హరీష్రావును బలిపశువు చేశారు!
posted on Nov 13, 2020 @ 3:31PM
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దుబ్బాక విజయంతో బీజేపీ జోష్ లో ఉండగా.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఓటమిపై పోస్ట్ మార్టమ్ జరుగుతోంది. దుబ్బాక ఫలితంపై కొత్త కొత్త వాదనలు బయటికి వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఓడిపోతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందే తెలుసని... అయినప్పటికీ మంత్రి హరీశ్ రావును బలిపశువును చేశారని చెప్పారు. కేసీఆర్ నిరంకుశ పాలనను, ఒంటెద్దు పోకడలను తిప్పికొట్టాలనే కసి ప్రజల్లో మొదలైందని చెప్పారు జితేందర్ రెడ్డి. ఆ కసిని దుబ్బాక ఎన్నికల్లో జనాలు తీర్చుకున్నారని చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా 84 వేల మంది ప్రజలు నిలబడ్డారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తామని చెప్పారు జితేందర్ రెడ్డి. అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్నారు. విజయశాంతి బీజేపీలో ఎప్పుడు చేరబోతున్నారనే సమాచారం తన వద్ద లేదని చెప్పారు. వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని జితేందర్ రెడ్డి విమర్శించారు. ఆ ప్రభావం అధికార పార్టీపై భారీగా ఉండబోతుందని చెప్పారు.