బీహార్ ఎన్నికల ఫలితాలపై తేజస్వి సెన్సేషనల్ కామెంట్స్
posted on Nov 12, 2020 @ 4:54PM
బీహార్ లో జరిగిన ఎన్నికలలో ఎన్డీయే కూటమి బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికలలో ఆర్జేడీ యువ నేత 31 ఏళ్ల తేజస్వి యాదవ్.. రాజకీయాలలో ఉద్దండులైన నేతలు మోడీ, నితీష్ కుమార్ లకు చుక్కలు చూపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా బీహార్ఎ న్నికల ఫలితాల పై ఆర్జేడీ యువ నేత 31 ఏళ్ల తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. బీహార్ రాష్ట్ర ప్రజలు తనకే మద్దతు పలికారని తేజస్వి చెప్పారు. రేపు సీఎం సీటులో ఎవరు కూర్చున్నా సరే... విజయం మాత్రం తనదేనని అయన అన్నారు. ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ఇద్దరూ అంగ , అర్ధ బలాన్ని వినియోగించారని... అయినా 31 ఏళ్ల తనను అడ్డుకోలేకపోయారని అయన అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తమ ఆర్జేడీ పార్టీ అవతరించడాన్ని వారిద్దరూ ఆపలేకపోయారని అన్నారు.
ఎన్నికల ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయని, దీనికోసం బీజేపీకి ఎన్నికల సంఘం అండగా నిలిచిందంటూ అయన తీవ్ర విమర్శ చేసారు. బీహార్ ఓటర్లు మహాకూటమికి అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ ఫలితాలను తారుమారు చేశారన్నారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందని ఆరోపించారు. అయితే "2015లో కూడా దాదాపు ఇలాంటిదే జరిగింది. ప్రజలు భారీ మెజారిటీతో మహాకూటమికి పట్టం కట్టారు. కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు వెతుక్కుంది. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించింది". బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మొదటిసారి తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, బీహార్ ఫలితాలను రీకౌంటింగ్ చేయాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలిచిన అనేక చోట్ల కేవలం వెయ్యిలోపు ఓట్ల మెజారిటీ వచ్చిందని… అక్రమాలు చేశారంటూ కాంగ్రెస్ సైతం ఆరోపించింది.
అంతేకాకుండా ఈ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి 119 స్థానాలు గెలిచిందని, అయితే అధికార బీజేపీ, జేడీయూల ఒత్తిళ్లకు తలొగ్గి 110 స్థానాలే గెలిచినట్లు ఈసీ ప్రకటించిందని ఆర్జేడీ ఆరోపించింది. చాలా మంది అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలుపొందడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తమ అభ్యర్థులే గెలిచారనడానికి ఆర్జేడీ కొన్ని రుజువులు చూపించే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఎన్నికలలో నితీశ్ కుమార్ ఛరిష్మా ఏమైందో అందరికీ అర్థమైందని తేజస్వి ఎద్దేవా చేశారు. తాజాగ జరిగిన ఎన్నికలలో నితీశ్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని అయన అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారనే విషయం దీంతో స్పష్టంగా వెల్లడైందని అన్నారు. నితీశ్ కుమార్ సీఎం సీట్లో కూర్చున్నా... తమ పార్టీ మాత్రం ప్రజల గుండెల్లో ఉందని తెలిపారు.