లిక్కర్ స్కాం నిందితుడు పిళ్లై కి బెయిల్ 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు,వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి కోర్టు బెయిల్ ఇచ్చింది.భార్య అనారోగ్యంతో ఉందంటూ బెయిల్ కోసం పిళ్లై దరఖాస్తు చేసుకున్న పిటిషన్ పై సానుకూలంగా స్పందించింది. ఆసుపత్రిలో చేరిన భార్యను దగ్గరుండి చూసుకోవడం కోసం రెండు వారాలు బెయిల్ మంజూరు చేస్తూ  కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారు. పిళ్లై వెల్లడించిన వివరాలతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో 8 వారాల బెయిల్ కోసం పిళ్లై చేసుకున్న దరఖాస్తును సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్  విచారించారు. పిళ్లై తరఫున న్యాయవాది నితీశ్ రాణా బెయిల్ కోసం వాదనలు వినిపించారు. తన క్లయింట్ భార్య ఆసుపత్రి పాలైందని, ఆమెను చూసుకోవడానికి అయినవాళ్ళు ఎవరూ లేరని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పిళ్లై తరపున న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపించారు. రోగి అయిన తన భార్యకు మనోధైర్యం ఇవ్వడానికి, వైద్యసేవలు చేయడానికి మధ్యంతర బెయిల్ కోసం కోర్టును కోరారు.బిఆర్ఎస్  ఎమ్మెల్సీకల్వకుంట్ల  కవితకు  పిళ్లై సన్నిహితుడని  ఈడీ పేర్కొంది. 

గజ గజ వణుకుతున్న హైదరాబాద్ 

హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. చలితో నగరవాసులు గజ.. గజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది.రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతున్నాయి. పగటి పూట కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాకింగ్ కు వెళ్లేందుకు బయట అడుగుపెట్టాలంటే నగరవాసులు భయపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠంగా 27 డిగ్రీలు, కనిష్ఠంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. సోమవారం అత్యల్పంగా పటాన్‌చెరు, రామచంద్రాపురంలో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది.  రాంచంద్రాపురం 14.8, రాజేంద్రనగర్‌ 14.9 ,సికింద్రాబాద్‌ 15.4 , కుత్బుల్లాపూర్‌ 15.7, హయత్‌నగర్‌15.8, మల్కాజిగిరి 16.3, గాజులరామారం 16.3, కూకట్‌పల్లి 16.7,బేగంపేట 16.9

సార్వత్రిక ఎన్నికల తరువాతే నామినేటెడ్ పోస్టులు.. కాంగ్రెస్ నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఇప్పుడు మరో మూడు నెలలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్ఠి పెట్టింది. లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రం నుంచి అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చినా వెంటనే నామినేటెడ్ పోస్టల భర్తీ చేపట్టరాదని నిర్ణయించింది. అలాగే ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వారిని అకామిడేట్ చేయడానికి నామినేటెడ్ పోస్టుల పందేరం అన్న సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేంది. ఈ మేరకు తాజాగా జరిగిన పీసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వారు తమతమ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించి.. లోక్ సభ ఎన్నికలలో ఆయా సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని టార్గెట్ నిర్దేశించింది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఈ ఐదేళ్లు పని చేసేలా వారికి టార్గెట్ నిర్దేశించింది.   ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన వారిలో కొందరిని కేబినెట్ లోకి తీసుకుంటారనీ, అందుకోసం వారిని ఎమ్మెల్సీ చేసే అవకాశాలున్నాయనీ వచ్చిన, వస్తున్న వార్తలకు కాంగ్రెస్ హై కమాండ్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులపై ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని విస్పష్టంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తేల్చి చెప్పింది.  ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల సమయంలో వారి నియోజకవర్గాల పరిధిలో పార్టీకి గణనీయంగా ఓట్లు పడేందుకు కృషి చేయాలని ఆదేశించింది.  

కాంగ్రెస్ టార్గెట్ జగన్.. ఏపీలో పావులు కదుపుతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ!?

దక్షణాదిలో కర్నాటక, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మూడో రాష్ట్రంపై కన్నేసిందా? అంటే ఔననే సమాధానమే వస్తుంది. అయితే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లా ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోగలుగుతుందా అంటే మాత్రం పరిశీలకులు అంత సీన్ లేదనే అంటున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ కు ఏ మాత్రం బలం పెరిగినా, అది అంతకు రెట్టింపు అధికార వైసీపీకి నష్టం చేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. తెలంగాణలో విజయంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బాగా బలహీనపడింది. తెలంగాణలో కోలుకుంది. విభజన జరిగిన పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.  ఇప్పుడు ఏపీలో కూడా పార్టీకి జవసత్వాలు నింపే పనిని కాంగ్రెస్ అధిష్టానం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ ఇప్పటినుంచే ఆ దిశగా ఫోకస్ మొదలు పెట్టింది. తాజాగా విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశంలో    మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ నుండి పరిశీలకులు వచ్చి వెళ్లడం పెరుగుతున్నది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీ కాంగ్రెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి బూస్టింగ్ ఇచ్చే పని మొదలు పెట్టారు. కర్నాటకలో విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగినట్లే.. తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఏపీ కాంగ్రెస్ నేతలలో ఉత్సాహం పెరిగిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఏపీలో కాంగ్రెస్ కు ప్రధాన సమస్య నేతల లోటు. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, సీనియర్లు రఘువీరారెడ్డి, జెడి శీలం, పల్లంరాజు, తులసి రెడ్డి లాంటి నేతలు ఉన్నా.. వారెవరూ ప్రజాకర్షణ ఉన్న నేతలు కాదు.  జగన్ వేరు కుంపటి అనంతరం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ నేతలు, క్యాడర్ వైసీపీ వైపుకు మళ్లింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాలంటే ముందుగా నేతలను ఆకర్షించాలి.  ఇప్పుడు అధికార వైసీపీలో నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ అధినాయకుడు జగన్ ఇష్టారీతిన అభ్యర్థులను మార్చేయడం ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. చివరికి మంత్రులను కూడా  నియోజకవర్గాలను మార్చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇప్పటికే జగన్ 11 మంది అభ్యర్థులను మార్చేయగా.. మరో 45 మందితో రెండో జాబితా కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం  90 మంది అభ్యర్థులను మార్చేస్తారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఓ ఎంపీ నివాసంలో వైసీపీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్లు వినిపిస్తున్నది. సంక్రాంతి తర్వాత వైసీపీ నుండి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. కొందరు ఇప్పటికే తెలుగుదేశం నేతలతో టచ్ లోకి వెళ్లారని.. త్వరలోనే వీరు సైకిలెక్కేస్తారనీ అంటున్నారు.  అయితే, తెలుగుదేశం, జనసేన పొత్తుతో వైసీపీ నేతలకు   పెద్దగా స్పేస్ లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ నేతలకు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అప్షన్ గా మారుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కాస్త ఫోకస్ చేస్తే వైసీపీకి వెళ్లిన వారిలో చాలామంది వెనక్కు వస్తారని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ఏపీలో వైసీపీ దారుణంగా పతనమవుతుంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి కనిపిస్తున్నది. ఇప్పుడు నేతలు కూడా అసంతృప్తితో పార్టీ నుండి వెళ్ళిపోతే ప్రభావం వైసీపీపై చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఇక వైసీపీకి ఘోరపరాజయం తప్పదు. వైసీపీ గత ఎన్నికల ఫలితాలలో కనీసం నాలుగు, ఐదు శాతం ఓటింగ్ ను కాంగ్రెస్ చీల్చగలిగినా,   వైసీపీకి  పాతిక సీట్లు  రావడం కష్టమే అవుతుంది. కనీసం రెండు మూడు శాతం ఓటింగ్ చీల్చినా పాతిక సీట్లు కూడా రావు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో వైసీపీకి మరో టెన్షన్ మొదలైంది. వైనాట్ ఏపీ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీని కోలుకోలేని దెబ్బ కొడుతుందా అనే చర్చ జరుగుతుంది.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  కొత్త స్టాంప్ విడుదల 

300 సంవత్సరాలకంటే ముందే బహుజన రాజ్యం కొరకు గోల్కొండ కోటను అధిరోహించి గోల్కొండ సింహసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. పాపన్న గౌడ్ ఒక గౌడ కులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడు.పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నారు. తాటి , ఈత చెట్ల పై అధిక పన్నులు వసూలు చేస్తున్న రజాకార్ల ఆగడాలు రోజురోజుకు శృతి మించడం వల్ల అది సహించని సర్దార్ సర్వాయి పాపన్న కేవలం 12 మంది సైనికులకు శిక్షణ ఇచ్చి వాళ్లతో పాటు 1260 సైన్యం గా మార్చుకొని యుద్ధం చేసి గోల్కొండ ని జయించారు. నల్గొండ జిల్లాలోని ఎన్నో కోటలను  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పరిపాలించారు. సర్వాయి పాపన్నగౌడ్   చాయ చిత్రాన్ని కేంద్ర ప్రభుత్వం ముద్రించింది. కేంద్ర ప్రభుత్వం నిన్న తపాలా శాఖ నుండి కొత్త స్టాంప్ రిలీజ్ చేసింది

ఇందిర బాటలో సోనియా...తెలంగాణ నుంచి లోకసభకు 

ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఫలితాల తరహాలోనే లోక్ సభ స్థానాలను అత్యధిక సంఖ్యలో గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో హృదయాల్లో వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించింది. ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీ వరుసగా రెండుపర్యాయాలు గెలిచిన టిఆర్ఎస్ (ఇప్పటి బిఆర్ఎస్) ను ఈ ఎన్నికలలో ఓడించారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక నాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ని తెలంగాణలో పోటీ చేయాలని తీర్మానించారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫెర్స్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసినట్లుగా ..ఇప్పుడు సోనియాగాంధీ కూడా తెలంగాణలోని ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని హస్తం పెద్దలు తీర్మానించారు. వచ్చే లోకసభ ఎన్నికలలో తన అత్త పోటీ చేసిన మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్ లో జంప్ అయిన విజయశాంతి పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి పోటీ చేయవచ్చని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఆమె గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మొదటి సారి టిఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. కెసీఆర్ తో విభేధించి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి మెదక్ నుంచి పోటీ చేయవచ్చనే ప్రచారం జరిగింది. 

లోకేష్ యువగళం.. మేకోవర్ ఆఫ్ ది లీడర్!

వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం పేరు నారా లోకేష్. ప్రత్యర్థుల ఎగతాళి మాటల నుండి పుట్టిన విస్ఫోటనం నారా లోకేష్. పని తీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్దత గల కార్యదక్షుడు లోకేష్. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ కక్ష పూరిత రాజకీయాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ, మూర్ఖ బుద్దితో ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో విసిగిపోయిన ప్రజలకు అండగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది.  సోమవారం(డిసెంబర్ 18) విశాఖలోని శివాజీనగర్ లో ఈ యాత్ర పరిసమాప్తం అయ్యింది. సాయంత్రం 5 గంటలకు శివాజీనగర్ లో శిలాఫలకం ఆవిష్కరించి పాదయాత్ర ముగించారు నారా లోకేష్. పాదయాత్ర ముగింపు సభ బుధవారం (డిసెంబర్20) జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. సభా వేదిక నిర్మాణ పనులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  భూమి పూజ చేశారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరౌతున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విజయోత్సవ సభకు తెలుగుదేశం శ్రేణులు తరలి వచ్చాయి.  గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు లోకేశ్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్ర ముగించారు. కాగా, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా 3,132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేశ్ యువగళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామాన్ని ఇచ్చి మళ్ళీ పునఃప్రారంభించి నేడు ముగిస్తున్నారు.  లోకేష్ పాదయాత్ర చిత్తూరులో 14 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు 577 కిమీ, అనంతపురం జిల్లాల్లో 9 నియోజకవర్గాల్లో 23 రోజులు 303 కిమీ, కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు 507 కిమీ, కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు 16 రోజులుపాటు 200 కిమీ, నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 31 రోజులుపాటు 459 కిమీ, ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో 17 రోజులపాటు 220 కిమీ, గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 16 రోజులుపాటు 236 కిమీ, కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 8 రోజులుపాటు 113 కిమీ, పశ్చిమగోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాలు 11 రోజులుపాటు 225.5 కిమీ, తూర్పుగోదావరి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 12 రోజులుపాటు 178.5 కిమీ, విశాఖపట్నం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 7 రోజులుపాటు 113 కిమీ మేర పాదయాత్ర సాగింది. లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో  కొత్త చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. లోకేష్ ఈ యాత్రతో ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ  భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు ప్రత్యర్ధులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజల నుండి పాదయాత్రకు లభించిన భారీ స్పందనే ఈ యాత్రను ఇక్కడ వరకు నడిపించింది. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడిచి, ఒక నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకున్నారు లోకేష్. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని నాయకుడిగా మరింత రాటుదేల్చాయని చెప్పొచ్చు. లోకేష్ పాదయాత్రలో కాళ్ల బొబ్బల కథలు లేవు.. వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్ మెంట్ల ప్రచారం లేదు. కాళ్లకు బొబ్బలని, చేతులకు గాయాలని డ్రామాలు, సెంటిమెంట్ రగిల్చేందుకు ప్రయత్నాలూ లేవు. కావాలని ప్రత్యర్థులను తూలనాడి అల్లర్లు చేయడం అసలే లేదు. పెయిడ్ ఆర్టిస్టులతో సెంటిమెంట్ పండించేందుకు నాటకాలు లేవు.  పాదయాత్ర వెళ్లిన చోట పేదవాళ్ళు పెట్టే బుక్కెడు బువ్వను కడుపులోకి పోకుండా పెదవులను తాకించి ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు. కేవలం ప్రజల సమస్యలే ధ్యేయంగా పదునైన మాటలతో ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేశారు. లోకేషా.. పాదయాత్రనా అని ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే శభాష్ లోకేష్ అనిపించుకున్నారు.   పగలు పాదయాత్ర, సాయంత్రం సభ, విరామ సమయంలో నేతలు, కార్యకర్తలతో మాటా మంతీ.. ఇలా ఆయన పాదయాత్రలకు కొత్త నిర్వచనం చెప్పారు. మొత్తంగా పాదయాత్రకు ముందు లోకేష్ వేరు. పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. మాట తీరు మారింది.. నడవడిక మారింది. నేతలను ఆప్యాయంగా పిలవడం తెలిసింది.. ప్రజలకు అండగా ఉండడం తెలుసుకున్నారు. లోకేష్‌ ఒక పరిపూర్ణ నేతగా తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఈ పాదయాత్ర ఎంతగానో దోహదపడింది.  పరిణితి చెందిన, విలువలు తెలిసిన నాయకుడిగా పరిశీలకుల మన్ననలందుకుంటున్నారు లోకేష్

పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే సీట్లివేనా?

తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చేసిందా? చంద్రబాబు పవన్ కల్యాణ్ తో ఆదివారం ఆయన నివాసంలో జరిపిన భేటీలో సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి వచ్చేశారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోయే సీట్ల సంఖ్యపై ఒక అవగాహనకు వచ్చేశారా అన్న ప్రశ్నలకు తెలుగుదేశం, జనసేన వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తున్నది. ఈ భేటీలో ఇరువురు నేతల మధ్యా సీట్ల సర్దుబాటుపైనే చర్చ జరిగిందనీ, పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు, నియోజకవర్గాలపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఏవో ఒకటి రెండు నియోజకవర్గాల విషయంలో  ప్రతిష్ఠభన ఏర్పడినా  చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిం చుకోవచ్చని వాటిని పక్కన పెట్టేశారనీ, మొత్తంగా ఇరు పార్టీల జాబితా ఒకే సారి ప్రకటించే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చారనీ అంటున్నారు.    ఇప్పటి వరకూ బీజేపీ కలిసి వస్తుందన్న భావనతో వేచి చూసే ధోరణి అవలంబించిన జనసేనానికి ఇక ఆ యోచనకు స్వస్తి పలికి తెలుగుదేశంతో మాత్రమే కలిసి సాగాలన్న అభిప్రాయానికి వచ్చేశారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా పేచీల్లేకుండానే ఒక ఒప్పందానికి జనసేనాని వచ్చేశారని చెబుతున్నారు. ఇక విషయానికి వస్తే తెలుగుదేశం, జనసేన వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తుంది. ఆ వర్గాల సమాచారం మేరకు టెంటటివ్ గా జనసేన పోటీ చేసే ఓ 20 స్థానాలు కూడా ఖరారైపోయాయి.  గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి. తెనాలి కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు విశాఖ జిల్లాలో పెందుర్తి, గాజువాక, చోడవరం చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా, తిరుపతి ప్రకాశం జిల్లాలో  దర్శి, గిద్దలూరు ఇక మిగిలిన స్థానాలలో జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రెండు పార్టీల వర్గాల ద్వారా తెలుస్తోంది.  

మూడు వేల సంవత్సరాల బాహుబలి   ఖడ్గం .. !    

జర్మనీలోని బవేరియాలోని నార్డ్లింగెన్ పట్టణంలోని ఒక సమాధి లోపల మూడు వేల  సంవత్సరాల నాటి ఖడ్గం బయటపడింది. మూడు వేల సంవత్సరాల ఖడ్గం నేటికి చెక్కు చెదరకుండా ఉండటం పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది .   బవేరియా స్టేట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ విభాగం అధిపతి మథియాస్  ఈ సందర్బంగా  మాట్లాడుతూ.. ఇది అసాధారణమైన విషం అని దీనిపై మరింత పరిశోధన   జరపాల్సి అవసరం ఉందని తెలియజేశారు.కాంస్యయుగానికి చెందిన వేల ఏళ్లనాటి ఖడ్గం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. జర్మనీలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఆ ఖడ్గం దాదాపు 3 వేల ఏళ్లక్రితం నాటిదని చెబుతున్నారు. అయితే ఆ ఖడ్గం ఇప్పటికీ ఏమాత్రం వన్నెతగ్గకుండా ధగధగలాడుతూ శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించింది.

కమలంలో కుమ్ములాటలు? లోక్ సభ ఎన్నికలలోనూ చతికిలపడ్డట్టేనా?

తెలంగాణ బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారైంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా  అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ దారుణంగా దెబ్బతింది. గతంలో కంటే అధికస్థానాలు గెలుచుకున్నాం, సార్వత్రిక ఎన్నికలలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నప్పటికీ ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగింపుతో మొదలైన ఆ పార్టీ పతనం అంతకంతకు దిగజారడమేగా కనిపిస్తున్నది. ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ వైపు మీడియా సమావేశాలు పెట్టి ప్రకటనలు గుప్పిస్తుంటే.. మరో వైపు లోక్ సభ టికెట్ల విషయంలో ఆ పార్టీలో పెద్ద ఎత్తున లొల్లి మొదలైంది. ముఖ్యంగా కరీంనగర్ లోక్ సభ స్థానంలో పోటీకి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ను నిలబెడితే తాము మద్దతిచ్చేది లేదని పలువురు సీనియర్లు ఇప్పటికే పార్టీ హై కమాండ్ కు అల్టిమేటమ్ ఇచ్చినట్లుగా పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఆ యన తన ఒంటెత్తు పోకడలతో పార్టీని భ్రష్టుపట్టించారని ఆయన వ్యతిరేకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో బండి మద్దతు దారులు మాత్రం బండిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన క్షణం నుంచే రాష్ట్రంలో బీజేపీ పతనం ప్రారంభమైందనీ, ఆ కారణంగానే రాష్ట్రంలో అధికారానికి దూరం కావడమే కాకుండా సింగిల్ డిజిట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే కరీంనగర్ పార్లమెంటు స్థానంలో పోటీ చేసి గెలిచే సత్తా బండికి కాక పార్టీలో మరెవరికి ఉందని సవాల్ విసురుతున్నారు.   బండి సంజయ్ కు ఈ సారి టికెట్ ఇవ్వొద్దంటూ బండిని వ్యతిరేకించే కొందరు  నాయకులు రహస్య సమావేశంలో తీర్మానం చేసినట్లు పార్టీ శేణులు చెబుతున్నాయి.   బండి సంజయ్ వ్యవహారశైలి  కారణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వెనుకబడ్డామని వారంటున్నారు.   అయితే ఆయన మద్దతు దారులు మాత్రం బండి సంజయ్ కారణంగానే తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ప్రత్యామ్నాయం అన్న స్థాయికి ఎదిగిందనీ, ఎప్పుడైతే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించారో అప్పటి నుంచే పార్టీ వెనుకబడిందని చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బండి సంజయ్ కరీంనగర్ నుంచి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన అభ్యర్థిగా ఉంటేనే కమలం పార్టీ గెలుస్తుందని లేకుంటే అంతే సంగతులని అంటున్నారు. రాష్ట్రంలో లోక్ సభ స్థానాలలో గెలిచే సీటు ఏదైనా ఉంటే అది కరీంనగర్ మాత్రమేననీ, అయితే బండి అభ్యర్థి కాకపోతే అక్కడా ఓటమే ఎదురౌతుందని అంటున్నారు.  ఈ పంచాయతీని బీజేపీ  హై కమాండ్ ఎలా పరిష్కరిస్తుందన్నది చూడాల్సిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి బండిని తప్పించి తప్పు చేశామని అధిష్ఠానం ఇప్పటికే గ్రహించిందని బండి మద్దతు దారలు అంటున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండిని స్టార్ క్యాంపెయినర్ ను చేశారని చెబుతున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాజయ పరాభవం నుంచి తెలంగాణ బీజేపీ గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు.

ఉగ్ర కుట్ర కోణం.. దేశ వ్యాప్తంగా ఎన్ ఐ ఏ సోదాలు 

దేశవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం సోదాలు చేస్తున్నారు. ఇస్లామిక్ టెర్రర్ గ్రూపు ఐసిస్ నెట్ వర్క్ ఛేదించే క్రమంలో ఈ దాడులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒక్క కర్ణాటకలోనే మొత్తం 11 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తుండగా.. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మహారాష్ట్రలోని 40 చోట్ల అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, నగదు, పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు పనిచేస్తున్న 15 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఒకరు ఐసిస్ సానుభూతి పరుడని, యువతను ఐసిస్ లో చేరుస్తున్నాడని గుర్తించారు. నిందితుడిని మరింత లోతుగా విచారించి సేకరించిన సమాచారంతో అధికారులు తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పవన్ ఇంటికి చంద్రబాబు.. ఇక ఉమ్మడి కార్యాచరణే!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ.. ప్రతిపక్ష  తెలుగుదేశం, జనసేన దూకుడు పెంచాయి. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఎప్పుడో పదేళ్ల కిందట ఆయన ఇలా పవన్ ఇంటికి వెళ్లగా.. మళ్లీ ఇప్పుడు వెళ్లారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటూ, చంద్రబాబు కూడా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆయనకు పవన్‌ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుమారు రెండున్నర గంటల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఈ భేటీ రాజకీయ వర్గాలలో సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది. ఈ భేటీలో ఏం చర్చించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.   ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల సన్నద్ధతపై వీరిరువురూ చర్చించారు. తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా బహిరంగ సభల‌ నిర్వహణపై కూడా వీరి భేటీలో  చర్చ జరిగిందంటున్నారు.   ఏపీలో మార్చిలోనే ఇంకా మాట్లాడితే ఫబ్రవరి చివరి వారంలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ  ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై బాబు, పవన్ భేటీలో చర్చ జరిగిందంటున్నారు.   ఉమ్మడి మేనిఫెస్టోలో ఏయే అంశాలు  పొందుపరచాలి?  మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి  ఎలా తీసుకెళ్లాలి తదితర అంశాలపైనా ఇరువురూ చర్చించినట్లు చెబుతున్నారు. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా కూడా విస్తృత చర్చ జరిగిందంటున్నారు. ఇద్దరూ కలిసి బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నట్లు చెబుతున్నారు. అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. బుధవారం (డిసెంబర్ 20) యువగళం ముగింపు సభ జరగనున్నది. ఆ తరువాత చంద్రబాబు, పవన్ ల ఉమ్మడి సభలు ఎప్పుడు, ఎక్కడెక్కడ అన్నది నిర్ధారణ అవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో పవన్ తో బాబు భేటీ  రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా విస్తృత చర్చకూ ఆస్కారమిచ్చింది. నిజానికి చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ తకెఱంలొ తెలుగుదేశం, జనసేన వారికి అండగా ఉంటే చాలు భారీ విజయం గ్యారంటీ అన్న భావన పరిశీలకులలోనే కాదు సామాన్యులలో కూడా వ్యక్తమౌతున్నది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పలుమార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించాయి. అలాగే సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది.  కానీ.. వీటి గురించి ఇరు పార్టీలు అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తొలిసారి పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో వేడి మొదలైంది. ఇక బుధవారం(డిసెంబర్ 20) విజయనగరం జిల్లాలో జరగనున్న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ జరగనున్నది. ఈ సభతో  తెలుగుదేశం ఎన్నికల శంఖారావం మోగిస్తుందని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు పేరిట నేతల నుండే అసంతృప్తిని ఎదురుకొంటున్న తరుణంలో ప్రతిపక్షాలు ఏకమై యుద్ధం ప్రకటించడం జగన్ కు సంకటంగా మారడం ఖాయమంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు, పవన్ భేటీ వైసీపీలో గుబులును ద్విగిణీకృతం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల.. సీమలో ప్రచారానికి మాత్రం దూరం!?

ఇప్పుడా, అప్పుడా అన్న మీమాంశ తొలగిపోయింది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం దాదాపు ఖరారైపోయింది. అందుకు ముహూర్తం కూడా ఫిక్సయ్యిందని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, అక్కడ నుంచి ఏపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారని చెబుతున్నారు. షర్మిల ఏపీ ఎంట్రీ కచ్చితంగా రాష్ట్రంలో అధికార వైసీపీకి తీరని నష్టం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలు ఎలా ఉన్నా.. ఏపీలోకి షర్మిల ఎంట్రీ మాత్రం నిస్సందేహంగా జగన్ కు కోలుకోలేని దెబ్బగానే ఉంటుందన్నది వాస్తవం. ఎందుకంటే.. విపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో షర్మిల వైసీపీ కోసం చేసిన సేవలను ఇప్పటికీ వైసీపీ శ్రేణులు మరచిపోలేవు. జగన్ జైలులో ఉండగా ఆమె రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రం చుట్టేశారు. అటువంటి షర్మిలను జగన్ అధికారంలోకి రాగానే దూరం పెట్టారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో షర్మిల తెలంగాణ వెళ్లి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆ సమయంలో కూడా జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు సరికదా, అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ కు మద్దతుగా తన పార్టీని ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంచారు.  అంతకు ముందు నుంచీ షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న వార్తలు వచ్చినప్పటి నుంచీ అది జరగలేదు. సరే ఇప్పుడు మాత్రం ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తన సోదరుడు జగన్ కు వ్యతిరేకంగా ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారని గట్టిగా వినిపిస్తోంది.  ప్రియాంకతో కలిసి ఏపీలో ఆమె ప్రచార సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాల నంచే సమాచారం అందుతోంది. బహిరంగ సభలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా (రాయలసీమ మినహా)ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారని చెబుతున్నారు.   తెలంగాణ శాసనసభ ఎన్నికలు  ముగిసి, కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచే కాంగ్రెస్ పెద్దలు షర్మిలతో ఏపీ రాజకీయాలలోకి ఆమెను ఆహ్వానిస్తూ సంప్రదింపులు జరుపుతున్నారనీ, రాజ్యసభకు పంపడం తో పాటు, ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి కట్టబెడతామని ప్రతిపాదిస్తున్నారని రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.   వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమంటూ జరిగితే.. పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారతాయి.  రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో  కాంగ్రెస్‌ స్థానాన్ని వైసీపీ ఆక్రమించింది. దీంతో ఏపీలో కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.  ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల రంగంలోకి దిగితే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏదో మేరకు పుంజుకుంటుందన్న భావన ఆ పార్టీ హైకమాండ్ లో ఉంది.  ఇప్పఇకే ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు స్టేక్ ఒక శాతం కంటే తక్కువే. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పరిస్థితీ అదే. అంటే ఏపీలో ఇప్పటికిప్పుడైతే పోటీ ద్విముఖమే. అంటే తెలుగుదేశం ప్లస్ జనసేన, వర్సెస్ వైసీపీ అన్నమాట. అదే షర్మిల కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుంటే.. వైసీపీలో అవమానాలు భరిస్తూ మరో గత్యంతరం లేక వైసీపీలో కొనసాగుతున్న  వైఎస్ అభిమానులు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ వారసుడిగా జగన్ ను అంగీకరించలేని వారికి కూడా కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయంగా మారుతుంది. వైఎస్ వారసురాలిగా షర్మిలను అంగీకరించే వారు కాంగ్రెస్ వైపు చూస్తారు. దీంతో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఓట్ షేర్ ఏదో ఒక మేరకు పెరుగుతుంది. అది విపక్ష కూటమికి ఏమాత్రం నష్టం చేయదు కానీ, వైసీపీ బలాన్ని గణనీయంగా తగ్గించేస్తుంది. అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రచారం చేయడానికి సుముఖత వ్యక్తం చేసిన షర్మిల రాయలసీమకు దూరంగా ఉంటానన్న షరతు ఎందుకు పెడుతున్నారన్న విషయంపై రాజకీయవర్గాలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద  షర్మిల ఏపీ రాజకీయాలలో క్రీయాశీలం కానున్నారన్న వార్తే వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 

ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో అసెంబ్లీ సెషన్

దాదాపు దశాబ్దం తరువాత భారత్ లో ప్రజాస్వామ్యం ఇంకా ఉందన్న నమ్మకం కలిగేలా ఒక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. నిజం 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత దేశంలో చట్ట సభల తీరు దారుణంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరిన తరువాత చట్ట సభల నిర్వచనమే మారిపోయిందా అనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్లమెంటు సమావేశాల తీరులో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. విపక్షాలను మాట్లాడనీయకపోవడం, వారి అనివార్యంగా స్పీకర్ పోడియం ను చుట్టుముట్టే పరిస్థితులు వచ్చేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, తరువాత స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ విపక్ష  సభ్యులను సస్పెండ్ చేయడం. క్రమంగా ఈ తీరు బీజేపీ పాలిత రాష్ట్రాల అసెంబ్లీలకూ పాకింది. ఇక రాష్ట్ర విభజన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల అనంతరం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరితే.. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ అసెంబ్లీ అప్పటి నుంచీ ఏక వ్యక్తి ఆధిపత్యం అన్నట్లుగానే సాగింది. కేసీఆర్ కనుసన్నలలో అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. విపక్షంలో గట్టిగా మాట్లాడే వారిని సస్పెండ్ చేయడమే లక్ష్యమన్నట్లుగా అధికార పార్టీ తీరు ఉండేది. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందనరావు వంటి వారు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టినప్పటికీ వారికి సభలో మాట్లాడే అవకాశం కాదు, అసలు సభలో కూర్చునే అవకాశం కూడా లేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో 2014 నుంచి 2019 వరకూ సభలో అనుచిత సంఘటనలు చోటు చేసుకున్నా.. సభా కార్యక్రమాల నిర్వహణ సజావుగా ఉండేందుకు అప్పటి అధికార పక్షం ప్రయత్నించింది. కానీ 2019 ఎన్నికలలో విజయం సాధించిన జగన్ పార్టీ.. అసెంబ్లీ నిర్వహణను పూర్తిగా సొంత వ్యవహారంగా పరిగణించింది. స్పీకర్ తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. నిత్యం విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, ఏకపక్షంగా ప్రసంగాలతో అసెంబ్లీ సమావేశాలంటేనే జనం పట్టించుకోవడం మానేసేలా పరిస్థితి మారిపోయింది.  ఇక రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలంటే ప్రజలకే కాదు, ఎమ్మెల్యేలకు కూడా ఆసక్తి లేదనిపించేలా పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ  జరిగినన్ని రోజులూ అసెంబ్లీ కళకళ లాడుతూ ఉండేది. అర్థరాత్రి వరకు చర్చలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సభ్యులు కూడా ఉత్సాహంగా చర్చలో పాల్గొనే వారు.  అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ప్రజా సంఘాల హడావిడి కనిపించేది. ఇందిరా పార్క్  వద్ద ‘ధర్నా చౌక్’ ఉన్నంత వరకు  అనేక ప్రజా సంఘాల ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ఉండేది. అలాగే, సామాన్య ప్రజల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగతున్నాయంటే, అదో రకమైన ఉత్కంఠ ఉండేది. అయితే రాష్ట్ర విభజన తరువాత పరిస్థితి మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలంటే ఒక మొక్కుబడి తంతు అన్నట్లుగా తయారైంది.  ఆరు నెలలకు ఒకసారి తప్పక అసెంబ్లీ సమావేశం కావాలనే రాజ్యాంగ నిబంధన ఉడడం వల్ల కా నీ లేకుండా  అసలు అసెంబ్లీ సమావేశాలే అవసరం లేదన్నట్లుగా అప్పటి ప్రభుత్వం తీరు ఉండేది. అందుకే సభకు సభ్యుల హాజరు అతి తక్కువగా ఉండేది.   అటువంటి పరిస్థితుల్లో తాజా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచి ప్రత్యేక తెలంగాణలో మూడో అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రత్యేకత చాటుకున్నాయి. కనుమరుగైపోయిన సభా సంప్రదాయాలు, విలువలు మళ్లీ తెరపైకి వచ్చాయి. విపక్షం రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా అధికార కాంగ్రెస్ సంయమనంతో వ్యవహరించింది. విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తూనే, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపింది. సస్పెన్షన్ల మాటే ఉండదనీ, తమ ప్రభుత్వం విపక్షాల సూచనలను స్వీకరిస్తుందనీ, ఏ అంశంపైనైనా సరే చర్చకు ముందుకు వస్తుందనీ, విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయదనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చర్చ జరిగింది. చర్చలో ఎవరిది పైచేయి అన్నది అప్రస్తుతం. అసలు అసెంబ్లీలో చర్చలు జరిగే వాతావరణమే గత పదేళ్లుగా కనిపించలేదు. అటువంటిది కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే ముందు ముందు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది తెలిసిపోయింది. చర్చలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా అసెంబ్లీ జరుగుతుందన్న నమ్మకం  ఏర్పడింది. ఈ తీరు మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ప్రజాస్వామ్య వాదులు ఆకాంక్షిస్తున్నారు. 

కాంగ్రెస్ నేతలకు లేని బాధ కేటీఆర్ కు ఎందుకు?

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఓ అలవాటు ఉంది. సబ్జెక్టు ఏదైనా ఆయన మొదలు పెడితే ఎదుటి వాళ్ళు ఆయన మాట వినే వరకూ వదిలి పెట్టరు. ముందు మొండిగా వాదన మొదలు పెట్టి.. అవసరమైతే ఎదుటి వాళ్లను బుకాయించి, గదమాయించి, బలవంతంగానైనా తన మాటే నిజం అనేలా చేసుకొని, చివరకు అవతలి వాళ్ళను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇక కేసీఆర్ కు మరో అలవాటు కూడా ఉంది. ముందుగా శత్రు వర్గాన్ని విభజించి ఒక్కొక్కరినీ తనకి అనుకూలంగా మార్చుకొని.. తన వైపు రానివాళ్ళని వాళ్ళ వర్గంతోనే దెబ్బ తీస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్ ఈ వ్యూహాన్ని మొదలు పెట్టగా.. ఆ తర్వాత కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలందరూ ఇదే వ్యూహంతో రాజకీయం చేస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టినా బీఆర్ఎస్ తమ పాత పద్దతులను వ్యూహాలను మర్చిపోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సభ వాడీవేడీగా సాగింది. కాగా, బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలో కూర్చున్నా.. బహుశా తామింకా అధికారంలోనే ఉన్నామనే భావనలో ఉన్నట్లు కనిపించారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులో అది స్పష్టంగా కనిపించింది. వీరి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, మాటలు చూస్తే తామింకా అధికారంలోనే ఉన్నామనే భ్రమల్లో ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చల్లో కేటీఆర్ , హరీష్ మాట్లాడిన మాటలు, వాళ్ళ బాడీ ల్యాంగ్వేజ్ చూస్తే ఆశ్చర్యమేసింది. పదేళ్ళ కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వివిధ శాఖలు చేసిన అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడుతుంటే.. కేటీఆర్, హరీష్ మాత్రం పదేళ్ళకు ముందు  అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కర్నాటకలో ప్రభుత్వ పాలన, ఇందిరాగాంధి హయాంలో జరిగిన విషయాలపై ప్రస్తావిస్తూ   బుకాయింపు మాటలతో సభను, చర్చను పక్క దారి పట్టంచాలని చూశారు.  ఇక, కేటీఆర్ అయితే తన తండ్రి విభజించు పాలించు అన్న సిద్దాంతాన్ని ఫాలో అయినట్లు కనిపించింది. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మా భట్టి అన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి అన్న అంటూ మంత్రులను సంబోధిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వచ్చేసరికి సీఎం గారు అంటూ సంబోధించారు. అన్న అంటూ సంబోధించడం మంచిదే కదా అనుకుంటే మంచిదే.. కానీ, ఒకే పార్టీకి చెందిన మంత్రులను అన్న అంటూ సంబోధిస్తూ.. రేవంత్ రెడ్డిని మాత్రం సీఎం గారు అంటూ సంబోధించడం చూస్తే.. మంత్రులందరూ మా వారే, సీఎం ఒక్కరే కాదు అని   కేటీఆర్ చెప్పకనే చెప్పారు. ఇక మంత్రులను పేరు పేరునా అన్నా అంటూ సంభోదిస్తూ.. వీరందరు కలిసి పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ అనే పుట్టలో దూరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారని వ్యాఖ్యానించారు. చీమలు పెట్టిన పుట్టలో పాము దూరి ఆక్రమించుకున్నట్లు ఉందని కేటీఆర్ పాత సామెతను కాంగ్రెస్ కు అన్వయించి చెప్పారు.  కేటీఆర్ మాట్లాడింది చూసేందుకు రేవంత్ వైపు వ్యతిరేకంగా కనిపించినా.. మిగతా కాంగ్రెస్ నేతలను ఇది రెచ్చగొట్టడం లాగానే కనిపిస్తుంది.  నిజానికి బీఆర్ఎస్ పార్టీ నేతలలో ఎక్కువ శాతం మిగతా పార్టీల నుండి వచ్చిన వారే.   ఉద్యమ వేళలో సమైక్య వాణిని వినిపించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారిని ఏరికోరి పార్టీలోకి తెచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. అలాంటిది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ స్వశక్తితో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఆయన సీఎం అయ్యారు. రేవంత్ సీఎం అంటే మిగతా కాంగ్రెస్ నేతల నుండి వ్యతిరేకత రాలేదు. కానీ, అదేంటో కేటీఆర్ కు ఇబ్బందిగా ఉన్నట్లు ఉంది. అయినా కాంగ్రెస్ వారికి లేని బాధ కేటీఆర్ కు ఎందుకని సొంత పార్టీ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి.  కానీ, కేటీఆర్ తన తండ్రి విభజించు పాలించు సిద్ధాంతాన్ని కాంగ్రెస్ నేతలపై ప్రయోగిస్తున్నట్లు  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంపు.. పేపర్లకే పరిమితమా?!

ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి  రూ.25 లక్షలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఈ విషయం ప్రకటించగా, ఇందుకు సంబంధించిన   ప్రత్యేక కార్యక్రమం సోమవారం (డిసెంబర్ 18) సీఎం చేతుల మీదుగా మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఈనెల 19 నుంచి నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించారు. ఇక ఈ కొత్త కార్డులపై జగన్ ఫోటోలను ముద్రించి పంచనున్నారు. ఈ కార్డుల పంపిణీ కార్యాక్రమం ప్రతీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లో జరిపించనుండగా ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొ్ంటారు.  కాగా, ఈ కార్డుల పంపిణీ జనవరి నెలాఖరు వరకు సాగుతుంది. జగన్ మోహన్ రెడ్డిని పేదల పాలిట పెన్నిధిగా, అపద్భాంధవుడిగా ఎక్కడికక్కడ వైసీపీ నేతలు కీర్తించడం కోసమే ఇప్పుడీ కార్యక్రమం చేపట్టినట్టు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆరోగ్య శ్రీ విలువ పెంచే సభకు, కార్డుల తయారీకి, కార్డుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయనుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉంది? ఏ జిల్లాలో ఏ ఆసుపత్రులలో ఈ వైద్య సేవ అమలు చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు? వైద్య పరీక్షలు, వైద్యం, అనంతరం తగిన మందులు కూడా ఆరోగ్యశ్రీలో భాగంగానే అందిస్తారా? మారిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి విధి విధానాలు ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న ఆసుపత్రులకు అందించారా? అనే విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. అలాగే అసలు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లిస్తున్నారా? ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆరోగ్య శ్రీ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఈ పథకాన్ని ఎంత మంది ప్రజలు వినియోగించుకున్నారు? జగన్ హయంలో ఇప్పటి వరకూ చెల్లించిన ఆరోగ్య శ్రీ నిధులెన్ని?  ప్రస్తుతం ఆరోగ్య శ్రీ బకాయిలెన్ని అన్నది కూడా జగన్ సర్కార్ ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే, నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోటాను కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు హయం వరకూ కాస్త ఆలస్యంగానైనా ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పలు మార్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రావాల్సిన బకాయిల సంగతెలా ఉన్నా.. ఇకపై తమకు ఆరోగ్యశ్రీనే వద్దంటూ కొన్ని ఆసుపత్రులను ఈ సేవ నుండి బయటకొచ్చేశాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవ తమ ఆసుపత్రికి కావాలంటూ దరఖాస్తుల వెల్లువెత్తగా, జగన్ హయాంలో   ఆరోగ్యశ్రీలో ఉన్న ఆసుపత్రులు ఆ సేవలను ఇక అందించలేమంటూ చేతులెత్తేశాయి.   ఇక మరి కొన్ని ఆసుపత్రులలో అయితే కేవలం వైద్యం మాత్రమే ఆరోగ్య శ్రీలో అందిస్తుండగా.. మిగతా వైద్య పరీక్షలు, మందులు వంటివి రోగుల వద్ద డబ్బులు కట్టించుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులలో అయితే ఆసుపత్రులలో అన్ని పరీక్షలు చేసే సదుపాయం ఉన్నా.. బకాయిలు రాక ఆరోగ్యశ్రీ పేషేంట్లను బయట ల్యాబులకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. కేవలం డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రి రూమ్ అద్దెలు వంటివి మాత్రమే ఆరోగ్యశ్రీలో అందిస్తున్నారు. వాటికి ఆసుపత్రుల యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే అవసరం లేకపోవడంతో.. ప్రభుత్వం నుండి బకాయిలు ఎప్పుడొచ్చినా   నష్టం ఉండదన్న ఆలోచనతో ఇలా ఆరోగ్యశ్రీలో కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ఆసుపత్రులైతే ప్రభుత్వం మారకపోతుందా.. కొత్త ప్రభుత్వంలో అయినా బిల్లులు రాకపోతాయా అని కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్య శ్రీని రూ.25 లక్షలకు పెంచితే ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లాకు పదుల సంఖ్యలో ఉన్న ఆరోగ్యశ్రీ.. ఇప్పుడు జిల్లాకు పది కూడా లేకపోగా.. ఉన్న వాటిలో కూడా వైద్యం అంతంత మాత్రమే. మరి రూ.25 లక్షలకు కాదు.. రూ.కోటికి పెంచినా ప్రయోజనం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.

తెలుగు ప్రజల పాలిట దైవ ప్రసాదం.. ముక్త్యాల రాజా

నాగార్జున సాగర్ లేనిదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు లేవు. ముఖ్యంగా సాగర్ లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం.. ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా  జిల్లాలు లేనే లేవు. ఇప్పుడంటే ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు పారిశ్రామికంగా ఎదిగాయి. కానీ, ఇండియాకి స్వాతంత్య్రం రాకముందు ఈ జిల్లాలలో నిత్యం కరువు తాండవించేది. పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కురిస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనేలా ఉండేది పరిస్థితి. ఇది చూసి చలించిన ముక్త్యాల రాజా వారు కృష్ణానదిపై ఓ ప్రాజెక్టు నిర్మించాలని కంకణం కట్టుకున్నారు. అప్పటికి ఇండియాలో స్వాతంత్య్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నది. అయినా రాజావారు పట్టువదలని విక్రమార్కుడిలా నాగార్జున సాగర్ నిర్మాణానికి ప్రయత్నించి చివరికి ఇండియాకి స్వాతంత్య్రం వచ్చాక ప్రాజెక్టు నిర్మాణాన్ని సాధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాగార్జున సాగర్ నిర్మాణానికి ముక్త్యాల రాజా  కృషి అంతా ఇంతా కాదు. ఆర్ధికంగా సొంత నిధులు ఇవ్వడంతో పాటు తానే స్వయంగా వందల కిలోమీటర్లు నడిచి తెలుగు రైతులను సంఘటితం చేసి ఈ ప్రాజెక్టును సాధించారు.  ముక్త్యాల రాజా అసలు పేరు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఎంతో పేరు ప్రతిష్ఠలు గల వాసిరెడ్డి వంశానికి చెందిన వారసుడు. ముక్త్యాల సంస్థనాధీశుడు. ముక్త్యాల రాజాను ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. తొలుత ముక్త్యాల రాజా కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తై ఉపయోగంలోకి వచ్చింది. అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కృష్ణానది నీటిని కూడా తమిళనాడుకు తీసుకువెళ్లేలా కుట్రలు చేసింది. ఇందులో భాగంగా తొలుత కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసేందుకు సిద్ధమైంది. ఇది తెలిసిన ముక్త్యాల రాజా  ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలలో ఊరూరూ తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. సొంత సొమ్ముతో రిటైరయిన ఇంజినీర్లను ఒక బృందంగా ఏర్పాటు చేసి  ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు సిద్ధం చేయించారు. నంది కొండ వద్ద ఆనకట్ట కడితే బహుళార్ధసాధకంగా ఉపయోగపడుతుందనీ,  తెలుగునేల అన్నపూర్ణగా మారుతుందని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించారు. మద్రాసు ప్రభుత్వం నాగార్జున సాగర్ నిర్మాణాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేసినా.. రాజా కృష్ణా రైతు  వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.  ఈలోగా దేశానికి స్వాతంత్య్రం రావడంతో ముక్త్యాల రాజా  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. విషయాన్ని గాంధీజీ, నాటి ప్రధాని జవాహర్లాల్ నెహ్రు, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. ముక్త్యాల రాజా ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ పరిశీలనకై   ఖోస్లా కమిటీని నియమించింది. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్లడానికి అనువైన దారి లేదనే సాకుతో   దాటవేయాలని చూశారు. దీంతో అప్పట్లోనే వేల రూపాయల సొంత ఖర్చుతో, 25 గ్రామాల ప్రజలను, స్వయంసేవకులను సమీకరించి వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి కార్లు వెళ్లేలా దారి ఏర్పాటు చేయించారు ముక్త్యాల రాజా. దీంతో ఖోస్లా కమిటీ నందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టుకు అనువైన స్థలమని తేల్చారు. ఆ తర్వాత కూడా ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టేందుకు ఢిల్లీలో ప్రయత్నాలు జరిగాయి.అయితే ముక్త్యాల రాజా   ఢిల్లీలో ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య వంటి పార్లమెంటు సభ్యులతో ఆ రిపోర్టులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషన్ సభ్యులను ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పించారు.  అలాగే అప్పటి ఏపీ గవర్నరు చందూలాల్ త్రివేదిని ఒప్పించి ప్రధాని నెహ్రూను ప్రభావితం చేయడంతో 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోద ముద్ర లభించింది. 1955 డిసెంబరు 10న ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 11 ఏళ్ల తర్వాత 1966 ఆగస్టు 3న ప్రాజెక్టు నుండి నీరు వదిలారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ముక్త్యాల రాజా  అప్పట్లోనే 52 లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారంటే ఆయన ఏ స్థాయిలో ఈ ప్రాజెక్టు ఉపయోగాన్ని నమ్మారో అర్ధం చేసుకోవచ్చు. వంశపార పర్యంగా వచ్చిన రాజరికంతో ఆయన తృప్తి చెందలేదు. తెలుగు నేలకు, ముఖ్యంగా రైతులకు ఏదో ఒకటి చేయాలనే తపన పడ్డారు. ఆయన  ఆలోచనే, తపన, ముందు చూపు ఫలితమే పులిచింతల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు సాకారమయ్యాయి.   తెలుగు ప్రజల పాలిట వరంగా మారాయి. నేడు నాలుగు ఉమ్మడి జిల్లాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే.. పాడి పంటలతో తులతూగుతున్నారంటే అందుకు ముక్త్యాల రాజా కృషి, పట్టుదల, సంకల్పం, సేవానిరతి కారణం అనడానికి ఇసుమంతైనా సందేహం లేదు.  నేడు ఈ నాలుగు జిల్లాలో ప్రజలు అన్నం తింటున్నారంటే అది  వాసిరెడ్డి రామ గోపాల కృష్ణ మహేశ్వర వర ప్రసాదమే.  ఈ మహోన్నతుడు 1972లో స్వర్గస్థులయ్యారు. నేడు ఆయన 50వ వర్ధంతి. నిజానికి మనం తినే ప్రతి మెతుకు ముక్త్యాల రాజా ప్రసాదమే. ఆయన చిరస్మరణీయుడు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భాసిల్లేందుకు శక్తికి మించి శ్రమించిన ఆయన గురించి భావితరాలకు తెలియజేయాలి. అదే ఆ మానుభావువుడికి మనమిచ్చే అసలైన నివాళి.  ముక్త్యాల రాజా 50వ వర్ధంతి సందర్భంగా.. ప్రత్యేక వ్యాసం