10 వేలు తీసుకున్నవారే ధర్నాలో కూర్చున్నారు! విపక్షాలది బురద రాజకీయమన్న కేటీఆర్ 

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు అడగకముందే వరద సాయం కోసం 550 కోట్ల రూపాయలను ప్రకటించామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటివరకు 4 లక్షల 30 వేల కుటుంబాలకు 10 వేల రూపాయల సాయం అందించామని తెలిపారు. 3 లక్షల 80 వేల కుటుంబాలు GHMC పరిధిలో, 12 వేల కుటుంబాలు కంటోన్మెంట్ పరిధిలో, 40 వేల సిటీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు అందించామన్నారు. 920 అధికారిక బృందాల ద్వారా ఒకేరోజు లక్ష మందికి డబ్బులు ఇచ్చామన్నారు కేటీఆర్.    10 వేల సాయం పొందిన ప్రతీ ఒక్కరి వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. సిటీ లో ఇంకా కొన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని ప్రకటించారు. మిగిలిన వారికి కూడా పదివేల సాయం ఇవ్వాలని సీఎం చెప్పారని తెలిపారు. 10 వేల రూపాయలు తీసుకున్న వారే కొందరు ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలో కూర్చుంటున్నారని కేటీఆర్ చెప్పారు. ఇంకొక వంద కోట్లు ప్రకటించమని సీఎంని కోరి అయినా అర్హులందరికీ వరద సాయం అందేలా చూస్తామని కేటీఆర్ ప్రకటించారు.    వరదల వల్ల 8,868 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి  స్పందన లేదన్నారు కేటీఆర్. గతంలో కర్ణాటక, గుజరాత్ లో వరదలు వచ్చినపుడు తక్షణమే కేంద్రం నిధులు పంపించిందని తెలిపారు. ఆరేండ్లలో తెలంగాణ నుండి 2 లక్షల 72 వేల కోట్లు పన్నులు కేంద్రానికి కడితే 1లక్షా నలభై వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేదని కేటీఆర్ విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ కి డిపాజిట్ రాదన్నారు మున్సిపల్ శాఖ మంత్రి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కబ్జాలను అరికడితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టం పై అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పారు కేటీఆర్.    1908, 1916 తర్వాత ఈసారి హైదరాబాద్ లో అతిపెద్ద వర్షపాతం నమోదైందన్నారు కేటీఆర్. 120 సెంటిమీటర్ల వర్షం కురిసిందన్నారు. ఒకేసారి కుంభవృష్టి లాగా అసాధారణ వర్షం కురవడం వల్లే వరద తీవ్ర ప్రభావం చూపిందన్నారు. నాళాలు కబ్జా చేయడం, చెరువులు కబ్జాల వల్ల వందలాది కాలనీలు మునిగాయన్నారు. ఏ సిటీ లో లేని విధంగా హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరు వరదల సమయంలో జనాల దగ్గరికి వెళ్లి కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు.

ఉద్యోగ సంఘ నేతలూ.. నెత్తురు ఉడకటం లేదా?

జీతాలు,పెన్షన్లు ఆపినా గొంతు పెగలదేం   నేతలపై ఉద్యోగుల ఉగ్రరూపం   జగనన్న సర్కారుకు శ్రమదానం చేస్తున్న ఉద్యోగ సంఘాల పాతివ్రత్యానికి, ఇప్పుడు పెద్ద పరీక్ష వచ్చి పడింది. ఒక్క డీఏను విడతల పద్ధతిలో ఇచ్చినందుకే, జగనన్న సర్కారుకు శతకోటిదండాలు పెట్టి, అపార భక్తిప్రపత్తులు చాటిన ఉద్యోగ సంఘాల నేతలు.. 40 శాతం మందికి ఇంకా వేతనాలు, పెన్షన్లు ఇవ్వని సర్కారు వైఫల్యంపై ఏమంటారు? 60 శాతం మంది పొందిన ప్రయోజనాలను, మిగిలిన 40 శాతం మందికి ఇప్పించడంలో నేతలు ఎందుకు విఫలమయ్యారు? ఈన్యాయంపై గొంతెత్తేందుకు, చొక్కా-లాగూలు తడిసిపోతున్నాయా? గత పాలకుల ముందు రెచ్చిపోయిన మీ పౌరుషం, ఏ కృష్ణానదిలో కలిసింది?.. ఇవీ.. ఇప్పటివరకూ పెన్షన్లు, జీతాలు అందని 40 శాతం మంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘ ‘పెద్దారెడ్ల’పై ప్రదర్శిస్తున్న ఉగ్రరూపం.   ఏపీలో ఆర్ధికపరిస్థితి అధ్వానస్థితికి చేరింది. 40 శాతం మందికి ఇంకా పెన్షన్లు, వేతనాలు, డీఏ చెల్లింపులు అందకపోవడమే, దానికి నిలువెత్తు నిదర్శనం. పథకాలతో ప్రజలకు డబ్బులు పప్పుబెల్లాల్లా పంచేస్తున్న జగనన్న సర్కారుకు.. తమకు జీతాలు, పెన్షన్లు, డిఏ బకాయిలు ఇచ్చేందుకు మాత్రం, చేతులు రాకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. దీనికంతటికీ తమ నాయకుల, పరాథీన త-లొంగుబాటే కారణమని ఉద్యోగులు చెబుతున్నారు.   తమ ‘పెద్దారెడ్లు’ పూర్తి సమయాన్ని.. సర్కారు సేవలో తరించేందుకే వెచ్చిస్తున్నందున, తమ గురించి ఆలోచించే సమయం లేకుండా పోయిందని,  వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, గత 17 నెలల క్రితం వరకూ.. ఉద్యోగ సంఘాల నేతలంటే, పాలకులకు భయం ఉండే భయం, ఇప్పుడు లేదంటున్నారు. దానికి కారణం.. తమ నేతల అసమర్థత- వైఫల్యం-‘సామాజిక’సంకటమేనని స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి వారికే చెమటలు పట్టించి, సెక్రటేరియట్ వద్ద పడుకునేలా చేసిన ఘనత, నాటి ఉద్యోగులదని గుర్తు చేస్తున్నారు.   గతంలో ఏ సీఎం అయినా.. ఉద్యోగ సంఘ నేతలకు ఎప్పుడంటే అప్పుడు, అపాయింట్‌మెంట్ ఇచ్చిన గత పూర్వవైభవాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఇప్పుడు నేతలే సీఎంను కలిసేందుకు వణికిపోతున్నారు. సీఎం కూడా వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా, కిందివారితో మాట్లాడిస్తున్నారని చెబుతున్నారు. తమ డిఏలు ఆగినా, జీతాలు-పెన్షన్లు నిలిపివేసి, కోతలు విధించినా.. ఇదేం అన్యాయమని ప్రశ్నించే దమ్ము, ఒక్క నాయకుడికీ లేకుండా పోవడం తమ దౌర్భాగ్యమంటున్నారు. ఎమ్మెల్యేలు-ఎంపీలంటే.. మళ్లీ టికెట్లు వస్తాయో, రావోనన్న భయంతో పాలకపార్టీని ప్రశ్నించకుండా మౌనంగా ఉంటారు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, ప్రశ్నించే ధైర్యం చేయరు. కానీ ఉద్యోగులకు ఆ భయం అవసరం లేదు. పార్టీలు-ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, 30 ఏళ్లు సర్వీసులో ఉంటారు. మరి అలాంటి ఉద్యోగులు-వారికి నాయకత్వం వహిస్తున్న నేతలూ, పాలకులకు ఎందుకు భయపడుతున్నారన్నది ప్రశ్న.   సచివాలయ ఉద్యోగుల పరిస్థితి, మరీ దారుణంగా ఉందంటున్నారు. ఉద్యోగ సంఘ నేతలు తమ మెహర్బానీ కోసం, తమ ప్రయోజనాలను పాలకుల వద్ద.. పణంగా పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పెద్దారెడ్లు’... మీ ఉద్యోగుల మనోవేదన మీకు అర్ధమవుతోందా? -మార్తి సుబ్రహ్మణ్యం

స్వరూపానందులకు.. సేవానందలహరి!

టీటీడీ అధికారుల సేవ చూడతరమా?   ఆయన జగద్గురువే కాదు. ‘జగన్గు’రువు కూడా. ఆ రెండేకాదు. లోకరక్షకుడు. అంతకంటే ముందు విశాఖ రక్షకుడు కూడా! ఆ స్వామివారు అక్కడ నడయాడుతున్నందుకే, విశాఖ శత్రుదుర్భేద్యంగా మారింది. నేను ఉన్నాను-నేను విన్నాను అని జగనన్న మాదిరిగా చెప్పకపోయినా.. ఆయన ఉన్నారన్న భరోసాతోనే అక్కడ నౌకాదళం ఏర్పాటుచేశారన్నది ఓ ప్రతీతి. స్వామివారు విశాఖలో లేకపోతే ఎగసిపడే సాగర కెరటాలు, ఆయన వచ్చాకనే శాంతిస్తాయన్నది ఓ నానుడి. ఆయన దగ్గరికి సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. సాధారణ రేషన్‌డీలర్ల సంఘం నాయకులు కూడా వచ్చి, తమ ఈతిబాధలు వెళ్లబోసుకుంటారు. అంత ‘పవర్’ఫుల్ స్వామి ఆయన!   ఆ స్వాములోరే స్వయంగా.. క్రైస్తవుడిగా ఉన్న జగన్‌బాబును, గంగలో మూడు మునకలేయించి, ‘కరుడుగట్టిన హిందూవాది’గా మార్చారని, మన నందమూరి లక్ష్మీపార్వతమ్మ తాదాత్మ్యంతో ధృవీకరించారు. అలాంటి ‘అభినవ ఆదిశంకరాచార్య’కరుణా కటాక్షాలు, కఠోర తపస్సుతోనే మన జగనన్న..   దేశం మెచ్చిన నలుగురు ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరు కాగలిగారు. అంటే స్వామివారు ఒక ఉత్తమ ముఖ్యమంత్రిని దేశానికి అందించారన్నమాట!   ఆ తపస్వి- రాజర్షి-మహర్షుల వారి చల్లని చూపులు ప్రసరిస్తున్నందుకే.. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి, అన్ని రంగాల్లో పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడే స్థాయిలో, పరుగులు తీస్తోంది. మరి అలాంటి భగవంతుడి అవతారమయిన స్వామివారు.. ఎయిర్‌పోర్టుకు వస్తే, టీటీడీ అధికారులు ఆయనకు ఎదురేగి స్వాగత సత్కారాలివ్వడం కూడా తప్పేనా? కలికాలం కాకపోతే.. అసలు అది కూడా ఒక వార్తనా? ఇవీ.. నడిచే దేవుడయిన, విశాఖ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి భక్తకోటి.. ఆవేదన-ఆర్తి-ఆగ్రహం కలగలిపి కారుస్తూ, సంధిస్తున్న ‘భక్తకన్నీటి’ప్రశ్నలు.   లేటెస్టుగా విశాఖ స్వాములోరు, తిరుమల దర్శనానికి వెళ్లారు. సరే.. ఆ పిచ్చికాలంలో అంటే శంకరాచార్యుల వారంటే.. ఫ్లెక్సీ స్వాగతాలు, పేపర్ యాడ్స్, పోలీసు కాన్వాయ్, వీవీఐపీలు పక్కన లేకుండానే దేశమంతా పాదయాత్ర చేశారు. మరి ఇప్పుడూ అలాగే చేయాలంటే ఎలా? ఎంచక్కా విమానాలు, బెంజికార్లు ఉన్న ఈ కాలంలో కూడా.. పాతకాలపు శంకరాచార్యుల మాదిరి నడిస్తే, పెద్ద ఇమేజ్-మీడియా కవరేజీ ఏముంటుంది? అందుకే విశాఖ స్వాములోరు, సరదాగా విమానంలో వచ్చారు. దానిపై కూడా విమర్శలు! హేమిటో? హెందుకో అర్ధం కాదు.   మరి అంతలావు సర్కారీ స్వాములోరు ఎయిర్‌పోర్టుకు వస్తే, ఆయనకు బాజా భజంత్రీలతో కాకపోయినా, కనీసం శాలువ-జగనన్నమాల.. సారీ..  గజమాలతో వెళ్లయినా స్వాగతించాలి కదా? మన టీటీడీ చైర్మన్ సహిత అధికారులు, ఎయిర్‌పోర్టుకు ఎదురేగి.. అలాగే స్వామివారిని స్వాగతించారు. ఒక రాజర్షికి చేసిన ఈ సాదాసీదా సన్మానం-గౌరవానికే సోషల్ మీడియా, గిట్టని రాజకీయ పార్టీలు గావుకేకలు పెట్టి.. గాయిగత్తర చేయడం స్వామివారి,  అనంతకోటి భక్తులకు సుతరామూ నచ్చడం లేదట. వారి సున్నిత హృదయాలు గాయపడ్డాయట.   అసలు స్వామివారి మహత్తు- త్యాగం ముందు.. ఈ గజమాల సన్మానాలు ఏ మూలకు పనికివస్తాయన్నది వారి ప్రశ్న. మరి స్వామి వారు తిరుమలకు వెళ్లినప్పుడు, శ్రీ వేంకటేశ్వరుడు కొండ దిగి, ఆయనకు స్వాగతం పలికే వీలు లేదు కదా? ఇప్పటికయితే వారికి ఆ ప్రొటోకాల్ ఇంకా కల్పించలేదు. కాబట్టి, ఆ ప్రకారం.. శ్రీవారి ప్రతినిధులుగా టీటీడీ అధికారులు, చైర్మన్ వస్తే తప్పేంటి? ఆయనకేమీ మణులు మాణిక్యాలు ఇవ్వలేదు కదా? జస్ట్. ఎయిర్‌పోర్టుకు వెళితే తప్పేంటన్నది స్వామివారి భక్తుల ప్రశ్న. అవును మరి. వారి వేదనా వినదగ్గదే!   నిజమే.. నిజానికి స్వామి వారు వచ్చినప్పుడు శ్రీవారే స్వయంగా వచ్చి స్వాగతించాలి. అలాంటి ప్రొటోకాల్ పాటించటం.. ఈ యుగంలో విగ్రహరూపంలో ఉన్న, ఆ యుగం శ్రీవారికి తెలియదు. కాబట్టే తన ప్రతినిధులుగా అధికారులను పంపారని సరిపెట్టుకోక, ఈ యాగీ ఏమిటి? అందుకే కదా గతంలో కూడా,  రాజర్షుల వారిని మూలవర్లకు అలంకరించే ఆకుతో చేసిన రామచిలకను, తిరుమల నుంచి అలిపిరికి తెచ్చిన.. ‘ధర్మాత్ముడైన ధర్మాధికారి’, మన  ధర్మారెడ్డిని భక్తులు తెగ మెచ్చుకుంది? గోశాలను-అందులోని గోవుల జన్మను, ధన్యం చేసేందుకు వచ్చిన మహర్షుల వారిని.. డాలర్‌శేషాద్రి వంటి సంఘసేవక స్వామి సహా, అధికారులు వచ్చి, మేళతాళాలు-బాజా భజంత్రీలతో స్వాగతించి, భక్తుల మెప్పు పొందింది కూడా అందుకే కదా?    ఇవన్నీ తెలియని పిచ్చి వాళ్లు, మతిలేని గతితప్పిన వాళ్లంతా.. స్వామివారిని ఆడిపోసుకోవడం మహాపచారమే కదా? అయినా మన పిచ్చి గానీ.. ‘పైవాడి’ ఆజ్ఞలేకపోతే.. స్వామి వారికి ఇంత భోగం పడుతుందా చెప్పండి? ఆ ‘పైవాడి’ ఆజ్ఞలేక, ఆగ్రహంతోనే కదా.. తమిళనాడులో కంచిస్వామివారు చెరసాలపాలయింది! హేమిటో.. ఈ జనం హెప్పుడు మారతారో హేమో?! -మార్తి సుబ్రహ్మణ్యం

నిందితుల వరుస ఆత్మహత్యలు! కీసర లంచం కేసులో అసలేం జరుగుతోంది?

తెలంగాణలో సంచలనం స్పష్టించిన కీసర మాజీ తహసీల్దార్​ నాగరాజు లంచం డిమాండ్ కేసులో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కోటి పది లక్షల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి.. కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్‌ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు ధర్మారెడ్డి. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు.   కోటి 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు... గత నెల 14న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ధర్మారెడ్డి కూడా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుసగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.    దాదాపు 40 ఎకరాలకు నకిలీ పాసు పుస్తకాలు తీసుకున్నట్లు ధర్మారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సెప్టెంబరు 29న ధర్మారెడ్డితో పాటు ఆయన కుమారుడు శ్రీకాంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. కీసర మండలం రాంపల్లిలో వేర్వేరు సర్వేనెంబర్లలో 24.16 ఎకరాల భూమికి సంబంధించి నలుగురికి అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. దీనికి సంబంధించి విలెన్స్‌ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో ఏసీబీ మరో కేసును నమోదు చేసింది. ఆ భూముల ఫైళ్లు ఆర్డీవో వద్ద పెండింగ్‌లో ఉన్న సమయంలో నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేసి, పాసు పుస్తకాలు జారీ చేశాడని ఆరోపణలు వచ్చాయి. దానిని విజిలెన్స్ అధికారులకు నివేదించారు.                       నకిలీ పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ధర్మారెడ్డితో తహశీల్దార్ నాగరాజు ఒప్పందం చేసుకున్నారని ఏసీబీ గుర్తించింది. కందడి లక్ష్మమ్మ, కందడి బుచ్చిరెడ్డి, కందడి మణెమ్మ, స్థానిక రైతు కందడి ధర్మారెడ్డికి నాగరాజు పాసుపుస్తకాలు ఇచ్చాడు. లంచం కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అంజిరెడ్డికి ధర్మారెడ్డి సమీప బంధువు. నలుగురికి పాసుపుస్తకాలిచ్చిన భూమి మొత్తం 24.16 ఎకరాలు అని తెలుస్తోంది. దీని విలువ 2.68 కోట్లుగా ఉంటుందని గుర్తించారు. మార్కెట్‌ విలువ ప్రకారం ఆ భూమి మొత్తం విలువ రూ.48.80 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు

ఎన్నికల విధులలో ఉన్న అధికారులకు, పోలీసు అధికారుల మధ్య పరస్పర అవగాహన, సమాచార మార్పిడి, సహకారం ఉన్నప్పుడే ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగలరని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులు నాలుగు జిల్లాల్లో ఉన్నాయని, జిహెచ్ఎంసీలో 6 జోన్లు, 30 సర్కిల్స్ ఉన్నాయని, దాదాపు 74 లక్షల ఓటర్లు ఉంటారని, 8000 పైచిలుకు పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. పోలీస్ అధికారుల ముఖ్యమైన విధులు శాంతిభద్రతలు కాపాడుతూ స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం అన్నారు. ఎన్నికల సమయంలో లైసెన్స్ లేని ఆయుధాలు సీజ్ చేయాలని, లైసెన్స్ ఆయుధాలు కలిగినవారు తమ ఆయుధాలు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సంబంధిత పోలిస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని, బీట్ పెట్రోలింగ్ పెంచాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని చట్టప్రకారం శిక్షించాలని అన్నారు. రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన రోజు నుండి మున్సిపల్ సర్కిల్ లలో పరిస్థితులను బట్టి తగినన్ని స్టాటిక్ సర్వేలేన్స్ టీములు, ఫ్లైయింగ్  స్క్వాడ్ లు, చెక్ పోస్టులు, పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ప్లాన్ తయారు చేయాలని, సమస్యలు సృష్టించే అరాచక శక్తులపై 24 గంటలు నిఘా పెట్టాలని, ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించాలని, రౌడీ మూకలు చెలరేగకుండా చూడాలన్నారు. మోడల్ కోడ్ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, వాహనాలు, లౌడ్ స్పీకర్ల వాడకం, పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయడం, లిక్కర్ షాపులు మూసివేయడం వంటి సూచనలు విధిగా అమలయ్యేలా చూడాలన్నారు.  ఎన్నికల ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి ఒక మెకానిజం తయారు చేసుకొని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ సెంటర్లవద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ రోజున అల్లరి మూకలను అదుపు చేయడానికి తగినన్ని స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, ఎప్పటికప్పుడు సానిటైజర్తో చేతులు శుభ్రపరుచుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో పొలీస్ అధికారులతో సమన్వయ పరచుకోవడానికి ప్రత్యేక విభాగాన్ని నోడల్ ఆఫీసర్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసి అన్ని రకాల  సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధికారులు సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో సంప్రదించి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని, ఎటువంటి వివక్ష లేకుండా పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుతూ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సజావుగా జరుగునట్లు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ. సజ్జనార్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, అడిషనల్ డిజీపి (శాంతి భద్రతలు) జితేంద్ర, సూపరింటె౦డెంట్ ఆఫ్ పోలీస్, సంగారెడ్డి, ఇతర పోలిస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మహాకూటమిదే బీహార్? ఎగ్జిట్ పోల్స్ లో లీడ్

హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మహా ఘట్ బంధన్ కూటమికే ఆధిక్యం కనిపిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమికి 100 నుంచి 115... బీజేపీ, అధికార జేడీయూలతో కూడిన ఎన్డీయే కూటమికి 90 నుంచి 110 స్థానాలు... ఎల్జేపీకి 3 నుంచి 5 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.  టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వేలో ఎంజీబీ కూటమికి 120... ఎన్డీయే కూటమికి 116, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు దక్కుతాయని తేలింది.   ఎంజీబీ కూటమికి 108 నుంచి 131 స్థానాలు, ఎన్డీయేకి 104 నుంచి 128 స్థానాలు లభిస్తాయని ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ప్రకటించింది. రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వేలో... ఎంజీబీ కూటమికి 118 నుంచి 138 స్థానాలు, ఎన్డీయే కూటమికి 91 నుంచి 117 స్థానాలు, ఎల్జేపీకి 5 నుంచి 8 స్థానాలు, ఇతరులు 3 నుంచి 6 స్థానాలు గెలుస్తారని అంచనా వేశారు. అయితే అన్ని సర్వేల్లోనూ రెండు కూటముల మధ్య తేడా మాత్రం చాలా స్వలంగానే ఉంది. దీంతో ఫలితాల్లో ఏదైనా జరగవచ్చని భావిస్తున్నారు. మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 60 శాతం వరకు పోలింగ్ జరిగింది.

ఆమెకు ఛాన్స్ ఇస్తే.. అసెంబ్లీ, సెక్రటేరియట్ ను కూడా పేకాట క్లబ్ గా మార్చేస్తుంది: అనిత 

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఒకప్పటి ఆమె అనుచరుడు, ఆ పార్టీ బహిష్కృత నేత సందీప్ తాజాగా చేస్తున్న ఆరోపణల పై తీవ్ర దుమారం రేగుతోంది. ఊరికి దూరంగా ఉండే తోటలలో పేకాట క్లబ్ నడిపే విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి... సందీప్ సలహా కోరుతున్నట్టుగా తాజాగా ఒక ఆడియో బయటపడింది. దీనిపై టీడీపీ పార్టీకి చెందిన తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేసారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా పేకాట క్లబ్బులు నిర్వహించడం వైసీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆమె అన్నారు.   ఇప్పటికే రాష్ట్రంలో ఊరూ, వాడా పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసి ప్రజలను గుల్ల చేస్తున్నారని, అసలు అవకాశం రావాలే గానీ ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ లలో కూడా పేకాట ఆడించేందుకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రెడీగా ఉన్నారని ఆమె విమర్శించారు. తనను ఎన్నుకున్న తాడికొండ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పేకాట క్లబ్ లపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేయాలని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనిత డిమాండ్ చేశారు. పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న శ్రీదేవి ఎమ్మెల్యేగా పూర్తిగా అనర్హురాలు అని ఆమె స్పష్టం చేశారు.   ఏపీ సర్కారు వెంటనే స్పందించి తాజాగా మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్ పై విచారణ జరిపించాలని అనిత డిమాండ్ చేసారు. పేకాట క్లబ్బులు నిర్వహిద్దామని స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పడంపై సీఎం జగన్ స్పందించాలని అనిత కోరారు. లేటెస్ట్ గా వాటాల పంపిణీలో విభేదాలు రావడంతోనే తనకు ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్యే శ్రీదేవి నాటకాలు ఆడుతున్నారని అనిత ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని ఏకంగా జూదాంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కామాఖ్యదేవికి మూడు బంగారు కలశాలు.. 20 కిలోలు విరాళమిచ్చిన అంబానీ దంపతులు 

అసోంలోని నీలాచల కొండల్లో కొలువైన కామాఖ్య దేవి ఆలయానికి 20కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు ముకేష్ అంబానీ దంపతులు. దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవికి బంగారం విరాళం ఇస్తామని మూడు నెలల కిందే అంబానీ దంపతులు ప్రకటించారు. ఆలయ వర్గాలకు సమాచారం అందించారు. మూడు కలశాల బంగారు తాపడం ఖర్చులు తాము భరిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున బంగారం అందించగా, ఆలయ కలశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.   కలశాల నిర్మాణ పనుల్లో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేశ్ అంబానీ, ఆయన అర్ధాంగి నీతా అంబానీ అసోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. దేశంలోని శక్తిపీఠాల్లో ప్రముఖమైన  కామాఖ్య ఆలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

అర్ధరాత్రి నోటీసులు, అరెస్టులు, కూల్చివేతలు! వేధింపులే లక్ష్యమన్న చంద్రబాబు 

అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి జీవీఎంసీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై ఈ రకంగా స్పందించడం వెనుక వేధింపు లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. కక్ష పూరిత చర్యల్లో భాగంగానే అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు అంటిస్తున్నారని టీడీపీ అధినేత  ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష రాజకీయాల కోసం పాలనా యంత్రాంగాన్ని, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు చంద్రబాబు.     అధికారంలో ఉన్నవాళ్లు ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రీపగలు ఆలోచిస్తారు, ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని కూడా ఉత్తేజపరుస్తారు... కానీ వైసీపీ పాలకుల తీరు వేరని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కక్ష ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనతో  వైసీపీ రాత్రుళ్ళు నిద్రకూడా పోతున్నట్టు లేదని ఆయన ఎద్దేవా చేశారు.  సబ్బం హరి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు సోమవారం వరకు స్టేటస్ కో విధించిందని, కానీ అంతలోనే భవనాలు తొలగించాలంటూ ప్రభుత్వం మరో నోటీసును పంపించిందంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఆ నోటీసును కూడా రాత్రివేళ ఇంటికి అంటించిపోయారని ఆరోపించారు.    సబ్బం హరికి జీవీఎంసీ అధికారులు గురువారం రాత్రి నోటీసులు జారీచేశారు. రిజర్వు ఓపెన్‌ స్పేస్‌లో భవనాలను నిర్మించారని, 3 రోజుల్లో వాటిని తొలగించాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు  టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది హరి ఇంటికి వెళ్లగా ఆయన లేరు. ఆ నోటీసును తీసుకునేందుకు వాచ్‌మన్‌ నిరాకరించడంతో గోడకు అతికించి వెళ్లిపోయారు. జీవీఎంసీకి అందించిన స్కీమ్‌ ప్లాన్‌ ప్రకారం సుమారు 2,200 గజాల స్థలాన్ని రిజర్వు ఓపెన్‌ స్పేస్‌గా మార్క్‌ చేశారు. ప్రస్తుతం అందులో కొంతభాగంలో సబ్బం హరికి చెందిన రెండు భవనాలు, గురవారెడ్డి, చిరంజీవిరెడ్డి, రాధాకృష్ణ అనే వ్యక్తులకు చెందిన భవనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పార్కు స్థలంలో సుమారు వంద గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ జీవీఎంసీ సిబ్బంది  నెల రోజుల కిందట తెల్లవారుజామున వాచ్‌మన్‌ గది బాత్‌రూమ్‌ను కూలగొట్టారు.                     మరోవైపు విశాఖలో ఉన్న తన స్థలంలోని నిర్మాణాల తదుపరి కూల్చివేతలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ మాజీ ఎంపీ సబ్బం హరి హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఆయన దాఖలు చేసుకున్న లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై సోమవారం వరకు స్టేట్‌సకో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ బీజేపీలో వర్గపోరు ముదురుతోందా?

తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోందా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాలుగా నేతలు విడిపోయారా? పార్టీ నేతల వలసల వెనక ఆయన హస్తం ఉందా?. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీ కేడర్ తో పాటు ప్రజల్లో వస్తున్న సందేహాలివి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలం పార్టీకి నాయకుల మధ్య వర్గపోరు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య వర్గ పోరు జరుగుతోందని సమాచారం. పార్టీ నేతలు కూడా ఇరు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు. నేతల మద్య వర్గపోరు ఉందనడానికి బలాన్నిచ్చేలా ఆ పార్టీలో వరుస ఘటనలు జరుగుతున్నాయి.    ఇటీవల కిషన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డికి టీఆర్ఎస్ నేత‌ల‌తో మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌నే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సిద్ధిపేట ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రిగా క‌లెక్ట‌ర్, సీపీని పిలిపించి మాట్లాడే అధికారం కిష‌న్ రెడ్డికి ఉన్నా ఎందుకు ఆ ప‌ని చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. అయితే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా బీజేపీ నేతలెవరు స్పందించలేదు. నిజానికి కేంద్రమంత్రిని టార్గెట్ చేశారు కాబట్టి పార్టీ అధ్యక్షుడైన సంజయే ఖండించాలి. కాని బండి ఆ పని చేయలేదు. అంతేకాదు ఇతర నేతలు కూడా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వలేదు. ఈ ఘటనతో బీజేపీలో కిషన్ రెడ్డికి, సంజయ్ వర్గాల మధ్య వార్ జరుగుతుందన్నది తెలుస్తోంది.    దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సిద్దిపేట పోలీసులు తనపై దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అయినా కేంద్రమంత్రిగా ఉన్నకిషన్ రెడ్డి ఆ ఘటనపై సీరియస్ గా స్పందించలేదని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కేంద్రమంత్రి హాోదాలో ఆయన జిల్లా కలెక్టర్, సీపీని పిలుపించుకుని మాట్లాడొచ్చు. కాని కిషన్ రెడ్డి మాత్రం దుబ్బాక వెళ్లి రఘునందన్ రావుతో మాట్లాడి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వచ్చేశారు. ఇది కూడా  ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే దానికి బలాన్నిస్తోంది. రఘునందన్ రావుది సంజయ్ టీమ్ వర్గంగా చెబుతారు, అందుకే దుబ్బాక ఉప ఎన్నికను కిషన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగుతున్నా కిషన్ రెడ్డి ఎక్కువగా ప్రచారం చేయకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది.    బండి సంజయ్ కమిటిలో కిషన్ రెడ్డి వర్గీయులను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్నిజిల్లాల్లోనూ కిషన్ రెడ్డికి అనుచరులుగా  ఉన్నవారిని పక్కన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి .. టీవీ చర్చల్లో పార్టీ వాయిస్ ఘనంగా వినిపించే జూబ్లీహిల్స్ ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డికి సంజయ్ టీమ్ లో చోటు దక్కకపోవడం అందరిని అశ్చర్యపరిచింది. కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నందువల్లే శ్రీధర్ రెడ్డిని తీసుకోలేదని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారని తెలుస్తోంది. శ్రీధర్ రెడ్డి తరహాలోనే చాలా మంది కిషన్ రెడ్డి అనుచరులకు బండి సంజయ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని పా్టీలో చర్చ జరుగుతోంది.    పార్టీలో తన మనుషులను నిర్లక్ష్యం చేయడంపై కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ తనకు తెలియకుండానే సంజయ్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. సంజయ్ తీరుతో అసహనంగా ఉన్న కిషన్ రెడ్డి... కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదని చెబుతున్నారు.ఈ కారణంగానే బండి సంజయ్ పై సిద్దిపేట పోలీసులు దాడి చేశారని ఆరోపణలు వచ్చినా.. కిషన్ రెడ్డి అంతగా స్పందించలేదని చెబుతున్నారు. కరీంనగర్ లో సంజయ్ ధీక్ష చేస్తున్నా.. షుగర్ లెవల్స్ పడిపోయి ఆస్పత్రిలో చేరినా కేంద్రమంత్రి అక్కడి వెళ్లలేదనే చర్చ జరుగుతోంది.   కిషన్ రెడ్డిపై కూడా తీవ్ర  ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్ వర్గ నేతలు.  సంజయ్ కు చెక్ పెట్టేందుకు కిషన్ రెడ్డి మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర సమస్యలపై బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిన రోజే.. ఢిల్లీనుంచి వీడియో కాన్పరెన్స్ లో కిషన్ రెడ్డి అవే అంశాలపై మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల్లో సంజయ్ కు  గ్రాఫ్  పెరగకుండా ఉండేందుకే కిషన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి ఎందుకు ఎక్కువగా ప్రచారం చేయలేదో చెప్పాల్సి ఉందన్నారు, రఘునందన్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన పార్టీ నేత కమలాకర్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి అనుచరుడేనని చెబుతున్నారు . కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీకి సవాల్ గా మారిన ఉప ఎన్నిక సమయంలో తమ అనుచరుడిని కంట్రోల్ చేయలేకపోయారా అని సంజయ్ వర్గ నేతలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జూబ్లీహిల్స్   పార్టీ ఇంచార్జ్ గా ఉన్న  శ్రీధర్ రెడ్డి కిషన్ రెడ్డి డైరెక్షన్ లోనే గులాబీ గూటికి చేరారని  చెబుతున్నారు బండి సంజయ్ వర్గీయులు.    బీజేపీలో మరో వివాదం కూడా ముదురుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా  ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే బండి సంజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి గత ఏడాది కాలంలో చాలా మంది నేతలు బీజేపీలో చేరారు. ఇప్పుడు పార్టీలో వారి హవానే నడుస్తుందన్నది పాత నేతల ఆరోపణ. వరంగల్ జిల్లాలో ఎంపీ గరికపాటి మోహన్ రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిని బండి ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోత్కుపల్లి హవా సాగుతుందంటున్నారు. కరీంనగర్ జిల్లాలో మాజీ ఎంపీ వివేక్, సోమారపు సత్యనారాయణ పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అంతా ఎంపీ ధర్మపురి  అర్వింద్ చెప్పినట్లు నడుస్తుండగా.. పాలమూరు జిల్లాలో జితేందర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ లోనూ  మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ఇంపార్టెన్స్ తగ్గిదంటున్నారు బీజేపీ లీడర్లు. తమను పట్టించుకోవడం లేదనుకుంటున్న నేతలంతా కిషన్ రెడ్డిని ఆశ్రయిస్తూ బండి సంజయ్ పై ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతున్నారు.    బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీలో వర్గ పోరు ముదురుతుందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్నపార్టీకి ఇలాంటివి ఇబ్బందులు తెస్తాయని చెబుతున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం కలుగుతుందని  కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరీ బీజేపీ నేతలు ఎలా ముందుకు వెళ్తారో..

రేషన్ గురించి ప్రశ్నిస్తే ఏకంగా తలలు పగలకొట్టాడు... ఏపీలో దారుణం 

రేషన్ షాపు టైమింగ్స్ దగ్గర నుండి.. సరుకుల కొలతలు, తూకం పైన ప్రశ్నించిన ఇద్దరు వ్యక్తుల పై ఒక రేషన్ షాప్ డీలర్ భర్త దాడి చేయడమేకాక ఏకంగావారి తలలు పగలగొట్టడం తో కలకలం రేగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి గ్రామంలో ఒక మహిళ ప్రభుత్వ రేషన్ దుకాణం డీలర్ గా ఉంది. అయితే ఆ రేషన్ షాపును మైంటైన్ చేసేది మాత్రం ఆమె భర్తగారే. ఆ రేషన్ షాపును టైం కు ఓపెన్ చేయకపోవడంతో పాటు సరుకుల కొలతలు, తూకంలో తేడాలు ఉండడంతో విసిగిపోయిన ఇద్దరు పౌరులు ఇదేమని ప్రశించడంతో బూతులు తిడుతూ... చేతికి దొరికినదానితో వాళ్లిద్దర్నీ చితకబాదిన అతడు తూకపు రాళ్లతో కొట్టి వారి తలలు పగలకొట్టాడు. దీంతో కొంత మంది స్థానికులు గాయపడిన వారిద్దరికీ సపోర్ట్ గా రాగా వారిని కూడా దుర్భాషలాడాడు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ రేషన్ డీలర్ భర్తపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

వారంలో గ్రేటర్ నోటిఫికేషన్! జోరుగా పార్టీల ఆకర్ష్ 

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నిక ముగియడంతో ఇప్పడు పార్టీలన్ని గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ చేశాయి. వారం రోజుల్లోనే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో నేతలు దూకుడు పెంచారు. జీహెచ్ఎంసీపై తమ పార్టీ జెండా పాతేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గ్రేటర్ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఎంతా వేగంగా చర్యలు తీసుకుంటుందో  అంతకంటే వేగంగా .. అధికారం కోసం పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. దీంతో బల్దియాలో ఇప్పుడు జంపింగుల పర్వం జోరందుకుంది. అన్ని పార్టీలు ఆకర్ష్ ఆపరేషన్ చేపట్టడంతో నేతల వలసలు ఊపందుకున్నాయి.                 రెండోసారి గ్రేటర్‌ హైదరాబాద్‌ పై పాగా వేయాలని భావిస్తున్న అధికార పార్టీ చాలా రోజుల క్రితమే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో సిటీ నేతలు ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే గ్రేటర్ లో తమను ఢీకొట్టేందుకు తహతహలాడుతున్న కమలం పార్టీకి.. ఝలక్‌ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ తన వ్యూహాలకు పదునుపెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికల నోటిపికేష్ కు ముందే బీజేపీని సిటీలో బలహీనం చేయాలని కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. నగరంలో కీలక బిజేపి నేతలను కారు ఎక్కించేలా ఆయన మంత్రాంగం జరుపుతున్నారని చెబుతున్నారు. కేటీఆర్ ప్లాన్ లో భాగంగానే జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌ శ్రీధర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారని చెబుతున్నారు. శ్రీధర్ రెడ్డి బాటలో పలువురు గ్రేటర్ కమలం నేతలు కూడా క్యూలో ఉన్నారని గులాబీ నేతలు చెబుతున్నారు.    గ్రేటర్ లో ఈసారి సెంచరీ కొడతామని చెబుతున్న కేటీఆర్.. తమకు ప్రధాన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్న బిజేపిని టార్గెట్ చేశారని చెబుతున్నారు. బీజేపీకి సరైన అభ్యర్థులే దొరకకుండా చేయాలని సిటీ టిఆర్ఎస్ కీలక నేతలకు కేటీఆర్‌ టాస్క్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. కేటీఆర్ అదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు నగరంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యాక్షన్ లోకి దిగారని చెబుతున్నారు. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టాక నగరంలోని కొందరు నేతలకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం ఉంది. అలాంటి నేతలందరిని టీఆర్ఎస్ లో చేర్పించేలా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ అసంతృప్త నేతలందరితో మాట్లాడుతూ వారిని కారెక్కించే పనుల్లో టిఆర్ఎస్ సీనియర్లు బిజీగా ఉన్నారని చెబుతున్నారు.     బీజేపీ కూడా కారుకు కౌంటర్ గా స్పీడ్ పెంచింది. సిటీలోని టీఆర్ఎస్ నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. గతంలో టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన వారిలో చాలా మంది ఆపార్టీ లో అసంతృప్తిగా ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యేతో విభేదాలతో కొందరు, పార్టీలోని మరో గ్రూపుతో పడక మరికొందరు గులాబీ కార్పొరేటర్లు సైలెంటుగా ఉన్నారని గుర్తించిన బీజేపీ పెద్దలు.. వారందరిని తమ పార్టీలోకి తీసుకొచ్చేలా చర్చలు జరుపుతున్నారని సమాచారం. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. మరికొందరు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కీలక నేతలు కూడా త్వరలోనే కమలం గూటికి చేరుతారంటున్నారు. కోర్ సిటీలో ఇలాంటి  చేరికలు ఎక్కువగా ఉంసటాయని గ్రేటర్ కమలం నేతలు చెబుతున్నారు.    మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే , హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనింకా అధికారికంగా ప్రకటించలేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఆయనకు విభేదాలు ఉన్నాయని, కచ్చితంగా ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వెళుతారనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుత కార్పొరేటర్లలో కొందరికి టీఆర్ఎస్ పార్టీ ఈసారి టికెట్లు ఇవ్వకపోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.  దీంతో అధికార పార్టీ టికెట్ నిరాకరించిన నేతలంతా తమ పార్టీలోకి వస్తారని గ్రేటర్ కమలం నేతలు అశిస్తున్నారు.    ఇక గ్రేటర్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు వల వేస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమని భావిస్తున్న చాలా మంది నేతలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నగరంలోని హస్తం నేతలు చెబుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ పరిధిలోనే 45 డివిజన్లు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్దమంటూ అన్ని పార్టీలకు చెందిన నేతలతో తమతో టచ్ లోకి వచ్చారని పీసీసీ నేతలు చెబుతున్నారు. ఎంఐఎంపై గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఓల్డ్ సిటీలో కనిపిస్తుందని, తమ కొంత వర్కవుట్ చేస్తే పాతబస్తీలోనూ మంచి ఫలితాలు వస్తాయని గ్రేటర కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు.    మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై అన్ని పార్టీలు పోకస్ చేయడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల వలసలతో పార్టీ కార్యాలయాల్లోనూ సందడి నెలకొంటుంది. రాబోయే రోజుల్లో జంపింగులు మరింత జోరుగా ఉంటాయని, ఎన్నికల నాటికి ఎవరూ ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని: వైసీపీ బహిష్కృత నేత  సెల్ఫీ వీడియో 

గుంటూరు జిల్లా తాడికొండ రాజకీయాల్లో గంటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆ పార్టీ బహిష్కృత నేత సందీప్ మధ్య కొంత కాలంగా సాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. సందీప్, సురేశ్ అనే వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే వైసీపీ బహిష్కృత నేత సందీప్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఉండవల్లి శ్రీదేవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కారణంగా తనకు ప్రాణహాని ఉందని, తనను సీఎం జగనే కాపాడాలని వేడుకున్నారు సందీప్.                  ఉండవల్లి శ్రీదేవి అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు సందీప్. సీఐ ధర్మేంద్ర, ఎమ్మెల్యే శ్రీదేవిలతో తనకు ముప్పు ఉందని, అక్రమ కేసుల కారణంగానే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. తన పరిస్థితి పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారని, మరణం తప్ప తనకు మరోమార్గం లేదంటూ సందీప్ కన్నీటి పర్యంతమయ్యారు. ఉండవల్లి శ్రీదేవికి మొదటి నుంచి అండగా ఉన్నానని, పార్టీ కోసం ఎంతో శ్రమించానని వీడియోలా తెలిపారు సందీప్.    కొన్నిరోజుల కిందట సందీప్, సురేశ్ గుంటూరు మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో వారిద్దరినీ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ పరిణామాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన సందీప్‌.. తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు.  

కర్ణాటక నుంచి రాజ్యసభకు ఖుష్బూ? తమిళనాడు ఎన్నికలే టార్గెట్ 

తమిళనాడులో పార్టీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించింది బీజేపీ. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. సినీ తారలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ ఖుష్బూ బీజేపీలో చేరారు. ఖుష్బూను తమ స్టార్ కాంపెయినర్ గా భావిస్తున్న కమల దళం అమెను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖుష్బూను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని చెబుతున్నారు.    కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఈ స్థానానికి డిసెంబరు ఒకటో తేదీన ఎన్నిక జరగనుంది. ఆ సీటు కోసం ఖుష్బూతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కర్ణాటకలో పోలీసు ఉన్నతాధికారిగా సేవలు అందించి, రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఐపీఎస్ అధికారి అన్నామలై పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.    అయితే బీజేపీ ప్రతిపాదనను రజనీకాంత్ అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన రాజకీయాలను దూరంగా ఉండాలని దాదాపుగా డిసైడయ్యారని చెబుతున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఖుష్బూను ఎంపిక చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఇమేజ్ పెరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఖుష్బూ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

త్వరలో ఆ పార్టీలో చేరనున్న మాజీ జేడీ లక్ష్మినారాయణ..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేన నుండి బయటకు వచ్చిన తరువాత కొంత కాలంగా సైలెంట్ గా ఉండి పోయారు. అయితే తాజాగా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అయన కేంద్ర బీజేపీ నాయకులతో డైరెక్ట్ గా కాంటాక్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అంటే ఏమాత్రం పడని అయన, ఏపీ బీజేపీ నేతలు కొంత మంది వైసీపీ అనుకూలవర్గంగా ఉండడంతో వారికంటే కేంద్ర నాయకత్వంతోనే చర్చించి చేరడం బెటర్ అని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికలలో తాను పోటీ చేసిన విశాఖ ఎంపీ సీటు నుండి మళ్ళీ పోటీ చేసే విషయం పై స్పష్టమైన హామీ కోసం అయన కేంద్ర నాయకులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.   ఇప్పటికే తనకు జనసేనలో ఎదురైన అనుభవంతో.. పక్కా ప్రణాళికతో విశాఖ ఎంపీ సీటు తనకే అనేది ఫైనల్ చేస్తే.. తాను అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటానని లక్ష్మీనారాయణ బీజేపీ పెద్దలతో చెప్పినట్లుగా సమాచారం. ఇప్పటికే ఢిల్లీ లో ఉండే ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేతతో అయన మాట్లాడారని మాజీ జేడీ సన్నిహితులు తెలియచేస్తున్నారు.   అయితే లక్ష్మీనారాయణ ఇప్పటికే విశాఖ లోక్ సభ నియోజకవర్గంపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో ఎక్కడ ఏ సమస్యలున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలి అనే విషయం పై ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేశారని సమాచారం. ఒకసారి బీజేపీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే.. ఆ పార్టీలో చేరి.. వర్క్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై బీజేపీ నాయకత్వం కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

రెచ్చగొడితే యుద్ధం తప్పదు! చైనా, పాక్ లకు రావత్ వార్నింగ్! 

సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న దాయాది దేశాలు చైనా, పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. రెచ్చగొడితే యుద్ధం తప్పదని హెచ్చరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, కాబట్టి యుద్ధానికి దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేమని చెప్పారు రావత్. తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఆర్మీ దుస్సాహసానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా బలగాలను భారత్ సమర్థంగా ఎదుర్కొంటుండడంతో చైనాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. చైనా, పాక్‌లు కలిసి ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయని బిపిన్ రావత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.    ఇక భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను సడలించేందుకు ఇరు దేశాల మధ్య ఎనిమిదో దఫా కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలోని చుషూల్ వద్ద శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదలైన చర్చలు రాత్రి ఏడు గంటలకు ముగిశాయి. భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్టు భారత అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను వెనక్కి తీసుకోవడం, సైనికుల ఉపసంహరణపై రోడ్‌మ్యాప్ ఖరారు చేయడం వంటివాటిపై ప్రధానంగా చర్చలు జరిగాయని మీనన్ తెలిపారు.

అభి‘మతం’మారితే..  ఇక అవస్థలే!

5 వేలు తీసుకున్న పాస్టర్లకు కేంద్రం షాక్   ఆ 5 వేలు కక్కిస్తారా? చర్యలు తీసుకుంటారా?   వారి ఎస్సీ. ఓబీసీ సర్టిఫికెట్లకూ ఎసరు   కరోనా కాలంలో ఏపీ సీఎం జగనన్న సర్కారు చర్చి పాస్టర్లకు ప్రేమతో ఇచ్చిన 5 వేల నజరానా... ఇప్పుడు మతం మారిన పాస్టర్ల మెడకు ఉచ్చులా మారనుంది. అదే సమయంలో జగన్ సర్కారుకూ పితలాటకంగా పరిణమించింది. హిందూ మాల-హిందూ మాదిగకు చెందిన వారు ఎస్సీలు- ఓబీసీ సర్టిఫికెట్లు తీసుకుంటూనే, సర్కారు నుంచి ఈ సాయం పొందడంతో కేంద్రం రంగంలోకి దిగింది.   లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చాలాకాలం నుంచి, దీనిని వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటంపై, కేంద్రం ఎట్టకేలకూ స్పందించింది. దీనితో ఎస్సీ-ఓబీసీ సర్టిఫికెట్లు ఉండి, మతం మారిన పాస్టర్లు చిక్కుల్లో పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. వారితోపాటు, మతం మారిన ఎస్సీ-ఓబీసీలు కూడా సమస్యలు ఎదుర్కోక తప్పని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కేంద్రం ఆదేశాల ప్రకారం వారి సర్టిఫికెట్లకూ ఎసరు తప్పదంటున్నారు.   ఏపీలో శాతం 70మంది పాస్టర్లకు, ఇప్పటికీ హిందూ ఎస్సీ-ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయి. అయితే క్రైస్తవ మతంలో మారిన వారంతా.. ఇప్పటికీ ఎస్సీ-ఓబీసీ ఫలాలు అనుభవిస్తున్న వైనంపై, చాలాకాలం నుంచి వివాదం కొనసాగుతోంది. క్రైస్తవం లోకి మారిన వారికి ఆ ఫలాలు అందివ్వడం వల్ల, నిజమైన హిందూ మాల-హిందూ మాదిగ వర్గాలకు ఆ ఫలాలు అందకుండా పోతున్నాయని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చాలాకాలం నుంచి పోరాడుతోంది.   ఆ మేరకు ఆ సంస్ధ కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ వస్తోంది. గత కొంతకాలం క్రితమే దీనిపై స్పందించిన రాష్ట్రపతి, ఆ వివరాలేమిటో పరిశీలించి తగిన చర్యలు  తీసుకోవాలని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అయినా దానిపై జగన్ సర్కారు నుంచి స్పందన కనిపించలేదు. ప్రధానంగా కరోనా కాలంలో పాస్టర్లకు 5 వేలు ఇచ్చిన వైనం వివాదాస్పదయింది. నిజమైన క్రైస్తల పాస్టర్లకు అవి ఇవ్వడం బదులు, హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి వెళ్లిన పాస్టర్లకు ఇవ్వడాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది.   అయితే, తాజాగా కేంద్ర సామాజికన్యాయ శాఖ దీనిపై కొరడా ఝళిపించింది. క్రైస్తవులుగా మారి, ఎస్సీ-ఓబీసీ ఫలాలు అనుభవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 వేలు పొందిన పాస్టర్లపై చర్యలు తీసుకోవాలని జగన్  ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో కరోనా కాలంలో 5 వేలు పొందిన మతం మారిన పాస్టర్లు చిక్కుల్లో పడే ప్రమాదం ఏర్పడింది. నిజానికి అవి మతం మారకుండా, నిజమైన క్రైస్తవులకే దక్కాల్సి ఉంది.   నిజానికి 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీలు ఇస్లాం-క్రైస్త్రవంలోకి మారితే వారి ఎస్సీ హోదా పోతుంది. కానీ 1977లో, ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు.. 341 నెంబరుతో తీసుకువచ్చిన ఉత్తర్వు.. ఎస్సీ నుంచి క్రైస్తవం లోకి మారినప్పటికీ, రాజ్యాంగం కల్పించిన అన్ని వెసులుబాట్లూ కల్పించింది. విద్య, ఉద్యోగం, ఉపాథితోపాటు ఎన్నికల్లో అవకాశంపై ప్రాధాన్యత మినహాయించి, ఎస్సీలకు అందే అన్ని సౌకర్యాలుకూడా, మతం మారిన క్రైస్తవులకు అందేలా ఈ జీఓ ఇచ్చారు. దీనిని రద్దు చేయాలని, దీనివల్ల నిజమైన హిందూ ఎస్సీలు తమ రిజర్వేషన్ సౌకర్యంతోపాటు, ఇతర వెసులుబాటు కోల్పోతున్నారంటూ  లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొన్నేళ్ల నుంచీ కేంద్రంపై పోరాడుతోంది.   ప్రధానంగా ఎస్సీలకు దక్కాల్సిన ఉచిత ఇళ్లు, ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాల వంటి రాయితీలను, క్రైస్తవంలోకి మారిన వారు అడ్డదారిలో అనుభవిస్తున్నారంటూ ఫోరం ఉద్యమం కొనసాగిస్తోంది. ఇలాంటి విధానం-వెసులుబాటు, దేశంలోని మరే రాష్ట్రాల్లోనూ అమలుకాకపోవడం విశేషం. కేవలం ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లోనే అమలవుతున్న ఈ విధానాన్ని తొలగించి, నిజమైన ఎస్సీలకు న్యాయం చేయాలని ఫోరం కేంద్రం తలుపుతట్టింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ సర్కారు ఎస్సీల సంక్షేమం కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే హిందూ మాల-హిందూ మాదిగ కులాల సంక్షేమం కోసమే, ఆ నిధులు కేటాయించారన్న మాట! అయితే, వాటిని మతం మారిన 80 శాతం మంది క్రైస్తవులు, ఎస్సీ-ఓబీసీ సర్టిఫికెట్లతోనే ఆ నిధులు అనుభవిస్తుండటాన్ని, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తప్పుపడుతూ వస్తోంది.   నిజమైన ఎస్సీలు అనుభవించాల్సిన 15 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను, మతం మారిన క్రైస్తవులు కొల్లగొడుతున్నారంటూ ఫోరం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. ఫోరం ఫిర్యాదుపైనే రాష్ట్రపతి స్పందించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇప్పుడు  కేంద్రం కూడా రంగంలోకి దిగడంతో, ఎస్సీ-ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నా, మతం మారిన పాస్టర్లు-ఇతరులు చిక్కుల్లో పడినట్టయింది. మరి దీనిపై జగన్ సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.  -మార్తి సుబ్రహ్మణ్యం

జగన్‌ లేఖ బహిర్గతంపై 16న విచారణ.. కోర్టు ధిక్కరణ ప్రక్రియపై ఏజీకి మరో లేఖ 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖకు కొనసాగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడంతో పాటు సీజేఐ కు ఏపీ సీఎం రాసిన లేఖ బహిర్గతం చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలపైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈనెల 16న విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణ జాబితాలో ఈ పిటిషన్లను చేర్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్ రవీంద్రభట్‌ నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణ జాబితాలో ఈ పిటిషన్లను చేర్చింది. జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్ రవీంద్రభట్‌ నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ చేపట్టనుంది.    న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌కుమార్‌ సింగ్‌, సునీల్‌కుమార్‌ సింగ్‌తో పాటు యాంటీ కరప్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. కోర్టులపై ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని సునీల్‌కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంలో చర్యలెందుకు తీసుకోకూడదో చెప్పేందుకు సీఎం జగన్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేయడంపై జీఎస్‌ మణి, ప్రదీప్‌కుమార్ పిటిషన్‌ దాఖలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేసినందుకు సీఎంగా జగన్‌ను తొలగించాలని కోరారు.     సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై నిరాధారమైన ఆరోపణలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తమ పిటిషన్లలో కోరారు లాయర్లు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని బహిర్గతం చేయడం ద్వారా జగన్ న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని  ఆరోపించారు.  జగన్ చర్యల ద్వారా  రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని చూస్తున్నారని  పిటిషన్ దారులు చెప్పారు. గతంతో పోలిస్తే, న్యాయస్థానాలపై ఆరోపణలు వస్తే, అవి ప్రజల్లోకి వేగంగా వెళుతున్నాయని, ఇది సమాజానికి చెడు సంకేతాలను పంపుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు లాయర్లు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ చర్యలున్నాయన్నారు.     ఏపీ సీఎం జగన్ లేఖకు సంబంధించి పిటిషనర్లు కీలక అంశాలను తమ పిటిషన్లలో ప్రస్తావించారు. జగన్ ఆరోపణలు చేసిన సమయం అనుమానించ తగినదేనని చెప్పారు. మాజీలు, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించాలన్న కేసును ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తున్న వేళ, ఈ ఆరోపణలు వచ్చాయని, అది కూడా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి చేశారని గుర్తు చేస్తూ, ఆయనపైనా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని తన పిటిషన్ లో  పేర్కొన్నారు సునీల్ కుమార్ సింగ్.    మరోవైపు ఈ వ్యవహారంలో సీఎం జగన్‌, ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయకల్లంపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు తనకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్‌ ఇప్పటికే అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కి లేఖ రాశారు. అయితే ఆ విషయం ప్రస్తుతం సీజేఐ పరిధిలో ఉన్నందున కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతివ్వలేనంటూ అశ్వినీకుమార్‌కు ఏజీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో అశ్వినీకుమార్‌ గురువారం ఏజీకి మరో లేఖ రాశారు. ప్రస్తుతం సీజేఐ పరిధిలో ఉన్నది జగన్‌ రాసిన లేఖే తప్ప.. అది కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుందంటూ తాను చేసిన ఫిర్యాదు కాదని, అందువల్ల కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతివ్వాలని ఆయన కోరారు.     సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ రాసిన లేఖ రాయడం, దాని మీడియాకు బహిర్గతం చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. జగన్ లేఖలపై వివిధ బార్ అసోసియేషన్లు, అఖిల భారత న్యాయవాదుల సంఘం, దేశంలో పలు కోర్టుల న్యాయవాదుల సంఘాలతో పాటు పలువురు సీనియర్ అడ్వకేట్లు తీవ్రంగా స్పందించారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా లేఖ రాసిన ఏపీ ముఖ్యమంత్రిపై జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సీజేఐకి కి జగన్ రాసిన లేఖ బహిర్గతం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

మ్యుటేట్ అయిన కరోనా వైరస్.. ఇది వ్యాపిస్తే వాక్సిన్లు ఎందుకు పనికిరావు 

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పటికే ఎన్నో రూపాంతరాలు (మ్యుటేషన్) చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అది మరింత ప్రమాదకరంగా మారుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్‌లో తాజాగా సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయని, ఈ మార్పు చెందిన తర్వాత వైరస్ కనుక విస్తృతంగా వ్యాపిస్తే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వాక్సిన్లు కూడా ఎందుకూ పనికి రాకుండా పోతాయని వారు హెచ్చరిస్తున్నారు.   డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుండి ఈ రూపాంతరం చెందిన వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్టు స్టేటెన్స్ సీరమ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా శాస్త్రవేత్తల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం వందల కొద్దీ మింక్ జంతువుల ఫారాలు ఉన్న జూట్‌ల్యాండ్‌లో కఠిన ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఉత్తర డెన్మార్క్‌లో ఈరోజు నుండి కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రధాని మెట్టి ఫ్రెడ్రెక్సన్ తెలిపారు. ఆ ప్రాంతంలో నివసించేవారు ఎటువంటి ప్రయాణాలు చేయవద్దని, దీనిని ఉల్లంఘిస్తే కనుక వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.