కరోనా పేరుతో తిరుపతి ఎన్నిక ఆపుతారా! వైసీపీని నిలదీసిన బోండా

ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. జగన్ అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారంతా వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే ఎన్నికలను వాయిదా వేస్తుందని విమర్శించారు. వైసీపీకి ధైర్యముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సహకరించాలని సవాలు విసిరారు బోండా ఉమ. ఎన్నికలకు భయపడుతూ ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు చేయేడమేంటనీ ఉమ మండిపడ్డారు.   కరోనా పేరుతో ఎన్నికలు వద్దంటున్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీలో బడులు ఎందుకు తెరిచిందని బోండా ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యం అంటే వైసీపీకి లెక్క లేదా? అని ఆయన నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతున్నట్లే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను కూడా కరోనా పేరుతో వైసీపీ నిలిపివేయగలదా అని బోండా ఉమ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ను తిడుతోన్న ప్రభుత్వం దేశంలో ఒక్క వైసీపీయేనని ఆయన విమర్శలు గుప్పించారు. జడ్జిలపై కూడా వైసీపీ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసిందని చెప్పారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ

కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లో దాని ట్రయల్స్, ఉత్పత్తికి భాగస్వామి అయిన సీరమ్ ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా కీలక ప్రకటన చేస్తూ.. ఫిబ్రవరి 2021లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను ముందుగా హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారికి ఇస్తారని, సామాన్య ప్రజలకు మాత్రం ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులకు కలిపి సుమారుగా రూ.1000 వరకూ ఉండొచ్చని అయన తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే తాము నాలుగు కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సిద్ధం చేశామని.. అయితే భారత నియంత్రణ సంస్థల నుండి ముందుగానే అనుమతి లభిస్తే, జనవరిలోపే వ్యాక్సిన్ ను తీసుకుని వస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎస్ఇసిదే.. స్పష్టం చేసిన మాజీ సీఎస్ ఐవైఆర్ 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ వ్యవహారంలో సీఎస్ తీరు పై, అలాగే మంత్రి కొడాలి నాని అసభ్య వ్యాఖ్యల పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన కు ఫిర్యాదు చేసారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పై మాజీ సీఎస్ ఐవైఆర్‌ కృష్ణారావు స్పందించారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్‌ ఈ వ్యవహారంలో రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసేలా ప్రవర్తిస్తున్నారని ఐవైఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అధికారం ఎలక్షన్ కమిషనర్‌దేనని అయన తేల్చి చెప్పారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడమంటే దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిది కాదని అయన అన్నారు. ఒకవేళ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక అడ్డుపడితే కోర్టులో ఈ సారి అక్షింతలతోనే వ్యవహారం ఆగకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పూర్తిగా వివేక రహితంగా ఉన్నాయని అయన అన్నారు.

ఆ బీహార్ మంత్రికి పదవి మూన్నాళ్ళ ముచ్చటే అయింది.. 

పాపం మూడు రోజుల క్రితమే మంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి తాజాగా తన పదవికి రాజీనామా చేయల్సి వచ్చింది. ఇటీవ‌ల కొత్తగా కొలువుదీరిన నితీష్ కుమార్ క్యాబినెట్ లో 14 మంది మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. దీంట్లో భాగంగా తారాపూర్‌ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్‌ చౌదరికి నితీష్ కుమార్ విద్యా శాఖను కేటాయించారు. అయితే ఆయన గతంలో భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పని చేసిన అనుభ‌వం ఉండ‌టంతో విద్యాశాఖ‌ను కేటాయించినట్లు ప్ర‌చారం జరిగింది.   అయితే మేవాలాల్‌ చౌదరి వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ గా ఉన్న సమయంలో యూనివర్సిటీ పరిధిలో నిర్మించిన కొన్ని భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా లంచం తీసుకుని కొందరు అర్హతలేని వారికీ యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జూనియర్‌ శాస్త్రవేత్తలుగా నియమించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేవాలాల్ ను విద్యాశాఖా మంత్రిగా నియమించడం పట్ల ప్రతిపక్షాల తీవ్రస్థాయిలో విమర్శలు చేసాయి. సీఎం నితీశ్‌ కేవలం తన పదవిని కాపాడుకోవడం కోసం అవినీతిపరులకు కేబినెట్‌లో చోటు కల్పించారంటూ ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. అంతేకాకుండా క‌నీసం జాతీయగీతం కూడా పాడడం రాని వ్య‌క్తి బీహార్ విద్యాశాఖ మంత్రి అంటూ ప్ర‌తిప‌క్షాలు తాజాగా ఒక వీడియోను వైర‌ల్ చేయ‌టంతో సీఎం నితీష్ కుమార్ మంత్రితో రాజీనామా చేయించిన‌ట్లుగా వార్తలు వస్తున్నాయి.

వరద బాధితులకు రూ.20 వేల సాయం! కారుకు కౌంటర్ ప్లాన్ 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా బల్దియాపై జెండా ఎగురవేయాలని పావులు కదుపుతున్న బీజేపీ.. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా ఎత్తులు వేస్తోంది. వరద సాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్న కారు పార్టీకి కౌంటర్ ప్లాన్ వేసింది కమలదళం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ. 20 వేలు ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. వరద నష్టం ఎంత వస్తే అంత లెక్క కట్టి ఇస్తామని చెప్పారు. నష్టపోయిన కార్లు, బైక్‌లు ఇప్పిస్తామన్నారు.    టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే చుక్కలు చూపిస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. జనసేనతో పొత్తుపైనా మరోసారి క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. జనసేనతో పొత్తుకు సంబంధించి  బీజేపీలో చర్చే జరగలేదన్నారు. పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు సంజయ్. గ్రేటర్‌లో ఒంటరిగా పోటీ చేయానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. తనకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య మధ్యవర్తులు అవసరం లేదన్నారు సంజయ్. ఏపీలో మత మార్పిడిలను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. పొత్తుల అంశం మాట్లాడటానికి తాను పవన్ కల్యాణ్‌ను కలవటంలేదని స్పష్టం చేశారు బండి సంజయ్.

డిసెంబర్ 1నే పోలింగ్ ఎందుకు? 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగబోతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో పోలింగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా పోలింగ్ ను మరింత ముందుకు తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. విపక్షాలకు ప్రచారం కోసం సరైన సమయం దొరకకుండా చేసేందుకు పోలింగ్ తేదీని ముందుకు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. అయితే డిసెంబర్ 1న పోలింగ్ జరపడం వెనక అధికార పార్టీ నేతల మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. విపక్షాలకు సమయం తక్కువగా ఉండేలా చూడటంతో పాటు తమకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని భావిస్తున్న ఉద్యోగుల ఓటింగ్ శాతం తగ్గేలా టీఆర్ఎస్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.    జీహెచ్ఎంసీ పోలింగ్‌పై లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ పడేలా షెడ్యూల్ రూపొందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగే డిసెంబర్ 1 మంగళవారం. ఆ రోజు పోలింగ్ హాలీడే ఉంటుంది. వీకెండ్‌లో భాగంగా శని, ఆదివారాలు సెలవులు. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ఉంది. ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్ లో ఉండే ఉద్యోగులు సొంతూర్లకు వెళ్లడమో, టూరిస్టు ప్రాంతాలకు వెళ్లడమో చేస్తారనేది గులాబీ ఆలోచనగా ఉందని చెబుతున్నారు.    కేసీఆర్ సర్కార్ పాలన, టీఆర్ఎస్ పై ఉద్యోగులు కొంత కాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల కాలంలో అది మరింత తీవ్రమైంది. మూడేండ్లు అవుతున్నా పీఆర్సీ ప్రకటించకపోవడం, ప్రమోషన్లను పట్టించుకోకపోవడం, బదిలీలు చేయకపోవడం వంటి అంశాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలపైనా వారు మండిపడుతున్నారు. కేసీఆర్ పై కోపంగా ఉద్యోగులంతా గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా కారుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఉద్యోగులు బీజేపీకి మద్దతిచ్చారని చెబుతున్నారు. ఇవన్నిలెక్కలు వేసిన అధికార పార్టీ.. వ్యూహాత్మకంగా వరుసగా సెలవులు వచ్చేలా చూసుకుని పోలింగ్ తేదిని నిర్ణయించందనే ఆరోపణలు వస్తున్నాయి. వరుస సెలవులు రావడంతో కొంతమంది ఉద్యోగులైనా టూర్లకు వెళతారని, అది తమకు కలిసి వస్తుందని గులాబీ నేతల వ్యూహమని తెలుస్తోంది.    నాలుగు రోజులు సెలవులు వస్తుండటంతో ఏపీకి చెందిన ఓటర్లు కూడా సొంతూర్లకు వెళ్లవచ్చనే చర్చ జరుగుతోంది. ఇది కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. తమకు ఇబ్బంది లేకుండా చూసుకుని డిసెంబర్ 1 గ్రేటర్ పోలింగ్ జరిగేలా టీఆర్ఎస్ చూసిందని, అయితే లాంగ్ వీకెండ్ ప్రభావంతో గ్రేటర్ లో పోలింగ్ శాతం తగ్గవచ్చనే ఆందోళన కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. మాములుగానే  హైదరాబాద్ లో పోలింగ్ తక్కువగా జరుగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత తగ్గుతుంది.  2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 42.04కాగా.. 2016లో 45.29 శాతంగా నమోదైంది.

నిమ్మగడ్డ ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలు జరగవు: జేసీ 

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం కమిషనర్ కు మధ్య జరుగుతున్న వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు జరిగేది కష్టమేనని చెప్పారు. పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం అడ్డుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నారు దివాకర్ రెడ్డి. జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించుకుని, స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడ వేశారని ఆరోపించారు. అందుకే  ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఆలస్యం చేస్తోందని జేసీ వివరించారు.    తాము కోరుకున్న కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా వస్తే తమ అభీష్టం ప్రకారం ఎన్నికలు జరుపుకుంటుందని వైసీపీ సర్కారుపై ఆరోపణలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. ఇంతకుముందు ఏకగ్రీవమైన స్థానాలు చెల్లుబాటు అవుతాయని కనగరాజ్ తో ఆదేశాలు ఇప్పిస్తారని చెప్పారు. ఇకపై ఎస్ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లకు అధికారులు హాజరయ్యేది అనుమానమేనని, వారు ఏదో ఒక సాకు చెప్పి సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని జేసీ వివరించారు. ఒకవేళ ఎన్నికలు వస్తే విపక్ష అభ్యర్థులను పోలీసు బలంతో బెదిరించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేస్తారని అన్నారు. ప్రజల్లో తమపై అభిమానం ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు బరిలో దిగకపోవడమే మంచిదని జేసీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ విపక్ష పార్టీల నుంచి ఎవరైనా గెలిచినా ఏదో ఒక ఆరోపణతో పోలీసు కేసు నమోదు చేస్తారని తెలిపారు జేసీ దివాకర్ రెడ్డి.  

రైతు బంధు రూల్ వరద సాయానికి వర్తించదా! అంతా కేసీఆర్ సర్కారే చేసిందా?

హైదరాబాద్ లో వరద సాయం ఆగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కోడ్ అమలులోనికి వచ్చినందున.. వరద బాధితులకు పరిహారంగా ఇస్తున్న 10 వేల రూపాయల సాయం పంపిణిని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అదేశించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కోడ్ పేరుతో వరద సాయాన్ని ఎన్నికల సంఘం నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రైతు బంధుకు వర్తించని రూల్.. వరద సాయానికి ఎలా అమలవుతుందన్న చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ అమలులో ఉన్నా.. రైతు బందు డబ్బులు రైతులకు అందించింది కేసీఆర్ సర్కార్. ఎలక్షన్ కోడ్ ఉన్నందున రైతు బంధు పంపిణి ఆపాలని విపక్షాలు గోల పెట్టినా.. అది కొత్త పథకం కాదని ఎన్నికల సంఘం ముందు వాదించి క్లియరెన్స్ తెచ్చుకుంది అప్పటి సర్కార్. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ గెలవడంలో రైతు బంధే కీలకమైందని చెబుతారు. ఏడాది క్రితం జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలోనూ రైతు బంధుపై వివాదం జరిగింది. హుజూర్ నగర్ నియోజకవర్గం వరకు నిధుల పంపిణి ఆపాలని విపక్షాలు ఆందోళన చేసినా.. ఆన్ గోయింగ్ పథకమంటూ పోలింగ్ ముందు రోజు కూడా రైతులకు రైతు బంధు నిధులు ట్రాన్ ఫర్ చేసింది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు కూడా అలా చేయవచ్చు. కాని కేసీఆర్ సర్కార్ ఆ పని చేయలేదు. దీంతో ప్రభుత్వమే ఎన్నికల సంఘం ద్వారా వరద సాయాన్ని ఆపించిందనే ఆరోపణలు వస్తున్నాయి.    ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. 2018 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు సాయాన్ని ఆపాలని విపక్షాలు కోరినప్పుడు ఎన్నికల సంఘానికి ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చింది.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న పార్థసారథే. అప్పుడు ఆయన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరిగా ఉన్నారు. రైతు బంధు పాత పథకమేనని ఎన్నికల అధికారులకు వివరణ ఇచ్చి నిధుల పంపిణికి ఆయన క్లియరెన్స్  తీసుకున్నారు. అప్పుడు ఆన్ గోయింగ్ కు పథకానికి ఎన్నికల కోడ్ వర్తించదని వాదించిన పార్థసారథి.. ఇప్పుడు ఎన్నికల అధికారిగా ఉంటూ ఆన్ గోయింగ్ స్కీంను కోడ్ పేరుతో ఆపేయాలని అదేశించడం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం పంపిణి కూడా ఎప్పుడో నెల క్రితమే ప్రారంభమైంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ మూడు రోజుల క్రితం వచ్చింది. వరద సాయం నెల రోజుల నుంచి కొనసాగుతుంది కాబట్టి.. అది ఆనో గోయింగ్ స్కీం కిందకే వస్తుందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు వివరించి క్లియరెన్స్ తీసుకోవచ్చనే అభిప్రాయం వస్తోంది. గ్రేటర్ లో చేస్తున్నది వరద సాయం. వరదలు విపత్తు కిందకు వస్తాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్నికల కోడ్ కు మినహాయింపులు ఉంటాయి. గతంలో చాలా సార్లు అలా జరిగింది. వరద విపత్తు సాయం చేస్తున్నామని సర్కార్ చెప్పినా ఎన్నికల సంఘం ఈజీగానే కన్విన్స్ అవుతుందని చెబుతున్నారు.    వరద సాయం చేయాలని సర్కార్ కు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల కోడ్ అడ్డంకే కాదని నిపుణులు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా విపక్షాలను టార్గెట్ చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. విపక్షాలను బూచిగా చూపుతూ అడ్డదారుల్లో తప్పించుకునేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేసిందనే విమర్శలు వరద బాధితుల నుంచి వస్తున్నాయి. వరద సాయం పేరుతో గులాబీ నేతలకు వందల కోట్లు దోచి పెట్టి ఖజానా ఖాళీ చేసిన కేసీఆర్ సర్కారే.. నిజమైన లబ్దిదారులకు ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో ఇలా ఎన్నికల సంఘం పేరుతో డ్రామాలు చేసిందనే  ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో రైతు బంధు నిధులు ఆపకుండా ఇచ్చినట్లుగానే  వరద సాయం పంపిణి కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.     నిజానికి వరద సాయం కోసం 550 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. అందులో ఇప్పటికే 5 వందల కోట్లను పంపిణి చేశారని అధికారిక లెక్కలె చెబుతున్నాయి. అయితే నిజమైన లబ్దిదారుల్లో కొంత మందికి మాత్రమే సాయం అందింది. వరద సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలే డబ్బులు కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సాయం కోసం వరద బాధితులు ధర్నాలు చేస్తుండటంతో మరో వంద కోట్లు పంపిణి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇవి కూడా పార్టీ నేతలు కాజేస్తారనే భయంతో మీసేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రభుత్వం మరో 10 వేల మందికి సాయం చేయాలని భావిస్తే.. పరిస్థితి మాత్రం మరోలా మారింది. మూడు రోజుల్లోనే మీసేవా కేంద్రాల ద్వారా లక్షలాది దరఖాస్తులు వరద సాయం కోసం వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియక ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా వాయిదా వేయింది అడ్డుకుందనే విమర్శలు వస్తున్నాయి. వచ్చిన దరఖాస్తుదారులందరికి సాయం చేయాలంటే మరో నాలుగు, ఐదు వందల కోట్లు కావాలి. అంత డబ్బు సమకూర్చడం కష్టమని భావించిన ప్రభుత్వమే విపక్షాలను బూచిగా చూపి వరద సాయం ఆపిందనే చర్చ జనాల్లో జరుగుతోంది.             మరోవైపు వరద సాయానికి బ్రేక్ పడటంతో బాధితులు భగ్గుమంటున్నారు. వరద సాయం పంపిణి నిలిపివేతపై రాజకీయ మంటలు రేగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీనే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బాధితులందరికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని న్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని చెప్పారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తావా? అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్.

ఆరేండ్లుగా హైదరాబాద్ ప్రశాంతం! కేసీఆరే రక్షన్న కేటీఆర్ 

సీఎం కేసీఆర్ వలనే హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్ లో కొన్ని చోట్ల అనిశ్చితి నెలకొందని తెలిపారు. హైదరాబాద్ పై ఎన్నో అసత్యప్రచారాలు చేశారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ప్రచారం జరిగిందన్నారు.  హైదరాబాద్ కు పెట్టుబడులే రావని.. తెలంగాణ వస్తే అంతా చీకటే అని పలువురు విమర్శించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం  దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని చెప్పారు మంత్రి కేటీఆర్.    హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన కేటీఆర్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు ఎన్నో విమర్శలు చేసినా... అసాధారణ పరిణతి చూపించారని కేటీఆర్ చెప్పారు. జూన్ 2న 2014లో బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీస అవసరాలు, మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాల దృష్టిలో పెట్టుకుని పని చేశామన్నారు గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ఎదుట ధర్నాలు జరిగేవని, ఇప్పుడు  తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి నగరంలో లేదని చెప్పారు. శివారు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు కేటీఆర్. మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్‌ ముందుందన్నారు.    హైదరాబాద్‌లో త్వరలో రెండు చెత్త డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో 3,200 స్వచ్ఛ ఆటోలు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో వారానికి 2 రోజులు పవర్‌ హాలిడేలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లు లేవు, గుడుంబా గబ్బులు లేవని తెలిపారు. నిర్మాణ రంగం వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాంట్‌ ఏర్పాటు చేశామన్నారు. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడిందన్నారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు కేటీఆర్.

ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ మరో సారి రద్దు.. ఇక మళ్ళీ కోర్టుకేనా..

ఏపీలో స్థానిక ఎన్నికలు జరపడం కోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెల్సిందే. దీనికోసం జిల్లా కలెక్టర్లు, జడ్పీసీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ జరపాలని నిర్ణయించి సీఎస్ కు లేఖ రాశారు. దీనికోసం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో ఈ రోజు కూడా సమావేశం రద్దు అయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై ప్రభుత్వ అనుమతి రాకపోవడంతో నిన్న జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయిన సంగతి తెల్సిందే.   ఇది ఇలా ఉండగా వీడియో కాన్ఫరెన్స్ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ రాకపోవడంతో పాటు ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే విషయాన్ని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ కోసం రెండు సార్లు సీఎస్ కు లేఖలు రాసినా అంగీకరించ లేదనే విషయాన్ని సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా.. ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ఎస్ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి.   ఇది ఇలా ఉండగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అసభ్య వ్యాఖ్యలతో పాటు, ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి నాని ఉపయీగించిన పదజాలం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో టేపులు, పేపర్ క్లిప్పింగులను ఎస్ఈసీ గవర్నర్ కు పంపారు. మంత్రి నాని పై వెంటనే చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ గవర్నర్ కు విజ్ఞప్తి చేసారు. 

అప్పుడు మోడీ.. ఇప్పుడు కేసీఆర్! జనాలను రోడ్లపై నిలబెట్టారని ఆరోపణలు

గత మూడు రోజులు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా జనాలే కనిపించారు. మీసేవా కేంద్రాల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిచ్చాయి. జీరాక్స్ సెంటర్లు జనాలతో కిటకిటలాడాయి. ఆధార్, కరెంట్ బిలు, బ్యాంక్ అకౌంట్ ఫారాలు పట్టుకుని మహిళలు గంటల తరబడి లైన్లలో నిలబడ్డారు. పసి పిల్లలను చంకలో ఎత్తుకుని మండు టెండుల్లో కొన్ని గంటల పాటు పడిగాపులు పడ్డారు. వృద్ధులు కూడా తమకు ఆరోగ్యం సహకరించకున్నా లైన్లలో నిల్చున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్న జనాలు తోపులాడుకున్నారు. కొన్ని చోట్ల  కుమ్ములాటలు కూడా జరిగాయి. కొందరు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోగా.. గోల్కొండ మీసేవా కేంద్రం దగ్గర ఓ మహిళ ప్రాణమే పోయింది. ఇదంతా సర్కార్ పంపిణి చేసిన వరద సాయం పొందేందుకు గ్రేటర్ ప్రజలు పడిన పాట్లు.   హైదరాబాద్ లో గత మూడు రోజులు కనిపించిన దృశ్యాలు చూసిన వారికి మూడేండ్ల కిందటి పరిణామాలు గుర్తుకువస్తున్నాయి. 2017 నవంబర్ అంటే సరిగ్గా ఇదే కాలంలో పెద్ద నోట్లను రద్దు చేసింది మోడీ సర్కార్. అప్పుడు కూడా జనాలు రోజుల తరబడి ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు క్యూ కట్టారు. తాము దాచుకున్న డబ్బులను తీసుకునేందుకు అవస్థలు పడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలు కట్టిన కొందరు అక్కడే కుప్పకూలి చనిపోయారు. నోట్ల రద్దు సమయంలో అనుభవించిన బాధలు ప్రజలకు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు పది వేల రూపాయల వరద సాయం కోసం హైదరాబాద్ నగరంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని చెబుతున్నారు.    వరదలతో ఇబ్బంది పడిన ప్రతీ కుటుంబానికి గడప దగ్గరికే వచ్చి వరద సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. వరద బాధిత కుటుంబాల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని, వారందరికీ సాయం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని నమ్మకం కలిగించారు. అయితే నెల రోజులు దాటినా వరద బాధితులకు సాయం అందలేదు. 5 వందల కోట్ల రూపాయలు వరద సాయంగా పంపిణి చేశామని ప్రభుత్వం ప్రకటిస్తుండగా.. వరద బాధితులు మాత్రం తమకు సాయం అందలేదంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో సర్కార్ పంపిణి చేసిన నగదు ఎక్కడికి వెళ్లిందో, ఎవరు నొక్కేశారో తెలియడం లేదు. వరద బాధితుల ఆందోళనలు పెరగడంతో దిగొచ్చిన సర్కార్... అందరికి సాయం చేస్తామని మీసేవా కేంద్రాల ద్వారా అప్లయ్ చేసుకోవాలని సూచించింది.‘మీ సేవ’ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే సాయం జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.    ప్రభుత్వ ప్రకటనతో వరద సాయం కోసం ప్రజలు ఎగబడ్డారు. వరద బాధితులంతా మీసేవా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తుదారులకు సోమవారం ఒక్క రోజే రూ.55 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పారు. ఎలాంటి పరిశీలన లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి పది వేలు మంజూరవుతున్నాయనే అభిప్రాయం రావడంతో ప్రజలు లక్షల సంఖ్యలోనే క్యూ లైన్లలో నిలబడడం మొదలుపెట్టారు. దీంతో మంగళ, బుధవారాల్లో ‘మీ సేవ’ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. దరఖాస్తుల వెల్లువ తట్టుకోలేక కంప్యూటర్ సర్వర్ సైతం ఆగిపోయిందంటే జనాలు ఏ రేంజ్ లో వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క రూపాయి దరఖాస్తు ఫారం 20 రూపాయలకు, రూ.45 సర్వీసు చార్జి రూ.150 వరకూ పెరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ అవకతవకలను నిలువరించడంలో విఫలమైంది.   వరద సాయం పంపిణీలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు బదులుగా స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నేతలు పంపిణీ చేస్తుండడంతో ఇది టీఆర్ఎస్ ఇస్తున్న సాయం అనే అభిప్రాయాన్ని కలిగించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓట్లకు పంచుతున్న నోట్లు అనే విమర్శలు వెల్లువెత్తాయి. వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్ల కోసం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిందని విపక్ష నేతలు ఆరోపించారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలైన సొమ్మునే ప్రభుత్వం నగదు రూపంలో పంచుతూ తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే.. కరోనా లాక్ డౌన్ సమయంలో నేరుగా అందరి అకౌంట్లలో డబ్బులు వేసినట్లు 10 వేలు కూడా వేస్తే సరిపోయేదని చెబుతున్నారు. ఓట్ల కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడారని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. వరద సాయం కోసం కరోనాను లెక్క చేయకుండా జనాలు గుంపులుగుంపులుగా ఒకచోట చేరారని.. దీని ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తే బాధ్యులు ఎవరిని ఆయన ప్రశ్నించారు.    ఇప్పటికీ ఎంతమందికి వరద సాయం అందిందో, ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందో ప్రభుత్వం లెక్కలను వెల్లడించడంలేదు. ఈ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా అమలు చేయలేకపోయిది. వరదలకు ఇబ్బంది పడని కుటుంబాలకు సైతం స్థానిక అధికార పార్టీ నేతలు నగదు సాయం అందించడంతో నిజమైన బాధితులకు సాయం అందకుండా పోయింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ పథకం అర్ధంతరంగా ఆగిపోవడంతో నిజమైన వరద  బాధితులకు ప్రభుత్వం సాయం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల్లో అధికార పార్టీకి ఇది  ఇబ్బందిగా మారవచ్చని భావిస్తున్నారు. సాయం అందని వరద బాధితులు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. వారంతా గ్రేటర్ ఎన్నికల్లో కారుకు వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

న్యాయం చేయలేకపోతే గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చో.. వైసిపి ఎమ్మెల్యే పై ఘాటు వ్యాఖ్యలు 

నంద్యాల అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో బాధితులకు న్యాయం చేయడం చేతకాకపోతే చీర, గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని ఉద్దేశించి ఎంఐఎం పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్‌ జునైద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని 16 రోజులవుతున్నా ఈ కేసులో ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేకపోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. అబ్దుల్‌ సలాం అత్త మాబున్నీసాను పరామర్శించేందుకు ఎంఐఎం నాయకులు బుధవారం నంద్యాలకు వచ్చారు. ఆమెను పరామర్శించిన తరువాత ఎంఐఎం నాయకులు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి చీర, గాజులు అందించేందుకు వెళ్తుండగా స్థానిక బొమ్మలసత్రం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడినుండి అబ్దుల్‌ సలాం న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం సర్కిల్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి దీక్షలకు మద్దతు తెలిపారు.

ఏపీలో ముందే ఎన్నికలు! పార్టీ కేడర్ ను అప్రమత్తం చేసిన పవన్ 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి గడువు కంటే ముందుగానే ఎన్నికలు వస్తాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మోడీ సర్కార్ చేస్తున్న కసరత్తు ఫలిస్తే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే ఏపీలో గడువు కంటే దాదాపు రెండేడ్ల ముందే అసెంబ్లీ పోల్ జరిగే ఉంది. అయితే జమిలి ఎన్నికలు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఖాయమని మరికొందరు చెబుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. 2024 కంటే ముందే వచ్చే ఏపీలో ఎన్నికలు వచ్చే  అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటి నుంచే అందుకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో జనసేనాని ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు.   ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం నిలబడాలన్నఉద్దేశంతోనే పార్టీని పెట్టినట్టు చెప్పారు పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో జన బలాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమైనట్టు తెలిపారు. భవిష్యత్తులో అధికారాన్ని అందుకోవాలంటే క్రియాశీలక సభ్యత్వం చాలా అవసరమని, ప్రతి సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేయాలని పార్టీ కేడర్ కు సూచించారు. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతోందని, ఒక్క జనసేన సైనికులు మాత్రమే బెదిరింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతున్నారని పవన్ కల్యాణ్ వివరించారు. మరో రెండు వారాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి ఏపీ ప్రభుత్వ మద్యం, ఇసుక విధానాలతోపాటు ఇతర సమస్యలపై చర్చిస్తామని పవన్ వివరించారు.    మరోవైపు జనసేన మద్దతుదారులమంటూ కొందరు చిన్నచిన్నవేదికలు ఏర్పాటు చేసుకుని సొంత అజెండాతో వస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ప్రజలను పవన్ కల్యాణ్ కోరారు. ఎవరైనా సరే జనసేన స్రవంతి ద్వారానే రావాలని అన్నారు. పార్టీ నచ్చకపోతే సరైన కారణాలు తెలియజేయాలి తప్పితే ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తామంటే కుదరదని అన్నారు. వందమంది వెళ్లిపోతే వెయ్యి మందిని తీసుకొస్తామని పవన్ స్పష్టం చేశారు.  జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని గ్రామ వలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని, అయినా ఒత్తిళ్లకు తట్టుకుని పవన్ కల్యాణ్‌పై నమ్మకంతో పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

అక్కడ ఊరందరికీ కరోనా.. కానీ ఒకే ఒక్కడు క్వారంటైన్ లో..

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని రోజుల క్రితం వైరస్ వ్యాప్తి కొంత తగ్గినట్టుగా కనిపించినా మళ్ళీ శీతాకాలం మంచు కారణంగా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా సోకిన వారు వీలయితే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తెస్కుకుంటున్నారు లేదంటే హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని జన్‌జాతీయ జిల్లా లాహౌల్-స్పీతి లోని థొరాంగ్ గ్రామంలో భూషన్ ఠాకుర్ అనే ఒక వ్యక్తికి మినహా మిగిలిన 42 మందికి కరోనా సోకింది. అయితే భూషన్ కుటుంబంలో కూడా అతను మినహా అతని భార్యతో పాటు కుటుంబంలోని ఆరుగురికి కూడా కరోనా సోకింది. దీంతో గ్రామం మొత్తంలో కరోనా సోకని వ్యక్తిగా భూషన్ ఠాకుర్ ఒక్కరే నిలిచారు. కరోనా సోకకుండా ఉండేందుకు తాను తగిన జాగ్రత్తలు తీసుకున్నందునే వ్యాధి బారిన పడలేదని అయన తెలిపారు. ఈ విషయం పై లాహౌల్- స్పీతికి చెందిన డాక్టర్ పల్జోర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన భూషన్ లో రోగ నిరోధక శక్తి సమర్థవంతంగా పనిచేస్తున్నదన్నారు.   మొత్తం గ్రామంలోని అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినా, భూషన్‌కు మాత్రం నెగిటివ్ రావడం చాల మందికి విచిత్రంగా అనిపించిందన్నారు. మొదట్లో గ్రామానికి చెందిన ఐదుగురు కరోనా పాజిటివ్ ‌గా తేలారని, దీంతో గ్రామంలోని వారంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకున్నారన్నారు. ఈ గ్రామంలో మొత్తం జనాభా 100 మంది కాగా.. ప్రస్తుతం అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కొంతమంది కూలూ ప్రాంతానికి తరలి వెళ్లిపోయారని అన్నారు. ఇది ఇలా ఉండగా కరోనా సోకని భూషన్ తన ఇంటిలోని వారికి దూరంగా ఒక గదిలో ఒక్కడే ఉంటూ.. స్వయంగా వంట వండుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు భూషన్ కూడా కరోనా టెస్టు చేయించుకోగా.. అతనికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కరోనాను ఎంత మాత్రం తేలికగా తీసుకోవద్దని, మాస్క్ ధరించడంతో పాటు శానిటైజ్ చేసుకోవడం మరచిపోకూడదని ఈ సందర్భంగా భూషన్ స్పష్టం చేస్తున్నాడు.

పాపం విద్యాశాఖా మంత్రి గారు.. జనగణమన కూడా రాదు..

మన జాతీయ గీతం పాడమంటే చిన్న పిల్లవాడిని అడిగినా గడగడా పాడేస్తాడు. కానీ ఆ రాష్ర విద్యాశాఖా మంత్రి మాత్రం జాతీయ గీతాన్ని ఖూనీ చేసి పారేసారు. బీహార్ లో కొద్దీ రోజుల క్రితం ఎన్నికలు పూర్తయి మళ్ళీ నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెల్సిందే. తాజాగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న అక్కడి విద్యాశాఖా మంత్రి జాతీయ గీతం పాడే విషయంలో అడ్డంగా బుక్కయి ఇపుడు హాట్ టాపిక్ గా మారారు.   బీహార్ లో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవాలాల్ ఛౌదరి ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం లో భాగంగా జాతీయ గీతాలపన చేస్తూ తప్పులో కాలేశారు. జనగణమన పాడడం రాక.. తన నోటికొచ్చింది పాడుతూ.. అయన నవ్వుల పాలయ్యారు. అయితే ఈ వీడియోను ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అయింది. అంతేకాకుండా "ఎన్నో అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖమంత్రి మేవాలాల్ చౌదరికి జాతీయ గీతం పాడడం కూడా రాదు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకైమైనా ఉందా? నితీష్‌జీ మీ అంతరాత్మ ఎక్కడ మునిగిపోయింది.'' అంటూ వీడియోతో పాటు ట్వీట్ చేసింది ఆర్జేడీ. ఆ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు మాత్రం.. నిజంగా ఇది సిగ్గుచేటని.. ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి జాతీయ గీతం పాడడం రాదా.. ? అని మండిపడుతున్నారు.   ఇది ఇలా ఉండగా, మంత్రి మేవాలాల్ చౌదరిపై ఇప్పటికే పలు అవినీతి కేసులున్నాయి. గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీల్లో లెక్చరర్ల నియమకాల్లో అక్రమాలు జరిగాయని.. అందులో కోట్ల రూపాయలు చేతులు మారాయని మేవాలాల్‌పై ఆరోపణలున్నాయి. అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గతంలో మంత్రి పదవి నుంచి కూడా తప్పించారు. ఐతే తాజాగా ఏర్పాటైన బీహార్ కొత్త ప్రభుత్వంలో మేవాలాల్‌కు మళ్లీ కీలకమైన విద్యాశాఖా మంత్రి పదవి ఇవ్వడంపై తాజాగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రేటర్ టికెట్ల కోసం పోటీ! టీటీడీపీలో జోష్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన టీటీడీపీ నేతలు బలమైన అభ్యర్థులును రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే టికెట్లు కావాలంటూ వారికి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో టీటీడీపీ నేతలు అశ్చర్యపోతున్నారట. గ్రేటర్ లో పోటీ చేయాలని భావిస్తున్న అశావహులతో ఎన్టీఆర్ భవన్ కళకళలాడుతుందని చెబుతున్నారు. నేతలు రాక ఇటీవల కాలంలో బోసిపోయినట్లు కనిపించిన ఎన్టీఆర్ భవన్ కు చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారని చెబుతున్నారు.   అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతీ డివిజన్‌లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది టీటీడీపీ. అయితే వారికి ఊహించని రీతిలో స్పందన వస్తోందట. ఒక్కో డివిజన్‌కు రెండు నుంచి ఐదు వరకు దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. టీటీడీపీ సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ టీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్ అశావాహులను వడపోస్తున్నారని తెలుస్తోంది. 80 మంది బలమైన అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేశారని సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసి సత్తా చాటాలని కంభంపాటి టీటీడీపీ నేతలను సూచించారు. అభ్యర్థుల ఎంపిక కోసం తాను అన్ని డివిజన్లలో పర్యటించానని, మంచి స్పందన వచ్చిందని అరవింద్‌కుమార్ గౌడ్ తెలిపారు.

ముసలం మొదలైందా.. రాజీనామాలు చేయబోతున్నారా! ఆ లేఖే కొంప ముంచిందా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో ముసలం పుట్టబోతుందా? జగన్ విధానాలతో తమ కొంప మునుగుతుందని ఆ పార్టీ నేతలే భయపడుతున్నారా? కష్టాలు రాకముందే తప్పుకోవాలని డిసైడవుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో సంచలనం జరుగబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది.    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఎం వైఎస్ జగన్ లేఖ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దేశంలోని న్యాయ నిపుణులు, న్యాయవాదులు జగన్ లేఖపై తీవ్రంగా స్పందిస్తున్నారు. జగన్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. జగన్ లేఖలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. జగన్ రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేస్తుందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.   సీజేఐకి జగన్ లేఖ రాసిన తర్వాత వైసీపీ నేతల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ ఏదో చేస్తుందన్న భయం అధికార పార్టీ నేతలను వెంటాడుతుందని చెబుతున్నారు. జగన్ లేఖ తర్వాత జరుగుతున్న పరిణామాలపై వైసీపీలోని చాలా మందిలో ఒక రకమైన ఆందోళన పెరిగిందంటున్నారు. జగన్ రాజకీయంగా ప్రస్తుతం తనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకుని తప్పులు చేస్తున్నారు అనే భావన చాలా మంది అధికార పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. ఇదేరకమైన అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.    ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మీడియా ముందు లెక్చర్లు దంచే వైసీపీ నేతలు కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. కోర్టులపై, న్యాయమూర్తుల పై రెచ్చిపోయి మాట్లాడే నాయకులు ఇప్పుడు కనిపించటం లేదు. చాలా మందిలో కేసుల్లో ఇరుక్కుంటాం అనే ఆందోళన ఉందని..అందుకే మీడియాతో మాట్లాడేందుకు జంకుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారులు కూడా మీడియా ముందుకు రావడానికి గాని, సలహాలు ఇవ్వడానికి గాని ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు అయితే అమరావతి రాక రెండు నెలలు అయిందట. అంతే కాదు చాలా మంది సలహాదారులు  మంత్రులతోనే మాట్లాడటం లేదని సమాచారం. ఇక ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్ష వార్తలు వడ్డించే జర్నలిస్ట్ లు కూడా కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.    సీజేఐకి జగన్ రాసిన లేఖను ఏ వర్గం మీడియా అయితే హైలెట్ చేసిందో ఆ మీడియా కూడా యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరి నుంచో  సూచనలు రావడం వల్లే అందరూ  సైలెంట్ అయ్యారని భావిస్తున్నారు. ఆరుగురు సలహాదారులు రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారనే అంతర్గత సమాచారం. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వంలో సంచలనమే. న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక రాజ్యసభ ఎంపీ చుట్టూ కొన్ని పరిణామాలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో.. సదరు ఎంపీ రాష్ట్రానికి కూడా రావడం లేదని తెలుస్తోంది.    గత కొన్ని రోజులుగా రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు చేస్తున్న వ్యాఖ్యలతో అధికార పార్టీ నాయకుల్లో అలజడి మొదలైందని చెబుతున్నారు. అన్నీ బాగుంటే తరువాత చూసుకోవచ్చు, కొన్ని రోజులు సైలెంట్ అయితేనే మంచిదని వారు భావిస్తున్నారట. అందుకే ఎప్పుడూ హడావుడి చేసే నేతలు కూడా ఏం మాట్లాడటం లేదని, అమరావతి రావడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు. మొత్తంగా జగన్ రాసిన లేఖతో ఆయన ఇబ్బందుల్లో పడటంతో పాటు నేతలందరిని ఇరికించేలా ఉన్నారనే చర్చ వైసీపీ నేతల్లోనే అంతర్గతంగా జరుగుతుందని తెలుస్తోంది. పార్టీలో రాజీనామాల పర్వం మొదలైతే మాత్రం అది ఆగకుండా ఉండే అవకాశం ఉందని కొందరు అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు.

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తావా? కేసీఆర్ కు సంజయ్ సవాల్

గ్రేటర్ హైదరాబాద్ లో ఆగిన వరద సాయం పంపిణిపై రాజకీయ మంటలు రేగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీనే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని అన్నారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తావా? అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్.    వరద సాయం కోసం క్యూలో నిల్చున్న మహిళ చనిపోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్ అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాదులో సమావేశం నిర్వహిస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందిస్తూ... గతంలో కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో జనాలంతా చూశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తొత్తులా మారిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో ఎన్నికల సాయాన్ని నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వరద బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

వరద సాయం నిలుపుదలతో మండిపడుతున్న హైదరాబాదీలు

హైదరాబాద్ లో వరద సాయానికి బ్రేక్ పడింది. దీంతో అటు మీసేవ దగ్గర పడిగాపులు పడుతున్న జనంతో పాటు.. ఇటు టోకెన్ తీసుకుని రాబోయే రెండు రోజులలో అప్లై చేయడానికి సిద్దమవుతున్న వారిలో కుడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బాధితులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. పలు చోట్ల మీ సేవా కేంద్రాల వద్ద తోపులాటలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇలా హైదరాబాద్ మహా నగరంలో పలుచోట్ల వరద బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.   అయితే జీహీచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో వరద సాయం కొనసాగించవచ్చని పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వరదసాయం నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వరదసాయం పంపిణీకి హఠాత్తుగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరద సాయం పొందేందుకు మీ సేవా కేంద్రాల వద్ద నగర ప్రజలు వందల కొద్ది బారులు తీరారు. అయితే ఉన్నట్టుండి వరదసాయం నిలిపివేసినట్లు వార్తలు రావడంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో రోడ్డుపై మహిళలు బైఠాయించారు. అలాగే రాంనగర్‌లో సిటీ బస్సులను వరద బాధితులు నిలిపివేశారు. ఇక మరికొన్ని చోట్ల మీ- సేవా సెంటర్లను మూసివేసినా కూడా ప్రజలు కదలకుండా అక్కడే నిరసనకు దిగారు. ఇక వనస్థలిపురంలో తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.   రాష్ట్ర ప్ర‌భుత్వం సహాయం చేస్తామ‌ని చెప్తేనే మూడు రోజులుగా తిండి కూడా లేకుండా ఎండ‌లోనే క్యూలైన్లో ఉన్నామ‌ని ప్రజలు క‌న్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న చేసే స‌మ‌యంలోనూ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అప్లై చేసుకోవ‌చ్చ‌ని చెప్పిందని, అయితే ఇప్పుడిలా మాట మార్చేస్తే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లే వ‌ర‌ద‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యాం.. తినేందుకు స‌రుకులు కూడా లేని ప‌రిస్థితిలో స‌ర్కార్ సాయం చేస్తామ‌న‌టంతో న‌మ్మి లైన్లో నిల‌బ‌డ్డామ‌ని, ఇప్పుడు తీరా సాయం అందే స‌మ‌యానికి ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు ఆగాల‌నడం స‌రైంది కాదంటున్నారు. మరి కొంతమందైతే మూడు రోజులుగా లైన్లో ఉంటే గురువారానికి టోకెన్ వ‌చ్చింద‌ని, ఇప్పుడు కాదు పోమ్మంటే మా నాలుగు రోజుల కష్టం బూడిద‌లో పోసిన‌ట్లు అవుతుంద‌ని స‌ర్కార్ తీరుపై మండిప‌డుతున్నారు.