రాజ గురువు జన్మదిన వేడుకలు.. ఏపీ సర్కార్ వివాదాస్పద ఆదేశాలు!

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను వ్యక్తి పూజలకు నిలయాలుగా మార్చేలా ఏపీ ప్రభుత్వం వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. 18వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఆదేశాలు జారీ చేశారు.   ఇటీవల స్వరూపానందకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికి.. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలికడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల నుంచి ఇంకా బయటపడకముందే, స్వరూపానంద విషయంలో తాజాగా వివాదాస్పద ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం అభాసుపాలయింది.   కాగా, గత సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్షలో విజయవాడలో ఉంటే రెండు నెలలపాటు ఒక్క ఆలయం వారు మర్యాదగా కూడా దర్శించు కోలేదు. సనాతన సర్వజ్ఞ జగద్గురు కంచి పీఠాధిపతులను పట్టించుకోని దేవాదాయ శాఖ.. స్వయంప్రకటిత విశాఖ పీఠానికి ఊడిగం చేస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కదలని కారు.. రోడ్డుపైనే 20 నిమిషాలు! బాబు భద్రత పట్టని ఏపీ సర్కార్

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారులో సాంకేతిక లోపం తలెత్తింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు నార్కట్ పల్లి సమీపంలోకి రాగానే మొరాయించింది. కారు ఎంతకూ కదలకపోవడంతో 20 నిమిషాల పాటు హైవేపైనే ఉండిపోయారు చంద్రబాబు. దీంతో మరో బులెట్ ప్రూఫ్ వెహికల్ లో హైదరాబాద్ కు వెళ్లిపోయారు చంద్రబాబు.   ఇటీవల కాలంలో చంద్రబాబు కాన్వాయ్ లో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుందని తెలుస్తోంది. ప్రతి 20వేల కిలోమీటర్లు కు ఒకసారి కారు క్లచ్ ప్లేట్స్ మార్చాల్సి ఉంటుంది. కాని ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే 60 వేల కిలోమీటర్లు తిరిగింది చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం. 20 కిలోమీటర్లు తిరగగానే క్లచ్ ప్లేట్స్ మార్చాల్సి ఉండగా.. 60 వేల కిలోమీటర్లు తిరిగినా మార్చకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.    చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జడ్ కేటగిరి సెక్యూరిటీలో ఉన్నారు. ఆయనకు ప్రభుత్వమే పూర్తి భద్రత కల్పించాల్సి ఉంటుంది. అయితే కావాలనే చంద్రబాబు కాన్వాయ్ లోని వెహికిల్స్ ను మార్చడం లేదని, డొక్కు వాహనాలనే కేటాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాని ఆయన ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో సాంకేతిక సమస్యలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు.

బాబోయ్ సంచయిత.. నేను వేగలేనంటున్న సింహాచలం దేవస్థానం ఈవో.!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక గజపతిరాజును తప్పించి సంచయితను చైర్మన్ గా నియమించిన సంగతి తెల్సిందే. అయితే ఆమె బాధ్యతలు చేపట్టిన తరువాత నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉంటూనే ఉన్నారు. తాజాగా సింహాచ‌లం దేవస్థానము ఈవో త‌న‌ను బ‌దిలీ చేయాలంటూ దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కు అర్జీ పెట్టుకున్నారు. దేవస్థానం ఈవో త్రినాథ‌రావు త‌ను ఇక్క‌డ ప‌నిచేయ‌లేనని, త‌న‌ను వెంటనే బ‌దిలీ చేయాల‌ని తాజాగా ఆర్జీ పెట్టుకున్నారు. ఇక్కడ విశేషమేంటంటే అయన మొన్న సెప్టెంబ‌ర్ లోనే బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా అప్పుడే బ‌దిలీ కోరటం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాకుండా త్రినాథ రావుకు ముందు దేవస్థానం ఈవోగా బాధ్య‌త‌లు నిర్వహించిన భ్ర‌మ‌రాంబ కూడా ఆ బాధ్య‌త‌ల్లో రెండు నెల‌లకు మించి ప‌నిచేయ‌లేక‌పోయారు. ఈవోలంతా వరుసగా బ‌దిలీ కోర‌టం వెనుక మ‌న్సాస్ ట్రస్ట్ చైర్మ‌న్ సంచ‌యితతో వస్తున్న తీవ్ర విభేదాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గ‌త ఆరు నెల‌ల కాలంలో ఏకంగా ముగ్గురు ఈవోలు మార‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఎమ్మెల్సీల ఎంపికలో సర్ ఫ్రైజ్! దేశపతి, కర్నెకు షాక్ 

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను మంత్రివర్గం ఖరారు చేసింది. కొంత కాలంగా ప్రచారంలో ఉన్న నేతలను కాకుండా .. ఎవరూ ఊహించని వారిని మండలికి ఎంపిక చేసి అందరికి సర్ ఫ్రైజ్ ఇచ్చారు గులాబీ బాస్. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. ఈ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. శాసనమండలి అభ్యర్థుల్లో ఎస్సీ, బీసీ, ఓసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.                 గవర్నర్ కోటాలో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సారయ్య. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో నగరానికి చెందిన బీసీ నేత బస్వరాజు సారయ్య ‌కు అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.    గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ప్రజా కవి గోరంటి వెంకన్న. సీఎం కేసీఆర్ ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ ను మండలికి పంపిస్తారని మొదటి నుంచి ప్రచారం ఉంది. ఆయన పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యాంగా దేశపతికి బదులు గోరటి వెంకన్నను మండలి తలుపు తట్టింది. ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీకి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారట. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన గోరటికి అదృష్టం కలిసి వచ్చిందని చెబుతున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాజకీయ నేతలు కాకుండా ఒకరిద్దరిని కళాకారుల నుంచి ఇవ్వాలని గవర్నర్ సూచించినట్లు గతంలో వార్తలు బయటికి వచ్చాయి. గోరటి ఎంపికకు ఇది కూడా ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు.                    మూడో మండలి అభ్యర్థిగా కొత్త వ్యక్తిని ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. మంత్రివర్గం ఖరారు చేసిన బొగ్గారపు దయానంద్ పేరు టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మందికి తెలియదు. ఆయన రాజకీయాల్లోనూ యాక్టివ్ గా లేరని చెబుతున్నారు. శాసనమండలికి దయానంద్ ఎంపిక అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కొత్తపేట మారుతీనగర్ కు చెందిన దయానంద్ ఆర్యవైశ్య సంఘంలో ప్రముఖ్య వ్యక్తిగా చెబుతున్నారు. ప్రస్తుతం వాసవి క్లబ్ చీఫ్ అడ్వయిజర్ గా ఉన్న దయానంద్ కు గ్రేటర్ పరిధిలోని వైశ్యులతో మంచి పరిచయాలు ఉన్నాయంటున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసమే ఆయన ఎంపిక జరిగిందనే చర్చ జరుగుతోంది.    దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అప్పటి నుంచి మండలి అభ్యర్థుల కసరత్తు జరుగుతూనే ఉంది. రెండు నెలల క్రితమే భర్తీ చేస్తారని ప్రచారం జరిగినా ఎందుకో ఆగిపోయింది. టీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. నాయిని నర్సింహరెడ్డితో పాటు ఉద్యమం నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న కర్నెకు మరోసారి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు కూడా వినిపించాయి. నాయిని ఆరోగ్యం క్షిణించడంతో ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడిందని అయితే వీరెవ్వరిని కనికరించలేదు కేసీఆర్.

జైలు గది, బాత్రూముల్లో కెమెరాలు: నవాజ్ షరీఫ్ కుమార్తె సంచలనం 

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలైన మర్యం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తన జైలు గదితో పాటు, బాత్రూమ్ లో కూడా అధికారులు కెమెరాలను పెట్టారని చెప్పారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో గత ఏడాది ఆమె జైలుకు వెళ్లారు. అప్పుడు జైల్లో తాను అనుభవించిన ఇబ్బందుల గురించి జియో న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మర్యం నవాజ్ వివరించారు.    తాను రెండు సార్లు జైలుకు వెళ్లానని చెప్పారు మర్యం నవాజ్. ఒక మహిళనైన తన పట్ల వ్యవహరించిన తీరును చెపితే... ఈ ప్రభుత్వం ఎవరికీ మొహాన్ని కూడా చూపించలేదని ప్రశ్నించారు. తనను ఉంచిన సెల్ తో పాటు, బాత్రూమ్ లో కూడా కెమెరాలను ఉంచి తనను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ప్రపంచంలో ఏ మహిళ కూడా బలహీనురాలు కాదన్నారు మర్యం నవాజ్. రాజ్యాంగ వ్యవస్థలకు తాము వ్యతిరేకం కాదని.. రాజ్యాంగానికి లోబడి మిలిటరీ వ్యవస్థతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని తెలిపారు. అయితే తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తేనే తాము చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు నవాజ్ షరీఫ్ కుమార్తె.

హరీష్‌రావును బలిపశువు చేశారు! 

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దుబ్బాక విజయంతో బీజేపీ జోష్ లో ఉండగా.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఓటమిపై పోస్ట్ మార్టమ్ జరుగుతోంది. దుబ్బాక ఫలితంపై కొత్త కొత్త వాదనలు బయటికి వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఓడిపోతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందే తెలుసని... అయినప్పటికీ మంత్రి హరీశ్ రావును బలిపశువును చేశారని చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలనను, ఒంటెద్దు పోకడలను తిప్పికొట్టాలనే కసి ప్రజల్లో మొదలైందని చెప్పారు జితేందర్ రెడ్డి. ఆ కసిని దుబ్బాక ఎన్నికల్లో జనాలు తీర్చుకున్నారని చెప్పారు.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ  బీజేపీ సత్తా చాటుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా 84 వేల మంది ప్రజలు నిలబడ్డారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తామని చెప్పారు జితేందర్ రెడ్డి. అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్నారు. విజయశాంతి బీజేపీలో ఎప్పుడు చేరబోతున్నారనే సమాచారం తన వద్ద లేదని చెప్పారు. వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని జితేందర్ రెడ్డి విమర్శించారు. ఆ ప్రభావం అధికార పార్టీపై భారీగా ఉండబోతుందని చెప్పారు.

సైనికుడి చేయి పట్టుకుని నడిచిన మెలానియా!ట్రంప్ తో తెగతెంపులేనా? 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ కు షాకుల మీద షాకుల తగులుతున్నాయి. ఆయన వైవాహిక జీవితం విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ నుంచి మెలానియా విడాకులు తీసుకోనుందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా ప్రవర్తిస్తున్నారు మెలానియా. వెటరన్స్ డే సందర్భంగా ట్రంప్ కు షాకిచ్చేలా ఆమె వ్యవహరించారు.    వెటరన్స్ డే సందర్భంగా తన భార్య మెలానియాతో కలిసి ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికను సందర్శించారు ట్రంప్. అయితే అక్కడ ఊహించని ఘటన జరిగింది. తన భర్తతో కలిసి నడవకుండా.. ఓ సైనికుడి చేయి పట్టుకుని మెలానియా నడిచింది. మెలానియా ప్రవర్తించిన తీరు అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటనతో అక్కడి వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో వీరిద్దరూ విడిపోనున్నారనే వార్తకు మరింత బలం వచ్చింది. జనవరిలో ట్రంప్ అధ్యక్షపీఠం నుంచి వైదొలగగానే వీరి వివాహబంధం ముగుస్తుందని చెపుతున్నారు.   అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా.. ఓటమిని అంగీకరించడం లేదు ట్రంప్. న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. వైట్ హౌజ్ నుంచి ఖాళీ చేయడానికి మొండికెస్తున్నారు. ఓటమిని ఒప్పుకోమని మెలానియా చెప్పినా ట్రంప్ వినడం లేదని తెలుస్తోంది. దీంతో ట్రంప్ తీరుపై మెలానియా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. గతంలోనూ వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే అమెరికా ఫస్ట్ లేడీగా ఉన్నందున ట్రంప్ తో విడిపోయేందుకు మెలానియా ఇష్టపడలేదని చెబుతున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ పదవి పోయినందున ట్రంప్ కు టాటా చెప్పేందుకు మెలానియా నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇంటిపై బ్యాగుల నిండా డబ్బు, బంగారం! జరిగింది తెలిస్తే షాకే! 

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో వింత చోరీ ఘటన జరిగింది. తన ఇంటి యజమాని ఇంట్లో చోరీకి ప్లాన్ వేశాడు వాచ్ మెన్. ఎవరికి దొరకకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్టర్ ప్రణాళిక రచించాడు. తాను అనుకున్నట్లే అంతా పక్కాగా చేశాడు ఆ దొంగ వాచ్ మెన్. అయితే ఉహించని పరిణామాంతో అడ్డంగా బుక్కైపోయాడు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. మీరట్ లో వెలుగుచూసిన వాచ్ మెన్ చోరీ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.    తాను ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం.. భవనంలో పనిచేసే వాచ్ మన్ తన యజమానికి సంబంధించిన డబ్బు, బంగారం దోచుకున్నాడు. దాన్నింతా బ్యాగుల్లో ఉంచి పక్కింటి డాబాపై పడేశాడు. తాను పనిచేస్తున్న ఇంటి గేటు నుంచి బ్యాగులను తీసుకెళితే సీసీ కెమెరాలకు దొరికిపోతానని భావించి, వాటిని అలా పక్కింట్లో వేశాడు. మరుసటి రోజు పక్క ఇంటిపై పడేసిన నోట్ల కట్టలు, బంగారం బ్యాగులను తీసుకుని ఉడాయించాలని భావించారు.   అయితే తెల్లారేసరికే వాచ్ మెన్ కథ అడ్డం తిరిగింది. చోరీ జరిగిన బిల్డింగ్ పక్కింట్లో నివసించే నివసించే వరుణ్ శర్మ అనే వ్యక్తి ఉదయం నిద్రలేచి ఇంటిపైకి వెళ్లాడు. ఆయనకు అక్కడ రెండు బ్యాగులు దర్శనమిచ్చాయి. బాగా బరువుగా ఉండడంతో వాటిని తెరిచి చూడగా కరెన్సీ నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. అంత పెద్దమొత్తంలో డబ్బు, బంగారం తన ఇంటిపై ఉండడంతో వరుణ్ శర్మ కంగారుపడ్డాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.    పోలీసులు వచ్చి ఆ రెండు బ్యాగులను స్వాధీనం చేసుకుని, ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న భవనం పైనుంచి ఆ బ్యాగులను పడేసినట్టు గుర్తించారు. పోలీసుల విచారణలో  అడ్డంగా దొరికిపోవడంతో వాచ్ మెన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గోవిందా.. ఏంటీ దారుణాలు! ఎస్వీబీసీని బజారున పడేశారా?

మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు.. పోర్న్ సైట్ లింకులు.. నిధుల్లో అక్రమాలు. ఇవి తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ లో వెలుగు చూస్తున్న వ్యవహారాలు. వరుసగా జరుగుతున్న ఘటనలతో శ్రీవారి చానెల్ అప్రదిష్ట పాలవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్వీబీసీ పూర్తిగా గాడి తప్పినట్లుగా మారిపోయింది. మాజీ చైర్మన్‌ వ్యవహారాలు, బోర్డు గందరగోళ నిర్ణయాలతో ప్రతిష్టాత్మక ఛానెల్‌ పరువు నవ్వులపాలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఇష్టారాజ్యంతోనే భక్తి చానెల్ బజారున పడే పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి చానెల్ లో జరుగుతున్న పరువు పోయే పరిణామాలతో వెంకన్న భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.    ఎస్వీబీసీలో తాజాగా వెలుగుచూసిన పోర్న్ సైట్ లింక్ వ్యవహారం టీటీడీకి తలనొప్పిగా మారింది.ఈ ఘటనలో విచారణ జరిపేకొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్వీబీసీ ఛానెల్ లో పనిచేసే ఉద్యోగుల్లో కొంతమంది పనిమానేసి పోర్న్ సైట్స్ చూడటానికి ఆఫీస్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఎస్వీబీసీలో పనిచేసే ఉద్యోగి పోర్న్‌ లింక్‌లు పంపటం నిజమేనని టీటీడీ విజిలెన్స్‌ విచారణలోనూ తేలింది. దీంతో పోర్న్‌ వీడియో పంపిన ఉద్యోగితోపాటు పోర్న్‌ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంది ఎస్వీబీసీ యంత్రాంగం.   శతమానం భవతి కార్యక్రమం కోసం ఒక భక్తుడు మెయిల్ చేయగా తిరిగి భక్తుడికి ఎస్విబిసి ఉద్యోగి ఓ అశ్లీల సైట్ లింక్ పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తుడు టిటిడి చైర్మన్ కు ,ఈవో కు దీనిపై ఫిర్యాదు చేశారు.  పోర్న్ సైట్స్ వ్యవహారం భక్తుడి ఫిర్యాదు ద్వారా వెలుగులోకి రావడంతో.. టీటీడీ  ఉలిక్కి పడింది. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టిందిఎస్వీబీసీ. సైబర్ క్రైమ్ పోలీస్ బృందం రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తోంది.  82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మిగతా కంప్యూటర్లలో కూడా పోర్న్ సైట్స్ చూసినట్టు ఆధారాలున్నాయని, బ్రౌజర్ హిస్టరీలో అన్ని విషయాలు బైటపడ్డాయని తెలిసింది. అయితే ఆ సమయంలో కంప్యూటర్లను ఎవరు వినియోగించారు, ఎవరు పోర్న్ సైట్స్ చూశారనే విషయాన్ని నిర్థారించుకునేందుకు సీసీ టీవీ ఫుటేజ్, అటెండెటన్స్ ను పరిశీలిస్తున్నారు.   వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాకా  ఎస్వీబీసీ చానెల్ లో భక్తుల మనోభావలకు భంగం కలిగే పరిణామాలే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఎస్వీబీసీ బోర్డుకు  జగన్ సర్కార్ నియమించిన చైర్మెన్ వ్యక్తే లైంగిక వేధింపులు చేస్తూ దొరికిపోవడం తీవ్ర దుమారం రేపింది. ప్రతిష్టాత్మక శ్రీవారి భక్తి చానెల్ చైర్మెన్ గా కమెడియన్ కమ్ యాక్టర్ పృథ్వీని నియమించింది. ఆయన పదవి చేపట్టిన కొన్ని రోజులకే గత జనవరిలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ఘటన వెలుగు చూసింది. మహిళా ఉద్యోగితో పృధ్విరాజ్  మాట్లాడిన ఆడియో లీక్ అవడం పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ ఆడియో కారణంగా పృథ్వీపై ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. తర్వాత కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఎస్వీబీసీ నిధుల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.     ధార్మిక ప్రచారం కోసం 2008లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌ను ప్రారంభించింది  తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి ఆలయం లోపల, వెలుపల జరిగే కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ఈ చానల్‌ను ప్రారంభించింది టీటీడీ. చానల్ పరిపాలన వ్యవహారాలను చూసుకోవడానికి ప్రత్యేకంగా బోర్డ్ ని...చైర్మన్ ని కూడా నియమించింది . ఇలా గొప్పగా ప్రారంభించిన ఛానల్  వివాదాలకు చిరునామాగా మారడం భక్తులను కలవరపరుస్తోంది. నియామకాలు..కొనుగోలు,  కార్యక్రమాలు నిర్వహణ వరకు అంతటా అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గత చైర్మన్ పృథ్విరాజ్ వ్యవహరించిన తీరు ఛానల్ ప్రతిష్టతో పాటు టీటీడీ పరువును బజారు కీడ్చినట్లయింది.   ఎస్వీబీసీలో జరుగుతున్న ఘటనలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.  ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేస్తుండగా.. ఏపీ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దీయోధర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛానల్‌లో అసాంఘిక ఘటనలు జరగడం బాధాకరమన్నారు సునీల్ దీయోధర్. అయోధ్య భూమి పూజను కూడా ఎస్వీబీసీ ప్రసారం చేయలేదని విమర్శించారు. తప్పులు చేయడం.. తర్వాత క్షమాపణలు చెప్పి సరిద్దిదుకోవడం టీటీడీకి సర్వసాధారణంగా మారిందన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ ఆస్తులు, నిధులను ప్రభుత్వం కాపాడాలని సునీల్ దీయోధర్ అన్నారు.    ఎస్వీబీసీ టీవీ ఛానల్ లో వెలుగు చూసిన అశ్లీల సైట్ లింక్ ఘటనతో పాటు గత ఏడాది కాలంగా వరుసుగా జరుగుతున్న ఘటనలతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వీ భక్తి ఛానల్‌కు  రాజకీయ గ్రహణం పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. ధర్మ ప్రచారానికి నిర్వహించే ఛానల్ లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం దురదృష్టకరమని మండిపడుతున్నారు. ఎస్విబిసి పవిత్రతను కాపాడాలంటూ హిందూ సంఘాలు ఆందోళనలు కూడా చేస్తున్నాయి. టీటీడీ పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు భక్తులు.

దళితుడికి పూజలు చేయనన్న గుడి పూజారి అరెస్ట్... 

జనగామ జిల్లా కేంద్రంలోని అభ‌యాంజ‌నేయ స్వామి ఆల‌యంలో దళితుడికి పూజలు చేయనని ఆలయ పూజారి వెనక్కి పంపడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలిసిన పలు దళిత సంఘాలు గుడి వద్ద ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దేవాలయ పూజారి అభయాంజనేయ శర్మను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.   దళిత వర్గానికి చెందిన భాస్కర్, సంధ్య దంపతులు తమ కుమారుడికి శాంతి పూజ చేయించేందుకు శుక్రవారం స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చారు. పూజ చేయాలని ఆలయ పూజారిని కోరగా.. వారు దళిత వర్గానికి చెందినవారని తెలుసుకుని.. దళితులకు అసలు ఆలయంలో ప్రవేశం లేదని, పూజలు కూడా చేయమని పూజారి చెప్పడంతో ఆ దంపతులు వెనక్కి వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. దళితులపై ఎందుకు ఇంత వివక్ష ప్రదర్శిస్తున్నారని ఈ సందర్భంగా దళిత సంఘాలు ప్రశ్నించాయి. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని పూజ చేయడానికి నిరాకరించిన పూజారిని అరెస్టు చేశారు.

లంచాలు గుంజడంలో ఏపీ ఉద్యోగులు టాప్..! తాజా సర్వేలో వెల్లడి

ఏపీలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు లంచాలు తీసుకోవడంలో ఆరితేరిపోయారని తాజాగా ఒక సర్వేలో తేలింది. ఎలక్ట్రిసిటీ యాక్సెస్‌ ఇన్‌ ఇండియా: బెంచ్‌మార్కింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటీస్‌ పేరుతో కేంద్ర విద్యుత్ శాఖ, నీతి ఆయోగ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, స్మార్ట్ పవర్ ఇండియా కలిసి సంయుక్తంగా 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. ఎక్కువగా లంచాలు తీసుకుంటున్న విద్యుత్ ఉద్యోగుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగదారుల నివేదిక ఆధారంగా ఈ సర్వే జరిగినట్లుగా వెల్లడించారు. ఈ సర్వేలో దాదాపు 57శాతం మంది వినియోగదారులు పాల్గొనగా.. విద్యుత్ సేవలకు సంబంధించి తాము ఎదుర్కున్న పరిస్థితులను ఈ సర్వేలో అధికారులకు వివరించారు. ఈ సర్వే ఆధారంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్ల పై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను ఈ నివేదిక సూచించింది.   తాము చేసిన పనికి మించి అదనంగా డబ్బులు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని వినియోగదారులు స్వయంగా ఈ సర్వేలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ సర్వే లో పాల్గొన్నవారిలో గృహ వినియోగదారులు 33% మంది, సంస్థాగత వినియోగదారులు 21% శాతం మంది ఉన్నారు. గుజరాత్‌ ఉద్యోగులలో అవినీతి తక్కువగా 8 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ, తూర్పు డిస్కంల పరిధిలో అత్యధికంగా 57 శాతంగా ఉందని తేలింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్యుత్తు సమస్యలు తెలుసుకోవడానికి 10 రాష్ట్రాల్లోని 25 డిస్కంల పరిధిలో 25,116 మంది వినియోగదారులను సర్వే చేశారు. దీంట్లో ఏపీ‌లో 1,809 మంది ఉన్నారు. ఈ సర్వేపై స్పందించిన నీతి ఆయోగ్‌ అటు వినియోగదారులను చైతన్య పరచడంతో పాటు, ఇటు అదనపు మొత్తాలను అడిగే సిబ్బందిపై కూడా సంబంధిత డిస్కింలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

రాహుల్ కు బలహీన అలవాటు! ఒబామా పుస్తకంలో సంచలనాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన కొత్త పుస్తకంలో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. తనకు ఎదురైన స్వియ అనుభవాలతో పాటు అమెరికా వ్యవహారాలను తన పుస్తకం  'A Promised Land'లో పొందు పరిచారు బారక్ ఒబమా. భారత్ గురించి, మన దేశ రాజకీయ నేతల గురించి కూడా తన అభిప్రాయాలు రాశారు. ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నేతల గురించి కూడా ఒబామా తన మనోగతాన్ని పుస్తకంలో వెల్లడించారు.   న్యూయార్క్ టైమ్స్ సమీక్షించిన ఈ పుస్తకంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు బారక్ ఒబామా. "రాహుల్ గాంధీకి ఒక బలహీనమైన అలవాటు ఉంది. అతను కోర్సు మొత్తం పూర్తి చేసి, టీచర్‌ను ఆకట్టుకోవాలని ఎదురుచూస్తుంటాడు. కానీ, లోతుగా విషయం నేర్చుకునేందుకు అవసరమైన అభిరుచి గానీ, అసక్తి గానీ ఉండవు." అని ఒబామా రాసుకొచ్చారు.   సోనియా గాంధీపై కూడా తన పుస్తకంలో బారక్ ఒబామా ప్రస్తావించారు. "చార్లీ క్రిస్ట్, రహమ్ ఇమాన్యుయేల్ వంటి పురుషుల అందం గురించి మనకు చెప్పబడింది. కానీ మహిళల అందం గురించి చెప్పలేదు. ఒకటి.. రెండు.. సందర్భాల్లో మినహా సోనియా గాంధీ విషయంలో కూడా అదే జరిగింది." అని చెప్పారు. అమెరికాకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా 2010, 2015లో రెండుసార్లు భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో భారత్ కు తనకు ఎదురైన విషయాలను పుస్తకంలో వెల్లడించారు అమెరికా మాజీ అధ్యక్షుడు. తన భారత పర్యటనలోనే సోనియా, రాహుల్ గాంధీలను కలిశారు ఒబామా. అప్పుడు గమనించిన విషయాల ఆధారంగా వారిద్దరిపై తన అభిప్రాయాన్ని బారక్ పుస్తకంలో రాశారని భావిస్తున్నారు.

తెలంగాణలో టపాసులపై నిషేధం విధించిన సర్కార్ 

తెలంగాణాలో టపాసుల వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న టపాసు దుకాణాల మూసివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాణసంబా వినియోగం పై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రజలు, సంస్థలు కూడా బాణసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు తెలంగాణ తన తాజా ఉత్తర్వులలో పేర్కొంది. ఈ నిబంధనలు వెంటనే అమలలోకి వచ్చాయని.. దీనికి సంబంధించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ, సీపీల‌కు, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు అలాగే రాష్ట్రంలోని పోలీసులకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.   కరోనా తీవ్రత నేపథ్యంలో టపాసులను నిషేధించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన లాయర్ ఇంద్రప్రకాశ్‌ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్‌ ఆర్‌ఎస్ చౌహాన్‌, జస్టిస్‌ బి విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టగా.. కరోనా వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో టపాసుల వినియోగం వల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా టపాసులు పేల్చడం ద్వారా ఏర్పడే కాలుష్యంతో ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ బాణసంచా నిషేధంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు స్వీయ నియంత్రణలు పాటిస్తారని ఆశిస్తున్నదని తెలిపారు.   రెండు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే వాయు కాలుష్యం శ్వాస కోశ ఇబ్బందులు సృష్టిస్తుందని తెలిపింది. దీంతో గాలి నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బతింటున్న కారణంగా.. మరోపక్క దేశంలో కొన్ని చోట్ల కరోనా సేకండ్ వేవ్ మొదలవడంతో.. పండుగలు జరుపుకోవడం ముఖ్యమేనని, అయితే ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో బాణసంచాపై నిషేధం విధించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది.

దుబ్బాక ఓడినా గులాబీకి తొందర! గ్రేటర్ కారణాలివేనా? 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎన్నికల సంఘం చకాచకా ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడంతో షాకైన.. గులాబీ పార్టీ గ్రేటర్ ఎన్నికలపై వెనక్కి తగ్గుతుందని అంతా భావించారు. ముందస్తుకు వెళ్లకుండా.. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరిలో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లవచ్చని రాజకీయ పార్టీలు భావించాయి. అయితే అందరి అంచనాలకు భిన్నంగా వీలైనంత త్వరగా బల్దియా ఎన్నికలు ముగించాలని కారు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో ఓడినా గ్రేటర్ హైదరాబాద్ లో ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధపడటం వెనుక బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు.    దుబ్బాకలో కమలం వికసించడంతో కారు పార్టీ నేతలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల టెన్షన్ పట్టుకుందట. దుబ్బాక ఫలితంతో రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవచ్చని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ లో బీజేపీకి పట్టుంది. దుబ్బాక తర్వాత సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గ్రేటర్ ఎలక్షన్స్ను ఆలస్యం చేస్తే బీజేపీ పుంజుకుంటుందని, తమ పార్టీ కేడర్  వలసపోవచ్చనే భయం గులాబీ పెద్దల్లో ఉందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బీజేపీకి పుంజుకునే చాన్స్ ఇవ్వొద్దన్న ఆలోచనలో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. దుబ్బాక ఫలితం తర్వాత గ్రేటర్లో బీజేపీ బలం పెంచుకునేందుకు  ట్రై చేస్తున్నదని, అలాంటి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఎన్నికలు పెట్టేలా సమాలోచనలు జరుపుతున్నట్లు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. గ్రేటర్ పార్టీ  లీడర్లకు దీనిపై సంకేతాలు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.దుబ్బాక ఫలితం ప్రభావం గ్రేటర్ లో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైనా వారితో  చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది. కచ్చితంగా ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించినందు వల్లే గత వారం రోజులుగా నగరంలో మంత్రులు జోరుగా పర్యటిస్తూ  ప్రారోంభత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని చెబుతున్నారు.    ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వందలాది కాలనీలు నీట మునిగాయి. వరద బాధితులకు సాయం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే 4 వందల కోట్ల రూపాయల వరకు పంపిణి చేసింది. షెడ్యూల్ వచ్చే వరకు మరో 150 కోట్ల రూపాయలు పంపిణి చేయాలని టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్లో వరద సాయం పంపిణీ కొనసాగుతున్నందున ఆ సాయం గురించి జనం మరువక ముందే ఎలక్షన్స్ పెడితే ఫాయిదా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నట్లు సమాచారం. గ్రేటర్ లో  ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున 5.50 లక్షల మందికి నగదు సాయం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికి 4.50 లక్షల మందికి ఆర్థిక సాయం చేసినట్లు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. లోకల్ కార్పొరేటర్,  లీడర్ల పర్యవేక్షణలో సాయం పంపిణీ జరుగుతోంది. బాధితుల సంఖ్య పెరిగితే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. సర్కారు ఆర్థిక పరిస్థితి సరిగా లేని టైంలో అందించిన ఈ సాయాన్ని ఓట్లుగా మల్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు చర్చ నడుస్తున్నది.   గ్రేటర్ వరద సాయంలో అక్రమాలు జరిగాయని, గులాబీ నేతలే కోట్లాది రూపాయలు కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఇది టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం వరద సాయం తమకు ప్లస్ అవుతుందని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే నాలుగన్నర లక్షల కుటుంబాలకు సాయం అందించామని, మరో లక్ష కుటుంబాలకు 10 వేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన కుటుంబానికి మూడు ఓట్లు లెక్కేసినా 16 లక్షల మందికి పైగా సాయం చేసినట్లు. ఇవన్ని తమకు ఓట్ల రూపంలో కలిసి వస్తాయని గులాబీ నేతల అంచనాగా ఉంది. గ్రేటర్ లో 74 లక్షల ఓట్లుగా.. పోలయ్యేది 35 లక్షల వరకే ఉంటుంది. దీంతో తమకు గెలుపు ఈజీగానే ఉంటుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు.  వరద సాయంలో టీఆర్ఎస్ నేతలు కాజేశారని చెబుతున్నారు కాబట్టి.. లక్ష కుటుంబాలకు సాయం అందకపోయినా.. ఓట్ల సమయంలో వారికి డబ్బులిచ్చి మేనేజ్ చేయవచ్చని కుండబద్దలు కొడుతున్నారు గ్రేటర్ కారు పార్టీ నేతలు.    గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వరద సాయంగా కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని నిజం చేసేలానే వరద సాయం పంపిణి జరిగిందని చెబుతున్నారు. నిజమైన వరద బాధితులకు కాకుండా ఓట్లు ఉన్నవారికే డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ లో ఓట్లు లేని వారి ఇండ్లు నీళ్లలో మునిగిపోయినా వారిని అధికారులు పట్టించుకోలేదంటున్నారు. దీన్ని బట్టి పక్కాగా గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసమే టీఆర్ఎస్ సర్కార్.. వరద సాయం చేస్తుందని... 550 కోట్ల ప్రభుత్వ సొమ్మును తమ పార్టీకి ఓట్లు కురిపించడానికి అప్పనంగా వాడుకుంటుందనే ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి.    మొత్తంగా దుబ్బాక విజయంతో జోష్ మీదున్న బీజేపీకి గ్రేటర్ లో ఎక్కువ సమయం ఇవ్వొద్దన్న భావనతో పాటు వరద బాధితులకు అందిస్తున్న సాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ పెద్దలు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అందుకే దుబ్బాకలో ఓడిపోయినా గ్రేటర్ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని తెలుస్తోంది.

భారత్ లో ట్విట్టర్ పై వేటు తప్పదా..!  

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ రాజధాని లేహ్‌ను జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగంగా చూపించడంతో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు షాకిచ్చేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్‌ను జమ్మూకశ్మీర్‌లో భాగంగా చూపించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి.. ఎందుకలా చూపించారో వివరణ ఇవ్వాలంటూ ట్విట్టర్‌కు ఐదు రోజుల గడువు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలపై ట్విట్టర్ స్పందించకున్నా, లేక అది ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోయినా దానిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద భారత్‌లో ట్విట్టర్ యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు .. లేదా ఆరు నెలల జైలు శిక్ష పడేలా పోలీసు కేసు కూడా పెట్టవచ్చు.   కొంత కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, దానికి లేహ్‌ను రాజధానిగా చేసింది. అయితే ట్విట్టర్ మాత్రం లేహ్‌ను చైనాలో భాగంగా చూపించింది. ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ట్విట్టర్ అధినేత జాక్ డోర్సీకి లేఖ రాయడంతో పటంలో మార్పులు చేస్తూ.. ఈసారి దానిని జమ్మూకశ్మీర్‌లో భాగంగా మార్చేసింది. దీంతో ప్రభుత్వం ట్విట్టర్ పై మరోసారి మండిపడుతూ.. ఇలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.   తప్పుడు పటాన్ని చూపిస్తూ.. భారతదేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే ట్విట్టర్ ఇలా చేస్తున్నట్టు గా పేర్కొంటూ.. దాని ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈసారి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేయడంతో.. ట్విట్టర్ కనుక సంతృప్తికర వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.  

డిసెంబరు 1 నుంచి మళ్లీ లాక్‌డౌన్! నిజం లేదన్న కేంద్రం

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వింటర్ సీజన్ కావడంతో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, కేరళలో సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని, వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని వైద్య సంస్థలు. నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అటు ప్రపంచ వ్యాప్తంగానూ కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. యూరప్ లోనూ వైరస్ వర్రీగా మారింది. పారిస్, లండన్ లో మరోసారి లాక్ డౌన్ విధించారు.    దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించేందుకు కేంద్రం సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ పేరుతో ఉన్న ట్వీట్ వైరల్ కావడంతో దేశ ప్రజలు నిజమే అనుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఆ ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అలాంటి ప్రకటన ఏదీ విడుదల కాలేదని స్పష్టం చేసింది.    సోషల్ మీడియాలో  వస్తున్న ప్రచారంపై స్పందించిన ప్రభుత్వానికి చెందిన నిజ నిర్ధారణ విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ).. మార్ఫ్‌డ్ ఇమేజ్ అంటూ ప్రముఖ మీడియా సంస్థ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  ట్వీట్‌ను పోస్టు చేసింది. మళ్లీ లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తేల్చి చెప్పింది. దేశంలో ప్రస్తుతం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు అమలవుతున్నాయి. లాక్ డౌన్ మళ్లీ విధిస్తారంటూ గతంలోనూ ఇటువంటి ప్రచారమే జరిగింది. అప్పుడు కూడా వివరణ ఇచ్చిన కేంద్రం.. తాజా పుకార్లపై మరోమారు స్పష్టమైన వివరణ ఇచ్చింది.

తిరుపతిలో దుబ్బాక రిజల్ట్ రిపీట్? బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేసే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? తిరుపతి ఉప ఎన్నిక అందుకు నాంది కాబోతుందా? జగన్ సర్కార్ పై బీజేపీ దూకుడు అందుకేనా? అంధ్రప్రదేశ్ లో తాజాగా  జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఇవే అనుమానాలు వస్తున్నాయి. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న  బీజేపీ నేతలు జగన్ సర్కార్ పై ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలంతా ఘాటు ఆరోపణలతో వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. దీంతో ఏపీలో బీజేపీ బలమైన స్కెచ్ వేసిందని,  తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోందనే చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నా.. జగన్ పాలనపై బీజేపీ హైకమాండ్ సాఫ్ట్ వైఖరితోనే ఉంది. కన్నా లక్ష్మినారాయణ ఏపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రాజధాని సహా పలు అంశాలపై ఆయన ఘాటుగానే స్పందించేవారు. జాతీయ నేతలు మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు. జీవీఎల్ జగన్ కు అనుకూలంగా మాట్లాడేవానే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే సోము వీర్రాజు పార్టీ పగ్గాలు వచ్చాకా ఏపీ కమలం నేతలు సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఏపీలో వరుసగా ప్రజా వ్యతిరేక ఘటనలు జరిగినా , తిరుపతిలో  వివాదాస్పద నిర్ణయాలు జరిగినా సోము వీర్రాజు టీమ్ స్పందించలేదు. దీంతో వైసీపీకీ బీజేపీ బీ టీమ్ గా మారిందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా జగన్ ప్రభుత్వంపై కమలం పార్టీ స్టాండ్ మార్చినట్లు కనిపిస్తోంది.                 తెలంగాణలో గతంలో ఎప్పుడు లేనంతగా రాజకీయ కాక రేపిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సంచలన విజయం సాధించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీని, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ ను అధిగమించి జయకేతనం ఎగురవేసింది కమలం పార్టీ. దుబ్బాక ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా  కమలం కేడర్ లో జోష్ కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ బలమైన ప్రత్యర్థిగా మారిందనే భావన వచ్చింది. దుబ్బాక తరహాలోనే  త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో విక్టరీ కొట్టి..  వైసీపీకి సవాల్ విసరాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కరోనాతో  వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు చనిపోవడంతో తిరుపతిలో ఉపఎన్నిక జరగనుంది. దీంతో తిరుపతిలోనూ దుబ్బాక తరహాలోనే అధికార పార్టీ, ఎంపీ చనిపోయిన సెంటిమెంట్ ను అధిగమించి విజయం సాధించాలని కమలం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.  తిరుపతిపై సీరియస్ గా ఫోకస్ చేసిన బీజేపీ.. అప్పుడు కార్యాచరణ కూడా ప్రారంభించింది. తిరుపతిలో కార్యకర్తల సమావేశం పెట్టారు బీజేపీ నేతలు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో సనాతన హిందూ ధర్మం ప్రమాదంలో పడిందన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తే వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని సునీల్ ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సంపదపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడిందని బీజేపీ చీఫ్  సోము వీర్రాజు ఆరోపించారు. సీఎం జగన్‌ ప్రజాకంటక పాలన గురించి ఏడాదిన్నరలోనే ప్రజలకు తెలిసిపోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ ఢిల్లీలో ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని.. పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు.  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో తాము గెలుస్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉండటానికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. తిరుపతి ఆధ్మాత్మిక నగరం కావడం బీజేపీకి ప్లస్ కానుంది. జనసేనతో పొత్తు ఉండటంతో కమలానికి మరింత బలంగా మారింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి సహకరించవచ్చని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నా..  లోపాయకారిగా బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేస్తారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినప్పుడు.. తిరుపతిలో స్వల్ప మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. గతంలో కన్నా  ఇప్పుడు బీజేపీ, జనసేన బలపడ్డాయని, తమకు తిరుపతిలో గెలవడం పెద్ద కష్టం కాదన్నది ఏపీ కమలం నేతల మాట.   2014లో ఎన్డీఏలోనే ఉన్న టీడీపీ గత లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీతో విభేదించి బయటికి వచ్చింది. ఇటీవలే మళ్లీ  బీజేపీ పెద్దలకు చంద్రబాబు మళ్లీ దగ్గరయ్యారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ద్వారా ప్రధాని మోడీని చంద్రబాబు ప్రసన్నం చేసుకున్నారని చెబుతున్నారు. అందుకే తిరుపతిలో బీజేపీ గెలుపు కోసం చంద్రబాబు, టీడీపీ సాయం చేయబోతున్నారని సమాచారం. వైసీపీ ఓడిపోవడమే టీడీపీ ముఖ్యం కాబట్టి అలా చంద్రబాబు ముందుకు వెళతారనే ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అభ్యర్థిని పెట్టకపోతే బాగుండదు కాబట్టి క్యాండిడేట్ ను పెడతారని.. కాని ప్రచారం మాత్రం నామ్ కే వాస్తాగానే ఉండవచ్చని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. కమ్యూనిస్టులు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఉంది. తిరుపతిలో కాంగ్రెస్ పోటీ చేసినా పెద్ద ప్రభావం ఉండదంటున్నారు బీజేపీ నేతలు.  తిరుపతి ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ఏపీలో పార్టీ బలోపేతానికి కమలం సన్నాహాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తిరుపతిలో పోటీకి బలమైన అభ్యర్థిని కూడా బీజేపీ ఇప్పటికే సిద్దం  చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలపై ఇంతకాలం ఎక్కువగా ఫోకస్ చేయని బీజేపీ.. ఇకపై తీవ్ర స్థాయిలో టార్గెట్ చేయవచ్చని తెలుస్తోంది. హైకమాండ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. ఢిల్లీ డైరెక్షన్స్ వచ్చాయి కాబట్టే ఎప్పుడూ వైసీపీపై పెద్దగా మాట్లాడని సోము వీర్రాజు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా తిరుపతి ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

బీహార్ ఎన్నికల ఫలితాలపై తేజస్వి సెన్సేషనల్ కామెంట్స్ 

బీహార్ లో జరిగిన ఎన్నికలలో ఎన్డీయే కూటమి బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికలలో ఆర్జేడీ యువ నేత 31 ఏళ్ల తేజస్వి యాదవ్.. రాజకీయాలలో ఉద్దండులైన నేతలు మోడీ, నితీష్ కుమార్ లకు చుక్కలు చూపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా బీహార్ఎ న్నికల ఫలితాల పై ఆర్జేడీ యువ నేత 31 ఏళ్ల తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. బీహార్ రాష్ట్ర ప్రజలు తనకే మద్దతు పలికారని తేజస్వి చెప్పారు. రేపు సీఎం సీటులో ఎవరు కూర్చున్నా సరే... విజయం మాత్రం తనదేనని అయన అన్నారు. ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ఇద్దరూ అంగ , అర్ధ బలాన్ని వినియోగించారని... అయినా 31 ఏళ్ల తనను అడ్డుకోలేకపోయారని అయన అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తమ ఆర్జేడీ పార్టీ అవతరించడాన్ని వారిద్దరూ ఆపలేకపోయారని అన్నారు.   ఎన్నికల ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, దీనికోసం బీజేపీకి ఎన్నిక‌ల సంఘం అండ‌గా నిలిచిందంటూ అయన తీవ్ర విమర్శ చేసారు. బీహార్ ఓట‌ర్లు మ‌హాకూట‌మికి అనుకూలంగా తీర్పునిచ్చిన‌ప్ప‌టికీ ఫ‌లితాల‌ను తారుమారు చేశార‌న్నారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందని ఆరోపించారు. అయితే "2015లో కూడా దాదాపు ఇలాంటిదే జరిగింది. ప్రజలు భారీ మెజారిటీతో మహాకూటమికి పట్టం కట్టారు. కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు వెతుక్కుంది. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించింది". బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మొదటిసారి తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, బీహార్ ఫ‌లితాల‌ను రీకౌంటింగ్ చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని కూట‌మి గెలిచిన అనేక చోట్ల కేవ‌లం వెయ్యిలోపు ఓట్ల మెజారిటీ వ‌చ్చింద‌ని… అక్ర‌మాలు చేశారంటూ కాంగ్రెస్ సైతం ఆరోపించింది.   అంతేకాకుండా ఈ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి 119 స్థానాలు గెలిచిందని, అయితే అధికార బీజేపీ, జేడీయూల ఒత్తిళ్లకు తలొగ్గి 110 స్థానాలే గెలిచినట్లు ఈసీ ప్రకటించిందని ఆర్జేడీ ఆరోపించింది. చాలా మంది అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలుపొందడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తమ అభ్యర్థులే గెలిచారనడానికి ఆర్జేడీ కొన్ని రుజువులు చూపించే ప్రయత్నం చేస్తోంది.  ఈ ఎన్నికలలో నితీశ్ కుమార్ ఛరిష్మా ఏమైందో అందరికీ అర్థమైందని తేజస్వి ఎద్దేవా చేశారు. తాజాగ జరిగిన ఎన్నికలలో నితీశ్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని అయన అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారనే విషయం దీంతో స్పష్టంగా వెల్లడైందని అన్నారు. నితీశ్ కుమార్ సీఎం సీట్లో కూర్చున్నా... తమ పార్టీ మాత్రం ప్రజల గుండెల్లో ఉందని తెలిపారు.

కేసీఆర్ అవినీతి సొమ్ము కక్కిస్తాం! వివేక్ సంచలన కామెంట్స్  

దుబ్బాక ఉప ఎన్నిక  విజయంతో జోష్ మీదున్న బీజేపీ..  టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. గత అరేండ్లలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని  ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. కేంద్ర సంస్థలతో విచారణ జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ , యాదాద్రి పవర్ ప్లాంట్ సహా పలు ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికితీయాలని కేంద్ర సర్కార్ ను కోరాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. బీజేపీ సీనియర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇదే విషయాన్ని ప్రకటించారు. గత ఆరేండ్లుగా కేసీఆర్ చేసిన దోపిడిని అంతా కక్కిస్తామని వివేక్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ప్రత్యేకంగా జాతీయ మీడియా సమావేశం నిర్వహించిన వివేక్ .. తీవ్ర పదజాలంతో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి సోమ్ముతో కేసీఆర్ ఫ్యామిలి వేల కోట్ల రూపాయల సంపద కూడబెట్టిందని ఆరోపించారు వివేక్. 30 వేల కోట్ల రూపాయలతో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలకు లక్ష కోట్లకు పెంచారని, అందులో కమీషన్ల రూపంలో కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల రూపాయలు దోపిడి చేసిందని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో పైప్ లైన్లలో అవినీతికి పాల్పడ్డారని, వందల కోట్లు స్వాహా చేశారని చెప్పారు. రాష్ట్రంలో గత అరేండ్లలో జరిగిన అన్ని పనుల్లోనూ అవినీతి జరిగిందని, కేసీఆర్ ఫ్యామిలీకి వాటా వెళ్లిందని వివేక్ ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సంబంధించిన అన్ని వివరాలతో త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర సర్కార్  పెద్దలకు అందిస్తామని వివేక్ తెలిపారు.  ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ..ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని వివేక్ ఆరోపించారు. కేసీఆర్ తుగ్లక్ పాలన వల్లే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు. నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చిన కేసీఆర్.. ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేదని వివేక్ విమర్శించారు. రెండున్నర లక్షల డబుల్  బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పి.. అందులో ఇప్పటివరకు ఐదు శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ నిర్వాకంతో కేంద్రం నుంచి ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద పేదలకు అందాల్సిన ఇండ్లు కూడా అందకుండా పోయాయని వివేక్ మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని చెప్పారు.  దుబ్బాక ఫలితంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని విషయం తేలిపోయిందన్నారు వివేక్. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాక ప్రజలు స్పష్టమైన తీర్పు  ఇచ్చారన్నారు. రైతులు, యువకులు, మహిళలు, దళితులు, కార్మికులు .. ఇలా ఏ ఒక్కరు కూడా టీఆర్ఎస్ పాలనలో సంతృప్తిగా లేరని చెప్పారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతల ఆదేశాలతో  హైదరాబాద్, సైబరాబాద్, సిద్ధిపేట పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని వివేక్ మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధించిన ఓ విషయంలో హైదరాబాద్ సీపీ అనవసరంగా తన పేరు, తన కంపెనీ తీశారని చెప్పారు. తనకు సంబంధం లేని విషయంలో హైదరాబాద్ సీపీ అలా మాట్లాడటంపై వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి దుబ్బాక ఎన్నికల సమయంలో బీజేపీ నేతల ఇండ్లలో పోలీసులు సోదాలు చేశారని, కాని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో, ప్రగతి భవన్ లో తనిఖీలు చేస్తే వందలాది నోట్ల కట్టలు  దొరికేవన్నారు వివేక్. తెలంగాణలో  బీజేపీ బలోపేతానికి కష్టపడుతున్నందువల్లే తనను కేసీఆర్ టార్గెట్ చేశారని వివేక్ ఆరోపించారు. అక్రమ కేసులతో తనను ఇబ్బంది పెట్టాలని, బెదిరించాలని చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ , టీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా,  వేధింపులకు పాల్పడినా తాను భయపడేది లేదని, మరింత ఉత్సాహంగా బీజేపీ కోసం పని చేస్తానని చెప్పారు. 2103లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వివేక్. కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందని, ఇప్పుడాయన ఏం చేసినా ప్రజలు నమ్మబోరన్నారు వివేక్.