డిసెంబరు 1 నుంచి మళ్లీ లాక్డౌన్! నిజం లేదన్న కేంద్రం
posted on Nov 13, 2020 9:12AM
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వింటర్ సీజన్ కావడంతో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, కేరళలో సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని, వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని వైద్య సంస్థలు. నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అటు ప్రపంచ వ్యాప్తంగానూ కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. యూరప్ లోనూ వైరస్ వర్రీగా మారింది. పారిస్, లండన్ లో మరోసారి లాక్ డౌన్ విధించారు.
దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించేందుకు కేంద్రం సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ పేరుతో ఉన్న ట్వీట్ వైరల్ కావడంతో దేశ ప్రజలు నిజమే అనుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఆ ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అలాంటి ప్రకటన ఏదీ విడుదల కాలేదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై స్పందించిన ప్రభుత్వానికి చెందిన నిజ నిర్ధారణ విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ).. మార్ఫ్డ్ ఇమేజ్ అంటూ ప్రముఖ మీడియా సంస్థ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ను పోస్టు చేసింది. మళ్లీ లాక్డౌన్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తేల్చి చెప్పింది. దేశంలో ప్రస్తుతం అన్లాక్ 5.0 మార్గదర్శకాలు అమలవుతున్నాయి. లాక్ డౌన్ మళ్లీ విధిస్తారంటూ గతంలోనూ ఇటువంటి ప్రచారమే జరిగింది. అప్పుడు కూడా వివరణ ఇచ్చిన కేంద్రం.. తాజా పుకార్లపై మరోమారు స్పష్టమైన వివరణ ఇచ్చింది.