దుబ్బాకలో దూసుకుపోతున్న బీజేపీ! హరీష్ రావు రాజీనామా చేస్తారా?

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాక్ తగులుతోంది. ఎగ్జిట్ పోల్స అంచనాలకు మించి బీజేపీ పార్టీ దుబ్బాకలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు లెక్కించిన ప్రతి రౌండ్ లోనూ కమలం పార్టీనే లీడ్ సాధించింది. దీంతో రౌండ్ రౌండ్ కు రఘనందన్ రావు మెజార్టీ పెరిగిపోతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీకి భారీ ఆధిక్యం రావచ్చంటున్నారు. రౌండ్ రౌండ్ కు లీడ్ పెరుగుతుండటంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటుండగా.. గులాబీ శిబిరంలో మాత్రం నిరాశ అలుముకుంది.    దుబ్బాక ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంలో పోరు హారాహోరీగా సాగింది. టీఆర్ఎస్ తరపుల అంతా తానే వ్యవహరించారు మంత్రి హరీష రావు. గతంకంటే తనకు మెజారిటీ పెరుగుతుందని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్‌లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ కనిపిస్తోంది. దుబ్బాక ఎన్నిక బాధ్యతను పూర్తిగా హరీశ్‌రావు చేపట్టినందువల్ల ఓటమి ఎదురైతే ఆయనే స్వయంగా నైతిక బాధ్యత వహించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మంత్రిగా తనంతట తానే  బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

నేతలు చెప్పినట్టు ఆడతామంటే కుదరదు.. ఏపీ హైకోర్టు తీవ్ర హెచ్చరిక 

ఏపీలో హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు వ్యవహరిస్తున్న తీరు తో ఘర్షణ వాతావరణం నెలకొంటున్న సంగతి తెల్సిందే. తాజాగా ఒక స్థలంలో భవన నిర్మాణంపై జారీ చేసిన స్టేటస్‌ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులను అమలు చేయని అధికారులపై హైకోర్టు మండి పడింది. న్యాయవ్యవస్థను ఎలా నడపాలో, అలాగే బ్యూరోక్రాట్లతో ఎలా వ్యవహరించాలో తమకు బాగా తెలుసని.. తమ ఆదేశాల అమలు కోసం తాము ఎంతవరకైనా వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరించింది. తమ ఆదేశాలను అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు తమకు సర్వాధికారాలూ ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారులు నిబంధనల మేరకు సవ్యంగా నడుచుకోవాలని, పొలిటికల్ పార్టీల నేతలు చెప్పినట్లు ఆడతామంటే కుదరదని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ పిటిషన్‌ వేయాలని, అందులో ఆ అధికారుల పేర్లను కూడా పేర్కొనాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ వ్యవహారంలో ఆ అధికారులను ఎవరు రక్షిస్తారో చూస్తామని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం కాస్త కటువుగా వ్యాఖ్యానించింది.   చిత్తూరు జిల్లా తిరుమలయప్పపల్లిలో గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ సభ నిర్వహించకుండానే నిబంధనలకు విరుద్ధంగా.. మామిడితోపు, బండి దారికి సంబంధించిన స్థలంలో రైతు భరోసా కేంద్రం భవనం నిర్మిస్తున్నారంటూ కొండకిందపల్లికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి, యర్రసాని గోపిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ తన వాదనలు వినిపించారు. గతంలో ఇదే స్థలంలో గ్రామ సచివాలయ భవనం నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయగా.. గడచిన సెప్టెంబరు 24న హైకోర్టు స్టేటస్‌ కో (యథాతథ స్థితి) విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ ఆదేశాలకు విరుద్ధంగా ఇప్పుడదే స్థలంలో అధికారులు రైతు భరోసా కేంద్రం భవనం నిర్మిస్తున్నారని.. ఈ విషయం బయటకు పొక్కితే సమస్యలు వస్తాయన్న అనుమానంతో సదరు భూమి సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా అధికారులు అక్కడ భవన నిర్మాణం ఎలా చేపడుతున్నారని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పుడు దీనిపైనా స్టేటస్‌ కో ఉత్తర్వులిస్తే.. రేపు ప్రభుత్వం మరో స్కీం ప్రారంభించినప్పుడు దానికి సంబంధించిన భవన నిర్మాణం కూడా అక్కడ చేపడతారేమోనని సందేహమా వ్యక్తం చేసింది.   ఇదే కేసులో ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ చెబుతున్న స్థలంలో మొదట్లోనే గ్రామ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్ర నిర్మాణం కూడా చేపట్టామన్నారు. అయితే అప్పట్లో పిటిషనర్‌ కేవలం గ్రామ సచివాలయంపై మాత్రమే కోర్టుకు వచ్చారని తెలిపారు. అంతేకాకుండా పిటిషనర్‌ చెబుతున్నట్లుగా సర్వే నంబరు ఒకటే అయినప్పటికీ.. ఆ స్థలం ఎంతో విశాలమైనదని, అందువల్ల కోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రదేశంలో కాకుండా పక్కన నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా కోర్టు ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ నిర్మాణం నిలిపేశారని చెప్పారు. కేవలం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం కోసం ఆ నిర్మాణం చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ధర్మాసనం దీనిపై స్పందిస్తూ.. ఏవి ప్రజా ప్రయోజనాలో తమకు తెలుసని.. ప్రభుత్వం చేపడుతున్న అన్ని విషయాల గురించీ తమకు తెలుసని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా మీ అధికారులను సరిగా నడచుకోమని చెప్పండి. మా ఆదేశాలపై అభ్యంతరముంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. అంతే కానీ.. కోర్టు ఆదేశాలను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. హైకోర్టు ఆదేశాలు జారీ చేశాక అదే భూమిలో వేరే పథకానికి సంబంధించిన భవన నిర్మాణం ఎలా చేస్తారు? ఇది కోర్టు ధిక్కారం కాదా? రాజకీయ నేతలు చెప్పినట్లుగా మీరు ఆడతామంటే కుదరదు.   ఈ వ్యవహారం పై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశిస్తాం అని కోర్టు హెచ్చరించింది. దీనిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఓ పాత కేసును గుర్తుచేస్తూ.. పట్నాలో ఒక కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు పాటించని ఓ జిల్లా మేజిస్ట్రేట్‌ను పిలిపించి.. అటు నుంచి అటే జైలుకు పంపించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. ఆ స్థలంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలతో పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు మొదటి వారానికి వాయిదా వేసింది.

తెరాస ప్లాన్ తిరగబడుతోందా?

కాంగ్రెస్‌పై కోపం కమలానికి కలసివస్తోందా?   ఇది కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదమేనా?   టీఆర్‌ఎస్‌లో సీనియర్ల అంత్మథనం   పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు.. తెలంగాణలో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ పోరులో, బీజేపీ లబ్ధిపొందేందుకు కారణమవుతోందన్న అంతర్మథనం, టీఆర్‌ఎస్ సీనియర్లలో వినిపిస్తోంది. రాష్ర్టంలో కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా.. సీఎం కేసీఆర్ పన్నుతున్న వ్యూహం, పరోక్షంగా బీజేపీకి రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతోందన్న వ్యాఖ్యలు, టీఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇది నిస్సందేహంగా తమ నాయకత్వ వ్యూహాత్మక తప్పిదమేనని, సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.   దుబ్బాక ఉప ఎన్నిక  తొలి దశ నుంచి.. తుది దశ ప్రచారాన్ని పరిశీలిస్తే, తమ నాయకత్వం అనుసరించిన వ్యూహం, బీజేపీని రెండవ స్థానంలో నిలిపేలా చేసిందని టీఆర్‌ఎస్ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. తొలి దశలో వేగంగా దూసుకువెళ్లిన కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించేందుకు, బీజేపీ చేసిన హడావిడికి అనవసర ప్రాధాన్యం ఇచ్చిందంటున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బీజేపీ.. పోలింగ్ సమయానికి, ఉప ఎన్నికలో ‘బీజేపీ  కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదన్న’ అంచనాల స్థాయికి వెళ్లిందని విశ్లేషిస్తున్నారు.   స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన మంత్రి హరీష్‌రావు కూడా.. బీజేపీనే తమ ప్రత్యర్ధి అన్నట్లు చేసిన ‘కారు మోటారు కావాలా? కరెంటు మోటారు కావాలా’ అన్న ప్రచారం, బీజేపీ ప్రాధాన్యం పెంచింది.  ఆ తర్వాత ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ కూడా,  కేంద్రంలోని బీజేపీ  సర్కారుపైనే విమర్శించడం ద్వారా.. పోటీ అంతా,  టీఆర్ ఎస్-బీజేపీ మధ్యనే అన్న సంకేతాలిచ్చినట్టయిందని,  టీఆర్‌ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు.   నిజానికి ఉప ఎన్నికలో మూడవ స్థానంలో ఉండాల్సిన బీజేపీ.. తమ పార్టీ వ్యూహాత్మక తప్పిదం వల్ల,  రెండో స్థాయికి చేరిందన్న భావన ఏర్పడిందని చెబుతున్నారు. బీజేపీ పోల్ మేనేజ్‌మెంట్ కంటే,  ఉద్రిక్త వాతావరణం సృష్టించే హడావిడికే ప్రాధాన్యమిచ్చింది. సహజంగానే అది,  మీడియాను విపరీతంగా ఆకర్షించింది. ఫలితంగా,  ఓటర్లు కూడా సహజంగా పోటీని, టీఆర్‌ఎస్-బీజేపీకే పరిమితం చేశారని విశ్లేషిస్తున్నారు. ఈవిషయంలో బీజేపీ మైండ్ గేమ్ సక్సెస్ అయిందంటున్నారు. తమ పార్టీ అగ్రనేతలు కూడా.. ప్రచారంలో కాంగ్రెస్‌కు బదులు, బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధి అన్నట్లు సాగించిన ప్రచారం,  పరోక్షంగా బీజేపీ బలపడేందుకు కారణమయిందని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్‌ను ఎదగనీయకూడదన్న లక్ష్యంతో  వేసిన, తమ నాయకత్వ ఎత్తుగడగానే  నిపిస్తోందంటున్నారు.   అయితే, తమ నాయకత్వ వ్యూహాత్మక తప్పిదం వల్ల, భవిష్యత్తులో భారీ మూల్యం తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీ బలపడిన రాష్ర్టాల్లో ఆ పార్టీ అనుసరించిన వ్యూహం, ఆ తర్వాత ఏకంగా ఆయా రాష్ర్టాల్లోనే పాగా వేసిన వైనాన్ని, కేసీఆర్ ఎలా విస్మరించారో అర్ధం కావడం లేదన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిజానికి అనేక వర్గాలు-ముఠాలున్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం చాలా సులభం.   కానీ మూలాలు బలంగా ఉన్న బీజేపీకి ఒకసారి అవకాశం కల్పిస్తే.. ఇక అక్కడ విపక్షాలు మళ్లీ పైకి లేవడం చాలా కష్టమన్న అనుభవాలు, కళ్లెదుటే ఉన్నాయని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలనుకునే కేసీఆర్ సిద్ధాంతం, ఈ విషయంలో ఎలా తప్పిందో అర్ధం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   ‘ఒకవేళ మా సార్ భయపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీనే బలపడిందనుకున్నాం. అయితే ఏమవుతుంది? కాంగ్రెస్‌ది బహు నాయకత్వం. తప్పులు దాని జన్మలక్షణం. దానితో ఎంత వేగంగా బలపడుతుంతో అంతే వేగంగా బలహీనపడుతుంది. కానీ బీజేపీ అలా కాదు. దానికి బలమైన నాయకత్వం ఉంది. మూలాలున్నాయి. ఒకసారి బలపడిందంటే, ఇక దాన్ని బలహీనపరచడం చాలా కష్టం. ఒకవేళ బలహీనపడినా, మళ్లీ బలపడేందుకు దానికి పెద్దగా సమయం అవసరం లేదు. ఈ లాజిక్కును మా సార్ ఎలా మిస్సయ్యారో మాకూ ఆశ్చర్యంగా ఉంద’ని ఓ సీనియర్ టీఆర్‌ఎస్ నేత వ్యాఖ్యానించారు.   కాగా ఇప్పటికే.. టీఆర్‌ఎస్-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని.. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి నేతలు ఆరోపిస్తున్నారు. అటు రాజకీయ విశ్లేషకులు సైతం.. కాంగ్రెస్‌ను అణచివేయడంలో, కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. కాబట్టి ఇప్పట్లో  కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, బీజేపీ కూడా భావిస్తోంది. కేసీఆర్ కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీన పరిచిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్నది కూడా, బీజేపీ వ్యూహంగా అర్ధమవుతోందని చెబుతున్నారు. ఏపీలో కూడా బీజేపీ ఇదే వ్యూహం అనుసరిస్తున్నందుకే, వైసీపీ సర్కారుకు బీజేపీ పరోక్షంగా సహకారమిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో చాలాకాలం నుంచీ జరుగుతోంది.   అయితే.. కాంగ్రెస్‌ని నిర్వీర్యం చేసే ఉత్సాహంలో.. బీజేపీ బలాన్ని పెంచుతున్నామన్న నిజాన్ని, తమ నాయకత్వం గ్రహించకపోవడమే వింతగా ఉందని,  టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు నిజామాబాద్‌లో.. మామూలు రాజకీయ పరిస్థితిలో అయితే, ఓడిన కవిత మళ్లీ ఎంపీ కావడం పెద్ద సమస్య కాదు. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గెలిచినా, మళ్లీ కవిత గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ గెలిచినందున, మళ్లీ ఆ స్థానం టీఆర్‌ఎస్ దక్కించుకోవడం.. చాలా కష్టమవుతుందని విశ్లేషిస్తున్నారు. -మార్తి సుబ్రహ్మణ్యం

నంద్యాలలో మరో సెల్ఫీ వీడియో కలకలం 

పోలీసుల వేధింపులు భరించలేక నంద్యాలకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మరిచిపోక ముందే.. తాజాగా మరో సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం.. సూరజ్ అనే కాంట్రాక్టర్ రెండు నెలల క్రితం ఒక ఎలక్ట్రికల్ వర్క్ కోసం టెండర్ వేశాడు. అయితే, ఆ టెండర్ ను రద్దు చేయకుండానే ఆ కాంట్రాక్టును నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్‌రెడ్డి ఒంగోలుకు చెందిన మాధవరావు అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇప్పించినట్టు సూరజ్ ఆ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. దీంతో తాము ఏపీ హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయిందని, ఎమ్మెల్యే చెప్పిన వారికే అధికారులు ఆ కాంట్రాక్ట్‌ను అప్పగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఎమ్మెల్యే శిల్పా రవిని తన తండ్రి తిట్టినట్టు ప్రచారం చేస్తున్నారని, అయితే ఇందులో అసలు ఎటువంటి వాస్తవం లేదని, తిట్టినట్టు నిరూపించాలని సూరజ్ కుమారుడు ప్రస్తుతం డిమాండ్ చేశాడు. నంద్యాల ఎమ్మెల్యే చేసిన పనివల్ల తమ కుటుంబం మొత్తం రోడ్డునపడిందని, దీంతో తమకు చావాలో, బతకాలో అర్థం కావడం లేదని అతడు వాపోయాడు.

బీహార్ ఎన్నికలలో హోరాహోరీ.. ముందంజలో కాంగ్రెస్ ఆర్జేడీ మహాఘట్ బంధన్

భారత దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం మొదలైంది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన సిబ్బంది, ఆ తరువాత ఈవీఎంలను తెరిచారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, మొత్తం 243 స్థానాలు ఉండగా.. ఎన్డీయే 94 స్థానాల్లో ముందంజలో ఉండగా, మహా ఘటబంధన్ 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.   ఈ ఎన్నికలలో ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ), బీజేపీ కలిసి ఒక కూటమిగా, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ - కాంగ్రెస్ మరో కూటమిగా.. చిరాగ్ పాశ్వాన్ విడిగా ఎన్నికల్లో పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు హోరాహోరీగా సాగాయని, అయితే ప్రజలలో కొంత మొగ్గు మహా ఘటబంధన్ వైపే ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. తాజాగా తొలిగా వస్తున్న ట్రెండ్స్ కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు సీఎం గా చేసి ఇవే నా చివరి ఎన్నికలు అంటున్న ప్రస్తుత ముఖ్య మంత్రి నితీష్ కుమార్ భవితవ్యం ఈ ఎన్నికలలో తేలనుంది.

మెగాస్టార్ కు కరోనా... ప్రగతి భవన్ లో అందరికి టెస్టులు

మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టే ఉద్దేశంతో.. టెస్ట్ చేయించుకోగా త‌న‌కు క‌రోనా సోకింద‌ని, అయితే త‌న‌కు ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు. దీంతో గత కొద్దీ రోజులుగా త‌న‌ను క‌లిసిన అంద‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. తాజాగా ఇదే విషయం ప్రగతి భవన్ లో కలకలం రేగింది. ఎందుకంటే చిరంజీవి, మరో టాలీవుడ్ హీరో నాగార్జున తో కలిసి సీఎం కేసీఆర్ ను కలిసి వరద సహాయ నిధికి విరాళం ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ తో పాటు పలువురు అధికారులతో చాలాసేపు సమావేశమయ్యారు. ఈ సమయంలో పాల్గొన్న వారెవరు మాస్కులు కూడా పెట్టుకోలేదు. తాజాగా చిరంజీవికి కరోనా సోకినట్లుగా తేలడంతో ప్రగతి భవన్ లో కలకలం రేగింది. దీంతో వెంటనే ప్రగతి భవన్ లోని వారందరికీ కరోనా రాపిడ్ టెస్టులు చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ టెస్టులో ఎంపీ సంతోష్ కు నెగెటివ్ రాగా మ‌రికొంద‌రి రిపోర్టులు రావాల్సి ఉంద‌ని స‌మాచారం. అయితే…వారంతా చిరంజీవితో క‌లిసి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే కాడంతో ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాత్ర‌మే క‌రోనా ఉన్నది లేనిది నిర్ధారణ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌న్న నిపుణులు చెపుతున్నారు.

వైకాపా ఎమ్మెల్యే దుర్భాషలాడడంతో మహిళా వాలంటీర్ ఆత్మహత్య యత్నం.. 

ఏపీ‌లో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన పి. గన్నవరం ఎమ్మెల్యే అవమానించారని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. సీఎం జగన్ గతంలో చేసిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నేడు మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పర్యటన చేపట్టారు. అయితే మామిడికుదురు మండలంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నందుకు ఓ మహిళా వాలంటీర్‌ను అందరి ముందు దుర్బాషలాడారు. కొన్ని వందల మంది ప్రజల సమక్షంలో ఆ వాలంటీర్ ను బూతులు తిట్టారు. దీంతో ఆమె తీవ్ర అవమానంతో పురుగులు మందుతాగి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచిత ప్రవర్తనపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కనీసం మహిళ అని గౌరవం కూడా లేకుండా అందరి ముందు వాలంటీర్ ను దుర్భాషలాడడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇది ఇలా ఉండగా గత కొద్దీ రోజులుగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అటు అధికారులు, ఇటు సామాన్య ప్రజల పైన విపరీతంగా రెచ్చిపోతున్నారు. మొన్న ఎమ్మెల్యే శ్రీదేవి ఓ సీఐను నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. నిన్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఓ అధికారిని పట్టుకుని, చెప్పు తెగేదాకా కొడతా... నీ ఇష్టమొచ్చినట్లు ఇసుక తరలిస్తే నీ అంతు చూస్తా.. అంటూ ఊగిపోయారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సామాన్య ప్రజలు ఏవగించుకుంటున్నారు.

ఏపీలో కలకలం రేపుతున్న ఫేక్ ఆధార్ కార్డులు..

ఏపీలో ఫేక్ ఆధార్ కార్డు తయారు చేస్తున్న ముఠా అరెస్టు తీవ్ర కలకలం రేపుతోంది. ఆధార్ కార్డులలో టాంపరింగ్ ద్వారా ప్రభుత్వ పథకాల్లో అనర్హులకు లబ్ధి చేకూర్చే విధంగా ఒక ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. కృష్ణ జిల్లా గుడివాడ, తిరువూరులలో ఆధార్‌ కార్డును ట్యాంపరింగ్‌ చేస్తున్నట్టు గుర్తించామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వీరు అక్రమాలకు పాల్పడుతున్నట్టు జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. వీరు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయమై జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఫేక్‌ ఆధార్‌ కార్డు తయారీ కేసులో జిల్లాలోని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని, ఇంకా కొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని ఎస్పీ ప్రకటించారు. ఒక్కొక్క నకిలీ ఆధార్‌ కార్డు కోసం వీరు రూ. 5 వేలు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, అతడికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ప్రకటించారు. అంతేకాకుండా వారి వద్ద నుండి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అందరిని మందలించి.. తానే మాస్కు తీసేశారు! చిరుకి కరోనాపై ఆర్ఆర్ఆర్ రియాక్షన్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడంపై స్పందించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. కరోనా అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి అనేక ప్రకటనలు ఉచితంగా చేసిన చిరంజీవి గారు ఇప్పుడు తానే కరోనా బారినపడడం దురదృష్టకరం అని ఆయన ట్వీట్ చేశారు. మాస్కులు ధరించాలంటూ చిరంజీవి అనేకమంది హీరోయిన్లను మందలించడం చూశామని, కానీ ఆయన ఒక్కసారి మాస్కు తీసి కనిపించాడని, కరోనా వచ్చేసిందని వ్యాఖ్యానించారు. చిరంజీవిని పరామర్శించేందుకు కాల్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదన్న రఘురామకృష్ణరాజు,. అందుకే ట్వీట్ పెట్టానని వివరించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు.    ఇక చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరకుంటూ సినీ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. చిరంజీవిగారూ.. త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. జాగ్రత్తగా ఉండండి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని రవితేజ స్పందించారు. చిరంజీవి సర్.. మీరు కరోనాను జయించి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నానని  నిఖిల్ ట్వీట్ చేశారు. చిరంజీవి సర్ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యవంతులుగా తిరిగి రండి. మిమ్మల్ని మేమందరం ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటామన్నారు దేవిశ్రీప్రసాద్.

లాడెన్, బాబర్ వారసుడిని బొంద పెడ్తాం! కేసీఆర్ పై సంజయ్ ఫైర్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ ను ఒక నియంతగా ఆయన అభివర్ణించారు.  బీజేపీ అంటే ఛత్రపతి శివాజీ వారసులమని... కేసీఆర్ మాత్రం లాడెన్, బాబర్ వారసుడని విమర్శించారు. ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్ కు బొంద పెడతామని... హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు బుద్ధి చెపుతామన్నారు బండి సంజయ్.    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామన్నారు బండి సంజయ్. పేదల్లో కష్టాల్లో ఉన్నా పరామర్శించకపోవడం యనకు అలవాటుగా మారిందని చెప్పారు. వరదలకు బంగ్లాలు మునగలేదు కాబట్టే ఇంటి నుంచి కేసీఆర్ బయటకు రాలేదని విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క ఇంటినీ సర్వే చేయాలని... బాధితులందరికీ నష్ట పరిహారాన్ని అందించాలని బండి డిమాండ్ చేశారు.   కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. బియ్యం, డబుల్ బెడ్రూమ్, రోడ్లు, టాయిలెట్లు, లైట్లు ఇలా అన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నా.. కేసీఆర్ మాత్రం అంతా తానే చేస్తున్నాననని డబ్బుా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ చీఫ్.  మైలార్ దేవ్ పల్లిలో జరిగిన బీజేపీ సభలో పాల్గొన్నారు. ఈ సభలోనే కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి కమలం పార్టీలో చేరారు. ఇక సభకు వెళుతూ ఆరాంఘర్ నుంచి మైలార్ దేవ్ పల్లి వరకు భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బండి సంజయ్.

లోకేష్ పారిపోయాడు.. కేటీఆర్ జులాయి! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సంచలన కామెంట్లు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గ్రేటర్లో వరద సాయం పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేస్తే కొట్టేయడం ఇబ్బంది అవుతుందని.. ఓట్లు కొనుగోలు చేయడానికి నగదు బదిలీ పథకం పెట్టారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ జులాయి అని రేవంత్ మండిపడ్డారు.  వరద సాయం కోసం ఇచ్చిన రూ. 10 వేల డబ్బుల్లో టీఆరెస్ నేతలు రూ. 5 వేలు కొట్టేశారని, దీనిపై ప్రజలంతా తిరగబడాలని ఆయన పిలుపిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు పైసలు అందలేదని, టీఆర్ఎస్ దొంగలకు మాత్రం డబ్బులు వెళ్లాయని  రేవంత్  మండిపడ్డారు.    జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. వరద సాయం వివరాలు అడిగితే చెప్పలేక లోకేష్ కుమార్ పారిపోయారన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులను పెట్టి దొంగలా తప్పించుకున్నాడని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.  శనివారం నాడే కమిషనర్ లోకేష్ అపాయింట్మెంట్ తీసుకున్నా.. ఆయన ఎందుకు ఆఫీసుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు ఆదుకోకుండా గులాబీ నేతలకు కమిషనర్ డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.    వరద సాయంలో జరిగిన అవతకవకలకు నిరసనగా  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు.  వరద బాధితులతో కలిసి రేవంత్‌ నిరసనకు దిగారు.  కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికివెళ్లకుండా వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వరద బాధితుల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి.. అందులో 250  కోట్ల రూపాయలు గులాబీ నేతలే ఆరోపించారు.

అన్ని పార్టీలు చుట్టేసిన రాములమ్మ! ఈసారైనా సెటిలయ్యేనా?

22 ఏండ్లు.. ఐదు పార్టీలు.. ఒకసారి ఎంపీ పదవి. ఇవీ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండుగా పిలుచుకునే విజయశాంతి అలియాస్ రాములమ్మ రాజకీయ చరిత్రను సూచించే లెక్కలు. సినిమా రంగం నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన విజయశాంతి.. ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండలేకపోయారు. నాలుగు పార్టీలు మార్చారు. సొంతగా ఒక పార్టీ పెట్టుకుని కొంత కాలానికి దుకాణం ఎత్తేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటి చైర్మెన్ గా ఉన్న ఆమె,,  త్వరలోనే బీజేపీలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.    1998లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు  విజయశాంతి.  తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009లో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి కేసీఆర్ తో కలిసి పనిచేశారు రాములమ్మ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ తర్వాత గులాబీ పార్టీలో నంబర్2 పొజిషన్ లో విజయశాంతి ఉన్నారనిపించింది.   అయితే కొద్ది రోజులకే  కేసీఆర్ తో ఆమెకు విభేదాలొచ్చాయి. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాసైన సందర్భంలో ఆమె టీఆర్ఎస్ ఎంపీగా సభలోనే ఉన్నారు. అయితే కేసీఆర్ తో మాత్రం దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్  లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతిని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ చైర్మెన్ ను చేశారు.             ఫైర్ బ్రాండ్ లేడీగా రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి ఎక్కడా స్థిరంగా ఉండకపోవడంపై విమర్శలకు తావిచ్చింది. ఆవేశపూరిత నిర్ణయాలే ఆమెకు నష్టం కల్గించాయనే భావన వ్యక్తమవుతోంది. ఎల్ కే అద్వాని శిష్యురాలిగా బీజేపీలో చేరిన రాములమ్మకు ఆ పార్టీలో  మంచి గుర్తింపే దక్కింది. అయితే కొంత కాలానికే ఆమె తల్లి తెలంగాణ పేరుతొ సొంత పార్టీ స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే దేవేందర్ గౌడ్ పీఆర్పీ వైపు మొగ్గు చూపడంతో.. విజయశాంతి ఆయనతో విభేదించారు. అనూహ్యంగా తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు.    2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి.. కొంత కాలానికే ఆ పార్టీ నేతలతో విభేదాలొచ్చాయి. ఎంపీగా ఉంటూనే టీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్జేజీలో ఉన్న సమయంలోఎంపీగా ఉన్న విజయశాంతి.. కేసీఆర్ తో మాత్రం గ్యాప్ పెంచుకుంటూనే వచ్చారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కొన్ని ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో  పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ 2013లో రాములమ్మని టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక 2014లో విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు.    కాంగ్రెస్ లోనూ విజయశాంతికి మంచి స్థానమే దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమెను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. తర్వాత ప్రచార కమిటి చైర్మెన్ చేశారు. నిజానికి ఎన్నికల ప్రచారంలో తప్ప మిగితా సమయంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరు. కొన్ని సార్లు నెలల తరబడి ఆమె బయటికే రారని ఆరోపణలున్నాయి. అయినా రాములమ్మకు కీలక పోస్టులు కట్టబెట్టింది కాంగ్రెస్. విజయశాంతికి  కాంగ్రెస్ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉండేవంటారు. అందుకే టీపీసీసీ నేతలతో పని లేకుండానే ఆమెకు పార్టీలో కీలక పోస్టులు వచ్చాయంటారు. అయితే ఈ మధ్య రాష్ట్ర పార్టీ సీనియర్లు తనను పట్టించుకోవడం లేదని,  కొన్ని కీలక సమావేశాలకు పిలవలేదనే భావనలో విజయశాంతి ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల  ప్రచారానికి ఆమె దూరంగా ఉన్నారు. గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతి.. అదే జిల్లా పరిధిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికను పట్టించుకోకపోవడంతోనే ఆమె పార్టీ మారడం ఖాయమనే సంకేతమిచ్చింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో రాములమ్మ పార్టీ మారకపోవచ్చని భావించారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ తో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.    బీజేపీ నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాములమ్మ.. తిరిగితిరిగి మళ్లీ అదే పార్టీ  చేరబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెకు బీజేపీలో జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో చేరి తనదైన ముద్ర వేసి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు బీజేపీలో చేరడం.. అటు ఆ పార్టీకి, ఇటు ఈమెకు కూడా లాభం చేకూర్చే అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో ఈసారైనా విజయశాంతి నిలదొక్కుకోగలుగుతుందా లేద మళ్లీ కొన్ని రోజులపై పార్టీ మారుతుందా అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.

సీఎం తేజస్వికి శుభాకాంక్షలు! ఫలితాలు రాకముందే హోరెత్తిన ట్విట్టర్ 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాక ముందే.. మహా గట్ బంధన్ ఎన్నికల సారథి, ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. బిహార్ లో ఆర్జేడీ కూటమిదే అధికారమని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో.. ఆ కూటమి కార్యకర్తల అనందానికి అంతే లేకుండా పోయింది.  ఇప్పటికే గెలుపుపై ధీమాగా ఉన్న ఆర్జేడీ కార్యకర్తలకు.. ఫలితాలకు ఒక రోజు ముందు తేజస్వి యాదవ్ పుట్టినరోజు కావడం డబుల్ ధమాకాగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్జేడీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.      అయితే తమ యువ నేత తేజస్వి యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సీఎం తేజస్వి అని పోస్టులు చేశారు ఆర్జేడీ కార్యకర్తలు. పాట్నాలోనూ 'ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ భారీగా బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. తేజస్వికి విషెష్ చెప్పేందుకు భారీగా తరలివచ్చిన నేతలు కార్యకర్తలు, అభిమానులు .. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.    ట్విట్టర్ లో తేజస్వి యాదవ్ పేరు మార్మోగుతోంది. ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్‌లో తేజస్వీ పేరు టాప్ లో నిలిచింది.  ఇండియా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగుల్లో తేజస్వీ పేరుతోనే నాలుగు హ్యాష్‌‌ట్యాగ్‌లు నిలిచాయి. ‘‘ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’’ హ్యాష్‌‌ట్యాగ్‌ అందులో టాప్ లో నిలిచింది.  తమ అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ముఖ్యమంత్రి కాబోతున్నారనే నమ్మకంతో  ఆ శుభాకాంక్షలు కూడా ముందుగానే చెప్పేశారు  నెటిజెన్లు.

అక్కడ 33.. ఇక్కడ 32! ఏపీలో మారిన కొత్త జిల్లాల లెక్క?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి దీనిపై లోతుగా అధ్యయనం చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోయినా ఏపీలో ఏర్పడబోయే జిల్లాలపై  జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది 25 జిల్లాలని.. మరికొందరు 26, 27 వరకు ఉంటాయని చెబుతున్నారు. తాజాగా ఏపీలో 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని మరో ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన మంత్రి తానేటి వనిత కూడా ఇదే విషయం చెప్పారు. కొత్తగా 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికి ప్రస్తుతం 32 జిల్లాలు ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మంత్రి ప్రకటనతో ఏపీలో కొత్తగా మరో 19  జిల్లాలు ఏర్పాటు కావొచ్చని.. వచ్చే ఏడాది జనవరి కల్లా దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.    ఉత్తరాంధ్రలో ప్రస్తుతం మూడు జిల్లాలు ఉండగా పునర్విభజనతో అని ఏడుకు పెరగబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు కొత్తగా పలాస, పార్వతీపురం, అరకు, అనకాపల్లి జిల్లాలు వస్తాయని సమాచారం.  ఇక గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలుగా మారనున్నాయి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయని చెబుతున్నారు. కృష్ణా జిల్లాను విజయవాడ,మచిలీపట్నం జిల్లాలుగా విభజించనున్నారు.గూంటూరు జిల్లా  నాలుగు  ముక్కలు కానుంది. గుంటూరుతో పాటు అమరావతి, బాపట్ల, నర్సరావుపేట కేంద్రాలుగా కొత్త జిల్లాలు రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఒంగోలు.. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు జిల్లాలు రానున్నాయట.             రాయలసీమ మొత్తం 10 జిల్లాలుగా మారబోతుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. చిత్తూరుతో  పాటు ఆధ్యాత్మిక నగరం తిరుపతి , మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు  వస్తాయని  చెబుతున్నారు. ప్రస్తుత అనంతపురం జిల్లా అనంతపురం, హిందూపురం జిల్లాలుగా విభజన కానుందంటున్నారు. ప్రస్తుత కర్నూల్ జిల్లా కర్నూల్, అదోని, నంద్యాల జిల్లాలుగా మూడు ముక్కలు అవుతుందని చెబుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కొత్తగా రాజంపేట జిల్లా వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.    జగన్ సర్కార్ రూపొందిస్తున్న కొత్త జిల్లాల ప్రతిపాదనలు,  అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పునర్విభజన తర్వాత రాయలసీమలో 10 జిల్లాలు ఉండనుండగా.. ఉత్తరాంధ్ర  ఏడు జిల్లాలుగా మారబోతోంది. ఉభయ గోదావరి ఐదు జిల్లాలుగా విభజన కానుండగా.. కోస్తాంధ్ర  10 జిల్లాలుగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కర్నూల్, విశాఖ, చిత్తూరు, తూర్పు గోదావరి మూడు ముక్కలు కానున్నాయి. ఏపీలో పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు నాలుగు జిల్లాలుగా విడిపోనుంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు , కడప, అనంతపురం , పశ్చిమగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రెండుగా విడిపోనున్నాయి.    ఆంధ్రప్రదేశ్ 25 జిల్లాలుగా పునర్విభజన జరగనుందని వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న 25 లోక్ సభ నియోజకవర్గాలనే జిల్లాలుగా మారుస్తారని భావించారు. ఆ దిశగానే ప్రభుత్వం నియమించిన జిల్లాల పునర్విభజన కమిటి కూడా కసరత్తు మొదలు పెట్టిందని ప్రచారం జరిగింది. అయితే తమ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చాయి.  మార్కాపురం, గూడూరు, పార్వతీపురం వంటి ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో  ప్రభుత్వం కూడా మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కనే తాజాగా 32 జిల్లాల ప్రతిపాదన తెరపైకి వచ్చిందంటున్నారు.    మరోవైపు  32 జిల్లాల ప్రతిపాదనపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా  ఆసక్తికర వాదనలు వస్తున్నాయి. 32 జిల్లాలతో ప్రయోజనం ఉంటుందా అని కొందరు పోస్ట్ చేస్తున్నారు. 32 జిల్లాలు అవసరమంటారా అంటూ మరికొందరు జనాల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న జిల్లాల వల్ల వచ్చే ప్రయోజనాలేంటీ, నష్టాలేంటీ అన్న విషయాలపైనా ఏపీ ప్రజల్లో మంచి చర్చ జరుగుతోంది. తన  ఫ్రెండ్ కేసీఆర్ బాటలోనే జగన్ నడుస్తున్నారని, తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు కావడంతో ఇక్కడ కూడా అలాగే చేయాలని చూస్తున్నారనే సెటైర్లు కొందరు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.

ఎముకలు విరగొచ్చు.. తలలు పగలొచ్చు! బెంగాల్ బీజేపీ చీఫ్ వార్నింగ్ 

పశ్చిమ బెంగాల్లో అధికార తృణామూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కత్తులు దూరుతున్నాయి రెండు పార్టీలు. తమ మాటల తూటాలతో కాక రేపుతున్నారు నేతలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనుచరులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ.. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.     దీదీ సోదరులకు ఇదే నా హెచ్చరిక. ఎవరైతే వచ్చే ఆరు నెలల్లో సమస్యలు సృష్టిస్తారో వారికి నా వార్నింగ్. వారి కాళ్లూ చేతులు, ఎముకలు విరిగిపోవచ్చు. తలలు పగలొచ్చు. వారు ఆసుపత్రుల్లో చేరవచ్చు. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటున్నారా? శ్మశానానికి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి" అని హల్దియాలో జరిగిన ర్యాలీలో దిలీప్ ఘోష్ హెచ్చరించారు. ఈ వార్నింగులే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.    బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మమతను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఇప్పటినుంచే ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ ముఖ్య నేతలు కూడా బెంగాల్ లో పర్యటిస్తూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా బెంగాల్ లో పర్యటించారు. ఇక బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో అయితే చాలా కాలంగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. అయితే అమిత్ షా పర్యటించి వెళ్లిన రెండు రోజుల్లోనే దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.    దిలీప్ ఘోష్ హెచ్చరికలపై టీఎంసీ నేతలు తీవ్రంగా ఫైరవుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలు స్పష్టించేలా బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపై హైకమాండ్ డైరెక్షన్ లోనే రాష్ట్ర నేతలు రెచ్చిపోతున్నారని టీఎంసీ నేతలు చెబుతున్నారు. ఎముకలు విరగొడతాం.. తలలు పగలకొడతామంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసినబెంగాల్ బీజేపీ చీఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తృణామూల్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  

ట్రంప్ కు మున్సిపల్ అఫీసులో ఉద్యోగం! జెరూసలేమ్ అధికారుల కలకలం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ పై సోషల్ మీడియాలో సెటైర్లు ఓ రెంజ్ లో పేలుతున్నాయి. ఆయనతో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. ఓడిపోయినా ఆయన ఇంకా అధ్యక్ష భవనం వీడకపోవడంపైనా పంచ్ లు విసురుతున్నారు. తాజాగా డొనాల్డ్  ట్రంప్ ను హేళన చేసే మరో ఘటన జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ కు ఉద్యోగాన్ని ఇస్తున్నట్టు ట్వీట్ పెట్టి కలకలం రేపారు జరూసలేమ్ మునిపల్ అధికారులు.    అధ్యక్షుడిగా ఉద్యోగం పోయినందుకు బాధ పడవద్దని, తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామంటూ ట్రంప్ ను ఉద్దేశించి జెరూసలేమ్ మునిసిపల్ అధికారులు తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ కావడంతో వెంటనే దాన్ని ఉన్నతాధికారులు తొలగించారు. ఈ పోస్ట్ అనుకోకుండా వచ్చిందని జెరూసలేమ్ మున్సిపల్  అధికార ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.  డొనాల్డ్  ట్రంప్ కు ఉద్యోగం ఇచ్చేందుకు తాము సిద్ధమంటే, తాము సిద్ధమని ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు కూడా ప్రకటిస్తున్నాయి.

తిరుమలలో భక్తుడి కిడ్నాప్‌ కలకలం

తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భక్తుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. అయితే, కుటుంబీకుల సమాచారంతో.. పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమై కిడ్నాపర్లను వెంటనే పట్టుకున్నారు.  నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన హనుమంతరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని ఎస్పీటీ అతిథిగృహానికి చేరుకోగానే.. నలుగురు వ్యక్తులు హనుమంతరావును బలవంతంగా ఓ కారులో ఎక్కించుకుని తిరుపతి వైపు దూసుకుపోయారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కారు నంబరును పోలీసులకు తెలియజేశారు.    పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమై అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద కారును అడ్డుకుని హనుమంతరావును రక్షించి.. కిడ్నా్‌పకు పాల్పడిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శ్రీనివాస్‌, మారుతి, పుట్టపర్తికి చెందిన కుమార్‌, చిత్తూరుజిల్లా చౌడేపల్లెకు చెందిన సురేష్‌ ఉన్నారు. పెనుగొండ కియా ప్లాంట్‌ ఎదుట క్యాటరింగ్‌ బిజినెస్‌ చేసేందుకు శ్రీనివాస్‌ వద్ద నుంచి రూ.20 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వక పోవడంతోనే హనుమంతరావును కిడ్నాప్‌ చేసినట్లు దర్యాప్తులో తేలిందని తిరుమల డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.

సీఎంవోలో మూడో పవర్ సెంటర్! యువ నేతల మధ్య వార్? 

ఆ ఇద్దరు యువ నేతలు. ఒకరు మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాలనలో చక్రం తిప్పుతున్నారు. మరొకరు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులుగా ఉంటున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య  ముందు నుంచి సఖ్యత బాగానే ఉండేది. కాని ప్రస్తుతం ఆ ఇద్దరు యువ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇవే కామెంట్స్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.    ఆ ఇద్దరు యువనేతలు ఎవరో కాదు.. ఒకరు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాగా... మరొకరు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. కేటీఆర్, సంతోష్‌రావుల మధ్య పంచాయితీ నడుస్తోందంటూ తాజాగా బాంబు పేల్చారు బండి సంజయ్. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సంజయ్ వ్యాఖ్యలు గులాబీ పార్టీలో గుబులు రేపుతుండగా.. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఇందులు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు.    సీఎంవోలో మూడో పవర్ సెంటర్ గా ఎంపీ సంతోష్ కుమార్ మారిపోయారనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. సీఎంవోలో సీఎం కేసీఆర్ కు మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ ఐఏఎస్ నర్సింగ్ రావులు కీలకంగా ఉన్నారు. వారితో పాటు మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. వారంతా సీఎం సెంటర్ గా పనిచేస్తారని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ కూ సీఎంవోతో పాటు ఉన్నతాధికారుల్లో సెపరేట్ టీమ్ ఉందని తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ లు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్ లు కేటీఆర్ సెంటర్ లో ముఖ్యలని చెబుతారు. అయితే కొన్నిరోజులుగా ఎంపీ సంతోష్ కు మద్దతుగా మరో వర్గం తయారైందనే ప్రచారం జరుగుతోంది. సీఎంవోతో పాటు సచివాలయంలోనూ సంతోష్ కోటరి బలంగా ఉందని కొందరు టీఆర్ఎస్ నేతలే అఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.    నిజానికి గతంలో సీఎం కేసీఆర్ పర్యటనలు, ఆయన వ్యక్తిగత నిర్ణయాల వరకే సంతోష్ కుమార్ చూసేవారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు ఉండేవారు. అయితే రాజ్యసభకు పంపించాక ఆయనలో మార్పు వచ్చిందంటారు. ఇప్పుడు కేసీఆర్ కార్యక్రమాలు చూడటంతో పాటు పార్టీ, ప్రభుత్వ  పాలనా వ్యవహరాల్లోనూ సంతోష్ కుమార్ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. గతంలో ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లు పోస్టింగులు, ప్రమోషన్ల కోసం కేటీఆర్ ను కలిసివారు.. ఇప్పుడు సంతోష్ తో కూడా తమ పని జరుగుతుందని వారు చెబుతున్నారట. అందుకే ఎప్పడూ బిజీగా ఉండే కేటీఆర్ కంటే సంతోష్ తో పని చేయించుకోవడమే బెటరనే అభిప్రాయం అధికారుల్లో ఉందంటున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా సంతోష్ ను పవర్ సెంటర్ గా చూస్తున్నాయని తెలుస్తోంది. ప్రమోషన్లు, బదిలీల కోసం కేటీఆర్ తో పాటు సంతోష్ కు కలుస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది.   గతంలో సినీ, రాజకీయ ప్రముఖులంతా మంత్రి కేటీఆర్ చుట్టూనే తిరిగేవారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రావాలన్నా, సర్కార్ నుంచి రాయితీలు అడగాలన్నా అందరూ కేటీఆర్ దగ్గరకే వచ్చేవారు. కాని ఇప్పుడు కొందరు వ్యాపార, సినీ ప్రముఖులు ఎంపీ సంతోష్ ను  ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా ఆయనకు బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ, వ్యాపర దిగ్గజాలతో సంతోష్ కు పరిచయాలు పెరిగాయని, దీంతో ఆయన ఇమేజీ కూడా పెరిగిందనే చర్చ జరుగుతోంది. మీడియాను కూడా సంతోష్ మ్యానేజ్ చేస్తున్నారని, అందుకే ఆయన కార్యక్రమాలకు మంచి కవరేజ్ లభిస్తుందని చెబుతున్నారు.    మొత్తంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవల కాలంలో తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు పార్టీ, ప్రభుత్వ వ్యవహరాల్లో కీలకంగా మారారని కేటీఆర్ టీమ్ కూడా గుర్తించిందని అంటున్నారు.  సంతోష్ రావు తీరుపై కేటీఆర్ వర్గం గుర్రుగా ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. ఇందుకు బలాన్నిచ్చేలా బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీని కలవర పరుస్తుందంటున్నారు. మొత్తానికి కేటీఆర్, సంతోష్ మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం ఆధిపత్య పోరు సాగుతుందనే సంజయ్ కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లోనూ, కారు పార్టీల్లోనూ కాక రేపుతున్నాయని చెబుతున్నారు.