గనుల సర్వేక్షణ సాంకేతికతలో బౌద్ధ అవశేషాల గుర్తింపు.. మల్లేపల్లి లక్ష్మయ్య
posted on Dec 23, 2023 4:41AM
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణలో గనుల కోసం చేపట్టే సర్వేక్షణంలో, బౌద్ధ స్థావరాల ఉనికిని కనిపెట్టడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శి, వి. ఎల్. కాంతారావుకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులోని ఎన్.ఎం.డి.సి లో కాంతారావును కలిసిన ఆయన భారత భూగర్భ సర్వేక్షణ అధికారులకు ఈ దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఇందుకు విఎల్ కాంతారావు సానుకూలంగా స్పందించారని లక్ష్మయ్య చెప్పారు.
యాదాద్రి -భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం, చాడ గ్రామంలో శాతవాహన, ఇక్ష్వాకుల కాలపు క్రీ. శ. 2-3 శతాబ్దాలు నాటి సున్నపు రాతి బుద్ధుని బొమ్మలు బయల్పడ్డాయనీ, అక్కడి పురాతన స్థలం దాదాపు 10 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొన్న లక్ష్మయ్య, ఆ స్థలంలో ఎంత మేరకు పురాతన కట్టడాలు ఉన్నాయో రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే చేపట్టాలని కాంతారావును కోరారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డిజైన్ ఇంచార్జ్ డి.ఆర్. శ్యాంసుందర రావు పాల్గొన్నారు.