హరి హరీ.. ఎస్వీబీసీలో కలకలం రేపుతున్న అశ్లీల సైట్ లింక్

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న భక్తి ఛానల్ ఎస్వీబీసీలో పోర్న్‌సైట్‌ లింక్ తీవ్ర కలకలం రేపింది. ఎస్వీబీసీలో శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఆ ఛానెల్ కు ఒక భక్తుడు మెయిల్ చేశాడు. దానికి జవాబుగా తిరిగి భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్‌ సైట్‌ లింక్ పంపాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీవారి భక్తుడు ఈ వ్యవహారం పై టీడీడీ చైర్మన్‌, ఈవోకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఎస్వీబీసీ ఆఫీసులో టీటీడీ విజిలెన్స్‌, సైబర్‌ క్రైం అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో ఛానల్ కార్యాలయంలో పోర్న్‌ సైట్‌ లింక్ పంపిన ఉద్యోగితో పాటు.. బాధ్యతలు మరిచి పోర్న్‌సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగుల్ని సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ గుర్తించింది. అలాగే తమ విధులు నిర్వర్తించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని కూడా అధికారులు గుర్తించారు. దీంతో ఎస్వీబీసీ అధికారులు, బాధ్యతలు మరిచిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై రాములమ్మ సెన్సేషనల్ కామెంట్స్

దుబ్బాక ఉపఎన్నిక టీఆరెఎస్ కు పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. మంత్రి హరీశ్‌రావు లేకుంటే దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు డిపాజిట్‌ కూడా దక్కేది కాదని అన్నారు. టీఆర్‌ఎస్‌ అహంకార ధోరణికి, కేసీఆర్‌ దొర నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై వ్యతిరేకతను ఓటు ద్వారా వెల్లడించారని మంగళవారం స్పష్టంచేశారు. లక్ష మెజారిటీ ఖాయమన్న టీఆర్‌ఎస్‌ నేతలు తర్వాత ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే అన్నారని, అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారారో వారికి వారే సమీక్షించుకోవాలని టీఆర్‌ఎస్ కు సూచించారు. దొర పాలనకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి దుబ్బాక ప్రజలు ఊపిరి పోశారని ఆమె అన్నారు. ఇది ఇలా ఉండగా టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి త్వరలో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 14న ఆమె ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది.

కోడిగుడ్డు.. వెరీ‘గుడ్డు’.. అందులో అవినీతి గాడిద గుడ్డేనట!

బీజేపీ అధ్యక్షుడి ఆరోపణలపై గాలి తీసిన శుక్లా   ఒక్క ఫిర్యాదూ రాలేదని వెల్లడి   రాష్ట్రంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల సరఫరాలో.. 700 కోట్ల అవినీతి జరుగుతోందన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలో, ఏమాత్రం పస లేదని ఐఏఎస్ అధికారి గాలి తీసిన వైనమిది. పైగా.. రాష్ట్రంలో కోడిగుడ్ల సరఫరా అద్భుతమని ,స్వయంగా కేంద్రమంత్రి ఇచ్చిన కితాబును గుర్తు చేయడం ద్వారా.. సదరు బీజేపీ నేత ఆరోపణలో పసలేదని జగన్ సర్కారు చెప్పకనే చెప్పినట్లయింది. ఏమిటీ కోడిగుడ్ల లొల్లి అనుకుని తల గోక్కుంటున్నారా?..  అయితే ఓసారి అలా ఆ కోడిగుడ్డు కథలోకి వెళ్లొద్దాం రండి.   రాష్ట్రంలో జరుగుతున్న కోడిగుడ్ల సరఫరాలో అవినీతి జరుగుతోందని, దాదాపు 700 కోట్ల రూపాయల మేర జరిగిన అవినీతిపై,  విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు,  ఇటీవల రాజమండ్రిలో ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఆయన దానిపై మాట్లాడిన వెంటనే, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరక్టర్ కృతికా శుక్లా తెర పైకొచ్చారు. 15 వేల మంది లబ్ధిదారులను సంప్రదించగా, ఏ ఒక్కరూ కోడిగుడ్ల నాణ్యతపై ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కూడా ప్రశసించారని గుర్తు చేశారు. అసలు బడ్జెట్ మొత్తమే  423.43కోట్ల రూపాయలని తే ల్చడం ద్వారా, సోమును ఆత్మరక్షణలో నెట్టేసినట్టయింది.   కేంద్రం ఇటీవల నిర్వహించిన పోషణాభియాన్ సర్వేలో కూడా.. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు,  నూటికి నూరు శాతం బాగా పనిచేస్తున్నాయన్న వాస్తవం వెల్లడయిందని శుక్లా చెప్పారు. గుడ్ల సరఫరాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పాత్ర లేదని, వాటిని పాఠశాల విద్యశాఖనే ఖరారు చేస్తోందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, గుడ్లు తీసుకునే ముందు వాటి బరువు తనిఖీ చేసి, తక్కువ బరువున్న గుడ్లను వెనక్కి పంపుతారన్నారు.   కరోనా వల్ల..  గుడ్లను లబ్థిదారుల ఇళ్లకే పంపుతున్నామని, ఆ సందర్భంగా ఏ ఒక్కరూ ఇప్పటిదాకా వాటిపై ఫిర్యాదు చేయలేదన్నారు. దీనికోసం తాము టోల్‌ఫ్రీ నెంబర్  1148 ఏర్పాటుచేసి, ప్రతి 15 రోజులకోసారి లబ్థిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని శుక్లా వివరించారు. పోషకాహారంగా అందిస్తున్న గుడ్ల కోసం 423.43 కోట్లు వార్షిక బడ్టెట్‌గా వాడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా 92.40 కోట్ల గుడ్లు..  30.50 లక్షల మంది లబ్ధిదారులకు చేరుతున్నాయని వెల్లడించారు. కానీ సోము మాత్రం ఇటీవలి రాజమండ్రి విలేకరుల సమావేశంలో..  ఇందులో 700 కోట్ల అవినీతి జరిగిందని, ఆరోపించడం ప్రస్తావనార్హం.     అంటే.. కృతికా శుక్లా వివరణ ప్రకారం.. బీజేపీ దళపతి సోము,  కోడిగుడ్లపై గత కొంతకాలం నుంచి చేస్తున్న ఆరోపణల్లో పసలేదని స్పష్టం చేసినట్లయింది. ఆయన తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా,  కోడిగడ్ల అవివీతిని ప్రస్తావించడం విశేషం. పైగా స్వయంగా కేంద్ర మానవ వనురుల శాఖ మంత్రి,  పోషణాభియాన్ సర్వేలో కూడా కోడిగుడ్ల సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై రాష్ట్ర పనితీరును ప్రశంచారని, శుక్లా గుర్తు చేయడం మరో విశేషం. అంటే.. సోము వీర్రాజు వాదన ప్రకారం..  కేంద్రమంత్రికి గానీ, పోషణాభియాన్‌పై సర్వే చేసిన సంస్థలకు గానీ ఏమీ తెలియదని చెప్పకనే చెప్పినట్టయింది.   ఇప్పటిదాకా ఒక్కరు కూడా, కోడిగుడ్ల నాణ్యతపై ఫిర్యాదు చేయలేదన్న శుక్లా వివరణ కూడా, సోము వీర్రాజు ఆరోపణలను గాలి తీసినట్టయింది. మరి సోము ఏ లక్ష్యంతో,  ఈ ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ప్రశంసించిన పథకంలో కూడా..  రాష్ట్ర అధ్యక్షుడు రంధ్రాన్వేషణ చేయడమే వింతగా ఉందని, దీనివల్ల కేంద్రమంత్రికి ఏమీ తెలియదన్న భావన ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు.  -మార్తి సుబ్రహ్మణ్యం

బీహార్ లో ఎన్డీయేకు అత్తెసరు మెజారిటీ.. ఇక దినదిన గండమేనా..  

దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ రోజు తెల్లవారుఝామున 3 గంటలకు వచ్చిన తుది ఫలితంతో స్పష్టమయ్యాయి. ఈ ఎన్నికలలో ఎన్డీయే అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి 125 స్థానాలను సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ 122 కాగా, దానికంటే కేవలం మూడు సీట్లను మాత్రమే ఎక్కువగా సంపాదించడం ద్వారా ఎన్డీయే అధికారాన్ని నిలుపుకుంది. అయితే ఒక పక్క బొటాబొటి మెజారిటీ ఉండడమే కాకుండా మరోపక్క ప్రతిపక్షం చాలా బలంగా ఉండటంతో బీహార్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ప్రతి రోజు గండాలు ఎదుర్కోవాల్సి రావచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.   ఇది ఇలా ఉండగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మహా ఘటబంధన్ 110 సీట్లకు పరిమితం కాగా, కేంద్రంలో ఎన్డీయేలో ఉండి కూడా రాష్ట్రంలో మాత్రం ఆ కూటమిలో చేరకుండా.. విడిగా పోటీ చేసిన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 1 స్థానానికే పరిమితం కాగా, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. పలు చోట్ల ఈవీఎంలు తెరచుకోకపోవడంతో.. కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 15 గంటల పాటు కొనసాగింది.   హోరాహోరీగా సాగిన బీహార్ తాజా ఎన్నికలలో.. గెలిచిన, ఓడిపోయిన రెండు కూటముల మధ్య ఓట్ల తేడా కనీసం ఒక శాతం కూడా లేదు. ఇక ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 74, జేడీయూకు 43, మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చాకు 4, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీకి 4 స్థానాలు గెలుచుకోగా.. ఈ మొత్తం కలిపి 125 సీట్లు అయ్యాయి. అయితే ఈ రెండు చిన్న పార్టీల్లోని ఏ పార్టీ దూరమైనా, బీహార్ లోని ఎన్డీయే సర్కారుకు గండమే. ఇక ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా బీజేపీ.. ప్రస్తుత సీఎం నితీశ్ కే సీఎం అవకాశాన్ని ఇస్తుందా.. లేక తమది పెద్ద పార్టీ కాబట్టి, మరో నేతను తెరపైకి తెస్తుందా? అనే విషయం రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.

దెబ్బేసిన.. దుబ్బాక!

విజేత వకీల్‌సాబ్   కేసీఆర్ పథకాలేమాయె?   ఒక ఎన్నిక.. అనేక ఫలితాలు   అవును. ఆరడగులబుల్లెట్ చెప్పినట్లు అక్కడ ఓటర్లు కరెంటు మోటారుకే ఓటెత్తారు. ఇంకో చిచ్చరపిడుగు చెప్పినట్లు అక్కడి నుంచే టీఆర్‌ఎస్ పతనం మొదలవనుంది. మరో ఫైర్‌బ్రాండ్ చెప్పినట్లు కమల వికాసం అక్కడి నుంచే ఆరంభం కానుంది. యస్. ఇవన్నీ అధికార టీఆర్‌ఎస్‌ను దెబ్బేసిన, దుబ్బాక జనం ఇచ్చిన ఎన్నిక తీర్పు సంకేతాలు. ఊపిరాడని ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నిక.. చివరాఖరకు వకీల్‌సాబ్‌నే విజేతగా నిలిపింది. అయితే ఎన్నిక ఒక్కటే.. ఫలితాలే అనేకం! కడదాకా ‘హీరో’చితంగా పోరాడి విజేతగా నిలిచిన బీజేపీ.. కొసప్రాణం వరకూ పోరాడి ఓడిన టీఆర్‌ఎస్.. ముచ్చటగా మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక ఫలితం అనేక గుణపాఠాలు.   దుబ్బాక ఉప ఎన్నికలో, టీఆర్‌ఎస్ గెలుస్తుందన్న సర్వే సంస్థల అంచనాలు, దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రచార సరళి చూసిన వారికి సైతం, బీజేపీ రెండోస్థానంలో నిలుస్తుందన్న భావన ఏర్పడింది. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం, ఆరడగుల బుల్లెట్ హరీష్‌రావు చేసిన ప్రచారం, బీజేపీ నేతల మైండ్‌గేమ్, కాంగ్రెస్ వైఫల్యాలు.. కలసి వెరసి బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు విజయానికి బాటలు వేశాయి. ఆయన గెలిచింది కేవలం 1,118 ఓట్లతోనే అయినప్పటికీ, ఇప్పటి పరిస్థితిలో అది అద్భుత-అనన్య-అపురూప-అనూహ్య విజయమే.   ఈ ఫలితం నిస్సందేహంగా అధికార టీఆర్‌ఎస్‌కు చావుదెబ్బ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలుచేస్తున్నామని గొప్పలతో జనంలోకి వెళ్లిన కారును, జనం మధ్యలోనే నిలిపివేశారు. దీనికి సంబంధించి బీజేపీ విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ ప్రత్యామ్నాయమయితే కొంపలుమునుగుతాయనుకున్న కేసీఆర్.. కమలం పార్టీని శత్రువుగా కొని తెచ్చుకున్న వ్యూహం వికటించి, బొక్కబోర్లా పడింది. ఇన్ని పథకాలు అమలుచేస్తున్నా, ప్రజలు కారును బోల్తా కొట్టించారంటే.. అది నిస్సందేహంగా తెరాసకు తిరోగమనమే. మరి అన్ని పథకాలతో ప్రజలు లబ్థిపొందుతుంటే, ఆ పార్టీని ఎందుకు తిరస్కరించారన్న ఆత్మవిమర్శ,  కేసీఆర్‌లో ఆరంభమయితే మంచిదే. అలా కాకుండా.. కేవలం ‘ఒక్క ఉప ఎన్నికనే కదా’... అని లైట్ తీసుకుంటే, వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోనూ ప్రమాదఘంటిక తప్పదు. దాదాపు వందకోట్లకు పైగా ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతున్నా, ప్రజలు కమలాన్నే విరబూయించడం కచ్చితంగా ఆత్మవిమర్శకు అర్హమైనదే. అలాకాకపోతే, బీజేపీ దళపతి సంజయ్ చెప్పినట్లు.. ఇక తెలంగాణలో కమల వికాసం దుబ్బాక నుంచి మొదలయినట్లే లెక్క.   దుబ్బాక  ఎన్నికలో అందరి కంటే దెబ్బ తిన్నది ఆరడగులు బుల్లెట్ హరీష్‌రావు. ట్రబుల్‌షూటర్‌గా ఉన్న పేరు కాస్తా ఈ ఫలితంతో కొట్టుకుపోయింది. ఈ ఎన్నిక రాకపోతే, ఆయన కీర్తి అలాగే నిలిచేదేమో? ఆయన చెప్పినట్లు జనం.. కారు మోటరు కాకుండా, కరెంటు మోటరుకే ఓటేశారు. అంటే... తెలంగాణ ప్రజలు కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ విధానాన్ని ఆమోదించారన్న మాట. ఈ ఫలితంతో వ్యక్తిగతంగా కేసీఆర్‌కు గానీ, కేటీఆర్‌కు గానీ వచ్చిన నష్టమేమీలేదు. ప్రచారమంతా హరీష్‌రావే చూసుకున్నందున, ఈ పరాజయం కూడా ఆయన ఖాతాలోకే వెళ్లడం సహజం. నిజానికి టీఆర్‌ఎస్ అభ్యర్ధికి సానుభూతి పవనాలు బ్యాలెట్ల రూపంలో వీచితీరాలి. కానీ, అది కూడా పనిచేయడం లేదంటే, సర్కారుపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. గెలుపు-ఓటములకు తేడా వందల ఓట్లే అయినప్పటికీ, ఫలితం మాత్రం కేసీఆర్ పాలనకు తీర్పుగానే భావించక తప్పదు.   ఇక తెలంగాణలో..  ‘ఉత్తరకుమారుడి’ సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, శిథిలావస్థకు దుబ్బాక మరో విషాద సంకేతం. ఆయన సారథ్యంలో.. వరస వెంట వరస విజయవంతంగా జరుగుతున్న పరాజయయాత్రలో, దుబ్బాక కూడా చేరింది. రేవంత్‌రెడ్డి వంటి గొంతున్న నేతల ప్రసంగాలు.. చప్పట్లు కొట్టించాయే తప్ప, ఓట్లు రాల్చలేదని స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీ బహు నాయకత్వం ఇలాగే వర్ధిల్లితే, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ, ఆ పార్టీకి పరాభవం తప్పదు.   ఏటికి ఎదురీది, కేసీఆర్ సర్కారును మొండిధైర్యంతో ఎదుర్కొంటూ వస్తున్న.. తెలంగాణ కమలదళపతి బండి సంజయ్ తెగింపునకు, దుబ్బాక సగౌరవ ఫలితమిచ్చింది. ‘కార్పొరేటర్ స్ధాయికి ఎక్కువ-జిల్లా స్థాయికి తక్కువ నేత’గా..  ఇన్నాళ్లూ ఆయనపై ఉన్న ‘ఎద్దేవా లాంటి ముద్ర’, దుబ్బాక విజయంతో చెరిగిపోయింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పెద్దగా దృష్టి సారించకపోయినా, సీనియర్లు ప్రచారంలోకి పెద్దగా రాకపోయినా.. ఉన్న వనరులతోనే రంగంలోకి దిగి, అద్భుత విజయం సాధించిన అభ్యర్ధి రఘునందన్‌రావు వెంట నిలిచిన సంజయ్..‘వీడు సామాన్యుడు కాదు’ అనిపించుకున్నారు.   నిజానికి కేంద్రంలో అధికారంలో ఉండి, తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎన్నికల ముందు తన అధికారాలు వినియోగించి, కేంద్ర బలగాలను రప్పిస్తారని చాలామంది భావించారు. అది జరిగి ఉంటే ఫలితాలు మరింత ఉత్కంఠభరితంగా ఉండేవంటున్నారు. సిద్దిపేట ఘటనలో పోలీసుకమిషనర్, జిల్లా కలెక్టర్‌ను పిలిపించి మాట్లాడే అవకాశం ఉన్నా, ఏ కారణం చేతనో ఆయన దానిని వినియోగించుకోలేదు. అయినా.. సంజయ్ తన శక్తినంతా దుబ్బాకపై కేంద్రీకరించి సరైన ఫలితం రాబట్టారు.   ఒకరకరంగా ఈ ఫలితం ‘వకీల్‌సాబ్’వ్యక్తిగతంగా కూడా చెప్పకతప్పదు. పార్టీ నేతల మోహరింపు, టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడిలో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నా... అంతిమంగా, అభ్యర్ధి రఘునందన్‌రావుకు వీచిన సానుభూతి పవనాలే, ఆయనను విజేతగా నిలబెట్టాయని నిర్వివాదం. గతంలో ఓడినప్పటికీ.. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న ఆయన చిత్తశుద్ధి.. ప్రజాసమస్యలపై నిరంతరం గళం విప్పే పోరాటతత్వం.. పోలింగుకు ముందు తనను ఒంటరిని చేసి, కేసీఆర్ సర్కారు పోలీసుల సాయంతో దౌర్జన్యం చేస్తుందన్న సందేశాన్ని ఇంటింటికీ చేర్చి, దానిని సానుభూతిగా మలచడంలో వకీల్‌సాబ్ వ్యూహం సక్సెస్ అయింది. ఇప్పుడాయన అసెంబ్లీలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పక్కన, మరొక సభ్యుడిగా కూర్చోనున్నారు. గతంలో బీజేపీ కూడా తన విజయప్రస్థానం ప్రారంభించింది. టీవీ చర్చల్లోనే ప్రత్యర్ధుల నోటికి తాళం వేయించే వకీల్‌సాబ్.. ఇక తెలంగాణ శాసనసభలో, ఎలా వాదిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.   ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినంత మాత్రాన.. రేపటి గ్రేటర్ ఎన్నికల్లోనూ, ఫలితాలు పునరావృతమవుతాయనుకుంటే పొరపాటు. అలా ఊహించుకుని, టపాసులు పేల్చుకుంటే మిగిలేది తాత్కాలిక ఆనందమే. గ్రామీణ ప్రాంతాల నేపథ్యం వేరు, నగర నేపథ్యం వేరు. గ్రామీణ-నగర ఓటర్ల ఆలోచనా విధానంలో బోలెడంత తేడా ఉంటుంది. దుబ్బాకలో టీఆర్‌ఎస్ ఓడినప్పటికీ, మెజారిటీ అత్యల్పమేనన్నది విస్మరించకూడదు. పైగా అభ్యర్థి పూర్తిగా రాజకీయాలకు కొత్త. అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో?!   గ్రేటర్ హైదరబాద్‌లో పనితక్కువ-పబ్లిసిటీ ఎక్కువ నేతలు బోలెడుమంది. ఫ్లెక్సీలు- ఫొటోలు-జిందాబాద్‌తో లాబీయింగ్ చేసే వాళ్లే ఎక్కువ. ఎక్కువ మంది , క్షేత్రస్ధాయి రాజకీయాలను విస్మరించి చాలాకాలమయింది. పైగా దత్తాత్రేయ-కిషన్‌రెడ్డి-లక్ష్మణ్-ఇంద్రసేనారెడ్డి-రామచంద్రారెడ్డి-రామచంద్రరావు ఇలా డజను వర్గాలున్నాయి. ఇప్పటిదాకా, నగరంలో ఆ పార్టీ నిర్మాణాత్మకంగా చేసిన ఉద్యమం గానీ, ప్రజాసమస్యల పరిష్కారంపై సాధించిన విజయం గానీ,  ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. స్థానికంగా అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ, అగ్రనేతల ఇళ్ల చుట్టూ తిరిగే నేతలే ఎక్కువ దర్శనమిస్తారు. ఈ పరిస్థితిలో ‘గ్రేటర్’ ఫలితాలను దుబ్బాకతో పోల్చుకుంటే.. దెబ్బయిపోతారు మరి! -మార్తి సుబ్రహ్మణ్యం

బీహార్ లో ఆర్జేడీ కూటమి కొంప ముంచిన బీజేపీ సీక్రెట్ పార్ట్నర్ ఎంఐఎం..!

హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో తన ఉనికి చాటుకుంటున్నఅసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ మెల్లమెల్లగా పక్క రాష్ట్రాలతో పాటు.. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పోటీ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వం లోని బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఎంఐఎం పార్టీ దూకుడు మరింత పెరిగింది. దీని పై రాజకీయ విశ్లేషకుల అంచనా ఏంటంటే.. తెలంగాణ వరకు ఎంఐఎం పార్టీ, టీఆరెఎస్ కు మిత్ర పక్షం అన్న సంగతి తెల్సిందే. ఇక బీజేపీ, ఎంఐఎం వ్యవహారం చూస్తే.. ఒవైసీని, అయన పార్టీని హైదరాబాద్, తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుంటారు. అదే సమయంలో ఒవైసి కూడా తెలంగాణ బీజేపీ నేతలతో పాటు సాక్షత్తు పీఎం మోడీపై కూడా మాటల దాడి చేస్తారు. అయితే బీజేపీకి అవసరమైన ఇతర రాష్ట్రాలలో మాత్రం మైనారిటీ ఓట్లు చీల్చి అక్కడ ప్రతిపక్షాన్ని దెబ్బ తీస్తూ.. ఒక పక్క తన సీక్రెట్ పార్ట్నర్ బీజేపీకి పరోక్షంగా సాయ పడుతూ.. మరో పక్క తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.   తాజాగా బీహార్‌లో విజయం పక్కా అనుకున్న ఆర్జేడీ కూటమికి ఫలితాల్లో పెద్ద షాక్ తగిలింది. దాదాపుగా ఆ కూటమి విజయానికి దూరంగానే ఆగిపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో బీజేపీ జెడియు కూటమికి కూడా తిరుగులేని మెజార్టీ రాలేదు. అయితే బొటా బోటి మెజారిటీ లేదంటే ఒకటి, రెండు సీట్లు తక్కువ పడవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం విక్టరీ ఖాయమనుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి విజయాన్ని దూరం చేసిన ఘనత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం పార్టీ కి దక్కుతుంది. దాదాపుగా బీజేపీ కూటమి మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి పరోక్ష కారణంగా అసదుద్దీన్ ఒవైసి నిలిచారు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రతి చోటా తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి.. ముస్లింల ఓట్లను భారీగా చీల్చి.. భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. కేవలం ఐదు ఎమ్మెల్యే సీట్లలో లీడ్ లో ఉన్న ఎంఐఎం.. కనీసం మరో ఇరవై చోట్ల కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల పరాజయానికి కారణంగా నిలిచింది.

శహభాష్...సీఎం!

పోలీసులకు బెయిల్‌పై ఎస్పీ అపీలు   చట్టం ప్రకారమే వెళతామన్న డీజీపీ సవాంగ్   రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి   ఎవరయినా తన ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు అనుకూలంగా తీర్పు, లేదా నిర్ణయం వెలువడితే పాలకులు సంతోషిస్తారు. ఆ శాఖాధిపతులు ఊరట పొందుతారు. కానీ ఏపీ సీఎం జగన్ దీనికి భిన్నం. మైనారిటీ కుటుంబ ఆత్మహత్య అంశంలో అరెస్టయి.. జైలుకెళ్లిన ఓ సీఐ, మరో హెడ్‌కానిస్టేబుళ్లకు మంజూర యిన బెయిల్‌ను సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పైగా.. ఆరోపణలు ఎందుర్కొని అరెస్టయింది, రెడ్డి వర్గానికి చెందిన ఓ అధికారి. అదీ ఆశ్చర్యం! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నంద్యాల మైనారిటీ వ్యక్తి ఆత్మహత్య కేసు జగన్ సర్కారుకు అప్రతిష్ట తెచ్చింది. దీనిపై టీడీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తోంది. పత్రికా ప్రకటనలతో జగన్ సర్కారుపై విరుచుకుపడుతోంది.  తమ ఆత్మహత్యకు నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కారణమంటూ,  ఆ మైనారిటీ కుటుంబం తీసిన సెల్ఫీ వీడి యో వైరల్ అయింది. దీనితో అప్రమత్తమయిన సర్కారు, సీఐ-హెడ్‌కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసి, వెంటనే జైలుకు పంపింది.   అయితే, స్థానిక కోర్టు వారిద్దరికీ బెయిలివ్వడం జగన్ సర్కారుకు షాక్‌నిచ్చింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టినా బెయిల్ రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన, సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బెయిల్ రద్దు కోరుతూ పైకోర్టులో పిటిషన్ వేయాలని ఆదేశించారు.  దానితో రంగంలోకి దిగిన ఎస్పీ, వారిద్దరి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. వారే నిందితులంటూ తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. తన కింద స్ధాయి అధికారులకు, కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని.. ఓ ఎస్పీ కోరిన ఘటన బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. సొంత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరటం కూడా రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇదే ప్రథమం.   మైనారిటీ కుటుంబ ఆత్మహత్యకు  కారకులని భావిస్తున్న,  ఇద్దరు పోలీసులపై చర్య తీసుకోకుండా..  ప్రభుత్వం-పోలీసు శాఖ ఉపేక్షించవచ్చు. దానిపై విచారణ పేరిట కాలయాపన చేయవచ్చు. కానీ నంద్యాలలో మాత్రమే కాదు. కర్నూలు-ఇతర జిల్లాలలో ఎక్కువగా ఉన్న,  మైనారిటీల మనోభావాలు దృష్టిలో ఉంచుకున్న జగన్ శరవేగంగా స్పందించారు.  నిందితులుగా భావిస్తున్న సీఐ,  రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారి. ఒకవేళ ఆయనపై చర్య తీసుకోకపోతే, రెడ్డి కాబట్టే ఆయనను వదిలేశారన్న విమర్శ ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికే రెడ్ల పెత్తనం ఎక్కువయిందన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. దానికి ఈ ఘటన అదనపు శిరోభారమవుతుంది. అది మైనారిటీలను దూరం చేసుకోవడమే అవుతుంది.   అందుకే జగన్ ఈ వ్యవహారంలో వాయువేగంతో స్పందించినట్లు కనిపిస్తోంది. అందుకే పోలీసులకు ఇచ్చిన బెయిల్ రద్దు కోసం.. పైకోర్టుకు అపీలుకు వెళ్లడం ద్వారా, తమ నిజాయితీ నిరూపించుకునేందుకే, సీఎం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.  పైగా ఇది రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్న, కొందరు  కింది స్థాయి పోలీసులకు,  ఒక హెచ్చరిక సంకేతంగా పంపించినట్టయింది. నిజానికి ఇటీవలి కాలంలో స్థానిక ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల అండతో   కొందరు కిందిస్థాయి పోలీసులు రెచ్చిపోతున్నారు. వారి అత్యుత్సాహంతో పోలీసు శాఖ అప్రతిష్ఠపాలవుతోంది. శిరోముండనం వంటి ఘటనలు,  జగన్ సర్కారుకు మచ్చగా మారాయి.   కాగా తాజా నంద్యాల సామూహిక ఆత్మహత్యల  ఘటనపై అటు  డీజీపీ సవాంగ్ సైతం, వ్యక్తిగతంగా కేసును ఆరా తీశారు. వారి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై వాకబు చేశారు. ఆ తర్వాత సీఐ-హెడ్‌కానిస్టేబుల్ సస్పెన్షన్-అరెస్టుపై ఆదేశాలిచ్చారు. ఈ విషయంలో డీజీపీ శరవేగంగానే చర్యలు తీసుకున్నారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అరెస్టయిన పోలీసులకు కోర్టు ఇచ్చిన  బెయిల్ రద్దు కోరకపోతే, పోలీసు శాఖ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చేది. తన శాఖ అధికారులను రక్షించుకునేందుకే,  పైకోర్టులో అపీలుకు వెళ్లలేదన్న అపప్రదను మూటకట్టుకునే ప్రమాదం ఉండేది. బహుశా ఆ ప్రమాదాన్ని గ్రహించిన తర్వాతనే, సవాంగ్.. కర్నూలు ఎస్పీని అప్రమత్తం చేసినట్లు కనిపిస్తోంది. ఫలితంగానే ఆ ఇద్దరి బెయిల్‌పై అపీలుకు వెళ్లాలని ఎస్పీ నిర్ణయించారు.   ‘నంద్యాల ఘటనపై మా శాఖ చట్టపరంగానే వ్యవహరిస్తుంది. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. తప్పు ఎవరు చేసినా తప్పే. మా శాఖలో పనిచేసే వారు తప్పు చేసినా వారిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని చెబుతున్నాం. కొందరు చేసే తప్పులకు మొత్తం పోలీసు వ్యవస్థను నిందించడం, కొందరిని బాధ్యులను చేయటం సరైనది కాదు.  తప్పు చేసిన వారిని మేం ఎక్కడ కాపాడామో చెప్పండి? నంద్యాల ఘటనలో ఎస్పీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మీరు ఎలాగూ మా తప్పుల గురించి రాస్తున్నారు. మంచి చేసినప్పుడు కూడా మీరు అభినందించాలి. పోలీసులు ఎవరినీ సమర్ధించరు. ఎవరికీ వ్యతిరేకంగా ఉండరు. మేం ఉన్నది ప్రజల కోసమే’నని డీజీపీ సవాంగ్ చెప్పారు.   అయితే ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులకు.. రిట్రీట్ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఏపీలో ఇప్పటివరకూ దానిని నిర్వహించలేదని ‘సూర్య’ డీజీపీకి గుర్తు చేసింది. అందుకు స్పందించిన సవాంగ్.. త్వరలోనే రిట్రీట్ నిర్వహిస్తామని చెప్పారు.  మానవ హక్కులు కాలరాస్తూ,  హృదయవిదారక ఘటనలకు కారకులవుతున్న అధికారులపై.. ఇలాంటి చర్యలు వేగంగా తీసుకుంటే, ఎవరు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని అభినందించరు?  సర్కారు అధికారులకిచ్చిన బెయిల్‌ను, రద్దు చేయాలని ఆదేశించే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? అందుకే.. శహభాష్ జగన్! -మార్తి సుబ్రహ్మణ్యం

విలేఖరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు

భాజపాలో కీలక నేత... క్యాడర్​కు సదా అందుబాటులో ఉంటాడనే పేరు... రెండు సార్లు ఓటమి పాలైనా పోరాటం ఆపలేదు. చివరకు మూడోసారి విజయం సాధించి.. దుబ్బాక పీఠం కైవసం చేసుకున్నారు మాధవనేని రఘునందన్ రావు. ఐపీఎల్ మ్యాచ్​ తరహాలో ఉత్కంఠగా సాగిన ఓటింగ్​లో అధికార పార్టీపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయభేరీ మోగించారు.రఘునందన్​ రావు తెరాసతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి భాజపాలో కీలక నేతగా మారారు. చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా పొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్​ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లింది. ‌   హైకోర్టు బార్​ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ఉమ్మడి మెదక్​ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్​ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. సిద్దిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్​ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్​.ఎల్​.బీ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్​ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు.   రెండుసార్లు ఓటమి తెరాస ప్రారంభం నుంచి రఘునందన్​ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండైన రఘు.. భాజపాలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో విజయం సాధించారు.

మండలి ఎన్నికలపై దుబ్బాక ఎఫెక్ట్! కారుకు కష్టమేనా? 

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాక్ తగిలింది. బీజేపీ సంచలన విజయం సాధించింది. దుబ్బాకలో కాంగ్రెస్ మూడో ప్లేస్ కు పడిపోయింది. దుబ్బాక బైపోల్ ఫలితంతో తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల శాసనమండలి స్థానాల ఎన్నికలపైనా దుబ్బాక ప్రభావం ఉంటుందంటున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం  గతంలో ఉన్న ఆరు ఉమ్మడి జిల్లాలు పట్టభద్రులు ఓటేయనున్నారు. దుబ్బాక ఫలితమే శాసనమండలి ఎన్నికల్లో పునరావృతం అవుతుందని బీజేపీ ధీమాగా చెబుతోంది. దుబ్బాకలో ఓడిపోయినా మండలి ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్ కవరింగ్ ఇస్తోంది. అధికార టీఆర్ఎస్ లో మాత్రం ఎమ్మెల్యీ ఎన్నికలపై ఆందోళన కనిపిస్తోంది.    దుబ్బాక ఉప ఎన్నికతో పోలిస్తే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలే అధికార టీఆర్ఎస్ కు గండం. ఎందుకంటే దుబ్బాక సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో ఉంది. అక్కడి ప్రజలతో ఆయనకు అనుబంధం ఉంది. అందులోనూ అది రూరల్ ప్రాంతం. రైతు బంధు తీసుకునే రైతులు దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. అదే శాసనమండలి ఎన్నికలకు వస్తే పట్టభద్రులు, ఉద్యోగులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఇదే ఇప్పుడు కారు పార్టీని కలవరపెడుతోంది. యువతలో కేసీఆర్ సర్కార్ పై బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందనే భావనలో ఉన్నారు వారంతా. ఉద్యోగులైతే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీఆర్సీలో జాప్యం, డీఏ సరిగా ఇవ్వకపోవడం, బదిలీలు చేపట్టకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం.. ఇలా చాలా అంశాల్లో వారు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   సీఎం కేసీఆర్ సొంత జిల్లా, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్, అధికార పార్టీగా అదనపు ప్రయోజనాలు. ఇన్ని ఉన్నా దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఉద్యోగులు ఎక్కువగా ఉండే దుబ్బాక అర్బన్ లో బీజేపీకి భారీ లీడ్ వచ్చింది.దుబ్బాకలోని మెజార్టీ యూత్ అంతా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేశారని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా విద్యావంతులే ఓటు వేసే శాసనమండలి ఎన్నికలు కారు పార్టీకి కలిసివచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవనే అభిప్రాయాలే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.    గతంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకా జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనకు గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. నల్గొండ, కరీంనగర్ కోటా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. గత శాసనమండలి ఎన్నికల కంటే ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారిందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలోనూ అది కనిపించింది. ఇలాంటి పరిస్థితిలో పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ కనీసం పోటీ కూడా ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.   త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి టీజేఎస్ అధినేత కోదండరామ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న కూడా పాదయాత్ర చేస్తూ జనంలోకి వెళ్లారు. మల్లన్నకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందంటున్నారు. మహబూబ్ నగర్ సీటు కోసం బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావు బరిలో మళ్లీ ఉంటున్నారు. ఆయన కూడా ప్రచారం ముమ్మరం చేశారు. గతంలో ఒకసారి విజయం సాధించిన ప్రోఫెసర్ నాగేశ్వర్ కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ మాత్రం ఇంకా స్పందించడం లేదు. గత అనుభవాలతో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా పోటీకి వెనుకంజ వేశారని చెబుతున్నారు.    ఇప్పటికే శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి టీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకడంలేదు. తాజాగా వచ్చిన దుబ్బాక ఫలితంతో ఆ పార్టీ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రావచ్చని చెబుతున్నారు. ఎలాగూ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి టీఆర్ఎస్ కూడా శాసనమండలి ఎన్నికలకు దూరంగా ఉండే ప్రయత్నాలు కూడా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ట్రబుల్ షూటర్ కు ట్రబులు మొదలయిందా! హరీష్ రావు ఫ్యూచరేంటీ? 

తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్యం జరిగింది. అధికార టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు దిమ్మతిరిగే షాకిస్తూ దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం సాధించింది. దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపుతో ఇప్పుడు అందరి కళ్లు మంత్రి హరీష్ రావుపైనే పడ్డాయి. ట్రుబుల్ షూటర్ కు ట్రబుల్స్  వచ్చాయని చెబుతున్నారు. దుబ్బాక ఎన్నికలో అధికార పార్టీ తరపున అంతా తానే వ్యవహరించిన హరీష్ రావు ఇప్పుడు ఏం చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హరీష్ రావు మంత్రి పదవికి రాజీనామా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఓటమి వంకతో టీఆర్ఎస్ హైకమాండే ఆయనను కేబినెట్ నుంచి తప్పించవచ్చన్న వాదన కూడా  కొన్నివర్గాల నుంచి వినిపిస్తోంది.    దుబ్బాక ఉప ఎన్నికలో పూర్తి బాధ్యత హరీష్ రావే తీసుకున్నారు. అయితే తీసుకోలేదని పార్టీ పెద్దలే అలా డిసైడ్ చేశారనే వాదన కూడా ఉంది. హోరాహోరీ పోరు జరుగుతున్నా టీఆర్ఎస్ నేతలెవరు దుబ్బాకను పట్టించుకోలేదు.  పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కూడా ప్రచారం చేయలేదు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి  కేటీఆర్ వెళ్లకపోవడం..  కవిత, ఎంపీ సంతోష్  రాకపోవడంపై  రాష్ట్ర ప్రజల్లోనూ చర్చ జరిగింది. దుబ్బాకలో  బీజేపీ  గెలుపు కోసం ఆ పార్టీ నేతలంతా కలిది వచ్చారు. గల్లీగల్లీ తిరిగి  ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ కూడా తమ నేతలందరిని దుబ్బాకలోనే  మోహరించింది. విపక్షాల నేతలంతా దుబ్బాకలోనే ఉన్నా టీఆర్ఎస్ మాత్రం హరీష్ రావుపైనే భారం వేసింది. అయినా ఒంటరి పోరాటం చేశారు హరీష్ రావు. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం దక్కలేదు.    ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలతో దుబ్బాక కేంద్రంగా మంత్రి హరీష్ రావుపై కుట్రలు జరిగాయని, ఆయన మెడపై కత్తి పెట్టారనే ఆరోపణలు  వచ్చాయి. సొంత పార్టీనే హరీష్ ను టార్గెట్ చేసిందనే ప్రచారం జరిగింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ముందే గ్రహించిన పార్టీ పెద్దలు కావాలనే హరీష్ రావు  ఒక్కడికే ఉప ఎన్నిక బాధ్యత అప్పగించితప్పించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దుబ్బాకలో వ్యతిరేక ఫలితం వస్తే.. ఆ నెపమంతా హరీష్ రావుకు  అంటగట్టే కుట్ర చేశారని హరీష్ రావు అనుచరులు  చెబుతున్నారు. హరీష్ రావును ఇరికించే ప్రయత్నం  దుబ్బాక ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతుందని వారంతా బలంగా వాదిస్తున్నారు.  టీఆర్ఎస్ లో మొదటి నుంచి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఎన్నికల్లోనూ  సక్సెస్ చేసి చూపించారని చెబుతారు. అలాంటి ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్  కలిగేలా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్లాన్ చేసిందనే ప్రచారం జరిగింది.    పాలనలో మాార్పులు ఉంటాయని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని కొంత కాలంగా  ప్రచారం ఉంది. కేటీఆర్ కు రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తారని, కవితను కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు కు చెక్ పెట్టి ఆ ప్లేస్ ను కవితతో భర్తీ చేస్తారనే వాదనలు వినిపించాయి. ఈ చర్చలు, ప్రచారాలకు అనుగుణంగానే దుబ్బాకలో పరిణామాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. దుబ్బాక ఫలితంతో ఇప్పుడు  టీఆర్ఎస్ లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక వ్యవహారంలో పార్టీ తీరుపై హరీష్ రావు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  పోలింగ్ తర్వాత ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అదే సంకేతమిచ్చాయి. పార్టీ నేతలు  కొందరు నేతలు కీలక టైంలో హ్యాండిచ్చారని కూడా మంత్రి భావిస్తున్నారట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దుబ్బాక ఓటమిపై నైతిక బాధ్యత వహిస్తూ హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.                      హరీష్ రావు రాజీనామా చేయకపోయినా దుబ్బాక ఫలితం సాకుతో ఆయన్ను టీఆర్ఎస్ హైకమాండ్ దూరం పెట్టవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. నిజానికి చాలా కాలంగా  ప్రభుత్వంతో పాటు పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గింది. కీలక సమావేశాలకు కూడా ఆయనకు పిలుపు రావడం లేదు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి ఆర్థికమంత్రి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.  కావాలనే హరీష్ రావును కేసీఆర్ దూరం పెడుతున్నారని అంటున్నారు.  దుబ్బాక ఫలితాన్ని సాకుగా చూపుతూ హరీష్ రావు రాజీనామాను సీఎం కేసీఆర్  కోరినా అశ్చర్యం లేదంటున్నారు. హరీష్ రావు ప్లేస్ లో కొన్నాళ్ల తర్వాత కవితను కేబినెట్ లోకి తీసుకోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.    దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు సాక్ష్యంగా నిలవగా.. ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు పరీక్ష పెట్టిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే ఈ పరీక్షలో హరీష్ రావు చివరివరకుపోరాడి ఓడినా,,, ఆయన భవిష్యత్ పై మాత్రం ప్రభావం చూపుతుందంటున్నారు.

మంత్రి హరీష్ రావుకు థాంక్స్... దుబ్బాక ఓటమిపై కేటీఆర్ రియాక్షన్ 

దుబ్బాక ఉపఎన్నికలో తన సొంత స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడంలో టీఆరెఎస్ బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నీ తానే అయి ప్రచారం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరో పక్క బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా టార్గెట్ చేసినా చివరికి విజయం బీజేపీనే వరించింది. దీంతో తెలంగాణ వచ్చిన తరువాత ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ ఓడిపోయినట్టు అయ్యింది   తాజాగా దుబ్బాక ఓటమి పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఉప ఎన్నికల్లో ఫలితం తాము ఊహించిన విధంగా రాలేదని అన్నారు. తెలంగాణ వచ్చిన ఆరున్నరేళ్లలో తాము అనేక విజయాలు సాధించామని.. అయితే ఈ తాజా ఫలితం ఒక రకంగా తాము అప్రమత్తంగా కావడానికి ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఫలితంపై పార్టీలో లోతుగా సమీక్షించుకుంటామని అయన అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఎలాంటి తొట్రుపాటు ఉండకుండా ముందుకు వెళతామని కేటీఆర్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచనల మేరకు ముందుకు సాగుతామని అయన అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ కు ఓటు వేసిన 62 వేల మందికి అయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన నేతలకు, మరీ ముఖ్యంగా మంత్రి హరీశ్ రావుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

దుబ్బాకలో ముస్లిం మహిళలు కూడా బీజేపీకే దన్నుగా నిలిచారా?

దుబ్బాక ఎన్నికల ఫలితాలను లోతుగా పరిశీలిస్తే, ఏఒక్క సామాజికవర్గం కూడా అధికార తెరాస ను సమర్ధించిన దాఖలాలు కనబడ్డంలేదు. ముఖ్యంగా, ముస్లిం మహిళలెవ్వరు తెరాస ను సమర్ధించకపోగా, ఆశ్చరకరంగా, బీజేపీనే బలపర్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.    దుబ్బాక నియోజకవర్గంలో సుమారు 7,000 పైగా ముస్లిం ఓట్లు ఉండగా, అందులో దాదాపు 4,000 పైగా ఒక్క దౌలతాబాద్ మండలంలోనే వున్నాయ్.  ఈ ఓట్లన్నీ తమవేనని మొదటినుండి తెరాస ఎంతో ధైర్యంగా వుంది. కానీ చివరికి ఫలితాలు చుస్తే, యిదంతా తారుమారయింది. మొదటి నుండి తెరాస ఇటు దౌలతాబాద్ పైనే  కాకుండా మరికొన్ని మండలాలపైన కూడా ఆశలు పెట్టుకొని వుంది. కానీ ఆ ఆశలన్నీ అడియాసలేనని ఓట్లర్లు తేల్చేశారు.      కనీసం, దౌలతాబాద్ మండలంలో కూడా తెరాస కు కేవెలం కొన్ని వొందల మెజారిటీ మాత్రమే రావడంతో అప్పుడే ఆ పార్టీ నాయకులు ఓటమిని అంగీకరించారు. ఈ మండలంలో కౌంటింగ్ మొదలైనప్పటినుండి, అంటే 17 వ రౌండ్ నుండి, తెరాస ఆశలు కొంచం పెరిగాయి. కానీ మొత్తం రౌండ్ పూర్తియ్యేటప్పటికీ, తెరాస కు వచ్చిన ఓట్లు చూసుకొని, అటు ఈ పార్టీ ఏజెంట్లు, కాంగ్రెస్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ సెంటర్ల నుండి బయటకు వెళ్లిపోయారంటే పరిస్థితిని సులభంగానే అర్థంచేసుకోవచ్చు.    ముస్లిం ఓట్లపై మొదటినుండి తెరాస ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ వర్గం ఎలాంటి పరిస్థితులలోను బీజేపీని సమర్ధించదని, కాంగ్రెస్ ఎలాగూ రేసులో వున్నా లేనట్లేనని భావించిన తెరాస, ఈ వర్గం వాళ్ళు తప్పక తమకే ఓటు వేస్తారని భావించింది. కానీ, ముస్లింలు, ముఖ్యంగా ఈ వర్గానికి చెందిన మహిళలు, ఆశ్చరకరంగా బీజేపీ ని సమర్ధించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయింది. దీనికి కారణం, బీజేపీ ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించడమేనని దీంతో, ఈ వర్గానికి చెందిన మహిళలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని, రేపు రాబోయే జీహెఎంసీ ఎన్నికల్లో కూడా ఇదీ రిపీట్ కాబోతున్నాడని రాజకీయ విశ్లేషకుల భావన. 

దుబ్బాకలో కారు బోల్తా! ఉత్కంఠ పోరులో రఘునందన్ విజయం        

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార  టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించారు. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఫలితాల్లో చివరికి బీజేపీ అభ్యర్థి  రఘునందన్ రావు వెయ్యికి పైగా  ఓట్ల తేడాతో  విజయం సాధించారు.    20-20 మ్యాచ్ ను తలపిస్తూ సాగింది దుబ్బాక కౌంటింగ్. రౌండ్ రౌండ్ కు ట్రెండ్స్ మారిపోయాయి. చివరి రౌండ్ వరకు ఎవరూ గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ లీడ్ సాధించగా.. 6, 7 రౌండ్లలో టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చింది. మళ్లీ 8. 9 రౌండ్లలో కమలం పార్టీకి  లీడ్ వచ్చింది. 10వ రౌండ్ లో కారుకు ఎక్కవ ఓట్లు రాగా.. 12వ రౌండ్ లో  కాంగ్రెస్ పార్టీకి వందల ఓట్ల లీడ్ వచ్చింది. అయితే కొన్ని రౌండ్లలో కారుకు లీడ్ వచ్చినా ఓవరాల్ గా మాత్రం ఫస్ట్ రౌండ్ నుంచి బీజేపీనే లీడ్ కొనసాగిస్తూ వచ్చింది.    అయితే 13వ రౌండ్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. 13 నుంచి 19వ రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ వరుసగా లీడ్ సాధించింది. దీంతో 18వ రౌండ్ తర్వాత తొలిసారి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును క్రాస్ చేసి లీడింగ్ లోకి వచ్చారు సోలిపేట సుజాత. అయితే 20,21, 22 రౌండ్లలో మళ్లీ బీజేపీ పుంజుకుని మంచి లీడ్ సాధించింది. చివరి 23 రౌండ్ లోనూ రఘునందన్ రావుకు మంచి లీడ్ రావడంతో సోలిపేట సుజాతపై ఆయన గెలుపొందారు.    మొదట కౌంటింగ్ జరిగిన దుబ్బాక మండలంలో బీజేపీ పూ్ర్తి అధిక్యం సాధించింది. మొదటి రౌండు నుంచి అయిదు రౌండ్ వరకూ బీజేపీ ఆధిక్యంలోనే దూసుకెళ్లింది. మొత్తంగా దుబ్బాక మండలంలో బీజేపీ 3020 ఓట్ల మెజారీటీ సొంతం చేసుకుంది. అయితే మిరుదొడ్డి మండలానికి వచ్చేసరికి కారుకు లీడ్ దక్కింది.  6,7 వ రౌండ్లలో మాత్రం సోలిపేట సుజాతకు ఆధిక్యం వచ్చింది.  తొగుంట మండలం ఓట్ల లెక్కింపులో 8.9 రౌండ్లలో మళ్లీ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 10 వ రౌండ్ లో సుజాతకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 11 రౌండ్లుగా వెనుకబడిపోయిన కాంగ్రెస్ పార్టీ 12వ రౌండులో ఎట్టకేలకు ఆధిక్యతను సాధించింది. ఈ రౌండులో కాంగ్రెస్ అభ్యర్థి 83 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో టీఆర్ఎస్ ఈ రౌండులో మూడో స్థానానికి పరిమితమైంది.   13వ రౌండ్ నుంచి దౌల్తాబాద్ మండల ఓట్లు లెక్కించడంతో కారు పార్టీ భారీగా పుంజుకుంది. రాయపోల్ మండలంలోనూ టీఆర్ఎస్ హవా చూపించింది. వరుస ఆరు రౌండ్లలో  కారుకు లీడ్ రావడంతో ఓవరాల్ గాను రఘునందన్ రావును క్రాస్ చేశారు సుజాత. అయితే నార్సింగ్. చేగుంట మండలాలకు సంబంధించి జరిగిన చివరి రౌండ్ల లెక్కింపులో మళ్లీ కమలం పుంజుకోవడంతో రఘునందన్ రావు విజయం సాధించారు.    దుబ్బాకలో విజయం సాధించడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దుబ్బాకతో పాటు సిరిసిల్ల, హైదరాబాద్ లో భారీగా క్రాకర్స్ కాల్చి తీన్మార్ స్టెప్పులు వేశారు కమలం నేతలు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు.ఇక ఓటమితో టీఆర్ఎస్ నేతలు ఢీలా పడ్డారు. అధికార పార్టీగా ఉండి, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ ఉన్నా గెలవకపోవడంతో గులాబీ నేతలంతా తీవ్ర విచారంలో మునిగిపోయారు. మూడో స్థానానికి పడిపోవడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

సంబరాలు..సమావేశాలు.. పాజిటివ్ ట్వీట్లు... మరి కరోనా పోయినట్లేనా?

సుద్దులు చెప్పే నేతలకు సిగ్గుందా?   బాధ్యత లేని సమాజం పడుతున్న బాధలు   కరోనా గుప్పిట తెరిచేసిన పాలకులు   జాగ్రత్తలు చెప్పిన చిరంజీవికి కరోనా                  తాంబూలాలిచ్చాం. తన్నుకుచావండి. తమాషా చూస్తాం. ఇదీ మొన్నటి వరకూ టీవీ తెరల ముందు గంభీర వదనాలతో, కరోనా జాగ్రత్తలపై భారీ పదజాలు వినిపించిన పాలకుల ఇప్పటి చేతులెత్తేసిన తీరు. అటు పాలకులు, వైద్యులు ఎన్ని హెచ్చరికలు చేసినా, వాటిని గాలికొదిలి కరోనా కోరలకు చిక్కుతున్న పాలితుల బేఖాతరిజం. సుద్దులు చెబుతూ, జనాలకు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులు, నాయకులే.. నిస్సిగ్గుగా జనంతో జాతర్లు చేస్తున్న నిర్లజ్జనం. కలసివెరసి.. కరోనా మహమ్మారి మరోమారు ఆవహిస్తున్న విషాదం.   అవును. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే, కరోనా పోయినట్లే కనిపిస్తోంది. బస్సులు, బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వైన్‌షాపులు, షేరింగ్ ఆటోల్లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. ఎవరికీ కరోనా చావులపై భయం లేదు. ఏ ఒక్కరికీ సామాజిక దూరం పాటించాలన్న స్పృహ లేదు. ఏ ఒక్కరికీ మాస్కు పెట్టుకోవాలన్న కనీస-ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకంటే మాస్కులు వారికోసం కాదు. ఎదుటివారి రక్షణ కోసం కాబట్టి!     కేంద్రమంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకూ, ఎమ్మెల్యేల నుంచి లోకల్ లీడర్ల వరకూ.. ఎవరూ సామాజికదూరం పాటిస్తున్న ఫొటోలు ఎక్కడా కనిపించవు. పల్లెల్లో మాస్కులు పెట్టుకున్న వారు, భూతద్దం పెట్టి వె తికినా కనిపించరు. మాస్కులు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా, పదిమంది గుమిగూడితే మరి.. కరోనా రాక,  కత్రినా కైఫ్ వస్తుందా?   లేటెస్టుగా మాజీ మెగాస్టార్ చిరంజీవి, తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు. తనను కలుసుకున్నవాళ్లంతా టెస్టులు చేయించుకోమని సూచించారు. ఆయన రెండురోజుల క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, నాగార్జునతో కలిశారు. ఆ సందర్భంలో చిరంజీవి మాత్రమే కాదు. కేసీఆర్ కూడా మాస్కు పెట్టుకున్నట్లు ఫొటోలో కనిపించలేదు. చిరంజీవి-నాగార్జున సినిమాల్లో కనిపించినట్లు, ఇరవై ఐదేళ్ల కుర్రాళ్లేమీ కాదు. మనుమలు, మనుమరాళ్లున్న  60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు. మరి కరోనా హెచ్చరికల ప్రకారం, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా? పైగా.. ఇటీవల తీసిన ఒక యాడ్‌లో, మాస్కు పెట్టుకోని ఓ తారకు, చిరంజీవి క్లాసు ఇస్తూ నటించారు. ఇప్పుడేమో ఆయనే కరోనా బారిన పడ్డారు. ఓ పక్క షూటింగుల వల్లే ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి మహా శిఖరమే కూలింది. రాజశేఖర్ వంటి హీరోలూ కరోనా బారిన పడ్డారు. అయినా సినిమా వాళ్లకు సంపాదనే ముఖ్యం. అందుకే షూటింగులూ మొదలెట్టేశారు. ఇవన్నీ దేనికి సంకేతాలు?   ఇక ఏపీలో సీఎం జగనన్న పాదయాత్రకు.. మూడేళ్ల సందర్భంగా వైసీపీ శ్రేణులంతా, ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’ పేరుతో ప్రచారం ప్రారంభించారు. మంత్రులు-ఎమ్మెల్యేలు-నేతలు సహా,  కట్టకట్టుకుని రోడ్డునపడ్డారు. కొన్ని చోట్ల మాస్కులు పెట్టుకుంటే, మరికొన్ని చోట్ల మాస్కులు లేకుండానే కనిపించారు. చుట్టూ డజన్లు, వందల మంది కార్యకర్తలను వెంటేసుకుని ఇచ్చిన ఫొటో ఫోజులు చూస్తే,  వారికి అసలు బాధ్యత ఉందా? అన్న ప్రశ్న బుద్ధి ఉన్న ఎవరికయినా వస్తుంది. కొద్దిరోజుల క్రితమే, బీసీ కార్పొరేషన్లు ప్రకటించినందుకు కృతజ్ఞతగా,  వైసీపీ నేతలంతా పోటీలు పడి మరీ, ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అక్కడా ఎవరికీ మాస్కులు లేవు. సామాజిక దూరం అసలే లేదు. మరి కరోనా రాక,  కత్తి యుద్ధం కాంతారావు వస్తారా?   ఇక స్వయంగా సీఎ జగన్ కూడా,  తన సమీక్షా సమావేశాల్లో ఎక్కడా మాస్కు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. పాలకులను బట్టే పాలితులు. అందుకే జనం కూడా మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడాన్ని గాలికొదిలేశారు. అసలు కరోనా పోయిందన్నట్లు తిరుగుతున్నారు. మరి ఇక్కడ తప్పెవరిది? శిక్ష మాత్రం.. మాస్కులు పెట్టుకోని సామాన్యులపై పోలీసుల చలాన్లు. ఆ నిబంధనలు గాలికొదిలిన ప్రజాప్రతినిధులపై,  ఆ చలాన్లు విధించే దమ్ము పోలీసులకు ఉందా మరి?   కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ..  మొన్నటి వరకూ వైసీపీపై తెగ విరుచుకుపడ్డ టీడీపీ కూడా, ఇప్పుడు కరోనా నిబంధనలు గాలికొదిలేసింది. ‘నా ఇల్లు-నా సొంతం’ పేరుతో టీడీపీ తమ్ముళ్లు కూడా రోడ్డునపడ్డారు. గుంపులు గుంపులుగా చేరి, ఫొటోలకు ఫోజులిస్తున్నారు. మొన్నామధ్య, వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ చుట్టూ అవే దృశ్యాలు. ఇప్పుడు ఇళ్ల ఆందోళన లోనూ అవే దృశ్యాలు. పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టే,  ఈ రాజకీయాలను చూసి రోత పుట్టడం లేదూ?   తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కూడా, కరోనా నిబంధనలు గాలికెగిరిపోయాయి. ర్యాలీలు, మీటింగులలో ఎక్కడా సామాజిక దూరం కనిపించలేదు. మాస్కులు పెట్టుకున్న మారాజులు బహు తక్కువ. అదే కరోనా మహమ్మారితో ఒక ఎమ్మెల్యే మృతి చెందారన్న కనీస భయం కూడా ఎవరిలోనూ కనిపించకపోవడమే ఆశ్చర్యం. వరద బాధితులకు పదివేల చొప్పున పంపిణీ చేసిన సమయంలో ఏ ఒక్కరూ సామాజికదూరం పాటించిన దాఖలాలు లేవు.   తమ రాష్ట్రంలో కరోనాకు మెరుగైన చికిత్స జరుగుతోందని,  గొప్పలకు పోతున్న ఏపీ పాలకులకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. అదే మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు పోవడం సిగ్గుచేటు. అంటే, దాన్ని బట్టి ఏపీలో వైద్యాన్ని పాలకులే నమ్మకం లేదన్నమాట. తమ వైద్యుల పనితనంపై తమకే నమ్మకం లేదన్నమాట.  పాపం అప్పటికీ.. కరోనా చికిత్సకు ఎవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లవద్దని, మంత్రి ఆళ్ల నాని చెప్పినా పట్టించుకునేవాడు లేరు. ప్రాణాలంటే అంత తీపి మరి! ఇక తెలంగాణలో ప్రజాప్రతినిధులకు కరోనా వస్తే, ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేయించుకుంటారని, సీఎం కేసీఆర్ సగర్వంగా ప్రకటించారు. కానీ, కరోనా వచ్చిన ఎమ్మెల్యేలంతా.. యశోదా, అపోలో తప్ప మరెక్కడా కనిపించలేదు. మరి చెప్పడానికేనా నీతులు?  -మార్తి సుబ్రహ్మణ్యం

టీఆర్ఎస్ ఎంపీ సొంతూరులో బీజేపీ లీడ్! ఉత్తమ్ ఊరులో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్! 

దుబ్బాక ఉప ఎన్నికలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ప్రముఖులకు తమ సొంత గ్రామాల్లో చుక్కెదురైంది. ఇక ప్రచారంలో పాల్గొన్న పార్టీల ముఖ్య నేతలకు చేదు ఫలితాలు వచ్చాయి. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన దుబ్బాక మండలంలోని పోతారంలో 110 ఓట్లు రఘునందన్ రావుకు ఎక్కువగా పోలయ్యాయి.  రఘునందన్ రావు సొంతూరు బొప్పాపూర్‌లో  ఆయన 277 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇక్కడ బీజేపీకి 424, టీఆర్ఎస్‌కు 147 ఓట్లు లభించాయి. దివంగత ఎమ్మెల్యే  రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌లో టీఆర్ఎస్‌కు 846 ఓట్లు పోలయ్యాయి.    ఇక మంత్రి హరీష్ రావు దత్తత గ్రామం అయిన మిరుదొడ్డి మండలంలోని చీకుడు గ్రామంలో బీజేపీకి 22 ఓట్ల లీడ్ వచ్చింది. చీకుడులో టీఆర్ ఎస్ కు 744 ఓట్లు రాగా, బీజేపీకి 766 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ దుబ్బాకలో ఘోరంగా చతికిలపడింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరించిన లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.  ఆ గ్రామంలో కాంగ్రెస్‎కు కేవలం 163 ఓట్లు మాత్రమే వచ్చాయి. లచ్చపేటలో టీఆర్ఎస్ పార్టీకి 520 ఓట్లు  బీజేపీకి 490 ఓట్లు పోలయ్యాయి.

బీహార్ లో బీజేపీకి లీడ్! మారుతున్న ట్రెండ్స్ 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్టిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతున్నాయి. ఫలితాల సరళి వేగంగా మారిపోతోంది. తొలి రౌండ్లలో లీడ్ లో ఉన్నట్లు కనిపించిన మహాగట్ బంధన్ ఇప్పుడు వెనకబడి పోయింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అభ్యర్థులే మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం బీహార్ లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్‌ను దాటే అవకాశాలు ఉన్నాయి.    బీహార్ లో మొత్తం  మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతానికి 120కి పైగా నియోజకవర్గాల్లో  ఎన్డీయే ఆధిక్యం కొనసాగిస్తోంది. మహాఘట్ బంధన్  105  స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.nఎన్డీఏ కూటమిలో బీజేపీ 72  స్థానాల్లో, జేడీయూ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మహా ఘట్ బంధన్ కూటమిలో 65 స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ 20 , కమ్యూనిస్టులు 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎల్‌జేపీ 2 స్థానాల్లో, వీఐపీ 7 స్థానాల్లో, ఇతరులు 29 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం మూడు స్థానాల్లో లీడ్ లో ఉంది.

అక్కడ ట్రంప్.. ఇక్కడ కేసీఆర్! దుబ్బాకపై సోషల్ మీడియా ట్రోల్స్ 

హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణలో తీవ్ర ఉత్కంఠగా మారింది. ఉదయం నుంచే ఫలితాలు తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయారు జనాలు. ఇక సోషల్ మీడియాలో దుబ్బాక బైపోల్ ట్రెండింగ్ లో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోషల్ మీడియా ప్రతి నిమిషం అప్‌డేట్ చేస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్లలో దుబ్బాక  కౌంటింగ్  వివరాలు ట్రోల్ అవుతున్నాయి. దుబ్బాక ఫలితాలను వాట్సాప్ స్టేటస్‌లలో వేలాది మంది పెట్టుకుంటున్నారు.గ్రూపు ఏదైనా, ఫేస్‌బుక్ తెరిచినా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై చర్చే సాగుతోంది.   దుబ్బాకలో అధికార  టీఆర్ఎస్ వెనుకంజలో ఉండటంపై సోషల్ మీడియాలో భారీగా పోస్టులు పెడుతున్నారు. అధికార పార్టీపై ఉన్న అక్కసును కొందరు సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతున్నారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, సంక్షేమ పథకాల వెనకంజ, కుటుంబ పాలనకు చరమగీతం అంటూ ఫలితాలపై కొందరు విశ్లేసిస్తున్నారు. గులాబీకి అండగా ఉండే మీడియాను కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఫలితాల సరళితో పింక్ మీడియా ముఖం చాటేస్తుందంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. వచ్చే గ్రేటర్‌లో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.     దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను అమెరికా ఎన్నికలతో ముడి పెడుతూ కొందరు పోస్టులు పెడుతున్నారు. వైట్‌హౌస్ నుంచి ట్రంప్‌ను ఈడ్చి వేసే వీడియోలను ఇప్పుడు రాష్ట్రానికి క్రియేట్ చేస్తూ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అధికారంపై విర్రవీగిన ట్రంప్ ఎలాగైతే బోల్తా పడ్డారో… రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందంటూ జోస్యం చెప్పుతూ వీడియోలను పెడుతున్నారు. ఇలాంటి వీడియోలు  నెట్టింటా హల్‌చల్ చేస్తున్నాయి. దుబ్బాక ఫలితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాంతో కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఫైజర్ వ్యాక్సిన్ సిద్ధమైనా వాళ్లు చెప్పలేదు! ట్రంప్ ఆరోపణ 

తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ఫైజర్ సంస్థ చేసిన ప్రకటనపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడో సిద్ధమైనా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఫైజర్ వ్యాక్సిన్ ఫలితాలను ప్రకటించలేదని ఆరోపించారు. కరోనాపై విజయం సాధించే దిశగా వ్యాక్సిన్ తయారైందని ఎన్నికలకు ముందే ప్రకటించడాన్ని డెమొక్రాట్లు ఇష్టపడలేదంటూ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ విషయంపై అధికారిక ప్రకటనను ఫైజర్ సంస్థ కావాలనే ఆలస్యం చేసిందని ఆరోపించారు ట్రంప్.    ఫైజర్, ఇతర సంస్థలు ఎన్నికలకు ముందు వ్యాక్సిన్ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని భావించలేదన్నారు ట్రంప్. ముందే ఈ పని చేసే ధైర్యం వారికి లేకపోయిందన్నారు. యూఎస్ ఎఫ్డీయే సైతం రాజకీయ ప్రయోజనాలనే చూసిందని ట్రంప్ విమర్శించారు. కరోనాపై పోరాటం ఇంకా ముగియలేదని, మరిన్ని నెలల పాటు ప్రజలు వైరస్ ను ఎదుర్కొనేలా తమవంతు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుందన్నారు ట్రంప్,  వ్యాక్సిన్ తయారీిలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.  ఫైజర్ నుంచి వచ్చిన ప్రకటన జాతికి కొత్త ఊపిరిని ఇచ్చిందని అన్నారు.

కేసీఆర్ నోట మళ్లీ సినిమా సిటీ మాట! నమ్మేవారున్నారా?

మాటలతో గారడీ చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటీవలే ఓ ప్రకటన చేశారు. అయితే కొత్తదేమి కాదు. గతంలో చెప్పిన మాటనే మళ్లీ చెప్పారు. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే మరో కారణమో తెలియదు కాని.. హైదరాబాద్ శివారులో 15 వందల నుంచి 2 వేల ఎకరాల్లో సినిమా సిటి నిర్మిస్తామని మళ్లీ ఫ్రెష్ గా ప్రకటించారు కేసీఆర్. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనపై టాలీవుడ్ నుంచి అసలు స్పందనే రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా కేసీఆర్ ను అభినందిస్తూ ప్రకటన చేయడం గాని.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాని చేయలేదు. దీన్నిబట్టే తెలుస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను ఫిల్మ్ వర్గాలు ఎంత లైట్ తీసుకున్నాయో. టాలీవుడ్ అలా స్పందించటానికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.    తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 జూలై 31న సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నగర శివారు ప్రాంతంలోని రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీని నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. అన్ని హంగులూ ఇక్కడే కల్పిస్తామని హామీ ఇచ్చారు. నటుడు కృష్ణను ఫిలిం సిటీ నిర్మాణానికి సంబంధించిన బోర్డులో సభ్యుడిగా నియమిస్తామని కూడా చెప్పారు.  ఆ తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సినిమా ప్రస్తావన తెచ్చిన కేసీఆర్ బాలీవుడ్ తరహాలో ఏ స్థాయిలోనైనా సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ తదితర అన్ని రకాల అవసరాలకు ధీటుగా ఫిలిం సిటీ ఉంటుందని ప్రకటించారు. దీనిని అవసరమైతే నాలుగైదు వేల ఎకరాలకు విస్తరిస్తామని చెప్పారు. సినిమాలకు మాత్రమే కాక టీవీ షూటింగులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. స్థల ఎంపిక కోసం సీఎం కేసీఆర్ స్వయంగా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు.    కేసీఆర్ ఫిలిం సిటీ ప్రకటన చేయడం, స్థల ఎంపిక కోసం ఏరియల్ సర్వే కూడా  చేయడంతో టాలీీవుడ్ సంతోషంలో మునిగిపోయింది. కేసీఆర్ ప్రకటనపై సినీ వర్గాల నుంచి భారీ స్పందన వచ్చింది.  హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా అందరూ కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. హీరో కృష్ణ అయితే ఒక అడుగు ముందుకేసి ఫిలిం సిటీకి కేసీఆర్ పేరే పెడతామని కూడా ప్రకటించారు. అయితే ఆరున్నర ఏండ్లు గడిచిపోయినా  సీఎం కేసీఆర్ ఫిల్మ్ సిటి ప్రకటన హామీగానే మిగిలిపోయింది. తానిచ్చిన హామీపై ఈ ఆరెండ్లలో మరోసారి సమీక్ష కూడా చేయలేదు కేసీఆర్. గతంలోనూ సిని ప్రముఖులు చాలా సార్లు ఆయన్ను కలిసినా తన హామీపై మాత్రం మాట్లాడలేదు ముఖ్యమంత్రి. సడెన్ గా ఇటీవలే ఆయన మళ్లీ సినిమా సిటి ప్రస్తావన తెచ్చారు. వరద విపత్తు సాయంగా తాము ప్రకటించిన విరాళాలు అందించేందుకు చిరంజీవి, నాగార్జున ప్రగతి భవన్ వెళ్లడంతో మళ్లీ కేసీఆర్ కు ఆ హామీ గుర్తు వచ్చినట్లుంది. అందుకే వెంటనే అక్కడే ఉన్న ఒకరిద్దరు అధికారులను కూర్చుబెట్టుకుని సమీక్ష చేశారు. మళ్లీ ఎప్పటిలాగానే ఆరున్నర ఏండ్ల క్రితం చేసిన ప్రకటనే మళ్లీ చేశారు.    తెలంగాణ ఏర్పడినాక సినీ పరిశ్రమ విశాఖపట్నం లేదా నెల్లూరు జిల్లాకు తరలిపోతుందన్న ప్రచారం జరగడంతో  సీఎం కేసీఆర్ ఫిలిం సిటీ నిర్మాణం గురించి ప్రస్తావించారు. సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి తరలిపోకుండా చూస్తామని చెప్పారు. హైదరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాల్లో ఒకే చోట రెండు వేల ఎకరాల స్థలం దొరకడం కష్టమని భావించిన అప్పటి ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు.. రాచకొండలో సుమారు 30 వేల ఎకరాల స్థలం ఉందని గుర్తించారు. ఇదే అనువైన ప్రదేశమని ప్రభుత్వానికి, సినీ ప్రముఖులకు సూచించారు. అయితే అందులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అది అలాగే మిగిలిపోయింది. అందుకే అయితే గతంలో  సినిమా సిటి ప్రకటన చేసినప్పుడు పోటీ పడి మరీ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన టాలీవుడ్ పెద్దలు..  ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.    నిజానికి హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే ఉన్న  రాచకొండలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. సినిమా షూటింగులకు అది అనువైన ప్రాంతంగా కూడా ఉంది. కేసీఆర్ సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. అక్కడ ఫిలింసిటి నిర్మించవచ్చు. కాని మాటలతోనే ఆయన కాలం వెల్లబుచ్చారు. అందుకే ఇప్పుడాయన 2 వేల ఎకరాల్లో సినిమా సిటి కడతామని చెప్పినా  సినిమా ఇండస్ట్రీలో స్పందించేవారు కరువయ్యారనే అభిప్రాయం వస్తోంది.