మంత్రులకు జగన్‌ స్పష్టం చేస్తుంటారనీ, అందుకే ఆయనకు ఎవరూ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయరని పీకే వివరించారు.  ఇక తెలుగుదేశం, జనసేన పొత్తు క్షేత్రస్థాయికి వెళ్లిందని,   అభ్యర్ధుల ఎంపిక,  ప్రచార వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తే విజయం ఖాయమని పీకే చంద్రబాబుతో చెప్పారు.   ఎన్నికలకు నెలముందే జగన్‌  నియోజకవర్గాలకు నిధులు పంపిణీ చేసే అవకాశం ఉందని, దానిపై దృష్టి సారించాలని పీకే చంద్రబాబుకు సూచించారని చెబుతున్నారు.  ఇక జిల్లాల వారీగా పీకే  తెలుగుదేశం విజయావకాశాలపై కూడా చంద్రబాబుకు వివరించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విజయనగరం జిల్లాలోనే వైసీపీ కొద్దిగా బలంగా కనిపిస్తోందనీ,  ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళంలో జిల్లాలు కలిపి  వైసీపీకి ఐదుకి మించి  స్థానాలు వచ్చే వచ్చే పరిస్థితి లేదనీ,  గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాలు మూడూ కలిపినా వైసీపీకి పదికి మించి వచ్చే వాతావరణం లేదని పీకే స్పస్టం చేశారని చెబుతున్నారు. రాయలసీమలోని కడపలో ఐదు సీట్లు వైసీపీ ఖాతా నుంచి టీడీపీలోకి పోవడం ఖాయమని కూడా చెప్పారు. నెల్లూరు-కర్నూలు-చిత్తూరు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యత సాధిస్తుందనీ, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఇదారు స్థానాలకు మించి దక్కే అవకాశాలు లేవనీ,  అనంతపురంలో అయితే ఒక్క స్థానంలో వైసీపీ గెలిచినా గొప్పేనని పీకే వివరించినట్లు సమాచారం.   

లోక్ సభ ఎన్నికల కోసమేనా కవిత హిందుత్వ అజెండా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ లో ఒక నిస్తేజం కనిపిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించిన నేతల నోళ్లు ఇప్పుడు మూతపడిపోయాయి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు జంకుతున్నారు. ఇక అలా వచ్చి మాట్లాడే ఇద్దరు ముగ్గురు నేతలు కూడా తమ పార్టీ ఓటమిని అంగీకరించి హుందాగా మాట్లాడకుండా, తామింకా అధికారంలోనే ఉన్నామన్న చందంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత బీజేపీ వాణి వినిపించారు.  అసలు బీఆర్ఎస్ ఓటమిలో ప్రధాన భాగం ఆ పార్టీ బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న భావనే అనడంలో సందేహం లేదు. జనాలు బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ అని గట్టిగా నమ్మడానికి కారణం కూడా లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకపోవడమేనని రాజకీయవర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా ఢల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకపోవడానికి బిజెపితో కేసీఆర్‌ అవగాహనకు రావడమే ఆరోపిస్తూ వచ్చింది. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కూడా   ఇదే విషయాన్ని ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బహిరంగంగానే చెప్పారు.   ఇప్పుడు కవిత తన వ్యాఖ్యల ద్వారా, కాంగ్రెస్ పై చేసిన విమర్శల ద్వారా అవి ఉట్టి ఆరోపణలు కావని తేల్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ కవిత ఏమన్నారంటే..   కాంగ్రెస్‌ డిఎన్‌ఎలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందనీ, సనాతన ధర్మాన్ని అవమానిస్తే రాహుల్‌ గాంధీ  స్పందించలేదని విమర్శించారు. డిఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ మౌనం అందుకు అంగీకారం తెలపడంలాగే కనిపిస్తోందని దుయ్యబట్టారు. అయితే కవిత మాటలను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. బీజేపీతో ఉన్న రహస్య బంధాన్ని కవిత మాటలు సందేహాలకు అతీతంగా రుజువు చేశాయని అంటున్నారు.    అకస్మాత్తుగా సనాతన ధర్మం, హిందూ మతం కవిత  కాంగ్రెస్ ను విమర్శించడానికి అస్త్రాలుగా భావించడం విస్తుగొలుపుతోందని అంటున్నారు.   కానీ, ఇప్పుడే ఆమె ఆ మాటలు ఎందుకున్నారంటే మూడు నాలుగు నెలల్లో   లోకసభ ఎన్నికలు   జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బిజెపి  తో బహిరంగ స్నేహం  బీఆర్ఎస్ తహతహ కవిత మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ను ఢీకొంటుందా, సమరం కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య జరిగి బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోతుందా అనే చర్చ జరుగుతున్న సమయంలో  కవిత మాటలు ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడ ఏమిటన్నది తేటతెల్లమౌతోంది. అయితే గతంలోలా బీజేపీ ఇప్పుడు బీజేపీతో రహస్య బంధం, మైత్రికి సుముఖంగా ఉంటుందా అన్నదే ప్రశ్న. పరిశీలకులు మాత్రం బీజేపీకి ఇప్పుడా అవసరం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలే వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది. స్థానాలూ పెరిగాయి.  గెలిచిన స్థానాలు కాకుండా దాదాపు 19 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఇక ఆ పార్టీ లోక్ సభ ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి.. తన బలాన్ని మరింత పెంచుకుందుకే ప్రయత్నిస్తుంది. అన్నిటికీ మించి  లోకసభ ఎన్నికలలో  జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.  ఆ కారణంగా ప్రాంతీయ పార్టీ(పేరులో భారత్ అని ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాజాలదు)తో రహస్య మైత్రి అవసరం బీజేపీకి పెద్దగా ఉండదు.  బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే అది వేరే విషయం.. అప్పుడు బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఉండి ఉండేది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఇసుమంతైనా లేదు, ఉండదు అని పరిశీలకులు చెబుతున్నారు.  అందుకే ఇప్పుడు బీజేపీ ప్రథమ లక్ష్యం తెలంగాణలో విపక్ష స్థానానికి చేరడం. అంటే ఆ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా  కాంగ్రెస్ ను భావిస్తుంది. ఆ పార్టీ దృష్టి అంతా రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడంగానే ఉంటుంది. అందుకు అవసరమైన వ్యూహాలు ఎత్తుగడలతోనే బీజేపీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమౌతుంది. అవుతోంది కూడా. గతంలో అంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ లు అనుసరించిన వ్యూహం కూడా ఇదే. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని జనంలోకి తీసుకువెళ్లేందుకు ఈ రెండు పార్టీలూ శతథా ప్రయత్నించాయి.  ఇప్పుడు బీజేపీ అదే వ్యూహాన్ని బీఆర్ఎస్ విషయంలో అదే ఎత్తుగడతో ముందుకు సాగనుంది.  బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అదే చేస్తున్నది. దీని కోసం   శాసనసభ ఎన్నికల్లో బిజెపి, బీఆర్‌ఎస్‌ రహస్య అవగాహనతో పనిచేశాయనే ప్రచారాన్ని ప్రజలు గట్టిగానే నమ్మారు. ఇప్పుడు ప్రజలలో ఆ నమ్మకాన్ని పోగొట్టే పనిలో బీజేపీ ఉంది.  అందుకే కవిత హిందుత్వ అజెండాను అందిపుచ్చుకున్నారు. అలా చేయడం వల్ల బీజేపీతో పాటు హిందుత్వ ఓట్లలో ఏంతో కొంత భాగాన్ని తమ ఖాతాలో వేసుకుంటే లోక్ సభ ఎన్నికలలో ఏదో మేరకు లబ్ధి పొందొచ్చన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంద. మాజీ మంత్రి కేటీఆర్ కూడా అందుకే రాహుల్ ఇటాలియన్ వంటి  పాత విమర్శలకు బూజులు దులిపి తెరపైకి తీసుకువస్తున్నారు.  అయితే బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజుకోవాలంటే చేయాల్సింది అడ్డదారులలో ప్రజలను మభ్యపెట్టి పబ్బంగడుపుకునే ఎత్తుగడలు కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి కారణాలను సమీక్షించుకుని, తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజాభిమానం కోసం క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా    వ్యవహరిస్తే మరో భంగపాటుకు ఆ పార్టీ రెడీ కావాల్సిందే.

ప్రధానిని కల్సిన రేవంత్, భట్టి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం... ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. తెలంగాణలో ఆర్థిక శాఖను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి చూస్తున్నారు. ప్రధానితో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు మధ్యాహ్నం  మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వినతులను అందజేశారు.దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన సీఎం అయినా బాధ్యతలు చేపట్టాక ప్రధానిని కలవడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు దేశ ప్రధాని నరేంద్రమోదీని కలిసారు.  ఈ సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత పదేళ్ళల్లో అమలు కావాల్సిన హామీలు, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురు నేతలు ప్రధానితో చర్చించారు.దానికి సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. దీంతో పాటూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి కూడా అడిగారు. ప్రధాని మోదీతో భేటీ తరువాత రేవంత్ రెడ్డి, భట్టిలు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటూ లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలు లాంటి అంశాల మీద చర్చించారని సమాచారం.

ఓడిపోయి బతికిపోయాను.. జనం తీర్పు మేలు చేసింది.. దగ్గుబాటి

పొలిటికల్ లీడర్లు ఎక్కడైనా ఎన్నికలలో తనను ఓడించిన ప్రజలను తిట్టుకుంటారు. పైకి ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పినా.. లోలోపల మాత్రం ప్రజలపై కోపం పెట్టుకుంటారు. ఇక గెలిచిన వారైతే తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తారు. గెలిచిన తర్వాత వారు జనాలను ఏ మాత్రం పట్టించుకుంటారన్నది పక్కన పెడితే..  ముందైతే తనకి ఓటేసిన ప్రజల పట్ల అమితమైన గౌరవంగా ఉంటారు. కానీ  ఈయన రూటే సెపరేటు.  తనను ఓడించి ప్రజలు మంచి పనిచేశారని వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన ఎవరో కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వయానా తోడల్లుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు పెద్దల్లుడు,   ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఔను.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రజలు తనను ఓడించి మంచి పనిచేశారని, అదే గెలిచి ఉంటే ఇప్పటి పరిస్థితిలో తలెత్తుకొని బయట తిరిగే పరిస్థితి కూడా ఉండేది కాదని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019లో వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పర్చూరు నుంచి పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో దగ్గుబాటి 1,647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం వైసీపీతో ఆయన దెగదెంపులు చేసుకుని.. గత నాలుగున్నరేళ్లుగా అసలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సొంత గ్రామంలో వ్యవసాయ పనులతో పాటు స్థానిక పరిచయాలతో కాలం గడిపేస్తున్నారు. అప్పటి నుండి ఏపీ రాజకీయాలపై దగ్గుబాటు ఎక్కడా మాట్లాడింది కూడా లేదు. తన సతీమణి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలైనా సరే ఆయన బయటకొచ్చి మాట్లాడింది కూడా లేదు. కానీ  అనూహ్యంగా ఇప్పుడు ఆయన బయటకొచ్చారు. రావడమే కాదు ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. వైసీపీ తరఫున పోటీచేసిన నన్ను పర్చూరు ప్రజలు ఓడించి మంచి పనిచేశారు. అదే గెలిచి ఉంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఏ పనీ చేయలేకపోయేవాడినని దగ్గుబాటి పేర్కొన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. పర్చూరులో తాను ఓటమి పాలు కావడం ఈ రోజుకు మంచిదే అని అన్నారు. తాను నాడు గెలిచి ఉంటే జనం ముందు తలెత్తుకుని తిరిగే వాడిని కాను అన్నారు. రోడ్లు బాగా లేవు అని ప్రజలే తనను నిలదీసేవారని వైసీపీ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు. ఇదంతా ప్రజలు చేయలేదు ఆ దేవుడే చేశాడని అన్నారు. అందుకే తాను ఓటమి చెందడం భగవంతుడు తనకు ఇచ్చిన  వరం  అన్నారు. ఎన్నికై ఉంటే, ఓటర్ల కోసం ఏమీ చేయనందుకు, చేయలేకపోయినందుకు తల ఎత్తుకుని తిరగలేకపోయేవాడిని డాక్టర్ దగ్గుబాటి పేర్కొన్నారు. అలాగే, ఇక తాను ఓడాక సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని మాట ఇచ్చారని, అది కూడా జరగలేదంటే.. అదంతా చేసింది భగవంతుడే అని వెంకటేశ్వర రావు అన్నారు. తాను ఎమ్మెల్యే అవ్వలేదు, తన కొడుక్కి ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు.. ఇదంతా దేవుడి దయ అని చెప్పుకున్నారు. ఇక తన సతీమణి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేసి బీజేపీలో చేరడం కూడా తమను ఇష్టం లేదని, కానీ బలవంతంగా చేరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కాగా, వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారాయి. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలందరిదీ ఇప్పుడు అదే పరిస్థితని, ఎక్కడికక్కడ ప్రజలు మొహం మీదే ఏం చేసారని ప్రశ్నిస్తున్నారని, ఏ ఎమ్మెల్యే కూడా ప్రజలకు సమాధానం చెప్పలేక మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అదే ఒకవేళ దగ్గుబాటి కూడా గెలిచి ఉంటే అదే పరిస్థితి ఆయనకు వచ్చేదని, అదే విషయాన్ని ఆయన చెప్పినట్లు భావిస్తున్నారు. ఇక, ఆయన కుమారుడు హితేష్ జగన్ ప్రభుత్వంలో మంత్రి అయి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడేదని, తల్లి పురందేశ్వరీ హితేష్ పై విమర్శలు చేయాల్సి వచ్చేదని, ఇదంతా జరగకుండా వెంకటేశ్వరరావు చెప్పినట్లు ఆ దేవుడే చేసి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వెంకటేశ్వరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.

యశస్వికి పాస్ పోర్ట్ ఇచ్చేయాలన్న హైకోర్టు 

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఎన్ఆర్ఐ యశస్విపై దాఖలైన కేసులో ఏపీ హైకోర్టు సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. యశస్వి నుంచి స్వాధీనం చేసుకున్న పాస్ పోర్ట్ ను ఆయనకు తిరిగిచ్చేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. పాస్ పోర్టు ఇప్పించాలంటూ యశస్వి దాఖలు చేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందిస్తూ ఈ ఆదేశాలు వెలువరించింది.  సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇటీవల భారత్ కు వచ్చిన యశస్విని సీఐడీ అధికారులు ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో యశస్వి దిగిన వెంటనే అదుపులోకి తీసుకుని, ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై యశస్వి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల తన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన యశ్ ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారన్న విషయం తెలిసిందే.ఆ సమయంలోనే సీఐడీ యశ్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.దీంతో పాస్ పోర్టు స్వాధీనం చేసుకుని ఇవ్వడం లేదని యశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం పాస్ పోర్టును ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది.రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు చేస్తున్న ఎన్ఆర్ఐ యశ్ ను విమానాశ్రయంలోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు!.. ముహూర్తం ఎప్పుడంటే?

మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు ఏపీపై కన్నేసింది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేంత కాకపోయినా దక్షణాదిలో మరో రాష్ట్రంలో తన స్థాయి ఏంటో నిరూపించుకోవాలి. కాంగ్రెస్ ఇక్కడ తుడిచిపెట్టుకుపోవడంలో  రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏపీ నష్టపోయిందన్నది ఏపీ ప్రజలలో బలంగా నాటుకుపోయింది. అయితే పదేళ్లు గిర్రున తిరగడంతో ఇప్పుడు ఆ భావనలో కొంత మార్పు వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ తమకి న్యాయం చేస్తారనే భావన పెరిగింది. దీంతో కాంగ్రెస్ లో ఆశ మొదలైంది. ఏపీ కాంగ్రెస్ శిథిలావస్థకు రెండో కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాంగ్రెస్ ను కొట్టే జగన్ తన పార్టీని నిలుపుకున్నారు. ఇద్దరు ముగ్గురు మినహా వైసీపీ సీనియర్ నేతలంతా కాంగ్రెస్ నుండి వచ్చిన వారే. కనుక ఇప్పుడు ఏపీలో జగన్ ను దెబ్బతీస్తేనే కాంగ్రెస్ కు స్కోప్ దక్కేది. ఇందుకోసమే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తున్నది. ఆ ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు   షర్మిల ఏపీలోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లోనే ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై చర్చలు పూర్తయ్యాయి. కానీ  తెలంగాణలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్పటికి వ్యూహాత్మకంగా అది వాయిదా వేశారు. ఇప్పుడు టార్గెట్ ఏపీ సమయం ఆసన్నమైంది. దీంతో షర్మిల రాజకీయ ప్రయాణం అప్పుడు ఎక్కడ ఆగిందో ఇప్పుడు అక్కడ నుండి మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. త్వరలోనే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీకి మకాం మర్చనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కేసి వేణుగోపాల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లు ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు తెలిస్తోంది. షర్మిల ఇప్పటికే డీకే శివకుమార్ ను పలు దఫాలుగా కలిసి చర్చలు జరపగా.. ఆ చర్చల్లో కేసి వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరే దగ్గరుండి షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది.  బుధవారం (డిసెంబర్ 27) కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్‌ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే సహా పార్టీ రాష్ట్ర  ముఖ్య నేతలకు ఇప్పటికే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ సమావేశంలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలపై కీలకంగా చర్చ జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంపై అధిష్టానం పెద్దలు రాష్ట్ర నేతలకు ఈ సమావేశంలోనే సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. అంతే కాదు ఈ నూతన సంవత్సరం రోజునే  అంటే వచ్చే ఏడాది జనవరి 1న షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలను అప్పగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు నిర్ధారిస్తున్నాయి.  నిజానికి షర్మిల మళ్ళీ ఏపీ రాజకీయాలకు రావడంపై తొలుత పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కావాలని భావించారు. తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం ప్రతిపాదన వచ్చిన సమయంలో కూడా షర్మిల అదే భావన వెలిబుచ్చారు. తెలంగాణ ఎన్నికలలో ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  ఒక నియోజకవర్గంలో పోటీ చేయడం, లేదా రాజ్యసభకు  అన్నట్లు ప్రచారం జరిగింది. కానీ  కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమె సేవలను ఏపీలో వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఏపీలోనే షర్మిలకు భవిష్యత్ ఉందని నచ్చజెప్పింది. దాంతో అంగీకారం తెలిపారు  ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం కాంగ్రెస్ సొంతం కావడంతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ అంటే ఖచ్చితంగా స్థాయి పెరుగుతుంది. దీంతో షర్మిల ఇప్పుడు మనస్పూర్తిగా ఏపీకి నాయకత్వం వహించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.  ఆమె ఏపీ రాజకీయాలలోకి రాబోతుండడంతోనే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపి సంకేతాలు ఇచ్చినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.

బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ సీఈవోగా డాక్టర్ కూరపాటి

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) గా డాక్టర్ కూరపాటి కృష్ణయ్యను నియమించినట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.  నాలుగు దశాబ్దాల పాటువైద్య రంగంలో ఎంతో అనుభవజ్ఞడుగా పేరెన్నికగలిగిన ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డా. కూరపాటి కృష్ణయ్య గతంలో మెడిసిటీ హాస్పిటల్ సీఈవోగా పని చేశారు.   సుదీర్ఘ అనుభవజ్ఞుడైన డా కృష్ణయ్య నియామకం అత్యున్నత శ్రేణి వైద్య సేవలు,  క్యాన్సర్ పై పోరాటంలో పరిశోధనలకు నెలవుగా నిలిచిన బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్  చరిత్రలో మరో మైలు రాయి కానుంది. టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్, ప్రైమరీ అండ్  రివిజన్ కాంప్లెక్స్ ట్రామా ,  ఇంటర్ లాకింగ్ నెయిలింగ్ లాంటి అత్యాధునిక శస్త్ర చికిత్సలలో ఎంతో గుర్తింపు పొందిన వైద్యుడు డాక్టర్ కూరపాటి కృష్ణయ్య, విలువలతో కూడిన వైద్య విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా ఆరోగ్య సేవలలో కరుణ, జాలి, దయలకు ఖచ్చితమైన స్థానం ఉండాలని భావిస్తారు. డాక్టర్ కూరపాటి కృష్ణయ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్  రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ విలువలలో ఖచ్చితంగా ఇమిడిపోయే వ్యక్తి అనడంలో సందేహం లేదు.  నూతన సీఈవో గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్ కూరపాటి కృష్ణయ్య ను    బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్  చైర్మన్  స్వాగతించారు. ఈ సందర్భంగా  ఆరోగ్య సేవల విభాగంలో అత్యున్నత శ్రేణి నాణ్యతా ప్రామాణాలను స్థాపించడంలో ఆయన ట్రాక్ రికార్డ్ ను గుర్తు చేసుకొన్నారు.  గతంలో మల్టీ స్పెషాలటీ హాస్పిటల్ సేవలకు పేరు గడించిన మెడిసిటీ హాస్పిటల్  సీఈవోగా వైద్య సేవలతో పాటూ విద్యా సంబంధమైన అంశాలను మేళవిస్తూ ఎంతో విజయవంతంగా సాగిన ప్రయాణాన్ని ప్రశంసించారు. వైద్య రంగంలో డాక్టర్ కూరపాటి కృష్ణయ్య   పయనం పూర్తి అంకితభావంతో శ్రేష్టతతో సాగిందని ప్రస్తుతించారు.   ఖచ్చితత్వంతో కూడిన స్పెషలిస్ట్ సర్జన్ గా డాక్టర్ కూరపాటి  కృష్ణయ్య ఆర్థోపెడిక్స్ విభాగంలో అత్యున్నత శ్రేణి ప్రమాణాలను స్థాపించడమే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో అత్యాధునిక శస్త్ర చికిత్స విధానాలను అవలంబించడంలో మార్గదర్శకత్వం వహించారని బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పారు.  

ఏపీ కాంగ్రెస్ కోసం రంగంలోకి రేవంత్?.. జగన్ కు బిగ్ షాక్

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు సెగలు రేపుతున్నాయి. ఒక వైపు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఉమ్మడి  శంఖారావం పూరించాయి. ఆ దెబ్బకే అధికార  వైసీపీ బిక్కుబిక్కుమంటూ గెలుపు దారులు కనిపించక మల్లగుల్లాలు పడుతోంది. సిట్టింగుల మార్పు పేరుతో సొంత పార్టీలోనే ముసలం పుట్టే పరిస్థితి తెచ్చుకుంది. ఇది చాలదన్నట్లు ఏపీలో కాంగ్రెస్ పార్టీ  కూడా జగనే  లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.  ఇప్పటికే దక్షణాదిలో కర్ణాటక, తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ .. ఇప్పుడు ఏపీని టార్గెట్ చేసుకున్నది.  ఏపీ కాంగ్రెస్ కోసం దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి,  వైఎస్ఆర్టీపీ అద్యక్షురాలు షర్మిల రంగంలోకి దిగనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. షర్మిల తన వైఎస్సార్టీపీని  కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఏపీపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ మేరకు నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పటికే వైసీపీలో వణుకు ప్రారంభమైంది.  ఇప్పుడు షర్మిల రూపంలో మరో షాక్ తప్పదా అన్న భయం మొదలైంది.   ఈ రెండూ చాలవన్నట్లు ఇప్పుడు వైసీపీకి తెలంగాణ సీఎం రేవంత్ రూపంలో మరో గండం పొంచి ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు,  అందునా సింగిల్ హ్యాండ్ తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం దక్కించుకోగల స్థాయికి చేర్చిన సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. రేవంత్  ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం కంకణం కట్టుకున్నారని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే రేవంత్ వర్గం నేతలు పని మొదలు పెట్టేశారనీ,  ఏపీలోని వైసీపీ నేతలతో రేవంత్ టచ్ లోకి వచ్చిందని అంటున్నారు. రేవంత్ దూతగా ఒకరు తెలంగాణలోని ఏపీ వైసీపీ నేతలతో  సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో సిట్టింగుల  మార్పు, కొందరు సిట్టింగులకు టికెట్ల నిరాకరణ వంటి విషయాలపై టార్గెట్ చేసిన రేవంత్ దూత.. వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా తెలంగాణలో వ్యాపారాలు, ఆస్తులు ఉన్న వైసీపీ నేతలను రేవంత్ టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి జగన్ కు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో రేవంత్ జగన్ కు షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, నాయకులకు తెలంగాణలో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణలో అధికారం మార్పుతో తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. రేవంత్ సీఎం కావడంతో టీడీపీ నేతలకు ఆయనతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో వారు ధీమాగా ఉన్నారు. ఇక వైసీపీ నేతలకే ఇక్కడ చిక్కు వచ్చి పడింది.  అటు చూస్తే ఏపీలో అధికారం కోల్పోవడం పక్కా అనేది నిర్ధారణైపోయింది. అటు ఏపీలో చంద్రబాబు సీఎం అవుతారనీ, తెలంగాణలో రేవంత్ సీఎంగా ఉన్నారనీ, వీరిద్దరి మధ్యా ఉన్న గురుశిష్యుల సంబంధం అందరికీ తెలిసిందేననీ, ఆ కారణంగా తమకి చిక్కులు తప్పవని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ దూత ఒకరు ఇలాంటి ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ నుండి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు రేవంత్ ఈ దూత ద్వారా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాదులో మీ వ్యాపారాలకు సహకరిస్తాం.. కాంగ్రెస్ లో  చేరితేనే సుమా అంటూ ప్రతిపాదిస్తున్నారని వైసీపీ వర్గీయుల ద్వారానే తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరితే ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా తాము అన్ని విధాలుగా అండ ఉంటామని భరోసా ఇస్తున్నారనీ,  కేంద్రంలో కూడా మోడీ హవా తగ్గుతుందని చెబుతూ..  కాంగ్రెస్ లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారంటున్నారు. ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా రేవంత్ ఆఫర్ కు  సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. వైసీపీలో ఉన్నా ఈసారి టికెట్ ఉండదు, ఒక వేళ టికెట్ ఇచ్చి నియోజకవర్గం మార్చినా గెలుపు గ్యారంటీ లేదు అన్న నిర్ణయానికి వచ్చేసిన పలువురు ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ లోకి జంప్ చేయడమే బెటరనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ లోకి వెళ్తే తెలంగాణలో ఐదేళ్ల పాటు తమ వ్యాపారాలకు, ఆస్తులకూ ఢోకా ఉండదు.  ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది కనుక కాంగ్రెస్ లో ఉన్న తమపై ఒత్తిడీ ఉండదన్న భావనలో వారు ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రతిపాదనకు ఓకే చెప్పేయడానికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  వైసీపీ నుంచి తక్కువలో తక్కువ 40 మంది  నేతలను చేర్చుకుని.. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా ఎదగాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసేందుకు చూస్తున్నారు. ఇందుకు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. రేవంత్ ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ దాదాపు ఖాళీయేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కరోనా కారణంగా హైదరాబాద్ లో  తొలి మరణం 

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ  విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 412 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్య కారణాలో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజటివ్ అని తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మృత్యువాత పడ్డాడు. ఊపిరితిత్తుల వ్యాధితో సదరు వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. కరోనా కారణంగా తెలంగాణలో ఈ ఏడాది నమోదైన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో... దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

జగన్ ఓటమే టార్గెట్.. పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి షర్మిల?

తెలుగుదేశం ఎంపీగా షర్మిల అంటూ గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమం వేదికగా పలు కథనాలు ప్రచారమయ్యాయి. వీటన్నిటికీ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడమే కారణం. అదే సమయంలో తన సోదరుడు జగన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు కాదు కదా, ఇదే నెలలో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సందర్భంగా కూడా షర్మిల ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయలేదు. సొంత అన్నను పూర్తిగా విస్మరించి, ఆయన ప్రత్యర్థి పార్టీలో కీలక నేత అయిన లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపడంతో.. జగన్, షర్మిల మధ్య విభేదాల విషయంలో ఏ మాత్రంగానైనా ఎవరిలోనైనా అనుమానాలు ఉండి ఉంటే అవన్నీ నివృత్తి అయిపోయాయి. 2019 ఎన్నికల ప్రచారం కోసం తన సేవలను ఉపయోగించుకున్న సొంత అన్న జగన్ ఆ ఎన్నికల తరువాత తనకు పూచిక పుల్ల విలువ సైతం ఇవ్వకుండా, పార్టీలో ఉండనీయకుండా, అసలు రాష్ట్రంలోనే ఉండలేని పరిస్థితులు కల్పించిన తీరుపై షర్మిల గుర్రుగా ఉన్నారు. పలు సందర్భాలలో అన్న తీరును, విధానాలనూ తప్పుపడుతూ వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఎలాంటి మొహమాటాలూ లేకుండా జగన్ కు వ్యతిరేకంగా ప్రత్యక్ష రాజకీయాలలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారన్న సంకేతాలు ఇచ్చేశారు. అయితే లోకేష్ కు క్రిస్మస్ గిఫ్టులు పంపినంత మాత్రాన ఆమె తెలుగుదేశం గూటికి చేరుతారని భావించడం సరికాదనీ, ఆమె చూపు ఇప్పటికీ కాంగ్రెస్ వైపే ఉందనీ ఆమెకు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా రాజకీయరంగ ప్రవేశం చేసిన షర్మిల.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయంలో క్లియర్ గానే ఉన్నారని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ దిశగా జరగిన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయనీ, ఇప్పుడు అవి ఫలవంతమౌతున్నాయని చెబుతున్నారు. షర్మిల టార్గెట్ తన అన్న జగన్ అయినప్పుడు ఆమె తెలుగుదేశం గూటికి చేరడం వల్ల జగన్ కు ప్రత్యర్థిగా మాత్రమే ఉండగలరనీ, అదే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు అందుకుంటే.. జగన్ కు తేరుకోలేని దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ పగ్గాలు చేపట్టడం అంటూ జరిగితే ఇక  జగన్ పార్టీకి నూకలు చెల్లినట్లేనని అంటున్నారు.   ఏపీ ప్రజలే కాదు, వైసీపీ నేతలు కూడా జగన్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిని చూడలేకపోతున్నారనీ, అందుకే షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆమె వెంట నడిచేందుకు రెడీ అవుతారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ క్షేత్ర స్థాయిలో అంతో ఇంతో బలం ఉంది. అయితే విభజన సందర్భంగా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిన కారణంగా కాంగ్రెస్ ను ఈ పదేళ్లూ దూరం పెట్టారు. అయితే జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన అరాచక పాలన చూసిన తరువాత జనంలో  కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కంటే జగన్ పాలన పట్ల ఆగ్రహమే ఎక్కువగా కనిపిస్తోంది.  జగన్ ను గద్దె దించాలన్న నిర్ణయానికి వచ్చేసిన జనం తెలుగుదేశం, జనసేన కూటమికి అధికారం కట్టబెట్టడానికి రెడీ అయిపోయారు. ఈ రెండు పార్టీల కలయికతో జగన్  దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అభ్యర్థుల మార్పు అంటూ ఏవేవో వ్యూహాలు, ఎత్తుగడలతో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి లబ్ధి పొందే ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్త పార్టీల ఏర్పాటుకు తెర వెనుక ప్రోత్సాహం అందిస్తున్నారు. అలా పుట్టుకు వచ్చినవే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జైభారత్  నేషనల్ పార్టీ, సినీ దర్శన నిర్మాత సత్యారెడ్డి ఏర్పాటు చేసిన తెలుగుసేన పార్టీలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఏపీలో చురుకుగా పావులు కదుపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసంపూర్తిగా మిగిలిన షర్మిల పార్టీ విలీనం చర్చలను తెరపైకి తీసుకువచ్చింది. షర్మిలకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించడంతో పాటు, ఆమె కోరిన స్థానం నుంచి, ఆమె అంగీకరిస్తే పులివెందుల నుంచి జగన్ ప్రత్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చేందుకు కూడా ప్రతిపాదించింవదని చెబుతున్నారు. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే కొత్తగా పుట్టుకు వచ్చిన పార్టీల ద్వారా జగన్ అశించే ప్రయోజనం సిద్ధించదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు. వైసీపీ ఓటు కూడా ఆ పార్టీకి దూరం అవుతుందని చెబుతున్నారు. అలాగే తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల కోసం జగన్ వెతుక్కునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న పలువురు సీనియర్ నేతలంతా కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే.  వారెవరూ ఇప్పుడు వైసీపీలో హ్యాపీగా లేరని అంటున్నారు.  జగన్ ఒంటెత్తు పోకడలు, అహంభావం, పార్టీలో దక్కని గౌరవంతో గత్యంతరం లేక వైసీపీలో గత్యంతరం లేక కొనసాగుతున్న పలువురు కాంగ్రెస్ హస్తం అందుకుంటారని అంటున్నారు.  అయితే తెలంగాణలోలా ఏపీలో కాంగ్రెస్ పట్ల ప్రజలలో  సానుకూలత ఇసుమంతైనా లేదు. తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పాట్ల సానుకూలత ఉంటే, ఏపీలో మాత్రం తమ అభీష్ఠానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రెండుగా ముక్కులు చేసిందన్న ఆగ్రహం  బలంగా వ్యక్తం అవుతోంది. ఆ కారణంగానే రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీలో జనం ఆ పార్టీని అసెంబ్లీలో అడుగుకూడా పెట్టనివ్వకుండా శిక్షించారు. పదేళ్ల తరువాత కూడా ఏపీ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఆ పార్టీ పుంజుకోవాలంటే షర్మిలను పార్టీలో చేర్చుకుని రాష్ట్ర పగ్గాలు అప్పగించడమే మార్గమని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.   ఏపీ జనం దివంగత సీఎం వైఎస్ రాజకీయ వారసుడిగా  ఆయన కుమారుడు జగన్ కు 2019 ఎన్నికలలో ఒక చాన్స్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు కట్టబెట్టారు. అయితే సీఎంగా ఆయన తీరు, ఆయన పాలనపై నాలుగున్నరేళ్లలోనే విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని జనం ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉంది. అలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ తనయ షర్మిల అడుగుపెడితే..  ఏపీ కాంగ్రెస్ లో ఒక్క సారిగా నూతనోత్సాహం వస్తుందని కాదు కానీ.. అధికార వైసీపీ మాత్రం పూర్తిగా బలహీనపడుతుంది. ఏదో ఒక మేరకు కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ వారసుడిగా భావించి జగన్ పంచన చేరిన పూర్వ కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్ లోకి వలస వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. జగన్ పార్టీలో ఇమడ లేక, మరో మార్గం కానరాక పార్టీలోనే అనామకులుగా మిగిలిపోయిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరొక్కరుగా లేదా గంపగుత్తగా కాంగ్రెస్ లోకి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైసీపీలో ఆందోళన తారస్థాయికి చేరుకోవడం వెనుక కారణం అదే.   షర్మిల ఏపీ ఎంట్రీతో వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ బలపడుతుందని చెబుతున్నారు. విజయం సాధించే పరిస్థితి ఉండకపోయినా విపక్షంగా ఎదిగే అవకాశం షర్మిల రాకతో కాంగ్రెస్ కు  దక్కినట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే.. షర్మిల కూడా కాంగ్రెస్ వైపునకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.  ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్, షర్మిల మధ్య చర్చలు పూర్తయ్యాయనీ, షర్మల పార్టీ కాంగ్రెస్ విలీనానికి, ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించడానికి నిర్ణయం జరిగిపోయిందని కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. అన్నీ కుదిరితే నూతన సంవత్సరారంభం రోజే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు.  నేడో రేపో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.  

గోరంట్ల బుచ్చయ్యా.. నీ మాటలు అక్షర సత్యాలయ్యా!

ఏమాటకామాటే చెప్పాలి.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటల్లో ఓ విధమైన పదను ఉంటుంది. ఆయన వయస్సు  డైబ్బై ఏడేళ్లపైనే ఉన్నా... ఆయనగారి మాటల్లో మాత్రం పదును, చరుక్కు.. చమక్కు తాలుకు వాడి వేడి.. ఇసుమంతైనా తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే.. వయస్సుతోపాటు ఆటోమెటిక్‌గా పెరుగుతూనే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రస్తావిస్తూ.. ఎక్స్ వేదికగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి  ఓ ట్విట్ చేశారు. ప్రభాస్‌ను కరెక్ట్‌గా వాడుకున్న దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ మాత్రమేనని.. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ను దర్శకులు రాజమౌళి, వినాయక్ వాడుకున్నారని.. .. ప్రిన్స్ మహేశ్ బాబుని పూరీ జగన్నథ్ వాడుకున్నారని.. ఇక అల్లుఅర్జున్‌ను వాడుకొంది మాత్రం సుకుమార్ అని.. అలాగే బాబాయి, తల్లి, చెల్లిని కరెక్ట్‌గా వాడుకున్నది మాత్రం వైసీపీ అధినేత  జగన్ అంటూ ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్ వెంటనే వైరల్ అయ్యింది.  ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో  స్పందిస్తూ ఆయన మాటలు అక్షర సత్యాలని ప్రస్తుతిస్తున్నారు.  ప్రస్తుత  రాజకీయ నాయకుల్లో జగన్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అంటున్నారు.  సొంత బాబాయ్  వివేకానందరెడ్డి, కన్న తల్లి  విజయమ్మ, సొంత సోదరి   షర్మిలలను అలా వాడుకొనే.. ఆ తర్వాత వారిని వదిలేశారని.. అందుకే తల్లీ చెల్లీ  రాష్ట్రం వదిలి తెలంగాణకు వలస వెళ్లిపోయారనీ,  సొంత చిన్నాన్న   వివేకానందరెడ్డి.. అత్యంత దారుణంగా హత్యకు గురి అయితే.. ఆయన హత్యను నాటి ప్రతిపక్ష నేతగా ఇదే  జగన్.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, నాటి సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై నెట్టి.. తీవ్ర విమర్శలు గుప్పించడమే కాకుండా... తన చిన్నాన్న హత్య కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తేనే.. ఈ కేసులో నిందితులు బయటకు వస్తారని..  ఈ హత్య వెనుక ఉన్న పాత్రధారులు. సూత్రధారులు సైతం వెలుగులోకి వస్తారంటూ  నానా యాగీ చేయడమే కాకుండా చిన్నన్న హత్యను ఎన్నికలలో తన విజయానికి ఒక సానుభూతి అస్త్రంగా వాడుకున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.   అయితే జగన్ అధికార పీఠం ఎక్కి నాలుగున్నరేళ్లు గడిచినా.. ఆయన కుటుంబంలో.. అది కూడా తండ్రి తర్వాత తండ్రి అంత వాడు అయిన చిన్నాన్నను అత్యంత దారుణంగా హత్య ేచసిన  నిందితులను నేటికి పట్టుకొలేదంటే... వైయస్ జగన్ ఎంతటి స్వాతి ముత్యమో అర్థమవుతున్నదని  పేర్కొంటున్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. గోదావరి జిల్లాలో సైకిల్ చక్రమే కాదు.. రాజకీయ చక్రం తిప్పిన ఘనాపాటి అని... అందుకే అసెంబ్లీకి జరిగిన పలు ఎన్నికల్లో చాలా సార్లు ఆయన గెలుపొందారని వారు గుర్తు చేస్తున్నారు.   ఈ రాజమండ్రి గ్రామీణ తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఓ డైలాగ్ రైటర్ ఉన్నారని.. ఆయన గారి ఈ డైలాగులు చూస్తే.... అటు పరిచూరి బ్రదర్స్, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు హోల్ సేల్‌గా టాలీవుడ్ వదిలి పారిపోతారనే అంటున్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే ఓ డేరింగ్ అండ్ డ్యాషింగ్ నాయకుడని.. అలాంటి గట్స్ ఉన్న  ఈ ఎమ్మెల్యే.. సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీలోనే.. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను.. నీకు మంగలి కృష్ణా తెలుసా? అంటూ ఆట పట్టించారని... దీంతో నాటి సభలోని ఫ్యాన్ పార్టీ సభ్యులంతా డంగై పోయారని వారు గుర్తు చేస్తున్నారు.  ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్‌తో రాజమౌళి ఛత్రపతి, బాహుబలి వన్, టూ చిత్రాలు తీశారు... అలాగే సలార్ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇక స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ట్రిపుల్ ఆర్ చిత్రాల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని హీరోగా పెట్టి రాజమౌళి సినిమాలు తీశారని.. అదే విధంగా ఇదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆది, ఆదుర్స్ చిత్రాలు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చాయి. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా పోకిరి, బిజినెస్‌మెన్ చిత్రాలు వెండి తెర మీద సందడి చేశాయి.. అల్లు అర్జున్ హీరోగా   దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పుష్ప 1.  ఈ చిత్రంలో అల్లు అర్జున్‌లోని నటనను బయటకు రాబట్టడంలో..దర్శకుడు నూటికి నూరు శాతం విజయం సాధించాడని.. అందుకే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నారని.. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందేనని.. అలాగే ఫ్యాన్ పార్టీ   జగన్‌ సైతం.. గత ఎన్నికల్లో గెలుపొందడం కోసం.. చిన్నాన్న వైయస్ వివేకా నందరెడ్డి హత్యను, అలాగే చెల్లి వైయస్ షర్మిలను, తల్లి వైయస్ విజయమ్మను బాగానా వాడుకొని.. ముఖ్యమంత్రి పీఠాన్ని వైయస్ జగన్ ఎక్కారంటే.. ఆయనలో మోస్ట్ ఫవర్ పుల్ టాలెంట్ ఉందనే విషయం ఇట్టే అవగతమవుతోందని నెటిజన్లు వివరిస్తున్నారు.

షర్మిలపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్

వైఎస్సార్టీపీ అధినేత్రి  షర్మిలపై శ్రీరెడ్డి ఎక్స్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. నీకు ఆస్తి కన్నా ఆంధ్రా ప్రజల భవిష్యత్తు ముఖ్యం కాదు.. నువ్వు చెల్లివి కాదు.. రాకాసి శూర్పణఖవి.  దేవుడిని అడ్డం పట్టుకొని ప్రజల సొమ్ముని చందాల రూపంలో అడుక్కుని తినే బతుకులు మీవి.. విదేశీ ఫండ్స్ దోచుకు తినే మీరు కూడా.. జగనన్నకి గోతులు తీసినంత మాత్రనా లేదా శాపాలు పెట్టినంత మాత్రానా ఏం ఓరగదు.. అవన్నీ తిరిగి మిమ్మల్నే సైతాన్లగా పీడిస్తాయి. పతివ్రత కట్టింగ్స్ వద్దులే. జాగ్రత్త అతి చేష్టలు ఒంటికి మంచిది కాదు.  షర్మిలకు శ్రీరెడ్డి చురకలంటించింది. అయితే ఈ శ్రీరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యపై నెటిజన్లు ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు.  డిసెంబర్ 24వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి   జగన్ సోదరి   షర్మిల క్రిస్మస్ కానుక పంపారు. దీనిపై నారా లోకేశ్ ట్విట్ చేస్తూ..   షర్మిలకు కృతజ్జతలు తెలిపారు.   షర్మిల.. తనకు పంపిన క్రిస్మస్ బహుమతులను ఎక్స్ వేదికగా నారా లోకేశ్ పోస్ట్ చేశారు. నారా కుటుంబం తరఫున ఆమెకు ఆయన క్రిస్మస్, న్యూ ఇయర్  శుభాకాంక్షలు తెలిపారు.  అయితే  షర్మిల.. ఇలా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి క్రిస్మస్ కానుకులు పంపి... శుభాకాంక్షలు తెలపడం.. జగన్ అబిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారికి అలవాటైన రీతిలో దూషణల పర్వానికి దిగారు.   సీఎం   జగన్ హార్ట్ కోర్ ఫ్యాన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి  శ్రీరెడ్డి అలాంటి దూషణల పర్వానికి శ్రీకారం చుట్టారు.   అయితే ఇటీవల అంటే ఈ ఏడాది నవంబర్ తొలి వారంలో ఇదే శ్రీరెడ్డి.. వైసీపీ కోసం సోషల్ మీడియాలో పని చేస్తున్న ఎవరికీ జీతాలు రావడం లేదని.. తామంతా చాలా ఇబ్బందులు పడుతున్నాం, సోషల్ మీడియా వింగ్‌ను పట్టించుకోండంటూ.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి   జగన్‌కు విన్నవించుకొంటున్న ఓ వీడియో సోషల్ మీడియలో వైరల్ అయిన సంగతి అందరకి తెలిసిందే.  ఈ వీడియోతో శ్రీరెడ్డి జగన్ పై అభిమానంతో కాదు.. వైసీపీ నుంచి అందుతున్న ఫండింగ్ కోసమే ఆమె తన అసభ్య పరిభాషకు పదును పెట్టుకుని మరీ జగనన్న కోసం, వైసీపీ కోసం సోషల్ మీడియా వేదికగా పని చేస్తున్నదని తేటతెల్లమైందనీ, ఇప్పుడు షర్మిలపై ఆమె వ్యాఖ్యలకు కారణం.. సొమ్ములు అందడమేనని నెటిజన్లు పేర్కొంటున్నారు.  గత ఎన్నికల వేళే కాదు..అంతుకు ముందు సైతం ఇదే శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేసేదో అందరికీ తెలిసిందేననే కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.   అలాగే రానున్న ఎన్నికల్లో మళ్లీ అదికారం చేపట్టేందుకు వైయస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని.. అలాంటి వేళ.. సొంత సోదరుడి రాజకీయ ప్రధాన ప్రత్యర్థి నారా ఫ్యామిలీకి వైయస్ షర్మిల ఇలా క్రిస్మస్ కానుకలు పంపడంతో.. ఫ్యాన్ పార్టీ అధినేత వర్గం తీవ్ర విస్మయం వ్యక్తం చేసిందని.. ఆ క్రమంలోనే శ్రీరెడ్డి వంటి వారు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

బీఆర్ఎస్ లో అయోమయం.. కాంగ్రెస్ వైపు స్థానిక నేతల పయనం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఈ ఎన్నికలలో ఓటమి పాలై విపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ కష్టాలు మాత్రం ఇప్పుడే మొదలయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత వరుసగా రెండు ఎన్నికలలో విజయం సాధించి 9 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ఒక్క ఓటమితో  కుదేలైపోయింది. భవిష్యత్ లో ఉనికే ప్రశ్నార్థకమౌతుందా అన్న రీతిలో బలహీనపడిపోయింది. నాయకులు పార్టీ అధికారం కోల్పోయిన క్షణం నుంచీ పక్క చూపులు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మల్లారెడ్డి వంటి వారైతే తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని బాహాటంగా మీడియాతోనే చెప్పేశారు. ఇక కొందరు ఎమ్మెల్సీలు.. ఎన్నికలలో పార్టీ ఓటమికి అధినేత విధానాలు, వ్యవహారశైలే కారణమని తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. వెళ్లగక్కుతున్నారు.  అంతే కాదు.. పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత డొల్లగా ఉందనడానికి సింగరేణి ఎన్నికలలో చేతులెత్తేయడమే నిదర్శనం. మరో మూడు నాలుగు నెలలలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన స్థితిలో పార్టీలో అభ్యర్థుల మార్పు అంశం తెరమీదకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులను మార్చకపోవడం వల్ల దెబ్బతిన్నామన్న భావనతో బీఆర్ఎస్ అధినేత లోక్ సభ ఎన్నికలలో సిట్టింగులను మార్చేస్తే చాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అసలు విషయం ఏమిటంటే.. అభ్యర్థుల మీద వ్యతిరేకత ఒక్కటే కాదు.. ప్రభుత్వ పనితీరు మీదా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉండడం వల్లనే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైంది. ఆ విషయాన్ని గమనించకుండా బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో అభ్యర్థుల మార్పే విజయానికి తారకమంత్రం అని భావిస్తున్నారు. ఇక లోక్ సభ ఎన్నికలు అయ్యీ అవ్వడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకురానున్నాయి.  ప్రస్తుతం బీఆర్ఎస్ లో తీవ్ర అయోమయం నెలకొని ఉంది. పార్టీని వీడేందుకు నేతలు రెడీ అవుతుంటే.. స్థానిక నేతలలో అయోమయం నెలకొని ఉంది. ముఖ్యంగా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పార్టీలో కొనసాగడమా? మారడమా అన్న సందిగ్ధతలో ఉన్నారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ పార్టీగా మనుగడ ఎలా సాగిస్తుందన్న విషయంలో పార్టీ అధినాయకత్వానికే ఒక స్పష్టత లేదన్న భావన కింది స్థాయి నేతలలో నెలకొని ఉంది. ఉద్యమ పార్టీగా మాత్రమే టీఆర్ఎస్ బలంగా ఉందనీ, ఆ తరువాత రాజకీయ పార్టీగా మారిన తరువాత బీఆర్ఎస్ నమ్ముకున్నది అధికారాన్ని మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కు ఆత్మ లాంటి తెలంగాణ పదానికి ఆ పార్టీ దూరమయ్యాకా పరిస్థితి మరింత దిగజారిందని అంటున్నారు.  ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. క్షేత్రస్థాయిలో క్యాడర్ సహా నేతల వరకూ పక్క చూపులు చూస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో అధికారంలో ఉంటే ఎదురే ఉండదన్నట్లుగా వ్యవహరించిన పార్టీ నాయకత్వం కారణంగానే కింది స్థాయి నాయకత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు చూస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎలా అయితే ప్రత్యర్థి పార్టీల నుంచి క్యాడర్ ను, లీడర్ ను ఆకర్ష్ పేరిట లాగేసుకుందో.. అదే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు కుప్పతెప్పలుగా చేరారు. అలాంటి వారే దాదానె 80శాతం మంది స్థానిక సంస్థలలో ప్రజా ప్రతినిథులుగా ఉన్నారు. అధికారానికి దూరంగా ఐదేళ్ల పాటు స్థానిక సంస్థల ప్రగతి, పురోగతిలో ముందుకు సాగడం కష్టమన్న భావనతో వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితులలో గ్రామీణ స్థాయిలో పట్టు నిలుపుకుని సాగడం బీఆర్ఎస్ కు అంత తేలిక కాదని అంటున్నారు.   అలాగే ఓటమి షాక్ నుంచి బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఓటమి అనంతరం ఇంత వరకూ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించడం కానీ, వారిలో భవిష్యత్ పట్ల భరోసా కలిగించే ప్రయత్నాలు కానీ జరగకపోవడంతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలు పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయారని, వారంతా పార్టీకి దూరం జరగాలన్న యోచనలో ఉన్నారనీ పరిశీలకులు అంటున్నారు.   అన్నిటికీ మించి పంచాయతీల్లో చేసిన పనులకు నిధులు మంజూరు కాకపోవడం, ఏకగ్రీవ గ్రామాలకు ప్రోత్సాహకాలు అందకపోవడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న స్థానిక నేతలు ఇక ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  

నగరి నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరంటే.. రోజాను పక్కన పెట్టేసిన జగన్!?

మంత్రి రోజాకు ఈ సారి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవా? అంటే వైసీపీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది.  రోజాకు నగరి నుంచి పోటీకి అవకాశం లేదని పార్టీ అధినేత జగన్ ఇప్పటికే చెప్పేశారని కూడా అంటున్నారు. నగరి నుంచి వైసీపీ అభ్యర్థిగా  శ్రీశైలం దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌  రెడ్డివారి చక్రపాణిరెడ్డిని వచ్చే ఎన్నికలలో రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. ఈ విషయం దాదాపు ఫైనల్ అయిపోయిందని చెబుతున్నారు.  నగరిలో రోజాకు ఎదురుగాలి వీస్తున్నదనీ, ప్రజలలో వ్యతిరేకతే కాకుండా రోజా అభ్యర్థిత్వాన్ని పార్టీ కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారన్న నివేదికల ఆధారంగా ఆమెకు బదులుగా రెడ్డివారి చక్రపాణి రెడ్డిని నగరి నుంచి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  సిట్టింగులను మార్చేసి ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే 11 మందిని మార్చేశారు. ముందు ముందు మరింత మందిని మారుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ నిర్ణయాలతో పార్టీలో అసంతృప్తి భగ్గుమంటున్నా ఖాతరు చేయడం లేదు. తదుపరి మార్పుల్లో మంత్రి రోజా స్థానం కూడా గాయబ్ కావడం ఖాయమని చెబుతున్నారు. నగరి నుంచి ఆమె ను మార్చడమే కాదు.. ఆమెకు ఈ సారి ఎక్కడ నుంచీ పోటీ చేసే అవకాశం లేదని కూడా అంటున్నారు. అయితే పార్టీలో సముచిత హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే.. మంత్రి రోజాకు తనకు టికెట్ నిరాకరించడం కంటే.. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా రాజీకీయాలు చేసిన రెడ్డివారి చక్రపాణి రెడ్డికి టికెట్ ఇవ్వడంమే ఎక్కువగా బాధకలిగిస్తోందని అంటున్నారు. అయితే చక్రపాణి రెడ్డికి చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఉండటంతో రోజా మాట చెల్లుబాటు కావడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  ఇప్పుడు రోజాను తప్పించి ఆమె స్థానంలో చక్రపాణి రెడ్డిని బరిలోకి దింపాలన్న జగన్ నిర్ణయంపై రోజా ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రోజా.. జగన్ నిర్ణయం వెలువరించిన తరువాత మౌనంగా ఉండే అవకాశాలైతే లేవని  ఆమె నైజం తెలిసిన వారు  అంటున్నారు. నిజంగానే నగరి నుంచి పోటీకి రోజాకు జగన్ టికెట్ నిరాకరించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మౌనంగా భరించడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నారని కొందరు అంటున్నారు. ఆమెకు తెలుగుదేశం కానీ, జనసేన కానీ రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెప్పే అవకాశాలు లేవనీ, జగన్ పొమ్మన లేక పొగపెట్టినా ఆమె వైసీపీ చూరు పట్టుకువేళాడాల్సిందే తప్ప రాజకీయంగా ఆమెకు మరో దారి లేదని అంటున్నారు.   నిజానికి రోజా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఆమె వాగ్ధాటి ఆమె పార్టీలో వేగంగా ఎదగడానికి దోహదపడింది. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమెకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే తెలుగుదేశం తరఫున రెండు సార్లు ఆమె అసెంబ్లీకి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. పార్టీలోనే తన వ్యతిరేకులు (గాలిముద్దుకృష్ణమ) తన ఓటమి కోసం పని చేశారన్న అసంతృప్తితో ఆమె రగిలిపోయారు. 2009లోనే ఆమె తెలుగుదేశం వీడి కాంగ్రెస్ గూటికి వెళ్లాలన్న ప్రయత్నాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కూడా ఆమెను కాంగ్రెస్ లో చేరేందుకు సానుకూలంగా స్పందించారు. అయితే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆమె హస్తం గూటికి  చేరలేదు. అయితే తరువాత ఆమె జగన్ పార్టీ వైసీపీలో చేరారు. 2014లో నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  అయితే వైసీపీ ఆ ఎన్నికలలో పరాజయం పాలు కావడంతో ఆమె విపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నారు. ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి. దాదాపు  ఏడాది పాటు ఆమె సభ నుంచి సస్పెండ్ అయ్యారు.  దీనిపై ఆమె కోర్టుకు వెళ్లినా ఆమెకు ఊరట లభించలేదు.  సరే 2019లో  తిరిగి నగరి నుంచి విజయం సాధించిన రోజాకు జగన్ మలి విడత కేబినెట్ లో స్థానం కల్పించారు.  మంత్రిగా కూడా రోజా తన విమర్శలు, వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఆమెకు టికెట్ నిరాకరిస్తే ఆమె స్పందన ఎమిటన్నది ఆసక్తికరంగా మారింది. 

ఏపీలో రెండు కొత్త పార్టీలు.. ప్రయోజనమేంటి? ప్రభావమెంత?

సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకువస్తుంటాయి. అది సహజమే. అలా పుట్టుకొచ్చేపార్టీల వల్ల ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది. ఏ పార్టీ నష్టపోతుంది అన్న చర్చలైతే జరుగుతాయి. అలాగే ఏపీలో మరోమూడు నాలుగు నెలల్లో  అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరణంలో ఏపీలో నూతనంగా ఆవిర్భవించిన రెండు పార్టీలపై విస్తృత చర్చ జరుగుతోంది. కొత్తగా ఆవిర్భవించిన రెండు పార్టీలలో ఒకటి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ నేషనల్  పార్టీ కాగా, రెండోది సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డి స్థాపించిన  తెలుగు సేన  పార్టీ. ముందుగా జైభారత్ నేషనల్ పార్టీ విషయాన్ని తీసుకుంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్థన్ రెడ్డి కేసుల దర్యాప్తుతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా జేడీ లక్ష్మీనారాయణగా   పాపులర్ అయ్యారు. ఆయన అసలు పేరు వీవీ లక్ష్మీనారాయణ అయినా అందరూ ఆయనను జేడీ లక్ష్మీనారాయణగానే గుర్తు పడతారు. అటువంటి జేడీ లక్ష్మీనారాణయ 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని  రాజకీయాల్లోకి వచ్చారు.  సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వివిధ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో   ప్రసంగాలతో  యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే సొంత రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన జనసేన పార్టీలో చేరి విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో జేడీ లక్ష్మీనారాయణ రెండున్నర లక్షల ఓట్లకుపైగా సాధించి మూడవ స్థానంలో నిలిచారు. వీవీ లక్ష్మీనారాయణ పోటీ చేయడం వల్ల జరిగిన క్రాస్ ఓటింగ్ కారణంగా విశాఖ లోక్ సభ స్థానం స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ గెలుపొందారు. టీడీపీ అభ్యర్ధి భరత్  పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుండి బయటకు వచ్చి స్వచ్చందంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. రాబోయే ఎన్నికల్లోనూ విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలన్న కృతనిశ్చయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన ఏ పార్టీలో చేరతారు అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్న సమయంలో జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీని ప్రారంభించడం సంచలనం సృష్టించింది.   ఈ పార్టీ అభ్యర్ధుల ప్రభావం ఏ రాజకీయ పార్టీపై పడుతుంది అన్నదానిపై చర్చ జరుగుతోంది.  తెలుగుదేశం, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉండే నియోజకవర్గాలలో నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు ఓటములపై  జై భారత్ నేషనల్ పార్టీ ప్రభావం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో జేడీ లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్ విధానాలను ప్రశంసిస్తూ చేసిన ప్రసంగాలతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన జగన్ పార్టీలో చేరతారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా సొంతంగా పార్టీ పెట్టడంతో ఆయన జగన్ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశంతోనే సొంత పార్టీ స్థాపించారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   గతంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోక్ సత్తా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధులను పోటీ పెట్టినా ఆయన ఒక్కడు మాత్రమే విజయం సాధించారు. కానీ ఆ పార్టీ అభ్యర్ధుల ప్రభావం చాలా నియోజకవర్గాల్లో నాటి ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులపై పడిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని జై భారత్ నేషనల్ పార్టీ లక్ష్యంకూడా అదేనా అన్న రీతిలో వారి విశ్లేషణలు సాగుతున్నాయి.  ఇక మరో కొత్త  పార్టీ తెలుగుసేన విషయానికి వస్తే ఈ పార్టీని సీనీ దర్శక, నిర్మాత సత్యారెడ్డి  స్థాపించారు.   అయ్యప్ప దీక్ష, ప్రశ్నిస్తా, సర్దార్ చిన్నపరెడ్డి సహా 53 సినిమాలు తీసిన సత్యారెడ్డి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను   అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు  ప్రకటించారు.  కొద్ది నెలల క్రితం పుంగనూరుకు చెందిన పారిశ్రామిక వేత్త బొడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ ఆవిర్భవించింది. రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలువనున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుండగా, తెలుగుదేశం, జనసేన పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆవిర్భవించిన కొత్త పార్టీల ప్రభావం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అన్న చర్చ జరోగా సాగుతోంది.

సీఎం రేవంత్ కు కరోనా పరీక్షలు

కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలకు కరోనా వ్యాప్తి కట్టడికి సూచనలు చేసింది. కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జలుబు, దగ్గు జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే వైద్యులు ఆయన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినట్లు సమాచారం. కరోనా కొత్త వేరియంట్ జెఎన్1 వేగంగా వ్యాప్తి చేందుతున్న తరుణంలో రేవంత్ అస్వస్థతకు గురి కావడం, ఆయనకు వైద్యులు కరోనా టెస్టులు చేయడతో కాంగ్రెస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. రేవంత్ కు కరోనా పాజిటివ్ వస్తే ఇటీవలి కాలంలో ఆయనతో సమీక్షల్లో పాల్గొన్న అధికారులు, మంత్రులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.   కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జేఎన్.1 వేరియంట్‌తో పలువురు  ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా 12 (డిసెంబర్ 24) కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్‌లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ప్రస్తుతం తెలంగాణలో 38 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం 1322 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున చిన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఉంటే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. ఇలా ఉండగా రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారనే వార్తల్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది.   సీఎం రేవంత్‌ అస్వస్థతకు లోనయ్యారని,   జ్వరం వచ్చిందని, గొంతు నొప్పితో బాధపడుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.   వాస్తవానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. 

వైసీపీకి భారీ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా?

ఎన్నికల ముంగిట ఏపీలో అధికార పార్టీ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీకి ఈసారి అధికారం దక్కడం గగనమేనని ఇప్పటికే ఎన్నో సర్వేలు తేల్చేశాయి. వైసీపీ సొంత సర్వేలలో కూడా ఓటమి తప్పదని తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు ఏపీ ప్రజలు సిద్ధమైపోయారు. అయితే  జగన్ మాత్రం ఎలాగైనా కనీసం పరువు నిలుపుకునే స్థానాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆయన వేస్తున్న ఎత్తులు మొదటికే మోసం తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.   ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు ద్వారా ప్రజా వ్యతిరేకతను ఏదో ఒక మేరకు తగ్గించుకోవచ్చన్న వ్యూహంతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగు ఎమ్మెల్యేల మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొలి విడతగా 11 మందిని నియోజకవర్గాలు మార్చేసిన జగన్.. ఇప్పుడు రెండో విడతలో 40 మందిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లగా తెరుచుకోని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఇప్పుడు అభ్యర్థులతో చర్చల కోసం తెరుచుకున్నాయి. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు, జిల్లాల వారీగా ఈ సీట్ల మార్పుపై వైసీపీ పెద్దలు కసరత్తులు చేస్తున్నారు.  కొందరు అభ్యర్థులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా.. మిగతా వారిని వైసీపీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వారు ఓదార్చి బుజ్జగిస్తున్నారు. జగన్ నిర్ణయాలను కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు తిరుగుబాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  కొందరు సీనియర్లు, మంత్రులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.  ఇంకొందరు అసలు  పోటీకే దూరమని చేతులెత్తేస్తున్నారు. జగన్ కు అంత్యంత సన్నిహితులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇప్పటికే శాసన సభ్యత్వానికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేయగా,   అదే బాటలో ఇప్పుడు మరికొందరు కూడా నడుస్తున్నారు.  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ రాజీనామాకు రెడీ అయిపోయారు.  వీరిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌లు తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు, ఇక  పిఠాపురం ఎమ్మెల్యే పెండం  దొరబాబు జనసేనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ ముగ్గురికీ వైసీపీలో ఈసారి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని జగన్ తేల్చి చెప్పడంతో వీరు ముగ్గురూ పార్టీకే గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోయారు.  తమకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు, పార్టీలో చేర్చుకుంటే చాలని వీరు తెలుగుదేశం, జనసేనలకు రాయబారం పంపినట్లు  తెలుస్తున్నది. జగన్ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని కూడా వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.  జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పటికే కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. జనవరి 5న ఆయన సైకిలెక్కేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో   పర్వత ప్రసాద్ తెలుగుదేశం గూటికి,  పెండం  దొరబాబు జనసేనలోనూ చేరబోతున్నట్లు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.  గడప గడపకి వైసీపీ, మా నమ్మకం నువ్వే జగన్, సాధికారిక బస్సు యాత్రల పేరిట వైసీపీ గత ఆరు నెలలుగా ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలలో తిప్పారు. ప్రజల నుండి వ్యతిరేకతలు వచ్చినా సర్ది చెప్పుకున్నారు. కొన్ని చోట్ల చీదరింపులు ఎదురైనా  ఓర్చుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేతను ప్రజలు ఎమ్మెల్యేలపై  చూపి చీవాట్లు పెట్టినా ఎలాగోలా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో విజయవంతం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ  చివరికి అధిష్టానం టికెట్లు లేవని చేతులెత్తేయడమో,  లేదంటే ఇక్కడ కాదు మరోచోటకి వెళ్లాలని ఆదేశించడమో చేస్తుండటాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు  జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సొంత నియోజకవర్గంలోనే తమకి పట్టు ఉందని.. స్థానం మారితే తమకి భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యేలు ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోకపోవడంతో   ఇక వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని నిర్ణయించుకొని బైబై చెప్పేస్తున్నారు.తెగతెంపులు చేసేసుకుంటున్నారు.  అవతలి పార్టీలలో టికెట్లు దక్కవని తెలిసినా.  ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయినా కనీసం ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని సర్దుకుపోతున్నారు. ఈ ముగ్గురే కాదు కనీసం   ముప్పై మందికి తక్కువ కాకుండా వైసీపీ సిట్టింగు ఎమ్మెల్యేలు  రాజీనామాల బాటలో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వైసీపీతోనే యుద్ధం.. జగన్ ఓటమే షర్మిల లక్ష్యం!?

జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందా? జగన్ వదిలిన బాణం ఇప్పుడు తిరిగి ఆయనే లక్ష్యంగా దూసుకొస్తోందా?  అప్పుడు అన్న గెలుపు కోసం చెమటోడ్చిన చెల్లెమ్మ ఇప్పుడు ఆ అన్న ఓటమి కోసమే కంకణం కట్టుకున్నారా? అంటే రాజకీయవర్గాల నుంచీ, విశ్లేషకుల నుంచే కాదు.. సామాన్య జనం నుంచి కూడా అవుననే సమాధానం వస్తోంది. అయితే ఎవరిలోనూ పాపం జగన్ అన్న సానుభూతి కనిపించడం లేకపోగా, హమ్మయ్య ఇప్పటికైనా  వాస్తవం గ్రహించి సరైన దిశలో అడుగులు వేస్తున్నారంటూ షర్మిలకు మద్దతు కనిపిస్తోంది.  ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల.. జగన్ జైల్లో ఉండగా ఆ  పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి అదే షర్మిల గాఢంగా అదే జగన్ ఓటమిని కోరుకుంటున్నారు. తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల.. అదే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే పరాయి రాష్ట్రంలో రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు చంచల్‌గూడ జైల్లో ఉంటే.. సోదరుడి కోసం రాష్ట్రవ్యాప్తంగా షర్మిల కాళ్లరిగేలా పాదయాత్ర చేశారు. గొంతు చించుకుని పార్టీ కోసం ప్రచారం చేశారు. తీరా జగన్ అధికారంలోకి వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది.  షర్మిలను రాష్ట్రం నుంచి తెలంగాణకు తరిమేశారు. పోనీ అక్కడ సొంత కుంపటి పెట్టుకుని తన మానాన తాను వెడుతుంటే.. అక్కడా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.    షర్మిల విషయంలో జగన్ ఏరు దాటేదాకా అన్న సమెతలా వ్యవహరించారని జనం నమ్మారు.   ఇప్పుడు వైఎస్ జగన్ వేరు.. వైఎస్ షర్మిల వేరు.  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తన భర్త రాష్ట్రమైన తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రవేశం చేసినా, అక్కడ రాజకీయంగా గుర్తింపు కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ, ఆమెకు ఆశించిన రీతిలో ఆదరణ దక్కలేదు. దీంతో తన తండ్రికి గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ గూటికే వెళ్లాలని నిర్ణయించుకోగా.. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, కాంగ్రెస్ పెద్దలను పలుమార్లు కలవడం అన్నీ జరిగిపోయాయి. కానీ, చివరి నిమిషంలో అది జరగలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. అలా ఉండటం ద్వారా జగన్ అనుంగు మిత్రుడైన కేసీఆర్ ఓటమికి పరోక్షంగా సహకరించారు. అప్పుడే షర్మిల నిర్ణయం ఏపీలో వైసీపీకి ఏ మాత్రం నచ్చలేదు. తెలంగాణలో షర్మిల తీసుకున్న నిర్ణయానికి ఏపీలో వైసీపీ నేతలు ఉలిక్కిపడి  ఆమెపై అవాకులు చవాకులు  పేలారు. ఆ ఎన్నికలు అయిపోయాయి. అక్కడ షర్మిల మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆమె సొంత రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. దీంతో సహజంగానే ఆమె అడుగులు ఎటువైపు అనే ఆసక్తి మొదలైంది. నిజానికి ఇప్పుడు షర్మిల రాజకీయ అడుగులు ఏపీలో తీవ్ర ఉత్కంఠగా మారాయి. ఎందుకంటే ఆమె భవిష్యత్ నిర్ణయాలు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గత కొన్నాళ్ళుగా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నట్లు ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటే.. అన్న వైసీపీకి తీరని నష్టం తప్పదు. కనీసం నాలుగు ఐదు శాతం ఓటింగ్ షేర్ కాంగ్రెస్ దక్కించుకున్నా వైసీపీకి ఘోర ఓటమే ఎదురవుతుంది. దీంతో వైసీపీలో షర్మిల అంటే వణుకు  మొదలైంది. షర్మిల ఇప్పటికే ఏపీలో రాజకీయ పునఃప్రవేశం కోసం ఏర్పాట్లు  చేసుకున్నారని.. సంక్రాంతి తర్వాత షర్మిల  ఏపీలో ప్రత్యక్ష రాజకీయాలలో చురుకుగా వ్యవహరించనున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలు అలా ఉండగానే.. షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఏపీ రాజకీయాలలో పెను సంచలనం కలిగించింది. వైసీపీలో అయితే ఇక తమ పని అయిపోయిందన్న భయాన్ని కలిగించింది. ఈ గిఫ్ట్ ద్వారా షర్మిల తన అన్న జగన్ కు డేంజర్ బెల్స్ మోగించారని, ఆమె ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం కాకుండా నేరుగా జగన్ కు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం గూటికే చేరనున్నారని ఈ గిఫ్ట్ ద్వారా స్పష్టమైన సంకేతాలను పంపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తద్వారా జగన్ కు పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి షర్మిల రెడీ అయిపోయారనీ అంటున్నారు.  షర్మిల తెలుగుదేశం గూటికి చేరడమే కాదు, ఆ పార్టీ అభ్యర్థిగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు ముద్దాయి, తన మరో సోదరుడు వైఎస్ అవినాష్ కు ప్రత్యర్ధిగా పోటీలోకి దిగనున్నారని  ప్రచారం జరుగుతోంది. అందుకు   షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపడమే తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో షర్మిల కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పనిచేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాక బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెబుతూ  కేసీఆర్‌కు ఓ సూట్ కేసు గిఫ్ట్ గా పంపిచారు. అలాగే ఏపీలో ఎన్నికలు జరగబోతున్న వేళ జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు.  ఇందుకోసమే ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేశ్‌కు షర్మిల క్రిస్మస్ కానుకలు పంపించారు. తద్వారా తాను తన అన్న జగన్ తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీ అన్న సంకేతాన్ని పంపారు. షర్మిల లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడంపై ఇప్పటికే వైసీపీ నేతల తమకు మాత్రమే చేతనైన భాషలో విమర్శలు ఆరంభించేశారు. షర్మిల తన చర్య ద్వారా వైసీపీ ఓటమిని ఇప్పటికే ఖరారు చేసేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం చెల్లి మద్దతు కూడా పొందలేని జగన్ కు జనం మాత్రం ఎలా మద్దతుగా నిలుస్తారని అంటున్నారు.

కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభకు షర్మిల.. లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ సంకేతం ఇదేనా?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల క్రిస్టమస్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కానుక పంపారు. లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ పండుగ‌ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ నోట్ ను కూడా పంపారు. షర్మిల పంపిన క్రిస్మస్ కానుకను స్వీకరించిన నారా లోకేష్ ఈ విషయాన్ని  స్వయంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు ప్రియమైన షర్మిల గారు మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు.. నూతన సంవత్సరం కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం కోరుకుంటున్నదని ట్వీట్ చేశారు. అలాగే.. షర్మిలకు కూడా లోకేష్‌ గిఫ్ట్‌ పంపారు. ఇప్పుడు ఈ వార్త పెను సంచలనంగా మారింది.  కాంగ్రెస్ లో విలీనం, ఏపీ సారథ్య బాధ్యతలు వంటి విషయాలు వెనక్కు వెళ్లి షర్మిల ఏకంగా తెలుగుదేశం అభ్యర్థిగా కడప నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.    జనం దీనిని ఏపీ రాజకీయాలలో చోటు చేసుకోబోతున్న పెను మార్పులకు, సంచలనాలకు సంకేతంగా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ ను భావిస్తున్నారు.  ఈ విష‌యం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  త‌న అన్న   జగన్ మోహ‌న్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన నారా లోకేశ్‌కు ష‌ర్మిల క్రిస్మ‌స్ గిఫ్ట్‌లు పంప‌డం వెన‌క సంకేతం ఏంట‌నే చ‌ర్చ‌లు సహజంగానే తెరమీదకు వచ్చాయి.  గతంలో అన్న‌తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దిగేందుకు సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టారు. కానీ  చివ‌రి నిమిషంలో ఆమె ట్విస్ట్ ఇచ్చి కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. దీనిపై కూడా అప్పట్లో పరిశీలకులు పలు రకాల విశ్లేషణలు చేశారు. అంతకు ముందు అసలు షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు కూడా కథనాలొచ్చాయి. అందుకు తగ్గట్లు అప్పట్లో చర్చలు, ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ, అనూహ్యంగా విలీనం ప్రస్తావన ఆగిపోవడం, తెలంగాణ ఎన్నికలలో కూడా షర్మిల దూరంగా ఉండటం జరిగిపోయాయి. కాగా, ఇప్పుడు షర్మిలకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే షర్మిల ఏపీ రాజకీయాలలో పునః ప్రవేశం చేయనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు.  ఆ వార్తలు ఒక వైపు కొనసాగుతుండగానే.. ఇప్పుడు  నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్ బహుమతులు పంపించడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు, లేదా విలీనం ప్రతిపాదన సమయంలో షర్మిల రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నాలలో భాగంగానే అప్పట్లో షర్మిల ఈ తరహా ట్వీట్ చేసినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరిగింది.   ఇప్పుడు షర్మిల   లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపారన్న దానిపై పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.  షర్మిల తెలుగుదేశం అండతో లేదా, ఆ పార్టీ అభ్యర్థిగా కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ. దీనిపై   వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. షర్మిలపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పిస్తున్నాయి. వైఎస్ బిడ్డ తెలుగుదేశంలో చేరడమా అంటూ నిలదీస్తున్నాయి. ఇక జగన్ అభిమానినని చెప్పుకునే శ్రీరెడ్డి అయితే షర్మిలపై దూషణల పర్వానికి దిగారు. అయితే సామాజిక మాధ్యమంలో వైసీపీ శ్రేణుల విమర్శలకు, దూషణలకు నెటిజన్లు దీటుగా జవాబిస్తున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, కేంద్ర మంత్రి కాగలిగినపుడు..  కాంగ్రెస్ పార్టీలో సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, సీఎం జగన్ సోదరి షర్మిల తెలుగుదేశం నుంచి పోటీ చేయడం తప్పు ఎందుకు అవుతుందని నిలదీస్తున్నారు. అయితే   పోటీ, తెలుగుదేశం ప్రవేశం వంటి విషయాలపై షర్మిల నుంచి ఇప్పటి వరకూ సమర్ధన కానీ, ఖండన కానీ రాలేదు.   కానీ  ఈ నెల   21  సీఎం జగన్ పుట్టినరోజు వేడుకను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించారు.   వైసీపీ శ్రేణులు భారీగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైసీపీ నేతలతో పాటు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సైతం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.  అయితే జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు లేవు. .   కనీసం సోషల్ మీడియాలో కూడా షర్మిల తన అన్నకు  శుభాకాంక్షలు తెలియజేయలేదు. కానీ  క్రిస్మస్ పండగకు ఏకంగా లోకేష్ కు షర్మిల బహుమతులు పంపించారు. నిజానికి షర్మిల గతంలో వైసీపీ పాదయాత్ర సమయంలో లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలతో పాటు, వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అలాంటి షర్మిల ఇప్పుడు ఇలా బహుమతులు పంపడం ఒక విధంగా జగన్ కు తనకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ రిటర్న్ గిఫ్ట్ పంపడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా షర్మిల లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపించడం జగన్కు షాక్ అనడంలో సందేహం లేదు. మహాభారత యుద్ధంలో ఓటమి ముంగిట ఉన్న దుర్యోధనుడు ఒక్కొక్కరుగా హితులు, సన్నిహితులు బంధువులు దూరం కావడాన్ని తలచుకుని వగచిన సందర్భం గుర్తుకు వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు జగన్ కు కూడా కుటుంబంలో, పార్టీలో అందరూ కాకపోయినా అత్యధికులు ప్రతికూలంగా మారుతున్నారు. గత ఎన్నికలలోతన విజయానికి కర్త, కర్మ, క్రియగా స్వయంగా జగనే చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ప్రత్యర్థి శిబిరంతో చేతులు కలిపారు. ఇప్పుడు సొంత చెల్లి షర్మిల కూడా జగన్ కు తాను వ్యతిరేకమని లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ద్వారా తేటతెల్లం చేశారు.