ఊరించి.. విసిగించి.. కడుపు మండించి.. పీఆర్సీ పాలిటిక్స్! 

ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ. సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగులు హర్షం. ఇది రొటీన్. పైకి కనిపిస్తున్నది ఇదే. కానీ, వాస్తవంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈ పీఆర్సీని మనస్పూర్తిగా ఆనందించ లేకపోతున్నాడు. హమ్మయ్య ఇప్పటికైనా ఎంతో కొంత పీఆర్సీ వచ్చిందంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు అంతే. డౌట్ ఉంటే.. మీ పక్కనున్న ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగినైనా కదిపి చూడండి. మీకే తెలుస్తుంది వారి మనోగతం. పీఆర్సీ ప్రకటించినా ఉద్యోగులు ఇంత డల్‌గా ఉండటానికి అనేక రీజన్స్.  ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్ ఇప్పటిది కాదు. రెండేళ్లుగా నాన్చుతూ వచ్చిన వేతన పెంపు ఇప్పటికిలా కొలిక్కివచ్చింది. గత టర్మ్ తుది దశలోనే.. త్వరలో పీఆర్సీ అంటూ ఉద్యోగులను ఊరించారు కేసీఆర్. ఆ తర్వాత సడెన్‌గా అసెంబ్లీ రద్దు చేయడం.. పీఆర్సీ ప్రకటించకుండానే.. ఎన్నికలకు వెళ్లడంతో అప్పటి నుంచి కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు ఉద్యోగులు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.. ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయనే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం జరిగింది. అయితే, అసెంబ్లీ ఎలక్షన్‌లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలవడంతో.. అప్పటి నుంచి ఉద్యోగులు పీఆర్సీపై నోరు మెదపలేని పరిస్థితి. కాలం గిర్రున తిరిగి.. దుబ్బాక, జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి షాక్ తగలడంతో కేసీఆర్ డిఫెన్స్‌లో పడ్డారు. ప్రజా వ్యతిరేకతతో పాటు ఉద్యోగుల కడుపు మంటను ఆలస్యంగానైనా గుర్తించారు. అంతకు ముందు.. పీఆర్సీ కమిటీ సిఫార్సు విషయంలో పెద్ద పొలిటికల్ డ్రామానే నడిపారు ముఖ్యమంత్రి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మొదట్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలే వీచాయి. రెండు సీట్లలోనూ ఓడిపోతామనేంతగా గులాబీ బాస్‌లో భయం పుట్టింది అంటారు. అందుకే, ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ పేరుతో విభజించి, కన్ఫ్యూజ్ చేసి.. సీఎం కేసీఆర్ ఓట్లు దండుకునే స్ట్రాటజీ అప్లై చేశారని అంటారు.  అధికార పార్టీకి చెందిన మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు వేరు, ఉపాధ్యాయులు వేరు అంటూ వరుస కథనాలు ప్రచురించి, ప్రచారం చేసి టీచర్లను డిఫెన్స్‌లో పడేశారు. ఆ కన్ఫ్యూజన్ కొనసాగుతుండగానే 7 శాతం పీఆర్సీ కమిటీ రిపోర్డు ఇవ్వడం మరింత కలకలం రేపింది. కావాలనే, అతి తక్కువగా 7శాతం మంటూ ఉద్యోగులను భయాందోళనలకు గురి చేశారని చెబుతారు. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గర పడటంతో మరో రకమైన బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కూడా నడిచాయి. అవంతా ఆఫ్ ది రికార్డ్. ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాల నేతలను సీఎం కేసీఆర్ పిలిపించుకున్నారట. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో గనుక టీఆర్ఎస్ ఓడిపోతే.. పీఆర్సీ మరింత లేట్ చేస్తామని.. అది కూడా 7శాతం మాత్రమే ఇస్తామని.. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఫిట్మెంట్ ప్రకటిస్తామని డీల్ కుదుర్చుకున్నారట. ఈ విషయం అప్పట్లో ఉద్యోగ సంఘాల వాట్సప్ గ్రూపుల్లో తెగ వైరల్ అయిందని చెబుతున్నారు. ఉద్యోగులంతా అధికార పార్టీకే ఓటు వేసేలా సంఘం నేతలు ఒత్తిడి తెచ్చారని అంటారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు టీఆర్ఎస్‌కి ఓటు వేశారో లేదో తెలీదు కానీ, ఎలా గోలా అతికష్టం మీద రెండు ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీ గెలుచుకోవడంతో కేసీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. అందుకే, ఫలితాలు వచ్చిన వెంటనే ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్  ప్రకటించి.. రిటైర్‌మెంట్ వయసు పెంచి.. ఉద్యోగులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. ముందుముందు నాగార్జున సాగర్ బై పోల్‌తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ సైతం ఉండటంతో ఉద్యోగులతో పెట్టుకుంటే.. మరీ తెగేదాక లాగితే.. అసలుకే ఎసరు వస్తుందని భావించిన కేసీఆర్.. పీఆర్సీ ప్రకటనతో నష్ట నివారణ చర్యలు చేపట్టారనేది ఉద్యోగుల భావన. అయితే.. ఎంప్లాయిస్ 45శాతానికి పైగా పీఆర్సీ డిమాండ్ చేస్తే.. కమిటీ 7శాతం సిఫార్సు చేస్తే.. మధ్యస్థంగా 30శాతంతో సరిపెట్టారు సీఎం కేసీఆర్. అందుకే, పెరిగిన పీఆర్సీపైనా ఉద్యోగులు అంత సంతృప్తిగా లేరంటున్నారు. రెండేళ్లు ఊరించి.. విసుగు పుట్టించి.. కడుపు మండించి.. చివరాఖరికి ఇంత ఆలస్యంగా.. ఎంతో కొంత పెంచిన ముఖ్యమంత్రిపై ఇప్పటికీ ఉద్యోగులు ఆగ్రహంగానే ఉన్నారని అంటున్నారు.

వదినను చంపిన మరిది.. ఎందుకంటే..?

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. సొంత వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తులకు నా అనుకున్న వాళ్లపైనే యమా పాశాలుగా మారుతున్నారు కొందరు దుండగులు. నిత్యం  ఎక్కడో ఒక చోట ఇలాంటి  సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్‌లో ఓ మహిళను సొంత మరిది కొబ్బరి బొండాల కత్తితో హతమార్చాడు.  వివరాల్లోకి వెళితే జహీరాబాద్ మండలం పస్తాపూర్ పంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు షబానాబేగం.  భర్త జహంగీర్ సోదరులైన యాకూబ్, ఖాజాల మధ్య ఆదివారం రాత్రి భూ వివాదం గొడవ జరిగింది. వారిద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఖాజా.. కొబ్బరి బొండాలు నరికే కత్తితో బేగంపై దాడి చేసి. మెడపై కత్తి పడటంతో షబానా అక్కడికి అక్కడే కుప్పకూలి పడిపోయింది.  కత్తి వేటుకు గాయపడిన షబానాను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.  మార్గం మధ్యలోనే  షబానా మృతిచెందింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎస్‌ఐ వెంకటేశ్ ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు. 

25 ఏళ్ళ యువతి.. పిల్లవాడిని టెర్రస్ పై..  

కాలం సైన్స్, టెక్నాలజీ అంటూ ముందుకు వెళ్తుంటే. కాలంతో ఆలోచించాల్సిన మనిషి ఆలోచన మాత్రం ఇంకా మంత్రాలు విష్వవాసాల దగ్గరే ఉన్నాయి. ఇంకా అనాగరిక   సమాజంలోనే బతుకుతున్నారు. ఇంకా పాత చింకాకాయ పచ్చడి అనే నాటి మూఢనమ్మకాలనే ఇప్పటికి నమ్ముతూ మూర్ఖంగా బతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో  చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ ఉన్నత విద్య వంతుల కుటుంబం మూఢనమ్మకాల బారిన పడి తమ కుటుంబాన్నిసర్వనాశనం చేసుకున్న విషయం తెలిసిందే. విద్యాబుద్ధులు చెప్పే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తమ కుమార్తెలను మూఢ నమ్మకాల పేరుతో  కడతేర్చారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆ సంఘటన మరుగున పడకముందే  తాజాగా మరో మూఢ సంఘటన వెలుగులోకి వచ్చింది. తనకు పిల్లలు పుట్టడం లేదంటూ ఓ మహిళా ఓ బాబాను ఆశ్రయించింది. వైద్యులను కలిసి ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన ఆమె, మూఢనమ్మకాల వలలో చిక్కుకుపోయి. దారుణానికి పాల్పడి చివరకు చెరసాల  పాలయింది. ఆమెకు సంతానం కాలేదు. అందుకు పక్కింటి  పసివాడి ప్రాణాలు తీసింది. ఆమెకు 25 ఏళ్ళు.  2013వ సంవత్సరంలో పెళ్లయింది. పెళ్లయి ఎనిమిదేళ్లవుతున్నా ఆమె అమ్మ అనే పిలుపుకు నోచుకోలేదు. ఈ విషయం పై అతింట్లో తీవ్ర ఒత్తిడిని ఆమె ఎదురుకుంది.  ఏంచేయాలనే ఆలోచనే ఆమెను తరిమింది. దాంతో  ఏం చేయాలో ఆమెకు తోచలేదు. తెలిసిన వాళ్ల సలహాతో నాలుగేళ్ల క్రితం అదే నగరంలోని ఓ తాంత్రికుడిని కలిసింది. తన సంతానం సమస్య గురించి వివరించి మొరపెట్టుకుంది. తనకు త్వరగా సంతాన భాగ్యం కలిగేలా చూడామణి మాంత్రికుడిని కోరింది. దీనికి అతడు బాగా ఆలోచించి అందుకు ఒకే ఒక్క మార్గం ఉందని హితబు పలికాడు.  ఎవరైనా చిన్న పిల్లాడిని బలి ఇచ్చి అమ్మవారికి రక్త తర్పణం చేస్తే త్వరగా సంతానం కలుగుతుందని. తనకు ఉన్న శని తొలగిపోవడానికి ఇదొక్కటే మార్గం. అంటూ మాయమాటలు చెప్పాడు. అంతే ఈ విషయం పై మొదట్లో ఆమె భయపడింది. పిల్లలు లేకున్నా పర్లేదులే, పసి ప్రాణాన్ని తీయడం ఎందుకని అనుకుంది. కానీ, ఇటీవల సంతానం గురించి అత్తారింట్లోనూ,  అటు ఇరుగు పొరుగు వారితో వస్తున్న ఒత్తిళ్లను ఆమె భరించలేకపోయింది. ఇక అంటే మాంత్రికుడు చెప్పిన పథకానికి సిద్ధం అయింది. తన పక్కింట్లోనే ఉండే మూడేళ్ల పిల్లాడిని ఎవరూ చూడకుండా ఇంటి పైకి తీసుకెళ్లింది. అక్కడే ఆ పిల్ల వాడిని  చంపేసి. ఆ తర్వాత శవాన్ని ఓ బ్యాగులో పెట్టి మూట కట్టింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లవాడి  శవాన్ని మాయం చేయాలని భావించింది. కానీ ఈ లోపే ఆ బాలుడి తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి చుట్టుపక్కల వెతకడం మొదలు పెట్టారు. పక్కింటి టెర్రస్ పై ఓ బ్యాగు ఉండటంతో అనుమానంతో ఆ బ్యాగును ఓపెన్ చేస్తే అసలు విషయం బయట పడింది. పోలీసుల ఎంట్రీతో ఆమె గుట్టు రట్టయింది. ఆమెతోపాటు, ఆ తాంత్రికుడిని కూడా పోలీసులు కటకటాల్లోకి నెట్టేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ నగరంలో  జరిగింది.   

తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. పీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 30 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటనలో ముఖ్యమంత్రి చెప్పారు. పెన్షనర్లు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. రిటైర్మెంట్ వయసును ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.  అంతర్ జిల్లాల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్.. వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపార ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా ఆలస్యం అయ్యిందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని తెలిపారు కేసీఆర్. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా! శాసనమండలిలో టెన్షన్ 

బడ్జెట్ సమావేశాల వేళ తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం రేపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కు పాజిటివ్‌గా తేలింది. సోమవారం శాసనసభ ఆవరణలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పురాణం సతీష్ కు రాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రాగా.. ఆర్టీపీసీఆర్ టెస్టులో మాత్రం  పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు ఎమ్మెల్సీ సతీష్. గత ఐదు రోజులుగా తనతో కాంటాక్టులో ఉన్న వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా సోకిన ఎమ్మెల్సీ పురాణం సతీష్.. శనివారం మండలికి హాజరయ్యారు. బడ్జెట్‌పై మాట్లాడారు. దీంతో సహచర ఎమ్మెల్సీలలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శాసనమండలి సభ్యులందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోనున్నట్టు సమాచారం. మరోవైపు కోవిడ్ కారణంగా అసెంబ్లీ సమావేశాలను కుదించనున్నారని తెలుస్తోంది. సభ్యుడికి కోరనా సోకడంతో షెడ్యూల్‌కు ముందే ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మంగళవారం  లేదా బుధవారం బడ్జెట్ సెషన్స్ క్లోజ్ చేయనున్నారని తెలుస్తోంది. బీఏసీ సమావేశం పెట్టి సెషన్స్‌పై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది. షెడ్యూల్ ప్రకారం 26వరకు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. 

వరంగల్ గులాబీలో వర్గపోరు! కడియం కారు దిగినట్టేనా?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో జోష్ లో ఉన్న  టీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేతలు షాకిస్తున్నారు. హాట్ కామెంట్లతో వేడి రాజేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న రాజయ్య, కడియం శ్రీహరి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. గతంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శల తూటాలు పేల్చుతున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ.. మండిపడుతున్నారు.  స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క రూపాయి ఎవరికి సహాయం చేయనివాడు కూడా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్యపై మండిపడ్డారు. చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు కడియం. పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదు.. మగాళ్ళయితే ఆర్థిక సహాయం చేయాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరి దగ్గర చాయ్ తాగినా.. పనుల పేరుతో రూపాయి తీసుకున్నా.. ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు కడియం శ్రీహరి. పదవులను, పనులను అమ్ముకుంటూ...మళ్లీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నెత్తి మీద పది రూపాయలు పెడితే రూపాయికి కూడా అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్యపై నిప్పులు చెరిగారు కడియం శ్రీహరి.  కడియం కామెంట్లకు వెంటనే కౌంటరిచ్చారు ఎమ్మెల్యే రాజయ్య. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. తనపై కడియం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కడియం చర్యలను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసకుంటుందని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. తనపై కడియం చేసిన ఆరోపణలపై పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన కార్యకర్తలను కోరారు రాజయ్య. పార్టీ అధినేత దగ్గర పూర్తి సమాచారం ఉందని  తెలిపారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించ వద్దని శ్రీహరికి రాజయ్య సూచించారు.  ఇటీవలే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గందరగోళం సృష్టించడానికి కొంత మంది కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఘనపుర్‌ గురించి మాట్లాడేవారికి అడ్రస్సే కాదు.. ఇక్కడ ఓటు కూడా లేదని ఎద్దేవా చేశారు. కొన్ని గుంటన క్కలు గోతులు తవ్వుతున్నాయని... నోరుందని ఏదీపడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని రాజయ్య స్పష్టం చేశారు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరన్న ఆయన.. ప్రజా బలం ఓట్లతోనే తెలుస్తుందని అన్నారు. రాజయ్య మాట్లాడిన ఈ వ్యాఖ్యలకే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇద్దరూ నేతలు పోటాపోటీ కౌంటర్లు ఇచ్చుకుంటుండటంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక గులాబీ కేడర్ గందరగోళంలో పడిపోయింది.  మరోవైపు కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ ముఖ్య నేతలు కొందరు ఆయనతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అయితే పార్టీ మారుతున్నారంటూ తనపై వస్తున్న వార్తలను గతంలో కడియం ఖండించారు. అయితే తాజాగా ఎమ్మెల్యే రాజయ్యపై ఓపెన్ గానే ఘాటు వ్యాఖ్యలు చేయడంతో...  తన రాజకీయ భవిష్యత్ పై ఆయన కీలక నిర్ణయం తీసుకుని ఉంటారనే చర్చ జరుగుతోంది. అందుకే అలా మాట్లాడారని చెబుతున్నారు. చూడాలి మరీ కడియం రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయో... 

చంద్రబాబుతో జతకడితేనే బీజేపీకి లైఫ్! 

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీల వ్యూహాలు ఛేంజ్ అవుతున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంది. బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని ప్రకటించింది. అయితే తిరుపతిలో పోటీ చేసి తీరుతామని ముందు నుంచి గట్టిగా పట్టుబట్టిన పవన్ కల్యాణ్.. వెనక్కి తగ్గడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో జనసేన తెగతెంపులు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే అనంతపురం మాజీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి రెడ్డి మరోసారి రాజకీయ కాక పుట్టించే కామెంట్లు చేశారు.    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి  జేసీ.. త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికపై తనదైన శైలిలో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలో  అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు వైసీపీదేనన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలకు  జేసీ ఓ సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బతికి బట్ట కట్టాలంటే ఒకేఒక్క మార్గముందన్నారు. చంద్రబాబుతో జతకడితేనే బీజేపీకి లైఫ్ ఉంటుందని తేల్చి చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి. బీజేపీ ఆ దిశగా త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటరన్నారు.  పంచాయతీ ఎన్నికలు, ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న పరిస్థితిని కూడా వివరించారు దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని తాను ఎంతచెప్పినా .. చంద్రబాబు పట్టించుకోలేదని చెప్పారు.  అన్ని రకాలుగా టీడీపీని అడ్డుకొని పంచాయతీలను వైసీపీ సొంతం చేసుకుంటుందని హెచ్చరించినా చంద్రబాబు మొండిగా ముందుకెళ్లారరని  అన్నారు. చంద్రబాబుపై కేసులు నమోదు చేయడం ఆలస్యమైందన్న జేసీ దివాకర్ రెడ్డి.. ఇంత లేట్ అవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. జేసీ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీతో పాటు బీజేపీని ఉద్దేశించి జేసీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. జేసీ మాటలపై చంద్రబాబు, ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  

కాబోయే సీఎం జూనియర్..

నువ్వు రాముడేషమే కట్టావంటే గుండెలు అన్నీ గుడులైపోతాయే  నువ్వు కృష్ణుడలే తెర మీదికి వస్తే వెన్నముద్దలై కరిగెను హృదయాల్లే  అన్న మాటలు తెలుగు తేజం, తెలుగు తమ్ముల గళం, తెలుగు ప్రజల గుండె చప్పుడు సర్గీయ నందమూరి తారక రామారావు గుర్తు చేస్తాయి.  తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు యెనలేని ఏదో గౌరవం ఉంది.. అలాగే  తాత ఇంటి పేరుతో పాటు ఒంటి పేరు, తాత తెలివిని, తెగువను, వారసత్వంగా పునికి పుచ్చుకున్న వారసుడు జూనియర్ అని చెప్పాలి.     జూనియర్  ఎన్టీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ వేరు. మాస్‌లో ఆయన బ్రహ్మాండమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు జూనియర్ . కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా నటించిన తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు తారక్. తనకు జీవితంలో స్టేజీపై మాట్లాడటానికి ఇంత టెన్షన్ ఎప్పుడూ రాలేదని చెప్పాడు తారక్. రేపు పొద్దున్న తన కొడుకులు అభయ్, భార్గవ్ సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి తనెంత ఇబ్బంది పడతానో  ఇప్పుడు సింహా, భైరవ గురించి మాట్లాడటానికి కూడా అంతే ఇబ్బంది పడుతున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయితే సినిమా గురించి ఈయన మాట్లాడుతున్న సమయంలోనే కింది నుంచి అభిమానులు సిఎం, సిఎం అంటూ అరిచారు. తారక్ మాట్లాడుతున్నంత సేపు కూడా అలా అరుస్తూనే ఉన్నారు. ఓ వైపు తనకు కంగారుగా ఉందని.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని జూనియర్ చెప్తున్న టైంలోనే  అభిమానులు అలా అరిచే సరికి సీరియస్ అయ్యాడు జూనియర్. తనకు  రాజమౌళి,కీరవాణి కుటుంబాలు దేవుడు ఇచ్చాడని. ఆ కుటుంబానికి తానెప్పుడూ గెస్ట్ కాలేనని అన్నాడు  జూనియర్. అలాగే వాళ్లు కూడా తనకు గెస్ట్ కాదని చెప్పాడు. అలా ఎమోషనల్ స్పీచ్ మధ్యలో సీఎం సీఎం అనే అరుపులు జూనియర్‌ను బాగా డిస్టర్బ్ చేసాయి. దాంతో వెంటనే ఆగండి బ్రదర్.. ఆగమని చెప్తున్నానా అంటూ ఒక్కసారిగా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు తారక్. అప్పటి వరకు అరిచినా అభిమానులు ఆయన మాటలు గౌరవం ఇస్తూ సైలెంట్ అయిపోయారు. సినిమాలే కాదు జూనియర్ కి రాజకీయంగా మంచి వాక్చాతుర్యం ఉందన్న విషయం మనకు తెలిసిందే. కానీ  ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అసలు తనకు పార్టీకి సంబంధం లేదన్నట్లు చాలా దూరంగా ఉంటున్నారు. తనకు ప్రస్తుతం సినిమాలు తప్ప మరో లోకమే లేదని చెప్తున్నాడు తారక్. ఒకవేళ ఎప్పుడైనా తన అవసరం వచ్చినప్పుడు తాత పెట్టిన పార్టీ కోసం వస్తానని చెప్తుంటాడు జూనియర్. అయితే ఆ సమయం ఇప్పుడు కాదని కూడా చెప్పాడు జూనియర్. ఇలాంటి  సమయంలో అభిమానులు ప్రేమతో అరిచినా కూడా జూనియర్‌కు కోపం తెప్పించాయి. దాంతో వాళ్లను అరిచినా కూడా తర్వాత మళ్లీ కూల్ చేసాడు తారక్. ఏదేమైనా కూడా రాజకీయాల నుంచి ఆయన దూరంగా ఉన్నా.. ఆయన్ని రాజకీయాలు మాత్రం దూరంగా ఉంచేలా కనిపించడం లేదు. చూడాలి జూనియర్ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుందో. ఎలా ఉండబోతుందో.. అభిమానుల ఆశను ఆయన ఆహ్వానిస్తారా లేదా..  

కార్పొరేటర్ అనుమానాస్పద మృతి! విశాఖ వైసీపీలో కలకలం 

విశాఖపట్టణం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న అధికార వైసీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ కార్పొరేటర్ సూర్యకుమారి ఆదివారం రాత్రి అనుమాస్పద స్థితిలో చనిపోయారు.  తీవ్ర గాయాలతో ఆమె చనిపోయినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేటర్ పై దాడిచేశారని ప్రాథమిక సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్  61వ వార్డు నుంచి సూర్యకుమారి విజయం సాధించారు. కుటుంబ సభ్యులతో కలిసి పారిశ్రామిక వాడలో ఆమె నివసిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యకుమారి ఆకస్మిక మృతి చెందడం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సూర్యకుమారి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్య కుమారి మ‌ృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా హత్య చేశారా? లేక అనారోగ్యంతో చనిపోయారా? ఆకస్మిక మృతికి కారణమేంటి? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల్లో గెలిచి వారం కాకముందే సూర్యకుమారి మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.   

అమెరికా భారత్ ను పాలించిందా.. ఎప్పుడబ్బా..?

కొద్దిరోజుల క్రితమే ఉత్తరాఖండ్‌ కొత్త సీఎం గా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత తీరథ్ సింగ్ రావత్ పాపం వరుసగా ఎదో ఒక కాంట్రవర్సీలలో చిక్కుకుంటున్నారు. మొన్న చిరిగిన జీన్స్ వేసుకొని మహిళలు సభ్య సమాజానికి  ఏం సందేశం ఇస్తున్నారని కామెంట్ చేసి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న సంగతి తెల్సిందే. ఈ వివాదం ఇంకా పూర్తిగా చల్లారకముందే తాజాగా  మరోసారి తన వివాదాస్పద కామెంట్స్ తో విపక్షాలకు దొరికిపోయారు. మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిన అమెరికా కరోనాను ఎదుర్కోలేక చేతులెత్తేసిందని అయన మజాగా చేసిన వ్యాఖ్యలపై అటు ప్రతిపక్షాలు, ఇటు నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నాయి. అవునా.. మన దేశాన్ని అమెరికా పరిపాలించిందా.. ఎప్పుడబ్బా అంటూ సెటైర్లు వేస్తున్నారు. వర్తకం పేరుతొ బ్రిటిష్ వాడు మనదేశం లోకి ఎంటర్ అయి దాదాపు రెండు వందల ఏళ్ళు ఏలి ఈ దేశాన్ని  పీల్చి పిప్పి చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఇదే విషయాన్నీ దేశంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా.. చెబుతారని.. అయితే ఈ మాత్రం చరిత్ర కూడా తెలియని వ్యక్తి ఈ రాష్ట్ర సీఎం అంటూ  అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. ఆదివారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తీరథ్ సింగ్ రావత్ కరోనా పరిస్థితులపై మాట్లాడుతూ.. మన దేశంలో నరేంద్ర మోదీ స్థానంలో మరొకరు ప్రధానిగా ఉంటే కరోనా సమయంలో ఏం జరిగి ఉండేదో ఎవరూ ఊహించని కూడా ఊహించలేరు. అప్పుడు దేశంలో చాలా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ప్రధాని మోదీ తీసుకున్న చర్యలతో దేశంలోని ప్రజలందరినీ కాపాడారు. మన దేశం విదేశాల కన్నా కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. మనల్ని 200 ఏళ్లు పాలించిన అమెరికా కూడా కరోనాను ఎదుర్కోలేక విలవిలలాడి పోయింది. అక్కడ లక్షలాది మంది ప్రజలు  చనిపోయారు. ఆరోగ్య రంగంలో ఎంతో ముందున్న ఇటలీలో కూడా 50 లక్షల మంది మరణించారు. అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన చేస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ కొత్త సీఎం గా బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై యువత తీవ్ర స్థాయిలో ఆపండించిన సంగతి తెలిసిందే. ఒక  ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి తాను షాకయ్యానని అయన అన్నారు. ఆ డ్రెస్ వేసుకుని ప్రజల్లోకి వెళ్లి.. సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.దేశంలో యూత్ రిప్ప్‌డ్ జీన్స్ కోసం షాపులకు వెళుతున్నారని, ఒకవేళ అవి అక్కడ దొరకకపోతే జీన్స్ కొనుక్కుని కత్తెరలతో తమకు తామే కట్ చేసుకుని మరీ ధరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ర్చ జరగడంతో.. చివరికి ఆయనే దిగొచ్చి, క్షమాపణలు చెప్పారు. తాజాగా  భారత్‌ను అమెరికా పాలించిందని చెప్పి మరోసారి ఉత్తరాఖండ్ సీఎం విమర్శల పాలయ్యారు  

తలపై బంగారం.. విలువ 2 కోట్ల పైనే.. 

తల పైన ఎవరైనా టోపీ పెట్టుకుంటారు. తలపై హేయిర్ లేకుంటే విక్కుపెట్టుకుంటారు. లేదంటే సినిమాలో పాత్ర కోసం పాత్ర దారులు విగ్గు పెట్టుకుంటారు. అది కుదరకపోతే పక్కవాళ్ళకి  టోపీ పెడతారు. వీళ్ళు మాత్రం ఏం చేశారో తెలుసా..? తలపై బంగారం పెట్టుకున్నారు. తలపైన బంగారం పెట్టుకున్నారంటే ఏ గుడిలో దేవుడు అనుకునేరు.. దేవుడు కాదు మనుషులే. నెత్తిపై విగ్గు ధరించి  అందులో ముడి బంగారాన్ని  దాచి అక్రమంగా రవాణా చేస్తున్న ఏడుగురిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో రూ. 24 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.   వివరాలోకి  నిన్న దుబాయ్, షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాలు చెన్నై చేరుకున్నాయి. అందులో వచ్చిన ప్రయాణికుల్లో కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురు నిందితుల నుంచి అధికారులు రూ. 2.53 కోట్ల విలవగల బంగారం పేస్ట్ ని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో చెన్నైనుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.  

అస్థిపంజరానికి.. ఆసరా పెన్షన్.. 

పెన్షన్ అంటే మాములుగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఇస్తారు. లేదా 60 ఏళ్లు పైబడిన వారికి ఆసర పెన్షన్ ఇస్తారు. కానీ ఒక అస్తిపంజరానికి పెన్షన్ ఇవ్వడం ఎక్కడైనా చూశారా. గవర్నమెంట్ నుండి పెన్షన్ తీసికోవాలంటే ఎంతో తతంగం ఉంటుంది. ఎవరైనా అర్హులు పెన్షన్ కోసం అధికారుల దగ్గరికి వెళితే. నువ్వు నింజంగానే అర్హుడివా.. నీ వయసు 60 లా లేదే.. అసలు నువ్వు బతికి ఉన్నావ్ అనడానికి ఫ్రూఫ్ ఏంటి..? అందుకు సాక్ష్యం ఉందా? అని రకరకాల ప్రశ్నలు వేస్తారు . కానీ ఇక్కడ మాత్రం ఓ అస్థిపంజరానికి 30 ఏళ్లుగా పెన్షన్ ఇస్తూనే ఉన్నారు. పెన్షన్ ఎంతో తెలిస్తే గుండెలు జారిపోతాయి. అక్షరాల రూ. 8 కోట్లు.  బ్రతికి ఉన్నవాళ్లకే సరిగ్గా పెన్షన్ రావడం లేదు. ఓ అస్థిపంజరానికి రూ. 8కోట్ల పెన్షన్ ఎలా ఇస్తారని? అంటుకుంటున్నారా అదేనండి ఇక్కడ ట్విస్ట్. సోగెన్ కటో 111వ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆయన మనవరాలితో ఈ రోజుల్లో 60,70 ఏళ్లు బ్రతకడం చాలా కష్టం అలాంటిది మీ తాత ఈ రోజుతో 111వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అది తెలుసుకొని విషెస్ చెప్పాలని వచ్చాం. ఒక్కసారి మీ తాత ఎక్కడున్నాడో చెప్పండి. అని అధికారులు కోరారు. దీంతో కంగారు పడ్డ ఆయన మనవరాలు. మా తాత ఎవరినీ చూడాలని అనుకోవడం లేదంటూ వారిని ఇంటి నుంచి పంపించేసింది. దీంతో అనుమానం వచ్చిన స్థానిక ప్రభుత్వ అధికారి టోమోకో ఇవామాట్సు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోగెన్ కటో ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సోఫాసెట్ పై దుప్పటి కప్పుకొని ఉన్న మనిషి ఆకారం కనిపించింది. వెంటనే పోలీసులు సోఫాలో పడుకుంది సోగెన్ కటో అని భావించారు. అతన్ని లేపేందుకు మొహం మీద ఉన్న దుప్పటిని పక్కకి లాగారు. సోఫాలో ఉన్న ఆకారాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. ఎందుకంటే సోఫాలో ఉంది సోగెన్ కటో అస్తిపంజరం. అస్తిపంజరానికి లోదుస్తులు, పైజామా ధరించి దుప్పటితో ముసుగేసి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సోగెన్ కటో చనిపోయి 30ఏళ్లు అవుతుందని, కానీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు టోక్యో మెట్రోపాలిటన్ సంక్షేమ అధికారి యుటాకా మురోయ్ తెలిపారు. సోగెన్ చనిపోయినా 30ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకుంటున్నారని, ఇప్పటి వరకూ అలా రూ.8 కోట్ల దాకా సోగెన్ కుటుంబ సభ్యులు తీసుకున్నట్లు మెట్రోపాలిటన్ సంక్షేమ అధికారి యుటాకా మురోయ్ వెల్లడించారు. ఈ సంఘటన జపాన్ టోక్యోలో జరిగింది. 

నీ సంగతి తేలుస్తా.. విలేఖరికి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్ 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రజా ప్రతినిధులు బరి తెగిస్తున్నారు. తమను ప్రశ్నింటే వారిపై ప్రతీకారాలకు దిగుతున్నారు. ప్రజా సమస్యలు. అక్రమాలు వెలుగులోనికి తెచ్చిన ఓ పత్రికా విలేకరిపై వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చిందులు తొక్కారు. వార్తలు రాసి నన్ను బెదిరించాలని చూస్తావా? నీ సంగతి తేలుస్తా అంటూ హెచ్చరించారు.  తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. వినుకొండలో అసైన్డ్ భూములు ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు వేస్తున్నారని, ఆ వార్తలు రాయకుండా పట్టణంలోని సమస్యలపైనే వార్తలు ఎందుకు రాస్తున్నారని విలేకరులను ఆయన ప్రశ్నించారు.  ఓ పత్రికా విలేకరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.‘‘పట్టణంలో గత పదేళ్లలో సమస్యలు లేవా? ఇప్పుడే ఉన్నాయా? నువ్వు చాలా చేస్తున్నావ్. నీ సంగతేంటో తేలుస్తా. వార్తలు రాసి నన్ను బెదిరిస్తావా? నువ్వెంత’ అంటూ సీటులోంచి లేచి ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతలో కల్పించుకున్న ఓ చానల్ విలేకరి భూముల ఆక్రమణలపైనా వార్తలు రాస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమ్మెల్యే మరోమారు మండిపడ్డారు. ‘‘ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. బయటకు పో’’ అంటూ చిందులు తొక్కారు. దీంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. తాగునీటి సమస్యలపై వార్తలు రాసిన మరో విలేకరిపైనా ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు బయటికి తీసుకువచ్చిన విలేఖరులను బెదిరించడం ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.   

తిరుపతి బీజేపీ అభ్యర్థికి వైసీపీ లంచం!

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినా.. రాజకీయ రచ్చమాత్రం ఆగడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలతో గెలిచిందని విపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇప్పటివరకు టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో  తమ పార్టీ అభ్యర్థికి రూ. 30 లక్షల ఆశ చూపి ప్రలోభ పెట్టే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  తిరుపతి కార్పొరేషన్ 26వ డివిజన్‌లో ఇది జరిగిందని చెప్పారు సోము వీర్రాజు. 26వ వార్డులో  6 వేల మంది ఓట్లు ఉంటే 5 వేల మందికి రూ. 500 చొప్పున వైసీపీ పంపిణీ చేసిందని ఆరోపించారు. ఇక్కడ వైసీపీకి వచ్చిన 1500 ఓట్లలో 300 దొంగ ఓట్లేనని అన్నారు. పైసా కూడా పంచని తమకు 300 ఓట్లు వచ్చాయన్నారు. పథకాలను నిలిపివేస్తామని ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో విజయం సాధించిందని వీర్రాజు ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థ కోసం నెలకు రూ. 310 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించాలని కేంద్రాన్ని కోరారు. తాము కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలను పేదలకు అందించేందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 వేల మంది కార్యకర్తలను నియమిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.

ఈటల సంచలన వ్యాఖ్యలు.. అంతగా బాధపెట్టిందెవరో?

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా టీఆర్ఎస్ లో రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆరు నెలల క్రితం ఆయన చేసిన కామెంట్లు కారు పార్టీలో కలకలం రేపాయి. గులాబీ జెండాకు తామే ఓనర్లమన్న ఈటల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనమయ్యాయి. కేసీఆర్ పై ఈటల తిరుగుబాటు చేస్తారనే చర్చ జరిగింది. అయితే ఆ వివాదం అక్కడితోనే ముగిసిపోయింది. అయినా పార్టీ కార్యక్రమాల్లో గతంలో లాగా చురుకుగా పాల్గొనడం లేదు ఈటల. తన మంత్రిత్వ శాఖ వరకే పరిమితమవుతున్నారు.  తాజాగా తన సొంత నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలని ‌అన్నారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదని రాజేందర్ చెప్పారు. తాను గాయపడినా తన మనసు మార్చుకోలేదన్నారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని తెలిపారు. ‘‘ఊరంతా ఒక దారి అయితే ఊసరవల్లికి ఒక దారి అన్నట్లు కొంతమంది ఉంటారు. మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది.  రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు. రావణుడు ఉన్నాడు. అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు. నాయకులంటే భారీ ఆకారంతో, అభరణాలతో, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి.’’ అని మంత్రి ఈటల తెలిపారు.  హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక మండలం రైతు వేదికలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఈటల ఈ  వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా తన మనసు మార్చుకోలేదన్న వ్యాఖ్యలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. పార్టీలో తాను గాయపడినట్లు రాజేందర్ చెప్పారని అంటున్నారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన ఈటలను గాయపరిచింది ఎవరూ అన్న చర్చ జరుగుతోంది. ఎలాంటి గాయం అయింది.. ఎందుకు మనసు మార్చుకోలేదన్న దానిపైనా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సంచలన వ్యాఖ్యలతో మరోసారి టీఆర్ఎస్ లో , తెలంగాణ రాజకీయాల్లో కాక రేపారు ఈటల రాజేందర్.

అంబానీ కేసులో గంటకో ట్విస్ట్! ముంబైలో అసలేం జరుగుతోంది?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఆయుధాలతో నిండిన వాహనం కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ హెడ్ వాజీ అరెస్ట్ తో ఉద్ధవ్ థాక్రే  ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. తాజాగా మహారాష్ట్ర  హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ రాసిన లేఖ కలకలం రేపుతోంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వివరించాలని కోరారు కేంద్రమంత్రి.  పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు.  హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని, వీటిపై దర్యాప్తుకు ఆదేశించే విషయంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సంపూర్ణ అధికారం ఉందని చెప్పారు. ఈ విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రిబీరో సహకారం తీసుకోవాలన్నారు శరద్ పవార్. అంబానీ నివాసం వద్ద కారు బాంబు కేసు దర్యాప్తులో క్షమించరాని పొరపాట్లు చేసిన పరంబీర్ సింగ్‌ను ముంబై నగర పోలీసు కమిషనర్‌ పదవి నుంచి తప్పించడంతో, ఆయన ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అరెస్టయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేను పునరుద్ధరించాలని గత ఏడాది నిర్ణయించినవారిలో పరంబీర్ సింగ్ ఒకరని చెప్పారు పవార్.  అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.హోం మంత్రి పదవిలో అనిల్ దేశ్‌ముఖ్ కొనసాగుతున్నంత కాలం ఈ ఆరోపణలపై విచారణ జరగరాదని చెప్పారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పైనా దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ను కాపాడేందుకు  శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారన్నారు. సత్యాన్ని శరద్ పవార్ మరుగుపరుస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల బదిలీల్లో అవినీతికి సంబంధించి ఓ నివేదికను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మహారాష్ట్ర డీజీ సుబోధ్ జైశ్వాల్ ఇటీవల సమర్పించారని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్య తీసుకోలేదని, దీంతో డీజీ జైశ్వాల్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని చెప్పారు.  ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ శనివారం మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ థాకరేకు రాసిన ఈ-మెయిల్ లేఖలో అనిల్ దేశ్‌ముఖ్ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి తనకు ఇవ్వాలని సస్పెండయిన ఏపీఐ సచిన్ వాజేను అనిల్ డిమాండ్ చేశారని తెలిపారు. అయితే పరమ్ బీర్ సింగ్ ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. పరమ్‌బీర్ సింగ్‌ను ముంబై నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి బదిలీ చేయడం గురించి ప్రస్తావించారు. సచిన్ వాజేపై దర్యాప్తులో ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే పరమ్‌బీర్ సింగ్‌ను బదిలీ చేసినట్లు తెలిపారు. 

హైదరాబాద్ లో ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణలో ఓటేశారు. హైదరాబాద్ లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఓటేయడం ఏంటని షాకవుతున్నారా.. కాని ఇది నిజం కర్నూల్ జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే  శిల్పా చక్రపాణిరెడ్డి హైదరాబాద్ లో ఓటేశారు. అయితే ఓటు వేసింది ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కాదు.. హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో.   వైసీపీ ఎమ్మెల్యేతో పాటు పలువురు ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ఓటు వేశారు. ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఓటు వేశారు. కేంద్ర మాజీమంత్రి పళ్లంరాజు, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు, జేసీ పవన్ రెడ్డి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇక తెలంగాణకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి కూడా ఓటు వేశారు. టాలీవుడ్ నుంచి సినీ హీరోలు వెంకటేష్, శ్రీకాంత్, త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజు, కేఎస్ రామారావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా హోరాహోరీగా ఎన్నికల్లో తలపడ్డారు అభ్యర్థులు. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో మొత్తం 3,181 ఓట్లు ఉండగా.. 1,750 మంది మాత్రమే ఓటు వేశారు.  హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ప్రాంతంలో 1,195 ఎకరాల్లో సొసైటీ విస్తరించి ఉంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో ఒకరు, మహిళా కేటగిరిలో ఇద్దరు, జనరల్ కేటగిరిలో 12 మంది సభ్యులు ఉంటారు. 2015లో ఎన్నికైన సభ్యుల పదవీకాలం గత ఏడాది ముగిసింది. 020లో సెప్టెంబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, సభ్యుల పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ప్రస్తుతం గడువు ముగియడంతో 2021 మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. 

టీఎస్ ఉద్యోగులకు 34 శాతం పీఆర్సీ!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందబోతోంది.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన రాబోతోంది.  పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో  పీఆర్సీ ప్రకటనపై రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నికల సంఘం అనుమతి కోరింది. దీనిపై స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది.అయితే పీఆర్సీపై అనవసర ప్రచారం చేయరాదని ఈసీ సూచించింది. ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ ఆదివారం లేఖ రాశారు. ఈసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో.. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు పీఆర్సీ చేయనున్నట్లు సమాచారం. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన ఆనందంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం కూడా పీఆర్టీయూ నేతలు కేసీఆర్ తో సమావేశమయ్యారు. మరికొందరు ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది.  ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఏపీలో అమలవుతున్న మధ్యంతర భృతి కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. గత జూలైలో జగన్ సర్కార్... అక్కడి ఉద్యోగులకు 27 శాతం పీఆర్సీ ఇచ్చింది. దీంతో తెలంగాణ ఉద్యోగులకు 34 శాతం ఫిట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీపై అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  మరోవైపు ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది.  

తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్?

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. పెరుగుతున్న కోవిడ్ కేసులతో సర్కార్ అప్రమత్తమైంది. మరోసారి లాక్ డౌన్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. లాక్ డౌన్ పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా ఉంటుందని తెలుస్తోంది. కరోనా హాట్ స్పాట్లుగా మారిన స్కూళ్ల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. వీకెండ్స్‌లో లాక్‌డౌన్  విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారు. కోవిడ్ అదుపులోనే ఉన్నా.. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోనుంది.ఈ నెల 26 కంటే ముందే అసెంబ్లీ సమావేశాలు ముగించే యోచనలో సర్కార్ ఉంది.   తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే లక్ష కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా రాష్ట్రంలో పది ప్రాంతాల్లో వైరస్‌ అవుట్‌ బ్రేకు అవ్వగా, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా విస్తృతమైన టెస్టులు చేసి కట్టడి చేయగలిగారు. గతంలో  సర్కారు చేపట్టిన చర్యల వల్ల తెలంగాణలో 1.44 లక్షల కేసులు రాకుండా ఆపడంతో పాటు, 2300 మరణాలు నివారించగలిగిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో కూడా వెల్లడించిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.  గత సంవత్సరం జనవరిలో ఇండియాలో తొలి కరోనా కేసు నమోదు కాగా.. మార్చి2న తెలంగాణలో తొలి కేసు వచ్చింది. మే, జూన్ లో కరోనా కేసులు భారీగా నమోదు కాగా.. నవంబరు నాటికి తీవ్రత తగ్గింది. మళ్లీ ఇప్పుడు వైరస్‌ విజృంభిస్తోంది. ప్రధానంగా  మహారాష్ట్రలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.  లోకల్‌ ట్రైన్స్‌తో పాటు, జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది.