రాజ గురువు జన్మదిన వేడుకలు.. ఏపీ సర్కార్ వివాదాస్పద ఆదేశాలు!
posted on Nov 13, 2020 @ 7:06PM
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను వ్యక్తి పూజలకు నిలయాలుగా మార్చేలా ఏపీ ప్రభుత్వం వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. 18వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల స్వరూపానందకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి రేణిగుంట ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికి.. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలికడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల నుంచి ఇంకా బయటపడకముందే, స్వరూపానంద విషయంలో తాజాగా వివాదాస్పద ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం అభాసుపాలయింది.
కాగా, గత సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్షలో విజయవాడలో ఉంటే రెండు నెలలపాటు ఒక్క ఆలయం వారు మర్యాదగా కూడా దర్శించు కోలేదు. సనాతన సర్వజ్ఞ జగద్గురు కంచి పీఠాధిపతులను పట్టించుకోని దేవాదాయ శాఖ.. స్వయంప్రకటిత విశాఖ పీఠానికి ఊడిగం చేస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.